visitors

Sunday, July 25, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఒకటవ భాగం

25.07.2021 -  ఆదివారం భాగం - 41*:
అధ్యాయం 2 భాగం 40  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"అందరూ పది కాలాలపాటు పచ్చగా, చల్లగా వుండాలి"; "పది కాలాల పాటు నే పాడిన పాటలు ప్రజల హృదయాలలో నిలిచిపోవాలి"; "ప్రజాభిమానంతో పదికాలాల పాటూ పాడుతూనే వుండాలి"; "పాడగలిగినంత కాలమే బ్రతికి వుండాలి". ఈ "పది కాలాల పాటు" అనే మాట తరచూ  ఘంటసాలవారి సంభాషణలలో దొర్లేది. 

ఒక్క ఆయుర్దాయం విషయంలో తప్ప మిగిలినవి మాస్టారు కోరుకున్నవి నెరవేరాయి. ఘంటసాలవారి దేవగానం శతాధిక వర్షాలు ప్రజల చెవులలో మార్మోగుతూనే వుంటాయి. కాలానికి కనీసం పది సంవత్సరాలు చొప్పున పది కాలాలకు పది పదులు నూరు సంవత్సరాలైనా వారు మన మధ్యలో వుండివుండాల్సింది. కానీ ఆ భగవంతుడు ఈ లోకంలో సగం ఆయుర్దాయమే యిచ్చి ఇక నిరంతరం నా సమక్షంలోనే గానం చేయమని తీసుకుపోయాడు.

ఘంటసాల అనే గాన గంధర్వుడు మన కోసం పాడింది సుమారు నాలుగు దశాబ్దాలే అయినా అనిర్వచనీయమైన అనుభూతిని మనకు మిగిల్చి వెళ్ళిపోయారు. 

1967 లో ఘంటసాల మాస్టారు పాడిన అజరామర గీతాలెన్నో. అవి స్వీయ సంగీతంలో కావచ్చు, లేదా ఇతర సంగీత దర్శకులకు కావచ్చు, ఏక గళం కావచ్చు, యుగళం కావచ్చు లేదా బృందగానాలు కావచ్చు. ఆ పాటలన్నీ ఈ నాటివరకు మనలో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. కొన్ని పాటలు గిలిగింతలు పెట్టి కవ్విస్తాయి. మరికొన్ని ఉదాత్తమై మనలో ఆలోచనలు రేకిత్తిస్తాయి. మరెన్నో పాటలు లాలించి, బుజ్జగించి జోకొడతాయి. ఒక గాయకుడు ఇన్ని రకాలుగా ప్రజా హృదయాలలో ఇన్ని కాలాలపాటు నిలిచిపోవడమనేది ఘంటసాలగారి వంటి దైవాంశసంభూతులకే సాధ్యం. స్థలాభావం వలన అన్నీ కాకపోయినా కొన్నిటిని, (గత వారాలలో తలచుకున్నవి కాకుండా) ఘంటసాలవారు 1967 చిత్రాలలో పాడిన పాటలు నా మనస్సుకు హత్తుకుపోయినవి మీ ముందు వుంచుతున్నాను. 

'గృహలక్ష్మి' లో భానుమతి గారితో పాడిన పాట 'వినవే ఓ ప్రియురాలా';

ఉమ్మడి కుటుంబం - సుశీలగారితో ' చెప్పాలని వుంది';
ఆ సినీమాలోనే తిలకం, మాధవపెద్దిలతో పాడిన సతీ సావిత్రి, లంకా దహనం  నాటకంలో పద్యాలు. వీధి నాటకాలు, వీధి భాగవత ప్రక్రియలలో ఘంటసాల మాస్టారికి గల పరిపూర్ణ అవగాహన మనకు తెలుస్తుంది.

'ప్రాణమిత్రులు' - సుశీల గారితో 'ఈ పాపం ఫలితం ఎవ్వరిది'

'చదరంగం' - ' బంగరు బొమ్మ సీతమ్మా';  అందులోనిదే మరో పాట సుశీల గారితో 'నవ్వని పువ్వే నవ్వింది';

'సరస్వతి శపధం' - 'రాణి మహారాణి రాశి గల రాణి'; 'విద్యయా, విత్తమా, వీరమా';

'భామా విజయం' - సుశీలగారితో ' రావే చెలీ నా జాబిలీ'

'మరపురాని కథ' - 'నూటికొక్క మనసే కోవెల'

'పెళ్ళంటే భయం' -  సుశీల గారితో ' చంద్రోదయం ఒక పిల్లయినదో'; 

'అగ్గిదొర' లో' సుశీల గారితో 'ఎందున్నావో ఓ చెలీ';




'పూలరంగడు' లో - ' నీతికి నిలబడి'; 'వినరా భారత వీరసోదరా' బుర్రకధ;

'ఆడపడుచు' లో పద్మనాభానికి పాడిన 'రిక్షావాలాను నేను పక్షిలాగ';

అల్ట్రా మోడర్న్ సినీమా 'అవే కళ్ళు' లో' - 'మా వూళ్ళో ఒక పడుచుంది'; ' ఎవరు నీవారో తెలుసుకోలేవో'; 'ఎంతటి అందం విరిసే ప్రాయంలో'; 'ముద్దులొలుకు చిన్నది'

(ఈ చిత్రంలోని పాటలను, తర్వాత వచ్చిన మరికొన్ని చిత్రాలలోని పాటలను ఘంటసాల మాస్టారు కొంత అయిష్టతతోనే పాడారు. రికార్డింగ్ ముగిసి ఇంటికి రాగానే ఆ పాటల కాగితం చివరను రెండు వేళ్ళతో  పట్టుకొని సావిత్రమ్మగారికి అందించిన తీరు నాకెందుకో బాగా గుర్తుండిపోయింది.   ట్రెండ్ మారుతోందని సినీమా సంగీతంలో, సాహిత్యంలో మార్పులొస్తున్నాయని బాధపడేవారు. ఈ రకమైన పాటలు కొత్త గాయకులు చేత పాడిస్తే బాగుండునని అనేవారు.);

'చిక్కడు దొరకడు' - పిబి శ్రీనివాస్ గారితో 'ఔరా వీరాధివీరా'; సుశీల గారితో 'పగటిపూట చంద్రబింబం';  విడతోనే మరో డ్యూయెట్ 'దోర నిమ్మపండులాగా' వంటి పాటలు మనకింకా వీనులవిందు చేస్తూనే వున్నాయి.



ఆ సంవత్సరంలోనే వచ్చిన మరో మహత్తర పౌరాణిక చిత్రం - 'శ్రీకృష్ణావతారం' - గాయకుడిగా ఘంటసాలవారి విశ్వరూప దర్శనం ఈ చిత్రంలో కలుగుతుంది. దాదాపుగా నలభై వరకు పాటలు, పద్యాలు, శ్లోకాలు గల ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ఘంటసాల మాస్టారిదే. 'జయహే కృష్ణావతారా'; 'నీ చరణ కమలాల నీడయే చాలు';  'జగములనేలే గోపాలుడే'; వంటి యుగళగీతాలు వైవిధ్యం తో కూడిన పాటలు.


'తాళలేనే నే తాళలేనే ' అనే కూచిపూడి దరువు వింటూవుంటే నిజంగా కూచిపూడి భాగవతులే వచ్చి పాడుతున్న అనుభూతిని ఘంటసాలవారు కలిగించారు. కూచిపూడి శైలి పట్టు, విరుపులు వారి కంఠంలో చాలా ఖచ్చితంగా ఒదిగిపోయాయి. ఏ ప్రక్రియను చేపట్టినా అది వారికే సొంతం అనే భ్రమను ఒక్క పామరుల్లోనే కాక సంగీతపు లోతుపాతులు తెలిసిన రసజ్ఞులలోనూ కలిగించిన అపూర్వ గాయకుడు మన ఘంటసాల.

శ్రీకృష్ణావతారం చిత్రంలో ప్రముఖ పాత్ర పద్యాలదే. అందుకుగాను తిరుపతి వెంకటకవులు వ్రాసిన 'పాండవోద్యోగవిజయాలు' నాటకంలోని పద్యాలనే ఉపయోగించారు. పాండవోద్యోగవిజయాలు రంగస్థల నాటకం తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సినీమాలు అభివృద్ధి చెందడానికి ముందు తెలుగువారిని అత్యంత ప్రభావితులను చేసింది పౌరాణిక నాటకం , పౌరాణిక నాటక నటులే. మరాఠీ రంగస్థల బాణీనే ఎక్కువగా అనుకరించేవారు. తిరుపతి వెంకట కవుల నాటక పద్యాలు చదవని తెలుగువాడే ఉండేవాడు కాదు. ఘంటసాల రంగప్రవేశం చేసేవరకూ నాటక నటులే సినీమాలలో కూడా ఆయా పాత్రలు ధరించి రంగస్థల నాటకశైలిలోనే పద్యాలు చదివేరు. ప్రజలంతా కూడా తన్మయులై విన్నారు. ఎప్పుడైతే ఘంటసాల నోట నవ్యత్వంతో కూడిన శ్రావ్యమైన, భావయుక్తమైన పద్యం వెలువడిందో అప్పటినుండి నవశకం ఆరంభమయింది. అదే ఘంటసాల యుగం. ఘంటసాల పాట పాడినా, పద్యం పాడినా, హరికథ చెప్పినా, బుర్రకథ చెప్పినా, కూచిపూడి దరువులు పలికినా అది అద్వితీయంగా, అప్రతిహతంగా తెలుగువారిని పరవశులనుజేసింది. ఘంటసాలకు ప్రత్యమ్నాయ గాయకుడు లేడు, రాబోడు అనే ఖ్యాతిని ఘంటసాల మూటకట్టుకున్నారు.

అందుకే, శ్రీకృష్ణావతారం వంటి భారీ పౌరాణిక చిత్రంలోని ముఖ్యమైన పద్యాలన్నీ కోరి మరీ ఘంటసాలవారిని వరించాయి. 

శ్రీకృష్ణావతారం చిత్ర నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్యగారు. ఎన్.టి.రామారావుగారి బావమరది. గతంలో నర్రా రామబ్రహ్మంగారితో కలసి 'మహామంత్రి తిమ్మరుసు' వంటి బ్రహ్మాండమైన చారిత్రాత్మక చిత్రం నిర్మించి చరిత్ర సృష్టించారు. ఆ చిత్ర విజయంలోనూ ఘంటసాలవారికి భాగస్వామ్యం వుంది.

పుండరీకాక్షయ్యగారు స్వయంగా మాస్టారింటికి వచ్చి తాను సొంతంగా 'శ్రీకృష్ణావతారం' చిత్రం నిర్మిస్తున్నానని అందులో సంగీతానిదే, ముఖ్యంగా, పద్యాలదే ప్రముఖ పాత్రయని, ఆ ప్రముఖ పాత్రను మాస్టారే వహించాలని కోరారు. ఆయన మాస్టారి కాల్షీట్లు అడిగిన సమయానికి మాస్టారికి కొంచెం జలుబు చేసి గొంతు సరిలేకుండా వుంది. అందువలన ఆ డేట్స్ లో కాక మరికొన్నాళ్ళ తర్వాత ఆ పద్యాలన్నీ బాగా రిహార్స్ చేసి మొత్తం పాటలు, పద్యాలన్నింటిని అత్యద్భుతంగా నభూతో నభవిష్యతి అనే రీతిలో రెండు మూడు కాల్షీట్లలో  పాడి ముగించారు. ఈ చిత్రం క్లైమాక్స్ లోని భగవద్గీత ను శ్లోకరూపం లో కాక వచనంగా (తనువుతో కలుగు బాంధవ్యమ్ములెల్ల) ఘంటసాలవారు గంభీరమైన కంఠస్వరంతో పలుకుతూంటే ప్రేక్షకులు తన్మయులయ్యారు.




అలాగే కృష్ణరాయబారం సీన్ లో ని పద్యాలు వింటూంటే ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ గారా లేక  ఘంటసాల గారా అనే అనుమానం వస్తుంది. అంతలా ఆయన తదాత్మ్యం చెంది ఆ పద్యాలను ఆలపించారు. తిరుపతి వెంకటకవులు వ్రాసిన ఈ పద్యాలన్నీ ఘంటసాల సృష్టించిన పద్యాల బాణిలోనే స్వరపర్చారు టి.వి.రాజు. ఎక్కడా పాతకాలపు రంగస్థల నాటక పద్య బాణీ వినపడదు. సంగీత నిర్వహణ టి.వి.రాజుగారు చేపట్టారు. చిత్రంలో గల దాదాపు ముఫ్ఫై పద్యాలు, శ్లోకాలలో ఇరవై ఘంటసాలవారి కంఠం నుండే వెలువడ్డాయి.

తర్వాతి కాలంలో ఘంటసాల పద్యాలు లేని  అనేక పౌరాణిక చిత్రాలు కొన్ని వచ్చాయి. కానీ ఈ సినీమాలన్నింటిలోనూ ఘంటసాల లేని లోటు కొట్టచ్చినట్లు కనపడింది. ఎందరిచేతనో పద్యాలు పాడించ ప్రయత్నించారు. కానీ  ఘంటసాల లేని లోటును భర్తీ చేసే గాయకులు మరి కానరారు. ఘంటసాలవారితోనే తెలుగు సినిమాలలో పద్యమూ అంతరించింది.

🌿🌺🌿


ఘంటసాలవారికి తీరిన కోరికలతో పాటూ తీరని కోరికలు కూడా ఎన్నో. అందులో ప్రధానమైనవి - దేశవ్యాప్తంగా కర్ణాటక సంగీత కచ్చేరీలు చేసి తాను విజయనగరంలో నేర్చుకున్న సంగీతవిద్యకు సార్ధకత చేకూర్చుకోవాలనే కోరిక వుండేది. అయితే సినీమాలలో పాడుతున్నంతకాలం కచేరీ బాణికి అలవాటు పడితే ఒకదాని ప్రభావం మరొకదానిపై పడే ప్రమాదముందనే అభిప్రాయం వారికివుండేది. ఏకకాలంలో జోడు గుర్రాల మీద స్వారి చేసే ఉద్దేశం వారికి లేదు. సినిమా సంగీతరంగం నుండి పూర్తి విశ్రాంతి తీసుకున్నాక శాస్త్రీయ సంగీత కచ్చేరీల మీద దృష్టి సారించాలనే తపన వుండేది. 

అలాగే, తన పేరు మీద సంగీత కళాశాలలు నిర్మించి అందులో క్రమ పధ్ధతిలో సిలబస్ రూపొందించి లలిత సంగీతానికి ప్రాధాన్యత కల్పించాలని ఆశించారు. ముందుగా తిరుపతిలో ఒక సంగీత కళాశాల నిర్మించాలని తలిచారు. తిరుపతిలో అలిపిరికి సమీపంలో  రోడ్ కు ఎడమవైపు కొన్ని కుంటల స్థలం కొన్నారు. అదే సమయంలో మా నాన్నగారు కొంత స్థలం కొనడం జరిగింది. కానీ ఇరువురి ఆశయం తీరలేదు. సరైన రక్షణ లేక చెట్లు చేమలతో నిండిన ఆ స్థాలాలను  నేను కూడా ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు చూశాను. ఇద్దరి స్థలాలు కూడా తర్వాత ఎప్పుడో  హరించుకుపోయాయి.

ఘంటసాల మాస్టారికి ఆరు ఋతువుల మీద ఒక వాద్యసంగీత దృశ్య రూపకాన్ని నభూతో నభవిష్యతి అనే రీతిలో తయారు చేసి భారతీయ సంగీత వైశిష్ట్యాన్ని విదేశాలలో చాటిచెప్పాలని  ఆశించారు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులలో ప్రకృతి ఎలా వుంటుంది; మానవులు జంతువులు ఎలా సంచరిస్తారు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఋతువుకు పదిహేను నిముషాల చొప్పున ఆయా ఋతువులకు అనుగుణ్యమైన రాగాలతో పూర్తిగా భారతీయ వాద్యసంగీతం సమకూర్చి వాటికి సినెమేటిక్ సౌండ్ ఎండ్ లైట్ ఎఫెక్ట్స్ జతపర్చి బ్రహ్మాండంగా 'ఋతు సంగీతాన్ని' రూపొందించాలని భావించారు. ఆ విషయంగా మా నాన్నగారితో కూడా  అప్పుడప్పుడు ముచ్చటించేవారు. ఆ కోరిక కూడా తీరలేదు.

ఈ కోరికలన్నీ నెరవేరకపోవడానికి కారణం సినీమా పాటలు; స్వీయ సంగీత దర్శకత్వం; కచేరీలు; మ్యుజిషియన్స్ యూనియన్ భాధ్యతల  మధ్య తగినంత సమయం లభించకపోవడమే కారణమని నాకు అనిపిస్తుంది. దానికి తోడు అప్పుడప్పుడు కలిగే అనారోగ్యం కూడా మరొక కారణమై తాను చేపట్టిన కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రధ్ధవహించలేకపోయేవారు.

చివరగా ఒక చిన్న విషయంతో ఈ భాగం ముగిస్తాను.

💥కొసమెరుపు💥

నిత్య కార్యక్రమాల ఒత్తిడి భరించలేక కనీసం ఒక వారమైనా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఘంటసాల మాస్టారు భావించారు. కానీ ఇంటివద్ద ఆ విశ్రాంతి తీసుకుందామన్నా ఎవరో ఒకరు  వచ్చి ఇబ్బంది కలిగించారు. ఇక ఇది మార్గంకాదని ఒక్క సావిత్రమ్మగారికి మాత్రమే చెప్పి కెథెడ్రల్ రోడ్ లో మ్యూజిక్ అకాడమీ పక్కనున్న న్యూ ఉడ్ ల్యాండ్స్ హోటల్ లో ఒక కాటేజి తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. మిగతావారికి ఎవరికీ తెలియదు. సాయంత్రం సమయాలలో అమ్మగారు పిల్లల్ని తీసుకొని హోటల్ కు వెళ్ళేవారు. ఆవిడ మాస్టారి దగ్గర కూర్చొని  మాట్లాడుతూంటే మేము పిల్లలందరం పక్కనున్న రెస్టారెంట్ నుండి తెప్పించిన స్నాక్స్ ను లాగిస్తూ, సరదాగా కాటేజ్ ముందునున్న  చల్లటి చెట్లక్రింద కాలక్షేపం చేసేవాళ్ళం. ఆనాటికి చోళా షెరాటన్లు, సవేరా, తాజ్ కోరమండల్ వంటి స్టార్ హోటల్స్ రాలేదు. ఉన్నవాటిలో డీసెంట్ గా ప్రశాంతంగా వుండే పెద్ద హోటల్ న్యూ ఉడ్ ల్యాండ్స్ హోటలే. రాయపేటలో ఒల్డ్ ఉడ్ ల్యాండ్స్ వుండేది. తర్వాత ఆ స్థానంలో  ఉడ్ ల్యాండ్స్ సినిమా ధియేటర్ వచ్చింది. ఈ న్యూ ఉడ్ ల్యాండ్స్ హోటల్ మాత్రం బాగా నడుస్తోంది.

ఇలా ఘంటసాల మాస్టారు ఒక రెండు రోజులు ప్రశాంతంగా హోటల్ కాటేజ్ లో వుంటూ ఆ సమయాన్ని తన పాటల కంపోజింగ్ కు వినియోగించున్నారు. ఘంటసాలగారు ఉడ్ ల్యాండ్స్ లో రెస్ట్ లో ఉన్నారనే విషయం ఎలాగో బయటకి వచ్చింది. ఒక్కొక్క సినిమా కంపెనీవాళ్ళు వరసగా మాస్టారు దగ్గరకు వచ్చి చాలా మంచి పనిచేసారని అభినందిస్తూనే హీరో హీరోయిన్ ల డేట్లు కుదిరాయని అర్జంట్ గా పాట షూటింగ్  ముగించక తప్పదని, ఎలాగైనా  తమకు మాత్రం పాడిపెట్టమని ఒత్తిడి చేస్తూ రికార్డింగ్ డేట్లను అడిగి తీసుకోవడం మొదలెట్టారు.  మళ్ళీ రికార్డింగ్స్ కు, రిహార్సల్స్ కు వెళ్ళక తప్పలేదు. ఈ మాత్రం భాగ్యానికి హోటల్ రెంట్ దండగ కూడా ఎందుకని ఒకరోజు సాయంత్రం ఇంటికి చక్కా వచ్చేసారు. 

సినీమా రంగంలో ఒక అంతస్థుకు చేరాక  ఉన్న స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలను కూడా కోల్పోతారు. 

💐


మరికొన్ని విశేషాలతో... వచ్చే వారం...
                        ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, July 18, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభైయవ భాగం

18.07.2021 - ఆదివారం భాగం - 40*:
అధ్యాయం 2  భాగం 39 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నెం.35, ఉస్మాన్ రోడ్ ఆర్చ్ గేటు, కాంపౌండు వాలు లోపల గేటు పక్కనుండే తంగేడు చెట్లు, గేటు లోపలి పోర్టికో, పదమూడు పధ్నాలుగడుగుల సిమెంట్ అరుగు, డార్క్ గ్రీన్, బ్లాక్, వైట్ కలసిన మార్బుల్ ఫ్లోరింగ్ వరండా, దానిమీద ఒక పొడుగాటి కర్రబల్ల, రెండు పేము కుర్చీలు వీటితోనే నా చిన్నతనం గడిచింది. ఈ పరిసరాలలోనే ఎంతోమంది వ్యక్తులతో కొద్దో గొప్పో పరిచయాలు ఏర్పడ్డాయి. వారందరివల్ల ఎన్నో విషయాలు అవగాహనకు వచ్చాయి. మా బొబ్బిలి తాతగారింటి ఆశ్రమవాస జీవితానికి అలవాటు పడిన నేను ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడేవాడిని, ఇప్పటికి కూడా. అందుచేత మా ఔట్ హౌస్ లో మా పిల్లల మధ్యకన్నా బయట పోర్టికోలోనే ఒంటరిగా గడిపేవాడిని. ఉదయం ఎనిమిది తర్వాత ఘంటసాల మాస్టారు బయటకి వెళ్ళగానే వీధి తలుపు మూసివేసి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయేవారు. తిరిగి మాస్టారి డ్రైవర్ గోవింద్ మ్రోగించే కారు హారన్ విన్న తర్వాతే మళ్ళీ తలుపు తెరిచేవారు. ఆ మధ్యకాలంలో, నేను ఇంట్లో వుంటే, ఆ  పోర్టికో వరండా మీదే ఏవో పుస్తకాలతో గడిపేవాడిని. లేదా రోడ్ మీద వచ్చీపోయే జనాలను గమనించేవాడిని. అందులో కొత్తవాళ్ళు వుండేవారు, పరిచయస్తులు వుండేవారు. వారిలో కొందరు గేటు బయటి గోడమీది 'ఘంటసాల' నేమ్ బోర్డ్ చూసి  నా వేపు చేయి ఊపేవారు, ఎందుకో, మరి.

అలా బయట వరండాలో కూర్చొని ప్రకృతిలో లీనమయేవేళ తరచూ మా ఎదురు ప్లాట్ ఫారమ్ మీదనుండి వెళుతూ ఇద్దరు పిల్లలు కనిపించేవారు. వారెవరో నాకు తెలియదు. అక్కా తమ్ముళ్ళు. చాలా సన్నగా, పొడుగ్గా వుండేవారు. ఆ రోజుల్లో ప్రతీవాళ్ళు నాకంటే పొడుగే అనిపించేది. ఆ అక్క చాలా జాగ్రత్తగా తమ్ముడి చేయిపట్టుకొని నడిపించి తీసుకువెళ్ళడం నాకు ఆసక్తి కలిగించిన విషయం. బజుల్లారోడ్ వేపు నుండి వస్తూండేవారు. ఒకరోజు ఒక సినీమా పత్రికలో ఈ అమ్మాయి ఫోటో చూసాను 'నాగిని'డాన్స్ కాస్ట్యూమ్స్ లో.  పేరు సురేఖ. శ్రీ రాజేశ్వరీ కళానికేతన్  ఆధ్వర్యంలో శాస్త్రీయ, జానపద నృత్య కార్యక్రమాలకు సంబంధించిన ఒక చిన్న పాంప్లెట్ పోస్టర్ లో. అంత సన్నగా వుండే పిల్ల డ్యాన్స్ చేస్తుందంటే నమ్మలేకపోయాను. తర్వాత ఒకసారి ఆ పిల్లలను మా నరసింగడికి చూపి అడిగితే చెప్పాడు, వాళ్ళు తెలుగువాళ్ళే, మన విజయనగరం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడినవారేనని.

అలా చిన్నప్పుడు చూసిన ఆ చిన్న కుర్రవాడు భవిష్యత్తులో ఘంటసాలవారింటి అల్లుడు అవుతాడని, మా కుటుంబానికి అతి సన్నిహిత మిత్రుడు అవుతాడని నేను కలలో కూడా ఊహించలేదు. అతనే మా సురేంద్ర. కొండూరు సురేంద్రకుమార్. కష్టాలలో వుండే స్నేహితులను, సన్నిహితులను ఆదుకోవడంలో ఎంతో అక్కర చూపించే గొప్ప సహృదయుడు. ఆనాడు నేను చూసిన అతని అక్క, ఆ సన్నపాటి చిన్న అమ్మాయి భవిష్యత్తులో ప్రసిద్ధ బాలీవుడ్ కోరియాగ్రాఫర్ గా రూపుదిద్దుకుంటుందని కూడా అప్పుడు నేననుకోలేదు. ఆమె, ఆమె భర్త చిన్ని ప్రకాష్ కూడా దేశంమంతా మెచ్చిన బాలీవుడ్ కోరియాగ్రాఫర్స్. ఎవరితో ఎప్పుడు ఎలాటి స్నేహాలు , బంధాలు ఏర్పడతాయో ఊహించలేము.

🍀🍀


అలా శెలవు రోజుల్లో పోర్టికోలోనో, గేటు బయటో నిల్చొని వచ్చేపోయే మాస్టారి అభిమానులకు, కోరస్ గాయకులకు తగిన సమాధానం చెప్పి పంపడంలో,  వారానికి ఒకసారైనా  కనిపించే హిస్ మాస్టర్స్ వాయిస్ (హెచ్.ఎమ్.వి.) పెరుమాళ్ తెచ్చే ఎర్ర లేబిల్, సరస్వతీ స్టోర్ వాళ్ళు తెచ్చే  నీలం లేబిల్ కొలంబియా గ్రామఫోన్ రికార్డులు, ముందుగా నేనే అందుకునేప్పుడు మహదానందంగా వుండేది. ఆ రికార్డులకు కట్టిన తెల్లటి ట్వైన్ దారపు ముడులను కష్టపడి విప్పి ఏ ఏ సినీమాలలో పాటలు వచ్చాయో, రెండుప్రక్కలా ఏ పాటలున్నాయో ముందుగా చూసి వాటిని మళ్ళీ ఆ దారంతో కట్టి జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకుపోయి అమ్మగారి (సావిత్రమ్మగారు) చేతికి అందించేవాడిని. ఆవిడ వాటిని చూసి "మధ్యాహ్నం అయ్యగారు వెళ్ళిపోయాక వేసుకుందాము" అని భరోసా ఇచ్చేవారు.  ఆ పాటలను వేసేప్పుడు గ్రామఫోన్ కు కీ ఇచ్చి, ముల్లుమార్చి ఆ రికార్డులు పెట్టి వినడంలో ఒక చిన్నపాటి థ్రిల్. 


ఘంటసాల మాస్టారు తాను పాడవలసిన తమిళమో, హిందీయో డబ్బింగ్ సినీమాల కోసం, లేదా ఏవైనా కచేరీల కోసం కొత్తపాటల నొటేషన్స్ కోసం మాత్రమే  గ్రామఫోన్ తెరిచేవారు. మిగతా  ఇంట్లోవాళ్ళం మాస్టారి పాటలు వినేది వారు ఇంట్లోలేని సమయంలోనే. తన పాటలు తాను వినేంత సమయం కాని, ఆసక్తికాని మాస్టారికి వుండేవికావు. రాత్రిపూట ఎప్పుడైనా ఢిల్లీ రేడియో నుండి వచ్చే అఖిల భారత సంగీతకార్యక్రమాలు మాత్రం వినేవారు. 


నెం.35, ఉస్మాన్ రోడ్ కు  మూడు పూటలా పోస్ట్ మేన్ వచ్చేవాడు. అప్పట్లో రోజుకు మూడు పోస్టల్ డెలివరీలు వుండేవి. వచ్చినప్పుడల్లా చాలా ఉత్తరాలే వుండేవి. అందులో కొన్ని మా నాన్నగారికి. మిగిలినవి మాస్టారి ఫ్యాన్స్ వ్రాసినవి, ఇతర బంధువులనుండి వచ్చే ఉత్తరాలు.  వాటిని నేను తీసుకుంటే వెంటనే వాటిని సార్టౌట్ చేసి ఎవరివి వాళ్ళకు అందజేసేవాడిని. నేను 12th పాసయిన తర్వాత మాస్టారి ఫాన్స్ ఉత్తరాలకు  నాచేతే సమాధానం వ్రాయించేవారు. అలాగే, సావిత్రమ్మగారు, పాప పిన్నిగారు వారి అక్కచెల్లెళ్ళకు, బంధువులకు వ్రాసే ఉత్తరాల మీద ఎడ్రెస్ లు వ్రాసే పని నాదే. (నా దస్తూరి బాగుంటుందని వారి నమ్మకం). ఉత్తరాలను వెనకనుండి ముందుకు వ్రాయడంలో పాప పిన్నిగారు సిధ్ధహస్తులు. మహాస్పీడుగా వ్రాసేవారు. ఆ వ్రాత నేను కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను. వాటిని చదవాలంటే అద్దం సహాయంతోనే చదవవలసి వచ్చేది.

మాస్టారికి వచ్చే అధిక సంఖ్యాక ఉత్తరాలు మాస్టారి కొత్త సినీమా పాటలు విని ఆనందించామని ప్రశంసలు కురిపిస్తూ వెంటనే తర్వాతి లైనులో  మాస్టారి కార్డ్ సైజ్ ఫోటో పంపమని విన్నపాలు. ఉత్తరాలకు రిప్లై వెంటనే ఇచ్చేవాళ్ళం కానీ, ఫోటోలు వెంటవెంటనే పంపాలంటే కుదిరేది కాదు. ఫాన్స్ కోసం మాస్టారు తీయుంచుకున్న  ఫోటోలు అందుబాటులో వుండేవికావు. వాటిమీద ఆటోగ్రాఫ్ చేయడానికి ఘంటసాలగారు అందుబాటులో వుండేవారు కాదు. పనికట్టుకు తీయించిన వందా, రెండు వందల ఫోటో కాపీలు రెండు మూడు నెలలలోనే అయిపోయేవి. ఈ ఉత్తరాలు వ్రాసేవారిలో చాలమందికి - ఘంటసాల నెం.35, ఉస్మాన్ రోడ్, టి.నగర్, మద్రాస్-17 అని పూర్తి ఎడ్రస్ తెలిసేది కాదు. తెలుగులో కేవలం
'ఘంటసాల, మద్రాస్' అని వ్రాసేవారు. అయినా అవి కొంచెం లేటుగా మా ఇంటికి వచ్చిచేరేవి. మెయిన్ పోస్టాఫీస్ లో ఎవరో తెలుగు అడ్రస్ ను ఎర్ర ఇంక్ పెన్నుతో ఇంగ్లీషు లో వ్రాసి డెలివరీ చేసేవారు. 

🍀🌺🌿


మా నాన్నగారికి  తరచూ ఉత్తరాలు వచ్చేవి - సాలూరు/ టాటానగర్ నుండి మా ప్రభు చిన్నాన్నగారు, అరుణాచలం నుండి గుడిపాటి వెంకట చలం గారు,  ఒరిస్సా రాయఘడా నుండి పంతుల శ్రీరామశాస్త్రిగారు, ఒరిస్సా జయపూర్/ భద్రక్ ల నుండి భట్టిప్రోలు కృష్ణమూర్తిగారు, రౌర్కేలా నుండి మంథా రమణరావు గారిలాంటి  చిరకాల సాహితీ మిత్రులు  ఉత్తరాలు వ్రాసేవారు. వృత్తిపరంగా వీరంతా వేర్వేరు రంగాలకు చెందినవారు. శ్రీరామశాస్త్రిగారు  హైస్కూలులో మాస్టరు. కృష్ణమూర్తి గారు ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్విసెస్ లో ఉన్నతాధికారి. రమణరావు గారు రూర్కెలా స్టీల్ ప్లాంట్ లో పెర్సెన్నెల్ మేనేజర్ (ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్  అంటున్నారు). వీరేకాక మరో ముఖ్య స్నేహితుడి దగ్గరనుండి  వచ్చిన ఉత్తరాలను కూడా జాగ్రత్తగా పదిలపర్చేవారు. ఆయనే డా. డి.ఎన్. రావు (ద్వివేదుల నరసింగరావు). మా నాన్నగారి విజయనగరంలో చిన్ననాటి స్నేహితుడు. ఘంటసాలవారి తర్వాత మా నాన్నగారి విషయంలో అత్యంత శ్రధ్ధ చూపిన వ్యక్తి. ద్వివేదుల నరసింగరావుగారు విజయనగరం ఎమ్.ఆర్.కాలేజీలో లెక్చెరర్ గా పనిచేసేవారు. కాలేజీ స్టూడెంట్స్  ప్రేమతో ఆయనను 'దిలీప్ కుమార్' అని పిలుచుకునేవారు. 1953లో ఘంటసాలవారు తమ కుటుంబంతో విజయనగరం వచ్చినప్పుడు తమ ఇంట్లో విందు కూడా  ఏర్పాటు చేసారు. విజయనగరం మహరాజావారి స్కాలర్షిప్ తో అమెరికా విస్కన్సిన్ యూనివర్శిటీలో పి.హెచ్.డి. చేసారు. రావుగారి సతీమణి ద్వివేదుల విశాలక్షి గారు. ప్రముఖ నవలా రచయిత్రి. ఈ ఇద్దరికీ మా నాన్నగారంటే చాలా గౌరవం అభిమానం.  చివర వరకూ మా కుటుంబం పట్ల ఎంతో అక్కర కనపర్చినవారు. అక్కడ నుండి డా.డి.ఎన్.రావు ఢిల్లీలో  ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆ స్టాఫ్ కాలేజీ సమ్మర్ లో ముస్సోరీలోనూ, వింటర్ లో ఢిల్లీలోనూ ఆరేసి మాసాలకు మారుతూండేది. ఆ రెండు ప్రాంతాలనుండి మా నాన్నగారికి ఉత్తరాలు వచ్చేవి. అలాటి డి.ఎన్. రావుగారు మద్రాస్ లో సెటిల్  అవుతారనే వార్త మా నాన్నగారికి చాలా సంతోషం కలిగించింది.

యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇన్ ఇండియా (USEFI)  సదరన్ రీజన్ డైరక్టర్ పదవిలో డా.డి.ఎన్. రావు మద్రాసు వచ్చారు. అప్పటికి మద్రాస్ లో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పడలేదు. డి.ఎన్.రావుగారు చెట్పట్ హారింగ్టన్ రోడ్  లో ఓ పోష్ లొకాలిటిలో నివాసం ఏర్పర్చుకున్నారు. వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. విజయనగరంలో వుండేప్పుడు మా ప్రభు చిన్నాన్నగారు ఆ అమ్మాయికి వైలిన్ సంగీతం కొన్నాళ్ళు నేర్పేవారు. అప్పుడు ఒకటి రెండుసార్లు వాళ్ళింటికి వెళ్ళాను. అప్పటి నా వయసు ఎనిమిదేళ్ళు. వాళ్ళందరికీ మద్రాసు వాతావరణం కొత్త. ఎవరితో ఇంకా స్నేహాలు ఏర్పడలేదని మా నాన్నగారు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళమనేవారు. నాకు సహజంగా వుండే బెరుకుతనం, మొహమాటం వలన నాకు అంతగా చనువులేని వారింటికి వెళ్ళడానికి సంకోచంగా వుండేది. ఒకరోజు మా నాన్నగారి ఒత్తిడి వలన వారింటికి వెళ్ళక తప్పలేదు. ఒకరోజు మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో పానగల్ పార్క్ దగ్గర 47 నెంబర్ బస్సులోనో లేక 9 వ నెంబర్ బస్సులోనో చెట్ పట్ వరకు వెళ్ళి హారింగ్టన్ రోడ్ లో వారిల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. హారింగ్టన్ రోడ్ అప్పుడూ ఇప్పుడూ కూడా పోష్ లొకాల్టీయే.  ఆరొజుల్లో ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో చాలా చల్లగా, ప్రశాంతంగా, నిర్మానుష్యంగా వుండేది. అప్పుడప్పుడు తిరిగే కార్ల సంచారమే తప్ప నరసంచారం వుండేదికాదు. డి.ఎన్.రావు గారింట్లో వారంతా చాలా స్నేహపూర్వకంగా, కలగొలుపుగా మాట్లాడారు. కొంతసేపు గడిచాక వారి అబ్బాయి అమ్మాయి సిటీలో ఎక్కడికైనా తిరిగిరావడానికి ప్లాన్ చేసి, చివరికి లోకల్ ట్రైన్ లో తాంబరందాకా వెళ్ళివద్దామని ప్లాన్ చేసారు. వీళ్ళుండే హారింగ్టన్ రోడ్ చివర ఇప్పుడు సబ్ వే ఉన్నచోట అప్పట్లో ఒక లెవెల్ క్రాసింగ్ వుండేది. అక్కడనుండి కొంచెం దూరం రైలు ట్రాక్ పక్కనుండే వెళితే నుంగబాక్కం రైల్వేస్టేషన్. అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కాలని నిర్ణయించుకొని బయల్దేరాము. కానీ కొంత దూరం వెళ్ళేసరికి ముందుకు వెళ్ళబడని పరిస్థితి.  ఎదురుగా ఒక బ్రిడ్జి, క్రింద కూవమ్ కెనాల్. మనుషులు వెళ్ళే త్రోవలేదు. వెళితే రైలు ట్రాక్ మీదే నడుచుకుంటూ వెళ్ళాలి. రెండు ట్రాక్ ల మీద వచ్చే పోయే లోకల్ ట్రైన్స్. మరో మీటర్ గేజ్ లైన్ మీద ఎగ్మూర్ నుండి సౌత్ కు వెళ్ళే ఎక్స్ప్రెస్ రైళ్ళు. అలాటి త్రోవలో వెళ్ళడం అంత మంచిదికాదని నాకు అనిపించింది. ఫర్వాలేదు స్పీడ్ గా నడిస్తే రెండు మూడు నిముషాల్లో దాటేస్తామని ధైర్యం చేసి ముందుకే సాగి ఏ అవాంతరం లేకుండా బ్రిడ్జ్ దాటేసాము. నుంగంబాక్కం స్టేషన్ లో టిక్కెట్లు కొని లోకల్ కోసం ఎదురు చూస్తూ బీచ్ స్టేషన్ తర్వాత ఫోర్ట్, పార్క్, ఎగ్మూర్, చెట్పట్, నుంగబాక్కం, కోడంబాక్కం, మాంబళం, సైదాపేట, గిండీ, మీనంబాక్కం, (అప్పటికి ఎయిర్ పోర్ట్ దగ్గర త్రిశూలం స్టేషన్ రాలేదు), పల్లవరం, క్రోమ్ పేట, సానిటోరియం,  ఆఖరున తాంబరం  అంటూ చెపుతూండగానే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదో మా ముందునుండి మీటర్ గేజ్ ట్రాక్ మీద స్పీడ్ గా వెళుతూ కనిపించింది. నా గుండె గుభేలుమంది. ఇదే ట్రైన్ ఒక ఏడెనిమిది నిముషాల ముందు మేము ఆ బ్రిడ్జి మీద నడుస్తున్నప్పుడే వచ్చివుంటే... మా గతి.... తల్చుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. నావరకు అదొక పెద్ద ఎడ్వెంచరే. నా పక్కనున్న వాళ్ళిద్దరూ అసలు పట్టించుకోనేలేదు. ఏవో కబుర్లు చెపుతువున్నారు. ఈలోగా లోకల్ రావడం అందులో ఎక్కి వరసగా వచ్చే స్టేషన్లు, ఆ ప్రాంతాలలో వుండే కంపెనీలు, ఫ్యాక్టరీలు , కోవెళ్ళు, హాస్పిటల్స్ చూసుకుంటూ తాంబరం చేరాము. అప్పటికి ఇంకా సౌత్ వేపు బ్రాడ్ గేజ్ ట్రాకులు ఏర్పడలేదు. లోకల్ రైళ్ళు తాంబరం తో సరి. చెంగల్పట్ వేపు వెళ్ళాలంటే మీటర్ గేజ్ పాసింజర్ రైళ్ళే. అప్పట్లో తాంబరం స్టేషన్ పెద్ద పెద్ద రావి చెట్లు, మర్రిచెట్లతో చల్లటి గాలివీస్తూ హాయిగా వుండేది. దూరాన కనిపించే వండలూరు కొండలు చూస్తూ ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్లాట్ ఫారం అంతా తిరిగాము. తాంబరం స్టేషన్ కు ఒక ప్రక్క  టిబి శానిటోరియం, మరోప్రక్క, మద్రాస్ క్రిష్టియన్ కాలేజీ బహు పురాతనమైనవీ, చాలా ప్రసిధ్ధి చెందినవి. ఇలా నాకు తెలిసిన విషయాలేవో చెపుతూ ఓ అరగంట అక్కడ కాలక్షేపం చేసి తిరిగి లోకల్  లో బయల్దేరాము. ఈ సారి నుంగంబాక్కం లో కాకుండా చెట్పట్ స్టేషన్ లో దిగి వాళ్ళను ఇంటిదగ్గర దింపి నేను రాత్రి ఎనిమిది తర్వాత ఇల్లు చేరాను. ఈ సంఘటన ఈనాడు అమెరికా లో వుంటున్న ఆవిడకు గుర్తుందోలేదో కానీ నాకు మాత్రం బాగా జ్ఞాపకం వుండిపోయింది. 

💐🌿💐


1967 లో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన మరో రెండు మంచి చిత్రాలు పుణ్యవతి', 'పెద్దక్కయ్య. 

'పుణ్యవతి' 'పూవుం పొట్టుమ్' 'నయీ రోషిని' త్రిబుల్ వెర్షన్  సినీమా. తెలుగు, తమిళ, హిందీ భాషలలో వాసూ స్టూడియోస్ అధినేత వాసుదేవ మీనన్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషలకు దాదామిరాసి డైరక్టర్. హిందీకి సివి శ్రీధర్ డైరక్టర్. హింది వెర్షన్ కి రవి,   తమిళానికి గోవర్ధనం, తెలుగుకు ఘంటసాల సంగీతం నిర్వహించారు. కథ ఒకటే అయినా ఎవరి సంగీతం వారిదే. ఈ మూడు వెర్షన్స్ లోనూ భానుమతి ప్రధాన పాత్ర ధరించినా ఒక పాట కూడా పాడకపోవడం ఒక విశేషం. ఎస్.వి.రంగారావు, ఎన్.టి.రామారావు, శోభన్ బాబు, హరనాథ్, కృష్ణకుమారి, జ్యోతిలక్ష్మి వంటి పెద్ద తారాగణమంతా వుంది.  మంచి కథాంశంగల కుటుంబ గాథా చిత్రం. పిల్లల పెంపకం సరిగాలేకపోతే జరిగే అనర్ధాలకు దర్పణం పట్టే చిత్రం 'పుణ్యవతి'. సన్నివేశపరంగా చాలా మంచి పాటలున్న చిత్రం. పాటలన్నిటినీ సినారెవే రాసేసినారు.  ఘంటసాలగారు చాలా  మంచి వరసలు కూర్చారు. ఎన్.టి.ఆర్, కృష్ణకుమారిల మీద "మనసు పాడింది సన్నాయి పాట" (బేహాగ్); హరనాథ్, జ్యోతిలక్ష్మిల మీద చిత్రీకరించిన ' ఎంత సొగసుగా వున్నావు'(భీంప్లాస్); శోభన్ బాబు సోలోలు " పెదవులపైన సంగీతం; "ఇంతేలే నిరుపేదల బ్రతుకులు" వంటి పాటలు, ఘంటసాలవారి మాటల్లోనే చెప్పాలంటే పదికాలాల పాటు నిలిచిపోయే చాలా మంచి పాటలు. హరనాథ్ తన పాటలకు సరైన లిప్ మూవ్మెంట్స్ ఇస్తారని ఘంటసాలవారు ప్రశంసించారు. సీరియస్ కేరక్టర్ లో శోభన్ బాబు చాలా చక్కగా నటించారు. సీనియర్ నటులుగా భానుమతి, రంగారావు, ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి తమ స్థాయిని నిలబెట్టుకున్నారు. ఈ మూడు వెర్షన్స్ లో తెలుగు సినీమా, అందులోని సంగీతమే తనకు బాగా తృప్తి కలిగించిందని నిర్మాత వాసు మీనన్ ప్రకటించారట.

ఇంతేలే నిరుపేదల బ్రతుకులు


పెదవులపైన సంగీతం.....పాట


అదే నెలలో విడుదలైన ఘంటసాలగారి మరో సినిమా 'పెద్దక్కయ్య'. తోట సుబ్బారావుగారి శ్రీదేవి కంబైన్స్ చిత్రం. ఫ్యామిలీ సెంటిమెంట్. గుమ్మడి, కృష్ణకుమారి, హరనాథ్, వాణిశ్రీ, చంద్రమోహన్, రమణారెడ్డి, జి.వరలక్ష్మి ప్రధాన తారాగణం. ఏడుగురు ఆడపిల్లల పేద తండ్రి కథ. కృష్ణకుమారి పెద్ద కూతురైతే, బేబి రాణి ఆఖరి కూతురు. బి.ఎ.సుబ్బారావు దర్శకుడు. హరనాథ్ కోసం ఘంటసాల మాస్టారు పాడిన దాశరధిగారి ఉమర్ ఖయ్యాం టైప్ పద్యాలు, ఘంటసాల, సుశీలగార్ల 'ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో'; సుశీలగారి సోలోలు ' చూడాలి అక్కను చూడాలి'; "తల్లి దీవించాలి దారి చూపించాలి"; మాస్టారి సోలో "తోడులేని నీకు  ఆ దేవుడే (శ్రీశ్రీ) " వంటి పాటలు సన్నివేశపరంగా,  సంగీతపరంగా చెప్పుకోదగ్గ మంచి పాటలు.




ఈ సినీమాలో తిరుమల కొండల నేపథ్యాన్ని చూపినప్పుడు మాస్టారు తన ప్రైవేట్ రికార్డు "వెంకన్న నామమే భక్తితో కొలిచితే" లోని ఒక బిట్ ఆలపించడం ఎంతో సందర్భోచితమనిపించింది. ఈ పెద్దక్కయ్య సినీమాలో ఆఖరి కూతురిగా బేబి రాణి ముద్దు ముద్దుగా నటించి గుమ్మడితో సమానమైన మార్కులు సంపాదించింది. ఆ సీజన్ లో బేబి రాణి వరసగా అనేక తెలుగు, తమిళ సినీమాలలో చిన్న పాపగా కనిపించి ప్రేక్షకుల హృదయాలలో నిల్చిపోయింది. ఆ పాప పెద్దయితే చాలా పెద్ద స్టారు అవుతుందని అందరూ భావించేవారు. కాని దురదృష్టం. ఛైల్డ్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోయింది. ఆమధ్య ఏదో తమిళ్ ఛానెల్ ఈనాటి బేబి రాణితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చూశాను. ఆ చిన్నప్పటి పాపకు ఈ అమ్మాయికి ఏమాత్రం సంబంధమే లేనట్లు అనిపించింది. చాలా బాధగా అనిపించింది. ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు.

🌿🌺🌿

మరిన్ని విశేషాలతో...
వచ్చేవారం ....
                     ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, July 11, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై తొమ్మిదవ భాగం

11.07.2021 -  ఆదివారం భాగం - 39*:
అధ్యాయం 2 భాగం 38  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
" సింగిల్ టిక్కెట్
  డబుల్ సినిమా -
  ఒకే టిక్కెట్ కు
  రెండు సినిమాలు"

ఘంటసాల మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు నందంబాక్కం సర్జికల్ ఇన్స్ట్రమెంట్స్ ప్లాంట్ లో పనిచేస్తున్న రోజుల్లో వారి క్వార్టర్స్ కు దగ్గరలో ఒక పాత టూరింగ్ టాకీస్ వుండేది. అక్కడ శని, ఆదివారాలలో రాత్రి 9.30 గంటలకు ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాలు వేసేవారు.  ఆదివారం శెలవు దినం కావడాన సర్జికల్ ప్లాంట్ ఉద్యోగులంతా తమ కుటుంబంలోని పిల్లపాపలందరితో సరదాగా కాలక్షేపం కోసం ఆ సినిమాలకు వచ్చేవారు. ఈ సినిమా లు చూసేందుకు టి.నగర్ నుండి పెద్దబాబు, రతన్, నేనూ కూడా శనివారం సాయంత్రానికి నందంబాక్కం ఎస్.ఐ.పి. కాలనీలోని పిన్నిగారింటికి చేరేవాళ్ళం. రాత్రి  భోజనాలు ముగించుకొని తొమ్మిది తర్వాత క్వార్టర్స్ లో వున్నవారంతా మెల్లగా ఆ టూరింగ్ హాలుకు చేరేవారు. వేసవికాలంలో వెన్నెల రాత్రుళ్ళలో అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటు నడుచుకు వెళ్ళేవారు. పెద్దలందరికీ ఒకళ్ళతో ఒకళ్ళు పరిచయాలు, స్నేహబంధాలు పెంచుకోవడానికి మంచి అవకాశం. పిల్లలంతా అక్కడ బయలు ప్రాంతంలోఇసకలో ఆటలాడేవారు. సినిమా ఒక సాకు. ఇంటర్వెల్ సమయంలో పెద్ద ఉద్యోగులు, చిన్న కార్మీకులు అనే తేడాలేకుండా అన్ని వర్గాలవారు కలసిమెలసి అక్కడి టీ స్టాల్ లో టీ త్రాగుతూ, బన్నులు తింటూ సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. నిద్రలకు ఆగలేనివారు ఒక సినిమా మాత్రం చూసి ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. ఓపికవున్నవాళ్ళు మాత్రం ఆ ఒక్క టిక్కెట్ కు రెండు సినిమాల ఛాన్స్  వదులుకునేవారు కాదు. మర్నాడు ఆదివారం హాయిగా నిద్రపోయి లేటుగా ఏ మధ్యాహ్నానికో లేచి సోమవారం షిప్ట్ లకు రెడీ అయిపోయేవారు. ఇలాటి కంపెనీలలో పనిచేసే ఉద్యోగస్తుల సౌకర్యం కోసమే ఆ థియేటర్ వాళ్ళు సింగిల్ టిక్కెట్ డబుల్ సినిమా ప్లాన్ వేసివుంటారు. శని ఆదివారాలెప్పుడూ రాత్రి ఆటలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తోనే ఆడేవి. సదాశివుడుగారు, పిన్నిగార్ల సౌజన్యంతో నేను కూడా బట్ రోడ్ టూరింగ్ టాకీస్ లో నెలకు ఒకటి రెండుసార్లు  పాత ఎమ్.జి.ఆర్ సినిమాలు, జయశంకర్ క్రైమ్ సినిమాలు, ఫ్రాంక్ నీరో కౌబాయ్ సినిమాలు, సీన్ కానరీ జేమ్స్ బాండ్ సినిమాలు చూసేవాణ్ణి. అలాటి సమయాలలోనే తాతగారి(సదాశివుడు) మేనేజర్స్ కృష్ణగారు, కుటుంబరావు గార్లతో,   ఇరుగుపొరుగు కొలీగ్స్ సెల్వనాయగం, పార్థసారధిగారి వంటి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఎస్.ఐ.పి కాలనీలోని తెలుగువారంతా కలసి ఒక ఏడాది ఉగాది వేడుకలు  చేసేరు.  అందులో భాగంగా ఒక నాటకం, లలిత సంగీత కార్యక్రమాలు  కూడా జరిగాయి.  కంపెనీ ఉద్యోగస్తులతో పాటూ కనకదుర్గ, జూ.భానుమతి వంటి సినిమా నటీమణులు కూడా  ఆ నాటకంలో నటించారు. ఆ డ్రామా రిహార్సల్స్ ఘంటసాల మాస్టారింటి హాలులోనే సదాశివుడుగారి ఆధ్వర్యంలో  జరిగాయి. సదాశివుడుగారి ముస్లీమ్ కొలీగ్, సన్మిత్రుడు ఒకాయన  అబూబెకర్ అని పేరు. ఘంటసాలవారి అభిమాని. బాగా పాడేవారు. ఆయనకు ఘంటసాలవారి పాత తమిళం పాటలన్నీ బాగా వచ్చు. ఆయన ఆరోజు ఉత్సవంలో ఆలపించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని ఎస్.ఐ.పి జూనియర్ ఘంటసాలగా గుర్తింపుపొందారు. 

🌷🌷

ఇలాటి ఒక టికెట్ కు రెండు సినిమాల్లాంటి ఛాన్స్ ఒకటి ఒకసారి విజయాగార్డెన్స్ లో తగిలింది. ఈనాటి పరిభాషలో చెప్పాలంటే  అది ఒక డబుల్ ఢమాకా... కాదు త్రిబుల్ ఢమాకా! విజయాగార్డెన్స్ రికార్డింగ్ థియేటర్ లో 'భువనసుందరి కథ' రీరికార్డింగ్ మొదలయింది. ఘంటసాల మాస్టారే ఆ సినిమాకు సంగీత దర్శకుడు. 9 to 9 కాల్షీట్.  వరసగా మూడురోజులపాటు జరిగింది. జానపద సినిమా అందులోనూ మంత్రాలు, తంత్రాలు, కుతంత్రాలు, పరకాయ ప్రవేశాలు, ఆకాశంలో ఎగరడాలు, దొమ్మరాటలు వంటి విశేషాలతో నిండిన సినిమా కావడంవలన అడుగడుగునా నేపథ్య సంగీతం అవసరమైన సినిమా. అలాటి సినిమా రీరికార్డింగ్ చూడడానికి మంచి హుషారుగా వుంటుంది. మాస్టారు ఏ సీన్ మీద ఎలాటి మ్యూజిక్ కంపోజ్ చేస్తారా అని పక్కనే సైలంట్ గా కూర్చొని గమనించేవాడిని. 

ఒక రోజు బ్రేక్ సమయంలో బయట వరండాలోకి వచ్చి చూసేప్పటికి  ఎదురుగా లాన్ లో ఒక తమిళ సినిమా డ్యూయెట్ సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నారు. వాహినీ స్టూడియో ఎంట్రన్స్ లో రెండు తెల్లటి పోట్లగిత్తల లైఫ్ సైజ్ బొమ్మలు బహు ఆకర్షణీయంగా దర్శనమిచ్చేవి. వాటి ముందు ఎన్నో భాషల్లో సినిమా షూటింగ్ లు జరిగేవి. అవే బొమ్మలు విజయా గార్డెన్స్ లో కూడా కనిపించేవి. ముఖ్యంగా ఔట్ డోర్ లోకేషన్లో పాటల సన్నివేశంలో ఈ జంట గిత్తలు కనిపించేవి. ఆ రోజు ఆ బొమ్మల ముందే పాట షూటింగ్.  సినీమా పేరు గుర్తులేదు. దేవిక, జయశంకర్ హీరో హీరోయిన్లు. అశోకన్ విలన్. ఆ పాటలో ముగ్గురూ కనిపిస్తారు. కానీ ఆ రోజు షూటింగ్  లో దేవిక మాత్రమే పాల్గొన్నారు. మంచి హుషారైన  డ్యాన్స్ సాంగ్. కాలంతో పాటూ కాళ్ళాడించక తప్పక దేవికలాంటి ఉదాత్త కథానాయకి కూడా అల్ట్రా మోడర్న్ డ్రెస్ లలో అవస్థపడుతూ నటించకతప్పలేదు. డాన్స్ మాస్టర్ ఒక పక్క చేసి చూపిస్తూంటే, 'స్టార్ట్, 'కట్', 'క్లాప్, 'టేక్' లతో ఒక గంటపైనే సాగింది. పాట పల్లవి పూర్తికానే లేదు. కెమేరామెన్  కట్ ఎండ్ బ్రేక్  చెప్పేశాడు. కారణమేమిటంటే కెమేరాలో హిరోయిన్ గారి  కాళ్ళ దగ్గర వేసుకున్న టైట్ లెగ్గీస్ కుట్లు విడిపోయాయట.  మేకప్ రూమ్ కు వెళ్ళి ఆ డ్రెస్ పూర్తిగా మార్చుకొని రావాలంటే టైమ్ టేకింగ్ వ్యవహారం. ఈ లోపల సూర్యభగవానుడు కనుమరుగైపోతాడు. అందుకోసం ఆపధ్ధర్మ కాస్ట్యూమర్ సూదీ దారంతో వచ్చి హీరోయిన్ గారి లెగ్గీ కి రిపేర్ మొదలెట్టాడు. అతను లాన్ లో క్రింద కూర్చొని కుడుతూంటే ఆ హిరోయిన్ రిలాక్స్ అవుతూ తర్వాతి షాట్ లో వచ్చే డాన్స్ మూమెంట్స్ చూసుకుంటూవుంది. పాట షూటింగ్ కంటే ఇదే మంచి వినోదంగా అనిపించింది. కొంతసేపటి తర్వాత  షూటింగ్ మళ్ళీ కొనసాగింది. ఇలా ఒక అరగంట చూసేప్పటికి బోర్ కొట్టింది. మనం సినిమాలో చూసినట్లు వరసగా షూటింగ్ జరగదు. ఒక్కొక్క షాట్ కు లొకేషన్ ఛేంజ్, లైటింగ్, మేకప్ టచప్ లు, స్టార్ట్, కట్ ల తోనే కాలం గడిచిపోతుంది. ఆ రోజు షూటింగ్ లో జయశంకర్, అశోకన్ కనపడనే లేదు. ఆ మర్నాటి  పాట షూటింగ్  జయశంకర్ మీద. అక్కడ దేవిక లేదు. ఆ ఇద్దరి కంబైన్డ్ షాట్స్ తర్వాత ఎప్పుడో ఇద్దరి డేట్స్ కలిసొచ్చినప్పుడు షూట్ చేయాలని ఆ ప్రొడక్షన్ వాళ్ళు మాట్లాడుకోగా విన్నాను. తమిళంలో జయశంకర్ మంచి పాప్యులర్ యంగ్ హీరో. తమిళనాడు జేమ్స్ బాండ్ గా పేరుపోందారు. చాలా హుషారుగా  డ్యాన్స్ లు, ఫైట్స్ చేస్తాడు.  ఆ రోజు జయశంకర్ మీద వచ్చే బిట్స్ షూట్ చేశారు. ఆ షూటింగ్ చూస్తున్న సమయంలో నా పక్కనే మరో ఇద్దరు వ్యక్తులు  కూడా ఆ షూటింగ్ గమనిస్తూ మాట్లాడుకోవడం విన్నాను. "ఒరేయ్! చూడు. ఆ మూమెంట్స్, టైమింగ్అబ్జర్వ్ చెయ్యి. ఎవరెవరు ఎలా ఏక్ట్ చేస్తున్నారో గమనించాలి" అంటూ ఏవో టిప్స్ ఇస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు డైరక్టర్ కె.ఎస్.ప్రకాశరావుగారు. మరొకరు అప్పుడే కొత్తగా నటించడం మొదలెట్టిన కొత్త హీరో కృష్ణగారు. అంతకుముందు కృష్ణగారిని మాస్టారింటి వద్ద తన తేనెమనసులు చిత్రం ప్రివ్యూకు ఆహ్వానించడానికి వచ్చినప్పుడు చూశాను. 

కొంతసేపటికి లొకేషన్ ఛేంజ్ అంటూ అందరూ అక్కడినుండి వెళ్ళిపోయారు.  ఆ మర్నాటి సాయంత్రం విలన్ నటుడు అశోకన్ వచ్చారు. తెల్లటి లుంగీ, ఫుల్ హ్యాండ్ షర్ట్ లో వున్నారు. వెనకాలే మరొకరు ఆ రోజు కాస్ట్యూమ్స్ నల్లటి సూటు, బూట్లు తెచ్చారు. వాటిని ఆ కారిడార్ లోనే ఒక పక్కన ధరించి షూటింగ్ కు హాజరయ్యారు. అది ఒక అరగంటో గంటో అయింది. ఈ మూడు రోజుల షూటింగ్ ను ఎడిటింగ్, మిక్సింగ్ చేసి ఒక పాటగా రూపొందిస్తారు. ముగ్గురు నటుల మూడు రొజుల కష్టాన్ని ఒక మూడు నిముషాల పాటగా మనం తెరమీద చూసి ఆనందిస్తాం. అక్కడితో సరి. 

💐

పరమానందయ్య శిష్యుల కథ తర్వాత శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తోట సుబ్బారావు గారు నిర్మించిన మరో జానపద చిత్రం ' భువనసుందరి కథ'. ఆకాశంలో ఎగిరే వింతైన విమానం, ఆలయంలోని భువనేశ్వరీదేవి ముక్కున వేలేసుకోవడం,  పరకాయ ప్రవేశ ప్రభావంతో అందాల రాకుమారుడు గూని చాకలి తిప్పడుగా మారడం వంటి విశేషాలతో నిండిన సినీమా. ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, వాణిశ్రీ,  కన్నడ ఉదయకుమార్, ధూళిపాళ, సత్యనారాయణ, ముక్కామల నటించిన వినోదభరిత చిత్రం. సంగీతపరంగా చెప్పాలంటే సినీమా టైటిల్ మ్యూజిక్ చాలా వినసొంపుగా, హాయిగా వుంటుంది. 


భువనసుందరి కథ టైటిల్ మ్యూజిక్

పాటల విషయానికొస్తే  - లీల, సుశీల పాడిన 'ఎంత చిలిపివాడవురా ప్రియా ప్రియా', సుశీల గారు పాడిన 'నా సొగసు రమ్మందిరా ఈ వయసు ఝుమ్మందిరా', నృత్యగీతం, ఘంటసాలవారి 'ఎల్లి నాతో సరసమాడేను', 'ఎవరికైనా ఎన్నడైనా తెలియరానిది దైవమూ' వంటి పాటలు బహుళ జనాదరణ పొందాయి. 


ఎల్లి నాతో సరసమాడేనూ....(భువనసుందరి కథ లో)

పాత తరం దర్శక పితామహుడు చిత్తజల్లు పుల్లయ్యగారు దర్శకత్వం వహించిన ఆఖరు చిత్రం ఇదే. ఈ సంవత్సరంలోనే సి.పుల్లయ్య దివంగతులయ్యారు. 

💥

'స్త్రీజన్మ' దగ్గుబాటి రామానాయుడు గారికి నిర్మాతగా ఐదవ చిత్రం. స్వంత సురేష్ బ్యానర్ మీద అయితే నాల్గవ చిత్రం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఘంటసాల మాస్టారు. సురేష్ సంస్థకు మాస్టారు పనిచేసిన ఏకైక చిత్రం. అంతవరకూ రామానాయుడుగారు తీసిన ఐదు చిత్రాలలో మూడింటికి పెండ్యాలగారు, ఒకటి మాస్టర్ వేణు, ఒకటి ఘంటసాలగారు చేశారు. ఈ 'స్త్రీజన్మ' సినీమాకు మూలం ' పూమాలై' తమిళం సినిమా. ఎస్.ఎస్.రాజేంద్రన్, విజయకుమారి, అంజలీదేవి నటించారు. మురసోలి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి కథ ఎమ్.కరుణానిధి సమకుర్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో 'స్త్రీజన్మ' గా ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, అంజలిదేవి, కాంతారావు, కృష్ణ, ఎల్.విజయలక్ష్మిలతో తీశారు. కె.ఎస్.ప్రకాశరావు దర్శకుడు. ఎన్.టి.ఆర్., కృష్ణ కలసి అన్నదమ్ములుగా నటించిన మొదటి చిత్రం. ఏన్టీ హీరో సెంటిమెంట్. హీరోయిన్ పాలిట హీరోవే విలన్. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. తమిళంలో గొప్ప హిట్. తెలుగులో ఫట్ అని చెప్పలేము కానీ పెద్దగా విజయం కాలేదు. 'స్త్రీ జన్మ'  సినీమా  ఘంటసాల మాస్టారికి రావడానికి కారణం మాధవీ ప్రొడక్షన్స్ ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులుగారే కారణమనిపిస్తుంది. ఈ సినిమాలో కొంత భాగస్వామ్యం కలిగినవారు. అందుకే సురేష్ కంబైన్స్ బ్యానర్ మీద రామానాయుడు ఈ చిత్రం తీసారు. ఈ సినీమాలో పాటలన్నీ సన్నివేశపరంగా ఉత్తమ విలువలు గల పాటలే మాస్టారు, సుశీల పాడిన 'ఎడారిలో పూలు పూచే ఎందుకని' చాలా మంచి యుగళగీతం. బేహగ్ రాగంలో చేశారు. ఈ జోడీ పాడినదే మరో యుగళం ఆరుద్రగారు రాసిన 'హలో అన్నది మనసు, ఛలో అన్నదీ సొగసు' అనే ఛలాకీ అయిన హుషారు గీతాన్ని కృష్ణ, ఎల్ విజయలక్ష్మిల మీద చిత్రీకరణ. అలాగే సుశీలగారి సోలోలు 'ఏదో ఏదో అవుతున్నదీ', 'చేయని నోమై అడగని వరమై చక్కని తండ్రీ లాలి జో' అనే జోలపాట  చాలామంచి పాటలు.


ఎడారిలో వూలు పూచె ఎందుకనీ....(స్త్రీ జన్మ)


చేయని నోమై.....( స్త్రీజన్మ)

ఈ సినీమాలో మాస్టారికి కొంత చేదు అనుభవం మిగిల్చిన పాటలు రెండు సోలోలు. మాస్టారు పాడినవే.  ఒకటి 'మగజాతికి బలి పశువమ్మా', మరొకటి 'తల్లీ ఇది తరతరాల కధ చెల్లీ'.  ఆత్రేయగారు వ్రాసిన ఈ రెండు పాటలు సన్నివేశ ప్రాధాన్యం కలవి. నేపధ్యగీతాలు. ఎంతో భావోద్వేగంతో, పైస్థాయిలో పాడవలసిన పాటలు. ఈ పాటలను ఎందుకో తమిళ గాయకుడు టి.ఎమ్.సౌందరరాజన్ చేత పాడించాలనే కోరిక నాయుడిగారికి పుట్టింది. ఆ విషయాన్ని స్వయంగా ఆయన మాస్టారితో చెప్పకుండా వేరెవరిద్వారానో (జె.వి.రాఘవులు) చెప్పించారు. ఇది మాస్టారిని నొప్పించింది. తర్వాత మరే పరిణామాలు చోటుచేసుకున్నాయో తెలియదు కానీ చివరికి ఆ రెండు పాటలు ఘంటసాల మాస్టారే పాడారు. మాస్టారు ఈ పాటలను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆ పాటల శ్రుతి కూడా కొంచెం పెంచి అత్యద్భుతంగా ఆలపించారు. గాయకుడిగా ఘంటసాలవారి పట్ల ఎవరికి ఏ వ్యతిరేక భావాలున్నా పూర్తిగా  తుడిచిపెట్టుకుపోయాయి. ఆ తర్వాత సురేష్ సంస్థ సినీమాలకు ఘంటసాలవారు సంగీతం సమకూర్చలేదు.


తల్లీ... ఇదితరతరాలకథచెల్లీ- స్తీజన్మ

ఈ సినీమా రీ రికార్డింగ్ కు నేను పూర్తిగా వున్నాను. కాలేజి ఏనివర్శరీ ఫంక్షన్, స్టూడెంట్స్ ఫుట్ బాల్ మ్యాచ్, హీరో హీరోయిన్ ను రేప్ చేసే సీన్, హీరో అక్కగారు ఇల్లువదిలే సమయంలో నేపథ్య సంగీతంలాటి సీన్ల్ ఎన్నిటికో మాస్టారు చాలా మంచి సంగీతాన్ని సమకూర్చారు. మంచి సినీమాయే. తెలుగు ప్రజానీకానికి అంతగా నచ్చలేదు.

💥 కొసమెరుపు💥

ఈ 'స్త్రీజన్మ' సినీమా రీరికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఒక తమాషా జరిగింది. ఘంటసాల మాస్టారు ఒక హెవీ సీన్ కు చాలా సీరియస్ గా మ్యూజిక్ కంపోజింగ్ లో నిమగ్నమైవున్నారు. సడన్ గా థియేటర్ స్క్రీన్ మీద' దోరనిమ్మపండు లాగా ఊరించే దొరసానీ' అనే పాట ఆడియో గట్టిగా వినిపించడంతో మాస్టారి సీరియస్ మూడ్ కి అంతరాయం కలిగింది. వెంటనే మైక్ లో 'ఎవడ్రా ఆ నిమ్మపండు, వాడి నోరు మూయించండి' అని గట్టిగా అరిచారు. వెంటనే రికార్డిస్ట్ రూములో నుండి 'సారీ మాస్టారు, బై మిస్టేక్ ఏవో ఫీడర్స్ ఓపెన్ అయాయి ' అంటూ పాటను ఆపేసారు. ఈ పాట 'చిక్కడు దొరకడు' సినీమాలోది.  మరో రూములో ఆ పాట మిక్సింగ్ జరుగుతోంది. పొరపాటున ఆడియో థియేటర్ లోకి ఓపెన్ అయింది. ' ఆ దోర నిమ్మపండు మీదే మాస్టారూ' అంటూ తబలా ప్రసాద్ జోక్ వెయ్యడంతో అందరూ ఒకటే నవ్వులు. మాస్టారు యథాప్రకారం తన పని కొనసాగించారు.

ఘంటసాల మాస్టారి సాన్నిహిత్యంలో ఇలాటి సరదా సంఘటనలెన్నో రికార్డింగ్ సమయాలలో జరిగేవి.

ఇలాటి మరిన్ని విశేషాలతో ....
 మళ్ళీ వచ్చే వారం.....
                ... సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, July 4, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఎనిమిదవ భాగం

04.07.2021 - ఆదివారం భాగం - 38*:
అధ్యాయం 2  భాగం 37 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారు చిత్రనిర్మాణం నుండి శాశ్వతంగా తప్పుకున్న తర్వాత తమ్ముడు సదాశివుడు, బావమరది సుబ్బారావు, ప్రొడక్షన్ మేనేజర్ సుబ్బు (సుబ్బారావు), ఎడిటర్లు హరినారాయణ, దేవేంద్రలు తమ ఉపాధి కోసం వేర్వేరు దిశలకు వెళ్ళిపోయారు. ఉన్నత విద్యాన్వేషణలో వచ్చి వుండిన రామబ్రహ్మం తన గమ్యస్థానం చేరుకున్నారు. ఆనారోగ్య స్థితిలో ఘంటసాల మాస్టారి ప్రియ మిత్రుడు దేవగుప్తాపు రామచంద్రరావు ముందు 35, ఉస్మాన్ రోడ్ ను వదలి వైజాగ్ వెళ్ళారు. కొన్నాళ్ళకు ఈ లోకాన్నే వదిలిపెట్టిపోయారు. అయినా నెం.35,ఉస్మాన్ రోడ్ ఆశ్రితులకు కల్పవృక్షం. ఆశ్రిత పక్షపాతియైన ఘంటసాల మాస్టారి ఆదరణలోకి మరికొందరు నెం.35, ఉస్మాన్ రోడ్ ను తమ నివాసం చేసుకున్నారు. మాస్టారి ఆఖరి బావమరది, సావిత్రమ్మగారి తమ్ముడు కె.హరినారాయణగారు, అనపర్తి నుండి వేదుల సుబ్రహ్మణ్యంగారు అలా వచ్చినవారే. ఉద్యోగాన్వేషణలో మద్రాస్ వచ్చిన మా నాన్నగారి రెండవ మేనమామ ఆయపిళ్ళ విశ్వేశ్వరరావుగారి పెద్దకుమారుడు పార్థసారధిగారు కూడా ఇదే 35, ఉస్మాన్ రోడ్ లో కొన్నేళ్ళు గడిపారు. 

సావిత్రమ్మగారి తమ్ముడు అక్కగారి నీడనే వుంటూ క్రమేణా కెమేరా విభాగంలో తర్ఫీదు పొంది ఒక  కెమేరా ఔట్ డోర్ యూనిట్లో అసిస్టెంట్ కెమేరామెన్ గా స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆయనకు వివాహం జరిగింది. 1983లో మా నాన్నగారు నెం.35, ఉస్మాన్ రోడ్ ను వదలిపెట్టాక హరినారాయణగారు తన కుటుంబంతో మేమున్న ఔట్ హౌస్ లోకి ప్రవేశించారు.  35 ఉస్మాన్ రోడ్ అమ్మేంతవరకు వారు ఆ ఇంటిలోనే వున్నారనుకుంటాను. వారి సంతానంతో నాకు పరిచయం లేదు. వారి అబ్బాయి ఒకరు ఒక తెలుగు టివి ఛానల్ లో చాలా మంచి  ఉద్యోగంలో వున్నారని చెప్పగా విన్నాను. 

వేదుల సుబ్రహ్మణ్యం గారిది విశాఖపట్నం దగ్గర అనపర్తో, వెదురుపర్తో గుర్తులేదు. పౌరాహిత్యానికి కావలసిన మంత్రాలు, పూజా విధానాలు అన్నీ తెలిసినవారే. ఘంటసాలగారి పరమ భక్తుడు. మీ ఇంట్లో పూజ పునస్కారాలు చేస్తూ మీ సేవ చేస్తూ మీ నీడలో గడిపేస్తానని వచ్చి చేరారు. ఓ ఏడాదో రెండేళ్ళో మాస్టారింట్లోనే  వున్నట్లున్నారు. ఇలా పరమభక్తులమని, మీ సేవ చేసుకొని మీతోనే వుంటామని చెప్పి చాలామంది వచ్చేవారు. అలాటివారిని ఘంటసాలవారు ప్రోత్సహించేవారుకాదు. సినీమాలమీది వ్యామోహంతో పాటలమీది ఆసక్తితో చదువుతున్న చదువులు, చేస్తున్న ఉద్యోగాలను వదలి వచ్చేవారిని కాస్తా గట్టిగానే మందలించేవారు. వేదుల సుబ్రహ్మణ్యం గారు ఘంటసాలవారింటి నుండి వెళ్ళిపోయాక ఎక్కడున్నారో తెలియదు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత సావిత్రమ్మగారు, నరసింగ కాశీ వెళితే అక్కడ కనిపించి అక్కడ క్రతువులు జరిపిస్తూ స్థిరపడినట్లు చెప్పారట. కాశీలో వీరికి కావలసిన ఏర్పాట్లన్ని తనే స్వయంగా చేసారని తెలిసింది. మాస్టారి పట్ల ఆయనకు గల  భక్తి విశ్వాసం అలాటిది.

అలాగే మరొక వ్యక్తి. పేరు గుర్తులేదు, నిక్ నేమ్ తప్ప. అతను కూడా మాస్టారి మీది భక్తితో మాస్టారి నీడలో వుంటానని వచ్చాడు. మాస్టారు అతనికి తన ఇంట వుంచుకొని ఆశ్రయం కల్పించే పరిస్థితిలో లేనని తనను నమ్ముకొని బంగారు భవిష్యత్తు పాడుచేసుకోవద్దని హితవు చెప్పి పంపేసారు. అయినా అతను రోజూ ఉదయాన్నే 'నెం.35, ఉస్మాన్ రోడ్' కు వచ్చేవాడు. ఎక్కడ వుండేవాడో తెలియదు. మాస్టారు బయటకు వెళ్ళేంతవరకు వుండి ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోతూండేవాడు. అప్పుడప్పుడు ఆయనతో కారులో రికార్డింగ్ లకు, రిహార్సల్స్ కు వెంటవెళ్ళేవాడు. అలా నిత్యమూ ఘంటసాలవారి దర్శనం చేసుకొని ఆయన చెప్పే మాటలు వింటూ మహదానంపొందాడు. అలా ఏడాదో, రెండేళ్ళో జరిగాక ఆ వ్యక్తి మాస్టారింటి దగ్గర కనపడలేదు. ఏమయ్యాడో తెలియదు. అలాటి అతను ఓ పుష్కరం తర్వాత ఒకసారి తిరుమల కొండమీద ఆలయ పరిసరాల్లో తారసపడ్డాడు. అతనే నన్ను గుర్తుపట్టి అభిమానంతో పలకరించాడు. అక్కడ దీక్షితులు గారి ఇంటివద్ద వుంటున్నట్లు చెప్పి, ఆ రోజు నన్నూ, మా ఆవిడను దీక్షితులుగారింటికి తీసుకువెళ్ళి దేవుడి ప్రసాదం పెట్టించాడు. తర్వాత పెద్దగా ఇబ్బంది పడకుండా స్వామివారి దర్శనానికి తీసుకువెళ్ళాడు. ఇది ఎన్నడూ ఊహించనిది. కారణమేమంటే నాకు మిగతావారితో ఉన్న పరిచయం ఇతనితో పెరగలేదు. అతను తిరుపతిలో నాకు అంత సహాయం చేయవలసినంత స్నేహమో, బాంధవ్యమో మా మధ్యలేదు. ఇందుకు ఘంటసాలవారిపట్ల అతనికి గల నిష్కల్మష భక్తియే కారణమని నేను అనుకొంటాను.

1965నాటి 'పాండవ వనవాసం' సినీమా మీకు గుర్తువుండేవుంటుంది. అందులో ద్రౌపదీ వస్త్రాపహరణం చాలా ఉత్కంఠ, ఉద్వేగ భరితమైన పొడుగాటి దృశ్యం. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, గుమ్మడి, నాగయ్య, బాలయ్య, మిక్కిలినేని, లింగమూర్తి, ప్రభాకరరెడ్డి, వంటి హేమాహేమీలు పాల్గొన్న అతి కీలకదృశ్యంలో కౌరవుల అకృత్యాలను నిరసిస్తూ ఒక అర్భకుడు తన గళాన్ని విప్పుతాడు.అతనే వికర్ణుడు. దుర్యోధనుని తొంభైతొమ్మిదిమంది సోదరులలో ఒకడు. రారాజు ఇచ్చిన పెద్దరికంతో కర్ణుడు వికర్ణుని పెద్దగా మాట్లాడనివ్వడు. ఆ వికర్ణుడే మా USN రాజుగారు. ఎవరికైనా గుర్తున్నారా? ఉప్పులూరి సూర్యనారాయణ రాజు. ఇదే అతని మొదటి చిత్రం.
ఘంటసాల మాస్టారి ప్రోద్బలంతోనే రాజుగారికి పాండవ వనవాసంలో నటించే ఛాన్స్ లభించింది. యు.ఎస్.ఎన్. రాజుగారిది విశాఖపట్నం దగ్గర ఏదో వూరు. జిల్లాపరిషత్ లో మంచి ఉద్యోగం. నాటకాలంటే అభిరుచి, ఆసక్తి. అది సినీమాలవేపు మళ్ళింది. మిత్రుల ప్రోత్సాహం. మద్రాసు మెయిల్ ఎక్కేసారు. రాజుగారు ఎలాగో ఘంటసాల మాస్టారికి పరిచయం చేయబడ్డారు. రాజుగారు చాలా మంచి అందగాడు, సౌమ్యుడు. స్నేహశీలి. మాస్టారికి అతనంటే ఒక రకమైన సానుభూతి కలిగింది. మద్రాసు సినీమారంగంలో వుండే కష్టనష్టాలను వివరించారు. సినిమా ను నమ్ముకొని బంగారంవంటి ఉద్యోగాన్ని వదలుకోవద్దని, కావాలంటే కొన్నాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి సినీమా వేషాలకోసం ప్రయత్నించమని ఉద్బోధ చేశారు. అప్పటికే రాజుగారికి వివాహం కూడా అయిందనుకుంటాను. ఆ కారణంగా మాస్టారు కొంతమంది నిర్మాత దర్శకులకు రాజుగారిని పరిచయం చేశారు. రాజుగారు అప్పటినుండి ఏదో సమయంలో ఇంటికి వచ్చి ఘంటసాల మాస్టారిని కలిసి తన ప్రయత్నాల గురించి చెప్పేవాడు. నాకూ అతనితో మంచి పరిచయమే వుండేది. అతను కృష్ణవేణి ధియేటర్ పరిసర ప్రాంతాల్లో ఒక రూములో అద్దెకువుండేవారు. మాస్టారి రికమెండేషన్ వలన రాజుగారికి పాండవ వనవాసంలో డైలాగ్స్ వున్న పాత్రే లభించింది. ఆ చిన్న పాత్రనే మహదానందంగా స్వీకరించాడు. ఆ తర్వాత కూడా నెం.35,ఉస్మాన్ రోడ్ వచ్చి పోతూండేవాడు. కొన్నాళ్ళ తర్వాత శెలవుపెట్టిన ఉద్యోగానికి రాజీనామా చేసి తన భార్యను కూడా మద్రాసు తీసుకు వచ్చేశారు. ఆవిడను కూడా మాస్టారింటికి తీసుకువచ్చి అందరికీ పరిచయం చేశారు. చాలా మంచి అమ్మాయి. చక్కటి ఈడూజోడు అని అందరూ ముచ్చటపడ్డారు. కానీ అతను ఉద్యోగం వదిలేయడం ఎవరూ హర్షించలేకపోయారు. ఆ తర్వాత రాజు ఏ సినీమాలలో నటించాడో నాకు మాత్రం అంతగా తెలియదు. నేను చూసిన ఓ మూడు నాలుగు సినీమాలలో హీరో మిత్రబృందంలో ఒకరుగా కాలరు ఎగరేసుకుంటూ పుస్తకాలతో కనిపించే స్టూడెంట్ వేషాలలో చూసాను. ఆ వేషాలకు ఏ విధమైన గుర్తింపు వుండదు. పురోభివృద్ధి వుండదు. రాజుగారి  సినీమా జీవితమూ అలాగే ముగిసిందనుకుంటాను. సినీమాలలో నటనకు తగ్గ వేషాలు దొరకక ఆర్ధిక ఇబ్బందులతో కాలం గడవక కొంతకాలానికి మద్రాస్ వదలిపెట్టారని విన్నాను. అతని పరిస్థితి తల్చుకున్నప్పుడల్లా జాలిగా అనిపిస్తుంది. ఎవరైనా మంచి సలహాలు చెప్పగలరే కానీ వాటిని పరిపూర్ణంగా ఆచరింపజేయలేరు. 

ఆ రోజుల్లో చాలామంది సినీమా జీవితమంటే విలాసవంతమైన గులాబీపాన్పు అనుకునేవారు. అంతో ఇంతో నటన, కాస్తా కూస్తో పాడగలిగితే చాలు మెడ్రాస్ లో లక్షలు సంపాదించి పెద్ద పెద్ద భవంతులు కట్టేయవచ్చని గాలిలో మేడలు కట్టేవారు. దూరపు కొండలు నునుపు. దగ్గరకు వెళ్ళి చూసినవాళ్ళకే తెలుస్తుంది అక్కడంతా వుండేది మిట్టపల్లాలు,ఎగుడుదిగుడు గతుకులు, ముళ్ళ కంపలు, రాళ్ళురప్పలు అని. అక్కడ శిఖరాలకు చేరడం ఏమంత సుగమం కాదని. అలాగే ఆనాటి సినీమా జీవితం కూడా. సినీమా కళాకారులకు పేరు ప్రఖ్యాతులు వచ్చినంతగా ఆర్ధికాభివృధ్ధి వుండేదికాదు. వందలాది, వేలాది సినీ కళాకారులు కష్టాల ఊబిలోనే వుండేవారు.

ఏ ఒక్క గొప్ప కళాకారుడిదీ వడ్డించిన విస్తరికాదు. వారంతా కూడా సుదీర్ఘమైన కృషి చేసి ఎన్నో కష్టాలు అనుభవించాకే ఆ స్థితికి చేరుకున్నారు. వారెంత ఉచ్ఛస్థితికి చేరుకున్నా అనేకమందిని జీవితాంతం అభద్రతాభావం వెన్నాడుతునేవుండేది. తమ తమ ఉన్నతస్థాయిని నిలబెట్టుకుందికి శతవిధాలా పోరాటం సాగించవలసివచ్చేది. ఈ కష్టాలన్ని తన జీవితాంతం అనుభవించి అర్ధం చేసుకున్న వ్యక్తి మన ఘంటసాల మాస్టారు. వారి జీవితం మనకెన్నో సత్యాలను నేర్పుతుంది.

🌿 🌺🌿


ఆ రోజు ఆంధ్రా యునివర్శిటీ డిగ్రి రిజల్ట్స్ వచ్చాయి. డిగ్రీ హోల్డర్ననిపించుకున్నాను. తలమీదనుండి పెద్ద బరువు దించుకున్నట్లనిపించింది. అంతకుమించి నాకు పెద్ద గర్వంగానో, సంతోషంగానో అనిపించలేదు. నేను పాసయినందుకు మా ఇంట్లోను , మాస్టారింట్లోనూ అందరూ ఆనందం వ్యక్తపర్చారు. అప్పటివరకూ మా ఇంట్లోకానీ, ఘంటసాలవారింట్లో కానీ ఎవరూ గ్రాడ్యుయేట్స్ లేరు.  ఆ ఘనత పొందిన మొదటి కుర్రవాడిని నేనే కావడం పెద్దలందరి ఆనందానికి ఒక కారణం. వీటన్నిటికి మించిన ఒక విషయం నాకు ఆశ్చర్యాన్ని, మొహమాటాన్ని కలుగజేసింది. ఘంటసాల మాస్టారు సావిత్రమ్మగారితో "ఈవేళ స్వరాట్ నాతో కలసి భోజనం చేస్తాడు, శ్రీలక్ష్మమ్మగారితో (మా అమ్మగారు) చెప్పు" అని అన్నారు. నేను మాస్టారి పక్కన కూర్చొని భోజనం చేయడమా? ఈ విషయాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించడం నాకు చాలా మొహమాటంగా అనిపించింది.  నేను బి.ఏ. పాసయినందుకు అభినందనపూర్వకంగా మాస్టారు అలా అనివుంటారని భావించాను. కానీ, నిజంగానే భోజనాల సమయానికి నన్ను పిలిపించి ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మేమిద్దరమే. ఆ సందర్భంలో అయ్యగారు అడిగారు  "తర్వాత ఏం చెయ్యదల్చుకున్నావు, ఎమ్.ఏ. చదువుతావా అని. నేను ఏవిషయమూ స్పష్టంగా నోరు తెరచి చెప్పలేకపోయాను. అమ్మగారే వడ్డించారు. ఆ రోజు వారింట్లో వండిన వంటలన్నీ ఇంకా బాగా గుర్తున్నాయి. దోసకాయపప్పు, గుత్తొంకాయ కూర, టమేటో చారు, పచ్చి నీరుల్లిపాయ ముక్కలు వేసిన మెంతిమజ్జిగ, గెడ్డ పెరుగు, ఆవకాయ, కొరివికారం ఇత్యాదులతో మాస్టారి పక్కన కూర్చొని భోజనం. అదే మొదటిసారి. అమ్మగారు చాలాబాగా వండుతారు. వారింట్లోని వంటకాలు అప్పుడప్పుడు మా ఇంటికీ వస్తూండేవి. సావిత్రమ్మగారు మెంతిమజ్జిగ స్పెషలిస్ట్. మా ఇంట్లో  వామువేసి పోపుమజ్జిగ అని చేస్తారు. (దాన్నే సత్యనారయణ బక్షీ (మా తాతగారి మిత్రులు బక్షీ పంతులుగారి కుమారుడు) Air Indiaలో Chief Chef, ఈtv ఒక కార్యక్రమంలో 'అమృత్ పీయూష్' గా పరిచయం చేసేరు.)  

ఆరోజు అమ్మగారు చేసినవన్నీ నాకు ఇష్టమైన పదార్ధాలే అయినా నాకు సహజంగానే వుండే మొహమాటం వలన అంత పెద్దాయన పక్కన ఒంటరిగా కూర్చొని స్వేఛ్ఛగా భోజనం చేయలేకపోయాను. ఆ విషయం ఈ రోజున తల్చుకుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఘంటసాలగారి వంటి ఒక మహోన్నతగాయకుడి సరసన కూర్చొని భోజనం చేయగలగడం మహా అదృష్టం. ఆ భాగ్యం నాకు కలగజేసిన ఘంటసాలవారి సహృదయత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నా తర్వాత చదివిన మా ఇంటిపిల్లలు కానీ, మాస్టారింటి పిల్లలు కానీ అందరూ బాగా చదువుకున్నవారే.  పి.జి.లు, పి.హెచ్.డీ.లు చేసినవారే. అయినా ఆ లోగిటి మొదటి గ్రాడ్యుయేట్ అనే అర్హత మాత్రం  నేను పొందగలిగాను.

🌿 🌺🌿

గత రెండు మూడు వారాలలో సినిమా పాటల గురించి ముచ్చటించే అవకాశం దొరకలేదు. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాల మాస్టారికి 1967 విజయవంతమైన సంవత్సరమే. ఆ సంవత్సరంలో మాస్టారు పాడిన అనేక సినీమాపాటలు బాగా హిట్టయి ఘంటసాల తప్ప వేరే గాయకుడు లేడు, మరొకరు అక్కరలేదు అనే స్థాయికి చేరిపోయారు. 


అలాగే, 1967లో ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో 6 సినీమాలు విడుదల అయ్యాయి. అవి - నిర్దోషి, భువనసుందరికథ, స్త్రీ జన్మ, పుణ్యవతి, పెద్దక్కయ్య, రహస్యం చిత్రాలు. సంవత్సరం మొదట్లో నందమూరి వారు హీరోగా వచ్చిన సాంఘిక చిత్రం, సంవత్సరాంతంలో అక్కినేని వారు నటించిన జానపద చిత్రం. అన్ని సినీమాలు సంగీతపరంగా ఘంటసాల మాస్టారికి గొప్ప పేరు ప్రఖ్యాతులనే తెచ్చిపెట్టాయి. ఇతర సంగీత దర్శకులకు ఘంటసాల వారు పాడిన పాటల్లో బాగా హిట్టయినవి, నాకు బాగా నచ్చినవి, ఆ పాటలకు సంబంధించి నాకు జ్ఞాపకం వున్న విశేషాలు కొన్ని ముచ్చటిస్తాను.

రాజమకుటం వచ్చిన ఆరేళ్ళకు వాహినీ బ్యానర్ మీద బి.ఎన్.రెడ్డిగారు తీసిన అద్భుత సామాజిక, కుటుంబగాధా చిత్రం 'రంగులరాట్నం'.  'లవకుశ' సీత అంజలీదేవి తప్ప ఇతర నటీ నటులంతా సినీమాకు నూతన పరిచయస్తులే. చంద్రమోహన్, నీరజ (విజయనిర్మల), విజయలలిత, వాణిశ్రీ, రామ్మోహన్, త్యాగరాజు, నగరాజారావు, కాకరాల, వంటి నూతన నటులకు ప్రాధాన్యమున్న పాత్రలనిచ్చి గొప్ప సాహసమే చేశారు బి ఎన్ రెడ్డి. కథావిలువగల చిత్రం కావడం వలన 'రంగులరాట్నం' అఖండవిజయం సాధించింది.  అమ్మ పాత్రలో అంజలీదేవి తన సీనీయారిటిని ప్రతిభావంతంగా కనపర్చారు. ఈ చిత్రానికి జంట సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు, బి.గోపాలం. గోపాలంగారు మంచి గాయకుడు. ఆయన పాటంటే బి ఎన్ రెడ్డిగారికి ఇష్టం. ఆయన చిత్రాలకు బి.గోపాలం సహ సంగీతదర్శకుడు. ఈ సినీమాద్వారా ఒక పాటల రచయిత ను బి ఎన్ పరిచయం చేశారు. ఆయనే కావలి కాలేజీ లో పనిచేసిన శ్రీ ఎస్.వి.భుజంగరాయశర్మగారు. సినీమాలకు ఆయన వ్రాసిన పాటలు చాలా తక్కువే అయినా తర్వాతి కాలంలో డా.వెంపటి చిన సత్యంగారి నృత్యనాటక గీతాల రచనల ద్వారా భుజంగరాయశర్మగారి ఖ్యాతి దిగంతాలకు ప్రాకింది. కూచిపూడి నాట్యకళా ముమూర్తులలో ఒకరుగా కళాప్రపంచంలో నిలచిపోయారు. రంగులరాట్నంలోని టైటిల్ సాంగ్ "ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నమూ" పాటను భుజంగరాయ శర్మగారే వ్రాశారు. ఘంటసాల మాస్టారి గంభీరమైన గళంలో ఈ వేదాంత తాత్త్విక గీతం అజరామరంగా నిల్చిపోయింది. ఇదే సినీమాలో ఘంటసాల మాస్టారు  ఎస్.జానకితో కలసి పాడిన మరో మధురాతి మధుర భక్తి గీతం  'నడిరేయి ఏ జాములో' దాశరధిగారి రచన. పహాడీ రాగ స్వరాలతో చేసిన పాట. తిరుపతి వెంకటేశ్వరుని కొలిచేవారంతా ఘంటసాల వెంకటేశ్వరుడు పాడిన ఈ పాటను మననం చేసుకోకుండా వుండనేలేరు. 





ఈ పాటను తెరమీద పాడే అదృష్టం త్యాగరాజుకు లభించింది. గూండాగా, దుష్టుడిగానే ప్రేక్షకులకు తెలిసిన త్యాగరాజుకు అతి సాత్వికపాత్రలో చూపించి అతని ఇమేజ్ ను మార్చిన బి.ఎన్. రెడ్డిగారి  సాహసమూ, దర్శకత్వ ప్రతిభ అనన్యసామాన్యం. 

ఘంటసాల మాస్టారికి సంబంధంలేకపోయినా రంగులరాట్నం లో మరో అద్భుతగీతం. సుశీలగారు పాడింది. సాలూరివారి సంగీత ప్రతిభకు గీటురాయి "కోయని కోయిల పలికినది" దాశరధిగారి రచన. నీలాంబరి రాగంలో చేసిన ఈ పాటను సుశీలగారు ఎంతో శ్రావ్యంగా, లలితమధురంగా గానంచేశారు. ఈ పాట చివరలో వీణ మీద వినిపించిన 'శృంగారలహరి' (లింగరాజ్ అర్స్ సాహిత్యం, స్వరరచన) చిట్టస్వరంలోని కొన్ని స్వరాలను  చిట్టిబాబుగారు వీణ మీద, తన కోకిల స్వరంతో సుశీలగారు  అత్యంత మనోజ్ఞంగా ఆలపించి పాటకు జీవం పోసారు. ఈ పాట చిత్రీకరణలో బిఎన్ రెడ్డిగారి ప్రతిభ ఎంతైనా కనిపిస్తుంది. ఆ పాట మీరూ వినండి.





"మల్లియలా... రా మాలికలా...రా
మౌనముగా ఉన్నా...రా
మా కధనయే విన్నా...రా "

ఘంటసాలవారి సంగీత ప్రతిభ గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావించినా "జ్ఞాన్ పీఠ్" అవార్డు గ్రహీత  డా. సి.నారాయణరెడ్డి గారు ఈ 'మల్లియలారా' పాట విశిష్టత గురించే చెప్పేవారు. తమ అలవాటుకు మారుగా ఘంటసాల మాస్టారు తనకు ముందు  ఈ ట్యూన్ ఇచ్చి మాటలు వ్రాయమన్నారని, చాలా భావగాంభీర్యం గల సన్నివేశం కనుక మాస్టారి ట్యూన్ కు అనుగుణంగా తగిన పదాలను ప్రయోగించినట్లు సినారె గారు చెప్పేవారు. మధ్యమావతి రాగచాయలలో వున్నదని చెప్పబడుతున్న 'మల్లియలారా' పాట 'నిర్దోషి' చిత్రం లోనిది. ఎన్.టి.రామారావు, సావిత్రిల మీద చిత్రీకరింపబడిన ఈ తొలిరేయి గీతం సూపర్ హిట్ సాంగ్ గా ఈనాటివరకూ బహుళ ప్రచారంలో కొనసాగుతున్నది. ఈ పాట స్వరరచనలో, పాడేప్పుడు భావప్రకటనలో ఘంటసాల మాస్టారి సంగీతప్రతిభ అణువణువున కనిపిస్తుంది. 



ఇదే 'నిర్దోషి' పేరుతో హెచ్.ఎమ్.రెడ్డిగారు 1951 లో ఒక సినీమా తీశారు. ఆ సినీమాకు ఘంటసాలవారే సంగీతదర్శకుడు. ఈ కొత్త చిత్రంలో నటించిన అంజలీదేవి ఆ నిర్దోషిలోనూ నటించారు. ఈ రెండింటి కధాంశం వేర్వేరే.

1967 నిర్దోషి   ఒక క్రైమ్ స్టోరీ. నిర్మాత నర్రా రామబ్రహ్మం. దర్శకుడు దాదామిరాసి. తమిళంలో అనేక క్రైమ్ థ్రిల్లర్స్ తీసిన అనుభవజ్ఞుడు. 

నర్రా రామబ్రహ్మంగారు, అట్లూరి పుండరీకాక్షయ్య గారూ కలసి గతంలో 'మహామంత్రి తిమ్మరుసు' చిత్రం తీసినట్లు చెప్పడం జరిగింది. ఆ సినీమా తీసిన ఐదేళ్ళకు ఇద్దరూ విడివిడిగా ఎన్టీఆర్ హీరోగా సీనీమాలు తీశారు. అందులో గౌతమీ పిక్చర్స్ బ్యానర్ మీద రామబ్రహ్మంగారి 'నిర్దోషి' ఆయనకు ఘంటసాలగారు చేసిన మొదటి చిత్రం. మాస్టారంటే రామబ్రహ్మంగారికి మంచి మర్యాద, గౌరవం వుండేవి. సంగీత దర్శకత్వం విషయంలో పూర్తి స్వేఛ్ఛను ఇచ్చారు. గౌతమీ రామబ్రహ్మంగారి గౌతమీ ఆఫీస్ టి.నగర్ వెంకటనారాయణ చెట్టి రోడ్ మొదట్లోనే రామకృష్ణా మెయిన్ స్కూల్ పక్కనే నానారావు నాయుడు స్ట్రీట్ ను ఆనుకొని వుండేది. నానారావు నాయుడు స్ట్రీట్ చివరలో నటుడు ముదిగొండ లింగమూర్తి గారి ఇల్లు. గౌతమీ ఆఫీసుకు మూడిళ్ళ తర్వాత నటి ఎస్.వరలక్ష్మి మేడ. అది దాటి కొంచెం ముందుకు వెడితే రాజా స్ట్రీట్. అందులో నటి సంధ్య, ఆమె కూతురు, నటి జయలలిత మేడ వుండేవి.

నిర్దోషిలో కొన్ని పాటల కంపోజింగ్ సమయంలో గౌతమీ ఆఫీసుకు వెళ్ళేవాడిని. రామబ్రహ్మంగారు అంత పెద్ద మేడలో (అద్దెదే) ఒంటరిగా వుండేవారు. సంసారం లేదు. కుటుంబం విషయం నాకు తెలియదు. క్రైమ్, ఫ్యామిలి సెంటిమెంట్ కలసిన ఈ నిర్దోషిలో మాస్టారు పాడిన పాటలు రెండు మాత్రమే ఒకటి మల్లియలారా - సోలో, మరొకటి సుశీలగారితో డ్యూయెట్ - 'ఈ పాట నీకోసమే హోయి ఈ ఆట నీకోసమే'.

ఉన్న ఏడు పాటల్లో ఒకటి కొసరాజు గారు, మిగిలిన ఆరూ డా.సి.నారాయణరెడ్డిగారు వ్రాసారు.  ట్యూన్ కు లిరిక్స్; లిరిక్స్ కు ట్యూన్;  రెండు పధ్ధతులలోనూ పాటల రచన సాగింది. క్రైమ్ సినీమాలో ఒక చక్కటి జోలపాట, సుశీలగారు పాడిన 'చిన్నారి కృష్ణయ్య రారా '. 

అలాగే మరో ఫోక్ డాన్స్ టైప్ సాంగ్ ' సింగారి చెకుముకి రవ్వ' పాట. ఈ రెండూ సినీమాకోసం పాడింది పి.సుశీలగారే అయినా ఆ గొంతులోని మార్దవం, భావం  యదాతధంగా ఘంటసాల మాస్టారి బాణియే. పాటలన్నీ జనరంజకంగానే అమరాయి. 

ఘంటసాల మాస్టారు తమ విదేశీ పర్యటనలో పాడిన ఈ నిర్దోషి సినీమాలోని 'మల్లియలారా' పాటతో పాటు 'సింగారి చెకుముకి రవ్వ' పాట కూడా అక్కడి శ్రోతలను బాగా ఆకట్టుకుంది. ఈ పాటలో వున్న ఫోక్ టింజ్ అక్కడివారిని బాగా ఆకర్షించిందని మాస్టారు చెప్పేవారు.


ఇలాటి మరిన్ని మంచి పాటల విశేషాలతో ...
వచ్చే వారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో......

                ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.