visitors

Sunday, June 27, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఏడవ భాగం

27.06.2021 - ఆదివారం భాగం - 37:
అధ్యాయం 2  భాగం 36 ఇక్కడ
                                
                                    నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

🌺

"అయ్యగారు రమ్మంటున్నారు.. రా..."

" నాన్ వారే... నీ పో..."

"అయ్యగారు రికార్డింగ్ కు వెళ్ళాలి. అర్జెంట్ గా రా...."

" నీ పో... ఉడనే వరే...."

" వెంటనే రా.. లేకపోతే అయ్యగారికి కోపం వస్తుంది...."

"సరి సరి.. నీ పో .. నాన్ వరే..."

కొన్నేళ్ళపాటు వాళ్ళిద్దరి మధ్య ఇంతే సంభాషణ.

ఒకరు గుండు మావయ్య( తమ్ముడు కృష్ణ), మరొకరు ఘంటసాలవారి ఆస్థాన బార్బర్. మా ఇంటికి అతి సమీపంలోనే అతని సెలూన్. ఒకరికి తమిళం రాదు; మరొకరికి తెలుగు తెలియదు. అయినా ఒకరి భావాలు మరొకరికి అర్ధమౌతాయి. 

ఘంటసాల మాస్టారి ఇంటికే ఆ బార్బర్ వచ్చేవాడు. అతనిని పిలవడానికి సాధారణంగా తమ్ముడు కృష్ణ వెళ్ళేవాడు. అతనితోకూడా నేను వెళ్ళేవాడిని. వాళ్ళిద్దరి మధ్య ఎన్నేళ్ళయినా ఇవే మాటలు. 

ఆ బార్బర్ ఒకసారి మా తమ్ముడు గోపికి కటింగ్ చేస్తూ జుట్టుతోపాటూ  చెవికూడా  కొంచెం కత్తిరించేసాడు. అంతే! ఆ తర్వాత అతనన్నా అతని సెలూన్ అన్నా హడలెత్తి మావాడు అటుపక్క వెళ్ళడం మానేశాడు. తర్వాత, పానగల్ పార్క్ దాటాక వచ్చే రామన్ కాఫీ వర్క్ షాప్ వరసలోని 'పూఙ్గా ముడి తిరుత్తం' ను మేము పోషించడం మొదలుపెట్టాము.

నాన్నగారికి ఎవరోవచ్చి గెడ్డానికి సోపు రాయడం, అది నురగగా మారడం, వాడు ఒక కత్తితో గీయడం ఇవన్ని మాస్టారి ఐదేళ్ల పాపకు వింతగానూ, ఒక ఆటగానూ తోచింది. ఒక రోజు తానుకూడా ఇదే ఆటను మా పక్కింటి అబ్బాయితో మొదలెట్టింది. గెడ్డం చేసుకోడానికి నరసింగ తయారు చేసి పెట్టుకున్న రేజర్ ని ఉపయోగించే సమయానికి నరసింగ వచ్చి చూడ్డంతో చిన్న రక్తపాతంతో పెద్ద ముప్పు తప్పింది. ఆ పిల్లవాడు కూడా అదేదో ఆటలా ఆనందంగా బుధ్ధిగా కూర్చున్నాడు. పిల్లల విషయంలో ఎంతో జాగురూకత అవసరం. చిన్నపిల్లలను అనుక్షణం గమనిస్తూండాలి. లేకపోతే ఎన్ని అనర్ధాలైనా జరిగే అవకాశం వుంది.

ఘంటసాల మాస్టారికి ఎప్పుడైనా కాసేపు బయట నడవాలని కోరికపుట్టేది. అలాటప్పుడు నాలాటివారిని వెంటపెట్టుకు వెళ్ళేవారు. అలా మాస్టారితో కొన్నిసార్లు కలసివెళ్ళిన ప్రదేశాలు రెండే రెండు, ఒకటి పార్క్ ల్యాండ్స్ హోటల్; మరొకటి పాండీబజార్ లోని 'గ్రాండ్ సెలూన్'. ఎప్పుడు వెళ్ళినా సాయంత్రం సమయంలోనే. పానగల్ పార్క్ నెం.35, ఉస్మాన్ రోడ్ కు చాలా దగ్గరగానే వుండేది. పార్క్ కు నాలుగు ప్రక్కలా పశ్చిమం వేపు ఉస్మాన్ రోడ్డు మీద శారదా విద్యాలయ గర్ల్స్ హైస్కూలు,  కూరల బజార్; దక్షిణం వేపు నాగేశ్వరరావు రావు రోడ్. (అక్కినేని కాదు. 'దేశబంధు' కాశీనాధుని వారి గౌరవార్ధం పెట్టిన పేరు. కొంతకాలానికి రాజకీయాలు కొత్తపుంతలు త్రొక్కడంతో నాగేశ్వరరావు లో 'రావు' కులం పేరుగా భావించి సర్కార్ వారు ఆ 'రావు'ను తొలగించి 'నాగేశ్వర' రోడ్ చేసారు.) ఆ రోడ్డు మీదే తారాచంద్ గలాడా జ్యూవెలర్స్, నల్లి శిల్క్స్, పార్క్ ల్యాండ్స్ హోటల్ ఉండేవి; తూర్పున రామకృష్ణ మిషన్ బాయ్స్ మెయిన్ హైస్కూలు; ఉత్తరం వేపున ప్రకాశం రోడ్డు. ఈ ప్రకాశం రోడ్డు ఉస్మాన్ రోడ్డు కలిసే దగ్గర శారాదా విద్యాలయ గర్ల్స్ హైస్కూలు ఎదురుగా మూలమీద బర్మా షెల్ పెట్రోల్ బంక్ ఉండేది. ఇది ఆనాటికి పనగల్ పార్క్ టోపోగ్రఫీ. తనకు తొలి రోజుల్లో ఆశ్రయమిచ్చిన పానగల్ పార్క్ కు ఒక ప్రదక్షిణం చేసి ఇక చివరగా పార్క్ ల్యాండ్స్ హోటల్ కు వెళ్ళేవాళ్ళం. ఈలోగా రోడ్ మీద ఎవరెవరో తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళుకూడా మాస్టారిని చూసి విష్ చెయ్యడం, పలకరించడం జరిగేది.  ఆ హోటల్ లో కూడా ఘంటసాల మాస్టారికి తెలిసిన  పాత స్టాఫ్, సర్వర్ల్ వుండేవారు. వారంతా మాస్టారిని సగౌరవంగా ఆహ్వానించి అట్టే జనాలు లేని ఫ్యామిలీ రూమ్ లో కూర్చోపెట్టేవారు. నేను, పెద్దబాబు కూడా భద్రంగారితో (ఆయన భోజనం ఆ హోటల్ లోనే)  తరచూ అదే హోటల్ కు వెళుతూండడంవలన అక్కడవారితో బాగానే పరిచయం వుండేది.మాస్టారికి ఆ సమయంలో ఆ హోటల్ కు వెళ్ళడం కేవలం కాలక్షేపం కోసం మాత్రమే. ఆ హోటల్ లో ఆయన ఎప్పుడూ రెండు ఇడ్లీ సాంబార్ మాత్రమే ఆర్డర్ చేసేవారు. అంతే. ఆ రోజుల్లో సామాన్య జనాలకు కూడా ఈ హోటల్ అందుబాటులో వుండేది. కేవలం ఒక ఇడ్లి, రెండు ఇడ్లీలు, సాంబార్ తో రోజంతా కాలక్షేపం చేసే ప్రజానీకం ఎందరో. తీసుకున్నది ఒక ఇడ్లీ అయినా, నాలుగు ఇడ్లీలైనా సమృధ్ధిగా అడిగినప్పుడల్లా చాలా రుచికరమైన సాంబారు వడ్డించేవారు. మామూలు సాదాసీదా జనాలంతా ఆ సాంబారు తోనే కడుపునింపుకునేవారు. అటువంటి దుర్భర వాతావరణంలో జీవించిన మాస్టారు అవన్నీ గుర్తు చేసుకొని చాలా విషయాలు చెపుతూండేవారు. అలా పార్క్ ల్యాండ్స్ లో కొంతసేపు గడిపి, పానగల్ పార్క్ కు మరో వేపునుండి నార్త్ ఉస్మాన్ రోడ్ వేపుకు మళ్ళి మెల్లగా నడుచుకుంటూ ఇంటికి చేరేవాళ్ళం. పార్క్ నుంచి ఇల్లు అర కిలోమీటర్ కన్నా తక్కువ దూరంలోనే ఉండేది. 

అలాగే, మాస్టారికి నడవాలని బుధ్ధిపుడితే వెళ్ళే మరో స్థలం పాండీబజార్ లోని గ్రాండ్ సెలూన్. మా ఇంటి ఎదురు వీధి వ్యాసారావు స్ట్రీట్ చివర నాగయ్యగారి (తర్వాత, రమణారెడ్డిగారి) ఇల్లు దాటాక, కుడిచేతి వేపు రాఘవయ్యా రోడ్ లోని కె.కె.వినాయకమ్ అనే రాజకీయ నాయకుడి  (ఈయన ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ లోనో, అసెంబ్లీ ఎలక్షన్స్ లోనో టి.టి.కృష్ణమాచారికి ప్రత్యర్థిగా పోటీచేశారు.) మేడ దాటి జి.ఎన్.చెట్టి రోడ్ దాటుకుంటూ పాండీబజార్ ప్రారంభంలోని ఆంధ్రా కిళ్ళీ షాప్ దగ్గర కనిపించే తెలుగు సినీమా జనాల పలకరింపులు అందుకుంటూ అక్కడ ఎడమవేపు పాండీబజార్లోకి ప్రవేశించేవాళ్ళం. ఆ రోడ్ పేరు సర్ త్యాగరాయ రోడ్డు. (పిట్టి త్యాగరాయ చెట్టి జస్టిస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు.) ఆ రోడ్డు మీద పాండీబజార్ లో ఎడమచేతివేపు వరసగా గీతా కేఫ్, విల్సన్ మెడికల్ షాప్ (ఉస్మాన్ రోడ్ సలామ్ స్టోర్స్ కు ఎదురుగా విలియమ్స్ మెడికల్ షాప్ వుండేది. ఈ రెండింటి ఓనర్ ఒకళ్ళో కాదో తెలియదు కానీ విలియమ్స్ లో పనిచేసిన మేనేజర్ ఒకాయన విల్సన్స్  లో కనిపించేవారు. నేను 'ఫెరడాల్' విటమిన్ టానిక్ ఆ ఉస్మాన్ రోడ్ విలియమ్స్ లో రెగ్యులర్ గా కొనడానికి వెళ్ళేవాడిని). పాండీబజార్ విల్సన్ మెడికల్ షాప్ దాటాక కేరళా హెయిర్ డ్రెసెస్; పాండీబజార్ పాత పోలీస్ స్టేషన్; గ్రాండ్ సెలూన్; ఆ తర్వాత పాండీబజార్ రోడ్డు కి పేరెలల్ గా ఉన్న రాజా బాదర్ స్ట్రీట్ కి ఇంకా ముందుకెళ్తే ఉండే గోపాలకృష్ణ అయ్యర్ రోడ్డుకి కలుపుతూండే లేన్ కి ముందు సి.ఎస్.ఆర్.గారి చెట్టు, అది అక్కడ అప్పట్లో నారాయణన్ కేఫ్ ముందున ఉండేది. ఇప్పుడదే అక్కడే అడయార్ ఆనంద భవన్ ముందుంది. అవన్నీ దాటి ముందుకు వెళితే నాయర్ రోడ్ దగ్గర పాండీ బజార్ సరిహద్దు. దాన్ని  దాటితే హోలీ ఏంజెల్స్ కాన్వెంట్; అక్కడనుంచి సుమారు అరకిలోమీటర్ దూరంలో ఆ రోడ్ చివర గిరియప్పా రోడ్డు దాటాక ఎడమవేపు కూవం కాలువ గట్టున కేసరీ హైస్కూలు. అది దాటితే మౌంట్ రోడ్; అక్కడ 'యు' టర్న్ తీసుకొని మళ్ళీ అరకిలోమీటర్ దూరంలోని పాండీబజార్లోకి ప్రవేశించేలోపు కుడివేపు కూవం కాలువ దాటాక SRMT 'శ్రీ రామదాస్ ట్రాన్స్ పోర్ట్' వారీ లారీ గొడౌన్, ఆ తరవాత బోగ్ రోడ్. మరికొంచెం దూరం నడిస్తే నాయర్ రోడ్ కు ఎదురుగా డీలక్స్ హోటల్, రాజకుమారి ధియేటర్, కృష్ణా ఫోటో స్టూడియో, భారత్ కేఫ్, అవన్నీ దాటాక ఆంధ్రాబ్యాంక్, డా.గాలి బాలసుందర్రావుగారిల్లు, రామకృష్ణా మెయిన్ బాయ్స్ హైస్కూల్ కాంపౌండ్ వాల్ వంటివి కొన్ని మాత్రమే నా జ్ఞాపకాలలో మిగిలివున్నాయి. 

ఈ పాండీబజార్ మొత్తం ఘంటసాల మాస్టారు నడిచేవారని మాత్రం అనుకోకండి. ఆయన గ్రాండ్ సెలున్ వరకే నడిచేవారు. మిగిలిన స్థలాలగురించి నా చాపల్యం వలన చెప్పినవి. గ్రాండ్ సెలూన్ కు కేరళా హెయిర్ డ్రెసెస్  మధ్య మొదట్లో కొన్నేళ్ళపాటు పోటాపోటీగా వుండేవి. ఆనాటి సెలూన్లన్నీ చాలా పరిశుభ్రంగా మంచి మంచి ఊదువత్తుల పరిమళంతో, చక్కని నాదస్వర సంగీతమో, షెహనాయ్ సంగీతమో, లేక మంచి భక్తి సంగీతమో వినిపిస్తూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా వుంచేవి. గ్రాండ్ సెలూన్ విశాలంగా ప్రశాంతంగా వుండేది. కేరళా హెయిర్ డ్రెసెస్ కన్నా జనాలు రద్దీ తక్కువగా వుండేది. అందుకే ఘంటసాల మాస్టారు అక్కడికి వెళ్ళేవారనుకుంటాను. అలాటిచోట్ల కూడా ఎవరో ఒకరు తెలిసినవారు కనిపించి మాట్లాడేవారు. మాస్టారు హెయిర్ కటింగ్ లేదా షేవింగ్ పూర్తి చేసుకొని వచ్చేవరకు ముందు రూమ్ లో కూర్చొని అక్కడ వుండే ఫిలిం ఫేర్, స్క్రీన్ వంటి సినీమా పత్రికలు తిరగేస్తూండేవాడిని. 

(ఇప్పుడు కూడా కేరళా హెయిర్ డ్రెసెస్ మూడు కటింగ్ లు, ఆరు షేవింగ్ లుగా అధునాతన ఫేషన్లకు తగ్గట్లుగా అభివృధ్ధిలో వుంది.  గ్రాండ్ సెలూను మాత్రం కొన్ని దశాబ్దాల క్రితమే మూతబడింది. కారణం తెలియదు.)

అక్కడనుండి బయటకు వచ్చి మెల్లగా అదే వరసలో వెనక్కి మరలి బరోడా బ్యాంక్ మీదుగా ప్రకాశం రోడ్ లోకి వెళ్ళి నార్త్ ఉస్మాన్ రోడ్ లో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇంటికి వెళ్ళే దోవలో ఎంతోమంది సినీమా పత్రికలవారు కనపడి పలకరించేవారు. వారందరితో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా మాట్లాడేవారు. ఘంటసాల మాస్టారితో ఇలాటి అనుభావాలు 35, ఉస్మాన్ రోడ్డులో మిగతా పిల్లలకన్నా నాకే ఎక్కువగా దక్కాయని చెప్పవచ్చును.

🍀

సినీమా వ్యామోహంగల యాత్రికులు మెడ్రాస్ టి.నగర్ పాండీబజార్లో నారాయణన్ కేఫ్, పానగల్ పార్క్ దగ్గర నల్లీ సిల్క్స్, టి.బి.గలాడా జ్యువెలరీ షాప్, సాయంత్రం పూటైతే పానగల్ పార్క్ కూరగాయల షాప్ ప్రాంతాలలో కొంతమంది నటీనటుల సందర్శనాభాగ్యం పొందేవారు. అయితే అక్కడికి వచ్చే నటులు మేకప్ లేకుండా సహజ రూపాలతో వుండడంతో అభిమానులకు వారిని పోల్చుకోవడం కష్టమయేది. ఆ రోజుల్లో తళుక్కుమనే తారా సందోహాన్ని చూడడానికి అనువైన  ప్రదేశం కోడంబాక్కం పెద్దగేట్, చిన్నగేట్. కోడంబాక్కం స్టూడియోలలో షూటింగ్ కు వెళ్ళే తారలంతా ఈ రెండు గేట్లు మీదుగానే వెళ్ళాలి. ఆ రెండు గేట్లూ లోకల్ ట్రైన్స్ రద్దీ వలన ప్రతీ పది నిముషాలకు మూసేవుంటాయి. కనీసం నాలుగైదు రైళ్ళు వెళ్ళేవరకు మేకప్ వేసుకున్న తారల సౌందర్యాలను తనివితీరే చూసే అవకాశం అక్కడే లభించేది. 1972 తర్వాత పెద్ద గేట్ దగ్గర కోడంబాకం బ్రిడ్జి కట్టడంతో సినీమా యాత్రికుల రవాణా, హంగామా  తగ్గింది. అలాగే తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలివెళ్ళడంతో మద్రాస్ లో  సినీమా యాత్రా బస్సుల రాకపోకలు తగ్గిపోయాయి.

నా వరకు నేను సావిత్రి, జెమినీ గణేశన్లను జంటగా మొదటిసారి చూసింది తారాచంద్ గలాడా షాప్ ముందరే. చాలామంది జూనియర్ ఆర్టిస్ట్ లను పానగల్ పార్క్ కూరగాయల షాప్ లోనే చూశాను. మా ఇంటికి కావలసిన కావలసిన పచారీ సామాన్ల కోసం సలామ్ స్టోర్స్ కు, ప్యూర్ ఫిల్టర్ కాఫీ పొడి కోసం రామన్స్ కాఫీ వర్క్స్ కు, కూరగాయల కోసం పానగల్ పార్క్ కు చాలాకాలం నేనే వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు సావిత్రమ్మగారికి తోడుగా వెళ్ళేవాడిని. పానగల్ పార్క్ కూరగాయల షాప్ నిజానికి సామాన్యులకు అందుబాటులో లేనిదే. అక్కడ అన్నీ, మా విజయనగరం భాషలో చెప్పాలంటే 'ప్రియమే'. అంటే ధర చాలా ఎక్కువే. కానీ అందుకు తగ్గట్లుగా చాలా ఫ్రెష్ గా, వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలు, రకరకాల పళ్ళు, అరటి ఆకులు, కొబ్బరికాయలు, పువ్వులు, సమస్తమూ అక్కడ లభించేవి. తరవాత చాలాకాలనికి కార్పరేషన్ వారు స్లాబ్డ్ రూమ్స్ కట్టేరు కానీ మా చిన్నప్పుడు పార్క్ ఈ చివరినుండి ఆ చివరివరకూ చిన్న పాకల్లో కొన్ని షాపులుంటే వాటికి ఎదురుగా ప్లాట్ఫారమ్ మీద మరిన్ని చిన్న షాపులుండేవి. ప్రతీ షాపు వాడు రకరకాల ఊదువత్తులు వెలిగించి పెట్టేవారు. అలాగే అక్కడి పువ్వుల దుకాణాల్లోంచి వచ్చే సుగంధపరిమళాలతో అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుండేది. మాంబళం రైల్వే స్టేషన్ రోడ్ అంతా కూడా కూరగాయల షాపులే. అక్కడ కూరగాయలు చాలా చౌక (చీప్)గా దొరికేవి. కాని అంత దూరంనుండి కూరగాయలు మోసుకురావడం ఒక పెద్ద సమస్యగా వుండేది. వేసవికాలంలో ముఖ్యంగా మామిడికాయ ఊరగాయల సీజన్లో ఈ రెండు కూరగాయల ప్రాంతాలు తెలుగువారితో రద్దీగా వుండేవి. మనం ఎంచుకున్న మామిడికాయలను అక్కడే కీలుకత్తిపీటతో ముక్కలు చేసి ఇచ్చే సౌకర్యం వుండేది. కాకపోతే అక్కడివాళ్ళు తరిగే అన్ని ముక్కలకు టెంక వుండేదికాదు. వాళ్ళు చాలా స్పీడ్ గా  కాయలను టకటక కొట్టిపడేస్తారు. ఇందుకు సిధ్ధపడేవాళ్ళు, ఒంట్లో ఓపికలేనివారు ఆ మామిడికాయల షాపులను ఆశ్రయించేవారు. 

ఆవకాయల సీజన్ 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో కూడా చాలా హాడావుడిగానే సాగేది. మాస్టారింట్లో ఆవకాయలకు కావలసిన  ప్రశస్థమైన ఆవాలు, ఎండుమిరపకాయలు, నువ్వులనూనె అన్నీ  గుంటూరు నుండే వచ్చేవనుకుంటాను. ఒక్కో ఏడాది అయితే పొడులు రూపంలోనే వచ్చేవి. మాస్టారింట్లో ఎప్పుడూ ఏడాది పొడుగునా కావలసిన మామిడికాయ ఊరగాయలు, దోసావకాయ, కొరివికారం, గోంగూర పచ్చడి అంటూ రకరకాల ఊరగాయలు నోరూరించేవి. మా అమ్మమ్మగారు, అమ్మగారు కూడా ఆవకాయ స్పెషలిస్టులే. మాస్టారింట్లో కృష్ణాజిల్లా స్టైల్ అయితే మా ఇంట్లో ఉత్తరాంధ్రా స్టైల్ ఊరగాయలు.  మా లోగిట్లోవారికి ఈ ఆవకాయ నోరూరిస్తే, మా పక్కింటివాళ్ళకు మాత్రం కడుపు, ఒళ్ళు మండేవీ ఆ ఆవకాయల ఘాటుకి. తమిళులు కారానికి ముఖ్యంగా తెలుగువారి కారానికి ఆమడ దూరం. ఇదే ఆవకాయల సీజన్ లో మా దొడ్డమ్మగారు గోంగూర పువ్వుతో పచ్చడి చేసి ప్రత్యేకంగా శాంతి ఆశ్రమంనుండి తెచ్చేవారు. ఏమైనా తెలుగువారు ఊరగాయల స్పెషలిస్ట్ లే. అయితే నవతరం వారి టేస్ట్ లు, దేహారోగ్య పరిస్థితులు  చూస్తూంటే ఊరగాయల శకానికి స్వస్తి పలికేట్టుగానే కనిపిస్తోంది.

ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇలాటి ఒక మామిడికాయల సీజన్ లోనే నేను రాధాకుమారిగారిని మొదటిసారిగా పానగల్ పార్క్ కూరగాయల షాపుల్లో చూశాను. (ఆ కుటుంబంతో గల స్నేహం మరో అధ్యాయంలో చెపుతాను) అప్పటికి ఆవిడను ఏ సినీమాలోనూ చూడలేదు. పత్రికల్లో బొమ్మలు తప్ప. అయితే వాణీమహల్లో  వేసిన 'పట్టాలు తప్పిన బండి' నాటకంలో చూశాను. ఆ నాటకం రావి కొండలరావుగారి నాటకం. అప్పట్లో వాళ్ళు పనగల్ పార్క్ దగ్గరే వాసన్ స్ట్రీట్ లో ఎక్కడో వుండేవారు. సాయంత్రం ఆరయేసరికి చక్కగా ముస్తాబై తెల్లటి చీరలో కూరగాయల షాపులలో ప్రవేశించేవారు. చాలా ధాటీయైన గొంతు. తూనికల విషయంలో ఒకసారి రాధాకుమారి ఒక షాపు వాడితో గొడవపడడం చూశాను. ఈవిడ విజయనగరం తెలుగులో, ఆ షాపువాడు అరవంలోనూ కొంతసేపు ఘర్షణ పడ్డారు. అప్పుడే తెలిసింది ఆవిడ తెలుగావిడని. అలాగే సురభి బాలసరస్వతి, జూ. శ్రీరంజనీ, ఛాయాదేవి, ముక్కామల, వీరంతా ఆ కూరల షాపుల్లో కనపడేవారు. పానగల్ పార్క్ మార్కెట్లో బేరాలుండవు. వచ్చినవాళ్ళూ చేయరు. ఎందుకంటే అక్కడికి వచ్చేవాళ్ళలో ఎనభైశాతం ధనవంతులు, ఎక్కువగా మార్వాడీలు. కార్లలోంచి హుందాగా  దిగి ముందుకు వెడుతూంటే వాళ్ళ వెనకే  అర్భకంగా వుండే వాళ్ళింటి పనివాళ్ళో లేక  డ్రైవర్లో గంపలు, పెద్దపెద్ద సంచులు మోసుకు వస్తూంటే వీళ్ళు ఆ కూర రెండు కిలోలు, ఈ కూర మూడు కిలోలు, ఇవి ఐదు కిలోలు అంటూ కిలోల లెఖ్ఖన కొనేవాళ్ళు. వెనకొచ్చినవాళ్ళు అమ్మగార్ల షాపింగ్ పూర్తి అయేవరకు పాపం! ఆ బరువంతా మోస్తూ  వెనకాలే తిరిగేవాళ్ళు. ఇక బేరం ప్రసక్తేముంది?

💐

సినీమాల పట్ల తెలుగు, తమిళులకు వున్నంత మోజు, వీరాభిమానం, వ్యక్తి ఆరాధన ఇతర ప్రాంతాలలో కనపడదు. కేరళ, బెంగాలీ ప్రాంతాలలో సినీమా క్రేజ్ తక్కువ అనేవారు. సినీమా కూడా ఇతర పరిశ్రమలు, వ్యాపారంలాంటిదిగానే భావించేవారు. సినీ నటులకు పెద్దగా ప్రత్యేక గుర్తింపు వుండేదికాదని అనేవారు. ఆ రోజుల్లో సినీ కళాకారులకు ఎక్కువగా ప్రచారాన్ని కల్పించేది సినీమా పత్రికలే. సినీమా నటీనటులు, నిర్మాతలు‌, అనేక సినీమా పత్రికల మనుగడకోసం ఇతోధిక ఆర్ధిక సహాయం చేసేవారు. అందుకు ప్రతిఫలంగా తగిన ప్రచారాన్ని ఆయా పత్రికలవారు చేసేవారనడంలో అతిశయోక్తి లేదు.

విజయనగరంలో నా చిన్నప్పటినుండీ పత్రికలలో సినీమా బొమ్మలు సినీమా వార్తలు కనపడేవి. అప్పట్లో 'కినీమా' అనే పూర్తి సినీమా విషయాలతో నిండిన బొమ్మల పుస్తకం వచ్చేది. ఈనాడు మనం చెప్పుకునే 'సినీమా' అనే మాటను పాత రోజుల్లో 'కినీమా' అని అనేవారేమో. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి వార పత్రికలలో కూడా చివరగా ఓ నాలుగైదు పేజీలు సినీమా వార్తలకు, సమీక్షలకు, బొమ్మలకు కేటాయించేవారు. ఆయా పత్రికల అట్టల మీద సర్వసాధారణంగా సినీ తారల బొమ్మలే వుండేవి. గాయకుల బొమ్మలో, దర్శకుల బొమ్మలో, సంగీత దర్శకుల బొమ్మలో అసలు కనిపించేవికావు. మొదటినుండీ సినీమా అంటే నటీనటులే. మద్రాస్ వచ్చాక ఎన్నో సినీమా పత్రికల పరిచయం కలిగింది.


ఘంటసాల మాస్టారింటికి అనేక రకాల పత్రికలు వచ్చేవి. అందులో సినిమా పత్రికలూ వుండేవి. చందాలు కట్టి తెప్పించేవి కొన్నయితే, చందాలు కట్టనివీ వచ్చేవి. రామనాధ్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో జివిజి కృష్ణగారు ఎడిటర్ గా 'సినీమారంగం'; ఇంటూరి వెంకటేశ్వరరావు గారి 'సినీమా'; గోటేటి రామారావుగారి 'మధురవాణి'; కె.కె.శర్మగారి 'కాగడా'; శ్రీకృష్ణగారి 'మెఱుపు'; రమణమూర్తి గారి 'కొరడా' మరెవరిదో 'చిత్రభూమి' ఇలా రకరకాల సినీమా పత్రికలు ఘంటసాల మాస్టారింటికి వచ్చాకే నాకు పరిచయం అయ్యాయి.

తెలుగులో సినీమారంగం అయితే, అదే తమిళంలో 'పేసుమ్ పడమ్'. పాకెట్ సైజ్ పుస్తకరూపంలో వచ్చేది. తెలుగు విభాగానికి జి.వి.జి.కృష్ణగారు ఎడిటర్. ఆయన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత, నటుడు కూడా. దేవదాసు సినీమాలో సావిత్రి (పార్వతి) సవతి కొడుకుగా నటించింది జి.వి.జి.కృష్ణగారే. పౌరాణిక చిత్రాలలో బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు అంటే నిర్మాతలకు జి.వి.జి.గారే గుర్తొస్తారు. ఘంటసాల మాస్టారి పాటల్లో భావాలు ఫోటో ఫీచర్ ను జి.వి.జి.కృష్ణగారే ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి సినీమా రంగంలో ప్రచురించారు. ఆ ఫోటోలను ఈనాటికీ మనం అనేక ఛానల్స్ లో, సమూహాలలో చూస్తూంటాము. సినీమారంగం తెలుగు సినిమా పత్రికలలో అగ్రశ్రేణిలో ఉండేది.

ఇంటూరి వెంకటేశ్వరరావుగారి 'సినీమా' కూడా బహుళ జనాదరణ పొందిన పత్రికే. ఇంటూరివారు నాగయ్యగారికి పరమభక్తుడు. సినీ జర్నలిస్టులకు భీష్మాచార్యుడు. నాగయ్యగారి అంత్యక్రియలు జరిపించడంలో, ఆయన శిలావిగ్రహాన్ని పానగల్ పార్క్ లో ప్రతిష్టించడంలో ఇంటూరివారి కృషి అనన్యసామన్యం. 'సినీమా' పత్రికలో సినీమాలకు సంబంధించిన అనేక ఫీచర్లుండేవి. అందులో ఇంటూరి వారి 'ఎక్స్ట్రా నటి వెంకాయమ్మ' ధారవాహికగా వచ్చేది. 'గోచీకట్టి గోదాలోకి దిగడం' అనే మాట ఇంటూరివారి పెట్ పదం. నాకెందుకో ఆ వెంకాయమ్మను తల్చుకున్నప్పుడల్లా నటి ఛాయాదేవే గుర్తుకు వచ్చేది. ఇంటూరి వెంకటేశ్వరరావుగారి 'సినీమా'లో మరో ముఖ్యమైన ఫీచర్ 'ప్రశ్న-జవాబులు' ఏచూరి చలపతిరావు, భీమవరంనుండి బి.మొహిద్దీన్ బాషా, మచిలీపట్నం నుండి ఎన్.వి.ఎస్.చలపతిరావు, ఐ.అర్జునరావు రెగ్యులర్ గా ప్రశ్నలు పంపేవారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు తమాషాగా, వినోదం కలిగించేవిగా ఉండేవి.

ఒకాయన అడుగుతాడు 'జానపద చిత్రాలకు ఎన్.టి.రామారావును మించినవాడు లేడని నేనూ, 'కాదు...అక్కినేనే మిన్న అని నా మిత్రుడు వాదించుకుంటున్నాము', మరి మీరెవరితో ఏకీభవిస్తారు ఎడిటర్జీ', అని. ఇంటూరివారికి ఈ ఇద్దరు నటుల సహకారమూ కావాలి. అందుచేత పాము చావకుండా, కర్ర విరగకుండా వుండేలాటి సమాధానం ఏదో చెప్పి గోడ దాటేసేవారు.

మరొక అభిమాని ప్రశ్న 'దేవదాసు లోని ఘంటసాల పాటలు గొప్పవా, లేక జయభేరి లో ఘంటసాల పాటలు గొప్పవా? తెలియజేయండి' అని. ఇలాటి కాలక్షేపం బఠాణీలు అనేకం 'సినీమా'లో కనిపించేవి. 

ఆనాటి ప్రమాణాలకి తెలుగులో యెల్లో జర్నల్ గా చెప్పుకో తగ్గది  కామేశ్వర శర్మగారి 'కాగడా'. ఎక్కువగా సినీ తారల 'గ్లామర్' ఫోటోలతో కొంచెం సరస గాసిప్స్ సంయుక్తంగా నడిచేది. 

'కొరడా' రమణమూర్తిగారు నటి రాధాకుమారిగారి తండ్రి. రావికొండలరావుగారి మామగారు. కొండలరావుగారు కూడా ప్రముఖ జర్నలిస్టే. రమణమూర్తిగారికి వచ్చే ఆదాయం ఆయన సిగరెట్లకే చాలేది కాదేమో అనిపించేది.

వీరు కాకుండా వాసిరాజు ప్రకాశంగారు, ముళ్ళపూడి వెంకట రమణగారు, వి.ఎ.కె.రంగారావుగారు వీరంతా కూడా సినీ జర్నలిజంలో నిష్ణాతులే.

'సినీమారంగం' వంటి ఏ ఒకటి రెండు పత్రికలో తప్ప మిగిలిన సినీమాపత్రికలన్ని నిర్మాతలు ఇచ్చే సినీమా ప్రకటనల మీదే ఆధారపడేవి. కొన్ని కొన్ని పత్రికలు కొన్ని మాసాలపాటు కనపడేవేకావు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ పుష్కలంగా సేకరించి వాటిమీద వచ్చే ఆదాయంతో పత్రికలు నడిపేవారు. ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ పత్రిక కూడ పెద్ద నిర్మాతల సహకారం వుండాలనే భావనలోనే వుండినట్లు ముళ్ళపూడి రమణగారి జీవితచరిత్రలో చదివాను. ఆయన ఆంధ్రపత్రికలో పనిచేసేప్పుడు విజయావారి 'అప్పుచేసి పప్పుకూడు' సినీమా మీద తీవ్రంగా విమర్శించారట. అది చూసి చీఫ్ ఎడిటర్ శివలంక శంభూప్రసాద్ గారో లేక రాధాకృష్ణగారో అన్నారట 'నువ్వింత ఘాటుగా విమర్శిస్తే చక్రపాణిగారికి కోపం వస్తుదేమో! మనకు రావలసిన ప్రకటనలు ఆగిపోతాయేమో! కొంచెం ఆచి తూచి సమీక్షలు రాయి' అని సలహా ఇచ్చారట. మరి అంత పెద్ద సంస్థకే అలాటి బెదురున్నప్పుడు ఇక సామాన్య పత్రికల సంగతేమిటి. ఫిలింఫేర్, స్క్రీన్, స్టార్ ఎండ్ స్టైల్ వంటి ప్రముఖ సినిమా పత్రికల ముందు ప్రాంతీయ సినిమా పత్రికలు సూర్యుడి ముందు దివిటీల వంటివే.

ఇలాటి పరిస్థితులలో విజయావారే తమ బి.ఎన్.కె ప్రెస్ నుండి అత్యంత భారీ ఎత్తున వివిధ భాషలలో ఒక రంగు రంగుల సినీమా మాస పత్రిక ప్రారంభించారు. అదే 'విజయచిత్ర'. తమిళంలో 'బొమ్మై'. ఈ పత్రిక ప్రభావంతో అనేక సాదాసీదా సినీమాపత్రికలు తుడిచిపెట్టుకుపోయాయి. రావికొండలరావు కోటలో పాగా వేశారు. విజయచిత్రకు సబ్ ఎడిటర్ గా తన అనుభవసారంతో ఎన్నో మంచి శీర్షికలు ప్రవేశపెట్టారు. 'విచి'గా పాఠకుల వింత ప్రశ్నలకి విచిత్రమైన జవాబులిచ్చేవారు. విజయచిత్ర సెంటర్స్ప్రెడ్ నటీమణులు షర్మిలా టాగోర్, ముంతాజ్, రేఖ, సాధన వంటి గ్లామర్ క్వీన్ లు కాలేజీ కుర్రాళ్ళ రూముల గోడలమీద ప్రధాన ఆకర్షణగా దర్శనమిచ్చేవారు. ఎన్నో సంవత్సరాలపాటు విజయచిత్రే అగ్రశ్రేణి సినీమా పత్రికగా విరాజిల్లింది.

ఇక ఈ చిన్న చిన్న సినీమా పత్రికల వారంతా ఉదయం నుండి సాయంత్రం వరకూ ప్రకటనల సేకరణలో, చందాల వసూళ్ళతోనే సతమతమయ్యేవారు. ఈ క్రమంలో ఇంటూరి మొదలు రమణమూర్తి వరకు ప్రతీ పత్రికాధిపతి మాస్టారు ఇంటికి చందాలకోసం వచ్చేవారు. అసలు ఘంటసాలవారికి పత్రికా పఠనమే అలవాటు లేదు. అందులోనూ సినీమా పత్రికలు చూసే ఆసక్తి ఆయనకుగానీ,  ఇంట్లోవారికి గాని అసలు లేదు.  వచ్చిన ఆ పత్రికలన్ని ముందునుండి చివరవరకూ నేనే చదివేవాడిని. కానీ, ఘంటసాలగారు చాలా ఉదారులు, సహృదయులు. తనకు ఈ పత్రికలు పంపవద్దని,  తనకు తోచిన ఆర్ధిక సహాయం అడపాదడపా చేసేవారు. ఆయన వద్దన్నా కూడా ఏవో కొన్ని పత్రికలు ఇంటికి వస్తూనేవుండేవి. షరా మామూలే.

ఈ వారం చాలా విషయాలే ముచ్చటించినట్లున్నాను.

మిగిలిన విషయాలు...వచ్చే ఆదివారము నాడూ
మెచ్చుక కలసి ....చూసెదమూ....

            ...సశేషం




Sunday, June 20, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఆరవ భాగం

20.06.2021 - ఆదివారం భాగం - 36:
అధ్యాయం 2  భాగం 35 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1957 - 2021
🌿

మా ఆత్మీయ కుటుంబ సభ్యుడుఅభిమానులను, సన్నిహితులను దుఃఖంలో ముంచి అర్ధారంతరంగా వెళ్ళిపోయిన శ్రీ ఘంటసాల వెంకట రత్నకుమార్ కు మా హార్దిక శ్రధ్ధాంజలి.

💐💐💐

మా పక్కిల్లు, నెం.36, ఉస్మాన్ రోడ్, రాజగోపాలన్ మామా ఇంటి మేడమీదకు ఒక తెలుగు కుటుంబం అద్దెకు వచ్చారు. ఆ కుటుంబ పెద్ద పేరు మండా బుచ్చి రామారావుగారు. ఆర్మీ ఇంజనీర్. ఎక్కడో నార్త్ నుండే ట్రాన్సఫరై మద్రాసు వచ్చారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి బి.ఎస్.సి.  తిరుపతిలో, చిన్నమ్మాయి పి.యు.సి మద్రాస్  కాలేజీలో  జాయిన్ అయ్యారు. మాకు ప్రక్కనే మరో తెలుగు కుటుంబం రావడం మా అందరికీ ఆనందం కలిగించింది. ఆ కుటుంబంలోని వారంతా చాలా కలివిడిగా, స్నేహపూర్వకంగా వుండడంతో ఆ అక్కచెల్లెళ్ళిద్దరూ నెం.35, ఉస్మాన్ రోడ్ లోనే వుండేవారు. ఘంటసాల మాస్టారు ఇంట్లో లేని సమయంలో వచ్చి అమ్మగారితో కబుర్లు చెప్పేవారు. వాళ్ళకు సావిత్రమ్మగారితో మంచి స్నేహం కుదిరింది. 

 

పెద్దమ్మాయి తిరుపతిలో హాస్టల్ లో వుండి చదువుకుంటూ శని ఆదివారాలలోశెలవుల్లో మద్రాసు వచ్చేది. ఆ అమ్మాయితో పాటూ అక్కడ ఎమ్.బి.బి.ఎస్ చేస్తున్న ఆమె స్నేహితురాలు కూడా మద్రాసు వచ్చి శెలవులన్నీ వీరితో గడిపేది. ఆ అమ్మాయిది విజయనగరం. మా విజయనగరానికి సంబంధించిన అమ్మాయే అనేసరికి, వాళ్ళెవరో నాకు తెలియకపోయినా  నాకు చాలా సంతోషం కలిగింది. తండ్రి విజయనగరంలో ఓ సినీమా హాలు' ఓనర్ అని చెప్పిన గుర్తు. రాజకీయ పలుకుబడి కూడా వుందనుకుంటాను. ఆ ముగ్గురికి అన్నదమ్ములు లేకపోవడం వలన నన్ను, పెద్దబాబు విజయకుమార్ ను, మాస్టారింట్లోని నరసింగని తమ అన్నదమ్ముల్లాగనే అభిమానంతో చూసుకునేవారు. మేమూ తరచు వాళ్ళ మేడమీద క్యారమ్స్ లాటి గేమ్స్ ఆడేవాళ్ళం.


రామారావు గారిని ఆఫీస్ కు తీసుకువెళ్ళడానికి ఆర్మీ వ్యాన్ వచ్చేది. ఫోర్ట్ సెయింట్ జార్జ్ లో ఆఫీస్. సాయంత్రం ఆరు లోపలే ఇంటికి చేరేవారు. ఆ దంపతులిద్దరూ కూడా మేమంటే ఎంతో ప్రేమ చూపించేవారు. ఆయన ఆదివారం శెలవు రోజున ఘంటసాల మాస్టారితోనూ, సావిత్రమ్మగారితోనూ ముచ్చటించేవారు.

 

మండా బుచ్చి రామారావు గారితో మొదట్లో మాకు కలిగిన ఒక అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను. అదేమిటంటే ---

 

రామారావు గారికి అరవం మట్లాడడం రాకఒక రోజు నన్ను, నరసింగడిని పిలిచి ఒక నలభై పేజీల రూల్డ్ నోట్ బుక్ కొనితెమ్మని డబ్బులు ఇచ్చారు.  వారింటి తర్వాత రెండిళ్ళకు ఎదురుగా ఒక ప్రొవిజన్ స్టోర్ వుండేది. అందులో స్టేషనరీ ఐటెమ్స్ కూడా దొరికేవి. మేము ఐదు నిముషాలలో ఆయన అడిగిన పుస్తకం కొని తెచ్చి ఇచ్చాము. ఆయన ఆ పుస్తకాన్ని నాలుగు పక్కలా చూసి అట్ట నలిగిపోయిందయ్యా అంటూ ఒక్కొక్క పేజీ లెఖ్ఖపెట్టడం మొదలుపెట్టారు. అన్ని పేజీలు లెఖ్ఖపెట్టి ఇందులో నలభై పేజీలు పూర్తిగాలేవు, ముఫ్ఫైఎనిమిదే వున్నాయి. ఇది ఇచ్చేసి పూర్తిగా నలభై పేజీలున్న పుస్తకం పట్రండి. వెళ్ళండి అన్నారు. మళ్ళీ ఆ పుస్తకం ఇచ్చేసి మరో మంచి పుస్తకం ఇవ్వమని అడిగాము. ఆ దుకాణం చెట్టియార్ మాకు పరిచయం వుండడం వలన మరో పుస్తకం ఇచ్చాడు. మేము అక్కడే ముందునుంచి చివర వరకు అన్ని పేజీలు లెఖ్ఖపెట్టాము. అందులోనూ ముఫ్ఫైఎనిమిది పేజీలే వున్నాయి. నలభైపేజీలు లేవు. ఆ కొట్టతను చెప్పిందేమిటంటే ముందు వెనక అట్టలకి అంటించిన పేజీలతో కలిపి నలభై పేజీలుగా పుస్తకాలు వేస్తారు.  అరవై పేజీలంటే ఏభై ఎనిమిది, ఎనభై పేజీలంటే డెభ్భై ఎనిమిది పేజీలుంటాయనిమీరే పుస్తకం కొన్నా అంతేనని చెప్పాడు. కావాలంటే మరో షాపులో కొనమని డబ్బులు తిరిగి ఇచ్చేసాడు. అదే విషయాన్ని రామారావు గారికి చెప్పాము. మిమ్మల్ని వాడు మోసం చేస్తున్నాడు. నేను రేపు ఆఫీస్ నుండి వచ్చేప్పుడు పూర్తిగా నలభై పేజీలున్న పుస్తకం కొని తెస్తాను చూడండని ఇచ్చిన డబ్బులు జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత రామారావుగారు కొన్న పుస్తకము మాకు చూపించనూ లేదుమేము అడగనూ లేదు.

 

ఆయనకు శెలవు దినాలలో వచ్చి సావిత్రమ్మగారితో మాట్లాడేవారు. తన కుటుంబ కష్ట సుఖాలుసమస్యలు ఆవిడతో చెప్పేవారు. "ఇందిరాగాంధీ, లిండన్ జాన్సన్ల (అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గా లిడన్ జాన్సన్, భారతదేశ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ వుండేవారు) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది ఎవరూ డిస్టర్బ్ చేయకండని ఇంట్లోవాళ్ళు సరదాగా అనుకునేవారు.  


మండావారి కుటుంబం మా పక్కింట్లో సుమారు మూడేళ్ళపాటు వున్నారనుకుంటాను. తర్వాత మళ్ళీ వేరే చోటికి ట్రాన్స్ఫరై వెళ్ళిపోయారు.

 

ఆ తర్వాత కొన్నేళ్ళకు 1972 లో నేనుమా ఆవిడా  మా దొడ్డమ్మగారి అమ్మాయి శారదక్కను చూడడానికి ఒరిస్సా బోర్డర్ లోని పాతపట్నం వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా రోడ్ మీద రామారావు గారుఆయన భార్య కనిపించారు. ఆ ఇద్దరూ అలాగే వున్నారుఏ మార్పులేదు. అదే ఆప్యాయతతోఅభిమానంతో  పలకరించి మట్లాడారు. ఆ పాతపట్నంలో వారికేవో పంట భూములున్నాయని వాటి వ్యవహారాలు చూసుకుందుకు వచ్చామని చెప్పారు. పెద్దమ్మాయి పెళ్ళయి బొంబాయిలో వుందని, అల్లుడు ఏదో బ్యాంకులో మేనేజర్ అని చెప్పారు. రెండో అమ్మాయి పూనాలో వుంటోందని అన్నారు. వివరాలు ఆయన చెప్పనూలేదు. మేమూ అడగలేదు. అంతే ఆ తర్వాత వారిని మళ్ళీ చూడడం జరగలేదు. కానీమరికొన్నేళ్ళకు వారమ్మయిలను మాత్రం ఘంటసాలవారింట్లో ఒక అమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడు చూశాను. అక్కడితో ఆ కుటుంబంతో స్నేహం ముగిసింది.


ఘంటసాల మాస్టారు చాలా సహృదయులు. తనకు చేతనైనంత వరకూ ఇతరులకు సహాయంచేసేవారు. 'నెం.35,ఉస్మాన్ రోడ్' మేడమీది భాగం పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడే మేముంటున్న ఔట్ హౌస్ డాబా మీద ఒక 'కొట్టాయ్వేయించారు. (కొబ్బరాకులశాల. ఆంధ్రా ప్రాంతాలలో ఇళ్ళకు తాటాకు లేదా చొప్ప వాడతారు. ఇక్కడ దక్షిణాదిన కొబ్బరాకుల మట్టలు అల్లి వాటిని పైకప్పుగా వేస్తారు)

 

నాకు తెలిసి మా డాబామీది కొట్టాయిలో ముందుగా భద్రంగారి కుటుంబం ప్రవేశించింది.  భద్రంగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మా తాతగారి శిష్యుడు. స్వస్థలం కొవ్వూరు అనుకుంటాను. గాయకుడు కావాలని మద్రాసు వచ్చి అందులో తగిన ప్రోత్సాహం లభించక ఘంటసాల మాస్టారి సలహాప్రోద్బలం మేరకు వైలిన్ ప్రాక్టీసు చేసి మాస్టారి ఆర్కెష్ట్రాలో, కచేరీలలో చోటు సంపాదించారు. తన భార్యముగ్గురు చిన్న పిల్లలతో ఆ కొట్టాయిలో కాపురం వుండేవారు. 35, ఉస్మాన్ రోడ్ రాశి ఏమిటో కానీ, ఆ భవనం ఎప్పుడు పిల్ల పాపల కేరింతలతో, ఆటపాటలతో మహా సందడిగా వుండేది. భద్రంగారికి ఒక ఆడపిల్ల? ఇద్దరు మగపిల్లలు - బాలచంద్ర, జయచంద్ర అని గుర్తు. పిల్లలిద్దరూ సినీ ఆర్కెస్ట్రాలలో వైలనిస్ట్లుగా స్థిరపడ్డారు. వీళ్ళంతా వయసులో నాకంటే బాగా చిన్నవాళ్ళు.


భద్రంగారు పొగచుట్టలు చుట్టడంలో సిద్ధహస్తులు. అయితే ఆయనకు పొగత్రాగే అలవాటు లేదు. ఘంటసాల మాస్టారికి నెలకు సరిపడా భద్రంగారే చుట్టలు చుట్టేవారు. మాస్టారి స్నేహితుడు గోసాల రామదాస్ వచ్చినప్పుడల్లా చేబ్రోలు పొగాకు తెచ్చేవారు. దానితోనే మాస్టారి చుట్టలు తయారయేవి. రోజుకు మూడు మాత్రమే కాల్చేవారు. 


ఒకసారి ఎప్పుడో ఇంట్లోని చుట్టలు అయిపోతే పాండీబజార్ ఆంధ్రా కిల్లీ షాప్ నుండి  దొరలు కాల్చే స్పెన్సర్ చుట్టలు కొన్ని కొని తెచ్చాను. కానీ అవి మాస్టారికి అంతగా నచ్చలేదు. 

 

భద్రంగారు వైలిన్ సాధన మొదలుపెట్టిన కొత్తల్లో తన చేతి వ్రేళ్ళకు ఏ కష్టమైన పని పెట్టేవారు కాదు. చాలా సుకుమారంగా జాగ్రత్తగా చూసుకునేవారు. వైలినిస్ట్ కు తన వేళ్ళే ప్రధానం అని చెప్పేవారు. భద్రంగారు వైలినిస్ట్ అయ్యారు కానీ ఏస్ వైలినిస్ట్ కాలేకపోయారు. కొన్నేళ్ళ తర్వాత భద్రంగారు నెం. 35, ఉస్మాన్ రోడ్ వదలి వళసరవాక్కం వెళ్ళిపోయారు.

 

మా ఔట్ హౌస్మీది కొట్టాయిలోకి బలి నారాయణ వచ్చారు. బలి పామర్తిగారి అన్నకొడుకు. పామర్తిగారు అతని సంరక్షణ భారం వహించి మద్రాసు తీసుకువచ్చారు. పామర్తిగారు అతనికి ఒక డోలక్ కొనిచ్చి శిక్షణ ఇచ్చారు. బలి గంటల తరబడి ఆ డోలక్ మీద సాధన చేయడం గుర్తుంది. వారికీ ఇద్దరు పిల్లలు. బలి మామగారు వెంపటి ముక్తేశ్వరరావుగారు మార్దంగీకుడు. ప్రముఖ కూచిపూడి కళాకారుల నృత్యాలకు మృదంగం వాయించేవారు. అలాగేసినీమాలలో వచ్చే కూచిపూడి నృత్య దృశ్యాలలో మృదంగం వాయిస్తూ కనపడేవారు. బలి ఒక మరదలి కొడుకు కొన్నేళ్ళక్రితం వరకూ తెలుగు టివి సీరియల్స్ లో నటించేవాడు. పేరు రాజేష్ అనుకుంటాను. బలి మొదట్లో మాస్టారివద్ద, పామర్తిగారివద్ద రిథిమ్ సెక్షన్లో  పనిచేసేవారు. క్రమేపి బలి నారాయణగారికి  అప్పారావుతో స్నేహం పెరిగింది. ఎప్పుడైతే అప్పారావు చక్రవర్తిగా మారారో అప్పుడే బలి నారాయణ దశ కూడా తిరిగింది.  చక్రవర్తి ఆర్కెష్ట్రా అరేంజర్గా బలి బాగా అభివృధ్ధిలోకి వచ్చారు. 


నెం.35, ఉస్మాన్ రోడ్ మేడ మీది భాగం పూర్తి అయ్యాక మాస్టారి కుటుంబం అంతా మేడమీదకు షిప్ట్ అయ్యారు. మా ఔట్ హౌస్ వేపునుండి కూడా మేడమీదకు వెళ్ళడానికి మెట్లు పెట్టించారు. బయటనుండి వచ్చేవారికి ముందువేపు మెట్లు, ఇంట్లోవారికి వెనకవేపు మెట్లు ఉపయోగంలో వుండేవి. అప్పుడే  రికార్డ్ ర్యాక్స్ తో కొత్త రేడియోగ్రామ్, కొత్త సోఫా సెట్ వంటివి ఇంట్లో అమరాయి. ఘంటసాల మాస్టారు ఆడంబరం, ఆర్భాటాలకు దూరం. ఆయనను అనుసరించే సావిత్రమ్మగారు కూడా తమ కుటుంబాన్ని నిరాడంబరంగా సామాన్య మధ్య తరగతి కుటుంబంలా నిర్వహించేవారు. గృహాలంకరణ, పిల్లల వేషభాషలు అన్ని సామాన్యంగానే వుండేవి. ఇతర సినిమా వాళ్ళ ఇళ్ళలో వుండే హంగుఆర్భాటాలు ఏవీ ఘంటసాలవారింట్లో కనపడేవికావు. అందువల్లనే నాలాటివాడు ఆ ఇంట్లో చనువుగా మసలడానికి వీలయింది.

 

మాస్టారి కుటుంబం మేడమీదకు వెళ్ళాక క్రింది పోర్షన్ లో ముందుగా ఒక మార్వాడి కుటుంబం అద్దెకు వచ్చారు. అప్పటినుండి నేను పోర్టికోలో కాలక్షేపం చేయడం తగ్గిపోయింది. 

నేను ఒక వేసవి శెలవులకు మద్రాసు వచ్చేప్పటికి ఘంటసాల మాస్టారింటి క్రింది పోర్షన్ లో నుండి తెలుగు మాటలు వినవచ్చాయి. అప్పుడే నాకు తెలిసింది, అంతవరకు వున్న మార్వాడీ కుటుంబం ఖాళీచేసి వెళ్ళిపోయారని. ఒక తెలుగు కుటుంబం వచ్చింది. వారు ఆ ఇంటికి వచ్చిన వేళా విశేషం, ఈ నాటి వరకు ఆ కుటుంబంతో మాకు స్నేహ బాంధవ్యం నిరాటంకంగా కొనసాగుతూవుంది. వారే కొల్లూరి వెంకటేశ్వరరావుగారు. వారు ఆ ఇంటికి వచ్చేసరికి మా లోగిట్లో పిల్లల సంఖ్య మరో ముగ్గురికి పెరిగింది. ముగ్గురూ ఆరేళ్ళ నుండి మూడేళ్ళ లోపువారే. వీరంతా మా కుటుంబాలతో ఏ అరమరిక లేకుండా కలసిపోయి తమ మమతానురాగాలను సరిసమానంగా పంచుకున్నారు.

 

వెంకటేశ్వరరావుగారు విద్యాధికుడు. ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్కాస్ట్ ఎక్కౌటెంట్ వంటి అనేక విద్యార్హతలుండేవి. అంబత్తూర్  ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వుండే 'వావిన్ ఇండియా' ప్లాస్టిక్ పైప్స్ లో కంపెనీ సెక్రెటరి. రావుగారి తమ్ముడిని వాళ్ళ పిల్లల్లాగే శాస్త్రిబాబు అని మేమంతా పిలిచేవాళ్ళం. అతను అన్నగారి వద్ద వుంటూ మద్రాస్ లో సి.ఎ. కోర్స్ చదువుతూండేవాడు. మనిషి దబ్బపండు రంగులో చాలా హ్యాండ్సమ్ గా వుండేవాడు. చిన్న పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో అతనికి బాగా తెలుసు. కొల్లూరివారు వచ్చాక పోర్టికో మళ్ళీ నా సొంతమయింది.


"దేశభాషలందు తెలుగు లెస్స" అనే నానుడి శ్రీనాథుడి కాలంనుండే ప్రచారంలో వున్నా కన్నడ ప్రభువు, 'ఆంధ్రభోజ', 'మూరురాయయగండరుబిరుదాంకితుడైన కవిదిగ్గజం శ్రీకృష్ణ దేవరాయలు మరొక్కసారి తెలుగు భాషా ఔన్నత్యాన్ని నొక్కి వక్కాణించాడు. కళాపోషకుడిగా దిగ్గజాలవంటి ఎనిమంది ఉత్తమ కవులను తన కొలువులో వుంచి సాహిత్యాభివృధ్ధికి ఎనలేని సేవచేశాడు. భారతావనిలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. ఆ కృష్ణదేవరాయలు ఔన్నత్యానికి అడుగడుగునా కృషి చేసిన స్వామిభక్తి పరాయణుడు సాళువ తిమ్మరుసు. రాయలవారి ప్రధానమంత్రి. తెలుగువాడు. నియోగి బ్రాహ్మణుడు. తిమ్మరుసు మంత్రాంగమే లేకుంటే కృష్ణదేవరాయల చరిత్రే లేదు. అటువంటి గొప్ప రాజతంత్రవేత్త  తిమ్మరుసు కధ 1962 లో "మహామంత్రి తిమ్మరుసు" పేరిట గౌతమీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నర్రా రామబ్రహ్మం, అట్లూరి పుండరీకాక్షయ్యలు నిర్మాతలుగా విడుదల చేశారు. టైటిల్ రోల్ ను గుమ్మడి, కృష్ణదేవరాయలుగా ఎన్.టి.రామారావు అత్యద్భుతంగా నటించి తెలుగులో ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతదర్శకుడు. సంగీత సాహిత్యాల కలబోతగా తయారైన ఈ చిత్రం ఘన విజయంలో  గాయకుడిగా ఘంటసాల మాస్టారి పాత్ర కూడా వుంది. ఈ చిత్రానికి  ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డ్ కూడా లభించింది. ఈ చిత్రం తర్వాత నిర్మాతలు ఎన్.రామబ్రహ్మం, ఎ.పుండరీకాక్షయ్య మరల కలసి మరే చిత్రమూ నిర్మించినట్లు లేదు. ఐదేళ్ళ తర్వాత 1967లో ఈ ఇద్దరు నిర్మాతలు వేరే వేరే కుంపట్లు పెట్టుకొని రామబ్రహ్మంగారు 'నిర్దోషి' చిత్రాన్ని, పుండరీకాక్షయ్యగారు 'శ్రీకృష్ణావతారం' చిత్రాలను విడుదల చేసారు. ఒకటి సాంఘికం. మరొకటి పౌరాణికం. ఈ రెండు చిత్రాలకు అన్నగారే హీరో. రెండూ ఘనవిజయం సాధించాయి. ఈ నిర్మాతలు ఇద్దరూ పోటీలు పడి ఒకేసారి విడుదల చేయకుండా  తెలివిగా ఆరు మాసాల వ్యవధిలో విడుదల చేసారు. నిర్దోషికి ఘంటసాల మాస్టారు సంగీత దర్శకుడు. శ్రీకృష్ణావతారం సినీమాకు టి.వి. రాజుగారు సంగీత దర్శకుడు. ఈ రెండు చిత్రాల విజయానికి ఘంటసాలవారి గాన ప్రతిభ ఎంతగానో దోహదం చేసింది.

నిర్దోషి , శ్రీకృష్ణావతారం సినీమా పాటల ముచ్చట్లు...

ఇప్పుడు కాదు.... వచ్చేవారమే...

...సశేషం




Sunday, June 13, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఐదవ భాగం

  13.06.2021 - ఆదివారం భాగం - 35*:
అధ్యాయం 2  భాగం 34 ఇక్కడ
                                
                                    నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్.
                  



 

  "ఋణానుబంధ రూపేణా
    పశు పత్నీ సుతాలయః 
    ఋణక్షయే క్షయం
    యాంతి కా తత్ర పరివేదన"

పశువులు,భార్యాసుతులు, గృహములు , భూవసతులు
మొదలైనవన్నీ  ఋణానుబంధ రూపంగా ఏర్పడి,ఆ ఋణం తీరగానే ఆ మనిషి నుండి దూరమైపోతాయి. ఆ ఋణం తీరిపోగానే వాటి వల్ల కలిగే దుఃఖమూ ఇంక మిగలదు అనేది సూక్తి.

" ఏనాటిదో ఈ బంధం
ఈ జీవుల సంబంధం
తెలియగరాని ఈ అనుబంధం
ఋణానుబంధం
అంతా ఋణానుబంధం....
..... ఎవరికి ఎవరు ఏమౌతారో 
అంతా ఋణానుబంధం..."

అని సముద్రాల రామానుజంగారు వ్రాసిన మాటల్లోని తాత్త్వికతను , వేదాంతాన్ని  పామరులకు సైతం అర్ధమయేలా సరళంగా మరింత భావోద్వేగంతో మన గాన గంధర్వుడు  ఘంటసాల మాస్టారు ఆలపించారు.

నేటితో మా తండ్రిగారి శ్రాద్ధ కర్మలు, మూడు రోజుల కార్యక్రమము  సంతృప్తికరంగా మా పరిధులమేరకు నిర్వర్తించాము. మా తండ్రిగారు నివసించిన మా పెద్దచెల్లెలు రమణమ్మ స్వగృహంలోనే వైకుంఠ సమారాధన కూడా జరిగింది. 
దైవత్వాన్ని పొందిన మా నాన్నగారి దివ్య ప్రసాదాన్ని మేమంతా భక్తి శ్రద్ధలతో స్వీకరించాము.

మాకు జన్మనిచ్చి, పెంచి, విద్యాబుద్ధులను నేర్పించి మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దిన పూజ్యులు, మా తండ్రిగారు పట్రాయని సంగీతరావు గారికి మేము ఋణపడివున్నామో,
లేక ఆయనే మాకు ఋణపడి అన్ని ఋణాలు తీర్చుకొని ఈ భవబంధాలనుండి విముక్తులయ్యారో అనేటువంటి తార్కిక,తాత్త్విక,వేదాంత విషయాల గురించి చెప్పే విషయ పరిజ్ఞానం నాకు లేదు.

కానీ వారు మాత్రం ఈ లోకంతో తనకున్న 101 సంవత్సరాల భవబంధాలను, అనుబంధాలను అన్నింటిని తొలగించుకొని మనమెవ్వరమూ ఊహించలేని, అందుకోలేని సుదూర తీరాలకు తరలివెళ్ళిపోయారు.
భౌతికంగా మా తండ్రిగారు మమ్మల్ని వదలివెళ్ళినా ఆయన సౌజన్యం, వ్యక్తిత్వం, మానవతాదృక్పధం,
ఆయనతోటి జ్ఞాపకాలు మాత్రం సదా మమ్మల్ని వెన్నంటే వుండి మాకు తోడునీడగా నిలిచేవుంటాయి.

మా నాన్నగారికి సంబంధించిన వీడుకోలు మాటలను ఇంత త్వరలో 'నెం. 35,ఉస్మాన్ రోడ్' ధారావాహిక లో వ్రాస్తానని,
వ్రాయవలసివస్తుందని నేను ఏనాడూ ఊహించలేదు. 
ఈ కరోనా మహమ్మారికి ఆయన బలికావలసి వచ్చింది. 101 సంవత్సరాల 7 మాసాలతో ఆయన ఆయుర్దాయం ముగిసింది. 
ఈ భూమి మీద ఆయన ఋణం తీరిపోయింది.
ఉన్న నాలుగునాళ్ళు ఒక మహామనీషిగా  అందరి గౌరవమర్యాదలను అందుకొని అందరివద్దా శాశ్వతంగా శెలవు తీసుకొని వెళ్ళిపోయారు.

'నెం.35,ఉస్మాన్ రోడ్' తో శ్రీ పట్రాయని సంగీతరావు గారి అనుబంధం నిన్న మొన్నటిది కాదు. 1952 లో మొదటిసారిగా ఆయన ఆ ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఆ రోజు 
కొత్త బంధాలకు, అనుబంధాలకు స్నేహ సత్సంబంధాలకు నాంది పలికిన రోజు.

ఆ రోజున ఘంటసాల మాస్టారింట్లో వారి తండ్రిగారి  ఆబ్ధికం జరుగుతోంది. మాస్టారు ఇంటిలోపల ఆ కార్యక్రమంలో నిమగ్నమైవున్నారు.
అలాటి సమయంలో శ్రీ సంగీతరావు గారు 'నెం.35, ఉస్మాన్ రోడ్' లోకి ప్రవేశించారు. వీధి వాకిలి, పోర్టికో దాటి వరండాలోకి వెళ్ళగానే అక్కడ ముందుగా మాస్టారి స్నేహితుడు మోపర్రుదాసుగారు కనిపించారట. ఆయన సంగీతరావు గారిని గుర్తుపట్టి,ఆయనను అక్కడే కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి ఘంటసాలవారి తో చెప్పారట. వెంటనే మాస్టారు చేస్తున్న కార్యక్రమాన్ని మధ్యలో ఆపి బయటకు వచ్చి సంగీతరావు గారిని చేయిపట్టుకొని సగౌరవంగా ఇంట్లోకి తీసుకువెళ్ళారట. 
ఆనాటి సంగీతరావు గారి మనస్థితి కుచేలుడి మనస్థితి వంటిదే. బాల్యమిత్రుడైన కుచేలుడిని కృష్ణుడు ఆదరించినట్లుగానే సంగీతరావు గారిని ఘంటసాల ఆదుకున్నారు. 

శ్రీకృష్ణ కుచేల సినీమాలోని కుచేలుని విషయాల గురించి
చెప్పేప్పుడు మా నాన్నగారిలోని వేదనాపూరితమైన భావోద్వేగాన్ని చూస్తే ఆ కుచేలుడు తానే అయి మాట్లాడుతున్నారా ?అనే భావన నాలో కలిగేది. అంతలా  ఆ కుచేలుడి పాత్రలో లీనమైపోయేవారు.

మద్రాసు సినీమా వాతావరణం లో ఇమడలేక కొన్ని మాసాల తర్వాత విజయనగరం వచ్చేసినా మరో ఏడాది తర్వాత సంగీతరావు గారు మరల మద్రాస్ వెళ్ళడం, ఆ సమయంలో ఘంటసాల మాస్టారిని మా నాన్నగారు కలవడం జరిగింది. ఇక మర్నాడు ప్రయాణమనగా  ఆయన బసచేసిన హోటల్ కు మాస్టారు వెళ్ళి బలవంతాన ప్రయాణం ఆపుచేయించి తనతో కూడా కారులో తన ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. అంతే, ఆ తర్వాత సంగీతరావు గారు మరల విజయనగరం లో నివాసం చేయలేదు. ఆనాడు ఘంటసాలవారు చూపిన ప్రేమాభిమానాలు, స్నేహభావం సంగీతరావు గారిని కట్టిపడేసాయి. ఇక తన జీవితమంతా ఘంటసాలవారి సహచర్యంలోనే అనే నిర్ణయానికి వచ్చేసారు. ముందు కొన్ని మాసాలు టి నగర్ రంగయ్యర్ స్ట్రీట్ ఇంటిలో గడిపినా , ఆ తర్వాత త్వరలోనే 'నెం.35,ఉస్మాన్ రోడ్' ఔట్ హౌస్ లోకి తన నివాసం మారిపోయింది. ఆ చిన్ని ఇంటిలో దాదాపు 28 సంవత్సరాలు ఘంటసాల కుటుంబీకుల మమతానురాగాల మధ్య సంగీతరావు గారు తన జీవనయానం కొనసాగించారు.


 శ్రీ సంగీతరావు గారు దాదాపు 22 సంవత్సరాలు సినీమారంగంలో గడిపినా తామరాకుమీది నీటిబొట్టులాగే వుండేవారు. సినీమా సంగీతం తన గమ్యం కాదనే దృష్టితో వుండేవారు. తనకు ఆశ్రయమిచ్చి ఆదరించిన ఘంటసాలవారి వద్ద తప్ప ఏ ఇతర సంగీత దర్శకుల దగ్గరా పనిచేయలేదు. చేయాలనే కోరికా వుండేదికాదు. స్వతహగా మంచి గాయకుడైనప్పటికీ సినీమాలలో పాడాలనే ఆసక్తే ఆయనకు కలగలేదు. తన వ్యక్తిత్వానికి, ఆశయాలకు భంగకరమనిపించినప్పుడు  ఆలిండియా రేడియో వంటి ప్రసార సాధనాలనే తృణీకరించారు. సంగీతరావు గారు ధనార్జన కోసం, కీర్తిప్రతిష్టలకోసం ఏనాడూ వెంపర్లాడలేదు. తనను గుర్తించి వచ్చిన అవకాశాలను మాత్రం స్వీకరించి త్రికరణశుధ్ధిగా అత్యంత నిజాయితీ తో పనిచేశారు. దాదాపు 70 సంవత్సరాలపాటు సంగీతరావు గారు మద్రాసులో గడిపినా తనకంటూ ఒక చిన్న ఇంటినిగానీ , ఒక సెంటు భూమిని కానీ ఏర్పర్చుకోలేకపోయారు. అందుకు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు కూడా ఒక ముఖ్య కారణం. అయినా ఆయన ఏనాడూ బాధపడలేదు. తనకున్న దాంట్లోనే సుఖంగా,సంతోషంగా జీవించారు. 

1972 తర్వాత ఘంటసాల మాస్టారి ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో చేతిలో తగినంత పని, ఆర్జన లేనప్పుడు కూడా, ఆయన దగ్గరవున్న ఇతర సహాయకులంతా వేరే మార్గాలు పట్టినప్పుడు కూడా సంగీతరావు గారు ఇతరులవద్దకు ఛాన్స్ల కోసం ఏ ప్రయత్నం చేయలేదు. 

అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దైవం, ప్రముఖ నాట్యాచార్యుడు
 శ్రీ వెంపటి చిన సత్యంగారి రూపంలో వచ్చి తమ కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ  ఢిల్లీలో నిర్వహిస్తున్న ఒక నృత్యనాటకంలో పాడేందుకు రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఘంటసాల మాస్టారి అనుమతితోనే   సంగీతరావు గారు ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వంలో మొదలైన 'సతీ సావిత్రి' సినీమాలోని ఒక శ్లోకం , 'నాదబిందు కళాధరి' పాట రికార్డింగ్  జరిగింది. అది సంగీతరావు గారు లేకుండా జరిగింది.

అంతకుముందు కూడా ఒకసారి తన అనారోగ్యం కారణంగా 'సత్యనారాయణ మహత్యం' సినీమాలోని ఒక నృత్యగీతం రికార్డింగ్ లో పాల్గొనలేకపోయారు. ఈ రెండు సమయాలలో తప్ప  ఘంటసాలవారి చరమాంకం వరకూ ఆయనకు సహాయకుడిగానే జీవించారు.
 
1974 లో తన 54 వ ఏట, తనకు రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్న తరుణంలో సరికొత్త జీవితాన్ని ఆరంభించారు. డా. వెంపటి చిన సత్యంగారి  ఆహ్వానం మేరకు కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీలో గాయకుడిగా, అక్కడి విద్యార్ధులకు సంగీతం మాస్టర్ గా, హార్మొనిస్ట్ గా, వైణికుడిగా, సంగీత దర్శకుడిగా తనలోని బహుముఖ ప్రజ్ఞను కనపర్చి తన విద్వత్ ఏమిటో లోకానికి చాటిచెప్పారు. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు  సంగీతజ్ఞుడిగా కూచిపూడి నృత్య విశిష్టత ప్రపంచ వ్యాప్తం కావడానికి ఇతోధికంగా కృషిచేశారు. కూచిపూడి నృత్య త్రిమూర్తులలో( డా.వెంపటి చిన సత్యం, పట్రాయని సంగీతరావు, శ్రీ ఎస్ వి భుజంగరాయ శర్మ) ఒకరిగా మన్ననలు పొందారు. అనేక సార్లు ప్రముఖ  ప్రపంచ దేశాలన్నీ పర్యటించి భారతీయ కళా సంస్కృతి ఔన్నత్యాన్ని ఆయా దేశాలలో చాటి చూపారు.
అక్కడే తన ఆశయసిధ్ధికి, సంగీత విద్వత్ కు తగిన గుర్తింపు, మన్నన , ప్రశంస లభించిందని మనసారా ఆనందించారు.తృప్తి చెందారు.

 కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ నృత్య నాటక సంగీత దర్శకుడిగా చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక 'కలైమామణి' బిరుదును ఆనాటి ముఖ్యమంత్రి కుమారి జె. జయలలిత చేతులమీదుగా స్వీకరించారు. 


ఆ తర్వాత,  వివిధ సందర్భాలలో మరెన్నో సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు పొందారు. శ్రీ సంగీతరావు గారికి తన 
22 వ ఏటనే మొట్టమొదటిసారిగా ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ వారిచే 'సంగీతభూషణ'  బిరుదు ప్రదానం జరిగింది. ఇన్ని బిరుదులు, సన్మానాలు,సత్కారాలు పొందినా తన జీవితాన్నంతా అతి నిరాడంబరంగా,ఏ డాబూ,దర్పం లేకుండా గడిపారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారికి అసలు సిసలైన వారసుడు శ్రీ పట్రాయని సంగీతరావుగారు. సంగీతమే తన వృత్తిగా,ప్రవృత్తిగా, ఊపిరిగా జీవించిన ధన్యజీవి.

శ్రీ సంగీతరావు గారు ఒక నాదయోగి.

శ్రీ సంగీతరావు గారిలో నిగూఢమై వున్న,అనన్యసామాన్యమైన సంగీత విద్వత్, నిరాడంబరత, సౌమ్యత‌, సౌజన్యం, అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం వంటి లక్షణాలు ఘంటసాల మాస్టారిని బాగా ఆకర్షించాయి. వారిరువురి మధ్య స్నేహబంధాన్ని బలపర్చాయి. మాస్టారు సంగీతరావు గారిని గురుస్థానంలోనే వుంచి గౌరవించారు. ప్రేమగా 'సంగీతం బాబూ' అని పిలిచేవారు. ఘంటసాలవారు కనపర్చిన గౌరవమర్యాదలనే సినీమా రంగంలోని ఇతర సంగీత కళాకారులు,దర్శక నిర్మాతలు సంగీతరావు గారిపట్ల చూపించేవారు. 

శాస్త్రీయ సంగీతం, కూచిపూడి నాట్యం మీద పరిశోధనా వ్యాసాలు వెలువరించే ఎంతోమంది పిహెచ్ డి విద్యార్ధులు విషయసేకరణకోసం శ్రీ సంగీతరావు గారి వద్దకు వచ్చేవారు. ఆయనకూడా ఎంతో సహృదయంతో వారికి  కావలసిన సమాచారాన్ని సోదోహరణంగా వివరించి చెప్పేవారు. 

ఘంటసాల మాస్టారు స్వీయ సంగీతంలో చేసిన, పాడిన ఎన్నో పాటలు ఉత్తమ సంగీత విలువలు కల గీతాలని ,శాస్త్రీయ సంగీతం నేర్చుకునే ప్రాధమిక విద్యార్ధులకు  అవి ఒక బేస్ వంటివని వాటిని అందరూ నేర్చుకొని పాడాల్సిన అవసరం ఎంతైనా వుందని సంగీతరావు గారు అభిప్రాయపడేవారు. అలాగే తన విద్యార్ధులందరికీ నేర్పించారు కూడా. అందులో ప్రముఖమైనవి -

'దినకరా శుభకరా '- పంతువరాళి రాగం;

ఆరుద్రగారి ' తూరుపుదిక్కున అదిగో చూడు పొడిచె వేగుచుక్క - గుణ్ కలి రాగం; ఈ పాటనే సంగీతరావు గారు భూపాళ రాగంలో స్వరపర్చి పాడేవారు;

'ఎన్ని మాయలు నేర్చినావయా కన్నా' మల్లాది వారి సాహిత్యం. జంఝూటి రాగం. ఘంటసాలవారు 'దైవం' అనే సినీమాను తీయాలని సంకల్పించి మల్లాదివారిచేత ఈ పాట వ్రాయించి కంపోజ్ చేశారు. కానీ ఆ సినీమా ఆదిలోనే ఆగిపోయింది. ఇంతమంచి పాట రికార్డు కూడా కాలేదు.
 


మల్లాది వారి 'తెల్లవార వచ్చె తెలియకనా సామి' మోహన రాగం;

దాశరధిగారి 'ఏనాటికైనా ఈ మూగవీణా' సింధుభైరవి రాగం;


'ఏడుకొండలవాడా వెంకటా రమణా' - చక్రవాకం



'వేణుగాన లోలునిగన' - దేశ్


ఇలాటి పాటలు మరెన్నో. ఇవికాక తాను వ్రాసి,స్వరపర్చిన గీతాలను కూడా పిల్లలకు నేర్పేవారు.



 ఘంటసాలవారు 'మాస్టారు' గా చిత్రపరిశ్రమలోని ప్రముఖులందరిచేత గౌరవింపబడుతున్నప్పటికీ ఆయనలో ఆ అహంకారం,దర్పం కొంచెం కూడా కనిపించేవి కావు. తోటి కళాకారులందరినీ తనతో సమానంగా గౌరవించేవారు,అభిమానించేవారు. ముఖ్యంగా,శాస్త్రీయ సంగీత విద్వాంసుల పట్ల ఎనలేని భక్తి విశ్వాసాలుండేవి.
మ్యూజిక్ ఎకాడెమీలో జరిగిన నిస్సార్ హుస్సేన్ ఖాన్ గారి గాత్రకచేరీకి స్వయంగా  తంబురా శ్రుతి వేసినా; ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ గారికి కొన్ని మాసాలపాటు తన ఇంట ఆతిథ్యం ఇచ్చినా; వీటన్నిటికీ కారణం ఘంటసాలవారిలోని వినయవిధేయతలే.

ఒక  శాస్త్రీయ సంగీత కచేరీ ముగింపులో సభ నిర్వాహకులు గాయకుడిని,పక్కవాద్యగాళ్ళను సత్కరించి తంబురా శ్రుతి వేసినాయనను వదిలేసారు. కొంత నిర్లక్ష్యం. కొంత అజ్ఞానం. అప్పుడు,ఆ సభలోనే వున్న మాస్టారు వేదికమీదకు వచ్చి సంగీతంలో శ్రుతికి గల ప్రాధాన్యత ను వివరించి ఆ శ్రుతిని సక్రమంగా వేస్తూ గాయకుడి గాత్రానికి దోహదపడే తంబురా కళాకారుడిని సన్మానించకుండా విస్మరించడం తగదని సన్నసన్నగా చీవాట్లు పెట్టారు. ఆ తర్వాత, తంబురా శ్రుతి వేసినాయనను ఘంటసాల మాస్టారే శాలువ కప్పి అభినందించారు. ఆ సమయంలో ఆ తంబురా సహకారం అందించిన వ్యక్తి ముఖంలోని సంతోషం,గుర్తింపు పొందానన్న తృప్తి స్పష్టంగా కనిపించింది.

ఘంటసాల మాస్టారి ఔన్నత్యం, వినయవిధేయతల గురించి మా నాన్నగారు,శ్రీ పట్రాయని సంగీతరావు గారు చెప్పిన ఒక ఉదంతం.

కదిరిలోనో లేక బళ్ళారిలోనో సరిగ్గా గుర్తులేదు, జరిగిన ఏవో సంగీతోత్సవాలకు ఘంటసాల మాస్టారు ఒక కచేరికి తన బృందంతో వెళ్ళారు. అక్కడ  సభ నిర్వాహకులు మాస్టారి కచేరీకి ముందు భీమ్ సేన్ జోషి గారి కచేరీ ఏర్పాటు చేసారట. భీమ్ సేన్ జోషి అంటే భారతదేశంలోని అగ్రశ్రేణి హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. అత్యంత ప్రతిభాశాలి. అటువంటి గాయకుడి గానం వినగలగడం ఒక అదృష్టంగా భావించి ఘంటసాల మాస్టారు తన కచేరీ సమయం కంటే చాలా ముందుగానే బయల్దేరి సభాస్థలికి చేరుకున్నారట. 

ఘంటసాల వచ్చారన్న విషయం తెలిసిన మరుక్షణమే ఆడిటోరియంలో భీమ్ సేన్ జోషి గారి కచేరి వింటున్న శ్రోతలంతా ఒక్కుమ్మడిగా బయటకు పరిగెత్తుకుపోయి ఘంటసాలవారి కారును చుట్టుముట్టారట. ఆయనను చూడడానికి , మాట్లాడడానికి ఒకటే కలకలం చెలరేగిందట.
జనాలు అంతా ఎందుకు అంత అకస్మాత్తుగా లేచి పరిగెడుతున్నారో అర్ధంకాక వేదికమీద జోషిగారు తన గానం ఆపేసి నివ్వెరపోయి చూస్తున్నారట.
బయట ఘంటసాల మాస్టారికి విపరీతమైన ఆగ్రహం వచ్చిందట. ఆయన జనాలను తప్పించుకొని హాలులో వేదికమీదకు వెళ్ళి మైకు అందుకొని గట్టిగా అరిచారట. ఒక మహా విద్వాంసుడు అత్యద్భుతంగా గానం చేస్తూంటే మధ్యలో లేచిపోవడం చాలా అనుచితమని,సభామర్యాద కాదని, ఆ మహాగాయకుడిని అవమానపర్చడమేనని కేకలు వేసారట. ఆయన కంటే తానేం గొప్ప గాయకుడినేంకాదని ఆయన సంగీతం వినడానికే ముందుగా ఆడిటోరియంకు వచ్చానని , ప్రేక్షకులు ఇంత హీనంగా ప్రవర్తించడం తగదని, ఈ రకమైన వాతావరణం లో తాను ఇక అక్కడ కచేరీ చేయనని గట్టిగా చెప్పి తాను భీమ్ సేన్ జోషి గారికి ప్రేక్షకుల తరఫున క్షమాపణలు చెప్పారట.
ఘంటసాలగారు అంత తీవ్రంగా స్పందిచడంతో అంతా సద్దుమణిగి  జోషి గారి కచేరీ ప్రశాంతంగా ముగిసిందట.

ఇది ఘంటసాల మాస్టారి వినయానికి, వ్యక్తిత్వానికి,
హృదయవైశాల్యానికి ఒక మచ్చుతునక.

 'నెం.35,ఉస్మాన్ రోడ్' లో పుస్తక పఠనాన్ని అలవాటు చేసింది సంగీతరావు గారే. ఆసక్తికరంగా ఆయన చెప్పే కథలు విని సావిత్రమ్మగారు , పాప పిన్నిగారు, తర్వాతి కాలంలో పిల్లలు మంచి పుస్తకాలు చదవడం పట్ల అభిలాషను పెంపొందించుకున్నారు.

సంగీతరావు గారు అటు సంగీతంలో ఎంత నిష్ణాతుడో సాహిత్యం విషయంలోనూ అంతే. ఆయనకున్న విషయ పరిజ్ఞానం అపారం. ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడగల వాక్పటిమ వుండేది. అయితే అది బయటకు తీసుకురావడానికి ఇతరులు చాలా శ్రమపడవలసి వచ్చేది. మా నాన్నగారిలోని రచయితను చందూర్ దంపతులవంటివారు గుర్తించి ఒకటికి పదిసార్లు బలవంతపెడితే కొన్ని కధలు వ్రాసారు. అవి చందూర్ గారి 'జగతి' లో, మాలతిగారి నిర్వహణలోని ' ఆంధ్రమహిళ 'లోనూ ప్రచురితమయాయి. సంగీతరావు గారికి ఈ సాహితీ సంపర్కం విజయనగరం రోజుల్లోనే ఏర్పడింది. ఆయన మిత్రులు పంతుల శ్రీరామశాస్త్రిగారు , భట్టిప్రోలు కృష్ణమూర్తి గారు , మంథా  వెంకట రమణారావుగారు మంచి కవులు. చేయితిరిగిన రచయితలు. వీరే కాకుండా స్థానికంగా కవులుగా లబ్ధప్రతిష్టులైన పంతుల లక్ష్మీనరసింహ శాస్త్రిగారు, క్రొవ్విడి రామంగారు,తదితర సాహితీవేత్తల సాంగత్యంతో 
శ్రీ సంగీతరావు గారికి సాహిత్యంలో అభినివేశం, మక్కువ ఏర్పడ్డాయి.

మా నాన్నగారు డబ్బులు చేర్చుకోలేకపోయారు, కానీ,
అంతకుమించిన ఎన్నో రెట్లు విలువైన ఉత్తమ సాహిత్యాన్ని  సేకరించగలిగారు. అవి ఎవరి దగ్గరా సంగ్రహించినవికావు. స్వయంగా డబ్బుపెట్టి కొనుక్కున్నవి.
 ఆయన ఇంటివద్ద  ఖాళీగా వుంటే సగభాగం సంగీతంతోనూ , సగభాగం పుస్తక పఠనంతోనూ గడిచిపోయేది.

పాండీబజార్ రాజకుమారి ధియేటర్ ( ఇప్పుడు 'బిగ్ బజార్ కాంప్లెక్స్)  కాంపౌండ్ గోడను ఆనుకొని ప్లాట్ ఫారమ్ మీద 
చాలా పెద్ద సెకెండ్ హ్యాండ్ పుస్తకాల షాపు వుండేది. ఒక్క వర్షాలు పడే సమయంలో తప్ప, ఉదయం పది నుండి రాత్రి 10 వరకూ ఆ పుస్తకాల షాపు తెరిచివుండేది. పానగల్ పార్క్ చప్టాలమీద ముచ్చట్లాడే రచయితలంతా అక్కడ లేరంటే, పాండీబజార్ లోని ఈ పుస్తకాల షాప్ దగ్గర దర్శనమిచ్చేవారు. ఆ పుస్తకాల షాపులో వివిధ భాషలకు చెందిన అమూల్యమైన గ్రంథాలెన్నోదొరికేవి. పుస్తకం ఖరీదు నూరు రూపాయలైతే ఏభై రూపాయలకు అమ్మేవారు
ఆ రకంగా మా నాన్నగారు చాలా పుస్తకాలే కొన్నారు. 
ఆ షాపులో ఇటువంటి ఉత్తమ గ్రంధాలతోపాటూ 
యువతరానికి కావలసిన మిల్స్&బూన్, జేమ్స్ హాడ్లీ ఛేస్, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు వంటి వారి పల్ప్ సాహిత్యం కూడా విరివిగానే దొరికేది. ఉదయం నుండి రాత్రివరకూ ఆ పుస్తకాల షాప్ జనాలతో కళకళలాడుతూ వుండేది. ఎవరి అభిరుచికి తగిన పుస్తకాలు  కొని వారు పట్టుకువెళ్ళేవారు. ఆరుద్ర, జరుక్ శాస్త్రి,శ్రీరంగం నారాయణ బాబు , ఊహాగానం - లత వంటి ప్రముఖులెందరో అక్కడ కనిపించేవారు.

ఇలాటి  మరో పెద్ద సెకండ్ హ్యాండ్ బుక్స్ స్టాల్ లజ్ కార్నర్ లో కామధేను ధియేటర్ ఎదురు ప్లాట్ ఫారమ్ మీద వుండేది. ఆ పుస్తకాల షాపుతో తనకు చిరకాల సాన్నిహిత్యాన్ని గురించి  చాలా రసవత్తరంగా ముళ్ళపూడి వెంకట రమణ తన జీవితకధలో వ్రాసారు.

మా నాన్నగారి వద్ద శరత్ బాబు‌, రవీంద్రనాధ్ టాగోర్, మున్షీ ప్రేమ్ చంద్, చలం, కొడవటిగంటి కుటుంబరావు గార్ల పుస్తకాలు, దేశి ప్రచురణ ( బొందలపాటి శివరామకృష్ణ,శకుంతలాదేవి అనే గుర్తు) వారి పుస్తకాలు ఎన్నో వుండేవి. వీటితోపాటు సంగీతం ,నృత్యం,వేదాంతాలకు సంబంధించినవీ వుండేవి.  ఆ పుస్తకాలన్నిటినీ  నేను పై పైని తిరగెయ్యడమే తప్ప క్షుణంగా చదివే అవకాశం లభించలేదు.

'రంగులరాట్నం' సినిమా తో పరిచయమైన చంద్రమోహన్ మా ఇంటికి సమీపంలోనే కృష్ణమాచారి స్ట్రీట్ లో ఒక మేడమీద ఒక చిన్న గదిలో అద్దెకు వుండేవారు. ఆయన దగ్గర నవతర మహిళలు ఆశించే యద్దనపూడి , కోడూరి , ముప్పాళ వంటి వారి సాహిత్యం కొంత వుండేది. ఆ పుస్తకాలను తెలుగువారిళ్ళలో అద్దెకు ఇస్తూండేవారు. అలా చంద్రమోహన్ పుస్తకాలు ఘంటసాలవారింట్లోను వచ్చి చేరేవి. ఎవరో సైకిల్ మీద వచ్చి ఇచ్చి మళ్ళా రెండు మూడు రోజుల తర్వాత పట్టుకుపోయేవారు. ఒక్కో  పుస్తకానికి  రూపాయో, రెండో వసూలు చేసేవారు.

అలాటి సమయంలోనే పానగల్ పార్క్ దాటాక పింజల సుబ్రహ్మణ్యం వీధి మొగలో రాఘవన్ నెయ్యి దుకాణం. దాని పక్కనే 'రవిరాజ్ లెండింగ్ లైబ్రరీ'.
ముందుగా ఒక చిన్న రూమ్ లో ప్రారంభించాడు. ఓనర్ అప్పటికి యువకుడే. పెద్ద చదువు సంధ్యలు లేవు. 
చాలా రకాల పుస్తకాలు, మ్యాగజైన్స్  చాలా భాషల్లో దొరికేవి. షాపు తెరచిన కొత్త రోజుల్లో పుస్తకం రేటును బట్టి  ఒక్కో పుస్తకానికి పావలా, అర్ధ,రూపాయి,రెండూ అద్దె వసూలు చేసేవారు. ఇంగ్లీష్ పుస్తకం అయితే అద్దె ఐదు రూపాయలు.  సరికొత్త పుస్తకాలు , మ్యాగజైన్స్ అయితే వాటికి వేరే రేటు.ఒకే రోజులో చదివేసి మర్నాటికల్లా ఇచ్చేయాలి. చాలా లోప్రొఫైల్ లో మొదలైన ఆ లైబ్రరీ అతి త్వరలోనే టి నగర్ అంతటికీ అతి పెద్ద లైబ్రరీగా మారింది. అదే బిల్డింగ్ లో మరో రెండు రూమ్స్ లోకి విస్తరించింది. ఒక్కో పుస్తకం నాలుగైదు కాపీలు వచ్చేవి. యండమూరి ,మల్లాది వెంకట కృష్ణమూర్తి పుస్తకాలకు మంచి గిరాకీ వుండేది. అక్కడ వుండే పుస్తకాలన్నీ చదవాలంటే నా ఆదాయం చాలదు. అందుచేత నాకు  అందుబాటులో వుండే పాత తెలుగు ,తమిళం పుస్తకాలతోనే  నేను , మా ఆవిడ శేషశ్రీ కాలక్షేపం చేసేవాళ్ళం. దాదాపు 1990 ల వరకు ఆ లైబ్రరీ లో మెంబర్ గా వుండేవాడిని. ఆ తర్వాత పనుల ఒత్తిడివల్ల తరచూ లైబ్రరీకి వెళ్ళిరావడం కుదరక మానేసాను.

మా నాన్నగారు రికార్డింగ్ లు , రీరికార్డింగ్ లకు వెళ్ళినప్పుడు తనతో కూడా ఒకటో రెండో పుస్తకాలు తన వెంట తీసుకువెళ్ళేవారు.
లంచ్ బ్రేక్ లో ఆ పుస్తకాలు చదువుతూవుండేవారు.
ఇంటి దగ్గర మా అమ్మగారు కూడా పుస్తకపఠనంతోనే కాలక్షేపం.

మా నాన్నగారిది, అమ్మగారిది( శ్రీలక్ష్మి)  బాల్య వివాహం. ఆనాటికి ఆయనకు పదకొండు సంవత్సరాలు; ఆవిడకు ఐదు సంవత్సరాల లోపే. వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. 85 ఏళ్ళ సహచర్యం. ఐదేళ్ళ వ్యవధిలో ఆ పుణ్యదంపతులు భౌతికంగా  మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. మానాన్నగారి జన్మదినం,నిర్యాణం రెండూ 2వ తేదీయే కావడం ఒక విశేషం.


ఘంటసాల మాస్టారి బృందగానాల్లో పాడే కొంతమంది గాయనీమణులకు పుస్తకపఠనం మీద ఆసక్తివుండేది. మా నాన్నగారి దగ్గర చేరి ఆ పుస్తకాలు తీసుకొని చదివిన తర్వాత తిరిగి రికార్డింగ్ లకు వచ్చేప్పుడు తీసుకువచ్చి ఇచ్చేసేవారు. ఓ ఇద్దరు గాయనీమణులు పుస్తకం తీసుకువెళ్ళడమే తప్ప తిరిగి ఇవ్వడం మర్చిపోతూండేవారు. అడిగితే వచ్చే రికార్డింగ్ సమయంలో తెచ్చిస్తానని ,లేకపోతే ఇంటికి తీసుకువచ్చి ఇస్తామని చెప్పేవాళ్ళు. అక్కడితో సరి. ఎన్నాళ్ళైనా ఇదే తంతు. ఆడవాళ్లు. గట్టిగా అడగలేని పరిస్థితి. చాలా మంచి 
విలువైన పుస్తకాలు చేజారిపోయినందుకు మా నాన్నగారు,
అమ్మగారు చాలా బాధపడేవారు. 
అందుకే మన పెద్దలంటారు - ఏమని --

" పుస్తకం,వనిత,విత్తం
పరహస్త గతం గతః
అధవా పునరాయతి
జీర్ణం, భ్రష్టాచ,ఖండశః "
      
               
     

ఈనాటి 'నెం.35,ఉస్మాన్ రోడ్ 35వ భాగం -
పూజ్యులు, మా తండ్రిగారు శ్రీపట్రాయని సంగీతరావు గారికి, మాతల్లిగారు శ్రీమతి శ్రీలక్ష్మిగారికి శతాధిక వందనములతో సమర్పణం.

స్వరాట్
💐🙏🌺🙏💐🍀🙏🌺

Sunday, June 6, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై నాలుగవ భాగం

06.06.2021 - ఆదివారం భాగం - 34*:
అధ్యాయం 2  భాగం 33 ఇక్కడ




నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నెం.35, ఉస్మాన్ రోడ్ మెయిన్ గేట్ మీద అర్ధచంద్రాకారంలో ఒక ఇనప ఆర్చ్. ఆ ఆర్చ్ మీద బోగన్విల్లా క్రీపర్. మెజెంటా కలర్ లో గుత్తులు గుత్తులుగా ఏ వాసనా వుండని పువ్వులు. జాగ్రత్తగా వుండకపోతే  అప్పుడప్పుడు గుచ్చుకునే ముళ్ళుఎండిపోయిన సన్నపాటి మోళ్ళు.  ఆ గేటు దాటి లోపలికి ప్రవేశిస్తే ఒక పెద్ద కారు పట్టేంత పోర్టికో. ఆ పోర్టికో దక్షిణం పిల్లర్ ముందు ఒక పూలమొక్క. గుత్తులు గుత్తులుగా సన్నటి తెల్లటి పూవులు పూసేది. రాత్రిపూట చాలా సువాసనలు వెదజల్లేది. అందువల్ల అది నైట్ క్వీన్  అని అనుకునేవాడిని. మా పెద్దలు అలాగే చెప్పారేమో కూడా. ఆ పూలమొక్క కాయలు మిరియం గింజలులా ఆకుపచ్చగా మెరుస్తూవుండేవి. అవి పండిపోయేసరికి బచ్చలిపండులా తయారయేవి. వాటిని పట్టుకోగానే చిట్లిపోయి లోపలినుండి పింక్ కలర్ ద్రవం వచ్చేది. అది బట్టలమీద పడితే ఎన్ని ఉతుకులు ఉతికినా ఆ పింక్ రంగు పోయేదికాదు. ఏప్రిల్ ఫూల్ చేయడానికిహోలీ సమయాలలో ఆ నైట్ క్వీన్ పళ్ళు మాకు ఉపయోగపడేవి. ఆ పోర్టికో ఎడమవేపు ఇంటివెనక వెళ్ళడానికి ఒక సందు. ఆ సందులో కాంపౌండ్ వాల్ ను ఆనుకొని ఒక దానిమ్మచెట్టు. అనార్కలీ అనీ ప్రేమతో పిలచుకోవడానికి ఎర్రటి పువ్వులు మాత్రం చక్కగా పూసేది. ఆశగా కోసుకుతినేలాటి పళ్ళుమాత్రం కాసిన గుర్తులేదు. మా ఔట్ హౌస్ ఆనుకొని ఒక జామిచెట్టు. పళ్ళుతోముకుందుకు ఉపయోగపడేది. దానిపక్కనే ఒక మునగచెట్టు. పాపందాని వంతుకు అది బాగానే కాచేది కానిఆ చెట్టు మొదట్లో విపరీతమైన తెల్లగొంగళీలు చేరేవి. అవి ఒంటిమీద ప్రాకితే విపరీతమైన దద్దుర్లు. ఆ గొంగళీలను తొలగించడానికి పొగపెట్టేవారు. మాకు దగ్గువచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యేవాళ్ళమేతప్ప గొంగళీలు పోయేవికావు. చివరకు ఆ మునగచెట్టునే సమూలంగా నరికిపారేసారు. నూతివేపు ఒక వేపచెట్టు. చల్లటిగాలిమంచి నీడతో అక్కడ హాయిగా వుండేది. అక్కడే బట్టలు ఉతికడానికి రెండు బండలు. అవి వాషింగ్ మెషిన్లుసర్ఫ్, ఎక్సెల్ వాషింగ్ పౌడర్లులిక్విడ్ లు లేని రోజులు. కొంత స్థోమత కలిగినవారు  పసుపురంగు  'సన్ లైట్వాషింగ్ సోపును వాడేవారు. 501 బార్ సోప్ కూడా అధికంగా అమ్ముడుపోయేది. ఆ సోప్ వాటరంతా అరటి చెట్టు మొదట్లోకి చేరేది. ఆ చెట్టుకు ఎదురుగా ఇంట్లోకి వెళ్ళడానికి ఒక దవ్వారం. దాని తర్వాత  మేడ మీదకు వెళ్ళే మెట్లగది. అది దాటి ముందుకు వెడితే మెయిన్ గేట్. నెం. 35, ఉస్మాన్ రోడ్ కు ఒక ప్రదక్షణం కొట్టడమయింది. 

ఇంటికి నాలుగు ప్రక్కలా మంచి గార్డెన్ పెంచాలని అమ్మగారికి (సావిత్రమ్మగారికి) కోరిక. కానీ మంచి పూలమొక్కలు పెంచడానికి తగిన భూసారం ఆ స్థలంలో లేకుండా నానారకాల సిమెంట్ఇటికకాంక్రీట్ వంటి రబిష్ తో మొదట్లో నింపారట. అందువలన సుందరమైనసువాసనలు వెదజల్లే సున్నితమైన మొక్కలు పెంచుకోవాలనే ఆశ నెరవేరలేదు.

 

కారు పోర్టికోలో నుండి వరండా మెట్లెక్కి వస్తే అక్కడ ప్రధాన ద్వారం. రోస్ వుడ్ కలర్ తలుపు. సగం నాన్ ట్రాన్సపెరెంట్ మ్యాటీ అద్దంతో  వుండేది. (ఇప్పుడు అదే తలుపు పార్థసారధిపురంలోని రత్నకుమార్ ఇంటికి అమర్చినట్లుగావుంది) ఆ తలుపు తెరవగానే ఒక పెద్ద హాలు ఆ హాలు దాటగానే ఎడమవైపుకు బయటకు వెళ్ళడానికి ఒక ద్వారం. కుడివేపు మరో చిన్న హాలు అక్కడో ద్వారం. పక్కనే ఒక బెడ్ రూమ్. చిన్నహాలు దాటాక స్టోర్ రూము లాటి గది. కుడివైపు వంటగది. ఆ స్టోర్ రూమ్ దాటాక కుడివేపు బాత్ రూము. ఎడమవేపు టాయిలెట్ వుండేది. ఘంటసాల మాస్టారు 1950 లలో ఆ ఇల్లు కొనడానికి ముందెప్పుడో   ఆ భవనం ఒక దొరదే అయినా ఆ ఇంటికి ఎటాచ్డ్ బాత్ సంస్కృతి ఏర్పడలేదనుకుంటాను. అక్కడ ఒక ద్వారం. అది  దాటితే చిన్న ఖాళీ ప్రదేశం. ఎదురుగా ఔట్ హౌస్. ఆ ఔట్ హౌస్ లో పామర్తిగారుకుటుంబం సుమారుగా ఓ ఐదేళ్ళుమేము ఓ 28 సంవత్సరాలు నివసించాము. నేనూమా పెద్ద చెల్లెలు రమణమ్మ తప్ప మిగిలిన నలుగురు పిల్లలు ఆ ఇంట్లోనే పుట్టిపెరగడం విద్యాబుధ్ధులన్నీ ఆ చిన్ని ఔట్ హౌస్ లోనే జరిగాయి.

 

నెం. 35 ఉస్మాన్ రోడ్ లో కొట్టచ్చేలా ప్రామినెంట్ గా కనపడేది మెయిన్ హాలు మాత్రమే. మిగిలిన గదులన్నీ చిన్నవే.  ఘంటసాల మాస్టారు తన కంపోజింగ్ కు రిహార్సల్స్ కోసం కావలసినంత పెద్ద హాలున్న ఇంటినే ఎన్నుకున్నారు తప్ప ఇతర వసతుల సంగతి పట్టించుకోలేదని అమ్మగారు అంటూ వుండేవారు. తర్వాత మేడమీది ఇల్లు కట్టినప్పుడు మరికొంత విశాలంగా కట్టించారు. అలాటి నెం.35,ఉస్మాన్ రోడ్ మెయిన్ హాల్ లో ఎన్నో కంపోజింగ్ లుమ్యూజిక్ రిహార్సల్స్సినీ మ్యుజిషియన్స్ యూనియన్ మీటింగ్ లుసాహితీ సదస్సులు  జరిగాయి. దేశంలోని ప్రముఖ వ్యక్తులెందరో ఆ హాలులో సమావేశమయ్యారు. కవులుగాయకులు ఎందరో ఆ హాలులో కూర్చొని పాటలు వ్రాసారు. ప్రముఖ గాయనీ గాయకులెందరో పాటలు నేర్చుకున్నారు. అలాటి సరస్వతీ నిలయం ఒక అరవై ఏళ్ళ కాల వ్యవధిలో కనుమరుగైపోవడం తీరని వేదనగా అనిపిస్తుంది. కానీ ఆ జ్ఞాపకాలు ఏనాటికీ మరపురానివి.

🌿

నెం.35,ఉస్మాన్ రోడ్ ఇంటి మెయిన్ హాల్ లో పడమటవేపు గోడంతటికి ఒక పెద్ద అద్దాల బీరువా. దానినిండా ఘంటసాల మాస్టారి గాన ప్రతిభకు నిదర్శనంగా వివిధ ఆకారాలలో దర్శనమిచ్చే జ్ఞాపికలు అసంఖ్యాకం. కొత్తవి రాగానే పాతవి అటకెక్కేవి. ఒక్క మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వారి మెమెంటోలే వరసగా ఏడాదికి ఒకటి చొప్పున పదిపన్నెండు ఉండేవి. ఆ సంస్థ నిర్వహించిన బ్యాలట్స్ లో ప్రతీ సంవత్సరం ఘంటసాలవారే ఉత్తమ గాయకుడిగా ఎన్నికవుతూ వచ్చారు. ఆ తర్వాత మాస్టారే ఆ బ్యాలట్స్ లో ఇక తన పేరును చేర్చవద్దని ఇతర గాయకులను ప్రోత్సహించే విధంగా ఏర్పాటుచేయమని కోరడం జరిగింది.  

ఒక సముద్రాల వారినిఒక మల్లాదివారినిఒక కృష్ణశాస్త్రి గారిని,ఆరుద్రగారినికొసరాజుగారినిశ్రీశ్రీ గారిని సి.నారాయణరెడ్డి గారినిదాశరధిగారిని,  పినిశెట్టి గారినిజరుక్ శాస్త్రిగారినియామిజాల వారినిరావులపర్తి భద్రిరాజుగారినిఇదే హాలులో చూసే అవకాశం నాకు కలిగింది. అలాగే లీలసుశీలకోమలజానకిపి.బి.ఎస్.మాధవపెద్దిపిఠాపురంపాణిగ్రాహిమల్లిక్ వంటి గొప్ప గాయకుల పాటను వినే అదృష్టం ఆ హాలు నాకు కలిగించింది. సినీమాలలో పాటలుడ్యాన్స్ లు అనేవి ఎక్కువగా భారతదేశపు సినీమాలలోనే కనిపిస్తాయి. హాలీవుడ్ సినీమాలలో ఈ ప్రక్రియ చాలా అరుదుగా కనిపిస్తుంది. పాశ్చాత్య సినీమాలలో సంగీతభరిత చిత్రంనృత్యభరిత చిత్రం అంటూ ప్రత్యేకించి ఎక్కువగా ఉండవు. కథతో సంబంధం లేకపోయినా రెండేసి రీళ్ళకు ఒక పాటడ్యాన్స్రీలున్నర ఫైట్స్ అనే   సినీమా ఫార్ములా సంస్కృతి  మన భారతదేశపు సినీమాలలోనే కనిపిస్తుంది.  సినీమా అంటే కేవలం ఒక వినోదసాధనంగా మనవాళ్ళకు అలవాటయిపోయింది. అందుకే ఇండియాలో ఆస్కర్ కి అర్హమైన ఆర్ట్ ఫుల్ సినీమాలకి ఆస్కారంలేదు.  


భారతదేశపు సినిమా ప్రపంచంలో వుండేంతమంది కవులుగాయకులుమ్యూజిక్ కంపోజర్స్ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ మరే ఇతర సినీమాలలోనూ కనపడరు. ముఖ్యంగామన తెలుగు టాకీ పుట్టినప్పటినుండీ కడుపునిండా పాటలతోనే పుట్టింది. పాటలుడాన్స్ లు లేని తెలుగు సినీమాలను ప్రస్తుతానికైతే ఊహించనేలేము. మారుతున్నకాలాన్నిబట్టి సినీమా పాటల ధోరణి మారుతుంది. దానిని ఎవరూ ఆపలేరు. 

 

ఇక మన సినీమాలలో ఇన్ని రకాల పాటలెందుకు అని ఆలోచించి చూస్తేనాకు కలిగిన అభిప్రాయం ఏమంటే  - మాటద్వారా వ్యక్తీకరించలేని మనోభావాలను బయటకు చెప్పడానికి పాట ఒక సాధనం. మనలోని నవరస భావాలను పాటలో చెప్పినంత బాగా మాటలో చెప్పడం సాధ్యంకాదు. అందుకు సన్నివేశానుసారం పాటలువినోదాన్ని పంచే నృత్యాలువాటి ఆలంబనతో సాగే పాటలు మన సినీమాలకు అనివార్యం అయాయేమో అని అనిపిస్తుంది. నా యీ అభిప్రాయంలోవ్యక్తీకరణలో లోటుపాట్లు వుండవచ్చు.

 

కానీఒక్కటి మాత్రం నిజం. మన సినీమాల ద్వారా ఎన్నో వేలమంది సాహితీకారులకుసంగీత కళాకారులకు భుక్తి లభిస్తున్నది. వారి వారి ప్రతిభను బట్టి సమాజంలో గొప్ప గుర్తింపుకీర్తి ప్రతిష్టలుఆర్ధికోన్నతి లభిస్తున్నాయి. ఇప్పుడు ఘంటసాల మాస్టారి కాలంలో  తెలుగు సినీమాలలో  పాటలు  ఎలా రూపొందేవో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్పడానికి ప్రయత్నిస్తాను.

 

ఒక శుభోదయాన  ఫలానా నిర్మాత ఆఫీసులోఫలానా టైములో  పాట కంపోజింగ్ పెడుతున్నారని,దానికి రావలసిందిగా ఆ చిత్ర సంగీతదర్శకునికవిగారినిచిత్రదర్శకుని ఆహ్వానిస్తారు. మ్యూజిక్ డైరక్టర్ తో పాటు ఒక తబలిస్ట్ ఒక హార్మనిస్ట్ (సాధారణంగా) కూడా వస్తారు. అలాగేడైరక్టర్ తో పాటూ అసిస్టెంట్ డైరక్టర్ వుంటారు. వారందరిని అనుకున్న సమయానికి ఆఫీసుకు తీసుకువచ్చే బాధ్యత మొదటిరోజుల్లో నిర్మాత యొక్క ప్రొడక్షన్ మేనేజరే చూసుకునేవాడు. వీరంతా అక్కడికి చేరగానే ఒకరినొకరు పలకరించుకొని ముచ్చట్లాడుతూంటారు. ఈలోగా కాఫీ టిఫిన్ కార్యక్రమం. ఉదయంపూట కంపోజింగ్ అయితే ఇడ్లీవడ లేదా పొంగల్వడవేడి వేడి కాఫీసాయంత్రం సమయమైతే బోండా లేదా బజ్జీవేడి వేడి కాఫీ. ఈ కాఫీ టిఫిన్లు సాధారణంగా పానగల్ పార్క్ దగ్గరలో వున్న  ఉడిపీ పార్క్ ల్యాండ్స్ హోటల్ లేదా పాండీబజార్ నారాయణన్ కేఫ్లేకపోతే గీతా కేఫ్ లనుండి తెప్పించేవారు. (గీతా కేఫ్ ఇంకా బాగానే నడుస్తోంది. నారాయణన్ కేఫ్ ప్రముఖ నటుడు  సి.ఎస్.ఆర్ గారి ఫేవరేట్ స్పాట్. ఇప్పుడు ఆ హోటల్ స్థానంలో అడయార్ ఆనందభవన్ స్వీట్స్ షాప్ వెలసింది. పార్క్ ల్యాండ్స్ హోటల్ ను నల్లీవారు ఒక పెద్ద జ్యువెలరీ షాప్ గా మార్చేశారు.)

 

ఈ టిఫిన్కాఫీల సెషన్ అయిన వెంటనే తాంబూల సేవనంలేదా తమకు ఇష్టమైన బ్రాండ్  శ్వేతకాష్టాలను ప్రత్యేకంగా తెప్పించుకొని మనసారా ఆస్వాదించుట. ఈ దినుసులన్నీ నిర్మాతగారి పద్దులోనే. ఈ పద్దులన్నీ ఏ విధంగా సద్దుబాటు చేయాలో చూసుకోవడానికి వేరే ఎక్కౌంటెంట్ వుంటాడు. ముందు ఆత్మారాముడిని సంతృప్తిపర్చాక అప్పుడు అసలు విషయం మీద కూర్చుంటారు. సీనీమా పరిభాషలో కథమీద 'కూర్చోవడంఅంటే పని ప్రారంభించడం. నిర్మాత గారి ఆదేశంతో డైరక్టర్ గారు తాము తీయబోతున్న సినీమా కథను సంక్షిప్తంగా వివరిస్తారు. చిత్రంలో నటిస్తున్న ప్రధాన పాత్రధారులుముఖ్యంగాపాటలు పాడే నటీనటులు గురించి చెపుతారు. ఈలోగా ఆయన అసిస్టెంట్ స్క్రీన్ ప్లే బుక్ తిరగేసి ఈ సినీమాకు ఎన్ని పాటలు అవసరమౌతాయోఎక్కడెక్కడ పాట వస్తుందో వంటి విషయాలను డైరెక్టర్ గారికి అందజేస్తాడు. ఆయన సభాముఖంగా అందరికీ తెలియజేస్తారు. ఎవరి లిమిట్స్ లో వారు వుండాలనే ఎథిక్స్ ను ఆనాటి వారు సక్రమంగా పాటించేవారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడంఅనుచిత సలహాలు ఇవ్వడం వంటివి వుండేవికావు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పదలిస్తే ప్రాపర్ ఛానల్ లోనే జరగాలి. నిర్మాతదర్శకులే కీ హెడ్స్. వారి నిర్ణయమే తుది నిర్ణయం. అందువలన ఒక సినీమా ఫేటు డైరక్టర్ తెలివితేటలమీదనిర్మాత విజ్ఞత మీద ఆధారపడివుంటుంది. మిగిలిన శాఖలవారంతా ఎవరి పనిని వారు బాధ్యతాయుతంగా చేసుకుంటూపోతారే తప్ప ఇతరములైన వ్యాఖ్యలు ససేమిరా చేయరు. అది ఆనాటి వృత్తి శైలి.

 

డైరక్టర్ మొట్టమొదటగా పాట యొక్క సన్నివేశాన్నితెరమీద నటించబోయే నటీనటుల గురించిఆ సీనుకు ముందు జరిగిన కథతర్వాతి సీన్ లో కథ క్లుప్తంగా వివరిస్తారు. ఆ పాట ఏ లొకేల్ లో షూట్ చేయాలనుకుంటున్నారో ఊహామాత్రంగా చెపుతారు. ఈలోగా నిర్మాత కూడా తన మనోభావాలు వెల్లడిస్తారు. ఇక అక్కడినుండి బంతి సంగీత దర్శకుడుకవిగార్ల కోర్ట్ లో వుంటుంది. పాటకు మాటామాటకు పాటాఅనేది ఆలోచిస్తారు. మామూలుగా వినోదాత్మక గీతాలకుశృంగార గీతాలకు మెట్టుకు మాటలు వ్రాస్తారు. లేదూ పాట సన్నివేశానికి పరిపుష్ఠిని చేకూరుస్తూ సాహిత్యపరంగా వుండాలీ అంటే పాట ముందు వ్రాసి దానికి వరస కూరుస్తారు. మాటకు పాటపాటకు మాట ఈ రెండు శైలులకు అందరు కవులుసంగీత దర్శకులు సిద్ధంగానే ఉంటారు. ఘంటసాల మాస్టారు సవ్యసాచి. ఏ పధ్ధతిలో పాటను చేయాలన్నా ఆయన సంసిధ్ధంగానే వుండేవారు. సంగీత దర్శకుడేగాయకుడు అయితే కవిగారి పని సులభతరం. ఇప్పుడుకొంతమంది ప్రముఖ కవుల రచనా శైలి ఎలావుంటుందో చూద్దాము.

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావుకతకుపద లాలిత్యానికి ప్రాధాన్యమిచ్చే మనిషి. ఏ బి.ఎన్. రెడ్డిగారిలాటి దర్శకుడో తప్ప ఆయన చేత పాటలు వ్రాయించలేరు. కాగితం మీద అక్షరం పెట్టడానికే రోజంతా పడుతుంది. అయితే ఆయన పలికించే ప్రతీమాట  మనసుకు హత్తుకుపోతుంది. వారు ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు వ్రాయలేదు. ఈ ఇద్దరు ప్రముఖులు కలసి పనిచేసినది 'విజయం మనదేసినీమాలో పాట శ్రీరస్తు శుభమస్తుపాట. మాస్టారే పాడారు. రామారావు గారుదేవిక గార్ల మీద చిత్రీకరణ. రామారావు గారి కజిన్ సాంబశివరావు గారు నిర్మాత. బి. విఠలాచార్య దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ పాట. ఈ నిర్మాత ఆఫీస్ సౌత్ ఉస్మాన్ రోడ్ లో CIT నగర్ లో వుండేది. ఈ పాట కంపోజింగ్ అప్పుడు ఒక రోజు నేనూ వెళ్ళాను. ఘంటసాల మాస్టారు తన పాటల కంపోజింగ్ కు విధిగా మానాన్నగారిని హార్మోనియం వాయించడానికిలయకోసం ఒక తబలిస్ట్ ను తీసుకువెళ్ళేవారు. వీరిద్దరు తమ వాద్యాలతో సహకరిస్తుండగా మాస్టారు తననాలతో అలా పాడి వినిపిస్తూండేవారు. కృష్ణశాస్త్రి గారు అలా తదేకంగా చిరునవ్వుతో మాస్టారు పాడింది వింటూవుండేవారే తప్ప ఒక్కమాట కూడా కాగితంమీద పెట్టేవారు కాదు. గంటలు గడిచేవి. మాస్టారు పల్లవి వరసను పాడుతూనే వుండేవారు. ఇక అక్కడ వున్నవారందరికీ విసుగుపుడుతోందని అనిపించే సమయానికి కృష్ణశాస్త్రి గారు కాగితం మీద వ్రాసి చూపించేవారు 'పాట మెదడులో వుంది. వ్రాసి పంపిస్తానుఅని. అప్పటికే ఆయన గళం మూగపోయింది. ఏది చెప్పాలన్నా కాగితం మీదే. ఇక ఆ రోజుకు కంపోజింగ్ ముగిసినట్లే. ఇలా ఒకటి రెండు సిట్టింగ్ ల తర్వాత ఆణిముత్యంలాటి పాట వెలువడేది. కృష్ణశాస్త్రి గారి పాట కావాలంటే  మంచి ఓపికాసహనం కావాలి. రాశికంటే వాసిని చూసే కవి కృష్ణశాస్త్రి గారు.


శ్రీ సముద్రాల రాఘవాచారిగారితో ఘంటసాల మాస్టారు చాలా సినీమాలకే పనిచేశారు. సారంగధర మొదలు రహస్యం వరకు చాలా సినీమాలలో ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో అనేక పాటలు వ్రాశారు. మాస్టారు తాను చేసిన పల్లవి తననాలు పాడుతూంటారుఆచార్యులవారు  తన స్టీల్ పాన్దాన్ లో నుండి  రెండో మూడో తామలపాకులు తీసి తాపీగా వాటిని తన పై కండువాతో తుడిచివాటికి సువాసన సున్నం పూసిఈనెలు తీసి వాటిమీద వక్క ,కొంచెం సీవల్ పెట్టి తాంబూల సేవనం మొదలెట్టేవారు. మాస్టారి పాట సాగుతూనే వుండేది. నోట్లోని తాంబూలం అయ్యాక బయటకు వెళ్ళి మంచినీళ్ళతో నోరు కడుక్కొని వచ్చి మరల కూర్చొనేవారు. "ఒరే నాయనా! నీ తననాలు మరోసారి చెప్పు రాసుకుంటాను" అని కాగితం మీద వ్రాసుకొని "నాకు మరో కంపెనీలో కంపోజింగ్ కు వెళ్ళాలి. రేపు మళ్ళీ కలుద్దాము. పల్లవి ఇచ్చేస్తాను. ఈలోగా నువ్వు చరణాలు తయారు చేసుకో" అని లేచి చక్కాపోయేవారు. అనుకున్నట్లుగానే మర్నాటికి పల్లవిచరణాలు రెడిగా పట్టుకువచ్చేవారు. వాటిని దర్శక నిర్మాతలు విని ఓకె అంటే పాట కంపోజింగ్ పూర్తయినట్లే. లేకపోతే మరో కొత్త పల్లవికి వరసమాటలు కూర్చడం మళ్ళీ మొదలయేది. ఈ తతంగమంతా చాలా సహజసిధ్ధంగానే ప్రశాంత వాతావరణంలో నే జరిగేది.




కొసరాజు రాఘవయ్య చౌదరీగారి పాటలు చాలావరకు జానపదవరసలుతోనే వుండేవి. ఆయన సిట్యుయేషన్ వినగానే  పాటను వ్రాయడం మొదలెట్టేవారు. ఆయన స్వతహాగా కొంత పాడతారు. తాను వ్రాసిన పాటను తానే తన ధోరణిలో పాడివినిపించేవారు. కొసరాజు గారు పాడింది బాగానేవుండేది. దానికి మాస్టారు సంగీతపరంగా మరింత పదునుపెట్టి పాడి వినిపించేవారు.ఆ పాట అందరి ఆమోదం పొందేది.


శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు కూడా పాటలు వెంటవెంటనే వ్రాసే మనిషికాదు. చాలా టైమ్ తీసుకుంటారు. సంగీతదర్శకుడు వినిపించే ట్యూన్ కు ఏవో ప్యారడీలు రాసి ఇవేకదా మీ పాట పెరామీటర్లు. రాసిస్తాను అనేవారట. రామకృష్ణ శాస్త్రిగారు 14 భాషలలో నిష్ణాతుడు. అలాగే సంగీతశాస్త్రంలో కూడా మంచి అవగాహన వుండేది. "రహస్యం" చిత్రం లోని కొన్ని పాటల సాహిత్యానికి సరిపడేలా రాగనిర్దేశనం కూడా శాస్త్రిగారే చేయడందానిని ఘంటసాల మాస్టారు అత్యంత ప్రతిభావంతంగా ప్రయోగించి అత్యద్భుతమైన పాటలను సమకూర్చడం జరిగింది.


ఇక, డాక్టర్ సి.నారాయణరెడ్డిగారైతే ప్రొడ్యూసర్స్ కుడైరక్టర్లకు  అందరికీ  ఫేవరిట్ సాంగ్ రైటర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ లో పనిచేస్తూవుండడం వలన హైదరాబాద్ లో వుండేవారు. పదిహేను రోజులకు ఒకసారి మద్రాసు వచ్చి మూడేసి రోజులు హోటల్ లో మకాం పెట్టేవారు. తాను వచ్చేముందు ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి రాయవలసిన పాటల సన్నివేశాన్ని అడిగి తెలుసుకునేవారు. ఎప్పుడు వచ్చినా ఫ్లైట్ లో వచ్చేవారు. ఎయిర్ పోర్ట్ లోఫ్లైట్ లో కూర్చొని తాను వ్రాయవలసిన పాటలకు పల్లవులుచరణాలు వ్రాసి తయారుగానే మద్రాసు లో అడుగెట్టేవారు. ఒక్కొక్క కంపెనీకి వెళ్ళి సంగీత దర్శకుడితో కూర్చొని వారి పాట విని తన సాహిత్యాన్ని తగినవిధంగా మార్పులు చేర్పులు చేసి ప్రొడ్యూసర్ చేత ఓకె అనిపించుకొని తనకు రావలసిన పైకం వసూలు చేసుకొని వేరే కంపెనీ కి వెళ్ళిపోయేవారు. ఇలా వున్న మూడు రోజుల్లో ఓ పదిహేను పాటలకు తక్కువలేకుండా వివిధ సినీమాలకు వ్రాసేసి హైదరాబాద్ వెళ్ళిపోయేవారు.

 

ఇక ఆరుద్రగారికైతే వరస దమ్ములాగనిదే పాట వ్రాయడానికి ఇన్స్పిరేషనే రాదనేవారు. రెండువేళ్ళ మధ్య సిగరెట్ పెట్టి గంజాయి పీల్చినట్లుగా సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ పాట వ్రాసేవారు. ఒక పాట పూర్తయేసరికి ఎన్నో పెట్టెలు ఖాళీ అయేవి.  

 

ఇక ఆత్రేయగారి సంగతి లోకవిదితమే. నేను కొత్తగా చెప్పడానికి ఏంలేదు. రాయక నిర్మాతలనురాసి ప్రేక్షకులను తెగ ఏడిపించిన కవిగా కీర్తిపొందారు.

 

ఈ విధంగా సినీమా లోకంలో వివిధ కవులది వివిధ రకాల అలవాట్లు. వివిధరకాల బాణివాణి. వీరందరి ధోరణికనుగుణంగా మాటకు మెట్టు కూర్చడంలోలేదా తన మెట్టుకు  తగిన మాటలు రాబట్టుకోవడంలో ఘంటసాల మాస్టారు కృతకృత్యులే అయ్యారు. నిర్మాత,దర్శకులు సంగీత దర్శకునికిపాటల కవికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చినప్పుడు సంగీతపరంగాసాహితీపరంగా సన్నివేశానికి తగిన అజరామరమైన గీతాలు రూపొందుతాయి. అలా ఎన్నో మధురాతిమధురమైన పాటలు రూపొందాయి కూడా.

 

కానీ ఈ రకమైన సుహృద్భావ వాతావరణం అన్నివేళలాఅన్నిచోట్లా అమరడం కష్టం. కొంతమంది నిర్మాతలు వుంటారు. వారికి సంగీతంతోనూసాహిత్యం తోనూ పరిచయం లేకపోయినా అన్నీ తెలిసినట్లుగా జోక్యంచేసుకొని పనికిరాని సలహాలు ఇస్తూంటారు. ఎన్ని మంచి పల్లవులు ఇచ్చినా బాగులేదంటూ కొత్తవి కావాలనడం.ఆ పల్లవిలో కొంత ఈ పల్లవిలో కొంత చేర్చి మరేదో ట్యూన్ చేయమనడంకవిగారి మాటలకు వంకలుపెట్టడం చేస్తూంటారు. డబ్బు పెట్టుబడి పెట్టి సినీమా తీస్తున్న నిర్మాతలమనే అభిజాత్యంతో ప్రవరిస్తారు. మరికొందరు నిర్మాతలైతే తమకు పాట నచ్చినాతమ పక్కనుండే కారు డ్రైవర్ కుఆఫీస్ బోయ్ కు సంగీత దర్శకుడు ఇచ్చిన పాట తృప్తికరంగా లేదంటున్నారు కనుక మరో పల్లవి అంటే బాగుంటుందని కవిగారినిసంగీతదర్శకుడిని ఇరకాటంలో పెట్టడమూ వుంది. ఒక స్థితిలో సహనం కోల్పోయి నువ్వూ వద్దూ నీ సినీమా వద్దు అంటూ లేచి చక్కాపోయే సర్వ స్వతంత్రులైన సంగీత దర్శకులు వున్నారుసాలూరు రాజేశ్వరరావు గారిలాటివాళ్ళు. ఎంత గొప్ప నిర్మాతైనా వారి ధోరణి నచ్చకపోతే వద్దని మధ్యలో మానేసిన సినీమాలెన్నో రాజేశ్వరరావుగారికి. నిర్మాతలు ఈ రకమైన వంకలను బొంబాయి నౌషద్ ఆలి దగ్గరోశంకర్ జైకిషన్ దగ్గరో మదన్ మోహన్ దగ్గరో పెట్టగలరాపెట్టి వాళ్ళచేత ఒక్క పాటైనా చేయించుకోగలరా! ఇలాటి విభిన్న మనస్తత్త్వాలు కలిగిన వ్యక్తులందరినీ సమన్వయపర్చుకుంటూసామరస్యభావంతో మెలగుతూ అందరిపట్ల వినయవిధేయతలు కనపరుస్తూఅందరిచేత గౌరవింపబడుతూ ఘంటసాల మాస్టారు  దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు చలనచిత్ర రంగంలో అజాతశత్రువుగా మనుగడ సాగించారు. ఇదేమంత సామాన్య విషయం కానేకాదు.

 

💥కొసమెరుపు💥

 

"మాస్టారూ! అన్నపూర్ణా లోకి కొత్త సంగీత దర్శకుడు వచ్చారట!" అని ఎవరో రాజేశ్వరరావు గారి దగ్గర వత్తి వెలిగించారట.

అందుకు ఆయన "ఏం చేస్తాం! సార్మధుసూదనరావు గారు

మన దగ్గర మోహన రాగం స్టాక్ అయిపోయిందని  అనుకున్నట్లున్నారు." అని అన్నారట మహా కూల్ గా.

 

💐

 

మరికొన్ని విశేషాలతో వచ్చేవారం.....

...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.