visitors

Friday, October 30, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నాలుగవ భాగం

30.10.2020 - శుక్రవారం భాగం - 4*:
అధ్యాయం 2  భాగం 3 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

రంగయ్యర్ స్ట్రీట్ లో వున్నప్పుడే, మా నాన్నగారు ఒకసారి నన్ను మాత్రం ఘంటసాలవారింటికి వెళ్ళి ఆయనకు పళ్ళు, పువ్వులు ఇచ్చిరమ్మని పురమాయించారు. ఎందుకో తెలియదు. కానీ, యిప్పుడనిపిస్తోంది, ఆరోజు ఘంటసాలవారి పుట్టినరోజు డిసెంబర్ 4 అయ్యుండచ్చు. అంతేకాకుండా, నేను స్వతంత్రంగా బయటకు వెళ్ళి పనులు చేసుకురావడం అలవాటు చేసుకోవాలనే ఉద్దేశమైనా కావచ్చు. ఆరోజు ఉదయాన్నే వెళ్ళి ఘంటసాలవారికి పళ్ళు‌, పువ్వులు ఇవ్వడానికి బయల్దేరాను. శుభ్రమైన తాజా పళ్ళు, పువ్వులు రంగనాధన్ స్ట్రీట్ పక్కనున్న 'శివ-విష్ణు' కోవెల దగ్గర పెట్టుకొని అమ్ముతూంటారని అక్కడికి వెళ్ళి కొనమని సూచనలిచ్చారు. ఆ శివ-విష్ణు ఆలయం టి.నగర్ బస్ స్టాండ్ దగ్గరగా ఉంటుంది. మా ఇంటి సందు చివర ఉత్తర దక్షిణాలకి మెయిన్ రోడ్డు - ఉస్మాన్ రోడ్ దగ్గర ఎడమవేపు వెళితే నెం.35, ఉస్మాన్ రోడ్ ఘంటసాలవారి స్వగృహం. కుడి వేపుకు వెళితే టి.నగర్ బస్ స్టాండ్. ఆ కోవెలను వెతుక్కుంటూ వెళ్ళాను మంచి అరటి పళ్ళు కోసం. సమయం ఉదయం 7-8 గంటల లోపు. ఆ రోజుల్లో, ఉస్మాన్ రోడ్ కు రెండువైపులా దట్టమైన చెట్లు వాటి మధ్యనుండి సన్నగా ప్రసరించే సూర్యకిరణాలతో, సుమారు ఐదు మైళ్ళ దూరాన ఉన్న సముద్రం మీద నుండి వీచే చల్లని గాలులతో, కొంచెం దూరాన కనిపించే శివ-విష్ణు ఆలయంనుండి వినవచ్చే ఘంటానాదంతో, సమీపానవుండే దుకాణాల దగ్గర అమ్మకానికి పెట్టిన పువ్వులు, అగరొత్తుల సుగంధ పరిమళాలతో ఆ ఉదయపు వాతావరణం ఇప్పటికీ నా కళ్ళముందు మెదులుతూనే వుంటుంది. 

రంగనాధన్ స్ట్రీట్ ముందునే వున్న 'నాధన్స్ కేఫ్', దానికి ఎదురు ప్లాట్ ఫారమ్ మీద వున్న 'శ్రీ దేవీ హోటల్' ల నుండి వచ్చే ఫిల్టర్ కాఫీ పరిమళాలు కాఫీ ప్రియులను ఉత్తేజపర్చి రారమ్మని ఆహ్వానిస్తూంటాయి, ఆ హోటల్స్ లోని రేడియోలలో వచ్చే భక్తిగీతాల నడుమ. అసలు, తెల్లవారుజామున రైల్లో మెడ్రాస్ పరిసరాలు తండియార్పేట, కొరుక్కుపేట స్టేషన్ల కు వచ్చేసరికి ముందుగా స్వాగతం పలికేది అప్పటికే తెరవబడిన సమీపంలోని హోటల్స్ నుండి వీచే శ్రేష్టమైన ఫిల్టర్ కాఫీ పరిమళమే. ఆనాటికి ఇంకా మద్రాసు నగరానికి వచ్చేవారికి స్వాగతం పలికే కూవమ్, అడయార్ నదులు వాటికి అనుసంధానంగా సెంట్రల్ స్టేషన్ ఆనుకుని ప్రవహించే బకింగ్ హాం కాలువలు దుర్గంధభూయిష్టం కాలేదు కనుక. ఆనాటికి బకింగ్ హాం కాలువలో ప్రవాహం ఉండేది. విజయవాడ దాకా పడవలలో కట్టెలు, ఉప్పు ఇతర వస్తువుల జలరవాణా ఉండేది. అర్బనైజేషన్ ఫలితంగా చెఱువులు, నదీతీరాలని మింగేసి వర్షాకాలంలో మానవ ఆవాసాలను చెఱువులు, కాలువలు, నదులుగా మార్చేసే భూబకాసురులను తయారుచేసిన రాజకీయం మొదలవలేదప్పటికింకా. 

మొత్తానికి ఫిల్టర్ కాఫీతోనే మెడ్రాస్ కు తెల్లవారుతుంది (నిజానికి నాకు టీ, కాఫీల వ్యసనం లేదు. పాలంటే అసలే పడదు). 

మెడ్రాస్ లో లోకల్ ట్రైన్స్ ఇటు బీచ్ నుండి, అటు తాంబరం నుండీ ఉదయం నాలుగు గంటలకే బయల్దేరుతాయి. షిఫ్ట్ లు ఎక్కే, దిగే ఫ్యాక్టరీల కార్మీకులు, ఉద్యోగులు, హోల్ సేల్ కొత్వాల్ బజార్లో కూరలు, ఫ్లవర్ బజార్లో పువ్వులు అమ్మకానికి కొనుక్కునే చిల్లర వ్యాపారస్తులతో అంత ఉదయాన్నేకూడా లోకల్ ట్రైన్స్ నిండుగానే వుండేవి.  తెల్లారేలోపే ప్రతీ ఇంటి ముంగిటా చక్కటి ముగ్గులు పెట్టే అరవ మామిలు దర్శనమిచ్చేవారు. దుకాణాలన్ని ఏడింటికే తెరిచేసేవారు. వీరందరికీ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించేది పరిమళభరిత ఫిల్టర్ కాఫీయే. భేష్ భేష్.

సంస్కృతీ సంప్రదాయాలకు, కళలకు, సంగీత సాహిత్య గోష్టులకు నిలయం మద్రాసు మహానగరం అని ఇక్కడి తెలుగువారు కూడా గర్వంగా చెప్పుకుంటారు. పేదవారు, మధ్య తరగతి వారు, లక్షాధికార్లు, కోటీశ్వరులు,  యిలా అన్ని తరగతులవారు బ్రతకడానికి తగిన  ఆశ్రయమిచ్చే మహానగరం మెడ్రాసే అని అనేవారు. మెడ్రాస్ జీవితానికి అలవాటు పడినవారు చచ్చినా ఈ వూరు వదిలిపెట్టరని ప్రముఖ రచయిత్రి 'ప్రమదావనం' మాలతీ చందూరు గారు అనడం నేను స్వయంగా విన్నాను. ఆ విధంగానే చందూరు దంపతులు చివరి వరకూ మద్రాస్ మహానగరంతోనే మమేకమై ఉండిపోయేరు. ఆనాటి స్థితిగతులు అన్నీ ఈనాడు కానరాకున్నా, కొన్ని మంచి పాత వాసనలు 'చెన్నై మానగరా'న్ని ఇంకా అంటిపెట్టుకుని వున్నాయి. 

'శివ-విష్ణు' ఆలయం దాకా వెళ్ళనక్కరలేకుండానే మధ్యలోనే రామనాధన్ స్ట్రీట్ సమీపంలో ఒక తోపుడుబండి మీద శ్రేష్టమైన అరటిపళ్ళ పెడలు పెట్టి కనిపించాయి. నాకు తాజాగా అనిపించిన పళ్ళను కొని చేతిలోని డబ్బులను వాడిముందు చాచాను. ఎంత ఏమిటి అని బేరాలాడడానికి భాష తెలియదు. ఆ బండివాడే తనకు రావలసిన డబ్బులు నా చేతిలోంచి తీసుకున్నాడు. ముప్పావలా. 

నేను కొన్నఖరీదైన అరటిపళ్ళను అరవంలో 'మలవాళపళం' అంటారు. ఆ అరవ బండివాడు అలాగే అరుస్తున్నాడు. కాని అసలైన ఆ అరవ పదాన్ని పలికే పద్ధతి తర్వాత తెలిసింది. అరవ భాష ప్రత్యేకత ఆ '''' కార శబ్దంలో ఉంది. అది వినడానికి అలవాటుపడి కొంత సాధన చేస్తేకాని పట్టుబడదు. నిజానికి అరవలలో కూడా ఆ శబ్దం పలుకు పట్టుబడని వారున్నారు. తెలుగులో కూడా ఈ శబ్దానికి ఒక సంకేతాక్షరం - బండి ఱ రూపంలో ఉండేదని కాలక్రమంలో దాని అవసరం పోయి కనుమఱుగై పోయిందంటారు. ప్రస్తుతం మన టీవీ వ్యాఖ్యాతల ధర్మవాఁ అని కాలక్రమంలో ణ, ళలకి  కూడా అదే గతి పడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంగ్లీషు F కి సమానంగా తెలుగులో అక్షరం లేదు ఆ శబ్దంతో మనకి పదాలూ లేవు. అంచేత Fruit అన్న పదంలో మనం Fకి సమానంగా ఫ వాడతాం, ఫ్రూట్ అని రాస్తాం అవసరమైనప్పుడు. కానీ అదే అలవాటుగా మార్చుకుని ఫ అన్న అక్షరం వచ్చే తెలుగు పదాలని ఇంగ్లీష్ F శబ్దానికి సమనంగా పలుకుతూ ఫలం లాంటి పదాలను Faలం, ప్రతిఫలానికి ప్రతిFaలం అనే వారూ తయారయేరు.  మరలాంటప్పుడు తెలుగు కీ బోర్డ్ లో  ழ  అనే అక్షరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని అంతలా  నిరసించడం ఎందుకో అర్థం కాదు. అది ఏ విధంగా తెలుగు భాషకి వినాశనకారో భాషావేత్తలకే  తెలియాలి. 

తమిழ், అన్బగన్, కనిమొழி   లాంటి పదాలలోని శబ్దం ళ కాదు అది మరొకలా పలకాలన్నది, కార అక్షరం గాని, దానికి సమానంగా గతంలో తెలుగులోనే ఉండిన అక్షరాన్నిగాని, కీ బోర్డ్ లో అందుబాటులో పెడితే  జిజ్ఞాసువులైన ఇతర భాషలవారు తెలుసుకోడానికి వీలుగా ఉండేది. కానీ మన భాషావేత్తలు అలా ఆ ழ అక్షరం కీ బోర్డ్ లోకి చేర్చినంత మాత్రానే తెలుగు లెస్స కాదు లెస్ అయిపోతుందని ఎందుకనుకున్నారో మరి. 

సరే, ఇంతకీ నేను కొన్నది  'మలైవాళపళం' కాదు మలైవామ్. చాలా రుచికరం. మిగతా అరటిపళ్ళ కన్నా ఆరోగ్యకరమట, ముఖ్యంగా, డైబిటిస్ పేషంట్లకి. ఆ పళ్ళతొక్కలు కూడా తినాలని కొందరు సలహా ఇచ్చారు!

సరే, ఆ పళ్ళను ఒక చేతి సంచిలో పెట్టుకొని నార్త్ ఉస్మాన్ రోడ్ లోని ఘంటసాలవారింటికి వెళ్ళడానికి వెనుదిరిగాను. అసలు, నాన్నగారేమంటారోనని ఘంటసాలవారింటికి వెళ్ళడానికి సిద్ధపడ్డానుకాని, అక్కడ ఎవరుంటారో ఏం అడుగుతారో నేనేం చెప్పాలోనని ఒకటే భయం, గుండె దడ. నాకెందుకీ బెడద పెట్టారో అని దిగులు. సుమారు పది నిముషాల నడక తర్వాత ఆ ఇంటి ముందున్నాను. ఇంటిముందు ఒక పిట్టగోడకు ఎడమ‌, కుడివేపుల నలుపలకలుగా రెండు  స్తంభాలు. వాటి మధ్య ఇనపగేటు. దానికి ఎడమవేపు తెల్లటి మార్బుల్ రాతిమీద 'ఘంటసాల' అని తెలుగు, ఇంగ్లీష్ లలో నల్లటి అక్షరాలు. కుడివేపు గుండ్రటి నల్లటి  పెయింట్ మధ్య '35'. అదే తూర్పుముఖంగా చాలా గంభీరంగా, పాత తరహా రాజభవనంలా ఎత్తుగా ఉన్న 'నెం.35, ఉస్మాన్ రోడ్'.

మొట్టమొదటిసారి ఒంటరిగా ఎవరి తోడు లేకుండా  కాళ్ళు వణుకుతుండగా భయం భయంగా లోపలికి అడుగుపెట్టాను. నిజానికి ఆ భయానికి అర్ధంలేదు. అయినా ఎందుకంటే ఏం చెప్పలేను. ఆ ఇంటి బాల్కనీ గోడమీద నడుం మీద చేతులు పెట్టుకుని ఎడమవేపుకి తల పైకెత్తి నిలుచుని ఉన్న స్త్రీ మూర్తి విగ్రహంతో ఆ ఇల్లు చాలా ఆకర్షణీయంగా కనిపించింది. నేను 1955లో మొదటిసారి చూసినప్పుట్నుంచి మరో పది పదిహేనేళ్ళు ఆ ఇంటి స్వరూపం మారలేదు.

1955 లో మొదటిసారి నేను చూసిన ఘంటసాలగారిల్లు

మేడ మీది ఆరుబయలు ప్రదేశాన్ని బాల్కనీ అంటారని అప్పుడే తెలుసుకున్నాను. గేటు దాటి కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక పెద్ద నల్లటి కారు కనిపించింది. అలాటి నల్లటి కారు బొబ్బిలిలో రాణీగారు వెళుతూండగా చూశాను. అది ఎప్పుడు చూసినా తళతళ మెరుస్తూ కొత్తదిగా వుండేది. ఈ కారు పాతదిగా మరో రకంగా ఉంది. ఆ కారు పక్కన ఒక సన్నపాటి సిమెంట్ అరుగు. దాని వెనక సిమెంట్ నేలతో కొంత ఖాళీ స్థలం. అక్కడే కారు నిలుపుతారట. అలాటి స్థలాన్ని పోర్టికో అని తెలుసుకున్నాను. పొడుగుపాటి మూడు మెట్లు ఎక్కాక, ముదురాకుపచ్చ మీద తెలుపు నలుపు రంగుల చుక్కలున్న మొజైక్ ఫ్లోరింగ్ తో అడుగు, అడుగున్నర ఎత్తులో వరండా. అలాటి ఆకర్షణీయమైన ఫ్లోరింగ్  తరువాత మరెక్కడా నేను చూడలేదు. (నేను సొంతిల్లు కడితే అలాటిదే అలాటి ముదురాకుపచ్చ, తెలుపు, నలుపు కలసిన ఆ ఫ్లోరింగ్ నే వేయించాలని కలలు కన్నాను. ఇల్లైతే కట్టగలిగాను కానీ, అలాటి ఫ్లోరింగ్ కు నోచుకోలేదు.) ఎడమచేతివేపు ఒక కిటికి అక్కడ ఒక నలుగురు మనుషులు కూర్చునేలా పెద్ద కర్రబల్ల. ఎదురువేపు కిటికీ ముందు రెండు కుర్చీలు. పోర్టికోలో నిల్చొని తీసివున్న వీధి తలుపు ద్వారా లోపలికి చూస్తున్నాను ఎవరైనా కనిపిస్తారేమోనని. మనిషి అలికిడేలేదు. పోర్టికోకు రెండువేపులా సందులున్నాయి ఇంటి వెనకవేపుకు వెళ్ళడానికి. మెయిన్ డోర్ తెరిచే ఉంది. ఎక్కడా ఎవరూ కనబడలేదు. ఎటునుండి లోపలకు వెళ్ళాలో, ఎలా పిలవాలో తెలియక నిలబడి చూస్తూన్నాను. కొంతసేపటికి, వెనక పెరటివేపు ఒకావిడ కనిపించారు. నన్ను లోపలికి రమ్మని సంజ్ఞ చేశారు. అంతా గాభరా, కంగారుగా అనిపించింది. అక్కడెవరిని చూశాను, ఎంతమందిని చూశానో తెలియదు. మా నాన్నగారు ఈ పళ్ళు ఇవ్వమని చెప్పారని చెప్పి సంచీలోని పళ్ళు అక్కడ పెట్టేసి, వెనక్కి తిరిగి చూడకుండా బయటకి పరుగులంకించుకున్నాను. అప్పుడు అక్కడెవారున్నరో, ఏం అడిగారో నేనేం చెప్పానో నాకు తెలియదు. ఘంటసాలగారూ అక్కడే ఉన్నారో ఏమో, చూశానో లేదో కూడా తెలియదు. పెద్ద భారం దింపినంత హాయిగా అనిపించింది. రోడ్ మీదకు వచ్చేసాక. మరోసారి 'ఘంటసాల' పేరున్నమార్బల్ పలకని, '35' నెంబర్ ను చూశాను. అదీ నా మొదటి నెం.35, ఉస్మాన్ రోడ్', ఘంటసాలవారింటి అనుభవం.

ఈసారి ఇంటికి వెళ్ళేప్పుడు దక్షిణం వేపునున్న  ఉస్మాన్ రోడ్ కు  రెండు పక్కలా ఉన్న వీధుల పేర్లు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాను. అప్పట్లో ప్రతీ వీధి ముందు, చివర ఒక ఆరడగుల సిమెంట్ స్తంభం మీద సిమెంట్ పలక, దానిమీద సిమెంట్ తోనే వీధి పేర్లు ఇంగ్లీష్ లో వుండేవి. మొదట్లో వాటిని చదవడానికి కష్టంగానే వుండేది. ఘంటసాలగారింటికి ఎదురుగా 'వ్యాసారావు స్ట్రీట్' (ఆ వీధికి చాలా ప్రాశస్త్యం వుంది. ఆ విషయాలు తరవాత మరోసారి), ఆ వీధి తరవాత దక్షిణం వేపు, అంటే, పనగల్ పార్క్ మా ఇంటికెళ్ళే వేపు వరసగా 'మురుగేశ మొదలియార్ రోడ్', 'కోట్స్ రోడ్', 'నాదముని స్ట్రీట్', 'గోవిందన్ స్ట్రీట్, 'ప్రకాశం రోడ్' ఆ తరవాత పనగల్ పార్క్ ఉన్నాయి. గోవిందన్ స్ట్రీట్ ప్రకాశం రోడ్ మధ్య బర్మాషెల్ పెట్రోల్ బంక్. ఇక, ఘంటసాలగారింటి వరసలో దక్షిణాన మొదట నాదన్ స్ట్రీట్ ఎదురుగా 'వాసన్ స్ట్రీట్', గోవిందన్ స్ట్రీట్ ఎదురుగా 'గ్రిఫిత్ రోడ్', RKM శారదా విద్యాలయ గర్ల్స్ హైస్కూల్,  స్కూల్ కు ఎదురుగా విశాలమైన పచ్చటి చెట్లతో పానగల్ పార్క్. అది ఒక ఐదురోడ్ల జంక్షన్. పనగల్ పార్క్ కి పశ్చిమాన ఉస్మాన్ రోడ్, ఉత్తరాన 'ప్రకాశం రోడ్', దక్షిణాన 'నాగేశ్వరరావు పంతులు రోడ్'. పార్క్ కి ఎదురుగా తూర్పున RKM Main Boys' హై స్కూల్. హై స్కూలు కి ఆగ్నేయంగా  'వెంకట నారాయణ రోడ్'. స్కూలునానుకుని పానగల్ పార్క్  ఎదురుగా తూర్పున పాండీబజార్ (సర్ త్యాగరాయ రోడ్). దానికి ఈశాన్యంగా 'జి.ఎన్ చెట్టి రోడ్' (అంటే గోపతి నారాయణస్వామి చెట్టి రోడ్). ఈ మూడు రోడ్లు ఓ రెండు మూడు మైళ్ళు దూరాన వుండే మౌంట్ రోడ్(ఈనాడు 'అన్నాసాలై') తో కలుస్తాయి. అలాగే పార్క్ కు దక్షిణాన వున్న ఉస్మాన్ రోడ్ కూడా సైదాపేట్ దగ్గరి మౌంట్ రోడ్ లో కలుస్తుంది. పార్క్ దగ్గర ఉస్మాన్ రోడ్ లోనుండి దక్షిణం వేపు వెడుతూంటే 'దొరైసామి రోడ్'. అది దాటాక సలామ్ స్టోర్స్ , రామన్స్ కాఫీ పౌడర్ షాప్. అక్కడే పారీస్ వేపు, ట్రిప్లికేన్ కు వెళ్ళే బస్ స్టాప్.  మంగేష్ స్ట్రీట్', దానికెదురుగా 'పింజాల సుబ్రహ్మణ్యం స్ట్రీట్'. ఇక్కడే రాఘవన్ 'నెయ్యి కడై' బస్ స్టాప్. పారీస్ నుండి వచ్చే బస్సుల స్టాపింగ్. 'రంగయ్యర్ స్ట్రీట్', ఎదురుగా 'రామస్వామి స్ట్రీట్',  'రామనాధన్ స్ట్రీట్', ఎదురుగా మోతీలాల్ స్ట్రీట్', 'రంగనాధన్ స్ట్రీట్', అది దాటాక టి.నగర్ బస్ స్టాండ్ .అక్కడ ఎదురుగా బర్కిట్ రోడ్. టి.నగర్ బస్ స్టాండ్ నుండే పారీస్ కార్నర్ కు వెళ్ళే 9,10,11, బస్సులు ఐస్ హౌస్ వేపు వెళ్ళే 12 నెంబర్, ట్రిప్లికేన్ వెళ్ళే 13 నెంబర్ బస్ లు బయల్దేరుతాయి.

ఇలా,  దక్షిణ ఉస్మాన్ రోడ్ లోని ఎదురుబొదురు వీధులన్నీ చూసుకుంటూ నడవడంలో మేముండే రంగయ్యర్ స్ట్రీట్ ను దాటి ముందుకు వెళ్ళిపోయిన సంగతి టి.నగర్ బస్ స్టాండ్ ప్రాంతాలకు వెళ్ళాకగానీ తెలియలేదు. మళ్ళా వెనక్కి తిరిగి ఒక్కో వీధి పేరు చూసుకుంటూ రంగయ్యర్ స్ట్రీట్ ను పట్టుకొని ఎలాగో ఇంటికి చేరుకున్నాను.

ఆనాటికి త్యాగరాయనగర్ (టి.నగర్) లో పెద్ద పెద్ద భవంతులతో పాటు పక్కవీధులలో మధ్యతరగతి ఇళ్ళూ ఉండేవి. వీధులన్నీ వరసగా క్రమపద్ధతిలో వుంటూ విశాలమైన ప్రాంగణాలతో అంత జన సమ్మర్దం లేకుండా ప్రశాంతంగా వుండేది. పానగల్ పార్క్ దక్షిణాన ఎన్ని వీధులుండేవో అలాగే ఘంటసాలగారింటి ఉత్తరం వేపూ ఉండేవి. అది విజయా వాహినీ స్టూడియోలకి వెళ్ళే దారి, కోడంబాకం రైల్వే గేటు దాటి వెళ్ళాలి. ఉత్తర దిక్కుకి మాత్రం నేను వెళ్ళలేదు. 

నార్త్ ఉస్మాన్ రోడ్ పూర్తిగా నివాస గృహాలు. దక్షిణాన మార్కెట్లు. ఏ విధమైన షాపింగ్ చేయాలన్నా పానగల్ పార్క్ దాటి రంగనాధన్ స్ట్రీట్ కు వెళ్ళాలి. ఆ వీధి చివరనే మాంబళం రైల్వే స్టేషన్. స్టేషన్ కు అవతల వేపు పాత మాంబళం. మేముండేది కొత్త మాంబళం లేదా త్యాగరాయనగర్ . ఒకసారి ఈ టి.నగర్ ఎంత పెద్దది అని అడిగితే  మా నాన్నగారు "మన విజయనగరం కంటే పెద్దదే" అన్నారు. ఇలాటి టి.నగర్ లు ఎన్నో కలిసిన నగరం మెడ్రాస్ అని, అదొక మహానగరమని చెప్పారు.

ఎవరైనా అరవం మాట్లాడుతుంటే అది అరవభాష అని తెలుసుకునే స్థితికి ఎదిగాను. కానీ వారి మాటలైతే అర్ధమయేవికాదు. తెలుగువారి సంఖ్య వల్ల, వారి ప్రభావం వల్ల చాలామంది మద్రాసులోని చాలామంది అరవవాళ్ళకు తెలుగు అంతో ఇంతో తెలిసి ఉండేది. జట్కావాళ్ళు రిక్షావాళ్ళు తెలుగు మాట్లాడకపోయినా బాగానే అర్ధం అయేది. అందువల్లే ఆంధ్రనుంచి వ్యాపారం, కోర్టు పనులమీద వచ్చిన తెలుగువారికి వారి దైనందిన కార్యక్రమాలకి భాష వలన పెద్దగా ఆటంకం ఉండేది కాదు.  

మెడ్రాస్ లో ప్రతీ వందమందిలో ఏభైమంది తమిళులైతే, ముఫ్ఫైమంది తెలుగువారు. మిగతా ఇరవై ఇతర భాషలవారు. అయితే మెడ్రాస్ లో తరతరలుగా స్థిరపడి ఉన్న తెలుగువారి తెలుగు మాట అర్ధమవడం కష్టమయేది. అది ప్రశస్తమైన అరవ తెలుగు. 

ఘంటసాలగారు మన తెలుగువారికి మాత్రమే కాదు తమిళులకు కూడా అభిమానపాత్రులే. అప్పటికే విడుదలైన లైలామజ్ను, పాతాళభైరవి, దేవదాసు తమిళ సినీమాల పాటల ద్వారా 'కండసాల' (ఘంటసాల) తమిళ శ్రోతల మనసులలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.



నేను ఘంటసాలవారింటికి వెళ్ళి వచ్చిన కొన్ని రోజులకు, వారింట్లో చూసినావిడ  ఎవరినో తోడు తీసుకొని మా ఇంటికి వచ్చారు. వీధిలో అల్లంత దూరాన్నే వారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మగారికి చెప్పాను. వాళ్ళున్నంతసేపు నేను ఇంటిలో అడుగుపెట్టలేదు, ఆడవాళ్ళంటే వుండే మొహమాటంవల్ల.  మా కాంపౌండ్ లోని చెట్టుక్రింద చప్టామీదే కాలక్షేపం చేశాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లోకెళ్ళాను. ఆవిడ ఘంటసాలవారి తమ్ముడు భార్యట. ఆవిడను చూస్తే మా శారదక్క (దొడ్డమ్మగారి అమ్మాయి) గుర్తుకు వచ్చింది. నిజానికి ఇద్దరి మధ్యా ఏ పోలికలు లేవు. అయినా నాకలా అనిపించింది. బహుశా, సమాన వయస్కులు కావడం వల్లనేమో. 

మా నాన్నగారు నన్ను మళ్ళీ స్కూల్ లో చేర్పించి చదివించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.1956 జూన్ వరకు స్కూలులో చేరే అవకాశంలేదు. ఈలోగా అందుకు కావలసిన శిక్షణ ఇవ్వడానికి నన్ను తన స్నేహితుడైన ఆంధ్రాబ్యాంక్ విశ్వనాధం గారికి అప్పజెప్పారు. విశ్వనాధం గారు తెలుగువారే. పాండీబజార్ బ్రాంచ్ ఆంధ్రా బ్యాంక్ లో పనిచేసేవారు. అక్కడే మా నాన్నగారికి ఆయనతో పరిచయం, స్నేహం ఏర్పడ్డాయి. చాలా మంచి మనిషి. కానీ, బ్రహ్మాండమైన చెముడు. పనివేళల్లో హియరింగ్ మెషిన్ వాడేవారు. ఆయన దగ్గర నన్ను చదువుకు పెట్టారు. రాత్రిపూట వారింటికి వెళ్ళి, ఆయన చెప్పింది నేర్చుకుని, రాత్రి అక్కడే పడుక్కొని, మళ్ళీ ఉదయాన్నే ఇంటికి చేరుకోవడం. ఇలా ఎన్నాళ్ళు జరిగిందో గుర్తులేదు, కానీ, మధ్యలో ఒక రోజు విపరీతమైన వర్షం కురిసి విశ్వనాధంగారింటికి వెళ్ళడం చాలా కష్టమయింది. విశ్వనాధంగారు టి.నగర్ బస్ స్టాండ్ ఎదురుగా వున్న బర్కిట్ రోడ్ లో చివరగా ఒక పెద్ద బంగళా వెనక ఉండే ఔట్ హౌస్ లో కాపురం. భార్య, ఒక చిన్న పాప. మరీ పెద్ద ఇల్లేమీ కాదు కానీ చాలా నీట్ గా వుండేది.  వర్షం పడిందంటే మెడ్రాస్ రోడ్ల పరిస్థితి అప్పుడు, ఇప్పుడూ కూడా పెద్ద తేడా ఉన్నట్టనిపించదు. దశాబ్దాలెన్ని గడిచినా ఈ విషయంలో ఏం మార్పులేదు. టి.నగర్ బస్ స్టాండ్ నుండి హిందీ ప్రచారసభ వీధి చివరి వరకు మహాసాగరం. నడుం లోతు నీళ్ళలో అలాగే విశ్వనాధంగారింటికి చేరుకున్నాను. గురువుగారు, గురువమ్మగారు నన్ను చూసి జాలిపడ్డారు. ఈ విధమైన రాత్రిపూట చదువు విశ్వనాధం గారింట్లో ఎన్నాళ్ళు సాగిందో గుర్తులేదు. ఆయన చెప్పిన చదువు నాకెంతవరకు ఉపయోగించిందో తెలియదు. నాకు క్లాసు పుస్తకాలు చదువుతున్నంతసేపూ అంతా అర్ధమైనట్లే వుండేది. ఏ ప్రశ్నలు వేసినా సమాధానాలు బాగానే చెప్పేవాడిని. కానీ , కర్ణుడి శాపాల్లాగా పరీక్షలలో మాత్రం నా తెలివితేటలు ఎందుకూ ఉపయోగపడేవి కాదు. ఏ ప్రశ్నకు ఏది సమాధానమో, అది ఎంతవరకు రాయాలో తెలిసేది కాదు. అనవసరంగా  పేజీలకు పేజీలు కాగితాలు ఖరాబు చేయడం సమాధానం కాదనే జ్ఞానోదయం చాలా లేటుగా కలిగింది. అప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఎక్కడవేసిన గొంగడి (గొంగళి పురుగే గుర్తుకు వస్తుంది) అక్కడే.

రంగయ్యర్ స్ట్రీట్ ఇంటిలో ఉన్నది నాలుగైదు మాసాలు మాత్రమేనని గుర్తు. ఒక శుభ ముహుర్తాన మా నివాసం నెం.35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ కు మారింది. 

ఆ విశేషాలు వచ్చేవారం .....
...సశేషం



*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, October 23, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - మూడవ భాగం

23.10.20 - శుక్రవారం భాగం - 3*:
అధ్యాయం 2 భాగం 2 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

రంగయ్యర్ స్ట్రీట్ ఇంటికి వెళ్ళిన మొదటివారంలోనే మా నాన్నగారు ఒక సాయంత్రం మా అందరిని చైనాబజార్ కు తీసుకువెళ్ళారు. మెడ్రాసులో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యాపార కేంద్రం చైనా బజార్. చెన్నపట్టణంలో ఫోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మించిన కాలంలో దానికి ఉత్తరంలో ప్రస్తుతం మద్రాసు హైకోర్ట్ ఉన్నజార్జ్ టౌన్ ప్రాంతాన్ని బ్రిటీష్ వారు బ్లేక్ టౌన్ అనేవారు. కొంత కాలం ఫ్రెంచ్ వారి అధీనంలో ఉన్నా, Treaty of Aix-la-Chapelle అన్న ఒక ఒడంబడిక ప్రకారం క్విబెక్ ని వారికి అప్పగించేక ఈ చెన్నపట్టణ ప్రాంతం మళ్ళీ బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. పాండీచేరీలో మాత్రం ఇంకా ఫ్రెంచ్ వారి ప్రాభవం, ప్రభావం ఇంకా కనిపిస్తుంటుంది. బ్రిటీష్ వారి అధీనంలోకి తిరిగి వచ్చేక తమ వద్ద పనిచేస్తున్న పనివారు స్థానికంగా నివసిస్తున్న బ్లేక్ టౌన్ ప్రాంతంలో కొంత భాగం నేల మట్టం చేసి పదమూడు స్థంభాలు ఏర్పాటు చేసుకున్నారట. శత్రుదాడిని సమర్ధంగా ఎదుర్కోడానికి. వాటిలో ఒక స్థంభం  పారీ భవన సముదాయంలో నేటికీ Parry Company వారి పరిరక్షణ, పర్యవేక్షణలో ఉంది. పదమూడు స్థంభాలు శత్రుదాడి నుంచి రక్షించుకోడానికి నిర్మించినవని చరిత్రాకారుల అభిప్రాయం అయినా, అవి బ్రిటీష్ వారు కెనడా లో ఫ్రెంచ్ వారికి స్వాధీనం చేసిన క్విబెక్ సహా పదమూడు ప్రావిన్స్ ల జ్ఞాపకార్ధం నిర్మించినవేమో.

ప్రస్తుతం సెంట్రల్ స్టేషన్ పక్కనున్న వాల్ టేక్స్ రోడ్ నుంచి ప్యారీస్ కార్నర్ కి వెళ్ళే దారి NSC Bose Road. అదే ఒకప్పుడు చైనా బజార్ రోడ్. దాన్నే ఈవెనింగ్ బజార్ రోడ్ అని కూడా అనేవారు. చైనా బజార్ రోడ్డు అదే ఇప్పటి NSC Bose Road  హార్బర్ కి వెళ్ళే ఫస్ట్  లైన్ బీచ్ రోడ్డుని కలిసే మూల, మద్రాసు హైకోర్ట్ ఎదురు వేపు ఉన్న ప్యారీ కంపెనీవారి పెద్ద అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పేరు మీద అది ప్యారీస్ కార్నర్ గా ప్రసిధ్ధికెక్కింది. 

పారి మునై - పారీ మూల - Parry's Corner

ఈ ఈవెనింగ్ బజార్ రోడ్డుని చైనా బజార్ గా పిలవడానికి నాకనిపించే ఒకే కారణం ఆ రోజుల్లో బ్రిటీష్ వారు వారికి కావలసిన వంటింటి క్రోకరీ - పింగాణీ సామగ్రి కొనుగోలు చేయడానికి వీలుగా ఈ ఈవెనింగ్ బజార్ లో చైనా వేర్ (పింగాణీ సామగ్రి) అమ్మే షాపులు ఉండేవి. వాటిలో అతి ప్రముఖమైనది 1889లో పేవ్ మెంట్ షాప్ గా ప్రారంభమైన కరీంభాయ్'స్ ఈనాటికీ ఆ రోడ్డు మీద కనిపిస్తుంది. 

1889లో ఈప్రాంతంలోనే ఒక పేవ్ మెంట్ షాపు ఈ కరీంభోయ్'స్


తరవాత కాలంలో భాయ్స్ కడై అంటే భాయ్స్ కొట్టు, అరవంలో ప, బ లకి తేడాలేకపోడం వల్ల పాయ్ కడై అయింది. పాయ్ అంటే అరవంలో చాపలు (mats) అన్న అర్ధంలో. ఆ తరవాత కొంత కాలానికి ఆ ప్రాంతంలో చాపల కొట్లు కూడా ఉండడంచేత అది పాయ్ (చాపల) కడై అయిపోయింది.  

నాకు తెలిసి అరవై డెబ్భైలలో కూడా పింగాణీ సామగ్రి, బొమ్మల వాడుక ఎక్కువగానే ఉండేది. అంచేత మద్రాసు చైనా బజార్ కి చైనాతో ఏ సంబంధం లేదు, ఎత్తేస్తే ఏడు ముక్కలయ్యే పింగాణీ సంబంధం తప్ప. అలాగే ఈమధ్య హైదరాబాద్ లాంటి నగరాల్లో కనిపిస్తున్న ప్లాస్టిక్, ఫేన్సీ వస్తువులమ్మే చైనా బజార్లకి చైనా-పింగాణీ తో ఏ సంబంధం లేదు, చైనా దేశంతో కూడా. 1960 దశకం చివర బర్మా నుంచి వచ్చిన తమిళ కాందిశీకుల కోసం ఫస్ట్ లైన్ బీచ్ రోడ్ మీద వారు తెచ్చుకున్న వస్తువుల అమ్మకం కోసం వెలసినది బర్మా బజార్. కాలక్రమంలో అది తొంభైలనాటికి contraband, smuggled electronic goods, CDలు DVDలు అమ్మే  గ్రే మార్కెట్ గా మారింది. 

హార్బర్ దారి - ఫస్ట్ లైన్ బీచ్ రోడ్ - కుడివేపు ఇప్పుడు బర్మా బజార్ షాపులు - ఆరోజుల్లో ట్రాం లైన్స్ ఉండేవి 

తరవాత అదే చైనా, మలేషియా, సింగపూర్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మార్కెట్.  ఫ్లవర్ బజార్ పోలిస్ స్టేషన్ సమీపంలోని కందసామి కోయిల్, మింట్ స్ట్రీట్ మొదలు పారీస్ కార్నర్ లోని ఆర్మీనియన్ స్ట్రీట్, లింగి చెట్టి, తంబు చెట్టి, అంగప్ప నాయకన్మూర్ స్ట్రీట్ లాంటి  వీధులన్నీ వ్యాపార కేంద్రాలే. బ్రాడ్ వే, బందర్ స్ట్రీట్, సుంకురామచెట్టి, తంబుచెట్టి స్ట్రీట్ లలో ఈ చివరి నుండి ఆ చివరివరకు ఒక్కో వీధి సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరానికి అన్నీ షాపులే. ఈ తంబుచెట్టి వీధిలోనే కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి 'ఆంధ్రపత్రిక' దిన, వార పత్రికల ఆఫీస్, ప్రెస్ వుండేవి. ఆ ప్రాతమంతా మెడ్రాస్ లోని ప్రముఖ వాణిజ్య కేంద్రం. హోల్ సేల్, రీటైల్ వ్యాపార కూడలి. 


ఆసియాలోనే అతి పెద్ద కొత్వాల్ చావడి కూరగాయల బజారు 

ఆసియాలోనే అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరు పొందిన కొత్వాల్ చావడి కూరగాయల బజారు, ఫ్లవర్ బజార్ మార్కెట్ ప్రాంతం కూడా అక్కడే. ఈ ప్రాంతమంతా జార్జ్ టౌన్ గా, పాత మెడ్రాస్ గా వుండేది. ఈ ప్రాంతం సూర్యోదయం నుండి అర్ధరాత్రి వరకు జనాలతో కిటకిటలాడుతూంటుంది. తొంభైల దాకా కూడా ఈ వీధుల్లో ఇళ్ళన్నీముందు భాగం షాపులు. వెనకాల వేపు వారి కుటుంబాలు. పెద్ద పెద్ద మేడలే. పాతకాలంవి. ఆ ఇళ్ళలోకి సహజమైన గాలి, వెలుతురు ప్రవేశించే వీలే వుండదు. క్రిక్కిరిసిన వాహనాలు, జనాలతో ఆ ప్రాంతం కొత్తవారికి ఉక్కిరిబిక్కిరిగానే ఉంటుంది. నాకు అలాటి పరిస్థితే ఏర్పడింది. చైనా బజార్ ప్లాట్ ఫారమ్ మీది షాపుల్లోని వింతలన్ని అంతవరకూ నా జన్మలో చూడలేదు. (ప్రస్తుతం మెట్రో రాకతో అధునాతనంగా తయారవుతోంది ఈ ప్రాంతం అంతా). 

ఇరుకు జార్జ్ టౌన్ ప్రాంతం

అవన్నీ చూసుకుంటూ తిరగడంలో టైమే తెలియలేదు. అప్పటికి రాత్రి 8.30 గంటలైపోయింది. జన సంచారం పల్చబడింది. మేము తిరిగి ఇంటికి రావడానికి   బస్ స్టాప్ కు చేరుకున్నాము. విశాలమైన  (జనాలు లేకపోతే) ఆ రోడ్ కు రెండు ప్రక్కలా బ్రిటిష్ కాలం నాటి ఎత్తైన ఎర్రటి భవంతులను చూస్తే   ఎంత పెద్ద ఇళ్ళో అని ఆశ్చర్యం కలిగింది. అంతంత పెద్ద ఇళ్ళు, భవనాలను ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి.  మెడ్రాస్ హైకోర్ట్ ప్రాంగణం ఆనుకుని మైన్ రోడ్డు మీద పారీ'స్ కార్నర్ బస్ స్టాండ్. ప్రాంగణం లోపలే లైట్ హవుస్. ఆ ప్రహారీ గోడను ఆనుకొని 11వ నెంబర్ బస్ స్టాప్. మేముండే టి.నగర్ కు వెళ్ళే 11, 11A, 11C బస్సులు అక్కడినుండే బయల్దేరుతాయి. అందులో 11 నెంబర్ బస్సులు అధిక సంఖ్యలో వుండేవి. అప్పట్లో అన్నీ ఎఱ్ఱరంగు ల్యాలెండ్ కంపెనీ బస్సులే వుండేవి. 

ఆరోజుల్లో వీధిదీపాలకి కూడా incandescent బల్బులే ఉండేవి. ఇప్పటిలా ట్యూబ్ లైట్లో, సోడియం వేపరో, ఎల్ఇడి బల్బ్ లో కావు కదా. మామూలు ఇళ్ళలో వాడే బల్బ్ లే. పదిహేను ఇరవై అడుగులు ఎత్తుండే ఆ దీప స్థంభాలు '?' షేపులో పైభాగం వంపు తిరిగి కిందికి చూస్తున్నట్టు నిలబడివుండేవి. 


వాటి డూములు/షేడ్ పైవేపు ఆకుపచ్చగా లోపల వేపు తెల్లగా కోటింగ్ వేసి వుండేవి. 

ఈ లైట్ లకి డూమ్/షేడ్ లు ఎందుకంటేట, ప్రపంచయుధ్ధ కాలంలో రాత్రిపూట శత్రు సైనికుల విమానాలకు క్రింద అక్కడ వూళ్ళున్నాయని తెలియకుండా వుండడానికి వీధి దీపస్థంభాలకు ఆ డిస్క్ లు తగిలించారని అనేవారు!? నిజానికి యుధ్ధవిమానాలు దాడే జరిగితే వీధిలైట్లు, ఇళ్ళలో లైట్లు ఆర్పేసి blackout చేసి పూర్తిగా అంధకారంలోనే గడిపేవారట. అటువంటి యుధ్ధవాతావరణంలో 1942 లో మా నాన్నగారు మెడ్రాస్ లో కొన్ని మాసాలున్నారట. 'అమ్మ బాబోయ్! ఎలా వున్నారో' అని అనుకున్నాను. అయితే, నేను పుట్టిన సంవత్సరంలోనే రెండవ ప్రపంచయుధ్ధం ముగియడం వల్ల నాకు ఆ విషయాలేవీ తెలియవు. కాకపోతే, నాకు కొంత జ్ఞానం వచ్చిన తరువాత కూడా నిత్యవసర వస్తువులకి రేషన్ ఉండడం, సులభంగా దొరకకపోవడమనేది గుర్తుంది. 

ప్యారీస్ కార్నర్ వీధి పొడుగునా దీపాలున్నా దట్టమైన చెట్ల మధ్య ఆ గుడ్డి దీపాలకాంతి అంతగా తెలియలేదు. వుండీ వుడిగీ లైట్ హౌస్ మీది రొటేటింగ్ ల్యాంప్ కాంతి మీద పడేది. (విశాఖపట్నం డాల్ఫిన్స్ నోస్ కొండమీది లైట్ హౌస్ దీపపు కాంతి దీనికంటే చాలా ఎక్కువట. సముద్రంలో చాలా దూరం వరకూ కనిపిస్తుందనుకునేవారు). టూరిస్టులు మద్రాసు లైట్ హౌస్ మీదకు వెళ్ళి వూరంతా చూడడానికి వీలుండేది అప్పట్లో, పగటిపూట. టికెట్ కొనుక్కుని. నేను కూడా చాలాసార్లు అలా  పైకి ఎక్కి చూశాను. ఇరుకు స్పైరలింగ్ మెట్లమీదుగా చుట్టూ తిరుగుతూ పైకి వెళ్ళాలి. అంత ఎత్తునుండి వూరంతా పచ్చని తివాసీ పర్చినట్లు చాలా దూరం వరకూ కనిపించేది. ఆనాటి మెడ్రాస్ దట్టమైన చెట్లమధ్య భవనాలు కనిపించేవికావు. (చల్లని సముద్రపుగాలితో సాయంసమయాలు ఎంతో ఆహ్లాదకరంగా వుండేది. ఆనాటి వాతావరణం పూర్తిగా మారిపోయింది). తూర్పున బంగాళాఖాతంలో కనుచూపు దూరంలో వెళుతున్న స్టీమర్లు కనిపించేవి. ఇప్పుడు నేను చెపుతున్న లైట్ హౌస్ మూడవది. 1894 లో సముద్రమట్టానికి 175 అడుగుల ఎత్తున హైకోర్టు ప్రాంగణంలో కట్టబడినది. రెండవ లైట్ హౌస్ 1841 లో 120 అడుగుల ఎత్తున అదే ప్రాంగణంలో డోరిక్ శిఖరం పైన ఉండేదట. అక్కడ హైకోర్ట్ ప్రాంగణంలోనే పారిస్ కార్నర్ ఎదురు వేపు ప్రస్తుతం రాజాజీ విగ్రహం ఉంది. మరి, మొదటి లైట్ హౌస్ వివరాలు తెలియవు. ఈనాడు అధునాతనంగా, మెరీనా-గాంధీ బీచ్ దగ్గర, ఆలిండియా రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న లైట్ హౌస్ నాలగవది. సాంకేతికంగా ఉన్నతమైనదే కావచ్చు కానీ హైకోర్టు లైట్ హౌస్ అంతా హుందాగా కనపడదు. 

ఈ విధంగా చుట్టూవున్న పరిసరాలను చూస్తూండగా 11 నెంబర్ రావడం, అందులో ఎక్కి టి నగర్ ఉస్మాన్ రోడ్ రాఘవన్ 'నెయ్ కడై' (నేతి దుకాణం) స్టాపింగ్ లో దిగి నడుచుకుంటూ రంగయ్యర్ స్ట్రీట్ లోని ఇంటికి చేరేసరికి రాత్రి 10 గంటలు దాటింది. నాకు గుర్తున్నంతవరకూ మా నాన్నగారితో కలిసి మళ్ళీ అలా విహారానికి వెళ్ళిన సందర్భాలు లేవు. అవకాశం లేకపోడం ఒక కారణం, స్వతహాగా విహారాలంటే ఆయనకుండే అనాసక్తత మరో కారణం కావచ్చు. మానాన్నగారితో కలసి అందరం బయటకు వెళ్ళిన సంఘటనలు చాలా అరుదు. 

మా లోగిట్లో అన్ని భాషలవారూ ఉండేవారు. అందులో చాలామంది సినీమావాళ్ళే. అందులో ఒక కన్నడ సినీమా పాటల రచయిత వుండేవారు. పేరు గుర్తులేదు. ఒంటరిగా ఉండేవారు. ఎప్పుడూ లుంగీ బనీను మాత్రం ధరించి ఇంట్లో చాపమీద గోడకానుకొని కూర్చొని సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ ఏదో రాసుకుంటూ గడిపేవారు. రచయితలకు సిగరెట్ కు ఏవిటో ఆ అవినాభావ సంబంధం?

అప్పుడప్పుడు ఎవరో వచ్చి ఆయనను కారులో బయటకు తీసుకెళ్ళేవారు. వాళ్ళు మాట్లాడేది ఒక్క ముక్క అర్ధమయేదికాదు. అలాగే, కన్నడ సినీమాలకు చెందిన మరో కుటుంబం వుండేది. తల్లి ఒక డాన్స్ మాస్టర్. కూతురు ఒక బాలనటి. మేము ఆ ఇంటిలోనుండి వెళ్ళిపోయాక ఎప్పుడో వచ్చిన 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం' డబ్బింగ్ సినీమాలో బాలనటిగా మంచి వేషమే వేసింది. పెద్దయ్యాక  ఏదో సినిమాలో ఎన్ టి రామారావు పక్కన చెల్లెలుగా చూసిన గుర్తు. పేరు సుమ లేక కుసుమ కావచ్చు. నటిగా పెద్ద విజయం సాధించినట్లు కనపడదు. ఆ తల్లీ కూతుళ్ళను షూటింగ్ కు తీసుకువెళ్ళడానికి కారో, వ్యానో వచ్చేది. ఒకసారి ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. అందులో ఒకావిడ కూర్చొనివుంది. రంగురంగుల బట్టలతో, ఒళ్ళంతా నగలతో, ముఖమంతా దట్టంగా పౌడర్ పూసుకొని, పెదవులంతా ఎఱ్ఱగా, తలంతా రంగురంగుల గొట్టాలాంటి క్లిప్ లతో వింతగా కనిపించింది. నేను మా కాంపౌండ్ లో వున్న చెట్టుక్రింది చప్టా ఎక్కి చూస్తున్నాను. ఆ వ్యాన్ లో ఉన్నావిడ నిముషానికి ఒకసారి చేతులు, వేళ్ళూ తిప్పుతూ, పెదవులాడిస్తూ, కళ్ళు తిప్పుకుంటూ సంజ్ఞలు చేస్తూంది. ఆ చర్యలు నాకెందుకో వింతగా, భయంగా అనిపించింది. ఇంతలో మా కాంపౌండ్ లోని డాన్స్ మాస్టర్ రావడం, వ్యానెక్కి వెళ్ళడం జరిగింది. తర్వాత తెలిసింది, ఆ రోజు వ్యాన్ లో ఉన్న నటి పేరు అమ్మాజీ అని, ఆ రోజు షూటింగ్ లోని డాన్స్ మూవ్మెంట్స్ ను మననం చేసుకుంటున్నారని. ఆవిడ రోజులమారాయి చిత్రంలో నటించిన విషయం మీకు తెలిసినదే. తరువాత, జయశ్రీగా పేరు మార్చుకొని (అదృష్టం కలిసొచ్చిందో లేదో) 'దైవబలం' లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించారు. ఆ జయశ్రీ కుమార్తే నిన్నటి తరం హీరోయిన్ జయచిత్ర.                                       

ఆ లోగిట్లో నా తెలుగు అర్ధం చేసుకుందుకు ఒక తెలుగు కుటుంబం వుండేది. నడి వయసు దాటిన భార్యభర్తలు. చదువు ముగిసి పెళ్ళికెదిగిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరే అవసరార్ధపు అరవ మాటలు కొన్ని నేర్చుకున్నాను.

అక్కడున్నప్పుడే మా నాన్నగారితో కలసి స్టూడియోలో  రికార్డింగ్ లకు వెళ్ళేవాడిని. అప్పటికింకా స్కూల్లో చేరలేదు. మా నాన్నగారిని స్టూడియోకు తీసుకువెళ్ళడానికి కారో, వ్యానో వచ్చేది. ఆ రోజుల్లో ఆర్కెష్ట్రా వాళ్ళను పికప్ చేసుకోవడానికి సినీమా కంపెనీవాళ్ళే వాహనాలు ఏర్పాటు చేసేవారు. అందుకోసం కార్లు, వ్యాన్లు అద్దెకు తీసుకునేవారు. అలా వచ్చే బళ్ళతో పాటు సినీమా కంపెనీ మనిషికూడా వచ్చేవాడు. అలా వచ్చే కారో, వ్యానో ముందుగా మా ఇంటికే వచ్చేది. ఉదయం 9 గంటలకు రికార్డింగ్ కాల్షీట్ అంటే 6.30 గంటల లోపే మా వాకిట్లో వ్యాన్ వచ్చేసేది. అప్పటికి మా నాన్నగారు సిద్ధమైపోయేవారు. ఆ బండిలో హార్మోనియం ఎక్కించి బయల్దేరేవాళ్ళం. వెళుతూ వెళుతూ దారి మధ్యలో వుండే ఇతర ఆర్కెష్ట్రా వాళ్ళను పికప్ చేసేవారు. వెస్ట్ మాంబళంలోని హుస్సేన్ రెడ్డిగారూ (ఆర్గన్), చిత్తూరు సుబ్రహ్మణ్యం గారు (వైలిన్), యిలా వ్యాన్ నిండేవరకు వాద్యబృందాన్ని ఎక్కించుకొని స్టూడియో రికార్డింగ్ ధియేటర్ వద్ద దింపేసేవారు. మా నాన్నగారు లోపలకు వెళ్ళగానే ఆనాటి పాటకు సంబంధించిన నొటేషన్స్ అంతా అక్కడకు చేరిన ఆర్కెష్ట్రా కు డిక్టేట్ చేసేవారు. ఆర్కెష్ట్రా లో string  instruments, wind instruments, rhythm instruments, వాయించేవాళ్ళంతా విడివిడిగా ఒక గ్రూప్ గా కూర్చోనేవారు. ఏ గ్రూపుకు ఆ గ్రూప్ కు విడిగా మైకులుండేవి. ఈ గ్రూప్ లు వాళ్ళు వాయించవలసిన  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ నోట్ చేసుకునేవారు. వెస్ట్రన్ instrument players వాళ్ళ వెస్టర్న్ టైప్ లో నొటేషన్స్ రాసుకునేవారు, పాడి వినిపిస్తూంటే. హార్మోనియం, ఆర్గన్, రెండు మూడు వైలిన్స్ మాత్రం పాటంతటినీ, బిజిఎమ్స్ తో సహా పూర్తిగా వాయించేవారు. ఈ నొటేషన్స్ వ్యవహారం పూర్తయే సమయానికి ఘంటసాలవారు రికార్డింగ్ ధియేటర్ కు చేరుకునేవారు. ఆర్కెష్ట్రా అంతా పాటను వాయిస్తూంటే, అవసరమైన చోట తగు సూచనలు మార్పులు చేసేవారు. ఇలా ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసాక వాయిస్ తో మానిటర్ చూసేవారు. ఆ సమయంలో ఆర్కెష్ట్రాను పామర్తిగారో, రాఘవులుగారో కండక్ట్ చేసేవారు. పాట కంపోజింగ్ నుండి ఆర్కెష్ట్రా కు నొటేషన్స్ ఇచ్చేవరకు సంగీతరావు గారి బాధ్యత. పాట తృప్తికరంగా వుందని భావించాక టేక్ కు వెళ్ళేవారు. సింగర్స్ రూమ్ వేరే. ఆర్కెష్ట్రా రూమ్ వేరే. మొదట్లో అన్నీ ఒకచోటే. మాస్టారు కాకుండా వేరే గాయనీ గాయకులైతే ఘంటసాలవారు సౌండ్ ఇంజనీర్ పక్కనే కూర్చొని వినేవారు. ఆకాలపు పాటలన్నీ లైవ్ రికార్డింగ్ కావడం వలన తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకునే పాట ఫైనల్ కు వెళ్ళేవారు. అయినా, ఎక్కడో ఏదో లోపం, ఏదో పొరపాటు మరో టేక్ కు దారి తీసేది.  ఏది ఏమైనా నిర్ణీతకాలంలో పాట రికార్డింగ్ పూర్తి అయిపోయేది.  ఆ పాటలో పాల్గొన్న గాయకులు, వాద్యబృందం మరో స్టూడియో లో మరో పాట రికార్డింగ్ కు సిధ్ధమయేవారు. గాయకుల కంఠం బాగుంది, రికార్డింగ్ కు అడ్డంకి రాదని అనుకున్న తరువాతే రికార్డింగ్స్ ఫిక్స్ చేస్తారు. అందువలన సాధారణంగా ఏ రికార్డింగ్స్ కాన్సిల్  చేయడమనేది జరగదు. మరీ ఏవైనా సాంకేతిక లోపాలు అకస్మాత్తుగా ఏర్పడితే తప్ప. ఇవన్నీ ఆనాడు సహజంగానే భావించేవారు. సినీమా అనేది ఒక సమష్టి కృషి. ఏ ఒక్కరి వల్లనో సినీమా విజయం సాధించిందనో, అపజయం పొందిందనో భావించడంలో అర్ధంలేదు. 

ఘంటసాలవారు ఈ ఆర్కెష్ట్రాను సక్రమమైన పధ్ధతిలో, సకాలానికి చేర్చే బాధ్యతను ఫ్లూట్ రాజేంద్రకు, రిధిమ్స్ వాయించే కణ్ణన్ కు అప్పగించేవారు. వాళ్ళే ఆర్కెష్ట్రా వాళ్ళందరికీ రికార్డింగ్ ఏ స్టూడియోలో జరుగుతుందో, కాల్షీట్ టైమింగేమిటో ఒక రెండు రోజులు ముందుగా తెలియజేసేవారు.  షెడ్యూల్ ప్రకారం లిస్ట్ లో వున్న వాద్యగాళ్ళందరు స్టూడియో లో చేర్చవలసిన బాధ్యత వాళ్ళిద్దరిదే. సొంత వాహనాలున్నవాళ్ళు సమయానికి  రికార్డింగ్ ధియేటర్ చేరుకునేవారు. వైలిన్ , ఫ్లూట్ వాయించేవాళ్ళు హాయిగా బస్ లో వచ్చేవారు. మా నాన్నగారిలా హెవీ వాద్యాలవాళ్ళకే ఇబ్బంది. కంపెనీ వాహనాలమీద ఆధారపడక తప్పేదికాదు. పాటల రికార్డింగ్ కాల్షీట్ ప్రకారమే జరుగుతుంది. ఆ టైమ్ షెడ్యూల్ ప్రకారం స్టూడియో ధియేటర్ ను అద్దెకు తీసుకుంటారు. ఆ సమయం ప్రకారం ఆ స్టూడియో కు సంబంధించిన సౌండ్, ఇంజనీర్, రికార్డిస్ట్, ఇతర సౌండ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా వారి వారి సరంజామా ఏర్పాటు చేసుకొని సిధ్ధంగా వుంటారు. నిర్ణీత సమయంలో పాట రికార్డింగ్ పూర్తి కావాలి. లేకపోతే నిర్మాత అదనంగా స్టూడియో వారికి అద్దె చెల్లించుకోవాలి. ఇక ఈ కాల్షీట్ బుక్ చేసే సమయాలు పాట లేదా పాటలను బట్టీ నిర్ణయిస్తారు. 7 to 1  ఒక ఫుల్ కాల్షీట్9 to 1 ఒక హాఫ్ కాల్షీట్;  2 to 9 ఒక ఫుల్ కాల్షీట్రీరికార్డింగ్ లయితే 9 to 9 లు  డబుల్ కాల్షీట్లు పనిచేసేవారు. అదీ చాలదనుకుంటే వరసగా రాత్రిం పగళ్ళు పని చేసి రీరికార్డింగ్ ముగించేవారు. ఆ సమయాలలో ఆర్కెష్ట్రా వారికి కాఫీ టిఫిన్లు, భోజనాలు నిర్మాతలే ఏర్పాటు చేసేవారు.  ఎవరికి వారు బయటకు వెళ్ళి తినిరావడానికి వ్యవధి వుండేది కాదు. అన్ని స్టూడియోలకు అందుబాట్లో హోటల్స్ వుండేవికావు. అందువలన, నిర్మాతలే భోజనపు ఏర్పాట్లు చేసేవారు. పాట రికార్డింగ్ అయ్యాక గాయకులకు, వాద్యబృందానికి క్యాష్ రూపంలోనో, చెక్ రూపంలోనో రెమ్యునరేషన్ చెల్లించేవారు. అయితే, ఇచ్చిన చెక్కులన్నీ పాసవుతాయనే గ్యారంటీ వుండేది కాదు. ఒకటికి పదిసార్లు తమ ఆఫీసులు చుట్టూ తిప్పించుకొని పాట డబ్బులిచ్చేవారు. అందరు నిర్మాతలు అలాటివారని చెప్పడం తగదు. క్రమక్రమంగా ఈ పధ్ధతులన్నీ మారిపోయాయి. ఆ వివరాలు తర్వాత, తర్వాత తెలుస్తాయి.

నాకు గుర్తున్నంతవరకూ  నేను మొదటిసారిగా స్టూడియో కు వెళ్ళినది 'జయంమనదే' రీరికార్డింగ్ కు. తరువాతిది ఘంటసాల మాస్టారి 'సొంతవూరు' లోని 'మన వూరే భారతదేశం 'పాటకు. 

              

అయితే  వివరంగా, బాగా గుర్తుండిపోయిన  మొట్టమొదటి రికార్డింగ్, రీరికార్డింగ్ సినీమా  ఘంటసాల వారింటి ఔట్ హౌస్ లోకి  వెళ్ళిన తరువాతే. అది రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 'సతి అనసూయ' ఘంటసాలవారి సంగీతం. కడారు నాగభూషణంగారి దర్శకత్వం. అంజలి, గుమ్మడి, జమున, కెవిఎస్ శర్మ ముఖ్య పాత్రధారులు. ఎన్ టి రామారావు గెస్ట్ ఆర్టిస్ట్. ఆ సినీమా లో సుశీలగారు పాడి, జమున, కెవిఎస్ శర్మల మీద చిత్రీకరించిన "పోనేల మధుర, పోనేల కాశి ఫలమేమి యాత్రలు చేసి, పతి పద సేవయే నా వారణాశి' అనే శోకగీతం రికార్డింగ్ కు వెళ్ళాను. గుండమ్మకధలోని "ప్రేమ యాత్రలకు బృందావనం" పాటలోని మాటలకు, ఈ పాటలోని మాటల మధ్య ఏదో భావ సామీప్యత గోచరిస్తూంటుంది. ఈ రెంటిలో ఏ పాట విన్నా ఆ రెండో పాట నాకెందుకో చటుక్కున గుర్తుకు వస్తుంది.

అసలు ఒక పాట ఎలా తయారవుతుందంటే ... ఇప్పుడు కాదు మరో సందర్భంలో చూద్దాము.

సతీ అనసూయ రీరికార్డింగ్ లో నాకు బాగా గుర్తుండిపోయినది నాగుపాము సీన్. సినిమాలో ఆ పాము కనిపించినప్పుడల్లా నేపధ్యంలో ఒక వాద్యం వినిపిస్తుంది. అది క్లేవైలిన్. అదే యూనివాక్స్ గా కూడా రూపాంతరం చెందింది.


ఈ నాటి  కొంబో ఆర్గన్స్, సింథసైజర్స్ రావడానికి ముందు సినిమా లలో ఈ యూనివాక్స్ కు చాలా ప్రాధాన్యత వుండేది. సతి అనసూయ లో ఘంటసాలవారు ఆ క్లేవైలిన్ ను సందర్భోచితంగా, సమర్ధవంతంగా ఉపయోగించుకొని మనసులకు హత్తుకుపోయే స్వరాలు వినిపించారు. ఈ క్లేవైలిన్/యూనివాక్స్ ను వాయించడంలో హనుమంతాచారిగారు సిద్ధహస్తులు. ఆయనకు హిందుస్థానీ సంగీతంలో మంచి ప్రవేశముంది. మరాఠీ భజన్స్ చాలా బాగా పాడేవారు. 'శ్రీరామచంద్ర కృపాళు భజమన',  పాటను' త్వమేవ మాతాచ పితా త్వమేవ' శ్లోకాన్ని తరుచూ పాడుతూండేవారు. ఆయన కన్నడం సినీమాలలో చిన్న చిన్న హాస్యపాత్రలు ధరించేవారు. రామానాయుడుగారి ప్రేమ్ నగర్ సినీమా ప్రారంభంలో వచ్చే విమానం సీనులో ఒక తెల్ల టోపీ పెట్టుకొని కనిపించేది ఈ హనుమంతాచారిగారే.


ప్రేమ్ నగర్ చిత్రంలో ANRతో హనుమంతాచారిగారు

తమిళ, తెలుగు భాషల్లో అఖండ విజయం సాధించిన 'రాము' (1966) చిత్రంలో ఉత్తమ బాలనటుడిగా జాతీయ బహుమతి పొందిన మాస్టర్ రాజ్ కుమార్, హనుమంతాచారిగారి కుమారుడే. అప్పుడప్పుడు ఘంటసాల వారింటికి వచ్చేవాడు. ఆ అబ్బాయి అసలు పేరు యోగి(యోగీంద్ర కుమార్). సినీమాల కోసం రాజ్ కుమార్ గా పేరు మార్చినట్లున్నారు. 


వెనక గాంధీ టోపీలో (వై బి చవాన్ లా) ఉన్నవారే హనుమంతాచారిగారు
ఘంటసాలగారి కుడిపక్క ఫ్లూట్ రాజేంద్ర వారిద్దరి మధ్య క్లేరినట్ సుభాన్ తబలా జడ్సన్ వెనక కనబడకుండా ఉన్నది రిథమ్స్ కణ్ణన్. నాన్నగారి కుడిపక్క వయొలిన్స్ చిత్తూరు సుబ్రహ్మణ్యం, భద్రం 

1978లో రావి కొండలరావుగారి  డ్రామా ట్రూప్ తో ఢిల్లీనుంచి తిరిగి వస్తున్నప్పుడు తమిళనాడు ఎక్స్ ప్రెస్ కి నాగపూర్ దగ్గర జరిగిన ఒక ఆక్సిడెంట్ లో రికార్డింగ్ లు, షూటింగ్ లు, కచేరీలు అంటూ క్షణం తీరిక లేని ఆ హనుమంతాచారిగారు హఠాత్తుగా కన్నుమూశారు. ఒక మంచి గాయకుడినీ, ఈనాటి multi-purpose, multi-functional electronic వాయిద్యాలు కాంబో ఆర్గన్, సింతసైజర్ లకి తొలిరూపం యూనివాక్స్ పయొనీర్ వాద్యనిపుణుడు, అనుభవజ్ఞుడైన వాద్యకళాకారుడిని దక్షిణాది సినీమా సంగీతరంగం అర్ధాంతరంగా కోల్పోయింది. (ఆ ప్రమాదంలో గాయపడిన ఈ ట్రూపు సభ్యుడు మరొకరు, టి.వి.రాజుగారి పెద్దబ్బాయి - ప్రముఖ సంగీతదర్శకద్వయం రాజ్-కోటిలలో రాజ్ అన్నగారు.)

మేము రంగయ్యర్ స్ట్రీట్ లో వున్న రోజుల్లో ఒకసారి మా నాన్నగారు  నన్నో పనిమీద ఘంటసాలవారింటికి పంపిచారు.

అది ఎందుకో, ఏమిటో ఆ వివరాలు వచ్చేవారం.

ఈలోగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.

...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

 

Friday, October 16, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - రెండవ భాగం


16.10.2020 - శుక్రవారం భాగం - 2*:
అధ్యాయం 2  భాగం 1 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్



మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ లో రైలు దిగి ప్లాట్ ఫారమ్ మీద అడుగుపెట్టగానే, నిజంగానే, మరేదో లోకానికి వచ్చినట్టయింది. నాకు తెలిసిన విజయనగరం స్టేషన్ కు రెండే ప్లాట్ ఫారమ్ లు. మెడ్రాస్ స్టేషన్ లో వరసగా ఆరో, ఏడో వున్నాయి. అన్నింటిమీదా రైళ్ళు నిలబడివున్నాయి. రైల్వే స్టేషన్లు ఇంత పెద్దవిగా , ఇంత పొడుగ్గా వుంటాయా అనిపించింది. బొబ్బిలి స్టేషన్ కంటే విజయనగరం స్టేషనే పెద్దదనుకుంటే  దానికంటే మరెన్నో రెట్లు పెద్ధదిగా మెడ్రాస్ స్టేషన్ కనిపించింది. స్టేషనంతా కూలివాళ్ళ కేకలు, అదలింపులతో, వేలాది( నాకప్పుడు అలా అనిపించింది) మనుషుల ఉరుకులు పరుగులతో, వచ్చీపోయే రైళ్ళ కూతలతో ఎక్కడ నిలబడాలో ఎటుపక్క వెళ్ళాలో తెలియక భయం భయంగా తోచింది. మా నాన్నగారి వెనకాలే ప్లాట్ ఫారమ్ మీద చాలాసేపు నడిచి బయటకు వచ్చాము. మేము రైలు దిగింది మధ్యాహ్నం అయినా చల్లటి గాలి వీస్తూంది. మా నాన్నగారు మమ్మల్ని (అమ్మగారు, అమ్మమ్మగారు, నేను, చెల్లెలు రమణమ్మ) ఒక కారులో ఎక్కించారు. (అంతకుముందు, మొదటిసారి, విజయనగరంలో ఘంటసాలగారు వచ్చినప్పుడు వాళ్ళతోపాటూ కారులో బయటకు వెళ్ళిన గుర్తుంది.)

మేము ఎక్కిన కారు చాలా చాలా దూరం వెళ్ళి ఒక దగ్గర ఆగింది. కారులోంచి దిగి చూస్తే ఒక పెద్ద రాజమహల్ లాంటి భవనం ముందు  ఉన్నాము. అది ఎవరిదో, అక్కడ ఎందుకు దింపారో అర్ధంకాలేదు. అంత పెద్ద మేడలో మేముంటామని ఊహించలేదు. కారువాడికి డబ్బులిచ్చేసి మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళారు. ఇంటిలోపలికి వెళ్ళాక, లోపలున్న మనుషులను చూసాక తెలిసింది అదే ఘంటసాలవారి ఇల్లని. వాళ్ళే మా తాతగారిని చూడ్డానికి విజయనగరం వచ్చేరని. ఆ ఇంట్లో వున్నవారంతా చాలా అభిమానంతో పలకరించారు మమ్మల్ని. అక్కడి వాతావరణం, మరికొంతమంది మనుషులు పూర్తిగా కొత్త కొత్తగా అనిపించింది. భయం భయంగా మా అమ్మగారి వెనకే నక్కడం బాగా గుర్తుంది. 

ఆ రోజు సాయంత్రం ఘంటసాలగారింట్లో వారంతా తమ స్నేహితుల ఇంట్లో పెళ్ళికో, లేక, పెళ్ళి విందుకో వెళుతూ మా అందరినీ కూడా తీసుకువెళ్ళారు. మేము వెళ్ళిన పెళ్ళివారిల్లు చాలా పెద్దదిగా విశాలంగా వుంది. అంత విశాలమైన గదిలో పెళ్ళి కార్యక్రమం చూడడం అదే ప్రధమం. అంతకు ముందు మా శారద పెళ్ళి చూసినా అదంతా తాటాకు పందిళ్ళ క్రింద జరిగింది. ఈ పెళ్ళికి వచ్చినవారిలో ఎక్కువగా తెలుగు మాట్లాడినవారే కనిపించారు. అయితే, మెడ్రాస్ తెలుగు ఊరే అని అనుకున్నాను. అక్కడివారంతా మాకు తెలియనివారు కావడం చేత వారి మాటలు వింటూ ఓ పక్కన కూర్చుండిపోయాము.  ఊరు కొంత అలవాటుపడిన కొన్నాళ్ళకు తెలిసింది - అది పెళ్ళి వారి సొంతిల్లు కాదని, అక్కడ అలాంటి పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు‌, సభలు, సమావేశాలు జరుగుతూంటాయని, వాటిని కళ్యాణమండపాలని అంటారని. అలాటి అద్దె విడిదుల్లోనే పెళ్ళిళ్ళు జరుపుతారని తెలుసుకున్నాను. మేము వెళ్ళిన కళ్యాణ మండపం నుంగంబాక్కం స్టెర్లింగ్ రోడ్, స్పర్ టాంక్ రోడ్ బ్రిడ్జ్ దాటాక చెట్ పట్ లెవెల్ క్రాస్ కు ముందు ఎడమవేపు బాగా లోపలకు వుండేది. (అప్పటికి చెట్ పట్ ఫ్లైఓవర్ కట్టలేదు). ఇప్పటికీ ఆ కళ్యాణమండపం మూడు పెళ్ళిళ్ళు ఆరు రిసెప్షన్లంటూ  నిత్యకళ్యాణం పచ్చతోరణంగా కలకలాడుతూనే  ఉంది ఈ మధ్యకాలం వరకూ 'కుచలాంబాళ్ కళ్యాణ మండపం' పేరిట. (ఇప్పుడూ ఉందనుకుంటాను. అటుపక్కకి వెళ్ళలేదు ఈమధ్య.) 

ఆ విధంగా మా మెడ్రాస్ జీవితం శుభప్రదంగా ఒక పెళ్ళి శుభకార్యంతో ప్రారంభమయింది. 

ఆరోజు రాత్రి ఘంటసాల వారింట్లోనే గడిపి ఆ మర్నాడు ఉదయం మేము వుండవలసిన ఇంటికి చేరుకున్నాము. అదొక పెద్ద లోగిలి. వీధివేపు ప్రహారీగోడ, లోపలికి వెళ్ళడానికి చిన్న గేటు.లోపలికి ప్రవేశించగానే ఎడమవేపు చిన్న చప్టాతో ఒక పెద్ద చెట్టు - అదేం చెట్టో గుర్తులేదు, కానీ చల్లదనం ఇచ్చే చెట్టు. కుడి, ఎడమల వేపు చిన్న చిన్న పెంకుటిళ్ళు. నడవడానికి మధ్య దారి. ఒక వంద గజాల తర్వాత ఎదురు వరసలో మరికొన్ని ఇళ్ళు. మొత్తానికి ఆ లోగిట్లో ఓ పదిహేను ఇళ్ళవరకు ఉండవచ్చును. ఆ ఇళ్ళ కప్పుల మీదున్న పెంకులు నేను విజయనగరంలో, బొబ్బిలిలో చూసిన ఇళ్ళపెంకులకు విరుధ్ధంగా ఉన్నాయి. అవి వంపు తిరిగి డొప్పల్లా వుంటే, మెడ్రాస్ ఇళ్ళ పెంకులు ఎర్రగా పలకల్లా పెద్దవిగా వున్నాయి. వాటినే బంగళా పెంకులంటారని తెలిసింది. బొబ్బిలి, విజయనగరం ప్రాంత పెంకుటిళ్ళు మెడ్రాస్ లో కూడా వున్నాయని కొన్నేళ్ళకు తెలిసింది. కచాలేశ్వర అగ్రహారం, పరశువాకం విల్లివాక్కం, ట్రిప్లికేన్, మైలాపూర్, సైదాపేట్, ఆలందూర్, వెస్ట్ మాంబళం వంటి పాత మెడ్రాస్ ప్రాంతాలలో అలాటి అప్పటికింకా ఉండేవి. అయితే ఎనభైలకి అవి శిధిలావస్థకి చేరుకున్నాయి. మేమున్న వీధి పేరు 'రంగయ్యర్ స్ట్రీట్. మెడ్రాస్ లో ప్రతీ ఇంటికీ విధిగా ఒక నెంబరు ఉండి తీరాలట, ఉంటున్న ఇంటిని ఇతరులకు చెప్పడానికి, పోస్ట్ మేన్ తిన్నగా ఉత్తరాలు తెచ్చివ్వడానికి. మా వూళ్ళలో ఏ ఇంటికీ ఏ నెంబర్ వుండేదికాదు. ఫలానా వారిల్లంటే చాలు జట్కావాళ్ళు, రిక్షావాళ్ళు  సరిగ్గా ఇంటిదగ్గర దింపేసేవారు. మెడ్రాస్ మహానగరం కావడాన ప్రతీ వీధికీ పేరు, ఇంటికి నెంబరు తప్పనిసరి. రంగయ్యర్ స్ట్రీట్ లో మేముండిన ఇంటి నెంబర్ '11'.

ఆ లోగిట్లో కుడివైపున్న నాలుగైదు ఇళ్ళలో ఆఖరిది. ఇల్లంతటికి ఒకటే గది. గుమ్మం దాటగానే ఎడమవేపు చిన్న వంటిల్లు, పక్కన చిన్న వరండా. అది దాటితే ఒక గది.  అంతే మొత్తం ఇల్లు. కరెంట్ దీపాలున్నాయి. ఇంటంతటికీ రెండే కాంతి తక్కువ బల్బులు, వంటింట్లో ఒకటి, గదిలో ఒకటి. ఇంటి బయట  ఒక కొళాయి, ఒక బాత్ రూమ్, ఒక టాయిలెట్ ఆ వరసలోని ఇళ్ళన్నిటికీ కామన్. వాటి శుభ్రత విషయం అంతంత మాత్రమే. అద్దె నెలకు ఇరవయ్యో, ముఫ్ఫైయో. మధ్య తరగతివాళ్ళకు అలాటిచోట్ల ఇల్లు దొరకడమే గొప్పని అనేవారు. ఆ లోగిలి సొంతదారుడు ఒక గుజరాతీ సేఠ్ అట. మా ఇంటికి ఎదురుగానే పెద్ద బంగళాలో వుంటారట. ఇంటికి చాలా పెద్దగేటు, లోపల పెద్ద పెద్ద కార్లు మాత్రమే కనిపించేవి. మనుషులు కనిపించేవారు కాదు. ఎప్పుడేనా కారు బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా ౠఎవరో తోటమాలి తలుపు తెరిచేవారు. వెంటనే తలుపులు మూసుకునేవి. అలాటప్పుడు ఒకసారి లోపలకు తొంగి చూసాను. వీధి వాకిట్లోనే చాలా పెద్ద కొలనులా వుంది. దాని మధ్య ఒక  పెద్ద రంగుల సిమెంట్ తామర మొగ్గ. కొలను చుట్టూ రౌండ్ గా సిమెంట్ తొట్టి. అలాటి కొలను  పాతాళభైరవి సినిమాలో 'ఎంత ఘాటు ప్రేమయో' పాటప్పుడు చూసిన గుర్తు. దానిని వాటర్ ఫౌంటెన్ అంటారట. అందులోనుండి నీళ్ళు చిమ్ముతాయట. అయితే, ఆ వింత ఆ ఇంట్లో ఉన్న రోజుల్లో చూడ్డం అవలేదు. 









ఏది ఏమైనా ఈ బంగళాపెంకుటింటి కంటే మా బొబ్బిలి పూరిల్లే విశాలంగా చాలా బాగుండేదనిపించింది. 

ఇంటిలోనుండి వీధిలోకి వచ్చి కుడివైపు కొంత దూరం వెడితే అడ్డంగా ఒక మెయిన్ రోడ్. దాని పేరు 'సర్ మహమ్మద్ ఉస్మాన్ రోడ్'. అక్కడ ఎడమ వేపు తిరిగి ఒక పది నిముషాల పాటు నడిస్తే 35 ఉస్మాన్ రోడ్ వస్తుందని మా నాన్నగారు చెప్పారు. అదే ఘంటసాలవారిల్లు.

ఘంటసాల అంటే గుర్తుకు వచ్చింది. మా లోగిట్లో కూడా ఒక ఘంటసాల వుండేవారు. అయితే జూనియర్ ఘంటసాల. పేరు బాగేపల్లి సుబ్రమణ్యం. భార్య, ఒక చంటిపిల్లవాడు వారి కుటుంబం. మా ఇంటికి ఎదురు వరసలో ఇల్లు. వారు కన్నడిగులే  అని గుర్తు. కానీ తెలుగు బాగా తెలుసు.  ఆయన దగ్గర ఒక గ్రామఫోన్ మూడో నాలుగో రికార్డ్లు ఉండేవి. ఆయన 'ఉమాసుందరి' సినీమాలో పిఠాపురం తో కలసి ఒక పాట పాడారట. కానీ ఇప్పుడు నెట్ లో ఆ సినిమా టైటిల్స్ లో ఆయన పేరులేదు. మరేవో మూడు పాటలు ఆయనవే, గ్రామఫోన్ లో వేసి వినిపిస్తూండేవారు ఎవరొచ్చినా. అలాగే,  'జూనియర్ ఘంటసాల 'బాగేపల్లి సుబ్రహ్మణ్యంగారి గాన కచేరీ  అని ప్రింట్ చేయబడిన లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ పాంప్లెట్స్ చూపించేవారు. కానీ, ఆ గ్రామఫోన్ లో వారిగొంతు ఘంటసాలగారి గొంతులా నాకనిపించలేదు. నా గ్రహణశక్తి లోపం కావచ్చు. మేము ఆ ఇల్లు వదలి వెళ్ళాక మళ్ళీ ఆ బాగేపల్లి సుబ్రమణ్యంగారిని నేను చూడడం తటస్థించలేదు. గాయకుడిగా కూడా ఆయన పేరు విన్న గుర్తులేదు. మెడ్రాస్ లో  తాము నేర్చుకున్న విద్యకు తగ్గ గుర్తింపు, అవకాశం లభించక కనుమరుగైపోయిన ఇలాటి సినీ కళాకారులెందరో.



తెలుగు, ఇంగ్లీషు, హిందీయే కాకుండా ఇంకా చాలా భాషలే వున్నాయని రంగయ్యర్ స్ట్రీట్ ఇంటికి వెళ్ళేకే నాకు తెలిసింది. అదొక మిని భారత దేశం. రకరకాల మనుషులు. అధిక సంఖ్యలో తమిళులు, స్వల్ప సంఖ్యలో తెలుగు, కన్నడ, మలయాళ, గుజరాతీ, మరాఠీ కుటుంబాలు ఆ వీధిలో వుండేవి. 

ఆ ప్రాంతంలోని అన్ని వీధులలో ఇలాటి లోగిళ్ళు రెండో మూడో వుండడం తర్వాతి కాలంలో గమనించాను. మా లోగిట్లో వారు మాట్లాడేది తమిళం, కన్నడం, మలయాళం భాషలంటారని క్రమక్రమంగా అర్ధమయింది. ఏ భాష ఏదో తెలిసేది కాదు, తెలుగు తప్ప. తెలుగులో మాట్లాడేవాళ్ళు తక్కువే. అక్కడి వాళ్ళు మాట్లాడే తెలుగుకి, నాకు తెలిసిన తెలుగుకి చాలా తేడావుంది. అరవం ఒక్క ముక్క అర్ధమయేది కాదు. (తమిళాన్ని అరవం అని అనడానికి కారణం ఏమిటో ? ఎవరైనా భాషా చరిత్రకారులు చెప్పాలి).

'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' తో పాటూ ఇతర భాషామ తల్లులని కూడా మల్లెపూదండలతో గౌరవించాలని రంగయ్యర్ స్ట్రీట్ లో నాకు బాగ అర్ధమయింది. 

నెం.11, రంగయ్యర్ స్ట్రీట్ లోగిట్లోవారంతా ఎవరి భాషలో వారు పలకరించేవారు. నాచేత మాట్లాడించడానికి ప్రయత్నించేవారు. అసలు బయట జనాలంటేనే భయం. అందులో ఏవేవో భాషలవారితో నేనేం మాట్లాడగలను. అందుకే, నా నైజం అర్ధం చేసుకున్న మా పెద్దమ్మమ్మగారు 'వీడు ఇంట్లో పులి, వీధిలో పిల్లి' అని అనేవారు.

రంగయ్యర్ స్ట్రీట్ ఇంటికి వెళ్ళిన కొద్దిరోజులకే బోల్డు కష్టాలలో ఇరుక్కున్నాను, భాషాపరంగా. ఒక రోజు మా అమ్మగారు పక్కవీధిలోని దుకాణానికి వెళ్ళి కాఫీగుండ తెమ్మని పురమాయించారు. ఆ దుకాణం మా ఇంటికి ఎడమవేపునున్న మాంబళం రైల్వే స్టేషన్ రోడ్ లో వుండేది. ఆ రోడ్ మీద ఎడమవేపు కొంత దూరం వెడితే  లోకల్ రైల్వే స్టేషన్, కుడివేపు వెళితే  దొరస్వామిరోడ్ లెవెల్ క్రాస్. ఒక పక్క పానగల్ పార్క్ రోడ్. లెవెల్ క్రాస్ కు అవతల వేపు వెస్ట్ మాంబళం. వెస్ట్ మాంబళం అతి ప్రాచీనం. మేముండేది కొత్త మాంబళం. దానినే త్యాగరాయనగర్ (టి.నగర్) అంటారట. 

నేను మా అమ్మగారు చెప్పిన కొట్టుకి (షాపు)వెళ్ళాను కాఫీగుండ కొనడానికి. అప్పట్లో ఆ షాప్ కు  ఏ పేరుండేదో గుర్తులేదు కానీ, తర్వాతి కాలంలో TUCS(ట్రిప్లికేన్ అర్బన్ కోపరేటివ్ స్టోర్)గా, ఆ ప్రాంతపు రేషన్ షాప్ గా వృధ్ధి చెందింది. సరే, ఆ షాపుకు వెళ్ళేను. పెద్దగా జనాలు లేరు అప్పటికి. కౌంటర్లో వున్నవాడితో  మా అమ్మగారు చెప్పినట్లుగా తూచా తప్పకుండా 'కాఫీగుండ' కావాలని అడిగాను శుధ్ధ తెలుగులో. నేనడిగింది అతనికి అర్ధమైనట్లులేదు. 'ఎన్నా వేణుం' అని అతనన్నది నాకర్ధంకాలేదు. మళ్ళీ 'కాఫీగుండ' అన్నాను. ఆ షాపువాడికి కాఫీ అన్నమాట ఒక్కటే తెలిసింది. అదిక్కడ దొరకదు హోటల్ కు పో అన్నాడు అరవంలో.  నాకు కావలసింది హోటల్ కాఫీ కాదు. అక్కడే నిలబడ్డాను జెండా కొయ్యలాగ. జనాలు వస్తున్నారు, పోతున్నారు. మరికొంతసేపటికి మరొకడు వచ్చి అడిగాడు ఏం కావాలని. మళ్ళీ అదే పాట 'కాఫీగుండ'. వీడికి నా మాట అర్ధమైనట్లుంది. లోపలికి వెళ్ళి పొట్లం కట్టి తీసుకువచ్చి నా దగ్గర డబ్బులు తీసుకొని, ఆ పొట్లాం చేతిలో పెట్టాడు. అమ్మయ్య! మొత్తానికి సాధించానని సంతోషంగా ఇంటివేపు లగెత్తాను. ఇంట్లోకి వచ్చి ఆ పొట్లాన్ని మా అమ్మగారికి ఇచ్చేను. 'ఇదేమిటి? కాఫీగుండ ఏది? ప్రశ్న. 'అదే ఇది' సమాధానం. పొట్లం విప్పి చూస్తే లోపల కాఫీ గుండ లేదు. వేయించని కాఫీ గింజలు.  అమ్మక్కోపం వచ్చింది. నేను గుండ అన్నది షాపు వాడికి కాఫీ గుండుగింజలుగా అర్ధమయింది. మా నాన్నగారే మళ్ళీ ఆ షాపుకు వెళ్ళి ఆ కాఫీ గింజలు మార్చి కావలసిన కాపీ తూళ్ అదే కాఫీ పొడి కొనుక్కువచ్చారు. అమ్మ చెప్పిన కాఫీగుండ తేలేకపోయినందుకు నాకు ఘోర అవమానంగా తోచింది. నా తెలుగు తెలియని ఆ అరవ్వాళ మీద కోపం వచ్చింది. 

అదే, మెడ్రాస్ లో నా మొట్టమొదటి షాపింగ్ అనుభవం.
ఇలాటి అరవంపు బాధలు మరిన్ని ...
వచ్చే వారం ....
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Friday, October 9, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - మొదటి భాగం

09.10.20 - శుక్రవారం భాగం - 1*:
మొదటి అధ్యాయం పంధొమ్మిదవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1955 చివరి నెలలలో మా నాన్నగారు, శ్రీ పట్రాయని సంగీతరావు గారు విజయనగరంనుంచి తన కుటుంబాన్ని మాత్రం మెడ్రాస్ కు మార్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికి మా తాతగారు  శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఇంకా విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్రోపన్యాసకునిగా పనిచేస్తూనే వున్నారు. మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు 1953 లోనే విశాఖపట్నానికి మకాం మార్చారు. అక్కడ డాబా గార్డెన్స్ లో ఒక చిన్న సంగీతం స్కూల్ పెట్టి గాత్రం, వీణ, క్లాసెస్ ప్రారంభించారు. విజయనగరంలో మా తాతగారు, పెద్దమ్మమ్మగారు, ప్రభూ చిన్నాన్నగారు, కమల పిన్నిగారు, వారి పిల్లలు ప్రసాద్, మంగమాంబ వున్నారు. విజయనగరంలో వుండేప్పుడు మా ప్రసాద్, నేనూ చాలా సఖ్యంగా వుండేవాళ్ళం. ఇప్పటికి ప్రసాద్ నాపట్ల చాలా ప్రేమాభిమానాలతో వుంటాడు. అతను నాకంటే రెండేళ్ళు చిన్న.

చిన్నతనంలో ప్రసాదు, స్వరాటు

ఇది మేము విజయనగరం వెళ్ళిన కొత్తల్లో మా ఇద్దరికీ ఫోటో స్టూడియోలో తీసిన ఫోటో. ఆ వయసులోని ఫోటో చూస్తూంటే ఏదో తమాషాగా వుంటుంది. 

అలాటి ఆత్మీయులందరినీ వదలి మెడ్రాస్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎలా ఫీలయ్యానో నాకు ఏమాత్రం గుర్తులేదు. బహుశా, చాలా దూరం రైలు ప్రయాణం చేయబోతున్నాననే సంతోషం వుందేమో. అంత సుదీర్ఘ రైలు ప్రయాణం చేయడం, నా పదేళ్ళ జీవితంలో అదే మొదటిసారి. అంతకుముందు ఒకసారి ఏదో పాతమొక్కుబడి తీర్చాలని నన్ను సింహాచలం కొండకు తీసుకువెళ్ళారు. అంతకు కొన్ని రోజులముందే విపరీతమైన జ్వరం వచ్చింది. (పదేళ్ళు దాటేవరకు వరకూ తరచూ నాకు మలేరియా జ్వరం వస్తూండేది). సింహాచలం కొండమీదకు మెట్లన్నీ (సుమారు వేయికి పైనే మెట్లున్నాయి). అంత చిన్న వయసులో (7 ఏళ్ళు)  ఎవరి చంకా ఎక్కకుండా అన్ని మెట్లు నేనే ఎక్కి వెళ్ళినందుకు మా అమ్మగారు అందరితో చెప్పి మురిసిపోవడం బాగా గుర్తుండిపోయింది. నేనూ ఏదో ఘనకార్యం సాధించేననే అనుకున్నాను. 

సింహాచలం  దేవుడు వరాహ నరసింహస్వామి. ఆ రోజుల్లో కొండమీదకు బస్సులు లేవు. కాలినడకనే మెట్లమీదుగా వెళ్ళవలసి వచ్చేది. సింహాద్రి అప్పన్న కొండంతా రకరకాల వృక్షాలతో, పూల వనాలతో సుగంధభరితంగా వుండేది. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా  ఉన్న పనసపళ్ళతో చెట్లు‌, ఆకు సంపెంగ, రేక సంపెంగ వృక్షాల సముదాయంతో, చిన్న చిన్న జలధారలతో దైవీక వాతావరణం మధ్య ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మా దైవ దర్శనం జరిగింది.

అక్కడ నుండి విశాఖపట్నం కూడా వెళ్ళాము. అందుకోసం సింహాచలం స్టేషన్ లో ఒక పెద్ద రావిచెట్టు క్రింది చప్టామీద కూర్చొని చాలాసేపే గడిపాము. ప్లాట్ ఫారమ్ మీద జనాలే లేరు. చల్లటి కొండగాలికి రావి ఆకుల గలగల సవ్వడి చేస్తూంటే చాలా హాయిగా అనిపించింది. ఈలోగా కాస్తా కాలక్షేపం కోసం మా నాన్నగారు పక్కనున్న టీ స్టాల్ నుండి వేడి వేడిగా  "శనగపప్పు పకోడీలు  ఫ్రెష్ గా వేస్తున్నాడంటూ పట్టుకొచ్చేరు. అందుకు మా అమ్మగారిచ్చిన సమాధానం 'ఆ! గుడ్డు! ఇప్పుడు ఏ హోటల్ వాడు శెనగపిండి వాడుతున్నాడు. ఇవి బఠాణీ పిండితో చేసిన పకోడీలే' అని ఒక్కమాటలో తేల్చేసింది. ఈ మాటలంటున్నప్పుడు ఆవిడ యిచ్చిన రియాక్షన్ ఇంకా అలాగే మనసులో నిల్చిపోయింది. అంటే ఆనాటికే కాదేదీ కల్తీకనర్హం అన్న వ్యాపారసూత్రం బాగా ప్రబలిందనుకోవాలి. (విజయనగరం కోటయ్య కొట్లోని పకోడీలు చాలా ప్రశస్థమని మా తాతగారు అప్పుడప్పుడు తెచ్చేవారు, కల్తీలేనివే అయుంటాయి). 

తర్వాత, వాల్టేర్ వెళ్ళే ప్యాసింజర్ రావడం మేము రైలెక్కడం జరిగింది. ఆ రాత్రికి విశాఖపట్నం లో డాబా గార్డెన్స్ లోని మా చిన్నాన్నగారింట గడిపాము.  ఆ ఇల్లు లీలామహల్ పక్క వీధిలో వుండేది. (అప్పట్లో ఆ ధియేటర్ పేరు నాకు తెలీదు). ఆనాటికి విశాఖపట్నం చిన్న పట్టణమే. అంత అభివృధ్ధి చెందలేదు. ఇళ్ళు కూడా చెదురుమదురుగానే వుండేవి. చీకట్లో ఊరంతా నిర్మనుష్యంగా వుండేది. డాల్ఫిన్స్ నోస్ కొండమీది లైట్ హౌస్ లైట్ వెలుగు, వాల్టేర్ అప్ ల్యాండ్స్ లోని గవర్నర్ బంగళా లైట్ల వెలుగు మా చిన్నాన్నగారింటికి స్పష్టంగా కనిపించేది. ఇతర కొండలమీద ఇళ్ళేవీ లేవు అప్పటికి. వాల్టేర్ రోడ్లన్నీ   ఎగుడు దిగుడు రోడ్లు. సిటీ బస్సులు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ రిక్షాలలోనే వెళ్ళాలి మనస్సాక్షి  చంపుకొని. ఒక పావలా ఇస్తే ఇద్దరు మనుషుల్ని ఎక్కించుకొని రైల్వే స్టేషన్ నుండి నాలుగైదు మైళ్ళ దూరం వరకూ తీసుకుపోయేవారు. ఎత్తు ప్రాంతాలలో  రిక్షా తొక్కలేరు. లాగుతూ, నడిపించుకునే తీసుకువెళ్ళాలి. ఎండైనా, వానైనా. ఆ రిక్షావాళ్ళ శ్రమ, కష్టం చూస్తే మనసుకు బాధ కలుగుతుంది. అలాటివారితో బేరాలాడడం మా నాన్నగారికి ఇష్టంవుండేది కాదు. ఆయన అన్నివిధాలా చాలా ఉదారంగానే ఉండేవారు. మా నాన్నగారెప్పుడూ పిల్లల్ని కొట్టడం, తిట్టడం చేయలేదు. కానీ కోపం వస్తే ఆయన  తీక్షణమైన చూపులు, ఘాటైన ఉపన్యాసాలు తీవ్రంగా వుండేవి. 

మా నాన్నగారు కథలు చెప్పే తీరు చాలా అద్భుతం. ఎక్కువగా టాగోర్, శరత్, ప్రేమ్ చంద్ కథలు చెప్పేవారు. ఆయన చెప్పిన కథలు చాలా బరువైనవిగా వింటూంటే దుఃఖం కలిగించేవిగా ఉండేవి. అంతలా మనసుకు హత్తుకునేలా కథలు చెప్పే తీరు నాకు మరెవరి దగ్గరా కనపడలేదు. ఈ విషయాన్ని ఘంటసాల సావిత్రమ్మగారు, పాప పిన్నిగారు (ఘంటసాల సదాశివుడిగారి భార్య) కూడా తరుచూ చెప్పేవారు. మేము మెడ్రాస్ కు వెళ్ళకముందు మా నాన్నగారు ఒంటరిగా ఓ ఏడాదికి పైగా ఘంటసాల వారింటి మేడమీద వుండేవారు. (పానగల్ పార్క్ దగ్గరి పార్క్ లాండ్స్ హోటల్ లో భోజనం, 35 ఉస్మాన్ రోడ్ మేడ మీదం మకాం). సత్రవు భోజనం, మఠం నిద్ర. అలాటి రోజుల్లో సాయంత్రం పూట బాల్కనీలో కూర్చొని  అందరూ సరదాగా కబుర్లు చెప్పుకునే సమయాలలో మా నాన్నగారు ఇలాటి కథలెన్నో చాలా రసవత్తరంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పేవారని, సంగీతంగారి కథలు విన్న తరువాతే పుస్తక పఠనం మీద ఆసక్తి పెరిగిందని చెప్పేవారు.

అలాగే, ఆయన పాడే తీరు, హార్మోనియం మీద కర్ణాటక సంగీతం వాయించే విధానం నన్ను కట్టి పడేసేవి. నేనే కాదు, మా నాన్నగారిని గురించి తెలిసినవారంతా ఇలాగే చెప్పేవారు. సంగీత, సాహిత్యాలలో ఆయనకున్న శాస్త్రపరిజ్ఞానం, అనుభవం అపారం. ఎడ్వాన్స్డ్ మ్యుజీషియన్స్ కు ఆయనొక గొప్ప గైడని ఆయన దగ్గరకు పలువురు సంగీత విద్యార్ధులు వచ్చేవారు. సంగీతరావు గారు గొప్ప మ్యూజికల్ జీనియస్సని డా. సి. నారాయణరెడ్డి గారు సభాముఖంగా ప్రశంసించడం నేను విన్నాను. ఆ సభలో సంగీతరావు గారు లేరు. ఆరుద్ర లాటి చరిత్రకారుడు కూడా సంగీతం విషయంలో ఆయనను సంప్రదించేవారు.   ఆయన స్థాయి సంగీత జ్ఞానం కలిగిన కొందరు ప్రముఖులు పొందిన గుర్తింపు ఆయనకి దక్కలేదన్నది ఆయన మిత్రులు కొందరి అభిప్రాయం. కమర్షియల్ పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మా నాన్నగారు, తాత, ముత్తాతల మార్గం భిన్నం. వారి ఆశయాలు, ఆదర్శాలు, వారిని మరో మార్గంలో నడిపించేయి.  

మా టివికె శాస్త్రిగారు ఎప్పుడూ ఒక మాట అనేవారు "మీ తాత, నాన్నల సంగీతం విని అనుభవించలేకపోవడం జనాల కర్మ. వాళ్ళకు ఆ అదృష్టం, ప్రాప్తం లేదు" అని. ఆయన కుటుంబం అంతటికీ మా తాత తండ్రుల గురించి తెలుసు. టివికె శాస్త్రిగారు కళాకారులను ఉద్దేశించి మరొక మాట కూడా ఎప్పుడూ అంటూండేవారు  "ఎంతటి బంగారు పళ్ళేనికైనా, దాని విలువ, మెఱుపు తెలియాలంటే ఒక మంచి దన్ను, దాపు ఉండాలి. ఆ పనే మనం చేస్తున్నాము. మనలాటివాళ్ళు పూనుకొని ప్రోత్సహిస్తేనే మరుగున పడిన మాణిక్యాలు కొన్నైనా బయటపడతాయి" అని  యువకులకు స్ఫూర్తినిచ్చేవారు. ఆ విశేషాలన్నీ మరో అధ్యాయంలో.

ఓ! నేను ఈ విషయాలు చెపుతూ కూర్చుంటే మెడ్రాస్ రైలు తప్పినా తప్పిపోవచ్చు. ఇంక మెడ్రాస్ మార్గం పడదాం.

నేను పుట్టిన దగ్గరనుండి దూసి-విజయనగరం, విజయనగరం- బొబ్బిలి మధ్య అనేకసార్లు రైళ్ళలో ప్రయాణం చేసినా నాకవి అంతగా గుర్తులేవు. ఆ రోజుల్లో విజయనగరం నుండి వెళ్ళాలంటే రెండో మూడో రైళ్ళుండేవి, ఒకటి హోరా వేపు, మరొకటి రాయపూర్ వేపు. అందువల్ల వచ్చీపోయే రైళ్ళలో జనాలరద్దీ ఎక్కువగానే వుండేది. మా (సామవేదుల) వరహాల్తాతగారి రైల్వే పరిభాషలో - ప్రతి  డబ్బా - కంపార్ట్ మెంటూ క్రిక్కిరిసే వుండేది. (ఆయన రాసిన రైలు కథలు, రైల్వే జోకులు తరుచూ ఆంధ్రపత్రికలో వచ్చేవి).  ఆ రైళ్ళలో  I, II, III అని మూడు తరగతులు. తొంభై శాతం ప్రయాణీకులు III క్లాసు డబ్బాల్లోనే ప్రయాణం. ఆనాటికి ఎడ్వాన్స్ రిజర్వేషన్ల పధ్ధతి లేదు. అంతా జనరలే. కండబలం కలిగినవాడే రైల్లో రారాజు. రైల్లో సీట్లు నాలుగు వరసల్లో పొడుగాటి కర్రబల్లలతో వుండేవి. కిటికీల వేపు రెండు వరసలు, మధ్యలో ముందు వెనుకలుగా రెండు వరసలు వుండేవి. సామాన్లు పెట్టుకుందుకు  పైన బల్లలుండేవి. అయితే, అవెప్పుడూ హోల్డాల్ లు పరచి బలాఢ్యులైన  వారి నిద్రలకే నిర్ణయమైపోయివుండేవి. అప్పట్లో ఎవరికీ less luggage more comfort అన్న స్లోగన్ అనుసరించవలసిన విషయంలా అనిపించేదికాదేమో. తక్కువ దూరం ప్రయాణమైనా ఒక హోల్డాల్, నీళ్ళ మరచెంబు, ఓ సూట్ కేసు, గొడుగు, విసనకర్ర తప్పనిసరి. మా నాన్నగారి చిరకాల స్నేహితుడు, తరువాత మా నారాయణమూర్తి చిన్నాన్నగారి వియ్యంకుడు, ప్రముఖ కవి, రచయిత అయిన కీ.శే. శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారు రాయఘడా నుండి ఎప్పుడు విజయనగరం వచ్చినా హోల్డాల్ తప్పనిసరి. అది మోయడానికి ఒక కూలీ. 

35, ఉస్మాన్ రోడ్ ఆఫీస్ రూం దగ్గర  
శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారితో నాన్నగారు 

ఇన్ని సామాన్లు, జనం రద్దీల మధ్య శనక్కాయలు, జంతికలు, జాంపళ్ళు అమ్మేవాళ్ళ జంగిడీలతో ప్రయాణం అనూహ్యం. మరి మా నాన్నగారు పూర్తి సామానుతో, ఇద్దరు చిన్న పిల్లలతో అంత రద్దీలో  విజయనగరంలో ఎలా రైలెక్కించగలిగారో ఆయనకే తెలియాలి. సగం మంది ప్రయాణీకులకే సీట్లు. మిగిలిన వారంతా వారి వారి పెట్టెల మీద సద్దుకోవడం, లేదంటే తమ స్టేషన్ వచ్చేవరకు వచ్చేపోయేవారి తోపులాటలు, కీచులాటలు భరిస్తూ నిలుచోవడం. అంతకు మించి వారికి వేరే గత్యంతరం లేదు. రైలు ప్రయాణం ఒక భగీరథ యత్నం. 

నా మొట్టమొదటి సుదీర్ఘ రైలు ప్రయాణం, విజయనగరం నుండి మెడ్రాస్ కు జనతా ఎక్స్ ప్రెస్ లో జరిగిన జ్ఞాపకం. ఆ రైలు హౌరా(కలకత్తా)లో బయల్దేరి ఖర్గపూర్, భువనేశ్వర్, కటక్, ఆముదాలవలసల మీదుగా విజయనగరం వచ్చి, వాల్టేర్, విజయవాడ, నెల్లూరు, గూడూరుల మీదుగా మెడ్రాస్ చేరేది. (విశాఖపట్నం పోర్ట్ స్టేషన్ కి కొన్ని ఎక్స్ ప్రెస్, పాసెంజర్ ట్రైన్స్ మాత్రం వెళ్ళేవి) ఈ మధ్యలో మరెన్నో ఊళ్ళు. ఆ లిస్టంతా మొదలెడితే కోట శ్రీనివాసరావు ప్రహసనమే అవుతుంది. ఆరోజుల్లో, నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ రెండే రైళ్ళు. ఈనాటికీ తూర్పుకోస్తా తీరం వెంబడి ప్రతిరోజూ 1,664 కిలోమీటర్ల దూరాన్ని28 గంటల్లో దాటుతూ సుదీర్ఘంగా నూట ఇరవై ఏళ్ళుగా ప్రతిరోజూ ప్రయాణిస్తూన్న హౌరా మెయిల్ ఒకటి.

 
   ఆనాటి WP స్టీమ్ ఇంజిన్                    ఇప్పటి WAP ఎలక్ట్రిక్ లోకో మోటివ్

మరొకటి జనతా ఎక్స్పెస్. కొన్నాళ్ళకు దాని స్థానంలో హౌరా ఎక్స్పెస్ వచ్చింది. మరికొన్నేళ్ళకు 1977 మార్చిలో ఆ బండి స్థానే కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వచ్చి రెండు మహా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు రెండు గంటలు  తగ్గించింది. 

ఆరోజుల్లో జనతా ఎక్స్ ప్రెస్  లో మెడ్రాస్ చేరడానికి  20 గంటలకు పైనే పట్టేది. విజయనగరం స్టేషన్ లోకి రైలు సైటింగ్ అయిందనగానే కలకలం మొదలయేది. జనాలంతా పిల్లాపాపలతో సామానేసుకొని ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందు వెనుకలకు పరుగులు మొదలెట్టేవారు. దూరాన కనిపించే రైలును చూడగానే నాకు కంగారుపుట్టేది. రైలింజన్ ఆవిరి చిమ్ముకుంటూ స్టేషన్ అదిరేలా ప్లాట్ఫారమ్ మీదకు రావడంతోనే నా గుండె అదరడం ప్రారంభమయేది. ఆ టెన్షన్ ఇప్పటికీ నాకు వుంది. చెన్నై నుండి బయల్దేరే రైళ్ళయితే ఇబ్బంది లేదు కానీ బయట వూళ్ళనుండి వచ్చే రైళ్ళు ఎక్కాలంటే కంగారే కంగారు ఇప్పటికీ, ఎంత రిజర్వేషన్ బెర్తులున్నా, ఆ గుండెల్లో గాభరా తగ్గలేదు. 

మరి, మేము మెడ్రాస్ రైలు ఎలా ఎక్కాము, సీట్లు దొరికాయా లేదా అనే విషయాలు గుర్తులేవు.

మేము మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ లో రైలుబండి దిగి ప్లాట్ ఫామ్ మీద అడుగు పెట్టగానే వేరేదో లోకంలోకి వచ్చినట్లయింది.

వచ్చేవారం నుండి మద్రాసు జీవితం కొత్త విశేషాలతో.....

                    .... సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.