visitors

Sunday, September 15, 2013

వెలిగించని దీపాలు - దేవులపల్లి గీతాలు


వెలిగించని దీపాలు - దేవులపల్లి గీతాలు

గిరిజా కల్యాణం  గీతం తెలుగు చిత్రసీమ ప్రేక్షకులందరికీ పరిచయమే. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రచించిన  యక్షగాన ప్రబంధం  ఇది. రహస్యం సినిమా నిర్మాణసంస్థ లలితా శివజ్యోతి ఫిలింస్ వారు. ఈ సినిమాకోసం ఇంకా చాలా పాటలు చిత్రించాలని అనుకున్నారు నిర్మాతలు. అందుకోసమే  దేవులపల్లి 
 వెంకట కృష్ణశాస్త్రిగారితో కొన్ని గీతాలు రాయించారు. వాటికి బాణీలు కట్టి రికార్డు కూడా  చేసారు  ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాలగారు. కానీ  ఏ కారణం వల్లనో ఆ పాటలను రహస్యం చిత్రానికి  ఉపయోగించుకోలేదు. ఘంటసాలగారికి స్వరసహచరులుగా ఉన్న సంగీతరావుగారు ఆ గేయాలను తాను కూచిపూడి నృత్యరూపకాలకు సంగీత దర్శకత్వం వహించిన సమయంలో అర్థనారీశ్వరం అనే నృత్యరూపకానికి ఉపయోగించారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రచించిన  ఆ పాటల్లో ఒకటి - భ్రమించు ముద్దు మోముతో.

అమ్మవారి గురించి వర్ణిస్తూ చిత్రించాలనుకున్న సందర్భం కోసం దేవులపల్లిగారు ఈ పాటను రచించారు.
భ్రమించు ముద్దుమోముతో
చలించు కుంతలాలతో
సుమించు లేత నగవుతో
రహించు గండపాణితో
విలాస నాట్యమాడు మాతృదేవికిన్
నమస్కృతుల్ నమస్కృతుల్
నమస్కృతుల్ 

ఈ పాటని ఘంటసాల గారు హమీర్ కల్యాణి రాగంలో స్వర పరిచారు. సంగీతరావుగారు దీన్ని  శ్రీ వెంపటి చినసత్యంగారి దర్శకత్వంలో రూపొందిన కూచిపూడివారి అర్థనారీశ్వరం నృత్య రూపకం కోసం ఉపయోగించారు. 

మరొక పాట-
ఈ పాటని ఈశ్వరుడి అర్థనారీశ్వర స్వరూపాన్ని వర్ణించేసందర్భంలో చేయాలనుకున్నారు. ఇది కూడా రికార్డు చేసారు కానీ ఉపయోగించుకోలేదు. ఈ పాటను ఘంటసాల గారు హంసధ్వని రాగంలో స్వరపరిచారు.
 మరొక గీతం - అఖిల లోకేశ్వరా అర్థనారీశ్వరా
పల్లవి          అఖిల లోకేశ్వరా అమర గంగాధరా
                   అహి హార అర్థనారీశ్వరా
                    అమృత కర కోటీర
                  అతిలోక సుందరా
                 అఘహరా అర్థనారీశ్వరా
చరణం           పులితోలు నీటుతో
                   వలువ వలెవాటుతో
                   చెలువొందు అర్థనారీశ్వరా
                   నిటల నయనమ్ముతో
                   నిడుద తిలకమ్ముతో
                   నెగడొందు అర్థనారీశ్వరా                                  “అఖిల లోకేశ్వరా అమర గంగాధరా
చరణం          వలకేల శరము
                 దాపల కేల సుమ శరము
                 వలెమించు అర్థనారీశ్వరా
                 తల్లివై  అలరింప తండ్రివై రక్షింప
                 ఏకమూర్తి ధరించు లోకేశ్వరా          
                 అర్థనారీశ్వరా....అర్థనారీశ్వరా...అర్థనారీశ్వరా.                  అఖిల లోకేశ్వరా అమర గంగాధరా                 
 చక్కని తెలుగు పదాలతో ఒక పాదంలో  శివమూర్తిని, మరొక పాదంలో గౌరిని
 వర్ణిస్తూ  దేవులపల్లిగారు ఎంత చక్కగా రచించారో ఈ   పాటని.

అర్థనారీశ్వర తత్వంలో రూపాన్ని వర్ణించడంతో పాటు వారిని జగన్మాతా పితరులుగా చూపించిన విధానం ఎంతో బావుంది.

ఇంకొక పాట
శివుడు తాండవమాడెనపుడూ.....

ఈ పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు  రచించారు. ఘంటసాల గారు ఈపాటను శ్రీరాగంలో స్వరపరిచారు. సంగీతరావుగారు దీన్ని శంకరాభరణం రాగంలో స్వరపరిచారు. కూచిపూడి నాట్యం చేసేవారికి సోలో డాన్స్ కోసం ఈ పాటను స్వరపరిచారు సంగీతరావుగారు.

శివుడు తాండవమాడేనపుడూ............

పల్లవి             శివుడు తాండవమాడెనపుడూ
                   శివుడు తాండవమాడేనపుడు
                   జగదంబ సహితముగ శివుడూ తాండవమాడెనపుడు

                     శౌరి మృదంగము మ్రోయింప 
                     పాకారి వేణువును పూరింప,
                     వారిజాసనుడు తాళము నదింప(శబ్దం చేయడం)
                     భారతి విపంచి   మ్రోయింప      
                          క్షీర వారాశి తనయ పాడ
                     అచ్చరలు క్రమ లయ న్యాసము తోడ
                     నారదాది మునివరులు తిలకింప
                     పారవశ్యమున జగతి పులకింప.........
ఈ పాట లో శివతాండవ దృశ్యం వర్ణించబడింది. విష్ణువు ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, సరస్వతి, లక్ష్మీదేవి, అప్సరసలు నారదుడు ఇలా దేవతలందరూ ఆ కొలువులో తమ కళా ప్రదర్శన చేస్తూ ఉండగా జగదంబ అయిన పార్వతీ సహితంగా  శివుడు తాండవ నాట్యం చేసాడు.
ఈ పాట లో దృశ్యాల వర్ణన వింటే సి. నారాయణరెడ్డిగారు రచించిన ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు పాట గుర్తు రావడం యాదృచ్ఛికమేనా. ఆ పాటలో కూడా దేవతలందరూ కలిసి ఒక్కోవిధమైన కళా ప్రదర్శన చేస్తున్నట్టు వర్ణించబడింది.
ఆ పాట సాహిత్యంలో విరించి తాళము వేయగా, హరి మృదగము మ్రోయింపగా ప్రమధులాడగా అప్సరసలు పాడగా....అంటూ ఆ తాండవ దృశ్యాన్ని వర్ణిస్తారు. మరి నారాయణరెడ్డిగారు ఈ పాట విన్న తరువాత రాసారో - కాదో మరి. 
రహస్యంలో గిరిజా కల్యాణం యక్షగానంతో పాటుగా ఈ పాటలు కూడా ఉండి ఉంటే సంగీతప్రియులైన సినీశ్రోతలకు వీనులవిందుగా ఉండేది. అయినా కూచిపూడి నృత్యరూపకాల ద్వారా ఆ లోటు కొంత తీరిందని సంతోషించవచ్చు కూడా.


Thursday, August 1, 2013

శ్రీ నూకల చిన సత్యనారాయణ - రాగ ప్రస్తారంలో స్వతంత్రుడు, సరసుడు





 
శ్రీ నూకల చినసత్యనారాయణగారితో సంగీతరావుగారికి చిన్నతనంలోనే పరిచయం ఉంది. నూకల సత్యనారాయణగారికి చిన్నతనంనుండే గాత్రసంగీతం పట్ల ఎంతో ఆసక్తి కనపరిచేవారు. కొంతకాలం కంభంపాటి అక్కాజీరావుగారి వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. తరువాత విజయనగరంలోన మహారాజావారి సంగీత కళాశాలలో విద్యార్థిగా చేరి శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. కొంతకాలం తర్వాత శ్రీ పినాకపాణివారి వద్ద శిష్యుడిగా చేరి, కర్ణాటక సంగీతంలో ఎన్నోఉన్నత శిఖరాలను అథిరోహించారు. సంగీతరావుగారి తండ్రి శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు ఈ విజయనగరం మహారాజావారి సంగీత కళాశాలలో వోకల్ పండితులుగా ఉండేవారు. ఆ విధంగా సంగీతరావుగారికి నూకలవారితో చిన్నతనంలోనే పరిచయం ఉంది. ఒక సంగీత కచేరీలో సంగీతరావుగారి పాటకి పక్కవాద్యంగా నూకల సత్యనారాయణగారు వయొలిన్ వాయించి వాద్య సహకారం చేసారు కూడా.

శ్రీ సంగీతరావుగారు 1976లో ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఆనాటి ప్రసిద్ధ సంగీత విద్వాంసుల పరిచయ పరంపర వెలువరించారు. ఆ వరుసలో శ్రీ నూకల చిన సత్యనారాయణగారి గురించి వ్రాసిన వ్యాసం ఇది. 1976తర్వాత 2013వరకు (దాదాపు 37 సం)జరిగిన ఇన్ని సంవత్సరాలలో నూకలవారు సాగించిన ప్రస్థానం, చేసుకున్న విజయోత్సవాలు ఎన్నో. అయితే ఈ వ్యాసం 1976 నాటికి శ్రీ సంగీతరావుగారికి పరిచయం ఉన్న నూకల చినసత్యనారాయణగారి ప్రతిభకు సంబంధించిన అంశాలకు పరిమితమయినది.
" రాగ ప్రస్తారంలో స్వతంత్రుడు, సరసుడు" ఇది ఆనాటి వ్యాసానికి శీర్షిక.



"నూకల చిన సత్యనారాయణ-
రాగ ప్రస్తారంలో స్వతంత్రుడు, సరసుడు" 

సంగీతం శాస్త్రంగా, వృత్తిగా పరిగ్రహించి సంపూర్ణమైన సత్ఫలితాలు సాధించిన సంగీత పట్టభద్రుడు శ్రీ నూకల చిన సత్యనారాయణ. కర్ణాటక సంగీత రసికులకు ఈనాడు శ్రీ సత్యనారాయణ సంగీతం ఎడల ఎంతో కుతూహలం, ఆసక్తి ఉన్నాయి. సుశ్రావ్యమైన ఆయన కంఠస్వరమూ, రాగ తాళములలో గల స్వాతంత్ర్యమూ, సరసత, కచేరీ నిర్వహించడంలో గల అభినివేశమూ శ్రీ సత్యనారాయణ సంగీతంలోని సహజ ఆకర్షణ.


మూడు పదులు దాటిన శ్రీ సత్యనారాయణ సంగీత   జీవితానుభవం గణనీయమైనది. సంప్రదాయ సంగీతం సక్రమమైన పద్ధతిలో గురుముఖతః సాధన చేసిన శ్రీ సత్యనారాయణ సంగీతం ఆయనను ప్రభావితం చేసిన అనేకమంది విద్వాంసుల ప్రతిభతో తాదాత్మ్యం చెందడం ఆయన రసజ్ఞతను, సహృదయత్వాన్నీ వ్యక్తం చేస్తుంది. కళాపరంగా ఎక్కడ ఏ మంచి వినిపించినా దానిని గ్రహించడం వలన శ్రీ సత్యనారాయణ పాండిత్యంలో ఎంతో వైశాల్యమూ, గాంభీర్యమూ ఏర్పడ్డాయి. ఈ విధమైన పాండిత్యం ఉత్తమ గురుత్వానికి లక్షణం.


శ్రీ సత్యనారాయణ మొదట వాయులీన వాదకులైన తరువాతనే గాయకులయ్యారు. వాద్య నైపుణ్యం కూడా కలిగిన గాయకునిలో శాస్త్రీయంగా సునిశితమైన అవగాహన, సుస్పష్టమైన గమక స్ఫూర్తీ ఉంటాయి.


పరిశోధన:


శ్రీ సత్యనారాయణ సంగీత శాస్త్రంలో పరిశోధనలు సలిపిన పండితులు. భారతీయ సంగీతంలోని రాగ విధానానికి సంబంధించిన దాక్షిణాత్య, ఔత్తరాహ సంగీతం సంప్రదాయ రీతుల తులనాత్మక పరిశీలన వారి ప్రత్యేక కృషి.

రాగవిధానం భారతీయ సంగీతం విశిష్టతను నిరూపిస్తుంది. భారత హృదయ సంవేదన రాగ విధానంలోనే సంగీత మయంగా వ్యక్తం అవుతుంది. రాగములు దేవతా మూర్తులుగా ధ్యానించబడ్డాయి. అనేక రాగములు రూపకల్పన చేయబడి, చిత్రీకరించబడ్డాయి.


రాగ నిర్వచనం


రాగం అంటే ఏమిటి  ఆరోహణావరోహణ క్రమంలో గల సర్వ సముదాయం అని స్థూలంగా చెప్పడం కన్నా, రాగం అంటే సంగ్రహ రూపంగా ఉన్న ఒక స్వర రచన అనడం ఉచితం. అయితే  ఆ రచన గాయకుని  ఊహా పోహల ననుసరించి సంకోచ వ్యాకోచాలకు అవకాశం కలిగిస్తుంది. అనేక రాగాలకు రసనిర్ణయం జరిగింది. అయితే, ఆ నిర్ణయం సక్రమంగా అనుసరించబడలేదు. 

నిజానికి వివిధ రసములకు లక్ష్య ప్రాయమైన స్వర రచనలు లేవు. యక్ష గానాలలోనూ, నాట్య రూపకాలలోనూ, ఆయా రాగాలను వివిధ రస నిష్పత్తికి ప్రయోగించేవారేమో. ఆయా రసభావములను పోషించే సందర్భంలో తీవ్ర కోమల స్వర సమ్మేళన గాయకుని సరసమైన ప్రతిభే ప్రధానంగా ఉంటుంది. రస నిష్పత్తికి రాగ ప్రాధాన్యాన్ని చెప్పినట్టు, తాళ ప్రాధాన్యాన్ని చెప్పడం కనబడదు. అనుభవంలో తాళ ప్రాధాన్యం, ఎంతో కనిపిస్తుంది. రస భావ పోషణలో.


రాగముల పరిథి నిర్ణయించడం పరిశోధకుల సమస్య. అనేక ప్రసిధ్ధ రాగములు శతాబ్దాల తరబడి ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాలక్రమాన మేళకర్త పద్ధతి అమలు లోకి వచ్చిన తర్వాత ఔడవ షాడవ భేదాలననుసరించి ఏర్పడ్డ రాగాలు వేలకు వేలు తయారయ్యాయి. మనకు కావలసిన మూర్ఛనకి సరిపడే పేరు పుస్తకాల్లో కనపడకపోతే ఏ శక్తి ప్రియ అనో పేరు పెట్టుకోవలసి ఉంటుంది. ఆరోహణావరోహణ క్రమంలో, చిత్ర సంచారంలో ఉన్న ప్రతి చిన్న మార్పుకు వేరే రాగంగా వ్యవహరించ వలసి వచ్చింది.


ఒక రాగం శ్రవణ యోగ్యంగా ఉండడం, ఆ రాగంలోని స్వర సంబంధం పరస్పర సంవాది, ఆనువాది రూపంగా ఉండడం గ్రహించగలుగుతాం. ఈ ప్రాతి పదిక మీద రాగ విధానం పునః పరిశీలించబడడం అవసరమేమో. ప్రతి చిన్న సంచారాన్నీ  ప్రత్యేక రాగంగా పేర్కొనడం కన్నా ఈనాడు వివిధ రాగములుగా పేర్కొనబడిన రాగాలను సమన్వయ పరిచి ఒకే రాగంగా వివృత పరచవచ్చునేమో. సత్యనారాయణగారి వంటి పరిశోధకులు వివరాలు సేకరించవలసి ఉంటుంది.


రాగ మేళనం


ఈనాడు ఉత్తరాది సంగీతంలో రెండు భాగాలు కలిపి గానం చేయడం ఒక ప్రక్రియగా అమలులోకి వచ్చి ఉంది. రాగ విధానం వలన నిర్దిష్టమైన రాగ భావములకు ప్రత్యేకత ఏర్పడడం జరిగింది. ఆ రాగ స్వరూపానికి స్కాలిత్యం ఏర్పడకుండా అచంచలమైన  లక్షణం ఏర్పడింది. గ్రహస్వరం, న్యాస స్వరం, అంశ స్వరములను నిర్ణయించి ఆ రాగ స్వరూపానికి మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా చేయబడింది. దీని వలన ఆయా రాగాల స్వరూపాలు నిర్దిష్టంగా ఏర్పడ్డా, ఆయా రాగములలో రచింపబడిన రచనలలో వైవిధ్యం లోపిస్తుంది. ఒకే రాగంలో ఉన్న అనేక రచనలలో ఉన్న రాగ భావం ఒకటే. ఒక కీర్తన గాంధారంలో ప్రారంభం అయితే మరొకటి షడ్జమంలో ఎత్తుగడ జరిగిందన్న తృప్తి తప్పిస్తే మరోకటి లేదు.


అందుచేతనే రాగభావములను ఆధారం చేసుకున్న ఆయా రచనలలో స్వర రచయిత భావనకు అవకాశం లేదు. ఇంతకు పూర్వం శతాబ్దులుగా ప్రచారంలో ఉన్న రాగ భావాన్ని సాహిత్యానికి అమర్చడమన్నదే ప్రధానం. ఆయా విషయాలను వివరంగా రసికులు గ్రహించడానికి శ్రీ సత్యనారాయణగారి వంటి పండితుల పరిశోధనలు ఎక్కువ ఉపకరిస్తాయి.

శ్రీ సత్యనారాయణ ప్రథమ శ్రేణి గాయకులు. అనేక సంగీత కచేరీలు చేసి, రసికుల మన్ననలు పొందారు. రేడియో జాతీయ కార్యక్రమాల్లో తమ సంగీతం వినిపించారు. అనేక సంగీత రూపకములకు సంగీత సారథ్యం వహించారు. ప్రభుత్వ మర్యాదల ననుసరించి అనేక సత్కారాలు పొందారు. పీఠాధిపతుల ఆశీస్సులనందుకున్నారు.


ఉత్తమ సంగీత విద్వాంసులుగా, ప్రథమశ్రేణి గాయకులుగా, వాద్య నిపుణులుగా, స్వర రచయితగా, ఆచార్యులుగా కృతార్థులయిన శ్రీ సత్యనారాయణ స్వకీయమైన ప్రతిభతో రసిక లోకానికి ఇవ్వగలిగినది ఇంకా ఎంతో ఉన్నదనే అనిపిస్తుంది.

పట్రాయని సంగీతరావు


డిసెంబరు, 12, ఆదివారం, 1976
ఆంధ్రప్రభ

Sunday, March 25, 2012

ఉగాది పాట


శ్రీ సంగీతరావుగారు  రచించి స్వరపరిచిన ఓ ఉగాది పాటను ఇక్కడ  పరిచయం చేయబోతున్నాను.

ఆకాశవాణి మద్రాసుకేంద్రంలో  చిన్న పిల్లలు ఉగాది సందర్భంగా పాడడం కోసం సంగీతరావుగారు ఓ గేయం రచించారు. ఆనందనామ సంవత్సరం (బహుశ 1975) ఉగాది సందర్బంగా ఈ గేయం ఆకాశవాణి లో ప్రసారమయింది.

మరోసారి ప్రభవ నామ సంవత్సరం ఉగాదినాడు మద్రాసు తెలుగు అకాడమీ వారి ఉగాది ఉత్సవాలలో ఉగాదికి ఆహ్వానగీతంగా ఒక పాటను స్వరపరచవలసిన సందర్భం వచ్చినపుడు సంగీతరావుగారు బాలాంత్రపు రజనీకాంతరావుగారు రచించిన గేయాలనుంచి ఒక గేయాన్ని ఎత్తుగడ గా తీసుకుని తన గేయాన్ని కూడా కలిపి స్వరపరిచారు. రజనీకాంతరావుగారి శతపత్రసుందరి గేయసంపుటిలో నుంచి ఈ గేయాన్ని తీసుకున్నారు

(శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతం, సాహిత్యం ఉభయరంగాలలోను లబ్ధ ప్రతిష్టులైన ప్రతిభా మూర్తి. లలితసంగీత రీతులను తెలుగు ప్రజలకు రేడియో మీడియా ద్వారా ప్రసారం చేస్తూ, తన రచనలతో, సంగీతంతో ప్రచారం చేస్తూ పరిపూర్ణమైన సహకారం అందించిన గొప్ప సంగీతమూర్తి. రజని పేరుతో తెలుగువారికి సుపరిచితులు.)

కొత్త సంవత్సరం ఆలయంలో మ్రోగిన ఘంటానాదంలా, ఆకాశంలో  మెరిసిన ఆశా జ్యోతిలా ఆగమిస్తోందని భావించారు రజనీకాంతరావుగారు.
గడిచిపోయిన సంవత్సరం లోని చేదు జ్ఞాపకాలు, మనస్సులోని పాపపుటాలోచనలు అన్నీ పటాపంచలైపోయి మనసులోని బాధనంతటినీ తుడిచేసి ఆ విశ్వ విభుడైన పరమేశ్వరుని కరుణా కటాక్షాలు జడివానగా కురుస్తుండగా ప్రక్షాళితమైన మనస్సులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఆశించారు రజనీకాంతరావుగారు. 
వసంత ఋతువులో చెట్లు పండిన సారంలేని ఆకులను రాల్చేసి కొత్తచిగుళ్లను తొడుగుతాయి. జగమంతా పచ్చదనం వెల్లివిరుస్తూ మనసులను ఉల్లాసపరుస్తుంది. అటువంటి శుభోదయం సమయంలో ఈ జగత్తులోని సర్వసౌభాగ్యాలకు కారణమైన ప్రభువును కీర్తించుదామని తనతో గొంతు కలపమని పిలుస్తారు రజనీకాంతరావుగారు.
ఆ గేయం యొక్క సాహిత్యం ఇది.

ఆలయమున వినబడునదిగో
ఆకసమున కనబడునదిగో
నవవర్షపు ఘంటానినదం
నవ్యాశా జ్యోతీ... నవ్యాశా జ్యోతీ...
ప్రాతయేటి పెను తమస్సులూ
పాప కలితములు మనస్సులు
పటాపంచలే
క్షుభిత హృదయములపై విరిసి
విభుని కరుణ జడులై కురిసే
నవవసంతమై నవవసంతమై
శుభోదయోత్సవ సమయమునా
ప్రభూయనుచు మధుర రవమునా
కీర్తించుదమా - కీర్తించుదమా                       
ఆలయమున వినబడునదుగో.....
ఇక్కడివరకు ఈ ఉగాది పాటలో రచన బాలాంత్రపు రజనీకాంతరావుగారిది. ఇక ఇక్కడ నుంచి సాహిత్యం సంగీతరావుగారిది.
అటువంటి నవ వసంతం ఆగమించిన కొత్త సంవత్సరానికి ఈ విధంగా స్వాగతం పలికారు సంగీతరావుగారు.
ముందుగా-
నవయుగం అంటే కొత్తసంవత్సరం ఆగమించిన వేళ ప్రకృతి ఎలా ఉంటుందో వివరించారు. వసంతకాలం హృదయాలను పులకింపజేసే సమ్మోహనకరమైన కాలం. వసంతానికి మరోపేరు ఆమని. వసంతకాలంలో తొలిసంజె వేళలో విరిసే వెలుగులు, ఆహ్లాదపరిచే వెన్నెలవేళలు అనుభవైకవేద్యమే.  వసంతకాలం అనగానే  మధురమైన సువాసనతో   విరిసే మల్లెపూలు, చవులూరించే  మధురమైన మామిడిపళ్ళు అందరికీ గుర్తొస్తాయి. అంతే కాక కొత్త మామిడిచిగుళ్ళను మేసి కలకూజితం చేసే కోయిలమ్మ కూడా వసంతానికి ప్రతినిధి కదా. అందుకే ఇన్ని అందమైన అనుభూతులనిచ్చే ఆమనికి, కొత్త సంవత్సరపు తొలిరోజుకి ఈ విధంగా స్వాగతం చెప్పారు.
ఆ.... ఆ....ఆ...
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదె నవయుగాదికి

తొలిసంజ వెలుగులు పులకించే వెన్నెలలు
మధురమైన ఫలములను మరుమల్లే విరులను
కొసరి కొసరి వినిపించే కోయిలమ్మ పాటను
హాయిగా తీయగా అందిచే ఆమనికి
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదే నవయుగాదికి
కవులు - కొత్తసంవత్సరానికి కేవలం స్వాగతం చెప్పి ఊరుకుంటే ఎలా.
అందుకే  సమాజాభ్యుదయానికి తాను ఆశించే విలువలను కూడా ప్రస్తావించి ఈ గేయాన్ని ముగించారు.
అనుమానం అసహనం అపరిమిత ద్వేషం
మటుమాయం కాగా మమకారం సహకారం
సమరసభావం శాంతి సౌభాగ్యం 
వర్థిల్లే నవ ప్రభవ వత్సరాదికి

స్వాగతమిదె స్వాగతమిదె వత్సరాదికి

స్వాగతమిదె స్వాగతమిదెనవయుగాదికి

పాటను స్వరపరుస్తుండగా రికార్డు చేసినందువల్ల  పాతికసంవత్సరాలకు పైబడి పోయినందువల్ల, సాంకేతికంగా కొంత సౌలభ్యం తక్కువగా ఉన్నా పాట వరుసను సంగీతరావుగారి స్వరంలో వినడం కోసం దాన్ని కూడా జతపరుస్తున్నాను 
ఇక్కడ.
https://soundcloud.com/sudha-sudha-1/ugadi-pata-swagathamide-vatsaraadiki-nava-yugadiki
 
ఈ పాటకు వీడియో దృశ్యరూపం కల్పించి అందించిన శ్రీ శివ(ఎందుకో ఏమో బ్లాగ్)   గారికి ధన్యవాదాలు. ఆ వీడియో ఇక్కడ

https://www.youtube.com/watch?feature=player_embedded&v=OhaZ5Xvjibs

ఈ ఇద్దరు ప్రతిభామూర్తుల గురించి శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు రచించిన వ్యాసం ఈమాట- వెబ్ పత్రికలో ప్రచురించబడింది. ఈ ఇద్దరితోనూ ఎంతో ఆత్మీయమైన స్నేహానుభవం ఉన్న రోహిణీ ప్రసాద్ గారు చెప్పిన ఎన్నో విశేషాలతో కూడిన వ్యాసాన్ని (88 ఏళ్ళ యువకులు) ఆసక్తి ఉన్నవారు ఇక్కడ చూడవచ్చు. .
http://eemaata.com/em/issues/200807/1296.html






Saturday, February 25, 2012

ఆంధ్రమాతకు కృష్ణ శాస్త్రిగారి గీతార్చన



(చాలామంది తెలుగువారికి తెలియని ఓ చక్కని,  కొత్తపాటని ఇక్కడ పరిచయం చేయబోతున్నాను)

1897లో ఆంధ్రదేశంలో జన్మించిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి మీద ఆ కాలంలోని అనేక ఉద్యమాల ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో భాష, సంస్కృతి, సమాజం ఈరంగాలలో అనేక మార్పులు చోటుచేసుకున్న కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం పట్టారు. ఆనాటి సాహిత్యంలో ప్రధాన మైన ధోరణి, ఉద్యమ స్థాయినందుకున్న కవితా పద్ధతి భావకవిత్వం.  గురజాడ, రాయప్రోలు సుబ్బారావుగారు తో ప్రారంభమై భావకవిత్వం శాఖోపశాఖలుగా విస్తరించింది. కవిత్వం చెప్పడంలోనే కాక ఆ కవిత్వం చెప్పేవారి రూపురేఖావిలాసాలు కూడా  కొత్తపోకడలు సంతరించుకుని భావకవులల్లిన కవిత్వం ప్రజా బాహుళ్యంలో విశిష్టమైన స్థానం సంపాదించింది.

ఆ భావకవిత్వ యుగంలోని అచ్చమైన భావకవి, దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవితా యుగంలోని అన్ని లక్షణాలు దేవులపల్లి కవిత్వంలో కనిపిస్తాయి. ప్రణయం, ప్రకృతి, దేశ భక్తి, ఆథ్యాత్మికత, సంఘ సంస్కరణ, మానవత్వం, కాల్పనికత, మార్మికత ఇలా భావకవులు  ఆ కాలంలోని  ఇతర భాషా సాహిత్యాల ప్రభావంతో చేసిన రచనలలోని ప్రధానమైన వస్తువులు. దేవులపల్లి కవిత్వంలో  ఈ అంశాలకు చెందిన గేయాలెన్నో కనిపిస్తాయి.

దేవులపల్లి గీతాలలో దేశ భక్తి గీతంగా ఎంతో ప్రసిద్ధి పొందిన గీతం -జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. 

భారతదేశాన్ని తల్లిగా భావించి దేవులపల్లిగారు రాసిన ఈ గేయం జాతీయపండుగల సందర్భాలలో  తెలుగు వాళ్ళ నోట పారాయణంగా మ్రోగుతుంది.

అయితే  దేశభక్తి అనే ఛాయతోనే ఆంధ్రదేశాన్ని తల్లిగా ఆరాధిస్తూ  దేవులపల్లి కష్ణశాస్త్రిగారు రచించిన మరొక గేయం చాలామంది తెలుగు వారికి తెలియదు.  ఆంధ్రదేశ వైభవాన్ని వర్ణిస్తూ సాగే గేయం జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ . 


 జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ గేయం పూర్తిగా సంస్కృత పదాలతో కూర్చిన గేయం అయితే, ఈ "జయ జయ మహాంధ్ర జనయిత్రీ  గేయంలో ఎక్కువగా తెలుగు పదాలను కూర్చడమే కాక తెలుగు దేశంలోని ప్రకృతి వర్ణన కూడా చేసారు కృష్ణశాస్త్రిగారు.

పట్రాయని సంగీతరావుగారు మద్రాసు కూచిపూడి ఆర్ట్ ఎకాడమీ - రూపొందించిన ఎన్నో నృత్యనాటకాలకు సంగీతం సమకూర్చారు. ఆ సమయంలో  మాష్టరు గారు వెంపటి  చినసత్యంగారి వద్ద నాట్యం నేర్చుకున్న అనేకమంది ప్రముఖ నర్తకీమణులలో సినీనటి కాంచన ఒకరు.   ఆమె తన నాట్యం లో   ప్రదర్శించడంకోసం   దక్షయజ్ఞం అనే రచన ప్రారంభించారట కృష్ణశాస్త్రిగారు. దక్షయజ్ఞం రచన కొసవరకు సాగలేదు, కానీ ఆసమయంలోనే కృష్ణశాస్త్రిగారు, " ప్రతిదినము నీ గుణకీర్తనమే పారవశ్యమున పాడెదమూ", 
" పూవులేరి తేవే చెలి"  అనే లలితగేయాలను రచించారుట.    అప్పుడు  కూచిపూడి నాటకాలకు సంగీత దర్శకుడిగా ఉన్న   పట్రాయని సంగీతరావుగారు   కృష్ణశాస్త్రిగారిని తరచు కలుసుకుంటూ ఉండేవారు. ఆ సందర్భంలోనే ఈ గేయాలను సంగీతరావుగారు  స్వరపరిచారు.  ప్రతిదినమూ నీ గుణకీర్తనమే గేయాన్ని శహనా రాగంలోను, పూ లేరి తేవే చెలి పోవలె గేయాన్ని యదుకుల కాంభోజి రాగంలోను, ఈ "జయ జయ మహాంధ్ర జనయిత్రీ " పాటను  కల్యాణి, మధ్యమావతి రాగాలలోను కూర్చారు సంగీతరావుగారు.

ఈ క్రమంలో దేవులపల్లివారు రాసుకున్న పాట  వారి స్వహస్తాలతో ఇదిగో ఇది.


ఈ పాట సాహిత్యం ప్రారంభం  ఇలా ఉంటుంది.
జయ జయ మహాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియతమ భారతధాత్రీ  ప్రియపుత్రీ శుభ ధాత్రీ

భారతదేశాన్ని తల్లిగా భావించి జయజయప్రియభారత జనయిత్రీ అని రాసిన కృష్ణశాస్త్రిగారు, ఆ భారతదేశంలో ఒక భాగమైన ఆంధ్ర దేశాన్ని భారతధాత్రీ ప్రియపుత్రీ  అంటూ  ఆ భారతమాత పుత్రికగా ఊహించారు ఈ పాటలో.

మొదటి చరణంలో పచ్చని పంటపొలాలతో సస్యాలతో కొత్త చిగుళ్ళు వేసి పచ్చగా ఉన్న ఆంధ్ర దేశాన్ని, అరటి, మామిడి,  కొబ్బరి మొదలైన వృక్షచ్ఛాయలతో నిండి వాటినుండి వచ్చే మృదువైన గాలులు  వింజామర వీచగా అతి సుందరంగా శోభిల్లే భూమిగా ఆంధ్రదేశాన్ని ఊహించారు.

రెండవ చరణంలో ఆంధ్రదేశానికి చెందిన ఘనమైన చరిత్రను స్మరించి, రాబోయే కాలాన్ని మరింత ఘనంగా ఊహించి ఇటు మంజీరా నది, అటు వంశధార నదులు ఆ తల్లిని ఘనంగా కీర్తిస్తూ ఉన్నాయట. కబరీ కాశ కదంబములూగ అంటే కొబ్బరిచెట్ల కొమ్మలు, రెల్లు పొదలు, కడిమిచెట్లు వంటి అంగాలతో చలిస్తూ ఉండగా  శబరీ, పెన్నా మొదలయిన నదులు సంతోషంతో నృత్యం చేస్తాయట. ఈ సంబరమంతా చూసి గోదావరి, కృష్ణా నదులు తమ ప్రవాహాలనే తలలను ఊపుతూ సంతోషాన్ని తెలియజేస్తాయని వర్ణిస్తారు కృష్ణశాస్త్రి.

మూడవ చరణం లో  ఈ ఆంధ్రదేశంలో వసించే వారి అన్ని కోరికలు తీరాలని, ఇటు తెలంగాణలోను, అటు కళింగదేశమయిన ఉత్తర ప్రాంతంలోను, రాయలసీమ లోను మొత్తం తెలుగు ప్రాంతాలన్నిటా వేల వేల గుమ్మాలలో మంగళనాదంగా ఆంధ్రగానం మోగాలని కోరుకుంటారు.

పాట ముగింపులో  కవి తన ప్రబోధాన్ని తెలియజేస్తారు. జగమంతా తన కుటుంబమే అని నమ్మే విశాలహృదయం కవిది. అందుకే విశాల మానవతా సమతా వాదమే మా మనోరథం అంటూ ఏ కులమతాలు, వైషమ్యాలు లేని సమానత్వంతో మానవత్వాన్ని సాధించి మనుషులంతా ఒకే కుటుంబంగా జీవించే ఆశయాన్ని సాధించాలంటారు. అందుకోసం నడుం కట్టాలంటారు. 

లోక కల్యాణం కోసం భావితరాల సౌభ్రాతృత్వం కోసం, స్వేచ్ఛకోసం ధృఢమైన శపథం తీసుకోవాలని బోధిస్తారు. ఒక్క క్షణకాలం కూడా వృథా చేయకుండా ఈ ఆశయసాధనకోసం అంకితం అవుతామని, గమ్యంకోసం సాగే ప్రయాణంలో తమ అడుగులు చెదరవని  సంకల్పాన్ని వెల్లడిస్తారు. ఇటువంటి మహదాశయంతో సాగిపోయే తమను తల్లిగా ఆశీర్వదించమని శుభము, శాంతి కలగాలని దీవించమని కోరుతారు.

సకల మానవకల్యాణమే విశ్వకవి కోరుకునే ఆశయం.
ఆ లోకకల్యాణంకోసమే కవి పూరించే ఈ మంగళకాహళి.

పాట సాహిత్యం :

          జయ జయ మహాంధ్ర జనయిత్రీ
          జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ
          జయ జయ ప్రియతమ భారతధాత్రీ 
          ప్రియపుత్రీ శుభ ధాత్రీ


1 చరణం.    శ్యామల నవ సస్యాంబరా
              కోమల సుమవల్లీ చికురా
              కదళీ రసాల లాంగలీ ఛలచ్ఛద
              మృదులానిల జామరా
              సుందరాతి సుందర వసుంధరా 
                                            "జయ జయ మహాంధ్ర"
2 చరణం.    నీ పూర్వ చరిత స్మరియించి
               నీ భావి ఘనత దర్శించి
               ఇటు మంజీర అటు వంశధార 
               ఎలుగెత్తి నిన్ను కీర్తించూ
               కబరీ కాశ కదంబములూగ 
               శబరీ పెన్నలు నర్తించు
               మరి మరి కృష్ణా గోదావరి 
               ఝరులు తలలూపి హర్షించు
                                              "జయ జయమహాంధ్ర"
 3 చరణం   ఎల్లర కోర్కులు నిండునని 
              మనమెల్లరమొక సంసారమని
              ఇటు తెలంగాణ  అటు కళింగాన
              అట నట కోస్తా రాయలసీమల
              సహస్ర సహస్ర మందిర గేహళి
              సదా మ్రోగు నీ మంగళ కాహళి  "జయ                                                                                జయమహాంధ్ర"
  ముగింపు:     శ్రీ విశాల మానవతా సమతా
                     సాధనమే మా మనోరథం
                      భావిలోక కల్యాణ సుస్థిర  
                      స్థాపనమే మా దృఢ శపథం
                      ఒక క్షణమేని వృథ పోనీము
                      ఒక అడుగేని చెదరనీయము
                      శ్రీరస్తు శుభమస్తని శాంతి రస్తని దీవించు  
                                               

    ( జయ జయ మహాంధ్ర జనయిత్రీ  వినడానికి వీడియో పైన  క్లిక్ చేయండి)

Saturday, February 11, 2012

ఇద్దరు మిత్రులు

ఇక్కడ చెప్పబోతున్న ఇద్దరు మిత్రులు, మన మధురగాయకుడు ఘంటసాల, కలైమామణి పట్రాయని  సంగీతరావూను.

పట్రాయని సీతారామశాస్త్రిగారు ఘంటసాలకి విజయనగరంలో  సంగీతవిద్య నేర్పిన గురువుగారు .గురువుగారి నుండి సంగీత విద్యను గ్రహించడమే కాకుండా ఆయన  వ్యక్తిత్వాన్ని జీవితాదర్శంగా చేసుకున్న గొప్ప శిష్యుడు ఘంటసాల. 

భాషలోని సాహిత్యభావానికి తగిన సంగీతకల్పన చేయడంలోతెలుగుపాటలో మాట తెలుగుమాటగా వినిపించాలన్న గురువుగారి ఆదర్శాన్ని ఘంటసాలగారు అక్షరాలా ఆచరించారు. గురువుగారి ప్రభావం వలననే భవిష్యత్తులో నా సంగీతానికి ఒక విశిష్టతప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడ్డాయి’ – అన్నారు ఒకచోట ఘంటసాల.

సీతారామశాస్త్రిగారు సంగీతాన్ని ఒకయోగంగా సాధనచేసిన గొప్ప సాధకులు. అనేకగీతాలను రచించి స్వరపరచి గానం చేసిన వాగ్గేయకారుడు.  గురువుగారి పట్ల ఎంతో వినయంతో పాటు అత్యంత ఆత్మీయతానురాగాలను చూపేవారు ఘంటసాల. 

గురువుగారి  ప్రథమ పుత్రులు సంగీతరావుగారు. పట్రాయని వంశంలోని తాతగారి, తండ్రిగారి సంగీత సాహిత్య స్వరసంపదను వారసత్వంగా అందుకున్నారు. అతి చిన్నవయసునుండే సంగీతకచేరీలు చేస్తూ ప్రముఖుల మన్ననలు పొందారు. 

ఘంటసాల విజయనగరంలో కొంతకాలం గురువుగారి ఆశ్రయంలో ఉండవలసిన పరిస్థితిలో వయసు తేడా ఎక్కువగా లేని సంగీతరావుగారు, ఘంటసాల మధ్య మైత్రి చిగురించింది. తరువాత ఘంటసాల మద్రాసుచేరి మంచి సంగీత దర్శకుడుగా స్థిరపడ్డారు. 1954 లో అనుకోకుండా మద్రాసు కి వచ్చిన  సంగీతరావుగారు ఘంటసాలగారి ఆహ్వానం మేరకు వారి ఆర్కెష్ట్రాలో హార్మోనియం వాయిద్యకారుడుగా, ఘంటసాలగారికి స్వరసహచరుడిగా మద్రాసులో ఉండిపోయారు.


1955లో ఘంటసాల  స్వంత ఆర్కెష్ట్రాని ప్రారంభించారు. అప్పటినుండి  ఘంటసాల  సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు అన్నిటిలోనూ సంగీతరావుగారు తనవంతు సహకారం అందించారు.ఘంటసాల స్వరపరుస్తూన్నప్పుడు వాటికి  నోట్స్ రాసి ఇవ్వడం, ఆర్కెష్ట్రాకి సూచనలు ఇవ్వడం  చేసేవారు సంగీతరావుగారు. పాట స్వరపరచినప్పుడు స్వరాలు రాసి ఇవ్వడం అనేది సులభమైన పని కాదు. చాలా శ్రమతో కూడుకున్నది.
పాట కంపోజ్ చేస్తున్నప్పుడు ఘంటసాల అలా పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే కాని స్వరాలు రాసుకోవడానికి టైం ఉండేది కాదు. అప్పుడా స్వరాలను గుర్తుపెట్టుకొని హార్మోనియం మీద నోట్ చేసుకోవడం సంగీతరావుగారు చేసేవారు. అలాగే  పాటలను కర్ణాటక సంగీతపరంగా ప్రయోగాత్మకంగా కూర్చినప్పుడు  సంగీతరావుగారికి గల అపారమైన సంగీత ప్రతిభ తెలిసిన ఘంటసాల సందర్భానుసారంగా ఉపయోగించుకునేవారు.


ఘంటసాల సంగీతరావుగారిని సంగీతం బాబూ అని పిలిచేవారుట. ఒక్కోసారి మేష్టారూ అని కూడా సంబోధించేవారట. శ్రీ ఘంటసాలగారి విద్యార్ధి దశనుంచి ఆయన జీవితకాల పర్యంతం అనేక దశలలో సంగీతరావుగారు ఆయన మిత్రుడిగా, సహచరుడిగా మెలిగారు. అటువంటి తన గురుపుత్రుడుగా, ఓమంచి మిత్రుడిగా సంగీతరావుగారిని ఘంటసాలగారు తన జీవితాంతం కూడా ఎంతో ఆదరాభిమానాలు కనపరిచి గౌరవించారు. 




మొదటిసారి ఈ ఇద్దరూ కలుసుకున్న ముహూర్తబలం ఎటువంటిదోకాని ఘంటసాలగారి మరణ పర్యంతం సుమారు పాతిక సంవత్సరాలపాటు  ఇద్దరూ కలిసి ఎంతో ప్రియమిత్రులుగా చరించారు. వృత్తిలోను, ప్రవృత్తిలోను మమేకమైనారు.  ఘంటసాలగారి ఇంటి వెనుక భాగంలోనే సంగీతరావుగారి కాపురం.  రికార్డింగులకి కలిసే వెళ్ళేవారు. ఇరువురి కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉండేవి. పిల్లలంతా కలిసి పెరిగారు.  ఘంటసాల విదేశీయాత్ర చేసినా, ఎక్కడ కచేరీలు చేసినా  పక్కనే ఉండేవారు సంగీతరావుగారు. స్వర కల్పన చేసినప్పుడు స్వరాలు రాయడం,హార్మోనియంతో వా                   ద్య సహకారం చేసేవారు. 


ఈ విధంగా పాతిక సంవత్సరాలకు పైగా స్వరమైత్రితో, పవిత్రమైన  స్నేహబంధంతో  చిరమిత్రులుగా ఎంతో ఆత్మీయతానురాగాలతో ముడిపడిన                                    
బంధం  వీరిద్దరిదీ.

ఆ బంధానికి గుర్తుగా  డిసెంబరు 4, 2006 న  అప్పటి ముఖ్యమంత్రి డా.రాజశేఖరడ్డి  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున  ఘంటసాల అవార్డ్              పేరుతో సంగీతరావుగారిని సత్కరించారు. 


మళ్ళీ ఈరోజు ఫిబ్రవరి 11, 2012 న ఘంటసాలగారి స్మృత్యర్థం ప్రతి           సంవత్సరం  ఇచ్చే  ఘంటసాల ప్రతిభా పురస్కారం అవార్డును  శ్రీ సంగీతరావుగారు అందుకోనున్నారు.  ఘంటసాల, సంగీతరావుగారి మధ్యగల మధురమైన స్నేహానుబంధానికి గుర్తుగా, సంగీత కళకు, నాట్యకళకు సంగీతరావుగారు అందించిన సేవలను గుర్తించి  ఈ అవార్డును 
సంగీతరావుగారికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు రూపంలో ఇచ్చి సన్మానించనున్నారు.

ఘంటసాలగారు మరణించి 38 సంవత్సరాలు గడిచింది. అయినా తెలుగు హృదయాలలో చిరంజీవి ఆయన.

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు - అన్నాడు మనసుకవి ఆత్రేయ. ఘంటసాలగారు మనకి వదిలి వెళ్ళిన తీపిగురుతు అయిన  ఈ ఇద్దరు మిత్రుల అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసే సందర్బం ఇది.

శ్రీ సంగీతరావుగారికి అభినందనలు.


ప్రియమిత్రులు ఘంటసాలగారి గురించి సంగీతరావుగారి మాటల్లో తెలుసుకోవాలంటే ఇక్కడ వినవచ్చు.


11 ఫిబ్రవరి, 2012నాటి సన్మాన సభ వివరాలు :