visitors

Sunday, September 26, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభైయవ భాగం

26.09.2021 - ఆదివారం భాగం - 50*:
అధ్యాయం 2  భాగం 49 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఒకసారి ఘంటసాలవారు తలపెట్టిన  ఏదో ఒక  కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలను పలువురు ప్రముఖులకు స్వయంగా అందజేసే భాధ్యతను నరసింగకు, నాకు అప్పజెప్పారు. మేము  స్వయంగా చెప్పి ఆహ్వనపత్రికను అందజేసేవారిలో వి.ఎ.కె.రంగారావుగారు కూడా వున్నారు. అందజేయవలసిన వారందరి ఎడ్రస్ లు సినీమా డైరక్టరీ నుండి సేకరించి వాటి ప్రకారం వెళ్ళి యివ్వాలని నిశ్చయించాము. ఆ ఎడ్రెస్సులలో చాలాభాగం టి.నగర్, కోడంబాకం, తేనాంపేట‌, ఆళ్వార్ పేట, మైలాపూర్, ట్రిప్లికేన్ ప్రాంతాలలోనివారే. అందువలన సైకిళ్ళమీద వెళ్ళి యిద్దామని నరసింగ సలహా యిచ్చాడు. అప్పటికి నాకు సైకిల్ తొక్కడం వచ్చును కానీ మౌంట్ రోడ్ వంటి భారీ ట్రాఫిక్ లో బస్సులు, లారీలమధ్య నుండి సైకిల్ తొక్కడానికి భయంగా వుండేది. దూరంగా సిటీ బస్సులు రావడం కనిపిస్తే ఇక్కడ నేను సైకిల్ దిగి మరల ఆ బస్ వెళ్ళిపోయాక సైకిల్ ఎక్కేవాడిని. మరొక పెద్ద సమస్య నేను ఆ సైకిలంత ఎత్తు కూడా లేకపోవడం వలన సైకిల్ ఎక్కడం, దిగడం చాలా ఇబ్బందికరంగా తోచేది. అసలు నేను సైకిల్ నేర్చుకున్నది మెడ్రాస్ లో కాదు. బొబ్బిలి హైస్కూలులో చదువుతున్న రోజుల్లో అందరి పిల్లల్లాగే నేను సైకిల్ నేర్చుకోవాలని ఉబలాటపడ్డాను. మా ఊళ్ళో గంటకు ఇంతని వసూలు చేసి అద్దెకు సైకిళ్ళు ఇచ్చే షాపులుండేవి. సొంత సైకిళ్ళు లేనివారు తమ అర్జంట్ పనులకు, కొత్తగా సైకిళ్ళు తొక్కడం నేర్చుకునే పిల్లలు ఈ అద్దె సైకిళ్ళనే ఆశ్రయించేవారు. మా సామవేదుల వారి సందులో, అగ్రహారం వీధిలో ఆ రోజుల్లో ఎక్కువ వాహన సంచారం వుండేదికాదు, సాయంత్రం పూట పూల్ బాగ్ కు వెళ్ళి వచ్చే బొబ్బిలి రాణీ గారి కారు తప్ప. అందుచేత మా సైకిల్ సాధన నిరాటంకంగా సాగేది. బాగా పొడుగున్న పిల్లలైతే సీటు మీద కూర్చొని వెనకాల మరొకరి సాయంతో నేర్చుకునేవారు. కొందరు హాఫ్ పెడల్ పధ్ధతిలో నేర్చుకునేవారు. నాకు ఈ రెండు పధ్ధతులు అనుకూలపడేవికావు. అందువలన ఎవరి సాయంలేకుండా వెనక కారియర్ మీద కూర్చొని అతికష్టం మీద బ్యాలన్సింగ్ అలవాటు చేసుకొని సైకిల్ నడపడం అలవాటు చేసుకున్నాను. అయితే సీటుమీద కూర్చొని దిగడానికి ఏవైనా అరుగులు,  వసారాలు చూసుకోవలసి వచ్చేది. మొత్తానికి కాలేజీలో ప్రవేశించేనాటికి బాగా సైకిల్ తొక్కడం వచ్చేసింది. కాకపోతే బొబ్బిలిలో నేను సైకిల్ ఉపయోగించవలసిన అవసరమేపడలేదు. ఒకసారి మాత్రం సరదాగా ఇంట్లోవారికి తెలియకుండా, బస్ లో సాలూరులో మా చిన్నాన్నగారింటికి వెళుతున్నాని చెప్పి , ఒక అద్దె సైకిల్ మీద ఓ పది,పన్నెండు మైళ్ళ దూరంలో వున్న సాలూరు ఉదయం వెళ్ళి, సాయంత్రానికి తిరిగి వచ్చేశాను.  ముందుగా చెప్పినట్లు దూరాన బస్సులు, లారీలు కనిపిస్తే అవి నన్ను దాటి వెళ్ళేవరకు సైకిల్ దిగిపోయేవాడిని. అప్పట్లో నాకది ఒక ట్రావెల్ ఎడ్వంచర్. 

అలాటి అనుభవంతో ప్రక్కన నరసింగ ఉన్నాడనే ధైర్యంతో సైకిల్ మీద వెళ్ళి ఇన్విటేషన్లు ఇవ్వడానికి అంగీకరించాను. నిజానికి నరసింగ నాకంటే పొట్టివాడే. అయినా సైకిల్ సీటు మీదకు సులభంగానే ఎక్కగలిగేవాడు. అది నాకు చేతనయ్యేదికాదు. మొత్తానికి  సొంత సైకిళ్ళమీద  ట్రిప్లికేన్ లో వున్న పైక్రాఫ్ట్స్ రోడ్ లో వుండే వి.ఎ.కె.రంగారావుగారింటికి మేమిద్దరం బయల్దేరాము. టి.నగర్ నుండి గోపతినారాయణస్వామి చెట్టి రోడ్ (జి.ఎన్.చెట్టి రోడ్) చివరనున్న సన్ ధియేటర్ (బండి సుందర్రావు నాయుడుగారి సినీమా హాలు. సుందర్రావులోని మొదటి మూడు ఇంగ్లీష్ అక్షరాలతో SUN Theatre గా పేరు పెట్టారు) దాటిన తర్వాత మౌంట్ రోడ్ వస్తుంది. అక్కడ ఎడమవేపు జెమిని స్టూడియో వేపునుండి నుంగంబాక్కం  హైరోడ్,  కుడివేపు  అమెరికన్ కాన్స్యులేట్, చర్చ్ ల వేపునున్న కెథెడ్రల్ రోడ్ వచ్చి కలుస్తాయి. అక్కడ నుండి కొంచెం దూరంలో ఎడమ వేపు వీకంసీస్ డైమండ్ కంపెనీవాళ్ళ సెఫైర్, బ్లూడైమండ్, ఎమరాల్డ్ సినీమా ధియేటర్ల కాంప్లెక్స్, అది దాటాక కుడివైపున చర్చ్ పార్క్ కాన్వెంట్. దాని దగ్గర ముందు పీటర్స్ రోడ్, కాన్వెంట్ దాటాక లాయడ్స్ రోడ్, వైట్స్ రోడ్, పటుల్లోస్ రోడ్, జనరల్ ప్యాటర్స్ రోడ్, వాలాజా రోడ్, ఏడమ్స్ రోడ్ అన్ని వరసగా మౌంట్ రోడ్ లో కుడివేపు వుండే రోడ్లు. సకల నదులు సముద్రంలోనే కలుస్తాయన్నట్లుగా మౌంట్ రోడ్ మీద కుడిచేతివేపున్న రోడ్లన్నీ తూర్పునున్న బంగాళాఖాత సముద్ర తీరానికే చేరుస్తాయి. ఈ పైక్రాఫ్ట్స్ రోడ్ చివరనే ట్రిప్లికేన్ బీచ్. అక్కడే సంగం కాలంనాటి మదురై నగరాన్ని తన శాపంతో దహించివేసిన మహా పతివ్రత, స్త్రీ శక్తి కణ్ణగి విగ్రహం రౌద్రంగా దర్శనమిస్తూంటుంది.

మేము ముందు చర్చ్ పార్క్ కాన్వెంట్ ముందున్న పీటర్స్ రోడ్ మీద (అంతగా బస్సుల రద్దీ వుండని కారణంగా) రాయపేట వరకు వెళ్ళి అక్కడ ఎడమవేపు తిరిగి "కేసరి కుటీరం", "గౌడీయమఠ్" దాటుకొని రాయపేట పోలిస్ స్టేషన్, పాత ఉడ్ ల్యాండ్స్ హోటల్ (ఇప్పుడు ఉడ్ లాండ్స్ సింఫనీ సినీమా థియేటర్ వుంది), రాయపేట గవర్నమెంట్ హాస్పిటల్ దాటాక నాలుగు రోడ్ల కూడలి. అక్కడ ఎడమవేపు మౌంట్ రోడ్ వెళ్ళే వైట్స్ రోడ్‌, తిన్నగాగా వెడితే (అది కూడా మౌంట్ రోడ్ లో బుహారీ హోటల్ దగ్గరకు వెళుతుంది) జనరల్ పాటర్స్ రోడ్ లోని ఓడియన్, మిడ్ ల్యాండ్ (తర్వాత  జయప్రదగా మారింది. సినీనటి జయప్రద తన తమ్ముళ్ళ కోసం కొనుగోలు చేసారని వార్త. కుడి వేపు తిరిగితే ట్రిప్లికేన్ లోని పైక్రాఫ్ట్స్ రోడ్. ఆ ప్రాంతమంతా ఈనాటికీ ముస్లిముల నివాసాలు, వ్యాపారాలు, మసీదులు, దర్గాలతో వారి ప్రాబల్యంతోనే నిండి వుంటుంది.

మొత్తానికి పైక్రాఫ్ట్స్ రోడ్ లోకి ప్రవేశించి కుడి ఎడమలు చూసుకుంటూ రంగారావుగారి ఇల్లు వెతకడం ప్రారంభించాము. అంతకుముందు మాలో ఎవరు వారింటికి వెళ్ళింది లేదు. సినీమా డైరక్టరీ ఆధారంతో ఇంటివేట మొదలెట్టాము. 'రామ్ మహల్' పేరిట  ఏ భవంతీ కనపడలేదు. ఇప్పటిలా అప్పుడు సెల్ ఫోన్లో, విరివిగా లోకల్ టెలిఫోన్ బూత్ లో వుండేవికావు. అలా కుడి ఎడమల కుసుమపరాగం అనుభవిస్తూ పైక్రాఫ్ట్స్ చివర వరకు వెళ్ళిపోయాము. అక్కడొక పెద్ద రావిచెట్టు. దానికి సమీపంలోనే టి.నగర్ నుండి వచ్చే 13 వ నెంబర్ బస్ ల చివరి స్టాప్. అక్కడ నుండి రోడ్ దాటి అవతలివేపుకు వెళితే ట్రిప్లికేన్ బీచ్. మాకు కావలసిన  'రామ్ మహల్' తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. అడ్రస్ లో ఉన్న నెం.1 (అనే గుర్తు) లో ఒక చిన్న ఉడిపి హోటల్ వుంది. వి.ఎ.కె.రంగారావుగారి ఇల్లు మాత్రం కనపడలేదు. ఇక వెతికే ఓపికలేక ఆ చిన్న హోటల్ లోకి వెళ్ళాము. హోటల్ చిన్నదే అయినా శుభ్రంగా వుంది. ఫలహారాలు రుచికరంగా వున్నాయి. ఆ సమయంలో ఆవిర్లు వస్తున్న వేడివేడి ఇడ్లీలు, తెలుగువారిష్టపడే కారపు చట్నీ మాకెంతో ఆనందం కలిగించింది. ఆ హోటల్లో ఉదయం నుండి రాత్రి హోటల్ మూసేవరకూ ఏ సమయంలోనైనా వేడివేడి ఇడ్లీలు లభిస్తాయని తెలిసింది. తర్వాత నేను ఎప్పుడు బీచ్ కు వెళ్ళినా 13 నెంబర్ బస్ దిగి ముందు ఆ హోటల్లో రెండు వేడివేడి ఇడ్లీలు తిని మరీ బీచ్ కు వెళ్ళేవాడిని. 
 
ఇక ఆవేళకి వెతుకులాట కార్యక్రమానికి స్వస్తి చెప్పి కాళ్ళీడ్చుకుంటూ.... కాదు సైకిళ్ళు తొక్కుకుంటూ ఇంటికి చేరుకున్నాము. 

ఆ తరువాత తీరుబడిగా మరోసారి సినీమా డైరక్టరీలో వి.ఎ.కె.రంగారావుగారి ఎడ్రస్ తీసి చూశాము. తీరా చూస్తే అది పైక్రాఫ్ట్స్ రోడ్ కాదు. పైక్రాఫ్ట్స్ గార్డెన్స్.   హడావుడిలో  గార్డెన్స్ అనే మాటను వదిలేసి రోడ్ అని ఎడ్రస్ రాసుకోడంతో అంతా తారుమారు అయింది. పైక్రాఫ్ట్స్ రోడ్ ట్రిప్లికేన్ లో వుంది. పైక్రాఫ్ట్స్ గార్డెన్స్. ఇప్పుడు కాలేజ్ రోడ్ మీదున్న విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ కి, శంకర్ నేత్రాలయాకి ముందు ఇండియన్ మిటియెరోలాజికల్ సంస్థ దగ్గరలో ఉండే ప్రాంతం. నుంగంబాకంలో హేడోస్ రోడ్ మీదున్న శాస్త్రీ భవన్ ఎదురువైపు ఉండే రోడ్డు పైక్రాఫ్ట్స్ గార్డెన్ రోడ్. ఆ తర్వాత మరో రోజు సరైన ఎడ్రస్ కు వెళ్ళి అందజేయవలసిన ఆహ్వానం సక్రమంగా అందజేశాము. అది వేరే సంగతి. 

పరమానందయ్య శిష్యుల పనితనం ఇలాగే ఉంటుంది.

ఘంటసాల మాస్టారింటి క్రింది పోర్షన్లో కొల్లూరి వారి కుటుంబం వుండేది. మంచి స్నేహపాత్రులు. వెంకటేశ్వరరావుగారు (ఆయన పేరు కూడా మాస్టారి పేరే) అంబత్తూర్ లోని ఒక ఫ్యాక్టరీలో ఒక పెద్ద పదవిలోనే వుండేవారు.

వెంకటేశ్వరరావుగారు ఘంటసాలవారింట్లోకి రాకముందు  పాండీబజార్లో హరిబాబు అనే సుప్రసిధ్ధ మేకప్ మెన్  ఇంట్లో అద్దెకు వుండేవారు. వెంకటేశ్వరరావు దంపతులు నేనంటే ఎంతో అభిమానంగా వుండేవారు. నా ఉద్యోగం విషయంలో మంచి అక్కర చూపేవారు. ఒక రోజు ఆయన తన కారులో  అంబత్తూర్  ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని తమ ఆఫీసుకు తీసుకువెళ్ళి అంతా చూపించారు. వాళ్ళ ఆఫీసులో నాకు తగిన ఖాళీలు లేవని చెప్పారు. ఏదో లీవ్ వేకన్సీలో ఒక పది పదిహేను రోజులు అక్కడ నాకు అవకాశం కల్పించారు. తర్వాత,  పాడీలో వున్న బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళారు. ఆ కంపెనీ కూడా అప్పటికి కొద్ది సంవత్సరాలముందే బిస్కట్ల తయారీ ప్రారంభించింది. అక్కడ కోటేశ్వరరావు అనే తెలుగాయన  ఒక డిపార్ట్మెంట్ కు మేనేజర్ గా వుండేవారు. మా వెంకటేశ్వరరావురావుగారూ ఆయనా స్నేహితులు. నన్ను పరిచయంచేసి విలయిన సహాయం చేయమని అడిగారు. ఫ్యాక్టరీ సైడ్ ఉద్యోగమైతే వెంటనే ఏర్పాటు చేయవచ్చని, అడ్మినిస్ట్రేషన్ సైడ్ అంటే  వెంటనే అవకాశం లేదని, నా బయోడాటా తనకు ఇవ్వమని, అవకాశాలు వచ్చినప్పుడు తప్పక ఇంటర్వ్యూకు పిలుస్తామని హామీ ఇచ్చారు.  అక్కడితో సరి.  కాకపోతే నాకు కాబోయే సతీమణి బ్రిటానియా బిస్కట్ల ఫ్యాక్టరీలోనే పనిచేస్తూవుండడం యాదృఛ్ఛికం.

అలాగే డి.ఎన్.రావుగారి స్నేహితుడు బి.డి.రావుగారి సిఫార్సుతో మెడ్రాస్ ఎనామిల్స్ అనే కెమికల్స్ కంపెనీకీ వెళ్ళాను.  అది సెంట్రల్ స్టేషన్ పక్కనున్న సిడెన్హామ్స్ రోడ్ చివరలో వుండేది. ఆ కంపెనీకి అధిపతి కానూరి రంజిత్ కుమార్ గారు. ఆయన, తమ కంపెనీ జీతాలు తక్కువని, వాళ్ళిచ్చే జీతం రెండు బస్సుల్లో వచ్చి వెళ్ళడానికే సరిపోతుందని చెప్పారు. ఆ ప్రాంతంలోనే ఉండేవాళ్ళకైతే అనువుగా వుంటుందని అందుచేత ఆ కంపెనీలో చేరి టైము వృధా చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఆ కానూరి రంజిత్ కుమార్ గారు ఒక దశాబ్దం తర్వాత  చిత్ర నిర్మాత గా కొన్ని తెలుగు  రంగుల సినీమాలు కూడా తీశారు.

కొల్లూరి వెంకటేశ్వరరావుగారు నాలాగే పొట్టిగా బొద్దుగా వుండేవారు. కానీ ఆయన పేరు వెనక పల్నాటి చేంతాడంత డిగ్రీలుండేవి. చాలా తెలివైన వాడు. ఆయన తమ్ముడిని పిల్లలంతా శాస్త్రిబాబు అనేవారు. అతను అప్పట్లో అన్నగారి వద్ద వుంటూ ఛార్టర్డ్ ఎక్కౌంటెన్సీ చదివేవాడు.  వీరిది రాజమండ్రి. రావుగారి సతీమణిది కాకినాడ, భమిడిపాటివారి ఆడపడుచు. వారు ఘంటసాలవారింట్లోకి వచ్చేనాటికి ముచ్చటగా  ముగ్గురు చిన్నపిల్లలు. ఒక అబ్బాయి, ఇద్దరమ్మాయిలు. గతంలో చెప్పినట్లుగా వారందరితో నెం. 35, ఉస్మాన్ రోడ్ 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం' లా పిల్లలతో  కళకళలాడుతూ వుండేది.

ఒక  ఆదివారం రోజు రావుగారి పిల్లలంతా 'చిన్నా బాబు వచ్చాడు, చిన్నాబాబు వచ్చాడంటూ' గోలగా అరవడం వినిపించింది. ఎవరా చిన్నా బాబు అని చూశాను. అంతకుముందెప్పుడూ చూడలేదు. ఆయన రావుగారికి తమ్ముడట. పెత్తండ్రి కొడుకు. మద్రాసులోనే అనుకుంటాను ఏదో ఒక జాపనీస్ కంపెనీలో  ఇంజనీర్ ట.  అతని తమ్ముడు కూడా IIT లో చదివేవాడట, అతనిని వీళ్ళంతా పండుబాబు అని పిలిచేవారు. అప్పుడప్పుడు వీళ్ళు విడివిడిగా శెలవు రోజుల్లో రావుగారింటికి వస్తూండేవారు.  చిన్నాబాబు చాలా హాండ్సమ్ గా రేమండ్ సూటింగ్, రెబొన్ గ్లాసెస్ మోడల్ లా చాలా స్టైల్ గా వుండేవాడు.  టైట్ ప్యాంట్, టక్ చేసిన టైట్ షర్ట్, నడుముకి బెల్ట్ , కోటెడ్ కూలింగ్ గ్లాసెస్ తో ఏదో కంపెనీ మోడల్ లా కనిపించాడు అప్పటి నా కళ్ళకు. అతని స్కూటర్ కూడా ఇతర వెస్పా, లాంబ్రెట్టాలకు భిన్నంగా వుండేది. అలాటి స్కూటర్లు చాలా అరుదుగా రోడ్లమీద కనపడేవి. మనిషి అతి చురుకు అనిపించేది. స్కూటర్ స్టార్ట్ చేసిన మరు సెకెండ్ లోనే మనిషి మాయమయ్యేవాడు. 

అలాగే కొల్లూరివారి బావమరదులు భమిడిపాటి బాపయ్యపంతులుగారు ఆయన సొదరుడు రామ్మోహన్, రావుగారి వదినగార్లు,మరదళ్ళ రాకపోకలతో నెం.35, ఉస్మాన్ రోడ్ నిత్యమూ కలకలలాడుతూవుండేది.

భమిడిపాటి బాపయ్య పంతులుగారి తండ్రిగారు సత్యనారాయణ గారనే గుర్తు. వారిది కాకినాడ. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు బిజినెస్ అనే విన్నాను. బాపయ్యపంతులుగారి సోదరులు రామ్మోహన్ కంటే పైన మరొకాయన వుండేవారు, పేరు గుర్తులేదు. రామ్మోహన్ బ్రిడ్జ్ ఆటలో ఎక్స్పర్ట్. మద్రాసు లోని  జింఖానా వంటి ప్రముఖ క్లబ్ లలో జరిగే బ్రిడ్జ్ టోర్న్ మెంట్లలో పాల్గొనేవారు. 

బాపయ్యపంతులుగారు చిత్రనిర్మాత. భాగస్తులతో కలసి కొన్ని సినీమాలు తీసి అవి కలసి రాక స్వతంత్రంగా  'మాయని మమత' అనే సినీమా తీయాలని తలపెట్టారు. డైరక్టర్ కమలాకర కామేశ్వరరావుగారు. ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి నాయికా నాయకులు.  సంగీత దర్శకుడిగా ఘంటసాలవారనే అనుకున్నారు. వారి ఆఫీసులోని ప్రారంభోత్సవానికి మేమంతా వెళ్ళాము. పాండీబజార్ వెనక ప్రాంతాల్లో ఆ ఆఫీసు వుండేది. ఒక రోజు రాత్రి ఆ కార్యక్రమం జరిగింది. త్వరలోనే  పాటల కంపోజింగ్ ప్రారంభించాలని మాస్టారితో చెప్పడమూ జరిగింది. ఈలోగా కొన్ని అనివార్య మార్పులు జరిగి ఘంటసాల మాస్టారు చేయవలసిన ఆ  'మాయని మమత ' సినీమా అశ్వథ్థామగారికి వెళ్ళింది. ఘంటసాలవారి నేపథ్య గానంతో దేవులపల్లివారు వ్రాసిన పాటలు చాలా చక్కగా అమరాయి. సినీమా కూడా చాలా బాగా తీశారు. కానీ డిస్ట్రిబ్యూషన్ సమస్యలు, లోపాలకారణంగా  నిర్మాత బాపయ్య పంతులు మాత్రం నష్టాలనే చవిచూసారని అనుకోవడం విన్నాను.

చిత్రం ఏమంటే 'మాయని మమత' వచ్చిన ఆరేళ్ళకు, ఘంటసాలవారు కాలం చేసాక వారి రెండో అమ్మాయి భమిటిపాటివారింటి కోడలు కావడం.  అప్పటికి కొల్లూరి వెంకటేశ్వరావుగారు వేరే ఇంటికి మారిపోయారు. అప్పుడు టేలర్స్ రోడ్ లో వుండేవారనుకుంటాను. లేదా జాంబియావో, కెన్యావో ఉద్యోగరీత్యా వెళ్ళిపోయారా ? గుర్తు లేదు. ఒకప్పటి కుటుంబ మిత్రులే బంధువులు కూడా కావడం ఎంతో విశేషం. చాలా ఆనందదాయకం. ఆ కుటుంబాలతో ఇంకా మా స్నేహం చెక్కుచెదరకుండా కొనసాగడం మరింత సంతోషకరం.

🌿🌷🌿


1969 లో ఘంటసాల మాస్టారు పాడిన పాటలెన్నో హిట్ గా ప్రజాదరణ పొందాయి. అందులో కొన్ని పాటలు  --

అదృష్టవంతులు చిత్రంలోని "అయ్యయ్యో బ్రహ్మయ్యా", "ముముముద్దంటే చేదా", వరకట్నం లోని "ఇదేనా మన సంప్రదాయమిదేనా", శ్రీ రామకధలో "మాధవా నను లాలించరా", మూగనోములో "ఈ వేళలో నాలో ఎందుకో", "నిజమైనా కలయైనా", సప్త స్వరాలులో "యదుబాలా శ్రితజనపాలా", "హాయిగా పాడనా గీతం", బందిపోటు దొంగలులో "విరిసిన వెన్నెలవో", "విన్నానులే ప్రియా", గండికోట రహస్యంలో "నీలాల నింగి మెరిసిపడే", విచిత్ర కుటుంబంలో "ఆడవే జలకమ్ములాడవే", సత్తెకాలపు సత్తెయ్యలో "నన్ను ఎవరో తాకిరి", ఆదర్శకుటుంబంలో "బిడియమేలా ఓ చెలి"

ఆత్మీయులు లో "కళ్ళల్లో పెళ్ళిపందిరి", "చేమంతి ఏమిటే ఈ వింత", బుధ్ధిమంతుడులో "నను పాలింపగ నడచి వచ్చితివో", "భూమ్మీద సుఖపడితే", "గుట్టమీద గువ్వ కూసింది", "బడిలో ఏముంది", "టాటా వీడుకోలు గుడ్ బై". ఈ పాటలలో ఘంటసాలవారు ఇద్దరు అక్కినేనిలకు మధ్య గల  వైరుధ్యభావాలకు తగినట్లుగా తన గాత్రంలో మార్పును సుస్పష్టంగా వినిపించారు. 


నను పాలింపగ నడచీ వచ్చితివా

మాతృదేవతలో "విధి ఒక విషవలయం".

ఆ సంవత్సరంలో అజరామరంగా, ఆపాతమాధుర్యాలుగా నిలచిపోయే పాటలను ఘంటసాల మాస్టారు ఏకవీర చిత్రంలో పాడారు. "తోటలో నా రాజు", "ఒక దీపం వెలిగింది", ఎస్.పి.బి.తో పాడిన "ప్రతీరాత్రి వసంతరాత్రి", పాటలు ఈనాటికీ శ్రోతలను అలరిస్తూనే వున్నాయి.


ఒక దీపం వెలిగింది

ఆ ఏడాది మాస్టారి సంగీత దర్శకత్వంలో రెండే సినీమాలు వచ్చాయి. ఒకటి భలే అబ్బాయిలు, మరొకటి‌ జరిగినకధ.

పేకేటి డైరక్షన్ లో తోట సుబ్బారావుగారి శ్రీదేవీ కంబైన్స్ నిర్మించిన "భలే అబ్బాయిలు" "వక్త్" అనే హింది సినీమాకు తెలుగు రూపం. " గులాబీలు పూసే వేళ", "కలగన్నానే తీయని కలగన్నానే", "ఆనాటి మధుర వసంతం" వంటి పాటలు వీనులవిందు చేసాయి. 


ఆనందం నాలో పొంగేను

నాగావళి రామవిజేతా బ్యానర్ మీద నిర్మాత దర్శకుడు కె.బాబురావు ప్రథమ ప్రయత్నం "జరిగిన కథ" ఈ సినీమా తర్వాత తీసిన మరో నాలుగు చిత్రాలకు ఘంటసాలవారే సంగీతం నిర్వహించారు. సంగీతం విషయంలో పూర్తి స్వేఛ్ఛనిచ్చే నిర్మాత బాబూరావు. అందుకే ఆయన చిత్రాలలోని పాటలన్నీ సన్నివేశపరంగా అందరి ప్రశంసలు పొందాయి.

జరిగినకథ చిత్రంలోని "భలేమంచి రోజు" పాట ఎంతటి సూపర్ హిట్టో అందరికీ తెలిసినదే. ఇదే చిత్రంలోని "ఏనాటికైనా ఈ మూగవీణ", "చినవాడ మనసాయెరా", "లౌ లవ్ లవ్ మి నెరజాణ", "ఇదిగో మధువు ఇదిగో సొగసు", "తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే" అన్ని పాటలు ఈనాటికీ అన్ని వేదికలమీదా వినిపిస్తునేవున్నాయి.


చినవాడ మనసాయెరా


లౌ లౌ లౌ మీ నెరజాణా

కవి యిచ్చిన మాటలకు వరస కట్టాలన్నా, లేక ఇచ్చిన ట్యూన్ కూ సరిపడిన సాహిత్యం అమరాలన్నా సంగీతదర్శకుడు, గీత రచయిత ఇద్దరూ సమర్థులైవుండాలి. వీరిచ్చిన పాటను సమర్థవంతంగా తెరకెక్కించే నైపుణ్యం, ప్రతిభ చిత్ర దర్శకుడికి వుండాలి. వీరందరిని అర్ధం చేసుకొని నటీనటులు సందర్భోచితంగా నటించాలి. వీరందరి సమిష్టి కృషిని తెరమీద చూసే ప్రేక్షకుడు అవునని అనాలి అప్పుడే ఆ  సినీమా విజయం పొందుతుంది. ఆ సినీమా లోని పాటలు ప్రచారంపొంది పదికాలాలపాటు ప్రేక్షకుల మనసులలో నిలచిపోతాయి. కానీ సినీమా చూసే ప్రేక్షకుడికి  ఎప్పుడు ఏ సినీమా ఎందుకు నచ్చుతుందో ఇంతవరకు వారిని సృష్టించిన బ్రహ్మదేవుడికి కూడా తెలియని పరమ రహస్యం. అందువల్లనే సరైన ప్రచారం లేక మాణిక్యాలవంటి పాటలు ఎన్నో మట్టిలో కలసి మరుగునపడిపోయాయి. 

🌺

ఘంటసాల మాస్టారికి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే విషయాలెన్నో వచ్చే వారాలలో...

మళ్ళీ వచ్చేవారం మరికొన్నివిశేషాలతో...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, September 19, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై తొమ్మిదవ భాగం

19.09.2021 -  ఆదివారం భాగం - 49:
అధ్యాయం 2 భాగం 48  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలగారు ప్రజల మనిషి. ప్రజాగాయకుడు. స్టూడియో మైక్రోఫోన్ ల ముందుకంటే ప్రజాబాహుళ్యంలో వారి ప్రశంసాపూర్వకమైన కరతాళధ్వనుల మధ్యనే పాడడానికి ఎక్కువ ఉత్సాహం చూపేవారు. ఘంటసాలవారు తిరిగినన్ని పల్లెటూళ్ళు ఆయన స్థాయిలో వున్న మరే గాయకుడు తిరిగివుండడు. తమ అంతస్తుకు తగ్గ పెద్ద పెద్ద హోటల్స్ లో బస చేస్తూ మహా నగరాలలోనే స్టేజ్ షోలు చేయడానికి సిధ్ధపడతారు. కానీ ఘంటసాలగారు ప్రయాణ సౌకర్యాలు లేని కుగ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ కచేరీలు చేసేవారు.

ఒక సంవత్సరం ఆగస్ట్ 15 భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంనాడు అప్పటి విశాఖపట్నం జిల్లాలోని కిండాం అగ్రహారం అనే కుగ్రామంలో  స్థానిక ప్రజల మధ్య పతాకావిష్కరణోత్సవంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రెండు మూడు గ్రూపులుగా విడిపోయిన ఆ చిన్న గ్రామంలోని పెద్ద మనుషులు, ఒకటిగా కలసిమెలసివుంటామనే కండిషన్ మీద ఘంటసాలవారు ఆ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు రోజు తనకెంతో ఆప్తుడు, కీర్తిశేషుడు అయిన ముద్దు పాపారావు గారి కుమార్తె వివాహాన్ని తన చేతులమీదుగా  జరిపించడానికి ఘంటసాలవారు కిండాం అగ్రహారం వెళ్ళారు. ఆ వివాహానికి అయిన ఖర్చంతా దివంగత మిత్రుడి మీది ప్రేమతో ఘంటసాలవారే భరించారు. తన మిత్రుడు కొడుకు ముద్దు నరసింగరావు అప్పటికే ఘంటసాలవారి పంచనజేరాడు.

ముద్దు పాపారావుగారు విజయనగరం మహారాజావారి సంగీత కళాశాలలో ఘంటసాలవారికి సహాధ్యాయి. మా తాతగారి శిష్యుడే. పాపారావుగారు, ఘంటసాలవారు మంచిమిత్రులు. సంగీత విద్య నేర్చుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఆ సమయంలో పాపారావుగారు ఘంటసాలవారికి ఆధరవుగా వుండేవారట. తమ మైత్రి ఎప్పటికి విడరానిదిగా వుండాలని ఈ ఇద్దరు మిత్రులు అనుకునేవారట.

సంగీతశిక్షణ పూర్తయాక ఎవరిదారులు వారివి అయాయి. ఇద్దరికీ కుటుంబ పోషణ ప్రధాన సమస్యగా మారింది. ఎవరికెవరూ సంబంధం లేకుండా పోయింది.  తాను నేర్చుకున్న సంగీతాన్నే నమ్ముకొని ఘంటసాలవారు పొట్టచేతబట్టుకొని దక్షిణాన ఉన్న మద్రాసు చేరుకున్నారు. పాపారావుగారు కూడా అదే సంగీతాన్ని నమ్ముకొని ఒరిస్సా రాష్ట్రం గుణుపూర్ లో స్థిరపడి అక్కడ సంగీత శిక్షణలు ఇస్తూ అతి సామాన్యంగా జీవితం సాగించారు. అప్పట్లో గుణుపూర్ చాలా చిన్న ఊరు. సంపాదన అంతంతమాత్రంగానే వుండేదట. ముద్దు పాపారావు గారి స్వస్థలం కిండాం అగ్రహారం. పాపారావుగారి పెద్దతండ్రి ముద్దు నారాయణ మూర్తిగారు గొప్ప పలుకుబడిగల భూ కామందు. జమీందారీ ఫాయిదాలో చాలా దర్జాగా, దర్పంగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. ఆనాటి సంస్థానాధీశులులాగా గుర్రపు బగ్గీలలో మందీ మార్బలంతో వుండేవారట. తుపాకీ చేతబట్టి వేటకు వెళ్ళే బ్రాహ్మణుడిగా ముద్దు నారాయణమూర్తిగారికి ఘనమైన కీర్తి ఆ వూళ్ళో వుండేది. ఆయన దేవిడి ముందునుండి  ఆ వీధిలో ఎవరు చెప్పులతో వెళ్ళడానికి సాహసించేవారు కాదంటే ఆయన రాజసం ఎంతటిదో ఊహించుకోవచ్చును. జమిందారీ ఆక్ట్ అమలుపర్చిన తర్వాత అందరి జమిందార్లు లాగే కిండాం ముద్దు నారాయణమూర్తిగారి భూములన్నీ ప్రభుత్వపరమైపోయాయి. ఆయన కొడుకులు, మనవల కాలానికి చాలా ఆస్తులు హరించుకుపోయాయి. ఉన్న భూములను ముందుచూపుతో అభివృధ్ధి పర్చుకున్నవారు బాగుపడ్డారు.  ఆ ముందు ఛూపు లేనివారు ఉన్న ఆస్తంతా సంపెంగి నూనెలకు, నేతి ఖర్చులకే ఉపయోగించి అనామకులయ్యారు. ముద్దు నారాయణమూర్తిగారి తమ్ముడు కొడుకే ముద్దు పాపారావుగారు. ఆయన కాలానికి, ఆయన భాగంగా ఏమీ మిగలలేదు. పాపారావుగారు మా తాతగారు పట్రాయని సీతారామశాస్త్రిగారి శిష్యుడు. ఘంటసాలగారి సహాధ్యాయి.


ఈ ఫోటోలో సరిగ్గా గురువుగారి వెనుక నించునున్నది ముద్దు పాపారావుగారు 
ఫోటోకి ఎడమవేపు కింద కూర్చునున్నది ఆయన మేనల్లుడు

మా నాన్నగారు (పట్రాయని సంగీతరావుగారి) జన్మస్థలం కూడా కిండాం అగ్రహారమే. మా నాన్నగారి మాతామహుల ఊరు. ఈ కిండాం అనే పాతకాలపు అగ్రహారం విజయనగరం జిల్లాలోని బొండపల్లి నుండి మూడుమైళ్ళ దూరంలో, గజపతినగరం నుండి పదిమైళ్ళ దూరంలోను వుందట. నేనెప్పుడూ ఆ వూరు వెళ్ళలేదు. ఇప్పుడు అన్ని ఊళ్ళలాగే ఆ వూరు కూడా కొంత అభివృద్ధి చెందిందని విన్నాను. (ఈ కిండాం కు సంబంధించిన వివరాలు కొన్ని మా నాన్నగారి ద్వారా విన్నవి, మరికొన్ని మా శర్మ బాబు (గుమ్మా మార్కండేయశర్మ, మా నాన్నగారి పినతల్లి కొడుకు) ద్వారా తెలుసుకున్నవి.)

ఘంటసాలవారి స్నేహితుడు ముద్దు పాపారావుగారికి వివాహం జరిగి సంసారం పెరిగింది. కాని ఆర్ధిక స్థితి అంతగా పెరగలేదు. ఆయన ఒక కొడుకు  నరసింగరావు అని పేరు.  విజయనగరంలో రాజావారి సింహాచలం సత్రవులో భోజనం చేస్తూ  చదువుతూవుండేవాడు. ఇలాటి పరిస్థితులలో ముద్దు పాపారావుగారు కాలం చేశారు. సంసారం రోడ్ న పడింది. నరసింగరావు చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ విషయం ఘంటసాలవారికి తెలిసింది. ఆయన వెంటనే తన స్నేహితుడు కొడుకైన నరసింగరావును తన దగ్గరకు పిలిపించుకున్నారు. ఇకపైన ఆ కుర్రవాడి బరువు భాధ్యతలు మనవేనని, మన సొంత మనిషిలానే అందరూ ఆదరించాలని, తనంతట తానుగా వెళ్ళిపోతానంటే తప్ప అతనిని ఎవరూ ఆ ఇల్లువదలి పొమ్మనకూడదని ఘంటసాల మాస్టారు తమ ఇంట్లోవారందరికీ చెప్పారు. 

ఆనాటి నుండి ముద్దు పాపారావుగారి కుమారుడు ముద్దు నరసింగరావు (మా నరసింగ) ఘంటసాలవారింటి కుటుంబసభ్యుడయాడు. చదువు సరిగా సాగనందున పెద్ద ఉద్యోగాలు దొరికే అవకాశంలేక  తమ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులకు వినియోగించేవారు. ఘంటసాలవారి సొంత నిర్మాణ సంస్థకు సంబంధించిన ఎకౌంట్స్ చూసే క్లర్క్ కు సహాయకారిగా వుంటూవుండేవాడు. 

కొన్నాళ్ళకు కొంచెం అనుభవం వచ్చాక ప్రముఖ నటుడు గుమ్మడిగారి ఇన్కమ్ టాక్స్ లెక్కలు రాయడానికి వెళ్ళేవాడు. అలాగే, ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ జి.ఎన్.భూషణ్, 'ది మెయిల్" మద్రాసులోని ప్రముఖ ఇంగ్లీష్ eveninger లో సబ్ ఎడిటర్ జి.వి.రామారావుగారు (గిడుగు వెంకట రామారావు) కలసి ఏర్పాటు చేసిన కల్పన పబ్లిసిటిస్ లో పార్ట్ టైమ్ టైపిస్ట్ గా పనిచేసేవాడు. ఆ ఇంటి మేడమీదే బేబి శ్రీదేవి కుటుంబం వుండేది. ఆ ఆఫీసుకు రెండుమూడుసార్లు వెళ్ళాను. బాపు రమణల సినీమాలన్నిటికి పబ్లిసిటీ వ్యవహారం అంతా ఈ కల్పనా పబ్లిసిటీ యే చూసేది. ఆ ఆఫీస్ టైపింగ్ శైలి నాకు వింతగా వుండేది. ఇంగ్లీష్ లోని కరస్పాడెన్స్ లో ఎక్కడా కాపిటల్ లెటర్సే ఉపయోగించేవారు కాదు. అంతా స్మాల్ లెటర్సే. అందరు ఎడమవేపు మార్జిన్  సెట్ చేస్తే వాళ్ళు కుడివేపున మార్జిన్ సెట్ చేసేవారు. అంతా తమాషాగా వుండేది. ఇదంతా సినిమా పబ్లిసిటీలో ఒక నావెల్టీ అనేవాడు. కొన్నాళ్ళపాటు ఒక స్నేహితుడు (సుధాకర్)తో కలసి 16 mm సినీమాలు డిస్ట్రిబ్యూషన్ కు తీసుకొని ఆంధ్రాలోని పల్లెటూళ్ళలో, స్కూళ్ళలో, పెళ్ళిళ్ళలో  ప్రదర్శిస్తూ ఓ చిన్నపాటి వ్యాపారం సాగించాడు. అవన్నీ మూన్నాళ్ళ ముచ్చటగానే సాగాయి. 

అయ్యగారిలా సంగీతం అబ్బలేదు కానీ వారిలా చుట్టకాల్చడం మాత్రం అబ్బింది. ఉదయం పూట చుట్టలు కాలిస్తే ఆ వాసనకు ఇంట్లోవారు తిడతారని రాత్రి పదయ్యాక  అందరూ పడుకున్నాక గేట్ బయటకు వచ్చి ఓ గంటసేపు చుట్టకాలుస్తూ అనేక  సినీమా కంపెనీల కబుర్లు చెపుతూండేవాడు.

ఘంటసాల మాస్టారి అభిమతం ప్రకారం ముద్దు నరసింగరావు చివరివరకూ ఘంటసాలవారింటి బిడ్డగానే బ్రతికాడు. ఘంటసాలవారు స్వర్గస్తులైన తర్వాత కూడా  ఆ కుటుంబానికి సంబంధంలేని కొమరవోలు వెంకట కృష్ణారావు అనే తమ్ముడు కృష్ణ ఉరఫ్ గుండు మామయ్య, ఈ ముద్దు నరసింగరావు ఈ నెం.35, ఉస్మాన్ రోడ్ లోనే వుండిపోయారు. ఘంటసాలవారి సతీమణి సావిత్రమ్మగారు ఈ ఇద్దరినీ కూడా తన పిల్లలతో సమానంగా చూసారు. నిజానికి తమ్ముడు కృష్ణ సావిత్రమ్మగారికంటే  వయసులో బాగా పెద్ద. అయినా అతన్ని తమ్ముడూ అనే పిలిచేవారు.  35, ఉస్మాన్ రోడ్ ఇల్లు అమ్మిన తర్వాత కూడా ఈ ఇద్దరూ అమ్మగారినే అంటిపెట్టుకొని ఆవిడకు సహాయంగా ఆవిడ ఉన్నచోటే  ఉంటూ ఈ ఇద్దరూ తమకంటూ ఏ కుటుంబమూ లేకుండా గడిపారు.  ఇద్దరికీ పెళ్ళి కాలేదు. తమ్ముడు కృష్ణ తన 90వ ఏట, ముద్దు నరసింగరావు తన 80వ ఏట  ఘంటసాల కుటుంబ సభ్యులుగానే తమ అంతిమశ్వాస విడిచారు. ఘంటసాలవారి కుటుంబ సభ్యులంతా వీరిద్దరి మరణానికి ఎంతగానో ఆవేదనపొందారు. ఘంటసాలవారి కుటుంబంతో మెలిగినవారంతా కూడా అంతటి ఆత్మీయతనే పొందారు. దీనంతటికీ కారణం ఘంటసాలవారి ఔదార్యం, మానవతా దృక్పధమే కారణం. 

🌺


చూస్తూండగానే వరసగా రెండు 12Bలు ఖాళీగా వెళ్ళిపోయాయి. నేనింకా కోట్స్ రోడ్ కూడా దాటలేదు. తర్వాతి బస్ ఎంతసేపటికి వస్తుందో ఇవేళ ఆఫీస్ కు లేటయలే వుంది అనుకుంటూ పానగల్ పార్క్ వేపు నడిచాను. నేను శారదా స్కూల్ ఎదురుగా వున్న పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళేసరికి 12 నెం. కూడా ఒకటి నాముందు నుండే వెళ్ళిపోయింది. నాలుగడుగులలో బస్ స్టాప్. బస్ స్టాప్ లో ఆపకుండా కొంచెం ముందుకు పోయి ఆపాడు. జనాలు పొలోమంటూ ఆ బస్ వెనక పరుగులు తీసారు. స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసుల టైముల్లో ఇది సర్వసాధారణం. నా 12B. రాలేదు. దానికోసం ఎదురుచూస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఈలోగా ఒకాయన వడవడిగా వచ్చి 12B. వెళ్ళిపోయిందా అని అరవంలో అడిగారు. నేనూ అదే అరవంలో ఐదునిముషాలముందే రెండు బస్సులు వెళ్ళిపోయాయని  చెప్పాను. ఆయన రిలాక్స్డ్ గా ఒక చెట్టును ఆనుకొని ఏవో కూనిరాగాలు తీస్తున్నారు. ఆయన వేషధారణ చూస్తే తెలుగాయనేమో అనిపించింది. పంచెకట్టు, పైన తెల్లటి జుబ్బా, భుజంమీద కండువా చూసి అనిపించింది. మరో పావుగంట తర్వాత 12B. కొంచెం ఖాళీగా వచ్చింది. వెంటనే ఎక్కేశాను. నాతోపాటే ఆయనా బస్ ఎక్కారు.  నాకు లక్కీగా పాండీబజార్లోని రాజకుమారి ధియేటర్ స్టాపింగ్ దగ్గర కిటికీ వేపు సీట్ దొరికింది. అక్కడ నుండి లజ్ కు వెళ్ళడానికి ఒక అరగంటైనా పడుతుంది. బయటనుండి వచ్చే చల్లటిగాలికి నాకళ్ళు మూతలుపడ్డాయి. ఎంతసేపు అలా పడుకున్నానో తెలియదు. ఇదే లాస్ట్ స్టాప్ అందరూ దిగండి దిగండనే బస్ కండక్టర్  తమిళ అరుపులతో నాకు తెలివి వచ్చింది. అప్పుడే లజ్ కార్నర్ వచ్చేసిందా అనుకుంటూ బస్ దిగి చూశాను. అది నాకు పరిచయమున్న లజ్ కార్నర్ కాదు. ఏదో కొత్త ప్రదేశం అంతకుముందెప్పుడు చూడలేదు. చుట్టూ కొబ్బరి చెట్లు. వాటి మధ్య ఎత్తైన ఒక రాజగోపురంతో ఒక పెద్ద శివాలయం కనిపించింది.  కంగారుగా వచ్చిన బస్ వేపు పరీక్షగా చూస్తే అది 12E. బస్. నేను దిగింది తిరువాన్మియూర్ లో. నా అదృష్టం బాగుంది. స్టాండ్ కండక్టర్లు ఎవరూ దిగినవాళ్ళ దగ్గర టిక్కెట్లు చెక్ చేయలేదు. అలాచేసివుంటే  కొన్న టిక్కెట్టు కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసినందుకు చీవాట్లు, దానితోపాటూ ఫైన్ కట్టవలసి వచ్చేది. ఆ ప్రాంతానికి వెళ్ళడం అదే మొదటిసారి. చాలా నిర్మానుష్యంగా ప్రశాంతంగా వుందా స్థలం. మహాబలిపురానికి బస్ లు  ఆ రోడ్ మీద నుండే వెళతాయని తర్వాత తెలిసింది. అదే ఈనాడు ఈస్ట్ కోస్ట్ రోడ్ గా దట్టమైన చెట్లతో, కాదు భవనాలతో, ట్రాఫిక్ జామ్ లతో  బ్రహ్మాండంగా అభివృద్ధిచెందింది.

నేను మళ్ళీ ఆ బస్ స్టాండ్ లో లజ్ కు వెళ్ళే బస్ నెంబర్ తెలుసుకొని, అది వచ్చేవరకు కాచుకొనివుండి ఆ బస్ లో బయల్దేరి ఒళ్ళు దగ్గరపెట్టుకొని  బుధ్ధిగా లజ్ లో దిగి కపాలేశ్వరాలయం దగ్గరకు వెళ్ళేసరికి 12 దాటింది. మెల్లగా మరో ఐదునిముషాల తర్వాత ఆఫీసుకు చేరుకున్నాను. ఎందుకు లేటయిందని ఎవరూ నన్నడగలేదు. పాత ఆఫీసర్ గారు ట్రాన్స్ఫరై వెళ్ళిపోయారు. క్రొత్తగా వచ్చిన లయొజన్ ఆఫీసర్ గారు  ఆరోజు ఆఫీసుకు రాకుండా డైరక్ట్ గా హార్బర్ లో చెకింగ్ కు వెళ్ళారట. ఆయన పేరు వి.కె.బావా (వసంతకుమార్ బావా). ఈయన కూడా IAS ఆఫీసరే. పంజాబీ. సూటు, బూట్ లతో ఒక పెద్ద ఎక్సిక్యూటివ్ కు వుండే లక్షణాలన్నీ వుండేవి. ఆయనకు తెలుగురాదు. ఇంగ్లీష్, హిందీలలోనే వ్యవహారమంతా.  ఈయన వచ్చాక నాకు పని ఎక్కువయింది. ఈయన హయాంలో ఎక్కువగా లెటర్ కరస్పాన్డెన్స్ జరిగేది. నేను మొదటిసారిగా ఫాక్స్ మిషన్ ను, సైక్లొస్టైల్ మిషన్ ను చూసింది ఆ ఆఫీసులోనే. 

మద్రాస్ లోని ఈ లయొజన్ ఆఫీస్  నడపాలా, వద్దా అని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం వారు ఏడాదికొకసారి ఆర్డర్స్ జారి చేసేవారు. ఆ ఆర్డర్స్ రావడం లేటయితే ఉద్యోగస్తుల జీతాలు రావడం కూడా లేటయేది. ఆంధ్రాలోని డీలర్లకు ఎరువులు ఏ పోర్ట్ ద్వారా ఎలా సరఫరా అవుతాయో తెలియని అసందిగ్దత ఏర్పడేది. అలాగే ఆ లయొజన్ ఆఫీస్ మద్రాస్ లో కొనసాగింది. మైలాపూర్ లో వున్న ఆ ఆఫీస్ తర్వాత కొన్నాళ్ళకు అడయార్ కు మారింది. 
🌺
              
కె.వి.రెడ్డిగారి దగ్గర సహాయకుడిగా పనిచేసి సంపాదించిన అనుభవంతో బాబూరావు అనే కొత్త కుర్రవాడు సినీమా తీస్తున్నాడు. అతనే డైరక్షన్ . మనమే ఆ సంగీతం చేస్తున్నామని  ఒకరోజు ఘంటసాల మాస్టారు చెప్పారు. అప్పటికి ఆయన చేతిలో రెండు మూడు సినీమాలకంటే ఎక్కువలేవు. 

1952 నుండి ఘంటసాల మాస్టారినే అంటిపెట్టుకొని అన్నిచోట్లకు కూడా తిరిగే జె.వి.రాఘవులుగారు కూడా మాస్టారింటికి రావడం తగ్గించేసారు. ప్రతీరోజూ ఉదయం ఎనిమిది గంటలకంతా వచ్చే రాఘవులుగారు లేకుండానే మాస్టారు బయట రికార్డింగ్ లకు రిహార్సల్స్ కు వెళ్ళడం సాగించారు. ఆ సమయంలోనే మొవ్వ జనార్దనరావు,  మూడవ రాఘవులు ఘంటసాలవారి దగ్గర చేరారు. ఈ ఇద్దరూ కూడా మంచి గాయకులే. ఆ తర్వాత,  అంతకుముందే  మాస్టారి అనేక సినీమాలకు సహాయకుడిగా పనిచేసిన పామర్తిగారు మరల వచ్చిచేరారు. రాఘవులుగారికి గాయకుడిగా రాణించే అవకాశాలు తక్కువనే విషయం ఆయనకు అవగతమయింది. స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేయాలనే కోరికా పెరిగింది. నూతనావకాశాలకోసం చేసే ప్రయత్నాలలో రాఘవులు ఘంటసాలవారి కి క్రమక్రమేణా దూరమయ్యారు. తన దగ్గర వున్న మనిషి అభివృద్ధి పథంలోకి అడుగుపెడుతున్నందుకు ఘంటసాల మాస్టారు ఆనందించారు.

మాస్టారి దగ్గర పనిచేసిన మాస్టర్ వేణు, విజయాకృష్ణమూర్తి, ఎమ్.రంగారావు, బి.గోపాలం, పామర్తి వంటివారెందరో అవకాశాలు లభించినప్పుడు సంగీతదర్శకులుగా వెళ్ళిపోయారు. వారెవరూ తనకు పోటీయని మాస్టారు భావించనూలేదు. వారందరి సినీమాలలో ఘంటసాలగారే ప్రధాన గాయకుడు.

ఘంటసాలవారు అప్పటికే సంగీత దర్శకుడిగా అగ్రస్థానాన ఉన్నారు. ఆయనుండే కాలానికి తెలుగు సినీమాలలో ఎక్కువ సంఖ్యలో సంగీత దర్శకత్వం వహించింది వారే. అనేక చిత్రనిర్మాణ సంస్థలకు రిపీటెడ్ గా సంగీత దర్శకత్వం వహించింది ఘంటసాలవారే. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా గల ప్రతిభతో పాటు ఆయనకు గల వినయ విధేయతలు, నిర్మాతా దర్శకులతో గల స్నేహ సత్సంబంధాల వలన ఒకే నిర్మాత తీసిన అనేక చిత్రాలకు ఆయనే సంగీతదర్శకుడిగా చివరవరకూ కొనసాగారు. ఒక చిత్రం ఒప్పుకున్న తర్వాత ఆయనంతట ఆయనగా  ఆ చిత్రం మధ్యలో తప్పుకున్న సందర్భాలే లేవు. ఘంటసాల మాస్టారిని సంగీత దర్శకుడుగా రిపీటెడ్ గా వినియోగించుకున్న అనేక చిత్రనిర్మాణ సంస్థలలో ముఖ్యమైనవి -

సి.కృష్ణవేణి&మీర్జాపూర్ రాజావారి ఆధ్వర్యంలోని శోభనాచల, నాగిరెడ్డి&చక్రపాణిల విజయా ప్రొడక్షన్స్, సుందర్లాల్ నహతాగారి రాజశ్రీ/శ్రీ/రాజలక్ష్మీ ప్రొడక్షన్స్, డి.ఎల్ నారాయణగారి వినోదా పిక్చర్స్, కోవెలమూడి భాస్కరరావు గారి భాస్కర్ ప్రొడక్షన్స్, దోనేపూడి కృష్ణమూర్తి గారి గోకుల్ పిక్చర్స్, లక్ష్మీరాజ్యం గారి రాజ్యం ప్రొడక్షన్స్, నర్రా రామబ్రహ్మంగారి గౌతమీ పిక్చర్స్, ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు గారి మాధవీ పిక్చర్స్, తోట సుబ్బారావు గారి శ్రీదేవి ప్రొడక్షన్స్, కె.ఎ.ప్రభాకర్&కె.బాబూరావ్ సోదరుల రామ విజేతా ఫిలింస్ వంటి సంస్థలకు వరసగా ఘంటసాలవారు సంగీత దర్శకత్వం వహించడం ఒక ఘనచరిత్రగానే భావించవచ్చును. 

సాటిలేని గాయకలక్షణాలు, సంగీతంలో పరిణితిచెందిన సంగీతదర్శకత్వపు లక్షణాలు ఒకే వ్యక్తి కలిగివుండడం అరుదైన విషయం. అటువంటి గొప్పకళాకారుడు మన ఘంటసాల. రెండున్నర దశాబ్దాల పాటు గాయకుడిగా , సంగీతదర్శకుడిగా కోట్లాది తెలుగువారి పరిపూర్ణాభిమానాన్ని చూరగొన్న ఘంటసాలవారి చలనచిత్ర జీవిత రజతోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆయన అభిమానులంతా కోరుకున్నారు. ఆ గంధర్వగాయకుని సంగీత రజతోత్సవం చేయడానికి ప్రణాళికలు వేయడం మొదలయింది.

ఆ విశేషాలేమిటో రాబోయే వారాలలో మీరే తెలుసుకుంటారు...
 
                 ...సశేషం



*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, September 12, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఎనిమిదవ భాగం

12.09.2021 - ఆదివారం భాగం - 48*:
అధ్యాయం 2  భాగం 47 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాల మాస్టారు తెలుగు సినీమా సంగీతానికి, లలిత సంగీతానికి చేసిన సేవలు అసమాన్యం, గాయకులకు మార్గదర్శకం. తాను నేర్చుకున్నది శుధ్ధ కర్నాటకమే అయినా లలిత సంగీతాభివృధ్ధికి, ఆ లలితసంగీతం సామాన్య శ్రోతల హృదయాలలోనికి చొచ్చుకుపోవడం కోసం కొన్ని కర్నాటక సంగీత రాగాలలో అన్యస్వర ప్రయోగం చేసి ఆయా పాటలకు జీవాన్ని, రసానుభూతిని ఘంటసాల కల్పించారు. ఆ రకమైన పాటలు బహుళజనాదరణ పొందాయి. ఈ రకమైన మార్పులు ఛాందసవాదులైన సంగీత విద్వాంసుల కనుబొమ్మల ఎగురవేతకు, కన్నెర్రకు కూడా గురి అయినాయి. కానీ, ఘంటసాల అలాటివారిని పట్టించుకోలేదు. తను సరియని నమ్మిన మార్గాన్నే అనుసరించారు. తాను రాగాలలో చేసిన మార్పులు తెలియకనో, పొరపాటునో చేసినవికావు. తిరిగి అదే రాగం మరో దగ్గర ఉపయోగించవలసివచ్చినప్పుడు కూడా అదే అన్యస్వర ప్రయోగాన్ని అదే రీతిలో ఉపయోగించేవారు.
 
తర్వాతి కాలంలో వచ్చిన 'శంకరాభరణం' సినీమాలోని 'సామజవరగమన' పాట సన్నివేశానికి (హిందోళ రాగంలో  అన్యస్వరం రిషభం ఉపయోగించడం) వెనుక ఘంటసాలవారి అన్యస్వర సంగీత ప్రభావం, స్ఫూర్తి వుందేమోనని నాకనిపిస్తుంది.

ఘంటసాలవారికి రోజూ అధిక సంఖ్యలో అభిమానుల దగ్గరనుండి ఉత్తరాలు వచ్చేవి. అవన్నీ ఆయన పాడిన పాటలను మెచ్చుకుంటూ పొగుడుతూ వ్రాసినవే. కొంతమంది నిష్కర్షగా విమర్శిస్తూ వ్రాసినవారూ వుండేవారు. కానీ ఘంటసాలవారు పొగడ్తలకు పొంగిపోనూలేదు. విమర్శలకు కుంగిపోనూలేదు. రెంటినీ సమానంగానే స్వీకరించేవారు.

1968 లో వచ్చిన ఒక ఉత్తరం నాకు కోపాన్ని, ఆవేశాన్ని కలిగించింది. ఆ ఉత్తరాన్ని అక్కడకక్కడే చింపిపారేయాలాన్నంత కోపం కలిగించింది. నిగ్రహం లేకపోవడమంటే అదే. ఆ ఉత్తరాన్ని చదివిన ఘంటసాల మాస్టారు, పనుల ఒత్తిడి మూలంగా వెంటనే సమాధానం రాయలేక ఆ ఉత్తరానికి సమాధానాన్ని మా నాన్నగారిని వ్రాసిపెట్టమన్నారు. మా నాన్నగారు చెప్పిన సమాధానం నేనే ఒక పోస్ట్ కార్డ్ మీద వ్రాసి మాస్టారికి చూపించాను. అది చూసి ఆయన చాలా తృప్తిగా బాగుందని చెప్పి ఆ కార్డ్ మీద సంతకం చేసారు. ఆ ఉత్తరం పోస్ట్ చేయడమూ జరిగింది.  ఇంతకూ ఘంటసాల మాస్టారిని విమర్శిస్తూ వ్రాసినవారు మరెవరో కాదు. 'సరాగమాల' శీర్షిక నిర్వాహకుడు, ప్రముఖ చిత్రసంగీత సమీక్షకుడు శ్రీ విఎకె రంగారావు గారే. ఆ కథ అక్కడితో ఆగిపోలేదు.

1971 లో ఘంటసాల మాస్టారు తన వాద్యబృందంతో ఒక నెల రోజుల విదేశీ పర్యటన చేసి వచ్చిన సందర్భంలో మాస్టారి గౌరవార్ధం శ్రీ విఎకె రంగారావు 'ఘంటసాల భువనవిజయం' అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో శ్రీ రంగారావు గారు వ్రాసిన 'నేనెరిగిన ఘంటసాల' వ్యాసం ఆఖరి పేరాలో యిలా వుంది. 

"రెండేళ్ళక్రితం ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ఒక చిత్రం విడుదలైనది. మద్రాసులో చూడడానికి వీలుపడక ఘంటసాల చేసిన పాటలు ఎనిమిది వున్నాయని ఆశపడి పనిగట్టుకొని తిరుపతి వెళ్ళి చూశాను. ఘంటసాల సంగీతంలో ఎప్పుడూ అంతర్లీనంగా ప్రవహించే మార్దవం ఆ చిత్ర సంగీతంలో పూర్తిగా మృగ్యం. వెంటనే అక్కడినుండే ఘంటసాలగారికి ఒక కార్డ్ వ్రాసి పడేసాను. "అయ్యా! ఫలానా చిత్రంలో తమ సంగీతం ఒక్క పాట దక్క దుర్భరము అని. దానికి పర్యవసానం ఏమిటి జరిగిందనుకున్నారు? 

"నన్నేం చేయమంటారు నిర్మాతలలా చేయించుకున్నారని యెదురు పడినప్పుడు కుంటిసాకులు చెప్పలేదు. మీరన్నది నిజమేనని అతి వినయం చూపలేదు, మనసులో వీడికేం తెలుసు అనుకుంటూ. నేను మద్రాసుకి తిరిగి వచ్చిన మూడవనాటికి యీ విధంగా కార్డ్ వచ్చింది.

"రంగారావుగారు! సినీమా సంగీతం పట్ల మీ అభిప్రాయం స్వీకారయోగ్యము, సృజనాత్మకము, ఎంతైనా సమంజసము. అభినందనలతో - ఘంటసాల".

ఘంటసాల  వినయానికి అంతకంటే వేరే నిదర్శనం కావాలా ! "
                  
ఈ సంఘటన ఘంటసాలవారి విచక్షణకు, పరిణితికి ఒక దర్పణం. 

🌺


ఎక్కిరాల వేదవ్యాస్ గారు ఒక IAS ఆఫీసర్. డా.డి.ఎన్.రావుగారు ఢిల్లీలో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో పనిచేసేప్పుడు  వేదవ్యాస్ ఆయన స్టూడెంట్ అని చెప్పగా విన్నాను. ఆయన మద్రాసులో వుండిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు లైజన్ ఆఫీసర్ గా వచ్చారు. డి.ఎన్.రావుగారు నన్ను వెళ్ళి ఆయనను కలవమని చెప్పారు. అప్పట్లో ఆ ఆఫీస్ మైలాపూర్ కపాలేశ్వరాలయం తూర్పు వేపు వీధుల్లో ఒక మేడమీద వుండేది. ఒక మంచి ముహుర్తాన ఆ ఆఫీసులో అడుగుపెట్టాను. నా గురించి అంతకుముందే డా.రావుగారి ద్వారా వినడం వలన పెద్దగా ప్రశ్నలేం వేయకుండా ఒక టెంపరరీ టైపిస్ట్ పోస్ట్ లో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఆ ఆఫీసులో పనిచేసే నలుగురూ  తెలుగువాళ్ళే. అందరూ ఆనాటి ఆంధ్రప్రదేశ్ నుండి ట్రాన్స్ఫరై వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగులే. విదేశాల నుండి మద్రాస్ పోర్ట్ కు షిప్ లలో వచ్చే ఫెర్టిలైజర్స్ ను ఈ ఆఫీస్ ద్వారా  ఆనాటి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలోని ఆథరైజ్డ్  డీలర్లకు లారీలలోనో లేక గూడ్స్ వ్యాగన్స్ లోనో సరఫరా అయేవి. మెడ్రాస్ పోర్ట్ కు  ఫెర్టిలైజర్స్ షిప్ వస్తున్నదనే వార్త తెలిసినప్పటినుండి ఈ లయొజన్ ఆఫీస్ లో ఒకటే హడావుడి, పని ఒత్తిడి అధికమయేది. ఆంధ్రానుండి అన్ని జిల్లాల్లోని డీలర్స్ తమకు కావలసిన యూరియా, అమోనియంసల్ఫేట్, నైట్రేట్   వంటి ఎరువులకోసం టన్నుల లెఖ్ఖన తమ ఇండెట్లను  తీసుకు వచ్చేవారు. వచ్చే సరుకును బట్టి అందులో ఆంధ్రా కోటా ఎంత వస్తుందో చూసి ఈ డీలర్లకు ఆ ఎరువులు పంపిణీ జరిగేది. ఒక్కొక్క డీలర్ కు ఈ ఆఫీసు ద్వారా రిలీజింగ్ ఆర్డర్స్ ఇచ్చేవారు.  డీలర్లు వాటిని పట్టుకొని మెడ్రాస్ హార్బర్ లో తమకు రావలసిన ఎరువులను రిలీజ్ చేసుకొని తమ తమ ఊళ్ళకు లారీలలోనో , లేక రైలు వాగన్స్ లోనో పంపుకునేవారు.  నెలలో ఒక వారం, పది రోజులు ఈ హడావుడి సాగేది. ఇదంతా సక్రమంగా, క్రమశిక్షణతో ఎటువంటి అవకతవకలు జరగకుండా లయొజన్ ఆఫీసర్ గారి పర్యవేక్షణలో జరిగేది. అటువంటి ఆఫీసులో నా కొత్త ఉద్యోగం. అక్కడ నేను కాక పనిచేసే మరో ముగ్గురిలో ఇద్దరి పేర్లే గుర్తున్నాయి. ఒకతని పేరు అబ్దుల్ సలామ్. నెల్లూరు ప్రాంతంవాడు. మెడ్రాస్ లో ముస్లింలు ఎక్కువగా వుండే ట్రిప్లికేన్ లో వుండేవాడు. మరొకాయన మంథా గోపాలకృష్ణ. వారిది విశాఖపట్నం.  మా టి. నగర్ నుండే వచ్చేవాడు. ఈ సలామ్, పేరు గుర్తు లేని మరొక క్లర్క్ వీళ్ళిద్దరితోనే ఆఫీస్ వ్యవహారమంతా నడిచేది. పేరుకు టైపిస్ట్ ఉన్నా చాలా భాగం  ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కువ చేతితోనే వ్రాసేవారు. ఒక్క ఆఫీసర్ గారు డిక్టేట్ చేసే లెటర్స్ మాత్రమే టైపింగ్ కు వచ్చేవి.  షిప్ లు వచ్చే సమయంలో తప్ప ఆఫీసులో నాకు పెద్దగా పనేమీ వుండేదికాదు. మా జీతాలన్నీ కూడా హైదరాబాద్ లోని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండే వచ్చేవి. ఆ డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు బట్వాడా అయేది. ఆ వ్యవహారమంతా సలామ్ అనే ఆయనే చూసేవాడు. మనిషి సన్నగా షెరాయి,చొక్కాలో చాలా సామాన్యంగా వుండేవాడు. నేను లయొజన్ ఆఫీసర్ గారి మూలంగా వచ్చినందున నాతో ఫ్రీగా మాట్లాడడానికి , ఏదైనా పని చెప్పడానికి సంకోచించేవారు. నాకు ఈ వాతావరణం కొత్తగా అనిపించింది. 
మా ఆఫీసర్ వేదవ్యాస్ గారు బయట వ్యవహారాలు చక్కబెట్టడంలోనే ఎక్కువగా నిమగ్నమైవుండేవారు. ఆఫీసులో వుండే సమయం తక్కువ. వారి దర్శనం కోసం ఆంధ్రా నుండి వచ్చే డీలర్లతో నిండివుండేది. వాళ్ళంతా ఎప్పుడు ఆఫీస్ స్టాఫ్ తో ఏదో గొడవపడుతూండేవారు. కారణం ఏమీ లేదు. వాళ్ళు అడిగినంత పెద్ద మొత్తంలో ఎరువులు దొరికేవి కావు. సప్లై, డిమాండ్ ప్రొబ్లం. ఆ విషయాలన్నీ లయొజన్ ఆఫీసర్ తప్ప మరెవరూ పరిష్కారం చేయలేరన్న విషయం అందరికీ తెలుసు. 

ఇలాటి షిప్మెంట్ జరుగుతున్న రోజుల్లోనే ఒక రోజు మా ఆఫీసుకు అల్లు రామలింగయ్య, వారి పెద్దబ్బాయి మా ఆఫీసుకు కొంచెం వేడిగానే వచ్చారు. ఈయనకు ఈ ఆఫీసులో ఏం పని అని అనుకుంటున్న సమయంలో అక్కడున్న సలామ్ ఆయనతో రెండు మూడు రోజుల్లో సరుకు వచ్చేస్తుంది. అందులో మీ ఇండెంట్ వుంది. ఈ వారంలో మీ పనయిపోతుందని సర్ది చెప్పడంతో కొంచెం చల్లబడ్డారు. తర్వాత తెలిసింది, అల్లు రామలింగయ్యగారికి పాలకొల్లులో ఫెర్టిలైజర్స్ డీలర్షిప్ వుందని ఆ సంబంధంగా ఆయన ఈ ఆఫీసుకు వస్తూంటారని. ఆయన ఎప్పుడు వచ్చినా వేదవ్యాస్ గారిని చూసే అవకాశం దొరికేదికాదు. అందుకు ఆయన కొంత చిరాకు చిత్తగించేవాడు. తర్వాత ఎప్పుడో ఆఫీసర్ గారు వచ్చి ఆ రోజు జరిగిన విషయాలన్నీ అడిగి తెలుసుకొని హైదరాబాద్ లోని ఎగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో సంప్రదింపులు, చర్చలు, రగడలు ఇత్యాదులన్నీ రొటీన్ గా సాగిపోతూండేవి. వేదవ్యాస్ గారు ఆఫీసులో ఉన్న సమయంలో వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా మారిపోయేది. అందరూ నిశబ్దంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. 

లంచ్ టైమ్ లో గోపాలకృష్ణ గారు ఆఫీసర్ గారి రూములో విధిగా ఓ రెండు గంటలు గడిపేవాడు. ఒకరోజు ఏదో పనుండి నేను లోపలికి వెళ్ళిచూస్తే వేదవ్యాస్ గారు,  గోపాలకృష్ణ జ్యోతిషం గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. టేబిల్ మీద పెద్ద పెద్ద పుస్తకాలు వున్నాయి. తర్వాత తెలిసింది వేదవ్యాస్, IAS గారు జ్యోతిష్య శాస్త్రంలో ఆరితేరిన పండితులని. ఈ గోపాలకృష్ణ గారికి కూడా జ్యోతిషం, హస్త సాముద్రికంలో మంచి ప్రవేశం వుందని. గోపాలకృష్ణ గారు స్టెనోగ్రాఫర్. అయితే ఆయన పనిచేయగా నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరూ ఆయనకు ఏ పని చెప్పేవారు కాదు. కారణం ఆయన ఆఫీసర్ గారి క్యాంప్ స్టెనోగ్రాఫరట. ఆఫీసర్ గారు బయటవూళ్ళు క్యాంప్ లకు వెళ్ళేప్పుడు మాత్రమే ఈయన ఆయనతో కూడా వెళ్ళి అక్కడి పనులు చక్కబెడతాడని చెప్పగా తెలిసింది. ఊళ్ళో వుంటే ఆయనకు పనేమీ వుండేదికాదు.  ఆఫీసుకు వచ్చే డీలర్లతో ఏవో కబుర్లు చెపుతూ, సలహాలు ఇస్తూ కాలక్షేపం చేసేవాడు. అందరిలాగే టంచన్ గా పది పదిన్నరకు ఆఫీసు కు వచ్చి తన సీట్ లో కూర్చొని తనతో కూడా తెచ్చుకున్న జ్యోతిషం పుస్తకాలను,  హోమియోపతి పుస్తకాలను చాలా సీరియస్ గా చదువుతూ కూర్చునేవాడు. టంచన్ గా లంచ్ టైమ్ లో లజ్ కార్నర్ వరకు వెళ్ళి హోటల్ లో భోజనంచేసి హాయిగా వచ్చేవాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ గ్రంధపఠనం సాగించేవాడు. ఐదు గంటలు దాటితే చాలు. పుస్తకాలు లోపల పెట్టేసి చక్కా ఇంటికి వెళ్ళిపోయేవాడు. దీనంతటినీ అక్కడివారు చాలా సహజంగానే తీసుకునేవారు. నాకు మాత్రం ఇబ్బందికరంగా వుండేది ఏ పని లేకుండా గంటలతరబడి ఒకే చోట కూర్చోవడానికి. ఆ డిపార్ట్మెంట్ లో అతనికి తగినంత పని లేదని వేరో ఊరికి ట్రాన్సఫర్ చేస్తూ ఆర్డర్లు వచ్చినా వెళ్ళి జాయిన్ అయేవాడు కాదు. ఆయన మద్రాస్ కు బాగా అలవాటు పడిపోయాడు. 

నేను అక్కడ పనిచేసిన రెండున్నర ఏళ్ళూ గోపాలకృష్ణ కూడా అదే ఆఫీస్ లో పనిచేసేవాడు. మనిషి  భుజాల వరకు దిగిన గిరజాల జుత్తుతో పాంట్, పైన ఖధ్ధర్ జుబ్బా, మెడలో ఒక సంచీ నిండా పుస్తకాలతో కనిపించేవాడు. ఎప్పుడో మాటల సందర్భంలో చెప్పాడు తన హెయిర్ కటింగ్ కు ఫోర్ షోర్ ఎస్టేట్ లో వున్న ఓషియానిక్ హోటల్ లోని సెలూన్ కే వెడతానని. నాకు ఆశ్చర్యం వేసింది. ఇతని జీతం అంత కాస్ట్లీ హోటల్ కు వెళ్ళడానికి సరిపోతుందా అని. ఆ రోజుల్లో ఓషియానిక్ కు రిచ్ పీపుల్ హోటల్ గా పేరు.

ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు గోపాలకృష్ణ చెట్టుక్రింద డాక్టర్ గా ప్రజాసేవ చేస్తూ కనపడ్డారు.  గవర్నమెంట్ వారి ట్రాన్సఫర్స్  బెడద పడలేక ఆ జాబ్ కు రాజీనామా చేసేసారట. పానగల్ పార్క్ దగ్గర ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ వుండే చోట వెంపటి చిన సత్యంగారి కూచిపూడి ఆర్ట్ అకాడమీ, ఆ పక్కన కార్పరేషన్ స్కూలో, ఆఫీసో వుండేది. దాని పక్కన వెంకటేశ్వరా కళ్యాణ మండపం.  ఈ గోపాలకృష్ణగారు కూచిపూడి ఆర్ట్ అకాడమీలోనే ఒక చిన్న గదిలో వుంటూ బయట ఒక చెట్టుక్రింద తన హోమియో వైద్యం చేసేవాడు. జ్యోతిషాలు చూసేవాడు. కూచిపూడి ఆర్ట్ అకాడమీ టి.నగర్ నుండి రాజా అణ్ణామలైపురంలోని గ్రీన్ వేస్ రోడ్ కు వెళ్ళిపోయాక నేను పానగల్ పార్క్ వేపు వెళ్ళడం తగ్గిపోయింది.కొన్నేళ్ళ తర్వాత గోపాలకృష్ణ ఆ చెట్టు క్రింద కనపడలేదు. ఏమయ్యారో తెలియదు.

కొంతమంది వ్యక్తుల గొప్పతనం, ఔన్నత్యం వారితో పనిచేసేటప్పుడు కానీ, వారి సాంగత్యంలో వున్నప్పుడు కానీ తెలియవు. ఎందుకంటే అలాటివారు తమ గురించి తాము డబ్బా వాయించుకోరు నేనింత సేవచేసానని, తానెంతో గొప్పవాడినని. అలాటి వ్యక్తే శ్రీ వేదవ్యాస్. నేను ఆయన ఆఫీసులో పనిచేసినా ఆయనతో మాట్లాడింది తక్కువే. ఒకసారి మాత్రం తనతోపాటూ కార్లో తీసుకువెళ్ళారు. అయితే అది ఆఫీసు పనిమీద కాదు. తన మిత్రులను కలుసుకోవడం కోసం. తీరా ఆ వెళ్ళిన స్థలం చూస్తే నాకు బాగా పరిచయమున్న స్థలమే. నెం.1, కచేరీ రోడ్. శాంథోమ్ హైరోడ్. చందూర్ దంపతుల ఇల్లు. ఆ ఇద్దరూ నాకు చిరపరిచితులే. ఆ రోజు అక్కడ చాలా విషయాలమీద ఆ ముగ్గురి మధ్య చర్చలు సాగాయి. నేను కేవలం శ్రోతను మాత్రమే. ఒక ఏడాది లోపలే వేదవ్యాస్ గారిని మద్రాస్ లయొజన్ ఆఫీసు నుండి వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసేసారు. వేదవ్యాస్ గారి విశిష్టత గురించి  మానాన్నగారి ద్వారా, తర్వాత పత్రికలలోని వ్యాసాల ద్వారానే నాకు అర్ధమయింది. వేదవ్యాస్ గారు కేవలం IAS అధికారిగానే కాక భారతీయ సంస్కృతి పరిరక్షణకు కూడా ఎంతో సేవచేసారు. ఆధ్యాత్మిక గురువుగా, యోగ, జ్యోతిష్య శాస్త్ర పండితునిగా అనేక ఉత్తమ గ్రంథాలెన్నో వ్రాసారు. దేశంలోని అనేక దేవాలయాల ప్రతిష్టాపనకు, వాటి ఔన్నత్యానికీ నిరవధిక కృషిచేసిన వ్యక్తి. అలాటి విశిష్టవ్యక్తి గురించి ఏమీ తెలుసుకోకుండానే ఆయన దగ్గర పనిచేయడంలో నేను గర్వపడాలా ! నా అదృష్టంగా భావించి సంతోషపడాలా ! ఏదీ తేల్చుకోలేకపోతున్న స్థితి నాది.  వేదవ్యాస్ గారు మద్రాస్ నుండి వెళ్ళిపోయాక తిరిగి నేను మరల ఎక్కడా కలుసుకోలేదు. ఆ సత్సాంగత్యం అక్కడితో సరి. 

💐🙏💐


భాగ్యనగరంలో, ఆనాటి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని యైన హైదరాబాద్ లో 'పంచశీల సాంస్కృతిక సమితి' అనే సంస్థ వుండేది. ఆ సంస్థయొక్క అద్యక్షుడు శ్రీ పి.వి.రంగారావుగారు. ఆయన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి కుమారుడు. శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డిగారి కాబినెట్లో మినిస్టర్ గా కూడా పనిచేశారు. ఆ పి.వి.రంగారావుగారు కళాభిమాని. సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణలో మంచి ఆసక్తి కలవారు. ఆయన తన పంచశీల సాంస్కృతిక సమితి ద్వారా ఘంటసాల మాస్టారిని ఘనంగా సత్కరించాలని సంకల్పించారు. సన్మాన కార్యక్రమం లో భాగంగా మాస్టారి సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేసారు. ఘంటసాల మాస్టారు తన వాద్యబృందంతో ఆ ఉత్సవంలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్ళారు. వాద్యబృందం వుందంటే మా నాన్నగారు కూడా తప్పనిసరి. అందరూ సంతోషంగా తరలివెళ్ళారు.

ఆ రోజున మా ఇంట్లో మా మూడవ చెల్లెలు లలిత, ఆరేడేళ్ళది, నలతగా కనిపించింది. మా నాన్నగారు ఉన్నప్పుడే వచ్చిందో లేక ఊరెళ్ళాక వచ్చిందో గుర్తులేదు కానీ జ్వరం కూడా వచ్చింది. అది ఒక రాత్రివేళ ఎక్కువై ఆందోళన పెట్టింది. ఇంట్లో వున్న మందులు ఇచ్చి చూసారు కానీ జ్వరం తగ్గే సూచనలు కనపడలేదు. రాత్రి మూడు గంటలు దాటేసరికి  ఫిట్స్ రావడం మొదలయింది. పరిస్థితి విషమంగా వుందని వెంటనే మాస్టారింట్లో సావిత్రమ్మగారిని లేపి విషయం చెప్పాము. ఆవిడ వెంటనే నన్ను డ్రైవర్ గోవింద్ ఇంటికి వెళ్ళి పిల్చుకు రమ్మని చెప్పారు. నేను వెంటనే గోవింద్ ఇంటికి పరిగెత్తాను. మూడుగంటల వేళ .అందరూ గాఢంగా నిద్రపోయేవేళ. ఆ ఇంటి ప్రాంతమంతా చీకటిగా నిర్మానుష్యంగా వుంది. ఎలాగో గోవింద్ ను లేపి విషయం చెప్పగానే అతను కంగారుపడుతూ మొహం కడుక్కొని బట్టలు వేసుకు వచ్చాడు. అంతరాత్రి వేళ ఏ డాక్టర్ వద్దకు వెళ్ళాలో తెలియలేదు. సావిత్రమ్మగారికి  నుంగంబాక్కం లో వుండే తమ ఛైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ గోవిందమీనన్ దగ్గరకు తీసుకువెడదాం పదమన్నారు. గోవిందమీనన్ వుండేది ఒక పెద్ద భవంతి. మెయిన్ గేట్ కు లోపలి భవనానికి చాలా దూరం. గేట్ తాళంవేసి వుంది. ఎంత పిలచినా , బయట గేట్ కు వున్న కాలింగ్ బెల్ నొక్కినా ఎవరూ పలకలేదు. ఇక్కడ పరిస్థితి విషమిస్తోంది. ఇంక అక్కడ వుండడం శ్రేయస్కరం కాదని రాయపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్ళాము. వాళ్ళు  చెక్ చేసి సీరియస్ కండిషనేనని వెంటనే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రారంభించారు. లోపల ట్రీట్మెంట్ ప్రారంభమైన తర్వాత  తెల్లవారుతుండగా సావిత్రమ్మగారు ఇంటికి వెళ్ళిపోయారు. నేనూ, మా అమ్మగారు మాత్రమే హాస్పిటల్ లో వున్నాము. ఆ రోజంతా ఏవో మందులు, ఇంజక్షన్స్ ఇస్తూనే వున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మా చెల్లెలు లలిత ఈ లోకం వదిలింది.  సెరెబ్రల్ హెమరేజ్ అని హాస్పిటల్ డాక్టర్లు డిక్లేర్ చేశారు. వెంటనే హాస్పిటల్ బయట ఆవరణలో వున్న లోకల్ టెలిఫోన్ బూత్ నుండి సావిత్రమ్మగారికి ఫోను చేసి చెప్పాను. ఆవిడతో పాటు మా కుటుంబ శ్రేయోభిలాషి డి.ఎన్.రావుగారికి కూడా తెలియజేశాను.  ఆయన వెంటనే వచ్చి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి తదుపరి కార్యక్రమాలు ముగించారు. తమాషా ఏమంటే ఆ తర్వాత జరిగిన విషయాలు నా జ్ఞాపకాలలో నుండి జారిపోయాయి. ఆ పాప బాడీని ఇంటికి తీసుకువచ్చామా? లేక హాస్పిటల్ నుండే శ్మశానానికి తీసుకువెళ్ళారా అనే విషయాలేవీ నాకు గుర్తులేవు.  ఈలోగా సావిత్రమ్మగారు హైదరాబాద్ కు ఫోన్ చేసి ఘంటసాల మాస్టారితో జరిగిన విషయం చెప్పినట్లున్నారు. ఆ మర్నాటికి హైదరాబాద్ నుండి మా నాన్నగారు, మాస్టారు మద్రాస్ చేరుకున్నారు. పంచశీల సాంస్కృతిక సమితివారు ఘంటసాలవారికి బహుకరించిన నిలువెత్తు సన్మాన పత్రం, అన్ని మెమెంటోలతోపాటూ ఈనాటికీ మాస్టారి రెండవ కుమారుడు కీ.శే. రత్నకుమార్ ఇంటి మేడమీద రూమ్ లో గోడను అలంకరించివుంది. ఆ సన్మాన పత్రాన్ని చూసినప్పుడల్లా ఈ విషాద సంఘటన గుర్తుకు వస్తుంది. 

వెలుగు పక్కనే చీకటి ; 

సంతోషాన్ని అంటిపెట్టుకునే దుఃఖం.  ప్రతీ మనిషికి ఈ రెండూ దశలూ ఒకాదానివెంట మరొకటి వస్తూనే వుంటాయి. 

🔔


1968లో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన సినీమాలలోని పాటలు విన్నాము. గాయకుడిగా కూడా ఆ ఏడాది చాలా మంచి పాటలే పాడారు. వాటిలో ముఖ్యమైనవి మాత్రమే చూద్దాము.

ఉమ, చండి, గౌరీ, శంకరుల కథలో మాస్టారు, ఎస్.జానకి పాడిన తిల్లానా

'మాస్టారు పాడిన 'కలగంటినా చెలి' పాట; బ్రహ్మచారి లో సుశీలగారితో డ్యూయెట్' ఏ తోటలో విరబూసెనో'; రణభేరిలో శ్రీశ్రీ గారి ' మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది'; వీరాంజనేయలోని పద్యాలు; రాము సినీమాలోని రెండు సోలోలు ఘంటసాలవారి ఖ్యాతిని ఇనుమడింపజేసిన పాటలే. ఒకటి 'మంటలు రేపే నెల రాజా'; మరొకటి 'రారా కృష్ణయ్యా' ఈ పాటను వేర్వేరు ట్రాక్స్ లో పాడించి తర్వాత ఒకే ట్రాక్ లో మిక్స్ చేశారు. ఈ పాటలో నాగయ్యగారికి, రామారావుగారికి మాస్టారు పాడిన తీరు అనితరసాధ్యం. ఆ వైవిధ్యం మరొకరికి సాధ్యం కాదు. 


అమాయకుడు కృష్ణకు పాడిన 'మనిషైతే మనసుంటే';  సుశీలగారితో పాడిన 'చందమామ రమ్మంది చూడు'; లక్ష్మీ నివాసం లో రంగారావు గారికి పాడిన 'ధనమేరా అన్నిటికీ మూలం'; బాంధవ్యాలులో అదే రంగారావు గారికి పాడిన మరో మంచి పాట 'మంచితనానికి ఫలితం వంచనా'; బంగారు గాజులలో  డ్యూయెట్ 'విన్నవించుకోనా చిన్న కోరికా'; భాగ్యచక్రంలో  డ్యూయెట్ 'నీవులేక నిముసమైనా నిలువజాలనే'


నేనే మొనగాణ్ణిలో, 'వయసు పిలిచింది ఎందుకో'


బాగ్దాద్ గజదొంగ లో 'రావే ఓ చినదానా' వంటి పాటలు ఈనాటికీ మనకు వీనులవిందు చేసే పాటలే. అందరూ తరచూ పాడుకుంటూ ఆనందించేవే.
                                       
                                      రావే ఓ చినదానా....

మనిషిలో సాత్విక లక్షణాలు, సమాజంలో మంచితనం  బ్రతికి వున్నంతకాలం ఘంటసాల పాట వినిపిస్తూనే వుంటుంది. ఇది సత్యం.

నెం. 35, ఉస్మాన్ రోడ్ లో మరికొన్ని జ్ఞాపకాలతో...

వచ్చేవారం...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.



Sunday, September 5, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఏడవ భాగం

05.09.2021 -  ఆదివారం భాగం - 47*:
అధ్యాయం 2 భాగం 46  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిని అనేక రకాల వ్యామోహాలలో ముంచెత్తుత్తున్న సినీమా అనే మాయా ప్రపంచం పుట్టి అప్పుడే 130 సంవత్సరాలు అవుతోంది. 1891 లో మాటలు , పాటలు రాని మూకీగా పుట్టిన సినీమా ఒకరెండు దశాబ్దాల తర్వాత 1920 లో ఫ్రాన్స్ రాజధాని పారీస్ మహానగరంలో తొలిసారిగా గొంతువిప్పింది. అయితే మొట్టమొదటిగా వ్యాపార సరళిలో ప్రజల ముందుకు వచ్చిన విదేశీయ సినీమా ' జాజ్ సింగర్' 1927 లో. 

మన దేశంలో తయారైన మొదటి మూకీ రాజా హరిశ్చంద్ర. ఈ చిత్ర నిర్మాతా దర్శకుడు దాదా సాహేబ్ ఫాల్కే. ఈయన గౌరవార్ధం ఆయన పేరిట మన దేశంలోని అత్యుత్తమ కళాకారులకు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వడం జరుగుతోంది. 

1931 లో మన దేశంలో మొట్టమొదటి టాకీ 'ఆలం ఆరా' తయారయింది. అర్దేషిర్ ఇరానీ నిర్మాత దర్శకుడు.  తమిళంలోని మొదటి టాకీ 'కాళిదాసు' కూడా అదే సంవత్సరం. తెలుగులో మొట్టమొదటి చలనచిత్రం 1932 లోని 'భక్త ప్రహ్లాద'. ఈ రెండు చిత్రాలకు నిర్మాత దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి. ఈయన 1951 లో నిర్మించిన 'నిర్దోషి' కి ఘంటసాలవారు కూడా సంగీత దర్శకుడిగా పనిచేసారు. భారత దేశంలో వచ్చిన మొదటి  మూడు భాషా చిత్రాలలోనూ సుప్రసిధ్ధ దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ నటించడం ఒక విశేషం.

తెలుగు సినీమా తొలి రోజులలో ఆయా సినిమాలలో నటించే నటీనటులే తమ పాటలు, పద్యాలు పాడుకునేవారు. అంద చందాలతోపాటు పాడగల సమర్ధులతోనే మొదటి రెండు దశకాల సినీమాలు వచ్చాయి. రికార్డింగ్ సిస్టమ్ సాంకేతికంగా వృద్ధి చెందని రోజులలో వాద్యబృందాన్ని కూడా షూటింగ్ జరిగే సమయంలోనే ఒక ప్రక్కగా కూర్చోబెట్టి పాట, నటన రెండు ఒకేసారి జరిపేవారట. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక ముందుగా పాటలు రికార్డింగ్ చెయ్యడం అలవాటయింది. రికార్డింగ్ కోసం వేరే థియేటర్ లు నిర్మించడం అనివార్యమైంది. సింగిల్  ఛానల్ సౌండ్, డబుల్ ఛానల్ సౌండ్ సిస్టమ్ నుండి ఈనాడు మల్టీ ఛానల్ సిస్టమ్ లో సినీమా మాటల పాటల ధ్వని ముద్రణ జరుగుతున్నది. 

1944లో ఘంటసాలవారు చిత్రరంగ ప్రవేశం చేసేనాటికే కొంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి సినీమాలలో నేపథ్యగానం అనే ప్రక్రియ మొదలయింది. చిత్రంలో నటీనటులకు వేరే వారిచేత పాటలు పాడించే నూతన ప్రక్రియ ప్రారంభమయింది. దీనితో  సంగీతం తెలియని కొత్త కొత్త నటులకు, గాయకులకు ఈ రంగంలో అవకాశాలు దొరకడం మొదలయింది. శ్రీమతి రావు బాలసరస్వతి  తెలుగులో మొదటి నేపథ్యగాయనిగా చెపుతారు. బెజవాడ రాజరత్నం, గాలి పెంచలనరసింహారావు, మోపర్తి సుందర రామారావు (ఎమ్.ఎస్.రామారావు) ఆనాటి నేపథ్యగాయకులుగా కొన్నేళ్ళపాటు తమ గానప్రతిభను ఒక వెలుగు వెలిగారు. 

1945 లో 'స్వర్గసీమ' సినీమాతో నేపధ్యగాయకునిగా ఘంటసాల అవతరించడంతో తెలుగు సినీమా పాట యొక్క రుచి, వాసన పూర్తిగా మారిపోయాయి.  ఒక నూతన  సంగీత శకం ప్రారంభమయింది. అదే ఘంటసాల శకం. గత 75 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారంతా ఘంటసాల గానవాహినిలోనే తన్మయత్వంతో ఓలలాడుతున్నారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా  ఒక నూతన ఒరవడిని సృష్టించి ఘంటసాల పండిత, పామర హృదయాలో సుస్థిర స్థానం పొంది చెరగని ముద్రవేశారు. ఈనాటి వరకూ లలిత సంగీత గాయకులందరికీ ఆదర్శం, మార్గదర్శకం ఘంటసాల పాట, పద్యమే. ఘంటసాల గళానికి ప్రత్యమ్నాయం లేదనేది నిర్వివివాదాంశం.

ఘంటసాలవారితో పాటే చలనచిత్రసీమలో కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావుగారు రంగప్రవేశం చేసారు. ఈ ఇద్దరూ ఘంటసాల బలరామయ్యగారి ప్రతిభా ఆఫీసులో కలిసే వుండేవారు.  సీతారామ జననంలో అక్కినేని రాముడుగా నటిస్తే ఘంటసాలవారు కోరస్ గీతాలలో పాల్గొని ఏవో  చిన్న వేషాలు వేసారట. అక్కినేని వారు మొదట్లో తన పాటలు తానే పాడుకునేవారు. అలా వచ్చినవే పల్నాటి యుధ్ధంలో, బాలరాజు లో వచ్చిన పాటలు. ఎప్పుడైతే ఘంటసాల కంచుకంఠం దశదిశాలా వ్యాపించడం మొదలయిందో అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు తనకు ఒక నేపథ్యగాయకుడు అవసరమనే సత్యాన్ని గుర్తించారు. అందుకే 'బాలరాజు' సినీమాలోని 'చెలియాకనరావా' పాట అటు అక్కినేని వారి గాత్రంతో, ఇటు ఘంటసాలవారి గళంతో ప్రజలను అలరించాయి. సినీమాలో మాత్రం ఘంటసాలవారి గాత్రమే అక్కినేని వారి కంఠంలోనుండి వినిపిస్తుంది. 


ఆనాడు మొదలైన వారి స్వరసహచర్యం మూడు దశాబ్దాలపాటు నిరాటంకంగా సాగి తెలుగు ప్రేక్షకులకు మహదానందం కలిగిచింది. తర్వాత వచ్చిన ఎన్.టి.రామారావు, జగ్గయ్య, కాంతారావు, శోభన్ బాబు, కృష్ణ ఆదిగాగల 1970ల నాటి హీరోల వరకు ఘంటసాలవారి నేపథ్యగానమే విజయాలకి ఆలంబలమైంది. వారికే కాదు ఇతర ప్రధాన భూమికలు పోషించే నటగాయకులు నాగయ్య, ధూళిపాళలకు, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, మిక్కిలినేని, రాజనాల, ముక్కామలవంటి వారికి, హాస్య నటగాయకులు రేలంగి, కస్తూరి శివరావులకు, రమణారెడ్డి, పద్మనాభం, చలం వంటి హాస్యనటులకు కూడా తమ పాటలను ఘంటసాలవారి చేత పాడిస్తేనే రాణిస్తాయని ఆశించి ఆయనచేతనే పాడించమని కోరేవారు. తెలుగు సినీమాను ఘంటసాలవారి గాత్రం అంతటి ప్రభావితం చేసింది. ఘంటసాలగారు సినీమాలలోకి వచ్చాక మాధవపెద్ది, పిఠాపురం నాగేశ్వరరావు, బి.గోపాలం, ఎ.ఎమ్.రాజా, పి.బి.శ్రీనివాస్, మోహన్ రాజ్, చిత్తరంజన్, బసవేశ్వర్, టి.ఆర్.జయదేవ్ వంటి ఎంతోమంది ఉత్తమగాయకులు నేపథ్యగాయకులుగా వచ్చారు. వీరిలో కొందరు బహుభాషా చిత్రగాయకులుగా మంచి పేరుపొందారు. కానీ నేపథ్యగాయకులుగా ఈ గాయకులంతా ఘంటసాలవారిలా  గాత్రవైవిధ్యాన్ని, రసభావాలను సమర్ధవంతంగా పలికించడంలో, రసజ్ఞుల ఆమోదాన్ని పొందడంలో సఫలీకృతులవలేదనే అనుకోవలసివస్తుంది. పాటలోని పరిపూర్ణ తృప్తి, రసానందం ఒక్క ఘంటసాల గాత్రంలోనే ధ్వనించిందని ఈనాటివరకూ తెలుగువారంతా అనే మాట. ఒక్క తెలుగునాటే కాక తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా ఘంటసాల చెరగని ముద్ర వేసారు.

బొంబాయి చలనచిత్ర సీమలో వుండే సాంకేతిక పరిజ్ఞానం అంతా మద్రాస్ లో తయారయే దక్షిణాది సినీమాలన్నిటిలో కనిపించేవి. 1960ల తర్వాత మల్టీట్రాక్ ఛానల్ సిస్టమ్ వచ్చినా 70ల వరకు పెద్దగా ఎవరూ ఉపయోగించలేదు. సినీమా పాటలన్నీ లైవ్ లోనే రికార్డింగ్ జరిపేవారు. అలాగే పాతకాలపు ఎన్.టి.ఆర్., ఎ.ఎన్,ఆర్., ఎమ్.జి.ఆర్., శివాజీ గణేశన్ల సినీమాల ఆడియో అంతా షూటింగ్ సమయంలోనే రికార్డ్ చేసేవారు. నటీనటులు డబ్బింగ్ చెప్పుకోవడమనేది ఇటివల 80లలో వచ్చిన నవీన పంథా. దానికి కారణం భాష తెలియని నటీనటులు ప్రాంతీయ చిత్రాలలో నటించడం. షూటింగ్ సమయంలో ఆ గాజు బొమ్మలు  డైలాగ్స్ పేరిట ఎ టు జెడ్ ఆల్ఫాబెట్స్ వల్లిస్తే తర్వాత ఎప్పుడో డబ్బింగ్ ఆర్టిస్ట్ లు వచ్చి అసలు డైలాగ్స్ చెపితే ఎడిటర్లు వాటిని లిప్ సింక్ చేసుకుంటారు.  అలాగే పాటల విషయానికొస్తే లైవ్ రికార్డింగ్ విధానం పోయి ట్రాక్ సింగింగ్, ట్రాక్ మిక్సింగ్ విధానం వచ్చింది. విదేశాలలో కూర్చొని మ్యూజిక్ డైరక్టర్ ట్యూన్ పంపిస్తాడు. దానికి రచయితలేవో మాటలందిస్తాడు. ఇక్కడి అరేంజర్లు కంప్యూటర్ లోకి ఎక్కిస్తారు. ఎవరికి వారే వారి స్థావరాలలో కూర్చొని మైక్రోఫోన్ ల ద్వారా   పాడేవారు పాడేస్తారు. వాద్యగాళ్ళు ఎవరికి వారే వారికిచ్చిన బిట్లు వాయించేస్తారు. ఎవరు ఏ సినీమాకి ఎందుకు పాడుతున్నారో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండానే పాటాల కార్ఖానాలో పుంఖానుపుంఖాలుగా పాటల మాన్యుఫేక్ఛరింగ్ జరిగిపోతుంది. తెరమీద ఎవరికి కావలసిన పధ్ధతిలో ఆ పాటలను ఎక్కడో దగ్గర వినిపించి చూపిస్తారు. 

ఘంటసాలవారు తనకు అనారోగ్య సమయాలలో తప్ప ట్రాక్ మిక్సింగ్ కు ఇష్టపడేవారు కాదు. పాటల రికార్డింగ్ లు లైవ్ గా జరిగితేనా పాటకు జీవం, అందం, ఆనందం అని భావించేవారు. ఘంటసాలవారి కాలంలో ఆయనే కాదు, సంగీత దర్శకులందరూ లైవ్ రికార్డింగ్ చేయడానికే ఇష్టపడేవారు.

రోజులు మారాయి. సాంకేతిక విజ్ఞానమూ పెరిగింది. చిత్రనిర్మాణ విధానాలు మారాయి. విడియో ఆవిర్భావం తర్వాత ట్రెండ్ మారిపోయింది. గత కాలంలోలా హిందుస్థాన్ ఫోటో ఫిలిం కంపెనీ,  లేదా కోడక్ వారి ముడి ఫిలిం తో షూటింగ్ లు జరిపి ఆ ఫిల్మ్ రీళ్ళను డబ్బాల్లోకి ఎక్కించి ఆ నెగెటివ్ లకు పాటల ఆడియో జతచేసి వాటిని పాజిటివ్ ఫిల్మ్ కాపీలుగా తీసి సినీమా హాల్స్ లో ప్రొజెక్టర్లలో ఆ 15-20 రీళ్ళ సీనీమాలను వెండితెరపై చూపించడమనే కాలమే పోయింది. ఒకప్పుడు ముడి ఫిల్మ్ కోసం పడరానిపాట్లు పడేవారు. ప్రతీ నిర్మాత తమకు కావలసిన ఫిల్మ్ కోసం ముందుగానే అప్లై చేసుకోవలసి వచ్చేది. అలాగే ఈస్ట్ మన్ కలర్, టెక్నికలర్ ఫిల్మ్ కోసం ఇంకా ఎక్కువకాలం ఎదురుచూడాల్సి వచ్చేది. బాగా ఆర్థిక స్థోమతకల నిర్మాతలైతే తప్ప చిన్న చిన్న నిర్మాతలకు సినీమా తీయడమంటే రోట్లో తలదూర్చటమే. అందుకే తెలుగులో మంచి కలర్ సినీమాల నిర్మాణం చాలా ఆలస్యంగా అభివృద్ధి చెందింది. సినీమా పూర్తయ్యాక అన్ని థియేటర్లకు సరిపడా ప్రింట్ల్ తీసే అవకాశం వుండేదికాదు. ఏ ఇరవై ప్రింట్లో తీయించి వాటినే ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాలలో అక్కడక్కడ ప్రదర్శించేవారు. మద్రాస్ వంటి పెద్ద నగరాలలో ఒకే  సినీమా ప్రింట్ ను  ఒకేసారి దూరం దూరంగా వున్న సినీమాహాల్స్ లో వేసేవారు. ఒక అరగంట వ్యవధిలో సినీమా షోలు మొదలెట్టేవారు. ఒక థియేటర్లో అరగంట సినీమా అయ్యేప్పటికి ఆ రీళ్ళ డబ్బాను ఆటోలోనో, చెమటలు కక్కుకుంటూ సైకిళ్ళమీదో ఆఘమేఘాల మీద మరో థియేటర్ కు చేర్చేవారు. ఈలోగా ఏ కారణం చేతైనా ప్రింట్ చేతికి అందకపోతే ఎక్స్ట్రా ఇంటర్వెల్ స్లైడ్ పడేసేవారు. ఈ విధంగా ఒకే ప్రింట్ ను రెండు మూడు థియేటర్లలో ఆడిన ఎన్నో సినీమాలు నేను చూశాను.

ఇప్పుడు సినీమా టెక్నాలజీ యే మారిపోయింది. ఇప్పుడు ఎవరూ పాత కెమెరాలు, పాత ముడి ఫిల్మ్  వాడడం, సినిమా హాల్స్ లో ప్రొజెక్టర్లు లోకి ఆ మొత్తం రీళ్ళను రెండు మూడు సార్లు మాన్యువల్ గా ఎక్కించి స్క్రీన్ మీద చూపడం ఆ పధ్ధతులన్నీ ఔట్ డేట్ అయిపోయాయి. ఆ నాటి సినీమా పరికరాలు అన్నీ మ్యూజియంలకు చేరాయి. గత పదేళ్ళుగా అంతా డిజిటల్ మయం. డిజిటల్ కెమెరాలు. డిజిటల్ సౌండ్ సిస్టమ్ . మొత్తం 15  రీళ్ళ రెండు గంటల సినీమాను  ఒక చిన్న డిస్క్ లో లేదా పెన్ డ్రైవ్ లో బంధించి  డిజిటల్ ప్రొజెక్టర్ల మూలంగా 70 mm, వైడ్ స్క్రీన్ , స్కోప్ అంటూ రకరకాల సౌండ్ సిస్టమ్స్ తో 3D, 4D  ఎఫెక్ట్స్ తో ప్రజలను వింత వింత లోకాలకు తీసుకుపోయి వినోదాన్ని కల్పిస్తున్నారు.

సినీమా ధ్యాసలో పడి షార్ట్ హాండ్ క్లాసుల గురించే మర్చిపోయాను. పానగల్ పార్క్ దగ్గరలోని నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ కు నాతో పాటు మా బ్యాచ్ లో మరో నలుగురైదుగు తెలుగువారుండేవారు. అందరితో పెద్ద స్నేహం ఏర్పడలేదు కానీ కొందరితో ముఖపరిచయం, కొందరితో పలకరించడం వరకు స్నేహరికం ఏర్పడింది. వారిలో ఒక ప్రముఖ నటి  మేనకోడలు వరస బంధువు ఒకమ్మాయి. ఏదో పేరంటానికి వెడుతున్నట్లుగా ఎప్పుడూ పట్టుబట్టలు, నగలు అలంకరించుకు  దండపాణి వీధి నుండి వచ్చేది. మరొకామె మా ఇంటి దగ్గరి మురుగేశ మొదలియార్ వీధిలోనుండి  వచ్చేది. ఎప్పుడు తెల్లని డిజైన్డ్ ఖటావ్ వాయిల్ చీరలనే కడుతూ చాలా హుందాగావుండేది. సాయంత్రం వేళల్లో తన మూడేళ్ళ చిన్న పాపను నడిపించుకుంటూ పానగల్ పార్క్  కూరల బజారు కు వెడుతూ కనిపించేది. మొదట్లో ఆవిడ  ఆ వీధిలోనే వుండే ఒక తెలుగు నిర్మాత భార్య అని అనుకునేవాడిని. కాని కాదు. ఆవిడ పేరుతో అప్పట్లో కొన్ని పత్రికల్లో కథలు వచ్చేవి. మరి ఆ రచయిత్రి, ఈవిడా ఒకటేనా కాదా అనేది ఇప్పటిదాకా వీడని చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. మరొక అమ్మాయి కోడంబాక్కం నుండి తన అన్ననో తమ్ముడినో తోడు తీసుకు వచ్చేది. ఆ అమ్మాయి తండ్రి సినీమా ఆర్కెష్ట్రా లలో హార్మోనియం వాయించేవారు. కొన్ని డబ్బింగ్ సినీమాల మ్యూజిక్ డైరెక్టర్ గా ఒకటి రెండుసార్లు ఘంటసాల మాస్టారి ఇంటిదగ్గర చూశాను. ఆయన పేరు వేలూరి కృష్ణమూర్తి. ఎన్.టి.రామారావుగారి 'గులేబకావళి కథ' జంట సంగీత దర్శకులలో ఒకరు. 

ఇక మగవాళ్ళలో భరణీ కోటేశ్వరరావు గా పేరుపొందిన భరణీ స్టూడియో సౌండ్ ఇంజనీర్ పి.వి.కోటేశ్వరరావు గారు. ఆయనే తర్వాతి కాలంలో జెమినీకి మారి జెమినీ కోటేశ్వరరావుగా అనేక సినీమాలకు పనిచేశారు. వారి అబ్బాయి ఈ నియో కమర్షియల్ క్లాసులకు వచ్చేవాడు. మరొక అబ్బాయి నారాయణమూర్తి. కోడంబాక్కం నుండి వచ్చేవాడు. సరదాగా మాట్లాడేవాడు. అతనిని మళ్ళా ఒక ఐదేళ్ళ తర్వాత సెంట్రల్ స్టేషన్ పక్కన వాల్టాక్స్ రోడ్ లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ కనిపించాడు. అతని ప్రోద్బలం మీద నెలకు 15/- రూపాయలు చొప్పున 20 మాసాలు  ఇన్స్టాల్ మెంట్ లో మహాబలిపురానికి ఏడు కిలోమీటర్ల ఇవతల ఓల్డ్ మహాబలిపురం రోడ్ లో ఓ రెండు ప్లాట్ లు కొనవలసి వచ్చింది. అదొక కాశీమజిలీ కధ. ఆ గాధ వచ్చే అధ్యాయంలోనే. ఇక్కడ కాదు. ఆ నారాయణ మూర్తి పరిచయం అక్కడితో సరి. రాజేశ్వరశర్మ అని మరో అబ్బాయి వెస్ట్ మాంబళం వేపునుండి వచ్చేవాడు. ఫైవ్ ల్యాంప్స్ ఏరియాలో వుండేవారనుకుంటాను. మనిషి చాలా సౌమ్యుడు. మా ఇద్దరికి కొంత స్నేహం ఏర్పడింది.  ఆ ఇన్స్టిట్యూట్ తోనే మా పరిచయం కూడా ముగిసింది. కానీ ఓ పుష్కరం తర్వాత ఆ రాజేశ్వరశర్మగారు మా రెండవ చెల్లెలు  వివాహ సందర్భంలో  మా రెండవ బావగారు కొచ్చెర్లకోట కృష్ణప్రసాద్ గారి అన్నగారిగా పునఃపరిచయం కావడం అనూహ్యం. ఆశ్చర్యదాయకం. ఈ స్నేహాలు, బంధాలు, అనుబంధాలు ఎప్పుడు, ఎవరితో, ఎలా ఏర్పడుతాయో చెప్పలేము. 

నియో కమర్షియల్ లో క్లాసెస్ టైమింగ్స్  లో క్లాష్ రావడంతో అక్కడ మానేసి మా ఉస్మాన్ రోడ్ మీద గ్రిఫిత్ రోడ్ కి వాసన్ స్ట్రీట్ కి మధ్య బస్ స్టాప్ దగ్గర మేడ వున్న పార్థసారధి టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ లోని షార్ట్ హాండ్ క్లాసులో జాయిన్ అయ్యాను. అది నెం. 25 లేక 26 ఉస్మాన్ రోడ్. మా ఇంటికి ఓ పదిళ్ళు అవతల. ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ ఒక మధ్య వయస్సు విడో. మేడమీద క్లాసులు, క్రింద భాగంలో ఇల్లు. తల్లి, ఇద్దరు అక్కచెల్లెళ్ళు వుండేవారు. చెల్లెలు AG ఆఫీసులో అనుకుంటాను పనిచేసేది. ఆవిడ కూడా అప్పుడప్పుడు షార్ట్ హాండ్ క్లాసెస్ తీసుకునేది. అలాటి కుటుంబాలను చూసాక జీవితం పట్ల నాలో ఒక రకమైన భయం, భాధ్యతల్లాంటివి అలవడడం మొదలయ్యాయి. 

మేడ మీద ఉన్న ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడానికి ఉన్న మెట్లను ఆనుకునే  తర్వాత కొన్నేళ్ళకు బస్ స్టాపువార TMS Stores, 'సమద్' ప్రొవిజన్ స్టోర్స్ వచ్చేయి. ఈ రెంటి మధ్యా పాలంకి సూర్యనారాయణగారి శ్రీ సూర్య ఆయుర్వేద నిలయం. సమద్ భాయి వచ్చాక, పార్క్ దగ్గరి 'సలామ్' భాయికి తాత్కాలికంగా బైబై చెప్పడం జరిగింది. ఆ సలామ్ భాయ్ కొన్నేళ్ళ క్రితం వడపళని ఆర్కాట్ రోడ్  'సలామ్' లో కనపడి, నన్ను గుర్తుపట్టి  పలకరించడం, మా నాన్నగారి యోగక్షేమాలు అడగడం నన్ను ఆశ్చర్యపరిచాయి. మా చిన్నప్పుడు ఉస్మాన్ రోడ్ 'సలామ్' లో సామాన్లు కొన్నప్పుడల్లా ఆ భాయి ఓ నూరు గ్రాముల పచ్చి వేరుశనగ పప్పులు విధిగా వేరేగా  పొట్లం కట్టి  ఉచితంగా ఇచ్చేవాడు. ఆ భాయికి తెలుగురాదు,  నాకు అరవం రాదు, అయినా మా మధ్య సఖ్యత పెరిగింది. ఇప్పుడు ఆ షాపులు లేవు, ఆ వ్యక్తులు ఎక్కడున్నారో తెలియదు. ఈ కాల చక్రభ్రమణంలో ఎవరెవరో తారసపడతారు, మనతోనే వుంటూంటారు. కొన్నాళ్ళకు అదృశ్యమైపోతూంటారు. వారి జ్ఞాపకాలు క్రమేపీ మనలోనుండి తొలగిపోతూంటాయి. 

🌺💐🌺

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో 1967 లో ప్రారంభమై 1968లో రిలీజైన నాలుగు సినీమాలలో రెండు సినీమాలు 'గోవుల గోపన్న', 'చుట్టరికాలు' సినీమా పాటల గురించి ముచ్చటించడం జరిగింది.

కాంతారావు నటించిన 'వీరపూజ', ' జీవితబంధం' కూడా ఆ సంవత్సరమే విడుదలయ్యాయి. వీరపూజ లో మాస్టారు పాడిన 'అద్దరిని వున్నాడు అందగాడు', 'కానరావయ్య కావరావయ్య గౌరీశ కైలాసవాసా', పి.సుశీలగారు పాడిన 'కొనుమా సరాగమాల' వంటి  మంచి పాటలు మరో నాలుగు కూడా ఉన్నాయి. 

'సరాగమాల' పేరు వినగానే వి.ఎ.కె.రంగారావుగారి ఆంధ్రపత్రిక శీర్షిక 'సరాగమాల' గుర్తుకువస్తుంది. ఆ శీర్షికలో శ్రీ రంగారావుగారు ఎన్నో సినీమా పాటల మీద సమీక్షలు వ్రాశారు. ఆ శీర్షికను వారికి సూచించింది శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారే అని విన్న గుర్తు.

ఎమ్.ఎస్.గోపీనాథ్ నిర్మాత దర్శకుడిగా మొదలైన చిత్రం 'జీవితబంధం'. ఇది రివైజ్డ్ టైటిల్. ముందు ఇంకేదో పేరు పెట్టారు. ఆర్థిక ఇబ్బందులవల్ల సినీమా చాలాకాలం ఆగిపోయింది. ఆ తర్వాత మరెవరో రైట్స్ కొనుక్కొని అదే దర్శకుడితో ముగించారు. అందులో మాస్టారు పాడిన 'తెగిపోయిన గాలి పటాలు', 'లేత హృదయాలలో విరిసె ఆనందమూ'  డ్యూయెట్  వినసొంపుగా వుంటాయి. మిగతా పాటల గురించి గుర్తులేదు. తర్వాత కాలంలో ఈ ఎమ్.ఎస్.గోపీనాథ్ మరికొన్ని తమిళ, తెలుగు సినీమాలు తీశారు. ఈయన కుమారుడే గడచిన తరం యువహీరో సురేష్. రత్నకుమార్ తీసిన 'తేన్ కూడు' తమిళ చిత్రంలో హీరో. అనేక తెలుగు, తమిళం సినీమాలలో హీరోగా నటించిన అతను ఈమధ్య వయసుమళ్ళిన పాత్రల్లో అడపదడపా కనిపిస్తున్నాడు.  

మరికొన్ని సినీమాల గురించి.... వచ్చేవారం....
                     ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.