visitors

Sunday, November 28, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై తొమ్మిదవ భాగం

28.11.2021 - ఆదివారం భాగం - 59*:
అధ్యాయం 2 భాగం 58 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ప్రధమంగా ఎవరైనా వోటర్ల లిస్ట్ లోకి ఎక్కేరంటే ఆ యువతీ యువకులు పెళ్ళీడుకు వచ్చినట్లే. 1970ల నాటికి బాల్య వివాహాలనేవి రూపుమాసిపోయినా ఉత్తర భారత దేశంలోని అనేక మారు మూల గ్రామాలలో ఇంకా  అక్కడక్కడ ఈ బాల్య వివాహాల జాడ్యం కనిపిస్తూనే వుంటుంది. ఇరవై ఏళ్ళు వచ్చేసరికే పెళ్ళిళ్ళు అయి వారికి పిల్లలూ పుట్టేస్తారు. సంసార జంఝాటంలో ఇరుక్కుపోతారు. ఎవరికైనా  ఏ కారణం చేతైనా ఇరవైయైదేళ్ళలోపు పెళ్ళి కాకపోతే వాళ్ళు ముదురు బెండకాయలక్రిందే లెఖ్ఖ. నేను ఆ కేటగిరిలోకి చేరకముందే పెళ్ళిచేసి చూడాలని మా పెద్దలు సంకల్పించారు. ఔననడానికి కానీ, కాదనడానికి కానీ కావలసిన మనస్థైర్యం,మనో పరిపక్వత ఆనాటికి నాకు ఏర్పడలేదు.

మా ఇంటికి వచ్చి వెళ్ళిన ఆ ద్విభాష్యం సుబ్బారావుగారి పెద్దమ్మాయి నాకు తగినదనే భావన మా నాన్నగారికి అమ్మగారికి కలిగింది. శ్రీ సుబ్బారావు గారి కోరికకు అంగీకారం తెల్పారు. సమానవియ్యం, సమాన కయ్యం అనే సిధ్ధాంతాన్ని మా పెద్దలు పాటించినట్లున్నారు.  సుబ్బారావు గారిది సంగీత కులం కాదు. మద్రాస్ అంబత్తూర్ లో వున్న టి.ఐ. సైకిల్స్ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. అయితే వారి కుటుంబానికి మా కుటుంబానికీ కొన్ని సారూప్య సామీప్యతలున్నాయి. వారిదీ మామూలు మధ్యతరగతి కుటుంబం. వారికీ ఐదుగురు సంతానం. మాఇంట్లోలాగే ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆర్ధికంగా కూడా సరిసమానమే. అయితే ఈనాటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం -  ఏ విధమైన ప్రత్యేకతా కనపడని నాలాటి సగటు నిరుద్యోగికి ఏ ధైర్యంతో  ఆ పెద్దమనిషి  తన కూతురిని నాకిచ్చి పెళ్ళి చేయాలనుకున్నారో నాకు అర్ధం కాని విషయం. నాకు ఓ డిగ్రీ, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ తప్ప కళ్యాణానికి కావలసిన మరే  పెద్ద అర్హతలు లేవు. పైగా అమ్మాయి ఆసరికే బ్రిటానియా బిస్కట్ ఫ్యాక్టరీలో చిన్నో చితకో ఉద్యోగంలో వున్నది. ఈ వివాహం విషయం లో ద్విభాష్యం వారు తొందరపడడానికి,  తర్వాత నేను గ్రహించిన, నాకు కనిపించిన కారణం ఒక్కటే.  అదే కొన్ని మాసాలకు ముందు వారింట జరిగిన ఒక విషాద సంఘటన. చదువు ముగించి, ఉద్యోగానికి సిధ్ధమై చేతికి అందివచ్చిన తమ పెద్దకొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ కుటుంబానికి ఒక పెద్ద అశనీపాతం. ఆ దుఖం నుండి, మనోవేదననుండి బయట పడడానికి ఆరుమాసాలలోపు ఇంట్లో శుభకార్యం జరిపించి ఆనందించాలనే తపనతో వారి పెద్దమ్మాయికి వరుని వెతికే  తీవ్ర ప్రయత్నాలలో భాగంగా  మా నాన్నగారి గురించి విని  వేదుల సుబ్బారావుగారితో మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. అయితే ఈ విషాద నేపథ్యం ఏమి అప్పట్లో చెప్పినట్లు లేదు. నిజానికి చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఏది ఏమైతేనేం ఉద్యోగం, సద్యోగం లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్న నాకు ముందరి కాళ్ళ బంధాలు వేయ నిశ్చయించారు మా పెద్దలు.

ఈ పరిణామాలేవీ ఆనాడు నాలో ఎలాటి ఆసక్తిని, స్పందన, ప్రతిస్పందనలు కానీ నాలో రేకెత్తించలేదు. After all, marriages are made in heaven. నమ్మక తప్పదు మరి.

ఈ సంబంధం విషయం మా నాన్నగారు  ఘంటసాల మాస్టారికి, సావిత్రమ్మగారికి తెలియజేయడంతోనే వారంతా చాలా సంతోషించారు. శుభస్యశ్రీఘ్రం అన్నారు. నిజంగానే రెండు మాసాల వ్యవధిలో నా పెళ్ళి నిశ్చయమైపోయింది. ఘంటసాల మాస్టారు మా పెళ్ళి రిసెప్షన్ లో తన వాద్యబృందంతో వచ్చి కచేరీ చేస్తానని ఆ రోజు మరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోనని ఇంట్లోవారికి చెప్పారు. అంతా బాగానే వుంది. పెళ్ళంటే మాటలా! ఆడపిల్లకైనా, మగపిల్లాడికైనా పెళ్ళంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆర్ధికస్తోమతు గలవారి విషయం వేరే. ఏ తాడూ బొంగరం లేని సామాన్యుల విషయంలో పెళ్ళిళ్ళు ఒక పెద్ద  ప్రతిబంధకమే. కానీ, చూద్దాము, కానున్నది కాకమానదు అనే కర్మసిధ్ధాంతాన్ని మా నాన్నగారు అనుసరించారేమో.

ఘంటసాల మాస్టారు, సావిత్రమ్మగారు కలసి నాకు పెళ్ళి బట్టలు కొనివ్వాలని నిశ్చయించారు. ఒకరోజు  మాస్టారు నేనూ  వారి కారులో పాండీబజార్ రాజకుమారి ధియేటర్ ఎదురుగా వున్న కైలాష్ టెక్స్ టైల్స్ షోరూముకు తీసుకువెళ్ళి నాకు నచ్చిన రంగుల్లో మంచి బట్టలను సెలెక్ట్ చేసుకోమన్నారు. నాకు చాలా మొగమాటమనిపించింది. అన్నిటినీ చూస్తూనే వున్నా ఎలాటివి ఎంచుకోవాలో తెలియలేదు. నా తడబాటు చూసి చివరకు మాస్టారే ఓ మూడు జతల బట్టలను ఎంపికచేసారు. వాటిని ఇంట్లో చూపించి వెంటనే కుబేంద్రరావుకు కుట్టడానికి ఇవ్వమని చెప్పారు.  ఘంటసాలవారి చొక్కాలు, జుబ్బాలు చాలాకాలంగా ఆ కుబేంద్రరావే కుట్టేవాడు. ఆయన ఒక కన్నడిగుడు. పానగల్ పా‌ర్క్ పార్క్ లాండ్స్ హోటల్ పక్కన వున్న మెకర్నెట్ బ్యాకరీ వెనకవేపు కుబేంద్రరావు టైలరింగ్ షాపు. మంచి పేరున్న బిజీ టైలర్. మాకు అలవాటుగా బట్టలు కుట్టే ఎన్. మాస్టర్ టైలర్ కొంతకాలంగా మాకు దూరమవడంతో (అన్నివిధాలా)  కేశవన్ ఎమ్.ఎ. మా ఆస్థాన టైలర్ అయ్యాడు. మనిషి చాలా మంచివాడు. మాకు తగినవాడు. అతనివల్ల భరించలేని నశ్యం వాసన తప్ప మరే ఇబ్బంది వుండేది కాదు. పైగా అతని టైలరింగ్ షాపు మా ఇళ్ళ వరసలోనే. పానగల్ పార్క్ కూరగాయల షాపుకు ఎదురుగా వుండే జైన్ స్టోర్స్ ప్రాంగణంలో ఒక చిన్న కొట్లో వుండేది. ఆ కేశవన్ నా పెళ్ళిబట్టలు కుట్టడానికి మహదానందం తో ఒప్పుకున్నాడు. అయ్యగారు బట్టలు కొనిస్తున్నారు కదా, రిసెప్షన్ కోసం ఒక మంచి సూట్ తీసుకోలేకపోయావా అని  మా నరసింగడు ఒక ఉచిత సలహా పారేసాడు. నేనేమీ మాట్లాడలేదు. నా వరకు పెళ్ళిపేరుతో జరిగే ప్రతి పైసా ఖర్చు శుధ్ధ దండగమారి వ్యవహారం. నాకు ఆదాయం లేకపోయినా కనీసపు అవసరాలు తీరడానికి మా నాన్నగారిలాటి కుటుంబీకులు పడే కష్టం నాకు తెలుసు. తెలిసి తెలిసి నా మూలంగా మరింత వృధా వ్యయం చేయించడానికి మనసు రాలేదు. అయితే ఈ భావాలన్నీ మనసులోనే. బయట వ్యక్తీకరించే ధైర్యం నాకేనాడూ అలవడలేదు.

పెళ్ళి ఇన్విటేషన్ల కోసం నేనూ నరసింగ కలసి 11వ నెంబర్ బస్ లో బయల్దేరి పారీస్ కార్నర్ సమీపంలోని ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా వుండే బందర్ స్ట్రీట్ లోకి వెళ్ళాము. దాని పక్కపక్కనే వుండే సుంకురామ చెట్టి స్ట్రీట్  వంటి వీధులన్నిటిలో ఎన్నో స్టేషనరీ షాపులు, వెడ్డింగ్ ఇన్విటేషన్ల్ దొరికే షాపులు వుండేవి. అలాటి ఒక షాపులో   మరీ ఆడంబరంగా, డాంబికంగా లేకుండా సింపుల్ వుండే కార్డ్ గా చూసి కొన్నాము. వాటిని పాండీబజార్లో నారాయణన్ కేఫ్ ఎదురుగా వుండే ఒక ప్రింటింగ్ ప్రెస్ లో ఇచ్చాము. ఆ ప్రెస్ లో మాకు తెలిసిన ఒక తెలుగాయన ఉండేవారు. పేరు పంచాది అప్పలస్వామి. సినీమాలలో చిన్న చిన్న ఎక్స్ ట్రా వేషాలు వేసేవారు మనిషి పొట్టిగా పంచెకట్టుతో వుండేవారు. ఆయన ఘంటసాలవారు తీసిన 'భక్త రఘునాధ్' లో కూడా ఏదో వేషం వేసారు. వేషాలకోసం తిరుగుతూ మాస్టారిని చూడడానికి వచ్చేవారు. ఆ పరిచయంతో ఆ ప్రెస్ లో ఇన్విటేషన్ల ప్రింట్ కు ఇచ్చాము.  సింపిల్ గా వుండే ఆ ఆహ్వాన పత్రికలో ఘనంగా అందరినీ ఆకర్షించే విషయం  ఘంటసాల వారి కచ్చేరీ ఒక్కటే. 

ఒక పెళ్ళి పేరిట ఇద్దరు మనుషులను కలపడానికి ఇంత ఖర్చు, యాతనా, కాలాయాపనా అవసరమా? అనే భావన నాకు ఎప్పుడూ కలుగుతూంటుంది. కట్నకానుకల విషయంలో, మర్యాదల విషయంలో, మ్యారేజ్ హాల్స్  విషయంలో, భోజనాలలోని ఆహార పదార్ధాల విషయంలోనూ, ఊరేగింపులు, బ్యాండ్ మేళాలు, విడియో కవరేజ్ ల విషయంలో  ఏర్పడే తగాదాలు, కొట్లాటలతో ఎన్నో వివాహాలు, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం కావడం ఈనాటికీ మనం చూస్తూనే వున్నాము. ఇలాటి స్వల్ప విషయాలలో నేటి మన నాగరికత, విద్య, వివేకం ఏమైపోతాయో అర్ధంకాదు.

ఈ రకమైనటువంటి ఏ బాదరబందీ లేకుండా మా పెళ్ళి మద్రాస్ కీల్పాక్ గార్డెన్స్ లోని ఒక కమ్యునిటీ హాల్ లో ఉన్నంతలో హుందాగా, పెద్దల సమక్షంలో  ప్రశాంతంగా జరిగింది. పెళ్ళికి ముందు జరిగే తతంగమంతా కూడా ఘంటసాల మాస్టారింటి చిన్న హాలులోనే  వారి కుటుంబ సభ్యులు, కొల్లూరి వెంకటేశ్వరరావుగారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారి ఆశిస్సులతో జరిగింది. (అదే హాలులో తర్వాత కాలంలో రత్నకుమార్ ఉపనయనం కూడా జరిగింది). సరిగ్గా ఓ ఏడాది క్రితం రతన్ (ఘంటసాల రత్నకుమార్) ఫోన్ చేసి మా పెళ్ళి రిసెప్షన్ లో జరిగిన  నాన్నగారి (ఘంటసాల మాస్టారి) కచేరీ ఫోటోలు పంపమని అడిగాడు. చిత్రం ఏమంటే ఆ నాడు ఎవరికీ పెళ్ళనే ఓ సంఘటనను భవిష్యత్తు లో గుర్తుచేసుకునేలా ఫోటోల ద్వారానో, 16 mm సినీమా ద్వారానో భద్రపర్చుకోవాలనే ధ్యాసే ఎవరికీ లేకపోయింది. ఎందుకంటే, సింపుల్, అదంతా ఖర్చు వ్యవహారం.

మా పెళ్ళికి ఫోటోగ్రాఫర్ లేడు. ఎవరు వ్యక్తిగతంగా కూడా ఫోటోలు తీయలేదు. అలాగే ఘంటసాల మాస్టారి కచ్చేరీ ఫోటోలు కూడా తీయబడలేదు. ఈ రకమైనటువంటి సరదాలు మా నాన్నగారికి తక్కువ. అదే అలవాటు నాకు వచ్చింది. నాకు నేనుగా ఫోటోల కోసం నిలబడిన సంఘటనలు చాలా తక్కువ.

తమిళనాడులో పెళ్ళి ముహుర్తాలన్ని దాదాపు ఉదయం పూటే జరుగుతాయి. అది కూడా ఏడు నుండి పదిన్నర గంటలలోపే వుంటాయి. పెళ్ళి భోజనాలు కూడా పన్నెండు లోపల ముగిసి రెండయేసరికి కళ్యాణమండపాలను ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పెళ్ళికి వచ్చినవారు కూడా  తమ తమ ఆఫీసులలో ఓ రెండు గంటలు పర్మిషన్ తీసుకొని పెళ్ళికి వచ్చి, వధూవరులను అభినందించేసి, పెళ్ళి భోజనాలు చేసేసి, పెళ్ళివారిచ్చే తాంబూలం కవరు తీసుకొని డైరక్ట్ గా ఆఫీసులకు వెళిపోతారు. 
ఇందువల్ల ఎవరి సమయమూ వృథాకాదు. ఎవరికీ ఏ రకమైన ఇబ్బంది కలగదు. బహుశా తమిళులు సౌరమానాన్ని పాటించడంవల్లకావచ్చు. వారికి విరుధ్ధంగా మన తెలుగువారి పెళ్ళిళ్ళన్నీ చాలావరకు అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున జరుగుతూండేవి. ఇప్పుడు రోజులు మారి తెలుగువారు కూడా ఉదయం ముహుర్తాలకే మొగ్గు చూపుతున్నారు. 

మా పెళ్ళి ముహూర్తం ఉదయాన్నే కుదిరింది. తొమ్మిది నుండి పదిముప్పావు. మా సమీప బంధువులు, ఆత్మీయులైన ఘంటసాలవారి కుటుంబం, కొల్లూరి వెంకటేశ్వరరావుగారి కుటుంబం, మా నాన్నగారికి సన్నిహితులైన సాహితీ మిత్రుల సమక్షంలో  వారి శుభాశిస్సులతో శ్రీ ద్విభాష్యం సుబ్బారావు గారి జ్యేష్ట కుమార్తె శేషశ్రీతో  నా వివాహం నిర్విఘ్నంగా శుభప్రదంగా జరిగిపోయింది.




అదే సాయంత్రం అదే కీల్పాక్ హౌసింగ్ బోర్డ్ కమ్యునిటీ హాలులో జరిగిన  ఘంటసాల మాస్టారి కచేరీ ఆహుతులందరికీ షడ్రసోపేత విందుగా అమరింది. ఆ రిసెప్షన్ కు ప్రముఖ రచయిత  మా నాన్నగారికి మంచి మిత్రుడైన శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు కుటుంబ సమేతంగా వచ్చారు.

ఆడపెళ్ళివారి తరఫున బ్రిటానియా కంపెనీ, టిఐ సైకిల్స్ ఉద్యోగులు తరలి వచ్చి మమ్మల్ని అభినందించారు. ఆనాటి ఘంటసాలవారి సంగీత కచేరీ వారందరికీ అపురూపమైన వరంగా అమితానందాన్ని కలగజేసింది. మాస్టారు దాదాపుగా రెండు గంటలసేపు ఆనాటికి బహుళ ప్రచారంలో వున్న  తన తెలుగు, తమిళ సినీమా పాటలను మృదుమధురంగా ఆలపించి శ్రోతలను మైమరపింపజేశారు. నా  పెళ్ళి కచేరీలో మా నాన్నగారు యథావిధిగా తన హార్మోనియంతో  ఘంటసాల మాస్టారికి సహకరించారు. ఆనాడు కచేరీలో పాల్గొన్న ఇతర వాద్యబృందం మా నాన్నగారు యథాశక్తి ఇచ్చిన పారితోషికాన్ని సంతోషంగా "ఇది మా ఇంట్లో పెళ్ళి" అని స్వీకరించారు. 

ఆప్త స్నేహితులు, బంధువుల పట్ల ఘంటసాల వారికి గల ఔదార్యానికి, ప్రేమాభిమానాలకు మా ఇంటి వివాహం ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.

కొత్తకోడలు వచ్చిన వేళావిశేషం అంటారు. అలాటిదేదో నావిషయంలో జరిగిందని చెప్పక తప్పదు. ఆనాటి రిసెప్షన్ కు మానాన్నగారి మరో విజయనగరం స్నేహితుడు బి.డి.రావుగారు భార్యా సమేతంగా వచ్చారు. ఆయనా మానాన్నగారు చిన్నప్పుడు హైస్కూలు లో సహాధ్యాయులని చెప్పిన గుర్తు. ఆయన తండ్రి భాగనారపు సంజీవరావుగారు విజయనగరంలో హెడ్మాస్టర్ గా పనిచేసేవారు. బి.డి.రావుగారు మద్రాసు లో ఒక మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీలో రీజినల్ మేనేజర్. మా నాన్నగారిని తరచూ చూడకపోయినా మంచి అభిమానం గల వ్యక్తి. ఆయన మా పెళ్ళి రిసెప్షన్ కు వచ్చారు. ఆయనకు నా గురించి అంతకుముందే డా. డి.ఎన్.రావుగారి ద్వారా వినివున్నారు. ఆయన ఈ రిసెప్షన్ లో నన్ను అభినందిస్తూ  ఒక మంచి రోజు చూసుకొని తనను తమ రాయపురం ఫ్యాక్టరీ లో కలుసుకొమ్మని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. అంతా మంచే జరుగుతుందని భరోసా ఇచ్చారు.

పట్రాయని వారింటి వివాహానికి రాలేకపోయిన బి.ఎన్.రెడ్డిగారు, పాలగుమ్మి పద్మరాజుగారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, డా.డి.ఎన్.రావు దంపతులు ఆశీఃపూర్వక ఉత్తరాలు పంపారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారైతే ఒకనాటి ఉదయాన్నే మా ఇంటికి వచ్చి కొత్తకోడలిని చూసి స్వయంగా ఆశీర్వదించారు. కృష్ణశాస్త్రిగారు మా ఇంటినుండి తిరిగివెళ్ళబోయే ముందు మా ఇద్దరిని తప్పక వారింటికి పంపమని మా నాన్నగారిని కోరారు. మా నాన్నగారు సంతోషంగా సమ్మతించారు. నాకు తగిన ఇల్లాలే మా ఆవిడ. మా ఇద్దరికీ సంగీతం రాదు. సాహిత్యం అంటే ఏమిటో తెలియదు. అలాటి మేము కృష్ణశాస్త్రిగారి వంటి ప్రసిధ్ధ కవి సమక్షంలో ఏం మాట్లాడగలము, ఎలా మసలగలము? వారింటికి వెళ్ళడానికి సంకోచమే. కానీ వెళ్ళకతప్పదు. ఒక రోజు మేమిద్దరం కృష్ణశాస్త్రిగారింటికి వెళ్ళాము. అప్పట్లో కృష్ణశాస్త్రి గారు టి.నగర్ తిరుమలపిళ్ళై రోడ్ సమీపంలో వాల్మీకి స్ట్రీట్ లో వుండేవారు. మేము వెళ్ళినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నట్లు పలకమీద వ్రాసి చూపారు. ఇంట్లోని తమ కోడలుకు, కుమారునికి మమ్మల్ని పరిచయం చేసారు. దాదాపు ఒక అరగంటకు పైగా వారు  మా స్థాయికి దిగివచ్చి సరదా కబుర్లు చెప్పి వాతావరణాన్ని మార్చివేసారు.  తన వాక్చాతుర్యంతో నాలోని బెరుకుతనం కొంతవరకు తొలగించారు. మేము తిరిగి వస్తున్నప్పుడు కృష్ణశాస్త్రిగారు మా ఆవిడకు తన కోడలిచేత పసుపుకుంకుమ, ఓ జత దీపపు కుందులు కానుకగా ఇప్పించారు. వారి కవితా సంపుటులు నాలుగు పుస్తకాలను నాకు బహుకరించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారింట్లో వారి సమక్షంలో  గడపిన ఆ క్షణాలు ఏనాటికి మరపురాని మధుర స్మృతులు. చూస్తూండగానే, నిన్న మొన్న జరిగినట్లనిపించే మా వివాహానికి స్వర్ణోత్సవం అయిపోయింది.

🌺

1971 జనవరిలో  నాలుగు సినీమా లు రిలీజయ్యాయి. రెండు రామారావు గారు నటించినవి; మరో రెండు నాగేశ్వరరావు గారివి. అవి - శ్రీకృష్ణ విజయం, 

అనరాదే బాలా... శ్రీకృష్ణవిజయం

దసరాబుల్లోడు, నిండు దంపతులు, మనసు మాంగల్యం.

ఆవేశం రావాలి ఆవేదన కావాలి ... మనసు మాంగల్యం

అగ్రనటుల సినీమాలంటే మాస్టారి పాటలు లేకుండా వుంటాయా? ఈ నాలుగు సినీమాలలో మొత్తం ఇరవైఐదు పాటలు పద్యాలు ఘంటసాల మాస్టారు పాడినవే. ఆ పాటల విశేషాలేమిటో వచ్చే వారం...

నెం.35, ఉస్మాన్ రోడ్ కు వస్తే తెలుస్తాయి...

      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, November 21, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై ఎనిమిదవ భాగం

21.11.2021 - ఆదివారం భాగం - 58*:
అధ్యాయం 2  భాగం 57 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"రామం! ఇవేళ పిల్లల్ని ప్రసాద్ కి తీసుకురావే, పిల్లల  పాటను షూట్ చేస్తున్నాము. సరదాపడతారు. సరోజాదేవి, రామారావుగారి కాంబినేషన్" అని చెపుతూ అక్కడే వున్న "నన్ను చూసి నువ్వు కూడా రావోయి" అని ఓ మాట అనేసి వెళ్ళిపోయారు నిర్మాత భమిడిపాటి బాపయ్యపంతులుగారు. మా క్రిందింటి వెంకటేశ్వరరావు గారి బావమరది. షూటింగ్ ఏ.వి.ఎమ్.లోనో, ప్రసాద్ లోనో జరిగింది. ప్రసాద్ స్టూడియోవే కావచ్చు. ఒకప్పుడు వాహినీలో ఒక  వెనక భాగం విజయా స్టూడియోస్. దానిని ఎల్.వి.ప్రసాద్ గారు లీజ్ కు తీసుకొని ప్రసాద్ స్టూడియో గా మార్చారు. ఆ స్టూడియో లో ఈ పాట షూటింగ్.  రావుగారి కార్లో మేము స్టూడియో ఫ్లోర్ లోకి అడుగుపెట్టేప్పటికి "ఎవరో వచ్చే వేళాయే ఎదురై కాస్త చూస్తారా! వాకిలి తీసే ఉంచారా మరి ఒకసారి చూస్తారా" అనే పాట పల్లవి వినిపిస్తోంది.  మా కోసమే పాడుతున్నారా అనిపించింది. ఈ పాట ఏ సినీమాలోదో మీకందరికీ తెలిసేవుంటుంది. 'మాయని మమత' సినీమా లోనిది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ముద్రగల పాట. అశ్వత్థామగారి సంగీతం. శ్రీమతి పి.సుశీల, బి.వసంత గార్లగానం. 

ఎవరో వచ్చే వేళాయె - మాయని మమత

పదమూడేళ్ళ వయసు నుండి ఆరేళ్ళ వయసులోపలి మూడు జతల ఆడపిల్లలతో సరోజాదేవి ఆడుతూ పాడే పాట షూటింగ్. షూటింగ్ అనేది నావరకు  చాలా విసుగెత్తించే విషయం. నత్త నడకలా సాగుతుంది వ్యవహారం. జైంట్ లైట్ల వెలుగు,  సెట్ లోపలి వేడి చాలా చికాకుగా వుంటుంది. అందులోనూ డాన్స్ సాంగ్. వెళ్ళిన కొంతసేపువరకు ఉత్సాహంగానే వుంటుంది. ఒక పల్లవి షూటింగ్ అవడానికి ఒక పూట పట్టింది. మొత్తం పాట అవడానికి ఎన్ని కాల్షీట్లు అయాయో? ఇంతకూ ఆ రోజు షూటింగ్ కు రామారావు గారు రానేలేదు. ఆయన షాట్స్ మరోరోజు , కంబైన్డ్ షాట్స్ మరో రోజు తీస్తారని అనుకున్నారు. ఈ పిల్లలతో ఉన్న భాగం పూర్తికావడానికే రెండురోజులు పడుతుందని అన్నారు. ఈలోగా లైట్లు, కెమేరాల సెట్టింగ్ కోసం బ్రేక్ ఇచ్చారు. ఆ గ్యాప్ లో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ శాస్త్రిగారు వచ్చారు.  మర్నాటి షూటింగ్ గురించి ఆర్టిస్ట్ లతో చర్చలు. ఈ ఆడపిల్లల గ్రూప్ లో ఉండే ఒక పెద్ద అమ్మాయి, జయ కౌసల్య (అనే గుర్తు) కు డేట్స్ క్లాష్. మర్నాడు మరేదో తమిళ్ మూవీ షూటింగ్. ఆ అమ్మాయికి వీలయిన రోజున హీరోయిన్ సరోజాదేవికి అవకాశం లేకపోవడం వంటి విషయాలన్నో చర్చకు వచ్చి చివరకేదో సద్దుబాటు చేసుకున్నారు.  ఈ శాస్త్రిగారిని తెలిసినవారంతా నక్షత్రక శాస్త్రి అనేవారు. ఏ కార్యం సాధించాలన్నా పట్టినపట్టు వదలకుండా అవతల వాళ్ళ చుట్టూ వదలకుండా తిరుగుతూ  పనులు సాధించేవారు. అలాటివారే సినీమా రంగంలో ప్రొడక్షన్ మేనేజర్లుగా రాణిస్తారు. కెమెరా ఏంగిల్స్ అన్ని చూసి మరో షాట్ కు రెడి అనడానికి  ఇంకా చాలా సమయం పట్టేలా కనిపించింది. ఇంక ఆ వేడిలో కూర్చొనే ఓపిక మా రావుగారి పిల్లలలో నశించింది. మెల్లగా అక్కడనుండి బయటపడి ఇంటికి చేరుకున్నాము.

'మాయని మమత' సినీమా టైటిల్స్ లో గాయకుడిగా ఘంటసాలవారి పేరు ముందు ' పద్మశ్రీ' అని వేసారు.  అందులో మాస్టారు పాడిన 'రానిక నీకోసం రాదిక వసంతమాసం' పాట ఈనాటికీ సంగీతాభిమానుల ను అలరిస్తూనేవుంది. 'మాయని మమత'  సినీమా బాగానే వచ్చింది.  పెద్ద నటులు,  పేరున్న డైరక్టర్, మంచి సంగీతం, అంతా బాగుంది కానీ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిర్మాతకు మాత్రం  సినీమా లంటే మమతను మిగల్చకుండా నిరాశాజనక మచ్చగా మిగిలిపోయింది. 

🌿


1970లో ముగ్గురు 'పద్మశ్రీ'లతో విడుదలైన మరో చిత్రం 'విజయం మనదే'. ఇందులోని హీరో ఎన్.టి.రామారావు, హీరోయిన్ బి.సరోజాదేవి, గాయక సంగీత దర్శకుడు ఘంటసాల - ముగ్గురు 'పద్మశ్రీ' గ్రహీతలే. బి.విఠలాచార్య దర్శకత్వంలో ఘంటసాలవారి సంగీతంతో వచ్చిన ముచ్చటైన మూడవ ఆఖరి చిత్రం. ఈ చిత్రం తర్వాత వారిద్దరూ కలసి పనిచేయలేదు. ఈ చిత్ర నిర్మాత నందమూరి సాంబశివరావుగారు  ఎన్.టి.రామారావుగారి కజిన్. ఆయనకు ఘంటసాల గారంటే మంచి గౌరవం, అభిమానం. 'విజయం మనదే' సినీమాకు మూలం 'అరసిలన్ కుమారి' అనే ఒక ఎమ్.జి.ఆర్. సినీమా. ఆ సినీమాను 'కత్తి పట్టిన రైతుగా' డబ్ చేసారు. ఆ సినిమా రీమేక్ 'విజయం మనదే'.
 
ఈ చిత్రంలోని ఘంటసాలవారు పాడిన 'శ్రీరస్తు శుభమస్తు' పాట, సుశీలగారితో పాడిన యుగళాలు - 'ఓ దేవి ఏమి కన్నులు నీవి', ' నా మదిలో ఉందొక మందిరము', ఎస్ జానకి గారి సోలో 'ఎవ్వరో పిలిచినట్టుట్టుంది' వంటి పాటలన్నీ సుశ్రావ్యమే. ఈ సినీమా కంపెనీ ఆఫీస్ సౌత్ ఉస్మాన్ రోడ్ చివరలోని సి.ఐ.టి.నగర్ లో వుండేది. కొన్ని పాటల కంపోజింగ్ కు వెళ్ళాను. ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాసారు 'శ్రీరస్తు శుభమస్తు చిన్నారి నా చెల్లికి - కొంచెం కొంచెం బిడియాలు పాట' వారు వ్రాసిందే.  

కొంచెం కొంచెం బిడియాలు - విజయం మనదే

వారి సినీ గీతాల రచనా శైలి గురించి గతంలో ముచ్చటించడం జరిగింది.  ఒకపట్టాన వారి కలం నుండి అక్షరరూపంలోకి వచ్చేవికావు. ఆయన అలా చిద్విలాసంగా అందరి ముఖాలు చూస్తూ నవ్వుతూ కూర్చునేవారు. ఎంతసేపైనా సంగీత దర్శకుడు  'తననాలు' పలుకుతూండవలసిందే, పల్లవి మాత్రం కాగితం మీదకు ఎక్కేది కాదు. ఇక అందరికీ విసుగు పుడుతున్నదన్న సమయంలో తన మనసులోని మాట పల్లవిగా వెలువడేది. అవి శిలాక్షరాలే. ఆణిముత్యాలే. ఈ పాట చరణంలో 'పుట్టినింట మహరాణి, మెట్టినింట యువరాణి' అనే పద ప్రయోగం ఆ సినీమా యువ అసిస్టెంట్ డైరక్టర్ కు అర్ధం కాలేదు. అందులో ఏదో తప్పును కనిపెట్టబోయాడు. అప్పుడు కృష్ణశాస్త్రి గారు వ్రాసి చూపించారు 'ఆడపిల్ల పుట్టింటిలో వున్నంతవరకూ మహా స్వేఛ్ఛగా మహారాణీ లా వుంటుంది, అదే కొత్తగా వివాహమై అత్తవారింటికి వెడితే అక్కడ అత్తగారిదే మహారాణి హోదా. కోడలు యువరాణిగానే పరిగణింపబడుతుంది' అంటూ  కోడలి స్థాయి గురించి  చక్కగా విశ్లేషించారు. అనుభవంలేని ఆ అత్యుత్సాహ సహాయదర్శకుడు వెనక్కి తగ్గాడు. ఏ కారణం చేతనో 'విజయం మనదే' సినీమాకు ఘంటసాలవారికి సహాయకుడిగా పనిచేసినా మానాన్నగారి పేరు సినీమా టైటిల్స్ లో వేయలేదు. ఒక్క పామర్తి గారి పేరు మాత్రమే కనిపిస్తుంది. ఆ సినీ మాయేమిటో నాకు అర్ధం కాదు. 

🌿🌺🌿


గతంలో ఒకసారి చెప్పాను, నాకు ఘంటసాల మాస్టారింట్లో వింతగా అనిపించిన విషయం, ఒకే పేరుతో ఇద్దరేసి వ్యక్తులు ఆ ఇంటితో అతి సన్నిహితంగా మెలగడం. ఇద్దరు వెంకటేశ్వర రావులు (ఘంటసాల, పామర్తి), ఇద్దరు కృష్ణలు (తమ్ముడు కృష్ణ మావయ్య కృష్ణ),  ముగ్గురు రాఘవులులు (సంగీత సహాయకుడు జె.వి.రాఘవులు, కచేరీలలో సహగాయకుడు కె.ఎస్. (తిరపతి) వీర రాఘవులు, దోభీ రాఘవులు, అలాగే  ఇద్దరు హరినారాయణలు (ఒకరు ఎడిటర్ బి.హరినారాయణ, మరొకరు సావిత్రమ్మగారి తమ్ముడు కె.హరినారాయణ (అసిస్టెంట్ కెమెరామెన్).

ఎడిటర్ హరినారాయణ గారిని నేను మద్రాస్ వెళ్ళినప్పటినుండి మాస్టారింట్లో చూసేవాడిని. లావుగా, పొడుగ్గా సగం నెరిసిన ఉంగరాల జుత్తుతో నీలం రంగు కళ్ళతో భారీగా కనిపించేవారు. మాస్టారింట్లోని పిల్లలందరికీ తన కెమేరాతో ఫోటోలు తీసేవారు. ఘంటసాలగారి సొంత సినీమాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా,  దర్శకుడిగా పనిచేసేవారు. ఘంటసాలవారంటే చాలా గౌరవాభిమానాలుండేవి. ఆ కుటుంబంతో చాలా ఆత్మీయంగా వుండేవారు. తర్వాత భానుమతి గారి భరణీ స్టూడియోలో ఆవిడకు అసిస్టెంట్ గా, ఎడిటర్ గా మంచి అనుభవం సంపాదించారు. ఆ బి. హరినారాయణ తన సోదరుడితో కలసి 'మెరుపు వీరుడు'  అనే జానపద సినీమా ను కాంతారావు, రాజశ్రీ,రాజనాల, లక్ష్మి, విజయలలితలతో  తన స్వీయ దర్శకత్వంలో  ప్రారంభించారు. ఆ సినీమాకు ఘంటసాలవారే సంగీతం. 1970 లోనే విడుదలయింది. అంతకుమించి ఈ సినీమా గురించి ఎక్కువగా చెప్పడానికి ఏమిలేదు. చిత్రం జయాపజయాల గురించి పెద్దగా అవగాహన లేదు. అయితే హరినారాయణ సోదరులు తర్వాత మరో క్రైమ్ థ్రిల్లర్ తీసారు. దానికీ ఘంటసాలవారే సంగీత దర్శకులు. ఆ సినీమా గురించి తర్వాత చెపుతాను.

🍀

రామవిజేతా బాబూరావు నిర్మించిన ' తల్లిదండ్రులు'  సినీమాకు ఘంటసాలవారే సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినీమా లోని ఏడు పాటలలో ఓ నాలుగు పాటలను ఎంతో చక్కగా స్వరపర్చారు మాస్టారు. సుశీలగారు పాడిన 'పాట పాడనా ప్రభూ పాట పాడనా', ఎస్.జానకి బృందం పాడిన 'గొబ్బియళ్ళో  కొండామల్లెకు గొబ్బిళ్ళు', ఘంటసాల-జానకి యుగళగీతం 'మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను', 'ముద్దులు కురిసే ఇద్దరి మనసులు', పాటలు ఎంతో బాగుంటాయి. కుటుంబగాధా చిత్రాలను తెరకెక్కించడంలో బాబూరావు చాలా సమర్ధుడు.

'తల్లిదండ్రులు' సినీమా రీరికార్డింగ్ కు ముందు రష్ వేసి చూపించారు. మాస్టారు, మా నాన్నగారితో పాటూ నేనూ వెళ్ళాను. ఆ రష్ మూవీ చూడడానికి జగ్గయ్య, శోభన్ బాబు, రాజబాబు, అల్లు రామలింగయ్యగార్లు కూడా వచ్చారు. సినీమా ప్రారంభించడానికి వ్యవధి వుండడంతో వీరంతా కబుర్లలొ పడ్డారు. ఆ సందర్భంలో జగ్గయ్య, శోభన్ బాబు గార్ల సంభాషణ 'విగ్గు'ల మీదకు వెళ్ళింది. జగ్గయ్యగారు తనకైతే విగ్గు తప్పనిసరని, మంచి తలకట్టు గల శోభన్ విగ్గులు లేకుండా సహజమైన జుట్టుతో కనిపిస్తే బాగుంటుందని తన నిర్మాతలకు నచ్చజెప్పమని సూచించారు. అందుకు దర్శకులు, నిర్మాతలు సహకరించడంలేదని చెపుతూండగా విన్నమాటలు బాగా గుర్తుండిపోయాయి. రాజబాబు గారైతే తన సీటులోంచి లేచివచ్చి ఘంటసాల మాస్టారి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చేతులు పట్టుకొని 'బాబాయ్' అంటూ వినయంగా, ఆప్యాయంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అల్లు రామలింగయ్యగారైతే ఈ లోకంలో వున్నట్లే కనపడలేదు. తనలో తాను ఏదో పాడుకుంటూ కూర్చొనివున్నారు. కొంతసేపటికి సినీమా వేయడం ఔట్ పుట్ బాగానే వచ్చిందని అందరూ అనుకోవడం జరిగింది. 

💥

ఘంటసాల మాస్టారి స్వీయసంగీతంలో పాటలేవీ పాడని సినీమాలు ఏవైనా వున్నాయా అంటే సందేహా స్పదమే. కానీ గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన 'రెండు కుటుంబాల కథ' లో మాస్టారి పాటలు లేవు. లీల, సుశీలగార్లు పాడిన ఒక పాట ప్రారంభంలో ఒక చిన్న సాకీలాటిది మాత్రమే పాడారు. 

జగతికి జీవము నేనే - రెండు కుటుంబాల కథ

ఆ సినీమాలో ఉన్నవి ఆరే ఆరు పాటలు. సుశీల, లీల, ఎల్.ఆర్.ఈశ్వరి, స్వర్ణలత, పిఠాపురం పాడారు. ఈ  సాంఘిక సినీమా లోని మూడు పాటలు ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత విద్వత్తుకు దర్పణం పట్టేవిగా వుంటాయి. అవి - 'వేణుగాన లోలుని గన', 'జగతికి జీవము నేనే', 'మదిలో విరిసే తీయని రాగం' పాటలు. ఈ పాటలు ఎన్ని దశాబ్దాలైనా నిత్యనూతనంగా శ్రవణానందకరంగానే వుంటాయి. ఈ సినీమా నిర్మాత వి.ఎస్.గాంధి. కాస్ట్యూమ్స్ గాంధిగా చిత్రసీమలో చాలా అనుభవం, పేరు గడించారు. ఆయన ఇంటిపేరు వృధ్ధులవారు. ఆ ఇంటిపేరు గలవారు బొబ్బిలిలో వుండేవారు. ఈ గాంధీగారి స్వస్థలం కూడా బొబ్బిలేనని మా నాన్నగారు అనడం గుర్తు. ఆయన మానాన్నగారు కలిసినప్పుడు ఆ బొబ్బిలి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకునేవారు.

ఈ సినీమా కథకు మూలం ద్వివేదుల విశాలాక్షిగారి 'వారధి' నవల. సినీమా స్క్రిప్ట్ కోసం కావలసిన సినాప్సిస్ నాచేతే వ్రాయించారు విశాలాక్షిగారు. ఆ కారణం చేతనేమో తెలియదు. ఈ సినీమా నిర్మాణ సమయంలో సినీమాలలో ఏదో శాఖలో చేరితేనో అనే చిన్న దురద నాకు పుట్టిన మాట వాస్తవం. అయితే అందుకు మానాన్నగారి, ఘంటసాల మాస్టారి ఆమోదమూ లభించదని నాకు బాగా తెలుసు. అసలు సినీమాలకు కావలసిన ఏ అర్హత నాకు లేదని తెలిసికూడా దురదపుట్టిందంటే అది శుధ్ధ అవివేకమే. 

🔔


1970లో సంగీత దర్శకుడిగా, గాయకుడిగా మంచి పేరును తెచ్చిపెట్టిన సినీమా 'ఆలీబాబా 40 దొంగలు'. ఈనాటి పరిభాషలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్. వినోదమే ప్రధానంగా తీయబడిన సినీమా. ఈ సినిమా ఘంటసాల మాస్టారి పరిచయ వాక్యాలతో ప్రారంభమవుతుంది. సినీమా లోకంతో సంబంధంలేని, బొబ్బిలి పట్టణానికి సమీపంలోని పిరిడి అనే చిన్న గ్రామంలో కొలువైవున్న వీరభధ్రస్వాములు, చండికా అమ్మవారి అనుగ్రహంతో ఈ జానపద సినీమాను విడుదల చేస్తున్నామని ప్రకటించడం, పరిత్రాణాయ సాధూనాం అని భగవద్గీత శ్లోకం వినిపించడం  నాలాటి కుర్రకారుకు తమాషాగా అనిపించిన  విషయం. ఏమైనా సినీమా బాగా విజయం సాధించింది. ఈ సినీమాలో సి.నా.రె., దాశరథి, కొసరాజుగార్లు వ్రాసిన 10 పాటలను ఘంటసాలవారి సుశ్రావ్య స్వరరచనలో ఆయనతో పాటు సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంలు మృదుమధురంగా ఆలపించారు. ఈ సినీమా హీరోయిన్ జయలలిత కూడా సొంతంగా ఒక పాటను పాడారు. ఆ పాట విశేషాలు గతవారాలలో చెప్పడమయింది. 

ఆలీబాబా 40 దొంగలు సినీమా లోని అన్ని పాటలు మంచి మనసుకు పట్టేవిగానే వుంటాయి. వాటిల్లో - 'మరీ అంతగా బిడియమైతే', 'సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు', 'నీలో నేనై  నాలో నీవై', 'లేలో దిల్బహార్ అత్తర్', 'రావోయి రావోయి రాలుగాయి', 'చల్ల చల్లనీ వెన్నెలాయె' పాటలు ఈనాటికీ అందరికీ గుర్తుండిపోయిన పాటలు. 

మరీ అంతగా బిడియమైతే - ఆలీబాబా 40 దొంగలు

గౌతమీ రామబ్రహ్మంగారికి ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా పనిచేసిన రెండవ ఆఖరు చిత్రం. ఈ సినీమా తర్వాత తీసిన 'వాడే వీడు' లో మాస్టారు పాటలు మాత్రమే పాడారు. ఆ సినీమా తర్వాత రామబ్రహ్మంగారు మరే సినీమాలు తీసినట్లు లేదు. మనిషి చాలా నిరాడంబరంగా వుండేవారు. 

🌿🌿

1970 చివర నాటి వరకూ నిరంతరాదయం వచ్చే ఉద్యోగమేదీ దొరకలేదు. చేస్తూ వచ్చిన తాత్కాలిక ఉద్యోగమూ పోయింది. చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. ఇలాటి పరిస్థితులలో కొన్ని అనూహ్యమైన విషయాలు జరిగాయి.

ఒకరోజు ఓ ఇద్దరు వ్యక్తులు మా నాన్నగారిని వెతుక్కుంటూ వచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఒకరు వేదుల సుబ్బారావుగారు, మరొకాయన ద్విభాష్యం సుబ్బారావు గారు. మళ్ళీ, ఇద్దరు సుబ్బారావులు. వేదులవారు, ద్విభాష్యంవారూ మా స్వశాఖీయులే. పరరాష్టంలో వున్న తెలుగువారంతా ఒకరినొకరు కలుసుకుంటూ స్నేహాలు కలుపుకోవడం పరిపాటే. ఆ విధంగానే ఈ సుబ్బారావు ద్వయం మా నాన్నగారితో మాట్లాడేందుకు వచ్చారనుకున్నాను. ఇద్దరిలో ఒకరు నాలాగే పొట్టిగా వున్నాయన ద్విభాష్యం సుబ్బారావుగారు. మద్రాస్ అంబత్తూర్ లోని టి.ఐ.సైకిల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. విల్లివాక్కం  నివాసం. ఆ ఇద్దరూ మా నాన్నగారి తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు.

ఈ నూతన పరిచయస్థుల రాకకు కారణమేమిటో తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే... వచ్చే వారమే...

            ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, November 14, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై ఏడవ భాగం

14.11.2021 - ఆదివారం భాగం - 57*:
అధ్యాయం 2 భాగం 56 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

తమిళ రంగస్థల నాటకం దేదీప్యమానంగా వెలుగొందుతున్న రోజులవి. రంగస్థలం నుండి సినీమాకు వచ్చిన అనేకమంది నటీనటులు  మధ్యాహ్నం వరకు స్టూడియోలలో పనిచేసి సాయంత్రం అయేసరికి విధిగా ఏదో సభలో ఏదో నాటకంలో నటిస్తూ నాటక కళ మీద తమకు గల వ్యామోహాన్ని, భక్తిని చాటుకుంటూవుండేవారు. 

ఒక శివాజీ గణేశన్, ఆర్.ఎస్.మనోహర్, పూర్ణం విశ్వనాధన్, మనోరమ, నాగేష్, సహస్రనామం, మేజర్ సుందరాజన్, చో రామస్వామి, వి.కె.రామస్వామి వంటి ప్రముఖ నటులెందరో విరివిగా విధిగా తమిళ నాటక ప్రదర్శనలలో పాల్గొనేవారు. వీరంతా నాటకాలాడేది ధనార్జన కోసం కాదు. వీరంతా సినీమాలలో బిజీగా పనిచేసేవారే. కానీ వారికి రంగస్థలం మీద గల మక్కువ అలాటిది. అలాటి కళాతృష్ణ తెలుగు సినీమా నటీనటులలో కనపడకపోడానికి కారణం వారిలో నాటకరంగ నేపథ్యం ఉన్నవారు క్రమంగా తగ్గిపోడమే. అలాగే తెలుగు ప్రజలు సినీమాకు ఇచ్చిన ప్రాధాన్యం తెలుగు నాటకానికి ఇవ్వలేదు. అందుకే 60ల తరవాత తెలుగు నాటకం తమిళ, కర్ణాటక, మహరాష్ట్రలలో వృధ్ధి చెందినంతగా తెలుగునాట మహోజ్జ్వలంగా ప్రకాశించలేదు. మిణుకుమిణుకుమంటూనే మనుగడ సాగించింది. 
 
ఒకప్పుడు తమిళనాట నలభై శాతం మంది ప్రజలు తెలుగువారే అయినప్పటికీ వారిలో అధికశాతం  తమిళ సంస్కృతి సంప్రదాయాలకు అలవాటు పడిపోయారు. ఇప్పటికీ కొన్ని జిల్లాలలో ఇళ్ళలో తెలుగులో మాట్లాడుకుంటున్నా వారి యాస, ఆచారవ్యవహారాలు తమిళ సంప్రదాయానికి దగ్గరలో వుంటాయి. 

మద్రాసులో తెలుగువారి  కళాతృష్ణను తీర్చేవిధంగా, తెలుగు సంస్కృతికి దర్పణం పట్టేలా పెద్దగా ఏ సాంస్కృతిక సంస్థలు ఉండేవికావు. మద్రాసులో ని అతి ప్రాచీనమైన తెలుగువారి సాంస్కృతిక సంస్థ చెన్నపురి ఆంధ్ర మహాసభ మాత్రమే. ఆ సంస్థే అప్పడప్పుడు ఏవో కార్యక్రమాలను నిర్వహించేది. అయితే అవి నగరంలో వివిధ మారుమూల  ప్రాంతాలలో వుండే తెలుగువారందరికీ తెలిసి, వెళ్ళి చూసే అవకాశముండేది కాదు. 

అలాటి వాతావరణం లో 1967 తర్వాత మెల్ల మెల్లగా తెలుగు సాంస్కృతిక సంస్థలు ఒక్కొక్కటిగా మొలకెత్తాయి. మద్రాస్ నగరంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే తెలుగువారు కొందరు ఔత్సాహిక సాంస్కృతికోత్సవాలు జరిపేవారు. వారిలో కార్యక్రమాలు నిర్వహించాలనే ఆసక్తి,అభిలాష మెండుగానే వున్నా వారికి తగినంత ఆర్ధిక వనరులు, నిర్వహణా సామర్థ్యం వుండేవికావు. అందువలన ఏడాదికి ఒకమారో రెండుమార్లో ఉగాదికో, దసరాలకో వారు నిర్వహించే సాంస్కృతికోత్సవాలు అంత జనాకర్షణీయంగా వుండేవికావు. పేలవంగానే నడిచేవి. ఇలాటి వాతావరణంలో తెలుగువారికోసం ఫుడ్ కార్పరేషన్ లో, అనే గుర్తు, పనిచేసే తాతా సోమయాజులుగారు, మద్రాస్ టెలిఫోన్స్ లో పనిచేసే గుడిపూడి శ్రీనివాసరావుగార్ల ఆధ్వర్యం లో ఉగాది కల్చరల్ అకాడెమీని ఏర్పాటు చేసి ఉగాది పండగల సమయంలో తెలుగువారి కోసం సాంస్కృతికోత్సవాలు చేయడం మొదలుపెట్టారు. అయితే జనాలను ఆకర్షించాలంటే వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించాలి. ఆ ఉత్సవాలలో వారి కళను ప్రదర్శించేలా సంగీత కచేరీయో, నృత్యమో, నాటకాలో ప్రదర్శించాలి. ఇవన్నీ అంత తేలికగా జరిగేవికావు. స్వలాభాపేక్ష లేకుండా ఇలాటి ప్రజారంజిత కార్యక్రమాలకు అందరూ సానుకూలంగా స్పందించరు. అందరికీ అనువుగా సానుభూతితో స్పందించే వ్యక్తిగా ఘంటసాలవారు పేరుపొందారు. గుడిపూడి శ్రీనివాసరావు గారు ఒకరోజు మాస్టారిని కలసి తమ ఉగాది ఉత్సవాలలో కచేరీ చేయవలసిందిగా కోరారు.  ఘంటసాల మాస్టారు వారి కార్యకలాపాల గురించి తెలుసుకొని నవ్వుతూ ప్రోత్సాహకరంగా మాట్లాడి పంపించేసారు. అయితే అది అంగీకారసూచకమా కాదా అని కార్యకర్తలకు తెలియలేదు. మరల వచ్చారు, అయితే ఈసారి ఘంటసాలవారికి బదులుగా హోమ్ డిపార్ట్మెంట్ హెడ్ నే కలిసి తమ కోరికను వెలిబుచ్చి సహాయం అర్ధించారు. సావిత్రమ్మగారు వారి అభ్యర్థనలను కాదనలేక మాస్టారిని ఒప్పించే భారం తన భుజాన వేసుకున్నారు. ఏదో ఓ ఉగాది పండగ రోజున ఘంటసాలవారి సంగీత కచేరీని ఏర్పాటు చేసారు. మాస్టారు కూడా వాళ్ళకు ఎక్కువ ఆర్థికభారం పెట్టకుండా అతి స్వల్ప వాద్యబృందంతో ఉచితంగా కచేరీ చేసారు. ఘంటసాలవారి కచేరీ అంటే శ్రోతలకు కొదవేముంది. జనాలు బాగానే వచ్చారు. నిర్వాహకుల ఆశయం నెరవేరింది.

అలాగే  దసరా ఉత్సవాల సమయంలో ఒక సాంస్కృతిక సంస్థవారు మా నాన్నగారి సంగీత కచేరీని కోరారు. అందుకు మా నాన్నగారు సమ్మతించారు. తేదీ, సమయం, వేదిక నిర్ణయించబడింది.

పానగల్ పార్క్ కు ఉత్తర దిశలో అంటే ప్రకాశం రోడ్ చివర, గోపతి నారాయణ చెట్టి స్ట్రీట్ మొదట్లో ఎడమవేపు శ్రీ వెంకటేశ్వర కళ్యాణమండపం, దక్షిణాన వుమ్మిడి బంగారు చెట్టి జువెలరీ షాపుకు, కుమరన్ బట్టల కొట్టుకు మధ్యలో సుగుణ్ విహార్ కళ్యాణ మండపం వుండేవి. ఇప్పుడు సుగుణ్ విహార్ అంతా కూడా కుమరన్ సిల్క్స్ గా మారిపోయింది. చిన్న చిన్న సాంస్కృతికోత్సవాలు ఈ రెండు కళ్యాణ మండపాలలో జరిగేవి.  ఈ కళ్యాణమండపాల పరిసరాలన్నీ  పెళ్ళిళ్ళ సీజన్ లో  రంగురంగుల దీప కాంతులతో, నాదస్వర మేళ తాళ మంగళధ్వనులతో, పట్టుచీరల రెపరెపలతో, రకరకాల సెంట్ వాసనల గుబాళింపులతో  కళకళలాడుతూవుండేవి. మిగిలిన రోజుల్లో  ఆ మండపాలు వెలవెలబోతూ కనిపించేవి. అలాటప్పుడు ఏవేవో ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేవారు.

అలాటి శ్రీ వేంకటేశ్వర కళ్యాణమండపంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఒక రోజు ఉదయం పది గంటలకు మా నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావు గారి కచేరీ. పక్క వాద్యాలున్నాయో లేదో గుర్తులేదు. సాధారణంగా దసరాల సమయంలో వానలు పడడం అలవాటు. ఆయన కచేరీ జరిగిన రోజు ఉదయం కూడా ఒక పెద్ద వర్షం పడి వెలసింది.  ఉదయం 9.30 గంటలకే వచ్చి తీసుకువెళతామన్న కార్యనిర్వాహకుల జాడలేదు. మా నాన్నగారే ఒక రిక్షాలో తన హార్మోనియంను పెట్టుకొని పానగల్ పార్క్ దగ్గరున్న కచేరీ వేదిక వద్దకు వెళ్ళిపోయారు. వెనకాలే నేనూ, మరికొంతమందిమి అక్కడికి చేరుకున్నాము.ఆ కళ్యాణ మండపం బయట ఆవరణలో ఒక నల్లబల్లమీద ఒక సుద్దముక్కతో ఆనాటి కార్యక్రమ విశేషాలు వ్రాసిపెట్టారు. అందులో మా నాన్నగారి పేరు వుంది. అప్పటికింకా ఉత్సవనిర్వాహకులు ఎవరూ రాలేదు. సమయం పది గంటలు కాగానే మా నాన్నగారు హార్మోనియం తెరచి  తన సహజధోరణిలో గానం చేయడం మొదలెట్టారు. ఆయన గాత్రం విని సంగీతాభిలాష గల కొంతమంది చుట్టుపక్కల తమిళ శ్రోతలు వచ్చి చేరారు. సుమారు ఒక గంటసేపు పాడి మా నాన్నగారు తమ కచేరీని ముగించి తిరిగి ఇంటికి వెళదామనుకుంటున్న సమయంలో ఆ ఉత్సవ నిర్వాహకులు కొందరు వచ్చి ఆలస్యం జరిగినందుకు విచారం వెలిబుచ్చి కచేరీని ప్రారంభించమని మా నాన్నగారిని కోరారు.  ఆయన ఏమాత్రం అసహనం కనపర్చకుండా తన సంగీత కచేరీ ముగిసిందని చెప్పారు. అది విని ఆ నిర్వాహకులు నిర్ఘాంతపోయారు.  సంగీతసభలో స్వాగతం, పరిచయాలు, ఉపన్యాసాలు, సత్కారాలవంటి తతంగం ఏమీ జరగకుండానే కచేరీ ఎలా జరుగుతుంది.  పైగా వర్షం వలన శ్రోతలు ఎక్కువగా రాలేదని, ఏవేవో కారణాలతో సంజాయిషీలు మొదలెట్టారు. మా నాన్నగారు అతి శాంతంగా కార్యనిర్వాహకులు ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదని, తాను  రోజూ  ఆ సమయంలో ఇంట్లో పాడుకుంటూనే వుంటానని, అలాటిది ఈ రోజు అమ్మవారి సన్నిధిలో పాడానని, శ్రోతలు వున్నారా లేదా అనేది తనకు ముఖ్యం కాదని వినయంగాచెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.

సంగీతరావుగారు సంగీతాన్ని తన ఆత్మానందం కోసం వినియోగించుకున్నారే కానీ పేరు ప్రఖ్యాతులు కోసమో, కచేరీలకోసమో లేక అందువల్ల లభించే ఆదాయం కోసమో కాదు. ఒక అరడజన్ పక్కవాద్యగాళ్ళతో, సంగీతం  తెలియకపోయినా  పక్కనున్న జనాలనాకర్షించడానికి తలలూపుతూ, ఆహా! ఓహో! అనే శ్రోతలకోసం ఆయన ఏనాడు పాడలేదు. పెద్ద పెద్ద సభలలో కచేరీల కోసం వెంపర్లాడలేదు. ఈ విషయంలో ఆయన మార్గం సద్గురు త్యాగబ్రహ్మంగారి మార్గమే.  అందుకే సంగీతరావు గారు మద్రాసు వచ్చాక చేసిన సంగీత కచ్చేరీలు వ్రేళ్ళమీద లెఖ్ఖపెట్టవచ్చును. 

తమ గురుపుత్రులు సంగీతరావు గారి ఈ విలక్షణ వ్యక్తిత్వానికే శ్రీ ఘంటసాలవారు ఆకర్షితులై  అమితమైన గౌరవాన్ని, స్నేహానురాగాలను చివరివరకూ కనపర్చేవారు.

అదీ శ్రీ పట్రాయని సంగీతరావు గారు.

ఒకసారి మద్రాస్ లో ఒక సంగీత కచేరీ జరిగింది. బహుశా టి.నగర్ లోని సుగుణ విహార్ లోనే జరిగిన జ్ఞాపకం. కచేరీ ఘంటసాల మాస్టారిది కాదు వేరెవరో పాడారు. ఆ కచేరీకి మాస్టారితో కూడా నేను వెళ్ళడం జరిగింది. కచేరీ ముగిసిన తర్వాత మాస్టారు కొంచెం సేపు మాట్లాడారు. మాట్లాడవలసిన పరిస్థితిని ఆ కచేరీ నిర్వాహకులు కల్పించారు. నిర్వాహకులు ప్రధాన గాయకుడితోపాటు కచేరీకి సహకరించిన ఇతర వాద్యగాళ్ళను కూడా సభాముఖంగా సముచితంగా పరిచయం చేసి సత్కరించి గౌరవించారు. కానీ ఆ కచేరీలో తంబురా శ్రుతి వేసి సహకరించిన కళాకారుడిని పూర్తిగా విస్మరించారు. ఇది ఘంటసాలవారి  మనసుకు బాధ కలిగించింది. ఆయన వెంటనే స్టేజిమీదకు వెళ్ళి గాయకుడిని అభినందిస్తూ, సంగీతం గురించి రెండు మాటలు చెప్పారు. సంగీతంలో శ్రుతి లయలు రెండూ ప్రధానాంగాలు. శ్రుతి లయలను అనుసరించి పాడగలిగినప్పుడే ఆ గాయకుడి పాట ఆమోదయోగ్యమవుతుంది. గాయకుడిని సదా అంటిపెట్టుకొని వుండేవి శ్రుతి లయలే. అటువంటి శ్రుతి లయలలో శ్రుతిని  నిర్వాహకులు నిర్లక్ష్యం చేసారు. తంబురా శ్రుతి వేసిన కళాకారుడిని పరిచయం చేయడం మరచిపోయారు. వైలిన్, మృదంగం, ఘటం వాద్యాలతో సహకరించిన కళాకారులు కచేరీకి ఎంత ప్రధానామో అలాగే తంబురా శ్రుతి వేసేవారు కూడా కచేరీలకు అంత ప్రధానం.  అలాటివారిని మరవడం భావ్యం కాదని ఘంటసాల మాస్టారు సన్న సన్నగా చీవాట్లు పెట్టి తాను ఆ తంబురా శ్రుతి వేసినవారిని వేదిక మీదకు పిలచి తాను యధారీతిని గౌరవించారు. ఆనాడు ఘంటసాలగారి వంటి మహాగాయకుడి చేత గుర్తింపబడి సత్కారం అందుకున్న ఆ చిరు కళాకారుడి ఆనందం వర్ణనాతీతం. 

అది ఘంటసాలవారి ఔన్నత్యం.

ఇలాటి వైఖరులు గల సాంస్కృతిక సంస్థలు అప్పుడూ వున్నాయి, ఇప్పుడూ వున్నాయి.  సాంస్కృతిక సంస్థలను నెలకొల్పడం కష్టమేమీకాదు. కానీ వాటిని నిర్దిష్టమైన ప్రణాళికలతో, క్రమశిక్షణతో, భక్తిశ్రధ్ధలతో నిర్వహించగలిగినప్పుడే ఆ కళా సంస్థలు  ప్రజల ఆదరాభిమానాలు పొందుతాయి, పదికాలాల పాటు మనుగడ సాగిస్తాయి. అయితే ఏవిధమైన స్వలాభాపేక్ష లేకుండా నిస్స్వార్ధ చింతనతో కళాసేవ చేసే సాంస్కృతిక సంస్థలు దేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.

1970 ల నుండి మద్రాస్ మహా నగరంలో మెల్లమెల్లగా తెలుగు సాంస్కృతిక సంస్థల ఆవిర్భావం మొదలయింది. అలాటివాటిలో ప్రధానమైనవి మూడు. అవి, కళాభారతి, కళావాహిని, కళాసాగర్. కళాభారతి ప్రారంభం ఘంటసాల మాస్టారి చేతులమీదుగానే జరిగిన గుర్తు. కళాసాగర్ సంస్థను నటసామ్రాట్  శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ మూడు సంస్థలు చాలా సంవత్సరాలు మంచి మంచి సాంస్కృతిక కార్యకలాపాలతో తెలుగువారిని అలరించాయి. నగరంలోని తెలుగు ప్రముఖులంతా సమిష్టిగా సమైక్యతా దృక్పధం లేకుండా తలో కుంపటి వెలిగించి 'కళ' తో పోటీలు పడ్డారు.  తమ తెలుగు నైజం నిరూపించుకున్నారు. 

మద్రాస్ లో బెంగాల్ అసోసియేషన్ వుంది. కర్ణాటక అసోసియేషన్ వుంది. మలయాళం అసోషియేషన్ వుంది. అయితే నగరంలో ఏ బెంగాలీ కార్యక్రమాలు జరిగినా, కన్నడ ఉత్సవాలు జరిగినా, లేదా కేరళ పండగలు జరిగినా వాటన్నిటినీ ఆయా భాషలవారంతా కలసి సమిష్టిగా ఐకమత్యభావంతో జరుపుకునేవారు. కాలక్రమేణా ఆయా అసోసియేషన్ లు మద్రాసులో తమకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపును పొందాయి.. కానీ  స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థలలో అలాటి సమిష్టి భావన ఉన్నట్లు తోచదు. 

మద్రాసులోని సాంస్కృతిక వైభవం గురించి మరో అధ్యాయంలో వివరంగా చూద్దాము. 

🌿🌷🌿


1970లో ఘంటసాలవారికి 'పద్మశ్రీ' బిరుదు లభించాక వారు పాడిన పాటలు గల చిత్రాలు విడుదలైనవి 38. ఆ సినీమాలలో వారు మొత్తం   90 పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడారు. వారి స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలు ఐదు - 'మెరుపు వీరుడు', ' ఆలీబాబా 40 దొంగలు', 'విజయం మనదే', 'తల్లిదండ్రులు' 'రెండు కుటుంబాల కథ' చిత్రాలు.

'పద్మశ్రీ' ఘంటసాల అని టైటిల్స్ లో వేసిన సినీమాలు కొన్ని వున్నాయి. 'పద్మశ్రీ' బిరుదును  తమ పేర్లముందు ఉపయోగించరాదనే నియమం ఏదో వుందనుకుంటాను. ఘంటసాలగారు తన లెటర్ హెడ్స్ లో 'పద్మశ్రీ' అని పేరుకు ముందు వేసుకోలేదు. సినీమా టైటిల్స్ లో కూడా వేయాలని ఆశించలేదు. వారిమీది గౌరవంతో నిర్మాతలే కొందరు తమ చిత్రాలలో పద్మశ్రీ ఘంటసాల అని ప్రకటించేవారు. ఇంతకంటే మరెన్నో ఉన్నత పురస్కారాలకు అర్హుడైన ఘంటసాలవారిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉపేక్షించడం చాలా దురదృష్టకరం. 

ఆ సంవత్సరం గాయకుడిగా మంచి పేరును తెచ్చిపెట్టిన  - అక్కాచెల్లెలు, 

చిటా పటా చినుకులతో - అక్కా చెల్లెలు

తల్లా? పెళ్ళామా?, లక్ష్మీ కటాక్షం, జైజవాన్, కధానాయిక మొల్ల, ఆలీబాబా 40 దొంగలు, పెత్తందార్లు, ధర్మదాత, 

జో... లాలీ... ధర్మదాత

విజయం మనదే, తల్లిదండ్రులు, చిట్టిచెల్లెలు, మాయని మమత, 

రానిక నీకోసం - మాయని మమత

మొదలైన సినీమాలలోని పాటలు ఈనాటికీ మనకు వినిపిస్తున్నాయి. 

ఆ పాటల వివరాలేమిటో వచ్చే వారం చూద్దాము.
                ...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, November 7, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై ఆరవ భాగం

07.11.2021 - ఆదివారం భాగం - 56:
అధ్యాయం 2  భాగం 55 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారికి  భారత ప్రభుత్వం ప్రదానం చేసిన 'పద్మశ్రీ' బిరుదు, ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన బ్రహ్మాండమైన సినీజీవిత రజతోత్సవం  అసంఖ్యాకులైన వారి అభిమానులలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. దాని ప్రభావంతో దేశవ్యాప్తంగా ఘంటసాలవారికి సన్మానాలు, సత్కార సభలు,వారి సంగీత కచేరీలు విరివిగా జరిగాయి. అందులో ప్రముఖమైనది కలకత్తా ఆంధ్రా అసోసియేషన్ వారు జరిపిన రజతోత్సవ కార్యక్రమం,తదుపరి ఘంటసాలవారి కచేరీ. ఈ సన్మాన సభకు గౌ. దామోదరం సంజీవయ్యగారు, శ్రీ పర్వతనేని ఉపేంద్రగారు, పలువురు తెలుగు ప్రముఖులు హాజరయి ఘంటసాలవారి గాన ప్రతిభను కొనియాడి ఘనంగా సత్కరించారు. ఆ కచేరీ లో పాడిన కొన్ని పాటలు నేటికీ మన ప్రసార మాధ్యమాలలో ప్రచారంలో ఉన్నాయి.

అదే 1970లో జరిగిన మరో సన్మాన సభ ఘంటసాలవారి కి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ సభ తమ గురుతుల్యులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి స్వస్థలమైన సాలూరు లో జరిగింది. సాలూరు చిన గురువుగారు, శారదా గాన పాఠశాల వ్యవస్థాపకులు అయిన శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారి జయంతి సందర్భంగా వారి శిష్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఘంటసాలవారికి సాలూరులో ఈ సన్మానం ఏర్పాటు చేశారు. 



సాలూరులోని ప్రముఖులు, కళాపిపాసి శ్రీ పాకలపాటి సత్యనారాయణగారు అధ్యక్షుడుగా, డాక్టర్ నవుడూరి శ్రీరామమూర్తిగారు (మక్కువ డాక్టర్ గారు) ఉపాధ్యక్షుడిగా, ప్రముఖ న్యాయవాది శ్రీ అవధానుల సంజీవరావుగారు కార్యదర్శిగా,   చినగురువుగారి శిష్యుడు శ్రీ మానం అప్పారావు,  స్థానిక వాద్య బృంద నిర్వాహకుడు, గాయకుడు శ్రీ కబీర్ షా వంటి ప్రముఖులు కార్యక్రమాల నిర్వాహకులుగా శ్రీ సీతారామ, త్యాగరాజ, నారాయణదాస మహోత్సవ కమిటీని ఏర్పాటు చేసి  ఈ ఉత్సవాలను ఘనంగా వరసగా ఒక వారం రోజులు సాలూరులో ఏర్పాటు చేశారు. గురువుగారి జయంతి సందర్భంగానే వారి శిష్యులైన మధుర గాయకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరావు గారికి సన్మాన సభ ఏర్పాటు చేయడం సాలూరు వంటి అతి చిన్న పట్టణ ప్రజలలో, మా తాతగారి, మా నాన్నగారి అభిమానులలో చాలా ఆసక్తిని, ఆనందాన్ని కలిగించింది. ఈ ఉత్సవంలో పాల్గొనడం తన కర్తవ్యంగా భావించి ఘంటసాలవారు వెంటనే తన ఆమోదాన్ని తెలియజేశారు. మద్రాసు నుండి ఘంటసాల మాస్టారితో పాటు, మా నాన్నగారు పట్రాయని సంగీతరావు గారు, వారి జ్యేష్ట కుమారుడినైన నేను కూడా సాలూరు వెళ్ళాము. అప్పటికి, మా సాలూరు పాఠశాలను నిర్వహిస్తూ వచ్చిన మా రెండో చిన్నాన్నగారు పట్రాయని ప్రభాకరరావుగారు తన కొడుకు వద్ద జెంషడ్పూర్ లో స్థిరపడ్డారు. అక్కడ నుండి ఆయన, మా శర్మబాబు, మక్కువ నుండి మా శ్రేయోభిలాషి, రచయిత,  ఆకుండి నారాయణమూర్తిగారు ఆనాటికి సాలూరు వచ్చారు.

ఘంటసాలవారి సత్కార సభ వైభవంగా జరిగింది. ఆ సభలో మా నాన్నగారు సాలూరు తో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని రసవత్తరంగా వివరించారు. ఘంటసాలవారు గురువుగారి స్వస్థలంలో తాను సన్మానం పొందడం మహాద్భాగ్యమని, విజయనగరంలో గురువుగారి సమక్షంలో తాను పొందిన సంగీత శిక్షణ, అనుభవాలను వర్ణించారు. ఆ తర్వాత వారి సంగీత కచేరీ జరిగింది. మరునాడు మా నాన్నగారి సంగీత కచేరీ కూడా జరిగింది.  ఈ సందర్భంగా శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి జయంత్యుత్సవ ప్రత్యేక సంచికను ఘంటసాలవారి చేతులమీదుగా విడుదల చేయాలని కమిటీవారు సంకల్పించారు. కానీ పుస్తక ప్రచురణలో జరిగిన జాప్యం వలన ఆ పుస్తకావిష్కరణ ఆ రోజు జరగలేదు. తరువాత మరి రెండు సంవత్సరాలకు మరో జయంతి రోజున ఆ ప్రత్యేక సంచికను మరో సందర్భంలో వేరెవరో ఆవిష్కరించారు.  ఈ పుస్తకంలో సర్వశ్రీ - పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు, క్రొవ్విడి రామంగారు, ఘంటసాల వేంకటేశ్వరరావుగారు, పట్రాయని సంగీతరావుగారు, ఇతర ప్రముఖుల వ్యాసాలు, పట్రాయని సీతారామ శాస్త్రిగారి కృతులు కొన్ని చోటుచేసుకున్నాయి.

సాలూరులో జరిగిన ఈ ఉత్సవంతో నాకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆ సన్మాన సభకు హాజరయిన కారణంగా, స్వాగతోపన్యాసకులు  నా పేరును కూడా సభాముఖంగా ప్రకటించడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని, సహజంగాగల సభాపిరికితనం వలన మొహమాటాన్ని కలుగజేసింది. 

సాలూరులో ఘంటసాల మాస్టారికి జరిగిన ఈ సన్మాన సభ కూడా నాకెంతో  అపురూపమైనది, అమూల్యమైనది. మరపురాని సంఘటనలలో ఒకటి.

సాలూరు ఊరంతా నాకు పూర్తిగా పరిచయం లేకపోయినా మా పాఠశాల పరిసర ప్రాంతాలు బాగా తెలుసు. మా ప్రభు చిన్నాన్నగారి కుటుంబం సాలూరు లో ఉన్నంత కాలం గణపతి నవరాత్రులకు ప్రత్యేకించి బొబ్బిలి నుండి వెళుతూండేవాడిని. ఆ విశేషాలన్నీ గతంలో తెలియజేశాను.

ఈ సాలూరు పాఠశాలను గురించి తలచుకున్నప్పుడల్లా కొన్ని చేదు సంఘటనలు కూడా గుర్తుకు వస్తాయి. మన మనుషులనుకునేవారే అసూయతో, స్వార్ధంగా, కుత్సితబుధ్ధితో వ్యవహరించారని తెలిసినప్పుడు ఎంతో బాధ, భయము కలిగింది.

మా ముత్తాతగారు శ్రీ పట్రాయని వెంకట నరసింహ శాస్త్రిగారు,మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు కలసి  శ్రీ శారదా గాన పాటశాలను నెలకొల్పారు.  మా తాతగారు తమ స్వార్జితంతో ఉన్న స్థలానికి మరికొంత స్థలాన్ని కొని  అష్టకష్టాలు పడి ఒక్కొక్క ఇటుకగా చేరుస్తూ పది సంవత్సరాల నాటికి తగుమాత్రపు నిర్మాణం చేసి సంగీతాభిలాషతో తమ వద్దకు వచ్చినవారికి ఉచితంగా సంగీత శిక్షణలు ఇచ్చేవారు.

సాలూరులోని  మా తాతగారి ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక కుటుంబపోషణార్ధం విజయనగరం మహారాజా సంగీతకళాశాలలో గాత్రోపన్యాసకునిగా చేరారు. తాను ఎంతో పవిత్రంగా, ప్రేమతో స్థాపించిన  సంగీత పాఠశాలను  నిర్వహించే భాధ్యతను తన  శిష్యులకు అప్పగించారు. మధ్య మధ్య వచ్చి స్థితిగతులు చూసుకునేవారు. 1957 ఏప్రిల్ లో మా తాతగారు దివంగతులయ్యాక విజయనగరం లో ఉండే ఆస్కారం లేక మా రెండో చిన్నాన్నగారు పట్రాయని ప్రభాకరరావు గారు తన కుటుంబంతో  స్వస్థలమైన సాలూరు చేరవలసిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో ఒక భాగంలో  కుటుంబం తో తను వుంటూ మరొక భాగంలో తానే స్వయంగా సంగీత శిక్షణలు ప్రారంభించాలని సంకల్పించారు. కానీ ఆ వ్యవహారం అంత సులభంగా జరగలేదు. అంతవరకూ ఆ పాఠశాలను చూసుకున్న వ్యక్తి మా చిన్నాన్నగారు ఆ ఇంటిలో ప్రవేశించకుండా అనేక అడ్డంకులు కల్పించారు. అందుకుగాను కొంతమంది రౌడీలను కూడా వినియోగించారట. అయితే సాలూరు చిన గురువుగారన్నా, సంగీతరావుగారన్నా గౌరవాభిమానాలు కల వ్యక్తులు చాలా మంది సాలూరులో ఉన్నారు. వారందరూ వచ్చి పాఠశాలను ఆక్రమించుకున్న వ్యక్తికి తగు హితోపదేశం చేసి, అందుకూ లొంగకపోతే ఏంచేయాలో చేసి చూపిస్తామని హెచ్చరించి చివరకు వారిని అక్కడనుండి బయటకు సాగనంపారు. 

మన సొంత ఆస్తులే అయినా  వాటిని స్వయంగా సక్రమంగా నిర్వహించుకోని పక్షంలో కలిగే అనర్ధాలు అనేక రకంగా వుంటాయి. సమాజంలో ఇంకా మంచి వున్నందునే ఈ నాటికీ సాలూరులో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి సంగీత పాఠశాలగా కొనసాగుతున్నది. 

మద్రాస్ లో నేను పనిచేస్తున్న  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ లయొజన్ ఆఫీస్ లో నా తాత్కాలిక ఉద్యోగం కొనసాగుతూనే వచ్చింది. ఆ ఆఫీసుకు ఉన్నతాధికారిగా IAS క్యాడర్ కు బదులు District Administration Officer హోదాలో వున్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాస్ ఆఫీసుకు నియమించారు. ఆయన పేరు ఎ.ఎస్.శివశాస్త్రి. గుంటూరు అని గుర్తు. మధ్యవయస్కుడు. ఆఫీస్ కు సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకొని కుటుంబం తో ఉండేవారు. చాలా శ్రోత్రీయుడు. చాలా సౌమ్యుడు. నా విషయంలో చాలా అక్కర చూపించేవారు.

ఈ తాత్కాలిక ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగంలో వుంటూ భవిష్యత్ ను వృధా చేసుకోవద్దని, గ్రాడ్యుయేషన్, స్టెనోగ్రఫీ అయినందువలన ఏవైనా సర్వీస్ కమీషన్ పరిక్షలకు కడితే మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని సలహాలు ఇచ్చేవారు. అక్కడ పని చేస్తున్న రోజులలోనే ఒకసారి తీవ్రమైన జాండిస్ వచ్చింది. ఆఫీసుకు వెళ్ళిరావడం కష్టమైపోయింది.  నెలలపాటు శెలవు పెట్టవలసి వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత శివశాస్త్రి గారి సలహా మేరకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చాను. మరల మంచి ఉద్యోగాలకోసం ప్రయత్నం మొదలయింది. 

మా క్రిందింట్లోని కొల్లూరి వెంకటేశ్వరరావు గారు ఏవో సలహాలు సూచనలు ఇచ్చేవారు.  మన కృషి ఎంతవున్నా  సమయం, సందర్భం, అంతకుమించిన అదృష్టం కలసిరావాలి. అంతవరకు కాచుకొని ఉండకతప్పదు. తిరుమల కొండమీది వేంకటేశ్వర స్వామివారిలా మేడమీద ఘంటసాల వేంకటేశ్వరావుగారు; క్రింద తిరుపతిలోని వరదరాజ పెరుమాళ్ లా క్రిందింట్లో కొల్లూరి వెంకటేశ్వరరావు గార్ల కుటుంబ సభ్యులతో నెం. 35,ఉస్మాన్ రోడ్ ఎల్లప్పుడూ  సందడిగా కళకళలాడుతూ వుండేది. పైన సంగీత వాతావరణం, క్రింద పారిశ్రామిక, వ్యాపార వాతావరణం. రెండు చోట్లా వచ్చే పోయే జనాలతో ఇంటి మెయిన్ గేట్ ఎల్లప్పుడూ తెరిచే వుండేది. దానివలన బయటనుండి వచ్చే మేకలు, ఆవులు ఉన్న నాలుగు మొక్కలను తృప్తిమేరకు నమిలి పోతూండేవి. అందుకే ఆ కాంపౌండ్ లో పువ్వుల మొక్కలు ఎక్కువ కనపడేవి కావు.

కొల్లూరి వారింటికి బంధుమిత్రుల రాక అధికమే. శని ఆదివారాలు వస్తే ఇల్లంతా సందడే సందడి. అందరూ గట్టిగా అరుచుకుంటూ, నవ్వుకుంటూ మాట్లాడుకునేవారు. 

అప్పుడప్పుడు రావుగారి కజిన్స్ ఇద్దరు వస్తూండేవారు. ఒకరి పేరు చిన్నా, ఇంజనీర్. ఏదో కంపెనీలో ఎక్సిక్యూటివ్ గా పనిచేసేవారు. రేమండ్/రేబన్ గాగుల్స్ మోడల్ లా వుండేవారు. కనిపించినప్పుడు పలకరింపులు వరకే మా పరిచయం. మరొక కజిన్ పేరు పండు. అసలు పేరు తెలియదు. ఇతను IIT లో చదివేవాడట. నాకు పరిచయంలేదు. అతని ముఖం కూడా గుర్తులేదు. రావుగారింట్లో వాళ్ళు మాటల సందర్భంలో అనుకోగా వినడమే. ఈ ఇద్దరూ సొంత అన్నదమ్ములు కారట. ఈ వివరాలు గత వారాలలో ప్రస్తావించడం జరిగింది.

ఒక రోజు క్రిందింటి వెంకటేశ్వరరావుగారింట్లో అంతా నిశబ్దంగా వుంది. పెద్ద అలికిడి లేదు. కనిపించిన ఒకరిద్దరు కూడా ఏదో డల్ గా కనిపించారు. ఏవో కొత్త ముఖాలు కూడా కనిపించాయి. నాకు మేడమీద మాస్టారింట్లోకి వెళ్ళి మాట్లాడేంత చనువు క్రిందింట్లో వుండేదికాదు. మరీ అవసరమైతే తప్ప.

ఉదయం పదకొండు గంటల తర్వాత బయట ఒకటే కలకలం. క్రిందింట్లోంచి   ఒక ముసలాయన గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చారు. పోర్టికో అరుగుమీదే అని గుర్తు, పూర్తిగా కప్పేసిన ఒక బాడీని తీసుకు వచ్చి దింపారు. ఇంట్లోని వారంతా గొల్లుమంటూ ఆ బాడీ చుట్టూ చేరారు. తర్వాత కొంతసేపటికి తెలిసింది  అంతకుముందు రోజు సాయంత్రం చిన్నాబాబు మహాబలిపురం వెళ్ళి వస్తూ రోడ్ ఆక్సిడెంట్ లో దుర్మరణం చెందారని. ఎవరమూ ఏనాడూ ఊహించని  ఆకస్మిక దుర్ఘటన. అన్నిటికంటే విచారకరమైన విషయమేమంటే  ఆ చిన్నాబాబుకు అప్పటికి కొన్ని మాసాలముందే వివాహమయిందట. పాపం, ఆ అమ్మాయి గతేమిటని మా మూడిళ్ళలోని ఆడవారంతా తలచుకొని విపరీతంగా బాధపడేవారు.

వృధ్ధుడైన అతని తండ్రి  కొడుకు పక్కనే కూలబడి విలపించిన దృశ్యం మాత్రం నన్నిప్పటికీ కలచివేస్తూవుంటుంది.  మరొక విషయం ఏమిటంటే అంతకు ముందు సంవత్సరమే IIT లో చదువుతున్న పండుబాబు కూడా తన స్నేహితులతో సముద్రస్నానానికి వెళ్ళి సముద్రంలో ములిగిపోయి దుర్మరణం చెందాడట. ఏడాది వ్యవధిలో, వృధ్ధిలోకి వచ్చి చేతికి ఆసరాగా వుండవలసిన ఇద్దరు నవ యువకులు  కళ్ళెదటే చనిపోవడం  ఆ ఇంటివారికి ఎంత కష్టం,ఎంతటి దురదృష్టకరం. ఆ కుటుంబంలోనివారు ఎలా తట్టుకోగలుగుతారు.

ఎలాటి దుఃఖాలనైనా, కష్టాలనైనా, అన్నింటినీ కాలమే  దూరం చేసి ఓదార్పును ఇస్తుంది. కానీ అలాటి విషాదకర జ్ఞాపకాలు మనసును కలచివేస్తాయి.

🌿🌷🌿

ఇలాటి సందర్భాలలోనే లౌకిక బంధాలకు అతీతంగా వైరాగ్యంతో తాత్త్విక చింతనలో వుండే సాధువులు, సన్యాసుల జీవితమే ఉన్నతమైనదేమో అని అనిపిస్తుంది. అయితే సర్వసంగపరిత్యాగానికి కావలసిన జ్ఞానము, పరిపక్వత  సంపాదించడం అంత తేలికైన విషయము కాదు. సనాతన భారతీయ సంస్కృతి కి దర్పణం పట్టే సాధు సత్పురుషులంటూ ఒక ప్రక్క గౌరవిస్తూనే మరోప్రక్క సన్యాసులంటే సమాజాభివృధ్ధికి ఏమాత్రం దోహదపడనివారని వాదించేవారున్నారు. ప్రతిఒక్కరు ముక్కు మూసుకొని ధ్యానం పేరిట అడవులకు చేరితే  జీవనవ్యవస్థ ఏమవుతుంది. దేశ పురోభివృద్ధి ఎలా సాగుతుందని ప్రశ్నించేవారూ ఉన్నారు. ఈ వాదనలను సమర్ధించడానికి గాని, ప్రతిఘటించడానికి గాని కావలసినంత పరిజ్ఞానము, విచక్షణాశక్తి నాకు ఏమాత్రము లేవు. 

🌺

ఒకరోజు సినీ/రంగస్థల నటులు శ్రీ కాకరాల మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో  చెప్పారు "స్వామీజీ వచ్చారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు" అని. మా నాన్నగారు ఆయనింటికి వెళ్ళి స్వామీజీని మా ఇంటికి తీసుకువచ్చారు. సచ్చిదానందేంద్రస్వామి మద్రాసులోని మా ఇంటికి రావడం అది రెండవసారి. అంతకు ఒక దశాబ్దం ముందు వచ్చారు. అప్పుడు కూడా శ్రీ కాకరాలగారే వచ్చి చెప్పారు. ఆయన భార్య స్వామీజీ శిష్యురాలు. మా నాన్నగారి మాటల్లో, శ్రీ కాకరాల గారికి ఆధ్యాత్మిక జీవులపట్ల అంత ఆకర్షణ ఉన్నట్లు కనిపించదు. ఇటీవలికాలంలో నేను గ్రహించినది ఆయన శ్రీ రాహుల్ సాంకృత్యాయన్ రచనలకు, సిధ్ధాంతాలకు ప్రభావితుడైన వ్యక్తి. స్వామీజీ మా నాన్నగారిని చూసి "అయితే మీ ఇంటికి బిక్షకు పిలుస్తున్నావా లేకపోతే మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉంచుకుంటానంటావా" అని అడిగారట. దానికి సమాధానంగా మా నాన్నగారు " మా ఇంట్లో కొన్నాళ్ళు మిత్రుడుగా ఆహ్వానిస్తున్నాను" అన్నారట. ఆ విధంగా స్వామీజీ మా ఇంట కొన్నాళ్ళపాటు రెండు సార్లు వచ్చి వున్నారు, తన సన్యాస జీవితానికి అనుగుణంగానే. స్వామీజీ 1970 లలో రెండవసారి మా ఇంటికి వచ్చే సమయానికి మా నాన్నగారి ఆర్ధిక స్థితి అంత ఆశాజనకంగా లేదు. కుటుంబం పెరిగింది. ఆదాయం తగ్గింది. ఉన్న ఎనిమిదిమంది కాకుండా తొమ్మిదవ వ్యక్తిని కూడా భరించాలంటే సగటు గృహస్తుకు సాధ్యమయే పనికాదు. అందులోనూ ఆయన సన్యాసి.ఆయన అలవాట్లు,ఆచారాలు, ఆహార విహారాదులు మామూలువారికంటే భిన్నంగా వుంటాయి. స్వామీజి ఉనికి ఘంటసాలగారి సతీమణి  సావిత్రమ్మగారికి అంతగా రుచించలేదు. సన్యాసులు దేవాలయాలలోనో, మఠాలలోనో ఉండాలిగానీ ఇళ్ళలో వుంటే ఎలా అని మా అమ్మగారితో అనడం జరిగింది. దానితో మా నాన్నగారికి  స్వామీజీ కోసం ప్రత్యమ్నాయ నివాసం ఏర్పాటు చేయక తప్పలేదు. ఆ సందర్భంలో మా నాన్నగారికి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు గుర్తుకు వచ్చారు. బస్సులో పరిచయం, సంగీతం ద్వారానే. ఆయనకు శృంగేరీ,కాంచికామకోటి పీఠాధిపతులతో కొంత సాంగత్యం వుండేదట. ఆయనతో స్వామీజీ చాతుర్మాస్య సమస్యగురించి చెప్పారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి తగిన ఏర్పాటు చేస్తానని చెప్పడమే కాక తమ ఇంటికి బిక్షకు ఆహ్వానించి తీసుకువెళ్ళారు. కానీ, తరువాత వారిద్దరి మధ్య సిధ్ధాంతపరమైన అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. చివరకు స్వామీజీ చాతుర్మాస్య దీక్ష మద్రాసులో జరగలేదు.

ఇక్కడ, సచ్చిదానందేంద్ర స్వాములవారి పూర్వాశ్రమ జీవితం గురించి కొంత చెప్పక తప్పదు. స్వామీజీ పూర్వాశ్రమంలో పంతుల పద్మనాభ స్వామి. మేనమామ గారి సంరక్షణలో మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతూండేవారు. ఆ సమయంలో ఆయనకు సంగీతం నేర్చుకోవాలని కోరిక పుట్టిందట. సంగీతం తప్ప మిగిలిన విద్యలేవీ జీవిత సార్ధకత కలిగించవని భావించి, మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి కీర్తిని విని, నేర్చుకుంటే  ఆయన వద్దే సంగీతం నేర్చుకోవాలని 1935లో సాలూరు వచ్చారట. అప్పటికి ఆయన వయసు ఇరవైలోపు. మా నాన్నగారి కంటే ఐదేళ్ళు పెద్ద.  మా తాతగారి వద్ద సంగీత శిష్యరికం మొదలెట్టారు. పద్మనాభ స్వామి గారికి రవీంద్ర సాహిత్యం అంటే చాలా ఇష్టమట. టాగూర్ కధలన్నీ మాతాతగారికి చదివి వినిపించేవారట. ఆ విధంగా ఆయన మా నాన్నగారికి సన్నిహితుడయ్యారు. ఇతరులనెవ్వరినీ పట్టించుకునేవారు కాదట. కొన్నాళ్లు అయాక ఆయన తల్లిగారి ఆరోగ్యం బాగాలేదనే వార్త వచ్చి సాలూరు వదలిపోయారు. ఆ తర్వాత కాలంలో నరసన్నపేటలో సామవేదుల సీతారామశాస్త్రిగారి వద్ద సంస్కృత భాషాభ్యాసం చేశారట. వేదాంతగ్రంధాలు సంస్కృతంలోనే అధ్యయనం చేయాలని, సన్యాసం స్వీకరించాలని సంకల్పించారట. ఆయన నిర్ణయం బంధువులందరికీ ఆందోళన కలిగించింది. కానీ శాస్త్ర సమ్మతమైనదానిని ఎవరు కాదనగలరు. పంతుల పద్మనాభ స్వామిగారు సన్యాసం స్వీకరించేముందు నైష్టిక బ్రహ్మచర్యం అవలంబించి తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. 

మాతాతగారు తమ నివాసం విజయనగరం మార్చాక  స్వామి మరల మా తాతగారింటికి స్వామీ రామతీర్థలా వచ్చేరట. ఆవిధంగా  మరల ఆయన మాతాతగారికి, మా నాన్నగారికి చాలా సన్నిహితులయ్యారు. మా నాన్నగారు ఏ ఊళ్ళో వున్నా అక్కడకు వెళ్ళి సంగీత,సాహిత్య, వేదాంత చర్చలు జరిపేవారట.
మా తాతగారంటే అమితమైన భక్తి శ్రధ్ధలు కనపర్చేవారట. మా తాతగారు శిష్యులకు బోధించే ఒక  రామనామ సంకీర్తనను తర్వాత ఎప్పుడో ఏభై ఏళ్ళ తర్వాత మా నాన్నగారి దగ్గర పాడి వినిపించారట. 

1947 లో  స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి జరిగిన మొదటి పార్లమెంటరీ ఎలక్షన్స్ లో నెహ్రూకు ఎదురుగా సనాతనిస్ట్ పార్టీ అభ్యర్ధిగా ప్రభుకల్ప బ్రహ్మచారి పోటీచేసారట. ఆ సనాతనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు కరపత్ర స్వామీజీ. ఆయన మా స్వామీజీకి శిష్యుడట. శిష్యుడికోసం  ఆయనకూడా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొని, కలివరంలో  ఉన్న మా నాన్నగారిని చూసేందుకు వచ్చారట. 

శ్రీ సచ్చిదానందేంద్ర స్వామీజీని మా నాన్నగారు చివరిసారిగా 1980 లలో జంషెడ్పూర్ లో కలిసారు. అప్పటికి స్వామీజీలో కొంచెంగా వార్దక్య లక్షణాలు చోటుచేసుకున్నాయి. స్వాముల వారికి జరగవలసిన సకల మర్యాదలు ఆయన పొందారు. స్వామీజీ అనేక వేదాంత గ్రంధాలు వ్రాసారు.

వాటిలో కొన్ని పుస్తకాలను మా నాన్నగారికి బహుకరించారు కూడా. సుమారు ఇరవై సంవత్సరాలక్రితం స్వామీజీ సిధ్ధిపొందారు. అనారోగ్యంతో వున్న ఆయనను ఆయన భక్తులో, శిష్యులో వారి బంధువులకు అప్పజెప్పారట. కానీ, అనారోగ్యంతో వున్నసన్యాస జీవికి  వాళ్ళెలా ఆప్తులవుతారు. ఎవరూ పట్టించుకోలేదు. చివరకు స్వామీజీ అంత్యక్రియలను ప్రేమ సమాజం వాళ్ళు నిర్వర్తించారట. 

స్వామి సచ్చిదానందేంద్ర గురించి మా నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావు గారు తన " చింతాసక్తి" లో ఇలా వ్రాసుకున్నారు. ఆ మాటలను యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాను.

"అతి చిన్నతనంలోనే అన్వేషణలో పడిన అతి మెత్తటి యువకుడు ఆయన.  ఆయన అన్వేషణలో గ్రహించినదేమో, సాధించినదేమో. ఆయన శాస్త్రీయంగా సన్యసించారు. సన్యాసిగా పీఠాధిపత్యం వహించలేదు. తెలుగులో చాలా గ్రంధాలు రాసినా, సన్యాసిగా గొప్ప పేరు సంపాదించలేదు. డబ్బుకి ఇబ్బంది పడలేదు. నిజమే. కాని యితరులు ఆయన్ని డబ్బుకోసం ఆశ్రయించి ఉండవలసినంత ఉందనుకోను.

లోకంలో ఒక కవి, ఒక గాయకుడు, ఒక భౌతిక శాస్త్రవేత్త  ఇలాంటి వాళ్ళ గొప్పతనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చును. ఆధ్యాత్మిక వేత్త అనుభవం ఏమిటో అర్ధం కాదు. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు గ్రహించినదానిని పుస్తకరూపంగా, ఉపన్యాసాల రూపంగా ప్రకటించి గొప్ప పేరు ప్రఖ్యాతులు, ధనమూ కూడా సంపాదిస్తారు. అయితే అదంతా లౌకికమే. మన అనుభూతి కి భిన్నమైనది ఏమి పొందారో తెలియదు. శంకర, రామానుజులు, స్వామి వివేకానందులు, అరవిందులు, రాజా రామమోహన రాయలు, వీళ్ళంతా గొప్పవాళ్ళే. లౌకికంగా వాళ్ళ గొప్పతనం గ్రహించింది లోకం. వాళ్ళ వ్యక్తిత్వానికి, ప్రచారానికి లోనయింది. చాలామంది కళాకారుల ప్రభావంలాగే. వాళ్ళంతా మనుషులుగానే బతికారు. మానుష స్పృహలోనే జీవించేరు. అవాజ్ఞ్మానసము, అఖండమూ, సచ్చిదానందమూ ఇవన్నీ మాటలే కదా. మనుష్యులలో రూపంలోనూ, గుణంలోనూ, తెలివితేటలలోనూ అంతరం ఉంది. వాళ్ళ అనుభవంలో నాజూకుతనం, మోటతనం, రసికత్వం, ఆటవికత ఇలాటి అంతరవులు ఉన్నాయి. ఇవి తెలుస్తాయి కూడా. బ్రహ్మజ్ఞానిగా భావించినవాని అపరోక్షానుభూతికి, మామూలు మనిషి అనుభవానికి గల వ్యత్యాసం ఏమిటి - అర్ధం చేసుకోవాలి. మనంతట మనమే చెప్పగలిగేది కాదు కదా. 

స్వామీజీ వంటి మహనీయులు, మహానుభావులు ఎందరో ఈ భువిని ప్రభావితం చేసారు. వారందరికీ వందనములు. 

🙏🙏💐💐🙏🙏


నెం.35,ఉస్మాన్ రోడ్ లోని మరెన్నో అనుభవాలతో,
జ్ఞాపకాలతో మళ్ళీ వచ్చే వారం...
          .    ...సశేషం