visitors

Friday, November 13, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఆరవ భాగం

13.11.2020 - శుక్రవారం భాగం - 6*:
అధ్యాయం 2  భాగం 5 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


బుద్ధి, మనసు పరస్పరం విరుద్ధం. బుద్ధి చెప్పినది మనసుకెక్కదు. మనసులోని మాట బుద్ధికెక్కదు.

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా?! 

జీవనక్రమంలో నెం. 35, ఉస్మాన్ రోడ్ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళడమా, పండుగ సీజన్ కనుక ఆఇంట్లో జరుపుకున్న పండుగ ముచ్చట్లను ముందుగానే  పంచుకోడమా? అంటే మనసు పండుగలవేపే మొగ్గుతోంది. 

నెం.35, ఉస్మాన్ రోడ్ దీపావళి గురించి ముచ్చటించే ముందు, దానికి ముందుగా వచ్చే దసరా నవరాత్రుల గురించి కూడా చెప్పవలసి వస్తుంది. 

బాబూ వాళ్ళమ్మగారు (ఘంటసాల సావిత్రమ్మగారు) దసరా నవరాత్రుల సందర్భంగా తొమ్మిదిరోజులపాటు బొమ్మలకొలువు చాలా గ్రాండ్ చేసేవారు. మేము ఆ ఇంటి ఔట్ హౌస్ లోకి వెళ్ళాక వరసగా నాలుగైదు సంవత్సరాలు బొమ్మల కొలువులు పెట్టిన గుర్తు. ఘంటసాలవారింటి హాలు చాలా విశాలమైనది. దక్షిణం వేపు గోడను ఆనుకొని ఐదు వరసల మెట్లమీద రంగురంగుల దేవతా విగ్రహాలను, పెద్దా, చిన్నా  రకరకాల బొమ్మలను అలంకరించేవారు. అలాగే, నేలమీద దట్టంగా ఇసకపోసి, చదునుచేసి ముందువేపు మెడ్రాస్ మౌంట్ రోడ్, కాసినో, గెయిటీ వంటి సినిమా హాల్స్ నమూనాలు, జి.ఎన్ చెట్టి రోడ్ లోని కొన్ని భవంతుల నమూనాలు, వీధి దీపాల స్థంభాలు, పార్కులలో చెట్లు, మొక్కలు, మినియేచర్ కుర్చీలు, బెంచీలు, వాటిమీద కూర్చుని ఉన్న మనుషులు, ప్లాస్టిక్ కార్లు, సైకిళ్ళు, సైకిల్ రిక్షాలు, రంగురంగుల సీసపు బడ్లు, తోరణాలు. వెనకవేపు పొలాలు, పల్లెటూళ్ళు, కొండపైన ఆలయాలు, అక్కడికి వెళ్ళడానికి రహదార్లు ఉండేవి. Concealed wiringతో series lighting వంటి వ్యవహారమంతా బాబూవాళ్ళ అమ్మగారు, పిన్నిగారి సలహాలు సూచనలమేరకు సుబ్బు ఏర్పాటుచేసేవారు. సుబ్బు అనబడే బి.సుబ్బారావు ఘంటసాలవారి జివిఎస్ ప్రొడక్షన్స్ లో ప్రొడక్షన్ మేనేజర్. ఘంటసాలవారి కుటుంబంలోని వ్యక్తిగా మెసిలేవారు. సావిత్రమ్మగారి అన్నగారి పేరు కూడా సుబ్బారావే. ఆయన అందరికీ సుబ్బారావు అన్నయ్య, పిల్లలకి మాఁవయ్య. ఈయన సుబ్బు. 

పొలాలను పండించడానికి ఒక వారగా ఏర్పాటు చేసిన మట్టిలో ఆవాలు, మెంతులు, ధనియాలు జల్లి వాటిమీద నీరు జల్లి వుంచితే రెండురోజుల్లో పంట పొలాలు తయారయేవి. అటకలమీదవుండే ఈ బొమ్మలను పెట్టెల్లోంచి దింపి వాటిని తుడవడంలో, కొలువులైపోయాక తిరిగి పెట్టెల్లో సద్దడంలో, పల్లెటూరు, పట్టణం మోడల్స్ తయారు చేయడానికి కావలసిన ఇసకను సేకరించడంలోనూ నా వయసుకు తగిన సాయం నేను చేసేవాడిని. మా ఇంటికి ఎదురుగా చాలా దగ్గరలోనే  సొమసుందరం స్ట్రీట్ లో పెద్ద కార్పరేషన్ గ్రౌండ్ వుంది. అక్కడ కబాడీ ఆడ్డానికి, ఉయ్యాళ్ళు ఊగే దగ్గర కావలసినంత ఇసక ఉండేది. ఆ ఇసకను తీసుకురావడానికి నేను, పెద్దబాబు (విజయకుమార్), తమ్ముడు కృష్ణ గోనె సంచులు పట్టుకెళ్ళి మోయగలిగినంత ఇసకను తెచ్చేవాళ్ళం. అలాగే, నవరాత్రి కొలువులు పూర్తి అయిపోయాక ఆ ఇసకనంతా తిరిగి ఆ కార్పరేషన్ గ్రౌండ్ లో తెచ్చిన చోటనే పోసేసి వచ్చేవాళ్ళం. ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే  ఆ మట్టిని తీసుకురావడానికి బాబూవాళ్ళ నాన్నగారు (ఘంటసాలగారు) ఒప్పుకునేవారు. ఈ బొమ్మలకొలువు తీర్చిదిద్దే వ్యవహారమంతా ఘంటసాలవారు ఇంటిలో లేనప్పుడు, లేదా రాత్రి అందరూ పడుకున్న తరువాత ప్రారంభించేవాళ్ళం. ఇలాటి నవరాత్రుల సమయంలోనే ఒకసారి, అదే మొదటిసారి కూడా, సోమసుందరం స్ట్రీట్ ప్లే గ్రౌండ్ లో ఆ ఇసకలో కొంతమంది ఫైట్ చేసుకోవడం చూసాను. అయితే అవి నిజమైన ఫైట్లుకావు. సినీమా ఫైట్లు. కొంతమంది స్టంట్ ఆర్టిస్ట్ లు ఫైట్స్ కంపోజ్ చేస్తూ ప్రాక్టీస్ చెసేవారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గాలిలో పల్టీలు కొట్టడం, ఒంటిమీద చేయిపడకుండా పిడికెళ్ళతో గుద్దుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం చూడ్డానికి చాలా సరదగా వుండేది.  ఆడుకోవడానికి గ్రౌండ్ కు వచ్చే చిన్నపిల్లలంతా ఆసక్తిగా చూసి ఆనందించేవారు. తరువాత, వాళ్ళూ అలాగే కొట్టుకునేవాళ్ళు. మరొక రోజు ఒక వస్తాదు లాటి వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ఈ రకమైన ఫైటర్స్ అందరికీ ఏవో  సలహాలు చెపుతూ తానూ చేసి చూపించాడు. బాగా వయసైన మనిషే. ఆయన పేరు చక్రపాణి అని, MGR కు అన్నగారని చెప్పుకోవడం విన్నాను. అలాటి వీరుల క్రీడా స్థలంలోని మట్టిని మా ఇంటి బొమ్మలకొలువులో ఉపయోగించేవాళ్ళము.  

ఘంటసాలవారింటి దసరా నవరాత్రుల కొలువులు చూచేందుకు ప్రతీరోజు చాలామంది సినీమా కుటుంబాలకు చెందిన ఆడవాళ్లు, పిల్లలు వచ్చేవారు. నేను మొదటిసారిగా గిరిజ అనే సినీమా నటిని చూసింది సావిత్రమ్మగారి బొమ్మలకొలువులోనే. చూడ్డానికి చాలా తెల్లగా నొక్కుల జుత్తుతో, చెవులకు ఎర్రపొడులున్న  చిన్న రింగులతో  చాలా అందంగా  తెల్లటి చీరలో స్లిమ్ గా కనిపించేరు. నాకు తెలియనివాళ్ళెందరో వచ్చేవారు. భానుమతి, జమునగార్ల ఇళ్ళలో కూడా బొమ్మలకొలువు సంబరాలు బాగానే జరిగేవని చెప్పుకునేవారు. భానుమతిగారంటే   సావిత్రమ్మగారికి చాలా ఇష్టం. అవకాశమున్నప్పుడు వెళ్ళి ఆవిడను చూసేవారు. ఈ నవరాత్రుల బొమ్మల కొలువు పేరంటాళ్ళు వచ్చే సమయంలో ఇంట ఘంటసాలవారు వుండేవారుకారు. వచ్చిన ఆడవాళ్ళంతా వెళ్ళాక ఏ ఎనిమిదింటికో ఇంటికి చేరేవారు. 

బొమ్మలకొలువు పేరంటాళ్ళు వచ్చేప్పుడు పామర్తిగారి పెద్దమ్మాయి రావమ్మ (రామలక్ష్మి), సావిత్రమ్మగారి అక్క కుమార్తె ఝాన్సీ చాలా చురుకుగా పాల్గొనేవారు. వాళ్ళు అట్నుండొకసారి, ఇట్నుండొకసారి తిరుగాడుతూ పేరంటాళ్ళకోసం వుంచిన శెనగలు, వక్కలు ఒక్కొక్కటిగా ఎవరూ చూడకుండా నోట్లో వేసుకోవడం నాకు వింతగాను, భయంగానూ వుండేది, ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే తిడతారేమోనని. కానీ, వాళ్ళకు ఆ భయం వుండేదికాదు. చాలా సహజంగా, చొరవగా తీసుకోవడమే కాక  రావమ్మ నా చేతిలో కూడా  కొంచెం శనగ్గింజలు, వక్కపొడి పెట్టేది. నాకు అప్పటినుండే వక్కపొడి నమలడం ప్రారంభమయింది. నాకు మరే అలవాటు లేకపోయినా, అందుబాటులో వుంటే ఇప్పటికీ వక్కపొడి నమిలే అలవాటుంది. మెడ్రాస్ లో 'అశోకా' వక్కపొడి 'సవరిన్' వక్కపొడి చిన్న చిన్న పేకట్లలో దేవాలయాల దగ్గర, తామలపాకుల దుకాణాలలో, కిరాణా కొట్లలో అమ్మేవారు. ఒక్కొక్క పొట్లం మూడు నయాపైసలుండేది. పెళ్ళిళ్ళలో, పేరంటాలలో తాంబూలం పేకట్లలో పెట్టడానికి ఈ వక్కపొడి పొట్లాలు తప్పనిసరిగా ఉపయోగించేవారు. 

నాకు వక్కపొడి కొంత అలవాటు కావడానికి కారణమైన మరొక వ్యక్తి మా దొడ్డమ్మగారు, చెళ్ళపిళ్ళ వరహాలమ్మ. భోజనం చేసే సమయం , నిద్రపోయే సమయంలో తప్ప మిగిలిన కాలమంతా ఆవిడ నోట్లో పోకచెక్కలు నానుతూనేవుండేవి. ఆవిడ చీరకొంగుముడిని ఎప్పడూ ఆ చెక్కలుండేవి. వాటిని ఉప్పుచెక్కలనేవారు. మా ప్రాంతాల్లో ఈ వక్కలు రెండు రకాలుగా తూకంవేసి అమ్మేవారు. పోకచెక్కలు. పీటి వక్కలు. 

  

మొదటిరకం రూపాయి నాణెంలా తెలుపు, ఎరుపు చారలతో వుంటాయి. మద్రాసులోను, తమిళనాట ఈ పోక్కాయల చెక్కునే సీవల్ గా అమ్ముతుంటారు. సన్నపొరలాగ సీవల్ చెక్కడానికి ప్రత్యేకమైన కత్తెరలాంటి సాధనాలువాడతారు.వీటిని అడకత్తెరలు అంటారు.

  


రెండవ రకంగా నల్లగా చిన్నవిగా పిక్కల్లా ఉంటాయి. 


ఆరోజుల్లో మద్రాసు తాంబూలసేవనకి, ఎక్కడపడితే అక్కడ, ముఖ్యంగా సినిమా థియేటర్లలో, ఎఱ్ఱటి ఉమ్ముల మరకలకి ప్రసిద్ధి. 

తమిళనాట వెత్తలె పాక్కు ప్రసిద్ధి

ఆ అలవాటు మితిమీరి చివరకి ప్రభుత్వం వక్కపొడుల అమ్మకంమీద ఆంక్షలు విధించే దాకా వెళ్ళింది. ఆఖరికి 'సవరిన్' 'అశోకా' వక్కపొడి కంపెనీలూ మూతపడ్డాయి. ప్రస్తుతం ఇంకా వాడుకలో త్రివేణి, క్రేన్, రత్నం వక్కపొడులు ప్రసిద్ధంగానే ఉన్నాయి. తమిళనాడులో 'రోజా' వక్కపొడి 'నిజాం పాక్కు' వాడకంలో వున్నాయి. పండగలు, పబ్బాలు, పూజలు, వ్రతాలు అంటే ఆకు వక్క తప్పనిసరి.

తమిళనాడు లో అత్యంత వైభవంగా జరుపుకునే పండగలు రెండే రెండు ఒకటి జనవరి లో వచ్చే పొంగల్; మరొకటి అక్టోబర్/నవంబర్ నెలలో వచ్చే దీపావళి. ఈ రెండు పండగల తర్వాతే మిగిలిన పండగలన్నీ. ఈ రెండు పండగలను అన్ని వర్గాలవారు ధనికులు, బీదలు అనే తేడా లేకుండా తమకున్నంతలో ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో దీపావళీ అమావాస్యకన్నా నరకచతుర్దశికే ప్రాముఖ్యత. 

తెల్లవారుజామున లేచి స్నానాలు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి సూర్యోదయం అయేవరకు బాణసంచా కాల్చడం పరిపాటి. వారికి  దీపావళి వెలుగులకన్నా శబ్దంలోనే ఆనందం. సీమ టపాకాయలు మొదలు బాంబుల వరకు ధ్వని ప్రధానమైన  బాణసంచామీదనే వందలు, వేల రూపాయలు ఖర్చుపెడతారు. ఆ శబ్దకాలుష్యాన్ని ఆనందించాక విందులు, వినోదాలు, దీపావళికి విడుదలైన సినిమాలకి  కుటుంబ సమేతంగా వెళ్ళి మళ్ళీ ఏ రాత్రికో ఇళ్ళకు చేరుతారు. మన తెలుగువారిలా అమావాస్య రోజు రాత్రి దీపాల పండగ జరపరు. 
దీపాలంకరణ వుండదు. కార్తీక పౌర్ణమి రోజున రాత్రిపూట దివ్వెలు వెలిగించి   దేవాలయ పుష్కరిణి జలాలలో వదులుతారు. తమ ఇళ్ళలో ఆచారాన్ని పాటిస్తూ సంప్రదాయబధ్ధంగా దీపాలను వెలిగిస్తారు. అందుచేత దీపావళి అమావాస్య కళ ఆనాటి రాత్రి పెద్దగా కనపడదు. అసలు సిసలు తెలుగువారున్న ప్రాంతాలలోమాత్రం కొంతమంది అమావాస్య నాటి రాత్రి తమ ఇళ్ళముందు దీపాలు పెట్టి బాణసంచా వెలిగిస్తారు.

నెం.35,ఉస్మాన్ రోడ్ లో మాత్రం దీపావళి అమావాస్య చాలా వైభవంగా కళకళలాడుతూ జరిగేది. ఎన్ని వేల రూపాయలకు టపాకాయలు కాల్చారన్నది ముఖ్యం కాదు. దీపావళి రోజున భవనం మొత్తం ప్రమిద దీపాలతో  ఆ ఇంట దీపలక్ష్మి తాండవించేది. నా చిన్నతనంలో ఘంటసాల మాస్టారికి కానీ, ఇంట్లోవారికి కానీ శబ్దాలతో కూడిన బాణసంచా అంటే ఇష్టముండేదికాదు. వెలుగులు చిమ్మే బాణ సంచానే కొనేవారు.
అలాటి క్రేకర్సన్నీ పాండీబజార్ లో , రంగనాధన్ స్ట్రీట్ మార్కెట్లో చాలా విరివిగానే దొరికేవి. కానీ ప్యారీస్ కార్నర్ గొడౌన్ స్ట్రీట్, బందర్ స్ట్రీట్ వంటి ప్రాంతాల్లో హోల్ సేల్ మార్కెట్లలో ఎక్కువ వెరైటీలు దొరుకుతాయని అలాటి చోట్ల క్రేకర్స్ కొనడానికి ఘంటసాలగారు ఉత్సాహం చూపేవారు.

ఈ విషయాలన్నీ 1962 కు ముందు సంగతులు.

ఒక ఏడాది దీపావళికి ఓ మూడు రోజుల ముందు క్రేకర్స్ కొనడానికి ఘంటసాలగారు నన్ను వెంటబెట్టుకువెళ్ళారు. నేను, ఆయన మాత్రమే కారులో వెళ్ళాము. సాధారణంగానే మెడ్రాస్ లో దీపావళికి సమయంలో కొద్దో గొప్పో వానలు పడడం ఆనవాయితి. మేము ఉదయం పది గంటల ప్రాంతంలో బయల్దేరాము. వాతావరణం మబ్బులు కమ్మివుంది. గేటులోనుండి కారు బయటకు వచ్చాక, ఘంటసాలవారు డ్రైవర్ గోవింద్ తో "అణ్ణామలైపురం కెనాల్ రోడ్ ప్రొడ్యూసర్ ఆఫీసుకు పోడా" అని అన్నారు. ఇదేమిటి మందుగుండు సామాను కొందాము రమ్మని, వేరేదో చోటుకు వెళ్ళమంటున్నారే! అయితే ఈవేళ క్రాకర్స్ కొనడానికి వెళ్ళడం లేదేమో అని అనుకుంటుండగా, నా ఉద్దేశం గ్రహించినట్లుగా "నాయనా! ముందు ఆ పని చూసుకొని తరువాత, జార్జ్ టౌన్ వెళదాం" అని అన్నారు. నేను తల ఊపాను. కారు రాజా అణ్ణామలైపురంలో కెనాల్ రోడ్ లో చివరగా కుడిచేతి వేపు ఒక ఇంటిముందు ఆగింది. ఎడమవేపు కెనాల్. "నాయనా! నువ్వు కారులో కూర్చో. ఓ పది నిముషాలలో వస్తాను" అని చెప్పి కారు దిగి లోపలకు వెళ్ళారు. నేను కూడా క్రిందికి దిగి ఆ ప్రాంతాన్ని చూస్తున్నాను. ఒక ఐదు నిముషాల తరువాత అక్కడికి ఒక వాక్సాల్ కారు వచ్చి ఆగింది. అందులోనుండి ఒకావిడ క్రిందికి దిగింది. ఆవిడే ఆ కారును డ్రైవ్ చేస్తూ వచ్చారు. అది నాకెంతో ఆశ్చర్యం. ఎంత గొప్పావిడో, ఎంత తెలివైనదో అని అనుకున్నాను. కారు డ్రైవ్ చేయడానికి తెలివితేటలుండాలో అఖ్ఖరలేదో నాకు తెలియదు. ఆవిడ లోపలకు వెడుతూంటే మాస్టారు బయటకు వచ్చారు. ఆ వచ్చినావిడ ఘంటసాలవారి కి వినయంగా నమస్కారం పెట్టింది. "ఏమ్మా! బాగున్నారా" అంటూ పలకరించారు. ఆవిడ తలూపుతూ లోపలికి వెళ్ళింది. మేము మళ్ళీ కారులో ప్యారీస్ వేపుకి బయల్దేరాం. కారులో కూర్చొని బయట వింతలన్నీ చూస్తూవున్నా, నా బుర్రలో ఆ ఆడమనిషి గురించే ఆలోచిస్తున్నాను. ఆవిడను ఎక్కడో చూశాను. ఎవరో గుర్తు రావడం లేదు. కొంతదూరం వెళ్ళాక ఈ పోలికలున్న అమ్మాయి శభాష్ రాముడు సినీమా లో రమణమూర్తికి జోడీగా పార్క్ లో డ్యూయెట్ పాడింది. ఆ! గుర్తుకు వచ్చింది. కుసుమ కుమారి. తమిళంలో శివాజీ గణేశన్ తో శభాష్ మీనాలో నటించిన మాలిని. తెలుగులో సంతానం వంటి ఓ నాలుగు సినీమాలలో నటించింది. బావామరదళ్ళు సినీమాలో కూడా రమణమూర్తితో నటిస్తున్నట్లు పత్రికలలో చూశాను. (ఒక ఆరేళ్ళ వ్యవధిలో ఓ డజన్ సినీమాలలో నటించి ఎవరో తమిళ డైరక్టర్ ను పెళ్ళిచేసుకొని సినీమాలకు గుడ్ బై చెప్పేసిందని వార్త.)

ఆ ఆలోచన ముగియగానే మరో ఆలోచన. అయితే ఘంటసాలవారు వెళ్ళిన సినీమా కంపెనీ ఎవరిదని. తరువాత, తెలిసింది అది బావామరదళ్ళు సినిమా తీస్తున్న నిర్మాత ఆఫీసని. పాడిన పాటల  రెమ్యునరేషన్ కోసం ఘంటసాలగారు ఆ ఆఫీసుకు వెళ్ళారని. సాధారణంగా ఈ పనులు నరసింగడికి అప్పగిస్తారు. అతనివల్ల సాధ్యం కాకపోతే ఆయనే వెళ్ళేవారు. 

కారు ఫ్లవర్ బజార్ పోలిస్ స్టేషన్ ప్రాంతాలకు వచ్చాక ఒక వారగా గోవిందు బండిని ఆపాడు. అప్పటికే ఒక పెద్ద జల్లుపడి వెలిసింది. రోడ్లన్నీ బురద బురదగా వున్నాయి. అలాగే, ఆ లోపలి గౌడౌన్ స్ట్రీట్ , మింట్ స్ట్రీట్ ల్లోని క్రేకర్స్  షాపులన్నీ చూస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ రకాలున్నాయో చూసుకుంటూ వెళ్ళాము.  ఘంటసాలవారి ముఖం గుర్తుపట్టిన కొంతమంది మంది వచ్చి నమస్కారం చేసి పలకరించారు. వారికి నవ్వుతూనే నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. అక్కడ ఓ అరగంట గడిపాక ఒక పెద్ద షాపులో మాకు కావలసిన క్రేకర్స్ కొనుగోలు చేసాము. ఈ బాణసంచా కొనడానికి వెళుతున్నానని తెలిసి మా అమ్మగారు నాకు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బులోనే నాకిష్టమైన క్రేకర్స్ కొనుకున్నాను. ఇద్దరికీ కలిపి చాలా క్రేకర్సే వచ్చాయి. మేమిద్దరం కలిపి కొన్న వస్తువుల ఖరీదు చెప్పితే మీరు ఆశ్చర్యపోతారు. వాటన్నిటి వెల అంతా కలిపి తొంభై రూపాయలే. నేను కొన్నవి పదిహేను రూపాయలకు. (ఈనాడు ఆ డబ్బులకి ఏవో రెండు వస్తువులు వస్తాయేమో. క్రేకర్స్ కొనడం మానేసి నాలుగు దశాబ్దాలయింది. కారణం. క్రేకర్స్ పొగ పడక. అవి కాల్చడంలోని ఆసక్తి ఎప్పుడో పోయింది.)

ఇక దీపావళీ ఉదయం నుండీ హడావుడే. తలంటు స్నానాలు, ఉన్నంతలో పిండివంటల తయారీలలో ఇంట్లోని ఆడవారంతా తలమునకలై వుండేవారు. బాబూ వాళ్ళమ్మగారు ముందురోజే దాచివుంచిన ప్రమిదలన్నింటినీ నీట్లో నానబెట్టి ఆరబెట్టించేవారు. ఇల్లంతా దీపాలు అలంకరించడమంటే మాటలా! నాలుగు ప్రహారీ గోడలు, పోర్టికోలో, బాల్కనీలో డాబామీది గోడలు అన్నింటినీ నూనె దీపాల ప్రమిదలు సిధ్ధం చేసేవాళ్ళం. చీకటి పడడం ఆరంభం కాగానే  సావిత్రమ్మగారు ప్రమిదల్లోని దీపాలు వెలిగించడం మొదలెట్టేవారు. వెనకాల ఔట్ హౌస్ వాకిట్లో కూడా మా అమ్మగారు దీపాలు వెలిగించేవారు. ఆనాటికి  ఘంటసాలవారింట్లో దీపావళి సెలబ్రేట్ చేసే పిల్లలం ముగ్గురం  మాత్రమే. మరో ముగ్గురు నలుగురున్నా వాళ్ళంతా మరీ చిన్నవాళ్ళు. అందుచేత కొన్న క్రేకర్సన్నీ  కాల్చేది నేనూ, పెద్దబాబే. మా బొబ్బిలి, విజయనగరంలో లాగా బాణా సంచా కాల్చడానికి ముందు 'దిబ్బు దిబ్బు దీపావళీ' కొట్టడానికి ఆముదం కొమ్మలు దొరికేవికావు. అందుకోసం బొప్పాయిచెట్టు కొమ్మలు కోసి ఆ ఆకులకు నూనెగుడ్డలు కట్టి వాటిని ముట్టించి వాటితో లాంఛనప్రాయంగా దీపావళీ బాణసంచా కాల్చడం చెసేవాళ్ళం. ఘంటసాలవారితో సహా వారింట్లోని కుటుంబసభ్యులు, ఇతర మిత్రబృందమంతా కూడా చాలా సరదాగా ఈ దీపావళి సంబరాల్లో పాల్గొనేవారు. మా పక్కింటిలోని పిల్లలు కూడా వచ్చి మాతో క్రేకర్స్ కాల్చేవారు. మేము చైనా బజార్లో కొన్న బాణసంచా రాత్రి తొమ్మిది గంటలవరకూ సరిపోయేవి. ఈలోగా గాలికి ప్రమిదలు ఆరిపోకుండా ఆరారగా నూనెపోస్తూవుండడం ఒక పెద్దపని.  నూనె దీపాలు వెలుగుతున్నంతసేపు ఇంట్లోని కరెంట్ దీపాలన్నీ ఆర్పేసి వుంచేవారు. నెం.35, ఉస్మాన్ రోడ్ లోని ఈ నూనె దీపాలకాంతి రోడ్ మీద చాలా దూరంవరకు ఆకర్షణీయంగా కనపడేది. మొత్తం మీద మా నార్త్ ఉస్మాన్ రోడ్ లో ప్రమిద దీపాలతో దీపావళి అమావాస్యను వైభవంగా జరిపేది ఒక్క ఘంటసాలవారింట్లోనే. 

మరొక ఏడాది దీపావళికి ఇంట్లోనే మతాబాలు, చిచ్చుబుడ్లు తయారు చేస్తే ఎలావుంటుందనే సంకల్పం నాకూ, నరసింగకు కలిగింది. మేమిద్దరం ఒకే జిల్లాకు చెందినవాళ్ళం కావడాన మతాబులు , చిచ్చుబుడ్లు తయారు చేయడానికి కావలసిన సరంజామా ఏమిటో బాగా తెలుసు. అయితే ఆ  ముడి వస్తువులు  దొరికే స్థలాలను కనిపెట్టడం చాలా కష్టమయింది. కోడంబాక్కం హైరోడ్ మీద కొన్ని కుండలు, మట్టివస్తువులు దొరికే కొట్లుండేవి. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఖాళీ చిచ్చుబుడ్లు కోసం ఆర్డర్ ఇస్తే వాళ్ళు రెండు మూడురోజుల తర్వాత రమ్మనేవారు. ఈలోగా మళ్ళీ జార్జ్ టౌన్ ఇరుకు సందుల్లో తిరిగి సురేకారం, గంధకం, అల్యుమినియం బీడు (రజన్) మొదలైనవన్నీ కొని వాటిని కల్వాలలో నూరి  మతాబులకి, చిచ్చుబుడ్లకి కావలసిన పాళ్ళు రెడీ చేసి, ఖాళీ చిచ్చుబుడ్లకి వెళితే వాడు కన్నాలు లేని బుడ్లు చేసిచ్చాడు. ఆ బుడ్లు పగిలిపోకుండా జాగ్రత్తగా వాటికి కన్నాలు పెట్టించడానికి మరొకరోజు ఆలస్యం. సొంత దీపావళి మీద ఆసక్తితో రాత్రింపగళ్ళు కష్టపడి నేను, నరసింగ అనుకున్నవాటిని  సమయానికి సిధ్ధం చేశాము. వీటితో పాటు మరికొంత బాణసంచాను బజార్లో కొన్నాము. యధాప్రకారం భవనమంతా దీపాలు వెలిగించి క్రేకర్స్ వెలిగించడం మొదలెట్టాము. మా ప్రతిష్టాత్మక చిచ్చుబుడ్లు , మతాబాలు మమ్మలిని చీదరపెట్టాయి. చిచ్చుబుడ్లలోంచి పొగతప్ప పువ్వులు రాలేదు. మతాబాలు అంతే పొగతోపాటు గెడ్డలుకట్టిన నిప్పురవ్వలే రాలేయి తప్ప తెల్లటి పువ్వులు రాలేదు. మా ఆపరేషన్ ఫెల్యూరుకి పరిశోధన మొదలెట్టాక తేలిందేమిటంటే  మేము కలపిన మతాబా పాళ్ళలో ఆముదం పాలు అనుకున్నదానికంటే ఎక్కువ పడింది. అందుకే తెల్లటిపువ్వులు రాలలేదని, వచ్చే సంవత్సరం ఈ లోటును సరిచేయాలని సరిపుచ్చుకున్నాము. అంతమాత్రాన దీపావళి ఏమీ ఆగిపోలేదు. మిగతా ఐటెమ్స్ తో గ్రాండ్ గానే జరిగింది. ఆ పై సంవత్సరం దీపావళి కి కూడా సొంత తయారీ మొదలెట్టాము. ఆదిలోనే హంసపాదు ఆ ఏడాది అల్యూమినియం రజన్ ఎక్కడా దొరకలేదు. ఎవరో మహానుభావుడు సలహా ఇచ్చాడు అల్యూమినియం పాత్రలు తయారు చేసే చోట్లకు వెళితే రజన్ దొరుకుతుందని. కానీ మాకు కావలసిన రజన్ దొరకలేదు. వాడు కొంచెం ముతకగా వున్న అల్యూమినియం పొడి మాకు అంటగట్టాడు. దానిని తెచ్చి కల్వంలో ఎన్నిగంటలు దంచినా మాకు కావలసిన పధ్ధతికి రాలేదు. అసలు ఇంతకి అది అసలైన ముడి పదార్ధంకాదు. ఆ ఏడాది మా సొంత తయారీ అట్టర్ ఫ్లాప్. మనకు సొంత తయారీలు ఏవీ అచ్చిరావని ఎవరికివారే గత అనుభవాలు గుర్తుచేసుకోవడం జరిగింది. 

దీపావళినాడు ప్రమిద దీపాలు పెట్టడంలో వుండే ఆనందం, తృప్తి, క్రేకర్స్ కాలిస్తే రాదు అని బాగా అర్ధం చేసుకున్నాం.  

మరొక ఏడాది దీపావళి కి పిల్లలు కొంత పెద్దయ్యారు. కొందరు, కాకరపువ్వొత్తులు పట్టుకునే వయసుకు వచ్చారు. యధాప్రకారంగా చీకటి పడ్డాక భవనం నాలుగు పక్కలా మేడ సహా ప్రమిద  దీప తోరణాలంకరణతో దేదీప్యమానంగా వుంది. సుమారు ఏడున్నర ప్రాంతంలో వరసగా నాలుగైదు  నల్లని పొడుగాటి గవర్నమెంట్ కార్లు సైరన్ మ్రోగించుకుంటూ చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాయి. ఎవరో, ఏమిటోనని  చూడ్డానికి మేము గేటు  బయటకు వచ్చాము. ఆఖరున వచ్చిన ఒక నల్లటి కారు మాత్రం నెం.35, ఉస్మాన్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లో అయింది. అక్కడ మిగతా ఇళ్ళకంటే వ్యత్యాసం గా కనిపించిన ఆ భవనంలోని ప్రమిదదీపాల కాంతులు  వారిని ఆకర్షించాయన్నది మాత్రం నిజం. తరువాత ఎవరో చెప్పగా తెలిసింది భారతదేశపు ప్రెసిడెంట్ డా. బాబూ రాజేంద్రప్రసాద్ గారు, ఉస్మాన్ రోడ్ మీదుగా రాజభవన్ కు వెళ్ళారని. పైలట్ కార్లన్నీ ముందు స్పీడ్ గా వెళ్ళిపోగా ప్రెసిడెంట్ కారు మాత్రం మా ఇంటి ప్రాంతంలో కొంచెం స్లోగా వెళ్ళిందని. 

ఆ తరువాత మరి కొన్ని నెలలకు తెలిసింది కోడంబాక్కం లెవెల్ క్రాసింగ్ దగ్గర పెద్ద ఫ్లై ఒవర్ కట్టబోతున్నారని. 1950ల నుండే అక్కడ బ్రిడ్జ్ కడతారని వార్తలు వచ్చినా ఆచరణలోకి రాలేదు. సడన్ గా ప్రెసిడెంట్ వస్తున్న వాహనమే ఆర్కాట్ రోడ్ లో లెవల్ క్రాసింగ్ దగ్గర చాలాసేపు నిలబడిపోవడంతో ఈ ఫ్లై ఓవర్ ప్రోజెక్ట్ విషయంలో ప్రభుత్వం ఉలిక్కిపడి నిద్రలేచిందని చెప్పుకున్నారు. కామరాజనాడార్ ముఖ్యమంత్రిగా పునాదిరాయి వేయగా , ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఎమ్ భక్తవత్సలం కాలంలో ఫ్లై ఓవర్ మీద రాకపోకలకు ప్రారంభోత్సవం జరిగింది. ఇంతటి చారిత్రాత్మక ఘట్టానికి మూలపురుషుడైన డా. బాబూ రాజేంద్రప్రసాద్ అప్పటికే కాలధర్మం చెందారు. 

నెం.35, ఉస్మాన్ రోడ్ లోని దీపావళి పండగలను తల్చుకున్నపుడల్లా షావుకారు సినీమా లోని మాస్టారు చేసిన దీపావళీ పాటే గుర్తుకు వస్తుంది.
 "దీపావళీ దీపావళి -మా ఇంటా మాణిక్య కళికావళీ ...దీపావళీ ... దీపావళీ".

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు



వచ్చేవారం మరికొన్ని జ్ఞాపకాలు...
అంతవరకూ 
... సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, November 6, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఐదవ భాగం

06.11.20 - శుక్రవారం భాగం - 5*:
అధ్యాయం 2 భాగం 4 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
నెం.35, ఉస్మాన్ రోడ్ మా చిరునామాగా మారింది. ఆనాటి మెడ్రాస్ లోని ప్రతీ భవనమూ ముందు విశాలమైన ప్రాంగణంతో, పూలమొక్కల వరసలు, కొబ్బరిచెట్లు, మామిడిచెట్లతో నిండివుండేది. భవంతి వెనకవేపు కారుషెడ్లు, ఆ ఇంటి యజమాని ఆర్ధిక స్తోమతనుబట్టి ఔట్ హౌస్ లువుండేవి. (ఔట్ హౌస్ కు తెలుగు పదమేమిటి చెప్మా!) అలాటి ఔట్ హౌసుల్లో ఆ భవంతిలో పనిచేసే ఉద్యోగస్తులో, కారుడ్రైవరో తమ కుటుంబంతో సహా అందులో ఉండేవారు.

ఘంటసాలవారి గృహం కూడా చాలా విశాలమైన పాతకాలపు భవంతే. నాలుగుప్రక్కలా ప్రహారీతో ఉండేది. తూర్పుముఖం ఇల్లు. వీధివేపు విశాలమైన స్థలం. పిల్లలు ఆడుకోవడానికి తగినంత స్థలం. ఇంటికి రెండుప్రక్కలా ఇంటి వెనకవేపున్న కార్ షెడ్ కి ఔట్ హౌస్ కి వెళ్ళడానికి మట్టి సందులు. ఎడంచేతి వెనకవేపు కారుషెడ్. దాని పక్కనే ఒక చిన్న ఔట్ హౌస్ (పెంకుటిల్లు). మొదట్లో డాబాలేదు. పిల్ల పాపా లేని చిన్న కుటుంబానికి అనువు. ఔట్ హౌస్ పక్కన ఇంటి పనిమనిషికి  చిన్న గుడిసె. ఆ పక్కనే టాయిలెట్. పనిమనిషి గుడిసెకు ఎదురుగా నైరుతిమూల మైన్ బిల్డింగ్ ఆనుకుని ఒక గిలక బావి.  అది 1955లో ఆ ఇంట్లో మా ప్రవేశం నాటికి 35, ఉస్మాన్ రోడ్ నైసర్గిక స్వరూపం. 

ఘంటసాలవారు ఆ ఇంటిని ఎవరో ఒక దొర దగ్గర కొన్నారట. అయితే అంతకు ముందో, తర్వాతో ఎవరో తమిళులు కూడా ఆ భవనంలో వుండి వుండాలి. ఎందుకంటే వీధిగుమ్మం మీద వరండాలో తూర్పువేపు గోడ మీద "వేలుమ్, మయిలుమ్ తుణై" అన్న వాక్యం తమిళం అక్షరాల్లో వుండేది. ఇది అరుణగిరినాదర్ "కందర్ అనుబూది" అన్న అద్వైత సిద్ధాంతం మీద రచించిన భాష్యంలోని మొదటి పద్యం తాత్పర్యం. అంటే, "(కుమారస్వామి) ఆయుధమైన శూలం (వేల్), వాహనమైన నెమలి రక్షించుగాక" అని స్థూలంగా చెప్పుకోవచ్చును.

ఘంటసాలగారి తమ స్వగృహంప్రవేశానికి ముహూర్తం 1951 జూన్ 21న అర్ధరాత్రి 1.30కి. అంతవరకు మోతీలాల్ స్ట్రీట్ లో కొన్నాళ్ళు, రామానుజం స్ట్రీట్ లో కొన్నాళ్ళు చిన్న అద్దె ఇళ్ళలో ఉండేవారట. ఈ గృహప్రవేశం సందర్భంగా సినీమారంగానికి చెందిన ప్రముఖులంతా హాజరయ్యారట. ఈ గృహప్రవేశానికి ఘంటసాలవారు తమ గురుదేవులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారిని కూడా ప్రత్యేకంగా విజయనగరం నుండి తీసుకువచ్చి ఆయనను సముచితరీతిని సత్కరించారు. ఎంతో శ్రద్ధాసక్తులతో తనకు సంగీతవిద్యను నేర్పి తన ఉజ్జ్వల భవిష్యత్ కు బంగారు బాట వేసిన గురువుగారి ఎడల తనకు గల గురుభక్తిని చాటుకున్నారు ఘంటసాల. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గురువుగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి సంగీతకచేరీ చాలా జనరంజకంగా జరిగిందని చెప్పేవారు. 

  
1951లో గృహప్రవేశానికి ఘంటసాలవారి ఆహ్వాన పత్రిక 

ఈ గృహప్రవేశం సమయంలోనే ఘంటసాలవారు తనకు చేదోడువాదోడుగా వున్న తన మిత్రుడు దేవగుప్తాపు రామచంద్రరావుకు తానే పెద్దై దగ్గరుండి ఉపనయనం జరిపి  ఉత్తమ స్నేహితులు ఎలావుండాలో చాటిచెప్పారు. రామచంద్రరావు  విశాఖపట్నం జిల్లాలోని ఏదో ఒక చిన్న గ్రామానుంచి పొట్టచేతబట్టుకొని మెడ్రాస్ చేరుకున్నవాడు. వీరిద్దరిని స్నేహితులుగా చేసింది  టి.నగర్ పనగల్ పార్క్. రామచంద్రరావు సంగీతం మనిషికాడు. ఉదయమంతా ఎక్కడెక్కడో ఏవేవో పనులు చేసుకుని రాత్రుళ్ళు ఘంటసాలగారు ఈ పార్క్ చప్టాలమీద కూర్చొని పాటలు పాడుతుంటే ఆయన కూడా పక్కనచేరి  అగ్గిపెట్టె మీద తాళం వేస్తూ ఉత్సాహపరిచేవాడట. ఆకలి ఇద్దరిని ఒకటి చేసింది. విజయనగరంలో తన తొలి రోజులలో నేలనూతల నాగభూషణం, ముద్దు పాపారావు ఎలాటి స్నేహాన్ని కనపర్చారో మళ్ళీ  అలాటి స్నేహితుడే మెడ్రాస్ లో రామచంద్రరావు రూపంలో ఘంటసాలగారికి లభించాడు. ఘంటసాలవారికి సావిత్రిగారితో వివాహమయ్యాక తొలిసారిగా మెడ్రాస్ లో కొత్త ఊళ్ళో, కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టినప్పుడు ఆవిడకు కూడా వంటా-వార్పు నేర్పి ఇంటిపనులలో చేదోడు వాదోడుగా వుండేవారట. 

ఘంటసాలగారి నెం.35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ లోకి మేము రాకముందు అందులో పామర్తిగారు ఉండేవారు.

ఔట్ హౌస్ ముందు పామర్తిగారితో నాన్నగారు

వారి స్వగ్రామం ఘంటసాలవారి స్వగ్రామమైన చౌటపల్లి సమీపంలోని సిధ్ధాంతం. జీవనాధారం లేక ఘంటసాలవారిని ఆశ్రయిస్తే, ఆయనకు డోలక్ వాయిద్యాన్ని సమకూర్చి దాన్ని వాయించే నైపుణ్యం సంపాదించుకునే దారి కూడా చూపారు. 1950లో వచ్చిన లక్ష్మమ్మ కధలో ఘంటసాలవారి పాటను  పాడుతూ రుక్మిణి (ప్రఖ్యాత నటీమణి లక్ష్మి తల్లిగారు) నృత్యానికి నట్టువాంగం చేస్తూ పామర్తి తెరమీద కనిపిస్తారు. 
ఆనాటినుండి ఘంటసాలవారికి సహాయకుడిగా పనిచేశారు. పామర్తిగారి పేరు కూడా వేంకటేశ్వరరావు. ఆయనకు మొదటినుండి స్వతంత్రంగా సినీమాలకు సంగీత దర్శకత్వం వహించాలనే తపన వుండేది. ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేసేవారు. (ఇక్కడ, యీ 'వేంకటేశ్వర' నామం మీద ఒక సందేహం. నా భాషాజ్ఞాన పెంచుకోవలని ఈ ప్రశ్న. వేంకటేశ్వర అని రాసేప్పుడు 'వె' కు దీర్ఘం ఇస్తారు. మరి, అదే 'వెంకట, వెంకట్రావు, వెంకట్' అన్నప్పుడు ఆ 'వె' కు ఎందుకు దీర్ఘం ఉండదో?)

నేను పుట్టి పెరిగిన వాతావరణానికి, యీ ఇంటి వాతావరణానికి చాలా తేడా. ఈ పరిసరాలకు అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. ఆనాటికి, ఆ కాంపౌండ్ అంతటికీ ముగ్గురే పిల్లలం. నేను, మా పెద్ద చెల్లెలు రమణమ్మ, ఘంటసాలవారింట్లో వారి పెద్దబ్బాయి, విజయకుమార్ (అసలు పేరు ఇంకేదో వుంది 'సుబ్రహ్మణ్య' కూడా కలుస్తుంది. నిజానికి ఈ కుర్రవాడు రెండవవాడు. మొదటి సంతానం 1950లో పుట్టిన వారం రోజులలోనే ఋణానుబంధం త్రెంచుకొని, ఆ దంపతులకు గర్భశోకం మిగిల్చాడు).

ఇంట్లో ఏమీ తోచేదికాదు. మా రమణమ్మ నాకంటే ఏడేళ్ళు చిన్నది. తనతో ఆడుకునే అవకాశంలేదు, ఎత్తుకొని ఆడించడం తప్ప. వెనకనున్న ఔట్ హౌస్ లోనుండి, గూట్లోని పక్షిలా బయటపడి వాకిట్లో ఉన్న కార్ల చుట్టూ తిరుగుతూ, గేటు బయట నిలబడి వచ్చేపోయే కార్లను, తోపుడు రిక్షాలను, ఎప్పుడో అరగంటకు ఒకసారి వచ్చి పోయే 12B (వడపళని-శాంథోమ్ రూట్) బస్సులను చూస్తూ ఆనందిస్తూండేవాడిని. మెడ్రాస్ లో అప్పట్లో - 1950-60 ప్రాంతంలో కలకత్తాలోలాగ ట్రామ్ వాహనాలు, హాండ్ రిక్షాలే అన్నీ. బస్సులు, కార్లు, బొంబాయిలోలాగ టాక్సీలు, వుండేవి. సైకిల్ రిక్షాలు, ఆటోరిక్షాలు 70ల నాటికి ఆ తరవాత వచ్చేయి.  1955 నాటికే బస్సు రవాణా, ట్రామ్ రవాణా సంస్థల మధ్య గొడవలు వచ్చి ట్రామ్ సర్వీస్ రద్దుచేసేసారట. మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో మైలాపూర్, మౌంట్ రోడ్, చైనా బజార్ వంటి ప్రాంతాలలో రోడ్లమీద ట్రామ్ బళ్ళ ట్రాక్ లు (పట్టాలు) ఉండేవి. కాలక్రమేణా రోడ్ల మరామత్తు సమయంలో ఆ పట్టాలన్నింటినీ తొలగించడం జరిగింది. ఒక మైలు రెండు మైళ్ళ లోపు ప్రయాణానికి చిన్న పిల్లలు, ముసలివారు, డాక్టర్ల దగ్గరకు వెళ్ళే గర్భిణీ స్త్రీలు లాగుడు హాండ్ పుల్లింగ్ రిక్షా మీదే ఆధారపడేవారు. ఆ రిక్షాలో ఇద్దరికే కూర్చోనే స్థలం ఉంటుంది. ఇద్దరు మనుషులను మరోమనిషి మోసుకుంటూ పోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ, కొందరికి అదే జీవనోపాధి. క్రమేపీ 1970 లు వచ్చేసరికి కరుణానిధి ప్రభుత్వం ఈ లాగుడు రిక్షాల స్థానంలో సైకిల్ రిక్షాలను రిక్షా కార్మికులకి ఉచితంగా ఇచ్చింది. (ఆ రకమైన ఉచితాల జ్ఞాపకార్ధం మౌంట్ రోడ్ మీద సైదాపేట్ లోకల్ స్టేషన్ దారిలో నిర్మించిన ఒక ఆర్చ్ (హైదరాబాద్ భాషలో 'కమాన్') మీద ఒక రిక్షా, కళ్ళజోడు, ఇత్యాది బొమ్మలుంటాయి. అలాటి లాగుడు రిక్షా తరవాత మ్యూజియం పీస్ గా మారి మెడ్రాస్ ఎగ్మూర్ మ్యూజియం లో వుండేది.

మా ఇంటికి ఎదురుగా ఒక డాక్టర్ ఉండేవారు. ఆ ఇంటి గోడకు డాక్టర్ నామగిరి అని ఉండేది. అక్కడికి చాలామంది గర్భిణీ స్త్రీలు ఈ రిక్షాలలో వచ్చివెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చేవరకూ ఆ రిక్షావాళ్ళు కాచుకునుండేవారు. వెళ్ళినవారు తిరిగి వచ్చేలోపల ఈ రిక్షావాళ్ళు తమిళం దినపత్రికలు చదువుతూండేవారు. ప్రతీ రిక్షావాడు  తప్పనిసరిగా తనకు నచ్చిన దిన పత్రికను చదవతూండడం చూసేవాణ్ణి. ఆ రోజుల్లో దేశం మొత్తం మీదే  అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయేవి మలయాళం దిన పత్రికలు, ఆ తరువాత తమిళ భాషా దినపత్రికలు. మిగిలిన భాషా దిన పత్రికల సర్కులేషన్ మలయాళ, తమిళ పత్రికలలో సగమే. దీనికి అక్కడి ప్రజలలోని అక్షరాస్యత,  రాజకీయ చైతన్యమే ముఖ్యకారణం. పత్రికా పఠనమయ్యాక   వక్క, పొగాకు, సున్నంతో తామలపాకులు, బీడీల పనిబట్టేవారు. కుంభకోణం వెత్తలై - వెట్రిలై (తమలపాకు) చాలా ప్రసిధ్ధి. ఈ తాంబూలసేవన ప్రక్రియ చాలా సమయమే తీసుకునేది. ఆ సరంజామా అంతా రిక్షావాళ్ళ నడుము దగ్గర లుంగీ మడతల్లోనే వుండేది. ఇదంతా నాకు వింతగా ఒక వేడుకగా వుండేది. వాళ్ళు మాట్లాడే మాటలు క్రమంగా అర్ధం అవడం ప్రారంభించాయి. మెడ్రాస్ లో వాళ్ళు మాట్లాడే తమిళం కాస్త సంకరం. స్వఛ్ఛమైన, ఉన్నతమైనది తమిళంగా మిగిలిన రాష్ట్ర ప్రజలు గుర్తించరు.  ఆ భాష, యాస మిగిలిన వారి దృష్టిలో అంత ఉన్నతమైనది కాదు. తిరుచ్చి, తంజావూరు, మదురై ప్రాంతాల తమిళమే శుధ్ధమైన తమిళమనే వాదన ఉంది. దేశంలో అన్ని ప్రాంతాలలోలానే ఈ మద్రాస్ రాష్ట్రంలో కూడా ఒక్కో ప్రాంతానికి ఒక్కో యాస. కోయంబత్తూరు ప్రాంతంలో ఒకలా, తిరునల్వేలి, కన్యాకుమారి ప్రాంతాలలో ఒకలా మాట్లాడతారు. ఇన్ని రకాల యాసలు వంటబట్టించుకోవడం కష్టమే. మన దేశంలోని అన్ని భాషల్లాగే తమిళం కూడా భ్రష్టు పట్టిపోతోందని, పరభాషా వ్యామోహంతో పెద్దలే తమ పిల్లలకు కనీస తమిళ భాషా జ్ఞానం కూడా లేకుండా చేస్తున్నారని తమిళ భాషాప్రియులు వాపోతుంటారు. ఆధునిక సినీమాలు,  టెలివిజన్ కార్యక్రమాలు అభివృద్ధి చెందాక స్పష్టమైన తమిళం మాట్లాడేవారే కరువైపోతున్నారని, ప్రాధమిక పాఠశాల స్థాయి నుండే ప్రతీ విద్యార్ధికి అరుణగిరినాదర్ వ్రాసిన తిరుపుగళ్ (15 వ శతాబ్దం) ఆధ్యాత్మిక గ్రంధం, 5వ శతాబ్దానికి ముందే తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ (ధర్మార్దకామమోక్షాలు గురించి సూక్తులు) ద్విపదలు పాఠ్యాంశాలుగా పెట్టి చిన్నవయసునుండే పిల్లలకు వాటి మీద అవగాహన కల్పించాలని, అప్పుడే పిల్లలు స్వఛ్ఛమైన తమిళ ఉచ్ఛారణ చేయగలుగుతారని, తమిళ భాష సజీవంగా దృఢంగా నిలుస్తుందని భాషావేత్తలు ప్రభుత్వానికి సలహాలిస్తుంటారు. కానీ వినేదెవరని, చెవిటివాడి ముందు శంఖమేనని వాపోతుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలలోని భాషాపరంగా అందరు సంప్రాదయవాదుల ఆవేదన ఈ విషయంలో ఒకటే.  నేటి చదువులన్ని జీవనోపాధి కోసమే. భాషాజ్ఞానం, భాషౌన్నత్యం అనే భావాలు ఏనాడో ప్రాధాన్యతను కోల్పోయాయి.

మరీ, తప్పనిసరైతే తప్ప మాస్టారింట్లోకి తరుచూ వెళ్ళి ఇంట్లోవారికి ఇబ్బంది కలిగించకూడదని మా నాన్నగారు చేసిన హెచ్చరికవల్ల ఘంటసాలవారింటి లోపలికి వెళ్ళడానికి సంకోచించేవాడిని. 

ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు వీధి వరండా మీద ఘంటసాలవారి పెద్దబాబు కనపడడం, మెల్లగా మాటలు కలపడం జరిగింది. అతను తెలుగులోనే మాట్లాడాడు. హమ్మయ్య, మాట్లాడేందుకు ఒక తెలుగువాడు దొరికాడని సంతోషమేసింది. వయసురీత్యా అతను నాకంటే ఐదేళ్ళు చిన్న. నాలో వయసుకు తగ్గ ఎదుగుదల కనపడేదికాదు. ఇద్దరమూ ఒకే వయసువాళ్ళం  అన్నట్లుండేది. పెద్దవాళ్ళంతా ఎవరి పనులమీద వారున్నప్పుడు, ఎవరూ చూడకుండా మెల్లగా వెనక వేపునుండి ఘంటసాలవారింట్లోకి వెళ్ళడం ప్రారంభం అయింది. ఒకరోజు ఉదయం బాబూ వాళ్ళ నాన్నగారు (ఘంటసాలవారి గురించి చెప్పుకున్నప్పుడల్లా మా ఇంట్లో వారందరం ఇలాగే సంబోధించేవాళ్ళం) బయటకు వెళ్ళిపోయాక పెద్దబాబును ఆడుకుందికి రమ్మని పిలవడానికి వెనక హాలుకి వెళ్ళాను. అప్పుడు అక్కడ బాబూ వాళ్ళమ్మగారు (సావిత్రమ్మగారు) అతనికి బట్టలు తొడిగి తల దువ్వుతున్నారు. నేను దగ్గరకు వెళ్ళి 'ఏమోయ్! రావోయ్, ఆడుకుందాం' అంటూ పిలిచాను. అందుకు, వాళ్ళ అమ్మగారు 'ఎందుకోయ్', 'ఎక్కడికోయ్' అంటూ ఆటపట్టించారు. నా మాటల్లో తప్పేముందో తెలియలేదు. ఆనాటి దాకా నేను పెరిగిన ఊళ్ళలో అందరూ స్నేహితులను 'ఏమోయ్' అనే పిలువడం వల్ల నాకూ అదే అలవాటయింది. మరీ, సన్నిహిత మిత్రులైతే 'ఒరేయ్', అని 'వాడూ, వీడూ' అని పిల్చుకునేవారు. నేను మాత్రం ఇంతవరకూ ఎవరిని 'ఒరేయ్' ' ఒసేయ్' అని పిలవలేదు, ఇంట్లోని పిల్లలతో సహా. బాబూ వాళ్ళమ్మగారు అలా ఆటపట్టించడం నాకు చిన్నతనంగా అనిపించి మారుమాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయాను. మరొకరోజు, నేను బయట వాకిట్లో నిల్చొని వచ్చేపోయే వాహనాలు చూస్తుండగా ఎవరో వచ్చి 'ఘంటసాలగారున్నారా' అని అడిగారు. ఆ వచ్చినవారెవరు, పేరేమిటి, ఎందుకోసం వచ్చారని? అడిగి తెలుసుకునే జ్ఞానం వుండేది కాదు అప్పట్లో. సరాసరి లోపలకు వెళ్ళాను చెప్పడానికి. అక్కడ బాబూ వాళ్ళమ్మగారు (సావిత్రమ్మగారు) కనిపించారు. ఎవరో వచ్చారని చెపితే సరిపోయేది. అది మానేసి 'వారున్నారాండీ' అని అడిగాను. 'ఎవరా వారు'? తిరుగు ప్రశ్న. నా మాట తడబడింది. మళ్ళీ 'ఆయన లేరాండీ' అని అడిగాను. 'ఎవరా ఆయన'? మళ్ళీ ప్రశ్న. నా నోట తడారిపోయింది. ఆవిడ ధోరణికి ఆవిడ ఎదట పడాలంటే నాకు భయం పట్టుకుంది. మెల్లగా అక్కనుండి తప్పుకున్నాను. ఆ వచ్చినాయనకు మరెవరో సమాధానం చెప్పిపంపడం జరిగింది. ఈ సంఘటన తరువాత  చాలాకాలం పాటు బాబూ వాళ్ళ అమ్మగారి ఎదుటపడే ప్రయత్నం చేయలేదు. మా ఇంట్లోనే గడపడం మొదలెట్టాను. ఇంట్లో ఉంటే పాత క్లాసు పుస్తకాలు చదవమని లేకపోతే కొత్త స్కూల్లో పాఠాలు అర్ధం కావని మా అమ్మగారు పోరుతూండేది. పుస్తకం తీసేసరికి ఎక్కడినుండో మా రమణమ్మ వచ్చి ఆ పుస్తకం లాగేయడమో, గిల్లడమో, కొరకడమో చేసేది. వద్దని ఏమాత్రం వారించినా గుక్క తిప్పుకోకుండా ఏడుపు మొదలెట్టేది. ఆ ఏడుపును మాన్పించడానికి పెద్దలు నానా యాతనా పడేవారు. మా రమణమ్మకు చిన్నప్పడు చిలిపితనం ఎక్కువే. విజయనగరంలో వున్నప్పుడే తన కంటే పెద్దదైన మంగమాంబను, చిన్నదైన జ్యోతిని కొరకడం, జుత్తుపట్టుకు పీకడం వంటి చేష్టలన్నీ చేసేది. "దొడ్డా! రమణమ్మ కొరికింది, జుత్తుపీకింది" అంటూ  అంబిక ఏడుపు లంకించుకునేది. జ్యోతికి ఏడవడం తప్ప మాటలు రావు అప్పటికి. వాళ్ళు ఏడుస్తూంటే తానంతకంటే గాఠిగా ఏడుపు లంకించుకునేది. అలాటి పిల్లను ఎత్తుకొని ఆడించడం, ఉయ్యాలూపి నిద్రపెట్టడం వంటి పనులలో మా అమ్మగారికి సహాయం చేసేవాడిని. అలాటప్పుడు ఆ గిల్లుళ్ళు, జుత్తు పీకించుకోవడం అనుభవైకవేద్యమే. పెద్దవాడిని కదా! "చెల్లి చిన్నదిరా, సద్దుకుపోవాలి" అనేవారు. అలా అన్నిటికీ సద్దుకుపోవడం అలవాటయింది.

మెల్లగా, ఘంటసాల వారింటి వ్యక్తులతో పరిచయాలు కలిగాయి. తరుచూ , "తాతా!", "పాపా!" అంటూ ఎవరో ఎవరినో పిలవడం వినబడేది. కానీ ఆ తాతగారు కానీ, ఆ పాప కానీ నాకంట పడనేలేదు. 

ఆ విషయాలన్నీ వచ్చేవారం....

                ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, October 30, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నాలుగవ భాగం

30.10.2020 - శుక్రవారం భాగం - 4*:
అధ్యాయం 2  భాగం 3 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

రంగయ్యర్ స్ట్రీట్ లో వున్నప్పుడే, మా నాన్నగారు ఒకసారి నన్ను మాత్రం ఘంటసాలవారింటికి వెళ్ళి ఆయనకు పళ్ళు, పువ్వులు ఇచ్చిరమ్మని పురమాయించారు. ఎందుకో తెలియదు. కానీ, యిప్పుడనిపిస్తోంది, ఆరోజు ఘంటసాలవారి పుట్టినరోజు డిసెంబర్ 4 అయ్యుండచ్చు. అంతేకాకుండా, నేను స్వతంత్రంగా బయటకు వెళ్ళి పనులు చేసుకురావడం అలవాటు చేసుకోవాలనే ఉద్దేశమైనా కావచ్చు. ఆరోజు ఉదయాన్నే వెళ్ళి ఘంటసాలవారికి పళ్ళు‌, పువ్వులు ఇవ్వడానికి బయల్దేరాను. శుభ్రమైన తాజా పళ్ళు, పువ్వులు రంగనాధన్ స్ట్రీట్ పక్కనున్న 'శివ-విష్ణు' కోవెల దగ్గర పెట్టుకొని అమ్ముతూంటారని అక్కడికి వెళ్ళి కొనమని సూచనలిచ్చారు. ఆ శివ-విష్ణు ఆలయం టి.నగర్ బస్ స్టాండ్ దగ్గరగా ఉంటుంది. మా ఇంటి సందు చివర ఉత్తర దక్షిణాలకి మెయిన్ రోడ్డు - ఉస్మాన్ రోడ్ దగ్గర ఎడమవేపు వెళితే నెం.35, ఉస్మాన్ రోడ్ ఘంటసాలవారి స్వగృహం. కుడి వేపుకు వెళితే టి.నగర్ బస్ స్టాండ్. ఆ కోవెలను వెతుక్కుంటూ వెళ్ళాను మంచి అరటి పళ్ళు కోసం. సమయం ఉదయం 7-8 గంటల లోపు. ఆ రోజుల్లో, ఉస్మాన్ రోడ్ కు రెండువైపులా దట్టమైన చెట్లు వాటి మధ్యనుండి సన్నగా ప్రసరించే సూర్యకిరణాలతో, సుమారు ఐదు మైళ్ళ దూరాన ఉన్న సముద్రం మీద నుండి వీచే చల్లని గాలులతో, కొంచెం దూరాన కనిపించే శివ-విష్ణు ఆలయంనుండి వినవచ్చే ఘంటానాదంతో, సమీపానవుండే దుకాణాల దగ్గర అమ్మకానికి పెట్టిన పువ్వులు, అగరొత్తుల సుగంధ పరిమళాలతో ఆ ఉదయపు వాతావరణం ఇప్పటికీ నా కళ్ళముందు మెదులుతూనే వుంటుంది. 

రంగనాధన్ స్ట్రీట్ ముందునే వున్న 'నాధన్స్ కేఫ్', దానికి ఎదురు ప్లాట్ ఫారమ్ మీద వున్న 'శ్రీ దేవీ హోటల్' ల నుండి వచ్చే ఫిల్టర్ కాఫీ పరిమళాలు కాఫీ ప్రియులను ఉత్తేజపర్చి రారమ్మని ఆహ్వానిస్తూంటాయి, ఆ హోటల్స్ లోని రేడియోలలో వచ్చే భక్తిగీతాల నడుమ. అసలు, తెల్లవారుజామున రైల్లో మెడ్రాస్ పరిసరాలు తండియార్పేట, కొరుక్కుపేట స్టేషన్ల కు వచ్చేసరికి ముందుగా స్వాగతం పలికేది అప్పటికే తెరవబడిన సమీపంలోని హోటల్స్ నుండి వీచే శ్రేష్టమైన ఫిల్టర్ కాఫీ పరిమళమే. ఆనాటికి ఇంకా మద్రాసు నగరానికి వచ్చేవారికి స్వాగతం పలికే కూవమ్, అడయార్ నదులు వాటికి అనుసంధానంగా సెంట్రల్ స్టేషన్ ఆనుకుని ప్రవహించే బకింగ్ హాం కాలువలు దుర్గంధభూయిష్టం కాలేదు కనుక. ఆనాటికి బకింగ్ హాం కాలువలో ప్రవాహం ఉండేది. విజయవాడ దాకా పడవలలో కట్టెలు, ఉప్పు ఇతర వస్తువుల జలరవాణా ఉండేది. అర్బనైజేషన్ ఫలితంగా చెఱువులు, నదీతీరాలని మింగేసి వర్షాకాలంలో మానవ ఆవాసాలను చెఱువులు, కాలువలు, నదులుగా మార్చేసే భూబకాసురులను తయారుచేసిన రాజకీయం మొదలవలేదప్పటికింకా. 

మొత్తానికి ఫిల్టర్ కాఫీతోనే మెడ్రాస్ కు తెల్లవారుతుంది (నిజానికి నాకు టీ, కాఫీల వ్యసనం లేదు. పాలంటే అసలే పడదు). 

మెడ్రాస్ లో లోకల్ ట్రైన్స్ ఇటు బీచ్ నుండి, అటు తాంబరం నుండీ ఉదయం నాలుగు గంటలకే బయల్దేరుతాయి. షిఫ్ట్ లు ఎక్కే, దిగే ఫ్యాక్టరీల కార్మీకులు, ఉద్యోగులు, హోల్ సేల్ కొత్వాల్ బజార్లో కూరలు, ఫ్లవర్ బజార్లో పువ్వులు అమ్మకానికి కొనుక్కునే చిల్లర వ్యాపారస్తులతో అంత ఉదయాన్నేకూడా లోకల్ ట్రైన్స్ నిండుగానే వుండేవి.  తెల్లారేలోపే ప్రతీ ఇంటి ముంగిటా చక్కటి ముగ్గులు పెట్టే అరవ మామిలు దర్శనమిచ్చేవారు. దుకాణాలన్ని ఏడింటికే తెరిచేసేవారు. వీరందరికీ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించేది పరిమళభరిత ఫిల్టర్ కాఫీయే. భేష్ భేష్.

సంస్కృతీ సంప్రదాయాలకు, కళలకు, సంగీత సాహిత్య గోష్టులకు నిలయం మద్రాసు మహానగరం అని ఇక్కడి తెలుగువారు కూడా గర్వంగా చెప్పుకుంటారు. పేదవారు, మధ్య తరగతి వారు, లక్షాధికార్లు, కోటీశ్వరులు,  యిలా అన్ని తరగతులవారు బ్రతకడానికి తగిన  ఆశ్రయమిచ్చే మహానగరం మెడ్రాసే అని అనేవారు. మెడ్రాస్ జీవితానికి అలవాటు పడినవారు చచ్చినా ఈ వూరు వదిలిపెట్టరని ప్రముఖ రచయిత్రి 'ప్రమదావనం' మాలతీ చందూరు గారు అనడం నేను స్వయంగా విన్నాను. ఆ విధంగానే చందూరు దంపతులు చివరి వరకూ మద్రాస్ మహానగరంతోనే మమేకమై ఉండిపోయేరు. ఆనాటి స్థితిగతులు అన్నీ ఈనాడు కానరాకున్నా, కొన్ని మంచి పాత వాసనలు 'చెన్నై మానగరా'న్ని ఇంకా అంటిపెట్టుకుని వున్నాయి. 

'శివ-విష్ణు' ఆలయం దాకా వెళ్ళనక్కరలేకుండానే మధ్యలోనే రామనాధన్ స్ట్రీట్ సమీపంలో ఒక తోపుడుబండి మీద శ్రేష్టమైన అరటిపళ్ళ పెడలు పెట్టి కనిపించాయి. నాకు తాజాగా అనిపించిన పళ్ళను కొని చేతిలోని డబ్బులను వాడిముందు చాచాను. ఎంత ఏమిటి అని బేరాలాడడానికి భాష తెలియదు. ఆ బండివాడే తనకు రావలసిన డబ్బులు నా చేతిలోంచి తీసుకున్నాడు. ముప్పావలా. 

నేను కొన్నఖరీదైన అరటిపళ్ళను అరవంలో 'మలవాళపళం' అంటారు. ఆ అరవ బండివాడు అలాగే అరుస్తున్నాడు. కాని అసలైన ఆ అరవ పదాన్ని పలికే పద్ధతి తర్వాత తెలిసింది. అరవ భాష ప్రత్యేకత ఆ '''' కార శబ్దంలో ఉంది. అది వినడానికి అలవాటుపడి కొంత సాధన చేస్తేకాని పట్టుబడదు. నిజానికి అరవలలో కూడా ఆ శబ్దం పలుకు పట్టుబడని వారున్నారు. తెలుగులో కూడా ఈ శబ్దానికి ఒక సంకేతాక్షరం - బండి ఱ రూపంలో ఉండేదని కాలక్రమంలో దాని అవసరం పోయి కనుమఱుగై పోయిందంటారు. ప్రస్తుతం మన టీవీ వ్యాఖ్యాతల ధర్మవాఁ అని కాలక్రమంలో ణ, ళలకి  కూడా అదే గతి పడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంగ్లీషు F కి సమానంగా తెలుగులో అక్షరం లేదు ఆ శబ్దంతో మనకి పదాలూ లేవు. అంచేత Fruit అన్న పదంలో మనం Fకి సమానంగా ఫ వాడతాం, ఫ్రూట్ అని రాస్తాం అవసరమైనప్పుడు. కానీ అదే అలవాటుగా మార్చుకుని ఫ అన్న అక్షరం వచ్చే తెలుగు పదాలని ఇంగ్లీష్ F శబ్దానికి సమనంగా పలుకుతూ ఫలం లాంటి పదాలను Faలం, ప్రతిఫలానికి ప్రతిFaలం అనే వారూ తయారయేరు.  మరలాంటప్పుడు తెలుగు కీ బోర్డ్ లో  ழ  అనే అక్షరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని అంతలా  నిరసించడం ఎందుకో అర్థం కాదు. అది ఏ విధంగా తెలుగు భాషకి వినాశనకారో భాషావేత్తలకే  తెలియాలి. 

తమిழ், అన్బగన్, కనిమొழி   లాంటి పదాలలోని శబ్దం ళ కాదు అది మరొకలా పలకాలన్నది, కార అక్షరం గాని, దానికి సమానంగా గతంలో తెలుగులోనే ఉండిన అక్షరాన్నిగాని, కీ బోర్డ్ లో అందుబాటులో పెడితే  జిజ్ఞాసువులైన ఇతర భాషలవారు తెలుసుకోడానికి వీలుగా ఉండేది. కానీ మన భాషావేత్తలు అలా ఆ ழ అక్షరం కీ బోర్డ్ లోకి చేర్చినంత మాత్రానే తెలుగు లెస్స కాదు లెస్ అయిపోతుందని ఎందుకనుకున్నారో మరి. 

సరే, ఇంతకీ నేను కొన్నది  'మలైవాళపళం' కాదు మలైవామ్. చాలా రుచికరం. మిగతా అరటిపళ్ళ కన్నా ఆరోగ్యకరమట, ముఖ్యంగా, డైబిటిస్ పేషంట్లకి. ఆ పళ్ళతొక్కలు కూడా తినాలని కొందరు సలహా ఇచ్చారు!

సరే, ఆ పళ్ళను ఒక చేతి సంచిలో పెట్టుకొని నార్త్ ఉస్మాన్ రోడ్ లోని ఘంటసాలవారింటికి వెళ్ళడానికి వెనుదిరిగాను. అసలు, నాన్నగారేమంటారోనని ఘంటసాలవారింటికి వెళ్ళడానికి సిద్ధపడ్డానుకాని, అక్కడ ఎవరుంటారో ఏం అడుగుతారో నేనేం చెప్పాలోనని ఒకటే భయం, గుండె దడ. నాకెందుకీ బెడద పెట్టారో అని దిగులు. సుమారు పది నిముషాల నడక తర్వాత ఆ ఇంటి ముందున్నాను. ఇంటిముందు ఒక పిట్టగోడకు ఎడమ‌, కుడివేపుల నలుపలకలుగా రెండు  స్తంభాలు. వాటి మధ్య ఇనపగేటు. దానికి ఎడమవేపు తెల్లటి మార్బుల్ రాతిమీద 'ఘంటసాల' అని తెలుగు, ఇంగ్లీష్ లలో నల్లటి అక్షరాలు. కుడివేపు గుండ్రటి నల్లటి  పెయింట్ మధ్య '35'. అదే తూర్పుముఖంగా చాలా గంభీరంగా, పాత తరహా రాజభవనంలా ఎత్తుగా ఉన్న 'నెం.35, ఉస్మాన్ రోడ్'.

మొట్టమొదటిసారి ఒంటరిగా ఎవరి తోడు లేకుండా  కాళ్ళు వణుకుతుండగా భయం భయంగా లోపలికి అడుగుపెట్టాను. నిజానికి ఆ భయానికి అర్ధంలేదు. అయినా ఎందుకంటే ఏం చెప్పలేను. ఆ ఇంటి బాల్కనీ గోడమీద నడుం మీద చేతులు పెట్టుకుని ఎడమవేపుకి తల పైకెత్తి నిలుచుని ఉన్న స్త్రీ మూర్తి విగ్రహంతో ఆ ఇల్లు చాలా ఆకర్షణీయంగా కనిపించింది. నేను 1955లో మొదటిసారి చూసినప్పుట్నుంచి మరో పది పదిహేనేళ్ళు ఆ ఇంటి స్వరూపం మారలేదు.

1955 లో మొదటిసారి నేను చూసిన ఘంటసాలగారిల్లు

మేడ మీది ఆరుబయలు ప్రదేశాన్ని బాల్కనీ అంటారని అప్పుడే తెలుసుకున్నాను. గేటు దాటి కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక పెద్ద నల్లటి కారు కనిపించింది. అలాటి నల్లటి కారు బొబ్బిలిలో రాణీగారు వెళుతూండగా చూశాను. అది ఎప్పుడు చూసినా తళతళ మెరుస్తూ కొత్తదిగా వుండేది. ఈ కారు పాతదిగా మరో రకంగా ఉంది. ఆ కారు పక్కన ఒక సన్నపాటి సిమెంట్ అరుగు. దాని వెనక సిమెంట్ నేలతో కొంత ఖాళీ స్థలం. అక్కడే కారు నిలుపుతారట. అలాటి స్థలాన్ని పోర్టికో అని తెలుసుకున్నాను. పొడుగుపాటి మూడు మెట్లు ఎక్కాక, ముదురాకుపచ్చ మీద తెలుపు నలుపు రంగుల చుక్కలున్న మొజైక్ ఫ్లోరింగ్ తో అడుగు, అడుగున్నర ఎత్తులో వరండా. అలాటి ఆకర్షణీయమైన ఫ్లోరింగ్  తరువాత మరెక్కడా నేను చూడలేదు. (నేను సొంతిల్లు కడితే అలాటిదే అలాటి ముదురాకుపచ్చ, తెలుపు, నలుపు కలసిన ఆ ఫ్లోరింగ్ నే వేయించాలని కలలు కన్నాను. ఇల్లైతే కట్టగలిగాను కానీ, అలాటి ఫ్లోరింగ్ కు నోచుకోలేదు.) ఎడమచేతివేపు ఒక కిటికి అక్కడ ఒక నలుగురు మనుషులు కూర్చునేలా పెద్ద కర్రబల్ల. ఎదురువేపు కిటికీ ముందు రెండు కుర్చీలు. పోర్టికోలో నిల్చొని తీసివున్న వీధి తలుపు ద్వారా లోపలికి చూస్తున్నాను ఎవరైనా కనిపిస్తారేమోనని. మనిషి అలికిడేలేదు. పోర్టికోకు రెండువేపులా సందులున్నాయి ఇంటి వెనకవేపుకు వెళ్ళడానికి. మెయిన్ డోర్ తెరిచే ఉంది. ఎక్కడా ఎవరూ కనబడలేదు. ఎటునుండి లోపలకు వెళ్ళాలో, ఎలా పిలవాలో తెలియక నిలబడి చూస్తూన్నాను. కొంతసేపటికి, వెనక పెరటివేపు ఒకావిడ కనిపించారు. నన్ను లోపలికి రమ్మని సంజ్ఞ చేశారు. అంతా గాభరా, కంగారుగా అనిపించింది. అక్కడెవరిని చూశాను, ఎంతమందిని చూశానో తెలియదు. మా నాన్నగారు ఈ పళ్ళు ఇవ్వమని చెప్పారని చెప్పి సంచీలోని పళ్ళు అక్కడ పెట్టేసి, వెనక్కి తిరిగి చూడకుండా బయటకి పరుగులంకించుకున్నాను. అప్పుడు అక్కడెవారున్నరో, ఏం అడిగారో నేనేం చెప్పానో నాకు తెలియదు. ఘంటసాలగారూ అక్కడే ఉన్నారో ఏమో, చూశానో లేదో కూడా తెలియదు. పెద్ద భారం దింపినంత హాయిగా అనిపించింది. రోడ్ మీదకు వచ్చేసాక. మరోసారి 'ఘంటసాల' పేరున్నమార్బల్ పలకని, '35' నెంబర్ ను చూశాను. అదీ నా మొదటి నెం.35, ఉస్మాన్ రోడ్', ఘంటసాలవారింటి అనుభవం.

ఈసారి ఇంటికి వెళ్ళేప్పుడు దక్షిణం వేపునున్న  ఉస్మాన్ రోడ్ కు  రెండు పక్కలా ఉన్న వీధుల పేర్లు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాను. అప్పట్లో ప్రతీ వీధి ముందు, చివర ఒక ఆరడగుల సిమెంట్ స్తంభం మీద సిమెంట్ పలక, దానిమీద సిమెంట్ తోనే వీధి పేర్లు ఇంగ్లీష్ లో వుండేవి. మొదట్లో వాటిని చదవడానికి కష్టంగానే వుండేది. ఘంటసాలగారింటికి ఎదురుగా 'వ్యాసారావు స్ట్రీట్' (ఆ వీధికి చాలా ప్రాశస్త్యం వుంది. ఆ విషయాలు తరవాత మరోసారి), ఆ వీధి తరవాత దక్షిణం వేపు, అంటే, పనగల్ పార్క్ మా ఇంటికెళ్ళే వేపు వరసగా 'మురుగేశ మొదలియార్ రోడ్', 'కోట్స్ రోడ్', 'నాదముని స్ట్రీట్', 'గోవిందన్ స్ట్రీట్, 'ప్రకాశం రోడ్' ఆ తరవాత పనగల్ పార్క్ ఉన్నాయి. గోవిందన్ స్ట్రీట్ ప్రకాశం రోడ్ మధ్య బర్మాషెల్ పెట్రోల్ బంక్. ఇక, ఘంటసాలగారింటి వరసలో దక్షిణాన మొదట నాదన్ స్ట్రీట్ ఎదురుగా 'వాసన్ స్ట్రీట్', గోవిందన్ స్ట్రీట్ ఎదురుగా 'గ్రిఫిత్ రోడ్', RKM శారదా విద్యాలయ గర్ల్స్ హైస్కూల్,  స్కూల్ కు ఎదురుగా విశాలమైన పచ్చటి చెట్లతో పానగల్ పార్క్. అది ఒక ఐదురోడ్ల జంక్షన్. పనగల్ పార్క్ కి పశ్చిమాన ఉస్మాన్ రోడ్, ఉత్తరాన 'ప్రకాశం రోడ్', దక్షిణాన 'నాగేశ్వరరావు పంతులు రోడ్'. పార్క్ కి ఎదురుగా తూర్పున RKM Main Boys' హై స్కూల్. హై స్కూలు కి ఆగ్నేయంగా  'వెంకట నారాయణ రోడ్'. స్కూలునానుకుని పానగల్ పార్క్  ఎదురుగా తూర్పున పాండీబజార్ (సర్ త్యాగరాయ రోడ్). దానికి ఈశాన్యంగా 'జి.ఎన్ చెట్టి రోడ్' (అంటే గోపతి నారాయణస్వామి చెట్టి రోడ్). ఈ మూడు రోడ్లు ఓ రెండు మూడు మైళ్ళు దూరాన వుండే మౌంట్ రోడ్(ఈనాడు 'అన్నాసాలై') తో కలుస్తాయి. అలాగే పార్క్ కు దక్షిణాన వున్న ఉస్మాన్ రోడ్ కూడా సైదాపేట్ దగ్గరి మౌంట్ రోడ్ లో కలుస్తుంది. పార్క్ దగ్గర ఉస్మాన్ రోడ్ లోనుండి దక్షిణం వేపు వెడుతూంటే 'దొరైసామి రోడ్'. అది దాటాక సలామ్ స్టోర్స్ , రామన్స్ కాఫీ పౌడర్ షాప్. అక్కడే పారీస్ వేపు, ట్రిప్లికేన్ కు వెళ్ళే బస్ స్టాప్.  మంగేష్ స్ట్రీట్', దానికెదురుగా 'పింజాల సుబ్రహ్మణ్యం స్ట్రీట్'. ఇక్కడే రాఘవన్ 'నెయ్యి కడై' బస్ స్టాప్. పారీస్ నుండి వచ్చే బస్సుల స్టాపింగ్. 'రంగయ్యర్ స్ట్రీట్', ఎదురుగా 'రామస్వామి స్ట్రీట్',  'రామనాధన్ స్ట్రీట్', ఎదురుగా మోతీలాల్ స్ట్రీట్', 'రంగనాధన్ స్ట్రీట్', అది దాటాక టి.నగర్ బస్ స్టాండ్ .అక్కడ ఎదురుగా బర్కిట్ రోడ్. టి.నగర్ బస్ స్టాండ్ నుండే పారీస్ కార్నర్ కు వెళ్ళే 9,10,11, బస్సులు ఐస్ హౌస్ వేపు వెళ్ళే 12 నెంబర్, ట్రిప్లికేన్ వెళ్ళే 13 నెంబర్ బస్ లు బయల్దేరుతాయి.

ఇలా,  దక్షిణ ఉస్మాన్ రోడ్ లోని ఎదురుబొదురు వీధులన్నీ చూసుకుంటూ నడవడంలో మేముండే రంగయ్యర్ స్ట్రీట్ ను దాటి ముందుకు వెళ్ళిపోయిన సంగతి టి.నగర్ బస్ స్టాండ్ ప్రాంతాలకు వెళ్ళాకగానీ తెలియలేదు. మళ్ళా వెనక్కి తిరిగి ఒక్కో వీధి పేరు చూసుకుంటూ రంగయ్యర్ స్ట్రీట్ ను పట్టుకొని ఎలాగో ఇంటికి చేరుకున్నాను.

ఆనాటికి త్యాగరాయనగర్ (టి.నగర్) లో పెద్ద పెద్ద భవంతులతో పాటు పక్కవీధులలో మధ్యతరగతి ఇళ్ళూ ఉండేవి. వీధులన్నీ వరసగా క్రమపద్ధతిలో వుంటూ విశాలమైన ప్రాంగణాలతో అంత జన సమ్మర్దం లేకుండా ప్రశాంతంగా వుండేది. పానగల్ పార్క్ దక్షిణాన ఎన్ని వీధులుండేవో అలాగే ఘంటసాలగారింటి ఉత్తరం వేపూ ఉండేవి. అది విజయా వాహినీ స్టూడియోలకి వెళ్ళే దారి, కోడంబాకం రైల్వే గేటు దాటి వెళ్ళాలి. ఉత్తర దిక్కుకి మాత్రం నేను వెళ్ళలేదు. 

నార్త్ ఉస్మాన్ రోడ్ పూర్తిగా నివాస గృహాలు. దక్షిణాన మార్కెట్లు. ఏ విధమైన షాపింగ్ చేయాలన్నా పానగల్ పార్క్ దాటి రంగనాధన్ స్ట్రీట్ కు వెళ్ళాలి. ఆ వీధి చివరనే మాంబళం రైల్వే స్టేషన్. స్టేషన్ కు అవతల వేపు పాత మాంబళం. మేముండేది కొత్త మాంబళం లేదా త్యాగరాయనగర్ . ఒకసారి ఈ టి.నగర్ ఎంత పెద్దది అని అడిగితే  మా నాన్నగారు "మన విజయనగరం కంటే పెద్దదే" అన్నారు. ఇలాటి టి.నగర్ లు ఎన్నో కలిసిన నగరం మెడ్రాస్ అని, అదొక మహానగరమని చెప్పారు.

ఎవరైనా అరవం మాట్లాడుతుంటే అది అరవభాష అని తెలుసుకునే స్థితికి ఎదిగాను. కానీ వారి మాటలైతే అర్ధమయేవికాదు. తెలుగువారి సంఖ్య వల్ల, వారి ప్రభావం వల్ల చాలామంది మద్రాసులోని చాలామంది అరవవాళ్ళకు తెలుగు అంతో ఇంతో తెలిసి ఉండేది. జట్కావాళ్ళు రిక్షావాళ్ళు తెలుగు మాట్లాడకపోయినా బాగానే అర్ధం అయేది. అందువల్లే ఆంధ్రనుంచి వ్యాపారం, కోర్టు పనులమీద వచ్చిన తెలుగువారికి వారి దైనందిన కార్యక్రమాలకి భాష వలన పెద్దగా ఆటంకం ఉండేది కాదు.  

మెడ్రాస్ లో ప్రతీ వందమందిలో ఏభైమంది తమిళులైతే, ముఫ్ఫైమంది తెలుగువారు. మిగతా ఇరవై ఇతర భాషలవారు. అయితే మెడ్రాస్ లో తరతరలుగా స్థిరపడి ఉన్న తెలుగువారి తెలుగు మాట అర్ధమవడం కష్టమయేది. అది ప్రశస్తమైన అరవ తెలుగు. 

ఘంటసాలగారు మన తెలుగువారికి మాత్రమే కాదు తమిళులకు కూడా అభిమానపాత్రులే. అప్పటికే విడుదలైన లైలామజ్ను, పాతాళభైరవి, దేవదాసు తమిళ సినీమాల పాటల ద్వారా 'కండసాల' (ఘంటసాల) తమిళ శ్రోతల మనసులలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.



నేను ఘంటసాలవారింటికి వెళ్ళి వచ్చిన కొన్ని రోజులకు, వారింట్లో చూసినావిడ  ఎవరినో తోడు తీసుకొని మా ఇంటికి వచ్చారు. వీధిలో అల్లంత దూరాన్నే వారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మగారికి చెప్పాను. వాళ్ళున్నంతసేపు నేను ఇంటిలో అడుగుపెట్టలేదు, ఆడవాళ్ళంటే వుండే మొహమాటంవల్ల.  మా కాంపౌండ్ లోని చెట్టుక్రింద చప్టామీదే కాలక్షేపం చేశాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లోకెళ్ళాను. ఆవిడ ఘంటసాలవారి తమ్ముడు భార్యట. ఆవిడను చూస్తే మా శారదక్క (దొడ్డమ్మగారి అమ్మాయి) గుర్తుకు వచ్చింది. నిజానికి ఇద్దరి మధ్యా ఏ పోలికలు లేవు. అయినా నాకలా అనిపించింది. బహుశా, సమాన వయస్కులు కావడం వల్లనేమో. 

మా నాన్నగారు నన్ను మళ్ళీ స్కూల్ లో చేర్పించి చదివించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.1956 జూన్ వరకు స్కూలులో చేరే అవకాశంలేదు. ఈలోగా అందుకు కావలసిన శిక్షణ ఇవ్వడానికి నన్ను తన స్నేహితుడైన ఆంధ్రాబ్యాంక్ విశ్వనాధం గారికి అప్పజెప్పారు. విశ్వనాధం గారు తెలుగువారే. పాండీబజార్ బ్రాంచ్ ఆంధ్రా బ్యాంక్ లో పనిచేసేవారు. అక్కడే మా నాన్నగారికి ఆయనతో పరిచయం, స్నేహం ఏర్పడ్డాయి. చాలా మంచి మనిషి. కానీ, బ్రహ్మాండమైన చెముడు. పనివేళల్లో హియరింగ్ మెషిన్ వాడేవారు. ఆయన దగ్గర నన్ను చదువుకు పెట్టారు. రాత్రిపూట వారింటికి వెళ్ళి, ఆయన చెప్పింది నేర్చుకుని, రాత్రి అక్కడే పడుక్కొని, మళ్ళీ ఉదయాన్నే ఇంటికి చేరుకోవడం. ఇలా ఎన్నాళ్ళు జరిగిందో గుర్తులేదు, కానీ, మధ్యలో ఒక రోజు విపరీతమైన వర్షం కురిసి విశ్వనాధంగారింటికి వెళ్ళడం చాలా కష్టమయింది. విశ్వనాధంగారు టి.నగర్ బస్ స్టాండ్ ఎదురుగా వున్న బర్కిట్ రోడ్ లో చివరగా ఒక పెద్ద బంగళా వెనక ఉండే ఔట్ హౌస్ లో కాపురం. భార్య, ఒక చిన్న పాప. మరీ పెద్ద ఇల్లేమీ కాదు కానీ చాలా నీట్ గా వుండేది.  వర్షం పడిందంటే మెడ్రాస్ రోడ్ల పరిస్థితి అప్పుడు, ఇప్పుడూ కూడా పెద్ద తేడా ఉన్నట్టనిపించదు. దశాబ్దాలెన్ని గడిచినా ఈ విషయంలో ఏం మార్పులేదు. టి.నగర్ బస్ స్టాండ్ నుండి హిందీ ప్రచారసభ వీధి చివరి వరకు మహాసాగరం. నడుం లోతు నీళ్ళలో అలాగే విశ్వనాధంగారింటికి చేరుకున్నాను. గురువుగారు, గురువమ్మగారు నన్ను చూసి జాలిపడ్డారు. ఈ విధమైన రాత్రిపూట చదువు విశ్వనాధం గారింట్లో ఎన్నాళ్ళు సాగిందో గుర్తులేదు. ఆయన చెప్పిన చదువు నాకెంతవరకు ఉపయోగించిందో తెలియదు. నాకు క్లాసు పుస్తకాలు చదువుతున్నంతసేపూ అంతా అర్ధమైనట్లే వుండేది. ఏ ప్రశ్నలు వేసినా సమాధానాలు బాగానే చెప్పేవాడిని. కానీ , కర్ణుడి శాపాల్లాగా పరీక్షలలో మాత్రం నా తెలివితేటలు ఎందుకూ ఉపయోగపడేవి కాదు. ఏ ప్రశ్నకు ఏది సమాధానమో, అది ఎంతవరకు రాయాలో తెలిసేది కాదు. అనవసరంగా  పేజీలకు పేజీలు కాగితాలు ఖరాబు చేయడం సమాధానం కాదనే జ్ఞానోదయం చాలా లేటుగా కలిగింది. అప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఎక్కడవేసిన గొంగడి (గొంగళి పురుగే గుర్తుకు వస్తుంది) అక్కడే.

రంగయ్యర్ స్ట్రీట్ ఇంటిలో ఉన్నది నాలుగైదు మాసాలు మాత్రమేనని గుర్తు. ఒక శుభ ముహుర్తాన మా నివాసం నెం.35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ కు మారింది. 

ఆ విశేషాలు వచ్చేవారం .....
...సశేషం



*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, October 23, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - మూడవ భాగం

23.10.20 - శుక్రవారం భాగం - 3*:
అధ్యాయం 2 భాగం 2 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

రంగయ్యర్ స్ట్రీట్ ఇంటికి వెళ్ళిన మొదటివారంలోనే మా నాన్నగారు ఒక సాయంత్రం మా అందరిని చైనాబజార్ కు తీసుకువెళ్ళారు. మెడ్రాసులో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యాపార కేంద్రం చైనా బజార్. చెన్నపట్టణంలో ఫోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మించిన కాలంలో దానికి ఉత్తరంలో ప్రస్తుతం మద్రాసు హైకోర్ట్ ఉన్నజార్జ్ టౌన్ ప్రాంతాన్ని బ్రిటీష్ వారు బ్లేక్ టౌన్ అనేవారు. కొంత కాలం ఫ్రెంచ్ వారి అధీనంలో ఉన్నా, Treaty of Aix-la-Chapelle అన్న ఒక ఒడంబడిక ప్రకారం క్విబెక్ ని వారికి అప్పగించేక ఈ చెన్నపట్టణ ప్రాంతం మళ్ళీ బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. పాండీచేరీలో మాత్రం ఇంకా ఫ్రెంచ్ వారి ప్రాభవం, ప్రభావం ఇంకా కనిపిస్తుంటుంది. బ్రిటీష్ వారి అధీనంలోకి తిరిగి వచ్చేక తమ వద్ద పనిచేస్తున్న పనివారు స్థానికంగా నివసిస్తున్న బ్లేక్ టౌన్ ప్రాంతంలో కొంత భాగం నేల మట్టం చేసి పదమూడు స్థంభాలు ఏర్పాటు చేసుకున్నారట. శత్రుదాడిని సమర్ధంగా ఎదుర్కోడానికి. వాటిలో ఒక స్థంభం  పారీ భవన సముదాయంలో నేటికీ Parry Company వారి పరిరక్షణ, పర్యవేక్షణలో ఉంది. పదమూడు స్థంభాలు శత్రుదాడి నుంచి రక్షించుకోడానికి నిర్మించినవని చరిత్రాకారుల అభిప్రాయం అయినా, అవి బ్రిటీష్ వారు కెనడా లో ఫ్రెంచ్ వారికి స్వాధీనం చేసిన క్విబెక్ సహా పదమూడు ప్రావిన్స్ ల జ్ఞాపకార్ధం నిర్మించినవేమో.

ప్రస్తుతం సెంట్రల్ స్టేషన్ పక్కనున్న వాల్ టేక్స్ రోడ్ నుంచి ప్యారీస్ కార్నర్ కి వెళ్ళే దారి NSC Bose Road. అదే ఒకప్పుడు చైనా బజార్ రోడ్. దాన్నే ఈవెనింగ్ బజార్ రోడ్ అని కూడా అనేవారు. చైనా బజార్ రోడ్డు అదే ఇప్పటి NSC Bose Road  హార్బర్ కి వెళ్ళే ఫస్ట్  లైన్ బీచ్ రోడ్డుని కలిసే మూల, మద్రాసు హైకోర్ట్ ఎదురు వేపు ఉన్న ప్యారీ కంపెనీవారి పెద్ద అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పేరు మీద అది ప్యారీస్ కార్నర్ గా ప్రసిధ్ధికెక్కింది. 

పారి మునై - పారీ మూల - Parry's Corner

ఈ ఈవెనింగ్ బజార్ రోడ్డుని చైనా బజార్ గా పిలవడానికి నాకనిపించే ఒకే కారణం ఆ రోజుల్లో బ్రిటీష్ వారు వారికి కావలసిన వంటింటి క్రోకరీ - పింగాణీ సామగ్రి కొనుగోలు చేయడానికి వీలుగా ఈ ఈవెనింగ్ బజార్ లో చైనా వేర్ (పింగాణీ సామగ్రి) అమ్మే షాపులు ఉండేవి. వాటిలో అతి ప్రముఖమైనది 1889లో పేవ్ మెంట్ షాప్ గా ప్రారంభమైన కరీంభాయ్'స్ ఈనాటికీ ఆ రోడ్డు మీద కనిపిస్తుంది. 

1889లో ఈప్రాంతంలోనే ఒక పేవ్ మెంట్ షాపు ఈ కరీంభోయ్'స్


తరవాత కాలంలో భాయ్స్ కడై అంటే భాయ్స్ కొట్టు, అరవంలో ప, బ లకి తేడాలేకపోడం వల్ల పాయ్ కడై అయింది. పాయ్ అంటే అరవంలో చాపలు (mats) అన్న అర్ధంలో. ఆ తరవాత కొంత కాలానికి ఆ ప్రాంతంలో చాపల కొట్లు కూడా ఉండడంచేత అది పాయ్ (చాపల) కడై అయిపోయింది.  

నాకు తెలిసి అరవై డెబ్భైలలో కూడా పింగాణీ సామగ్రి, బొమ్మల వాడుక ఎక్కువగానే ఉండేది. అంచేత మద్రాసు చైనా బజార్ కి చైనాతో ఏ సంబంధం లేదు, ఎత్తేస్తే ఏడు ముక్కలయ్యే పింగాణీ సంబంధం తప్ప. అలాగే ఈమధ్య హైదరాబాద్ లాంటి నగరాల్లో కనిపిస్తున్న ప్లాస్టిక్, ఫేన్సీ వస్తువులమ్మే చైనా బజార్లకి చైనా-పింగాణీ తో ఏ సంబంధం లేదు, చైనా దేశంతో కూడా. 1960 దశకం చివర బర్మా నుంచి వచ్చిన తమిళ కాందిశీకుల కోసం ఫస్ట్ లైన్ బీచ్ రోడ్ మీద వారు తెచ్చుకున్న వస్తువుల అమ్మకం కోసం వెలసినది బర్మా బజార్. కాలక్రమంలో అది తొంభైలనాటికి contraband, smuggled electronic goods, CDలు DVDలు అమ్మే  గ్రే మార్కెట్ గా మారింది. 

హార్బర్ దారి - ఫస్ట్ లైన్ బీచ్ రోడ్ - కుడివేపు ఇప్పుడు బర్మా బజార్ షాపులు - ఆరోజుల్లో ట్రాం లైన్స్ ఉండేవి 

తరవాత అదే చైనా, మలేషియా, సింగపూర్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మార్కెట్.  ఫ్లవర్ బజార్ పోలిస్ స్టేషన్ సమీపంలోని కందసామి కోయిల్, మింట్ స్ట్రీట్ మొదలు పారీస్ కార్నర్ లోని ఆర్మీనియన్ స్ట్రీట్, లింగి చెట్టి, తంబు చెట్టి, అంగప్ప నాయకన్మూర్ స్ట్రీట్ లాంటి  వీధులన్నీ వ్యాపార కేంద్రాలే. బ్రాడ్ వే, బందర్ స్ట్రీట్, సుంకురామచెట్టి, తంబుచెట్టి స్ట్రీట్ లలో ఈ చివరి నుండి ఆ చివరివరకు ఒక్కో వీధి సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరానికి అన్నీ షాపులే. ఈ తంబుచెట్టి వీధిలోనే కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి 'ఆంధ్రపత్రిక' దిన, వార పత్రికల ఆఫీస్, ప్రెస్ వుండేవి. ఆ ప్రాతమంతా మెడ్రాస్ లోని ప్రముఖ వాణిజ్య కేంద్రం. హోల్ సేల్, రీటైల్ వ్యాపార కూడలి. 


ఆసియాలోనే అతి పెద్ద కొత్వాల్ చావడి కూరగాయల బజారు 

ఆసియాలోనే అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరు పొందిన కొత్వాల్ చావడి కూరగాయల బజారు, ఫ్లవర్ బజార్ మార్కెట్ ప్రాంతం కూడా అక్కడే. ఈ ప్రాంతమంతా జార్జ్ టౌన్ గా, పాత మెడ్రాస్ గా వుండేది. ఈ ప్రాంతం సూర్యోదయం నుండి అర్ధరాత్రి వరకు జనాలతో కిటకిటలాడుతూంటుంది. తొంభైల దాకా కూడా ఈ వీధుల్లో ఇళ్ళన్నీముందు భాగం షాపులు. వెనకాల వేపు వారి కుటుంబాలు. పెద్ద పెద్ద మేడలే. పాతకాలంవి. ఆ ఇళ్ళలోకి సహజమైన గాలి, వెలుతురు ప్రవేశించే వీలే వుండదు. క్రిక్కిరిసిన వాహనాలు, జనాలతో ఆ ప్రాంతం కొత్తవారికి ఉక్కిరిబిక్కిరిగానే ఉంటుంది. నాకు అలాటి పరిస్థితే ఏర్పడింది. చైనా బజార్ ప్లాట్ ఫారమ్ మీది షాపుల్లోని వింతలన్ని అంతవరకూ నా జన్మలో చూడలేదు. (ప్రస్తుతం మెట్రో రాకతో అధునాతనంగా తయారవుతోంది ఈ ప్రాంతం అంతా). 

ఇరుకు జార్జ్ టౌన్ ప్రాంతం

అవన్నీ చూసుకుంటూ తిరగడంలో టైమే తెలియలేదు. అప్పటికి రాత్రి 8.30 గంటలైపోయింది. జన సంచారం పల్చబడింది. మేము తిరిగి ఇంటికి రావడానికి   బస్ స్టాప్ కు చేరుకున్నాము. విశాలమైన  (జనాలు లేకపోతే) ఆ రోడ్ కు రెండు ప్రక్కలా బ్రిటిష్ కాలం నాటి ఎత్తైన ఎర్రటి భవంతులను చూస్తే   ఎంత పెద్ద ఇళ్ళో అని ఆశ్చర్యం కలిగింది. అంతంత పెద్ద ఇళ్ళు, భవనాలను ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి.  మెడ్రాస్ హైకోర్ట్ ప్రాంగణం ఆనుకుని మైన్ రోడ్డు మీద పారీ'స్ కార్నర్ బస్ స్టాండ్. ప్రాంగణం లోపలే లైట్ హవుస్. ఆ ప్రహారీ గోడను ఆనుకొని 11వ నెంబర్ బస్ స్టాప్. మేముండే టి.నగర్ కు వెళ్ళే 11, 11A, 11C బస్సులు అక్కడినుండే బయల్దేరుతాయి. అందులో 11 నెంబర్ బస్సులు అధిక సంఖ్యలో వుండేవి. అప్పట్లో అన్నీ ఎఱ్ఱరంగు ల్యాలెండ్ కంపెనీ బస్సులే వుండేవి. 

ఆరోజుల్లో వీధిదీపాలకి కూడా incandescent బల్బులే ఉండేవి. ఇప్పటిలా ట్యూబ్ లైట్లో, సోడియం వేపరో, ఎల్ఇడి బల్బ్ లో కావు కదా. మామూలు ఇళ్ళలో వాడే బల్బ్ లే. పదిహేను ఇరవై అడుగులు ఎత్తుండే ఆ దీప స్థంభాలు '?' షేపులో పైభాగం వంపు తిరిగి కిందికి చూస్తున్నట్టు నిలబడివుండేవి. 


వాటి డూములు/షేడ్ పైవేపు ఆకుపచ్చగా లోపల వేపు తెల్లగా కోటింగ్ వేసి వుండేవి. 

ఈ లైట్ లకి డూమ్/షేడ్ లు ఎందుకంటేట, ప్రపంచయుధ్ధ కాలంలో రాత్రిపూట శత్రు సైనికుల విమానాలకు క్రింద అక్కడ వూళ్ళున్నాయని తెలియకుండా వుండడానికి వీధి దీపస్థంభాలకు ఆ డిస్క్ లు తగిలించారని అనేవారు!? నిజానికి యుధ్ధవిమానాలు దాడే జరిగితే వీధిలైట్లు, ఇళ్ళలో లైట్లు ఆర్పేసి blackout చేసి పూర్తిగా అంధకారంలోనే గడిపేవారట. అటువంటి యుధ్ధవాతావరణంలో 1942 లో మా నాన్నగారు మెడ్రాస్ లో కొన్ని మాసాలున్నారట. 'అమ్మ బాబోయ్! ఎలా వున్నారో' అని అనుకున్నాను. అయితే, నేను పుట్టిన సంవత్సరంలోనే రెండవ ప్రపంచయుధ్ధం ముగియడం వల్ల నాకు ఆ విషయాలేవీ తెలియవు. కాకపోతే, నాకు కొంత జ్ఞానం వచ్చిన తరువాత కూడా నిత్యవసర వస్తువులకి రేషన్ ఉండడం, సులభంగా దొరకకపోవడమనేది గుర్తుంది. 

ప్యారీస్ కార్నర్ వీధి పొడుగునా దీపాలున్నా దట్టమైన చెట్ల మధ్య ఆ గుడ్డి దీపాలకాంతి అంతగా తెలియలేదు. వుండీ వుడిగీ లైట్ హౌస్ మీది రొటేటింగ్ ల్యాంప్ కాంతి మీద పడేది. (విశాఖపట్నం డాల్ఫిన్స్ నోస్ కొండమీది లైట్ హౌస్ దీపపు కాంతి దీనికంటే చాలా ఎక్కువట. సముద్రంలో చాలా దూరం వరకూ కనిపిస్తుందనుకునేవారు). టూరిస్టులు మద్రాసు లైట్ హౌస్ మీదకు వెళ్ళి వూరంతా చూడడానికి వీలుండేది అప్పట్లో, పగటిపూట. టికెట్ కొనుక్కుని. నేను కూడా చాలాసార్లు అలా  పైకి ఎక్కి చూశాను. ఇరుకు స్పైరలింగ్ మెట్లమీదుగా చుట్టూ తిరుగుతూ పైకి వెళ్ళాలి. అంత ఎత్తునుండి వూరంతా పచ్చని తివాసీ పర్చినట్లు చాలా దూరం వరకూ కనిపించేది. ఆనాటి మెడ్రాస్ దట్టమైన చెట్లమధ్య భవనాలు కనిపించేవికావు. (చల్లని సముద్రపుగాలితో సాయంసమయాలు ఎంతో ఆహ్లాదకరంగా వుండేది. ఆనాటి వాతావరణం పూర్తిగా మారిపోయింది). తూర్పున బంగాళాఖాతంలో కనుచూపు దూరంలో వెళుతున్న స్టీమర్లు కనిపించేవి. ఇప్పుడు నేను చెపుతున్న లైట్ హౌస్ మూడవది. 1894 లో సముద్రమట్టానికి 175 అడుగుల ఎత్తున హైకోర్టు ప్రాంగణంలో కట్టబడినది. రెండవ లైట్ హౌస్ 1841 లో 120 అడుగుల ఎత్తున అదే ప్రాంగణంలో డోరిక్ శిఖరం పైన ఉండేదట. అక్కడ హైకోర్ట్ ప్రాంగణంలోనే పారిస్ కార్నర్ ఎదురు వేపు ప్రస్తుతం రాజాజీ విగ్రహం ఉంది. మరి, మొదటి లైట్ హౌస్ వివరాలు తెలియవు. ఈనాడు అధునాతనంగా, మెరీనా-గాంధీ బీచ్ దగ్గర, ఆలిండియా రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న లైట్ హౌస్ నాలగవది. సాంకేతికంగా ఉన్నతమైనదే కావచ్చు కానీ హైకోర్టు లైట్ హౌస్ అంతా హుందాగా కనపడదు. 

ఈ విధంగా చుట్టూవున్న పరిసరాలను చూస్తూండగా 11 నెంబర్ రావడం, అందులో ఎక్కి టి నగర్ ఉస్మాన్ రోడ్ రాఘవన్ 'నెయ్ కడై' (నేతి దుకాణం) స్టాపింగ్ లో దిగి నడుచుకుంటూ రంగయ్యర్ స్ట్రీట్ లోని ఇంటికి చేరేసరికి రాత్రి 10 గంటలు దాటింది. నాకు గుర్తున్నంతవరకూ మా నాన్నగారితో కలిసి మళ్ళీ అలా విహారానికి వెళ్ళిన సందర్భాలు లేవు. అవకాశం లేకపోడం ఒక కారణం, స్వతహాగా విహారాలంటే ఆయనకుండే అనాసక్తత మరో కారణం కావచ్చు. మానాన్నగారితో కలసి అందరం బయటకు వెళ్ళిన సంఘటనలు చాలా అరుదు. 

మా లోగిట్లో అన్ని భాషలవారూ ఉండేవారు. అందులో చాలామంది సినీమావాళ్ళే. అందులో ఒక కన్నడ సినీమా పాటల రచయిత వుండేవారు. పేరు గుర్తులేదు. ఒంటరిగా ఉండేవారు. ఎప్పుడూ లుంగీ బనీను మాత్రం ధరించి ఇంట్లో చాపమీద గోడకానుకొని కూర్చొని సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ ఏదో రాసుకుంటూ గడిపేవారు. రచయితలకు సిగరెట్ కు ఏవిటో ఆ అవినాభావ సంబంధం?

అప్పుడప్పుడు ఎవరో వచ్చి ఆయనను కారులో బయటకు తీసుకెళ్ళేవారు. వాళ్ళు మాట్లాడేది ఒక్క ముక్క అర్ధమయేదికాదు. అలాగే, కన్నడ సినీమాలకు చెందిన మరో కుటుంబం వుండేది. తల్లి ఒక డాన్స్ మాస్టర్. కూతురు ఒక బాలనటి. మేము ఆ ఇంటిలోనుండి వెళ్ళిపోయాక ఎప్పుడో వచ్చిన 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం' డబ్బింగ్ సినీమాలో బాలనటిగా మంచి వేషమే వేసింది. పెద్దయ్యాక  ఏదో సినిమాలో ఎన్ టి రామారావు పక్కన చెల్లెలుగా చూసిన గుర్తు. పేరు సుమ లేక కుసుమ కావచ్చు. నటిగా పెద్ద విజయం సాధించినట్లు కనపడదు. ఆ తల్లీ కూతుళ్ళను షూటింగ్ కు తీసుకువెళ్ళడానికి కారో, వ్యానో వచ్చేది. ఒకసారి ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. అందులో ఒకావిడ కూర్చొనివుంది. రంగురంగుల బట్టలతో, ఒళ్ళంతా నగలతో, ముఖమంతా దట్టంగా పౌడర్ పూసుకొని, పెదవులంతా ఎఱ్ఱగా, తలంతా రంగురంగుల గొట్టాలాంటి క్లిప్ లతో వింతగా కనిపించింది. నేను మా కాంపౌండ్ లో వున్న చెట్టుక్రింది చప్టా ఎక్కి చూస్తున్నాను. ఆ వ్యాన్ లో ఉన్నావిడ నిముషానికి ఒకసారి చేతులు, వేళ్ళూ తిప్పుతూ, పెదవులాడిస్తూ, కళ్ళు తిప్పుకుంటూ సంజ్ఞలు చేస్తూంది. ఆ చర్యలు నాకెందుకో వింతగా, భయంగా అనిపించింది. ఇంతలో మా కాంపౌండ్ లోని డాన్స్ మాస్టర్ రావడం, వ్యానెక్కి వెళ్ళడం జరిగింది. తర్వాత తెలిసింది, ఆ రోజు వ్యాన్ లో ఉన్న నటి పేరు అమ్మాజీ అని, ఆ రోజు షూటింగ్ లోని డాన్స్ మూవ్మెంట్స్ ను మననం చేసుకుంటున్నారని. ఆవిడ రోజులమారాయి చిత్రంలో నటించిన విషయం మీకు తెలిసినదే. తరువాత, జయశ్రీగా పేరు మార్చుకొని (అదృష్టం కలిసొచ్చిందో లేదో) 'దైవబలం' లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించారు. ఆ జయశ్రీ కుమార్తే నిన్నటి తరం హీరోయిన్ జయచిత్ర.                                       

ఆ లోగిట్లో నా తెలుగు అర్ధం చేసుకుందుకు ఒక తెలుగు కుటుంబం వుండేది. నడి వయసు దాటిన భార్యభర్తలు. చదువు ముగిసి పెళ్ళికెదిగిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరే అవసరార్ధపు అరవ మాటలు కొన్ని నేర్చుకున్నాను.

అక్కడున్నప్పుడే మా నాన్నగారితో కలసి స్టూడియోలో  రికార్డింగ్ లకు వెళ్ళేవాడిని. అప్పటికింకా స్కూల్లో చేరలేదు. మా నాన్నగారిని స్టూడియోకు తీసుకువెళ్ళడానికి కారో, వ్యానో వచ్చేది. ఆ రోజుల్లో ఆర్కెష్ట్రా వాళ్ళను పికప్ చేసుకోవడానికి సినీమా కంపెనీవాళ్ళే వాహనాలు ఏర్పాటు చేసేవారు. అందుకోసం కార్లు, వ్యాన్లు అద్దెకు తీసుకునేవారు. అలా వచ్చే బళ్ళతో పాటు సినీమా కంపెనీ మనిషికూడా వచ్చేవాడు. అలా వచ్చే కారో, వ్యానో ముందుగా మా ఇంటికే వచ్చేది. ఉదయం 9 గంటలకు రికార్డింగ్ కాల్షీట్ అంటే 6.30 గంటల లోపే మా వాకిట్లో వ్యాన్ వచ్చేసేది. అప్పటికి మా నాన్నగారు సిద్ధమైపోయేవారు. ఆ బండిలో హార్మోనియం ఎక్కించి బయల్దేరేవాళ్ళం. వెళుతూ వెళుతూ దారి మధ్యలో వుండే ఇతర ఆర్కెష్ట్రా వాళ్ళను పికప్ చేసేవారు. వెస్ట్ మాంబళంలోని హుస్సేన్ రెడ్డిగారూ (ఆర్గన్), చిత్తూరు సుబ్రహ్మణ్యం గారు (వైలిన్), యిలా వ్యాన్ నిండేవరకు వాద్యబృందాన్ని ఎక్కించుకొని స్టూడియో రికార్డింగ్ ధియేటర్ వద్ద దింపేసేవారు. మా నాన్నగారు లోపలకు వెళ్ళగానే ఆనాటి పాటకు సంబంధించిన నొటేషన్స్ అంతా అక్కడకు చేరిన ఆర్కెష్ట్రా కు డిక్టేట్ చేసేవారు. ఆర్కెష్ట్రా లో string  instruments, wind instruments, rhythm instruments, వాయించేవాళ్ళంతా విడివిడిగా ఒక గ్రూప్ గా కూర్చోనేవారు. ఏ గ్రూపుకు ఆ గ్రూప్ కు విడిగా మైకులుండేవి. ఈ గ్రూప్ లు వాళ్ళు వాయించవలసిన  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ నోట్ చేసుకునేవారు. వెస్ట్రన్ instrument players వాళ్ళ వెస్టర్న్ టైప్ లో నొటేషన్స్ రాసుకునేవారు, పాడి వినిపిస్తూంటే. హార్మోనియం, ఆర్గన్, రెండు మూడు వైలిన్స్ మాత్రం పాటంతటినీ, బిజిఎమ్స్ తో సహా పూర్తిగా వాయించేవారు. ఈ నొటేషన్స్ వ్యవహారం పూర్తయే సమయానికి ఘంటసాలవారు రికార్డింగ్ ధియేటర్ కు చేరుకునేవారు. ఆర్కెష్ట్రా అంతా పాటను వాయిస్తూంటే, అవసరమైన చోట తగు సూచనలు మార్పులు చేసేవారు. ఇలా ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసాక వాయిస్ తో మానిటర్ చూసేవారు. ఆ సమయంలో ఆర్కెష్ట్రాను పామర్తిగారో, రాఘవులుగారో కండక్ట్ చేసేవారు. పాట కంపోజింగ్ నుండి ఆర్కెష్ట్రా కు నొటేషన్స్ ఇచ్చేవరకు సంగీతరావు గారి బాధ్యత. పాట తృప్తికరంగా వుందని భావించాక టేక్ కు వెళ్ళేవారు. సింగర్స్ రూమ్ వేరే. ఆర్కెష్ట్రా రూమ్ వేరే. మొదట్లో అన్నీ ఒకచోటే. మాస్టారు కాకుండా వేరే గాయనీ గాయకులైతే ఘంటసాలవారు సౌండ్ ఇంజనీర్ పక్కనే కూర్చొని వినేవారు. ఆకాలపు పాటలన్నీ లైవ్ రికార్డింగ్ కావడం వలన తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకునే పాట ఫైనల్ కు వెళ్ళేవారు. అయినా, ఎక్కడో ఏదో లోపం, ఏదో పొరపాటు మరో టేక్ కు దారి తీసేది.  ఏది ఏమైనా నిర్ణీతకాలంలో పాట రికార్డింగ్ పూర్తి అయిపోయేది.  ఆ పాటలో పాల్గొన్న గాయకులు, వాద్యబృందం మరో స్టూడియో లో మరో పాట రికార్డింగ్ కు సిధ్ధమయేవారు. గాయకుల కంఠం బాగుంది, రికార్డింగ్ కు అడ్డంకి రాదని అనుకున్న తరువాతే రికార్డింగ్స్ ఫిక్స్ చేస్తారు. అందువలన సాధారణంగా ఏ రికార్డింగ్స్ కాన్సిల్  చేయడమనేది జరగదు. మరీ ఏవైనా సాంకేతిక లోపాలు అకస్మాత్తుగా ఏర్పడితే తప్ప. ఇవన్నీ ఆనాడు సహజంగానే భావించేవారు. సినీమా అనేది ఒక సమష్టి కృషి. ఏ ఒక్కరి వల్లనో సినీమా విజయం సాధించిందనో, అపజయం పొందిందనో భావించడంలో అర్ధంలేదు. 

ఘంటసాలవారు ఈ ఆర్కెష్ట్రాను సక్రమమైన పధ్ధతిలో, సకాలానికి చేర్చే బాధ్యతను ఫ్లూట్ రాజేంద్రకు, రిధిమ్స్ వాయించే కణ్ణన్ కు అప్పగించేవారు. వాళ్ళే ఆర్కెష్ట్రా వాళ్ళందరికీ రికార్డింగ్ ఏ స్టూడియోలో జరుగుతుందో, కాల్షీట్ టైమింగేమిటో ఒక రెండు రోజులు ముందుగా తెలియజేసేవారు.  షెడ్యూల్ ప్రకారం లిస్ట్ లో వున్న వాద్యగాళ్ళందరు స్టూడియో లో చేర్చవలసిన బాధ్యత వాళ్ళిద్దరిదే. సొంత వాహనాలున్నవాళ్ళు సమయానికి  రికార్డింగ్ ధియేటర్ చేరుకునేవారు. వైలిన్ , ఫ్లూట్ వాయించేవాళ్ళు హాయిగా బస్ లో వచ్చేవారు. మా నాన్నగారిలా హెవీ వాద్యాలవాళ్ళకే ఇబ్బంది. కంపెనీ వాహనాలమీద ఆధారపడక తప్పేదికాదు. పాటల రికార్డింగ్ కాల్షీట్ ప్రకారమే జరుగుతుంది. ఆ టైమ్ షెడ్యూల్ ప్రకారం స్టూడియో ధియేటర్ ను అద్దెకు తీసుకుంటారు. ఆ సమయం ప్రకారం ఆ స్టూడియో కు సంబంధించిన సౌండ్, ఇంజనీర్, రికార్డిస్ట్, ఇతర సౌండ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా వారి వారి సరంజామా ఏర్పాటు చేసుకొని సిధ్ధంగా వుంటారు. నిర్ణీత సమయంలో పాట రికార్డింగ్ పూర్తి కావాలి. లేకపోతే నిర్మాత అదనంగా స్టూడియో వారికి అద్దె చెల్లించుకోవాలి. ఇక ఈ కాల్షీట్ బుక్ చేసే సమయాలు పాట లేదా పాటలను బట్టీ నిర్ణయిస్తారు. 7 to 1  ఒక ఫుల్ కాల్షీట్9 to 1 ఒక హాఫ్ కాల్షీట్;  2 to 9 ఒక ఫుల్ కాల్షీట్రీరికార్డింగ్ లయితే 9 to 9 లు  డబుల్ కాల్షీట్లు పనిచేసేవారు. అదీ చాలదనుకుంటే వరసగా రాత్రిం పగళ్ళు పని చేసి రీరికార్డింగ్ ముగించేవారు. ఆ సమయాలలో ఆర్కెష్ట్రా వారికి కాఫీ టిఫిన్లు, భోజనాలు నిర్మాతలే ఏర్పాటు చేసేవారు.  ఎవరికి వారు బయటకు వెళ్ళి తినిరావడానికి వ్యవధి వుండేది కాదు. అన్ని స్టూడియోలకు అందుబాట్లో హోటల్స్ వుండేవికావు. అందువలన, నిర్మాతలే భోజనపు ఏర్పాట్లు చేసేవారు. పాట రికార్డింగ్ అయ్యాక గాయకులకు, వాద్యబృందానికి క్యాష్ రూపంలోనో, చెక్ రూపంలోనో రెమ్యునరేషన్ చెల్లించేవారు. అయితే, ఇచ్చిన చెక్కులన్నీ పాసవుతాయనే గ్యారంటీ వుండేది కాదు. ఒకటికి పదిసార్లు తమ ఆఫీసులు చుట్టూ తిప్పించుకొని పాట డబ్బులిచ్చేవారు. అందరు నిర్మాతలు అలాటివారని చెప్పడం తగదు. క్రమక్రమంగా ఈ పధ్ధతులన్నీ మారిపోయాయి. ఆ వివరాలు తర్వాత, తర్వాత తెలుస్తాయి.

నాకు గుర్తున్నంతవరకూ  నేను మొదటిసారిగా స్టూడియో కు వెళ్ళినది 'జయంమనదే' రీరికార్డింగ్ కు. తరువాతిది ఘంటసాల మాస్టారి 'సొంతవూరు' లోని 'మన వూరే భారతదేశం 'పాటకు. 

              

అయితే  వివరంగా, బాగా గుర్తుండిపోయిన  మొట్టమొదటి రికార్డింగ్, రీరికార్డింగ్ సినీమా  ఘంటసాల వారింటి ఔట్ హౌస్ లోకి  వెళ్ళిన తరువాతే. అది రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 'సతి అనసూయ' ఘంటసాలవారి సంగీతం. కడారు నాగభూషణంగారి దర్శకత్వం. అంజలి, గుమ్మడి, జమున, కెవిఎస్ శర్మ ముఖ్య పాత్రధారులు. ఎన్ టి రామారావు గెస్ట్ ఆర్టిస్ట్. ఆ సినీమా లో సుశీలగారు పాడి, జమున, కెవిఎస్ శర్మల మీద చిత్రీకరించిన "పోనేల మధుర, పోనేల కాశి ఫలమేమి యాత్రలు చేసి, పతి పద సేవయే నా వారణాశి' అనే శోకగీతం రికార్డింగ్ కు వెళ్ళాను. గుండమ్మకధలోని "ప్రేమ యాత్రలకు బృందావనం" పాటలోని మాటలకు, ఈ పాటలోని మాటల మధ్య ఏదో భావ సామీప్యత గోచరిస్తూంటుంది. ఈ రెంటిలో ఏ పాట విన్నా ఆ రెండో పాట నాకెందుకో చటుక్కున గుర్తుకు వస్తుంది.

అసలు ఒక పాట ఎలా తయారవుతుందంటే ... ఇప్పుడు కాదు మరో సందర్భంలో చూద్దాము.

సతీ అనసూయ రీరికార్డింగ్ లో నాకు బాగా గుర్తుండిపోయినది నాగుపాము సీన్. సినిమాలో ఆ పాము కనిపించినప్పుడల్లా నేపధ్యంలో ఒక వాద్యం వినిపిస్తుంది. అది క్లేవైలిన్. అదే యూనివాక్స్ గా కూడా రూపాంతరం చెందింది.


ఈ నాటి  కొంబో ఆర్గన్స్, సింథసైజర్స్ రావడానికి ముందు సినిమా లలో ఈ యూనివాక్స్ కు చాలా ప్రాధాన్యత వుండేది. సతి అనసూయ లో ఘంటసాలవారు ఆ క్లేవైలిన్ ను సందర్భోచితంగా, సమర్ధవంతంగా ఉపయోగించుకొని మనసులకు హత్తుకుపోయే స్వరాలు వినిపించారు. ఈ క్లేవైలిన్/యూనివాక్స్ ను వాయించడంలో హనుమంతాచారిగారు సిద్ధహస్తులు. ఆయనకు హిందుస్థానీ సంగీతంలో మంచి ప్రవేశముంది. మరాఠీ భజన్స్ చాలా బాగా పాడేవారు. 'శ్రీరామచంద్ర కృపాళు భజమన',  పాటను' త్వమేవ మాతాచ పితా త్వమేవ' శ్లోకాన్ని తరుచూ పాడుతూండేవారు. ఆయన కన్నడం సినీమాలలో చిన్న చిన్న హాస్యపాత్రలు ధరించేవారు. రామానాయుడుగారి ప్రేమ్ నగర్ సినీమా ప్రారంభంలో వచ్చే విమానం సీనులో ఒక తెల్ల టోపీ పెట్టుకొని కనిపించేది ఈ హనుమంతాచారిగారే.


ప్రేమ్ నగర్ చిత్రంలో ANRతో హనుమంతాచారిగారు

తమిళ, తెలుగు భాషల్లో అఖండ విజయం సాధించిన 'రాము' (1966) చిత్రంలో ఉత్తమ బాలనటుడిగా జాతీయ బహుమతి పొందిన మాస్టర్ రాజ్ కుమార్, హనుమంతాచారిగారి కుమారుడే. అప్పుడప్పుడు ఘంటసాల వారింటికి వచ్చేవాడు. ఆ అబ్బాయి అసలు పేరు యోగి(యోగీంద్ర కుమార్). సినీమాల కోసం రాజ్ కుమార్ గా పేరు మార్చినట్లున్నారు. 


వెనక గాంధీ టోపీలో (వై బి చవాన్ లా) ఉన్నవారే హనుమంతాచారిగారు
ఘంటసాలగారి కుడిపక్క ఫ్లూట్ రాజేంద్ర వారిద్దరి మధ్య క్లేరినట్ సుభాన్ తబలా జడ్సన్ వెనక కనబడకుండా ఉన్నది రిథమ్స్ కణ్ణన్. నాన్నగారి కుడిపక్క వయొలిన్స్ చిత్తూరు సుబ్రహ్మణ్యం, భద్రం 

1978లో రావి కొండలరావుగారి  డ్రామా ట్రూప్ తో ఢిల్లీనుంచి తిరిగి వస్తున్నప్పుడు తమిళనాడు ఎక్స్ ప్రెస్ కి నాగపూర్ దగ్గర జరిగిన ఒక ఆక్సిడెంట్ లో రికార్డింగ్ లు, షూటింగ్ లు, కచేరీలు అంటూ క్షణం తీరిక లేని ఆ హనుమంతాచారిగారు హఠాత్తుగా కన్నుమూశారు. ఒక మంచి గాయకుడినీ, ఈనాటి multi-purpose, multi-functional electronic వాయిద్యాలు కాంబో ఆర్గన్, సింతసైజర్ లకి తొలిరూపం యూనివాక్స్ పయొనీర్ వాద్యనిపుణుడు, అనుభవజ్ఞుడైన వాద్యకళాకారుడిని దక్షిణాది సినీమా సంగీతరంగం అర్ధాంతరంగా కోల్పోయింది. (ఆ ప్రమాదంలో గాయపడిన ఈ ట్రూపు సభ్యుడు మరొకరు, టి.వి.రాజుగారి పెద్దబ్బాయి - ప్రముఖ సంగీతదర్శకద్వయం రాజ్-కోటిలలో రాజ్ అన్నగారు.)

మేము రంగయ్యర్ స్ట్రీట్ లో వున్న రోజుల్లో ఒకసారి మా నాన్నగారు  నన్నో పనిమీద ఘంటసాలవారింటికి పంపిచారు.

అది ఎందుకో, ఏమిటో ఆ వివరాలు వచ్చేవారం.

ఈలోగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.

...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.