visitors

Sunday, October 31, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై ఐదవ భాగం

31.10.2021 - ఆదివారం భాగం - 55*:
అధ్యాయం 2 భాగం 54 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

'పద్మశ్రీ' బిరుదాంకితులు, సాటిలేని మేటి మధురగాయకులు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారి సినీజీవిత రజతోత్సవం దక్షిణభారత చిత్రరంగాన ఉన్న ప్రముఖులందరిలో నూతనోత్సాహన్ని నెలకొల్పింది. 

హైదరాబాద్ లాల్ బహదూర్  స్టేడియంలో 1970 ఫిబ్రవరి 1వ తేదిన జరగబోయే బ్రహ్మాండమైన సన్మాన, సంగీతోత్సవంలో సినీరంగానికి, రాజకీయరంగానికి చెందిన అతిరథ మహారథులంతా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి.

ఘంటసాలవారి సినీజీవిత రజతోత్సవాన్ని అంతకుముందు కని, విని, ఎరుగని రీతిలో జరపడానికి రజతోత్సవ కార్యనిర్వాహకులు సంసిధ్ధులయ్యారు.

అందులో భాగంగా  ఆనాటి ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకులతో, సినీప్రముఖులతో   రజతోత్సవ కమిటీ ఏర్పాటు చేసిన విషయమూ గత వారాలలో చెప్పడం జరిగింది. దానికి తోడు తెలుగు చలనచిత్రసీమ దిగ్దంతలనదగ్గ  సర్వశ్రీ - చిత్తూర్ వి.నాగయ్య, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కె.జగ్గయ్య, టి.ఎల్.కాంతారావు, ఎస్.వి.రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, రేలంగి వెంకట్రామయ్య, భానుమతి, సావిత్రి, అంజలీదేవి, జయలలిత, విజయనిర్మల, సంధ్య మొదలగువారు ఘంటసాలవారి రజతోత్సవ వేడుకలలో పాల్గొనడానికి సుముఖత చూపించారు.

ఇంతమంది ప్రముఖులతో నిండిన వేదికమీద అందుకు దీటుగా భారీగా సంగీతకార్యక్రమం నిర్వహించడానికి ఒక వైవిధ్యభరితమైన అంతకుముందెన్నడు జరగని రీతిలో సంగీతాభిమానులను అలరించడానికి రూపకల్పన జరిగింది.

ఘంటసాలవారు తన 25 సంవత్సరాల సినీజీవినయానంలో ఎంతోమంది సంగీత దర్శకులతో, గాయనీగాయకులతో కలసి పనిచేశారు. పరస్పర స్నేహ సౌభాతృత్వాలతో ఒక వసుధైక కుటుంబకంగా మెలిగారు. అలాటి పలువురు ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీగాయకులను కూడా తనతో పాటే సముచితంగా గౌరవించబడాలని, వారందరి సమ్మేళనంతో ఒక సంగీత విభావరి జరగాలని ఘంటసాల మాస్టారు ఆశించారు. చిత్రసీమలోని ప్రముఖ సంగీత దర్శకులను, గాయనీగాయకులను తనతో పాటు వేదికనలంకరించి తలా ఒకటి రెండు పాటలను ఆలపించవలసిందిగా కోరారు. మాస్టారు కోరడమే తడవుగా దక్షిణాది సినీమా సంగీత కుటుంబం తమ పరిపూర్ణ సహాయ సహకారాలందించడానికి ముందుకు వచ్చారు. ఆనాటి సంగీతోత్సవంలో ఒక్కొక్క సంగీత దర్శకుడు తమ సంగీత దర్శకత్వంలో తమకు నచ్చిన రెండు పాటలను, మాస్టారి సోలో ఒకటి, డ్యూయెట్ ఒకటి పాడించడానికి నిర్ణయించారు. ఘంటసాలవారు, ఇతర గాయకులు వేదికమీద పాడుతున్నప్పుడు ఆ పాటలను స్వరపర్చిన సంగీత దర్శకులే వేదికమీదకు వచ్చి ఆర్కెస్ట్రా బృందాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విధంగా చేయడంవలన అంతకుముందు తెరవెనుకే వుండి సామాన్య ప్రేక్షకులకు కనపడని తమ అభిమాన సంగీత దర్శకులను, గాయనీగాయకులను, అతిపెద్ద ఆర్కెస్ట్రా బృందాన్ని, తమ అభిమాన నటీనటులను ఒకేసారి చూసి ఆనందించే అవకాశం కలుగుతుంది. ఘంటసాల సినీ సంగీత రజతోత్సవ సంగీత విభావరిలో పాల్గొనడానికి అడిగిందే తడవుగా  అంగీకరించి తమ మాస్టారిపట్లగల  గౌరవాభిమానాలను చాటుకున్న ప్రముఖ సంగీత దర్శకులు/ గాయనీ గాయకులు : సర్వశ్రీ - ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఎమ్.ఎస్.విశ్వనాధన్, కె.వి.మహాదేవన్, పి.ఆదినారాయణ రావు, టి.వి.రాజు, మాస్టర్ వేణు, ఎస్.పి.కోదండపాణి, టి.చలపతిరావు, సుసర్ల దక్షిణామూర్తి, జి.అశ్వథ్థామ, విజయా కృష్ణమూర్తి, బి.శంకర్, సాలూరి హనుమంతరావు, పి.సుశీల, పి.లీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, జమునారాణి, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.

ఘంటసాల సినీ సంగీత రజతోత్సవ సంగీతకార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపు 40 మంది సభ్యులు గల వాద్యబృందాన్ని ప్రత్యేకంగా మద్రాస్ నుండే తీసుకువెళ్ళడానికి నిశ్చయించారు.

ఘంటసాల, కె.వి.మహాదేవన్, ఎస్.రాజేశ్వరరావు, ఎమ్.ఎస్.విశ్వనాధన్, పెండ్యాల, టి.వి.రాజు, మొదలగు సంగీత దర్శకుల వద్ద పనిచేసే వాద్యకళాకారులు, ఆంగ్లో ఇండియన్ వైలినిస్ట్ లు, గిటార్, మేండలిన్, సాక్స్, ట్రంపెట్, డ్రమ్స్ ప్లేయర్స్ ఈ సంగీతోత్సవానికి అదనపు ఆకర్షణ.

ఈ సంగీతోత్సవంలో ఆనాటికి బహుళ ప్రచారంలో వున్న పాటలనే సంగీత దర్శకులు తమ పాటలుగా ఎంపికచేసి ఇచ్చారు. దాదాపు 40-50  బహుళ జనాదరణపొందిన సోలోలు, డ్యూయెట్లు లెక్కకు తేలాయి. ఆ పాటలన్నిటినీ గ్రామఫోనులో వింటూ మా నాన్నగారు శ్రీ సంగీతరావుగారు నొటేషన్స్ తయారు చేశారు. ఆ పాటలన్నిటిని అందుబాటులో వున్న గాయనీ గాయకులతో ఆర్కెస్ట్రావారితో  పలుసార్లు మాస్టారింట్లోనే రిహార్సల్స్ చేసారు. 

వేదికలమీద జరిగే లలిత సంగీత కచేరీలలో  తరచూ రిథిమ్స్ సెక్షన్ వాళ్ళ శ్రుతులు చేసుకునేందుకు తీసుకునే సమయంతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. పది పాటలు పాడవలసిన చోట ఆరేడు పాటలతోనే సరిపెట్టేస్తారు. ఇలాటి అవకతవకలు స్టేజిమీద శ్రుతులు చూసుకోవడం వంటి పరిస్థితి రాకుండా ఒకే శ్రుతిలో వుండే పాటలన్ని ఒకేసారి పాడేలా, అందుకు సిధ్ధంగా తబలాలు, డోలక్ లు ఏర్పాటుచేసుకోవలసిన ఆవశ్యకత గురించి రిహార్సల్స్ లో   ఆర్కెస్ట్రాకు మాస్టార్ తగు హెచ్చరికలు చేశారు. అలాగే పాటలోని బిజిఎమ్స్ మాత్రమే వాయించేదెవరు, గాయకులతో కలసి పూర్తి పాటను ఫాలో అయే వాద్యకళాకారులు ఎవరు అనే అంశాలను ముందుగానే మాస్టారు అందరికీ తగు సూచనలు ఇచ్చారు. ఘంటసాలవారి కచేరీలలో పాల్గొనే ఆర్కెస్ట్రా అంతా పాటను పూర్తిగా ఫాలో చేయాలని నిర్ణయించారు.  ఆ క్రమంలో  కచేరీలోని అన్ని పాటలకు హార్మోనియం (మా నాన్నగారు), వయొలిన్స్ (Y.N.శర్మగారు, అచ్యుతశాస్త్రిగారు, చిత్తూరు సుబ్రహ్మణ్యంగారు), ఫాలోయింగ్  తప్పనిసరైంది. వెస్టర్న్ స్టైల్ వైలినిస్ట్ లు, మేండలిన్, గిటార్స్,  ట్రంపెట్స్, సాక్సోఫోన్, డ్రమ్స్, మొదలైనవారంతా ఒక్క బ్యాక్ గ్రౌండ్స్ మాత్రమే వాయిస్తారు.  సినీమాలలోని ఆర్కెస్ట్రా ప్లేయర్స్ అంతా తమ తమ వాద్యాలలో అత్యంత నైపుణ్యం కలిగివుంటారు. వాళ్ళకుండే బిజీ షెడ్యూల్స్ లో ఎవరూ ఎక్కువగా రిహార్సల్స్ చేయడానికి, చేయించడానికి ఇష్టపడరు. ఒకసారి పాట నొటేషన్ వారి చేతికి వెళితే ఎవరి బిట్స్ వాళ్ళు మహా పెర్ఫెక్ట్ గా వాయించేస్తారు. అలాటి perfectionistలకే సినీమా రంగంలో మనుగడ. సంగీతశాస్త్రం తెలియడంతో పాటు on the spot దానిని ఖచ్చితంగా ప్రదర్శించగల వాద్యకళాకారులనే సంగీత దర్శకులు తమ రికార్డింగ్ లకు పిలుస్తారు. 

అందుచేతనే హైదరాబాద్ కు తెలుగు పరిశ్రమ తరలివెళ్ళిన చాలా సంవత్సరాలవరకూ సినీమా పాటల రికార్డింగ్ లు మాత్రం మద్రాసు సినీమా స్టూడియోల లోనే జరిగేవి.  ఆనాటికి హైదరాబాద్ స్టూడియోలలో రికార్డింగ్ సౌకర్యాలుకానీ,  సినీమా టెక్నిక్ తెలిసిన వాద్య నిపుణులు గానీ అంత ఎక్కువ సంఖ్యలో ఉండేవారు కారు. లబ్దప్రతిష్టులైన  సినీసంగీత వాద్యకళాకారులనే ఘంటసాల సినీ రజతోత్సవ సంగీత కార్యక్రమానికి ఎన్నుకున్నారు. చిత్తూర్ సుబ్రమణ్యం, వై.ఎన్.శర్మ, ప్రసాదరావు,  అచ్యుతరామశాస్త్రి, ఆర్.వి.భద్రం, జోసెఫ్, కృష్ణ‌, డేనియల్ , టోనీ డకోస్టా (డ్రమ్స్), సుబ్బారావు (ఎలక్ట్రిక్ గిటార్), ప్రసాద్, జడ్సన్, (తబలా), సుబ్బారావు (డోలక్) వంటి ప్రముఖ వాద్యకళాకారులు పాల్గొన్నారు.  

ఈ బృహత్ సంగీతోత్సవంలో గాయనీగాయకులు పాడే పాటలను నీటుగా అక్షరదోషాలు లేకుండా వ్రాసే భాధ్యతను ఘంటసాల మాస్టారు  నాకు అప్పజెప్పారు. ప్రతీ గాయకుడికి, గాయనికి విడివిడిగా ఆ పాటలను గ్రామఫోనులో వింటూ శ్రధ్ధాభక్తులతో రాసి ముగించాను. ఘంటసాల మాస్టారికి ప్రత్యేకంగా ఒక నలభై పేజీల నోట్ బుక్ లో ఆయన పాడవలసిన పాటలన్నీ వ్రాసాను.

ఆ కచేరీలో పాడిన లేదా నేను వ్రాసిన పాటలన్నీ ఈనాడు గుర్తులేవు. కొన్ని మాత్రం గుర్తుండిపోయాయి. అవి - సర్వశ్రీ అశ్వథ్థామ గారి 'సుధవోల్ సుహాసిని', వేణుగారి 'ప్రియతమా రాధికా', బి.శంకర్ గారి 'మనిషైతే మనసుంటే' - అమాయకుడు విశ్వనాధన్ గారి 'జగమే మాయ', కె.వి.మహాదేవన్ గారి 'ముద్దబంతి పూవులో', మంచిమనసులు లోని 'మామ మామా', ఎస్.పి.కోదండపాణి గారి 'ఆలయాన వెలసిన', చలపతిరావుగారి 'ఎవరివో నీవెవరివో', ఘంటసాలవారి సంగీతంలో 'దినకరా శుభకరా', 'అందమె ఆనందం', మాధవపెద్దిగారి 'వివాహభోజనం' 'అందమే ఆనందం' ఆదినారాయణ రావుగారి 'హాయి హాయిగా'. ఇలాటి హాయినిగొలిపే  సుశ్రావ్యమైన పాటలు ఎన్నింటినో ఎంపికచేశారు. ఈ రజతోత్సవ కచేరీ పాటల వ్రాతలు, రిహార్సల్స్
తో  పొద్దే తెలిసేది కాదు. హేమాహేమీలవంటి సంగీత దర్శకుల సమక్షంలో  సుప్రసిధ్ధులైన గాయనీగాయకులందరితో, తాను సినీమాలలో పాటలనే తిరిగి ఈ బహిరంగ భారీ వేదిక మీద ఆలపించడానికి ఘంటసాలవారు మరింత శ్రధ్ధాసక్తులు  చూపించారు.

ఈ ఉత్సవంలో పాల్గొనడానికి  హైదరాబాద్ కు ఫ్లైట్స్ లో వెళ్ళేవారికి,  రైల్లో వెళ్ళేవారికి ముందుగానే టిక్కెట్లు బుక్ చేయడం జరిగింది.

1970 జనవరి 31 వ తేదీన ఆర్కెస్ట్రావారందరితో కలసి మాస్టారింట్లోని నరసింగ, నేను కూడా హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో బయల్దేరాము.   రెండు సెకెండ్ క్లాస్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లలో మా ఆర్కెష్ట్రావారికి బెర్తులు కేటాయించబడ్డాయి. 

ఆనాడు తమిళనాడు లో టోటల్ ప్రొహిబిషన్ వుండేది. మందు ప్రియులంతా సమయం దొరికితే పక్కనున్న  పాండిచ్చేరికి (యూనియన్ టెరిటరీ. అక్కడ అంతా ఫ్రీ గా లభించేది) గాని, లేదా తమిళనాడు - ఆంధ్రా బోర్డర్ లు దాటి గూడూరు, నెల్లూరు లు గానీ పరుగులు తీసేవారు.

మన సమాజంలోని అన్ని రంగాలలో వ్యసనపరులున్నా, మందుకు, మగువకు, చీట్లాటకు బానిసలైపోయినవారు సినీమారంగంలో  ఎక్కువనే చెప్పాలి. ఆ రకమైన వాళ్ళంతా ఒక చోట చేరి ఈ హైదరాబాద్ ట్రిప్ ను తమకు అనువుగా మార్చుకొని బ్రహ్మానందాన్ని అనుభవించారు. 

ఫిబ్రవరి 1, 1970 ఉదయానికి అందరం హైదరాబాద్ చేరుకున్నాము. అందరికీ హోటల్స్ లో రూమ్స్ ఏర్పాటు చేశారు. మాస్టారింటి నుండి ఆయనతోపాటు సావిత్రమ్మగారు, పెద్దబాబు మాత్రం ఫ్లైట్ లో వచ్చారు. 

నేనూ, నరసింగ ముందుగానే లాల్ బహదూర్ స్టేడియంకు చేరుకున్నాము. స్టేడియం అంతా ఈ భారీ రజతోత్సవ సభకు బాగా ముస్తాబయింది. వేదికనలంకరించే పెద్దలందరినీ పుష్పమాలలతో గౌరవించడానికి కావలసిన గులాబీ మాలలన్నీ ప్రత్యేకంగా మద్రాసు నుండే తెప్పించడం జరిగింది. వాటన్నిటినీ వేదిక పక్కనే అందుబాటులో వుంచే ఏర్పాట్లలో నేను, నరసింగ నిమగ్నులయ్యాము. ఆ పూల మాలలన్నీ వాడిపోకుండా మధ్యమధ్యలో నీళ్ళు జల్లుతూ చాలా జాగ్రత్త తీసుకున్నాం.

సాయంత్రం ఐదు దాటిందగ్గరనుండి ఒక్కొకరుగా స్టేడియంకు రావడం మొదలు పెట్టారు. సాయంత్రం ఆరయేసరికి లాల్ బహదూర్ స్టేడియం జనసముద్రమయింది. ముఫైవేలమంది ప్రేక్షకులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిథులతో, రాజకీయనాయకులతో, దక్షిణ భారత చలన చిత్ర ప్రముఖులతో  లాల్ బహదూర్ స్టేడియం అంతా ఉత్సవ వాతావరణం నెలకొన్నది. బొంబాయి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత-దర్శకుడైన దేవానంద్, ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ప్రత్యేకంగా విశిష్ట అతిథులుగా ఈ ఉత్సవంలో పాల్గొనడంతో ప్రేక్షకుల ఆనందం రెట్టింపు అయింది.

నిర్ణీత సమయానికి ప్రార్థనా గీతంతో సభ ప్రారంభయింది.

శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంగీత మహోత్సవ సభ అధ్యక్షులు గా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ. శ్రీ కాసు బ్రహ్మనందరెడ్డి తమ సతీమణి శ్రీమతి రాఘవమ్మ గారితో విచ్చేశారు.

 ఈ రజతోత్సవ కమిటీ అధ్యక్షుని హోదాలో ఆనాటి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ రెవెన్యూ శాఖామాత్యులు పి.తిమ్మారెడ్డిగారు ఆహుతులకు స్వాగతం పలికారు. "మన అభిమాన గాయకుడు, సంగీత దర్శకుడు అయిన ఘంటసాల వేంకటేశ్వరరావుగారిని సత్కరించదలచడం ఒక అపూర్వ సన్నివేశం. గానసరస్వతికే ఇది అమోఘమైన ఆనందోత్సవం" అంటూ తమ స్వాగతోపన్యాసాన్ని కొనసాగించారు.

ప్రముఖ హిందీ నటుడు దేవానంద్ ఘంటసాల సినీ జీవిత రజతోత్సవాన్ని ప్రారంభిస్తూ ఘంటసాల లక్షలాది ప్రేక్షకుల హృదయాలలో తన అపూర్వగానంతో ఆనందాన్ని వెల్లివిరియజేసారని, అటువంటి సంగీత కళానిధిని సన్మానించడమంటే సినీకళాకారులందరినీ సన్మానించడమేనని కొనియాడారు. తరువాత, ప్రముఖ హిందీ నటి వహీదా రెహ్మాన్ రజతోత్సవ కమిటీ తరఫున ఒక సుందరమైన వీణను బహుకరించారు. (తర్వాతి కాలంలో ఘంటసాల మాస్టారి పిల్లలు మా నాన్నగారి దగ్గర సంగీత సాధనకు ఆ వీణ పూర్తిగా ఉపయోగపడింది).

రజతోత్సవ కమిటీ కార్యదర్శి ఆర్.వి.రమణమూర్తి ఘంటసాల వారి సన్మానపత్రం చదివి వినిపించారు. సుప్రసిధ్ధ చిత్రనిర్మాత, పంపిణీదారు అయిన శ్రీ సుందర్లాల్ నహతా 'ఘంటసాల రజతోత్సవ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఈ ప్రత్యేక సంచికలో  తెలుగుసినీమా రంగానికి చెందిన గీత రచయితలు, సర్వశ్రీ శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరధి, సి.నారాయణరెడ్డి, సముద్రాల (జూ.) కొసరాజు, కరుణశ్రీ  వంటి ప్రముఖులు ఘంటసాలగాన ప్రతిభను తమ కవితలు ద్వారా కొనియాడారు. మరెందరో ప్రముఖులు వ్యాసాలు వెలువరించారు.

చలన చిత్రసీమకు చెందిన  ఎన్.టి.రామారావు, ఎ.నాగేశ్వరరావు, జగ్గయ్య, కాంతారావు, గుమ్మడి, రేలంగి, సావిత్రి, అంజలీదేవి, తదితర నటీనటులు, చిత్రనిర్మాతలు, దర్శకులు, చలనచిత్ర డిస్ట్రిబ్యూటర్ లు ఘంటసాలవారిని పూలమాలలతో ముంచెత్తి తమ ప్రేమాభిమానాలను చాటారు. ఎన్.టి.రామారావు మాట్లాడుతూ ఘంటసాల చాలా కష్టపడి వృధ్ధిలోకి వచ్చారని, సర్వకాల సర్వావస్థలలోనూ బాధితుల పట్ల కరుణపూరితంగా వ్యవహరించే మాస్టారంటే తనకెంతో గౌరవమని అన్నారు. అక్కినేని తన ఉపన్యాసంలో  తామిద్దరూ ఒకే చోటనుండి వచ్చి అనేక కష్టనష్టాలను తట్టుకొని నిలబడినవారమని, ఘంటసాలను సన్మానించడం అంటే సినీమా ప్రపంచం, ప్రేక్షకలోకం తమను తాము సన్మానించుకోవడమే అవుతుందని అన్నారు. దేశ విదేశాలలో కూడా ఘంటసాల పర్యటించి మన తెలుగుదనాన్ని, తెలుగు సంగీత ప్రాభవాన్ని చాటిస్తారనే దృఢ నమ్మకం తనకు వున్నదని అన్నారు. 

సుప్రసిధ్ధ దర్శకుడు బి.ఎన్.రెడ్డిగారు  ఘంటసాలవారి గాన ప్రతిభ గురించి మాట్లాడుతూ  గాయకుడిగా ఘంటసాలచేత విఘ్నేశ్వరపూజ చేయించిన ఘనత తనకే దక్కిందని చెప్పారు.

నటుడు జగ్గయ్య తన ఉపన్యాసంలో 'గానానికి మారుపేరు ఘంటసాల' అని ఆయన గళం  ఆంధ్రదేశంలో ప్రతీ ఇంటా మార్మోగుతూనే వుంటుందని కొనియాడారు.

సభకు అధ్యక్షత వహించిన గౌరవ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారు మాట్లాడుతూ అందరికీ సంగీతం రాకపోయినా విని ఆనందించడానికి తగిన అభిరుచి, సంస్కృతి అవసరమని, వాటిని పెంపొందించడానికి ఘంటసాలే సర్వసమర్ధుడని అభిప్రాయపడ్డారు. 

ముఖ్యఅతిథుల ఉపన్యాసాలనంతరం తనకు జరిగిన  ఘన సన్మానోత్సవానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఘంటసాల ప్రసంగించారు. ముందుగా తన సినీజీవిత రజతోత్సవ సభకు విచ్చేసి దిగ్విజయంగా జరిపించిన సర్వశ్రీ  గౌరవ ముఖ్యమంత్రి,  తిమ్మారెడ్డిగారు, ఎ.వాసుదేవరావు, తదితర మంత్రివర్యులు, ముఖ్య, విశిష్ట అతిథులుగా హాజరయిన దేవానంద్, వహీదా రెహ్మాన్ చలన చిత్ర ప్రముఖులు, తోటి సంగీత కళాకారులందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు. 

ఆదిలో తనను చిత్రసీమకు పరిచయం చేసిన శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారికి, నిర్మాత  ఘంటసాల బలరామయ్యగారికి, పాటలు పాడించిన  ఆకాశవాణికి, మొదటి గ్రామఫోన్ పాట పాడించిన శ్రీ పేకేటి శివరాం గారికి, ఐరవై ఐదు సంవత్సరాల పాటు తనను అభిమానించి ప్రోత్సహిస్తున్న ఆశేష ఆంధ్ర ప్రజానికానికి తాను సర్వదా ఋణపడి వున్నానని ఘంటసాల చెప్పారు. తనకు 'పద్మశ్రీ' బిరుదునిచ్చి గౌరవించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

చివరగా, ఆంద్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి అక్కిరాజు వాసుదేవరావుగారు ఘంటసాల గాన ప్రతిభను కొనియాడుతూ  వందన సమర్పణ చేశారు.

సభా కార్యక్రమం ముగిసిన తరువాత ఘంటసాల సంగీతోత్సవం అత్యంత జనరంజకంగా సాగింది. ఘంటసాలవారు గంటల తరబడి నిలబడి పాడిన కచేరీ ఇదొక్కటే. ఆయనెప్పుడూ తన వాద్యబృందంతో సహా  కూర్చోనే కచేరీలు చేసేవారు. ఈ అద్భుత సంగీత విభావరికి ప్రముఖ సినీ గీత రచయిత డా. సి.నారాయణరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఉత్సవానికి విశిష్టత తెచ్చారు. 'నభూతో నభవిష్యతి' అనే రీతిలో  జరిగిన ఘంటసాల రజతోత్సవ సంగీతోత్సవంలో పాల్గొన్న  సంగీతదర్శకులకు, గాయనీ గాయకులకు ప్రముఖ నటీమణులు సావిత్రి, అంజలిదేవి మెమెంటోలను బహుకరించారు.

ఈ  సభ ఆద్యంతమూ నేను వేదికపైనే వుండి చూసే అదృష్టం నాకు కలిగింది. నా జీవితంలో నేను మొదటిసారిగా పాల్గొన్న అత్యంత భారీ సాంస్కృతికోత్సవం  ఘంటసాల సినీ రజతోత్సవ సభ. 

ఘంటసాల సినీజీవిత రజతోత్సవం

ఆ తరువాత కాలంలో నేను మరెన్నో ప్రతిష్టాత్మక జాతీయ సంగీతోత్సవాలలో కార్యకర్తగా పాల్గొనే మహద్భాగ్యం కలిగినా ఈ మొదటి ఉత్సవ అనుభవాన్ని మాత్రం నేనెన్నటికీ మరువలేను. ఈ తరహాలో ఏ కళాకారుడికి ఇంత ఘనమైన సత్కారం ఏనాడు జరగలేదు. ఇకపై జరగదు. ఘంటసాలవారిని గాన గంధర్వులన్నా, అమరగాయకులన్నా, శతాబ్ది గాయకులన్నా అది వారికి మాత్రమే చెల్లు.

అటువంటి మహోన్నత సంగీతజ్ఞుడు, సినీ గాయకుడు, సినీ సంగీత దర్శకుడు, సమాజసేవా తత్పరుడు, దేశభక్తుడు అయిన ఘంటసాలకు మరెన్నో ఉన్నత పురస్కారాలు లభించాలి. అందుకు రానున్న ఘంటసాల శతజయంతి ఉత్సవాలు మరింత దోహదం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని నా ఆకాంక్ష.

ఘంటసాలవారి 'నెం. 35, ఉస్మాన్ రోడ్' లో మరిన్ని జ్ఞాపకాలతో... వచ్చేవారం...
       .             ... సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, October 24, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై నాలుగవ భాగం

24.10.2021 - ఆదివారం భాగం - 54*:
అధ్యాయం 2  భాగం 53 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1967 లో 'నిర్దోషి' సినీమాను విడుదల చేసిన నర్రా రామబ్రహ్మంగారు తన రెండవ చిత్రంగా తన గౌతమీ పిక్చర్స్ బ్యానర్ మీద ఒక జానపద సినీమాను తీయడానికి సంసిధ్ధులయ్యారు. బి.విఠలాచార్య దర్శకుడు. ఎన్.టి.రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, రావికొండలరావు మొదలగువారు ప్రధాన తారాగణంగా వుంటారని అనుకున్నారు. తన మొదటి చిత్రం 'నిర్దోషి' కి సంగీతం నిర్వహించిన ఘంటసాలవారినే తన రెండవ చిత్రానికి కూడా సంగీతం చేయమని నిర్మాత రామబ్రహ్మం కోరారు. ఘంటసాలవారంటే మంచి గౌరవం, స్నేహంగల వ్యక్తి రామబ్రహ్మం గారు. వారిద్దరి మధ్య ఒక సదవగాహన వుండేది.

ఒక శుభ ముహుర్తం చూసి గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ లో కంపోజింగ్ మొదలెట్టారు ఘంటసాల. బందిపోటు సినీమా తర్వాత ఘంటసాల, బి.విఠలాచార్య కలసి పనిచేస్తున్న రెండవ సినీమా. వీఠలాచార్యగారి ఆలోచనా సరళికి, ఘంటసాలవారి ఆలోచనా సరళికి అంతరాలున్నా వాటన్నింటిని పక్కనబెట్టి సమన్వయంతో కలసి పనిచేసి చిత్ర విజయానికి కృషిచేశారు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో మరో జానపదం కూడా వచ్చింది. ఆ విషయం తర్వాత. 

గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ మా 35, ఉస్మాన్ రోడ్ కు దగ్గరే. పానగల్ పార్క్ కు తూర్పునున్న రామకృష్ణ మిషన్ మెయిన్ హైస్కూలు పక్కనే నటుడు ముదిగొండ లింగమూర్తిగారు వుండే నానారావు నాయుడు స్ట్రీట్. దానిని ఆనుకొని వెంకట నారాయణ చెట్టి రోడ్ మీదకే ఉన్న మొదటి భవనం. ఆ భవనంలోనే రామబ్రహ్మం గారు ఒంటరిగా ఉండేవారు. సంసారం ఏదీ ఇక్కడ ఉండేదికాదు. బ్రహ్మాచారి అని విన్నాను. వివరాలు తెలియవు. ఆ ఇంటికి రెండు మూడు ఇళ్ళ తర్వాత ఎస్.వరలక్ష్మిగారి ఇల్లు, ఆ తర్వాత వచ్చే రాజా స్ట్రీట్ లో  ఎడమవేపు మొదటిదో, రెండవదో నటి సంధ్యగారి ఇల్లు. ఆమె కుమార్తే జయలలిత. నటిగా, తర్వాత ఎమ్జీయార్ పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా తమిళనాట తన ప్రభావాన్ని, ప్రాభవాన్ని చాటి చెప్పారు. ఆ జయలలితే రామబ్రహ్మంగారి 'ఆలీబాబా 40 దొంగలు' సినిమాకు కధానాయిక. 

ఆ రోజుల్లో సినిమా పాటల కంపోజింగ్ మొదలుపెట్టేముందు ఆ చిత్రం యొక్క కథను సంగ్రహంగా సంగీత దర్శకుడికి, ఆనాటి పాట వ్రాయడానికి వచ్చే రచయిత కు వివరిస్తారు. సాధారణంగా ఆ భాధ్యత ను రచయిత, అసిస్టెంట్ డైరక్టర్ తీసుకుంటారు. చిత్రనిర్మాత కూడా పక్కనే వుంటారు. 

ఆ విధంగా వారు కథను చెప్పిన తర్వాత ఏఏ సన్నివేశాలలో పాటలు అవసరమనిపిస్తాయో వాటి వివరాలు ఆయా పాటల కంపోజింగ్ సమయంలో చెపుతారు. వారు చెప్పినదానిని మనసులో పెట్టుకొని గీత రచయిత, సంగీతదర్శకుడు తమ కార్యక్రమానికి ఉపక్రమిస్తారు.  వెళ్ళిన ప్రతీసారి, వీటన్నిటికీ ముందు ఒక ముఖ్యమైన కార్యక్రమం వుంటుంది, అదే ఫలహారాలు, కాఫీ, తాంబూలం, సిగరెట్ల సేవనం. సాధారణంగా ఈ పాటల కంపోజింగ్ లు ఉదయం తొమ్మిదికి, సాయంత్రం నాలుగు తర్వాత ఏర్పాటు చేసేవారు. ఆ సమయానికి అనుగుణమైన ఫలహారాలనే ,పాపం , నిర్మాతలు తమ సొంత ఖర్చుమీద, ఒక మంచి పెద్ద హోటల్ నుండి తెప్పించి ఆ రోజు అక్కడున్నవారందరికీ తెప్పించేవారు. షూటింగ్/రికార్డింగ్/రీరికార్డింగ్ లు జరిగేప్పుడు ఆయా  సమయాలను బట్టి కాఫీ, టిఫెన్లు, భోజనాలు ఏర్పాటు చేసేవారు. షూటింగ్ లు, రీరికార్డింగ్ లు నిర్విరామంగా, ఏ అడ్డంకులు లేకుండా సాగాలంటే ఈ రకమైన సాదరు ఖర్చులు తప్పవు.
 
ఆ రోజుల్లో స్టూడియోలకు వెళ్ళి రావడానికి వాహనాలను కూడా నిర్మాతలే ఏర్పాటు చేసేవారు. అందుకు సినీమా నిర్మాణంలో వున్నన్ని రోజులు కొన్ని కార్లను, వ్యాన్లను అద్దెకు తీసుకునేవారు.

మరీ నాస్తికుడైన నిర్మాత అయితే తప్ప,   తమ సినిమాను ఒక శుభముహుర్తాన పురోహితుల సమక్షంలో వినాయకుడు, లక్ష్మీ, సరస్వతి మొదలైన దేవతాపటాలను పూలమాలలతో అలంకరించి పూజతో ప్రారంభిస్తారు. సాధారణంగా ఈ పూజా కార్యక్రమానికి  నిర్మాత దర్శకుడు, హీరో హీరోయిన్ లు, సంగీత దర్శకుడు, కెమెరామెన్, డిస్ట్రిబ్యూటర్ లను కూడా ఆహ్వానిస్తారు. ఆ పూజకు హాజరైనవారంతా తలా ఒక కొబ్బరికాయ (నిర్మాత డబ్బులే)  కొట్టి భగవంతుడి ఆశీస్సులు పొందుతారు. ఈ పూజా కార్యక్రమాలు కొన్నిసార్లు మొదటి రోజు షూటింగ్ సందర్భంగా చేస్తారు, లేదా పాటల కంపోజింగ్ తో ఆఫీసులో జరుపుతారు. వారి అనుకూలాన్నిబట్టి జరుగుతాయి. నిర్మాత యొక్క ఆర్ధికస్తోమత,  మెయిన్ ఆర్టిస్ట్ లు ఇచ్చే  వరస డేట్ల మీద సినిమా ఎంతకాలంలో ముగుస్తుందనేది తెలిసిపోతుంది.

మరి, ఈ ఆలీబాబా 40 దొంగల సినిమా ఏవిధంగా ప్రారంభయిందో నాకు తెలియదు. నేను 'వినాయకచవితి', 'మాయనిమమత' సినిమా ప్రారంభోత్సవాలకు తప్ప మిగిలిన ఏ సినీమా ఉత్సవాలకు వెళ్ళలేదు. ఈ సినిమా సమయంలో నేను కొంచెం ఖాళీగానే ఉండేవాడిని. శని ఆదివారాలు శెలవు, ప్రతీ పండగకు ఏదో రకమైన శెలవుల వలన, మా నాన్నగారికి ఇష్టంలేకపోయినా, ఘంటసాల మాస్టారి వెనకాల వెళ్ళేవాడిని. షూటింగ్ ల పట్ల, స్టార్స్ పట్ల నాకు ఏనాడు ఆసక్తివుండేదికాదు. ఆంధ్రానుండి మద్రాస్ వచ్చే బంధుమిత్రుల కోసం కొన్ని షూటింగ్ లకు వెళ్ళడం జరిగింది. పాటల రచన విధానం మీద, స్వర రచనల మీద వుండే ఆసక్తివలన కంపోజింగ్ లకు, రికార్డింగ్/రీరికార్డింగ్ లకు వెళ్ళేవాడిని. అది కూడా ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలకు మాత్రమే వెళుతూ,  ఎక్కడా నా వల్ల ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడిని. పాటల కంపోజింగ్ సమయంలో పాటల లోని పదాలు,  వరసల విషయంలో రచయిత, సంగీత దర్శకుల మధ్య జరిగే చర్చలు, సంభాషణలు వినడంలో ఒక ఆనందం వుండేది.
 
కొసరాజుగారు, సి.నారాయణరెడ్డి గారి వంటి రచయితలు వారే ఏవో ట్యూన్స్ లాటివి కట్టి పాడి వినిపిస్తూండేవారు. పాటల కంపోజింగ్ మామూలు వాళ్ళకు ఒక విసుగుపుట్టించేపని. ఘంటసాలవారి కంపోజింగ్ అంటే సంగీతంబాబు (హార్మోనియం), రాఘవులు (చేసిన ట్యూన్ కు సరైన మాటలు దొరికేవరకు అలా  పదే పదే పాడి వినిపించడం ఆనాటి రివాజు). లయ కోసం ఒక తబలా తప్పనిసరి. మొదటి రోజుల్లో పామర్తిగారు కంపోజింగ్ లలో తబలా వాయించేవారు. తర్వాత పెద్ద ప్రసాద్, జడ్సన్, ఆయన తమ్ముడు చిన్నప్రసాద్, సుబ్బారావు, ఇలా చాలామంది మారారు.

గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ ఇంటి క్రింది భాగంలో వుండడం మా నాన్నగారిలాటి వాళ్ళకు ఒక సౌకర్యంగా వుండేది. కొన్ని ఫిల్మ్ కంపెనీలు మేడమీద వుండి తన హార్మోనియంను ప్రతీసారీ మేడమీదకు ఎక్కించడం, దింపడం మహాయాతనగా వుండేది. కొన్నిసార్లు ఆఫీసు బాయ్స్ అందుబాటులో వుండేవారు కాదు. అలాటి కొన్ని సమయాలలో నేనే ఆయనకు సాయంపట్టేవాడిని. తర్వాత కాలంలో వీణ వాయించేప్పుడు అదే సమస్య. రెండు చాలా బరువైన వాద్యాలే. హార్మోనియం, వీణ, డ్రమ్స్ వంటి హెవీ ఇన్స్ట్రమెంట్స్ ను స్టూడియోలకు మోసుకెళ్ళడమూ శ్రమతోకూడిన పనే. ఈ వాద్యలతో పోలిస్తే ఫ్లూట్, వైలిన్ వాయించేవాళ్ళకు మహా హాయి. చాలా తేలికగా బస్సుల్లో ప్రయాణం చేసి స్టూడియోలకు వచ్చేవారు. అందుకే మొదటి రోజుల్లో సినీమా కంపెనీవాళ్ళే ఆర్కెస్ట్రావారిని తమ కార్లలో తీసుకువెళ్ళి, మళ్ళీ ఇళ్ళవద్ద దింపేవారు. మొదటినుండి మా నాన్నగారిది బరువైన జీవితమే.

ఆలీబాబా 40 దొంగలు కథ అరేబియన్ నైట్స్ కథలలోనిది. ఈ  కథ సినీమాగా అనేక విదేశీ భాషల్లో, స్వదేశీ భాషలలో నిర్మించారు. 1955లో ఆలీబాబా 40 దొంగలు సినీమాను మోడర్న్ థియేటర్స్ వారు తమిళంలో ఎమ్.జి.రామచంద్రన్, భానుమతి, వీరప్ప, తంగవేలు మొదలైనవారితో తీసారు. తమిళంలో మొట్టమొదటి గేవాకలర్ సినీమా. బ్రహ్మాండమైన విజయం పొందింది. హీరో పాడే ఒకే డ్యూయెట్ భానుమతితో   ఎ.ఎమ్.రాజా పాడగా, కమేడియన్ తంగవేలు తెర మీద పాడిన 'ఉల్లాస ఉలగమ్ ఉనకే సొందం... సెయడ సెయడ సెయడ... ని జల్సా సెయడ సెయడ సెయడ..." పాటను ఘంటసాలగారు పాడారు. సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతంలో వచ్చిన ఆ సినీమా పాటలన్నీ చాలా జనాదరణ పొందాయి. సినిమాలో భానుమతిగారి పాటలే ఎక్కువ. ఆ సినీమాను తెలుగులో కూడా డబ్ చేసారు. ఆ సినీమాను ఒక పధ్నాలుగేళ్ళ తర్వాత తెలుగులో తీయ సంకల్పించారు రామబ్రహ్మంగారు. విఠలాచార్యగారు, మాటల రచయిత డి.వి.నరసరాజుగారు కలసి తెలుగు సినిమా ట్రీట్మెంట్ ను కొంత మార్చారు. ఒరిజినల్ కథలో ఆలీబాబాకు, ఆ నలభై దొంగలకు ఏ సంబంధము లేదు. కాని తెలుగులో మాత్రం ఆ బందిపోటు దొంగల గుంపు వల్లే ఆలీబాబా తండ్రి చనిపోవడం లాటి ఫ్లాష్ బ్యాక్ ను సృష్టించారు. కామెడీ ట్రాక్ మార్చారు. 1969 సినీమా నాటికి దొంగల చేతికి తుపాకులు వచ్చాయి. అవి పాత సినిమా లో కనపడవు. ఆలీబాబా 40 దొంగలు లో వినోదానికి కొదవలేదు. అందువల్ల పాటలకు కొదవలేదు. సోలోలు, డ్యూయెట్లు, డాన్స్ పాటలు చాలానే వుంటాయని అనుకోవడం జరిగింది. సంగీతపరంగా మంచి స్కోప్ వున్న సినీమా. పాటల ట్యూన్స్ విషయంలో ఏ విధమైన జోక్యం లేకుండా స్వేఛ్ఛగా పనిచేసుకునే వాతావరణాన్ని ఘంటసాలవారికి రామబ్రహ్మంగారు కల్పించడంతో ఘంటసాలగారు మనసుపెట్టి ఈ సినీమాకు పనిచేశారు. 

అప్పుడే వర్ధమాన గాయకుడిగా అందరి దృష్టిలో పడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనే నూతన గాయకుడిచేత ఘంటసాలవారు తనసంగీత దర్శకత్వంలోని ఈ సినీమాలో  రెండు పాటలు పాడే అవకాశం కల్పించారు. 

ఈ సినీమాలో హీరోయిన్ కు ఒక రొమాంటిక్ సోలో. ఎవరిచేత పాడించాలనే విషయం చర్చకు వచ్చింది. సాధారణంగా జయలలిత పాటలకు  సుశీలగారినే ఎన్నుకుంటారు. కానీ ఈ పాటను ఆ సినిమా హీరోయిన్ జయలలిత చేతే పాడించాలని నిర్ణయించారు. జయలలిత  గాయని కాదు.  నటి, నర్తకి మాత్రమే. కానీ సంగీతం మీద ఆసక్తి, పాడాలనే ఉత్సాహం గల నటి. శ్రావ్యమైన కంఠం. అది చూసి ఎమ్.జి.ఆర్ ముందుగా తన సొంత చిత్రం ' అడిమై పెణ్' లో జయలలిత చేత ఒక సోలో కె.వి.మహాదేవన్ సంగీతంలో పాడించారు. ఆ పాట ('అమ్మా ఎన్డ్రాల్ అన్బు)  అందరికీ నచ్ఛింది. అలాగే, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  తమిళంలో పాడగా రిలీజైన మొదటి సినీమా కూడా ఈ అడిమై పెణ్ సినీమానే. ఇందులో  హీరో ఎమ్.జి.ఆర్ కు పాడే అవకాశం రావడం అతనికి దక్కిన గొప్ప అదృష్టం.

గాయని కాని గాయని చేత పాడించాలంటే సంగీతదర్శకుడు కొంత కసరత్ చేయాలి. పాత గాయనీమణుల శక్తి సామర్ధ్యాలు అందరికీ తెలిసినవే కావడం వలన పాట ఎలా కంపోజ్ చేసినా ఇబ్బందిలేదు. కావలసిన ఎఫెక్ట్ రాబట్టుకోవచ్చును. అదే నూతన గాయకులైతే వారు ఏ శ్రుతులలో పాడగలరు, ఎంత స్థాయి వరకు గొంతు పెగులుతుంది, గమకాలు ఎంతవరకు పాడగలరు, భాష ఉచ్చారణ, భావ ప్రకటన  వంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని  వారి స్థాయికి తగ్గ రీతిలో పాటకు వరస కూర్చవలసి వస్తుంది. అక్కడ సంగీత దర్శకుడు తన సంగీత ప్రతిభను చాటకూడదు. విజ్ఞతను చూపించాలి. లేకపోతే పాట అభాసుపాలు అవుతుంది.

ఏ సన్నివేశానికి ఏ రకమైన రాగాలు అనువుగా వుంటాయి, పాటలో ఎన్ని చరణాలుండాలి, పాటను బట్టి ఎలాటి బిజిఎమ్స్ వేయాలి, పాటకు ఎంత ఆర్కెస్ట్రాను పెట్టాలి అనే విషయాలన్నిటిమీద సంగీత దర్శకుడిగా ఘంటసాలవారికి నిర్దిష్టమైన అభిప్రాయాలే వుండేవి. అవసరమున్నా లేకపోయినా హెవీ ఆర్కెస్ట్రాను ఉపయోగించడానికి సుతారము ఘంటసాలగారు ఇష్టపడేవారు కాదు. పాట అందరు పాడుకోవడానికి వీలుగా పదాలు సులభంగా అర్ధం అయేలా, క్యాచీగా వుండాలి. అందుకే తన పాటలలో పల్లవి తర్వాత వచ్చే చరణాలు రెండైనా, మూడైనా ఒకే వరసలోనే చేసేవారు. చరణం చరణానికి ట్యూన్ మార్చుకుంటూ పోతే ఆ పాట  శ్రోతల హృదయాలలో నిలవదనేది వారి అభిప్రాయం. రాగమాలిక పాటలు వేరు. అదే నృత్యప్రధాన గీతమైతే డాన్స్ డైరెక్టర్ ను కూడా పక్కన పెట్టుకొని వారి సూచనలు తీసుకొని గతులను, జతులను సమకూర్చేవారు. 

జయలలితకు తెలుగులో ఇదే మొదటిపాట. హీరో హీరోయిన్ లను మంచి చేసుకుంటే (ఇచ్చే భారీ పారితోషికాలు ఎలాగూ తప్పవు) తమ సినిమా షూటింగ్ లు ఏ ఆటంకాలు లేకుండా అనుకున్న ప్రకారం ముగిసిపోతాయని నిర్మాతల అల్ప ఆశ. అందుకోసం వాళ్ళలో వుండే అదనపు అర్హతలు కనిపెట్టి బయటపెట్టడానికి తాపత్రయపడుతూ వుంటారు. స్టార్ ఇమేజ్ గలవాళ్ళు ఏం చేసినా అదో గొప్ప చరిత్ర అని భావించే వీరాభిమానులున్నంత వరకూ ఎవరేంజేసినా చెల్లుతుంది.

జయలలిత విషయంలో అలాటి అపప్రధ రాకుండా వుండేలా ఘంటసాల మాస్టారు ఆలీబాబా 40 దొంగలు సినీమా లో ఒక పాటను స్వరపర్చారు. ఆ పాటను  సరళమైన చిన్న చిన్న మాటలతో దాశరధి వ్రాసారు. మాస్టారు కూడా గాయని ఎక్కువ కష్టపడకుండా వుండేలా సున్నితంగా, శ్రావ్యంగా బృందావన సారంగ స్వరాలను ఉపయోగించి ఈ పాటను స్వరపర్చారు. ఘంటసాల మాస్టారు చేసినపాట నిర్మాత, దర్శకుడు అందరికీ నచ్చింది. ఇప్పుడా పాట రికార్డింగ్ చేయడానికి ముందు హీరోయిన్ జయలలితకు నేర్పాలి. ఆ తర్వాతే రికార్డింగ్. నిర్మాత హీరోయిన్ ను సంప్రదించి పాట రిహార్సల్స్ చేయడానికి  ఓ రెండు రోజుల పాటు సమయం సంపాయించారు. ఉదయం ఆరు నుండి ఏడు గంటలవరకు రిహార్సల్స్. ఆ తరువాత ఆవిడ మేకప్ చేసుకొని తొమ్మిదికల్లా షూటింగ్ స్పాట్ లో వుండాలి. రాత్రి తొమ్మిది దాటాకే ఇంటికి రావడం. అప్పుడు అసలు కుదరదు. జయలలిత ఇంట్లోనే రిహార్సల్స్. ఘంటసాల మాస్టారే ఆవిడ ఇంటికి వెళ్ళి పాట నేర్పాలి. ఆ విషయంలో మాస్టారికేమీ పట్టింపులేదు. తాను చేసిన పాట బాగా రావాలి, అంతే. ఆవిడ నివాసం గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ కు దగ్గరలోనే రాజా స్ట్రీట్ లో. అనుకున్నట్లుగానే ఒక రోజు ఉదయం ఆరింటికల్లా మాస్టారు, మా నాన్నగారు (సంగీతరావుగారు) హార్మోనియంతో, జడ్సన్ తబలాతో, వారితో పాటు నేను కూడా జయలలిత ఇంటికి చేరుకున్నాము. ఎవరో మమ్మల్ని చూసి లోపల హాల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. ఇల్లంతా నిర్మానుష్యంగా, నిశబ్దంగా వుంది. కొంతసేపటికి సంధ్యగారు వచ్చి మాస్టారిని పలకరించి అమ్ము (జయలలిత  ముద్దు పేరు) ఇప్పుడే వచ్చేస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఓ పది నిముషాల తర్వాత మెల్లగా సుకుమారంగా మేడ మెట్లు దిగి జయలలిత మేమున్న చోటికి వచ్చి అందరికి ఓ నమస్కారం అందజేసింది. కొన్ని మామూలు మాటలు అయ్యాక మాస్టారు, వాద్యబృందం సహకారంతో ఆవిడకు 'చల్ల చల్లనీ వెన్నెలాయే, మల్లెపూల పానుపాయే' పాటను  ఓ రెండుసార్లు పాడి వినిపించారు. జయలలిత మంచి జ్ఞానస్తురాలే. ఎక్కువ సమయం తీసుకోకుండానే పాటను నేర్చుకుంది. తానూ పాడి వినిపించింది. సన్నటి శ్రావ్యమైన గాత్రం. అవేళకు రిహార్సల్స్ ముగిసాయి. ఆ మర్నాడు కూడా మరోసారి రిహార్సల్స్ చూస్తే రికార్డింగ్ పెట్టుకోవచ్చని చెప్పిందావిడ. ఆ మర్నాడు ఉదయం జరిగిన రిహార్సల్స్ కు నేను వెళ్ళలేదు. తర్వాత ఒక రోజు విజయాగార్డెన్స్ థియేటర్ లో 2 to 9 కాల్షీట్ లో రికార్డింగ్ ఫిక్స్ చేసారు. ఈ పాటకు వైలిన్స్, గిటార్, మేండలిన్, పియోనో, ప్లూట్, క్లారినెట్, డబుల్ బేస్, తబలా, డోలక్, రెండు హార్మోనియంలు (రెండో హార్మోనియం హుసేన్ రెడ్డిగారు) ఇతర రిథిమ్స్ మొత్తం అంతా ఒక పదిహేను మంది ఆర్కెస్ట్రాను ఉపయోగించిన గుర్తు.   హీరోయిన్ జయలలిత పాడుతున్న పాట అనగానే ఈ పాట రికార్డింగ్ కు ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, డాన్స్ డైరక్టర్, అసిస్టెంట్లుతో పాటు నాలాటివారు కూడా చాలా మందే హాజరయ్యారు. ఆర్కెస్ట్రాతో ఓ రెండు మానిటర్లు చూసాక సింగర్ వాయిస్ తో ఒక రిహార్సల్ చూశారు. ఘంటసాలమాస్టారు సౌండ్ ఇంజనీర్ స్వామినాథన్ పక్కనే కూర్చోని జయలలితకు, ఆర్కెస్ట్రావారికి తగిన సూచనలిచ్చాక ఫైనల్ టేక్ కు అంతా రెడీ అయ్యారు. అప్పుడు జయలలిత తన రూమ్ లోనుండి ఘంటసాల మాస్టారు వున్న రూముకు వచ్చి మొదటిసారిగా తెలుగులో మీ డైరక్షన్ లో పాడుతున్నాను. బాగా పాడాలని ఆశీర్వదించండి అని  వంగి ఘంటసాల మాస్టారి కాళ్ళకు నమస్కారం చేసింది.  అందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. అది ఒక ఉత్తమ కళాకారుడి సంస్కారం. వినయ విధేయతలు. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ పెద్దలను గౌరవించడమనే సంస్కారం అందరిలో అలవడాలి. ఆ తరువాత ఓ రెండు మూడు టేకులలో పాట OK చేసారు.  జయలలిత ఆలీబాబా 40 దొంగలు సినీమా కోసం పాడిన తొలి తెలుగు గీతం రికార్డింగ్  తృప్తికరంగా ముగిసింది. 


చల్లచల్లనీ వెన్నెలాయే

 🌿💐🌿


1969 లో తిరుమల-తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడిగా ఘంటసాలవారిని కరుణించిన వేంకటేశ్వరస్వామి 1970లో మరోసారి మరోలా ఆశీర్వదించాడు. 

తన సంగీతం ద్వారా 25 సంవత్సరాల పాటు చలనచిత్రసీమకు, సమాజానికి, దేశానికి ఇతోధికంగా చేసిన సేవలకు గుర్తింపుగా భారతప్రభుత్వం ఘంటసాల వారికి ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' బిరుదును ఇచ్చి గౌరవించింది. 1970 ప్రారంభంలో ఢిల్లీలో ఆనాటి రాష్ట్రపతి గౌరవనీయులు వి.వి.గిరిగారి చేతులమీదుగా ఘంటసాలవారు  'పద్మశ్రీ' అవార్డు ను అందుకున్నారు.
 
పద్మ అవార్డ్ ను పొందిన తొలి తెలుగు సినీమా గాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది తెలుగు సంగీతాభిమానుల ప్రశంసలను, ఆశీస్సులను, ప్రేమాభిమానాలను తన సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ వచ్చిన శుభతరుణంలో ఘంటసాల రజతోత్సవ నిర్వహణా కార్యకర్తలలో మరింత నూతనోత్సాహం పుంజుకుంది.

ఆ రజతోత్సవ విశేషాలన్నీ వచ్చేవారం...
                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, October 17, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై మూడవ భాగం

17.10.2021 -  ఆదివారం భాగం - 53*:
అధ్యాయం 2 భాగం 52 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, వ్యక్తులతో పరిచయాలు, తిరిగే పరిసరాలు యాదృఛ్ఛికంగా జరిగేవే అయినా వాటితో అనుబంధం, మమకారం మనలను అంటిపెట్టుకునే వుంటాయి.

మేము నెం.35, ఉస్మాన్ రోడ్ లో 28 సంవత్సరాలున్నాము. అలాగే ఆ ఇల్లు వదలిపెట్టి కూడా 38 సంవత్సరాలయింది. ఆ ఇల్లు మన్నందర్నీ వదిలి 20 ఏళ్ళైంది. అయినా, ఆ యింటితో, ఉస్మాన్ రోడ్ తో, టి.నగర్ ప్రాంతంతో వున్న అనుబంధం, మమకారం నన్ను అంటిపెట్టుకునేవున్నాయి. ఆనాటి జ్ఞాపకాలు సదా మదిలో మెదులుతూనే వుంటాయి. 

అలాగే  మా లయొజన్ ఆఫీస్ ఉన్న అడయార్ ప్రాంతం. మైలాపూర్ నుండి ఆఫీస్ షిప్ట్ చేసేనాటికి ఆ ప్రాంతం ఎక్కడ వుందో,ఎలా వుంటుందో నాకు తెలియదు. టి.నగర్ నుండి  47, 47A బస్ లలో వెళ్ళడం మొదలు పెట్టినా సరిగ్గా మా ఆఫీస్ వీధికి దగ్గరలో వున్న స్టాపింగ్ లో దిగడం గాంధీనగర్ ఫోర్త్ క్రాస్ స్ట్రీట్ లో వుండే ఆఫీస్ కు వెళ్ళడం మళ్ళా మెయిన్ రోడ్ కు వచ్చి బస్ ఎక్కి పానగల్ పార్క్ దగ్గర దిగడం, ఇదే దినచర్యగా వుండేది. అడయార్ లోని మిగిలిన ప్రాంతాలగురించి ఏ అవగాహన వుండేదికాదు. కానీ, ఎప్పుడైతే మా లయొజన్ ఆఫీసర్ వసంతకుమార్ బావా గారు నన్ను తానుండే ఇంటికి ఆఫీస్ పనిమీద రమ్మనడం మొదలెట్టారో అప్పటినుండి అడయార్ ప్రాంతం గురించి తెలియడం ప్రారంభించింది. అప్పట్లో ఆయన ఉండే ఫ్లాట్స్  లోనే  ఇప్పుడు అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ  'మలర్' హాస్పిటల్ వుంది. ఆ ప్రాంతంలోనే శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి ఆలయం వుంది. స్వామివారు శయనభంగిమలో చాలా పెద్ద విగ్రహం. అప్పటికి ఆ ఆలయం కట్టి ఆరేడు సంవత్సరాలు మాత్రమే. త్రివేండ్రమ్ ఆలయంలోని మూలవిరాట్ లానే వుంటుంది. ఆ ఆలయనిర్మాణానికి స్థలాన్ని దానం చేసింది కూడా త్రివాన్కూర్  ఆఖరి మహారాజే. ఎప్పుడైతే బస్ లో  మానేసి సైకిల్ మీద వెళ్ళడం ప్రారంభించానో అప్పుడే అడయార్ ఎంత పెద్ద ప్రాంతమో తెలియడం ఆరంభమయింది. 1970ల నాటికి నేను ఆ ఆఫీస్ వదిలేశాను.  కానీ  ఓ దశాబ్దంన్నర తర్వాత మళ్ళీ అదే గాంధీనగర్ కు మా టివికె శాస్త్రిగారితో వెళ్ళవలసి వచ్చేది.  ఆదినుండి మా సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే శ్రీమతి జయలక్ష్మి తన తల్లిదండ్రులతో అదే గాంధీనగర్ లో మా ఆఫీస్ వుండిన వీధిలోనే వుండేది. 

ఇప్పటికీ ఆ అడయార్ తో నా అనుబంధం ముగియలేదు. ఇప్పుడు మేముంటున్న OMR (IT Express way) కు కూడా అడయార్ మీదుగానే రావాలి. ఏ పెద్ద షాపింగ్ చేయాలన్నా అడయార్ గాంధీనగర్ మెయిన్ రోడ్ కు వెడుతూనేవుంటాము.
అలా అడయార్ కూడా మా జీవితంలో ఒక భాగమైపోయింది.

అసలు ముఖ్యమైన విషయం ఒకటి ఇక్కడ చెప్పవలసివుంది. 

నేను ఈ అడయార్ ఆఫీస్ కు రావడానికి ఓ రెండేళ్ళముందే మా నాన్నగారి తో కలసి ఒకసారి ఈ అడయార్ గాంధీనగర్ కు వచ్చాను. అప్పుడు అడయార్ ప్రాంతం చాలా ప్రశాంతంగా  వుండేది. ఇప్పుడు వున్నంత జనసమర్దత కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఫ్లై ఓవర్స్ కానీ ఏవీ లేవు. రోడ్లకు రెండుప్రక్కలా పెద్ద పెద్ద చెట్లతో  చాలా చల్లగా వుండేది. పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాగా వుండేది. అప్పట్లో శ్రీ వి.జి.కె.చారి (వింజమూరి గోపాలకృష్ణమాచారి)గారు ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు శ్రీ వింజమూరి వరదరాజయ్యంగార్ గారి సోదరుడి కుమారుడు,  అడయార్ గాంధీనగర్ లో  వుండేవారు. వరదరాజయ్యంగార్ గారి కుమార్తె మా పెద్దచెల్లెలు డాక్టర్ కె.వి.రమణమ్మకి కాలేజీలో ఒక సంవత్సరం సీనియర్. వి.జి.కె.చారిగారు వృత్తిరీత్యా ఛార్టర్డ్ ఎక్కౌంటెన్సీ కన్సల్టెంట్. మా నాన్నగారికి అంతవరకూ లేదు కానీ ఆ  ఒక్క ఏడాది మాత్రం  ఆదాయం పన్ను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ లెక్కల వ్యవహారాలు సరిచూడడానికి మా నాన్నగారు చారీగారి వద్దకు వచ్చారు. ఆయన తెలుగువారే. వృత్తిరీత్యా ఆడిటర్  అయినా ప్రవృత్తి భక్తిగీత రచనలు. సంగీతం పట్ల మంచి ఆసక్తి వుండేది. 


వి.జి.కె. చారిగారు


వింజమూరి వరదరాజ అయ్యంగార్ గారు

ఆయన మా నాన్నగారి ఆదాయ వ్యయాలు సరిచూసి చివరకు ఒక నూరు రూపాయలు టాక్స్ కట్టాలని తేల్చి 'are you happy?' అని నన్ను అడిగారు. ఈ సందర్భంగా నేను మాత్రం ఆయన వద్దకు రెండుసార్లు వెళ్ళాను. ఈ వ్యవహారం చూసేందుకు మా నాన్నగారు ఆయనకు ఫిజు ఎంత ఇచ్చారో తెలియదు. ఇవన్నీ మా నాన్నగారున్న స్థితిలో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందమయింది.
 
ఈ టాక్స్ ల వ్యవహారం అయిన తర్వాతే అని గుర్తు వి.జి.కె.చారిగారు వ్రాసిన రెండు పాటలను శ్రీ ఘంటసాలవారు ప్రైవేట్ రికార్డ్ లుగా పాడారు. అవే తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి మీద పాడిన 'శేషాద్రి శిఖరాన', 'తిరువెంకటాధిశ జగదీశా' పాటలు. 





ఈ రెండు పాటలు బహుళ జనాదరణ పొందాయి. ఈ పాటలు ఈనాటికీ తిరుమల శిఖరాలలో నిత్యమూ ప్రతిధ్వనిస్తూ యాత్రికులలో భక్తిభావాన్ని పెంపొందిస్తూనేవున్నాయి.

🌿🌺🌿


ఒకరోజు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారు నన్ను వారింటికి రమ్మని కబురుచేశారు. అప్పటికి USEFI  అమెరికన్ కాన్స్యులేట్ కి వెళ్ళడం వల్లనో లేక డి.ఎన్ రావుగారు USEFI వదలి ఇండో-కెనెడియన్ ఫౌండేషన్ లో రీజినల్ డైరెక్టర్ గా చేరడం వల్లనో తెలియదు, మొత్తానికి వారిల్లు విజయరాఘవాచారి రోడ్  'పూర్ణిమ' నుండి బజుల్లా రోడ్ - తిరుమలపిళ్ళై రోడ్ జంక్షన్ లోని ఇంటికి మారింది. ఆ కొత్త ఇంటికి వెళ్ళగానే విశాలాక్షి గారు తాను వ్రాసిన ఒక పుస్తకాన్ని నా చేతిలో పెట్టారు. ఆ నవలను ఎవరో నిర్మాత తెలుగులో సినీమాగా తీయాలని సంకల్పించారని, ఆ నవలకు ఒక సినాప్సిస్ వ్రాయాలని , ఆ పనిని నేను చేయాలని అడిగారు. పుస్తకాలు సరిగా చదవడమే రాదు, వాటికి సినాప్సిస్ నేను రాయడమా? అలవాటు లేని ఔపాసన అని అనుకున్నాను. కానీ, ఆవిడ ధైర్యం చెప్పి ఎలా రాయాలో చెప్పి నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని పురిగొల్పారు. ఆవిడ చెప్పిన పధ్ధతులలోనే ఆ నవలకు కావలసిన సినాప్సిస్ తెలుగులో వ్రాసి ఆవిడ చెప్పిన గడువుకు ముందే వ్రాసి ఇచ్చేశాను. ఆవిడ అది చదివి చాలా సంతోషించారు. నేను వ్రాసినదానికి ఏ మార్పులు చేయకుండా యథాతథంగా ఆ నిర్మాతకు అందజేసినట్లు తర్వాత చెప్పారు. ఆ నిర్మాత దర్శకులకు కూడా ఆ కథాసంగ్రహం నచ్చిందని దానినే సినిమా గా తీయడానికి విశాలాక్షి గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ నవలే ' వారధి'. ఆ సినీమాయే 'రెండు కుటుంబాల కథ'.  ఈ నవలకు సినాప్సిస్ వ్రాసినందుకు నాకు కొంత పారితోషికం కూడా లభించింది. ఈ సినీమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తర్వాత చూద్దాము. 

🌿🌺🌿


ఘంటసాలవారు చలనచిత్ర సీమకు వచ్చి 25 సంవత్సరాలు అవుతున్నది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా, స్వాతంత్య్ర పోరాటంలో తన పాటలతో ప్రజలను ఉత్తేజపర్చి తనవంతు పాత్రను పోషించిన ఒక ఉత్తమ పౌరుడిగా, ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలనే ఒడ్డిన పొట్టి శ్రీరాములుగారి నిరాహారదీక్షలో తనవంతు చేయూతనిచ్చి ప్రవాసాంధ్రులలో చైతన్యం తెచ్చిన ప్రజాగాయకుడిగా ఘంటసాలవారి కృషి, చేసిన సేవ నిరుపమానం.

అటువంటి ఘంటసాల చలనచిత్ర రజతోత్సవాన్ని ఘనంగా జరపాలని దేశవ్యాప్తంగా వున్న ఘంటసాల అభిమానులంతా కోరుకున్నారు. అందుకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా సహకరించడానికి తమ సంసిధ్ధతను తెలియజేశారు. దక్షిణ చలనచిత్ర సీమలలోని ప్రముఖులంతా కూడా  ఘంటసాల చలనచిత్ర రజతోత్సవ సంగీత సంబరాలలో పాల్గొనడానికి తమ పరిపూర్ణ సహకారాన్ని ప్రకటించారు.

ఘంటసాలవారు తన 25 సంవత్సరాల సినీ సంగీత యానంలో తన పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డ నిర్మాత, దర్శకులు, సంగీతదర్శకులు, నేపథ్యగాయనీగాయకులు, వాద్యకళాకారులు, అంతకు మించి తాను పాడిన పాటలను, స్వరపర్చిన గీతాలను మెచ్చుకుంటూ తమ ప్రశంసలతో, అభిమానంతో ప్రోత్సహిస్తూ వస్తున్న అశేష ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా అందరి సమక్షంలో ఈ బ్రహ్మాండమైన ఉత్సవం జరగాలని  ఘంటసాలగారు కోరుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమ అంతా ఒకే కుటుంబమని, వారందరి సహాయ సహకారాలతోనే తాను వివిధ భాషలలో ఎన్నో పాటలు పాడే అవకాశం లభించిందని, అందువలన ఈ రజతోత్సవం కళాకారులందరి ఉత్సవంగా అందరూ పదికాలాలపాటు తలచుకునేలా భాసిల్లాలని ఆశించారు. 

1944 లో మద్రాసు సినీమా రంగంలో అడుగుపెట్టిన ఘంటసాల సినీ సంగీత ప్రస్థానం 1969 నాటికి 25 సంవత్సరాలు  పూర్తి చేసుకున్నది. 

"శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంఘం " (Sri Ghantasala Venkateswara Rao Movie Career Silver Jubilee Celebrations Committee) పేరిట ఒక కార్యనిర్వాహక సంఘాన్ని ఏర్పర్చారు.

ఘంటసాల ప్రజల మనిషి గా అందరి ఆదరాభిమానాలు పొందిన వ్యక్తి కావడంతో ఆనాటి రాజకీయ ప్రముఖులు ఈ ఉత్సవ నిర్వహణలో ఉత్సాహం కనపర్చారు.

శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంఘం -

అధ్యక్షులు :  గౌ. శ్రీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిగారు (ఆనాటి ఆంధ్రప్రదేశ్  రెవెన్యూ శాఖామాత్యులు);

ప్రధాన కార్యదర్శి : గౌ.శ్రీ అక్కిరాజు వాసుదేవ రావు గారు (ఆనాటి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖామాత్యులు);

ఉపాధ్యక్షులు : శ్రీ పి. రామచంద్రా రెడ్ఠి, B.A.B.L;

కోశాధికారి : శ్రీ రాజా ఎ. రామచంద్రారెడ్డి (ఆనాటి ఆంధ్రప్రదేశ్ క్రీడామండలి అధ్యక్షులు);

కార్యదర్శి : శ్రీ ఆర్ వి రమణమూర్తి

🌷రిసెప్షన్ కమిటీ మెంబర్స్ గా - సర్వశ్రీ - గౌరవనీయులు -
జె.వి. నరసింగరావు (డెప్యూటీ చీఫ్ మినిస్టర్),
కె. విజయభాస్కర రెడ్డి (మినిస్టర్ ఫర్ ఫైనాన్స్),
ఆర్. రామలింగరాజు (మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్),
పి.వి. నరసింహారావు (మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్),
వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు (మినిస్టర్ ఫర్ పవర్),
ఎ. భగవంతరావు (మినిస్టర్ ఫర్ హ్యాండ్ లూమ్స్), 
ఎమ.ఎన్. లక్ష్మీనరసయ్య (మినిస్టర్ ఫర్ ట్రాన్స్ పోర్ట్),
రోడా మిస్త్రి (మినిస్టర్ ఫర్ టూరిజం),
వి.పురుషోత్తమ రెడ్డి (మినిస్టర్ ఫర్ మైనర్ ఇరిగేషన్);

🌺రిసెప్షన్ కమిటీలో చలనచిత్ర సీమ ప్రముఖులు:

సర్వశ్రీ - బి.ఎన్.రెడ్డి, ఎ వి మెయ్యప్పన్, డి.మధుసూదనరావు,
ఎ.ఎల్.శ్రీనివాసన్, సుందర్లాల్ నహతా, జి. కామరాజు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కె.జగ్గయ్య, వి.నాగయ్య, శివాజీ గణేశన్, ఎమ్.జి.రామచంద్రన్, పి.పుల్లయ్య, టి.ఎల్.కాంతారావు, రేలంగి, సావిత్రి గణేష్, షావుకారు జానకి, అంజలీదేవి, కె.శ్రీనివాసరావు, ఎన్,త్రివిక్రమరావు, డి.రామానాయుడు; డా.సి.నారాయణరెడ్డి, రావూరు వెంకట సత్యనారాయణ, వి.వి.మాణిక్యాలరావు, ఎ.కెచెలువరాజు, జి.హనుమంతరావు, పోతుకూచి సాంబశివరావు, జి.ఎస్.వరదాచారి, పి.ఎస్.ఆర్.ఆంజనేయశాస్త్రి, బాసాని సుదర్శనరెడ్డి, కె. సుబ్రహ్మణ్యం, ఎ.ఆర్ కృష్ణ, బి.కృష్ణంరాజు. (సేకరణ : ఘంటసాల రజతోత్సవ ప్రత్యేక సంచిక)

ఈ రజతోత్సవ ప్రత్యేక కమిటీలు ఏర్పడకముందు, ఏర్పడిన తర్వాత కూడా ఆర్.వి.రమణమూర్తి తరచూ మద్రాస్ వచ్చి ఘంటసాలవారి తో సంప్రదించేవారు. కమిటీ అధ్యక్షుడు గౌ. మంత్రివర్యులు శ్రీయుతులు పి. తిమ్మారెడ్డిగారు, అక్కిరాజు వాసుదేవరావు గారు కూడా  ఓ రెండుసార్లు మద్రాస్ వచ్చి  ఘంటసాల మాస్టారింట్లో చాలా సేపు ఈ ఉత్సవ విషయమై చర్చించేవారు. వీరితోపాటు మరికొందరు రాజకీయనాయకులు కూడా వచ్చేవారు. వీరందరి చర్చలతో మాకు పొద్దే తెలిసేదికాదు. స్థానికంగా వున్న దక్షిణాది సినీ ప్రముఖులందరిని కలిసి ఈ బ్రహ్మండమైన రజతోత్సవంలో పాల్గొనేలా సమ్మతింపజేశారు. వాసుదేవరావుగారు వచ్చినప్పుడల్లా ఆయనతో నటుడు కాంతారావు కూడా వచ్చేవారు. వారిద్దరూ కోదాడకు చెందినవారు కావడాన ఆ స్నేహం కావచ్చు. వారిద్దరూ బంధువులని కూడా విన్నాను. ఎంతవరకూ నిజమో నాకు తెలియదు. రమణమూర్తిగారికి ఘంటసాల మాస్టారంటే చాలా గౌరవం, అభిమానం వుండేవి. 

ఘంటసాల చలనచిత్ర జీవిత రజతోత్సవాన్ని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యపట్టణం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది చలనచిత్రాభిమానుల సమక్షంలో జరపడానికి పెద్దలంతా కలసి నిర్ణయించారు.

రజతోత్సవ సంఘం కార్యదర్శిగా ఆర్.వి.రమణమూర్తిగారు చేసిన కృషి, పడిన శ్రమ అసమాన్యం. ఈ ఉత్సవం చేయాలని సంకల్పించినది మొదలు అది  'నభూతో నభవిష్యతి' అనే రీతిలో ముగిసేవరకు ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు. కాలికి చక్రాలు కట్టుకున్నట్లుగా హైదరాబాద్ మద్రాసుల మధ్య ఎన్నిసార్లు తిరిగారో లెఖ్ఖలేదు. రమణమూర్తి చాలా ఉత్సహవంతుడు. హైదరాబాద్ లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలో ఆరితేరిన వారు. రాజకీయ రంగంలో, సినీమా రంగంలో గల ప్రముఖులందరితో మంచి పరిచయాలు గల వ్యక్తి. అందరిళ్ళలో  వాళ్ళ వంటింటి వరకూ వెళ్ళి  కబుర్లు చెప్పేంత చొరవగల మనిషి అని ఘంటసాల మాస్టారు చెప్పేవారు. అతనితో రెండుసార్లు తిరిగాక ఆ మాట నిజమే అనిపించింది. ఒకసారి మద్రాస్ వచ్చి ఈ రజతోత్సవం తిరుపతి వేంకటేశ్వరుడి ఆశిస్సులు తోనే జరగాలి. అందువల్ల  వెంటనే తిరుపతి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని, నరసింగడిని, నన్ను కూడా తనతో బయల్దేరదీసాడు. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నేను కూడా ఎలాగైనా ఏదో రకంగా  ఘంటసాలవారి రజతోత్సవం లో పాలుపంచుకోవాలని. ఆరోజు మధ్యాహ్నం సమయాన మేము ముగ్గురం కారులో తిరుపతి బయల్దేరాము. ముందుగా దారిలో వచ్చే తిరుత్తణి కొండమీద వున్న సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాము. మేము వెళ్ళిన సమయానికి ఆలయంలో పెద్ద రద్దీలేదు. దర్శనం బాగా జరిగింది. రమణమూర్తి అక్కడ ఏవో అర్చనలు జరిపించారు. నేను తిరుత్తణి వెళ్ళడం అదే మొదలు, ఆఖరు కూడా. ఆ తర్వాత ఎన్నోసార్లు వెళ్ళాలని ప్రయత్నించినా కుదరనేలేదు. ఈ సదవకాశం రమణమూర్తి పుణ్యమే అని చెప్పాలి. అక్కడ నుండి బయల్దేరి సాయంత్రం చీకటి పడే సమయానికి తిరుమలలో వేంకటేశ్వర సన్నిధికి చేరుకున్నాము. అక్కడ ఎంతసేపు క్యూలో నిలబడాలో, ఎంత సమయం పడుతుందోనని నేను భయపడ్డాను. కానీ రమణమూర్తి డైరక్ట్ గా ప్రధాన ద్వారం లోపలనుండే మమ్మల్ని గర్భగుడిలోకి తీసుకువెళ్ళిపోయారు. ఎవరూ అడ్డగించలేదు. లోపల దేవుడికి అతి చేరువలో నిలబడి దర్శనం చేసుకున్నాము. అంత దగ్గరలో, అంత ఎక్కువసేపు వెంకన్న సన్నిధిలో నేను ఏనాడు గడపలేదు. (కానీ అలాటి సదవకాశం మరల కొన్ని దశాబ్దాల తర్వాత వరసగా ఐదురోజులపాటు లభించింది. ఆ వివరాలు వేరే అధ్యాయంలో).

రమణమూర్తి కోరిక నెరవేరింది. వచ్చిన పని సక్రమంగా ముగించుకొని అర్ధరాత్రి కి మద్రాసు చేరుకున్నాము. ఆ మర్నాడు ఉదయం ఫ్లైట్ లో రమణమూర్తి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.

ఈ తిరుపతి ప్రయాణంలో కలిగిన పరిచయమే. ఈ ఉత్సవం జరిగిన మధ్యకాలంలో చాలా తరచుగానే కలిసి తిరిగేవాళ్ళం. మాట్లాడుకునేవాళ్ళం. హైదరాబాద్ లో జరిగిన రజతోత్సవం తర్వాత నేను రమణమూర్తి గారిని మళ్ళీ  ఘంటసాలవారి విదేశ యాత్ర సమయంలో చూసాను. ఆ తర్వాత మరల ఎక్కడా కలవనూ లేదు, చూసిన గుర్తూ లేదు. పత్రికలలో చూడడం తప్ప. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చురల్ కౌన్సిల్ కు చైర్మన్ గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చాలా పేరుపొందారు. సినీమా నిర్మాతగా కూడా 'నీరాజనం', 'అభినందన' వంటి చిత్రాలు నిర్మించి ఎన్నో నందీ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు  కూడా పొందారు. ఈ చిత్రాలలో నీరాజనం చిత్రానికి O.P.నయ్యార్, అభినందన చిత్రానికి ఇళయరాజా వంటి  జాతీయస్థాయి సుప్రసిధ్ధ సంగీత దర్శకులు పనిచేయడం ఒక విశేషం.

ఘంటసాల సినీ జీవిత రజతోత్సవానికి ఇంకా చాలా సమయం వుంది. ఇందుకు సంబంధించిన మరెన్నో విశేషాలు వచ్చేవారాలలో ....అంతవరకూ.....
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, October 10, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై రెండవ భాగం

10.10.2021 - ఆదివారం భాగం - 52*:
అధ్యాయం 2  భాగం 51 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నకాలంలో తెలుగు సినీమాలలో కథకు, కథకుడికి కూడా ప్రాధాన్యత వుండేది. ఒక సినీమా విజయవంతం కావాలంటే కథ, మాటలు, పాటలు, నేపథ్యసంగీతం, దర్శకత్వ, సాంకేతిక వర్గ నైపుణ్యం, అన్నీ సమపాళ్ళలో వుండాలి. అప్పుడే ఆ సినీమా ప్రజారంజకమవుతుంది. ఆ చిత్రంలోని పాటలు ప్రజల హృదయాలలో నిలిచిపోతాయి.

మల్లీశ్వరి, పాతాళభైరవి కాలంలో, సినీమా పరిభాషలో చెప్పాలంటే, కథ మీద కూర్చునే (చర్చలు జరపడం) సమయమే ఎక్కువగా వుండేది. ఆ కథకు పకడ్బందీగా కథా సంవిధానం తయారు చేసుకొని, మాటలు వ్రాయించి, ఆ తర్వాతే సందర్భోచితంగా పాటల దృశ్యాలను నిర్ణయించి సంగీతదర్శకుడిచేత వరసలు కట్టించి, ఆ పాటలు పాడగల సమర్థులైన గాయకులచేత పాడించి రికార్డింగ్ చేయించేవారు. కథలో సన్నివేశబలం గల చోట్ల వచ్చిన పాటలు తప్పక బహుళ జనాదరణ పొందేవి. 

1960లు దాటేవరకు మన తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు  చాలావరకు తమ కథల కోసం పరాయి భాషల మీదే ఆధారపడేవారు. బెంగాలి శరత్ బాబు, ఆశాపూర్ణాదేవి, షేక్స్పియర్, అలెగ్జాండర్ డ్యూమాస్, అరేబియన్ నైట్స్  కథల ఆధారంగానే మన తెలుగు సినీమాలు వుండేవి. గుణసుందరి కథ, మనదేశం, పాతాళభైరవి, మిస్సమ్మ, బాటసారి, మాంగల్యబలం, ఆరాధన, వెలుగునీడలు వంటి ఎన్నో కథలు పరాయి భాషలనుండి దిగుమతి చేసుకొని మన తెలుగు వాతావరణానికి తగినట్లుగా ఆ కథలను మలచుకొని తెరకెక్కించారు. తెరానువాదం సక్రమంగా జరిగిన సినీమాలు కొన్ని విజయంపొందాయి. మరికొన్ని ప్రేక్షకుల ఆమోదం పొందలేదు. ఎందుకంటే మరేవో లోపాలు. ప్రేక్షకులు ఏ సినిమాలు నచ్చుతారు ఏ సినిమాలు నచ్చరు అన్నదానికి సినిమా విశ్లేషకులు, విమర్శకుల 'సహేతుక' వివరణలన్నీ కాయితాలకి పరిమితమైన థియొరీలే. పాండిబజార్ లో సినిమా సారాన్నంతా గ్రహించి రోడ్డుమీదే అందరికీ పంచే తత్త్వజ్ఞానులూ ఉండేవారు. 

తెలుగు సినీమా స్వర్ణయుగంలో తెలుగు కథకు పట్టాభిషేకం చేసి శిఖరాగ్రాన కూర్చోబెట్టిన మహాకథకులెందరో వుండేవారు. సినీమారంగంతో సంబంధం లేని కథా రచయిత లెందరో తమ అద్భుత రచనా చాతుర్యంతో తెలుగు రచనా ప్రాభవాన్ని చాటిచెప్పారు. ఆరోజుల్లో ఇప్పటికన్నా ప్రజలలో పఠనాసక్తి ఎక్కువగానే వుండేది. నిత్యజీవితంలోని సమస్యలనే ప్రధానాంశాలుగా తీసుకొని వాటిని విభిన్నకోణాలలో విశ్లేషించి రచయితలు తమ రచనలు కొనసాగించారు. ఉత్తమ సాహిత్యానికి విలువనిచ్చే తెలుగు దిన, వార, పక్ష, మాస పత్రికలెన్నో మంచి మంచి కథలను, నవలలను తమ తమ పత్రికలలో ప్రచురించేవారు.

నాకు కొంత ఊహ తెలిసేనాటికి నేను చూసిన మొదటి వార పత్రిక 'ఆంధ్రపత్రిక', అలాగే 'ఆంధ్రపత్రిక' దిన పత్రిక. 'దేశోధ్ధారక' నాగేశ్వరరావు పంతులుగారు స్థాపించినది. వారి స్థాపనంలో వచ్చిన మరో అద్భుత మాస పత్రిక 'భారతి'. భారతి విద్యావేత్తల, సాహితీ మేధావుల పత్రిక. కవిత్వంలో ఆరితేరిన మహామహుల రచనలు, విమ‌ర్శలు, విశ్లేషణలు, చర్చలు, వాదోపవాదాలుతో నిండివుండేది. విశ్వనాథ సత్యనారాయణ, తిరుపతి వెంకటకవులు, శ్రీపాదకృష్ణమూర్తి, గురజాడ, శ్రీశ్రీ, చలం వంటి గొప్ప కవుల రచనలు ఆ భారతిలో వచ్చేవి. 'భారతి'లో ఎవరి కథైనా, వ్యాసమైనా ప్రచురించబడితే ఆ రచయిత ఒక విశిష్ట రచయితగా సాహితీలోకంలో గుర్తింపబడి గౌరవించబడేవాడు. ఆ స్థాయిని అందుకోవడం కోసం ఆనాటి రచయితలంతా తపించేవారు. అలాటి 'భారతి' లో మా నాన్నగారి స్నేహితులు - పంతుల శ్రీరామశాస్త్రి, భట్టిప్రోలు కృష్ణమూర్తి, మంథా రమణరావుగార్ల కథలు, చందోభధ్ధ కవితలు ప్రచురించబడేవి. భారతిలో వచ్చిన మంథా రమణరావుగారి 'మంటలు' నేనూ చదివాను. ఆయన వ్రాసిన మరో నవల 'చలిచీమలు' ను సినీమాగా కూడా  తీసారు. మంథా రమణరావు తాను వ్రాసిన ఒక పుస్తకాన్ని మా నాన్నగారికి అంకితం కూడా చేశారు. మంథా రమణరావు వృత్తిరీత్యా రూర్కెలా స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతోద్యోగి. ప్రవృత్తి రచనా వ్యాసాంగం. భట్టిప్రోలు  కృష్ణమూర్తిగారు ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఉన్నతాధికారి. జయపూర్, జునాఘడ్, కెయింఝోర్ లోని ప్రవాసాంధ్ర కవి, రచయిత. పంతుల శ్రీరామశాస్త్రి రాయఘడా హైస్కూలులో మాస్టర్. చందోబధ్ధంగా కవిత్వం రాసేవారు. ఈ ఇద్దరూ, మా నాన్నగారు కలసి వ్రాసిన గొలుసుకట్టు కథలు 1950లలో ఆంధ్రపత్రికలో ప్రచురించబడ్డాయి. అయితే కథలు చదివేంత వయసు ఆనాడు నాకు లేదు. 

మేము విజయనగరంలో వుండేనాటికి ఆనాటి ప్రముఖ పత్రికలుగా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక, విశాలాంధ్ర, ప్రజామాత, జాగృతి, గృహలక్ష్మి  కనిపించేవి. ఇందులో కొన్ని దినపత్రికలు, కొన్ని వార, పక్ష మాస పత్రికలు. వీటన్నిటిలో  చాలా మంచి కథలు, నవలలు, వ్యాసాలు వచ్చేవి. ఈ పత్రికలన్నింటిలో కొన్ని పేజీలు సినీమా వార్తలకోసం ఫోటోల కోసం కేటాయించేవారు.అప్పుడు ఇప్పుడూ కూడా వారపత్రికల ముఖచిత్రాలుగా సినీమా తారల బొమ్మలే వేయడం ఆచారంగా వస్తోంది.

మేము విజయనగరం లో వుండేప్పుడు ఆంధ్రపత్రికలో వచ్చిన ఒక సీరియల్ పేరు మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఆ సీరియల్ పేరు 'మంచి-చెడు' రచయిత శారద. ఆ పేరు వల్లే నాకు ఆ సీరియల్ పేరు గుర్తుండిపోయింది. కారణం 'శారద'. శారద మా దొడ్డమ్మగారి ఏకైక కుమార్తె. ఆమె నన్ను ఎప్పుడూ తమ్ముడూ అని  ప్రేమతో లాలించి పిల్చినా నేను మాత్రం శారద అనే పిలిచేవాడిని 'అక్క' అని ఎప్పుడూ పిలవలేదు. నాకు ఎవరిని వరసలు పెట్టి పిలిచే అలవాటు అలవడలేదు.

శారద పేరు ఇంతగా గుర్తుండిపోవడానికి మరో కారణం.  1930లలో మా తాతగారు సాలూరులో నెలకొల్పిన సంగీత పాఠశాల పేరు 'శారదా గాన పాఠశాల'.

ఇంతకూ ఈ 'మంచి-చెడు'  శారద ఎవరు? విజయనగరంలో ఉన్నంతకాలం పత్రికలలో కనపడే శారద మహిళా రచయితనే అనుకునేవాడిని. శారద అనేది మగ రచయిత కలం పేరని, ఏదో ఊళ్ళో ఒక హోటల్ లో సర్వర్ అని మెడ్రాస్ వచ్చాకే తెలిసింది. ఈమధ్య కాలం వరకూ  శారద పూర్తి చరిత్ర నాకు ఏమాత్రం తెలియదు. తెలుగు కథకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా  వెలువడిన ఒక వీడియోలో 'పిరికి ప్రియుడు' అనే కథను పరిచయం చేసారు శ్రీగొల్లపూడి మారుతీరావుగారు. ఆ కథను వ్రాసింది శారద. శారద గురించి శ్రీ మారుతీరావుగారు చెప్పింది విన్నాక మనసు వికలమయింది.  

శారద తెలుగువాడు కాదు. ఒక తమిళుడు. పేరు నటరాజన్. అతి పేద కుటుంబంలో పుట్టాడు. పుట్టినగెడ్డమీద బ్రతికే ఆస్కారం లేక పొట్ట చేతబట్టుకొని తండ్రితో ఆంధ్రదేశంలోని తెనాలి చేరుకున్నాడు. అప్పటికి అతని వయసు 13 సంవత్సరాలు మాత్రమే. పరాయి రాష్ట్రంలో భాష తెలియని ప్రాంతంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ నానా అవస్థలు పడ్డారు. నటరాజన్ కు తమిళ సాహిత్యం మీది మక్కువతో ఆ వయసుకే కథలు వ్రాసేవాడట. తెనాలి వచ్చాక తండ్రి మరణించాడు. శారద అనాథయ్యాడు. తెలుగు భాష మీద మక్కువ పెంచుకొని,  నోటు బుక్కులు కొనే స్థోమత లేక  రోడ్లమీద దొరికే సిగరెట్ ప్యాకెట్లు ఏరుకొని వాటి వెనక తెలుగు మాటలకు అర్ధం తెలుసుకొని వాటిని వ్రాసుకొని తెలుగు నేర్చుకొని తెలుగులో వ్రాసిన అద్భుతమైన కధలు ఆనాటి ప్రముఖ తెలుగు రచయితలను, పాఠకులను ఉలిక్కిపడేలా చేశాయి.

విజయవాడలో జరిగిన ఒక సాహితీ సదస్సులో విశ్వనాథ, జాషువా వంటి మహా రచయితలను చూసి వారి స్ఫూర్తితో తెలుగు భాషమీద పట్టును సాధించినవాడు శారద. తమ హోటల్ కు వచ్చిన ప్రతీ ఒక్కరిని వారికి పుస్తకపఠనాభిలాష వుందా అని అడిగి తెలుసుకొని వారి వద్దనుండి తెలుగు పుస్తకాలు అడిగి పుచ్చుకొని విస్తృతంగా చదివేవాడట. శారద హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్న రోజులనుండి అంటిపెట్టుకున్న ఆయన స్నేహితుడు ఆలూరి భుజంగరావు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాడు శారద, భుజంగరావు, అతని తల్లి తినేందుకు తిండి దొరకక పస్తుండి మంచినీళ్ళతో కడుపునింపుకున్నారట. శారదకు మూర్ఛ జబ్బు. నయం చేసుకునే ఆర్థిక స్తోమత లేదు.  అప్పుడప్పుడు నడిరోడ్ మీదే మూర్ఛ వచ్చి పడిపోతూండేవాడట. చివరకు ఆ మూర్ఛ జబ్బు వల్లనే శారద తన 30వ ఏట 1955లో  అతి పిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపోయాడట. శారద తన జీవితకాలంలో చిల్లర నాణేలు, రూపాయి, ఐదు, పది రూపాయల నోటు తప్ప నూరు రూపాయల నోటు ఎలా వుంటుందో  తెలియదట. 'మంచి- చెడు', 'అపస్వరాలు', ఏది సత్యం' వంటి అధ్భుతమైన తెలుగు నవలలు వ్రాసిన తమిళుడు  శారద అనబడే ఎస్.నటరాజన్ దుర్భర లేమిలో కనుమూసాడు. ఎంతటి దౌర్భాగ్యస్థితి.  సామాన్య ప్రజల జీవితం నుండి, మనచుట్టూ వున్న సమాజం నుండే తన కథలను, కథాపాత్రలను ఎంచుకొని సహజమైన కథలను వ్రాసిన ప్రతిభాశాలి శారద. ఆయన వ్రాసిన 'ఏది నిజం' నవల పబ్లిష్ అయిన రెండు నెలలలోనే అన్ని పుస్తకాలు అమ్ముడుపోయి ద్వితీయ ముద్రణ వేయవలసి వచ్చిందట.

ఈ రచయిత విషాద గాధలో  ఒక సినీమాకు సరిపడేంత జీవిత సత్యాలు నిండివున్నాయి.

మా నాన్నగారికి వున్న సాహిత్యాభిలాషతో ఆయన చాలా మంచి పుస్తకాలనే సేకరించారు. టాగోర్, శరత్, మున్షీ ప్రేమ్ చంద్, విశ్వనాధ, గురజాడ, చలం, కొడవటిగంటి, రావూరి భరద్వాజ వంటి ప్రముఖుల పుస్తకాలతోపాటూ మాక్సిమ్ గోర్కి, టాల్ స్టాయ్, సోమర్సెట్ మామ్, మార్క్ ట్వైన్ వంటి విదేశీ రచయితల అనువాద సాహిత్యం, సంగీత నృత్యాలకు సంబంధించిన ప్రాచీన గ్రంథాలు అంతా మా నాన్నగారు కొనేవారు. ఈ ఉత్తమ సాహిత్యంలోని చాలాభాగం పాండీబజార్లో రాజకుమారి థియేటర్ ముందున్న ప్లాట్ ఫారమ్ బుక్ షాపులో సెకెండ్ హ్యాండ్ లో కొన్నవే. ఎంతో విలువైన పుస్తకాలు. పుస్తకాలకు మించిన మంచి స్నేహితులుండరని మా నాన్నగారి అభిప్రాయం. రికార్డింగ్ ల విరామ సమయంలో, ఘంటసాలవారితో బయట వూళ్ళు కచేరీలకు వెళ్ళేప్పుడు ప్రయాణాలలో ఈ పుస్తక పఠనంతోనే కాలక్షేపం చేసేవారు.

మా ఇంట్లోని ఈ సాహిత్యం పూర్తిగా కూలంకషంగా చదివేంత విజ్ఞానం నాకు లేకపోయింది. వార పత్రికలలో వచ్చే కధలతోటే నాకు గడచిపోయేది. అప్పుడే నాకు చాలామంది రచయితలు, రచయిత్రుల పేర్లు తెలిసాయి. ఆనాటి పత్రికలలో ఎక్కువగా  చక్రపాణి, గోపీచంద్ (అసమర్ధుని జీవిత యాత్ర),  కొడవటిగంటి కుటుంబరావు (చదువు), బలివాడ కాంతారావు, మధురాంతకం రాజారామ్, కొమ్మూరి వేణుగోపాలరావు (పెంకుటిల్లు), మద్దిపట్ల సూరి, బుచ్చిబాబు (చివరకు మిగిలేది), ధనికొండ హనుమంతరావు, ఎన్.ఆర్.నంది, కొండముది హనుమంతరావు, మహీధర రామ్మోహనరావు, పిలకా గణపతిశాస్త్రి (విశాలనేత్రాలు), తిరుమల రామచంద్ర (హంపీ నుండి హరప్పా దాకా), రాచకొండ విశ్వనాధ శాస్త్రి (ఆరు సారా కథలు, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త), ముళ్ళపూడి వెంకట రమణ (ఋణానందలహరి), పోలాప్రగడ సత్యనారాయణ (దీపశిఖ ) వంటి చేయి తిరిగిన రచయితలెందరో  తెలుగు కథాధా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. 

పురుష రచయితలకు సమానంగా స్త్రీ రచయితలు కూడా ఎంతోమంది వినూత్న పంథాలో రచనలు సాగించారు. కొమ్మూరి పద్మావతి , ఇల్లిందల సరస్వతీ దేవి, భానుమతి, లత (ఊహాగానం), మాలతీ చందూర్ (చంపకం-చెదపురుగులు, ప్రమదావనం), కె. రామలక్ష్మి, ద్వివేదుల విశాలాక్షి (వైకుంఠపాళి, గ్రహణం విడిచింది, వారధి),  వేల్పూరి సుభద్రాదేవి (మంచుబొమ్మలు), డా.త్రివేణి (వెండిమబ్బు), ముప్పాళ రంగనాయకమ్మ (బలిపీఠం, కృష్ణవేణి ,పేకమేడలు), కోడూరి కౌసల్యాదేవి (చక్రభ్రమణం, ప్రేమ నగర్), యద్దనపూడి సులోచనారాణి (సెక్రెటరి, జీవన తరంగాలు, మీనా), డా.శ్రీ దేవి (కాలాతీత వ్యక్తులు), డి. కామేశ్వరి, పవని నిర్మలా ప్రభావతి, సి. ఆనందారామం మొదలైన రచయిత్రులు తెలుగువారి సాహితీ వికాసానికి ఇతోధికంగా తోడ్పడ్డారు. 

(బ్రాకెట్లలో ఉన్నవి నేను చదివిన వారి వారి పుస్తకాలు).

ఒక దశలో  తెలుగు సినిమా నిర్మాతాదర్శకులు ఆనాటి పత్రికలలో వచ్చిన నవలలు, సీరియల్స్ ఆధారంగా ఎన్నో విజయవంతమైన సినీమాలను తీశారు. తమ కథల ద్వారా ముప్పాళ రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి, ద్వివేదుల విశాలాక్షి, పోలాప్రగడ ఇత్యాదులు సినీప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా చూరగొన్నారు. 1980ల తర్వాత వచ్చిన యండమూరి వీరేంద్రనాధ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, కొమ్మనాపల్లి గణపతిరావు వంటి ప్రముఖ పత్రికా రచయితలు కూడా సినీమా కథకులుగా లబ్దప్రతిష్టులు.

నాతరం వారందరికీ కూడా బాగా తెలిసిన  పాల మనసులు (డా.త్రివేణి వెండిమబ్బు), డా.చక్రవర్తి, ప్రేమనగర్,  సెక్రెటరి, చదువుకున్న అమ్మాయిలు, మీనా, జీవన తరంగాలు, బలిపీఠం, భార్యాభర్తలు (డా.లక్ష్మి అనే తమిళ రచయిత్రి నవల), తల్లిదండ్రులు, రెండు కుటుంబాల కథ, చలి చీమలు వంటి సినీమాలన్నీ సినీమా రంగానికి సంబంధంలేని పత్రికా రచయితల కథల ఆధారంగా తీసినవే.

సినీమా నిస్సందేహంగా వినోదం ముడిసరుకుగా ఉన్న వ్యాపారం. ఏ నిర్మాత సినీమా తీసినా ముఖ్యోద్దేశం  సినీమా వ్యాపారం ద్వారా ధనార్జనే. అందుకే ఈ నాటి సినీమాలలో వాసి కంటె రాశికే ప్రాధాన్యత. నిర్మాతలంతా  వివిధ ప్రసార ప్రచార సాధనాలతో తమకు గల వ్యాపార దక్షత అంతా ఉపయోగించి వందల కోట్ల బడ్జెట్ తో   ప్రేక్షక వినోదమే ప్రధాన లక్ష్యంగా, సంచలనమే ముఖ్యాకర్షణగా సినీమాలు నిర్మిస్తున్నారు. అయితే  విజయవంతమయ్యేవి పది సినీమాలలో  ఏ రెండో మూడో. మిగిలినవన్నీ మఖలో పుట్టి పుబ్బలో గిట్టే సినీమాలే. వందలాది కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే. ఆ సినీమాలలోని కథ, మాటలు, పాటలు, నటీనటులు, ఏ అంశమూ ప్రేక్షకులకు జ్ఞాపకమే వుండవు.

ఈ రకమైన ఫక్తు వ్యాపార  దృక్పథం గడచిన తరం నిర్మాతా దర్శకులలో తక్కువ. అధిక లాభాలు రాకపోయినా తాము ఆ సినీమా మీద పెట్టిన సొమ్ము తిరిగి వస్తే చాలని ఆనందంగా సినీమాలు తీసేవారు. తమ సినీమాల ద్వారా సమాజానికి ఏదో ఒక మంచిని చేయాలని,  ఆదర్శ ప్రాయమైన సందేశాన్ని వినిపించాలని తలచేవారు. అందుకే కథ విషయంలో, సభ్యత గల  భాషను వాడే విషయంలో,  వీనులకు విందు చేసే శ్రావ్యమైన సంగీతం విషయంలో, సందర్భోచిత నటన విషయంలో ఎంతో  జాగ్రత్తలు వహించేవారు. 

ఆ రోజుల్లో ఒక సినీమా వరసగా  50 రోజులు ఆడితే వారి పెట్టుబడి వారికి వచ్చి రెండవ సినీమా తీయడానికి కావలసిన డబ్బు చేతికందే పరిస్థితి. ఆనాడు గోల్డెన్ జూబ్లీలు చేసుకున్న చిత్రాలు వచ్చాయి. కేవలం వారం, రెండు వారాలలోనే ఫిలిం డబ్బాలు వెనక్కి తిరిగి వచ్చినవీ ఉన్నాయి. నాటికీ నేటికీ సినీమా నిర్మాణ దృక్పథంలో ఎంతో తేడా వచ్చింది. ప్రేక్షకుల అభిరుచిలోనూ మార్పువచ్చింది. 

ఈనాటి సినీమాలలో ఉత్తమ సాహిత్యాన్ని, సుశ్రావ్యమైన మనసులను పరవశింపజేసే సంగీతాన్ని ఆశించడమనేది నేతి బీరకాయలో నేయికోసం వెతకడంలాటిదే అవుతుంది. 

💐

మాస్టారుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని వారందరిచేత ఆప్యాయంగా  గౌరవింపబడిన సుప్రసిధ్ధ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారు చలనచిత్రసీమకు వచ్చి 25 సంవత్సరాలు అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఘంటసాల సినీ జీవిత రజతోత్సవాన్ని(ఆనాటి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానియైన హైదరాబాద్ లో అత్యంతభారీగా, వైభవోపేతంగా జరపడానికి నిశ్చయించబడింది. అందుకుగాను వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో ఒక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 

ఆ మహోత్సవ విశేషాలు... వచ్చే వారం...
...సశేషం




Sunday, October 3, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభైయొకటవ భాగం

03.10.2021 -  ఆదివారం భాగం - 51:
అధ్యాయం 2 భాగం 50 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఇప్పటి చెన్నైలో మౌంట్ రోడ్ స్పెన్సర్స్ ప్లాజాకు ఎదురుగా సిటీ బ్యాంక్ వుంది. ఆ బ్యాంక్ మొదటి పేరు ఫస్ట్ నేషనల్ సిటి బ్యాంకు, ఒక విదేశీ సంస్థ. మద్రాసులో లో కొత్తగా తెరిచారు. ఆ బ్యాంక్ లో స్టెనో టైపిస్ట్ ల ఉద్యోగానికి పత్రికలలో ప్రకటన చేశారు. అది చూసి నేను  నా అప్లికేషన్ ను పంపాను. 

డా. డి.ఎన్.రావు గారి అబ్బాయి  శ్రీనాధ్ అదే ఫస్ట్ నేషనల్ సిటి బ్యాంక్ బొంబాయి బ్రాంచ్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కొత్తగా జాయిన్ అయ్యారు. ఒంటరిగా ఉండేవాడు. బొంబాయి మహానగరంలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ. ఇండియాలో ఫ్లాట్స్,అపార్ట్మెంట్స్ సంస్కృతి ముందుగా అభివృద్ధి చెందినది బొంబయిలోనే.  1970ల తర్వాతే మద్రాస్ లో మల్టీస్టోరీడ్  రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సిస్టమ్ డెవలప్మెంట్ ప్రారంభమయింది. ఎగ్మూర్ పోష్ లొకాలిటీస్ లో ఈ ఫ్లాట్స్ ఒకటో రెండో వుండేవి. వాటిలో ఎక్కువగా మార్వాడీలు, గుజరాతీలు వుండేవారు. దాక్షిణాత్యులంతా విశాలమైన  కాంపౌండ్ తో ఇండివిడ్యువల్ భవంతులు, ఇళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి మద్రాస్ లో వాళ్ళుండే 'పూర్ణిమ' లాగే బొంబాయిలో శ్రీనాధ్ వుండేది ప్రత్యేకమైన పెద్ద ఇల్లేనా అని అడిగితే అతను చెప్పిన సమాధానం అప్పట్లో షాక్ నే కలిగించింది. ఒక మల్టీస్టోరీడ్ బిల్డింగ్ లో ఒక చిన్న 12'×12' రూమ్ లో మరొకరితో షేర్ చేసుకొని వుంటాడట. ఆ చిన్న రూమ్ కు ఇతని వంతు అద్దె 2500/- రూపాయలని చెప్పిన గుర్తు. అంత అద్దెకు మద్రాస్ లో  నాలుగేసి గదులున్న చాలా పెద్ద ఇళ్ళే అద్దెకు దొరికేవి.  బొంబాయి లైఫ్ స్టైల్ గురించి అతను చెప్పే మాటలను ఆశ్చర్యంగా వినేవాడిని.

అలాటి పెద్ద బ్యాంక్ నుండి నన్ను ఇంటర్వ్యూకు రమ్మని పిలవడం నాకు ఆశ్చర్యమే. మద్రాసులోని ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ అప్పట్లో ప్యారీకార్నర్ వెనక ఆర్మీనియన్ స్ట్రీట్ లో వుండేది. మా పానగల్ పార్క్ బస్ స్టాప్ లో 11 నెంబర్  బస్ పట్టుకొని ఆఖరి స్టాపింగ్  అయిన ప్యారీస్ కార్నర్ లో దిగి ఆర్మీనియన్ స్ట్రీట్ లోని ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ కు నడుచుకుంటూ వెళ్ళాను. అలాటి పెద్ద బ్యాంక్ లకు వెళ్ళడం కొత్త. అక్కడ అందరూ చాలా టిప్ టాప్ గా సూటూ బూట్లతో హైలెవెల్ లో కనిపించారు. ఇంటర్వ్యూ కు వచ్చినవారు కూడా చాలా స్టైలిష్ గా వున్నారు. అందరిలోకి అతి సామాన్యంగా వున్నది నేను మాత్రమే. నేను డి.ఎన్.రావుగారి USEFI లో పనిచేసేప్పుడు నా సర్టిఫికెట్లు అన్ని పెట్టుకోవడానికి అక్కడి సెక్రెటరీ కుప్పుస్వామి ఒక బ్లూకలర్ థిక్ ప్లాస్టిక్ క్లోజ్ట్ ఫోల్డర్ ఒకటి ఇచ్చారు. ముందువేపు స్కైబ్లూ , వెనకవేపు డార్క్ బ్రోన్. నా సర్టిఫికెట్లు అన్నీ ఇంకా అదే ఫోల్డర్ లో నా దగ్గర భద్రంగా వున్నాయి. ఆ ఫోల్డర్ తోనే ఆ రోజు ఇంటర్వ్యూ కు వెళ్ళాను. ప్రతి ఇంటర్వ్యూ లాగే సాగింది.  ఒక  పావుగంటలో ఇంటర్వ్యూ ముగిసింది. ఏ సంగతీ తర్వాత తెలియజేస్తామన్నారు. నేను సరేనని వెనక్కి తిరిగి వచ్చేసాను. 

కొన్నిరోజుల తర్వాత  బొంబాయి నుండి శ్రీనాధ్ వీకెండ్స్ కు మద్రాస్ వచ్చారు. అతని బ్యాంకు లోనే నన్ను ఇంటర్వ్యూకు పిలిచారన్న విషయం శ్రీనాధ్ కు  చెప్పడానికి వెళ్ళాను. అతను నాకంటే వయసులో మరీ పెద్దవాడేమీ కాదు. ఉంటే ఒకటి రెండేళ్ళు పెద్దవాడేమో, తెలియదు. కానీ, చాలా తెలివైనవాడు, చొరవగలవాడు. అతనికి నా ఇంటర్వ్యూ వివరాలన్ని చెప్పాను. అన్నీ విని అతను ఒకే మాటన్నాడు 'ఆ స్టెనోగ్రాఫర్ ఉద్యోగం నీకు రాదు' అని. దానికి శ్రీనాధ్ చెప్పిన కారణం నాకు ఒక గుణపాఠం. ఆ బ్యాంక్ లో నన్ను ఇంటర్వ్యూ చేసిన పెద్దమనిషి అన్ని వివరాలు అడుగుతూ ఆ బ్యాంకు లో నాకు తెలిసినవారెవరైనా ఉన్నారా అని అడిగాడు. నేను మహాగొప్పగా శ్రీనాధ్  పేరుచెప్పి బొంబాయి బ్రాంచ్ లో పనిచేస్తున్నారని చెప్పాను. అదే నా కొంపముంచిందిట. తెలిసినవాళ్ళున్నారని చెప్పడం అలాటి పెద్ద కంపెనీలలో ఒక డిస్క్వాలిఫికేషన్ క్రింద పరిగణిస్తారట. అలాటి అప్లికెంట్స్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తారట. కారణాలేమైనా  ఆ తర్వాత మళ్ళీ నేను ఆర్మీనియన్ స్ట్రీట్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ ఛాయలకు వెళ్ళనేలేదు. 
🌷

మా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లయొజన్ ఆఫీస్ మైలాపూర్ నుండి అడయార్ కు మారాక నేను 12B బస్సులకోసం కాచుకోవడం మానేశాను. బస్ లో వెళితే ICF నుండి వచ్చే 47Aలో కానీ, విల్లివాక్కం నుండి వచ్చే 47 బస్ లో కానీ వెళ్ళాలి. ఆ బస్ స్టాప్ లు పానగల్ పార్క్ బస్ స్టాపింగ్ లకు కొంచెం దూరంలో వున్న రామకృష్ణ మెయిన్ స్కూల్ దాకా వెళ్ళాలి. ఆ బస్సులు సరియైన  సమయానికి వచ్చేవి కావు. వచ్చినా ఆ బస్సులు ఫుల్ గా జనాలు వేలాడుతుండేవారు. ఆ స్టాప్ లో ఆగకుండానే వెళ్ళిపోయేవి. ఆ బస్సుల కోసం కాచుకొని కూర్చుంటే ఆఫీసుకు బాగా లేటయిపోయేది. ఎంత నాకు పనిలేని గవర్నమెంట్ ఆఫీసయినా వారిచ్చే జీతానికి విశ్వాసంగా, సక్రమంగా పనిచేయాలనే నియమం నాకు వుండేది. అందువల్ల ఇంక సిటి బస్సులను నమ్ముకోకుండా ఆఫీసుకు సైకిల్ మీద వెళ్ళడం ప్రారంభించాను. వ్యాయామానికి వ్యాయామం. డబ్బుకు డబ్బు ఆదా. దీనివల్ల మా అమ్మగారికి ఆనందమే. బస్సులు వెళ్ళిపోతాయనే నెపంతో తన కొడుకు తాను వండి కట్టిచ్చే టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళకుండా పారిపోయే అవకాశం ఇప్పుడులేదు. మొత్తానికి ఓ నలభైయైదు నిముషాలలో సైకిల్ మీద అడయార్ గాంధీనగర్ లోని ఆఫీసుకు చేరేవాడిని. మా ఇంటినుండి సౌత్ ఉస్మాన్ రోడ్ చివరనున్న మౌంట్ రోడ్ వరకూ ఒకటే తిన్నటి రోడ్. ఇప్పటిలా ఫ్లైఓవర్ లు, వన్ వే ట్రాఫిక్ ల బెడద వుండేది కాదు. టి.నగర్ రంగనాథన్ స్ట్రీట్ నుండి టి నగర్ బస్ స్టాండ్ దాటేవరకే వాహనాల రద్దీ ఎక్కువగా వుండేది. ఆ తర్వాత  ప్రయాణం ఫ్రీగా సాగేది. ఆ తర్వాత మళ్ళి మౌంట్ రోడ్ లో సైదాపేట బ్రిడ్జ్ దాటేవరకు వాహనాల రాకపోక ఎక్కువే. లిటిల్ మౌంట్ దాటి రాజభవన్ రోడ్ ప్రవేశించాక, అడయార్ ఆఫీస్ కు వెళ్ళేవరకు చక్కనీ రాజమార్గమే. చాలా నిర్మానుష్యంగా, చల్లటి సముద్రపుగాలి, ప్రశాంతమైన వాతావరణంతో చాలా ఆహ్లాదకరంగా వుండేది.  రాజభవన్, గిండీ ఇంజనీరింగ్ కాలేజ్, గాంధీ మండపం దాటి IIT క్యాంపస్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, దాటేవరకూ రోడ్ కు రెండు ప్రక్కలా దట్టమైన చెట్లతో లోపలనున్న గిండీ ఫారెస్ట్ లోని లేళ్ళు, దుప్పులు రోడ్ ను క్రాస్ చేసుకుంటూ ఛెంగు ఛెంగున దుముకుతూ వచ్చేపోయే వాహనాలకు అడ్డుతగులుతూండేవి. సాయంత్రం ఏడు గంటలు దాటితే ఆ రోడ్ మీద నర సంచారమే వుండేదికాదు, అప్పుడప్పుడు తిరిగే బస్సులు,కార్లు తప్ప. అలా ఆ ఆఫీసుకు ఓ రెండేళ్ళపాటు సైకిల్ మీదే వెళ్ళివచ్చేవాడిని. ఆ ఆఫీస్ లో ఫెర్టిలైజర్స్ షిప్మెంట్ టైములో తప్ప మిగిలిన సమయాలలో పెద్దపని వుండేదికాదు. పని తగినట్లుగానే జీతాలు తక్కువే. అక్కడ పనిచేసేప్పుడు ఖాళి సమయమంతా నా షార్ట్ హాండ్ ప్రాక్టీస్, పుస్తకపఠనం, లంచ్ టైమ్ కునుకుపాట్లతో గడిచిపోయేది. సాయంత్రం ఐదు దాటినదగ్గరనుండీ స్టాఫ్ అంతా ఒక్కొక్కరూ మెల్లగా ఇళ్ళకు జారుకునేవారు. లయొజన్ ఆఫీసర్  బావా, IAS గారి నివాసం కూడా అడయార్ లోనే. కుటుంబం వుండేది కాదు. ఒంటరిగా ఒక గెస్ట్ హౌస్ లో వుండేవారు. మనిషి పొడుగ్గా ఏదో అనారోగ్యంతో వున్నట్లు కనపడేవాడు. ఆయన ఆహారం ముప్పొద్దులా బ్రెడ్, గ్రేప్స్, ఆపిల్స్,ఆరెంజ్ లు తోనే గడిపేవాడు. అప్పుడప్పుడు నన్ను తన రూమ్ కి పిల్చి అక్కడ లెటర్స్ డిక్టేట్ చేసేవాడు. ఆయనా ఆ ఆఫీస్ లో ఎక్కువ రోజులు పనిచేయలేదు. ట్రాన్స్ఫరై వెళ్ళిపోయాడు. Men may come,men may go, but the institutions remain the same. మాలాటివాళ్ళు మాత్రం మరో గత్యంతరం లేక అలాటి ఆఫీసులను పట్టుకు వేళ్ళాడుతుంటారు.

ఒక రోజు ఆఫీసులో పని వుండి సాయంత్రం ఇంటికి బయల్దేరడం ఒక గంట లేటయింది. సైదాపేట బ్రిడ్జి దాటి జయరాజ్ థియేటర్ దగ్గరకు వచ్చేసరికి బాగా చీకటిపడి రోడ్ లైట్లు వెలిగించేసారు. నేను సైదాపేట పోలీసు స్టేషన్ ప్రాంతానికి వచ్చేసరికి ఒక ట్రాఫిక్ పోలిస్ అటకాయించాడు. సైకిల్ కు లైట్ లేదని ఫైన్ కట్టమన్నాడు. ఇప్పుడే కదా లైట్లు వేసారు. మరో పావుగంటలో ఇంటికివెళ్ళిపోతానంటాను నేను. సైకిల్ కు వెనకవేపుండే రెడ్ షేడ్ లేదని మరో అభియోగం. అది కొన్ని రోజులముందే ఏ గోడకో కొట్టుకొని ముక్కలైపోయింది. కొత్తది వేయించడానికి బధ్ధకించడంతో ఆ రోజున పోలీస్ కు బలైపోయాను. సాధారణంగా ఆరు లోపల ఇంటికి చేరుకోవడం వలన ఈ సైకిల్ లైట్, వెనక రెడ్ షేడ్ గురించి ఎవరూ పట్టిచ్చుకునేవారు కాదు. బీట్ కాన్స్టేబుల్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ లో పెట్టేసి ఓ రెండురోజుల తర్వాత ఫైన్ కట్టేసి సైకిల్ ను తీసుకుపొమ్మన్నాడు. ఎంత బ్రతిమాలినా కనికరించలేదు. బహుశా చేయి తడిపితే వదిలేసేవాడేమో! అందుకు నేను సిధ్ధంగా లేనే. సైకిల్ అక్కడ వదలేసి అడయార్ నుండి వచ్చే 47A. బస్ పట్టుకొని పానగల్ పార్క్ దగ్గర దిగి మెల్లగా ఇంటికి చేరుకున్నాను.

ఆ మర్నాడు ఆఫీసుకు బస్ లో వెళ్ళవలసి వచ్చింది. పానగల్ పార్క్ దగ్గరకు వచ్చేసరికి 12B స్టాపింగ్ దగ్గర గతంలో కనపడ్డ తెలుగాయన మళ్ళీ కనపడ్డారు. ఆయనతో మా ఆఫీస్ లో పనిచేసే జ్యోతిషం  గోపాలకృష్ణ ఏదో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళను దాటుకొని రామకృష్ణా స్కూల్ స్టాపింగ్ కు నడిచాను. నేను వెళ్ళిన కాసేపటికి గోపాలకృష్ణ కూడా నేనున్న బస్ స్టాప్ దగ్గరకే వచ్చారు. ఆ తెలుగాయన గురించి ఈ తెలుగాయనను అడిగాను. ఆయనపేరు సూర్యప్రకాశరావు గారని, ఆలిండియా రేడియో లో పనిచేస్తున్నారని చెప్పారు. అయితే మరో సంగీతం మనిషన్నమాట అని అనుకున్నాను. అప్పుడప్పుడు బస్ స్టాప్ ల దగ్గర కలుసుకున్నా వయోభేదం చేత ఆయనతో నాకు పరిచయం పెరగలేదు. కానీ దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత మా రెండో చెల్లెలు మామగారిగా శ్రీ కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారితో పరిచయం ఏర్పడింది. వారి మరో అబ్బాయి రాజేశ్వరశర్మగారే  పానగల్ పార్క్ దగ్గరవున్న  నియో కమర్షియల్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ లో  నాకు సహాధ్యాయి. నేను శ్రీ సూర్యప్రకాశరావుగారితో స్వయంగా వారింటివద్ద  మాట్లాడింది 1994 లో నేను హైదరాబాద్ కు ట్రాన్సఫర్ మీద వెళ్ళినప్పుడే. మనుషుల మధ్య స్నేహాలు, అనుబంధాలు చాలా చిత్రంగా అనూహ్యంగా ఏర్పడతాయి.

🌺🌿🌺


తిరుపతి వేంకటేశ్వర స్వామివారికి పరమ భక్తుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారు.  పౌరాణిక సినీమాలలో వచ్చే దైవ సంబంధమైన గీతాలెన్నింటికో ఘంటసాలవారు ప్రాణప్రతిష్టచేశారు. వారి కంఠంలోని మాధుర్యం, భావం, భక్తితత్పరతల వలన  అనేక భక్తిగీతాలు ప్రజా బాహుళ్యంలోనికి చొచ్చుకుపోయాయి. అనేకమందికి దేవుడిపట్ల భక్తివిశ్వాసాలు ఏర్పడ్డాయి. వివిధ దేవతామూర్తులమీద ఘంటసాలవారు పాడినన్ని భక్తి గీతాలు, పద్యాలు, శ్లోకాలు, అంత సార్ధకంగా మరే గాయకుడు పాడివుండరు. 

1960ల తర్వాత తిరుపతి వెంకటేశ్వరుడి మీద ఘంటసాలవారు వెలువరించిన గ్రామఫోన్ రికార్డులు పల్లె పల్లెలలా, పట్టణాలలో, నగరాలలో, మహానగరాలలో, విదేశాలలోని తెలుగువారందరికీ  దైవప్రార్ధనా గీతాలు అయినాయి. HMV గ్రామఫోన్ కంపెనీ వారికి విపరీతమైన ప్రచారాన్ని, ధనాన్ని సంపాదించిపెట్టాయి.

తెలుగునాట గల ప్రతీ సినీమా హాలు వాళ్ళు మూడాటలకు  ముందుగా ఘంటసాలవారు పాడిన 'ఏడు కొండలా సామి', 'నమో వెంకటేశా' పాటలను విధిగా వినిపించిన తర్వాతే తమ టిక్కెట్ కౌంటర్లు తెరిచేవారు. అదొక సంప్రదాయంగా, సదాచారంగా మారింది. ఆ తర్వాతే మిగిలిన పాటలను లౌడ్ స్పీకర్లలో వినిపించేవారు. ఘంటసాలవారి భక్తిగీతాలు తెలుగువారిని అంత ప్రభావితులను చేశాయి. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యంలో ఘంటసాలవారు తెరమీద కనిపిస్తూ పాడిన ఏకాంతసేవా గీతం 'శేషశైలా వాసా' రంగుల రాట్నంలోని 'నడిరేయి ఏ జాములో' పాటలు తెలుగు హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు.

తిరుపతి వెంకన్న మీద ఘంటసాల పాడిన - 'ఏడు కొండల సామీ', 'నమో వెంకటేశా', 'వేంకటేశ్వర సుప్రభాత పద్యాలు', 'వేంకటేశ్వరుని బుర్రకథ', 'తీయని వెంకని నామామృతం', 'వెంకన్న నామమే భక్తితో కొలిచితే,' 'జయ జయ జయ శ్రీ వేంకటేశా', 'శేషాద్రి శిఖరానా', 'తిరువెంకటాధీశ జగదీశా', 'నీ కొండకు నీవే రప్పించుకో ' 'భువనమోహన నిను పొడగన్న కనులతో'', భక్త జయదేవుని అష్టపదులు, తన జీవిత చరమాంకంలో ఆలపించిన తాత్పర్య సహిత భగవద్గీత  ఘంటసాలవారి భక్తి సంగీతానికి అజరామరత్వం కల్పించాయి.  భక్తికి, ముక్తికీ ఘంటసాల గాన శ్రవణమే పరమావధిగా ప్రతీ తెలుగువారూ భావించారు.



ఘంటసాల, జలసూత్రం, దేవులపల్లి, యామిజాల



అటువంటి గానగంధర్వుడిని తిరుపతి వేంకటేశ్వరుడు కరుణించాడు. తన ఏడుకొండలలో ఘంటసాల భక్తిగానం నిరంతరం  ప్రతిధ్వనింపజేస్తూ  తనను చేరవచ్చే భక్తుల అలసటను, అలసత్వాన్ని తొలగించే దివ్యౌషధంగా వరం ప్రసాదించాడు. అంతేకాదు, ఎంతటి పుణ్యమో చేసుకుంటే తప్ప సామాన్యులెవ్వరికీ లభించని పదవిని, తన ఆస్థాన గాయక పదవిని ఘంటసాలవారికి లభించేలా ఆ శ్రీనివాసుడు అనుగ్రహించాడు. తిరుమల- తిరుపతి దేవస్థానం వారు ఘంటసాలవారిని తమ ఆస్థాన గాయకునిగా నియామకం చేసి ఆ భక్తగాయక శిఖామణిని సముచితంగా గౌరవించారు. మూడేళ్ళపాటు అపురూపమైన స్వామివారి సన్నిధిలో గానం చేసే అదృష్టాన్ని ఘంటసాలవారికి కల్పించారు. టి.టి.డి.వారి అత్యున్నత ఆస్థాన గాయక పదవిని పొందిన తొలి లలిత/ సినీమా సంగీత గాయక శ్రేష్టుడు ఘంటసాలవారు. ఇంతకు మించిన ఉన్నత స్థానాన్ని, పదవిని ఏ మానవమాత్రుడు ఇవ్వగలడు? ఇచ్చినా భగవంతుని వరప్రసాదంతో సమానమౌతుందా ? ఘంటసాలవారి సంగీత విద్య, గాన ప్రతిభ సార్ధకత చెందాయి. ధన్యజీవి ఘంటసాల.

తన ఆరాధ్యదైవం తిరుపతి వేంకటేశ్వరుని కరుణా కటాక్షాలతో తన సదాశయాలన్నీ సిధ్ధించాలని నూతనోత్సాహం తో ముందడుగు వేసారు ఘంటసాల. కొత్తగా అజంతా మూవీస్ వారి 'మెరుపువీరుడు', శ్రీ గౌతమీ పిక్చర్స్ వారి 'ఆలీబాబా 40 దొంగలు', రామవిజేతా వారి 'తల్లిదండ్రులు', గిరిధర్ ప్రొడక్షన్స్ వారి 'రెండు కుటుంబాల కధ', రాజ్యం ప్రొడక్షన్స్ వారి 'రంగేళీ రాజా'  తో పాటూ మరో రెండు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేయడానికి ఒప్పుకున్నారు.

ఆ చిత్ర గీతాల విశేషాలు వచ్చేవారం ... అంతవరకూ...

                ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.