visitors

Sunday, March 7, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవైయొకటవ భాగం

07.03.2021 -  ఆదివారం భాగం - 21:
అధ్యాయం 2 భాగం 20 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
శౌరిరాజన్, శ్రీనివాసన్. ఈ రెండు పేర్లు విష్ణుమూర్తికే చెందుతాయి. శౌరిరాజన్ డాక్టర్. శ్రీనివాసన్ సివిల్ ఇంజనీర్.

ఘంటసాలవారింట్లో ఎవరికి ఏ అస్వస్థత కలిగినా డాక్టర్ శౌరిరాజన్ ఇంటికి వచ్చి చూసేవారు. మంచి హస్తవాసిగల డాక్టర్ అని పేరు. అందరితో చాలా సౌమ్యంగా కలివిడిగా మాట్లాడేవారు. సాధారణమైన ఎత్తుచాలా సన్నగా వుండేవారు. ఆయన క్లినిక్ సౌత్ ఉస్మాన్ రోడ్ లో రంగనాధన్ స్ట్రీట్ సమీపంలో శ్రీదేవీ హోటల్ పక్కన ఒక మేడమీద వుండేది. క్లినిక్ ఎప్పుడూ కిటకిటలాడుతూవుండేది.

మొదట్లో మేమూ శౌరిరాజన్ దగ్గరకే వెళ్ళేవాళ్ళం. శౌరిరాజన్ చాలా పేద కుటుంబం నుండి రావడం వలన పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవారు. మొదట్లో CITనగర్ ప్రాంతంలో గాయకుడు పి.బి.శ్రీనివాస్ ఇంటి పరిసరప్రాంతాలలో ఒక చిన్న ఇంటిలో తల్లి, తమ్ముడుతో నివసించేవారు.

1950లలో శ్రీరామ్ అని ఒక తమిళ నటుడు వుండేవారు. చాలా తమిళం, కొన్ని తెలుగు సినీమాలలో హీరోగా, విలన్ గా నటించినవారు. 


శ్రీరాం సంసారం (తమిళం) చిత్రంలో

శ్రీరాం, వైజయంతీమాల - మర్మవీరన్ చిత్రంలో


ఆయనింట్లో శౌరిరాజన్ తల్లి వంటలక్కగా పనిచేసేవారట. తండ్రిలేని ఈ కుటుంబ దీనస్థితికి జాలిపడి శ్రీరామ్ శౌరిరాజన్ మెడిసిన్ చదవడానికి ఇతోధికంగా ఆర్ధిక సహాయం చేశారట. శౌరిరాజన్ డాక్టరయి కొంత నిలదొక్కుకున్నాక తమ్ముడిని చదివించి ఇంజనీర్ ను చేశారు. హస్తవాసి గల డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న శౌరిరాజన్ రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ తరఫున ముందు కౌన్సిలర్ గా, తర్వాత MLAగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన వివాహం జరిగింది. ఆయన భార్య పేరు రుక్మిణి. జంటకు తగిన పేర్లు అమరినాయి. అంతేకాదు రుక్మిణిగారు గైనికాలజస్ట్.  సమాజంలో అంతస్తు పెరిగింది. ఉస్మాన్ రోడ్ లోని ఆ చిన్న క్లినిక్, టి.నగర్ లోనే దండపాణీ స్ట్రీట్ లో ప్రముఖ నటి కన్నాంబ ఇంటి సమీపానికి మారింది. పెద్ద మెటర్నిటి హాస్పిటల్ వెలసింది. ఘంటసాల మాస్టారి ఆడపిల్లల్లో ఒకరు రుక్మిణీ శౌరిరాజన్ హాస్పిటల్ లోనే పుట్టినట్లుసావిత్రమ్మగారు డిస్ఛార్జ్ అయి ఇంటికి వచ్చిన రోజున నేనూ వున్న గుర్తు. మెటర్నిటి పక్కనే డా. శౌరిరాజన్ రూమ్ కూడా వుండేది. పేషంట్లతో పాటూ వచ్చిపోయే రాజకీయ నాయకుల హడావుడి కూడా ఎక్కువగానే వుండేది. అందువలన ఇళ్ళకు వెళ్ళి పేషంట్లను చూడడం తగ్గించేశారు. కానీ డాక్టర్ గారి తల్లి సావిత్రమ్మగారిని చూసేందుకు వస్తునే ఉండేవారు.

డా.శౌరిరాజన్ తమ్ముడు ఎమ్.కె.శ్రీనివాసన్ ఇంజనీర్ అయ్యాక స్వంతంగా వృద్ధిచెందేరు. ఆయన ఆఫీస్ మా ఎదురు వీధి వ్యాసారావ్ స్ట్రీట్ లో వుండేది. 70లలో 'పరక్కుం పడై' అన్న పేరుతో వినియోగదారుల పరిరక్షణ కోసం ఒక సంస్థని నడిపేవారు. తరవాత కొంత కాలానికి వారమ్మాయి IPSకి ఎంపిక కావాడం, అనంతరం ప్రధాని రక్షణ వ్యవస్థలో ఒక ఉన్నత స్థానాన్ని పొందడం చరిత్ర.

డా.శౌరిరాజన్ వద్దకు వెళ్ళడం తగ్గింది. (ఆయన 2013లో 84 ఏళ్ళ వయసులో కీర్తిశేషులయేరు). డా. జయంతి రామారావు, డా.గోవింద మీనన్ (ఛైల్డ్ స్పెషలిస్ట్), డా.చిట్టూరి సత్యనారాయణ (ఇ.ఎన్.టి స్పెషలిస్ట్), డా. బ్రహ్మానందం, (ఈయన క్లినిక్ 34, ఉస్మాన్ రోడ్ బోర్డ్ మీద మాత్రం Dr.Bhirmananadam, Cardiologist  అని ఉండేది) ఇత్యాది డాక్టర్లతో పరిచయాలు ఏర్పడి ఘంటసాల మాస్టారికి, వారింట్లోవారికి ట్రీట్ చేయడం జరిగింది. వీరందరికీ ఘంటసాల మాస్టారి గానమంటే మహా ప్రీతి.

వీరిలో డా. జయంతి రామారావు ఘంటసాల మాస్టారి కుటుంబానికి అతి సన్నిహితుడిగా మెలిగారు. ఘంటసాల మాస్టారు దివంగతులైన తర్వాత కూడా జయంతి గారి కుటుంబంతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగాయి. ఇంట్లోవారికి ఏ అనారోగ్యం వచ్చినా డా.జయంతి రామారావుగారిని సంప్రదించేవారు. పూనమల్లీ హైరోడ్ లోని ఒక పెద్ద అపార్ట్ మెంట్లో వున్నప్పుడు రెండు మూడుసార్లు వెళ్ళాను.  చాలా కాలం తర్వాత అంబత్తూర్ తెలుగు సాంస్కృతిక సంఘంవారి ఉత్సవాలకు డా. జయంతిగారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి ఘంటసాల మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు, నేనూ కూడా డాక్టర్ గారితో  వెళ్ళడం జరిగింది.

ఘంటసాల మాస్టారు, డా. జయంతి రామారావుగారి మైత్రీ చాలా పాతదే. సదాశివుడిగారికి ఏదో అస్వస్థత కలిగినప్పుడు మింట్ లో ఉన్న స్టాన్లీ మెడికల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అప్పుడే డా.జయంతి రామారావుగారితో ప్రథమంగా పరిచయం. ఘంటసాలవారి పాటంటే విపరీతంగా అభిమానించే జయంతిగారు సదాశివుడు గారి చికిత్స విషయంలో చాలా శ్రధ్ధ వహించారు.

డా. జయంతి రామారావు ప్రముఖ నెఫ్రాలజిస్ట్. మాస్టారి ప్రోద్బలంతోనే విజయా హాస్పిటల్ లో కన్సల్టెంట్ గా చేరారని విన్నాను. ఆయనను అపోలోలో కూడా చాలాసార్లు చూశాను. భార్యాభర్తలు ఇద్దరూ చాలా మంచివారు. మంచి స్నేహశీలురు. ఘంటసాల మాస్టారు విజయా హాస్పిటల్ లో వున్నప్పుడు డా.జయంతిగారి సేవలు, సహాయం మరువలేనివి.

డా. శౌరిరాజన్ మా అందుబాటులో వుండరని తెలిసాక మా నాన్నగారు పాండీబజార్ పార్థసారధిపురంలోని తణికాచల రోడ్, రాజాచార్ స్ట్రీట్, అగస్త్యర్ గుడి ప్రాంతంలోని  ఎస్.వి.టి.చారీగారి క్లినిక్ కు తీసుకువెళ్ళేవారు. చారీగారి క్లినిక్ మాకు మరీ దూరమైపోవడంతో మరో డాక్టర్ ను చూసుకోవలసిన పరిస్థితి లో ఉస్మాన్ రోడ్ లోనే మా ఇంటికి సమీపంలో ఉస్మాన్ రోడ్ గోవిందన్ స్ట్రీట్ మూలమీద ఉండే ఒక ఇంటి గదీలో క్లినిక్ నడిపే డా.రాఘవన్ అనే ఆయన మా పాలిట ఆపద్బాంధవుడయేరు. కొంచెం వయసు మీరినవాడే. RMPడాక్టరే అయినా చాలా అనుభవజ్ఞుడు. ఎంతో మంచివాడు. ఆ రోజుల్లో ఆయన ఫీజు రెండు రూపాయలో, మూడు రూపాయలో ఉండేది. ఇచ్చేవారి దగ్గర పుచ్చుకునేవారు. పేదలైతే ఉచితంగా చూసేవారు. ఇంజక్షన్లు, మందులు పేషంట్లే కొనుక్కోవాలి. సంగీతం మీద అభిరుచి వుండేదనుకుంటాను, రాఘవన్ డాక్టర్ మా నాన్నగారంటే మంచి అభిమానం చూపేవారు.

డాక్టర్ల ప్రసక్తి వచ్చింది కనుక ఘంటసాలవారి కుటుంబానికి తెలిసిన మరో డాక్టర్ గారి ముచ్చటతో నేటి వైద్య ప్రహసనం ముగిద్దాము. ఈ డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళేముందు 'నెం.35, ఉస్మాన్ రోడ్'లోని మరో యిద్దరు వ్యక్తుల గురించి చెప్పక తప్పదు. ఒకరు తాయి. మరొకరు ఆవిడ కొడుకు పయ్యా. (అంటే కుర్రోడు అని చెప్పుకోవచ్చు). పేరు వడివేలు.  తాయి మా లోగిలి పనిమనిషి. తాయి అంటే తల్లి. నిజంగా పిల్లలందరినీ అమ్మలాగే విపరీతమైన అభిమానం చూపేది. తాయి పనిమనిషే అయినా ఏకవచన ప్రయోగం చేయడానికి నాకు మనస్కరించదు. మా ఔట్ హౌస్ పక్కనే ఒక చిన్న గుడిసెలో తల్లీకొడుకులుండేవారు.

మేము ఆ ఇంటికి వెళ్ళేనాటికే తాయికి నలభైఐదేళ్ళు దాటివుంటాయి.వీళ్ళు ఎక్కడివారో, ఎప్పుడు  వచ్చారో నాకు తెలియదు. చాలా నమ్మకస్తురాలు. మొత్తం ఇంటిపని తానే చేసేది. కొడుకు మతిస్థిమితం లేనివాడు. చిన్నవయసులో బాగానే వుండేవాడట. పెద్దగా చదువు సంధ్యలు లేవు. అలాటివాడికి పెళ్ళయింది. వచ్చిన భార్యకు వీడంటే ఇష్టంలేదు. వచ్చిన కొన్నాళ్ళకో, కొన్నేళ్ళకో ఆ పిల్ల నూతిలో దూకడమో, లేక, వేరెవరితోనో వెళ్ళిపోవడమో జరిగింది. ఆ తర్వాతే పయ్యాకు (వడివేలు) మతి తప్పింది. అయితే ఎవరినీ ఏ ఇబ్బంది పెట్టేవాడు కాదు. పొద్దస్తమానం ఆ గుడిసెలోనే స్థబ్దుగా కూర్చోడంతల్లిపెట్టింది తినడం, నిద్రవస్తే పడుక్కోవడం. అప్పుడప్పుడు నాలుగురోడ్లు తిరిగి వచ్చేవాడు. మూడ్ బాగుంటే తల్లితోపాటూ వెత్తలె, పాక్, సీవల్, పుగాకు కాడలు నములుతూ తల్లి పనిపాటల్లో సాయపడేవాడు. ఎవరేది చెప్పినా చేసేవాడు. అలాటి కొడుకుతో ఒక వయసు మళ్ళిన తల్లి జీవితం వెళ్ళదీయడం దుర్భరమే. చుట్టాలో, తెలిసినవాళ్ళో అప్పుడప్పుడు తాయి గుడిసెకు వచ్చేవారు.



35, ఉస్మాన్ రోడ్ సంఘటనలకి సాక్షీభూతంగా నేటికీ అక్కడ నిలబడిన ఉన్నRain Trees - అదే తూంగు మూంజి - నిద్ర గన్నేరు చెట్లు. తాజాగా గత నెల, ఫిబ్రవరి 23, 2021న తీసిన ఫోటో

ఘంటసాలవారింటి లోగిలి చాలా పెద్దది.  పెరట్లో వేపచెట్టు ఆకులు, పక్కింటి మామిడిచెట్టు ఎండుటాకులతో నేలంతా నిండిపోయేది. వాకిట్లో అయితే చెప్పే అక్కరలేదు. రోడ్ మీద వున్న రెండు చెట్ల ఆకులు, ఎండిన పువ్వులతో నిండిపోయేది. మద్రాస్ లోని రోడ్లన్ని అలాటి avenue tressతో దట్టమైన నీడను ప్రసాదించేవి. ఆ చెట్లని మా అమ్మగారు నిద్ర గన్నేరు చెట్లనేవారు. అరవలు వాటిని తూంగుమూంజి (నిద్రముఖం) చెట్లనేవారు. రాత్రిళ్ళు ఆ చెట్ల ఆకులు ముడుచుకుపోయుండేవి. 


  


గుత్తులు గుత్తులుగా నూలుపోగులవంటి పింక్, తెలుపు కలసిన పువ్వులు పూసేవి. కాయలు శీకాయ కాయల్లావుండేవి. ఆ పువ్వులు ఎండి, బ్రౌన్ కలర్ కు మారి జలజలా క్రిందకు కుప్పలు కుప్పలుగా రాలేవి. పక్కన ఆనందన్ స్ట్రీట్ లో ఉండే గుడిసెవాసులు, మేకలు కాచుకునేవాళ్ళు, మేకలు పశువులకి మేపడానికి, చిన్న వంపు కత్తులు కట్టి ఉన్న పొడుగాటి వెదురు కఱ్ఱలతో ఆ కాయలు, ఆకులు, కోసుకోడానికి వస్తుండేవారు. ఎండిపోయి పడిపోయిన ఆకులు, కాయలతో వాకిలి నిండిపోయుండేది తెల్లారేసరికి. వాటన్నిటినీ మహా ఓపికగా ఉదయం ఊడ్చి, కళ్ళాపు జల్లి ఒక చిన్న ముగ్గుపెట్టడంతో తాయి దినచర్య ప్రారంభమయేది. తర్వాతే మాస్టారింటి లోపల పనులకు వెళ్ళేది. మధ్యే మధ్యే పానీయం అన్నట్లు గంటకోసారి తన గుడిసె ముందు కూర్చొని పొగాకుతో కూడిన తాంబూల సేవనం జరిగేది. ఈ ప్రాంతాల్లో చాలామంది సమయానికి అన్నం లేకపోయినా ఫర్వాలేదు, వెత్తలె పాక్ ఉంటే చాలన్నట్లు వుండేవారు. తమిళనాడులో వెత్తలె పాక్ అలవాటులాటిదే మా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వాసులు కొందరికి ఒక అలవాటు వుండేది. అది పొగాకు చుట్ట. కొన్ని తెగలవారిలో ఆడ, మగ, వయోభేదం లేకుండా చుట్టలు కాల్చేవారు. కొంతమందికి అడ్డపొగ అలవాటుండేది. అంటే ఆ చుట్టను నిప్పువున్నవేపు నోట్లో పెట్టుకునేవారు. నోరు కాలకుండా ఎలావుండేదో నాకు ఇప్పటికీ అంతుపట్టని మేజిక్కే. మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో తాయి చీరకట్టు కూడా వ్యత్యాసంగా వుండేది. మన తెలుగువారి చీరకట్టుకు విభిన్నమైనది. తరవాత అర్ధం అయింది. దక్షిణాది జిల్లాలలో పాతకాలపు స్త్రీల కట్టువ్యవహారం అదని.

అలాటి తాయికి ఒకసారి జ్వరం వచ్చింది. ఒకటి రెండు రోజులైనా తగ్గలేదు. అమ్మగారు తాయిని డాక్టర్ దగ్గరకు వెళ్ళమని చెప్పారు. తోడుగా నన్నుకూడా వెళ్ళమన్నారు రిక్షాలో. నాకు దిక్కు తోచలేదు. ఆ డాక్టర్ తో ఏం చెప్పాలి, ఏ భాషలో చెప్పాలని. అన్నిటికంటే బలహీనత ఏమిటంటే బయటవాళ్ళతో ధైర్యంగా మాట్లాడలేకపోవడం. పాప పిన్నిగారు సలహా ఇచ్చారు. "ఈ అమ్మాయికి జ్వరం వచ్చింది, కొంచెం చూడండి అని చెప్పు చాలు" అని  ఆ డాక్టర్ తో ఎలా మాట్లాడాలో చెప్పారు. ఆ డాక్టర్ గారు తెలుగాయనే సమస్యేంవుండదని ధైర్యం చెప్పారు. తాయి రిక్షా ఎక్కడానికి ఒప్పుకోలేదు. నడిచే వెళ్ళాము. ఆ డాక్టర్ గారు ఒక హోమియోపత్. వుండేది బజుల్లా రోడ్ లో.  

నెం.35, ఉస్మాన్ రోడ్ కు ఎడమవైపు ఫర్లాంగు దూరంలో (సుమారుగా పావు కిలోమీటర్) రోడ్ కు రెండు వైపులా బజుల్లా రోడ్. ఎడమవైపు బజుల్లా రోడ్ మొదట్లో (ఇప్పుడు వివేక్ అండ్ కో బిల్డింగ్ వెనకవేపు ఎడమవేపు మొదట ఉండే ఒక పాత ఇల్లు హాస్యనటుడు కస్తూరి శివరావుగారిది. ఆ ఇంటి పక్కిల్లు 63వ నెంబర్ ఇల్లు. ఎన్.టి.రామారావుగారిది. రామారావుగారింటికి ఎదురుగా పెండ్యాలగారిల్లు. పెండ్యాలగారు ఆ ఇంటిని దాసరి నారాయణరావుగారికి అమ్మేసారు. పెండ్యాలగారు అంతకుముందు నార్త్ ఉస్మాన్ రోడ్ లోని CITనగర్ లో వుండేవారు. పెండ్యాలగారికి ఇళ్ళు కొనడం, లాభసాటిగా అమ్మడం ఒకరకమైన వ్యాపారం కాకపోవచ్చు. వ్యాపకం కావొచ్చు

కుడివేపు బజుల్లా రోడ్ ఒకానొకప్పుడు చాలా ఫేమస్. ఆ రోడ్ లోనే బ్రిటిష్ ప్రభుత్వ ఆఖరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డా. చక్రవర్తి రాజగోపాలాచారిగారి స్వగృహం వుండేది.




రాజాజీగారికి నెహ్రూగారికి మధ్య అంత సయోధ్య వుండేదికాదని అనుకునేవారు. ఈయన సొంతంగా స్వతంత్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ జండా నీలం బాక్ గ్రౌండ్ తో మధ్యలో తెల్లటి నక్షత్రం. 


ఆయన సంపాదకత్వం లో స్వతంత్ర పత్రిక కూడా వచ్చేది. రాజాజీ వ్రాసిన రామాయణం చాలా పేరుపొందింది. రాజాజీ చాలా మంచి వక్త. మాటలతో మనుషులను బోల్తా కొట్టించడంలో రాజాజీ మహా దిట్ట అన్న అభిప్రాయం ప్రముఖ పాత్రికేయుడు, లాయర్, హాస్యనటుడు, తుగ్లక్ సంపాదకుడు 'చో' రామస్వామిది. (భాగీరథన్ రాసిన తేన్ మొழிయాళ్అన్న  నాటకంలో ఆయన నటించిన పాత్ర పేరు చోఅని ఇప్పుడే తెలుసుకున్నాను – సోర్స్ దినమణి). రాజాజీ సూక్తులన్నీ ఇతరులకు చెప్పడానికే, తనకు వర్తించవనే మనస్తత్త్వం రాజాజీదని చో ఒకసారి తన తుగ్లక్ పత్రికలో వ్యంగ్యాత్మకంగా వ్రాశారు.

రాజాజీ ఒకసారి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉపన్యసించారట. భారతదేశ సనాతన ధర్మం గురించి, మన ఆచార వ్యవహారాలగురించి, ప్రతీ పౌరుడు ఆచరించవలసిన నీతి నియమాలగురించి ధారాప్రవాహంగా ప్రసంగించారట. వేల సంఖ్యలో ప్రజలంతా ఆయన పురాణకాలక్షేపాన్ని చాలా భక్తిశ్రధ్ధలతో విని ఆయనను వేనోళ్ళ పొగిడారట. ఆ సభకు రాజాజీ భార్య కూడా వచ్చి భర్త ప్రసంగానికి ముగ్ధురాలయిందట. రాత్రి భార్యాభర్తలిద్దరూ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి ముచ్చటించుకుంటూ భోజనాలు చేస్తున్న సమయంలో రాజగోపాలాచారిగారి భార్య ఆయనకు వేడి వేడి సాంబార్ వడ్డించారట. రాజాజీగారు ఆ సాంబార్ లో ఏవో వెతుకుతున్నారట. ఇది ఏం సాంబారు అని అడిగారట. బెండకాయ  సాంబారు అని చెప్పగానే రాజాజీ చిరాకు పడ్డారట. "శుభ్రంగా చిన్న ఉల్లిపాయలు వేసి చేయవచ్చు కదా" అని గదమాయించారట. అందుకు ఆవిడ "అదేమిటండీ ఇవేళ శనివారం. భోజనంలో ఉల్లిపాయ ఎలా చేరుస్తాము. పైగా ఇవేళ మీరే మన ఆచారవ్యవహారాల గురించి ఆహార నియమాల గురించి ఊరికి ఉపదేశం చేసారు, మర్చిపోయారా!" అని అడిగారట.  అందుకు రాజాజీ నవ్వుతూ "ఓసి పిచ్చిదానా! ఉపదేశాలనేవి ఇతరులకోసం మాత్రమే. మనం శుభ్రంగా ఉల్లిపాయ సాంబార్ లాగించవచ్చును" అని భార్యకు హితబోధ చేసారట. ఇది తుగ్లక్ చో సెటైర్. నిజానిజాలు వాళ్ళకే ఎరుక.

సరే, మన తాయి విషయం చూద్దాము. రాజాజీ యిల్లు దాటాక కొంత దూరంలో రోడ్ కు అవతల ప్లాట్ఫారమ్ మీద డాక్టర్ గారింటి నెంబర్ కనిపించింది. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళితే ఒక వరండా కనిపించింది. మేము వెళ్ళే సమయానికి ఎవరూ లేరు. తాయిని అక్కడ వుండమని చెప్పి కాలిగ్ బెల్ నొక్కాను. అరవ గుండారు లుంగీ చుట్టుకున్న ఒక ముసలాయన బయటకు వచ్చి ఎవరని అడిగారు. నేను వెంటనే స్పష్టమైన తెలుగులో అమ్మగారు, పాప పిన్నిగారు చెప్పినట్లు "ఈ అమ్మాయికి జ్వరం. చూడండి" అని తడబడుతు చెప్పాను. డాక్టర్ గారూ చుట్టూ చూసి "ఎక్కడ అమ్మాయి"? అని అడిగారు. ఈ అమ్మాయే అని తాయిని చూపించాను.

ఆయన పగలబడి నవ్వడం ప్రారంభించారు. నేను అన్నమాటలో నవ్వేందుకు ఏముందో నాకు అర్ధం కాలేదు. ఆ డాక్టరు గారు "ఈవిడ అమ్మాయా! సరి సరి అంటూ నా అమాయకత్వానికి జాలిపడి, తర్వాత తాయిని పరీక్షించి ఏవో మందుపొట్లాలు ఇచ్చారు. తాయి, నేను ఇంటికి వచ్చేసాము. కానీ మయసభలో పరాభవం పొందిన దుర్యోధన సార్వభౌముడి చెవిలో ప్రతిధ్వనించే ద్రౌపది నవ్వులా, ఈనాటికీ మరిచిపోలేనివి ఆ డాక్టర్ గారి వికటాట్టహాసం, ఈ తాయి-అమ్మాయి సంఘటన. ఇలాటి సంఘటనలు అవమానంగా అనిపించినా తప్పులు చేసే మంచి పాఠాలు నేర్చుకంటామన్నదీ తెలిసిసొస్తుంది. 

ఘంటసాల మాస్టారు కాలంచేసి ఎన్నో దశాబ్దాలు గడిచినా  తమిళనాట ఘంటసాల పేరు చిరస్మరణీయమే. నగరంలోని ఏ హాస్పిటల్ కు వెళ్ళి ఘంటసాల కుటుంబంలోని వారని చెపితే చాలు, ప్రత్యేక శ్రధ్ధతో అభిమానం చూపించి వైద్యం జరిపిన సంఘటనలున్నాయి. ఇంతకూ వారెవరూ ఘంటసాల మాస్టారిని చూసివుండరు. పాటే విని వుంటారు. అయినా గత కాలపు చిత్రాల్లోని ఘంటసాల పాటల ప్రభావం వారి మీద వుందని స్పష్టంగా తెలుస్తోంది.


1962లో ఎన్.టి.రామారావుగారు నటించిన చిత్రలు తొమ్మిది వచ్చాయి. అక్కినేనివారివి ఆరు చిత్రాలు. వీటిలో ఎన్.టి.ఆర్. నటించిన గులేబకావళి కథ, భీష్మ, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరుసు, రక్తసంబంధం, ఆత్మబంధువు చిత్రాలు, అందులోని పాటలూ బహుళ జనాదరణపొందినవే.

ఇక నాగేశ్వరరావుగారి సినీమాలలో ఆరాధన, మంచిమనసులు, కులగోత్రాలు, సిరిసంపదలు, హిట్ సినీమాలుగా పేరుపొందాయి. అదే సంవత్సరం జగ్గయ్యగారి పదండిముందుకు చిత్రం మంచి పేరు తెచ్చుకుంది.

ఈ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో నాలుగు సినీమాలు వచ్చాయి. కోవెలమూడి భాస్కరరావుగారి మోహినీ రుక్మాంగద, సిఎస్ రావు డైరక్షన్లో టైగర్ రాముడు, విజయావారి గుండమ్మ కథ, సుందర్లాల్ నహతగారి రక్త సంబంధం. వీటిలో గుండమ్మ కథ, రక్త సంబంధం సినీమాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయి. గుండమ్మ కథ తమిళం వెర్షన్ "మనిదన్ మారవిల్లై" కు కూడా ఘంటసాల మాస్టారే సంగీతం. ఈ సినీమాలోని కొన్ని పాటల్లో మాస్టారి హమ్మింగ్స్ వినిపించినా జెమినీ గణేశన్ పాటలు శీర్కాళి గోవిందరాజన్, నాగేశ్వరరావు పాటలను ఎ.ఎల్.రాఘవన్ పాడడం ఒక విశేషం. గుండమ్మకథ పాటలు ఎంతటి జనాదరణ పొందాయో ప్రత్యేకించి చెప్పపనిలేదు. అలాగేరక్తసంబంధం పాటలు కూడా. ఈ ఏడాది విడుదలైన ఎఎన్నార్ చిత్రాల పాటలు, ఎన్టీఆర్ గులేబకావళి, మహామంత్రి తిమ్మరుసు, ఆత్మబంధువులో పాటలు, భీష్మలో పద్యాలు ఘంటసాల మాస్టారి కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాయి.

ఎన్టీఆర్, ఎఎన్నార్, జగ్గయ్య, కాంతారావు, బాలయ్య, రేలంగిలకు ఘంటసాలవారు పాడిన పాటలు ఎంతో వైవిధ్యంతో కూడుకొని, పాడుతున్నది ఆయా నటులే అన్న భ్రమను శ్రోతలకు కలిగిస్తాయి. ఈ సినీమాలు విడుదలై అరవై సంవత్సరాలైనా ఆ చిత్రాల పాటలు సంగీతాభిమానులను మైమరపిస్తూనే వున్నాయి. గుండమ్మ కథ సినీమాలో ఎల్.విజయలక్ష్మి నృత్యం కోసం మాల్కౌంస్ రాగంలో ఘంటసాల మాస్టారు స్వరపర్చిన నృత్య వాద్య సంగీతం అజరామరంగా నిల్చిపోయింది. ఈ నాటికీ ఆ వాద్యగీతాన్ని నృత్యకళాకారులంతా వేదికలమీద ప్రదర్శిస్తున్నారు.

కొసమెరుపు: "భీష్మ " చిత్రంలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం ప్రదర్శించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వృధ్ధుడైపోయిన భీష్ముడి మేకప్, గెటప్ ల గురించి ఎవరో చక్రపాణి గారి దగ్గర చాలా గొప్పగా వర్ణించారట. రామారావుగారి మేకప్ అద్భుతం. మనిషినే గుర్తుపట్టలేము అంటూ పొగిడారట. అందుకు చక్కన్నగారు మహాకూల్ గా "అంత గుర్తు పట్టలేనప్పుడు ఆ వేషం ఆడే ఎందుకెయ్యడం. నువ్వే వెయ్యచ్చు" అని అన్నారట. చక్రపాణి గారి భాష్యమేవేరు.

ఇదే చిత్రంలో, దర్శకత్వపరంగా మరో చిన్న లోపాన్ని కూడా ప్రేక్షకులు ముచ్చటించుకునేవారు.

భీష్ముడు వృధ్ధుడై యుధ్ధరంగంలోకి దిగినప్పుడు ఎన్టీఆర్ మాటలలో, చేతలలో వణుకు ప్రదర్శించగా పద్యాలు పాడేప్పుడు ఘంటసాల స్టోన్ కంచు ఘంటలా దుమ్ము దులిపేసిందని, మాటకు పాటకు మ్యాచ్ కాలేదనే  భావన వినవచ్చేది. ఈ విషయంలో దర్శకుడు, సంగీతదర్శకుడు తగిన శ్రధ్ధ తీసుకోలేదని కొందరి అభిప్రాయం. దిష్టి పరిహారార్ధం చిన్న చిన్న లోపాలుండాలి. ఏమంటారు ?

మరిన్ని విశేషాలతో వచ్చే వారం...  

                    ...సశేషం

Sunday, February 21, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవైయవ భాగం

21.02.2021 - ఆదివారం భాగం - 20*:
అధ్యాయం 2  భాగం 19 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
ఘంటసాల మాస్టారింటి వరండాలో ఎడమవైపున్న కిటికీలకు,కుడివైపునుండే ప్రవేశద్వారానికి మధ్య గోడమీద 'GHANTASALA MUSIC DIRECTOR - IN/OUT'  అనే ప్లాస్టిక్ నేమ్ బోర్డ్ వుండేది. 

ఆ  in/out లు మార్చడానికి వీలుగా ఒక స్లైడింగ్ వుండేది. దానిమీద వున్న ఒక చిన్న బటన్ ను జరిపితే IN/OUT లు కనిపించేవి. ఘంటసాల మాస్టారు బయటకు వెళ్ళినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు విధిగా ఆ IN/OUT లకు మార్చేవారు. నేను ఆ యింటికి వెళ్ళిన కొత్తల్లో ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోతే ఆ నేమ్ బోర్డ్ లోని IN/OUT స్లైడింగ్ తో ఆడుతూ కాలక్షేపం చేసేవాడిని. ఆ నేమ్ ప్లేట్ ఆ గోడకు బిగించేప్పుడే క్రిందిభాగం స్క్రూ వద్ద చిన్నముక్క విరిగిపోయింది.


అదెప్పుడు ఎవరు బిగించారో నాకు తెలియదు. అయినా, ఆ అశ్రధ్ధకు  కారకులైన ఆ బోర్డ్ ను బిగించినవారి మీద ఒక నిరసన భావం వుండేది. ఇలాటి నేమ్ ప్లేటే పామర్తిగారు దొరైసామి రోడ్ లో తంజావూరు స్ట్రీట్ కార్నర్ లో మేడమీద అద్దెకున్నప్పుడు చూశాను. పామర్తిగారింటి నేమ్ ప్లేట్ నల్లటి ప్లాస్టిక్ బోర్డ్ మీద తెల్లటి అక్షరాలు అదే సైజ్ లో వుండేవి.

 

పామర్తిగారికి మ్యూజిక్ డైరక్టర్ గా రాణించాలనే కోరిక మహాబలంగా వుండేది. అందుకు సర్వదా కృషిచేస్తూనేవుండేవారు. కానీ, ఆయన ఆశించినమేరకు అవకాశాలు అందలేదు. డబ్బింగ్ సినీమాలెన్నిటికో సంగీతదర్శకత్వం వహించినా చాలా తక్కువగానే స్ట్రైట్ సినీమాలకు సంగీతం నిర్వహించారు. పామర్తిగారు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో ముఖ్యమైనవి -'సతీ తులసి' ,'బబృవాహన', తిరుపతమ్మకధ'.  వీటన్నిటిలో మాస్టారు పాడిన మంచి పాటలు కొన్ని ఉన్నాయి.

 

మన చిత్రసీమలో వున్న పెద్ద దయనీయ పరిస్థితి ఏమిటంటే, ఒకసారి ఎవరికైనా సంగీతదర్శకుడిగా ముద్రపడిపోయిందంటే, అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆ శాఖలోనే వుండిపోవలసిందే. వాద్యకారునిగా అంతకుముందు ఇతరులవద్ద పనిచేసినా,  ఒకసారి సంగీతదర్శకుడయ్యాడని అనిపించుకుంటే అతనికి వాద్యకారునిగా ఉపయోగించుకునేందుకు ఇతర సంగీత దర్శకులు సంకోచించేవారు. అలాగే ఈ నూతన సంగీతదర్శకులుగా ముద్రపడినవారు కూడా ఇతరుల వద్ద ఆర్కెష్ట్రాలో ఛాన్స్ కోసం ఆశించడానికి ఒక రకమైన అహం అడ్డువచ్చేది. ఒక కళాకారునిలో ఎంతటి ప్రతిభావ్యుత్పత్తులున్నా తాను ఆశించిన రంగంలో  ఒక స్థాయికి చేరుకోవడంలో విఫలమై ఆర్ధిక దుస్ధితులను ఎదుర్కొనే కళాకారులెందరో మద్రాస్ రోడ్లమీద కనపడేవారు.

 

సంగీత దర్శకులమని అనిపించుకోవడమే లక్ష్యంగా కాక తమకున్న వాద్య నైపుణ్యంతో అందరి సంగీత దర్శకుల వద్ద అవకాశాలు చేజిక్కించుకొని కేవలం వాద్యగాడి హోదాలోనే లక్షలు సంపాదించి మద్రాసులో సొంత ఇళ్ళూ వాకిళ్ళు ఏర్పరచుకొని హాయిగా బ్రతికినవాళ్ళూ ఉన్నారు. ఈ రకమైన పరిస్థితి సినీమాలలో ఒక్క సంగీతరంగంలోనే కాదు,అన్ని శాఖల్లో కనిపిస్తారు. హీరోలైపోదామని, హీరోయిన్లు కావాలని, దర్శకులు కావాలని , నిర్మాతలైపోవాలని , లేదా గొప్ప కెమేరామెన్లు అయిపోవాలని ఆదర్శంగా పెట్టుకొని ఆ అవకాశాలు లభించక, తిరిగి తమ సొంతవూరుకు వెళ్ళే ధైర్యమూ చాలక మురికివాడలలో జీవితం కొనసాగించుకున్నవారెందరో మద్రాస్ లో కనిపిస్తారు. సినీమా ఒక విచిత్రలోకం. అక్కడ టాలెంట్ ఒక్కటే గుర్తింపుకు రాదు. అంతకుమించిన మరెన్నో అంశాలు పరిగణించబడతాయి. ఎవరు ఎప్పుడు ఎందుకు షైన్ అవుతారో ఎవరూ చెప్పలేరు.

 

నేపధ్యగాయకునిగా, సంగీత దర్శకునిగా ఘంటసాల మాస్టారుకు వున్న స్థానం అద్వితీయం. మెడ్రాస్ చిత్రపరిశ్రమలో ప్రవేశించిన మొదటి మూడేళ్ళు  అవకాశాల వెతుకులాటలో  చాలా శ్రమించిన మాట వాస్తవమే అయినా 1950 ల తరువాత, చిత్రనిర్మాతలే ఘంటసాలగారిని వెతుకుతూ వచ్చారు. ఘంటసాలగారే తమ చిత్రంలో పాడాలని, తమ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాలని కోరుకొని మరీ వచ్చేవారు. తనకుతానుగా పనికోసం వెంపర్లాడలేదు. ఇతరులకు లభించే అవకాశాలకు ఏనాడూ అడ్డుపడలేదు. సాటి కళాకారుల మనుగడకోసం తనకు వచ్చిన సినీమాలను, పాటలను ఎంతో ఉదారంగా వదులుకున్న సంఘటనలెన్నో.

 

ఘంటసాలవారింటికి అవకాశాలకోసం వాద్య కళాకారులు, కోరస్ పాడేవారూ ఎంతోమంది వచ్చేవారు. మాస్టారి చేతిలో ఎప్పుడూ నాలుగైదు చిత్రాలకు తక్కువలేకుండా వుండేవి. ఆ సినీమాలలో హీరో, హీరోయిన్ ల సోలో, డ్యూయెట్  సాంగ్స్ తో పాటూ రెండో మూడో బృందగానాలు వుండేవి. అలాటి పాటలలో పాడే ఛాన్స్ కోసం ఎంతోమంది కోరస్ గాయనీగాయకులు మాస్టారి వద్దకు వచ్చేవారు. ఒక్క ఘంటసాల మాస్టారింటికే కాదు, ప్రముఖ సంగీత దర్శకులందరినీ వెళ్ళి కలుసుకోవడం వారి దైనందిక జీవితంలో ఒక నిత్యకృత్యం.  మాస్టారు వారందరితో సరదాగా అన్ని విషయాలు ముచ్చటించేవారు.

పాటల ఛాన్స్ ల కోసం ప్రత్యేకించి, డబ్బులు ఖర్చుపెట్టుకు రావద్దని చెప్పేవారు. ఘంటసాల మాస్టారు అలాటివారిని ప్రొత్సహించేవారు కాదు. కోరస్ పాటలు వుంటే తప్పక అవకాశాలు కల్పిస్తానని, ఈ విషయంగా తనను కలుసుకోవలసిన అగత్యమే లేదని చెప్పేవారు.

ఘంటసాల మాస్టారి సినీమాలలో వచ్చే బృందగానాలలో జెవి రాఘవులు తో పాటూ వి.రామారావు, కృష్ణ, బ్రహ్మయ్య, సౌమిత్రి,రఘురాం,రావూరి వీరభద్రం, పట్టాభి; ఆడవారిలో వైదేహి,ఉడత, హైమావతి( చక్రవర్తి అక్క), బేబీ కృష్ణవేణి( లైలా మజ్నులో చిన్న లైలా), సరోజిని, శోభ, సుందరమ్మ మొదలైనవారు కనిపించేవారు. వీరందరూ బాగా పాడేవారే. కానీ వీరిలో చాలామంది కోరస్ కే పరిమితమైపోయారు. భద్రంగారు వైలిన్ నేర్చుకొని ఘంటసాలవారి ఆర్కెష్ట్రాలో చోటు సంపాదించుకున్నారు. సినీమా లలో గాయకుడిగా తగిన అవకాశాలు దొరకక పట్టాభిగారు హరికధా రంగంలో కృషిచేసి పట్టాభి భాగవతార్ గా కొంత గుర్తింపుపొందారు.

భద్రంగారు, రామారావు గారు అప్పటికి బ్రహ్మచారులు. నార్త్ ఉస్మాన్ రోడ్ లో ఇప్పుడు 'జాయ్ అలుక్కాస్' జ్యూవెలరీ షాప్ ఉన్నచోట ఒక పాత మేడమీద రూమ్ లో అద్దెకుండేవారు. వాళ్ళ రూమ్ లో పంజరాలలో చిలకలు, కుందేళ్ళువుండేవి. వాటని చూడడానికి నేను, పెద్దబాబు భద్రంగారి రూమ్ కు వెళ్ళి వాటికి బఠాణీలు, శనగలు పెట్టేవాళ్ళం. రామారావు, భద్రం ఈ ఇద్దరూ పానగల్ పార్క్ దగ్గర పార్క్ లాండ్స్ హోటల్లో భోజనం చేసేవారు. వాళ్ళతో పాటూ మేమిద్దరం కాలక్షేపానికి వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని చూసి అక్కడి సప్లయర్స్ పెద్ద పెద్ద అప్పడాలు తినడానికి ఇచ్చేవారు. ఫ్రీగానే. అలాగే అప్పుడప్పుడు రసమ్ కూడా ఇచ్చేవారు. పార్క్ ల్యాండ్స్ హోటల్ లోని టిఫెన్లు, భోజనం కూడా చాలా రుచికరంగా, చవకగా వుండేది. మేము మెడ్రాస్ రావడానికి ముందు మా నాన్నగారు కూడా అదే హోటల్ లో భోజనం చేసేవారు.  రెండు పూట్లా భోజనానికి నెలవారీ టిక్కెట్లు నలభై/ఏభై రూపాయాలలోపే అని జ్ఞాపకం.

ఘంటసాల మాస్టారింటికి అమ్మగారిని చూడడానికి ఒకావిడ వచ్చేవారు. పేరు అన్నపూర్ణమ్మ. బళ్ళారి రాఘవాచార్యులు వంటి నటులతో నాటకాలలో నటించేవారట. పద్యాలు చాలా బాగా పాడేవారు. బిబిసి రేడియోలాగా లోక విశేషాలన్నీ సావిత్రమ్మగారికి చెప్పేవారు. ఆవిడ మా పిల్లలందరితో సరదాగా కబుర్లు చెప్పేవారు. అయితే అన్నపూర్ణమ్మ గారితో ఉన్న పెద్ద సమస్య, ఆవిడకు బ్రహ్మాండమైన చెముడు. ఎదుటివారికి చెముడన్నట్లుగా ఆవిడ చాలా గట్టిగానే మట్లాడేవారు ఆవిడ కూతురు శోభ. అసలు పేరు సరోజిని. గాయనీమణులలో చాలామంది సరోజినిలు వుండడాన శోభగా పేరు మార్చుకుంది. ఒక పక్క లా కాలేజీలో చదువుతూనే అవకాశం దొరికితే  సినీమాలలో కోరస్ పాటలు పాడేది. అయితే ఆ రంగంలో నిలదొక్కుకోలేక లా పూర్తిచేసి ఎవరినో పెళ్ళిచేసుకొని జీవితంలో స్థిరపడింది. 1980 ప్రాంతాలలో ఎప్పుడో ఒకసారి మౌంట్ రోడ్ లో కనపడి నన్ను గుర్తుపట్టి పలకరించింది. తానేదో కంపెనీలో ఎక్సిక్యూటివ్ గా పనిచేస్తున్నట్లు చెప్పింది.

శాస్త్రీయ సంగీతంలో ఎంతో నైపుణ్యమున్న గాయకులు, వాద్యకళాకారులు మాస్టారి వద్దకు అవకాశాలకోసం వచ్చేవారు. అయితే వారిలో చాలామంది సినీమా టెక్నిక్ కు తమను తాము మలచుకోలేకపోయేవారు. 1974 తర్వాత ఈ కళాకారులంతా ఏమయ్యారో, ఎక్కడున్నారో నాకు తెలియదు. అప్పుడప్పుడు మా జంట సంస్థల వేదికలమీద కొందరు పాత పరిచయస్తులు కనపడి పలకరించేవారు. ఘంటసాల మాస్టారితో తమకున్న అనుబంధం గురించి జ్ఞప్తికి తెచ్చుకునేవారు. మాధవపెద్ది సత్యంగారు, పిఠాపురం నాగేశ్వరరావుగారూ కూడా అప్పుడప్పుడూ ఘంటసాలవారి ని కలుసుకునేందుకు నెం.35,ఉస్మాన్ రోడ్ కు వచ్చేవారు.

అలాగే ఘంటసాల మాస్టారింటి బొమ్మలకొలువు వంటి విశేషాలకు వచ్చి 'వదినా, వదినా' అంటూ సావిత్రమ్మగారితో హడావుడిగా కబుర్లు చెప్పే మరో గాయని బేబీ కృష్ణవేణి. మొదటిసారి ఈ పేరు విన్నప్పుడు నాకు అక్కడ బేబీ ఎవరూ కనపడలేదు. బదులుగా షర్మిలాటాగూర్ స్టైల్ చక్రాల్లాటి చెవులరింగులతోసాధనా స్టైల్ లో నుదుటిపై హెయిర్ లాక్స్ తో ఒక పెద్దమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయే బేబి కృష్ణవేణి. సి.కృష్ణవేణి, పి.జి.కృష్ణవేణిలతోపాటు మరో కృష్ణవేణి. అందరికీ తెలియడం కోసం బేబీగానే పిలవబడేది. లైలామజ్ను లో చిన్న లైలా, చిన్న మజ్ను గా ఈ బేబి కృష్ణవేణి,  వీణ చిట్టిబాబు నటించారు.

తర్వాత, ఈ కృష్ణవేణి ఏ సినీమాలలో నటించిందో నాకు తెలియదు, కానీ, మాస్టారి సంగీతదర్శకత్వంలో తరుచూ కోరస్ సింగర్ గా కనపడేది. కొన్నాళ్ళ తరువాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు తెచ్చుకొని తోటి డబ్బింగ్ ఆర్టిస్ట్ చుండ్రూ సూర్యనారాయణ అనే ఆయనను వివాహం చేసుకున్నారు. నేను సినిమా రంగానికి చెందినవాడిని కాకపోవడంతో 1974 నుండీ ఈ కోరస్ సింగర్స్ విషయాలు తెలిసే అవకాశం పోయింది.

స్థానికంగా వుండే గాయనీ గాయకులే కాక ఆంధ్రదేశం నలుమూలల నుండీ ఔత్సాహిక గాయకులంతా ఘంటసాలవారికి తమ గానాన్ని వినిపించి, మెప్పించి సినీమాలలో గుర్తింపు పొందాలని ఆశతో వచ్చేవారు. అలాటివారిని మాస్టారు సాదరంగా నాలుగు మంచి మాటలతో ప్రోత్సహించేవారు. గాయకులమంటూ వచ్చేవారిలో సగానికిపైగా ఔత్సాహికులే తప్ప వారికి కనీస సంగీతజ్ఞానం వుండేదికాదు. ఘంటసాలవారి పాటలే తిరిగి ఆయన ఎదుట పాడి వినిపించేవారు. అవన్నీ కూడా ఆయన చాలా ఓపికగా విని, సున్నితంగా పాడినవారి మనసు నొప్పించకుండా మంచి సలహాలు చెప్పి పంపేవారు.

మరి కొందరు చాలా బాగా మాస్టారి పాటల, లేక యితరుల పాటలో పాడి వినిపించేవారు. అలాటివారిని సినీమా పాటలు, తాను పాడినవి కాక ఇతర లలితగీతాలు లాటివి పాడమనేవారు. వచ్చినవారిలో ఎవరికీ ఇతర లలితగీతాలు పాడే సామర్ధ్యం ఉండేది కాదు. కొంతమంది ఏవో పాటలు పాడినా అవి ఆమోదయోగ్యంగా వుండేవికావు. తన దగ్గర పాటలు పాడి వినిపించడానికి వచ్చినవారందరికీ ఒకటే సలహా చెప్పేవారు. పాడేప్పుడు ఏ గాయకుడి గొంతును అనుకరించవద్దని, తమకు భగవంతుడు ఇచ్చిన స్వతసిధ్ధమైన గాత్రంతోనే పాడడం సాధన చేయాలని చెప్పేవారు. స్టార్ సింగర్స్ ను అనుకరిస్తూ పాడేవారికి లభించే గుర్తింపు తాత్కాలికమని, అలాటివారికి దీర్ఘకాలిక మనుగడ కష్టమని అనేవారు. ప్రతీ గాయకుడు అనుకరణలేని తన సహజ బాణీనే అభివృధ్ధి చేసుకోవాలని భావించేవారు. తన గొంతునే అనుకరిస్తూ సినీమాలలో పాడే వర్ధమాన గాయకులను చూసి,వారి భవిష్యత్ గురించి మనసులోనే బాధపడేవారు. గాయకుడుగా రాణించాలంటే శృతి శుధ్ధత , లయ, భాష , భావప్రకటనల విషయంలో తగిన శ్రధ్ధాభక్తులు పాటిస్తూ సంగీత సాధన చేయమని సలహా ఇచ్చేవారు. సినీమాలలో గాయకులుగా రాదల్చుకున్నవారు తమ జీవనోపాధికి ఏదో వృత్తిని చేసుకుంటూ సినీమా ప్రయత్నాలు కొనసాగిస్తే ఆ కుటుంబ సభ్యులకు ఆసరా అవుతారని, కేవలం సినీమాలనే నమ్ముకోవడం శ్రేయస్కరం కాదని ఘంటసాల మాస్టారు అభిప్రాయపడేవారు.

ఈ సలహా చాలామందికి చేదు మందులా తోచేది. చేదుమందు ఒంటికి ఆరోగ్యం. ఘంటసాలవారి  సలహాలలో జీవిత సత్యమెంతో వుంది.

ఈమధ్య ఈ వాట్సప్ సమూహాలతో పరిచయం ఏర్పడి అనేకమంది సమూహ సభ్యులు ఘంటసాలవారితో తాము పొందిన ప్రత్యక్ష పరోక్ష అనుభవాలు పంచుకోవడం జరిగింది. 1960 లో జరిగిన అలాటి ముచ్చట ఒకటి ప్రస్తావిస్తాను. శ్రీ జ్యోతి ప్రభాకరరావు వరంగల్ వాస్తవ్యులు. రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాషియర్ గా పనిచేసేవారు. మంచి ఔత్సాహిక గాయకులు. ఘంటసాల మాస్టారి పాటలు పాడడంలో మంచి నైపుణ్యం సంపాదించి స్థానికంగా జూనియర్ ఘంటసాలగా అందరి ప్రశంసలు పొందారట. ప్రభాకరరావుగారికి ఘంటసాలగారన్నా, ఆయన గానమన్నా విపరీతమైన అభిమానం. ఘంటసాలగారిని కలిసి ఆయనతో మాట్లాడాలని, తన పాటను వినిపించాలని కలలు కనేవారట. ఆ కలలు నెరవేరే సందర్భం కలసివచ్చింది. వరంగల్ నుండి తమ మిత్రబృందంతో ప్రభాకరరావు మద్రాస్ వచ్చి ముందుగా ఘంటసాలవారింటికే వెళ్ళారట. ఘంటసాలగారు వరంగల్ నుండి వచ్చిన అభిమానులందరితో ముచ్చటించి, ప్రభాకర రావుగారి పాట విన్నారట.  తన అభిమాన గాయకుని ముందు ఆయనే ఆలపించిన 'కృష్ణా! ముకుందా మురారీ!' పాటను పాడి వినిపించారట. పాటంతా విని మాస్టారు చాలా సంతోషించి అభినందించారట. ఇంకా బాగా సాధకం చేస్తే గాయకుడిగా రాణించగలవని ఆశీర్వదించారట.

ఆ తర్వాత, మాస్టారు బయటకు కారులో వెళ్ళబోతే ఆ కారు వెంటనే స్టార్ట్ కాక మొరాయిస్తే ప్రభాకరరావు, మరికొంతమంది మిత్రులు ఒక చేయివేసి త్రోయగా స్టార్టయిందని, ఆ విధంగా తన అభిమాన గాయకుడికి ఏదోవిధంగా సహాయపడిన ఆనందం తనకు దక్కిందని వరంగల్ లో అందరికీ చెప్పి ఆనందించారట. ఆ తరవాత ప్రభాకరరావుగారి బృందం అంతా ఘంటసాలవారింటి నుండి బయల్దేరి నెం.35, ఉస్మాన్ రోడ్ సమీపంలోని బజుల్లా రోడ్ లోని ఎన్.టి.రామారావుగారిని చూడడానికి వెళ్ళారట. అవి 'శ్రీ సీతారామ కళ్యాణం' సినీమా నిర్మాణం లో వున్న రోజులు.  వీళ్ళంతా వెళ్ళే సమయానికి రామారావు గారు రావణాసురుని మేకప్ లో వుండి స్టూడియో కు వెళ్ళడానికి సిధ్ధంగా వున్నారట. అభిమానులను అభిమానించే ఎన్టీఆర్ ఈ మిత్రబృందాన్ని కూడా వేరే వ్యాన్ లో వాహినీ స్టూడియో కు తన షూటింగ్ కు తీసుకువెళ్ళారట. ఆ రోజు రావణబ్రహ్మ అష్టదిక్పాలకులను శాసించే సీన్ షూట్ చేస్తున్నారట. ఈ షూటింగ్ అరేంజ్మెంట్స్ జరిగే సమయంలో ఘంటసాల మాస్టారి అభిమాని ప్రభాకరరావు గారి పాటను వినిపించడానికి రామారావుగారు అనుమతించగా వారి ముందు కూడా పాండురంగమహత్మ్యం లోని 'కృష్ణా ముకుందా మురారి' పాట పడారట. రామారావు గారు కూడా చాలా సంతోషించారట. ఆ తర్వాత, ఎప్పుడో టి చలపతిరావు గారు కొత్త గాయకులను ప్రోత్సహించే క్రమంలో ఈ వరంగల్ ప్రభాకరరావు గారిని ఆడిషన్ కు పిలిపించారట. కానీ, ఇందుకు ప్రభాకరరావు గారి తల్లి చాలా విముఖత చూపి తన కొడుకు తనకు దూరం కావడానికి ఇష్టపడక ఆయన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసారట. ఈ విధంగా జ్యోతి ప్రభాకరరావు సినీ గాయకుడు కావాలనే ఆశలు నీరుగారిపోయాయట.

ఈ విషయాలన్నీ జ్యోతి ప్రభాకరరావుగారి కుమారుడు జ్యోతి రాజకుమార్ గారు తెలియజేసేరు.

ఘంటసాలవారికి దేశవ్యాప్తంగా ఎంతమంది ఆత్మీయాభిమానులు, ప్రియభక్తులు వుండేవారో ఈ చిన్న సంఘటన తెలియజేస్తుంది. 1961 లో ఘంటసాల మాస్టారి సంగీతంలో రెండే సినీమాలు. ఒకటి 'శ్రీ కృష్ణ కుచేల', మరొకటి ' శభాష్ రాజా'. శ్రీ కృష్ణ కుచేల లో సి.ఎస్.ఆర్ హీరో(కుచేలుడు), శభాష్ రాజాలో అక్కినేని హీరో. శ్రీకృష్ణ కుచేల సినిమా ఆర్ధికంగా విజయవంతం కానప్పటికీ అందులో చాలా మంచి సంగీతముంది. నటనాపరంగా చక్కటి సినీమా. ఇందులో రంగస్థల నటులైన కె.రఘురామయ్య, అద్దంకి శ్రీరామమూర్తి పాడిన పద్యాలున్నాయి. ఒక పద్యమో, పాటో సి.ఎస్.ఆర్ గారిచేత కూడా మాస్టారు పాడించారు. కానీ సిఎస్ ఆర్ గారి ఒత్తిడితో దానిని మాస్టారే మరల పాడి సినిమాలో ఉపయోగించారు. శ్రీ కృష్ణ కుచేల సంగీతం గురించి, అద్దంకి శ్రీరామమూర్తిగారి గురించి ఆయన బాణీ గురించి మా నాన్నగారు (పి. సంగీతరావు) తమ వ్యాసాలలో, చాలా ఇంటర్వ్యూలలో పాడి వివరించారు.


శబాష్ రాజా సినిమా వినోదం కలిగించే ఒక సాధారణ సినిమా. హుషారైన పాటలెన్లో ఉన్నా ఇది సుందర్లాల్ నహతాగారి సినిమా కావడం వలన హిందీ వరసల పాటలే అధికం. ఈ సినిమాలోని 'అందాల రాణివై ఆడుమాపాట చాలా బాగుంటుంది. వైవిధ్యంగల నేపథ్యగాయకుడిగా ఘంటసాలవారి గానప్రతిభ 1961లో మరోసారి నిరూపించబడింది. సీతారామ కళ్యాణం (గాలి పెంచలనరసింహారావు) - కానరార కైలాస నివాస, జయత్వదభ్రవిభ్రమద్బ్రమద్భుజంగ మస్ఫుర, గోవింద మాధవ దామోదర; వెలుగు నీడలు లో (పెండ్యాల) - పాడవోయి భారతీయుడా, కలకానిదీ విలువైనదీ; బావామరదళ్ళు లోని (పెండ్యాల) - నీలిమేఘాలలో, ముక్కోటి దేవతలు, పయనించే మన వలపుల, హృదయమా ఓ బేల హృదయమా; భార్యాభర్తలు లో (ఎస్.రాజేశ్వరరావు) - జోరుగా హుషారుగా, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి; భక్త జయదేవ లో (ఎస్.రాజేశ్వరరావు) - ప్రళయపయోధిజలే, నీ మధుమురళీ గానలీల, అనిలతరళ కువలయ నయనేన, ప్రియే చారుశీలే; పెండ్లి పిలుపు లో (కె.ప్రసాదరావు) - నాలోని అనురాగమంతా; కృష్ణప్రేమ లో (పెండ్యాల) - మోహనరూపా గోపాలా; ఋష్యశృంగ లో (టి.వి.రాజు) - నభో లోకనాయకా, పరుగులు తీసేవూ పయనమెచటికో మౌనీ; జగదేకవీరుని కథ లో (పెండ్యాల) - శివశంకరీ శివానందలహరి, ఓ సఖీ ఓహో సఖీ, ఆశా ఏకాశ నీ నీడనె నే చేరేసా, రా రా కనరారా కరుణ మానినారా, మనోహరముగా మధుర మధురముగా; వాగ్దానం లో (పెండ్యాల) - సీతాకల్యాణం హరికథ, పాహి రామప్రభో, నా కంటిపాపలో నిలచిపోరాకలసివుంటే కలదు సుఖం లో (మాస్టర్ వేణు) - ముద్దబంతి పూలు బెట్టి; పెళ్ళికాని పిల్లలు (మాస్టర్ వేణు) - చల్లగాలి చక్కని తోట, ప్రియతమా రాధికా, మొన్ననిన్ను చూశాను; ఇద్దరు మిత్రులు లో (ఎస్.రాజేశ్వరరావు) - హలో హలో అమ్మాయి, ఖుషీ ఖుషీగా నవ్వుతూ, ఈ ముసిముసి నవ్వుల - ఈ పాటలన్నీ వివిధ రసాలతో కూడిన వైవిధ్యంగల పాటలు. ఈ పాటలన్నీ ఘంటసాల మాస్టారి గళం నుండి అలవోకగా జాలువారి చిరంజీవత్వం సంతరించుకున్నాయి.

ఈ సినిమాలు వచ్చి అరవై ఏళ్ళు దాటినా ఈ పాటలన్నీ ఈ నాటికీ సినీమా సంగీతాభిమానులందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాయి. ఈ పాటలు పాడని గాయకులు లేరు. వినపడని సభాస్థలి కానీ టివి ఛానల్స్ గానీ వుండనే వుండవు.

ఘంటసాల శకం సినీ సంగీత చరిత్రలో ఒక స్వర్ణయుగమే. మా నాన్నగారి మాటల్లో ఇరవైయవ శతాబ్దం ఘంటసాలది.




1961లో వచ్చిన తెలుగు చిత్రాలలోని పాటలన్నీ బహుళ జనాదరణపొందినవే అయినా విజయావారి ' జగదేకవీరునికథ' చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన  'శివశంకరి శివానందలహరి' పాట ఆనాటినుండి నేటివరకూ నెంబర్ 1 పాటగానే రసజ్ఞులందరిచేతా ప్రశసించబడుతున్నది. ఈ పాటకు కలిగినంత సంచలనం, వాదోపవాదాలు, ఊహాగానాలు మరేపాటకు లేవంటే అతిశయోక్తి కాదు. ఆ సినీమా విడుదలైనప్పుడు  ఆ చిత్రంలోని అన్నిపాటల్లాగే పెండ్యాల గారు చాలా అద్భుతంగా స్వరపర్చారని, ఆ పాటను ఘంటసాల మాస్టారు తన గానప్రతిభతో మరింత అద్భుతంగా పాడారని, హీరో ఎన్టీఆర్ చాలా గొప్పగా నటించారని ప్రశంసలు వచ్చాయి. గత మూడు దశాబ్దాలుగా 'శివశంకరి ' పాటను గురించిన చర్చలు అనూహ్యంగా పెరిగిపోయి వాస్తవానికి అతీతమైన వ్యాఖ్యలు ప్రచారంలోనికి వచ్చాయి. ఘంటసాల, పెండ్యాల, ఎన్టీఆర్, కెవి రెడ్డి, పింగళిగార్ల వీరాభిమానులు ఈ పాట గురించి ఏమాటంటే ఏవిధంగా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఉందన్నవిషయం మాత్రం నిజం.

విజయావారి 'జగదేకవీరునికథ' కు 1944 లో వచ్చిన పక్షిరాజావారి 'జగదలప్రతాబన్' తమిళం సినీమా ఆధారం. అందులో హీరో పి.యు.చిన్నప్ప. హీరోయిన్లు తెలుగులోలాగే నలుగురు. జి. రామనాధన్ సంగీతం. ఈ సినీమాలో పాటలన్నీ ఆనాడు సూపర్ హిట్. గాయక నటునిగా పి.యు.చిన్నప్పకు త్యాగరాజ భాగవతార్ తో సమానమైన అంతస్తును ఏర్పర్చిన సినీమా 'జగతలప్రతాపన్'. ఈ సినీమాలో కూడా 'శివశంకరి' పాటలాటిదే అతిపెద్ద పాట ఒకటి వుంది. ఇందులో కూడా హీరో అనేక రూపాలలో అనేక వాద్యాలు వాయిస్తూ కనిపిస్తాడు. "తాయై పణివేన్" అనే ఈ పాటను కళ్యాణిలో స్వరపరిచారు. ఈ పాట అనుకున్నదానికంటే నిడివి పెరిగిపోగా పది పన్నెండు నిముషాలకు కుదించారట. ఆ కారణంగా ఈ పాట గ్రామఫోన్ రికార్డ్ గా రాలేదట. పి.యు.చిన్నప్ప ఈ గీతాన్ని మరల ఒక నలభై అయిదు నిముషాలపాటు కచేరీ బాణీలో పాడి గ్రామఫోన్ రికార్డ్ గా విడుదల చేయడం అది తమిళనాట విపరీతమైన జనాదరణ పొందడం జరిగిందని తమిళ పత్రికలలో వచ్చిన వార్త.



విజయావారి 'జగదేకవీరునికథ'ను తమిళంలో మరల 'జగదలప్రతాబన్' పేరిట డబ్ చేశారు. ' శివశంకరీ' పాటను శీర్కాళి గోవిందరాజన్ పాడిన గుర్తు. దక్షిణాది భాషలతోపాటూ హిందీ, ఒరియాలోకి కూడా డబ్ చేసి మంచి విజయాన్ని పొందిన చిత్రం 'జగదేకవీరునికథ'. తెలుగు భాష సజీవంగా ఉన్నంతకాలం ఘంటసాల మాస్టారి గాన వైదుష్యానికి నికషోపలంగా 'శివశంకరీ' పాట అజరామరంగా నిల్చిపోయివుంటుంది.






ఘంటసాల మాస్టారి మరిన్ని మంచి పాటలతో, విశేషాలతో మళ్ళీ వచ్చే వారం......

సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.