visitors

Friday, September 18, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదహేడవ భాగం

18.09.20 - శుక్రవారం భాగం - 17*:
పదహారవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

చెళ్ళపిళ్ళ వరహాలమ్మ గారు మా దొడ్డమ్మగారు. మహా దొడ్డ వ్యక్తి. ఎవరైనా ఆదర్శ మహిళ పేరు చెప్పమంటే ఆవిడ పేరే చెపుతాను. ఆవిడ జీవితాన్ని చూసి నేర్చుకోవలసినవి, నేర్చుకున్నవి చాలానే ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాలను ప్రస్తావిస్తాను. 

(తోటపల్లి కొండలు శాంతి ఆశ్రమంలో  దొడ్డమ్మ చెళ్ళపిళ్ళ వరహాలమ్మగారితో పెద్ద చెల్లెలు రమణమ్మ రెండో చెల్లెలు పద్మావతి) 

ఆవిడ ఒకే కూతురు మా శారదక్క. మా శారద చిన్నతనంలోనే తండ్రి పోయారు. ఆయన పేరు చెళ్ళపిళ్ళ అప్పల నరసింహంగారు. ప్రస్తుత ఒరిస్సాలోని రాయఘడాలో వుండేవారు. మా దొడ్డమ్మగారికి ఆయనకు  పదమూడేళ్ళకు తక్కువ లేకుండా వయోభేదం వుండేది. బాల్య వివాహమే. ఆయన ఆయుర్వేద డాక్టర్ కమ్ సంగీతం మాస్టర్. ఆయన గొప్ప సంగీత శాస్త్రపరిజ్ఞానం కలిగినవాడు. ఈరోజుల్లో అలాటివారు మ్యూజికాలజిస్ట్ లుగా గొప్ప గుర్తింపు పొందుతున్నారు. ఆయనదంతా మాటల సంగీతం. వారి నలుగురన్నదమ్ములకూ సంగీతమే వృత్తి. ఆయన సంగీతం మీద కాకుండా ఆయుర్వేదం మీద దృష్టిపెట్టి వుంటే బాగా రాణించివుండేవారని మా నాన్నగారి అభిప్రాయం. నేను పుట్టడానికి చాలా కాలం మునుపే ఆయన పోయుండాలి. నాకు ఊహ తెలిసినప్పటినుండి, మా దొడ్డమ్మగారు, శారద మా బొబ్బిలి తాతగారి సంరక్షణలోనే వుండేవారు.

మా దొడ్డమ్మగారు వారి రాయఘడా గురించి చెప్పిన వాటిలో ఒక విషయం మాత్రం భయంకరంగా ఒళ్ళు గగుర్పొడిచేదిగా ఉండి గుర్తుండిపోయింది. రాయఘడా ఊరు చుట్టూ కొండలు అడవులు వుండేవి. సాయంత్రమైతే నరసంచారం ఉండేదికాదు. అందరు ఇళ్ళలో తలుపులు మూసుకునే ఉండేవారట. కొంచెం రాత్రి పడగానే పక్కనున్న కొండల్లోంచి చిరుతలు, ఎలుగుబంట్లలాటివి ఊళ్ళో వీధుల్లోకి వచ్చి మూసి ఉన్నతలుపులు మీద పంజాలతో బాదుతూ నానా హంగామా చేసేవిట. ఆవిడ ఆ విషయాలు చెపుతూంటే నాకు చాలా భయంగా అనిపించేది. మరి అలాటి ఊళ్ళో వుండేకంటే వేరే మంచి ఊళ్ళో వుండవచ్చు కదా అని అమాయకంగా అడిగేవాడిని. ఉన్న ఊరు మారడం అంత సులభమా? విధి నిర్ణయప్రకారమే కదా ఏదైనా జరిగేది. ప్రయత్నం మాత్రమే మానవుడు చేయగలడు.

మా శారద ఎనిమిదో క్లాసు వరకూ బొబ్బిలి గర్ల్స్ స్కూల్ లో చదివి మానేసింది. తన పదహారవ ఏట వివాహం నిశ్చయమయింది. ఈ విషయంలో మా నాన్నగారి తోడ్పాటు, ప్రమేయం ఉన్నట్లు విన్నాను. వరుడు భళ్ళమూడి సత్యనారాయణ. వారిది కుద్దిగాం అనే కుగ్రామం. ఇది ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో శ్రీకాకుళం జిల్లాలో ఉంది. 

(శారదక్క, బావగారు భళ్ళమూడి సత్యనారయణగారు)
సాధారణంగా తెలుగువారిళ్ళల్లో పెళ్ళిళ్ళు ఆడపిల్లవారింటనే జరగడం ఆనవాయితి. కానీ, మా శారద పెళ్ళి వరుని ఇంట జరిగింది. బొబ్బిల్నుంచి ఆ కుద్దిగాం ఇప్పటి రోడ్, రైలు రవాణా సౌకర్యాల దృష్ట్యా ఇప్పుడు ఓ నాలుగైదు గంటల ప్రయాణం. కానీ, మేము 1953లో ఉదయం బయల్దేరితే, అర్ధరాత్రికి ఆ ఊరు చేరుకోగలిగాము. బస్, రైలు, ఎడ్లబళ్ళంటూ అన్ని వాహనాలు ఎక్కేము. పెళ్ళి వైశాఖ మాసం(ఎండాకాలం) కావడాన పడవ ఎక్కే అవకాశం రాలేదు. అదే వర్షాకాలమైతే వరద పరిస్ధితిని బట్టి వంశధారానది ప్రతాపాన్ని చూడవలసి వచ్చేది. మా రైలు ప్రయాణంలో మధ్యాహ్న భోజనాల సమయంలో ఏదో స్టేషన్ లో రైలు వచ్చి ఆగింది. నా జ్ఞాపకం ప్రకారం అది నౌపడా స్టేషన్ కావచ్చు. అది వాటరింగ్ స్టేషన్ కూడాను. మళ్ళీ బండి బయల్దేరడానికి మరో గంటన్నా పడుతుందని ప్రయాణీకులంతా స్టేషన్ బయటకు భోజనాలకు వెడుతూంటే మా పెళ్ళి బృందంలో కొందరు భోజనాలకు బయల్దేరారు.  వారిలో నేనూ ఉన్నాను. ఆరోజుల్లో మా ఇళ్ళలోని ఆడవారు బయట భోజనాలు చేయడం అన్నది కనీవినీ ఎరుగరు. అరటిపళ్ళు, మంచినీళ్ళతోనో సరిపెట్టుకోవలసిందే. అక్కడ స్టేషన్ బయట హోటలు అని అందరూ అంటున్నది ఒక పూటకూళ్ళమ్మ సత్రంలాటిది. పూరిల్లు. అక్కడ అందరూ రెండు మూడు వరసల్లో క్రిందనే కూర్చునేవారు. విస్తరాకులలో వడ్డన.  మా ఛాన్స్ వచ్చేప్పటికి అన్నంతో పాటు ఉడికించిన పెసరపప్పు, ఏదో కూర, గోంగూర పచ్చడి వంటి పదార్ధాలుతో భోజనం వడ్డించారు. అయితే, మేము ఎవరమూ ఆ పదార్ధాల రుచిని మెచ్చుకుని తినే స్థితిలో లేము.  నాకైతే తినడం లేటయితే రైలు వెళ్ళిపోతుందనే భయం. మా రైలు మళ్ళా ప్రయాణం సాగించి మమ్మల్ని పర్లాకిమిడి స్టేషన్ లో పడేసింది. ఇప్పుడు ఆ ఊరు పేరు పర్లాఖముండీగా మారింది. అక్కడనుండి వేరే రైలు ఎక్కి హద్దుబంగీ అనే స్టేషన్ లో దిగాలి. హద్దుబంగీలో ఎడ్లబండి  ఎక్కి మరికొన్ని మైళ్ళు ప్రయాణం చెయ్యాలి. అప్పటికే చీకటి పడింది. పర్లాకిమిడి నుంచి నేరోగేజ్ రైలు. ఊటీ హిల్ ట్రైన్ లా ఆ రైళ్ళు చాలా నెమ్మదిగా నడిచేవి. ఆనాటి ట్రైన్స్ అన్నిటికీ స్టీమ్ ఇంజిన్లే. రాక్షసిబొగ్గు సహాయంతో నడిచే స్టీమ్ ఇంజిన్లు. (ఇంగ్లీషులో రైల్/రైల్స్  అంటే పట్టా/పట్టాలు. తెలుగులో రైలు/రైళ్ళు అంటే ట్రైన్. ఇంగ్లీష్ రైల్స్ మీద నడిచే బళ్ళు తెలుగు రైళ్ళు. ట్రైన్ అనగా తెలుగులో రైలు!)  

ఈ పొగబళ్ళ ప్రయాణాల తరవాత మనుషుల ఆకారాలు వికారాలయ్యేవి.  ఎంతటి వైజయంతీమాలలైనా  'నాదీ ఆడజన్మే' సావిత్రిలయిపోతారు. లక్స్ సబ్బు బిళ్ళలు అరగదీసి మొహానికి కాశ్మీర్ స్నోలు, హిమాలయా పౌడర్లు దట్టంగా పట్టించవలసిందే. 

ఈ రైలు ఇంజిన్లు ఘాట్ సెక్షన్ లలో పరిగెత్తలేవు. నెమ్మదిగా నడుస్తూ వెళ్తాయి. ఎత్తుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు వేగం మరింత తగ్గిపోయి కాలినడకన వెళ్ళడమే సుఖమనుకునేలా ఉండేవి. ఆ రైలు ఇంజన్లకు' రాముడు‌, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు' అని పేర్లుండేవి. ఇవేళ్టి ఇంజన్ రాముడా, హనుమంతుడా అని అనుకునేవారు. అలాటి ఒక రైలెక్కి హద్దుబంగీ స్టేషన్ లో దిగేప్పటికి రాత్రి పది దాటిందనుకుంటాను. స్టేషనంతా చిమ్మచీకటి. స్టేషన్లో అక్కడక్కడ చిన్న చిన్న లాంతర్లు. ఆ వెలుగులో బయటకు వచ్చి మగపెళ్ళివారు పంపిన  రెండో మూడో ఎడ్లబళ్ళలో మా పెళ్ళి బృందమంతా ఎక్కి కుద్దిగాంకు ప్రయాణం కట్టాము. వేసవి కావడం వలన వంశధారలో నీళ్ళు ఎక్కువగా లేకుండా బళ్ళు ఏటిలోనుండే వెళ్ళాయి. పెళ్ళివారింటికి చేరేసరికి బాగా రాత్రయిపోయింది. నేనైతే బండిలోనే నిద్రపోయాను.

నేను మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఊరంతా పూరిళ్ళమయం. ఈ పెళ్ళివారింట్లో ఒకపక్క గొడ్ల సావిడి. మరో పక్క ఒక నల్లబల్లతో చిన్న  గది. అది ఒక ఎలిమెంటరీ స్కూలని చెప్పారు. అక్కడ కూడా ఏవో బస్తాలు, పాత సమాన్లతో నిండివుంది.

పెళ్ళికొడుకు తండ్రిగారి పేరు కూడా సత్యనారాయణగారే. ఇంట్లోని పెద్దకొడుకులకు సత్యనారాయణ పేరు పెట్టడం ఆనవాయితిట. ఆయన పేరుకు ముందు 'ఈశ్వర' అని ఉంటుంది. కొడుకు పేరు ముందు  'అప్పల' అని గుర్తు.  ఇప్పుడు ఆయన పెద్దమనవడి పేరు కూడా ఈశ్వర సత్యనారాయణే. మేమంతా ఈశ్వరుడు అంటాము. 

(ఈశ్వరుణ్ణి ఎత్తుకున్న శారదక్క)
ఆ భళ్ళమూడి సత్యనారాయణగారు కుద్దిగాంలో సింగిల్ స్కూల్ టీచర్. పేరుకే స్కూలు. పిల్లలెవరూ వుండరు అందరూ పొలంపనులకో, ఆవులను మేపుకుందుకో పోతూంటారు. జన్మానికో శివరాత్రిగా ఎవరైనా స్కూళ్ళ ఇన్స్పెక్టర్ పొరపాటున ఆ నది దాటుకొని రాగలిగితే, విషయం ముందే తెలుసుకొని పదిమంది పిల్లలను పోగేసి  అల, వల, తల, రెండొకట్ల రెండూ, మూడు నాలుగులు పన్నెండని అరిపించి, వచ్చిన అధికారికి తగిన ఆతిధ్యమిచ్చి పంపించేస్తారు. ఈ తతంగమంతా వచ్చిన అధికారికి తెలుసు. పిల్లలు లేరంటే స్కూల్ ఎందుకని మూసేస్తారు. వచ్చే నాలుగురూకలు రాకుండా పోతాయి. అయితే వీరికి ముఖ్యమైన వృత్తి ఆయుర్వేద వైద్యం. ఇంట్లో అందరూ వైద్యులే. అలాగే తండ్రీకొడుకులు ఇద్దరూ మంచి మార్దంగికులు. చుట్టుపక్కల జరిగే హరికథా కాలక్షేపాలకు మృదంగ సహకారం అందిస్తారు. వీరికి మంత్ర శాస్త్రంలో ప్రవేశముందని చెపుతారు. ఆరోజుల్లో సుప్రసిధ్ధ మంత్రశాస్త్రవేత్తగా పేరుపొందిన మండా సూర్యనారాయణ శాస్త్రిగారి శిష్యులు. 

శ్రీ మండా సూర్యనారాయణ శాస్త్రిగారు

శ్రీ మండా సూర్యనారాయణ శాస్త్రిగారు ప్రముఖ హరికధా కళాకారిణి మండా కమలకుమారిగారి తండ్రి. 'ముత్యాలముగ్గు' రావు గోపాలరావు గారికి మామగారు.

నాకు ఊహ తెలిసాక జరిగిన, నేను వెళ్ళిన మొట్టమొదటి పెళ్ళి మా శారదదే. పెళ్ళిళ్ళు, పెళ్ళితతంగాలు ఎలా వుంటాయో మొదటిసారిగా చూసింది అక్కడే. అందుచేత ప్రతీ విషయమూ ఒక వింతే, విశేషమే.

ఉదయాన్నే పెళ్ళివారందరికీ అల్పాహార విందుగా అడ్డాకుల విస్తళ్ళలో ఉప్మాలాటి ఉప్పుపిండి, లేదా ఉప్పుపిండిలాటి ఉప్మాను తీసుకువచ్చి పెట్టారు. పక్కనే పెద్ద పెద్ద ఇత్తడి గ్లాసుల్లో ఫుల్ గా కాఫీ అనే ద్రవ పదార్ధం. పేరుకు అల్పాహారం. కాని విస్తరినిండా వున్న ఆ రాశిని చూస్తే  మరో రెండురోజుల వరకూ భోజనమే అవసరం లేదనట్లు అనిపించింది. నాకు ముందునుంచీ ఉప్మా అంటే చిన్నచూపే. ఆ పెళ్ళివారింట ఉప్మాలాటి ఆ పదార్ధం తిన్న కొన్ని దశాబ్దాల వరకు ఉప్మా పేరును కూడా నా తలపులలోకి రానిచ్చేవాడిని కాదు. (అలాటిది ఇప్పుడు, కాలమహిమ, రెండ్రోజులకు ఒకసారి మా ఆవిడ పెట్టే రవ్వ ఉప్మావో, సేమ్యా ఊప్మావో, ఉప్పుడుపిండో మహదానందంగా తినేస్తా.) కానీ అవేళ అక్కడ వద్దని చెప్పడానికి నాకు తెలిసిన మావాళ్ళెవరు పక్కనలేరు. మా పెద్ద చెల్లెలు రమణమ్మ అప్పటికి  నెలల పిల్ల. అందువల్ల తనను చూసుకుంటూ మా అమ్మగారెక్కడో ఉన్నారు. ఆ పెళ్ళికొడుకు ఇంట్లో ఆడవాళ్లు ఎవరూలేరు. ముగ్గురూ మగపిల్లలే. వంటలూ, వార్పులూ, వడ్డనలకు ఊళ్ళోనే వున్న వారి బంధుజనం వచ్చి సహాయం చేసినట్లు విన్నాను. తరువాత, ఓ పదిగంటలకు స్నానాల కార్యక్రమం అని ఏటి ఒడ్డుకు పదమన్నారు. నాకు నూతి దగ్గర వేడినీళ్ళతో స్నానమే అలవాటు. ఏటి స్నానమంటే భయం. కలివరం ఏట్లో ములిగిపోయిన అనుభవం తరువాత పారే ఏరన్నా, నదన్నా భయమే. ఈలోగా, పెళ్ళికొడుకు తమ్ముళ్ళతో మాట్లాడేందుకు మరో యిద్దరు వచ్చారు. వారిని నా దగ్గరకు తీసుకువచ్చి మా 'నేస్తులు' అని వాళ్ళ పేర్లేవో చెప్పారు. ఆ ప్రాంతాలలో స్నేహితులను 'నేస్తాలు' అని అంటారని అప్పుడే విన్నాను. మా నాన్నగారు అప్పటికి రెండుసార్లు మెడ్రాస్ వెళ్ళి వచ్చారని తెలిసి అక్కడి ఎన్టీవోడు, నాగయ్య, రేలంగి నాగెస్సర్రావు,  అంజలి, శివరావు, ఘంటసాల అంటూ ఏవో సినీమా విషయాలేవో అడగబోయారు. నిజానికి నాకప్పటికి ఆ విషయాలేవీ తెలియవు. ఇంతలో మా కాబోయే అల్లుడిగారి తమ్ముడొకరు అడ్డు తగిలి 'మరీ బెంటులా మాట్లాడతావేటి ఇప్పుడూ..' అంటూ విసుకున్నాడు. ఆ 'బెంటు' అనే మాటకు  సరైన అర్ధం నాకు తెలియదు. బహుశా 'పల్లెటూరి బైతు' లాటి మాట కావచ్చును. మొత్తానికి వీళ్ళందరూ కలసి నన్ను స్నానం పేరిట వంశధారలో ముంచారు. అలవాటు లేని ఔపాసన. వాళ్ళంతా నన్ను ఒక్కసారిగా నీళ్ళలో ముంచేప్పటికి నీళ్ళన్ని తాగి,  అవి ముక్కుల్లోకి వెళ్ళి చాలా ఉక్కిరిబిక్కిరి అయింది. వాళ్ళూ కొంత భయపడ్డారు. కొంతసేపయాక సద్దుకుంది. ఆ ఏటి ఒడ్డునుండి నాలుగుపక్కలా ఉన్న ప్రాంతాలను చూపిస్తూ అటుపక్క నివగాం, అక్కడ కొత్తూరు అంటూ చుట్టుపక్కల ఊళ్ళ గురించి చెప్పారు. 

అక్కడికి కొంత దూరంలో గుణుపూర్ అనే ఊరుంది. ఆ ఊళ్ళో మా తాతగారి దగ్గర సంగీతం నేర్చుకున్న ముద్దు పాపారావు అనే ఆయన వుండేవారు. 

(శిష్యులతో తాతగారు పట్రాయని సీతారామశాస్త్రిగారు

ఆయన ఘంటసాలగారికి విజయనగరం సంగీత కళాశాలలో సహధ్యాయి. ఇద్దరూ ప్రాణస్నేహితులు. పైనున్న తాతగారితో ఘంటసాలగారు ఇతర శిష్యులు ఉన్న ఫోటోలో తాతగారి వెనక ఉన్నవారే ముద్దు పాపారావుగారు. 

ఈ ఊళ్ళన్నీ  శ్రీకాకుళం జిల్లాలోని తెలుగు ప్రాంతాలే. కాకపోతే  అక్కడివారి మీద ఒరియా ప్రభావం కనిపిస్తుంది. నా వరకూ, మీఠాకిళ్ళీలు, కారా(జరదా)కిళ్ళీలు నమలడం ఉమ్మడంలాటి అలవాట్లు, మగాళ్ళందరి హెయిర్ స్టైల్, ఇలా కొన్ని విషయాల్లో అందరూ ఒకేలా కనిపించారు. ఇక వాళ్ళు  ఏవో కబుర్లు చెపుతూంటే, నేను వింటూ మళ్ళీ ఊళ్ళోకి వచ్చేము. 

మధ్యాహ్నం ఓ రెండు గంటల ప్రాంతంలో భోజనాలకు పిలుపులు వచ్చాయి. మేము బొబ్బిలిలో అరటి ఆకులలో భోజనం చేసేవాళ్ళం. ఇక్కడ ఈ పెళ్ళివారు పెద్ద పెద్ద తామరాకులు తీసుకువచ్చి పెట్టారు. తామరాకులలో కూడా భోజనం చేస్తారని అప్పుడే తెలిసింది. ఆ ఆకుల్లో వేడి వేడి అన్నం, పప్పు, కూరలు, పులుసులాటివి వడ్డించేసరికి ఆకు మధ్యలోని బుడిపెల్లోంచి ఆవిరి బుడగలు రావడం ఒక తమాషాగా అనిపించింది. అలాగే, నేను పుట్టిన ఎనిమిదేళ్ళలో మొదటిసారిగా ఆవపెట్టిన పనసపొట్టు కూర తినడం అక్కడే జరిగింది. నిజం చెప్పొద్దూ, ఆ పనసపొట్టు కూర మహాద్భుతం. అంత రుచికరమైన కూర అప్పటివరకూ తినలేదు. మా ప్రాంతాలలో జరిగే  పెళ్ళిళ్ళలో పనసపొట్టు కూర ఒక స్పెషల్ డిష్. ఆ కూరను వండడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆ పనసపొట్టు కూర తినేవాళ్ళకు అమృతతుల్యమే అనిపించినా వండడం మహా పీకులాట వ్యవహారమని తర్వాత తెలిసింది.  కూరకు పనికివచ్చే పనసకాయను ఎంచుకోవడం దానిని కొయ్యడానికి తగిన కత్తి, తరిగేప్పుడు జిగురు అంటుకోకుండా ఏదో నూనెలు పూసుకోవడం, కూరకు తగిన విధంగా పదునుగా పొట్టుగా నలగగొట్టడం, అది కూరగా వండడానికి సమపాళ్ళలో కావలసిన దినుసులు - వీటన్నిటితో రుచికరంగా చేయడమనేది సాధారణ  ఇంటి ఇల్లాళ్ళకు సాధ్యమయే పనికాదు. పాకశాస్త్రంలో ఆరితేరినవాళ్ళే ఈ competitive పనసపొట్టు కూరను వండి మెప్పించగలరు. 

ఇక పెళ్ళి అర్ధరాత్రి ముహుర్తం. అది తెలుగువారి ప్రత్యేకత. తమిళనాడు ముహుర్తాలు చాలా హాయి. తొమ్మిది నుండి పదకొండు లోపల ముహుర్తాలే ఎక్కువ. శుభ్రంగా ఉదయం పెళ్ళికి హాజరేయించుకొని , పదకొండు గంటలకు భోజనాలు కానిచ్చేసి, హాయిగా ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు. ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం రెండు లోపల అన్ని తతంగాలు ముగించేసి కళ్యాణమండపం ఖాళీ చేసేస్తారు. ఒకానొక కాలంలో పెళ్ళిళ్ళు ఒక్కో రోజు ఒక్కొక్క ఐటమ్ చొప్పున పదహారు రోజులపాటు జరిపేవారట. ఇప్పుడు పదహారు గంటలే ఎక్కువగా భావిస్తున్నారు. ఇప్పటి పెళ్ళిళ్ళలో పెళ్ళి తంతుకన్నా బ్యూటీ పార్లర్లలో ఒంటి డెకరేషన్ కే ఎక్కువ సమయం పడుతుంది. లేకపోతే  రిసెప్షన్, పెళ్ళి వీడియోలలో మొహం అసయ్యంగా ఉంటుంది కదా. కలకాలం ఆ మొహాలు చూసుకోడం భయంకరం కదా. ఈనాడు మన భారతీయ వివాహ ప్రక్రియే పూర్తిగా మారిపోయింది.

మా శారద పెళ్ళికి ముందే సాయంత్రం మా నాన్నగారి సంగీత కచేరీ జరిగింది. పెళ్ళికొడుకే మృదంగం వాయించారు. చీకటి పడుతున్న సమయానికి ఎక్కడినుండో మూడు పెట్రోమాక్స్ లైట్లను తీసుకువచ్చారు. అలాటి లైట్లను కలివరంలో దూరం నుంచి చూశాను. కానీ అవి వెలగడానికి ఎంత శ్రమపడాలో ఇక్కడే దగ్గర నుంచి చూసాను. వాటి టాంక్ లో కిరొసిన్ పోసి పంపు కొట్టడం, గేస్ మేంటల్ మాత్రమే అంటుకునేలా వెలిగించడం, మంచి వెలుగు వచ్చేవరకూ కుస్తీలు పట్టడం చికాకు పనే. 




ఒకసారి వెలిగిస్తే కొన్ని గంటలపాటూ దేదీప్యమానంగా వెలుగుతాయి. అలాటి లైట్ల వెలుగులో మా నాన్నగారి కచేరీ, రాత్రి భోజనాలు, అర్ధరాత్రి పెళ్ళి ముహుర్తం, ఇతర తంతులన్నీ సవ్యంగా ముగిసాయని చెప్పారు. ఒక రాత్రయాక నేను పూర్తిగా నిద్రపోయాను. ఏం జరిగింది నాకు తెలియనే తెలియదు. అలాగే, కాశీయాత్ర సమయంలో పెళ్ళికూతురి తమ్ముడిగా చేయవలసిన తంతులో పాల్గొన్నానో లేదో ఆ విషయాలేవి నా జ్ఞాపకాలలో లేవు. అవన్నీ నెమరు వేసుకుందుకు ఇప్పటిలా  విడియో కేసట్లు, కలర్ ఆల్బంలు, కనీసం, బ్లాక్&వైట్ ఫోటోలు కూడాలేవు. పెళ్ళయ్యాక ఆ కుద్దిగాంలో ఎన్నాళ్ళున్నామో సరిగా గుర్తులేదు,కానీ, అక్కడ నుండి మేము విజయనగరం/బొబ్బిలి వేపు ప్రయాణం కట్టడం జరిగింది. 
             
1954 లో ఒకసారి మా నాన్నగారు కలివరం నాయుడిగారి ఆహ్వానం మీద తిరుపతి వెళ్ళారు. అక్కడికి వారికి బంధువు, ప్రముఖ చిత్ర దర్శకుడైన బి ఎ సుబ్బారావు రాగా వారందరూ స్వామి దర్శనం తరువాత మెడ్రాస్ ప్రయాణం కట్టారు. మెడ్రాస్ లో వీళ్ళంతా కలసి ఘంటసాలవారి ని చూడాలని త్యాగరాయనగర్ (టి.నగర్)లో నెం.35, ఉస్మాన్ రోడ్ కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన సమయానికి ఘంటసాలగారు ఇంట్లోలేరట. 'కన్యాశుల్కం' సినీమా పాటల రికార్డింగుకు వెళ్ళారట. మా నాన్నగారు, నాయుడుగారు కొంతసేపు అక్కడ గడిపి తిరిగి బసకు వచ్చేశారు. మర్నాడు ఉదయమో, సాయంత్రమో రైలుకు బయల్దేరే సమయానికి ఘంటసాలగారు ఆ హోటల్ కు వచ్చి, మా నాన్నగారిని వెళ్ళడానికి వీలులేదని, చేతినిండా సినీమాలపని ఉందని తనతోనో ఉండిపొమ్మని బలవంతపెట్టి నాయుడిగారిని మాత్రం తిరిగి వెళ్ళమని చెప్పి మా నాన్నగారిని తనతో కూడా కారులో తమ ఇంటికి తీసుకువచ్చేశారట. తరువాత ఒక ఏణ్ణర్ధం పాటు నేను మా నాన్నగారిని చూడలేదు. మధ్య మధ్య క్షేమ సమాచారాలతో ఉత్తరాలు వచ్చేవి. అప్పుడే, నా చదువు బొబ్బిలికి ట్రాన్సఫర్ అయింది. 1955లో బొబ్బిలి బ్రాంచ్ హైస్కూలులో సెకెండ్ ఫారమ్ లో జాయిన్ అయ్యాను. 

ఆ స్కూల్ విశేషాలు, బొబ్బిలి టూరింగ్ టాకీస్ లలో సినీమాలు ...
వచ్చేవారం....
                    ....సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Friday, September 11, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదహారవ భాగం

11.09.20 - శుక్రవారం భాగం - 16*:
పదిహేనవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నా బాల్యమంతా కలివరం, విజయనగరం,బొబ్బిలి మధ్యనే జరిగింది. పుట్టింది బొబ్బిలి. మొదటి ఐదేళ్ళూ నాగావళీ తీరాన. మూడేళ్ళు తెలుగువారికి సాంస్కృతిక కేంద్రమైన విజయనగరంలో. చదువు బొబ్బిలి - మద్రాస్ - బొబ్బిలిలో. ఉద్యోగరీత్యా మద్రాస్ లోనే స్థిరనివాసం. 

నేను ఓ మూడేళ్ళపాటు విజయనగరం లోనే ఉన్నా మా అమ్మగారి ఊరైన బొబ్బిలి తరుచూ వెళ్తూండేవాడిని. అక్కడ మా అమ్మమ్మగారు ఆవిడ తమ్ముడు సామవేదుల నరసింహంగారు, మా దొడ్డమ్మగారు చెళ్ళపిళ్ళ వరహాలమ్మ, ఆవిడ ఒకే కూతురు శారద. వీరందరి సంరక్షణాభారం మా తాతగారిదే. ఆయన బొబ్బిలి కోపరేటివ్ అర్బన్ బ్యాంకు లో పెద గుమస్తా, కేషియర్ గా పనిచేసేవారు. ఆయన భార్య సుందరి చిన్నతనంలోనే పోయింది. మా అమ్మమ్మగారు, దొడ్డమ్మగారు ఇద్దరూ వితంతువులే. మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి అయినా తెలిసిన వారంతా సుందరి అనే పిలిచేవారు. ఆవిడకు ఒక అన్నగారుండేవాడట. నాకు తెలియదు. పేరు రామం. పదహారేళ్ళకే పోయాడట. మా బొబ్బిలి తాతగారి పెద్దక్కగారే విజయనగరం ఇంటి సంరక్షకురాలు. మా తాతగారు సీతారామశాస్త్రిగారి ముగ్గురు కొడుకులను పెంచినావిడ. బొబ్బిలిలో మా తాతగారింట్లో ఉన్నవారందరిదీ సాత్వికమైన  ఆశ్రమ జీవితం. అందుకు తగినట్లుగా వారుండేది ఒక పూరిల్లు. ముందు వెనుకల ఇల్లు. మధ్యలో చిన్న వాకిలి. అందరూ బహు సౌమ్యులు. ఎవరినోటా ఏ విధమైన పరుషపు మాటలు, వ్యాఖ్యానాలు వినవచ్చేవి కాదు. మా బొబ్బిలి తాతగారిని అందరూ 'సింహాలు బాబూ' అని చాలా గౌరవంగా చూసేవారు. అగ్రహారపు జీవనం. అలాటి వాతావరణంలో పెరగడం నా అదృష్టం. మా తాతగారుండే వీధిలో మొదట్లో అందరూ సామవేదులవారి కుటుంబాలే ఉండేవి . అందుకే ఆ వీధిని సామవేదులవారి సందు అని అనేవారు. పోస్టల్ రికార్డ్స్ లో కూడా అలాగే ఉండేది. మా తాతగారి పూర్వీకులు బొబ్బిలి సంస్థానంలో సామవేద పండితులుగా, ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారని చెపుతారు.

మా నాన్నగారి తన  నాలుగు, ఐదు క్లాసుల చదువు బొబ్బిలిలో జరిగింది. అప్పుడే, శ్రీ ఆకుండి నారాయణ శాస్త్రిగారి వద్ద కొంత సంగీతం నేర్చుకున్నారు. ఆ నారాయణ శాస్త్రిగారు బొబ్బిలి కోటలో రాజవంశీయుల పిల్లలకు సంగీతం నేర్పేవారు. బొబ్బిలి రాజావారి పట్టాభిషేకం చాలా ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా రాజావారి మీద నారాయణశాస్త్రి గారు  ప్రశంసా గీతం ఒకటి స్వయంగా రాసి రాగమాలికలో స్వరపరచేరు. ఆ తరువాత కూడా ప్రతీ సంవత్సరం బొబ్బిలి ప్రాంతంలో పట్టాభిషేకం దినోత్సవం అని జరుపుకునేవారట. అలాంటి ఒక సందర్భంలో  పట్టాభిషేక దినోత్సవంనాడు బొబ్బిలి ఆస్థానంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్న  మా నాన్నగారి చేత ఆ కీర్తన పాడించేవారట వారి గురువుగారు నారాయమ శాస్త్రిగారు. ఆ పట్టాభిషేక గీతాన్ని మా నాన్నగారు తొంభై ఏళ్ళ వయసులో మళ్ళీ 2010లో పాడినప్పుటి రికార్డింగ్ ఇక్కడ




సుమారు 263 సంవత్సరాలకు ముందు ఒక సాధారణ కోడి పందేలు కారణంగా చిన్నగా వైషమ్యాలు ఏర్పడి అవి పెరిగి పెద్దవై ఇరుగు పొరుగు సంస్థానాల మధ్య పోరు పెరిగి విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య యుధ్ధానికి దారి తీసింది. హైదరాబాద్ నవాబ్, ఫ్రెంచ్ బుస్సీల ఫిరంగి సైనికుల సహాయంతో బొబ్బిలి కోటను నేలమట్టం చేసి బొబ్బిలి వీరులందరినీ హతమార్చారు. బొబ్బిలి కోటలోని అంతఃపుర స్త్రీలంతా ఆత్మాహుతి చేసుకున్నారు. ఇందుకు ప్రతీకారంగా బొబ్బిలి రాజు బావమరిది తాండ్ర పాపారాయుడు విజయరామరాజును దారుణంగా హత్యచేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తరువాత, ఒక 150 సంవత్సరాలకు బొబ్బిలి వంశీయులు ఇప్పుడున్న చోట కొత్తగా ఒక కోట నిర్మించుకున్నారు. దాని చుట్టూ ఒక ఊరు వృధ్ధి చెందింది. ఆనాటి  అసలు రాజ వంశస్థులెవరూ లేని కారణంగా ఇతర సంస్థానాలనుండి దత్తత కు వచ్చినవారే సంస్థానాధీశులు అయినట్లు చెప్పుకుంటారు. ఇప్పుడున్న విజయనగర రాజుల పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని  రేవా సంస్థానం నుండి దత్తతకు వచ్చినవారే. అందుకే ఇన్నాళ్ళైనా వారెవరూ స్వఛ్ఛమైన తెలుగు మాట్లాడలేరు. పివిజి రాజు పెత్తండ్రి - సర్ విజ్జీ ప్రముఖ క్రికెటర్. రన్నింగ్ కామెంటేటర్ గా కూడా చాలా ప్రసిధ్ధి పొందారు.

ఉత్తరాంధ్రాలో ఉన్న జమిందారి సంస్థానాలలో ప్రముఖమైనవి విజయనగరం, బొబ్బిలి, సాలూరు. అందులో ఉన్నతంగా, పెద్ద ఆదాయం కలిగినది విజయనగరం, తరువాత బొబ్బిలి, చివరగా సాలూరు. ఈ సంస్థానాల గురించి ఒక జోకు ప్రచారంలో ఉండేది. ఈ మూడు సంస్థానాలలో నగారాలు మ్రోగించేవారట. ఆ నగారాల నాదం ఆ ఆస్థానాల ఆర్ధికస్థితిని పోలి ఉండేదట.  విజయనగరం నగారా ఘనం ఘనం అని ఘనంగా మ్రోగేదట. బొబ్బిలి నగారా ధనం ధనం అంటూ ధనం కోసం మ్రోగేదట. ఇక, సాలూరు నగారా ఋణం, ఋణం అంటూ ఋణనాదం చేసేదట. ఆయా సంస్థానాల ఆదాయ స్థితిగతులని ఇలా ఈ జోక్ చేసేవారు. 

అలాటి మూడు సంస్థానాలతోనూ మా పూర్వీకులకు సత్సంబంధాలు వుండేవి.

1952లో విజయనగరంలో ఉన్నప్పుడు విజయావారి  "పెళ్ళిచేసి చూడు" చిత్రం వచ్చింది. ఆ సినీమాను అక్కడ చూసినా పూర్తి అవగాహన లేని వయసు. "బ్రహ్మయ్యా! బ్రహ్మయ్యా!" పాట, "అమ్మా! నొప్పులే, అమ్మమ్మా నొప్పులే" పాట, ఎన్ టి రామారావు పిచ్చివాడిలా బస్సు నడపడం, పుష్పలత, మహంకాళి వెంకయ్య నూలు దారంతో ఆడడంవంటివేవో గుర్తున్నాయి తప్ప, పూర్తి సినీమా గుర్తులేదు. నేను, మా అమ్మగారు 1953లోనో ఎప్పుడో బొబ్బిలి వచ్చినప్పుడు రాజావారి హాలుకి పెళ్ళి చేసి చూడు సినీమా రాబోతున్నదని వార్త వచ్చింది. ఆ సినీమాకు ఘంటసాలవాడే సంగీతం సమకూర్చాడని, అందులో అతని పాటలున్నాయని అందరూ ఘనంగా చెప్పుకున్నారు. ఘంటసాల విజయనగరం మ్యూజిక్ కాలేజీలో అందులో సాలూరు చినగురువుగారి దగ్గర సంగీతం నేర్చుకోవడం వలన, ఆ ప్రాంతాలవారందరికీ ఘంటసాల అన్నా ఘంటసాల సంగీతమన్నా, పాడిన పాటన్నా, పద్యమన్నా విపరీతమైన అభిమానం, గౌరవం ఇప్పటికీ వున్నాయి. ఘంటసాల తప్ప మరో గొప్ప గాయకుడున్నాడంటే ససేమిరా ఒప్పుకోరు. 

పెళ్ళిచేసి చూడు చిత్రమూ అందులోని పాటలు అప్పటికే బహుళ జనాదరణ పొందడంతో బొబ్బిలిలో ఆ సినీమా కోసం అందరూ ఎదురు చూసారు. బొబ్బిలిలో అప్పటికి ఒకటే పెర్మనెంట్ సినీమా హాలు. అదే రాజావారి శ్రీరామా టాకీస్. అదికాక ఓ రెండు మూడు టూరింగ్ టాకీస్ లు ఉండేవి.  టెంట్ హాల్స్. అవి వర్షాకాలంలో పనిచేయవు. రాజావారి హాలులో సౌండ్ బాగుంటుందని, డబుల్ ప్రొజెక్టర్ తో పని చేస్తుందని, ఆ హాలులో స్క్రీన్ సిల్వర్  స్క్రీన్ అని చెప్పేవారు. స్క్రీన్ క్లాత్ కాదు. అలాటి హాలులో సినీమా చూడడం ఆనందంగా భావించేవారు. సినీమా రిలీజ్ డేట్ తెలియగానే పోస్టర్లు అంటించిన బళ్ళు ఊరేగించారు. ఆ బళ్ళకు ముందు ఓ ముగ్గురు డప్పులు వాయించుకుంటూ వచ్చేవారు. ఊళ్ళోని ప్రతీ వీధి జంక్షన్ లో నిలబడి లౌడ్ స్పీకర్లలో ఆ సినీమా గురించి గట్టిగా అరిచి చెప్పేవారు. ఐదేసి నిముషాలకు ఒకసారి గ్రామఫోన్ లో ఆ సినీమాలో పాటలు పెట్టేవారు . గ్రామఫోన్ కీ తగ్గినా, స్పీడ్ లెవెల్స్ కదిలిపోయినా పాట మహా బొంగురుగానో, లేదా కీచుగానో వినిపించేది. ఒక్కొక్కసారి జట్కా బండికి పోస్టర్ తడకలు కట్టి, సినిమా రంగు కాగితాలు గాలిలోకి విసురుతూ పంచేవారు. మరి, అలాటి ఘంటసాలవాడి సినీమా చూడడం మానేస్తామా?

మా సామవేదుల వారి వీధిలో ఆఖరి మూడిళ్ళూ సామవేదులవారివే. వారంతా కజిన్స్. తాతా సహోదరుల పిల్లలుఆ మూడిళ్ళ కోడళ్ళ పేరూ ఒకటే. కామేశ్వరి. పెద కామేశ్వరి, మధ్య కామేశ్వరి, చిన్న కామేశ్వరి. ఆ చిన్న కామేశ్వరిగారి భర్త సత్తేలు(సత్యనారాయణ). ఒకే కొడుకు తరణీరావు. చిన్నప్పటినుండీ ఏదో అనారోగ్యం. మెడ ఒక పక్కకు వంగిపోయి భుజానికి అంటుకుపోయినట్లుగా వుండేది. నెలల పిల్లాడిగా ఉన్నప్పటినుండి చిన్న ఊగుడు కుర్చీలో పడుక్కోబెట్టడం వలన అలాటి అవకరం వచ్చిందనేవారు. మరేదో కారణం కావచ్చు. బాగుపడలేదు.  వారిల్లు విశాలమైన పెంకుటిల్లు. రెండు వీధులవేపునుండి ఇంట్లోకి ప్రవేశముండేది.
వారింటికి మా వీధివేపుండే గుమ్మం మాకు దగ్గర.  నిమ్మ, నారింజ, పంపర పనస, జామి వంటి చాలా చెట్లు,   మల్లి, బంతి చామంతి వంటి రకరకాల పువ్వుల మొక్కలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ఇల్లుండేది. ఆ సత్తేలుగారు చెలికాని అచ్యుతరావుగారి రైస్ మిల్లులో పనిచేసేవారు. అచ్యుతరావుగారు బొబ్బిలి రాజా వారికి బావమరది అని విన్నాను. వారంతా వెలమ  దొరలు. అలాటి దొరల కొలువులో పనిచేయడం వలన మిగిలిన వారికంటే కొంచెం ఉన్నతమే. వాళ్ళింటికి అన్నీ దొరగారి దివాణం నుంచే వస్తాయని ఆ చిన్నకామేశ్వరిగారు గొప్పగా చెపుతూండేది. మా తాతగారి కుటుంబానికి కూడా దగ్గరే. మా అమ్మమ్మగారిని వదినా అని పిలిచేది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద చెంబుతో పాలో, లేక మజ్జిగో నిమ్మాకులు, దబ్బాకులు వేసి ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళమనేది. మనిషి మంచిదే. కానీ నోటి ధాటీ వుండేది. వాళ్ళ ఇంటి పక్కనున్న మధ్య కామేశ్వరి గారికి భర్త లేడు. ముగ్గురు పిల్లలు రమణ, వరహాలు, భాస్కరం. బాచీ అని పిలిచేవారు. అతను నాకు బొబ్బిలిలో మొదటి స్నేహితుడు. పెద్దతను అప్పటికే  ఉద్యోగరీత్యా (రైల్వేలోనే అని గుర్తు) వేరెక్కడో ఉండేవాడు. రెండో అతను వరహాలు. హైస్కూలు లో పేరు మోసిన ఫుట్ బాల్ ప్లేయర్. గోల్ కీపర్ గా మంచి పేరుండేది. స్పోర్ట్స్ కోటాలోనే అతనికీ రైల్వేలో ఉద్యోగం దొరికింది. అతనికి బ్రహ్మాండమైన చెముడు. వాళ్ళిల్లు కూడా మా ఇల్లులాగే పూరిల్లు. ఆ పక్కన పెద కామేశ్వరిగారిల్లు. మేడ ఇల్లు. ఎస్ ఎమ్ రావ్ గారూ రైల్వేలోనో పనిచేసేవారు. ఆరోజుల్లో ఉత్తరాంధ్రాలోని చాలామంది SSLC పూర్తికాగానే చిన్నో, చితకో రైల్వే ఉద్యోగం కోసం తెగ తాపత్రయ పడి ఆ ఉద్యోగంలోనే జీవితాంతం గడిపేవారు. ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ లో స్థిరపడిన సగంమంది తెలుగువారంతా రైల్వే ఉద్యోగులే. ఉత్తరాంధ్రాకు చెందినవారే. వారంతా తమ తమ ఊళ్ళలో తెలుగు సంస్కృతిని కాపాడుకోవడంలో ఇతోధికంగా కృషిచేశారు. 

ఆ రోజుల్లో  బొబ్బిలి కోటకు ఎదురుగా, రాజవీధిలో ఒక టౌన్ హాలుండేది. అందులో తరచూ బొబ్బిలి రాణీగారి ఆధ్వర్యంలో పురాణ కాలక్షేపాలు, భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. వాటిలో మా వాళ్ళంతా కూడా వెళ్ళి పాల్గొనేవారు. మా దొడ్డమ్మగారు, చెళ్ళపిళ్ళ వరహాలమ్మ గారు బాగా పాడేవారు హార్మోనియం కూడా వాయించేవారు. బొబ్బిలిలో ఉండే అనేక సత్సంగ కార్యక్రమాలన్నింటికీ విధిగా హాజరయి భజనగీతాలు ఆలపించేవారు. రాణీగారి టౌన్ హాల్ లో జరిగే భజనలకు స్త్రీలకు మాత్రమే ప్రవేశం. రాణివాసపు ఘోషా అమలులో ఉండేది. మగవారికి వేరేగా ఏర్పాటు చేసేవారు. మా కుటుంబానికి ఈ రకమైనటువంటి పరిచయాలు బొబ్బిలి సంస్థానంతో ఉండేవి.



శ్రీ వి ఏ కే రంగారావు

మనందరికీ బాగా తెలిసిన ప్రముఖ సంగీత, నృత్య విమర్శకుడు శ్రీ విఏకె రంగారావు (వేంకట ఆనంద కృష్ణ)గారిది ఆ వూరే. బొబ్బిలి రాజా శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారి తమ్ముడు, కిర్లంపూడి జమిందారు శ్రీ జనార్ధన రంగారావుగారి కుమారుడు. వారి బంగళా ఊరికి కొంచెం దూరంగా విశాలమైన తోటలో వుండేది. విఎకే రంగారావుగారికి నృత్యంలో మంచి ప్రవేశముండేది. ఆయనకు పదహారేళ్ళ వయసులో కాలికి గజ్జె కట్టి వారి రామ్ మహల్ లో నృత్యం చేయడం బాగా గుర్తు. బహుశా గోకులాష్టమి ఉత్సవాల సమయం కావచ్చు. ఈవయసులో కూడా ప్రతీ సంవత్సరం కార్వేటినగర్ వేణుగోపాలుని సన్నిధిలో గజ్జె కట్టి నాట్యం చేస్తారట. అయితె, ఆయనతో నా పరిచయమంతా ఘంటసాలవారింట్లో ఉన్నప్పుడే. బొబ్బిలిలో కృష్ణాష్టమి సమయంలో డోలాయాత్ర చాలా ఘనంగా జరిపేవారు. మా అగ్రహారం వీధి చివరన ఉన్న పూల్ బాగ్ లో ఉన్న మండపంలో  పెద్ద ఊయలను అలంకరించి అందులో కృష్డ విగ్రహాలు పెట్టి పూజా పునస్కారాలు జరిపేవారు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకూ మా వీధంతా రకరకాల షాపులతో, చుట్టుపక్కల గ్రామాలనుండి ఎడ్లబళ్ళమీద   వచ్చే జనాలతో మహా కోలాహలంగా వుండేది. అలాటి సమయాలలో మా తాతగారి బంధువులు కొందరు పక్కనున్న పాల్తేరు నుండో లేక రాయపూర్ నుండో వచ్చి ఈ డోలాయాత్ర, ఊళ్ళో ఉన్న తెలుగు సినిమాలు మూడాటలు చూసి ఆ మర్నాడు తిరిగి వెళ్ళిపోతూండేవారు. మా వీధి చివరన ఉన్న పూలబాగ్ లో చాలా మంచి టెన్నిస్ కోర్ట్ వుండేది. అక్కడ టెన్నిస్ ఆడడానికి బొబ్బిలి రాణిగారు తమ నల్ల ఫోర్డ్ కారులో ప్రతీరోజూ సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో దుమ్ము రేపుతూ వెళ్ళేవారు. ఆ కారంతా తెల్లటి సిల్క్ తెరలు కప్పేసి ఉండేవి. యువరాణి లావణ్యకుమారి మంచి టెన్నిస్ ప్లేయర్. ఆవిడ మద్రాస్ లో  స్టేట్ లెవెల్  పోటీల్లో  చాలా వాటిలో పాల్గొన్నారు.

బొబ్బిలిలోని రాజావారి కోట, వేణుగోపాలస్వామి ఆలయం, సంస్థానం హైస్కూల్, సుగర్ ఫాక్టరీ, ఊరు చివరి తాజ్ మహల్ లాటి గెస్ట్ హౌస్, ఇవే  ఆ వూరి ప్రతిష్టా చిహ్నాలు. దివాణంలోని గంటలు, సుగర్ ఫ్యాక్టరీ సైరన్ లు బొబ్బిలి ప్రజలకు సమయపాలనం గురించి గుర్తు చేసేవి.

సినీమాలకు సంబంధించినంత వరకూ బొబ్బిలి B సెంటర్. అందువలన ఫస్ట్ రిలీజ్ సినీమాలు బహు అరుదు. పక్కనున్న పార్వతీపురం బిజినెస్ సెంటర్ అందువలన అది A గ్రేడ్ . ప్రతి కొత్త సినీమా ఆ ఊళ్ళో ఆడుతుంది. ఆ A సెంటర్స్ లో ఆడి వెళ్ళిన తరువాత ఎప్పుడో బొబ్బిలిలో  సినీమాలు రిలీజయేవి. అప్పట్లో సినిమాలన్ని ఏ పదిహేను కాపీలో, ఇరవై కాపీలో మాత్రమే తీసి ఆంధ్రదేశమంతా ఆడేవారు. బొబ్బిలిలాటి ఊళ్ళో బొమ్మ నాలుగు వారాలాడితే అది హిట్ సినీమా క్రిందే లెక్క. మామూలు సినీమాలన్నీ రెండు వారాలాడితే గొప్ప.


అలాటి సందర్భంలో, ఈ పెళ్ళిచేసి చూడు సినీమా వచ్చింది. బొబ్బిలి రాణిగారి అనుయాయులంతా పాసుల మీద  ఈ  సినీమా చూసేందుకు అవకాశం వచ్చిందని, అందరం కలసి సాయంత్రం ఆటకు వెళదాం రమ్మనమని మా వీధిలోని చిన కామేశ్వరిగారు మా అందరిని బయల్దేరదీసింది. సాధారణంగా ఈ సినీమాలకు పాసులు సినీమా ఇంక వెళిపోతుందనగా, పోలీసులకు, సానిటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లవారికి ఇచ్చేవారు. ఎందుకంటే ఆయా శాఖలవారి నిరంతర సహకారం సినీమా ధియేటర్లకు అవసరం. అందుకోసం వాళ్ళకి ఫ్రీ. 

మేము వెళ్ళినది సినిమా విడుదలైన వారంలోనే. అందులోనూ ఆడవారికి మాత్రమే. నేను చిన్నపిల్లవాడిని కావడం వలన నాకు ఇబ్బంది లేదు. కానీ, వచ్చిన ఇబ్బంది అంతా శ్రీరామా టాకీస్ లోనే. మేమంతా రాణివాసం వారికి కావలసినవాళ్ళం కావడం వలన మమ్మల్నందరినీ తీసుకువెళ్ళి బాక్స్ లో కూచోపెట్టారు. హాలుకు రెండు ప్రక్కలా రెండు బాక్స్ లు ఒక్కొక్కదాంట్లో పదిహేనుమందో ఇరవైమందో కూర్చోవచ్చును. రాయల్ ఫేమీలి వారికోసం మాత్రమే. ధియేటర్లోని ఇతర ప్రేక్షకులు ఎవరూ కనపడకుండా పూర్తిగా తెరలు కప్పేసి ఉంచుతారు, ఘోషా కోసం.  హాలులో హైక్లాస్ కుర్చీ టికెట్ తప్ప మిగిలిన క్రింది క్లాసులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. మధ్యలో  కర్ర డివైడర్స్ ఉండేవి. సినీమా వేసేముందు ధియేటర్లోని లైట్లన్నీ పూర్తిగా ఆర్పివేశాక అప్పుడు బాక్స్ లోని తెరలు తొలగించేవారు. అసలే పొట్టివాడిని. దానికి తోడు అడ్డంగా  బాక్స్ ముందు పిట్టగోడలు (parapet wall). నిక్కి నిక్కి చూడాలి.
 
తెరమీద 'పొగ త్రాగరాదు' 'No Smoking', 'ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు' వంటి హితోపదేశాల స్లైడ్స్ తరువాత ఇండియన్ న్యూస్ రీల్ విమానాలతో ఏదో ఒక పది నిముషాల వార్తా విశేషాలు. తర్వాత, అసలు సినీమా. అప్పటిదాకా హాలు బయట డప్పుల మ్రోత, టిక్కెట్ల అమ్మకం జరిగేది. మెయిన్ సినీమా ప్రారంభించాక టికెట్ కౌంటర్లు మూసివేశేవారు. డప్పుల మ్రోత ఆగేది. సాయంత్రం ఆరుగంటల వేళ ఊళ్ళో ఉన్న మూడు సినీమా హాల్స్ డప్పుల మ్రోత ఊరంతటికి వినపడేది. 

"పెళ్ళి చేసి చూడు" సినీమాకు ముందు ఆ సినీమా ట్రైలర్ వేశారు. అయితే బొమ్మలేకుండా మాటలతోనే ఆ సినీమా వివరాలు, పాటలు వినిపించిన గుర్తు. అందులో పని చేసిన వారిగురించి చెపుతూ, "ఇంట ఇంటనూ గంట గంటకూ ఎవ్వరి కంఠం వింటారో  ఆ ఘంటసాలవారీ చిత్రానికి నాదబ్రహ్మలండీ" అని ఆ సినీమాకు సంగీత దర్శకత్వం వహించి, పాటలు పాడిన ఘంటసాలవారి గురించి ప్రత్యేకంగా చెప్పడం ఒక విశేషం. నాకు మహా ఆనందం. 

అంటే అప్పటికే ఘంటసాలవారి గళం ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేసిందని అర్ధమౌతుంది. ఆ సినీమాలో మిగతా అంశాలతో పాటు పిల్లలకోసమే నాలుగు పాటలు డాన్స్ లు పెట్టడం వలన పెళ్ళిచేసి చూడు, ఆ బాల గోపాలాన్ని అమితంగా ఆకర్షించింది. 



సినీమా పూర్తయి బాక్స్ లోని ఆడవాళ్లంతా కారులోనో, తెరలుకట్టిన జట్కాలలోనో వెళ్ళిపోయాక ధియేటర్ తలుపులు తీసేవారు. అప్పుడు మిగతా జనం బయటకు పోయేవారు. నాకు కట్టి పడేసినట్లుగా ఉండే ఈ బాక్స్ సినీమా తృప్తి కలిగించలేదు. మళ్ళీ  మా తాతగారి దగ్గర మారాం చేసి  ఆరణాల బెంచి టిక్కెట్టు కొనుక్కొని చుట్ట, బీడీ, సిగరెట్ పొగల మధ్య మరొకసారి 'పెళ్ళి చేసి చూడు' సినీమాను తృప్తిగా చూశాను. 

ఈ పెళ్ళి చేసి చూడు సినీమా చూశాక మర్నాడు మా శారద పెళ్ళికి కుద్దిగాం తరలివెళ్ళేం.

ఆ వివరాలు వచ్చేవారం....
                 ....సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.