visitors

Friday, June 12, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - మూడవభాగం

                                           🌳 నెం. 35 , ఉస్మాన్ రోడ్ 🌳

                                                                                         -  స్వరాట్

                                              


తండ్రి గారు తన ఆఖరి క్షణాలలో యిచ్చిన సలహా ప్రకారం ఎలాగైనా సరే సంగీతం నేర్చుకోవాలనే పట్టుదలతో , యింట్లో ఎవరికీ చెప్పకుండా  చేతినున్న ఉంగరాన్ని అమ్మి ఆ డబ్బుతో విజయనగరం చేరుకున్నాడు వెంకటేశ్వర్లు. అక్కడున్న సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించాలని అతని కోరిక. 

కానీ , దురదృష్టం అతడిని వెంటాడుతూనే వుంది. అతను విజయనగరం వెళ్ళిన సమయానికి సంగీత కళాశాల వేసవి శెలవుల కారణంగా మూసివేశారు. ఏం చేయాలో తోచక ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడిగారిని ఆ కుర్రవాడు కలిసి తన గురించి చెప్పుకోగా , కళాశాల తెరిచేంతవరకు సంగీత కళాశాలలోనే తలదాచుకుందుకు అనుమతించారు నాయుడుగారు. అతనిలాటి వారే కొందరు సంగీత విద్యార్థులు శెలవులకు యిళ్ళకు వెళ్ళలేనివారు అక్కడే బసచేసేవారు. తమ మధ్యకు మరో కొత్తవాడు రావడం వాళ్ళకు గిట్టలేదు. ఇతనిని అక్కడలేకుండా చేయడానికి ఏవో సమస్యలు , యిబ్బందులు సృష్టించారు. అందులో భాగంగా , తమకు సంబంధించినదేదో దొంగలించబడిందని అది యీ కొత్త కుర్రాడే చేశాడని నిందమోపి వెంకటేశ్వర్లుకు నిలవనీడ లేకుండా తరిమికొట్టారు. ఆ విద్యార్ధులకు భయపడి కళాశాల కు సమీపంలో వున్న ఎల్లమ్మ గుడిలో కొన్నిరోజులు తలదాచుకున్నాడు. తినడానికి తిండి , నిలువ నీడ లేని అతనికి ఎవరో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి గురించి చెప్పి , ఆయనను కలిస్తే తగు సహాయం చేస్తారని సలహా యిచ్చారట. ఆ ప్రకారం , శ్రీ సీతారామశాస్త్రి గారిని కలసి తన కష్టాలు చెప్పుకున్నాడు.

తర్వాత కాలంలో ఎప్పుడో బయటపడిన విషయం ఏమంటే  ఆ దొంగతనం అభియోగం కేవలం అసూయతో చేశారట. దొంగలించబడిన వస్తువులేం విలువైనవి కావు. అక్కడ బస చేస్తున్న  ఒక విద్యార్ధి ఎక్కడినుండో తలంటుపోసుకోవడానికి కుంకుడుకాయలు తెచ్చి ఎండబెట్టుకున్నాడట. సాయంత్రం వచ్చి చూస్తే అవి కనిపించలేదట. ఆ కుంకుడుకాయలు దొంగిలించింది ఈ కొత్త కుర్రాడే అని అతడిని హింసించి వెళ్ళగొట్టారట. వాళ్ళలో వాడే మరొకడు ఆ కాయలను తీసి కనపడకుండా దాచేసాడట.
ఇంతే జరిగిన విషయం .అసలు విషయం ఏమంటే  మరో కొత్తవాడు వస్తే తమ స్థాన బలిమి ఎక్కడ పోతుందో అనే భయం, అసూయ. బాల్య చాపల్యం.
 ఈ విషయాలు ఏవీ  ఘంటసాలవారి జీవిత చరిత్రలలోఎక్కడా వ్రాయబడలేదు. 

ఘంటసాలవారు తన కధలో " నేను విజయనగరంలో నిలదొక్కుకొని కాలేజీలో సక్రమంగా ప్రవేశించడానికి కూడా ఎంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇటువంటి నిరుత్సాహ పరిస్థితులలో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి దర్శనం చేశాను. " అని మాత్రమే వ్రాసుకున్నారు.

తర్వాత కాలంలో నాకు జ్ఞానం వచ్చాక ఘంటసాలవారి ప్రస్తావన వచ్చినప్పుడు  మా యింట్లో మా పెద్దలు అనుకున్న మాటలు యివి.)

 ఆ కుర్రవాడి పరిస్థితి కి జాలిపడి శాస్త్రిగారు తన యింటనే ఆశ్రయమిచ్చారు. వెంకటేశ్వర్లు పాటవిని సంగీతం నేర్పడానికి సమ్మతించారు.

శ్రీ సీతారామశాస్త్రి గారింట్లో వారితో పాటు వారి అక్కగారు, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు వుండేవారు. వారుకాక సంగీతం నేర్చుకునే విద్యార్థులు కూడా ఓ ఐదుగురు అదే యింట్లో ఒక గదిలో నివసించేవారు. వారితోపాటు వెంకటేశ్వర్లుకు కూడా శాస్త్రిగారింట్లో నిలవ నీడ దొరికింది. మరి భోజనం సంగతేమిటి ? ఆనాడు యిప్పటిలా హోటల్స్ వుండేవికావు.  వున్నా అలాటి చోట్ల భుజించడానికి కావలసిన డబ్బులు విద్యార్ధుల దగ్గర వుండేవికాదు. అలాటి పేద విద్యార్ధులకోసం , ముఖ్యంగా సంస్కృత కళాశాల విద్యార్ధులకోసం విజయనగరం రాజావారు సింహాచలం భోజన సత్రం ఏర్పాటు చేశారు.అందులో  వందలాది సంస్కృత కళాశాల విద్యార్ధులున్నా , సంగీత కళాశాల విద్యార్ధులు ఓ ఇరవైమందికి మాత్రమే భోజన వసతి  ఉండేది. ఆ సత్రవులో భోజన వసతి  దొరకడానికి  కొంత సమయం పడుతుంది.  అడిగిన వెంటనే దొరకదు.అంతవరకూ ఏం చేయాలి. తాత్కాలికంగా శ్రీ సీతారామ శాస్త్రిగారి దయార్ద్ర హృదయం వలన ఆకలి సమస్య తీరినా , వారి ఆర్ధికస్థితి దృష్ట్యా వారిని యిబ్బంది పెట్టకూడదని , చాలామంది పేద విద్యార్ధులలాగనే వెంకటేశ్వర్లు కూడా మధూకరం ఎత్తడానికి నిర్ణయించాడు.

 ఆరోజుల్లో విద్యార్ధులు మధూకరం చేయడం , సంపన్న గృహస్తుల యిళ్ళలో వారాలు చేసుకొని విద్య సాగించడమనేది సహజంగానే జరిగేది. గృహస్తులు తమ పరిధులలో బీద విద్యార్ధులకు చేయూతనిచ్చేవారు. వెంకటేశ్వర్లు కూడా అదే బాట పట్టాడు. శ్రీ సీతారామశాస్త్రి గారింట్లో వుండే నేలనూతుల నాగభూషణం అనే  ఒక విద్యార్ధితో కలసి ఊళ్ళో మధూకరం చేసి పొట్టనింపుకునేవాడు. నాగభూషణం శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి దగ్గర హరికధ , శ్రీ సీతారామశాస్త్రి గారింట్లో వుంటూ సంగీతం నేర్చుకునేవాడు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నాగభూషణాన్ని ఘంటసాల అన్నా అని సంబోధించేవాడు. ఘంటసాలకు జోలె పట్టుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా , యిద్దరికి కావలసిన అన్నాన్ని నాగభూషణమే తీసుకువచ్చేవాడు.

సంగీత కళాశాల తెరిచే వరకు ఆగకుండా శ్రీ సీతారామశాస్త్రి గారు వెంటనే తన యింటనే సంగీత శిక్షణ యివ్వడం ప్రారంభించారు.
విజయనగరం నుండి తిరిగి వెళ్ళేవరకూ గురువుగారింటనే వెంకటేశ్వర్లు గడపడం జరిగింది. బయట ఆహారం దొరకని పరిస్థితులలో భోజనం కూడా గురువుగారింట్లోనే జరిగేది.

ఈలోగా , వేసవి శెలవులు ముగిసి సంగీత కళాశాల తెరవడం జరిగింది. ప్రిన్సిపాల్ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు , చౌటపల్లి నుంచి వచ్చిన యీ ఘంటసాల వెంకటేశ్వర్లు పాటవిని గాత్ర సంగీతానికి యీ కుర్రవాడి కంఠం బాగుంటుందని గాత్రం క్లాసులోనే ప్రవేశించమని సలహా యిచ్చారు. ఆవిధంగా , ఘంటసాలకు సంగీత కళాశాలలో కూడా శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి పర్యవేక్షణలోనే సంగీత శిక్షణ మొదలయింది.

రోజూ కళాశాలలో, తర్వాత యింటి దగ్గర సంగీతం నేర్చుకునేవాడు.

శ్రీ సీతారామశాస్త్రి గారు ఘంటసాలకు నేర్పిన సంగీత
లక్ష్య , లక్షణాల గురించి  తెలుసుకోవాలంటే
ముందుగా , ఘంటసాలవారి గురువుగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వం గురించి , వారి సంగీత బోధన పధ్ధతుల గురించి , వారి కచేరీలు చేసే విధానం గురించి , వారి కుమారులు శ్రీ పట్రాయని సంగీతరావు గారి మాటల్లో.....

No comments: