visitors
Friday, October 30, 2020
నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నాలుగవ భాగం
Friday, October 23, 2020
నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - మూడవ భాగం
ప్రస్తుతం సెంట్రల్ స్టేషన్ పక్కనున్న వాల్ టేక్స్ రోడ్ నుంచి ప్యారీస్ కార్నర్ కి వెళ్ళే దారి NSC Bose Road. అదే ఒకప్పుడు చైనా బజార్ రోడ్. దాన్నే ఈవెనింగ్ బజార్ రోడ్ అని కూడా అనేవారు. చైనా బజార్ రోడ్డు అదే ఇప్పటి NSC Bose Road హార్బర్ కి వెళ్ళే ఫస్ట్ లైన్ బీచ్ రోడ్డుని కలిసే మూల, మద్రాసు హైకోర్ట్ ఎదురు వేపు ఉన్న ప్యారీ కంపెనీవారి పెద్ద అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పేరు మీద అది ప్యారీస్ కార్నర్ గా ప్రసిధ్ధికెక్కింది.
పారి మునై - పారీ మూల - Parry's Corner
ఈ ఈవెనింగ్ బజార్ రోడ్డుని చైనా బజార్ గా పిలవడానికి నాకనిపించే ఒకే కారణం ఆ రోజుల్లో బ్రిటీష్ వారు వారికి కావలసిన వంటింటి క్రోకరీ - పింగాణీ సామగ్రి కొనుగోలు చేయడానికి వీలుగా ఈ ఈవెనింగ్ బజార్ లో చైనా వేర్ (పింగాణీ సామగ్రి) అమ్మే షాపులు ఉండేవి. వాటిలో అతి ప్రముఖమైనది 1889లో పేవ్ మెంట్ షాప్ గా ప్రారంభమైన కరీంభాయ్'స్ ఈనాటికీ ఆ రోడ్డు మీద కనిపిస్తుంది.
1889లో ఈప్రాంతంలోనే ఒక పేవ్ మెంట్ షాపు ఈ కరీంభోయ్'స్
నాకు తెలిసి అరవై డెబ్భైలలో కూడా పింగాణీ సామగ్రి, బొమ్మల వాడుక ఎక్కువగానే ఉండేది. అంచేత మద్రాసు చైనా బజార్ కి చైనాతో ఏ సంబంధం లేదు, ఎత్తేస్తే ఏడు ముక్కలయ్యే పింగాణీ సంబంధం తప్ప. అలాగే ఈమధ్య హైదరాబాద్ లాంటి నగరాల్లో కనిపిస్తున్న ప్లాస్టిక్, ఫేన్సీ వస్తువులమ్మే చైనా బజార్లకి చైనా-పింగాణీ తో ఏ సంబంధం లేదు, చైనా దేశంతో కూడా. 1960 దశకం చివర బర్మా నుంచి వచ్చిన తమిళ కాందిశీకుల కోసం ఫస్ట్ లైన్ బీచ్ రోడ్ మీద వారు తెచ్చుకున్న వస్తువుల అమ్మకం కోసం వెలసినది బర్మా బజార్. కాలక్రమంలో అది తొంభైలనాటికి contraband, smuggled electronic goods, CDలు DVDలు అమ్మే గ్రే మార్కెట్ గా మారింది.
హార్బర్ దారి - ఫస్ట్ లైన్ బీచ్ రోడ్ - కుడివేపు ఇప్పుడు బర్మా బజార్ షాపులు - ఆరోజుల్లో ట్రాం లైన్స్ ఉండేవి
తరవాత అదే చైనా, మలేషియా, సింగపూర్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మార్కెట్. ఫ్లవర్ బజార్ పోలిస్ స్టేషన్ సమీపంలోని కందసామి కోయిల్, మింట్ స్ట్రీట్ మొదలు పారీస్ కార్నర్ లోని ఆర్మీనియన్ స్ట్రీట్, లింగి చెట్టి, తంబు చెట్టి, అంగప్ప నాయకన్, మూర్ స్ట్రీట్ లాంటి వీధులన్నీ వ్యాపార కేంద్రాలే. బ్రాడ్ వే, బందర్ స్ట్రీట్, సుంకురామచెట్టి, తంబుచెట్టి స్ట్రీట్ లలో ఈ చివరి నుండి ఆ చివరివరకు ఒక్కో వీధి సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరానికి అన్నీ షాపులే. ఈ తంబుచెట్టి వీధిలోనే కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి 'ఆంధ్రపత్రిక' దిన, వార పత్రికల ఆఫీస్, ప్రెస్ వుండేవి. ఆ ప్రాతమంతా మెడ్రాస్ లోని ప్రముఖ వాణిజ్య కేంద్రం. హోల్ సేల్, రీటైల్ వ్యాపార కూడలి.
ఆసియాలోనే అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరు పొందిన కొత్వాల్ చావడి కూరగాయల బజారు, ఫ్లవర్ బజార్ మార్కెట్ ప్రాంతం కూడా అక్కడే. ఈ ప్రాంతమంతా జార్జ్ టౌన్ గా, పాత మెడ్రాస్ గా వుండేది. ఈ ప్రాంతం సూర్యోదయం నుండి అర్ధరాత్రి వరకు జనాలతో కిటకిటలాడుతూంటుంది. తొంభైల దాకా కూడా ఈ వీధుల్లో ఇళ్ళన్నీముందు భాగం షాపులు. వెనకాల వేపు వారి కుటుంబాలు. పెద్ద పెద్ద మేడలే. పాతకాలంవి. ఆ ఇళ్ళలోకి సహజమైన గాలి, వెలుతురు ప్రవేశించే వీలే వుండదు. క్రిక్కిరిసిన వాహనాలు, జనాలతో ఆ ప్రాంతం కొత్తవారికి ఉక్కిరిబిక్కిరిగానే ఉంటుంది. నాకు అలాటి పరిస్థితే ఏర్పడింది. చైనా బజార్ ప్లాట్ ఫారమ్ మీది షాపుల్లోని వింతలన్ని అంతవరకూ నా జన్మలో చూడలేదు. (ప్రస్తుతం మెట్రో రాకతో అధునాతనంగా తయారవుతోంది ఈ ప్రాంతం అంతా).
ఇరుకు జార్జ్ టౌన్ ప్రాంతం
అవన్నీ చూసుకుంటూ తిరగడంలో టైమే తెలియలేదు. అప్పటికి రాత్రి 8.30 గంటలైపోయింది. జన సంచారం పల్చబడింది. మేము తిరిగి ఇంటికి రావడానికి బస్ స్టాప్ కు చేరుకున్నాము. విశాలమైన (జనాలు లేకపోతే) ఆ రోడ్ కు రెండు ప్రక్కలా బ్రిటిష్ కాలం నాటి ఎత్తైన ఎర్రటి భవంతులను చూస్తే ఎంత పెద్ద ఇళ్ళో అని ఆశ్చర్యం కలిగింది. అంతంత పెద్ద ఇళ్ళు, భవనాలను ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. మెడ్రాస్ హైకోర్ట్ ప్రాంగణం ఆనుకుని మైన్ రోడ్డు మీద పారీ'స్ కార్నర్ బస్ స్టాండ్. ప్రాంగణం లోపలే లైట్ హవుస్. ఆ ప్రహారీ గోడను ఆనుకొని 11వ నెంబర్ బస్ స్టాప్. మేముండే టి.నగర్ కు వెళ్ళే 11, 11A, 11C బస్సులు అక్కడినుండే బయల్దేరుతాయి. అందులో 11 నెంబర్ బస్సులు అధిక సంఖ్యలో వుండేవి. అప్పట్లో అన్నీ ఎఱ్ఱరంగు ల్యాలెండ్ కంపెనీ బస్సులే వుండేవి.
ఆరోజుల్లో వీధిదీపాలకి కూడా incandescent బల్బులే ఉండేవి. ఇప్పటిలా ట్యూబ్ లైట్లో, సోడియం వేపరో, ఎల్ఇడి బల్బ్ లో కావు కదా. మామూలు ఇళ్ళలో వాడే బల్బ్ లే. పదిహేను ఇరవై అడుగులు ఎత్తుండే ఆ దీప స్థంభాలు '?' షేపులో పైభాగం వంపు తిరిగి కిందికి చూస్తున్నట్టు నిలబడివుండేవి.
వాటి డూములు/షేడ్ పైవేపు ఆకుపచ్చగా లోపల వేపు తెల్లగా కోటింగ్ వేసి వుండేవి.
ఈ లైట్ లకి డూమ్/షేడ్ లు ఎందుకంటేట, ప్రపంచయుధ్ధ కాలంలో రాత్రిపూట శత్రు సైనికుల విమానాలకు క్రింద అక్కడ వూళ్ళున్నాయని తెలియకుండా వుండడానికి వీధి దీపస్థంభాలకు ఆ డిస్క్ లు తగిలించారని అనేవారు!? నిజానికి యుధ్ధవిమానాలు దాడే జరిగితే వీధిలైట్లు, ఇళ్ళలో లైట్లు ఆర్పేసి blackout చేసి పూర్తిగా అంధకారంలోనే గడిపేవారట. అటువంటి యుధ్ధవాతావరణంలో 1942 లో మా నాన్నగారు మెడ్రాస్ లో కొన్ని మాసాలున్నారట. 'అమ్మ బాబోయ్! ఎలా వున్నారో' అని అనుకున్నాను. అయితే, నేను పుట్టిన సంవత్సరంలోనే రెండవ ప్రపంచయుధ్ధం ముగియడం వల్ల నాకు ఆ విషయాలేవీ తెలియవు. కాకపోతే, నాకు కొంత జ్ఞానం వచ్చిన తరువాత కూడా నిత్యవసర వస్తువులకి రేషన్ ఉండడం, సులభంగా దొరకకపోవడమనేది గుర్తుంది.
ప్యారీస్ కార్నర్ వీధి పొడుగునా దీపాలున్నా దట్టమైన చెట్ల మధ్య ఆ గుడ్డి దీపాలకాంతి అంతగా తెలియలేదు. వుండీ వుడిగీ లైట్ హౌస్ మీది రొటేటింగ్ ల్యాంప్ కాంతి మీద పడేది. (విశాఖపట్నం డాల్ఫిన్స్ నోస్ కొండమీది లైట్ హౌస్ దీపపు కాంతి దీనికంటే చాలా ఎక్కువట. సముద్రంలో చాలా దూరం వరకూ కనిపిస్తుందనుకునేవారు). టూరిస్టులు మద్రాసు లైట్ హౌస్ మీదకు వెళ్ళి వూరంతా చూడడానికి వీలుండేది అప్పట్లో, పగటిపూట. టికెట్ కొనుక్కుని. నేను కూడా చాలాసార్లు అలా పైకి ఎక్కి చూశాను. ఇరుకు స్పైరలింగ్ మెట్లమీదుగా చుట్టూ తిరుగుతూ పైకి వెళ్ళాలి. అంత ఎత్తునుండి వూరంతా పచ్చని తివాసీ పర్చినట్లు చాలా దూరం వరకూ కనిపించేది. ఆనాటి మెడ్రాస్ దట్టమైన చెట్లమధ్య భవనాలు కనిపించేవికావు. (చల్లని సముద్రపుగాలితో సాయంసమయాలు ఎంతో ఆహ్లాదకరంగా వుండేది. ఆనాటి వాతావరణం పూర్తిగా మారిపోయింది). తూర్పున బంగాళాఖాతంలో కనుచూపు దూరంలో వెళుతున్న స్టీమర్లు కనిపించేవి. ఇప్పుడు నేను చెపుతున్న లైట్ హౌస్ మూడవది. 1894 లో సముద్రమట్టానికి 175 అడుగుల ఎత్తున హైకోర్టు ప్రాంగణంలో కట్టబడినది. రెండవ లైట్ హౌస్ 1841 లో 120 అడుగుల ఎత్తున అదే ప్రాంగణంలో డోరిక్ శిఖరం పైన ఉండేదట. అక్కడ హైకోర్ట్ ప్రాంగణంలోనే పారిస్ కార్నర్ ఎదురు వేపు ప్రస్తుతం రాజాజీ విగ్రహం ఉంది. మరి, మొదటి లైట్ హౌస్ వివరాలు తెలియవు. ఈనాడు అధునాతనంగా, మెరీనా-గాంధీ బీచ్ దగ్గర, ఆలిండియా రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న లైట్ హౌస్ నాలగవది. సాంకేతికంగా ఉన్నతమైనదే కావచ్చు కానీ హైకోర్టు లైట్ హౌస్ అంతా హుందాగా కనపడదు.
ఈ విధంగా చుట్టూవున్న పరిసరాలను చూస్తూండగా 11 నెంబర్ రావడం, అందులో ఎక్కి టి నగర్ ఉస్మాన్ రోడ్ రాఘవన్ 'నెయ్ కడై' (నేతి దుకాణం) స్టాపింగ్ లో దిగి నడుచుకుంటూ రంగయ్యర్ స్ట్రీట్ లోని ఇంటికి చేరేసరికి రాత్రి 10 గంటలు దాటింది. నాకు గుర్తున్నంతవరకూ మా నాన్నగారితో కలిసి మళ్ళీ అలా విహారానికి వెళ్ళిన సందర్భాలు లేవు. అవకాశం లేకపోడం ఒక కారణం, స్వతహాగా విహారాలంటే ఆయనకుండే అనాసక్తత మరో కారణం కావచ్చు. మానాన్నగారితో కలసి అందరం బయటకు వెళ్ళిన సంఘటనలు చాలా అరుదు.
మా లోగిట్లో అన్ని భాషలవారూ ఉండేవారు. అందులో చాలామంది సినీమావాళ్ళే. అందులో ఒక కన్నడ సినీమా పాటల రచయిత వుండేవారు. పేరు గుర్తులేదు. ఒంటరిగా ఉండేవారు. ఎప్పుడూ లుంగీ బనీను మాత్రం ధరించి ఇంట్లో చాపమీద గోడకానుకొని కూర్చొని సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ ఏదో రాసుకుంటూ గడిపేవారు. రచయితలకు సిగరెట్ కు ఏవిటో ఆ అవినాభావ సంబంధం?
అప్పుడప్పుడు ఎవరో వచ్చి ఆయనను కారులో బయటకు తీసుకెళ్ళేవారు. వాళ్ళు మాట్లాడేది ఒక్క ముక్క అర్ధమయేదికాదు. అలాగే, కన్నడ సినీమాలకు చెందిన మరో కుటుంబం వుండేది. తల్లి ఒక డాన్స్ మాస్టర్. కూతురు ఒక బాలనటి. మేము ఆ ఇంటిలోనుండి వెళ్ళిపోయాక ఎప్పుడో వచ్చిన 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం' డబ్బింగ్ సినీమాలో బాలనటిగా మంచి వేషమే వేసింది. పెద్దయ్యాక ఏదో సినిమాలో ఎన్ టి రామారావు పక్కన చెల్లెలుగా చూసిన గుర్తు. పేరు సుమ లేక కుసుమ కావచ్చు. నటిగా పెద్ద విజయం సాధించినట్లు కనపడదు. ఆ తల్లీ కూతుళ్ళను షూటింగ్ కు తీసుకువెళ్ళడానికి కారో, వ్యానో వచ్చేది. ఒకసారి ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. అందులో ఒకావిడ కూర్చొనివుంది. రంగురంగుల బట్టలతో, ఒళ్ళంతా నగలతో, ముఖమంతా దట్టంగా పౌడర్ పూసుకొని, పెదవులంతా ఎఱ్ఱగా, తలంతా రంగురంగుల గొట్టాలాంటి క్లిప్ లతో వింతగా కనిపించింది. నేను మా కాంపౌండ్ లో వున్న చెట్టుక్రింది చప్టా ఎక్కి చూస్తున్నాను. ఆ వ్యాన్ లో ఉన్నావిడ నిముషానికి ఒకసారి చేతులు, వేళ్ళూ తిప్పుతూ, పెదవులాడిస్తూ, కళ్ళు తిప్పుకుంటూ సంజ్ఞలు చేస్తూంది. ఆ చర్యలు నాకెందుకో వింతగా, భయంగా అనిపించింది. ఇంతలో మా కాంపౌండ్ లోని డాన్స్ మాస్టర్ రావడం, వ్యానెక్కి వెళ్ళడం జరిగింది. తర్వాత తెలిసింది, ఆ రోజు వ్యాన్ లో ఉన్న నటి పేరు అమ్మాజీ అని, ఆ రోజు షూటింగ్ లోని డాన్స్ మూవ్మెంట్స్ ను మననం చేసుకుంటున్నారని. ఆవిడ రోజులమారాయి చిత్రంలో నటించిన విషయం మీకు తెలిసినదే. తరువాత, జయశ్రీగా పేరు మార్చుకొని (అదృష్టం కలిసొచ్చిందో లేదో) 'దైవబలం' లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించారు. ఆ జయశ్రీ కుమార్తే నిన్నటి తరం హీరోయిన్ జయచిత్ర.
ఆ లోగిట్లో నా తెలుగు అర్ధం చేసుకుందుకు ఒక తెలుగు కుటుంబం వుండేది. నడి వయసు దాటిన భార్యభర్తలు. చదువు ముగిసి పెళ్ళికెదిగిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరే అవసరార్ధపు అరవ మాటలు కొన్ని నేర్చుకున్నాను.
అక్కడున్నప్పుడే మా నాన్నగారితో కలసి స్టూడియోలో రికార్డింగ్ లకు వెళ్ళేవాడిని. అప్పటికింకా స్కూల్లో చేరలేదు. మా నాన్నగారిని స్టూడియోకు తీసుకువెళ్ళడానికి కారో, వ్యానో వచ్చేది. ఆ రోజుల్లో ఆర్కెష్ట్రా వాళ్ళను పికప్ చేసుకోవడానికి సినీమా కంపెనీవాళ్ళే వాహనాలు ఏర్పాటు చేసేవారు. అందుకోసం కార్లు, వ్యాన్లు అద్దెకు తీసుకునేవారు. అలా వచ్చే బళ్ళతో పాటు సినీమా కంపెనీ మనిషికూడా వచ్చేవాడు. అలా వచ్చే కారో, వ్యానో ముందుగా మా ఇంటికే వచ్చేది. ఉదయం 9 గంటలకు రికార్డింగ్ కాల్షీట్ అంటే 6.30 గంటల లోపే మా వాకిట్లో వ్యాన్ వచ్చేసేది. అప్పటికి మా నాన్నగారు సిద్ధమైపోయేవారు. ఆ బండిలో హార్మోనియం ఎక్కించి బయల్దేరేవాళ్ళం. వెళుతూ వెళుతూ దారి మధ్యలో వుండే ఇతర ఆర్కెష్ట్రా వాళ్ళను పికప్ చేసేవారు. వెస్ట్ మాంబళంలోని హుస్సేన్ రెడ్డిగారూ (ఆర్గన్), చిత్తూరు సుబ్రహ్మణ్యం గారు (వైలిన్), యిలా వ్యాన్ నిండేవరకు వాద్యబృందాన్ని ఎక్కించుకొని స్టూడియో రికార్డింగ్ ధియేటర్ వద్ద దింపేసేవారు. మా నాన్నగారు లోపలకు వెళ్ళగానే ఆనాటి పాటకు సంబంధించిన నొటేషన్స్ అంతా అక్కడకు చేరిన ఆర్కెష్ట్రా కు డిక్టేట్ చేసేవారు. ఆర్కెష్ట్రా లో string instruments, wind instruments, rhythm instruments, వాయించేవాళ్ళంతా విడివిడిగా ఒక గ్రూప్ గా కూర్చోనేవారు. ఏ గ్రూపుకు ఆ గ్రూప్ కు విడిగా మైకులుండేవి. ఈ గ్రూప్ లు వాళ్ళు వాయించవలసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ నోట్ చేసుకునేవారు. వెస్ట్రన్ instrument players వాళ్ళ వెస్టర్న్ టైప్ లో నొటేషన్స్ రాసుకునేవారు, పాడి వినిపిస్తూంటే. హార్మోనియం, ఆర్గన్, రెండు మూడు వైలిన్స్ మాత్రం పాటంతటినీ, బిజిఎమ్స్ తో సహా పూర్తిగా వాయించేవారు. ఈ నొటేషన్స్ వ్యవహారం పూర్తయే సమయానికి ఘంటసాలవారు రికార్డింగ్ ధియేటర్ కు చేరుకునేవారు. ఆర్కెష్ట్రా అంతా పాటను వాయిస్తూంటే, అవసరమైన చోట తగు సూచనలు మార్పులు చేసేవారు. ఇలా ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసాక వాయిస్ తో మానిటర్ చూసేవారు. ఆ సమయంలో ఆర్కెష్ట్రాను పామర్తిగారో, రాఘవులుగారో కండక్ట్ చేసేవారు. పాట కంపోజింగ్ నుండి ఆర్కెష్ట్రా కు నొటేషన్స్ ఇచ్చేవరకు సంగీతరావు గారి బాధ్యత. పాట తృప్తికరంగా వుందని భావించాక టేక్ కు వెళ్ళేవారు. సింగర్స్ రూమ్ వేరే. ఆర్కెష్ట్రా రూమ్ వేరే. మొదట్లో అన్నీ ఒకచోటే. మాస్టారు కాకుండా వేరే గాయనీ గాయకులైతే ఘంటసాలవారు సౌండ్ ఇంజనీర్ పక్కనే కూర్చొని వినేవారు. ఆకాలపు పాటలన్నీ లైవ్ రికార్డింగ్ కావడం వలన తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకునే పాట ఫైనల్ కు వెళ్ళేవారు. అయినా, ఎక్కడో ఏదో లోపం, ఏదో పొరపాటు మరో టేక్ కు దారి తీసేది. ఏది ఏమైనా నిర్ణీతకాలంలో పాట రికార్డింగ్ పూర్తి అయిపోయేది. ఆ పాటలో పాల్గొన్న గాయకులు, వాద్యబృందం మరో స్టూడియో లో మరో పాట రికార్డింగ్ కు సిధ్ధమయేవారు. గాయకుల కంఠం బాగుంది, రికార్డింగ్ కు అడ్డంకి రాదని అనుకున్న తరువాతే రికార్డింగ్స్ ఫిక్స్ చేస్తారు. అందువలన సాధారణంగా ఏ రికార్డింగ్స్ కాన్సిల్ చేయడమనేది జరగదు. మరీ ఏవైనా సాంకేతిక లోపాలు అకస్మాత్తుగా ఏర్పడితే తప్ప. ఇవన్నీ ఆనాడు సహజంగానే భావించేవారు. సినీమా అనేది ఒక సమష్టి కృషి. ఏ ఒక్కరి వల్లనో సినీమా విజయం సాధించిందనో, అపజయం పొందిందనో భావించడంలో అర్ధంలేదు.
ఘంటసాలవారు ఈ ఆర్కెష్ట్రాను సక్రమమైన పధ్ధతిలో, సకాలానికి చేర్చే బాధ్యతను ఫ్లూట్ రాజేంద్రకు, రిధిమ్స్ వాయించే కణ్ణన్ కు అప్పగించేవారు. వాళ్ళే ఆర్కెష్ట్రా వాళ్ళందరికీ రికార్డింగ్ ఏ స్టూడియోలో జరుగుతుందో, కాల్షీట్ టైమింగేమిటో ఒక రెండు రోజులు ముందుగా తెలియజేసేవారు. షెడ్యూల్ ప్రకారం లిస్ట్ లో వున్న వాద్యగాళ్ళందరు స్టూడియో లో చేర్చవలసిన బాధ్యత వాళ్ళిద్దరిదే. సొంత వాహనాలున్నవాళ్ళు సమయానికి రికార్డింగ్ ధియేటర్ చేరుకునేవారు. వైలిన్ , ఫ్లూట్ వాయించేవాళ్ళు హాయిగా బస్ లో వచ్చేవారు. మా నాన్నగారిలా హెవీ వాద్యాలవాళ్ళకే ఇబ్బంది. కంపెనీ వాహనాలమీద ఆధారపడక తప్పేదికాదు. పాటల రికార్డింగ్ కాల్షీట్ ప్రకారమే జరుగుతుంది. ఆ టైమ్ షెడ్యూల్ ప్రకారం స్టూడియో ధియేటర్ ను అద్దెకు తీసుకుంటారు. ఆ సమయం ప్రకారం ఆ స్టూడియో కు సంబంధించిన సౌండ్, ఇంజనీర్, రికార్డిస్ట్, ఇతర సౌండ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా వారి వారి సరంజామా ఏర్పాటు చేసుకొని సిధ్ధంగా వుంటారు. నిర్ణీత సమయంలో పాట రికార్డింగ్ పూర్తి కావాలి. లేకపోతే నిర్మాత అదనంగా స్టూడియో వారికి అద్దె చెల్లించుకోవాలి. ఇక ఈ కాల్షీట్ బుక్ చేసే సమయాలు పాట లేదా పాటలను బట్టీ నిర్ణయిస్తారు. 7 to 1 ఒక ఫుల్ కాల్షీట్; 9 to 1 ఒక హాఫ్ కాల్షీట్; 2 to 9 ఒక ఫుల్ కాల్షీట్; రీరికార్డింగ్ లయితే 9 to 9 లు డబుల్ కాల్షీట్లు పనిచేసేవారు. అదీ చాలదనుకుంటే వరసగా రాత్రిం పగళ్ళు పని చేసి రీరికార్డింగ్ ముగించేవారు. ఆ సమయాలలో ఆర్కెష్ట్రా వారికి కాఫీ టిఫిన్లు, భోజనాలు నిర్మాతలే ఏర్పాటు చేసేవారు. ఎవరికి వారు బయటకు వెళ్ళి తినిరావడానికి వ్యవధి వుండేది కాదు. అన్ని స్టూడియోలకు అందుబాట్లో హోటల్స్ వుండేవికావు. అందువలన, నిర్మాతలే భోజనపు ఏర్పాట్లు చేసేవారు. పాట రికార్డింగ్ అయ్యాక గాయకులకు, వాద్యబృందానికి క్యాష్ రూపంలోనో, చెక్ రూపంలోనో రెమ్యునరేషన్ చెల్లించేవారు. అయితే, ఇచ్చిన చెక్కులన్నీ పాసవుతాయనే గ్యారంటీ వుండేది కాదు. ఒకటికి పదిసార్లు తమ ఆఫీసులు చుట్టూ తిప్పించుకొని పాట డబ్బులిచ్చేవారు. అందరు నిర్మాతలు అలాటివారని చెప్పడం తగదు. క్రమక్రమంగా ఈ పధ్ధతులన్నీ మారిపోయాయి. ఆ వివరాలు తర్వాత, తర్వాత తెలుస్తాయి.
నాకు గుర్తున్నంతవరకూ నేను మొదటిసారిగా స్టూడియో కు వెళ్ళినది 'జయంమనదే' రీరికార్డింగ్ కు. తరువాతిది ఘంటసాల మాస్టారి 'సొంతవూరు' లోని 'మన వూరే భారతదేశం 'పాటకు.
అయితే వివరంగా, బాగా గుర్తుండిపోయిన మొట్టమొదటి రికార్డింగ్, రీరికార్డింగ్ సినీమా ఘంటసాల వారింటి ఔట్ హౌస్ లోకి వెళ్ళిన తరువాతే. అది రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 'సతి అనసూయ' ఘంటసాలవారి సంగీతం. కడారు నాగభూషణంగారి దర్శకత్వం. అంజలి, గుమ్మడి, జమున, కెవిఎస్ శర్మ ముఖ్య పాత్రధారులు. ఎన్ టి రామారావు గెస్ట్ ఆర్టిస్ట్. ఆ సినీమా లో సుశీలగారు పాడి, జమున, కెవిఎస్ శర్మల మీద చిత్రీకరించిన "పోనేల మధుర, పోనేల కాశి ఫలమేమి యాత్రలు చేసి, పతి పద సేవయే నా వారణాశి' అనే శోకగీతం రికార్డింగ్ కు వెళ్ళాను. గుండమ్మకధలోని "ప్రేమ యాత్రలకు బృందావనం" పాటలోని మాటలకు, ఈ పాటలోని మాటల మధ్య ఏదో భావ సామీప్యత గోచరిస్తూంటుంది. ఈ రెంటిలో ఏ పాట విన్నా ఆ రెండో పాట నాకెందుకో చటుక్కున గుర్తుకు వస్తుంది.
అసలు ఒక పాట ఎలా తయారవుతుందంటే ... ఇప్పుడు కాదు మరో సందర్భంలో చూద్దాము.
సతీ అనసూయ రీరికార్డింగ్ లో నాకు బాగా గుర్తుండిపోయినది నాగుపాము సీన్. సినిమాలో ఆ పాము కనిపించినప్పుడల్లా నేపధ్యంలో ఒక వాద్యం వినిపిస్తుంది. అది క్లేవైలిన్. అదే యూనివాక్స్ గా కూడా రూపాంతరం చెందింది.
తమిళ, తెలుగు భాషల్లో అఖండ విజయం సాధించిన 'రాము' (1966) చిత్రంలో ఉత్తమ బాలనటుడిగా జాతీయ బహుమతి పొందిన మాస్టర్ రాజ్ కుమార్, హనుమంతాచారిగారి కుమారుడే. అప్పుడప్పుడు ఘంటసాల వారింటికి వచ్చేవాడు. ఆ అబ్బాయి అసలు పేరు యోగి(యోగీంద్ర కుమార్). సినీమాల కోసం రాజ్ కుమార్ గా పేరు మార్చినట్లున్నారు.
1978లో రావి కొండలరావుగారి డ్రామా ట్రూప్ తో ఢిల్లీనుంచి తిరిగి వస్తున్నప్పుడు తమిళనాడు ఎక్స్ ప్రెస్ కి నాగపూర్ దగ్గర జరిగిన ఒక ఆక్సిడెంట్ లో రికార్డింగ్ లు, షూటింగ్ లు, కచేరీలు అంటూ క్షణం తీరిక లేని ఆ హనుమంతాచారిగారు హఠాత్తుగా కన్నుమూశారు. ఒక మంచి గాయకుడినీ, ఈనాటి multi-purpose, multi-functional electronic వాయిద్యాలు కాంబో ఆర్గన్, సింతసైజర్ లకి తొలిరూపం యూనివాక్స్ పయొనీర్ వాద్యనిపుణుడు, అనుభవజ్ఞుడైన వాద్యకళాకారుడిని దక్షిణాది సినీమా సంగీతరంగం అర్ధాంతరంగా కోల్పోయింది. (ఆ ప్రమాదంలో గాయపడిన ఈ ట్రూపు సభ్యుడు మరొకరు, టి.వి.రాజుగారి పెద్దబ్బాయి - ప్రముఖ సంగీతదర్శకద్వయం రాజ్-కోటిలలో రాజ్ అన్నగారు.)
మేము రంగయ్యర్ స్ట్రీట్ లో వున్న రోజుల్లో ఒకసారి మా నాన్నగారు నన్నో పనిమీద ఘంటసాలవారింటికి పంపిచారు.
అది ఎందుకో, ఏమిటో ఆ వివరాలు వచ్చేవారం.
ఈలోగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.
...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.
Friday, October 16, 2020
నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - రెండవ భాగం
Friday, October 9, 2020
నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - మొదటి భాగం
1955 చివరి నెలలలో మా నాన్నగారు, శ్రీ పట్రాయని సంగీతరావు గారు విజయనగరంనుంచి తన కుటుంబాన్ని మాత్రం మెడ్రాస్ కు మార్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికి మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఇంకా విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్రోపన్యాసకునిగా పనిచేస్తూనే వున్నారు. మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు 1953 లోనే విశాఖపట్నానికి మకాం మార్చారు. అక్కడ డాబా గార్డెన్స్ లో ఒక చిన్న సంగీతం స్కూల్ పెట్టి గాత్రం, వీణ, క్లాసెస్ ప్రారంభించారు. విజయనగరంలో మా తాతగారు, పెద్దమ్మమ్మగారు, ప్రభూ చిన్నాన్నగారు, కమల పిన్నిగారు, వారి పిల్లలు ప్రసాద్, మంగమాంబ వున్నారు. విజయనగరంలో వుండేప్పుడు మా ప్రసాద్, నేనూ చాలా సఖ్యంగా వుండేవాళ్ళం. ఇప్పటికి ప్రసాద్ నాపట్ల చాలా ప్రేమాభిమానాలతో వుంటాడు. అతను నాకంటే రెండేళ్ళు చిన్న.
ఇది మేము విజయనగరం వెళ్ళిన కొత్తల్లో మా ఇద్దరికీ ఫోటో స్టూడియోలో తీసిన ఫోటో. ఆ వయసులోని ఫోటో చూస్తూంటే ఏదో తమాషాగా వుంటుంది.
అలాటి ఆత్మీయులందరినీ వదలి మెడ్రాస్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎలా ఫీలయ్యానో నాకు ఏమాత్రం గుర్తులేదు. బహుశా, చాలా దూరం రైలు ప్రయాణం చేయబోతున్నాననే సంతోషం వుందేమో. అంత సుదీర్ఘ రైలు ప్రయాణం చేయడం, నా పదేళ్ళ జీవితంలో అదే మొదటిసారి. అంతకుముందు ఒకసారి ఏదో పాతమొక్కుబడి తీర్చాలని నన్ను సింహాచలం కొండకు తీసుకువెళ్ళారు. అంతకు కొన్ని రోజులముందే విపరీతమైన జ్వరం వచ్చింది. (పదేళ్ళు దాటేవరకు వరకూ తరచూ నాకు మలేరియా జ్వరం వస్తూండేది). సింహాచలం కొండమీదకు మెట్లన్నీ (సుమారు వేయికి పైనే మెట్లున్నాయి). అంత చిన్న వయసులో (7 ఏళ్ళు) ఎవరి చంకా ఎక్కకుండా అన్ని మెట్లు నేనే ఎక్కి వెళ్ళినందుకు మా అమ్మగారు అందరితో చెప్పి మురిసిపోవడం బాగా గుర్తుండిపోయింది. నేనూ ఏదో ఘనకార్యం సాధించేననే అనుకున్నాను.
సింహాచలం దేవుడు వరాహ నరసింహస్వామి. ఆ రోజుల్లో కొండమీదకు బస్సులు లేవు. కాలినడకనే మెట్లమీదుగా వెళ్ళవలసి వచ్చేది. సింహాద్రి అప్పన్న కొండంతా రకరకాల వృక్షాలతో, పూల వనాలతో సుగంధభరితంగా వుండేది. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఉన్న పనసపళ్ళతో చెట్లు, ఆకు సంపెంగ, రేక సంపెంగ వృక్షాల సముదాయంతో, చిన్న చిన్న జలధారలతో దైవీక వాతావరణం మధ్య ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మా దైవ దర్శనం జరిగింది.
అక్కడ నుండి విశాఖపట్నం కూడా వెళ్ళాము. అందుకోసం సింహాచలం స్టేషన్ లో ఒక పెద్ద రావిచెట్టు క్రింది చప్టామీద కూర్చొని చాలాసేపే గడిపాము. ప్లాట్ ఫారమ్ మీద జనాలే లేరు. చల్లటి కొండగాలికి రావి ఆకుల గలగల సవ్వడి చేస్తూంటే చాలా హాయిగా అనిపించింది. ఈలోగా కాస్తా కాలక్షేపం కోసం మా నాన్నగారు పక్కనున్న టీ స్టాల్ నుండి వేడి వేడిగా "శనగపప్పు పకోడీలు ఫ్రెష్ గా వేస్తున్నాడంటూ పట్టుకొచ్చేరు. అందుకు మా అమ్మగారిచ్చిన సమాధానం 'ఆ! గుడ్డు! ఇప్పుడు ఏ హోటల్ వాడు శెనగపిండి వాడుతున్నాడు. ఇవి బఠాణీ పిండితో చేసిన పకోడీలే' అని ఒక్కమాటలో తేల్చేసింది. ఈ మాటలంటున్నప్పుడు ఆవిడ యిచ్చిన రియాక్షన్ ఇంకా అలాగే మనసులో నిల్చిపోయింది. అంటే ఆనాటికే కాదేదీ కల్తీకనర్హం అన్న వ్యాపారసూత్రం బాగా ప్రబలిందనుకోవాలి. (విజయనగరం కోటయ్య కొట్లోని పకోడీలు చాలా ప్రశస్థమని మా తాతగారు అప్పుడప్పుడు తెచ్చేవారు, కల్తీలేనివే అయుంటాయి).
తర్వాత, వాల్టేర్ వెళ్ళే ప్యాసింజర్ రావడం మేము రైలెక్కడం జరిగింది. ఆ రాత్రికి విశాఖపట్నం లో డాబా గార్డెన్స్ లోని మా చిన్నాన్నగారింట గడిపాము. ఆ ఇల్లు లీలామహల్ పక్క వీధిలో వుండేది. (అప్పట్లో ఆ ధియేటర్ పేరు నాకు తెలీదు). ఆనాటికి విశాఖపట్నం చిన్న పట్టణమే. అంత అభివృధ్ధి చెందలేదు. ఇళ్ళు కూడా చెదురుమదురుగానే వుండేవి. చీకట్లో ఊరంతా నిర్మనుష్యంగా వుండేది. డాల్ఫిన్స్ నోస్ కొండమీది లైట్ హౌస్ లైట్ వెలుగు, వాల్టేర్ అప్ ల్యాండ్స్ లోని గవర్నర్ బంగళా లైట్ల వెలుగు మా చిన్నాన్నగారింటికి స్పష్టంగా కనిపించేది. ఇతర కొండలమీద ఇళ్ళేవీ లేవు అప్పటికి. వాల్టేర్ రోడ్లన్నీ ఎగుడు దిగుడు రోడ్లు. సిటీ బస్సులు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ రిక్షాలలోనే వెళ్ళాలి మనస్సాక్షి చంపుకొని. ఒక పావలా ఇస్తే ఇద్దరు మనుషుల్ని ఎక్కించుకొని రైల్వే స్టేషన్ నుండి నాలుగైదు మైళ్ళ దూరం వరకూ తీసుకుపోయేవారు. ఎత్తు ప్రాంతాలలో రిక్షా తొక్కలేరు. లాగుతూ, నడిపించుకునే తీసుకువెళ్ళాలి. ఎండైనా, వానైనా. ఆ రిక్షావాళ్ళ శ్రమ, కష్టం చూస్తే మనసుకు బాధ కలుగుతుంది. అలాటివారితో బేరాలాడడం మా నాన్నగారికి ఇష్టంవుండేది కాదు. ఆయన అన్నివిధాలా చాలా ఉదారంగానే ఉండేవారు. మా నాన్నగారెప్పుడూ పిల్లల్ని కొట్టడం, తిట్టడం చేయలేదు. కానీ కోపం వస్తే ఆయన తీక్షణమైన చూపులు, ఘాటైన ఉపన్యాసాలు తీవ్రంగా వుండేవి.
మా నాన్నగారు కథలు చెప్పే తీరు చాలా అద్భుతం. ఎక్కువగా టాగోర్, శరత్, ప్రేమ్ చంద్ కథలు చెప్పేవారు. ఆయన చెప్పిన కథలు చాలా బరువైనవిగా వింటూంటే దుఃఖం కలిగించేవిగా ఉండేవి. అంతలా మనసుకు హత్తుకునేలా కథలు చెప్పే తీరు నాకు మరెవరి దగ్గరా కనపడలేదు. ఈ విషయాన్ని ఘంటసాల సావిత్రమ్మగారు, పాప పిన్నిగారు (ఘంటసాల సదాశివుడిగారి భార్య) కూడా తరుచూ చెప్పేవారు. మేము మెడ్రాస్ కు వెళ్ళకముందు మా నాన్నగారు ఒంటరిగా ఓ ఏడాదికి పైగా ఘంటసాల వారింటి మేడమీద వుండేవారు. (పానగల్ పార్క్ దగ్గరి పార్క్ లాండ్స్ హోటల్ లో భోజనం, 35 ఉస్మాన్ రోడ్ మేడ మీదం మకాం). సత్రవు భోజనం, మఠం నిద్ర. అలాటి రోజుల్లో సాయంత్రం పూట బాల్కనీలో కూర్చొని అందరూ సరదాగా కబుర్లు చెప్పుకునే సమయాలలో మా నాన్నగారు ఇలాటి కథలెన్నో చాలా రసవత్తరంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పేవారని, సంగీతంగారి కథలు విన్న తరువాతే పుస్తక పఠనం మీద ఆసక్తి పెరిగిందని చెప్పేవారు.
అలాగే, ఆయన పాడే తీరు, హార్మోనియం మీద కర్ణాటక సంగీతం వాయించే విధానం నన్ను కట్టి పడేసేవి. నేనే కాదు, మా నాన్నగారిని గురించి తెలిసినవారంతా ఇలాగే చెప్పేవారు. సంగీత, సాహిత్యాలలో ఆయనకున్న శాస్త్రపరిజ్ఞానం, అనుభవం అపారం. ఎడ్వాన్స్డ్ మ్యుజీషియన్స్ కు ఆయనొక గొప్ప గైడని ఆయన దగ్గరకు పలువురు సంగీత విద్యార్ధులు వచ్చేవారు. సంగీతరావు గారు గొప్ప మ్యూజికల్ జీనియస్సని డా. సి. నారాయణరెడ్డి గారు సభాముఖంగా ప్రశంసించడం నేను విన్నాను. ఆ సభలో సంగీతరావు గారు లేరు. ఆరుద్ర లాటి చరిత్రకారుడు కూడా సంగీతం విషయంలో ఆయనను సంప్రదించేవారు. ఆయన స్థాయి సంగీత జ్ఞానం కలిగిన కొందరు ప్రముఖులు పొందిన గుర్తింపు ఆయనకి దక్కలేదన్నది ఆయన మిత్రులు కొందరి అభిప్రాయం. కమర్షియల్ పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మా నాన్నగారు, తాత, ముత్తాతల మార్గం భిన్నం. వారి ఆశయాలు, ఆదర్శాలు, వారిని మరో మార్గంలో నడిపించేయి.
మా టివికె శాస్త్రిగారు ఎప్పుడూ ఒక మాట అనేవారు "మీ తాత, నాన్నల సంగీతం విని అనుభవించలేకపోవడం జనాల కర్మ. వాళ్ళకు ఆ అదృష్టం, ప్రాప్తం లేదు" అని. ఆయన కుటుంబం అంతటికీ మా తాత తండ్రుల గురించి తెలుసు. టివికె శాస్త్రిగారు కళాకారులను ఉద్దేశించి మరొక మాట కూడా ఎప్పుడూ అంటూండేవారు "ఎంతటి బంగారు పళ్ళేనికైనా, దాని విలువ, మెఱుపు తెలియాలంటే ఒక మంచి దన్ను, దాపు ఉండాలి. ఆ పనే మనం చేస్తున్నాము. మనలాటివాళ్ళు పూనుకొని ప్రోత్సహిస్తేనే మరుగున పడిన మాణిక్యాలు కొన్నైనా బయటపడతాయి" అని యువకులకు స్ఫూర్తినిచ్చేవారు. ఆ విశేషాలన్నీ మరో అధ్యాయంలో.
ఓ! నేను ఈ విషయాలు చెపుతూ కూర్చుంటే మెడ్రాస్ రైలు తప్పినా తప్పిపోవచ్చు. ఇంక మెడ్రాస్ మార్గం పడదాం.
నేను పుట్టిన దగ్గరనుండి దూసి-విజయనగరం, విజయనగరం- బొబ్బిలి మధ్య అనేకసార్లు రైళ్ళలో ప్రయాణం చేసినా నాకవి అంతగా గుర్తులేవు. ఆ రోజుల్లో విజయనగరం నుండి వెళ్ళాలంటే రెండో మూడో రైళ్ళుండేవి, ఒకటి హోరా వేపు, మరొకటి రాయపూర్ వేపు. అందువల్ల వచ్చీపోయే రైళ్ళలో జనాలరద్దీ ఎక్కువగానే వుండేది. మా (సామవేదుల) వరహాల్తాతగారి రైల్వే పరిభాషలో - ప్రతి డబ్బా - కంపార్ట్ మెంటూ క్రిక్కిరిసే వుండేది. (ఆయన రాసిన రైలు కథలు, రైల్వే జోకులు తరుచూ ఆంధ్రపత్రికలో వచ్చేవి). ఆ రైళ్ళలో I, II, III అని మూడు తరగతులు. తొంభై శాతం ప్రయాణీకులు III క్లాసు డబ్బాల్లోనే ప్రయాణం. ఆనాటికి ఎడ్వాన్స్ రిజర్వేషన్ల పధ్ధతి లేదు. అంతా జనరలే. కండబలం కలిగినవాడే రైల్లో రారాజు. రైల్లో సీట్లు నాలుగు వరసల్లో పొడుగాటి కర్రబల్లలతో వుండేవి. కిటికీల వేపు రెండు వరసలు, మధ్యలో ముందు వెనుకలుగా రెండు వరసలు వుండేవి. సామాన్లు పెట్టుకుందుకు పైన బల్లలుండేవి. అయితే, అవెప్పుడూ హోల్డాల్ లు పరచి బలాఢ్యులైన వారి నిద్రలకే నిర్ణయమైపోయివుండేవి. అప్పట్లో ఎవరికీ less luggage more comfort అన్న స్లోగన్ అనుసరించవలసిన విషయంలా అనిపించేదికాదేమో. తక్కువ దూరం ప్రయాణమైనా ఒక హోల్డాల్, నీళ్ళ మరచెంబు, ఓ సూట్ కేసు, గొడుగు, విసనకర్ర తప్పనిసరి. మా నాన్నగారి చిరకాల స్నేహితుడు, తరువాత మా నారాయణమూర్తి చిన్నాన్నగారి వియ్యంకుడు, ప్రముఖ కవి, రచయిత అయిన కీ.శే. శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారు రాయఘడా నుండి ఎప్పుడు విజయనగరం వచ్చినా హోల్డాల్ తప్పనిసరి. అది మోయడానికి ఒక కూలీ.
35, ఉస్మాన్ రోడ్ ఆఫీస్ రూం దగ్గర
శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారితో నాన్నగారు
ఇన్ని సామాన్లు, జనం రద్దీల మధ్య శనక్కాయలు, జంతికలు, జాంపళ్ళు అమ్మేవాళ్ళ జంగిడీలతో ప్రయాణం అనూహ్యం. మరి మా నాన్నగారు పూర్తి సామానుతో, ఇద్దరు చిన్న పిల్లలతో అంత రద్దీలో విజయనగరంలో ఎలా రైలెక్కించగలిగారో ఆయనకే తెలియాలి. సగం మంది ప్రయాణీకులకే సీట్లు. మిగిలిన వారంతా వారి వారి పెట్టెల మీద సద్దుకోవడం, లేదంటే తమ స్టేషన్ వచ్చేవరకు వచ్చేపోయేవారి తోపులాటలు, కీచులాటలు భరిస్తూ నిలుచోవడం. అంతకు మించి వారికి వేరే గత్యంతరం లేదు. రైలు ప్రయాణం ఒక భగీరథ యత్నం.
నా మొట్టమొదటి సుదీర్ఘ రైలు ప్రయాణం, విజయనగరం నుండి మెడ్రాస్ కు జనతా ఎక్స్ ప్రెస్ లో జరిగిన జ్ఞాపకం. ఆ రైలు హౌరా(కలకత్తా)లో బయల్దేరి ఖర్గపూర్, భువనేశ్వర్, కటక్, ఆముదాలవలసల మీదుగా విజయనగరం వచ్చి, వాల్టేర్, విజయవాడ, నెల్లూరు, గూడూరుల మీదుగా మెడ్రాస్ చేరేది. (విశాఖపట్నం పోర్ట్ స్టేషన్ కి కొన్ని ఎక్స్ ప్రెస్, పాసెంజర్ ట్రైన్స్ మాత్రం వెళ్ళేవి) ఈ మధ్యలో మరెన్నో ఊళ్ళు. ఆ లిస్టంతా మొదలెడితే కోట శ్రీనివాసరావు ప్రహసనమే అవుతుంది. ఆరోజుల్లో, నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ రెండే రైళ్ళు. ఈనాటికీ తూర్పుకోస్తా తీరం వెంబడి ప్రతిరోజూ 1,664 కిలోమీటర్ల దూరాన్ని28 గంటల్లో దాటుతూ సుదీర్ఘంగా నూట ఇరవై ఏళ్ళుగా ప్రతిరోజూ ప్రయాణిస్తూన్న హౌరా మెయిల్ ఒకటి.
మరొకటి జనతా ఎక్స్పెస్. కొన్నాళ్ళకు దాని స్థానంలో హౌరా ఎక్స్పెస్ వచ్చింది. మరికొన్నేళ్ళకు 1977 మార్చిలో ఆ బండి స్థానే కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వచ్చి రెండు మహా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు రెండు గంటలు తగ్గించింది.
ఆరోజుల్లో జనతా ఎక్స్ ప్రెస్ లో మెడ్రాస్ చేరడానికి 20 గంటలకు పైనే పట్టేది. విజయనగరం స్టేషన్ లోకి రైలు సైటింగ్ అయిందనగానే కలకలం మొదలయేది. జనాలంతా పిల్లాపాపలతో సామానేసుకొని ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందు వెనుకలకు పరుగులు మొదలెట్టేవారు. దూరాన కనిపించే రైలును చూడగానే నాకు కంగారుపుట్టేది. రైలింజన్ ఆవిరి చిమ్ముకుంటూ స్టేషన్ అదిరేలా ప్లాట్ఫారమ్ మీదకు రావడంతోనే నా గుండె అదరడం ప్రారంభమయేది. ఆ టెన్షన్ ఇప్పటికీ నాకు వుంది. చెన్నై నుండి బయల్దేరే రైళ్ళయితే ఇబ్బంది లేదు కానీ బయట వూళ్ళనుండి వచ్చే రైళ్ళు ఎక్కాలంటే కంగారే కంగారు ఇప్పటికీ, ఎంత రిజర్వేషన్ బెర్తులున్నా, ఆ గుండెల్లో గాభరా తగ్గలేదు.
మరి, మేము మెడ్రాస్ రైలు ఎలా ఎక్కాము, సీట్లు దొరికాయా లేదా అనే విషయాలు గుర్తులేవు.
మేము మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ లో రైలుబండి దిగి ప్లాట్ ఫామ్ మీద అడుగు పెట్టగానే వేరేదో లోకంలోకి వచ్చినట్లయింది.
వచ్చేవారం నుండి మద్రాసు జీవితం కొత్త విశేషాలతో.....
.... సశేషం