visitors

Sunday, August 31, 2014

ఆటపాటలమేటి - లేరతనికి సాటి!!


( (శ్రీ పట్రాయని సంగీతరావుగారు తన "చింతాసక్తి "అనే పుస్తకంలో ఆనాటి విజయనగరం జ్ఞాపకాలతో శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు(1864-1945)గారి గురించి  వ్రాసిన వ్యాసం ఇది. నేడు శ్రీ ఆదిభట్ల 

నారాయణదాసుగారి 150వ జయంతి. ఈ సందర్భంగా నారాయణదాసుగారికి  నివాళులు అర్పిస్తూ  

దాసుగారి ముచ్చట్లను ఇక్కడ ఉంచుతున్నాను.)

                     ఆటపాటల మేటి - శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు


ఆటపాటలమేటి శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి పుట్టుక నెత్తురు కంటి ఏడు(రక్తాక్షి నామ సంవత్సరం అన్నమాట) తూరుపురిక్క నెలలో (అంటే పూర్వఫల్గుని నక్షత్రపు నెల, ఫాల్గుణమాసం కాబోలు) తిథి,వార నక్షత్రాలు జ్ఞాపకం లేదు. ఆయన విజనయనగరం దొరపాట బడిపెద్ద. ఆ పాట బడిలో గీటు మీటు చాటు జంత్రముల పలికింపు సొంపు నేర్పడమవును. పై మాటలు శ్రీ దాసుగారు అక్కడా ఇక్కడా అన్నవి. ఆయన పేరూరు ద్రావిడ బ్రాహ్మణ వైదీక కుటుంబంలో జన్మించినా ఆయనది అచ్చతెనుగు హృదయం.
విజయనగరం మహారాజా వారి సంగీత కళాశాల, ప్రేమాస్పదుడైన సంస్థానోద్యోగి, కుమారుడు జాత్సంధుడైన చాగంటి గంగబాబు నిమిత్తం నిర్మింపడిందని అనుకోవడం ఉంది. 1919లో అనుకుంటాను. మ్యూజిక్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ కానుకుర్తి బుచ్చిబాబు గారట. కానుకుర్తివారిది సుప్రసిద్ధ బ్రాహ్మణ సంపన్న కుటుంబం. కానుకుర్తి వారి సత్రం ఆ రోజుల్లో ప్రముఖమైనది విజయనగరంలో.
మధ్వ స్వాములవారు ఎప్పుడు వచ్చినా చాతుర్మాస్య దీక్ష విజయనగరంలోనే. ఆస్థాన సంగీతవిద్యా గురువు పెద గురాచార్యులవారు ఆయన కుమారుడు వీణా రమణయ్యదాసుగారూ మధ్వులే. కానుకుర్తి బుచ్చిబాబుగారి అన్నగారు మూలరామ ప్రియ కానుకుర్తి క్రిష్ణారావుగారు. శ్రీ మహానంద గజపతి మహారాజుగారు, వీణారమణయ్యగారు సహాథ్యాయులట. సంగీతంలో వారి గురువు గురాచార్యులవారు.
సరీ. శ్రీ కానుకుర్తి బుచ్చిబాబుగారు సంగీత ప్రియులు. సరదాగా వయొలిన్ వాయించేవారు. బుచ్చిబాబుగారే సంగీత కళాశాలకి అర్హమైన ప్రిన్సిపాల్ గా శ్రీ నారాయణదాసుగారిని ఎన్నిక చేసి పదవీ బాధ్యత అప్పగించారట ప్రభువు వారి అనుమతితో. 

ఈ విధంగా నారాయణదాసుగారు ప్రిన్సిపాల్ గా నిర్ణయం అయిన తరువాత నారాయణదాసుగారి అభిప్రాయాన్ని పురస్కరించుకొని మిగిలిన పండితుల నియామకం అయిందట.
విద్యార్థిగా వచ్చిన ద్వారం వెంకటస్వామి నాయుడుగారినే వాయులీన పండితుడిగా తీసుకున్నారుట. ఇక వీణపండితుడుగా ఎవరిని నియమించాలీ అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ  రోజుల్లో ఆ ప్రాంతంలో వైణుకుడిగా పొడుగు రామ్మూర్తిగారికి మంచి పేరు ఉండేది. అయితే నారాయణదాసుగారు అన్నారూ –ఒరే ఇది గాంధర్వ వేదం. అందులోనూ వీణ. కోళ్ళు కోసుకొనేవాడూ, గొర్రెలు కోసుకునేవాడూ పనికిరాడ్రా. అది ఫిడేలులాగ పిల్లపేగుల వాద్యం కాదు (వయొలిన్ స్ట్రింగ్స్ దాంతో తయారయ్యేవి) స్వచ్ఛమయిన లోహ తంత్రులు. పరమ పవిత్రమయిన వాద్యం. రసాధి దేవత చేపట్టిన వాద్యం. అందుచేత సంప్రదాయజ్ఞుడు, శ్రోత్రియుడయిన వైణికుణ్ణి నియమించుకోవాలీ  అని అన్నారట. ఈనాడు ఇంత కుల ద్వేషం పెరగడానికి కారణం ఈ ధోరణే. అప్పుడు బొబ్బిలి ఆస్థాన వైణిక కుటుంబీకుడైన వాసా వెంకటరావుగారిని నియమించారు వీణ పండితుడుగా.
ఆ రోజుల్లో మార్దంగికుడిగా మంచి మోజు కలిగిన లింగం అప్పగారినిమృదంగం పండితుడిగానూ, దాక్షిణాత్య నాదస్వర విద్వాంసుడు మునిస్వామి గారిని నాదస్వర పండితునిగా నియమించారట. పేరిబాబుగారు (రామమూర్తి)గాత్రము, వీణ అన్నీ చెప్పేవారు. అయితే ఆ రోజుల్లో సంగీత కళాశాలలో దాసుగారి హయాంలో హరికథ శిష్యులే చాలామంది ఉండేవారుట. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న మహారాజావారి స్టూడెంట్ బోర్డింగ్ హౌస్ లో ఒక పదిహేనుమంది వరకూ సంగీత విద్యార్థులకు భోజనం పద్దు ఉండేది. దాసుగారు ఒక విద్యార్ధికి పద్దు వేస్తే, ఆ విద్యార్థి వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నట్టు చూపిన తర్వాతే ఆ పద్దు మరొకరికి ఇచ్చేవారుట. దాసుగారి హయాంలో సంగీత కళాశాలకి మూడు మాసాలు వేసవి సెలవలు. సంగీతమా మజాఖావా, చెమటల్తో సాధకం ఎలారా అనేవారట. తరువత కూడా చాలాకాలం ఆ ఆనవాయితీయే నడిచింది. దాసుగారి హయాంలో ఎంతోమంది హరికథకులు తయారయ్యారు.
వాజపేయల సుబ్బయ్యగారు, నేతి లక్ష్మీనారాయణగారు, వడ్లమాని నరసింహాదాసుగారు వీరంతా సుప్రసిద్ధ హరిదాసులో ఆరోజుల్లో. ఈనాడు మనకి జ్ఞాపకంలేని పేర్లు ఎన్నో. విజయనగరం నిండా హరిదాసులుండేవారు. దాసుగారు పోయిన తర్వాత కూడా విజయనగరం హరిదాసులకు స్థావరమే. అదేవిధంగా వైణికులు ఎంతోమంది తయారయ్యాడు. పూజ్యులు వాసా వెంకటరావుగారి అంతేవాసులు, మండా సూర్యనారాయణ ద్యయం, చెళ్ళపిళ్ళ రామమూర్తి పెనుమర్తి రామశర్మ, మేడేపల్ల నరసింగరావు వీళ్లంతా దాసుగారు ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు తయారయినవారే. అదే విధంగా నాయుడుగారి దగ్గర, కోటిపల్లి గున్నయ్యగారు, మట్టెల సత్యమూర్తి, చాగంటి గంగబాబూ, వీళ్ళంతా పాతతరం సంగీతకాలేజి విద్యార్థులే. నాదస్వరం క్లాసులో గాడిపిల్లి పైడిస్వామి, ఇనపకుర్తి నారాయణలు ముఖ్యులు. గాడిపిల్లి పైడిస్వామిది రాజమహేంద్రవర. దేశానికి బాగా సుపరిచితులు. మామిళ్ళపల్లి బాలసుబ్రహ్మణ్యశర్మ ఆయన శిష్యుడే. ఇనపకుర్తి నారాయణ అనారోగ్యం చేత నాదస్వరం మానుకుని ఫ్లూటు సాధన చేసారు. ఆయన సంగీతకళాశాలలో జూనియర్ విద్వాంసుడిగా ఉండేవారు.

దాసుగారు ప్రిన్సిపాల్ గా ఉన్నరోజుల్లో సంగీత కళాశాలకి సంబంధించిన ముచ్చట్లు కొన్ని.
విజయనగరంలోని మహారాజావారి సంగీత కళాశాల
రాజావారి సంగీతకళాశాల కేవలం సంస్ధానానికి చెందినది. ఆరోజుల్లో ఎవరో ప్రభుత్వాధికారి సంగీత కళాశాలకి వచ్చారుట. దాసుగారు ఆఫీసురూంలో గోచీ కట్టుకుని ఆయన స్పెషల్ ఛైర్ లో పడుకొన్నారుట. ఆ ప్రభుత్వాధికారికి ఏమీ తోచలేదు. "ఏమిటీ వేషం, ఇది సంగీత కాలేజీయేనా పండితులెవరూ సంగీతం విద్యార్థులకు చెప్తున్నట్టు కనిపించదు. అబ్బే ఏమీ బాగులేదు" అన్నాడట. దాసుగారు నిదానంగా చూసి " ఎవరు నువ్వు, ఎందుకు వచ్చేవు నా పర్మిషన్ లేకుండా" అని అడిగేరట. ఆ ప్రభుత్వాధికారి తనిఖీ చేసే అధికారం తనకి ఉందన్నాడట. "నువ్వు రాదలచుకుంటే నాకు మొదట తెలియజేయాలి. మాకాలేజి మా పద్ధతిలోనే నడుస్తుంది" అన్నారట. "పండితులెవరూ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్టేలేదే" అన్నారుట ఆయన. "అవును చెప్పరు" అన్నారుట దాసుగారు. " మరెందుకు తమరున్నట్టు" అన్నారుట ఆయన. "ఏనుగుల శాలలో ఏనుగులు ఎందుకుంటాయి" అని అన్నారుట దాసుగారు. ఇక లాభంలేదనుకుని ఆయన వెళ్ళి పోయాడట.
చిత్రం ఏమిటంటే ఏ విధమైన రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకపోయినా అన్ని శాఖలలోను, ఎంతోమంది విద్యార్థులు విద్వాంసులుగా రూపొందారు. ఈనాటి మన కొలతలలో, ఆ రోజులను ఆనాటి కళాకారులను వారు సాధించిన విజయాన్ని, ధనం, కీర్తిని బట్టీ అంచనా వేయకూడదు. ఈనాడు కళాకారులు కీర్తిమంతులుగా, ధనవంతులుగా విజయం సాధించే అవకాశాలు, అడ్డుదారులూ ఆనాడు లేవు. జనసామాన్యంలో  కీర్తిని ఆనాటి విద్వాంసులెవరూ కోరుకునేవారు కాదు. సరి, ఇది వేరే విషయం.
అసలు సంగీత కళాశాల వాతావరణమే వాళ్ళని విద్వాంసులను చేసేది. ఆగురువుల సామీప్యమే, గురుభక్తి వారిని విద్వాంసులుగా చేసేది. సంగీత విద్య క్లాసులవారీగా, సిలబస్ ప్రకారమే జరగాలని లేదు. నిరంతర శ్రవణం, నిరంతర సాధన, విద్యలకు అంకితమైన ఆసక్తి ప్రధానం. ఆ రోజుల్లో ఏ వాద్యం సాధన చేసినా సంగీత విద్య అందరికీ సమానమే కదా. అందుచేత వీణ క్లాసు విద్యార్థులు గాత్రం క్లాసు విద్యార్థులు నేర్చుకున్న గీతమో, వర్ణమో, కృతో కొత్తదైతే వాళ్ళు పరస్పరం నేర్చుకుంటూ ఉండేవారు. గ్రహణశక్తి, ఆరాధన ఉన్న విద్యార్థులు ఎక్కడ ఏ విధమైన సంగీతం వినపడినా స్వంతం చేసుకోగలిగేవారు.
మరో చిత్రమైన ముచ్చట –శ్రీ నారాయణదాసుగారు చినగురుణ్ణి (చిన్నగురుడంటే భంగు). పెదగురుణ్ణి (పెద్దగురుడంటే బ్రాందీ విస్కీలాంటివి),సేవించడం తెలిసినా, తాగినవాణ్ణి చూస్తే ఆయనకి భయంట. సంగీత విద్యార్థులకి సత్రంలో పద్దులుండడం చేత వచ్చిన చిక్కు. ఎవడో ఒక మొండివాడు బాగా పట్టింటి, దుడ్డుకర్ర పట్టుకుని దాసుగారికి దండం పెట్టి, బాబూ! నాకు సంగీత నేర్చుకోవాలని ఉంది. ముందు సత్రంపద్దు వేయించండి. లేదా ఈ దుడ్డు కర్రతో మీ తల పగలకొట్టి నా తల పగలకొట్టుకుంటాను, ఏమి సెలవు? అన్నాడుట. దాసుగారు ఒరే ఉండరా, నీకు సత్రం పద్దు కావాలిట్రా, అంతేనా. సరే నాతో రారా!! “ అని తనతో వాణ్ణి మెల్లగా పోలీసు స్టేషన్కి తీసుకొని వెళ్ళి అక్కడ  సబ్ ఇన్స్ పెక్టర్ తో బాబూ,వీడిసంగతి చూడండి. సత్రం పద్దు వేయకపోతే నా తల బద్దలు కొడతాడట”-  అని అప్పజెప్పేరుట.
 
ఆనాటి స్టూడెంట్ బోర్డింగ్ హౌస్ ఇదే.
దాసుగారి ఆత్మకథ నా ఎరుక లో ఆయన బాల్య, యవ్వన జీవితం గడిచిన తీరు వివరించారు. గాయకుడిగా, వైణికుడిగా, హరికథా పితామహునిగా ఆయన ఘనతను పండిత పామర జనసహితంగా యావదాంధ్రదేశం ఆయనకి నీరాజనమెత్తింది. ఆయన గురించి నాలాంటివాడు ప్రత్యేకంగా రాయవలసిన  అవసరం లేదు. రాసుకుంటున్నదంతా నాకు తెలిసినదాసు గురించే.

 విజయనగరం సంగీత కళాశాల ఉద్యోగానికి మానాన్న (శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు) దరఖాస్తు పెట్టినప్పుడు ఆయనకి ఏ సర్టిఫికెట్లు లేవు కదా. అందుచేత విజయనగరంలోని పెద్దలందరి వద్ద నుంచియోగ్యతా పత్రాలు తీసుకోవలసి వచ్చింది. ఆ సందర్భంలో మా నాన్న దాసుగారింటికి వెళ్ళారట. మా నాన్నని దాసుగారికి తెలుసు. ఏమిరా పేరాసాహెబ్ ! నువ్వు మా నరసింహ కొడుకువు కదూ ఆని పలకరించారుట. మా తాతయ్యని ఆయనకి బాగా తెలుసు. అసలు ఆయన మా తాతయ్యకంటే పదేళ్ళు పెద్ద. ఇక పేరా సాహెబు ఎవరూ. ఆ రోజుల్లో గొప్పహిందుస్థానీ గాయకుడు. అతని గ్రామఫోన్ రికార్డులు చాలా ప్రచారంలో ఉండేవి కూడ. హిందుస్థానీ భైరవిలో అతని రికార్డు బహుతేరా ముజాయురీలాగగునా అనేది ఉండేది. పాటలో నేను రాసిన మాటలు తప్పుకావచ్చు. చాలా సన్నవిడి గాత్రం. తారస్థాయిలో వినబడేది ఆయన పాట. ఆ పేరా సాహెబు ఫోటోలు కూడా రసికుల ఇళ్ళలో గోడలమీద వేలాడేవి . మా నారాయణశాస్త్రిగారింట్లో చూసేను పేరాసాహెబు ఫోటో. పెద్దదే. మా నాన్నకి అతనికి ఏవో కొన్ని పోలికలు ఉండేవి. ముఖ్యంగా పొడుగు మెడ. పచ్చటి రంగు లుంగీ కట్టుకుని తిరగడం, హార్మోనియం వాయిస్తూ పాడడం కారణం అనుకుంటాను,  దాసుగారి ఆ పలకరింపుకి కారణం. ఒరే! నీకెందుకురా ఆ బాడఖావు ఉద్యోగం. సలక్షణంగా పాఠశాల కట్టేవు, స్వతంత్రంగా ఉన్నావు , నీ ప్రారబ్ధం అలా ఉంది! తప్పదు!” అని ఆయన యోగ్యతా పత్రం రాసి ఇచ్చారుట. పక్కనున్నవాళ్ళతో అన్నారట –“ ఆ హార్మోనియం లేదూ, అదొక కొయ్య. దానిలోంచి అమృతం పిండుతాడు వీడు అని.
అందరినీ ఆయన ఒరే అని పిలవడమే అలవాటు. ఎవరూ ఏమీ అనుకునే వారు కాదు. మీదు మిక్కిలి అలా అనకపోతే బాధపడేవారు. ఆయన తిడుతుంటే ఆనందించేవారు. అదో జాతకం. ఆయనకి అలవాటయిన తిట్టు దొంగమాదిగాడి కొడుకు. అని ఆయన పండితులతోటి, పామరులతోటి ఒకే విధంగా సరదాగా మాట్లాడేవాడు.
మహా మహోపాధ్యాయ తాత సుబ్బరాయ శాస్త్రిగారిని –“ ఒరే తాతా! నీ ముక్కు ఇకొయణచి లా ఉందిరా అనేవారట. ఇకొయణచి - ఇదొక వ్యాకరణ సూత్రంట. రాయుడు శాస్త్రిగారి మహా వయ్యాకరణి.
ఆరోజుల్లో హరి నాగభూషణంగారు ఆయనకి ప్రత్యర్థిగా అనుకునేవారు. నాగభూషణంగారు సంగీత సాహిత్యాలలో అపారమైన పాండిత్యం కలిగినవాడు. వాగ్గేయ కార రత్న, దివనామగాయనీ ఇత్యాది బిరుదులుండేవి. పైగా జంత్రగాత్రములతో సాగేది ఆయన కచేరీ. ఆయన త్యాగరాజస్వామిని అనుసరించి సన్యాసం కూడా స్వీకరించారు. దాసుగారికన్నా చిన్నవాడే వయసులో. అతనిని ఆట పట్టించేవారుట దాసుగారు.
ఒకసారి నాగభూషణంగారి కచేరీ అవుతోంది. ఆయన స్వరకల్పనకు బదులు రామనామంతో లయవిన్యాసంతో గానం చేసేవారట. అందుకే ఆయనకి దివ్యనామ గాయనీ బిరుదు. కచేరీలో కొంతసేపు స్వరకల్పన చేసి దివ్యనామం అందుకొన్నారు. రమరామరామ రమరామరామ అంటూ తర్వాత అదే ఫిడేలుమీద వాయిస్తున్నారు. నారాయణదాసుగారు ఎదురుగా వింటూ ఆహా ఓహో అని మెచ్చుకుంటూ నాగభూషణం మహాభక్తుడు చూడండయ్యా ఆ ఫిడేలు కూడా ఎలా రామ రామ అంటుందో అన్నారట.
మేము ఆయనను చూసేనాటికి ఆయన అస్తమిస్తున్న సూర్యదేవుడు. స్వయంగా మేము ఆయన ప్రతిభను గ్రహించడానికి మరేమీ మిగిలిలేదు. కీర్తి ప్రభ మాత్రం తగ్గలేదు. మేము ఎరిగిన నాటికి దాసుగారు డెబ్భయిఏళ్ళ వయోవృద్ధు. అదే ఆయన చివరి దశ. ఆజానుబాహు. సేలం పట్టుపంచె పెద్ద అంచులవి కట్టుకునేవారు ఎగగట్టి. పట్టు జుబ్బా మోకాళ్ళవరకు. కాలికి గండపెండేరం, చేతికి మురుగులు, మెళ్ళో బంగారు పతకం, మధ్యపాపిడి, చేతిలో దుడ్డుకర్ర, పెద్ద పెద్ద పండు మీసాలు. ఇదీ మేము చూసిన దాసుగారి రూపం.
రోజూ మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆయన పార్కులో ఉన్న టౌన్ హాలుకి బయలుదేరేవారు. పులివేషం వెంట జనంలా ఉండేవారు జనం ఆయన వెంట. రోడ్డుమీదే ఆయన శిష్యులకి పాఠం చెప్పేవారు. మా ఇంట్లో ఉంటున్న మధూకర విద్యార్థి నేలనూతుల నాగభూషణం ఆయన  చివరితరం శిష్యుడు. ఆ రోజుల్లో గుడసుమీరిన బుద్ధిమంతులు ఎవరూ ఉండేవారు కారు. ఆయన వెంట. అందరూ అమాయకులు, వెర్రిబాగుల వాళ్ళలాంటివారే ఉండేవారు.
ఆయన హరికథాపాఠం కానుకుర్తివారి వీథిలోంచి బొంకులదిబ్బ దగ్గరకొచ్చేసరికి " చాటుచున్నదదో భేరి "అని సీతాకల్యాణం మట్టు ప్రారంభం అయ్యేది కోటగేటు దగ్గర. అదో మజిలీ. అక్కడ కొంతసేపు భక్తులతో గోష్టి. ఆ తరువాత మజిలీ-మూడు లాంతర్లు,  పైడితల్లి అమ్మవారి గుడిదగ్గర. అక్కడ డప్పులు, తప్పెట్లు వాయించేవాళ్ళ విద్వత్ పరీక్షలు జరిగేవి. దాసుగారు దుడ్డుకర్ర తో తాళం చూపించేవారు. వాళ్ళు డప్పు వాయించేవారు. మనకి అంత దృష్టి ఉండదు ఆ వాద్యం మీద. కానీ దాసుగారి ముందు వాళ్ళు వాయిస్తూ ఉంటే అబ్బ!  దీనిలో అంత వ్యవహారం ఉందా అనిపించేది.  దాసుగారు మెచ్చుకొని వాద్యకులకు బిరుదులివ్వడమూ ఉండేది.
తరువాత మజిలీ. సానివీధి శివాలయం దగ్గర. అక్కడ ఆయన శృంగార జీవితం నెమరువేసుకునేవారు. ఇక్కడ ఉండేదిరా నా సాని అనేవారు. ఆ మాటతో కుర్రాళ్ళందరికీ హుషారు పుట్టేది. అలాగా బాబూ! మంచి ప్రాయంలో ఉండేదా బాబూ అనేవారు. ఏమీ అరవై ఏళ్ళు దాటేయి దానికి అనేవారు. అంతా గొల్లుమనేవారు. తరువాత ఆయన పార్క్ లో టౌన్ హాలుకి వెళ్ళిపోయేవారు.  శిష్యులు బయట ఉండిపోయేవారు పార్కులో రేడియో వింటూ. తిరిగి ఆయన ఎనిమిది దాటేక బయలుదేరేవారు. గురువుగారిని ఇంటికి దిగపెట్టి శష్యులు వెళ్ళేవారు ఇళ్ళకి.

మా తమ్ముడు నారాయణమూర్తి పెళ్ళి 1939లో  అయినట్టు జ్ఞాపకం.  పెళ్ళి భీమవరం అగ్రహారంలో అయింది. మనుగుడుపులకు, పెళ్ళికూతురూ, పెళ్ళివారూ విజయనగరం వచ్చిన సందర్బంలో పెళ్ళి కళ కోసం ఆరోజు ఇంట్లోనే వినోదంగా మా ఇంట్లో ఉన్న నేలనూతల నాగభూషణాన్ని హరికథ చెప్పమని అడిగేం కుర్రాళ్ళు అందరమూను. మా గురువుగారి సెలవు కావాలే అన్నాడు అతను. మొత్తానికి గురువుగారి సెలవయింది. గురువుగారు కూడా వస్తామన్నారు  అన్నాడు నాగభూషణం. మా గుండెల్లో రాయిపడింది. ఆటపట్టించడానికి అతని హరికథ అనుకుంటే చివరికి వ్యవహారం జటిలం అయిపోయింది. కుర్ర వ్యవహారం అనుకున్నది పెద్ద కార్యక్రమం అయిపోయింది. కథ ప్రారంభం అయింది. సహకార వాద్య గోష్టి ముమ్మరంగా ఉంది. "శంకరాశ్రిత ఘన శంకరా ప్రభ" అని ప్రార్థన ప్రారంభం అయింది కేదారరాగంలో. చరణంలో మిత్రం కింకర జన సముదాయ సౌఖ్యంకర దగ్గరికి వచ్చేసరికి నాగభూషణం గారికి ఆవేశం వచ్చేసింది. నృత్యం ఉధృతమైంది. కుర్రాళ్ళందరికీ మంచి వినోదంగా ఉంది. సరిగ్గా ఆ సమయంలో నారాయణదాసుగారు శిష్యపరివారం అంతా ఇరవై మంది దాకా వచ్చేసారు. సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో.  పెద్దలంతా వారిని ఆహ్వానించారు. మర్యాదలన్నీ అయ్యాక దాసుగారే ప్రారంభించారు కథ.  


చాటుచున్నదదో భేరి నుంచి. ఏమి గాత్రం. అది సింహగర్జనలా ఉండేది ఆగాత్ర గాంభీర్యం. శ్రీ రామచంద్రమూర్తి శివ ధనుస్సు ఎత్తడానికి సభలో ప్రవేశించగానే సభ్యుడు అనుకుంటున్నారు ఆ అవతారమూర్తిని చూసి కన్నవారెలెంత ధన్యులో . ఈ విధంగా సాగింది కథ. దాసుగారితో శిష్యబృందం అంతా వంత పాడారు. వచనం ఆయన అందిస్తుంటే నాగభూషణం గారు వల్లె వేసారు. శిష్యుల ఎడల ఆయన ప్రేమ అటువంటిది.
1982లో అనుకుంటాను. ఎంబార్ విజయరాఘవాచార్యులుగారికి మద్రాసు మ్యూజిక్ అకాడెమీ సంగీత కళానిధి బిరుదం ఇచ్చింది. ఆయన తమిళనాడులో ప్రసిద్ధ హరికథకుడు. సంగీతంలో ప్రామాణికుడు. ఆ సభలో హరికథకి సంబంధించి సెమినార్లు జరిగాయి. ఒక రోజు పప్పు వేణుగోపాలరావుగారు శ్రీ నారాయణ దాసుగారి జీవిత విశేషాలు తెలియజేసిన సందర్భంలో సోదాహరణంగా దాసుగారి  రచనలు, అనేక హరికథలలోని మట్లు నేను, మా అమ్మాయి చి.సౌ. పద్మ పాడడం అయింది. ఆ కార్యక్రమానికి ముందు క రెండు మాసాలైనా అయి ఉంటుంది. ఆ మట్లన్నీ ఒక క్రమంలో మూల సంగీత రచనకి భిన్నం కాకుండా చూసుకుంటూ ఆయన వచనాలు చెప్పే పద్ధతి, ఇవన్నీ సరి చూసుకోవలసి వచ్చింది. (ఆ సోదాహరణ ప్రసంగానికి బహుమతి కూడా లభించింది)


నేను హరికథకుణ్ణి కాదు. నా చిన్నతనం నుంచి దాసుగారి మొదటి తరం శిష్యులు పాడగా విన్నాను. రావికంటి జగన్నాథ దాసుగారని ఉండేవారు. ఆయన కుంటివారు. కూర్చునే హరికథలు చెప్పేవారు. నారాయణ దాసుగారి మట్లు ఆయన బానీలో యథాతథంగా పాడేవారు. మా నాన్నగారు ఆయన విన్న రుక్మిణీ కల్యాణంలో భూపాలరాగంలో సామిరావ దేమిరాయో సర్వాంతర్యామిరా అన్న మట్టు ఎంతో భావావేంతో, శరణాగతితో నినే నమ్మినాను, తనువమ్మినానా నీకు దయరాదా మదీ నీ సతీ నీవే నా గతీ నిక్కము దయా నీరధీ అంటూ గానం చేసేవారు ఆయన. ఒళ్ళు గగుర్పొడిచేది. అలాగే మార్కండేయ లో బాలచంద్రమౌళి పాదము విడక అనే మట్టు పున్నాగవరాళిలో విన్నప్పుడు హృదయావేశాలను సంగీతంలో ఎంత సమర్ధంగా రసస్ఫూర్తిగా తెలియచేయవచ్చునో అర్థమయింది.

 దాసుగారి సంగీత రచన లక్ష్యం, రసభావ పోషణకి రాగ తాళములను సమన్వయపరచడం లోను, ఆయన ఎంత ప్రతిభావంతుడో తెలుస్తుంది. అసలు దాసుగారి మట్లు సంగీత సాహిత్యాలకు సమర్థమయిన సమన్వయాలు. ఆ మట్లు నడకలో మాట మాటగా తెలుస్తుంది. వాగ్గేయకారుల రచనలో మాట సాగుతుంది.  
ఒకటనిపిస్తుంది.  యావదాంధ్రదేశ రసిక లోకమూ అతనిని ఒక యుగ పురుషునిగా గుర్తించినా సంగీత విద్వల్లోకంలో ఆయనను వాగ్గేయకారునిగా గుర్తించకపోవడం అన్యాయం. అనాలోచితం. రసదృష్టి లేకపోవడం.

ఈనాడు మనం సంగీత సభలలో రాగపోషణలో, స్వరకల్పలలో ఎంతో నాదానుభవం పొందగలం. అదే విధంగా అంతర్లీనమయిన లయ సౌందర్యాన్ని విజ్ఞులు గ్రహించగలరు. విశిష్టమయిన కర్ణాటక సంగీతపు నుడికారం వినిపిస్తుంది. కర్ణాటక సంగీతానుభవం పొందలేరు నిజమే. అయితే సాహిత్యం తోను, రసభావములతోను, సమన్వయపడిన కృతి పాడుతున్నప్పుడు సంగీతానికి సాహిత్యానికి పొంతన లేదు. ఆ స్పృహే లేదు. గాయకులకు సంగతులు వేయడంలో నిగ్రహం లేదు. సంగీతం, సాహిత్యంలోని రసభావానుగుణ్యంగా లేదు. రాగ చిత్రణ, రాగ ప్రస్తారము లయబద్ధంగా గానం చేయడమే ప్రధానం అన్నట్టుగా వినిపిస్తుంది. కీర్తనను  గానం చేయడానికి చాలా శ్రద్ధాసక్తులు అవసరం. భావానుగుణ్యంగా సంగీతం ఉందా లేదా అన్నదానికి ముందు పదోచ్చారణ, ఆ పదం మీద వచ్చే ధ్వని మధురంగా వినిపించాలి. దంత, తాలవ్య, ఓష్ఠ్య, కంఠ్యముల ఆధారంగా వచ్చే నాదం శ్రావ్యమై ఉండాలి. మన ప్రయత్నం అంతా తంజూవూరు బానీ సాధించడంతో పూర్తి కాదు. దానివల్ల ఏమయిందీ, తెలుగు వాడికి తెలుగుపాట వినపడదు. సంగీతపు బానీ విషయంలో దాసుగారిది సముచితమయిన అవగాహన.  ఆయన అన్నారు – పాటలో తమిళుడు తమిళ యాచతో పాడతాడు. నా తెలుగు యాచతో నేను పాడతాను.

రాయడం  మరచిన సంగతి – దాసుగారు రిటైరయ్యి నాయుడుగారు ప్రిన్సిపాల్ అయిన తర్వాత దాసుగారు కూర్చున్న కుర్చీమీద నాయుడుగారు కూర్చునేవారు కాదు. దాసుగారి రచన అయిదు తాళాలకు సంబంధించి ఏక ముఖంగా ప్రదర్శించడానికి ఉద్దేశించబడిన పంచముఖి పటం కట్టించి ఉంది. ఆ పటం ఆకుర్చీ మీద ఉండేది ఒకమూల.







         








Friday, April 4, 2014

శ్రీ సంగీతరావుగారు  రచించి స్వరపరిచిన ఓ ఉగాది పాటను ఇక్కడ  పరిచయం చేయబోతున్నాను.
ఆకాశవాణి మద్రాసుకేంద్రంలో  చిన్న పిల్లలు ఉగాది సందర్భంగా పాడడం కోసం సంగీతరావుగారు ఓ గేయం రచించారు. ఆనందనామ సంవత్సరం (బహుశ 1975) ఉగాది సందర్బంగా ఈ గేయం ఆకాశవాణి లో ప్రసారమయింది.
మరోసారి ప్రభవ నామ సంవత్సరం ఉగాది నాడు మద్రాసు తెలుగు అకాడమీ వారి ఉగాది ఉత్సవాలలో ఉగాదికి ఆహ్వానగీతంగా ఒక పాటను స్వరపరచవలసిన సందర్భం వచ్చినపుడు సంగీతరావుగారు బాలాంత్రపు రజనీకాంతరావుగారు రచించిన గేయాలనుంచి ఒక గేయాన్ని ఎత్తుగడ గా తీసుకుని తన గేయాన్ని కూడా కలిపి స్వరపరిచారు. రజనీకాంతరావుగారి శతపత్రసుందరి గేయసంపుటిలో నుంచి ఈ గేయాన్ని తీసుకున్నారు
(శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతం సాహిత్యం ఉభయరంగాలలోను లబ్ధ ప్రతిష్టులైన ప్రతిభా మూర్తి. లలితసంగీత రీతులను తెలుగు ప్రజలకు రేడియో మీడియా ద్వారా ప్రసారం చేస్తూ, తన రచనలతో, సంగీతంతో ప్రచారం చేస్తూ పరిపూర్ణమైన సహకారం అందించిన గొప్ప సంగీతమూర్తి. రజని పేరుతో తెలుగువారికి సుపరిచితులు.)
కొత్త సంవత్సరం ఆలయంలో మ్రోగిన ఘంటానాదంలా, ఆకాశంలో  మెరిసిన ఆశా జ్యోతిలా ఆగమిస్తోందని భావించారు రజనీకాంతరావుగారు.
గడిచిపోయిన సంవత్సరం లోని చేదు జ్ఞాపకాలు, మనస్సులోని పాపపుటాలోచనలు అన్నీ పటాపంచలైపోయి మనసులోని బాధనంతటినీ తుడిచేసి ఆ విశ్వ విభుడైన పరమేశ్వరుని కరుణా కటాక్షాలు జడివానగా కురుస్తుండగా ప్రక్షాళితమైన మనస్సులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఆశించారు రజనీకాంతరావుగారు. 
వసంత ఋతువులో చెట్లు పండిన సారంలేని ఆకులను రాల్చేసి కొత్తచిగుళ్లను తొడుగుతాయి. జగమంతా పచ్చదనం వెల్లివిరుస్తూ మనసులను ఉల్లాసపరుస్తుంది. అటువంటి శుభోదయం సమయంలో ఈ జగత్తులోని సర్వసౌభాగ్యాలకు కారణమైన ప్రభువును కీర్తించుదామని తనతో గొంతు కలపమని పిలుస్తారు రజనీకాంతరావుగారు.
ఆ గేయం యొక్క సాహిత్యం ఇది.
ఆలయమున వినబడునదిగో
ఆకసమున కనబడునదిగో
నవవర్షపు ఘంటానినదం
నవ్యాశా జ్యోతీ... నవ్యాశా జ్యోతీ...
ప్రాతయేటి పెను తమస్సులూ
పాప కలితములు మనస్సులు
పటాపంచలే
క్షుభిత హృదయములపై విరిసి
విభుని కరుణ జడులై కురిసే
నవవసంతమై నవవసంతమై
శుభోదయోత్సవ సమయమునా
ప్రభూయనుచు మధుర రవమునా
కీర్తించుదమా  కీర్తించుదమా                                   ఆలయమున వినబడునదుగో.....
ఇక్కడివరకు ఈ ఉగాది పాటలో రచన బాలాంత్రపు రజనీకాంతరావుగారిది. ఇక ఇక్కడ నుంచి సాహిత్యం సంగీతరావుగారిది.
అటువంటి నవ వసంతం ఆగమించిన కొత్త సంవత్సరానికి ఈ విధంగా స్వాగతం పలికారు సంగీతరావుగారు.
ముందుగా-
నవయుగం అంటే కొత్తసంవత్సరం ఆగమించిన వేళ ప్రకృతి ఎలా ఉంటుందో వివరించారు. వసంతకాలం హృదయాలను పులకింపజేసే సమ్మోహనకరమైన కాలం. వసంతానికి మరోపేరు ఆమని. వసంతకాలంలో తొలిసంజె వేళలో విరిసే వెలుగులు, ఆహ్లాదపరిచే వెన్నెలవేళలు అనుభవైకవేద్యమే.  వసంతకాలం అనగానే  మధురమైన సువాసనతో   విరిసే మల్లెపూలు, చవులూరించే  మధురమైన మామిడిపళ్ళు అందరికీ గుర్తొస్తాయి. అంతే కాక కొత్త మామిడిచిగుళ్ళను మేసి కలకూజితం చేసే కోయిలమ్మ కూడా వసంతానికి ప్రతినిధి కదా. అందుకే ఇన్ని అందమైన అనుభూతులనిచ్చే ఆమనికి, కొత్త సంవత్సరపు తొలిరోజుకి ఈ విధంగా స్వాగతం చెప్పారు.
ఆ.... ఆ....ఆ...
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదె నవయుగాదికి

తొలిసందె వెలుగుల పులకించే వెన్నెలల
మధురమైన ఫలములను మరుమల్లే విరులను
కొసరి కొసరి వినిపించే కోయిలమ్మ పాటను
హాయిగా తీయగా అందిచే ఆమనికి
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదే నవయుగాదికి
కొత్తసంవత్సరానికి కేవలం స్వాగతం చెప్పి ఊరుకుంటే ఎలా.
అందుకే  సమాజాభ్యుదయానికి తాను ఆశించే విలువలను కూడా ప్రస్తావించి ఈ గేయాన్ని ముగించారు.
అనుమానం అసహనం అపరిమిత ద్వేషం
మటుమాయం కాగా మమకారం సహకారం
సమరసభావం శాంతి సౌభాగ్యం
అందిచే ఆమనికి
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదే నవయుగాదికి

పాటను స్వరపరుస్తుండగా రికార్డు చేసినందువల్ల  పాతికసంవత్సరాలకు పైబడి పోయినందువల్ల, సాంకేతికంగా కొంత సౌలభ్యం తక్కువగా ఉన్నా పాట వరుసను సంగీతరావుగారి స్వరంలో వినడం కోసం దాన్ని కూడా జతపరుస్తున్నాను ఇక్కడ. ఆడియో పోస్టుకి శ్రీ శివగారు అద్భుతంగా  చేసి ఇచ్చిన వీడియో ఇది.

ఈ ఇద్దరు ప్రతిభామూర్తులు - శ్రీ సంగీతరావుగారు, శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఈ ఇద్దరి గురించి శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు రచించిన వ్యాసం ఈమాట- వెబ్ పత్రికలో ప్రచురించబడింది. ఈ ఇద్దరితోనూ ఎంతో ఆత్మీయమైన స్నేహానుభవం ఉన్న రోహిణీ ప్రసాద్ గారు చెప్పిన ఎన్నో విశేషాలతో కూడిన ఆ వ్యాసాన్ని (80 ఏళ్ళ యువకులు) ఆసక్తి ఉన్నవారు ఇక్కడ చూడవచ్చు.
https://eemaata.com/em/issues/200807/1296.html






Sunday, September 15, 2013

వెలిగించని దీపాలు - దేవులపల్లి గీతాలు


వెలిగించని దీపాలు - దేవులపల్లి గీతాలు

గిరిజా కల్యాణం  గీతం తెలుగు చిత్రసీమ ప్రేక్షకులందరికీ పరిచయమే. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రచించిన  యక్షగాన ప్రబంధం  ఇది. రహస్యం సినిమా నిర్మాణసంస్థ లలితా శివజ్యోతి ఫిలింస్ వారు. ఈ సినిమాకోసం ఇంకా చాలా పాటలు చిత్రించాలని అనుకున్నారు నిర్మాతలు. అందుకోసమే  దేవులపల్లి 
 వెంకట కృష్ణశాస్త్రిగారితో కొన్ని గీతాలు రాయించారు. వాటికి బాణీలు కట్టి రికార్డు కూడా  చేసారు  ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాలగారు. కానీ  ఏ కారణం వల్లనో ఆ పాటలను రహస్యం చిత్రానికి  ఉపయోగించుకోలేదు. ఘంటసాలగారికి స్వరసహచరులుగా ఉన్న సంగీతరావుగారు ఆ గేయాలను తాను కూచిపూడి నృత్యరూపకాలకు సంగీత దర్శకత్వం వహించిన సమయంలో అర్థనారీశ్వరం అనే నృత్యరూపకానికి ఉపయోగించారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రచించిన  ఆ పాటల్లో ఒకటి - భ్రమించు ముద్దు మోముతో.

అమ్మవారి గురించి వర్ణిస్తూ చిత్రించాలనుకున్న సందర్భం కోసం దేవులపల్లిగారు ఈ పాటను రచించారు.
భ్రమించు ముద్దుమోముతో
చలించు కుంతలాలతో
సుమించు లేత నగవుతో
రహించు గండపాణితో
విలాస నాట్యమాడు మాతృదేవికిన్
నమస్కృతుల్ నమస్కృతుల్
నమస్కృతుల్ 

ఈ పాటని ఘంటసాల గారు హమీర్ కల్యాణి రాగంలో స్వర పరిచారు. సంగీతరావుగారు దీన్ని  శ్రీ వెంపటి చినసత్యంగారి దర్శకత్వంలో రూపొందిన కూచిపూడివారి అర్థనారీశ్వరం నృత్య రూపకం కోసం ఉపయోగించారు. 

మరొక పాట-
ఈ పాటని ఈశ్వరుడి అర్థనారీశ్వర స్వరూపాన్ని వర్ణించేసందర్భంలో చేయాలనుకున్నారు. ఇది కూడా రికార్డు చేసారు కానీ ఉపయోగించుకోలేదు. ఈ పాటను ఘంటసాల గారు హంసధ్వని రాగంలో స్వరపరిచారు.
 మరొక గీతం - అఖిల లోకేశ్వరా అర్థనారీశ్వరా
పల్లవి          అఖిల లోకేశ్వరా అమర గంగాధరా
                   అహి హార అర్థనారీశ్వరా
                    అమృత కర కోటీర
                  అతిలోక సుందరా
                 అఘహరా అర్థనారీశ్వరా
చరణం           పులితోలు నీటుతో
                   వలువ వలెవాటుతో
                   చెలువొందు అర్థనారీశ్వరా
                   నిటల నయనమ్ముతో
                   నిడుద తిలకమ్ముతో
                   నెగడొందు అర్థనారీశ్వరా                                  “అఖిల లోకేశ్వరా అమర గంగాధరా
చరణం          వలకేల శరము
                 దాపల కేల సుమ శరము
                 వలెమించు అర్థనారీశ్వరా
                 తల్లివై  అలరింప తండ్రివై రక్షింప
                 ఏకమూర్తి ధరించు లోకేశ్వరా          
                 అర్థనారీశ్వరా....అర్థనారీశ్వరా...అర్థనారీశ్వరా.                  అఖిల లోకేశ్వరా అమర గంగాధరా                 
 చక్కని తెలుగు పదాలతో ఒక పాదంలో  శివమూర్తిని, మరొక పాదంలో గౌరిని
 వర్ణిస్తూ  దేవులపల్లిగారు ఎంత చక్కగా రచించారో ఈ   పాటని.

అర్థనారీశ్వర తత్వంలో రూపాన్ని వర్ణించడంతో పాటు వారిని జగన్మాతా పితరులుగా చూపించిన విధానం ఎంతో బావుంది.

ఇంకొక పాట
శివుడు తాండవమాడెనపుడూ.....

ఈ పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు  రచించారు. ఘంటసాల గారు ఈపాటను శ్రీరాగంలో స్వరపరిచారు. సంగీతరావుగారు దీన్ని శంకరాభరణం రాగంలో స్వరపరిచారు. కూచిపూడి నాట్యం చేసేవారికి సోలో డాన్స్ కోసం ఈ పాటను స్వరపరిచారు సంగీతరావుగారు.

శివుడు తాండవమాడేనపుడూ............

పల్లవి             శివుడు తాండవమాడెనపుడూ
                   శివుడు తాండవమాడేనపుడు
                   జగదంబ సహితముగ శివుడూ తాండవమాడెనపుడు

                     శౌరి మృదంగము మ్రోయింప 
                     పాకారి వేణువును పూరింప,
                     వారిజాసనుడు తాళము నదింప(శబ్దం చేయడం)
                     భారతి విపంచి   మ్రోయింప      
                          క్షీర వారాశి తనయ పాడ
                     అచ్చరలు క్రమ లయ న్యాసము తోడ
                     నారదాది మునివరులు తిలకింప
                     పారవశ్యమున జగతి పులకింప.........
ఈ పాట లో శివతాండవ దృశ్యం వర్ణించబడింది. విష్ణువు ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, సరస్వతి, లక్ష్మీదేవి, అప్సరసలు నారదుడు ఇలా దేవతలందరూ ఆ కొలువులో తమ కళా ప్రదర్శన చేస్తూ ఉండగా జగదంబ అయిన పార్వతీ సహితంగా  శివుడు తాండవ నాట్యం చేసాడు.
ఈ పాట లో దృశ్యాల వర్ణన వింటే సి. నారాయణరెడ్డిగారు రచించిన ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు పాట గుర్తు రావడం యాదృచ్ఛికమేనా. ఆ పాటలో కూడా దేవతలందరూ కలిసి ఒక్కోవిధమైన కళా ప్రదర్శన చేస్తున్నట్టు వర్ణించబడింది.
ఆ పాట సాహిత్యంలో విరించి తాళము వేయగా, హరి మృదగము మ్రోయింపగా ప్రమధులాడగా అప్సరసలు పాడగా....అంటూ ఆ తాండవ దృశ్యాన్ని వర్ణిస్తారు. మరి నారాయణరెడ్డిగారు ఈ పాట విన్న తరువాత రాసారో - కాదో మరి. 
రహస్యంలో గిరిజా కల్యాణం యక్షగానంతో పాటుగా ఈ పాటలు కూడా ఉండి ఉంటే సంగీతప్రియులైన సినీశ్రోతలకు వీనులవిందుగా ఉండేది. అయినా కూచిపూడి నృత్యరూపకాల ద్వారా ఆ లోటు కొంత తీరిందని సంతోషించవచ్చు కూడా.


Thursday, August 1, 2013

శ్రీ నూకల చిన సత్యనారాయణ - రాగ ప్రస్తారంలో స్వతంత్రుడు, సరసుడు





 
శ్రీ నూకల చినసత్యనారాయణగారితో సంగీతరావుగారికి చిన్నతనంలోనే పరిచయం ఉంది. నూకల సత్యనారాయణగారికి చిన్నతనంనుండే గాత్రసంగీతం పట్ల ఎంతో ఆసక్తి కనపరిచేవారు. కొంతకాలం కంభంపాటి అక్కాజీరావుగారి వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. తరువాత విజయనగరంలోన మహారాజావారి సంగీత కళాశాలలో విద్యార్థిగా చేరి శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. కొంతకాలం తర్వాత శ్రీ పినాకపాణివారి వద్ద శిష్యుడిగా చేరి, కర్ణాటక సంగీతంలో ఎన్నోఉన్నత శిఖరాలను అథిరోహించారు. సంగీతరావుగారి తండ్రి శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు ఈ విజయనగరం మహారాజావారి సంగీత కళాశాలలో వోకల్ పండితులుగా ఉండేవారు. ఆ విధంగా సంగీతరావుగారికి నూకలవారితో చిన్నతనంలోనే పరిచయం ఉంది. ఒక సంగీత కచేరీలో సంగీతరావుగారి పాటకి పక్కవాద్యంగా నూకల సత్యనారాయణగారు వయొలిన్ వాయించి వాద్య సహకారం చేసారు కూడా.

శ్రీ సంగీతరావుగారు 1976లో ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఆనాటి ప్రసిద్ధ సంగీత విద్వాంసుల పరిచయ పరంపర వెలువరించారు. ఆ వరుసలో శ్రీ నూకల చిన సత్యనారాయణగారి గురించి వ్రాసిన వ్యాసం ఇది. 1976తర్వాత 2013వరకు (దాదాపు 37 సం)జరిగిన ఇన్ని సంవత్సరాలలో నూకలవారు సాగించిన ప్రస్థానం, చేసుకున్న విజయోత్సవాలు ఎన్నో. అయితే ఈ వ్యాసం 1976 నాటికి శ్రీ సంగీతరావుగారికి పరిచయం ఉన్న నూకల చినసత్యనారాయణగారి ప్రతిభకు సంబంధించిన అంశాలకు పరిమితమయినది.
" రాగ ప్రస్తారంలో స్వతంత్రుడు, సరసుడు" ఇది ఆనాటి వ్యాసానికి శీర్షిక.



"నూకల చిన సత్యనారాయణ-
రాగ ప్రస్తారంలో స్వతంత్రుడు, సరసుడు" 

సంగీతం శాస్త్రంగా, వృత్తిగా పరిగ్రహించి సంపూర్ణమైన సత్ఫలితాలు సాధించిన సంగీత పట్టభద్రుడు శ్రీ నూకల చిన సత్యనారాయణ. కర్ణాటక సంగీత రసికులకు ఈనాడు శ్రీ సత్యనారాయణ సంగీతం ఎడల ఎంతో కుతూహలం, ఆసక్తి ఉన్నాయి. సుశ్రావ్యమైన ఆయన కంఠస్వరమూ, రాగ తాళములలో గల స్వాతంత్ర్యమూ, సరసత, కచేరీ నిర్వహించడంలో గల అభినివేశమూ శ్రీ సత్యనారాయణ సంగీతంలోని సహజ ఆకర్షణ.


మూడు పదులు దాటిన శ్రీ సత్యనారాయణ సంగీత   జీవితానుభవం గణనీయమైనది. సంప్రదాయ సంగీతం సక్రమమైన పద్ధతిలో గురుముఖతః సాధన చేసిన శ్రీ సత్యనారాయణ సంగీతం ఆయనను ప్రభావితం చేసిన అనేకమంది విద్వాంసుల ప్రతిభతో తాదాత్మ్యం చెందడం ఆయన రసజ్ఞతను, సహృదయత్వాన్నీ వ్యక్తం చేస్తుంది. కళాపరంగా ఎక్కడ ఏ మంచి వినిపించినా దానిని గ్రహించడం వలన శ్రీ సత్యనారాయణ పాండిత్యంలో ఎంతో వైశాల్యమూ, గాంభీర్యమూ ఏర్పడ్డాయి. ఈ విధమైన పాండిత్యం ఉత్తమ గురుత్వానికి లక్షణం.


శ్రీ సత్యనారాయణ మొదట వాయులీన వాదకులైన తరువాతనే గాయకులయ్యారు. వాద్య నైపుణ్యం కూడా కలిగిన గాయకునిలో శాస్త్రీయంగా సునిశితమైన అవగాహన, సుస్పష్టమైన గమక స్ఫూర్తీ ఉంటాయి.


పరిశోధన:


శ్రీ సత్యనారాయణ సంగీత శాస్త్రంలో పరిశోధనలు సలిపిన పండితులు. భారతీయ సంగీతంలోని రాగ విధానానికి సంబంధించిన దాక్షిణాత్య, ఔత్తరాహ సంగీతం సంప్రదాయ రీతుల తులనాత్మక పరిశీలన వారి ప్రత్యేక కృషి.

రాగవిధానం భారతీయ సంగీతం విశిష్టతను నిరూపిస్తుంది. భారత హృదయ సంవేదన రాగ విధానంలోనే సంగీత మయంగా వ్యక్తం అవుతుంది. రాగములు దేవతా మూర్తులుగా ధ్యానించబడ్డాయి. అనేక రాగములు రూపకల్పన చేయబడి, చిత్రీకరించబడ్డాయి.


రాగ నిర్వచనం


రాగం అంటే ఏమిటి  ఆరోహణావరోహణ క్రమంలో గల సర్వ సముదాయం అని స్థూలంగా చెప్పడం కన్నా, రాగం అంటే సంగ్రహ రూపంగా ఉన్న ఒక స్వర రచన అనడం ఉచితం. అయితే  ఆ రచన గాయకుని  ఊహా పోహల ననుసరించి సంకోచ వ్యాకోచాలకు అవకాశం కలిగిస్తుంది. అనేక రాగాలకు రసనిర్ణయం జరిగింది. అయితే, ఆ నిర్ణయం సక్రమంగా అనుసరించబడలేదు. 

నిజానికి వివిధ రసములకు లక్ష్య ప్రాయమైన స్వర రచనలు లేవు. యక్ష గానాలలోనూ, నాట్య రూపకాలలోనూ, ఆయా రాగాలను వివిధ రస నిష్పత్తికి ప్రయోగించేవారేమో. ఆయా రసభావములను పోషించే సందర్భంలో తీవ్ర కోమల స్వర సమ్మేళన గాయకుని సరసమైన ప్రతిభే ప్రధానంగా ఉంటుంది. రస నిష్పత్తికి రాగ ప్రాధాన్యాన్ని చెప్పినట్టు, తాళ ప్రాధాన్యాన్ని చెప్పడం కనబడదు. అనుభవంలో తాళ ప్రాధాన్యం, ఎంతో కనిపిస్తుంది. రస భావ పోషణలో.


రాగముల పరిథి నిర్ణయించడం పరిశోధకుల సమస్య. అనేక ప్రసిధ్ధ రాగములు శతాబ్దాల తరబడి ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాలక్రమాన మేళకర్త పద్ధతి అమలు లోకి వచ్చిన తర్వాత ఔడవ షాడవ భేదాలననుసరించి ఏర్పడ్డ రాగాలు వేలకు వేలు తయారయ్యాయి. మనకు కావలసిన మూర్ఛనకి సరిపడే పేరు పుస్తకాల్లో కనపడకపోతే ఏ శక్తి ప్రియ అనో పేరు పెట్టుకోవలసి ఉంటుంది. ఆరోహణావరోహణ క్రమంలో, చిత్ర సంచారంలో ఉన్న ప్రతి చిన్న మార్పుకు వేరే రాగంగా వ్యవహరించ వలసి వచ్చింది.


ఒక రాగం శ్రవణ యోగ్యంగా ఉండడం, ఆ రాగంలోని స్వర సంబంధం పరస్పర సంవాది, ఆనువాది రూపంగా ఉండడం గ్రహించగలుగుతాం. ఈ ప్రాతి పదిక మీద రాగ విధానం పునః పరిశీలించబడడం అవసరమేమో. ప్రతి చిన్న సంచారాన్నీ  ప్రత్యేక రాగంగా పేర్కొనడం కన్నా ఈనాడు వివిధ రాగములుగా పేర్కొనబడిన రాగాలను సమన్వయ పరిచి ఒకే రాగంగా వివృత పరచవచ్చునేమో. సత్యనారాయణగారి వంటి పరిశోధకులు వివరాలు సేకరించవలసి ఉంటుంది.


రాగ మేళనం


ఈనాడు ఉత్తరాది సంగీతంలో రెండు భాగాలు కలిపి గానం చేయడం ఒక ప్రక్రియగా అమలులోకి వచ్చి ఉంది. రాగ విధానం వలన నిర్దిష్టమైన రాగ భావములకు ప్రత్యేకత ఏర్పడడం జరిగింది. ఆ రాగ స్వరూపానికి స్కాలిత్యం ఏర్పడకుండా అచంచలమైన  లక్షణం ఏర్పడింది. గ్రహస్వరం, న్యాస స్వరం, అంశ స్వరములను నిర్ణయించి ఆ రాగ స్వరూపానికి మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా చేయబడింది. దీని వలన ఆయా రాగాల స్వరూపాలు నిర్దిష్టంగా ఏర్పడ్డా, ఆయా రాగములలో రచింపబడిన రచనలలో వైవిధ్యం లోపిస్తుంది. ఒకే రాగంలో ఉన్న అనేక రచనలలో ఉన్న రాగ భావం ఒకటే. ఒక కీర్తన గాంధారంలో ప్రారంభం అయితే మరొకటి షడ్జమంలో ఎత్తుగడ జరిగిందన్న తృప్తి తప్పిస్తే మరోకటి లేదు.


అందుచేతనే రాగభావములను ఆధారం చేసుకున్న ఆయా రచనలలో స్వర రచయిత భావనకు అవకాశం లేదు. ఇంతకు పూర్వం శతాబ్దులుగా ప్రచారంలో ఉన్న రాగ భావాన్ని సాహిత్యానికి అమర్చడమన్నదే ప్రధానం. ఆయా విషయాలను వివరంగా రసికులు గ్రహించడానికి శ్రీ సత్యనారాయణగారి వంటి పండితుల పరిశోధనలు ఎక్కువ ఉపకరిస్తాయి.

శ్రీ సత్యనారాయణ ప్రథమ శ్రేణి గాయకులు. అనేక సంగీత కచేరీలు చేసి, రసికుల మన్ననలు పొందారు. రేడియో జాతీయ కార్యక్రమాల్లో తమ సంగీతం వినిపించారు. అనేక సంగీత రూపకములకు సంగీత సారథ్యం వహించారు. ప్రభుత్వ మర్యాదల ననుసరించి అనేక సత్కారాలు పొందారు. పీఠాధిపతుల ఆశీస్సులనందుకున్నారు.


ఉత్తమ సంగీత విద్వాంసులుగా, ప్రథమశ్రేణి గాయకులుగా, వాద్య నిపుణులుగా, స్వర రచయితగా, ఆచార్యులుగా కృతార్థులయిన శ్రీ సత్యనారాయణ స్వకీయమైన ప్రతిభతో రసిక లోకానికి ఇవ్వగలిగినది ఇంకా ఎంతో ఉన్నదనే అనిపిస్తుంది.

పట్రాయని సంగీతరావు


డిసెంబరు, 12, ఆదివారం, 1976
ఆంధ్రప్రభ