visitors

Sunday, January 2, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైనాలుగవ భాగం

02.01.2022 - ఆదివారం భాగం - 64:

అధ్యాయం 2  భాగం 63 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


"ఏ దేశమేగినా ఎందు కాలిడినా... పొగడరా నీ తల్లి భూమి భారతిని"

1971 అక్టోబర్ 9న వెస్ట్ జర్మనీ చేరిన ఘంటసాలవారి బృందం తమ  విదేశీయానంలోని మొదటి సంగీత కచేరీని పదవ తారీఖున గొటింజెన్ నగరంలోని పెడగోగియా ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిపారు. జర్మన్ శ్రోతలే అధిక సంఖ్యలో హాజరయి ఘంటసాలవారి సంగీతాన్ని ఆద్యంతం ఆస్వాదించి ఆనందించారు. భాష తెలియకపోయిన భారతీయ సంగీతంలోని భావం, శ్రుతి లయలు, ఘంటసాలవారి గాత్రంలోని మార్దవం, గంభీరత అక్కడి శ్రోతలనెంతో ఆకట్టుకున్నాయి. అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు కచేరీ జరిపారట. ఈ సంగీత కచ్చేరీ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఒక సత్కార్యం కోసం ఉపయోగించారు.

ఈస్ట్ పాకిస్థాన్ నుండి తరలివచ్చిన శరణార్ధుల సంక్షేమం కోసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి తమ విరాళంగా కార్యనిర్వాహకులు, ఘంటసాల బృందం సమర్పించడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. స్వదేశంలోనే కాక విదేశాలలో కూడా ఘంటసాలవారు తన ఔదార్యాన్ని సత్కార్యాలపట్ల తనకు గల భక్తి శ్రధ్ధలను చాటిచూపారు. అక్కడ ఘంటసాలవారికి జర్మన్ సంగీతాభిమానులు ఏర్పడి తర్వాత కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. ఘంటసాలవారి బృందం గొటింజెన్ నుండి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళేప్పుడు అనేకమంది జర్మన్ విద్యార్ధులు రైల్వే స్టేషన్ కు వచ్చి ఉత్సాహంగా వీడ్కోలు చెప్పి ఘంటసాలవారి ని తిరిగి జర్మనీలో పాడాలని మరీమరీ కోరారట. అలాగే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో కూడా అధిక సంఖ్యలో అక్కడి భారతీయులు వచ్చి వీడ్కోలు పలకడం, తన తొలి విదేశీ కచేరీ ఎటువంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయం గా జరగడం ఘంటసాలవారికి, ఇతర బృందానికి ఎంతో ఆనందం కలిగించింది.

ఫ్రాంక్ఫర్ట్ నుండి లండన్ వచ్చిన ఘంటసాల మాస్టారికి, వారి బృందానికి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారిగారు  తన మిత్రులతో వచ్చి ఘనస్వాగతం ఇచ్చారు. అక్టోబర్ 11న లండన్ లో శ్రీమతి సూర్యకుమారి నిర్వహిస్తున్న నృత్య కళాశాలలో ఘంటసాలవారి గౌరవార్థం ఒక అభినందన సభను, సంగీత కచేరీని ఏర్పాటు చేశారు.  ఆ సభకు సంగీత నృత్యాభిమానులే హాజరు కావడం వలన వారంతా  భారతీయ సంగీతాన్ని గురించి కొంత అవగాహన కలిగినవారే కావడంతో వారంతా ఘంటసాలవారి సంగీతం వారిని అమితంగా ఆకర్షించింది. పదే పదే అడిగి మరీ పాడించుకున్నారట. అక్కడి వారి సంగీతాభిలాషకు, ప్రశంసలకు ఘంటసాలవారు ఎంతగానో చలించిపోయారట. తరచూ లండన్ వచ్చి మరింత పెద్ద బహిరంగ స్థలాలలో పాడాలని మరీ మరీ కోరడం ఘంటసాలవారి కి రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించింది. లండన్ లో తనకు, తన వాద్య బృందానికి లభించిన ఆదరణతో పొంగిపోయిన ఘంటసాలవారు రెట్టింపు ఉత్సాహంతో యునైటెడ్ స్టేట్స్ వేపు పయనించారు. ఈ పర్యటనలో అధిక సంఖ్యలో కచేరీలు ఏర్పాటు అయినవి యునైటెడ్ స్టేట్స్ లోనే. 

ఘంటసాలవారు తమ విదేశీ పర్యటనలో ఎటువంటి సంగీతాన్ని వినిపించాలనే విషయంలో చాలా స్పష్టంగానే వున్నారు. భారతీయ సంగీతం, ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే కర్ణాటక, హిందుస్థానీ సంగీత రీతులలో చేయబడిన గీతాలను, లలిత, శృంగార, జానపద రీతులలో బహుళ జనాదరణ పొందిన తెలుగు చిత్రగీతాలను,  అన్నమయ్య, జయదేవ, రామదాసు భక్తి సంగీత గీతాలను తన విదేశీ కచేరీలలో సమయ సందర్భాలననుసరించి గానం చేశారు. వివిధ ప్రక్రియలతో కూడిన ఘంటసాలవారి సంగీతం వారు వెళ్ళిన ప్రతీ స్థలంలోనూ అక్కడి సంగీతాభిమానులను విశేషంగా ఆకర్షించింది. అలాగే  తన వాద్యబృందంలోని సితార్ జనార్దన్, ఫ్లూట్ నంజప్ప, సంగీతరావు హార్మోనియం, ప్రసాద్-మురుగేశన్ల తాళ వాద్య ప్రతిభ రసజ్ఞుల మెప్పులను, ప్రశంసలందుకున్నట్లు చెప్పారు. 

ఈ బృందానికి మరొక ముఖ్య ఆకర్షణ నేరెళ్ళ వేణు మాధవ్ గారి మిమిక్రి. మన తెలుగు, హిందీ నటుల, గాయకుల గాత్రాలనే కాక హాలీవుడ్ నటుల గాత్రాలను అనుకరించి  బెన్ హర్ , టెన్ కమాండ్మెంట్స్, క్లియోపాట్రా  వంటి భారీ చిత్రాలలో వచ్చే యుధ్ధ సన్నివేశాలలోని వినవచ్చే డైలాగ్స్, వాద్యాల ధ్వనులను ఏకకాలంలో పలికించి  వెళ్ళిన చోటల్లా విదేశీ ప్రేక్షకులను ఆశ్చర్యసంభ్రమాలలో ముంచెత్తేవారని చెప్పేవారు. 

🌅

1971 అక్టోబర్ 31న ఘంటసాల మాస్టారు తన బృందంతో న్యూయార్క్ చేరుకున్నారు. ఘంటసాలవారి నార్త్ అమెరికా పర్యటనను పురస్కరించుకొని అక్కడి స్టూడియోలో మాస్టారి తొలి పలుకులతో పాటు  మరో ఎనిమిది పాటలను పాడగా రికార్డ్ చేసారు. అవి తర్వాత లాంగ్ ప్లేయింగ్  " గోల్డెన్ రికార్డ్" గా  విడుదలయింది. ముందుగా, శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి "ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గర్వమ్ము..."అన్న రాయప్రోలువారి మాటలను తలచుకుంటూ అమెరికాలోని తెలుగు సోదరులకు ఆవేశపూరితమైన స్ఫూర్తిని కలుగజేశారు. 

"అమెరికాలో ఉన్న తెలుగువారికి ఘంటసాలవారి సందేశం" 

ఆ తర్వాత పాడిన ఎనిమిది గీతాలు తన స్వంత స్వర రచనలో చేసిన పాటలనే ఎన్నుకున్నారు.  ఇతర సంగీత దర్శకుల పాటలేవీ ఈ రికార్డ్ లో లేకుండా చూసి జాగ్రత్త వహించారు.  ఆ గోల్డెన్ రికార్డ్ ఒక ప్రక్క - *వినాయక చవితి చిత్రం నుండి తన ఫేవరిట్ గీతం 'దినకరా శుభకరా',

"దినకరా శుభకరా"

*జయదేవుని అష్టపది 'యారమితా వనమాలినా', 

"యారమితా వనమాలినా"

*అన్నమాచార్యులవారి 'కొలనిదోపరికి గొబ్బిళ్ళో,

"కొలని దోపరికి గొబ్బిళ్ళో"

*కంచెర్ల గోపన్న( భక్త రామదాసు) గారి 'నను బ్రోవమని చెప్పవే' పాటలు వున్నాయి. 

"నను బ్రోవమని చెప్పవే"

అదే రికార్డ్ లో రెండవ ప్రక్క - *త్యాగరాజకీర్తన 'చలమేలరా సాకేతరామా', *జరిగిన కథ' చిత్రంలోని 'భలేమంచి రోజు', *'నిర్దోషి' చిత్రంలోని 'సింగారి చెకుముకి రవ్వ',

"సింగారి చెకుముకి రవ్వ"

*'బ్రతుకు తెరువు' లోని 'అందమె ఆనందం' పాటలు వున్నాయి.

వినాయక చవితి సినిమా విడుదలైన నాటినుండి తన ఆఖరి కచేరీ వరకూ ప్రతీసారి తన కచేరిని 'దినకరా శుభకరా' తో ప్రారంభించి 'బ్రతుకు తెరువు' లోని 'అందమె ఆనందం' పాటతో ముగించేవారు. ఈ మధ్యలో మరెన్నో పాత,  కొత్త సినీమా పాటలు పాడినా ఈ రెండు పాటలు లేకుండా వారి కచేరీ ఏది జరగలేదు. ఆ సంప్రదాయాన్నే ఘంటసాల మాస్టారు అమెరికాలో కూడా అనుసరించారు.

"రాధికా కృష్ణా రాధికా"

అమెరికా, కెనడా దేశాలలోని ప్రముఖ నగరాలన్నింటిలో అక్టోబర్ 13 నుండి నవంబర్ 1వ తేదీ వరకు వరసగా దాదాపు పదిహేను కచేరీలు బహిరంగ స్థలాలోను, స్థానిక  భారతీయుల గృహాలలోనూ చేసి ఘంటసాలవారు అక్కడి భారతీయులందరికీ మరింత ఆప్తుడు, ఆత్మీయుడు అయ్యారు. 

"ఉలగే సమాదాన ఆలయమా"

వారంతా ఘంటసాలవారిని, వారి బృందాన్ని చిరుకానుకలతో సత్కరంచారు. 

ఘంటసాలవారి బృందం తొలిసారిగా విదేశాలంటే వెళ్ళింది కానీ ఆ పర్యటన లో వారెవరికీ తగినంత ఫారిన్ కరెన్సీ లభ్యపడలేదు. ఒక్కొక్క సభ్యుడికి కేవలం ఎనిమిది డాలర్లు మాత్రమే ఇచ్చారు. ఆ ఎనిమిది డాలర్లతో ఆ యా దేశాలలోని వింతలే చూస్తారా ? లేక ఆనాటికి ఇండియా లో దొరకని అపురూప వస్తవులే కొంటారా ? వెళ్ళినచోట్లలోని వింతలు విశేషాలు చూసి ఆనందించడం వరకే వీరంతా చేయగలిగారు. అయితే అక్కడి కళాభిమానులు కొందరు బృంద సభ్యులకు విడివిడిగా తమకు తోచినంత డాలర్ల రూపంలో ఇచ్చి సహకరించారు. అలాంటి కానుకలతో ఏవో చిన్న చిన్న వస్తువులు  ఇండియా లోని తమవారికోసం కొనుక్కోగలిగారు.  స్థానిక నిర్వాహకులు వీరందరినీ నయగారా ఫాల్స్, డిస్నీలాండ్, రేడియో హాల్   వంటి ఎన్నో పర్యాటక కేఃద్రాలను సందర్శించే ఏర్పాట్లు చేసారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘంటసాలవారి విదేశీ పర్యటన జరగడానికి అందరూ కలసికట్టుగా కృషిచేసారు.  ఈ దేశాలలో జరిగిన ప్రతీ సంగీత కచేరీ విదేశీ శ్రోతలకు, మన భారతీయులకు చాలా తృప్తిని కలిగించింది. వారందరూ కూడా ఘంటసాలవారు మరల మరల తమ దేశాలలో సంగీత కచ్చేరీ చేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ప్రశంసలందించారు. 

ప్రపంచ దేశాల దౌత్య ప్రతినిధులతో  నిండిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో తమ ప్రతిభను చాటుకునే అవకాశం అతికొద్దిమందికే లభిస్తుంది. అటువంటి అరుదైన  గొప్ప అవకాశం ఘంటసాల మాస్టారికి, ఆయనతో వున్న కళాకార బృందానికి  లభించింది. UNO లో జరిగిన ఘంటసాలవారి కచ్చేరికి దేశదేశాల ప్రతినిధులంతా విచ్చేసి వారి అద్భుత గానాన్ని విని ఆనందించారు. ఘంటసాలవారి గాన ప్రతిభను ప్రశంసిస్తూ వారికి అతి ప్రతిష్టాత్మకమైన  'శాంతి పతకం' బహుకరించారు.  వాద్యబృందాన్ని కూడా సముచితంగా సత్కరించి కానుకలు అందజేశారు. ఈ సంఘటన తన జీవితంలో మరువలేని మధురక్షణంగా ఘంటసాలవారు భావించేవారు. యునైటెడ్ స్టేట్స్ లో ఆఖరుగా నవంబర్ ఒకటవ తేదిన  న్యూయార్క్ లోని తెలుగు సాంస్కృతిక సంఘంవారు ఘంటసాలవారికి, వారి  వాద్యబృందానికి ఒక ఘనమైన సన్మాన సభ ఏర్పాటు చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికాలో జరిగిన ఘంటసాల వారి కచ్చేరీలు అన్నింటికి స్థానిక భారతీయులే కాక మూడు వందలు,  నాలుగువందల మైళ్ళ దూరంలో వున్న తెలుగువారంతా తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంతో వచ్చి విని ఆనందించారట.

నవంబర్ 1న పారిస్  బయల్దేరిన ఘంటసాలవారికి న్యూయార్క్ తెలుగువరాంతా ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఘంటసాలవారికి, వారి బృందానికి ఘనమైన విడ్కోలు పలికారు. పారీస్ లో ఘంటసాలవారి కచేరీలు ఏవీ ఏర్పాటు చేయబడలేదు. కేవలం రెండురోజులు విశ్రాంతి, ఆ సమయంలో  ఈఫిల్ టవర్  వంటి ముఖ్యమైన పర్యాటక స్థలాలు సందర్శన కోసం మాత్రం కేటాయించారు. 

ఘంటసాలగారు ఏ దేశం వెళ్ళినా ఎంతటి ఉన్నత వ్యక్తులను కలసినా తన సహజ వేష భాషలను మార్చుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా తన తెల్ల లుంగీ, తెల్ల చొక్కాతోనే హుందాగా వెళ్ళేవారు. అలాగే కచ్చేరీలు చేసేప్పడు కూడా. సూటూ బూట్లతో వేదికల మీదకు వెళ్ళడమనేది ఆయనకు అలవాటులేదు. సశాస్త్రీయంగా వేదిక మీద కూర్చోనే తన సంగీత కచేరీలు చేసారు. మన సంస్కృతి సంప్రదాయాలను తూచ పాటించేవారు.

ఘంటసాలగారి వంటి అపురూప మధురగాయకుడిని చూడడానికి వచ్చేవారు వారిచేత పాడించక వదులుతారా? మాస్టారిని తమ తమ ఇళ్ళకు విందుకు ఆహ్వానించి వారిళ్ళలోనే చిన్నపాటి కచేరీలు చేయించారట. అభిమానుల సంతృప్తికోసం పాడేందుకు మాస్టారు ఎప్పుడూ సిధ్ధమే.

ఎయిర్ ఇండియా సంస్థలో శ్రీ డి.ఎన్.లింగం ఉన్నతాధికారిగా వుండేవారు. ఆయన, ఆయన మిత్ర బృందం అంతా కలసి  ఘంటసాలవారి కచ్చేరీని కువైట్ లో నవంబర్ 5 వ తేదీన ఏర్పాటు చేసారు. వారి విదేశీ పర్యటనలో ఇదే చివరి కచేరీ. కానీ దురదృష్టవశాత్తు వీరు బయల్దేరే సమయానికి పారీస్ లో దట్టమైన మంచు కురిసి విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సకాలానికి కువైట్ ఫ్లైట్ అందుకోలేక పోవడంతో కువైట్ కచేరీ కాన్సిల్ చేయవలసి వచ్చింది. నిర్వాహకులు , ఘంటసాల మాస్టారు చాలా నిరాశచెందారు.  కువైట్ లోని ఘంటసాలవారి అభిమానులంతా ఎయిర్ పోర్ట్ కు వచ్చి 5వ తేదీ రాత్రి బొంబాయి ఫ్లైట్ ఎక్కేంతవరకు వారితోనే వుండి ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. కువైట్ వాసులకోసం మరల మరొకసారి పర్యటన జరపి సంగీత కచేరీ చేయాలనే ఘంటసాలవారి కోరిక మరింక నెరవేరలేదు.

కువైట్ నుండి బయల్దేరి మర్నాడు ఉదయానికి ఘంటసాలవారి బృందం బొంబాయి చేరుకున్నారు. 1971 నవంబర్ 6 మధ్యాహ్నానికి ఘంటసాలవారు, వారి బృందం సురక్షితంగా మద్రాస్ వచ్చి చేరారు. ఘంటసాలవారికి ఘన స్వాగతం పలకడానికి సినీ ప్రముఖులెందరో మద్రాస్ విమానాశ్రయానికి వచ్చారు.

పదిమంది సభ్యులతో అమెరికాలో లలిత సంగీత కచేరీ జరిపిన తొలి భారతీయ గాయకుడిగా ఘంటసాలవారి గురించి చెప్పుకునేవారు. విదేశాలలో తెలుగు సంగీతాన్ని వినిపించాలనే ఘంటసాల వారి కోరిక సాఫల్యం చెందింది. మాస్టారు కూడా చెప్పలేనంత ఆనందాన్ని పొందారు. 

"అందమే ఆనందం ఆనందమె జీవిత మకరందం"

ఇప్పుడు రోజులు మరిపోయాయి. విదేశాలలో పర్యటించడానికి ప్రతిభావ్యుత్పత్తుల అవసరమేలేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి తన గొంతు వినిపించే సౌకర్యాలు వచ్చేసాయి.

నాలుగు వారాల విదేశ యాత్ర ముగించుకు వచ్చిన ఘంటసాల మాస్టారు తన వృత్తి వ్యాపకాలు మొదలెట్టారు. తన కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలకు ఒక్కొక్కరికీ కాల్షీట్లు ఇచ్చి తాను పాడవలసిన పాటల ట్రాక్ మిక్సింగ్ లకు, రికార్డింగులకు హాజరుకావడం మొదలెట్టారు.

ఆ విశేషాలన్నీ వచ్చే వారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో చూద్దాము.

              ...సశేషం

No comments: