visitors

Sunday, May 16, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఒకటవ భాగం

16.05.2021 -  ఆదివారం భాగం - 31*:
అధ్యాయం 2 భాగం 30  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"శ్రుతి ఎంత"?

"శ్రుతా! అదెవడికి తెలుసు. నువ్వు లాగించు. నీ ఆర్మణీ నా పాటకు తోకలాగుండాలి.

"ఆ...  కోడలే కులమునక్కత్తారమూ..

( కులమునకు ఆధారము)

గోడలే మెడకత్తారమూ

(మేడకు ఆధారము)

 'రమ్ రమ్ము' ' మ ప'.

 'శ్రుతి దొరికిందా?'

 'దొరికింది సార్!'

ఒకసారి నాలుగు, మరోసారి మూడున్నర'.

"పాతికకు అటూ ఇటైనా ఏం ఫర్లేదు. నువ్వు కానీ... అస్తమాను ఆ తెల్లవే కాక నల్లవి కూడా నొక్కుతూండు." (హార్మోనియం మెట్లు)

ఇది ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో సుమారు 56 ఏళ్ళ క్రితం "చెరపకురా చెడేవు" సినీమా లోని ఒక సీన్. అందులో రేలంగి ఔత్సాహిక ఒక రంగస్థల నట గాయకుడు. చిడతల అప్పారావు అతని ఆర్మణిస్ట్.  ఈ సీన్ వ్యంగ్యాత్మకమైనా ఆనాటి ఔత్సాహిక నాటకాల స్థితిగతులకు దర్పణం పడుతుంది. సాహిత్య, సంగీతాల విషయంలో తెలుగు నాటకం ఈనాటికీ అదే గతిలో వుందనిపిస్తుంది.

ఆత్రేయఎన్.ఆర్.నందిభమిడిపాటిగొల్లపూడిలకు ముందు తెలుగు సాంఘిక నాటక రంగస్థలం అంతగా వృధ్ధిచెందలేదు.

ఆనాడు సమైక్యాంధ్రప్రదేశ్ లోని  గ్రామసీమలలోని సామాన్య ప్రజానీకానికి వినోదమంటే  పౌరాణిక నాటకమే. 1947 తర్వాత  తెలుగు సినిమా టూరింగ్ టాకీస్ ల ద్వారా మారుమూల పల్లెల్లో ప్రవేశించేదాకా పౌరాణిక నాటకానిదే రాజ్యం. మా బొబ్బిలి లాటి వూళ్ళలో పొద్దస్తమానం ఏదో ఓ ఇంటిలో నుండి "అదిగో ద్వారక ఆలమందలవిగో", "బావా! ఎప్పుడో వచ్చితీవు"అనే పాండవోద్యోగవిజయాలు, శ్రీకృష్ణరాయబార పద్యాల ప్రాక్టీస్ తో ఊరంతటికీ వినపడేలా హోరెత్తించేవారు.

మరోపక్కనుండి అంతకన్నా గట్టిగా "చచ్చిరి సోదరుల్ సుతుల్ చచ్చిరీ" అంటూ శృతి కలవని కర్ణకఠోరమైన హార్మోనియంతో జనాలను చంపేవారు మరికొందరు. ఊళ్లో ఏ పండగాపబ్బం జరిగినా, పెళ్ళిపేరంటం జరిగినా ఏదో నాటకం ఆడాల్సిందే. మధ్య మధ్య నవతరం యువకులు ఉత్సాహంగా ఏవైనా చిన్న చిన్న సాంఘిక నాటికలు వేసినా ప్రజలు మాత్రం తిరుపతి వెంకట కవుల పౌరాణిక నాటకాలవేపే మోజు చూపేవారు. పండితుల మొదలు పామరులవరకు పాండవోద్యోగవిజయాలు, కృష్ణరాయబారంలోని పద్యాలన్నీ వాళ్ళ నాలిక చివరే వుండేవి. వీరందరికీ తుంగల చలపతిరావు, కపిలవాయి రామనాధశాస్త్రిసి.ఎస్.ర్, బందా కనకలింగేశ్వరరావు, కె.రఘురామయ్య, సూరిబాబు, షణ్ముఖి ఆంజనేయరాజు, అద్దంకి శ్రీరామమూర్తిపీసపాటి నరసింహమూర్తి వంటి నటగాయకులే ఆదర్శం.

తెలుగు రంగస్థల పౌరాణిక నాటకంమీద మరాఠీ నాటక ప్రభావం ఎంతైనావుంది. ఆ బాణీతోనే తెలుగు పౌరాణిక నాటకం కొనసాగింది. ఈ నటులలో చాలామంది బాగా చదువుకున్నవారు, సంగీతజ్ఞానం కలవారు వుండేవారు. అలాటివారి నాటక పద్యాలు అందరినీ అమితంగా ఆకర్షించాయి. ఈ నాటక పద్యాలలో సంగీతంసాహిత్యం వున్నా సుదీర్ఘమైన రాగాలాపనకే  ప్రాధాన్యత. ఒక నటుడు రాగాలాపనతో ఒక పద్యం  మొదలెడితే అది పూర్తవడానికి పదినిముషాలైనా పడుతుతుంది. అది ముగిసేసరికి మరో నటుడు అంతకన్నా గట్టిగా మరింత ఎక్కువ రాగంతీసి  పోటీగా తన సమర్థత చూపేవాడు. ఈ విధంగా ఓ కృష్ణుడు, అర్జునుడుదుర్యోధనుడుధర్మరాజుకర్ణుడు, భీముడూ అంటూ తలో నాలుగైదు పద్యాలు పాడేసరికి తెల్లారిపోయేది. రాత్రి ఏ పదింటికో మొదలైన నాటకం మర్నాటి ఉదయం ఆరింటివరకూ సాగేది.

అన్ని గంటల నాటకాన్ని ప్రేక్షకులు మహా ఉత్సాహంతో చూసి ఆ పద్యాలనే రోడ్లమీద పాడుకుంటూ ఇళ్ళకు తిరిగివెళ్ళేవారు. ఆయా నటుల గిరికీ రాగాలాపనకే జనాలు పడి చచ్చేవారు. అయితే తెలుగు పౌరాణిక నాటక పద్యాలలోని సంగీతాన్ని కర్ణాటక సంగీత ప్రపంచం అంతగా హర్షించదుఆమోదించదు.

ఈ నాటకాలలో నటనకు హావభావాలకు అవకాశం తక్కువ. కరెంట్, మైకు వసతులులేని రోజుల్లో ఆయా నటుల కంఠస్వర బలమే వారికి శ్రీరామరక్ష. ఈ పౌరాణిక నాటకాలు చాలా దీర్ఘమైనవి కావడం వలన ఒక్కొక్క నాటకంలో ఇద్దరేసి కృష్ణులు (ఒక్కోసారి ముగ్గురు కూడా), ఇద్దరేసి అర్జునులు నటించేవారు. నాటకపోషకులు వీరి మధ్య పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చి సంతోషపడేవారు. సంగీతసాహిత్యాలలో ప్రతిభ కలిగిన నటీనటులు నటించినంతవరకూ పౌరాణిక నాటకం విరాజిల్లింది.

సినీమాలలో నేపథ్యగాన సౌకర్యం వృధ్ధి చెందనంతవరకూ రంగస్థల నటులే సినీమాలలో కూడా రాణించారు. రానురాను సంగీత పరిజ్ఞానం ఏమాత్రం లేని వారంతా శృతజ్ఞానంతో పౌరాణిక నాటకాలు ఆడడం మొదలెట్టారు. సరైన కంఠస్వరం లేనివారు, శృతి గతి లేనివారంతా నటులైపోవడంతో తెలుగు పౌరాణిక నాటకం తన ప్రాభవం కొల్పోయింది. ఈనాటికీ అక్కడక్కడ పౌరాణిక నాటక ప్రదర్శనలు జరుగుతున్నా  అందులోని నటుల పద్యపఠనం మాత్రం తృప్తికరంగా వుండదు. పాత కళల పరిరక్షణ అంటూ ప్రభుత్వం కూడా అలాటివారినే గుర్తించి పోషిస్తూంటుంది. 'వృక్షాలు లేనిచోట ఆముదం మొక్కే మహావృక్షం' అవుతుంది.

ఘంటసాల వెంకటేశ్వరరావుగారి చిత్రసీమలో అడుగుపెట్టడంతోనే తెలుగు సినీమా సంగీత రూపురేఖలు మారిపోయాయి. నేపథ్యగాన ప్రక్రియ వృధ్ధి చెందడంతో గతకాలపు రంగస్థల నటుల గాత్ర ధర్మాలు నవీన తెలుగు సినీమాకు ప్రయోజనకారి కాలేకపోయాయి. అలాటి నటీనటులంతా తెరమరుగయ్యారు.

ఘంటసాలవారు తెలుగు పద్యపఠనంలో ఒక నూతన ఒరవడిని సృష్టించి తెలుగు ప్రపంచంలో ఒక ప్రభంజనమయ్యారు. నవ్య తెలుగు లలితసంగీతానికి ఆద్యుడు ఘంటసాలే.

ఘంటసాల కంఠం తెలుగువారికి పరిచయమైనది ఒక పద్యంతోనే. కాకపోతే స్వర్గసీమలో భానుమతి తో కలసి పాడిన పాట ముందుగా ప్రజలకు చేరింది. అంతవరకు వినని ఒక వినూత్న బాణీ ఘంటసాల కంఠస్వర రూపంలో వెలువడింది. ఘంటసాల గాత్రం అనితరసాధ్యం. ఘంటసాల పాట పెదవులమీదనుంచి రాదునాభిస్థానం నుండి నాదం వెలువడుతుంది. ఆ నాదంలో మృదుత్వం వుందిలాలిత్యం వుంది. అలా అని ఆ గాత్రం స్త్రీ గాత్రం కాదు. భావగంభీరమైనది. నవరసాలను సమాన స్థాయిలో పలికించగల ప్రతిభాశాలి. మూడున్నర శృతులవరకూ ఏ శృతిలో పాడినా తేలిపోని ఉత్తమ గాత్ర సంపద ఘంటసాల సొంతం. భాషభావప్రకటన ఘంటసాల సొమ్ము. శృతిలయలలో ఘంటసాలకు వున్న పట్టు అసమాన్యం.

ఉత్తమ సంగీతజ్ఞునికి కావలసిన ఈ లక్షణాలన్నీ సంపూర్ణంగా ఘంటసాల కంఠంలో ప్రకటితమైనట్లు వేరే యితర గాయకుని కంఠంలోనూ ప్రకటితం కాలేదంటే అది అతిశయోక్తో, లేక వల్లమాలిన వీరాభిమానంతో పొగిడే పొగడ్తలో కావు. అక్షరసత్యాలు. అందుకే కోట్లాది తెలుగు ప్రజలకు ఆరాధ్య‌ఆదర్శ గాయకుడు ఎవరంటే ఘంటసాల పేరే వినిపిస్తుంది. సినీరంగంలోని సంగీతదర్శకులుకవులుగాయనీగాయకులునటీనటులుదర్శక నిర్మాతలు అందరిచేత ముక్తకంఠంతో కొనియాడబడి గౌరవింపబడిన గాయకశ్రేష్టుడు మన ఘంటసాల. భావగాంభీర్యం గల పాటలు ఏవి పాడాలన్నా మొదటి ప్రాధాన్యత ఘంటసాలవారికే. ఒక దశలో తమిళ సినీమాలలో విషాదకరుణరస ప్రధానమైన పురుష కంఠం పాటలన్నీ ఘంటసాలవారినే వరించి వచ్చేవి. ఒక్క తెలుగునాటే కాదుతమిళకన్నడ దేశాలలో కూడా ఘంటసాల గానాభిమానులు అసంఖ్యాకంగానే వున్నారు.

ఘంటసాల తెలుగువాడై పుట్టడం మన అదృష్టం. 'అది ఆయన దురదృష్టంఅని అనేవారూ ఉన్నారు. బహుశా, కేంద్రప్రభుత్వపరమైన బిరుదుల విషయంలోని అలక్ష్యధోరణి వలన కావచ్చు.

నాదయోగులైన గురువుల కృపతోపూర్వజన్మ సుకృతంవలన దైవానుగ్రహంతోనాదసిధ్ధుడిగా రూపొందిన ఘంటసాలవారిలోని ప్రతిభను నిర్ణయించే కొలమానంఅనేక ప్రలోభాలకు లోబడినఘంటసాల  సంగీతం అంటే ఏమిటో  తెలియని ఓ పదిమంది కలసి నిర్ణయించే అశాశ్వత 'పద్మ'లు కానేకావు. అంతకు మించిన శాశ్వతస్థానాన్ని ఘంటసాలవారికి ఇచ్చి రసజ్ఞులైన సంగీతలోకం ఏనాడో తమ సహృదయతనుభక్తి విశ్వాసాలను ప్రకటించింది.

ప్రతీ తెలుగువాడి గుండె చప్పుడులోనూ ఘంటసాల పాటే వినిపిస్తుంది. ఘంటసాల నావాడని, నామనిషని, ప్రజాగాయకుడని ప్రతీ తెలుగువాడు ఈనాటికీ తల్చుకుంటున్నాడంటే అంతకుమించిన ఉన్నతమైన గౌరవంబిరుదు మరేముంది. వాసికన్నా రాశిఅంతకుమించిన ధనార్జనే ప్రతిభకు గీటురాళ్ళుగా భావించి ఇచ్చే బిరుదులు ఘంటసాలకు అనవసరం. 

ఈ శతాబ్దిలోనే కాదు మరెన్ని శతాబ్దాలైనా ఘంటసాల వంటి ఉత్తమగాయకుడు జన్మించడు. ఇది పొగడ్త కాదు. అతిశయోక్తి అంతకన్నాకాదు.

1960 లో  శ్రీకృష్ణరాయబారం అనే పౌరాణిక సినీమా వచ్చింది. పూర్తిగా తిరుపతి వెంకట కవులు వ్రాసిన పద్యాలతో తీశారు. పి.సూరిబాబు  రంగస్థల బాణీలోనే పద్య సంగీతం సమకూర్చారు. రఘురామయ్య, సూరిబాబుఅద్దంకి శ్రీరామమూర్తి, కాంతారావు, గుమ్మడిరాజనాల, మిక్కిలినేని మొదలగువారు ఈ సినీమాలో నటించారు.

ఈ సినీమాలో వున్న దాదాపు ఎనభై పద్యాలలో ఘంటసాల మాస్టారు ఓ పదిహేడు పద్యాలను అర్జునునికి, కర్ణునికి రంగస్థలనాటక బాణీని అనుసరిస్తూనే  అత్యంత శ్రావ్యంగా తనదైన ముద్రను కూడా ప్రస్ఫుటం చేస్తూ పాడారు. HMV లేబిల్ తో  వచ్చిన ఈ శ్రీకృష్ణరాయబారం పద్యాలు నాలుగైదు గ్రామఫోన్ రికార్డులుగా 'నెం.35, ఉస్మాన్ రోడ్రికార్డ్ ర్యాక్ లోవుండేవి.

1960ల తర్వాత, మూడు సొంత సినీమాల నిర్మాణం వలన కలిగిన నష్టాలనుండిఅప్పుల ఊబినుండి బయటపడడానికి ఘంటసాల మాస్టారు మరింత ఎక్కువ శ్రమించడానికి సిద్ధపడ్డారు. డబ్బింగ్ సినీమాలలో పాడడానికి సుముఖత చూపారు. విరివిగా కచేరీలు చేయడం ప్రారంభించారు.

ఆ దశలోనే  ఆనాటి ఆంధ్రదేశంలోని ఒక నాటకాల కంట్రాక్టర్ వరసగా తన  పౌరాణిక నాటకాలలో వేషం వేయడానికి, నాటకానికి ముందుగానో లేక మధ్య విరామ సమయంలోనో ఒక గంటగంటన్నర సంగీత కచేరీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఘంటసాల మాస్టారికి పౌరాణిక నాటకాలు కొత్తకాదు. బాల్యంలోనూ, విజయనగరంలో సంగీతశిక్షణ ముగించుకొని వచ్చిన తర్వాత ఒక నాటక సమాజం పెట్టి కొన్నాళ్ళు పద్యనాటకాలు వేసారు. ఆ అనుభవ దృష్ట్యా ఘంటసాలవారికి ఈ నాటకాలలో వేషం కట్టడం పెద్ద ఇబ్బందికరం కాలేదు. కృష్ణలీలలులో అకౄరుడుకృష్ణరాయబారంలో విదురుడు, సక్కుబాయిలో యోగి వంటి వేషాలు వేసేవారట. ఆ నాటకాలు చూడగలిగే వయసు నాది కాదు. 

కానీ, ఘంటసాల మాస్టారి ఈ రెండోసారి నాటకాలు చూసే అవకాశం మాత్రం నాకు లభించింది. ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలతో పాటూ మా బొబ్బిలి లో కూడా ఘంటసాలవారి కచేరీతో కూడిన నాటకం చూసే అదృష్టం నాకు కలిగింది. బొబ్బిలి చిన్న బజార్ లో వున్న ఒక  సాధారణ నాటక పెండేలు (శ్రీ వెంకటేశ్వరా హాల్ అనే జ్ఞాపకం)లో ఈ నాటక ప్రదర్శనలు అయాయి. ఈ నాటకాలలో షణ్ముఖి ఆంజనేయరాజు, పీసపాటి నరసింహమూర్తి, అద్దంకి శ్రీరామమూర్తి వంటి లబ్దప్రతిష్టులైన నటులెందరో పాల్గొన్నారు. మా బొబ్బిలికి ఘంటసాల రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.

ఆయన సరాసరి మా ఇంటికే రావడం ఒక సంచలనమే అయింది. మా ఇంటిలోనో రాత్రి భోజనాలు ముగించుకొని రెండు మూడు జట్కా బళ్ళలో చిన్నబజార్ లోని నాటకాల హాలుకు చేరుకున్నాము. ఘంటసాల కచేరీ, నాటకంలో వేషం అంటే జనాలకు కొదవా? చుట్టుపక్కల గ్రామాలవారంతా ఘంటసాలను చూడడానికివినడానికి తరలివచ్చారు. ఘంటసాలగారి కచేరీకి మానాన్నగారి హార్మోనియంతో పాటు ఒక తబలా, ప్లూట్క్లారినెట్ మాత్రమే ఆర్కెస్ట్రా అని గుర్తు.

ఆనాటి నాటకం 'కృష్ణరాయబారం' అనే గుర్తు. మాస్టారు విదురుడు. కొన్ని పద్యాలు వున్నాయి. ఇతర ప్రధానపాత్రలు ఎవరు వేసారో గుర్తులేదు. కానీ, భీముడిగా ఆకెళ్ళ అప్పారావు భాగవతార్ అనే ఆయన వేసారు. నిజంగా భీముడిలాగే వుండేవారు.

ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ నాటకానికి ముందా? విరామ సమయంలోనా అనే విషయం మీద కంట్రాక్టర్ కు , ప్రేక్షకులకు మధ్య ఒక చిన్నపాటి గొడవలు తలెత్తినట్లు విన్నాను.

నాటకం రాత్రి పది తర్వాత కావడం వలన, రాత్రి పన్నెండు తర్వాత హాలులో కుర్చీలో కూర్చొనే ఓ చిన్న కునుకు తీశాను.  మధ్యలో ఎవరో లేపారు, ఘంటసాల పద్యాలు పాడుతున్నాడులేవమని. సగం సగం నిద్రలోనే విన్నాను. విరామ సమయంలో మేము స్టేజ్ వెనక్కు వెళ్ళాము.

అక్కడ నేను ఊహించని వింత . కృష్ణుడు, దుర్యోధనుడు, ధర్మరాజు, భీముడుఅర్జునుడు మొదలైనవారంతా కిరీటాలు, గెడ్డాలు తో పంచెలు ఎగ్గట్టుకొని నేలమీద గొంతుకూర్చొని  చుట్టలుసిగరెట్లు కాలుస్తున్నారు. అక్కడ వాళ్ళు ఉపయోగించే మాండలిక యాసతో కూడిన భాష నాకు ఆశ్చరంవేసింది. ఇంతవరకూ అచ్చ గ్రాంధికంలో సమాసభూయిష్టమైన పద్యాలు పాడింది వీళ్ళేనా అని అనిపించింది. మొత్తానికి ఆ నాటకం పూర్తయేసరికి తెల్లారిపోయింది.

ఈ విధంగా ఘంటసాల మాస్టారి కాంట్రాక్టు నాటక ప్రదర్శనలు తెలుగునాట కొన్నాళ్ళు జరిగాయి.

ఘంటసాలవారి పద్యం చదివే తీరు ఇతర పౌరాణిక రంగస్థల నటుల కంటే భిన్నమైనది. పద్యంలో రాగంతీత కంటే రాగ లక్షణానికి, భాషకు, భావప్రకటనకు, గమకశుధ్ధికిశృతిశుధ్ధతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. పద్యం ఏ రాగంలో పాడినా ఆ రాగ స్వరూపం సంపూర్ణంగాజనరంజకంగా ఆ నిముషంరెండు నిముషాల పద్యంలో ఇమిడేలా పాడడం ఘంటసాలవారి గాన విశిష్టత.

ఈ విషయంలో తన మీద తమ గురుదేవులైన పట్రాయని సీతారామశాస్త్రి గారి ప్రభావం చాలా వున్నట్లు ఘంటసాలవారు తరచూ తమ ఉపన్యాసాలలో చెప్పేవారు. ఘంటసాలగారు తన బాణీ ఇతర రంగస్థల నటుల లేదా ఇతర సినిమా గాయకుల బాణీకి విరుధ్ధమైనదైనా, గాయకుడిగా తాను వారందరికన్నా ఉఛ్ఛస్థాయిలో వున్నా సాటి నట గాయకులపైన అమితమైన గౌరవం, మర్యాద కలిగివుండేవారు. తానే అధికుడననే అహంకారమో, దర్పమో ఘంటసాలవారిలో అసలు కనిపించేవి కావు. అందరిపట్లా చాలా వినయవిధేయతలతో ఉండేవారు. మంచి పాట ఎవరు పాడినా పక్షపాత బుధ్ధి లేకుండా విని ఆనందించమని, మంచి పాటను పెంచమని తన అభిమానులకు సందేశం ఇచ్చేవారు. అందుకేతెలుగునాట ఘంటసాలగారికి గాయకుడిగా ఎంత గౌరవముందో వ్యక్తిత్వంగల మనిషిగా కూడా అంత గౌరవమూ వుంది.

కర్ణాటక సంగీతంలో మహామహులుగా పేరుపొందిన ఎమ్.ఎల్.వసంతకుమారి, ఎన్.ఎల్.గానసరస్వతి, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణగార్లకు తాను సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలో పాడే అవకాశం కల్పించి  వారిపట్ల తనకు గల గౌరవాన్నిఅభిమానాన్ని చాటుకున్నారు.

అలాగే రంగస్థల నటగాయకులైన కె.రఘురామయ్యకు వాల్మీకి చిత్రంలో నారదపాత్రలో పాడే అవకాశం కల్పించారు. శ్రీకృష్ణ కుచేలలో సి.ఎస్.ఆర్ కు, అద్దంకి శ్రీరామమూర్తిగారికి పాడే అవకాశం కల్పించారు. ధర్మరాజు పాత్రధారి అద్దంకి శ్రీరామమూర్తిగారు పాడవలసిన పద్యాలను ఘంటసాలవారు ఆయనచేతే పాడించారు. రాగనిర్దేశంస్వరరచన స్వేచ్ఛ వారికే ఇచ్చారట. ఈ సందర్భంలో అద్దంకి  శ్రీరామమూర్తి గారు దర్బార్ రాగంలో  ఒక పద్యం సెట్ చేశారట. అయితే ఆ రాగ స్వరప్రయోగ విషయంలో చిన్న అభ్యంతరాలని సంగీత సహాయకుడిగా మా నాన్నగారు (పట్రాయని సంగీతరావు) సూచించడంతో అద్దంకి శ్రీరామమూర్తిగారు "ఇక్కడ (సినీమావాళ్ళలో)  సంగీతం గురించి తెలిసినవాళ్ళు కూడా ఉన్నారా బాబూ!" అని వ్యాఖ్యానించి, తర్వాత తన పద్యాన్ని తగురీతిగా మార్చి పాడారట. సి.ఎస్.ఆర్. కుచేలుడి పాత్రకి పాడిన 'నిలుపన్ జాలను నెమ్మనమ్ము' పద్యం ఘంటసాలగారు తిరిగి పాడిన రికార్డింగ్ సందర్భాన్ని కూడా ఘంటసాలవారి సంగీతం గురించిన వ్యాసాలలో  పట్రాయని సంగీతరావుగారు పేర్కొన్నారు. సహగాయనీగాయకుల యడల ఘంటసాలగారి వినమ్రభావం ఆ సంఘటన స్పష్టం చేస్తుంది. ఘంటసాలగారి పద్యపఠన శైలి వైశిష్ఠ్యం, నాటక పద్యశైలికి దానికీ ఉన్న వైరుధ్యం గురించి సంగీతరావుగారి మాటల్లో ఇక్కడ వినండి.




మొత్తానికి అన్ని వర్గాలవారిని ఆకట్టుకొని వారి ప్రేమాభిమానాలు పొందిన విలక్షణ గాయకోత్తముడు మన ఘంటసాల.

💥కొసమెరుపు💥

రాజీ! (ఘంటసాల మాస్టారు సావిత్రమ్మగారిని రాజీ అనే పిలిచేవారు) ఇవేళ తలనొప్పిగా వుంది. సాయంత్రం పనిలేదు. పడుక్కుంటాను. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూడు'.

"అలాగే. మీరు రెస్ట్ తీసుకోండి."

మరో రెండు రోజుల తర్వాత అదే సాయం సమయాలలో "రాజీ! కాళ్ళు తెగమంటలు పుడుతున్నాయి. ఆ కిష్టిగాడిని నా కాళ్ళకు కొంచెం నూనె రాయమని చెప్పు.

"అలాగే చెపుతాను".

మరో రోజు సాయంత్రం కూడా మాస్టారికి చెవినొప్పి వచ్చింది.

అప్పటికి సావిత్రమ్మగారికి ఘంటసాల మాస్టారి నొప్పులకు కారణం అర్ధమయింది. ఆయనకు వచ్చినవి నిజమైన నొప్పులుకావు 'పెళ్ళిచేసిచూడు'లో మాస్టర్ కందా మోహన్" అమ్మా నొప్పుల" బాపతని. వారానికి రెండు మూడు రోజులు వచ్చే హిందీ మాస్టర్ బారినుండి తప్పించుకోవడానికే కాళ్ళనొప్పులు, తలనొప్పులు కొనితెచ్చుకునేవారు. LKG పిల్లవాడి తంతు.

అనేక వ్యాపకాల మధ్య, అంత వయసు వచ్చాక, ఏ ఆసక్తిలేకుండా కొత్తగా హిందీ నేర్చుకోవడం ఎందుకని ఆయన భావన. చూస్తూ చూస్తూ ఇంటికి వచ్చే పేద బ్రాహ్మడిని రావద్దని చెప్పడానికి ఘంటసాలవారికి మనసొప్పేది కాదు. ఎవరి ప్రేరణతో, ఏ కారణంతో హిందీ నేర్చుకోవాలనుకున్నారో నాకు తెలియదు కానీ, ఆ హిందీ చదువు ఎక్కువ రోజులు సాగలేదు. మాస్టారికి బదులు అమ్మగారు పలకా బలపం పట్టుకొని హిందీ మాస్టర్ ఎదుట కూర్చోనేవారట. అదీ కొన్నాళ్ళ ముచ్చటే. తర్వాతఅమ్మగారికీ తలనొప్పి, కడుపునొప్పి రావడం మొదలయింది. 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో హిందీ భాషాభివృధ్ధికి బ్రేక్ పడింది.

 

💐ఈ ఉదంతంలోని విషయం మాత్రం ఘంటసాల సావిత్రమ్మగారి పుస్తకంలోనిది. కథనంభాష మాత్రం నావే.

ఈ చిన్న విషయం ద్వారా నేను చెప్పదల్చినదేమంటే ఘంటసాలవారు చాలా సున్నిత మనస్కులు. ఎవరినీ ఏ విధంగానూ నొప్పించకూడదనే పసిపిల్లవాడి మనస్తత్త్వం కలవారు. తనకు హిందీ నేర్చుకోవడంపట్ల ఆసక్తి లేదనిఅందువల్ల రావద్దని ఆ హిందీ మాస్టరుగారి ముఖంమీదే స్పష్టంగా చెప్పలేకపోయారు.

(నా జ్ఞాపకాలలో లేని, లేదా తెలియని అనేక విషయాలలో ఈ హిందీ కథ ఒకటి. బహుశా నేను మద్రాస్ లో లేనప్పడు జరిగిన విషయం కావచ్చు. అందుకే సావిత్రమ్మగారికి కృతజ్ఞతాభివందనాలతో....)

మరికొన్ని "నెం.35, ఉస్మాన్ రోడ్" జ్ఞాపకాలతో వచ్చే వారం...

                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

6 comments:

P P Swarat said...

నాన్నగారి వ్యాఖ్యానమే ఈ ఎపిసోడ్ కు ముఖ్యాకర్షణ. ధన్యవాదాలు.

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి. చాలా ఓపికగా వివరస్తున్నారు

ameerjan said...

ఈసారి మీ ఎపిసోడ్...జనాకర్షక సంగీత ధోరణులతో మొదలుపెట్టి....కొసమెరుపుగా....ఇష్టం లేని పనులు ఇష్టం లేదని చెప్పడంలో మాస్టారి మొహమాట ధోరణిని మీ హాస్యోక్తులతో చెప్పడం బావుంది. మాస్టారు ఎంత సున్నిత మనస్కులో...మనకందరికీ ఎన్నో సందర్భాలుగా విని తెలుసుకుని వున్నా....మీరు ఈనాటి ఎపిసోడ్ లో అనేక ఉదంతాలని ఉటంకిస్తూ...పాఠకుల మనసుల్లో మాస్టారి సౌశీల్యాన్ని, సున్నితమైన మానసిక స్థితిని మరింతగా ముద్రించేశారు. అలాగే....అలనాటి నాటకరంగ మార్తాండుల గురించి చెప్పడం మమ్మల్నీ బాల్యంలో నాటక పద్యాలను గుర్తుకు తెచ్చింది. ఆడియోలో మాస్టారి పద్య శైలిని వివరిస్తూ....పనిలో పనిగా...నాటకాలకు, సినిమాలకు గల వైరుధ్యాన్ని మాస్టారు ఎంత ప్రభావశీలంగా విశిష్ట శైలిని ఏర్పరచుకున్నారో....శ్రీ సంగీత రావు గారి విశ్లేషణాత్మక వివరణ అత్యద్భుతంగా.....విజ్ఞానభరింతంగా సాగింది! ధన్యవాదాలు శ్రీ స్వరాట్ గారు!🙏🙏

P P Swarat said...

ధన్యవాదాలు.

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

మరో అద్భుతమైన సంచిక.....

ఎవరినీ నొప్పింపని ఘంటసాల మాస్టారు గారి సున్నితమైన మనస్తత్వం గురించి....

ఘంటసాల గారికి ముందు & ఘంటసాల గారి రాక తర్వాత నాటకాలలోనూ, సినిమా లలోనూ పద్య పఠనం లో వచ్చిన మార్పుల గురించి..... చాలా చాలా వివరంగా తెలియబరిచారు.... ఎపిసోడ్ చివర్లో సంగీతరావు గారి విశ్లేషణాత్మక వ్యాఖ్యానం చాలా అమోఘం గా ఉంది స్వరాట్ బాబాయ్ గారూ....👌👌👌👌👌👏👏👏👏👏😊🙏🙏😊💐💐😊

ఇంత ఓపికగా ఘంటసాల మాస్టారు గారి గురించి మాతో మీ జ్ఞాపకాలని పంచుకుంటున్నందుకు మరోసారి మనసారా కృతజ్ఞతాభివందనాలు మరియు హార్ధిక ధన్యవాదములు ..... తరువాత సంచిక కోసం ఎప్పటిలాగే ఆసక్తిగా నిరీక్షిస్తూ ఉంటాము బాబాయ్ గారూ 🙏🙏

P P Swarat said...

మీకు నా ధన్యవాదాలు.