ప్రణవ స్వరాట్
సాలూరు పెద గురువుగారు - మా ముత్తాతగారు, శ్రీ పట్రాయని నరసింహ శాస్త్రిగారి - దగ్గర్నుంచి సంక్రమించిన చిన్న స్థలం పక్కనే సాలూరు చిన గురువుగారు - మా తాతగారు, శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు సాలూరులో మరికొంత స్థలంకొని ఏడాదికో ఇటికా గోడా అంటూ నిర్మాణం ప్రారంభించి క్రమ క్రమంగా ఒక పదేళ్ళనాటికి కట్టడం పూర్తిచేసి అప్పటికే తాను ప్రారభించిన 'శారదా గాన పాఠశాల'ను తమ సొంత కట్టడంలోనే నిర్వహించడం ప్రారంభించారు.
ఆ కాలంలో ఏవిద్యార్ధియైనా అభిలాషతో విద్య నేర్చుకోవాలని వస్తే వారికి ఉచితంగానే బోధించేవారు. ఈ రోజుల్లోలాగా గంటకు ఇంత ఫీజ్ అని సంగీతం వ్యాపారం కాని రోజులవి. విద్యార్ధుల తల్లితండ్రులే వారి వారి స్తోమతును బట్టి గురుదక్షిణ ఏదో ఇచ్చేవారు. ఇవ్వగలిగినవారు ఇస్తారు లేనివారు లేదు. కానీ, గురువులు శిష్యులందరినీ సమాన దృష్టితో చూసి విద్య నేర్పేవారు. మా నాన్నగారు, మా తాతగారు, వారి తండ్రిగారు వివిధ ప్రాంతాలలో కచేరీలు చేసి అక్కడి సంగీత పోషకులు ఇచ్చిన పారితోషకాలతో జీవనం చేసేవారు. అయితే ఆరోజుల్లో ఏర్పడిన మొదటి, రెండవ ప్రపంచ యుధ్ధాల కారణంగా జనజీవనం స్థంభించి, ఆర్ధిక మాంద్యం వలన మన దేశంలో పేదరికం ఎక్కువయింది. అప్పుడూ, ఇప్పుడూ కూడా శాస్త్రీయ సంగీతానికి ఆదరణ ఆంధ్రదేశంలో కన్నా దక్షిణాదినే ఎక్కువ. అలాటి పరిస్థితులలో సాలూరు లో సంగీత పాఠశాల నెలకొల్పడం గొప్ప సాహసమే. ఆ పాఠశాల మెల్లగా అభివృద్ధి పొందుతున్నతరుణంలో, కుటుంబపోషణకోసం చినగురువుగారు సాలూరు విడిచిపెట్టక తప్పలేదు. సాలూరు వదిలి విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో నెల జీతానికి కొలువుకి కుదిరి సంగీతాచార్యునిగా రెండు దశాబ్దాలు పాటు పనిచేశారు. అప్పటికి మా నాన్నగారి వయసు పదిహేను సంవత్సరాలు. తన పదకొండవ ఏట నుండే తండ్రిగారి వెనకాల పాడుతూ పదహారు సంవత్సరాలు వచ్చేప్పటికి స్వతంత్రంగా హార్మోనియం వాయిస్తూ కర్ణాటక సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు.
మా తాతగారు ఉద్యోగనిమిత్తం విజయనగరం మకాం మార్చేక కొన్నాళ్ళు సాలూరు పాఠశాలను నిర్వహించారు. సంగీతరావు గారికి సాలూరులో పెద్ద మిత్రబృందమే ఉండేది. గాయకుడిగానూ మంచి గుర్తింపు పొందారు. ఆయనా అక్కడనుండి వెళ్ళక తప్పలేదు. అప్పుడు, సాలూరిలోని సంగీత పాఠశాల నిర్వహణ బాధ్యతను మా తాతగారి శిష్యులు మానం అప్పారావు, దుంప నరసింహారెడ్డి మొదలైనవారు తీసుకున్నారు. గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు సాలూరులో చాలా ఘనంగా చేసేవారు . సాలూరు లారీ ట్రాన్స్పోర్ట్ కు ముఖ్య కేంద్రం. ఒరిస్సాలోని జైపూర్ వంటి ఘాట్ ప్రాంతాలకు సాలూరు నుండి వర్తక వ్యాపారాలు జరిగేవి. ఆ లారీ ట్రాన్స్పోర్ట్సంతా విడివిడిగా, సామూహికంగా ఈ సాంస్కృతిక ఉత్సవాలు తొమ్మిదిరోజులూ ఏవో సంగీత, నృత్య, నాటక, హరికధా, బుర్రకధా కాలక్షేపాలతో ఎంతో ఉత్సాహాంతో నిర్వహించి రాష్టంలోని పలుప్రాంతాల కళాకారులను ఇతోధికంగా పోషించేవారు.
అలాటి ఏదో ఒక ఉత్సవం సమయంలోనే మా నాన్నగారు - సంగీతరావుగారి - సాలూరు ప్రయాణం జరిగిన గుర్తు. విజయనగరం నుండి మా నాన్నగారు, నేను బస్సులో సాలూరు బయల్దేరాము. ఈనాటి రవాణా సౌకర్యాల దృష్ట్యా ఒక గంటన్నర ప్రయాణం. కానీ ఆరోజుల్లో ఒక పూట ప్రయాణం.ఆనాటి బస్సులన్నీ ఫ్రంట్ బోనెట్ తో ఉండేవి. నలుపు, ముదురాకు పచ్చ రంగుల్లో చూసిన గుర్తు.
ఇప్పటిలాగా బస్సు స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ ఇగ్నిషన్ ఉండేదో లేదో, లేక పనిచేసేదికాదో నాకు తెలియదు కానీ ఆ బస్సులన్నిటినీ ముందు భాగంలో హేండీల్ పెట్టి తిప్పుతూ ఒక ఐదారు నిముషాలు కష్టపడి కుస్తీపట్టాక ఇంజన్ స్టార్ట్ అయేది. 'అప్పన్న బస్సు రైట్ రైట్' అంటూ బయల్దేరదీసేవారు.
ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆ రోజుల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరన్నా అప్పన్నలు, అప్పారావులు, అప్పలకొండలు ఉండేవారు. కారణం, విశాఖపట్నం పట్నం సమీపంలోని సింహాచలం కొండమీది దేవుడు. సింహాచలం కొండమీద వెలసిన శ్రీ వరహ నరసింహస్వామి వారిని సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు. మా ప్రాంతాల్లో ఆనాడు అప్పన్న, సింహాద్రి, అప్పలకొండ, వరహాలు, నరసింహం పేరు లేని వాళ్ళు చాలా అరుదు.
"ఒరే అప్పన్నా పొరపాట్న కూడా ఇంజనీ ఆపుచేయకురోయి. మళ్ళీ హేండిలెయ్యాలంటే నా వల్లకాదు" అని మరో అప్పన్న గోల. అలాటి ఒక బస్సు వెనకవేపు డోర్ లోంచి ఎక్కబోతూంటే "బాబూ! మీరు మధ్యలో కూకోండని " మమ్మల్ని మధ్య కంపార్ట్మెంట్లో కూచోపెట్టారు. బండి ఓనర్ దొరగార్లు లైన్లోకొస్తే వాళ్ళు డ్రైవర్ పక్కన కూర్చుంటారు. లేదా దారి మధ్యలో ఏ పోలీసులో, రెవెన్యూఆఫీసర్లో చేయూపితే అలాటివారికి మధ్యభాగం. మామూలు పాసెంజర్లకి వెనకాల భాగం. ఇలా రెండు మూడు భాగాలుగా ఆనాటి బస్సులుండేవి. బస్సు ఆపనివాళ్ళది పాపం. బస్సు టాప్ మీద కూడా సామాన్లతో పాటు పేసంజర్లని ఎక్కించేసేవారు. వీళ్ళందరినీ ఎక్కిచ్చుకొని నిండు గర్భిణీలా ఆ బస్ బయల్దేరి తన గమ్యం చేరేప్పటికి 'చాలులే ఇటువంటి సేవా' అనిపించేది. మధ్య గదిలో కూర్చోడం వలన మాకు అంత శ్రమ తెలియలేదు. విజయనగరం-సాలూరుల మధ్య మానాపురం, గజపతినగరం, మరడాం, రామభద్రపురం అంటూ చాలా జంక్షన్లే వచ్చేవి. ఒక్కోక్క జంక్షన్లో కనీసం పావుగంటైనా ఆపేసి టీలు, సోడాలు తాగడానికి పోయేవారు. అలాటి సమయాలలో ఇంజన్ ఆగిందంటే ఇంతే సంగతులు. మళ్ళీ హేండిల్ తిప్పాల్సిందే. ఇలా మానాపురం, గజపతినగరం, ఆరికతోట దాటి రామభద్రపురం జంక్షన్ లో బస్ ఆపేప్పటికి అమ్మకాలవాళ్ళు తమ జంగిడీలతో ఈగల్లా బస్ చుట్టూ మూగేవారు. "సిక్కోలు, బొబ్బిలి, పార్తీపురం పేసంజర్లు ఇక్కడ దిగడిపోయి వేరే బస్సు ఎక్కండహో" అని ఒక అప్పన్న గాఠిగా హుకూం జారీ చేసేవాడు. దిగేవాళ్ళు దిగగా మరికొందరు కొత్త పేసంజర్లు బస్ ఎక్కేవారు. అప్పట్లో ప్రత్యేకించి బస్ స్టాండ్ లేదు. రోడ్ మీదే ఒక సైడ్ కి బస్సులు ఆపేవారు. ఒకడిని మించి మరొకడు ఓవర్ టేక్ చేసి బస్సులు ఆపడంతో ముందు వెళ్ళవలసిన బస్సువాడు వెళ్ళడానికి చోటులేక ఆ రెండు బస్సుల డ్రైవర్లు కీచులాడుకోవడం ఒక దినసరి చర్య.
బస్సు కిటికీలోంచి చూస్తే పక్కనుంచి వరసగా కావిళ్ళు మోసుకుపోతూ రైతులు, కూలీలు కనిపించారు. ఆ కావిళ్ళలో కట్టెలమోపులు, పచ్చగడ్డి మోపులు, పాలు, పెరుగు కుండలు, నీళ్ళ బిందెలు, కోళ్ళు, కూరగాయలతో పాటూ కావిడిలో మరోపక్క చంటిపిల్లలను కూడా కూర్చో పెట్టుకొని ఆడంగుల సహా పొలాలకో, సంతలకో, ఇళ్ళకో పోతూ కనిపిస్తుండేవారు.
ఆ కావిళ్ళు చూస్తే నాకు కలివరంలో జరిగిన ఒక పాత సంఘటన గుర్తుకు వచ్చింది.
ఒకసారి కలివరం గంగుల అప్పల నాయుడు గారింట్లోని భోషాణం రేడియోకి జబ్బుచేసింది. దానిని జీప్ బ్యాటరీ దిమ్మలకు కనెక్ట్ చేసి ఉపయోగించేవారు. అలాటి ఆ రేడియోలో జుయ్యిమని గాలివాన గాలి తప్ప పాటాలేదు, మాటాలేదు. ఒక చేత సిగరెట్ పీలుస్తూ మరొక చేతితో ఆ రేడియో నాబ్ ని మహా స్పీడ్ గా ఆపరేట్ చేసే నాయుడిగారి బావగారు అనకాపల్లి రంగారావుగారు ఇంక ఆ రేడియో పనిచేయదని డయాగ్నైజ్ చేయగా దానిని విజయనగరం పెద్ద షాపులకి రిపేరుకి ఇచ్చారు. దానిని విజయనగరం తీసుకువెళ్ళే బాధ్యత మా నాన్నగారిదయింది. దూసి స్టేషన్ వరకు వెళ్ళేప్పుడో, వచ్చేప్పుడో సరిగా గుర్తులేదు ఆ రేడియోను ఒక కావిడిలో పెట్టుకు రావడం జరిగింది. కూడా మా నాన్నగారు, నేనూ కూడా ఆ మూడు నాలుగు మైళ్ళ దూరం నడిచాము. దారిమధ్యలో ఆ రేడియో ఉన్న కావిడిని మోసే కంబారి (ఇళ్ళలోని పనివాళ్ళను కంబార్లు అనేవారు. కంబారి అనగానే నాకు అంబారి గుర్తుకు వస్తుంది, రెండింటికీ ఏ సామీప్యం లేకపోయినా) నేను చిన్నపిల్లాడినవడం వలన అంత దూరం నడవలేనని నన్ను కూడా ఆ కావిడిలో మరో పక్క కూర్చోపెట్టాడు. కానీ, కాళ్ళు ముడుచుకొని కూచోవడం నాకంత సౌకర్యం అనిపించలేదు. కొంత దూరం వెళ్ళాక అందులోనుంచి దిగి నడిచే వెళ్ళాను.
రామభద్రపురం జంక్షన్లో ఆ కావిళ్ళ గుంపును చూస్తే ఆ పాత సంఘటన గుర్తుకు వచ్చింది.
రామభద్రపురం జంక్షన్ తీపి తీపి కోవాబిళ్ళలకు చాలా ప్రసిధ్ధి . వాటి రుచి మాటల్లో చెప్పలేము. ఆ క్వాలిటీ మన ఫైవ్ స్టార్ స్వీట్ స్టాల్స్ లో కూడా వుండదు. అతిశయోక్తి కాదు. ఒక్కొక్క బిళ్ళ కనీసం డెభ్భై గ్రాములన్నా ఉంటుంది. అలాగే జీళ్ళు, జంతికలు కూడా. ఈ రెండింటినీ తిని ఓ గోలీ సోడా లాగించే సమయానికి బస్సు బయల్దేరేది. బస్సుల రాకపోక ఉన్నంతసేపు ఈ వ్యాపారం నిరాటంకంగా సాగేది. సీజన్ బట్టి మామిడిపళ్ళు, తాటిముంజెలు, జామిపళ్ళు అంటూ బస్సులొచ్చే సమయానికి సిధ్ధమైపోయేవారు. అంతవరకూ నిర్జనంగా ఉండే ఆ రోడ్ ఒక్కసారిగా బస్సుల రాకతో కోలాహలంగా వుండేది.
ఇలా కొన్ని గంటలు ప్రయాణం చేసిన తరువాత సాయం సమయానికి సాలూరు శారదా సంగీత పాఠశాలకు చేరుకున్నాము. అక్కడ మా నాన్నగారి చిరకాల మిత్రుల రాకతో, ముచ్చట్లతో సమయమే తెలియలేదు. కొంతసేపటికి మా నాన్నగారి సంగీత కచేరీ ప్రారంభమయింది. ఆహుతులందరూ ఆ గానంలో లీనమైపోయారు. కచేరీ చాలా అద్భుతంగా సాగింది. రెండు మూడు గంటలన్నా పాడివుంటారు. హర్మోనియం ఒక్కటే పక్కవాద్యం. మృదంగం కూడా ఎవరో వాయించిన గుర్తు.
ఆ కచేరి ముగిసి బయటికి వచ్చి చూస్తే విపరీతమైన వర్షం పడి రోడ్లన్ని చిత్తడిగా వున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఏ వర్ష సూచనా లేదు. ఒక్క మేఘమూ లేదు. "సంగీతరావుగారు "ఆనందామృతకర్షిణి" కీర్తన పాడేరు. ఆయన గాత్రం మహిమ, మంచి వర్షం కురిసింది అని అక్కడివారు మా నాన్నగారిని మెచ్చుకోవడం జరిగింది. పాటలు పాడితే వర్షాలు ఎలా పడతాయని నాకు ఒకటే ఆశ్చర్యం.
తర్వాతి కాలంలో, తాన్సేన్ మేఘ్ మల్హర్ రాగం గానం చేస్తే వర్షించిందని పుస్తకాలలో చదివాను. మద్రాస్ లో వర్షాలు లేక మంచినీటి చెరువులు పూర్తిగా చుక్కనీరు లేకుండా ఎండిపోతే సుప్రసిధ్ధ కర్ణాటక వాయులీన విద్వాంసుడు కున్నక్కుడి వైద్యనాదన్ రెడ్ హిల్స్ చెరువులో నిలబడి "అమృతవర్షిణి" రాగంలో దీక్షితర్ కృతి "ఆనందామృతాకర్షిణి" ని గంటల తరబడి వైలిన్ మీద వాయించినట్లుగా పత్రికలలో ఫోటోలు చూశాను. సంగీతానికి ఉన్న మహిమ మాటలకు అతీతం. సంగీతం ద్వారా సత్ఫలితాలు సాధించడం ఒక్క గానయోగులకే సాధ్యం.
ఆ సంగీత కార్యక్రమం అనంతరం రాత్రి భోజనానికి ఎవరింట్లోనో ఏర్పాటు చేశారు. నేను ముందే చెప్పినట్లు మా నాన్నగారికి మొగమాటం ఎక్కువ. అందువల్ల తాను భోజనం చేయనని పాలు, పళ్ళుంటే చాలని చెప్పడంతో నన్ను మాత్రం పంపారు. ఆ ఇల్లు మా సంగీత పాఠశాలకు సమీపంలోనే ఏటికి వెళ్ళే త్రోవలో ఉంది. నేను వెళ్ళినప్పుడు ఎవరో ఒక అవ్వగారు మాత్రమే ఉన్నారు. నన్ను చూసి "సంగీతరావు కొడుకువా! రా నాయనా, మనమందరం కావలసినవాళ్ళమే, మొహమాటపడకు" అంటూ లోపలికి తీసుకువెళ్ళి భోజనం వడ్డించారు. మావాళ్ళెవరూ పక్కన లేకుండా పరాయివాళ్ళ ఇళ్ళలో భోజనం చేయడం అదే మొదటిసారి. నా శౌర్యమంతా మా ఇంట్లో నాలుగు గోడలమధ్యే. బయటకు వెళితే బెదురుగొడ్డునే. ఇప్పటికి కూడా. ఆ ఇల్లు చాలా సామాన్యంగానే ఉంది. ఒక చమురు (కిరోసిన్) బుడ్డి దీపం వెలుతురులో భోజన కార్యక్రమం. వాళ్ళకోసం చేసుకున్నదే పెట్టారు. వేడి వేడి అన్నం, కటిక పెసర పచ్చడి, ఇంగువ చారు, మజ్జిగ, ఇవే పదార్ధాలు. ఆ అవ్వగారు పక్కన కూర్చొని ఏవేవో విషయాలు చెప్పారు. అవేవీ నాకు అర్ధం కాలేదు. కానీ ఆవిడ చూపిన ఆదరణ మరువలేను. అలాగే ఆవిడ చేసిన కటిక పెసర పచ్చడి రుచి అమోఘం. నేను అంతకుముందు ఎక్కడా అంత రుచికరమైన పెసర పచ్చడి తినలేదు. నిజం చెప్పొద్దూ... నాకు కారంగా వుండే పదార్థాలు ఏవైనా ఇష్టమే. ఆవిడ చేసిన ఆ రోటి పచ్చట్లో ఇంగువ, ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువగానే పడ్డాయేమో నాకు ఆ పచ్చడి కారామృతంగా అనిపించింది. ఇది నా జీవితంలో ఎన్నటికీ మరువలేని సంఘటనగా మిగిలిపోయింది.
మేము మద్రాస్ 35, ఉస్మాన్ రోడ్ లో ఉన్నప్పుడు, ఒకసారి మా కుటుంబం బొబ్బిలి వెళ్ళారు. అప్పుడు స్వయంపాకం మొదలెట్టి మొదలెట్టి తరుచూ ఈ కటిక పెసరపచ్చడిని అన్నంలోకి చేసేవాడిని. ఒకసారి సావిత్రమ్మగారు నేను చేసిన పచ్చడి రుచి చూసి "ఓర్నాయనో! ఇంత కారంగా ఉందేవిట్రా! "అంటూ రెండు గ్లాసుల మంచినీళ్ళు త్రాగారు. నాకు మాత్రం ఆ సాలూరు పెసరపచ్చడి స్ఫూర్తితో చేసినందువల్ల అద్భుతంగా వుండేది. ఇప్పటికీ నేను కనిపించినప్పుడల్లా సావిత్రమ్మగారు "ఏరా, ఇంకా పెసరపచ్చడి చేస్తున్నావా" అని అడుగుతూంటారు. అలా అని నేను పెద్ద భోజనప్రియుడిని కాను.ఏదుంటే దానితోనే సద్దుకుపోయే రకం. కానీ, ఆ పాతకాలపు అవ్వగారి ప్రేమపూర్వక భోజనం ఎప్పటికీ మరువలేను.
ఇక్కడ, విజయనగరం మహారాజా వారి ఔదార్యం గురించి చెప్పే కధ ఒకటి గుర్తుకు వస్తుంది.
విజయనగరం మహారాజావారు ఒకసారి వేటకు వెళ్ళి మధ్యాహ్నం వరకు వేటాడి బాగా డస్సిపోయారు. ఆకలి దంచేస్తోంది. చుట్టుపక్కల గ్రామాలేవీ లేవు. అలాటిచోట వెడుతూండగా ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. అందులో ఒక ముసలామె ఉంది. అవసరార్ధం తప్పులేదనుకున్నారో ఏమో, నోరు విడిచి, తినడానికి ఏదైనా పెట్టమని అడిగారట.
ఎవరో డాబూ, దర్పంగా ఉన్న మనిషి తన వంటి పేదరాలిని తినడానికి ఏదైనా పెట్టమని అడగడం ఏమిటని ఆ ముసలామె వణికిపోయింది. వచ్చిందెవరో ఆమెకు తెలియదు. కానీ బాగా ఆకలిమీదున్నాడని అర్ధమయింది. రాజుగారిని బయట చెట్టునీడలో కూర్చోమని చెప్పి ఆదరాబాదరా కాస్తా అన్నం ఉడికించి, ఏదో ఒక పచ్చడి నూరి ఆ రెంటినీ ఒక ఆకులో పెట్టి రాజుగారి ముందు ఉంచింది. ఆయన ఆకలిమీద వుండి ఆ ముసలామె పెట్టిన ఆహారాన్ని సంతుష్టిగా తినడమే కాక ఆవిడ చేసిన పచ్చడిని ఆయన అమితంగా ఇష్టపడ్డాడు. తన జన్మలో ఇంత రుచికరమైన పచ్చడి తినలేదని అదేమి పచ్చడో చెప్పమని అడిగాడు. ఆ ముసలామె భయంతో వణికిపోయింది. వచ్చినవాడు మెచ్చుకుంటున్నాడో, ఎగతాళి చేస్తున్నాడో తెలియలేదు నిజం చెపితే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయపడింది. రాజుగారు అదే ప్రశ్నను పదే పదే వేయడంతో ఆ పేదరాలికి చెప్పకతప్పలేదు. భయపడుతు మెల్లిగా చెప్పింది అది గరికతో (గడ్డి) చేసిన పచ్చడి అని. రాజుగారు నిర్ఘాంతపోయాడు,
తాను అంతగా మెచ్చుకొని తిన్నది గడ్డి పచ్చడా అని. అందుకు ఆయన ఆగ్రహించలేదు. గరికతో కూడా అంత రుచికరమైన వంట పదార్ధంచేసి పెట్టిన ఆ ముసలామె పరిస్థితిని, ఆమె ఆదరణను అర్ధం చేసుకొని ఆమెకు మనసారా నమస్కరించి వెళ్ళిపోయారు. తరువాత, కోటకు వెళ్ళిపోయిన మహారాజావారు ఆ ముసలామె ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాన్నంతా ఆమెకు దానంగా రాసిచ్చారు. అదే నేటి 'గరికవలస' ప్రాంతమనే కధ ప్రచారంలో వుండేది.
దీనిని బట్టి మనకు అర్ధమయేదేమిటి? మనిషి విలువ వాళ్ళకుండే సిరి సంపదలను బట్టి కాదు. వారిలోని సద్గుణాలే వారికి ఔన్నత్యాన్ని కల్పిస్తాయి.
ఈ రెండు సంఘటనలు ఆనాటి మంచితనం, ప్రేమాభిమానాలు, ఆదరణకు దర్పణం పడతాయి.
ఈ రకమైన గతకాలపు అనుభావాలు, ఈ ధారావాహిక చదివే ఆధునిక తరానికి తెలియాలనే నెం.35, ఉస్మాన్ రోడ్ లో పొందుపరుస్తున్నాను. ఈ రకమైనటువంటి అనుభవాలెన్నిటినో ఘంటసాల తన ప్రారంభ దశ జీవితంలో చవిచూశారు. మనిషెప్పుడూ గతాన్ని గౌరవిస్తూ వర్తమానకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి.
...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.