visitors

Friday, August 28, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పధ్నాలుగవ భాగం

28.08.20 - శుక్రవారం భాగం - 14*:
పదమూడవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

సాలూరు పెద గురువుగారు - మా ముత్తాతగారు, శ్రీ పట్రాయని నరసింహ శాస్త్రిగారి - దగ్గర్నుంచి సంక్రమించిన చిన్న స్థలం పక్కనే సాలూరు చిన గురువుగారు - మా తాతగారు, శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు సాలూరులో మరికొంత స్థలంకొని ఏడాదికో ఇటికా గోడా అంటూ నిర్మాణం ప్రారంభించి క్రమ క్రమంగా ఒక పదేళ్ళనాటికి కట్టడం పూర్తిచేసి అప్పటికే తాను ప్రారభించిన  'శారదా గాన పాఠశాల'ను తమ సొంత కట్టడంలోనే నిర్వహించడం ప్రారంభించారు.


సాలూరులో ఈనాటికీ నిలిచివున్న 1930ల నాటి పెంకుల కట్టడం

ఆ కాలంలో  ఏవిద్యార్ధియైనా అభిలాషతో విద్య నేర్చుకోవాలని వస్తే వారికి ఉచితంగానే బోధించేవారు.  ఈ రోజుల్లోలాగా గంటకు ఇంత ఫీజ్ అని సంగీతం వ్యాపారం కాని రోజులవి. విద్యార్ధుల తల్లితండ్రులే వారి వారి స్తోమతును బట్టి గురుదక్షిణ ఏదో ఇచ్చేవారు. ఇవ్వగలిగినవారు ఇస్తారు లేనివారు లేదు. కానీ, గురువులు శిష్యులందరినీ సమాన దృష్టితో చూసి విద్య నేర్పేవారు. మా నాన్నగారు, మా తాతగారు, వారి తండ్రిగారు  వివిధ ప్రాంతాలలో కచేరీలు చేసి అక్కడి సంగీత పోషకులు ఇచ్చిన పారితోషకాలతో జీవనం చేసేవారు. అయితే ఆరోజుల్లో ఏర్పడిన మొదటి, రెండవ ప్రపంచ యుధ్ధాల కారణంగా జనజీవనం స్థంభించి, ఆర్ధిక మాంద్యం వలన మన దేశంలో  పేదరికం ఎక్కువయింది. అప్పుడూ, ఇప్పుడూ కూడా శాస్త్రీయ సంగీతానికి ఆదరణ ఆంధ్రదేశంలో కన్నా దక్షిణాదినే ఎక్కువ. అలాటి పరిస్థితులలో సాలూరు లో సంగీత పాఠశాల నెలకొల్పడం గొప్ప సాహసమే. ఆ పాఠశాల మెల్లగా అభివృద్ధి పొందుతున్నతరుణంలో, కుటుంబపోషణకోసం చినగురువుగారు సాలూరు విడిచిపెట్టక తప్పలేదు. సాలూరు వదిలి విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో నెల జీతానికి కొలువుకి కుదిరి సంగీతాచార్యునిగా రెండు దశాబ్దాలు పాటు పనిచేశారు. అప్పటికి మా నాన్నగారి వయసు పదిహేను సంవత్సరాలు. తన పదకొండవ ఏట నుండే తండ్రిగారి వెనకాల పాడుతూ పదహారు సంవత్సరాలు వచ్చేప్పటికి స్వతంత్రంగా హార్మోనియం వాయిస్తూ కర్ణాటక సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు.


1971లో అమెరికా ప్రయాణం కోసం తీసిన ఫోటో

మా తాతగారు ఉద్యోగనిమిత్తం విజయనగరం మకాం మార్చేక కొన్నాళ్ళు సాలూరు పాఠశాలను నిర్వహించారు. సంగీతరావు గారికి సాలూరులో పెద్ద మిత్రబృందమే ఉండేది. గాయకుడిగానూ మంచి గుర్తింపు పొందారు. ఆయనా అక్కడనుండి వెళ్ళక తప్పలేదు. అప్పుడు, సాలూరిలోని సంగీత పాఠశాల నిర్వహణ బాధ్యతను మా తాతగారి శిష్యులు మానం అప్పారావు, దుంప నరసింహారెడ్డి మొదలైనవారు తీసుకున్నారు. గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు సాలూరులో చాలా ఘనంగా చేసేవారు . సాలూరు లారీ ట్రాన్స్పోర్ట్ కు  ముఖ్య కేంద్రం. ఒరిస్సాలోని జైపూర్ వంటి ఘాట్ ప్రాంతాలకు సాలూరు నుండి వర్తక వ్యాపారాలు జరిగేవి. ఆ లారీ ట్రాన్స్పోర్ట్సంతా విడివిడిగా, సామూహికంగా ఈ సాంస్కృతిక ఉత్సవాలు తొమ్మిదిరోజులూ ఏవో సంగీత, నృత్య, నాటక, హరికధా, బుర్రకధా కాలక్షేపాలతో ఎంతో ఉత్సాహాంతో నిర్వహించి రాష్టంలోని పలుప్రాంతాల కళాకారులను ఇతోధికంగా పోషించేవారు. 

అలాటి ఏదో ఒక ఉత్సవం సమయంలోనే మా నాన్నగారు - సంగీతరావుగారి - సాలూరు ప్రయాణం జరిగిన గుర్తు. విజయనగరం నుండి మా నాన్నగారు, నేను బస్సులో సాలూరు బయల్దేరాము. ఈనాటి రవాణా సౌకర్యాల దృష్ట్యా ఒక గంటన్నర ప్రయాణం. కానీ ఆరోజుల్లో ఒక పూట ప్రయాణం.ఆనాటి బస్సులన్నీ ఫ్రంట్ బోనెట్ తో ఉండేవి.  నలుపు, ముదురాకు పచ్చ రంగుల్లో చూసిన గుర్తు.


ఆనాటికి ఆంధ్రదేశంలో ప్రజారవాణాకి ఉపయోగించిన ''డాడ్జ్" బస్సులు ఇలాగే ఉండేవి

ఇప్పటిలాగా బస్సు స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ ఇగ్నిషన్ ఉండేదో లేదో, లేక పనిచేసేదికాదో నాకు తెలియదు కానీ ఆ బస్సులన్నిటినీ  ముందు భాగంలో హేండీల్ పెట్టి తిప్పుతూ ఒక ఐదారు నిముషాలు కష్టపడి కుస్తీపట్టాక  ఇంజన్ స్టార్ట్ అయేది. 'అప్పన్న బస్సు రైట్ రైట్' అంటూ బయల్దేరదీసేవారు. 

ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆ రోజుల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరన్నా అప్పన్నలు, అప్పారావులు, అప్పలకొండలు ఉండేవారు. కారణం, విశాఖపట్నం పట్నం సమీపంలోని సింహాచలం కొండమీది దేవుడు. సింహాచలం కొండమీద వెలసిన శ్రీ వరహ నరసింహస్వామి వారిని సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు. మా ప్రాంతాల్లో ఆనాడు అప్పన్న, సింహాద్రి, అప్పలకొండ, వరహాలు, నరసింహం పేరు లేని వాళ్ళు చాలా అరుదు. 

"ఒరే అప్పన్నా పొరపాట్న కూడా ఇంజనీ ఆపుచేయకురోయి. మళ్ళీ హేండిలెయ్యాలంటే నా వల్లకాదు" అని మరో అప్పన్న గోల. అలాటి ఒక బస్సు వెనకవేపు డోర్ లోంచి ఎక్కబోతూంటే "బాబూ! మీరు మధ్యలో కూకోండని " మమ్మల్ని మధ్య కంపార్ట్మెంట్లో కూచోపెట్టారు. బండి ఓనర్  దొరగార్లు లైన్లోకొస్తే వాళ్ళు డ్రైవర్ పక్కన కూర్చుంటారు. లేదా దారి మధ్యలో ఏ పోలీసులో,  రెవెన్యూఆఫీసర్లో చేయూపితే అలాటివారికి మధ్యభాగం. మామూలు పాసెంజర్లకి వెనకాల భాగం. ఇలా రెండు మూడు భాగాలుగా ఆనాటి బస్సులుండేవి. బస్సు ఆపనివాళ్ళది పాపం. బస్సు టాప్ మీద కూడా సామాన్లతో పాటు పేసంజర్లని ఎక్కించేసేవారు. వీళ్ళందరినీ ఎక్కిచ్చుకొని నిండు గర్భిణీలా ఆ బస్ బయల్దేరి తన గమ్యం చేరేప్పటికి 'చాలులే ఇటువంటి సేవా' అనిపించేది. మధ్య గదిలో కూర్చోడం వలన మాకు అంత శ్రమ తెలియలేదు. విజయనగరం-సాలూరుల మధ్య మానాపురం, గజపతినగరం, మరడాం, రామభద్రపురం అంటూ చాలా జంక్షన్లే వచ్చేవి. ఒక్కోక్క జంక్షన్లో కనీసం పావుగంటైనా ఆపేసి టీలు, సోడాలు తాగడానికి పోయేవారు. అలాటి సమయాలలో ఇంజన్ ఆగిందంటే ఇంతే సంగతులు. మళ్ళీ హేండిల్ తిప్పాల్సిందే. ఇలా మానాపురం, గజపతినగరం, ఆరికతోట దాటి రామభద్రపురం జంక్షన్ లో బస్ ఆపేప్పటికి అమ్మకాలవాళ్ళు తమ జంగిడీలతో ఈగల్లా బస్ చుట్టూ మూగేవారు. "సిక్కోలు, బొబ్బిలి, పార్తీపురం పేసంజర్లు ఇక్కడ దిగడిపోయి వేరే బస్సు ఎక్కండహో" అని  ఒక అప్పన్న గాఠిగా హుకూం జారీ చేసేవాడు. దిగేవాళ్ళు దిగగా మరికొందరు కొత్త  పేసంజర్లు బస్ ఎక్కేవారు. అప్పట్లో ప్రత్యేకించి బస్ స్టాండ్ లేదు. రోడ్ మీదే ఒక సైడ్ కి బస్సులు ఆపేవారు. ఒకడిని మించి మరొకడు ఓవర్ టేక్ చేసి బస్సులు ఆపడంతో ముందు వెళ్ళవలసిన బస్సువాడు వెళ్ళడానికి చోటులేక ఆ రెండు బస్సుల డ్రైవర్లు కీచులాడుకోవడం ఒక దినసరి చర్య.

బస్సు కిటికీలోంచి చూస్తే పక్కనుంచి వరసగా కావిళ్ళు మోసుకుపోతూ  రైతులు, కూలీలు కనిపించారు. ఆ కావిళ్ళలో కట్టెలమోపులు, పచ్చగడ్డి మోపులు, పాలు, పెరుగు కుండలు, నీళ్ళ బిందెలు, కోళ్ళు, కూరగాయలతో పాటూ  కావిడిలో మరోపక్క చంటిపిల్లలను కూడా  కూర్చో పెట్టుకొని ఆడంగుల సహా పొలాలకో, సంతలకో,  ఇళ్ళకో పోతూ కనిపిస్తుండేవారు.

ఆ కావిళ్ళు చూస్తే నాకు కలివరంలో జరిగిన ఒక పాత సంఘటన గుర్తుకు వచ్చింది.

ఒకసారి కలివరం గంగుల అప్పల నాయుడు గారింట్లోని భోషాణం రేడియోకి జబ్బుచేసింది. దానిని జీప్ బ్యాటరీ దిమ్మలకు  కనెక్ట్ చేసి ఉపయోగించేవారు. అలాటి ఆ రేడియోలో జుయ్యిమని గాలివాన గాలి తప్ప పాటాలేదు, మాటాలేదు.  ఒక చేత సిగరెట్ పీలుస్తూ మరొక చేతితో ఆ రేడియో నాబ్ ని  మహా స్పీడ్ గా ఆపరేట్ చేసే నాయుడిగారి బావగారు అనకాపల్లి రంగారావుగారు ఇంక ఆ రేడియో పనిచేయదని డయాగ్నైజ్ చేయగా దానిని విజయనగరం పెద్ద షాపులకి రిపేరుకి ఇచ్చారు. దానిని విజయనగరం తీసుకువెళ్ళే బాధ్యత మా నాన్నగారిదయింది. దూసి స్టేషన్ వరకు వెళ్ళేప్పుడో, వచ్చేప్పుడో సరిగా గుర్తులేదు ఆ రేడియోను ఒక కావిడిలో పెట్టుకు రావడం జరిగింది. కూడా మా నాన్నగారు, నేనూ కూడా ఆ మూడు నాలుగు మైళ్ళ దూరం నడిచాము. దారిమధ్యలో ఆ రేడియో ఉన్న కావిడిని మోసే కంబారి (ఇళ్ళలోని పనివాళ్ళను కంబార్లు అనేవారు. కంబారి అనగానే నాకు అంబారి గుర్తుకు వస్తుంది, రెండింటికీ ఏ సామీప్యం లేకపోయినా) నేను చిన్నపిల్లాడినవడం వలన అంత దూరం నడవలేనని నన్ను కూడా ఆ కావిడిలో మరో పక్క కూర్చోపెట్టాడు. కానీ, కాళ్ళు ముడుచుకొని కూచోవడం నాకంత సౌకర్యం అనిపించలేదు. కొంత దూరం వెళ్ళాక అందులోనుంచి దిగి నడిచే వెళ్ళాను. 

రామభద్రపురం జంక్షన్లో ఆ కావిళ్ళ గుంపును చూస్తే ఆ పాత సంఘటన గుర్తుకు వచ్చింది.

రామభద్రపురం జంక్షన్ తీపి తీపి కోవాబిళ్ళలకు చాలా ప్రసిధ్ధి . వాటి రుచి మాటల్లో చెప్పలేము. ఆ క్వాలిటీ మన ఫైవ్ స్టార్ స్వీట్ స్టాల్స్ లో కూడా వుండదు. అతిశయోక్తి కాదు. ఒక్కొక్క బిళ్ళ కనీసం డెభ్భై గ్రాములన్నా ఉంటుంది. అలాగే  జీళ్ళు, జంతికలు కూడా. ఈ రెండింటినీ తిని ఓ గోలీ సోడా లాగించే సమయానికి బస్సు బయల్దేరేది. బస్సుల రాకపోక ఉన్నంతసేపు ఈ వ్యాపారం నిరాటంకంగా సాగేది. సీజన్ బట్టి మామిడిపళ్ళు, తాటిముంజెలు, జామిపళ్ళు అంటూ బస్సులొచ్చే సమయానికి సిధ్ధమైపోయేవారు. అంతవరకూ నిర్జనంగా ఉండే ఆ రోడ్ ఒక్కసారిగా బస్సుల రాకతో కోలాహలంగా వుండేది.

ఇలా కొన్ని గంటలు ప్రయాణం చేసిన తరువాత సాయం సమయానికి సాలూరు  శారదా సంగీత పాఠశాలకు చేరుకున్నాము. అక్కడ మా నాన్నగారి చిరకాల మిత్రుల రాకతో, ముచ్చట్లతో సమయమే తెలియలేదు. కొంతసేపటికి మా నాన్నగారి  సంగీత కచేరీ ప్రారంభమయింది. ఆహుతులందరూ ఆ గానంలో లీనమైపోయారు. కచేరీ చాలా అద్భుతంగా సాగింది. రెండు మూడు గంటలన్నా పాడివుంటారు. హర్మోనియం ఒక్కటే పక్కవాద్యం. మృదంగం కూడా ఎవరో వాయించిన గుర్తు. 

ఆ కచేరి ముగిసి బయటికి వచ్చి చూస్తే విపరీతమైన వర్షం పడి రోడ్లన్ని చిత్తడిగా వున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఏ వర్ష సూచనా లేదు. ఒక్క మేఘమూ లేదు. "సంగీతరావుగారు "ఆనందామృతకర్షిణి" కీర్తన పాడేరు. ఆయన గాత్రం మహిమ, మంచి వర్షం కురిసింది అని అక్కడివారు మా నాన్నగారిని మెచ్చుకోవడం జరిగింది. పాటలు పాడితే వర్షాలు ఎలా పడతాయని నాకు ఒకటే ఆశ్చర్యం.

తర్వాతి కాలంలో, తాన్సేన్ మేఘ్ మల్హర్ రాగం గానం చేస్తే వర్షించిందని పుస్తకాలలో చదివాను. మద్రాస్ లో వర్షాలు లేక మంచినీటి చెరువులు పూర్తిగా చుక్కనీరు లేకుండా ఎండిపోతే సుప్రసిధ్ధ కర్ణాటక వాయులీన విద్వాంసుడు కున్నక్కుడి వైద్యనాదన్  రెడ్ హిల్స్ చెరువులో నిలబడి "అమృతవర్షిణి" రాగంలో దీక్షితర్ కృతి "ఆనందామృతాకర్షిణి" ని గంటల తరబడి వైలిన్ మీద వాయించినట్లుగా పత్రికలలో ఫోటోలు చూశాను. సంగీతానికి ఉన్న మహిమ మాటలకు అతీతం. సంగీతం ద్వారా సత్ఫలితాలు సాధించడం ఒక్క గానయోగులకే సాధ్యం.

ఆ సంగీత కార్యక్రమం అనంతరం రాత్రి భోజనానికి ఎవరింట్లోనో ఏర్పాటు చేశారు. నేను ముందే చెప్పినట్లు మా నాన్నగారికి మొగమాటం ఎక్కువ. అందువల్ల తాను భోజనం చేయనని పాలు, పళ్ళుంటే చాలని చెప్పడంతో నన్ను మాత్రం పంపారు. ఆ ఇల్లు  మా సంగీత పాఠశాలకు సమీపంలోనే ఏటికి వెళ్ళే త్రోవలో ఉంది. నేను వెళ్ళినప్పుడు ఎవరో ఒక అవ్వగారు మాత్రమే ఉన్నారు. నన్ను చూసి "సంగీతరావు కొడుకువా! రా నాయనా, మనమందరం కావలసినవాళ్ళమే, మొహమాటపడకు" అంటూ లోపలికి తీసుకువెళ్ళి భోజనం వడ్డించారు. మావాళ్ళెవరూ పక్కన లేకుండా పరాయివాళ్ళ ఇళ్ళలో భోజనం చేయడం అదే మొదటిసారి. నా శౌర్యమంతా మా ఇంట్లో నాలుగు గోడలమధ్యే. బయటకు వెళితే బెదురుగొడ్డునే. ఇప్పటికి కూడా. ఆ ఇల్లు చాలా సామాన్యంగానే ఉంది. ఒక చమురు (కిరోసిన్) బుడ్డి దీపం వెలుతురులో భోజన కార్యక్రమం. వాళ్ళకోసం చేసుకున్నదే పెట్టారు. వేడి వేడి అన్నం, కటిక పెసర పచ్చడి, ఇంగువ చారు, మజ్జిగ, ఇవే పదార్ధాలు. ఆ అవ్వగారు పక్కన కూర్చొని ఏవేవో విషయాలు చెప్పారు. అవేవీ నాకు అర్ధం కాలేదు. కానీ ఆవిడ చూపిన ఆదరణ మరువలేను. అలాగే ఆవిడ చేసిన కటిక పెసర పచ్చడి రుచి అమోఘం. నేను అంతకుముందు ఎక్కడా అంత రుచికరమైన పెసర పచ్చడి తినలేదు. నిజం చెప్పొద్దూ... నాకు కారంగా వుండే పదార్థాలు ఏవైనా ఇష్టమే. ఆవిడ చేసిన ఆ రోటి పచ్చట్లో ఇంగువ, ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువగానే పడ్డాయేమో నాకు ఆ పచ్చడి కారామృతంగా అనిపించింది. ఇది నా  జీవితంలో ఎన్నటికీ మరువలేని సంఘటనగా మిగిలిపోయింది.

మేము మద్రాస్ 35, ఉస్మాన్ రోడ్ లో ఉన్నప్పుడు,  ఒకసారి మా కుటుంబం బొబ్బిలి వెళ్ళారు. అప్పుడు  స్వయంపాకం మొదలెట్టి  మొదలెట్టి తరుచూ ఈ కటిక పెసరపచ్చడిని అన్నంలోకి చేసేవాడిని. ఒకసారి సావిత్రమ్మగారు నేను చేసిన పచ్చడి రుచి చూసి "ఓర్నాయనో! ఇంత కారంగా ఉందేవిట్రా! "అంటూ రెండు గ్లాసుల మంచినీళ్ళు త్రాగారు. నాకు మాత్రం ఆ సాలూరు పెసరపచ్చడి  స్ఫూర్తితో చేసినందువల్ల అద్భుతంగా వుండేది. ఇప్పటికీ నేను కనిపించినప్పుడల్లా సావిత్రమ్మగారు "ఏరా, ఇంకా పెసరపచ్చడి చేస్తున్నావా" అని అడుగుతూంటారు. అలా అని నేను పెద్ద భోజనప్రియుడిని కాను.ఏదుంటే దానితోనే సద్దుకుపోయే రకం. కానీ, ఆ పాతకాలపు అవ్వగారి ప్రేమపూర్వక భోజనం ఎప్పటికీ మరువలేను. 

ఇక్కడ, విజయనగరం మహారాజా వారి ఔదార్యం గురించి చెప్పే కధ ఒకటి గుర్తుకు వస్తుంది.

విజయనగరం మహారాజావారు ఒకసారి వేటకు వెళ్ళి మధ్యాహ్నం వరకు వేటాడి బాగా డస్సిపోయారు. ఆకలి దంచేస్తోంది. చుట్టుపక్కల గ్రామాలేవీ లేవు. అలాటిచోట వెడుతూండగా ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది.  అందులో ఒక ముసలామె ఉంది. అవసరార్ధం తప్పులేదనుకున్నారో ఏమో, నోరు విడిచి, తినడానికి ఏదైనా పెట్టమని అడిగారట.
ఎవరో డాబూ, దర్పంగా ఉన్న మనిషి తన వంటి పేదరాలిని తినడానికి ఏదైనా పెట్టమని అడగడం ఏమిటని ఆ ముసలామె వణికిపోయింది. వచ్చిందెవరో ఆమెకు తెలియదు. కానీ బాగా ఆకలిమీదున్నాడని అర్ధమయింది. రాజుగారిని బయట చెట్టునీడలో కూర్చోమని చెప్పి ఆదరాబాదరా కాస్తా అన్నం ఉడికించి, ఏదో ఒక పచ్చడి నూరి ఆ రెంటినీ ఒక ఆకులో పెట్టి రాజుగారి ముందు ఉంచింది. ఆయన ఆకలిమీద వుండి ఆ ముసలామె పెట్టిన ఆహారాన్ని సంతుష్టిగా తినడమే కాక ఆవిడ చేసిన పచ్చడిని ఆయన అమితంగా ఇష్టపడ్డాడు. తన జన్మలో ఇంత రుచికరమైన పచ్చడి తినలేదని అదేమి పచ్చడో చెప్పమని అడిగాడు. ఆ ముసలామె భయంతో వణికిపోయింది. వచ్చినవాడు మెచ్చుకుంటున్నాడో, ఎగతాళి చేస్తున్నాడో తెలియలేదు నిజం చెపితే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయపడింది. రాజుగారు అదే ప్రశ్నను పదే పదే వేయడంతో ఆ పేదరాలికి చెప్పకతప్పలేదు. భయపడుతు మెల్లిగా చెప్పింది అది గరికతో (గడ్డి) చేసిన పచ్చడి అని. రాజుగారు నిర్ఘాంతపోయాడు, 
తాను అంతగా మెచ్చుకొని తిన్నది గడ్డి పచ్చడా అని. అందుకు ఆయన ఆగ్రహించలేదు. గరికతో కూడా అంత రుచికరమైన వంట పదార్ధంచేసి పెట్టిన ఆ ముసలామె పరిస్థితిని, ఆమె ఆదరణను అర్ధం చేసుకొని ఆమెకు మనసారా నమస్కరించి వెళ్ళిపోయారు. తరువాత, కోటకు వెళ్ళిపోయిన మహారాజావారు ఆ ముసలామె ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాన్నంతా ఆమెకు దానంగా రాసిచ్చారు. అదే నేటి 'గరికవలస' ప్రాంతమనే కధ ప్రచారంలో వుండేది.

దీనిని బట్టి మనకు అర్ధమయేదేమిటి? మనిషి విలువ వాళ్ళకుండే సిరి సంపదలను బట్టి కాదు. వారిలోని సద్గుణాలే వారికి ఔన్నత్యాన్ని కల్పిస్తాయి. 

ఈ రెండు సంఘటనలు ఆనాటి మంచితనం, ప్రేమాభిమానాలు, ఆదరణకు దర్పణం పడతాయి.

ఈ రకమైన గతకాలపు అనుభావాలు, ఈ ధారావాహిక చదివే ఆధునిక తరానికి తెలియాలనే నెం.35, ఉస్మాన్ రోడ్ లో పొందుపరుస్తున్నాను. ఈ రకమైనటువంటి అనుభవాలెన్నిటినో ఘంటసాల తన ప్రారంభ దశ జీవితంలో చవిచూశారు. మనిషెప్పుడూ గతాన్ని గౌరవిస్తూ వర్తమానకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి.
                   ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, August 21, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదమూడవ భాగం

21.08.20 - శుక్రవారం భాగం - 13*:
పన్నెండవ భాగం ఇక్కడ:
నెం.35, ఉస్మాన్ రోడ్
               
               ప్రణవ స్వరాట్

మా ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి ఇద్దరమ్మాయిలు వచ్చేవారు. మా వీధి వాళ్ళే. వడ్లమాని నారాయణ మూర్తిగారి అమ్మాయిలు. చిన్న బజార్లో ఆయనకో స్టీల్ సామాన్ల షాపుండేది. ఆ అమ్మాయిలు మాకంటే వయసులో బాగా పెద్ద. వాళ్ళకు మా ఇంట్లో ఎవరికి అవకాశం వుంటే వాళ్ళు పాఠం చెప్పేవారు. మా అమ్మ, సీత పిన్నిగారు ఇద్దరూ బాగానే పాడేవారు. వీణ వాయించడంలో కూడా ప్రవేశముంది. గీతాలు, వర్ణాలు, స్వరజతుల వరకు పిల్లలకు చెప్పగల సమర్ధత గలవారే. ఆ ఇద్దరమ్మాయిల పేర్లు గుర్తులేవు. కానీ, అందరూ వాళ్ళను పెద్దమ్మి, చిన్నమ్మి అని పిలిచేవారు. వాళ్ళు వస్తే మా పిల్లలకి కావలసినంత కాలక్షేపం. వాళ్ళ సంగీత పాఠం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. వాళ్ళ సంగీత పాఠం పూర్తికాగానే పెరట్లోకి దారి తీసేవాళ్ళం. వాళ్ళు అక్కడున్న రాచఉసిరి కొమ్మలు పట్టుకొని గట్టిగ ఊపేసరికి కాయలన్నీ జలజలా నెత్తిమీద పడేవి. వాటిని తింటూ, వెనకవేపున్న జామిచెట్టు క్రిందకు చేరేవాళ్ళం. చాలా పెద్ద చెట్టు. కర్రకు అందనంత ఎత్తులో పెద్ద పెద్ద ముగ్గిన జామికాయలు, పళ్ళు ఉండేవి. ఈ పెద్దమ్మి, చిన్నమ్మి ఎలాటి చెట్లైనా ఎక్కడంలో ఆరితేరిపోయారు. క్షణాలమీద చెట్టు చివరదాకా ఎక్కి ఒకటి, రెండూ చెట్టంతా దుళ్ళగొట్టేసేవారు. క్రింద పడిన వాటిలో మంచివన్నీ ఏరి పెట్టడం నాపని. మా తాతగారు చూస్తే మాత్రం, 'ఆడపిల్లలు అలా చెట్లెక్కి కాళ్ళు విరగొట్టుకుంటే మీకు పెళ్ళిళ్ళు కావర్రా, దిగండి, దిగండి' అని అదిలించేవారు. ఆయన చూస్తే మాత్రం రాచ ఉసిరికాయలను తిననిచ్చేవారు కాదు. జలుబు చేసి, గొంతు పట్టేస్తుంది అని పిల్లలను తిననిచ్చేవారు కాదు. ఆ అక్కచెల్లెళ్ళిద్దరూ మాకంటే ఎంతో పెద్దైనా మాతో సమానంగా ఆటలాడేవారు. కొబ్బరాకులతో బూరాలు చేయడం వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. 
కొబ్బరి ఆకుతో బూర

మా ఇంటి పెరటి తలుపు తీస్తే వెనక రోడ్. అక్కడే వీధి కొళాయి. అందులో నీళ్ళు వచ్చేసమయానికి ఇళ్ళలోని ఆడవారంతా బిందెలతో సిధ్ధమయేవారు. నీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంతవరకు ఉన్న స్నేహాలేవి పనిచేయవు. రోజూ ఎవరో ఒకరు కీచులాడుకోకతప్పదు. అక్కడ మాత్రం నోరున్నవాళ్ళదే రాజ్యం. పెరటి తలుపుకు కుడిప్రక్క ఒక ఇల్లుండేది. అందులో తల్లి, కొడుకు, కోడలు వుండేవారు. అతనికి కొత్తగా పెళ్ళయిన గుర్తు. ఆ అత్తాకోడళ్ళు ఇద్దరు నీళ్ళకొళాయి దగ్గర కనిపించేవారు. తమాషా ఏమిటంటే వాళ్ళిద్దరి పేర్లూ కాంతమే. కోడలిపేరు సూర్యకాంతం. అత్తగారు మరేదో కాంతం. అత్తగారిలాగే నేనుకూడా ఆ కొత్త కోడలిని సూరీడు అనే పిలిచేవాడిని, మా అమ్మగారు  పెద్దవాళ్ళని అలా పేరు పెట్టి పిలవడం తప్పని వారిస్తున్నా. 

ఈ రోజుల్లోలా అప్పుడు గ్యాస్ స్టౌవ్ లు, గీజర్లు వంటివి ఏవీ లేవు. ఎంతటి ధనవంతులైనా వండుకోవడానికి కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్లు ఉపయోగించవలసిందే. ఏ కారణం చేతనో విజయనగరంలో వీటికి ప్రత్యామ్నాయంగా పొట్టు పొయ్యిలను కూడా వాడేవారు. ఆ పొట్టుపొయ్యిని ప్రిపేర్ చేయడానికి చాలా ఓర్పు, నేర్పు అవసరమయేవి. నాలుగు ప్రక్కలా మూసివుండే మట్టి కుంపటిలో మధ్యలో ఒక సన్నపాటి రోకలిలాటిది పెట్టి, ఆ కుంపట్లో ధాన్యపు పొట్టును పొసి రూళ్ళకర్రతోనో, అప్పడాల కర్రతోనో గట్టిగా దట్టించి, ఆ పొట్టు దిట్టంగా ఉందనే నమ్మకం కలిగాక నెమ్మదిగా అందులోంచి రోకలిని బయటకు తీయాలి.   ఈ ప్రోసెస్ ఏమాత్రం అజాగ్రత్త జరిగినా దట్టించిన పొట్టంతా కూలిపోయేది. మళ్ళీ మొదటినుంచి ప్రారంభించాల్సిందే. అందుచేత‌, ఆ పొట్టుపొయ్యి ఉపయోగించే స్థానమేదో ముందే నిర్ణయించుకొని ఈ  పొట్టు దట్టింపు వ్యవహారం మొదలెట్టాలి. ఈ పనిని చేయడంలో మా ప్రభు చిన్నాన్నగారు సిధ్ధహస్తులు. ఆ పొయ్యిలోని రోకలి కదలకుండా గట్టిగా పట్టుకునే పని నాది. ఆ రూళ్ళకర్ర, అప్పడాలకర్ర మరో సందర్భంలో కూడా ఉపయోగించేవారు. భోజనాల సమయంలో మా చిన్నాన్నగారి పక్కన ఇవి ఉండేవి.            
                      
ప్రతిరోజూ భోజనాల దగ్గర నేను కాని, ప్రసాద్ కానీ ఏదో విషయానికి తిక్కపెట్టి, అన్నం తినడానికి మారాము చేయడం పరిపాటి. అప్పుడు ఈ రూళ్ళకర్రే మా చిన్నాన్నగారి వజ్రాయుధం. దానిని పట్టుకొని ఒకసారి ఆయ్! అని గర్జించేప్పటికి మా అంత అల్లరి బంద్. భోజనాల కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేది. ఆవిర్లు గ్రక్కే అన్నం, పప్పు వెంట వెంటనే తినేయాలనేది నా పంతమైతే, ఆవకాయ ముక్కలాటివాటిని కడిగి వేయలేదని ప్రసాద్ అల్లరి. వీటన్నిటికీ మందు ఆ రూళ్ళకర్రే. మా ప్రభూ చిన్నాన్నగారికి పిల్లలను అదుపు చేయడం మా బాగా తెలుసు. మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు ఇలాటివేవి పట్టించుకునేవారే కాదు. ఆయనకెప్పుడైనా సరదా పుడితే మమ్మల్ని ఎత్తుకొని ఉసిరి చెట్టు ఎక్కించి వదిలేస్తాను , గోడవతలకి విసిరేస్తాను అంటూ ఆటలు పట్టించేవారు. ఇక మా నాన్నగారితో కలిసి విజయనగరం లో గడిపిన రోజులేవీ అంతగా గుర్తులేవు. కానీ, ఆయన తీక్షణంగా చూస్తేమాత్రం నేనూ, ప్రసాద్ ఆ చుట్టుపక్కల చేరేవాళ్ళం కాదు. మా అమ్మ, కమల పిన్ని అవసరమైతే చేయిచేసుకోవడం గుర్తుంది. మా తాతగారు మాకు శ్రీరామ రక్ష. ఆయన పిల్లలను ఏమీ అననిచ్చేవారు కాదు. ఆయనది భయంతో కూడిన ప్రేమ. 

మాగెడ్డవీధి మొదటింటి వరండా నేల అంతా నల్లసేనపు పలకలతో ఉండేది. ఎత్తైన అరుగులు ఆనాటికి. (2008 లో వెళ్ళి చూసినప్పుడు ఇంటి రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఎత్తు అరుగులే లేవు. శిథిలావస్థకు వచ్చింది. ఇల్లంతా రోడ్ లెవల్ కు దిగువుగా కనిపించి చూసేందుకే మనసుకు కష్టమయింది.) వరండా నేల నల్లటి పలకలతో ఉండేది. కొన్ని చతురస్రంగా, కొన్ని నలుచదరంగంగా ఉండేవి. అలాటి నలుచదరపు పలకలు మాకు క్యారమ్ బోర్డ్. ఆ  ఆట మా పిల్లలకి కాలక్షేపం. ఆ క్యారమ్ ఆట  అంత తేలిక కాదు.  పలకమీద నాలుగు పక్కలా సుద్దముక్కతో పోకెట్స్ గీసి , మధ్యలో ఒక రౌండ్ వేసి , మూలలంటా ఏరోలు పెట్టి నిజమైన బోర్డ్ గా చేసేవారు. స్ట్రైకర్, రెడ్, 18 కాయిన్స్ తయారు చేయడం ఒక పెద్ద తతంగం. అందుకోసం పిల్లలంతా ఇటికలను, పెంకులను తెచ్చి వాటిని గుండ్రంగా అరగదీసి వాటితో క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళం. మాకంటే పెద్ద పిల్లలు ఈ బోర్డ్ చేయడంలో సహాయపడేవారు. అయితే వారానికో, పదిరోజులకో వరండా అంతా నీళ్ళుపోసి కడిగేప్పటికి మా క్యారమ్ బోర్డ్ గాయబ్. మళ్ళీ  అంత శ్రమ పడవలసిందే. గవ్వలతో, అవి లేకపోతే చింతపిక్కలను ఒక పక్క అరగదీసి తెల్లగా చేసి అష్టా చెమ్మాలు ఆటలు ఆడేవాళ్ళం.

మా అందరికీ బాగా ఇష్టమైన ఫేవరేట్ కాలక్షేపం సినీమా చూడడం. మా వీధిలో మార్కస్ బార్ట్ లీలు, కమల్ ఘోష్ లు, పి. శ్రీధర్ వంటి కేమెరామెన్లు (కేమెరామెన్ ఇంగ్లీషు, కేమెరామెన్లు తెలుగు) చాలామందే ఉండేవారు. వాళ్ళు సిగరెట్ పేకట్ల అట్టలతో కేమెరాలు చేసి ఫోటోలు తీసేవారు. ఆ అట్టలను మడవడంలో ఒక టెక్నిక్ ఉండేది. దానితో కెమెరా షట్టర్ ఓపెన్ అయేది. అదే ఫోటో తీయడం. అలాగే తరుచూ, మధ్యాహ్నం పూట ఇంట్లో వారంతా విశ్రాంతి తీసుకునే సమయంలో, సినీమా మ్యాట్నీ షో వేసేవారు. ఆ ధియేటర్ మా ఇంట్లోని ముందుగది. దాని కిటికి రోడ్ వేపు ఉండేది. సినీమా హాల్స్ దగ్గర బోల్డెన్ని ఫిలిమ్ ముక్కలు పడి ఉండేవి. వాటిని ఎవరో ఏరుకు వచ్చేవారు. గది కిటికీ కవర్ చేసేలా ఒక అట్టను కత్తిరించి, మధ్యలో ఫిలిమ్ ముక్క పట్టేలా నలుచదరంగా కన్నం చేసి దాని మధ్య ఈ ఫిలిమ్ పెడితే ప్రొజెక్టర్ రెడీ. గది బయట రోడ్ మీద ఎండలో ఒక అద్దం పెట్టి ఆ సూర్యకిరణాలు గదికి పెట్టిన ఫిల్మ్ మీద సోకేలా ఎక్స్పర్ట్ కెమెరామెన్లు చూసేవారు. గదంతా చీకటి చేయడంలో బయటి సూర్యకాంతి ఫిల్ము మీద పడి దాని ప్రతిబింబం తెల్లటి గోడమీద పడేది. సినీమా స్టార్టయేది. అందులో, ఎన్ టి రామారావు కనపడేవాడు. దిలీప్ కుమార్ కనపడేవాడు. నర్గీస్, అంజలి కూడా కనపడేవారు.  ఉన్న ఫిల్మ్ ముక్కలు అయేవరకు సినిమా సాగేది. ఈలోగా రోడ్ మీద రిక్షా వచ్చినా, జట్కా వచ్చినా అద్దం తీసేయాలి. అప్పుడు ఇంటర్వెల్. మళ్ళా, అంతా ఎరేంజ్ చేసి సినీమా వేసేవారు. నేనూ ప్రసాద్ ఎప్పుడూ ప్రేక్షకులమే. ఈ విషయాలేవీ ప్రసాద్ కు గుర్తులేవు. అతను నాకంటే రెండేళ్ళు చిన్న. ఇంతలో మరో కొత్త టెక్నిక్ వచ్చింది . పాడైపోయిన ఎలక్ట్రిక్ బల్బ్ లోని ఫిలమెంట్ తీసేసి అందులో సగానికి పైగా నీరుపోసి ఆ గాజు బుడ్డీని ఫిల్మ్ కు అడ్డంగా పెడితే గోడమీది సినీమా మరింత క్లియర్ గా కనపడేది. ఇలా బోల్డ్ సినీమాలు మా హోమ్ ధియేటర్లో, ఎదిరిళ్ళలో చూసేవాళ్ళం. ఈ పాడైపోయిన బల్బ్ లు కావాలంటే కరెంట్ ఉన్న ఇళ్ళవారిని అడగాలి. మా ఇంట్లో కరెంట్ దీపాలు లేవు. అందుకోసం, పక్కవీధిలో ఒకరింటికి వెళ్ళేవాళ్ళం. ఆ ఇంటి అబ్బాయి, మా ఇంట్లో ఉండే ఆంధ్రపత్రికలు చదవడానికిస్తే ఈ పాడయిపోయిన బల్బ్ లకు బేరం పెట్టేవాడు. అలాగే, ఆ పాత పత్రికలు ఇంట్లోవాళ్ళకు చెప్పి ఇచ్చేవాడిని. అయితే బల్బ్ లకోసం కాదు. వారింట్లో ఢిఫరెంట్ సైజుల్లో ప్రిజమ్స్ ఉండేవి. వాటిల్లోంచి చూస్తే ఎన్నో రంగులు కనిపించేవి. వాళ్ళకు ఆ రంగురాళ్ళు కోటలోంచి వస్తాయని చెప్పేవాడు. నిజమో, అబధ్ధమో నాకు తెలియదు. అలా ఈ బార్టర్ పధ్ధతిలో ఈ రంగురాళ్ళు కొన్ని నాదగ్గరుండేవి.



నేను ఒంటరిగా ఆడే ఆట ఒకటుండేది. అది సైకిల్ టైర్ ఆట. ఎక్కడికైనా కొట్టుమీదకెళ్ళాలంటే ఆ టైర్ ను తోసుకుంటూ పరిగెత్తుకు వెళ్ళడం. ఆ టైర్ ను తొయ్యడానికి ఒక చిన్న కర్ర. అలా వెళ్ళడం సైకిల్ తొక్కుతూ వెళుతున్న ఆనందం.  నాకు పోటీగా మరికొందరు పిల్లలు సైకిల్ వీల్ రిమ్ తో వచ్చేవారు. ఆ రిమ్ మధ్య కర్రపెడితే ఆ వీల్ ఆటోమెటిక్ గా నడిచేది.  తొయ్యక్కరలేదు. టైరు చక్రం కన్నా, రిమ్ చక్రాన్ని తోలడంలో బ్రహ్మాండమైన ఆనందం ఉండేది. అలాటి రిమ్ నా దగ్గర లేనందుకు అవమానకరంగా ఉండేది.



మా ప్రభూ చిన్నాన్నగారు చదరంగంలో ఆరితేరినవారు. ఊళ్ళోని పెద్ద పెద్ద ప్లేయర్సంతా ఆయన దగ్గర ఓడినవారే. అయితే ఆయన  ఏనాడూ ఏ పోటీలకు వెళ్ళినట్లులేదు. ఇంట్లో చదరంగం బల్ల నలుపు తెలుపు రంగులలో ఉండేది. పావులన్నీ కర్రతో చేసినవే పసుపు, ఎరుపు రంగుల్లో ఉండేవి. ఒకటి రెండుసార్లు ఆయనతో కలసి చిన్నబజార్లో (అనే గుర్తు) ఒక మేడమీద రీడింగ్ రూములో చదరంగం ఆటకు వెళ్ళాను. అదే వరసలో మినర్వా టాకీస్ ఉండేదనుకుంటాను. మా చిన్నాన్నగారికి ఆ వీధిలో వారంతా పరిచయస్తులే. ఒక్కో షాప్ దగ్గరా పదేసి నిముషాలు కూచోపెట్టి బాతాఖానీ మొదలెట్టేవారు. అలా ఒక షాప్ దగ్గరకు వెళ్ళగా అక్కడ వరస స్టాండ్లలో రంగు రంగు నీళ్ళున్న సీసాలు వరసగా ఉండేవి ఎవరెవరో వచ్చి ఆ రంగునీళ్ళలో నిమ్మరసం, పంచదార వేయించుకొని త్రాగేవారు. వాటిని షర్బత్ లు అంటారని తెలిసింది. లైట్లవెలుగు ఆ రంగునీళ్ళ సీసాల మీదపడి చూడ్డానికి అదేదో ఇంద్రలోకం లా అనిపించింది 

మా వీధుల్లోకి రంగు రంగుల పాకం మిఠాయి అమ్మకానికి వచ్చేది. ఆ పాకపు ముద్ద ఒక పెద్ద లావాటి వెదురుకర్రకు అంటించివుండేది. అది అమ్మేవాడు ఒకచేత్తో గంట మోగించుకుంటూ వచ్చేవాడు. మనం ఇచ్చే డబ్బులను బట్టి ఆ రంగు పాకాన్ని రెండు చేతుల మణికట్టుల దగ్గర వాచీలా, దండకడియాల్లా కట్టేవాడు. అది కొంచెం కొంచెంగా తీసుకు తినడం మహదానందం. 
అలాగే, నాన్ రొట్టి, రస్క్ లు బిస్కట్లు అమ్మవచ్చేవి. కాఫీలో నాన్ రొట్టి ముంచుకు తినడం మా ప్రసాద్ అలవాటు. ఈ వస్తువులన్నింటిమీద చాలా ఈగలు వాలేవి. అమ్మేవాళ్ళు ఎంత శుభ్రంగా ఉంచినా ఈగలు మూగేవి. అలాగే ఇంట్లో త్రాగేసి వదిలేసిన కాఫీ గ్లాసులలో  కూడా ఈగలు ముసిరేవి. ఆ గ్లాసులు వెంటవెంటనే ఎందుకు కడిగేవారు కాదో నాకు తెలియదు. ఆ పనులు ఏ టైముకైనా ఆడవాళ్ళే చేయాలి. మగాళ్ళు ఇంటి పని చేయడం నామోషి .  ప్రతీ పనికి ఒక టైమ్ టేబుల్. దాని ప్రకారం పనులు జరపడంలో ఇలాటి ఇబ్బందులు తప్పవేమో. అప్పట్లో, మూడో క్లాస్ తెలుగు వాచకంలో ఈగ మీద  ఒక పాఠం ఉండేది. అందులో ఈగ వల్ల వచ్చే హాని గురించి ఈగల వల్ల వచ్చే రోగాల గురించి రాసుండేది. ఆ పాఠాన్ని ఇంట్లోవారెందుకు చదవరో తెలిసేదికాదు. 

టైమ్ టేబిల్ అంటే గుర్తుకు వచ్చింది. భోజనపు మెనును మా పెద్దమ్మమ్మగారే డిసైడ్ చేసేవారు. అన్నంలోకి ఏ పప్పు వండాలి(కంది, పెసర), ఏ పప్పుకు ఏ కూర ఉండాలి. వేడి చేసే కందిపప్పైతే చలవ చేసే బీర, దొండ, బెండవంటి కూరలు, పెసరపప్పైతే వేడిచేసే కూరలు, ఏ రకమైన చారు పెట్టాలి, రాత్రి అయితే ఏ పప్పు పచ్చళ్ళు చేయాలి, ఏ పొడులు వేసుకోవాలి, శని ఆదివారాలలో ఒంటిపూట ఉపవాసం వాళ్ళకి ఏం టిఫెన్లు చేయాలి, వాటికి ఎలాటి సైడ్ డిషెస్ వుండాలి అనే విషయాలను కూలంకషంగా పరిశీలించి ఆరోగ్యాలకు తగినట్లు ఆవిడ వంటను నిర్ణయించేవారు. ఆ విధంగానే  ఆ ఇంటి కూతుళ్ళు  చేసేవారు. మా తాతగారి ముగ్గురు కొడుకులు ఆవిడకు మేనల్లుళ్ళు కావడం వలన వారి భార్యలు ఆవిడకు కూతుళ్ళే. 

ఒక రోజు మా నాన్నగారు సాలూరు వెళ్ళబోతున్నట్లు చెప్పారు.  తనతో కూడా నన్నూ తీసుకువెళ్ళడానికి నిశ్చయించడం అపూర్వమే. ఆయన చాలా మొహమాటస్తుడు. తనవల్ల ఇతరులకు ఏవిధమైన అసౌకర్యం, ఇబ్బంది కలగకూడదని ఆయన ఆశయం. అందుకే ఎక్కడికి వెళ్ళినా తనొక్కరే వెళ్ళడం అలవాటు. ( ఇది నాకు కలిగిన అవగాహన).
సాలూరు ప్రయాణ విశేషాలు వచ్చేవారం.

           ...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, August 14, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పన్నెండవ భాగం

15.08.20 - శుక్రవారం భాగం - 12:
పదకొండవ భాగం ఇక్కడ:
నెం.35, ఉస్మాన్ రోడ్


      ప్రణవ స్వరాట్

నెం. 35, ఉస్మాన్ రోడ్ ధారావాహిక - ఘంటసాలగారి జీవిత చరిత్ర కాదు.

ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాలైన కలివరం, విజయనగరం, బొబ్బిలి వంటి చిన్న ఊళ్ళలో పుట్టి పెరిగి ఒకేసారి మద్రాస్ మహానగరంలోకి వచ్చిపడిన  ఒక సగటు కుర్రవాడి మనోభావాలు, అవస్థలు చూపే ప్రయత్నమే ఈ నెం.35, ఉస్మాన్ రోడ్. 

ఒక డెభ్భై ఏళ్ళక్రితం మన ఊళ్ళు ఎలా ఉండేవో, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, అగ్రహారాలలో ఆనాటి ఆచార వ్యవహారాలు పరిపూర్ణంగా కాకపోయినా సూచనప్రాయంగానైనా ఈ తరంవారికి తెలియజెప్పే ప్రయత్నమే నెం.35, ఉస్మాన్ రోడ్. ఇందులో వచ్చే అన్ని భాగాలతోనూ ఘంటసాలగారికి ప్రత్యక్ష సంబంధం ఉండవచ్చును. ఉండకపోవచ్చును. కానీ, ఆ నాటి పరిస్థితులన్నీ ఘంటసాలగారి సంగీత విద్యమీద, పురోభివృద్ధి మీద, వ్యక్తిత్వ వికాసం మీద ప్రభావం చూపాయనే నేను భావిస్తున్నాను.  వయసు మీరుతున్న కారణంగా గత జ్ఞాపకాలు పూర్తిగా మరుగున పడిపోకముందే వాటిని అక్షరరూపంలో పెట్టే ప్రయత్నమే ఈ నెం.35, ఉస్మాన్ రోడ్. ఈ విషయాలన్నీ ఘంటసాలవారి అభిమానులకు ఆసక్తికరంగా తోచకపోయినా, మా పట్రాయని కుటుంబంలో మా తర్వాతి తరంవారికి, వారి పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష వుంటే ఈ వ్యాసాలు కొంత ఉపయోగిస్తాయి. ఈ వ్యాసాలలో అవాస్తవాలకు, అతిశయోక్తులకు చోటులేదు.  నాకు జ్ఞాపకమున్నంతవరకు ఔచిత్యం పాటిస్తూ ఉన్న విషయాన్ని చెప్పడమే నా ముఖ్యోద్దేశం.

ఇక మన కథలోకి వెళదాం.

ఘంటసాల అనే ఆయన తమ కుటుంబంతో మా తాతగారింటికి వచ్చి వెళ్ళాక ఆయన సినీమా లలో పాటలు పాడతారని, మా తాతగారింట్లోనే వుంటూ సంగీతం నేర్చుకున్నారని తెలిసింది. అప్పటినుండి రేడియోలో కానీ, సినీమాల ప్రచారం కోసం జట్కా బళ్ళలోనూ, సైకిల్ రిక్షాలలో లౌడ్ స్పీకర్లు పెట్టి గ్రామఫోన్లలో వచ్చే పాటల్లోకానీ ఘంటసాల పాట వస్తే గుర్తు పట్టడం తెలిసింది. పెద్దవాళ్ళతో సినీమాలకెడితే అందులో వచ్చే పేర్లలో ఘంటసాల అనే పేరుందో లేదో చూడడం మొదలయింది. 

అప్పట్లో సంసారం, మల్లీశ్వరి,  పరోపకారం, దేవదాస్ వంటి సినీమా పాటలు తరుచూ లౌడ్ స్పీకర్లలో వినిపించేవి. పరోపకారం సినీమా ఘంటసాల వారిదేనని చెప్పుకోవడం విన్నాను. ఆ సినీమాను ధియేటర్లో  చూసిన గుర్తుంది. ఘంటసాల పాటలు జనాలు బాగా పాడుకోవడం మొదలయింది. ముఖ్యంగా దేవదాసు వచ్చాక ఎక్కడ చూసినా అవే పాటలు. 

ఊళ్ళో జరిగే పాటల పోటీలలో కూడా ఔత్సాహిక గాయకులు ఘంటసాల పాటలు పాడడం ఆరంభమయింది. ఘంటసాల పుష్పవిలాపం పద్యాలు చదివే గాయకులు ఎక్కువగా తయారయ్యారు. అలాటి  ఔత్సాహిక గాయకుల పాటల పోటీ ఒకటి సింహాచలం చౌల్ట్రీలో జరిగింది. ఆ పాటల పోటీలలో ముగ్గురు జడ్జీలలో మా నాన్నగారు - శ్రీ సంగీతరావుగారు ఒకరు. ఆ పోటీలో మా నాన్నగారి కజిన్ గుమ్మా మార్కేండేయ శర్మ కూడా పాల్గొని ఘంటసాలగారి 'హృదయమా సాగిపోమ్మా' (పరోపకారం) పాట పాడారట. ఈ విషయాలు పెద్దయ్యాక తెలిసినవి.
  హృదయమా సాగిపొమ్మా"పాటను ప్లేబటన్ నొక్కి వినవచ్చు

రోడ్లమీద తాగుబోతు వాళ్ళ నోట్లో దేవదాసు పాటలే.  మా తాతగారికి రోడ్లమీద తూలుతూ నడిచే తాగుబోతులంటే మహాభయం. దానితో పిల్లలను బయటకు వదిలేవారు కాదు. అలాగే  వీధుల్లో గాడిదలు విపరీతంగా తిరిగేవి. వాటి ముందరి కాళ్ళు రెండూ కట్టేసే ఉంచేవారు వాటి యజమానులు. అయినా అవి అలాగే గెంతుకుంటూ తిరుగాడుతూండేవి. ఆయనే ఎప్పుడైనా పిల్లలను తీసుకొని నల్లచెఱువు మెట్టలవేపు తీసుకువెళ్ళేవారు. అక్కడికి వెళ్ళాలంటే మహదానందం. అక్కడ చాలా ఈతచెట్లుండేవి. చేతికందేలా గుత్తులు గుత్తులుగా ఎర్రటి పళ్ళుండేవి. వాటికోసం ఆయన వెంటపడేవాళ్ళం. ఆ ఈతపళ్ళు, నేరేడు పళ్ళు వీధుల్లోకి తెచ్చి అమ్మేవారు. అవి కొనుక్కోవాలంటే గుప్పెడు నూకలో, బియ్యమో ఇవ్వాలి డబ్బులకు బదులుగా.(అంటే బార్టర్ పద్ధతిలో (barter system) వంగ, దొండ, బెండ, చిక్కుడు, అరటి దవ్వ(దూట), అరటిపువ్వు వంటి కూరగాయలు పాతిక, ఏభై, వందల లెఖ్ఖన అమ్మేవారు.  తూనికతో అమ్మకాలు తక్కువ. వాటికి కూడా డబ్బులకు బదులు నూకలే తీసుకునేవారు. తాటి ముంజెలు, మామిడిపళ్ళ సీజన్ లో  ఆ పళ్ళన్ని చాలా విరివిగా అమ్మకానికి వచ్చేవి.  పెద్ద రసాల మామిడిపళ్ళు వంద పళ్ళు ముఫ్పై, నలభై రూపాయలలోపే వుండేవి. వాటిని బేరం చేసి, ఎంచి, కొని డబ్బులు ఇచ్చే వ్యవహారమంతా మా పెద్దమ్మమ్మగారిదే (మా తాతగారి అక్కగారు). ఆవిడ దగ్గర మూరెడు పొడుగున ఒక పాత పెద్ద తోలు పర్స్  మూడు నాలుగు మడతల్లో ఉండేది.  అప్పట్లో కరెన్సీ నోట్లకన్నా  నాణేల చెలామణియే ఎక్కువుండేది.  ఆవిడ పర్స్ లో ఒక మడతలో రూపాయి నాణేలు, ఒక దాంట్లో అర్ధలు, పావలాలు, ఒక దాంట్లో బేడలు, అణాలు, మరొక మడతలో అర్ధణాలు, కాన్లు వుండేవి. వాటన్నిటితో ఆవిడ పర్స్ బరువుగానే వుండేది.  మొత్తం అంతా కలిపి  ఓ పాతిక రూపాయలుంటే ఎక్కువేనేమో.
                        1950ల నాటికి చలామణీలో ఉన్న నాణాలు

 ఒకసారి మా నాన్నగారు ఏదో ఊరు సంగీత కచేరీకి వెళ్ళి వచ్చి అక్కడి వారిచ్చిన పారితోషకపు మూటను  మా తాతగారికి ఇవ్వమని నా చేతిలో పెట్టారు. నేను మోయలేనంత బరువుంది. ఆ మూట తాళ్ళు విప్పి చూస్తే అందులో అన్నీ  జార్జ్ బొమ్మ (V or VI అనేది గుర్తులేదు) ఉన్న పెద్ద ఇచ్చు రూపాయి నాణేలు. వాటిని నేను లెఖ్ఖపెట్టగా సరిగ్గా ఏభై ఉన్నాయి. నేను మా తాతగారికి ఇవ్వగా ఆయన అమ్మీ అంటూ తన అక్కగారిని పిలిచి ఆ డబ్బు ఆవిడ చేతికిచ్చారు. తన జీతం కూడా ఆవిడకే ఇచ్చేవారు. ఇంటి యాజమాన్యం ఆవిడదే. ఆవిడ ఆ డబ్బులను ఆ మూరెడు తోలు పర్స్ లో పెట్టేది. ఆవిడను ఇంట్లోని మగాళ్ళు అత్తా అని, మా అమ్మ, పిన్ని గార్లు అమ్మన్న అని పిలిచేవారు. 


ఆనాడు రూపాయికి ఉండే విలువ ఈనాడు ఊహించలేము. ఒక రూపాయి ఒక తులం బరువుండేది. బంగారం తూచడానికి ఒక వెండి రూపాయి నాణేన్నే ఉపయోగించేవారు.

   1906నాటి వెండి రూపాయి నాణెం
నేను పుట్టడానికి ముందు ఒక రూపాయికి తులం బంగారం వచ్చేదని చెప్పుకునేవారు. కానీ ఆ రూపాయి దొరకడమే బహు దుర్లభంగా వుండేది. దీపావళి  మతాబాలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, చిచింద్రీల వంటి బాణసంచా తయారుచేసేప్పుడు వాటిలో ఉపయోగించే పదార్థాలను తూచడానికి ఈ రూపాయి నాణేన్నే ఉపయోగించేవారు.

నేను విజయనగరం లో ఉన్నప్పుడు యాచక వృత్తి వుండేది. మాతాతగారికి  మ్యూజిక్ కాలేజీ లేని రోజుల్లో వీధి వరండాలో కూర్చొని వచ్చిపోయేవారిని కుశలప్రశ్నలు వేసి పలకరించేవారు. ఒక రోజు  ఒక ముష్టివాడు ఏవో పాటలు పాడుకుంటూ ఆ వీధిలోకి వచ్చాడు. అతని పాట మా తాతగారికి నచ్చిందనుకుంటాను. అతనిని అరుగుమీద కూర్చోపెట్టి అతనిచేత పాడిస్తూ తాను అగ్గిపెట్టెమీద పాటకు తగ్గట్టు తాళం వేస్తూ ఆనందించారు. అంతా అయిపోయాక అమ్మిగారిచేత డబ్బులు ఇప్పించి పంపేరు. తానొక గొప్ప వాగ్గేయకారుడైనా, ఎటువంటి భేషజం, దర్పం లేకుండా ఒక సామాన్య యాచకుని గానాన్ని మెచ్చుకున్నారంటే ఆయన ఎంతటి విశాలహృదయం గలవాడో, నేను పెద్దయ్యాక అర్ధమయింది. 

అలాటిదే, మరో సంఘటన నేనెన్నటికీ మరువలేనిది. రోజు ఉదయాన్నే ఆరు గంటల ప్రాంతంలో మా ఇంటికి ఎదురింట్లో ఉండే ఒక ముసలి ఆయవారం బ్రాహ్మడు వచ్చి తిధి, వార, నక్షత్రాల వివరాలు చెప్పి ఇంట్లోవారిచ్చే గుప్పెడో, దోసెడో బియ్యం తన ఇత్తడి చెంబులో వేయించుకొని మరో ఇంటికి వెళ్ళేవారు. వేసేవారు వేస్తారు. లేనివారు లేదు. తిధి వార నక్షత్రాలు చెప్పి ఓ రెండు మూడు నిముషాలు చూస్తాడు. ఎవరైనా వస్తే సరే, లేకపోతే మరో గడప ఎక్కేవాడు. చూడడానికి చాలా దీనంగా అనిపించేది. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఒక కోడలు. పెద్దకొడుకు టీచర్ గా పనిచేసేవాడని గుర్తు. రెండోవాడు చదువుకుంటూ, యాచనకు వెళ్ళేవాడు. వారెవరి పేర్లు గుర్తులేవు. ఒక రోజు  మా అమ్మగారు  ఒక బేడ నా చేతిలోపెట్టి  ఒక ప్లాస్టిక్ పన్ని(దువ్వెన) ఒకటి  కొనమని చెప్పింది. ఆ డబ్బులు చొక్కా జేబులో పెట్టుకొని బజారు వేపు వెళ్ళి దారిలో ఒక పార్క్ లో  స్పీకర్ లో నుండి పాటలు వినిపిస్తూంటే అవి వింటూ అక్కడి పచ్చికలో కూర్చొని అక్కడ ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ కాలక్షేపం చేశాను . కొంతసేపు అలా గడిచాక షాపుకెళ్ళి దువ్వెన కొనడానికి బయల్దేరాను. పార్క్ బయటకు వచ్చి జేబులో చెయ్యి పెట్టి చూస్తే డబ్బులు లేవు. గుండెలు గుభేలుమన్నాయి. పరిగెత్తుకుంటూ మళ్ళీ పార్క్ లో నేను కూర్చున్న చోటికి వచ్చి చూస్తే అక్కడేమీ కనపడలేదు. ఏంచేయాలి. డబ్బులు పోయాయని ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుందని భయం. అంతటా వెతకడం మొదలెట్టాను. ఏడుపు తన్నుకొస్తోంది. ఏంచేయాలో తెలీక అక్కడే బిక్కమొహం వేసుకొని దిక్కులు చూడ్డం మొదలెట్టాను. కొంచెం చీకటి పడుతోంది. ఇంతలో, మా ఎదురింటి ఆయవారం బ్రాహ్మడి రెండో కొడుకు అటు పక్క వెళుతూ కనపడ్డాడు. నన్ను చూసి ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావని అడిగాడు. పన్ని కొనాలని వచ్చానని చెప్పాను. సరే, కొనేసావుగా, ఇంటికి పద పోదామని అన్నాడు. అప్పుడు ఏడుపు గొంతుతో జరిగింది చెప్పాను. ఇంటికెళ్తే అమ్మ తిడుతుందని భయం. అతను తన జేబులు చూసి తన దగ్గరా డబ్బులు లేవని చెప్పి. భయపడకు ఇప్పుడే వస్తాను, అక్కడే వుండమని చెప్పి ఒక పావుగంట అయ్యాక వచ్చి నా చేతిలో పన్ని పెట్టి ఇంటికి పదమన్నాడు. డబ్బుల్లేవన్నావు, పన్ని ఎలా కొన్నావని అడిగాను. అదంతా నీకెందుకు.  పన్నిని తీసుకువెళ్ళి అమ్మకు ఇవ్వు. డబ్బులు పోయిన సంగతి, నేను కొనిచ్చానన్న సంగతి ఎవరికి చెప్పద్దని మరీ మరీ చెప్పాడు. అలాగే ఇంటికి వచ్చి ఆ పన్నిని అమ్మగారి చేతికిచ్చాను. అక్కడితో ఆ సంఘటన ముగిసింది. ఈ విషయం నేను తరువాత మా అమ్మగారికి చెప్పానా లేదా పాపం! ఆ డబ్బులు ఆ ఎదురింటి కుర్రవాడికి తిరిగి ఇచ్చానా లేదా? ఆ విషయాలేవీ నాకు గుర్తులేవు. మేము ఆ ఊరొదిలి వెళ్ళాక, నాకు బాగా జ్ఞానం వచ్చాక, ఈ సంఘటన తల్చుకుంటే ఏదో తప్పు చేసిన గిల్టీనెస్ కలుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో యాచన చేసుకునే కుర్రాడి సహాయం పొందవలసి వచ్చిందే, అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా తప్పు చేసాననే  భావం ఇప్పటికీ నన్ను వదలలేదు. విజయనగరం, ఆ పార్క్ తలచుకున్నప్పుడల్లా ఆ సంఘటన గుర్తుకు వచ్చి మనసంతా వికలమౌతుంది.

నేను విజయనగరంలో ఉన్న నాలుగు సంవత్సరాలలో నాకు బాగా గుర్తుండిపోయినవి ఆటలు తప్ప స్కూల్ కు వెళ్ళి చదవడం, అక్కడి విషయాలేవీ గుర్తులేవు. అరటిచెట్ల బడిలో దసరా ఉత్సవాలప్పుడు పప్పుబెల్లాలకోసం తిరగడం. పండగలప్పుడు స్కూల్ లో పెట్టే ప్రసాదాలు తప్ప. ఏవో పండగలయ్యాక ఒక రోజు నేను స్కూలుకు వెళ్ళలేదు. మర్నాడు వెళ్ళినప్పుడు నన్ను మాత్రం టీచర్స్ రూమ్ కు తీసుకుపోయి అక్కడ నాకు ఏదో స్వీటు, పులిహోర పెట్టడం జ్ఞాపకముంది. ఆ మూడో క్లాసు మాస్టారు తెల్లటి పంచే చొక్కా వేసుకొని, భుజంమీద కండువాతో, ఒక బెత్తం పట్టుకొని వచ్చేవారు. ఆయన రామాయణ, భారత కధలను చాలా ఉత్సాహంగా రసవత్తరంగా చెప్పేవారు. పిల్లలంతా నోళ్ళు తెరుచుకొని ఆ కధలు వినేవారు. ఆయన పేరు తెలియదు. ఆ మాస్టారు మా ఇంటికి అప్పుడప్పుడు బియ్యం కొనుక్కునేందుకు వచ్చేవారు. మా ఇంట్లో బియ్యపు వ్యాపారమేమిటని సందేహం కలగవచ్చును. కలివరం నాయుడు గారి బియ్యపు బస్తాలు కొన్నాళ్ళు  విజయనగరంలో మా ఇంట వుంచి అమ్మకానికి పెట్టారు. దానిమీద వచ్చే ఆదాయం ఎవరికోసం అనే విషయం నాకు తెలియదు. ఆ బియ్యాన్ని కొనుక్కునేందుకు ఆ మాస్టారు మా ఇంటికి రెండు మూడుసార్లు రావడం గుర్తుంది. ఒక శేరో, రెండు శేర్లో ఒక గోనె సంచిలో వేయించుకొని వెళ్ళేవారు. అదెన్నాళ్ళు సాగిందో తెలియదు. బియ్యం పప్పులు కొలిచేందుకు కుంచం, అడ్డ‌, శేరు, తవ్వ, సోల, గిద్దెలు ఉపయోగించేవారు. కుంచం హైయ్యస్ట్. గిద్దె లోయస్ట్ కొలమానం. అలాగే, బెల్లం, చింతపండు వంటి ఘన పదార్థాలు తూచడానికి వీశె, మణుగు, బారువ వంటి కొలమానాలుండేవి. ఈ సిస్టమ్ అంతా 1956 లో మారిపోయింది నయాపైసలు, కిలోగ్రాములు, కిలో మీటర్ల మానాలు అమల్లోకి వచ్చాయి. 

ఇందాక  భారత, రామాయణాలంటే ఒక విషయం గుర్తుకువచ్చింది.

ఒకసారి మా ఇంట్లో అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున గట్టిగా అరుపులు, కేకలు వినిపించాయి. ఎందుకో ఏమిటో తెలియదు. మా తాతగారు, పెద్దమ్మమ్మగారు తీవ్రంగా వాదించుకుంటూ, అరుపులు వినపడ్డాయి. మాతాతగారు కోపంతో బయటకు వెళ్ళిపోయారు. ఆవిడ తన తమ్ముడిని 'మూర్ఖపు గాడిదకొడుకు' అని అనడం గుర్తు. ఆయన కోపంతో నల్లచెఱువు మెట్టలవేపో, వ్యాసనారాయణ మెట్టలకో వెళ్ళి కోపం తీరేవరకు అక్కడే కాలక్షేపం చేసి తెల్లారక నెమ్మదిగా ఇంటికి వచ్చేవారు. 'అమ్మీ! ఆలోచించి చూస్తే నువ్వు చెప్పిందే రైట్ సుమీ' అని సమాధానపడేవారు. ఇంతకూ దెబ్బలాటకు కారణం తెలిస్తే విస్తుపోతారు. గొడవలు వాళ్ళిద్దరి మధ్యాకాదు. ఏ మహాభారతం గురించో మొదలయి ఒకరు పాండవుల పక్షాన, ఒకరు కౌరవుల పక్షాన సమర్ధించుకుంటూ మాటకు మాటా పెరిగి తీవ్రరూపం దాల్చేది. ఇలాటి దెబ్బలాటలు ఆర్నెల్లకో, ఏడాదికో జరగడం పరిపాటని తరువాత పెద్దయ్యాక ఇంట్లోవారు అనుకోగా అర్ధమయింది. 

మా తాతగారు తెల్ల ఖధ్ధరు పంచెలు, తెల్ల చొక్కా, కండువా, గొడుగేసుకొని మ్యూజిక్ కాలేజీకి వెళ్ళేవారు. భోజనాల సమయానికి వచ్చేవారు. భోజనం చేసేప్పుడు కాశీ పంచె కట్టుకొని, చొక్కా లేకుండా ఒళ్ళంతా గంధం పూసుకొని నుదుట నల్లటి పెద్ద బొట్టు పెట్టుకొని భోజనానికి వచ్చేవారు. ఆయనకు కావలసిన గంధం అరగదీయడంలో, ఆ నల్లటి బొట్టు తయారుచేయడంలో మాకు చేతనైన పనులు మేము చేసేవారం. ఆ నల్లబొట్టు తయారీలో అరటిపువ్వు దొప్పలు ఉపయోగపడేవి. లేత పువ్వుల్లో ఒకరకమైన తేనెలాటిది ఉంటుంది. దానికోసం పిల్లలం ఎగబడేవాళ్ళం. పువ్వంతా రెలిచిన తరువాత, అరటిపువ్వు డొప్పలను మండుటెండలో ఎండబెట్టి వాటిని ఒక తాడులో గుచ్చేవాళ్ళం. అవసరమైనప్పుడు ఆ ఎండు డొప్పలను నల్లగా కాల్చి ఆ నుసిని ఒక భరిణలోవేసి అందులో మంచికర్పూరంపొడి, ఏదో నూనె వేసి గట్టిగా కలియబెట్టేవారు ఇంట్లోని ఆడవారు. దానిని ఆయన నుదుట అడ్డంగా గంధం రాసుకొని దానిపైన ఈ నల్లబొట్టు పెట్టుకునేవారు. ఈ కార్యక్రమం సుమారు పావుగంట పట్టేది. తరువాత భోజనాలకు కూర్చునేవారు. ముందు మగవారు, పిల్లల భోజనాలు. తరువాత ఆడవారి భోజనాలు. రెండు బ్యాచ్ లుగా అయేవి. భర్తలు లేచాక వదిలిన ఆ కంచాలలోనే ఆ ఇంటికోడళ్ళు భోజనం చేయడం ఆనవాయితి. అదేం ఆచారమో? ఈ రోజుల్లో అలాటివి ఎవరు ఆచరించరు. చెపితే, కనీసం నమ్మను కూడా నమ్మరు. కాని, ఇది నిజం. మా తాతగారికి చిన్నతనంలోనే ఆస్థ్మా వచ్చింది. ఎప్పుడూ దగ్గుతూండేవారు. ఆయనకు చుట్టకాల్చే అలవాటు ఉండేది. ఇదే అలవాటు, బహుశా, శిష్యుడైన ఘంటసాలకు అబ్బిందేమో!

పట్రాయని సీతారామశాస్త్రి గారికి బొట్టు అలవాటు విజయగరం వచ్చిన కొత్తల్లో లేదేమో. ఎందుకంటే, ఈయన, తమ తండ్రిగారి కంటే పెద్దైన శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారిని చూడడానికి వెళ్ళినప్పుడు, ఆయన ఈయనను చూసి 'ఏమిరా, పేరా సాహేబూ! నువ్వు మా నరసింహ కొడుకువి కదూ' అంటూ పలకరించారట. ఆ పేరా సాహేబ్ అనే ఆయన ఆ రోజుల్లో గొప్ప హిందుస్థానీ గాయకుడట. 
Peara Saheb (పేరా సాహెబ్)
 
ఆయన పాడిన గ్రామఫోన్ రికార్డులు బహుళ ప్రచారంలో ఉండేవి. ఆ పేరా సాహేబ్ ఫోటోలు కూడా చాలామంది కళాకారుల ఇళ్ళలో ఉండేవట. మాతాతగారికి ఆయనకు ఏవో పోలికలుండేవట. ముఖ్యంగా,  మాతాతగారు పచ్చని లుంగీ కట్టుకు తిరగడం, హార్మోనియం వాయిస్తూ పాడడం కూడా, ఆయన అలా పిలవడానికి కారణం కావచ్చు. మా తాతగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చేరడానికి ముందు, ఒక యోగ్యతా పత్రం కావలసివచ్చి నారాయణ దాసుగారిని చూసేందుకు వెళ్ళారు. దాసుగారు మా తాతగారిని చూసి "ఒరే, నీకెందుకురా ఆ బాడుఖావు ఉద్యోగం. సలక్షణంగా పాఠశాల కట్టేవు. స్వతంత్రంగా ఉన్నావు అని, నీ ప్రారబ్ధం అలా ఉంది తప్పదు' అని యోగ్యతా పత్రం రాసి ఇచ్చేరట. పక్కనున్నవాళ్ళతో అన్నారట 'ఆ హార్మోనియం లేదూ అదొక కొయ్య. దానిలోంచి అమృతం పిండుతాడు వీడు' అని. (శ్రీ పట్రాయని సంగీతరావు గారి - 'చింతాసక్తి' నుండి). హార్మోనియం విషయంలో ఆ తండ్రిగారి వారసత్వమే శ్రీ సంగీతరావు గారికీ సంక్రమించి వుండవచ్చును. నాకు ఆనాడు ఆ సంగీతపు విలువలు తెలియదు. ఆ వ్యక్తుల ఔన్నత్యం అర్ధమయే వయసుకాదు.

మా తాతగారికి నడుము నొప్పులు, కాళ్ళనొప్పులు వుండేవనుకుంటాను. ఆయన మంచంమీద బోరిగిళ్ళా పడుకొనివుంటే నేను, మా ప్రసాద్ ఇద్దరం గోడ ఆసరాతో ఆయన కాళ్ళమీద, నడుము మీద నిలబడి నెమ్మదిగా తొక్కేవాళ్ళం. ఆయనకు ఆ సేవ చేయడానికి మేమిద్దరం కాట్లాడుకునేవాళ్ళం. అది తల్చుకున్నప్పుడల్లా పరమానందయ్య శిష్యుల కధలో నాగయ్యగారి పాట్లే గుర్తుకు వస్తాయి.

మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు వారి పెద్దమ్మాయి జ్యోతిర్మయి పుట్టిన కొన్ని నెలలకు సంగీత పాఠాలు చెప్పడానికి తన నివాసం విశాఖపట్నానికి మార్చారు. మా సీత పిన్ని, చెల్లి మా తాతగారితోనే వుండేవారు. మా తాతగారింట్లో ఎప్పుడూ బంధు, మిత్రుల రాకతో కళకళలాడుతూ వుండేది. ఇంట్లో ముగ్గురు కోడళ్ళు. వాళ్ళ పుట్టింటినుండి అన్నదమ్ములో, అక్కచెల్లెళ్ళో ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవారు. వైద్యంకోసం విజయనగరం వచ్చే బంధువులు కూడా మా తాతగారింటికి వచ్చేవారు. కుటుంబం పెద్దదవుతూవుంది. ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రం. కళాకారులకు పేరు వచ్చినంతగా ఆదాయం వచ్చేది కాదు. 'బయట పల్లకీలమోత, ఇంట్లో ఈగలమోత' అనే సామెత సంగీతంవాళ్ళకే వర్తిస్తుంది.
 
ఇంట్లోని పిల్లలకెప్పుడూ అనారోగ్యాలు, దగ్గులు, జ్వరాలు. అప్పట్లో మలేరియా జ్వరాలతోపాటు 'కోరింత' దగ్గు అని ఒకటి వచ్చి పిల్లలను బాగా ఇబ్బంది పెట్టేది. ఆ కోరింత దగ్గు వస్తే మాత్రం ఒక పట్టాన వదిలేదికాదు. కనీసం మూడుమాసాలైనా పడుతుంది తగ్గడానికి. ఇలాటి పరిస్థితులలో మా చెల్లెలు రమణమ్మ నెలలపిల్ల. పెరట్లో ఉసిరిచెట్టుక్రింద చాపమీద పడుక్కోపెట్టారు. నిద్రలో దొర్లుకుంటూ పోయి పక్కనున్న చిన్న రాతికాలువలో పడి అక్కడున్న సూదైన రాయి తలవెనక తగిలి బాగా రక్తంకారడం మొదలయింది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ గా మా కమల పిన్నిగారు (ప్రసాద్ తల్లి)  పంచదార, పసుపులాటివేవో అద్ది కట్టుకట్టారు. తరువాత, సుసర్ల వెంకట్రావు గారి హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా ఆయన చూసి తలవెనుక మూడు కుట్లు వేశారు. కొన్నాళ్ళకు గాయంమానింది. మచ్చ ఉండిపోయింది. 

ఏ కారణం చేతనో నా ప్రాధమిక చదువు సక్రమంగా సాగలేదు. ఇంట్లోనే చదివించి, తరువాత సంవత్సరం ఆరోక్లాసులో బ్రాంచ్ కాలేజీ లో చేర్పించడానికి ఏర్పాట్లు చేశారు. మా ఇంటికి కొంచెం దూరంలో, ఇస్మైల్ కాలని అని గుర్తు. ఆ వీధిలో  పప్పు అప్పలనరసింహంగారని మా నాన్నగారికో, తాతగారికో మిత్రులు. ఉపాధ్యాయులు. ఆయన దగ్గరకు ప్రైవేటుకు పంపారు. ఆయన ఏంచెప్పారో, నేను ఎన్నాళ్ళు,  ఏం నేర్చుకున్నానో నాకైతే తెలియదు. నేను చదువు విషయంలో ఎప్పుడూ అంతంత మాత్రంగానే వుండేవాడిని. కొంచెం వయసు వస్తే సరిపోతుందని అనేవారు. కానీ, ఏమీ సరికాలేదు. గ్రాహ్యశక్తి తక్కువ కావడం వలన స్కూల్ పాఠాలు అర్ధమైనట్లే వుండేవి కాని అవి పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి పనికివచ్చేవి కాదు. ఇంట్లో మా ప్రభూ చిన్నాన్నగారు మా ఇద్దరిని కూర్చోబెట్టి చదివించేవారు. ఒకసారి ఆయన కూడికలు, తీసివేతలు లెఖ్ఖలు ఇచ్చారు వాటిలో నూటికి తొంభై రెండు మార్కులు వచ్చాయి.  నా చదువు జీవితంలో అదో నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నంత ఘనత. అదే ఫస్ట్ ఎండ్ లాస్ట్. ఆ తరువాత అందులో సగం మార్కులే నా హైయ్యస్ట్ ర్యాంక్. ఇందుకు, నా పనికిరాని సినీమా పరిజ్ఞానమే కారణమని అనేవారు. ఆటలమీదున్న శ్రధ్ధ చదువుమీద ఉండేది కాదు. మా ప్రసాద్ నాకంటే రెండేళ్ళు చిన్న. నాకు పసుపురంగులో, నీలం కలర్ లో రెండు బుష్ కోట్లు ఉండేవి. వాటికి కాంట్రాస్ట్ కలర్స్ లో బటన్లు. వేసవికాలమైనా అవే వేసుకు తిరిగేవాడిని. నేను కొంచెం బొద్దుగా ఉండేవాడిని, ప్రసాద్ చాలా సన్నగా, వాళ్ళ నాన్నగారిలానే ఉండేవాడు. నాకు బాగా టైట్ అయిపోయిన బట్టలు వాడికి తొడిగితే చాలు. మా ఇద్దరి మధ్యా రామరావణ యుధ్ధమే. మా పిన్నిగారు వచ్చి కోపంగా గుడ్లురిమి చూస్తే చాలు పరుగో పరుగు. ఒక సారి వీధులన్ని చెక్కరకొట్టి మెల్లగా ఇంట్లోకి దూరేవాడిని. ఎప్పుడో తప్ప నేనూ ప్రసాద్ చాలా స్నేహంగానే ఉండేవాళ్ళం.

ఒకసారి మా నాన్నగారు మెడ్రాస్ నుంచి వస్తూ రెండు కీ బస్సులు, రెండు పేము కలర్ స్టిక్స్ తెచ్చారు. ఆ బస్సులు ఒకటి నీలం, ఒకటి ఆకుపచ్చ. చెరొకటి ఇచ్చారు. అంతవరకూ బాగే. వాటితో ఆడేప్పుడే తంటా. నా దగ్గరున్నది వాడికి నచ్చేది. వాడి దగ్గరున్నది నాదైతే బాగుండునని నాకుండేది. అందుకోసం పోట్లాట. మా నాన్నగారు తెచ్చిన స్టిక్స్ తో ఫైటింగ్. అప్పటికి ఎన్ టి రామారావు, నాగేశ్వరరావు జానపద సినీమాలు చూస్తుండడం వలన ఇంట్లో ఆ యుధ్ధాలు మొదలెట్టేవాళ్ళం. నేను ఎన్ టి రామారావును. వాడు నాగేశ్వరరావు. ఆ ఎన్ టి రామారావు పోస్ట్ కోసం ఇద్దరం ఫైటింగ్. నువ్వు సన్నగా నాగేశ్వరరావులా ఉంటావు. అందుచేత నువ్వే నాగేశ్వరరావు, నేను ఎన్ టి రామారావు అని నేను, ఎప్పుడూ నువ్వే ఎన్  టి రామారావు అంటావు‌ ఇవేళ నేనే ఎన్ టి రామారావుని అని మా ప్రసాద్ ఇలా ఇద్దరం  కీచులాడుకునేవాళ్ళం. అదెప్పటికీ తేలేదికాదు. ఈలోగా చేతిలోని స్టిక్స్ వాడికి తగలడమో, నాకు తగలడమో జరిగేది. ఏడుపులు లంకించుకునే సమయంలో మా అమ్మో, వాళ్ళ అమ్మో ఎంట్రీ ఇచ్చి ఆ స్టిక్స్ మా చేతిలోంచి లాక్కొనేవారు. అప్పటికా ఫైటింగ్ సీన్ ముగిసేది. ఇలావుండగా, ఒకసారి మా నాన్నగారు సాలూరు వెళుతూ నన్నూ తీసుకువెళ్ళారు. అంతవరకు కలివరం, విజయనగరం, బొబ్బిలి పేర్లు మాత్రమే తెలుసుకున్న నేను సాలూరు అనే మరో ఊరిపేరు తెలుసుకున్నాను. 

ఆ విశేషాలన్నీ వచ్చేవారం.....(సశేషం)
                                                         -   ప్రణవ స్వరాట్,

Friday, August 7, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదకొండవ భాగం

07.08.20 - శుక్రవారం భాగం - 11 :
పదవ భాగం ఇక్కడ

నెం.35 ఉస్మాన్ రోడ్

                                                          - ప్రణవ స్వరాట్

బాలరాజు, కీలుగుఱ్ఱం, లైలామజ్ను, మనదేశం, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు, సినీమాలతో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా తెలిసింది. విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్న వ్యక్తి మెడ్రాస్ వెళ్ళి సినీమాలలో స్థిరపడి పేరు తెచ్చుకోవడం ఆ వూరి వారందరికీ గర్వకారణంగా వుండేది.  విజయనగర ప్రాంతాలకు చెందిన రావి కొండలరావు, జెవి రమణమూర్తి వంటి నటులకు, ఏవిఎన్ మూర్తి వంటి గాయకులకు సినీమాలలో చేరడానికి ఘంటసాల ఒక స్ఫూర్తిగా నిలిచారు.

అప్పట్లో, జెవి రమణమూర్తి తయారు చేసిన 'విశ్వశాంతి' అనే నాటకానికి మా నాన్నగారు- సంగీతరావు గారు  సంగీతం సమకూర్చారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో ఆ నాటకానికి ఉత్తమ బహుమతి లభించింది.  కన్యాశుల్కంలోని గీరీశం పాత్ర రమణమూర్తి గారికి పేటెంట్. 
కన్యాశుల్కం నాటకాన్ని దేశవ్యాప్తంగా కొన్ని వందల ప్రదర్శనలిచ్చారు. తరువాత,  కెబి తిలక్ ఆయనను ఎమ్ఎల్ ఏ సినీమాలో హీరోగా పరిచయం చేయడం మీ అందరికీ తెలిసినదే. 'శంకరాభరణం' సోమయాజులు గారు రమణమూర్తి సోదరుడే. ఆయనా మంచి రంగస్థలనటులు. చాలా లేటుగా సినీమాల్లోకి వచ్చారు.  ఉత్తరాంధ్రాకు చెందిన పింగళి వారు, ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్యగారు అప్పటికే మద్రాసు చేరారు.

మా ఇంటికి ఎదురింట్లోనే గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీ ఏవిఎన్ మూర్తి కుటుంబం వుండేది. అప్పటికి ఆయన చిన్నవాడే. తరువాత సంగీతం నేర్చుకొని మద్రాసు వెళ్ళారు.

                                     శ్రీ ఏ.వి.ఎన్. మూర్తి
 ఆయన తమ్ముడు గోపాలరావ్, సర్వి అనే సర్వేశ్వరరావు, మంత్రిప్రగడ నాగభూషణం, వేలమూరి రామారావు, నా వయసువారు. అందరం కలసి ఆటలాడేవాళ్ళం. మల్లాప్రగడ, కందాళం, వడ్లమాని, నేమాని వంటి కుటుంబాలు ఆ గెడ్డ వీధిలోనే ఉండేవి.

ఘంటసాలవారు మా ఇంటికి వస్తారన్న వార్త అందరికీ తెలిసింది. ఒక్కొక్కరుగా వచ్చి ఎప్పుడొస్తారు, ఎన్నాళ్ళుంటారని మావాళ్ళను అడగడం మొదలుపెట్టారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గురువుగారి శిష్యుడన్న విషయం వారికి తెలుసు. 

ఈ హడావుడి మా తాతగారికి కంగారు పుట్టించింది. మర్నాడు, ఘంటసాల వచ్చేప్పటికి వీధిలో వారంతా ఇంటికి వచ్చేస్తే సంబాళించడమెలా, వచ్చే అతిధులకు ఇబ్బందికరంగా తయారౌతుందేమోనని భయం. అదీకాక చాలా పసిపిల్లలున్న ఇంట్లో వచ్చే వారికి తగిన మర్యాదలు చేయడం కష్టమనే భావన. ఇవన్నీ ఆలోచించి ఘంటసాల కుటుంబాన్ని కొంతసేపు వుంచుకొని తరువాత, తమ మిత్రులైన వసంతరావు బ్రహ్మాజీరావుగారింట్లో దింపుదామనే నిర్ణయానికొచ్చారు. బ్రహ్మాజీరావుగారి తమ్ముడు వసంతరావు వెంకట్రావుగారు  ఎమ్ ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా వుండేవారు. వారంతా మా తాతగారికి అతి సన్నిహితులు.
1951లో ఘంటసాలవారు మెడ్రాస్ లో స్వంతంగా ఒక మేడను కొనుగోలు చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఆ సందర్భంగా గురువుగారిని మెడ్రాసు రప్పించి సగౌరవంగా సత్కరించారు. ఆ రోజు సాయంత్రం గురువుగారు, మా తాతగారైన పట్రాయని సీతారామశాస్త్రిగారి సంగీతకచేరీ కూడా ఏర్పాటు చేశారు. శిష్యుడు సాధిస్తున్న ప్రగతికి గురువుగారెంతో సంబరపడ్డారు.





అటువంటి శిష్యుడు కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడం సంతోషకరమే అయినా  కనీసం కరెంట్ వసతి కూడా లేని ఆ ఇంటిలో వారు ఎలా గడపగలరు అనేది ఆయన చింత. అందుకే సకల వసతులు గల తమ మిత్రుల ఇంటిలో బస ఏర్పాట్లు చేశారు.

అనుకున్నట్లుగానే మర్నాడు ఉదయం ఒక కారులో అతిధులు వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారో గుర్తులేదు‌, కానీ ఒక మగ, ఇద్దరు ఆడ, ఓ చిన్న బాబు మాత్రం బాగా గుర్తుండిపోయింది. వచ్చినాయన తెల్లటి చొక్కా, అరవ్వాళ గుండారు కట్టుకొని ఉన్నారు. వచ్చినావిడ చాలా తెల్లగా పొడుగ్గా కనిపించారు. వాళ్ళ బాబుకు రెండేళ్ళుంటాయేమో. ఆవిడను మా ఇంట్లో వాళ్ళందరికీ 'నా వైఫ్ సావిత్రి' అని చెప్పారు. ఆవిడ అందరితో కలుపుగోలుగా మాట్లాడారు. మరొక పెద్దావిడ ఆయన తల్లిగారట. 

(ఘంటసాలగారి తల్లిగారు రత్తమ్మగారు)
ఆ వచ్చినాయన పేరే ఘంటసాల అని తెలిసింది. వారిని చూచేందుకు నాకు తెలియని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి పలకరించడం ఆయన సమాధానాలు చెపుతూ మాట్లాడడం జరిగింది.ఇల్లంతా కోలాహలంగా వుండడం పిల్లలమైన మాకు మంచి ఉత్సాహంగా అనిపించింది. ఘంటసాలగారు మధ్య మధ్యలో "రాజీ! అని పిలవడం, "ఓయ్ అని ఆ సావిత్రి గారు రావడం వింతగా అనిపించింది. ఆవిడ పేరు  సావిత్రి అన్నారే, ఇప్పుడు రాజీ అని పిలుస్తున్నారే. ఆవిడకు రెండు పేర్లా ? అని నాకు సందేహం.  అందరి మాటలు వింటూ ఇంట్లో ఒక ఓరగా నిలబడి వింతగా చూస్తూండిపోయాను. ఘంటసాల గారు ఏవో పాటలు పాడిన గుర్తు. ఆ పాటలకు తగినట్లు బొద్దుగా ఉన్న వారి బాబు కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆడడం గుర్తుంది. మంచి లయజ్ఞానం ఉందని మాపెద్దవాళ్ళు ముచ్చట పడ్డారు. ఆ బాబు పేరు విజయకుమార్ అని చెప్పారు.

(ఘంటసాల విజయకుమార్)
ఘంటసాలగారు విజయా సంస్థలో ఆస్థాన సంగీత దర్శకుడిగా కాంట్రాక్టు జరిగిన మరుసటి సంవత్సరం ఈ బాబు పుట్టాడు. విజయాతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని ఈ బాబుకు ' విజయ' కలిసేలా పేరు పెట్టమని విజయా అధినేత బి.నాగిరెడ్డిగారు సూచించారట. ఆయన కోరిక మేరకు వారి బాబుకు విజయకుమార్ అని పేరు పెట్టడం జరిగిందని తరువాత కాలంలో తెలుసుకున్నాను. ఆ అతిధుల మాటలు, చేష్టలు కొన్ని నాకు బాగా కొత్త . మా పెరట్లో రాచ ఉసిరి, జామి, కొబ్బరి, పత్తి వంటి చెట్లతో చాలా చల్లగా ఉండేది. ఆ సావిత్రి గారికి చాలా ఒత్తైన, పొడుగాటి తలకట్టు ఉండేది. జడవేసుకోవడానికి మావాళ్ళు  పన్ని ఇవ్వబోతే ఆవిడ తన దువ్వెనతో తల దువ్వుకోవడం గుర్తుండిపోయింది. మా ప్రాంతాలలో దువ్వెనను పన్ని అంటారు. మాఇంట్లో పన్నిలు చిన్నవి. కానీ ఆవిడ దగ్గరున్న రంగుదువ్వెన చాలా పొడుగు. తల దువ్వుకుంటూ ఆ దువ్వెనను ఆవిడ తల మధ్యలో పెట్టుకొని మరింకే పనులో చేయడం నాకు ఒకటే ఆశ్చర్యం. మా ఇంటిలో అప్పటికి చూడనివి.

ఇలా కొన్ని గంటలు గడిపాక, వారందరూ బయటకు వెళ్ళారు. మా తాతగారూ, నాన్నగారితో నేనూ వెళ్ళడం జరిగింది. మాతో పాటూ ఆ వూళ్ళోనే ఇంటర్మీడియట్ చదువుతున్న మా నాన్నగారి కజిన్ గుమ్మా మార్కండేయ శర్మ కూడా ఉన్నారు. శర్మ బాబుగా చిరపరిచితుడైన ఆయన పాటలు, పద్యాలు బాగా పాడేవాడు.

ముందుగా, వసంతరావు బ్రహ్మాజీరావు గారింటికి వెళ్ళాము. వారిల్లు చాలా పెద్దిల్లు. ఇల్లాంతా ఎలక్ట్రిక్ దీపాలున్నాయి. నీళ్ళకొళాయిలున్నాయి. వరండాలు,హాల్స్ లో పెద్ద పెద్ద స్థంభాలు, పైనుండి క్రిందికి వేలాడుతూ రంగు రంగుల అద్దాల లైట్ డూమ్స్. ఏ కాలానివో. వాటిలో దీపాలు వెలిగించేవారో లేదో తెలియదు. బ్రహ్మాజీరావు గారి భార్య పేరు రాధమ్మగారు. ఆ దంపతులిద్దరికీ మా తాతగారన్నా, ఆయన పాటన్నా చాలా ఇష్టం. వసంతరావు వెంకట్రావు గారిని కూడా అనేక సార్లు చూశాను. వారంతా ఘంటసాల వారి రాక పట్ల చాలా సంతోషం పొందారు. మాటలు, పాటలు పద్యాల మధ్య మద్యాహ్నపు విందు వారింట్లోనే జరిగింది. 

గురువుగారు తమను ఆ రాత్రికి కూడా బ్రహ్మాజీరావు గారింటనే ఉంచదల్చుకున్నారనే వార్త ఘంటసాలగారికి తెలిసింది. ఆ నిర్ణయానికి ఒప్పుకోలేదు. ఆయన మాతాతగారితోనూ,  వారి కుటుంబ సభ్యులతో గడపడం కోసమే వచ్చామని  అందుచేత వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని రాత్రంతా గురువుగారింట్లోనే ఉంటామని పట్టుపట్టారు. అలాగే చేశారు. మార్గమధ్యంలో మ్యుజిక్ కాలేజి, ఎమ్ ఆర్ కాలేజి, సంస్కృత కాలేజి, ఆయనకు తెలిసిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ, ఒకసారి అయ్యకోనేరు గట్టుమీద ఉన్న గుమ్చీ ప్రాంతంలో ఆగి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అక్కడనుండి, విద్యార్ధి దశలో తనకు ఆకలి సమస్య తీర్చి నిశ్చింతగా సంగీతం నేర్చుకుందుకు దోహదపడిన సింహాచలం దేవస్థానం అన్నసత్రం లోపలికి కూడా వెళ్ళాము. అప్పటికి చీకటి పడింది. అక్కడి భోజనశాలలో కొంతమంది విద్యార్థులు బారులు తీరి భోజనాలు చేస్తున్నారు. అందులో చాలామందికి వచ్చినవారి గురించి ఏమీ తెలియక వింతగా చూశారు. ఘంటసాలగారు ఆ పరిసరాలన్ని తనకు బాగా తెలిసినవే అన్నట్లుగా అన్ని చోట్లకు వెళ్ళి చూశారు. చీకటిగా చిరు దీపాల వెలుగుతో ఉన్న వంటశాలలోకి కూడా వెళ్ళి అక్కడవారితో సరదాగా మాట్లాడారు. మనిషి ఎంత స్థితిమంతుడైనా గతం మరువకూడదనే దానికి నిదర్శనంగా ఘంటసాలగారు నిలుస్తారు. ఆ రాత్రి భోజనాలు మా ఇంట్లోనే జరిగాయి. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఇంట్లో మనిషిలాగే గడిపారు. ఘంటసాలగారు సావిత్రమ్మగారిని మా పెద్దమ్మమ్మగారి వద్దకు తీసుకెళ్ళి "అమ్మగారూ! మీ చేతివంట తిని ఎన్నేళ్ళయిపోయిందో. మీరు చేసే సద్ది కోసమే వచ్చాన"ని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో పులిహోరను 'సద్ది' అని అంటారు. అదెలా చేస్తారో అమ్మగారిని అడిగి నేర్చుకోమని సావిత్రిగారికి చెప్పారు. 

ఘంటసాలగారు తమ మద్రాస్ జీవితంలో అంతకన్నా రుచికరమైన, ఖరీదైన వంటకాలన్నో రుచి చూచి వుండవచ్చును. కాని,గతంలో తనకు అన్నం పెట్టి ఆదరించిన ఒక తల్లి పట్ల తనకుగల ప్రేమాభిమానాలను, కృతజ్ఞతను  వ్యక్తపర్చడానికి అన్న మాటలుగా నేను భావిస్తాను. కరెంట్ దీపాలు లేని ఆ ఇంట్లో హరికెన్ లాంతర్ల వెలుగులో సరదాగా కబుర్లు చెపుతూ భోజనాలు ముగించారు.

మర్నాడు ఉదయం మద్రాస్ ప్రయాణం.

రైలు ఎక్కడానికి ముందు తమ ఇంటికి వచ్చి వెళ్ళవలసిందేనని మా నాన్నగారి స్నేహితుడు శ్రీ ద్వివేదుల నరసింగరావుగారు, వారి భార్య విశాలాక్షిగారు బలవంతం చేసి వారింటికి తీసుకువెళ్ళారు.
(2001 - విశాఖపట్నంలో శ్రీ డి ఎన్ రావుగారు, విశాలాక్షిగారు)

 విశాలాక్షిగారు అప్పటికి రచనా వ్యాసాంగం మొదలుపెట్టలేదు. ఆవిడ ఆంధ్రా మెట్రిక్ పాసయ్యారు. నరసింగరావుగారు మహారాజావారి కాలేజీలో లెక్చెరర్. మా నాన్నగారు మద్రాసు వెళ్ళడానికి ముఖ్య ప్రేరణ ఆ నరసింగరావుగారే.  వారికి ఒక అబ్బాయి శ్రీనాధ్. నాకంటే ఓ రెండేళ్ళు పెద్ద కావచ్చు. తరువాత అమ్మాయి ఛాయ. నాకంటే కొంచెం చిన్నది. ఆ అమ్మాయికి మా ప్రభూ చిన్నాన్నగారు కొన్నాళ్ళు వైలిన్ నేర్పారు. తరువాతి కాలంలో శ్రీ నరసింగరావుగారు విజయనగరం మహారాజావారి స్కాలర్ షిప్ తో అమెరికాలో విస్కన్సిన్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ విభాగంలో పి హెచ్ డి చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ విశేషాలన్నీ రానున్న భాగాలలో చూద్దాము.

అలా ద్వివేదుల వారింటి ఆతిధ్యం పొంది ఘంటసాలవారు తమ కుటుంబంతో సంతోషంగా  మద్రాస్ మెయిల్ ఎక్కారు.

వచ్చేవారం మరిన్ని విశేషాలు. అంతవరకూ....
                      సశేషం