visitors

Saturday, January 16, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదిహేనవ భాగం

16.01.2021 -  శనివారం భాగం- 15*:
అధ్యాయం 2 భాగం 14 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

అందరికీ పండుగానంతరం చెబుతున్న మకర సంక్రమణ శుభాకాంక్షలు.

దీపావళీ  వచ్చి వెళ్ళిన తరువాత వచ్చే మరో పెద్ద పండగ మకర సంక్రాంతి. నాలుగురోజుల పండగ. ధనుర్మాస కాలం ప్రారంభమైన దగ్గరనుండే తెల్లవారుజామునే పక్కనే ఉన్న 'దరుమపురి ఆదీన మడం' (ధర్మపురి ఆధీన మఠం)లో నుండి, కొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడులనుండి భక్తిగీతాలు గాలిలోనుండి తేలివచ్చి మమ్మల్ని మేల్కొలిపేవి. మెడ్రాస్ కు చలికాలంలేదు. రెండే కాలాలు. వేసవికాలం, వర్షాకాలం. అయినా ఉదయాన్నే సముద్రపుగాలి చలి చలిగా గిలిగింతలు పెట్టేది. అప్పట్లో ఇంత జనసముద్రం, వాతావరణ కాలుష్యం లేని రోజులు కదా.

మహానగరం కావడంవలన రోడ్లమీద సంక్రాంతి ముగ్గుల హడావుడి ఎక్కువ కనపడేది కాదు. ఎవరింటి వాకిట్లో వారు ముగ్గులు పెట్టుకునేవారు. మాంబళం శివ విష్ణు ఆలయం, మైలాపూర్ కపాలేశ్వరాలయం, ట్రిప్లికేన్ పార్ధసారధి, విల్లివాక్కం దామోదరస్వామి, ఇతర ప్రముఖ ఆలయ ప్రాంతాల  మాడ వీధులలోని స్త్రీలంతా చూడముచ్చటైన ముగ్గులు, వాటిమధ్య రకరకాల పువ్వులతో గొబ్బెళ్ళుతో అలంకరించేవారు. బోగి(భోగీ), పొంగల్(సంక్రాంతి), మాట్టు పొంగల్(కనుమ). ఆ మర్నాడు ముక్కనుమను ఉழవర్  తిర్నాళ్ గా పండుగ చేసుకుంటారు. ఉழవర్ అంటే కర్షకులు. రైతులు, వ్యవసాయదారుల కృషిని గుర్తిస్తూ నాలుగో రోజు ఊరు వాడా అంతా కలిసి సమష్ఠిగా చేసుకునే పండుగ రోజు.  ఈ నాలుగు రోజులూ ఊరంతా ఆనందోత్సాహాలతో సందడే సందడి. 

మకర సంక్రాంతి పండగ అంటేనే వ్యవసాయదారులకు, పశువులకు సంబంధించిన పండగ. ఈ పండగ విశేషాలన్నీ మన పాత తెలుగు సినీమాలెన్నిటిలోనో చూశాము. భోగీనాడు ఉదయాన్నే భోగీ పిడకల తోరణంతో, లేదా ఎవరిళ్ళనుండో దొంగతనంగా ఎత్తుకొచ్చిన పాత తలుపులు, విరిగిపోయిన కిటికీలు, కట్టెలతో భోగి మంటలు వేయడం మా ఊళ్ళలో రివాజు. కానీ మెడ్రాస్ లో రోడ్లమీద భోగీమంటల నిషేధం వుండేది. పైగా పేడ గొబ్బిళ్ళ పిడకలు తట్టేంత అవకాశం నగరవాసులకు వుండేది కాదు. అందువల్ల పాత రబ్బర్ టైర్లు, ట్యూబులు, చిత్తు పుస్తకాలు వారి వారి ఇళ్ళలోనే మంటపెట్టి ఆనందించేవారు. ఈ రకమైన చర్యలవలన కాలుష్యం పెరగడం తప్ప మరే విశిష్టత లేదు. ఈ నాలుగురోజుల పొంగల్ పండగలకు ప్రభుత్వపరమైన ఆశీస్సులు వున్నాయి. ఈ రోజుల్లోనే తిరువళ్ళువర్, అంబేద్కర్ ల జయంతులని కూడా పురస్కరించుకుని అదనంగా చేర్చి సభలు, సమావేశాలు, కవితాగోష్టులంటూ ప్రజలను మరింత చైతన్యవంతం చేయడం జరుగుతూంటుంది. 

పొంగల్ వస్తోందంటే మూర్ మార్కెట్ పక్కనున్న కన్నప్పర్ తిడల్ లోని SIAA గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ లు ప్రారంభమయేవి. అలాగే సర్కస్ కంపెనీల డేరాలు వెలిసేవి. ఒక ఏడాది కమలా త్రీ రింగ్ సర్కస్ మెడ్రాస్ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఆ సర్కస్ ఆడిన రోజుల్లో రాత్రిపూట సెర్చ్ లైట్లతో ఊరంతటిని హడలుగొట్టారు. వున్నట్టుండి లైట్ వెలుగు పడి మాయమయేది. మళ్ళీ రెండు మూడు నిముషాలకు కనపడేది.  ఆ దీపపు వెలుగు ఎక్కడో వున్న మా టి నగర్ ఇళ్ళలో కూడా  పడేది. అదేమిటో తెలియక జనాలు మొదట్లో కంగారు పడ్డారు. తర్వాత తెలిసింది అది 'కమలా త్రీ రింగ్ సర్కస్' వాళ్ళ ప్రచార సాధనమని. భారీ ఎత్తున అనేక ఆకర్షణలు కలిగిన ఆ సర్కస్ నేనూ చూశాను.

డైరీ మిల్క్, బాటిల్డ్ మిల్క్ సంస్కృతి రాకముందు 35, ఉస్మాన్ రోడ్ కి ఆవుపాలు, గేదెపాల సరఫరావుండేది. ఉదయమో, రాత్రో ఆ పశువులను ఇంటికి తీసుకువచ్చి పాలు పితికి ఇచ్చేవారు. ఆ పాలు పితికి పోసే ఆర్ముగం మహా మాయలోడు. ఒక పొడుగాటి గొట్టంలాటి స్టీల్ లేదా ఇత్తడి పాత్రలో పాలు పితికేవాడు. ఆవుపొదుగులు కడగడానికి ఆ పాత్రలో నీరు తెచ్చేవాడు. కడగడం అయ్యాక పాలు తీసేముందు "అమ్మగారు చూసుకోండి" అంటూ ఆ పాత్రను బోర్లించి తిప్పేసేవాడు. పక్కనే అమ్మగారో, తమ్ముడు కృష్ణో(గుండు మావయ్య) ఉంటే తీసిన పాలు చిక్కగావుండేవి. దగ్గరలో ఎవరూ లేకపోతే ఆ పాత్రలో నీళ్ళు అలాగే వుండేవి. పాలు నీళ్ళలాగే వుండేవి. ఈ మాయాజాలం అందరికీ ఎరికే. చీవాట్లు పెట్టడమూ జరిగేది. ఆ పాలవాడు కుంటిసాకులూ సాగేవి. మాట్టు పొంగల్ రోజున ఆ ఆవులను బాగా అలంకరించి మాస్టారింటికి తీసుకువచ్చేవాడు. ఆవుమీద భక్తికాదు. పండగ ఈనాముల కోసం. ఆవుల ఒళ్ళంతా పసుపు పూసి కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరణ చేసేవాడు. ఆవుల కొమ్ములు, కాలిగిట్టలకు రంగు పెయింట్లు వేసేవారు. ఆయా పాలవాళ్ళు ఏ రాజకీయ పార్టీ అనుయాయులైతే ఆ పార్టీ రంగులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోనూ లేదా ఎరుపు, నలుపు రంగుల్లోను ఆ పశువుల కొమ్ములు మెరుస్తూండేవి. ఆ రెండు కొమ్ముల చివర మువ్వలు కట్టేవారు. అవి తల ఆడించినప్పుడల్లా గలగలాడుతూ చూడముచ్చటగా వుండేది. బేటరీతో వెలిగే చిన్న చిన్న బల్బులూ తగిలించేవారు.  అమ్మగారు ఆ పశువులకు ఓ చిన్న పూజలాటిది జరిపి ఆ పాలవాడికి పొంగల్ ఇనాము ఇచ్చిపంపేవారు. 

పొంగల్ రోజుల్లో పానగల్ పార్క్ మార్కెట్, పాండీబజార్ మార్కెట్, రంగనాధన్ స్ట్రీట్ బజార్లో అన్ని షాపులు కళకళలాడుతూ వుండేవి. రకరకాల పువ్వుల దుకాణాలు, పళ్ళదుకాణాలు, పసుపు కొమ్మలు, పొడుగాడి చెరుకుగడలు, మురియులు(మరమరాలు) కొనుక్కొని పట్టుకెళ్ళే పిల్లలు పెద్దలతో కాలుపెట్టే సందులేకుండా వుండేది.

ఉழవర్ తిరునాళ్ రోజున ఊరిజనమంతా మెడ్రాస్ మెరీనా బీచ్ లోనే కాపురం. ఎక్కడెక్కడినుండో ప్రత్యేక బస్సుల్లో తండోపతండాలుగా కుటుంబాలతో సహా వచ్చి బీచ్ లో ఆటపాటలతో ఆనందంగా గడిపేవారు.
 
పొంగల్ వస్తోందంటే కొత్త సినిమాలకు కొదవలేదు. పోటాపోటీగా సినీమాలను వదిలేవారు. రోజుకు నాలుగైదు ఆటలతో పొంగల్ వారంరోజులు అన్ని ధియేటర్లు కళకళలాడుతూ కోలాహలంగా వుండేవి. ఏ సినీమాకైనా కలెక్షన్లు కనిపించేవి. రెండోవారం నుండి ట్రెండ్ మారేదనుకోండి అది వేరే విషయం. దీపావళీ, పొంగల్ పండగలొస్తే ఎమ్.జి.ఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎస్.ఎస్.రాజేంద్రన్ల సినీమాలు తప్పనిసరిగా విడుదల చేసేవారు.  అవి కూడా పక్క పక్క ధియేటర్లలో వేసేవారు. ఆయా థియేటర్ల దగ్గర పండగ వాతావరణంతో పాటు యుధ్ధవాతావరణమూ కనిపించేది. బుధ్ధున్నవాడెవడూ పండగల రోజులలో సినిమాకు వెళ్ళడనుకునేవాళ్ళం. మెడ్రాస్ లో కేవలం ఎమ్జీయార్ సినీమాలు మాత్రమే ఆడే ధియేటర్లు కొన్నయితే, శివాజీ సినీమాలు తప్ప వేయని సినిమా హాల్స్ మరికొన్ని ఉండేవి. జెమినీ గణేశన్ ను 'సాంబార్ హీరో పడమ్(సినీమా)' అని ఎగతాళి చేసేవారు. కానీ, ఆ సాంబార్ హీరో ఏక్ట్ చేసిన మాయాబజార్, తేన్ నిలవు,  కళ్యాణ పరిసు(పెళ్ళికానుక), కొంజుం సలంగై(మురిపించే మువ్వలు), 'వంజికోట్టై వాలిబన్', 'రాము', 'కర్పగం'(తోడు నీడ) వంటి చిత్రాలెన్నో తమిళనాడులో, సిలోన్, మలేషియా  వంటి విదేశాలలో సైతం సంచలనం సృష్టించాయి.

ఇలాటి పండగ సీజన్లలోనే ఒక సంవత్సరం మెడ్రాస్ కు ఒక కొత్తరకం సినీమా వచ్చింది. ఆ సినీమాను చూడ్డానికి ఆడమగా, పిల్లజెల్లా, ముసలిముతక, చిన్నాచితక అందరూ తండోపతండాలుగా ఎగబడి ఆ సినీమాను చూసారు. మేము ఆ సినీమా ఆ వూరు వదలి వెళ్ళిపోవడానికి ముందు వెళ్ళి చూసివచ్చాము. 'సర్కరామ' అనే ఆ సినీమాను మనవాళ్ళు 'సర్కారమా' అనో 'సర్కారామా' అనో అనేవారు. Circle Vision. Panorama లాగా Circlerama. ఆ సినీమా విశేషం ఏమంటే ఆ సినీమాను నిల్చునే చూడాలి. కూర్చుండ కుర్చీలుండవుగా. 

  

సినీమాను వెయ్యడానికి ప్రొజెక్టర్లు కనపడేవి కావు. ఒక్కొక్క ఆటకు నూరు, నూటయాభైమంది లోపలే జనాలను వదిలేవారు. ఆ సినీమా హాలు పెర్మనెంట్ కాదు. ఒక గుడారంలో ఆ సినీమా. సన్ ధియేటర్ పక్కనే వున్న విశాలమైన కాంగ్రెస్ గ్రౌండ్స్ లో ఈ సర్కారమ సినీమా ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. సినీమా మొదలవగానే గుడారంలోపల అన్ని దిక్కులనుండి సినీమా పెద్ద పెద్ద తెరలమీద బ్రహ్మాండమైన సౌండ్ తో  కనిపించింది. ఆ సినీమా కధాంశం గుర్తులేదు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా, నోళ్ళు తెరచి చూశారు. తరువాతి రోజుల్లో సినీమా టెక్నాలజీ పెరిగి బిర్లా ప్లానెటోరియా, 70 mm స్క్రీన్ లు వచ్చాక అలాటి వింతలెన్నో సర్వసాధారణం అయాయనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ నాటికి 'సర్కరామ' ఒక గొప్ప అనుభవం. 

మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తల్లో అన్ని సింగిల్ స్క్రీన్ ధియేటర్లే. 1960-70లలో ఒకే కాంపౌండ్ లో రెండేసి, మూడేసి స్క్రీన్ లున్న ధియేటర్లు కట్టడం ప్రారంభమయింది. 

మెడ్రాస్ సిటీ లిమిట్స్ లో చాలా లిమిటెడ్ గానే సినీమా హాల్స్ వుండేవి. ముందుగా టి.నగర్ నుండి ప్రారంభిస్తే - పాండీ బజార్లో "రాజకుమారి" (తమిళం) (ఇది ప్రముఖ సినీమా నటి టి.ఆర్.రాజకుమారిది. ఈ ధియేటర్లో సినీమా చూడడానికి వచ్చిన కృష్ణకుమారి  తానే ఒక  సినిమా హీరోయిన్ అయిపోయింది. తరువాత, రాజకుమారి చేతులు మారి "సాహ్నీ" గా మారిన రోజుల్లో ఇంగ్లీష్, హిందీ సినిమాల హాలుగా మారింది. ఇందులోనే నేను "ఝనక్ ఝనక్ పాయల్ బాజే", "నవరంగ్" సినీమాలు చూశాను. మళ్ళీ కొన్నాళ్ళ తరవాత రాజకుమారీగా మారిపోయింది.

జి.ఎన్.చెట్టి రోడ్ (గోపతి నారాయణస్వామి చెట్టి రోడ్) చివర మౌంట్ రోడ్ కు సమీపంలో "సన్" ధియేటర్(తమిళం). ఇది బండి సుందర్రావు నాయుడు గారనే తెలుగాయనది. ఎమ్జియార్ సినిమాలే వేసేవారు. వెస్ట్ మాంబళంలో నేషనల్ ధియేటర్ (తమిళం), సైదాపేటలో "జయరాజ్"(తమిళం), అడయార్ లో "ఈరోస్". లజ్ కార్నర్లో "కామధేను", మౌంట్ రోడ్ ప్రాంతంలో  "గెయిటీ ", మెడ్రాస్ లో నిర్మించబడ్డ మొట్టమొదటి సినీమాహాలు. 1913 లో శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడుగారు కట్టించారు. పరశువాక్కంలోని "రాక్సీ", మింట్ లోని "క్రౌన్" ధియేటర్ లను కూడా రఘుపతి వెంకయ్య నాయుడే నిర్మించినట్లు సినీమా చరిత్ర. 

గ్లోబ్" ఇదే తరువాత "అలంకార్". "ప్లాజా", "వెల్లింగ్టన్", "మిడ్ లాండ్" (ఈ ధియేటర్ ను నటి జయప్రద కొని "జయప్రద" గా మార్చి పైనే మరో ధియేటర్ కూడా కట్టించారు). "న్యూ ఎలిఫిన్ స్టన్", "ఓడియన్", గెయిటీ , "కాసినో ',  ట్రిప్లికేన్ హైరోడ్ లో "స్టార్', వాలాజారోడ్ లో "పారగన్", మౌంట్ రోడ్ గెయిటీ పక్కన కూవమ్ వంతెన దాటాక "చిత్ర", పరశువాక్కంలో "రాక్సీ", కెల్లీస్ లో "ఉమ", "మేఖల", అయనావరంలో "సయానీ", విల్లివాక్కంలో "నాదముని" (ఇందులో భానుమతి గారికి భాగస్వామ్యం వుండేదనేవారు). జార్జ్ టౌన్ లో  "సెలక్ట్"(తెలుగు), "మినర్వా" (ఇంగ్లీష్). ఇది గోడౌన్లు, వర్క్ షాపుల మధ్య ఒక మేడ మీద వుండేది. ముగ్గురేసి కూర్చునేలా పేము సోఫాలు. కెపాసిటీ వందలోపే). బ్రాడ్వేలో "ప్రభాత్", "బ్రాడ్వే", మింట్ లో  "మురుగన్",  "క్రౌన్", "శ్రీకృష్ణా", వాషర్ మేన్ పేటలో "మహరాణి", రాయపురంలో "బ్రైటన్", ఇవి ఆనాటి ప్రముఖ సినీమా హాల్స్.

ఈ రాక్సీ , బ్రాడ్వే సినీమాల మీద శ్రీ శ్రీ గారి ప్రసిధ్ధికెక్కిన వాక్యం ఒకటుంది. " బ్రాడ్వే లో కాంచనమాలా ? లేక రాక్సీలోని  నార్మా షెరెర్?" ఎవరిని చూడాలో అర్ధంకాక ఒక యువకుడు సందిగ్ధంలో పడ్డాడని. 

వీటిలో మౌంట్ రోడ్ లోని గ్లోబ్, ఓడియన్, మిడ్ లాండ్, న్యూఎలిఫిన్ స్టన్, కాసినోలలో కేవలం ఇంగ్లీష్ సినీమాలు, అప్పుడప్పుడు హిందీ సినిమాలు మాత్రం ఆడేవి. నేను చూసిన మొట్టమొదటి ఇంగ్లీషు సినీమా "కొ వాడీస్", విజయనగరంలో మా నారాయణమూర్తి చిన్నాన్నగారు తీసుకెళ్ళారు. ఆ సినీమా పేరు తప్ప మిగిలిన విషయాలు గుర్తులేవు. మెడ్రాస్ వచ్చాక నేను చూసిన తొలి ఇంగ్లీష్ సినీమాలు 'టెన్ కమాండ్మెంట్స్", "బెన్ హర్", మరొక సినీమా పేరు, ది మిస్టీరియస్ ఐలండ్ అయుండొచ్చు, సరిగా గుర్తులేదు. జూల్స్ వెర్న్ నవలే అని జ్ఞాపకం. ఆంధ్రపత్రికలో 'సాగరగర్భంలో సాహసయాత్ర' అనే సీరియల్ వచ్చేది. ఆ సినీమాయే అది. ఆ సినీమాను మిడ్ లాండ్ లోనే చూశాము. మానాన్నగారు, ఊరినుంచి వచ్చిన ఆయన స్నేహితులు, మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు, బావమరది సుబ్బారావు గారు కూడా వచ్చిన గుర్తు. నిజానికి నేను ఆరోజు వెళ్ళగలిగే స్థితిలో లేను. అప్పుడు నా ఎడమకాలి వెనక మోకాలు మధ్యలో పెద్ద సెగగడ్డలేచింది. కాలు మడవబడక విపరీతంగా బాధపడుతున్న సమయం. అయినా మొండిగా వాళ్ళతో బయల్దేరాను. ఆ రోజు వేసుకున్న డ్రెస్ కూడా బాగా గుర్తే. బ్లూబ్లాక్ పోలియెస్టర్ ప్యాంట్, సిల్వర్ గ్రే షార్క్ స్కిన్ ఫుల్ హాండ్ షర్ట్. అసలే కురుపు. దాని మీద ఒత్తిడి తెస్తూ మరింత వేడి కలిగించే పోలియెస్టర్ ప్యాంట్. బలవంతంగా, కుంటుకుంటూ వాళ్ళ వెనక వెళ్ళాను. ఆ సినిమా చాలా విజయవంతమైన సినీమా. అయితే బలవంతంగా వెళ్ళి సినిమా చూసిన ఆనందం దక్కలేదు. చూసి వచ్చాక రాత్రి కొంచెం జ్వరం కూడా వచ్చింది.

మౌంట్ రోడ్ గీతాకేఫ్ పక్కనే మలుపు తిరగగానే  (ఇప్పుడు సబ్ వే ఉన్న చోట) అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ వుండేది. ఎక్కువగా ఆంగ్లో ఇండియన్స్, వెస్ట్ నర్లే వచ్చేవారు. ఓపెన్ ఎయిర్ లోనే పూలతీగెలు, పూలతొట్లు మధ్య చిన్న వాటర్ ఫౌంటెన్. దాని చుట్టూ కుర్చీలు, రౌండ్ టేబిల్స్ తో వుండేది. దానిని ఆనుకొని వున్న అతి చిన్న ధియేటర్ న్యూ ఎలిఫిన్ స్టన్. పారమౌంట్, వార్నర్ బ్రదర్స్  వాళ్ళ వార్ సినీమా లు ఎక్కువగా ఆడేవి. అందులోనే "హటారీ"  అనే  ఇంగ్లీష్ సినీమా చూసాను. చూడడం వరకే. బ్రహ్మాండమైన దృశ్యాలు చూసి ఆహా! ఓహో! అని ఆనందించడం వరకే. ఆ  అమెరికన్ ఇంగ్లీష్ ఒక్క మాటకూడా అర్ధమైయ్యేదికాదు. ఇప్పటికీ. నేనూ హాలీవుడ్ సినిమాలు చూస్తాననిపించుకోవడం కోసం.  స్టాటస్ సింబల్ కదా! 

ఓడియన్ లో "జిస్ దేశ్ మే గంగా బహతీహై", మిడ్ ల్యాండ్ లో "మొఘల్-ఏ-ఆజం" చూశాను. మరపురాని చిత్రాలు.

నేను చూసిన మొట్టమొదటి 70 mm సినిమా లిజ్ టేలర్ , రిఛర్డ్ బర్టన్, రెక్స్ హారిసన్ల "క్లియోపేట్రా". సఫైర్ థియేటర్లో. 64లో ఆ థియేటర్ కట్టినప్పుడు అందులో రిలీజైన మొట్టమొదటి సినిమా క్లియోపేట్రా. మద్రాసులోని మొదటి 70 mm థియేటర్. లాబీలో స్నాక్స్ కౌంటర్ దగ్గర ఓ 'Foosball' table కూడా ఉండేది. ఆ కౌంటర్ వెనక గోడమీద ఆరడగుల ఎత్తునుంచి రూఫ్ దాకా ఓ పది పదిహేనడుగులు పొడుగున్న wooden board మీద ఆ థియేటర్ లో అప్పటి వరకూ రిలీజైన సినిమాల లిస్ట్ డేట్ వారీగా ఉండేది. కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఏ సినిమా చూసామో, లేదా చూడలేదో అని లెక్కబెట్టుకుంటూన్న జనం కూడా ఉండేవారు. మౌంట్ రోడ్ వేపు వ్యూ కనిపించేలా అద్దాలతో ఓ లిఫ్ట్ పైకి కిందికీ వెళుతూ కనిపించేేది.  

ట్రిప్లికేన్ ప్రాతంలో ముస్లీమ్ జనాభా ఎక్కువగా ఉండేది. అందువల్ల అక్కడి "స్టార్" ధియేటర్లో హిందీ సినీమాలు మాత్రం ఆడేవి. "సెలెక్ట్" సినిమాలో తెలుగువి వచ్చేవి. కానీ అక్కడికి వెళ్ళి సినీమా చూడడమంటే మరో ఊరు వెళ్ళడమే. ఈ సెలెక్ట్ లో మాస్టారితో కలసి ఒక సినిమాకు వెళ్ళాము. ఆ సినీమా విశేషాలు రానున్న వారాలలో. ఇక మిగిలిన సినీమా హాల్స్ లో అరవ సినీమాలే ఆడేవి.

ఇన్ని సినీమా హాల్స్ వివరాలు నాకు ఎలా తెలుసనే సందేహం మీకు రావడం సహజం. ఆరోజుల్లో మెడ్రాస్ రోడ్లలో వుండే ఇళ్ళ కాంపౌండ్ గోడలమీద పెద్ద పెద్ద సినిమా వాల్ పోస్టర్స్ పెద్ద పెద్ద అక్షరాలతో దర్శనమిచ్చేవి. సినీమా పోస్టర్స్ లేని సిటీ గోడలే అరుదు. అలాటి వాటిలో ఘంటసాల మాస్టారి ఇంటి కాంపౌండ్ వాల్. అదెందుకో మరి, సినీమా వాల్ పోస్టర్ల బారిన పడలేదు. కొన్నేళ్ళ తర్వాత సర్కారు వారు గోడలమీద సినీమా వాల్ పోస్టర్ల సంస్కృతికి చరమగీతం పాడారు. అయితేనేం, మద్రాస్ వీధుల గోడలన్నీ రాజకీయ పార్టీల కబ్జాకు గురి అయాయి. ఇప్పుడు ఏ గోడ చూసినా ఉదయసూర్యుడు, రెండాకులు, హస్తం, సుత్తి కొడవళ్ళు, వాటి నాయకుల నిలువెత్తు చిత్రాలు మనలను బెదిరిస్తూంటాయి.  

మా ఇంటి ఎదురుగా వుండే అన్ని ఇళ్ళ గోడలమీదా కొట్టచ్చేలా సావిత్రి, అంజలి, భానుమతి, సరోజాదేవి, రాజసులోచన, జమున, శివాజీ గణేశన్, ఎమ్జీయార్, ఎమ్ ఆర్ రాధ, పి.ఎస్ వీరప్ప, నంబియార్ మొదలగువారి  రంగు రంగులబొమ్మలు, దర్శనమిచ్చేవి. ఆ పోస్టర్లలో సినీమా హాల్స్, అవి ఉండే స్థలాలు ఇంగ్లీష్ లో ఉండేవి. సినీమా పేర్లన్నీ తమిళంలో పెద్దవిగా ఉండేవి. నేను తమిళం నేర్చుకోవడానికి ఎక్కువగా సహాయపడినవి ఈ వాల్ పోస్టర్లే. ఆ సినీమా పేర్లేమిటో తెలుసుకొని అందులోని అక్షరాలను పోల్చుకోవడంతో ప్రారంభించాను. ఒకసారి మా ఇంటి ఎదురు గోడమీద ఎమ్జీయార్, భానుమతి, కన్నాంబల బొమ్మలతో ఒక వాల్ పోస్టర్ చూసాను. అందులో భానుమతి, కన్నాంబ వుండడం నన్ను ఆకర్షించింది. వాళ్ళిద్దరూ మనోళ్ళు కదా! ఆ సినీమా పేరేమిటని మా రావమ్మను (పామర్తిగారి పెద్దమ్మాయి) అడిగాను. "తాయిక్కుప్పింతారమ్" అని చెప్పింది.  అందులో నాకు రెండే రెండు మాటలు అర్ధమయాయి. ఒకటి తాయి. మరొకటి కుప్పింతారం. నా కళ్ళకెదురుగా మా ఇంటి ముసలి పనిమనిషి 'తాయి', కుప్పించి ఎగిరింది అన్నట్టనిపించి నవ్వొచ్చింది. నాకెందుకు నవ్వొచ్చిందో అర్ధంకాని రావమ్మ అయోమయంగా చూసింది. తర్వాత ఎన్నేళ్ళకో నాకు తమిళం కొంత అర్ధమవడం ప్రారంభించాక ఆ సినీమా అసలు పేరు అర్ధమయింది " తాయ్ క్కు పిన్ దారమ్" (అంటే 'తల్లి తర్వాతే భార్య' అని అర్ధం). ఎమ్జీయార్ సినీమాలన్నింటిలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా వుండేది. రాజకీయాలలో ఎదగడానికి కూడా తమిళనాడు మహిళల ఆదరణే కారణం.

ఈ మెడ్రాస్ ధియేటర్లలో ఎక్కడో ఏదో మూల ఘంటసాల మాస్టారు తమిళ పాటలు పాడిన సినీమాలు, సంగీతం చేసిన సినీమాలు ఆడుతూనేవుండేవి. తమిళ ప్రేక్షకుల చెవులకు ఘంటసాల పాట, పేరు సోకుతూనే వుండేది.

అలాగే, ఇన్ని సినీమా హాల్స్ గురించి తెలియడం వెనక మరో కధ ఉంది.1970 ప్రాంతాలలో మా టివికె శాస్త్రిగారికి మెడ్రాస్ లో తెలుగు సినీమాలు ఆడించి తెలుగులకు సేవచేయాలనే కోరికపుట్టింది. మద్రాసులోనే తెలుగు సినీమా తయారవుతున్నా, సినీమాలతో సంబంధంలేని తెలుగువారు తెలుగు సినిమా చూసే అదృష్టానికి నోచుకోలేదు. తెలుగు జనాభా ఎక్కువుండే ప్రాంతాలను, ఆ చుట్టుప్రక్కల వుండే సినీమా హాల్స్ వివరాలు సేకరించేపనిలో నన్నూ వినియోగించారు. ఆ సమయంలో ఈ ధియేటర్ల పేర్లు, స్థలాలు మరింతగా తెలిసాయి. చివరకు అందరికీ అందుబాటులో టి.నగర్ బస్ స్టాండ్ కు ఎదురుగా వున్న కృష్ణవేణి ధియేటర్ ను ఎంపిక చేశారు. దాని ఓనర్ ఒక నెల్లూరు రెడ్డిగారని గుర్తు. ప్రతీ ఆదివారం ఉదయం ఏదో ఒక తెలుగు సినిమాను మార్నింగ్ షోగా వేయడం జరిగింది. ఆ ప్రయత్నం విజయవంతమైతే ఈవెనింగ్ షోస్ వేయాలని భావించారు. సుమారు ఒక ఏడాది వేసాక ఆదాయం కంటే ఖర్చులే  ఎక్కువగా కనిపించడంతో ఆ తెలుగు సినిమా సేవకు స్వస్తి పలికారు. నాకు మాత్రం మెడ్రాస్ సినీమా హాల్స్ పరిజ్ఞానం మిగిలిపోయింది. 

1960ల తర్వాత ఆనంద్, సత్యం, సఫైర్, దేవీ కాంప్లెక్స్ - దేవీ, దేవీ పారడైజ్, దేవీబాలా, దేవీకళ - పైలట్, ఉడ్ లాండ్స్, శాంతి, అభిరామి, మోక్షమ్, వంటి మల్టీ స్క్రీన్ ధియేటర్లెన్నో వెలిసాయి. అయితే ఇవన్నీ చాలావరకూ ఈనాడు మూతబడి కళ్యాణ మండపాలుగానో, షాపింగ్ మాల్స్ గానో మారిపోయాయి. ఇవాళ సినీమా ధియేటర్ల బిజినెస్ అంత లాభసాటి కాదనే స్థితిలో వున్నారు. ఇప్పుడంతా మల్టీప్లెక్స్ కల్చర్. గత ఇరవై ఏళ్ళలో నేను థియేటర్లలో చూసిన సినీమాలు ఒక పాతిక కూడా వుండవు. ఎందుకంటే ఈ తరం సినీమాలు, అందులో వినిపించే సంగీతం విని, చూసి ఆనందించే స్థితిలో ఏమాత్రం లేకపోవడమే. 

ప్రేక్షకుల హృదయాలకు హత్తుకొని పదికాలాలపాటు (ఘంటసాలవారి డైలాగ్) పాడుకునేలా ఈనాటి సినీమా సంగీతం లేదు. 

1959 లో వచ్చిన  'మాంగల్యబలం' 'శభాష్ రాముడు' వంటి కొన్ని చిత్రాలు తమిళంలో కూడా రిలీజ్ అయి గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాలవారి కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేసాయి. 

1959 లో తెలుగులో కూడా గాయకునిగా, సంగీత దర్శకుడిగా ఆఖిలాంధ్ర ప్రజలచేత కొనియాడబడేలా ఏన్నో సినీమాలు వచ్చాయి. అందులో ముఖ్యమైనవి - మాంగల్యబలం, అప్పుచేసి పప్పుకూడు, సతీ సుకన్య, పెళ్ళి సందడి, జయభేరి, ఇల్లరికం, రేచుక్క పగటి చుక్క, శభాష్ రాముడు, బాలనాగమ్మ, బండరాముడు, భక్త అంబరీష వంటి సినీమాలున్నాయి. వీటన్నిటిలో మకుటాయమానంగా నిలిచిపోయిన చిత్రం "జయభేరి". ఈ చిత్రంలో పాటలన్నీ ఆపాతమధురమే. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన పాటలన్నీ గాయకులకు సవాలు విసిరి హడలెత్తించేవే. అందులోని రసికరాజా, మది శారదా దేవి మందిరమే, రాగమయీ రావే, నందుని చరితము, యమునా తీరమున, ఇలా ఈ సినీమాలో పాటలన్నింటికీ ఘంటసాల మాస్టారు ప్రాణప్రతిష్ట చేసి సంగీత దర్శకుడు పెండ్యాలగారి కీర్తికి దోహదపడ్డారంటే అతిశయోక్తికాదు. జయభేరి చిత్రంలోని "మదిశారదాదేవి" పాట సన్నివేశం తనకెంతో ఇష్టమైనదని ఘంటసాల మాస్టారు అనేక సందర్భాలలో చెప్పారు. గురుపాదులైన నాగయ్యగారి సమక్షంలో అక్కినేని, ఇతర శిష్యబృందం ఈ పాటను ఆలపించినప్పుడు, విజయనగరంలో తమ గురువులు శ్రీ పట్రాయని సీతామశాస్త్రిగారి సన్నిధిలో తాను చేసిన సంగీత సాధన, గురువుగారి బోధన, వాత్సల్యం గుర్తుకు వచ్చేయని, ఈ రకమైన పాట చిత్రీకరణ చాలా ఆనందం కలిగించిందని చెప్పేవారు. 


                  "జయభేరి" చిత్రంలో "మది శారదాదేవి మందిరమే" పాట

ఈ సంవత్సరంలో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలో శభాష్ రాముడు, పెళ్ళి సందడి సినీమాలు సంగీతపరంగా కూడా మంచి పేరు తెచ్చి పెట్టాయి. శభాష్ రాముడు లోని "రేయీ మించేనోయి రాజా", "జయమ్ము నిశ్చయమ్మురా", పాటలు, "పెళ్ళిసందడి" సినీమా లోని "రావే ప్రేమలతా", "ఛమక్ ఛమక్ తారా, "జాలీ బొంబయిలే మామా", లీల, జిక్కిలు పాడిన 'సమయమిది డాయరా సరసుడా' అనే జావళీ తరహా పాట, "హైలేలో నారాజా రావోయి నీదేనోయి కన్నె రోజా" అనే ఓరియంటల్ మ్యూజిక్ తో వున్నపాట ఈనాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే వున్నాయి. ఈ చిత్రాలలోని సంగీతం విషయంలో  మాస్టారు అన్ని రకాల సంగీత శైలులు ప్రయోగించడం ఒక విశేషం. శభాష్ రాముడు, పెళ్ళి సందడి ఈ రెండు సినీమాల రీరికార్డింగ్ చూశాను.


           "సమయమిది డాయరా" -పెళ్ళిసందడి - లీల, జిక్కి యుగళగీతం

"ఒక్క లెగ్ లో జాక్పాట్ మిస్. ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు .....??

వచ్చే వారం ....  
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, January 9, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పధ్నాలుగవ భాగం

09.01.2021 - శనివారం భాగం - 14*:
అధ్యాయం 2  భాగం 13 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1959 - 1963 ల మధ్య నెం.35, ఉస్మాన్ రోడ్, 36, ఉస్మాన్ రోడ్ లలో బాలకాండ సాగింది.  పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యంగా ఇల్లంతా కళకళలాడింది. 


35, 36 ఉస్మాన్ రోడ్ పిల్లలు

నెం.35, ఉస్మాన్ రోడ్ లోని ఘంటసాలవారి పిల్లలు, ఔట్ హౌస్ లోని సంగీతరావుగారి పిల్లలు, నెం.36, ఉస్మాన్ రోడ్ లోని రాజగోపాలన్ గారి పిల్లలు ఏ అరమరికా లేకుండా, ఏ భేషజాలు లేకుండా చివరివరకూ స్నేహసుహృద్భావాలతో, ఒకరిపట్ల మరొకరు ప్రేమాభిమానాలు కనపరుస్తూ మెలిగారు. ఇప్పటికీ ఈ మూడిళ్ళలో పుట్టి పెరిగిన సంతానం అలాగే వున్నారు. అక్కా తమ్ముడూ, అన్నా చెల్లి అంటూ ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోకపోయినా అందరూ సోదరభావంతోనే మెసలుతూ వచ్చారు. ఇంట్లో పెద్దల భావాలు, నడవడిక, పెంపకం ఎలావుంటే ఆ ఇంటి పిల్లలు కూడా అదే రీతిలో పెరుగుతారు, అని జనరలైజ్ చేసి చెప్పలేము, కానీ, ఆయా కుటుంబాలలోని సంస్కారం అందుకు తప్పక దోహదం చేస్తుంది. 

1959 జనవరిలో మా యింట మా రెండో చెల్లెలు పద్మ, 1959 మే నెలలో మాస్టారి పెద్దమ్మాయి శ్యామల, 1960 జూలైలో మాస్టారి రెండో అమ్మాయి సుగుణ, 1961 మే లో మా మూడో చెల్లెలు లలిత, 1963 జనవరిలో ఘంటసాలవారి ఆఖరి అమ్మాయి రాధ (శాంతి), 1963 అక్టోబర్ లో మా ఆఖరి చెల్లెలు సుమబాల పుట్టడం జరిగింది. మా పక్కిల్లు నెం.36, ఉస్మాన్ రోడ్, మామా ఇంట్లో కూడా దాదాపు ఈ కాలంలోనే వారి ఆఖరి ఇద్దరి ముగ్గురు పిల్లలు పుట్టిన గుర్తు. మా పక్కింటి మామా (శ్రీAKరాజగోపాలన్), మామీల (శ్రీమతి పర్వతవర్థని) పెద్దబ్బాయి రఘు, సీత, తార, లల్లి(లలిత), శేఖర్ (AKస్వామినాథన్), కణ్ణా(బాలకృష్ణన్), శీను(శ్రీనివాసన్), వీళ్ళందరికీ నడకా, మాటా వచ్చేసరికి అందరి గమ్యం 35 ఉస్మాన్ రోడ్డే.



మా అమ్మగారికి పిల్లలంటే మహా ప్రాణం. ఆవిడ ఏనాడు పిల్లలను తిట్టడంగానీ, వాళ్ళను కఠినంగా శిక్షించడంవంటివి గానీ  చేయలేదు. విజయనగరంలో ఒకేఒకసారి మాత్రం  ఆవిడ కోపాన్ని నా మీద ప్రయోగించింది. కారణం గుర్తులేదుఅందువలన ఈ రెండిళ్ళలోని పిల్లలు మా అమ్మగారంటే చాలా ఇష్టపడేవారు. ఆవిడ దాదాపు ఐదు దశాబ్దాలు మద్రాసులోనే గడిపినా ఆవిడకు తమిళం ఒక్క ముక్క ఒంటబట్టలేదు. ఆవిడ ఆ ప్రయత్నమూ చెయలేదు. (మా నాన్నగారికీ తమిళం రాలేదు. భాష అర్ధమవుతుంది కానీ, మాట్లాడలేరు.)

అందువలన మా పక్కింటి పిల్లలు మా అమ్మగారితో మెసలుతూ అవసరంమేరకు తెలుగులో మాట్లాడడం నేర్చేసుకున్నారు. అలాగే  మాస్టారింట్లో పనిచేసే తాయి, ఆవిడ కొడుకు మా తెలుగులోనే మాట్లాడుతూ మా అమ్మగారికి అభిమానపాత్రులయ్యారు. మాస్టారింట్లో సావిత్రమ్మగారు, పాపగారు, అందరూ  తమిళం బాగా మాట్లాడతారు. నాకు మొదట్లో తమిళ భాష రానందువల్ల పక్కింటి మామా కుటుంబంతో, వారి పిల్లలతో పెద్దగా స్నేహం పెరగలేదు. అందుకు మరో కారణం నా వయసు. పక్కింటి రఘు తప్ప మిగిలిన రెండిళ్ళ పిల్లలు వయసులో చాలా చాలా చిన్నవాళ్ళు. వాళ్ళతో కలసి అల్లరిచేస్తూ, ఆటలాడే వయసు నాది కాదు. 

'బాలానాం రోదనం బలం' అంటారు. ఇంట్లో ఏదో మూల ఒకరు ఏడుపు మొదలెడితే వెంటనే రెసిప్రోకల్ గా మరో పక్కనుండి మరో శృతిలో మరొకరు గొంతు కలిపేవారు. ఇలా ఒక ఐదేళ్ళు అందరి ఆరున్నరశృతి  సప్తస్వరాలలాగా  వినిపించేవి. ఈ పిల్లల అల్లరితో ముద్దు మురిపాలతో నెం.35, ఉస్మాన్ రోడ్ లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. 1965 నాటికి  ఒక చిన్న సైజ్ కిండర్గార్డెన్ స్కూలుకు కావలసినంతమంది పిల్లలు ఈ రెండు లోగిళ్ళలో తయారయ్యారు.


మెరీనా బీచ్ లో ఉస్మాన్ రోడ్ పిల్లలతో నరసింగ

ఘంటసాల మాస్టారికి పిల్లలంటే ముద్దే. స్వపర భేదం లేదు. అందరినీ చేరదీసేవారు. ఆయన తీరికగా ఇంట్లో వుంటే ఈ చంటి పిల్లలంతా ఆయన గుండెలమీదే స్వారీ చేసేవారు. ఆయన కూడా ఏదో తమాషాలు చేసి ఆ పిల్లలను నవ్వించేవారు. పిల్లలమీద విసుక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి మాస్టారికి ఇష్టముండేది కాదు. ఆ సెషన్ అంతా అమ్మగారిది. అయ్యగారు ఇంట్లోలేనప్పుడు క్లాస్ తీసేవారు. అమ్మగారికి కోపం ఎక్కువే. అల్లరిపెట్టేవాళ్ళకి అమ్మగారి శిక్షలు తప్పేవికావు. తన ప్రేమపాశాన్ని తొడపాశాల ద్వారా  చూపెట్టేవారు. నొప్పితో కుయ్యో, మొర్రోమని నోరెత్తితే "ఛంపుతా" అని కళ్ళెర్ర జేసి అమ్మగారు చెయ్యెత్తితే చాలు అల్లరి చేసే పిల్లల నోళ్ళు మూతపడేవి. వాళ్ళు మెల్లగా అక్కడనుండి జారుకొని పాప పిన్నిగారి దగ్గరకో, మా అమ్మగారి దగ్గరకో చేరి కావలసిన సానుభూతిని, బిస్కట్ల లంచాన్ని పొందేవారు. మాస్టారింటి తీన్ దేవియాల అల్లరి చేష్టల వల్ల  ఆ ఇంట్లోని ఒక మంచి క్యారమ్ బోర్డ్ ఎందుకూ పనికి రాకుండాపోయింది. మరి అది ఎలాటి అల్లరో  మీరే ఊహించుకోండి.

1959 అంతా నెం.35, ఉస్మాన్ రోడ్ లో నిర్విరామ కార్యక్రమాలతో చాలా ఉత్సాహంగా సాగింది. 

ఆ సంవత్సరం ఘంటసాల మాస్టారింటికి సుప్రసిధ్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ గారు ఏడెనిమిది మంది పరివారంతో మద్రాస్ వచ్చారు.  

బడే గులాం ఆలీఖాన్ గారిది పాటియాలా ఘరానా సంగీత శైలి. తుమ్రీ, ఖయాల్ గానంలో అత్యంత నిష్ణాతులు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గాయకుడు. అటువంటి గాయకుడిని కళ్ళారా చూడడమే గొప్ప అదృష్టమైతే, ఆయన కచేరీ వినే మహాధ్భాగ్యం నాకు నా చిన్నతనంలోనే కలిగింది. ఘంటసాల మాస్టారు 'ఖాన్ సాబ్' అని పిలిచేవారు. మాస్టారికి ఖాన్ సాబ్ గాత్రమన్నా, ఆయన సంగీతమన్నా చాలా ఇష్టం. చంద్రహారం లోని "ఇది నా చెలీ, ఇది నా సఖీ" పాటకు ఘంటసాల మాస్టారు ఉపయోగించిన రాగేశ్వరి రాగం మీద ఖాన్ సాబ్ సంగీత శైలి ప్రభావం వుందని అంటారు. 



ఖాన్ సాబ్ తన కచేరీలలో విధిగా "క్యా కర్ సజనీ ఆయెన బాలం" అనే గీతాన్ని ఆలపించేవారు. ఘంటసాలవారికి ఈ గీతమంటే అమితమైన ఇష్టం. తరచూ హమ్ చేసేవారు. మా నాన్నగారు పాడగా కూడా విన్నాను. మాస్టారు వారిని, వారి వాద్యబృందాన్ని, పరివారాన్ని చాలా సాదరంగా, గౌరవంగా తమ ఇంటికి ఆహ్వానించి తీసుకువచ్చారు.

అప్పట్లో ఒక బ్రాహ్మడు ఒక ఇస్లామ్ మతస్థుడిని తీసుకువచ్చి తన ఇంట్లో పెట్టుకోవడం కొందరు ఛాందసవాదుల కన్నెర్రకు కారణమయింది, అని చెప్పుకోగా విన్నాను. అయినా ఘంటసాల మాస్టారు చాలా విశాల దృక్పథం కలవారు. ఎవరి విమర్శలను లెఖ్ఖ చేయలేదు. అందుకే ఖాన్ సాహేబ్ కు ఘంటసాలగారంటే అంత వాత్సల్యం, అభిమానం. వచ్చినవారందరికీ మాస్టారి ఇంటి మేడ భాగాన్ని పూర్తిగా కేటాయించి, ఇంట్లో వారెవరూ వారికి ఏ రకమైన అంతరాయం కలిగించరాదని హెచ్చరించారు. భోజన వసతులన్నీ మాస్టారింటినుండే వెళ్ళేవి. మేడమీదకు వెళ్ళడానికి ప్రత్యేకమైన త్రోవ వుండడం వలన ఎవరికీ ఏవిధమైన ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లన్నీ చేశారు. అంతకుముందు, వారు ఒకసారి మద్రాస్ వచ్చారట, కానీ, అప్పటికి మేము మద్రాస్ వెళ్ళలేదు. ఈసారి కొన్ని వరస కచేరీలు చేయడానికి మద్రాస్ వచ్చారు. అందులో ఒక రోజు కచేరీకీ మాస్టారింట్లో అందరితోపాటూ నేనూ వెళ్ళాను. ఆ రోజున కూడా ఆ "క్యా కర్ సజనీ ఆయెన బాలమ్"  గీతాన్ని ఎంతో మనోజ్ఞంగా గానం చేశారు. నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు. కానీ ఆయన పాట వింటూంటే చాలా ఆశ్చర్యంగా, ఎంతో హాయిగా, ఆనందంగా అనిపించింది.



ఖాన్ సాబ్ ను చూడకముందు ఆయన గురించి మా నాన్నగారిని అడగేను. 1960ల నాటికి మా ఇంట్లో అందరికంటే మా నాన్నగారు, ఆయన స్నేహితుడు శ్రీ పంతుల శ్రీరామశాస్త్రి గారు వలంగా ఉండేవారు. (మా ప్రాంతాల్లో లావుగా వుండడాన్ని 'వలంగా' వున్నాడని అంటారు.) మా నాన్నగారి కంటే ఘంటసాల మాస్టారు లావు. మాస్టారికి రెండింతలు బడే గులాం ఆలీఖాన్ గారు వుంటారని మా నాన్నగారు చెపితే 'అమ్మ బాబోయ్' అనిపించింది. నిజమే, ఖాన్ గారిది చాలా భారీకాయమే. పెద్ద పెద్ద బుర్ర మీసాలు, తలమీద నల్లటి టోపీ, పఠాన్లు లాగా వస్త్రధారణ. కారులోకి ఎక్కేప్పుడు, దిగేప్పుడు చాలా శ్రమపడవలసి వచ్చేది. చిన్న పీటలాటిది ఎప్పుడూ అందుబాటులో ఉండేది. ఖాన్ సాబ్ కు కానీ, ఆయన పరివారానికి కాని పెద్ద సమస్య భాష. వారందరికీ ఉర్దూ తప్ప మన తెలుగు , తమిళ భాషలు ఒక్క ముక్క అర్ధం కావు.  ఉర్దు, తెలుగు తెలిసిన ఎవరో మధ్యవర్తి ద్వారా కాలక్షేపం జరిగేది. ఘంటసాల మాస్టారిది, ఖాన్ సాబ్ ను చూసేందుకు వచ్చేవారందరిదీ ఒకటే భాష. సంగీతం.  అన్ని వర్గాలవారిని సమన్వయపర్చి వారధిగా నిలిచేది విశ్వవ్యాప్తమైన సంగీతమే. అక్కడ మరే యితర మాటలకు తావులేదు. అంతా సామవేద గానమే. అదే మన భారతీయ సంస్కృతి. ఖాన్ సాబ్ పాటను వినడానికి మద్రాస్ లోని ప్రముఖ సంగీత విద్వాంసులంతా మాస్టారింటికి ఎడతెరిపిలేకుండా వచ్చేవారు.  కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన విద్వాంసులందరు ఖాన్ సాబ్ ను చూసి ఆయనతో ముచ్చటించాలని వచ్చేవారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, డికె పట్టమ్మాళ్, ఎమ్మెల్ వసంతకుమారి, శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, వంటి విద్వాంసులను అప్పుడే చూసే అవకాశం లభించింది. ఇక సినీమా గాయకులు, అన్ని భాషలవారూ చూడడానికి వచ్చేవారు. 

ఖాన్ సాబ్ పాడుతున్నప్పుడు అంతరాయం కలగకూడదని, మెల్లగా చప్పుడు చేయకుండా మేడ మెట్లమీదే కూర్చొని శ్రధ్ధగా ఆయన పాటను ఆలకించేవాడినని ప్రముఖ కవి ఆరుద్ర తన వ్యాసం ఒకదానిలో వ్రాశారు. అర్ధరాత్రి దాటేవరకూ ఎవరో ఒకరు రావడం ఆయన పాడేది వినడం పరిపాటిగా వుండేది. ఖాన్ సాబ్ నిద్రపోతున్న సమయంలో కూడా స్వరమండల్ ఆయన గుండెలమీదే వుండేది. ఏమాత్రం మెలకువ వచ్చినా స్వరమండల్ తంత్రులన్నీ మధురమైన స్వరాలని వినిపించేవి.

ఖాన్ సాబ్ వంటి సరస్వతీ పుత్రులవల్ల, ఆయనను సందర్శించడానికి వచ్చే ఇతర గాయక స్రష్టల వలన "నెం.35, ఉస్మాన్ రోడ్" ఎంతో పావనమయింది. అందుకే, నా దృష్టిలో "నెం.35, ఉస్మాన్ రోడ్" ఒక సాధారణ గృహం కాదు. ఒక పవిత్ర సరస్వతీ నిలయం.  సంగీతాలయం. అటువంటి సాంస్కృతిక వాతావరణంలో పెరిగి పెద్దైన అదృష్టం నాకు లభించింది. పాట రాకపోయినా ఫర్వాలేదు, మంచి సంగీతం విని ఆనందించే హృదయముంటే చాలని భావిస్తాను.

వచ్చిన సంగీతాభిమానులంతా వెళ్ళిపోయిన తరువాత వారి రాత్రి భోజన కార్యక్రమం జరిగేది. ఖాన్ సాబ్ బృందమంతా చిన్న, పెద్ద తేడాలేకుండా అందరూ చుట్టూరా కూర్చొనేవారు. వారిమధ్యలో పెద్ద పెద్ద చపాతీ దొంతరలు, పక్కనే కొన్ని కూరల వంటకాలు ఉండేవి. ఇన్ని చపాతీలు  ఎవరైనా తినగలరా అని నాకు అనిపించేది. కానీ ఒక చిన్న ముక్క కూడా మిగిలేది కాదు. అన్నం విలువ తెలిసినవారే ఏ ఒక్క పదార్ధమూ పారేయకుండా భక్తి శ్రధ్ధలతో తింటారని మా పెద్దలు చెప్పేవారు.

ఖాన్ సాబ్ బృందంవారు భోజనాల సమయంలో ఒకరు వడ్డించడం, మరొకరు తినడం అనే ప్రసక్తేలేదు. ఎవరికి కావలసినది వారే వడ్డించుకు తినేవారు. భోజన సమయంలో కూడా గడచిన సంగీత కార్యక్రమం గురించి, లేదా, జరగబోయే కచేరీ గురించి చర్చించుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించేవారు. వారి భోజన కార్యక్రమం నాకు చాలా వింతగా అనిపించేది. వయసు, అనుభవం లేకపోతే ఏది చూసినా వింతే. ఇవన్నీ నాకు గుర్తుండిపోవడానికి కారణం ఆ చిన్న వయసు మనస్తత్త్వమేనేమో!

బడే గులాం ఆలీఖాన్ గారు ఏనాడు సినీమాలలో పాడలేదు. పాడాలనీ అనుకోలేదేమో! అటువంటి వ్యక్తిని బలవంతపెట్టి "మొఘల్ ఈ అజాం" చిత్రంలో తాన్సేన్ పాత్రకు పాడించారు. సినీమాలలో  ఒక సంగీత దర్శకుడి అదుపాజ్ఞలు పాటిస్తూ పాడడం ఇష్టంలేని ఖాన్ సాబ్ ఒక అనూహ్యమైన చాలా పెద్ద పారితోషికం డిమాండ్ చేసారట. అంత పెద్ద మొత్తం ఆ రోజుల్లో ఏ సినీమా గాయకుని ఇచ్చే స్తోమత ఏ నిర్మాతకు వుండేది కాదు. కానీ నిర్మాత పట్టుదలతో ఆయన కోరిన పారితోషికం ఇచ్చి పాడించారట. సంగీత దర్శకుడు నౌషాద్ అలి. సాధారణ గాయకులకు నేర్పినట్లు ఖాన్ సాబ్ కు పాట నేర్పడం సాధ్యమయేపనికాదు. అందువలన రాగం పేరు మాత్రం చెప్పి సాహిత్యం చేతికి ఇచ్చి  ఆయన ఇష్టానికే వదిలేసారట. పాడడమంటూ మొదలుపెడితే అది అనంతంగా సాగిపోవలసిందే. కట్ చెప్పి ఆపే ధైర్యం నౌషాద్ చేయలేకపోయారట. పాట అంతా రికార్డ్ చేసి తరువాత ఎడిటింగ్ సమయంలో తమకు కావలసినంత మేరకు సినీమాలో ఉపయోగించుకున్నారని మొఘలే ఈ అజాం సినీమా సంగీత విశేషాల గురించి వచ్చిన ఒక వ్యాసంలో చదివాను. ఇందులోని నిజానిజాలు నాకైతే తెలియవు.

బడే గులాం ఆలీఖాన్ గారు తమ బృందంతో తిరిగి బొంబాయి వెళ్ళేముందు అందరూ  వాకిట్లో కారు పోర్టికోలోకి వచ్చారు. ట్రైన్ లోనే వెళ్ళిన గుర్తు. మేడ మీద నుండి వారి సామానంతా కార్లలోకి ఎక్కిస్తున్న సమయంలో ఖాన్ సాబ్ పోర్టికోలోని సిమెంట్ అరుగుమీద కూర్చొని (ముక్కాలి పీట సాయంతో), వెళ్ళేముందు మాస్టారిని, మా నాన్నగారిని, అక్కడ ఉన్నవారందరినీ పలకరిస్తూ వచ్చారు. మా నాన్నగారి పక్కనే నిల్చొనివున్న నన్ను చూసి "ఈ కుర్రవాడి చెవులు పెద్దవిగా ఉన్నాయి. చాలా అదృష్టవంతుడు అవుతాడు" అని నా తల నిమిరారు. ఆ సమయంలో అందరి దృష్టి నా మీదే పడడంతో నాకు చాలా సిగ్గనిపించింది. అష్టవంకరలు పోయాను. 

అదృష్టం అనేక రకాలు.  ధనార్జనే ఒక్కటే అదృష్టంగా భావించనక్కరలేదు. ఆ విధంగా నేను అదృష్టవంతుడినే. అంతటి మహాగాయకుని మాటలు నాకు ఆశీస్సులు గా భావిస్తాను. మనిషికి తప్పనిసరిగా ఏదో ఒక ambition ఉండాలి,  జీవితంలో ఏదైనా ఘనమైన సాధన చేయాలి అని మా నాన్నగారు తరుచు అనేవారు. డబ్బు సంపాదన ఒక్కటే సాధన కాదని ఆయన దృఢాభిప్రాయంగా నాకు తోస్తుంది. 

1958-59 ప్రాంతాలలోనే 'నమో వెంకటేశా', 'ఏడు కొండలసామీ' వంటి పాటలు గ్రామఫోన్ రికార్డింగ్ జరిగిన జ్ఞాపకం. ఆ పాటల కంపోజింగ్ మేడమీద ముందు రూమ్ లో జరిగేది. ఆ సమయంలోనే ఆ పాటల రచయిత శ్రీ రావులపర్తి భద్రిరాజుగారిని చూసాను. ఆ పాటల కంపోజింగ్ సమయంలోనే 'ఖోల్' అనే వాద్యాన్ని మొదటిసారిగా చూసాను. 

 


చూడడానికి మృదంగంలా కనిపించినా ఆకారంలో, ధ్వనిలో చాలా తేడావుంది. అలాగే ఆ పాటలలో క్లేవైలిన్ (యూనివాక్స్) కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ రెండు పాటలు ఎంత హిట్టయినాయో అందరికీ తెలుసు. సినీమా పాటలకంటే ఎక్కువ ప్రజాదరణ పొంది ఘంటసాల మాస్టారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. 'ఏడు కొండలసామి' పాట గ్రామఫోన్ రికార్డ్ గా రావడానికి ముందు, కొంచెం తేడాగా ఘంటసాలగారు పాడినది ఆలిండియా రేడియోలో ప్రసారం చేసారు. 

మాస్టారి ఇంటి మేడమీది ముందు రూమ్ లో తెలుపు నలుపుల ఫోటో ఒకటి గోడకు వేలాడుతుండేది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఆ వ్యక్తి చేతిలో ఒక కాఫీ కప్ కూడా కనిపిస్తుంది. మాస్టారికి ఏ విధమైన సంబంధమో తెలియదు. తరువాత ఎవరో చెప్పారు ఆయన ఒక  పెద్ద గాయకుడని, హిందీ సినీమాలలో పాడతారని. మనిషి చాలా హాండ్సమ్ గా కనిపిస్తారు. నాకెందుకో అతనే  ముఖేష్ అని అనిపించేది. ఆ పేరే నా మనసులో  చాలాకాలం లాక్ అయిపోయింది. కొన్ని దశాబ్దాల తర్వాత, కొంత సినిమా పరిజ్ఞానం పెరిగాక అప్పుడు తెలిసింది ఆ ఫోటోలో వున్న హిందీ గాయకుడి పేరు తలత్ మహమ్మద్ అని. తలత్ మహమ్మద్ గళంలోని ఒక రకమైన వణుకు ఆయన ప్రత్యేకత. అది ఆయనకే చెల్లు.

1959లో ఘంటసాలవారి పుష్పకవిమానం (నెం.35, ఉస్మాన్ రోడ్)లోకి మరొక కొత్త వ్యక్తి ప్రవేశించాడు. అతని పేరు ముద్దు నరసింగరావు. 

చివర సర్కిల్ ఉన్నది నరసింగరావు

ఘంటసాల మాస్టారి స్నేహితుడు ముద్దు పాపారావుగారి కుమారుడు. పాపారావుగారు, మాస్టారు విజయనగరం సంగీత కళాశాలలో సహాధ్యాయులు. ఆప్తమిత్రులు. 


తాతగారి వెనుకే సర్కిల్ లో ఉన్నది ముద్దు పాపరావుగారు
ఎడమవేపు కూర్చుని సర్కిల్ ఉన్నది ఆయన అన్నగారి అబ్బాయి (నరసింగరావుకి కజిన్)

ఘంటసాలవారి స్నేహసౌశీల్యాలు చాలా గొప్పవి. పాపారావుగారు గుణుపూర్ లో ఉండేవారు. ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో వుండి కనుమూశారు. భార్యా పిల్లలకు జీవనాధారం కరువయింది. స్నేహితుడి కుమారుడైన నరసింగరావును తన దగ్గరకు రప్పించి తమ ఇంటి పిల్లవాడిలా ఆదరించారు. అతని చెల్లెళ్ళకు తనే దగ్గరుండి వివాహం జరిపించి ఆ కుటుంబానికి దారి చూపారు. నరసింగరావుకు పెద్ద ఉద్యోగం  ఏర్పాటు చేయడానికి కావలసిన విద్యార్హతలు లేక తమ ప్రొడక్షన్ ఆఫీసు పనులే చేయించేవారు. నరసింగరావు నాకంటే ఏడేళ్ళు పెద్ద. ఘంటసాలవారింటి పిల్లవాడిలాగే అందరూ చూసుకున్నారు. గత రెండేళ్ళ క్రితం వరకు ఘంటసాలవారి మూడో అల్లుడు, (శాంతి భర్త కొండూరు సురేంద్ర కుమార్) స్వగృహంలోనే సావిత్రమ్మగారికి సొంత కొడుకులా సేవచేస్తూ చేదోడువాదోడుగా వుండేవాడు. అతనికి కుటుంబ పరిస్థితులవల్ల పెద్దగా చదువు సంధ్యలు, వివాహం అమరలేదు. అమ్మగారు ఏవూరు వెళ్ళినా తోడుగావెళ్ళేవాడు. (రెండేళ్ళ క్రితం, సరిగ్గా 24 జనవరి 2019న) ఎనభై ఏళ్ళ వయసులో అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి నిద్రలో సునాయాస మరణం పొందాడు. మాస్టారి కుటుంబమే అంత్యక్రియలు జరిపించారు. ఎవరు ఏపాటి మేలు చేసినా మరువక పోవడమనేది ఘంటసాలవారి సౌహార్ద్రత, వాత్సల్యం. 

వేసవి శెలవులు వచ్చాయంటే 35, ఉస్మాన్ రోడ్ బంధు మిత్రులతో నిండిపోతుంది. మా ఇంటికి వచ్చే అతిధులు కూడా రాత్రిపూట నిద్ర మాస్టారింటి మేడమీదనే. 1959 వేసవుల్లోనే అని గుర్తు, మా నాన్నగారి పినతల్లి కొడుకు గుమ్మా మార్కెండేయ శర్మ. 


గుమ్మా మార్కండేయ శర్మ

మా ఇంటికి వచ్చి కొన్నాళ్ళున్నారు. ఆయన BA, B.Ed., మాస్టరుగారు. మెడ్రాసంతా చూపించడానికి అతనికి నేనే ఎస్కార్ట్ ను. ఇద్దరమూ కలసి బస్ లో చాల చోట్లకే తిరిగాము.

ఆ సమయంలోనే HMVలో మాస్టారివి రెండు పాటలు రికార్డ్ చేయడం జరిగింది. అవి రావులపర్తి భద్రిరాజుగారు వ్రాసిన "పాడనా ప్రభూ పాడనా", మరొకటి "జీవితమంతా కలయేనా" ఈ పాటల రికార్డింగ్ కు నేనూ, శర్మబాబు కూడా ఘంటసాల మాస్టారితో వెళ్ళాము. ఆ రికార్డింగ్ సమయంలో తీసిన ఫోటో కూడా ఉండేది. అందులో శర్మ కూడా కనిపిస్తారు. ఈ HMV రికార్డింగ్ స్టూడియో మౌంట్ రోడ్ లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసు ఎదురుగా వుండేది. కొత్తగా ఎవరు ఏ సినీమా తీయదల్చిన తమ సినీమాపేరును ఈ ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకెవరైనా అదే పేరుతో సినిమా తీస్తే చెల్లుబాటు కాకుండా చర్యలు చేపట్టేవారు. ఇప్పుడు ఆ ఫిలిం ఛాంబర్ కు ముందు వేపు మౌంట్ రోడ్ లో వుమ్మిడియార్స్ వారి పెద్ద నగల దుకాణం వెలసింది.

HMVకి పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ లో 'కోల్ ఇండియా' ఆఫీసు, మరొక పక్క సఫైర్, బ్లూ డైమండ్, ఎమరాల్డ్ థియేటర్స్ కాంప్లెక్స్ ఉండేది. 

ఆ బ్లూ డైమండ్ థియేటర్ ఇండియాలోనే మొట్టమొదటి కంటిన్యువస్ సినీమా థియేటర్. ఉదయం 9 గంటల నుండి రాత్రి ఒంటిగంట వరకు ఒకే సినిమా నాన్ స్టాప్ గా  వేసేవారు. ఒకే టిక్కెట్టు మీద రోజంతా ఆ థియేటర్లో కాలక్షేపం చేయవచ్చు. ఎక్కువగా ఇంగ్లీషు సినీమాలే వేసేవారు. పనీపాటాలేని వారంతా హాయిగా ఇక్కడ కాలక్షేపం చేసేవారు. ఈ సినీమా కాంప్లెక్స్ కు అధిపతులు వీకంసీస్ డైమండ్ జ్యూవెలర్స్ వారిది. ఆ స్థలంమీద రాజకీయ నాయకుల శీత కన్నుపడింది. ఆ కాంప్లెక్సంతా నేలమట్టమై,నిరుపయోగంగా, వివాదాస్పద స్థలమైపోయింది.

ఘంటసాల మాస్టారికి తీరిక చిక్కినప్పుడు భార్యా పిల్లలను ఇంట్లోనివారిని తీసుకొని బీచ్ కు వెళ్ళడం ఆయనకు సరదా. రాత్రి భోజనాలు అయ్యాక ఏ తొమ్మిదింటికో బయల్దేరేవారు. ఒక కారు చాలకపోతే రెండో కారును కూడా తీసేవారు. తమ్ముడు కృష్ణ మాస్టారికోసం ఒక చాప, దిండు కూడా తీసుకువచ్చేవారు. మాస్టారు బయట ఊళ్ళ కచేరీలకు వెళ్ళినప్పుడు ఈ తమ్ముడు కృష్ణే ఎస్కార్ట్. ఇతని గురించి మరోసారి చూద్దాము. ఆ రోజు బీచ్ కు మా నాన్నగారు, నేనూ, శర్మబాబు కూడా వెళ్ళాము (మా నాన్నగారికి అంత ఆమోదయోగ్యం కాకపోయినా. తనవల్ల, తనవారి వల్ల ఘంటసాలవారికి, వారి కుటుంబానికి ఏ అసౌకర్యం కలగకూడదనేది మా నాన్నగారి ధ్యేయం. ఆ విషయం నేనూ ఒక తండ్రినయ్యాకగానీ అర్ధంకాలేదు).

మాస్టారు ఎప్పుడు బీచ్ కు వెళ్ళినా ఇలియట్స్ రోడ్ చివరన ఉన్న గాంధీ స్టాచ్యూ బీచ్ కే తీసుకువెళ్ళేవారు. దానికి ఎదురుగా IG of Police (now DGP) ఆఫీస్, పక్కనే ఆలిండియా రేడియోస్టేషన్ ఉన్నాయి. కొత్త లైట్ హౌస్  కూడా ఇప్పుడు ఆలిండియా రేడియో కు ఎదురుగా ఉంది.  బిసెంట్ నగర్ లో కూడా ఒక ఇలియట్స్ బీచ్ వుంది. పాతరోజుల్లో, అమెరికన్ కాన్స్లులేట్ ఉన్న స్థలం నుండి మద్రాస్ మ్యూజిక్ ఎకాడెమీ వరకు ఉన్న రోడ్ ను కెథెడ్రల్ రోడ్ అని, (ఈ రోడ్ మీదే మద్రాసులోని మొట్టమొదటి ఫైవ్ స్టార్ హోటల్ చోళా షెరాటన్ వెలసింది) దాని తర్వాత వచ్చే రోడ్ ను ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ అని పిలిచేవారు. ప్రసిధ్ధి పొందిన కళ్యాణీ హాస్పిటల్ కూడా ఈ రోడ్ మీదే  ఉంది. ఆ రోడ్ చివరన గాంధీ బీచ్. భారత ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధకృష్ణన్ గారి "గిరిజ" భవనం ఉన్నదీ ఈ రోడ్డే.  ఆ భవనంలో డా.రాధాకృష్ణన్ గారి సమక్షంలో మాస్టారు చేసిన ఒక కచేరీకి నేనూ వెళ్ళాను. ఆయన పేరు మీదుగానే ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ ను డా.రాధాకృష్ణన్ సాలై( వీధి)గా మార్చడం జరిగింది.

మేము బీచ్ కు వెళ్ళే సమయానికి జనసమర్దం వుండేదికాదు ప్రశాంతమైన  చల్లనిగాలితో, వెన్నెల రాత్రిలో బీచ్ లో గడపడం ఎంత హాయిగా, ఆనందంగా ఉండేదో. బీచ్ ఇసకలో ఒక చోట కృష్ణ తెచ్చిన చాప దిండు వేసుకొని మాస్టారు పడుక్కునేవారు. పక్కనే అమ్మగారు, మా నాన్నగారు కూర్చొని మాట్లాడుకునేవారు, కృష్ణ మాస్టారి కాళ్ళు పడుతూండేవారు. పిల్లలందరం వాళ్ళతో సంబంధం లేకుండా పిన్నిగారితో కలసి చాలా దూరం వరకు నడచి వెళ్ళి అక్కడ ఆటలాడే వాళ్ళం. మేము వెళ్ళేముందే మాస్టారు చెప్పేవారు ఒక గంట వరకు రావద్దని. మా నాన్నగారిని కూడా  బీచ్ కు తీసుకు వచ్చారంటే ఏవో పాటల కంపోజింగ్ కు, సంగీతానికి సంబంధించిన చర్చలు జరపడానికే. నా చిన్నతనంలో చాలాసార్లే  మాస్టారి కుటుంబంతో వెన్నెలలో బీచ్ కు వచ్చి ఆనందంగా గడపడం జరిగింది. తిరిగి ఏ పదకొండు గంటల తర్వాత ఇంటికి బయల్దేరేవాళ్ళం.

ఇప్పుడు రోజులు మారిపోయాయి. అదుపుమీరి పెరిగిపోతున్నజనసముద్రం, విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యంతో బీచ్ లో మునుపచి ఆహ్లాదకరమైన వాతావరణం లేదు. ఇంటి దగ్గరున్నా, బీచ్ కు వెళ్ళినా ఒక్కటే అనిపిస్తోంది. ఇప్పటిలా ఆ రోజుల్లో బీచ్ లో సేఫ్టీ, సెక్యూరిటీ ప్రోబ్లమ్ అంటూ ఏ ఆంక్షలు వుండేవి కావు. ఇప్పుడు ఇంట్లోని ఆడవాళ్లతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో బీచ్ కు వెళితే భద్రతే లేదు. అటు ఎన్టీ సోషల్ ఎలిమెంట్స్, ఇటు వారిని కంట్రోల్ చేసే నెపంతో పోలీసుల అథారిటీ. వీటన్నిటితో "బీచ్ పక్కకెళ్ళద్దురా డింగరీ" అని పాడుకోవలనిపిస్తుంది.

1959 లో ఘంటసాల మాస్టారు మరొకసారి సినీమా నిర్మాణానికి పూనుకున్నారు.

 మళ్ళీనా...???

ఆ సినీమా సమాచారం వచ్చేవారం ..... 
                 ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Saturday, January 2, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదమూడవ భాగం

02.01.2021 -  శనివారం భాగం- 13*:
అధ్యాయం 2 భాగం 11 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1957వ సంవత్సరం ఘంటసాల మాస్టారికి అత్యంత విజయవంతమైన సంవత్సరం. సంగీత దర్శకుడిగానే కాక గాయకుడిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి బాగా దోహదపడిన చిత్రం 'పాండురంగమహత్మ్యం' తన ఎన్ఎటి బ్యానర్ మీద ఎన్ టి రామారావు, ఎన్ త్రివిక్రమరావు సోదరులు నిర్మించిన భక్తిరస ప్రధాన చిత్రం. పరిణతి చెందిన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎన్ టి రామారావు సంతృప్తిపర్చారు. 'పాండురంగమహత్మ్యం' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో సంగీతానిదే ప్రధాన భూమిక. ఎన్ఎటి ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినీమా ఇంత ఘన విజయం సాధించడంలో ఘంటసాల మాస్టారి పాత్ర ఎంతైనావుంది. నవరసాలను తన గళం ద్వారా పలికించగల అద్వితీయ గాయకుడు ఆయన. ఎన్ టి రామారావు అద్భుత నటనకు దోహదపడినది మాస్టారి గానమే. ఈ సినీమాలో మాస్టారు పాడిన శృంగారగీతాలు, శోక గీతాలు, భక్తిగీతాలు, దండకం, మరాఠీ అభంగాలు, పద్యాలు అన్నీ అజరామరంగా నిల్చిపోయాయి. ముఖ్యంగా, 'హే కృష్ణా ముకుందా మురారే', 'శ్రీ కామినీ కామితాకార', 'అమ్మా అని అరచినా' 'హరహర హర శంభో' ఇలా ఒకటేమిటి, ఈ చిత్రంలోని అన్ని పాటలు పాటలు కేవలం ఘంటసాలవారి గానం వల్లనే చిరంజీవత్వం సంతరించుకున్నాయని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ పాటలన్నీ గ్రామఫోన్ లో ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖేలేదు. 'పాండురంగమహత్మ్యం' ప్రివ్యూ చాలాసార్లే వేశారు. ఈ సినిమా వేసే ముందు టి.వి.రాజుగారి సహాయకుడు కమల్ దాస్ గారు ఒకసారి, ఎన్.టి.రామారావుగారి పెర్సనల్ డ్రైవర్ కృష్ణ ద్వారా, రామారావు గారి బావమరది పుండరీకాక్షయ్య గారి ద్వారా కబురు చేశారు. వాహినీ స్టూడియో లోనే ప్రివ్యూ వేసారు. వారి సంస్థల సినీమా ప్రివ్యూలన్నీ నందమూరి సోదరులు ఆధ్వర్యంలోనే జరిగేవి. వారిద్దరూ రామలక్ష్మణులులాగా ప్రివ్యూ ధియేటర్ ముందు నిల్చొని వచ్చే ఆహ్వానితులందరిని సాదరంగా ఆహ్వానించేవారు. అనుకున్న ముహుర్త సమయానికి సెకెండ్ల తేడా లేకుండా రామారావుగారి సంజ్ఞతో సినీమా ప్రారంభించేవారు. 

పాండురంగమహత్మ్యం సినిమా చూసినవారందరిదీ ఒకే అభిప్రాయం. ఘంటసాల మాస్టారి గానం, రామారావుగారి నటనే ఈ చిత్రానికి ఆయువుపట్టని. అలాగే, చిత్రం ఘనవిజయం సాధించి అందరికీ మహదానందాన్ని కలిగించింది. అయితే చంద్రుడిలో మచ్చలా చిన్న కొరత మిగిల్చింది. ఈ సినిమా ఘనవిజయానికి కారణమైన పాటలను పాడిన ఘంటసాలగారి పేరు సినీమా టైటిల్స్ లో కనపడదు. వారిది మాత్రమే కాదు. ఏ గాయకులది లేదు. నేపథ్యగాయకుల టైటిల్ కార్డ్ మిస్సింగ్. ఈ పొరపాటుకు రామారావుగారు ఘంటసాల మాస్టారికి క్షమాపణ చెప్పారని, మాస్టారు కూడా సహృదయతతో రామారావుగారిని సముదాయించారని విన్నాను.  కారణాల గురించి చర్చించడం వలన ఒరిగేది  ఏమీ లేదు. వేలు ఎవరి వేపు చూపాలో అర్ధంకాదు. అయినా "జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల?" 

పాండురంగమహత్మ్యం శతదినోత్సవం చాలా ఘనంగానే జరిగింది. ఘంటసాల మాస్టారికి ఒక పెద్ద ఆకర్షణీయమైన షీల్డ్ ను బహుకరించారు. ఓ ఆరంగుళాల  రజత పుండరీక విగ్రహం. విగ్రహం వెనుక రౌండ్ గా "మాతాపిత సేవే మాధవసేవ" అనే అక్షరాలతో అందంగా వున్న ఆ షీల్డ్ మాస్టారి గృహంలో మెయిన్ హాల్ లో ఉన్న అద్దాల బీరువాలో కొలువుతీరింది. ఎన్టీఆర్ పాండురంగమహత్మ్యం సినీమాకు స్ఫూర్తి 1944 లో వచ్చిన ఎమ్.కె.త్యాగరాజ భాగవతార్ నటించిన 'హరిదాస్' చిత్రం. నటగాయకుడిగా  భాగవతార్ అంటే తమిళనాడులో విపరీతమైన క్రేజ్ వుండేది. ఈ సినీమాలో కూడా 'కృష్ణా ముకుందా మురారి' పాట వుంది. ట్యూన్ వేరే. త్యాగరాజ భాగవతారే పాడారు. పాపనాశం శివన్ రచయిత, సంగీతదర్శకుడు. మరొక సహ సంగీత దర్శకుడు జి.రామనాధన్ . ఈ హరిదాస్ ఎంతటి హిట్ అంటే  ఒక్క బ్రాడ్వే ధియేటర్లోనే  ఏకబిగిన రెండున్నర సంవత్సరాలపాటు నిరాటంకంగా ఆడి గొప్ప రికార్డ్ నే స్థాపించింది. ఆ సినీమా పాటలకు, ఎన్టీఆర్ పాండురంగమహత్మ్యం సినీమా పాటలకు ఏవిధమైన పోలిక లేదు.


 త్యాగరాజ భాగవతార్ పాడిన కృష్ణా ముకుందా మురారీ
                        

 ఘంటసాల పాడిన కృష్ణా ముకుందా మురారీ
 
పాండురంగమహత్మ్యం సినీమా విడుదలైన కొద్ది రోజులకే 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో మరో  వంశోద్ధారకుడు జన్మించాడు. ఘంటసాలగారికి ద్వితీయ పుత్రోదయం. 


ఏడాది వయసులో ఘంటసాల వెంకట రత్నకుమార్ 

ఘంటసాల మాస్టారు జన్మించిన నెలలోనే వారి ఇద్దరు పుత్ర రత్నాలు కూడా జన్మించడం ఒక విశేషం. పెద్దబాబు పుట్టిన ఆరేళ్ళకు చిన్నబాబు. మా తమ్ముడు గోపి (వేణుగోపాలకృష్ణ)కంటే తొమ్మిది మాసాలు చిన్న. చిన్న బాబుకు వెంకట రత్నకుమార్ అని నామకరణం చేశారు. సాధారణంగా మన కుటుంబాలలో పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో అనేక తర్జనభర్జనలు, అలకలు, కోపతాపాలతో ఆ తతంగం జరగుతూంటుంది. చిన్న బాబు పేరు విషయంలో ఏవిధమైనటువంటి అభిప్రాయభేదాలకు తావేలేదు. ఎందుకంటే అందరూ సకుటుంబీకులే. అయ్యగారి తల్లి రత్తమ్మ గారు (వెంకట రత్నమ్మగారు.) అమ్మగారి తండ్రి వెంకట రత్నశాస్త్రిగారు. వీరిద్దరూ రెండు కుటుంబాలలో పరమ పూజనీయులు. పరస్పర ప్రేమాభిమానాలు కలవారు.

ఘంటసాల మాస్టారి ఇంట్లో కర్ర స్టాండ్ తో వుండే ఉయ్యాలవుండేది. అందులోనే చిన్న పరుపు, దిళ్ళువేసి మధ్యన చిన్న బాబును పడుక్కోపెట్టేవారు.

ఇలాటి స్టాండ్ ఉయ్యాలనే నేను 'పెళ్ళి చేసి చూడు' సినీమాలో చూశాను. ఆ సినీమాలో చూసిన మరికొన్ని కూడా మాస్టారింట్లో చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మాస్టారింటి కిచెన్ చిమ్నీ, బాత్ రూమ్ ముందు వాటర్ బాయిలర్, బాత్ రూమ్  లోని షవర్ - ఇవన్నీ పెళ్ళిచేసి చూడు సినీమాలోనూ చూశాను. బహుశా ఆ రోజుల్లో అందరిళ్ళలోనూ ఇలాటివే ఉపయోగించేవారేమో.

1958 లో ఘంటసాల మాస్టారికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టిన మ్యూజికల్ హిట్ సినీమా ఏ వి మెయ్యప్ప చెట్టిగారి (AVM స్టూడియో) 'భూకైలాస్'. సుదర్శనం, గోవర్ధనం సోదరులు సంగీతం నిర్వహించారు. ఘంటసాల మాస్టారు ఏవిఎమ్ స్టూడియో సినీమాలకు మొదటిసారిగా పాడినది 'భూకైలాస్' అనే నా ఉద్దేశ్యం. ఈ సినీమాలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలసినటించడం ఒక విశేషం. రావణాసురుని పాత్ర లో ఎన్టీఆర్ మొదటిసారిగా నటిస్తే, నారదుడిగా అక్కినేని తొలిసారిగా నటించారు. అక్కినేని నారదుడిగా నటించిన మరో చిత్రం 'కృష్ణమాయ' కూడా భూకైలాస్ తరువాత అదే సంవత్సరంలో వచ్చింది. ఆ సినిమాలో  కూడా మాస్టారిగానం వల్లనే చిత్రం రాణించింది.

భూకైలాస్ చిత్రంలో శివకేశవులిద్దరినీ స్తుతిస్తూ  "దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో" అని రావణుడు, "నారాయణ హరి నమో నమో" అని నారదుడు ఒకే సీన్ లో పాడుకుంటూ రావడం ఆ సినీమాలో ఒక విశేషం. ఈ ఒకే పాటను ఇద్దరు నటులకు విభిన్నరీతులలో గానం చేసిన ఘంటసాలవారి కంఠ మాధుర్యం, గంభీరత్వం, భావ ప్రకటన అనన్యసామాన్యం. ఈ సినిమాలోని 'నీలకంధరా', 'రాముని అవతారం', 'తగునా వరమీయ', 'సుందరాంగా అందుకోరా' (పాట నేపథ్యంలో శివ పంచాక్షరీ జపం), పాటలు, పద్యాలు, ఘంటసాలవారి గాన మాధుర్యం వల్లనే రక్తికట్టాయి. ఈనాటికీ సంగీతాభిమానులు ఆ పాటలను పాడుకుంటున్నారు. 

భూకైలాస్ పాటలన్నీ కొలంబియా రికార్డులుగా వచ్చాయి. కొలంబియా రికార్డులను మౌంట్ రోడ్ లోని సరస్వతీ స్టోర్స్ వారు మార్కెటింగ్ చేసేవారు. ఆ సరస్వతీ స్టోర్స్ ఏవిఎమ్ వారిదే. 1958లో గాయకుడిగా మాస్టారి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన చిత్రాలనేకం. అందులో "చెంచులక్ష్మి", "శ్రీరామభక్త హనుమాన్", "మంచి మనసుకు మంచి రోజులు", "పెళ్ళినాటి ప్రమాణాలు", "పార్వతీ కళ్యాణం" మొదలైన చిత్రాలు కొన్ని మాత్రమే. ఆఖరి మూడు చిత్రాల సంగీతదర్శకుడిగా ఆణి ముత్యాలవంటి పాటలను మాస్టారు స్వరపర్చారు.

"మంచి మనసుకు మంచి రోజులు" చిత్రంలోని "రావే నాచెలియా" అని కళ్యాణీ రాగంలో స్వరపర్చి గానం చేసిన విధానం ఏనాటికీ గాయకులకు పెను సవాలే. శ్రోతలకు వీనులవిందే. ఈ పాటను అప్పుడే చిత్రరంగంలోకి కొత్తగా ప్రవేశించిన రమణమూర్తి మీద చిత్రీకరించడం, ఆ నటుని భవిష్యత్ కు ఎంతగానో దోహదపడింది. 

అలాగే, ఘంటసాల మాస్టారు అద్భుతమైన సంగీతం అందించిన చిత్రం "పెళ్ళినాటి ప్రమాణాలు". ఇది జయంతి పిక్చర్స్ బేనర్ కింద కెవి రెడ్డిగారి సొంత చిత్రం. జానపద, పౌరాణిక చిత్రాలకే ప్రాముఖ్యత నిచ్చే కెవి రెడ్డిగారు 'పెద్ద మనుషులు" సినీమా తర్వాత దర్శకత్వం వహించిన సాంఘిక చిత్రం "పెళ్ళినాటి ప్రమాణాలే". ఈ సినీమాలో వినోదం వుంది, మంచి సందేశముంది. అన్నిటికీ మించి మనసులను రంజింపజేసే అతి శ్రావ్యమైన ఘంటసాల మాస్టారి సంగీతం వుంది. "శ్రీమంతురాలివై వెలుగొందుమాతా", "ఎదో తెలియక పిలిచితినోయి", "చల్లగ చూడాలి పూలను", "బృందావన చందమామ", "రావే ముద్దుల రాధా", "వెన్నెలలోనే వేడి ఏలనో" "లాలి మా పాపాయి ఆనందలాలి" వంటి పాటలు ఎన్నిసార్లు విన్నామో. అయినా తనివితీరదు. అలాగే , పార్వతీ కళ్యాణంలో పి. లీల పాడిన "జయ జయ సుందర నటరాజా" పాట ఎంత శ్రావ్యంగా వుంటుందో.

చూస్తూండగానే చిన్నబాబు (రత్నకుమార్) పుట్టి ఏడాది అయిపోయింది. అతని మొదటి సంవత్సరం పుట్టినరోజు పండగను ఘనంగానే జరిపారు. చాలామంది ప్రముఖులు వచ్చి చిన్నబాబును ఆశీర్వదించారు. మాస్టారికి సన్నిహితులైన వారందరికీ ఆహ్వానపత్రికలు పంపారు. ఆ ఆహ్వానం, పుట్టినరోజు జరుపుకుంటున్న బాలుడే చేస్తున్నట్లు ప్రింట్ చేయడం నాకు వింతగా తోచింది. ఆ ఇన్విటేషన్లో ఒక ప్రక్క రౌండ్ నెక్ బనీన్, చిన్న నిక్కర్ తో కూర్చొని ఉన్న భంగిమలో రత్నకుమార్ ఫోటో వేసారు. ఆ  బ్లాక్ & వైట్ ఫోటో చాలా బాగుండేది. ఎడిటర్ హరినారాయణ, సుబ్బు కలసి ఒక కమర్షియల్ కెమేరాతో తీశారు. అప్పట్లో కలర్ ఫోటోగ్రఫీ తక్కువ. మాస్టారింట్లో ఒక పాత ఆగ్ఫా డబ్బా కెమేరా వుండేది. మాస్టారింట్లో పెద్దబాబు తొలిరోజుల ఫోటోలన్నీ ఆ కెమేరాతోనే సుబ్బు, రామచంద్రరావు, పామర్తిగార్లు తీస్తూండేవారు. అప్పట్లో అదే ఒక కాలక్షేపంగా వుండేది.

అలాటి ఫోటోలలో నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన, గుర్తుండిపోయిన ఫోటో ఒకటి వుండేది. అది పాప పిన్నిగారి ఫోటో. అందులో ఆవిడ ప్యాంట్,ఫుల్ హాండ్ షర్ట్ లతో తలమీద ఒక టోపీతో (మా వైపు సానిటరీ/రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పెట్టుకునే టోపీలాటిది) ఉండేది. అప్పట్లో ఆడవాళ్లు మగడ్రెస్ లు వేసుకోవడం నాకు వింత. సంఘం సినీమాలో వైజయంతిమాలను మగడ్రెస్ లో చూసాను. పాప పిన్నిగారి ఫోటో చూసినప్పుడల్లా ఆ సినీమా గుర్తుకు వచ్చేది.  ఆ ఫోటో ఇప్పుడు ఎక్కడుందో. చిన్నబాబు ఎక్కువగా పిన్నిగారి సంరక్షణలోనే పెరిగాడు. ఇంట్లోని పిల్లలందరూ పిన్నిగారంటే చాలా ఇష్టంగా వుండేవారు. అందరికీ ఆవిడ దగ్గరే చేరిక ఎక్కువ.

ఆ రోజుల్లో టి.నగర్ షాపింగ్ హబ్ కాదు. అత్యవసర వస్తువులన్నీ పానగల్ పార్క్, రంగనాధన్ స్ట్రీట్  ప్రాంతాలలో దొరికినా ప్రత్యేకంగా ఖరీదైన నగలు, పెళ్ళిబట్టలు,హోల్ సేల్ లో కూరగాయలు, పువ్వులు, దీపావళీ క్రేకర్స్ మొదలైనవాటికోసం అందరూ చైనాబజార్ ప్రాంతాలకే వెళ్ళేవారు. దానితో చైనాబజార్ ప్రాంతంలో రాకపోకల అంతరాయం రానురానూ ఎక్కువైపోయింది. దానీతో మద్రాస్ కార్పరేషన్ తీవ్రచర్యలు చేపట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్స్ ప్రెస్ బస్ స్టాండ్, ఫ్లవర్ బజార్, కొత్వాల్ బజార్లోని కూరగాయల షాపులన్నీ కోయంబేడుకు, నగలు, బట్టల దుకాణాలన్నీ టి.నగర్ పానగల్ పార్క్ నుండి దాదాపు మౌంట్ రోడ్ వరకు తరలి వచ్చేయడంతో ట్రాఫిక్ ఎక్కువైపోయి స్థానిక ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ఎక్కడచూసినా వన్ వే ట్రాఫిక్. నో పార్కింగ్ ప్రోబ్లెమ్. కారులో మూడు నిముషాల్లో చేరుకోవలసిన చోటుకు మరో కిలోమీటర్ దూరం ప్రయాణం చేయవలసిన పరిస్థితి. ఆనాటి ప్రజలెవరూ ఎన్నడూ ఊహించని అభివృద్ధి. ఈ అభివృద్ధికి ఆనందించాలో, ఆందోళన చెందాలో తెలియని పరిస్థితి యీనాటివారిది. 

ఈ రకమైన మార్పులేవీ జరగని రోజుల్లో రోడ్లన్నీ విశాలంగా, ఖాళీగా, ప్రశాంతంగా ఉన్నరోజుల్లో సాయంత్రంపూట బజారుకు సావిత్రమ్మగారు వెళ్ళేవారు. ఆవిడతో కూడా పెద్దబాబు, నేనూ కూడా వెళ్ళేవాళ్ళం. మా ఇంటినుంచి దక్షిణం వేపు శారదా హైస్కూల్ దాటాక పానగల్ పార్క్ గోడను ఆనుకొని దగ్గరగా రెండు వందల మీటర్ల దూరం ప్లాట్ ఫాం మీద రెండు వరసలలో పెద్ద కూరగాయల బజార్ వుండేది. రకరకాల కూరగాయలు, పళ్ళు, పువ్వులు చాలా తాజాగా దొరికేవి. అక్కడి వస్తువులన్నీ చాలా ఖరీదు. మధ్యతరగతి వారు ఆ మార్కెట్లోకి అడుగుపెడితే ఆరిపోతారు. ఆ మార్కెట్ కు బాగా డబ్బున్న మార్వాడీలు, గుజరాతీలు, సినీమావాళ్ళు కార్లలో వచ్చి గంపలు గంపలుతో కూరగాయలు కొనుక్కువెళ్ళేవారు. అప్పట్లో వీధి చివర కూరగాయల షాపులు తక్కువే. ఆ పానగల్ పార్క్ కూరగాయల మార్కెట్ కు ఎదురుగా ఉస్మాన్ రోడ్ మీద కుమరన్ స్టోర్స్ బట్టల దుకాణం. చాలా చిన్నది. దాని పక్కనే యూనివర్శల్ బ్యాకరీ. దాని తర్వాత, N మాస్టర్ టైలర్స్ షాప్. ఆ పక్కనే టి.నగర్ నుంచి వెస్ట్ మాంబళానికి వెళ్ళే దారి, దొరస్వామిరోడ్. ఉస్మాన్ రోడ్ దొరస్వామి రోడ్ కలిసే మొగలో మొదట వేలన్ అంఢ్ కో, హార్డ్ వేర్ షాప్ ఆ తరవాత నాధన్స్ కేఫ్. పానగల్ పార్క్ కు దక్షిణాన నాగేశ్వరరావు (అక్కినేని కాదు, కాశీనాధుని) రోడ్. ఆ రోడ్ మీద ఆ రోజుల్లో చెప్పుకో దగ్గ పెద్ద షాపులు రెండే. ఒకటి తారాచంద్ గలాడా టిబి జ్యూవెలరీ షాపు. దాని పక్కన నల్లి చిన్నస్వామి  చెట్టి బట్టల దుకాణం, పక్కనే పార్క్ లాండ్స్ హోటల్. దానిని ఆనుకొని మెకర్నెట్ బ్యాకరీ చాలా ఫేమస్. ఆ ఆవరణలోనే బి వి కుబేంద్రరావు (కన్నడిగుడు) టైలర్ షాప్. ఘంటసాల మాస్టారి జుబ్బాలు, షర్ట్ లు అతనే కుట్టేవాడు. చాలా మంచివాడు. హుందాగా వుండేవాడు. 

ఒకసారి మేము ముగ్గురం ఆ టిబి జ్యూవెలరీ షాప్ సమీపంగా వెడుతూండగా ఆ షాప్ లో నుండి ఒక ఆడా మగా గట్టిగా నవ్వుకుంటూ బయటకు వచ్చారు. ఎవరో సినీమా వాళ్ళలా అనిపించారు. బాగా దగ్గరగా చూస్తే అప్పుడు గుర్తుకు వచ్చింది, వారిద్దరు సావిత్రి, జెమినీ గణేశన్ అని. వాళ్ళిద్దరు ఒక చిన్న తెల్ల ఫియట్ కార్ లో ఎక్కి వెళ్ళిపోయారు. నటి సావిత్రిని చూడడం అదే మొదటిసారి. మరొకసారి అదే షాపుకు వెళ్ళినప్పుడు లోపల మరొక నటి కనిపించి సావిత్రమ్మగారితో చాలా సేపు ముచ్చట్లాడారు. చాలా ఫెయిర్ గా, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడుతో ఉన్నారు. చూసిన వెంటనే గుర్తుపట్టలేకపోయాను. కానీ తర్వత తెలిసింది, ఆవిడే జూనియర్ శ్రీరంజని అని. గుణసుందరి, చంద్రహారం, పరాశక్తి, వంటి పాత చిత్రాలెన్నిటిలోనో నటించారు. 

పెద్దబాబు బజార్ కు వచ్చాడంటే ఆ రోజు యూనివర్శల్ బ్యాకరీకి వెళ్ళడం తప్పనిసరి. అతనికి చిన్నప్పుడు బన్, బట్టర్,జామ్ ఫేవరిట్ఐటమ్. యూనివర్శల్ స్టోర్లో బ్యాకరీ, ఐస్ క్రీమ్స్ తో పాటు స్టేషనరీ ఐటెమ్స్ కూడా అమ్మేవారు. ఆ షాప్ యజమానో, మేనేజరో నాకు తెలియదు. ఒక మలయాళీ నాయర్. నుదుట ఎప్పుడూ చందనం బొట్టు, వేష్టి, హాఫ్ షర్ట్ తో కనిపించేవాడు. అతనికి ఘంటసాలగారన్నా సావిత్రమ్మగారన్నా చాలా గౌరవం. ఎంతో వినయంగా దగ్గరుండి కావలసిన వస్తువులన్నీ తానే ప్యాక్ చేసి ఇచ్చేవాడు. అక్కడే మరో సేల్స్ మేన్ ఉండేవాడు. కుర్రవాడే. బొద్దుగా లావుగా వుండేవాడు. ఈ ఇద్దరూ నాకూ బాగా పరిచయమే. నాకు ఎందుకో చిన్నప్పుడు బ్రెడ్, బన్నులు నచ్చేవికావు. అవి జ్వరంవస్తే తినవలసిన పథ్యపు తిండని నా భావన. విజయనగరం లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికి జ్వరం వచ్చినా ఈ బన్ను, బ్రెడ్ లు బలవంతాన తినిపించేవారు. యూనివర్శల్ స్టోర్స్ లో పెద్దబాబు బన్ బట్టర్ జామ్ అయ్యాక "అమ్మా! ఐస్క్రీమ్ అనేవాడు". అమ్మగారు మూడ్ బాగుంటే దొరికేది. లేకపోతే ఇంకోసారి వచ్చినప్పుడు కొనిస్తాననేవారు. పెద్దబాబు పెద్ద మొహం చిన్నబుచ్చుకుని కామ్ గా వెంట నడిచేవాడు. రిటర్న్ లో పానగల్ పార్క్ కూరల మార్కెట్లో వంకాయలు, పసుపు పచ్చ దోసకాయలు, సొరకాయల వంటివి కొన్ని కూరలు కొనేవారు. అప్పట్లో కూరలు కొంటే కొత్తిమీర కరివేపాకు ఫ్రీ. ఇటీవలి కాలం వరకు అలాగే ఇస్తూ వచ్చారు. నేను కూడా మా ఇంటికి ఒకటి రెండు కూరలు కొనేవాడిని. వస్తూ, వస్తూ దారిలో మా ఇంటి వరసలోనే వుండే టిప్ టాప్ ఫ్యాన్సీ షాపులో దూరేవాళ్ళం అక్కడ అమ్మగారు బొట్టు, కాటుక, గాజులవంటి వస్తువులు కొనుగోలు చేసేవారు. ఇవన్నీ ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి బాగా చీకటిపడేది. అమ్మగారితో షాపింగ్ లకు వెళ్ళడం వలన త్వరలోనే నేను స్వతంత్రంగా బజారు సామాన్లు కొనుక్కురావడం అలవాటయింది. ఆ అనుభవంతో ఒకసారి, సాలూరులోని మా చిన్నాన్నగారి అమ్మాయి మంగమాంబ కోసం టిప్ టాప్ స్టోర్ లో ఒక  తెల్లటి పూసల హారం ఒకటి కొని తీసుకువెళ్ళి ఇస్తే ఆ పిల్ల చాలా మురిసిపోయింది. మా అన్నయ్య మెడ్రాస్ నుంచి కొని తెచ్చాడని అందరికి చూపించి ఆనందపడడం నాకు బాగా గుర్తు.

ఆనాటి మెడ్రాస్ వాతావరణానికీ, నేటి చెన్నై వాతావరణానికి మధ్య వచ్చిన మార్పులు అనూహ్యం. ఒక చెన్నై యే కాదు భారత దేశంలోని ప్రతీ మహానగరం, పట్టణం, ప్రతీ పల్లే కూడా పూర్తిగా మారిపోయాయి. అలాగే,మానవతా విలువలు కూడా మారిపోయాయి.

ఇంక భవిష్యత్ ఎలా వుంటుందో... నెం.35, ఉస్మాన్ రోడ్ లో...

మరిన్ని విషయాలు... వచ్చే వారం...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, December 26, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పన్నెండవ భాగం

26.12.2020 - శనివారం భాగం - 12*:
అధ్యాయం 2  భాగం 11 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నెం.35, ఉస్మాన్ రోడ్ లోగిలి నిశ్శబ్దంగా వుందీ అంటే ఘంటసాల మాస్టారు ఇంట్లోవున్నారని అర్ధం. ఆయన వున్న సమయాలలో రేడియో శబ్దాలు కాని, గ్రామఫోన్ పాటలు కానీ వినిపించేవి కావు. అలాగే, అనవసర సంభాషణలు గట్టిగా వినపడేవికావు. వారు ఇంట్లో ఉన్న సమయంలో ప్రశాంతంగా వుంచాలని ఇంట్లోవారంతా తాపత్రయపడేవారు. ఆయన రికార్డింగ్ లకో, రిహార్సల్స్ కో బయటకు వెళ్ళిన సమయాలలోనే పాటలు వినడం జరిగేది. అలాగే, సాయంత్రం సమయాలలో బాల్కనీలో అందరూ కలసి సత్కాలక్షేపం చేసేవారు. అప్పుడప్పుడు కధలమీద, సాహిత్యం మీద కబుర్లు సాగేవి. అలాటప్పుడు మా నాన్నగారే వక్త. సావిత్రమ్మగారు, పాప పిన్నిగారు, సుబ్బారావు, రామచంద్రరావు, బ్రహ్మంగారు మొదలైనవారంతా శ్రోతలు. శ్రీ సంగీతరావుగారు (మా నాన్నగారు) ఏ విషయం మీదనైనా రసవత్తరంగా మాట్లాడేవారు. ఆయన శరత్, టాగోర్, ప్రేమ్ చంద్ కథలను కళ్ళకుకట్టినట్లుగా, హృదయానికి హత్తుకునేలా చెప్పేవారు. ముఖ్యంగా, ఆయన చెప్పే 'కుక్క-యజమాని', 'గోపాల్' వంటి కరుణరస ప్రధానమైన కథలు దుఖః కలిగించేవి. అయినా ఆ కథలను ఎప్పుడు చెప్పినా వినాలనిపించేవి. 

సర్వశ్రీ - పంతుల శ్రీరామశాస్త్రి (రాయఘడాలో హైస్కూల్ మాస్టర్), భట్టిప్రోలు కృష్ణమూర్తి (OAS, ఒరిస్సా జైపూర్ ఎస్టేట్ ఆఫీసర్), మంథా రమణరావు (రూర్కేలా ఐరన్&స్టీల్ ఫ్యాక్టరీ లో పెర్సనల్ మేనేజర్) వంటి ఆనాటి ప్రముఖ రచయితలు ఆయనకు విజయనగరం కాలంనాటి నుండీ మంచి మిత్రులు. 

  

పంతుల, భట్టిప్రోలు, మంథా మిత్రులతో నాన్నగారు

(ఈ రచయితల కథలు వ్యాసాలు భారతి లో ప్రకటించబడేవి. ఆకాలంలో 'భారతి' పత్రికలో రచనలు ప్రచురించబడ్డాయంటే అదొక అమూల్యమైన గొప్ప ప్రశంసాపత్రం. తెలుగు భాషలో నిష్ణాతులైన వారి రచనలు మాత్రమే భారతిలో చోటుచేసుకునేవి). 

విజయనగరంలో వున్న రోజుల్లో వ్రాసిన కధలు కొన్ని ఆంధ్రపత్రిక(వారపత్రిక)లో ప్రచురితమయ్యాయి. ఈ ముగ్గురు శెలవుల్లో మద్రాస్ వచ్చి మా నాన్నగారితో కొన్నాళ్ళు గడిపేవారు. అలాటప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా, సర్వశ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, యామిజాల పద్మనాభ స్వామి, జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి, మాలతీ, ఎన్నార్ చందూర్ దంపతులను కలిసేవారు. వృత్తిపరంగా, సముద్రాల, మల్లాది, దాశరధి, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, ఆత్రేయ వంటి కవులతో మంచి అనుబంధం వుండేది. మా నాన్నగారు ఎవరైనా మరీ బలవంతపెడితే తప్ప ఏ రచనలు చేసేవారు కాదు. ఆయనలోని రచనాశక్తిని గ్రహించిన చందూర్లు బలవంతం మీద ఆంధ్రమహిళ, జగతి వంటి పత్రికలకు కొన్ని కధలు వ్రాశారు. సమకాలీన సంగీత విద్వాంసులమీద ఆంధ్రప్రభ దిన పత్రికలో సంగీత వ్యాసాలు వ్రాయడం జరిగింది. అలాగే ఆయన జీవితంలో తారసపడిన ప్రముఖ వ్యక్తులందరితో తనకు గల అనుబంధాన్ని, జ్ఞాపకాలను 'చింతాసక్తి' పేరిట, తన ఆత్మ సంతృప్తికోసం, ఒక పుస్తకం వ్రాసుకున్నారు. వాటన్నిటినీ సంకలనపరచి ఒక పెద్ద పుస్తకంగా ప్రచురించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ పుస్తకం మీముందుకు వస్తుంది. మా నాన్నగారి రచనా వ్యాసాంగానికి 'నెం.35, ఉస్మాన్ రోడ్' లోని వ్యక్తులు,  వాతావరణం కూడా ఎంతో దోహదపడ్డాయి.

మాస్టారు ఉదయం రికార్డింగ్ ఉంటే మధ్యాహ్నం 1.30 తరువాత, మధ్యాహ్నం రికార్డింగ్ అయితే రాత్రి 9.30 తరువాత ఇంటికి చేరేవారు. మాస్టారు వచ్చేలోపల, రేడియో సిలోన్, వివిధభారతిలో వచ్చే తెలుగు, తమిళ, హిందీ సినిమాల పాటలను మార్చి మార్చి వినేవాళ్ళం. అలాగే కొత్తగా వచ్చిన గ్రామఫోన్ రికార్డులను అరగదీసేవాళ్ళం. మాస్టారు సినీమా లలో పాడిన తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రగీతాలను హెచ్ ఎమ్ వి, కొలంబియా కంపెనీ వారు విడుదల చేసేవారు. అలాటి పాటలను మాస్టారికి 'కాంప్లిమెంటరీ'లుగా పంపేవారు. అయితే,  ఒక సినీమాలో పదిహేను,  ఇరవై పాటలు, పద్యాలు వుంటే అవన్నీ రికార్డ్ రూపంలో వచ్చేవికావు. బాగా అమ్ముడుపోతాయనే నమ్మకం వున్న పాటలనే రికార్డులుగా వేసేవారనుకుంటాను. అలాటి రికార్డులు మాత్రమే మాస్టారింటికి వచ్చేవి. 

నాకు తెలిసినప్పటినుండీ HMVలో శ్రీ మంగపతిగారే ప్రోగ్రామ్ ఇన్ ఛార్జ్ గా వుండేవారు. మూడు మాసాలకు ఒకసారైనా ఓ రెండు లలితగీతాలు మాస్టారివి రికార్డ్ చేసేవారు. ఆ లలితగీతాల కంపోజింగ్ మాస్టారింటి హాల్ లోగానీ, లేదా మేడమీది ఫ్రంట్ రూమ్ లో కానీ జరిగేవి. అలాటి సందర్భాలలోనే సర్వశ్రీ - రావులపర్తి భద్రిరాజు, ఎ వేణుగోపాల్, సముద్రాల ఆంజనేయులు, విజికె చారి, సి.సుబ్బారావు వంటి గీత రచయితలను చూడడం జరిగింది.

HMVలో పెరుమాళ్ అని ఒక ఎటెండర్ వుండేవాడు. మధ్యపాపిడి, సగం నెరసిన నొక్కులజుత్తు. కళ్ళజోడు, ఖాకీడ్రెస్. వారానికి ఒకసారైనా సైకిల్ మీద వచ్చి రెండో మూడో రికార్డులు ఇచ్చివెళ్ళేవాడు. (అంటే ఆరు పాటలు). సాధారణంగా అతను వచ్చే సమయానికి నేనే వాకిట్లో వుండేవాడిని. పెరుమాళ్ పుస్తకంలో సంతకం చేసి ఆ రికార్డులను తీసుకునేవాడిని. ఆ రికార్డులు నాలుగుపక్కలా ట్వైన్ దారంతో కట్టబడివుండేవి. వాటిని తీసుకువెళ్ళి అమ్మగారికి అప్పగించి వాటిని వినే అవకాశం కోసం ఎదురుచూసేవాడిని. 

ఘంటసాల మాస్టారి ఇంట్లో మొదట్లో ఒక పెద్ద పాతకాలపు వాల్వ్ రేడియో, ఒక HMV గ్రామఫోన్ ప్లేయర్ మెయిన్ హాల్ లో వుండేవి. ఆ హాలుగోడలన్నీ  స్కై బ్లూ  కలర్ లో కళ్ళకు చల్లదనాన్ని ఇచ్చేవిగా వుండేవి.  వీధి గుమ్మంనుండి లోపలి హాలు చివరివరకు ఒక ఆకుపచ్చ తివాసి (కొబ్బరినారుతో చేసినది) ఉండేది. ఎడమప్రక్క పడమట గోడంతాపూర్తిగా అద్దాల బీరువా. దానినిండా మాస్టారికి వచ్చిన షీల్డ్ లు, వెండి కప్పులు, పతకాలతో పూర్తిగా నిండివుండేది. హాలుకు మధ్య రంగురంగుల ముఖమల్ తివాసీ దానిమీద ఒక పెద్ద సోఫా ఎదురెదురుగా సింగిల్ సోఫాలు. ఈ సోఫాలు దూదితో చేయబడినవి. తెలుపు ఆకుపచ్చల చారలతో చాలా ఆకర్షణీయంగా వుండేవి. అక్కడే ఒక పక్కగా మాస్టారి పేము పడకకుర్చీ, రెండు కాళ్ళు జాపుకొని హాయిగా పడుక్కునేందుకు వీలుగా పొడుగాటి మడత చేతులతో ఉండేది. గ్రామఫోన్ కు దక్షిణం  గోడవేపు ఒక స్టాండ్ మీద గ్రామఫోన్, పక్కనే రేడియో గ్రామ్ . దానికి ముందు ఒక పేము కుర్చీ. తూర్పు గోడమీద అయ్యగారు , అమ్మగారి పెద్ద కలర్ ఫోటోలు. తరువాత కాలంలో జలాల్ కంపెనీ వారి సిల్వర్ డయల్ పెండ్యులమ్ వాల్ క్లాక్ వచ్చాయి. ఆ వాల్ క్లాక్ ను తుడిచి , కీ ఇచ్చే భాధ్యత తమ్ముడు కృష్ణదైతే అతనెక్కిన కుర్చీని పట్టుకోవడం నా అలవాటు గా మారింది. ఆ HMV గ్రామఫోన్ కు రెండు మూతలుండేవి. ఒకటి పైవేపు. మరొకటి ముందువేపు. ఆ మూతలు వేసేసినా కూడా పాట స్పష్టంగా వినబడేది. ముందువేపు స్పీకర్లు వుండేవి. అందులో వినపడే పాట స్టూడియో ధియేటర్లో వినేపాటలాగే నిర్దిష్టంగా వినపడేది. అలాటి గ్రామఫోన్ మరల నేను ఎవరింట్లోనూ చూసిన గుర్తులేదు. ఆ గ్రామఫోన్ లో పాటలు పెట్టి, కీ ఇవ్వడమన్నా,  ముల్లు మార్చడమన్నామహదానందంగా వుండేది. రామచంద్రరావో, అమ్మగారో పెడుతునప్పుడు చూసి తెలుసుకున్నాను. కొంచెం పెద్దయ్యాక నేనే ఆ గ్రామఫోన్ లో రికార్డులు పెట్టేవాడిని. తరువాత కొన్నేళ్ళకు (1967-68లో ఇంటి రినొవేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో మరో ఇల్లు కట్టిన తరవాత) ఆ పాత రేడియో స్థానే ఒక నాలుగు బ్యాండ్ల ఫిలిప్స్  రేడియో గ్రామ్ వచ్చింది. అందులోనే రేడియో, గ్రామఫోన్ కూడా వుండేది. ఒకేసారి ఎనిమిది రికార్డులు లోడ్ చేస్తే ఒకదాని  తరవాత ఒకటి వరసగా టర్న్ టేబుల్ మీద ఆటోమేటిక్ గా పడి ఆటోమేటిక్ గానే పికప్ రికార్డ్ మీదకి దిగి ఒక పాట తరువాత మరో పాట ప్లే అయేవి. ఆ రేడియో గ్రామ్ క్రింది భాగంలో రెండు మూడు వరసల్లో రికార్డులు భద్రపరిచే స్థలముండేది. కొన్ని వందల రికార్డులు వాటిలో దాచవచ్చును. ఇవన్నీ 1965 తర్వాత వచ్చినవి. అప్పటినుండే ఇంట్లో అందుబాటులో వున్న గ్రామఫోన్ రికార్డులకు ఒక ఇండెక్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన రావడం, (రికార్డులు మీద నెంబర్లు కూడా వేసేమేమో!) నెంబర్ ప్రకారం కొంత లిస్ట్ తయారు చేయడం జరిగింది. అందులో నా పాత్ర కూడా వుందని చెప్పడానికి ఆనందంగానేవుంది.

నాకు పది పన్నెండేళ్ళ వయసులో ఆ పాత HMV గ్రామఫోన్ లో చాలా పాటలే విన్నాను. అందులో ముఖ్యంగా, పుష్పవిలాపం, కుంతీకుమారి, సాంధ్యశ్రీ, పాపాయి పద్యాలు, షావుకారు, పాతాళభైరవి, చంద్రహారం, దేవదాసు, చిరంజీవులు, కన్యాశుల్కం, సంతానం,  మాయాబజార్, సారంగధర, ఇలా ఎన్నో సినీమా పాటలు. అప్పటికి నా వయసు సుమారు పన్నెండేళ్ళు. 

ఆ సమయంలోనే 'సతీ అనసూయ' సినీమా వచ్చింది. సినీమా 1957 లో వచ్చినా  కొన్ని పాటల రికార్డింగ్ 1956 లోనే వాహినీలో జరిగిన గుర్తు. వాహినీలో ముందు కృష్ణన్ సౌండ్ ఇంజనీర్. తరువాత వల్లభజోస్యుల శివరాంగారు వచ్చారు. పెద్ద పెద్ద మీసాలు. భారీ శరీరం. ఈయన  పోతన, షావుకారు, గుణసుందరి వంటి అనేక సినీమాలలో కూడా  నటించారు. విజయాగార్డెన్స్ రికార్డింగ్ ధియేటర్ రాకముందు మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన అనేక సినీమా పాటలను వాహినీ స్టూడియో లో శివరాంగారి ఆధ్వర్యంలోనే రికార్డ్ అయాయి. విజయాగార్డెన్స్ వచ్చాక మాస్టారి సినీమా పాటలు అక్కడే రికార్డింగ్ జరపడం మొదలెట్టారు. అక్కడ ఏ ఆర్ స్వామినాథన్ సౌండ్ ఇంజనీరు. అప్పట్లో భరణీలో కోటేశ్వరరావుగారు (ఆయన తరువాత జెమినీ స్టూడియోకు మారారు), ఏవిఎమ్ లో జె జె మాణిక్యం , ప్రసాద్ లో ఎస్పి రామనాధన్ వంటివారు సౌండ్ ఇంజనీర్లుగా వుండేవారు.

సతీ అనసూయ పాటల రికార్డింగ్ వాహినీలో జరిగినా, రీరికార్డింగ్ మాత్రం వేరే స్టూడియో జరిపారు. అది కూడా వడపళని దాటాకే అర్కాట్ రోడ్ లోనే ఉండేది. (ఆ రోజుల్లో వాహినీ, ఏవిఎమ్ దాటాక అంతా నిర్మానుష్యంగా వుండేది. సినీమా వారి వాహనాల రాకపోకలే కనిపించేవి. ఆ ఆర్కాట్ రోడ్   పోరూర్, పూనమల్లి హైరోడ్ కు వెళుతుంది. అప్పట్లో పొలాలు, కొబ్బరితోటలతో నిండిన ఆ ప్రాంతమంతా ఇప్పుడు ఒక కాంక్రీట్ జంగిల్. హెవీ ట్రాఫిక్ జామ్ లతో, వాతావరణ కాలుష్యంతో మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.)

సతీ అనసూయలో కూడా ఇరవైకి పైగానే పాటలు పద్యాలు వున్నాయి. ఇవన్నీ గ్రామఫోన్ రికార్డులు గా వచ్చాయా అనేది నాకు సందేహమే. అందులోని పాటలన్నింటికీ చాలా శ్రావ్యమైన సంగీతాన్నే ఘంటసాల మాస్టారు సమకూర్చారు. ఆ పాటలన్నీ గ్రామఫోన్ లో వేసుకొని వినేవాళ్ళం. 


ముఖ్యంగా ఎమ్మెల్ వసంతకుమారి పాట 'మారు పల్కవదేమిరా', 'పోనేల మధుర పోనేల కాశి', 'జయ జయ దేవహరే, 'ఓ నాగదేవతా నా సేవగొని', 'ఊగేరదిగో మువ్వురు దేవులు ఉయ్యాలలో పసిపాపలై', 'కదిలింది గంగా భవానీ' వంటి పాటలను, మళ్ళీ మరేవైనా కొత్త రికార్డ్ లు వచ్చేవరకు వేసుకు వినేవాళ్ళం. గ్రామఫోన్ లో ఈ పాటలు వినడానికి నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి. అందుకు పిన్నిగారిని ఆశ్రయించేవాడిని. ఈ రకంగా మాస్టారు లేని సమయంలో పాటల కార్యక్రమం జరిగేది.

'ఓ సఖా ఓహో సఖా' పాట డ్యూయెట్. జిక్కి, మాస్టారు పాడారు. ఈ పాటకు మూలం 'ఝనక్ ఝనక్ పాయల్ బాజే' లో లతామంగేష్కర్, హేమంత్ కుమార్ పాడిన 'నయన్ సొ నయన్ నహీ మిలో" పాట. చాలా మంచి పాట. స్లో రిధిమ్ లో ఉండే ఈ పాటను రతీ మన్మధుల నృత్యగీతికి తగినట్లు మార్చి మాస్టారు వరసను కూర్చారు. 



సతీ అనసూయ లేడీ ఓరియెంటెడ్. హీరో లేని సినీమా. అంజలీ, జమునలే ఈ చిత్రానికి జీవం. గుమ్మడి, కెవి శర్మ,  పద్మనాభం, రేలంగి, ముక్కామల, రాజనాల ముఖ్యపాత్రలు.  కాంతారావు, అమర్ నాధ్ కూడా ఉన్నారు. ఆఖరున ఒక సీన్ లో శాపం తీరిన కౌశికుడుగా, జమున భర్తగా ఎన్ టి రామారావు కనిపిస్తారు. కానీ యూట్యూబ్ పొస్టర్స్ లో ఎన్టీఆర్ ఫోటోను, పేరును ప్రముఖంగా చూపిస్తున్నారు.

సతీ అనసూయ రాజశ్రీ ప్రొడక్షన్స్ సుందర్లాల్ నహతాగారి రెండవ సినీమా. కడారు నాగభూషణం గారు డైరక్టర్. ఈ సినీమా రీ రికార్డింగ్ వడపళని దాటాక అదే ఆర్కాట్ రోడ్ లోని పేరమౌంట్ స్టూడియో లో జరిగిన గుర్తు. పక్క పక్కనే శ్యామలా స్టూడియో,  ప్రకాష్,  మెజెస్టిక్, వాసూ స్టూడియో,  గోల్డెన్ స్టూడియో, ఫిలింసెంటర్ వంటి చిన్న స్టూడియోలుండేవి. ఆ తరువాత కొంతకాలానికి కర్పగం, ఎ ఆర్ ఎస్ గార్డెన్స్ వంటి స్టూడియో లు వచ్చాయి. ఆ రోజుల్లో ఈ స్టూడియో లన్నీ చాలా బిజిగా కళకళలాడుతూ పనిచేసేవి. ఈనాడు ఆర్కాట్ రోడ్ లోని సినీమా స్టూడియోలన్నీ మూతబడి, వాటి నామరూపాలే తెలియకుండా ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ గొడౌన్లుగా, మల్టీస్టోరీడ్ హైటెక్ బిల్డింగ్స్ గా రూపాంతరం చెందాయి. 

సినీమా నిర్మాణం పూర్తిగా బజారుకు ఎక్కింది. పెద్ద పెద్ద భవంతులలో , బీచ్ రిసార్ట్స్ లో, పూర్తి ఔట్ డోర్ లలో సినీమా షూటింగ్ లు జరుపుతున్నారు. సినీమా  టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఆ మార్పే నేటి సినీమా సంగీతంలో కనిపిస్తోంది. అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో, గ్రాఫిక్స్ ,ఏనిమేషన్స్ తోనే సినీమా తయారౌతున్నది. గతకాలపు విలువలేవీ ఈ నాటి సినీమా కు అవసరం లేదు.

పారమౌంట్ స్టూడియోలో జరిగిన రీరికార్డింగ్ లో కొన్ని సీన్లను చూశాను. పారమౌంట్ స్టూడియో మరీ పెద్దదేం కాదు. ఆ స్టూడియో కు వెళ్ళాలంటే డైరక్ట్ బస్ సౌకర్యం లేదు. మా నాన్నగారితో కానీ, లేదా, మాస్టారి తో కానీ వెళ్ళేవాడిని. మా నాన్నగారిని , ఇతర ఆర్కెష్ట్రా వారిని తీసుకు వెళ్ళడానికి ప్రొడక్షన్ మేనేజర్  బి. సుబ్బారావు (సుబ్బు) కారో, వ్యానో తీసుకువచ్చేవారు. ఆ సుబ్బునే మాస్టారి సొంత చిత్రాలకు కూడా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు.

ప్రొడక్షన్ మేనేజర్ల ఉద్యోగాలు నిరంతరం కాదు. ఆ సినీమా పూర్తి అయ్యేవరకే. వెంటవెంటనే మరో సినీమా తీసే కంపెనీ అయితే ఫర్వాలేదు. లేకపోతే జీవనం కోసం మరో సినీమా కంపెనీకోసం వెతుకులాట తప్పదు. సినీమా లోకంలో అనుభవమున్నవారు వెంటవెంటనే ఏదో కంపెనీలో చేరిపోతూంటారు. సినీమాలలో ఎవరికీ Job guarantee లేదు. ఆనాడు సినీమా నిర్మాణం most unorganized. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నవారు బ్రతికి బాగుపడ్డారు. లేనివారు తెరమరుగైపోయారు.

సరి, ఇప్పుడు, 'సతీ అనసూయ' ను చూద్దాము. ఈ సినీమా రీరికార్డింగ్ మధ్యాహ్నం నుండి మర్నాటి ఉదయం వరకూ డబుల్ కాల్షీట్లు లో పనిచేసిన జ్ఞాపకం. రీరికార్డింగ్ చూడ్డానికి వెళ్ళినవాళ్ళం ఏ తొమ్మిందింటి వరకో వుండి తిరిగి వచ్చేసేవాళ్ళం. సతీ అనసూయ లో రీరికార్డింగ్ సమయంలో నేను చూసినవి,  నాకు బాగా జ్ఞాపకం వున్న సీన్లు - మనుషులు చేసిన పాపాలు పిశాచాలై పవిత్ర గంగాదేవిని పీడిస్తూ వెంటపడేప్పుడు  వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్, అత్రి మునిని కాటేయమని పార్వతీదేవి శివుడి మెడలోని నాగరాజును ఆజ్ఞాపిస్తుంది. ఆ సందర్భంలో ఆ నాగుపాము వెళుతున్నప్పుడు వచ్చే మ్యూజిక్. ఆ సీన్ లో యూనివాక్స్, ఘటసింగారి లేక పంబలాటి వాద్యం నేపథ్యంలో వినిపిస్తుంది. అనసూయ పాతివ్రత్యబలం వలన కాటేయడానికి వెళ్ళిన నాగరాజు పూలహారంగా మారేప్పుడు వినిపించే వీణ బిట్స్, సింబల్స్, బేస్ డ్రమ్స్ వంటి వాద్యాలతో నేపధ్యసంగీతం సమకూర్చారు. 

అలాగే, ఇంద్రుడు నర్మద మీదకు పంచభూతాలను ప్రయోగించి భీభత్సాన్ని సృష్టించే సమయంలో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్, మధ్య మధ్య త్రిమూర్తులు ప్రత్యక్షం అయ్యేప్పుడు వచ్చే మ్యూజిక్, త్రిమూర్తులు పసిపాపలుగా మారడానికి ముందు, వెనక వచ్చే మ్యూజిక్ స్వయంగా రికార్డింగ్ థియేటర్లో కూర్చోని సినీమా చూస్తూ, వినడం ఆ వయసులో గొప్ప థ్రిల్లింగ్. 

నాకు సినీమా షూటింగ్ లు చూడడంలో ఏనాడు పెద్ద ఆసక్తి వుండేదికాదు. అవకాశం దొరికితే మాత్రం రీరికార్డింగ్ లకు మాత్రం తప్పక హాజరయేవాడిని.

ఈ సినీమా ప్రివ్యూ కూడా ఇంట్లో అందరం చూశాము.

1960-70ల మధ్య ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ తెలుగు వార పత్రికలు, యువ, జ్యోతి వంటి మాస పత్రికలు దసరా, దీపావళి, సంక్రాంతి సమయాలలో ప్రత్యేక సంచికలు ప్రచురించి నవలలు, కథల పోటీలు నిర్వహించి ఉత్తమ రచనలకు మొదటి బహుమతి 5000, రెండవ బహుమతి, 3000, మూడవ బహుమతి 1500/- రూపాయలు ప్రకటించి ఆయా నవలలను, కధలను ధారావాహికలుగా తమ తమ పత్రికలలో ప్రచురించేవారు. పండగల సందర్భంలో వచ్చే ఆ ప్రత్యేక సంచికలు తెరచి చూడగానే ఘాటైన ఒక సెంట్ వాసన పాఠకులను మత్తెక్కించేది. ఆ సెంట్ పేరు 'కునేగా మరికొళందు'. 

 

 


పత్రికలవారు, ఆ సెంట్ కంపెనీవారు సంయుక్తంగా తమ వ్యాపారాభివృధ్ధికోసం ఈ విధంగా ప్రజలను ఆకర్షించేవారు. 

ఒకసారి మా హైస్కూలులో మా క్లాస్ పిల్లలందరిని స్టడీ టూర్ లాటిదానికి తీసుకువెళ్ళారు. కొంతమంది మా క్లాస్ అయ్యవారితో  టి.నగర్ నుండి బస్ లో వెళితే మరికొందరు తమ సొంత వాహనాలమీద వెళ్ళారు. నేను, వెస్ట్ మాంబళం ప్యాడీఫీల్డ్ రోడ్ లో వుండే  ఎస్ ఎస్ వాసన్, వంటి పిల్లలు మరికొంతమందిని కలుపుకొని మాంబళంనుండి నడచుకుంటూ   జయరాజ్ థియేటర్ మీదుగా సైదాపేట బస్ స్టాండ్ దగ్గర  47 నెం. బస్ ఎక్కి అడయార్ లో దిగి అయ్యవారు చెప్పిన ఎడ్రస్ కు వెళ్ళాము. అదొక ఫ్యాక్టరీలాగా వుంది. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళగానే పరిచయమున్న ఘాటైన సెంట్ వాసన తగిలింది. అది ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికల్లో వచ్చిన కునేగా సెంట్ వాసనే. ఆ ఫ్యాక్టరీ పేరు 'గంగా సోప్ ఫ్యాక్టరీ' అని జ్ఞాపకం. దీనికి సమీపంలోనే అడయార్ నుంచి OMR (Old Mahabalipuram Road) దారిలో లాటిస్ బ్రిడ్జ్ రోడ్ మీద 'ఈరోస్' సినీమాహాలు చూసిన జ్ఞాపకం.  ఇప్పుడు ఆ స్థలాలన్నీ గొప్ప రియల్ ఎస్టేట్ వెంచర్స్ గా మారిపోయాయి.
 
మేమందరం కలసి అయ్యవారితో లోపలకు వెళ్ళాము. అక్కడ ఒకాయన ఆ ఫ్యాక్టరీని అంతా చూపించి, అరవంలో సబ్బులు ఎలా చేస్తారో, ఏ ఏ కెమికల్స్ ఎంతెంత పాళ్ళలో కలుపుతారో, ద్రవపదార్ధం గట్టి సబ్బుబిళ్ళగా ఎలా మారుతుందో అన్నీ వివరించి చెప్పారు. ఆయన చెప్పింది కొంత అర్ధమయింది. కొంత కాలేదు. అప్పటికి మధ్యాహ్నం మూడు దాటింది. లోపలనుండి బయటకు వచ్చి చెట్లక్రింద మేము తెచ్చుకున్న ఫలహారాలు తినడం మొదలెట్టాము. వచ్చేప్పుడే స్కూలుకు ఎదురుగా వున్న టి.నగర్ సోషల్ క్లబ్ క్యాంటిన్ లో ఎవరికి కావలసిన టిఫిన్ వారు ప్యాక్ చేయించుకొని తెచ్చుకున్నారు. "ఆబ లావు పీక సన్నం" అని మావేపు ఒక సామెత ఉంది. తెలీసీతెలియక ఒక నాలుగు ఇడ్లీలు కట్టించాను. అక్కడ వాటిని విప్పి చూసేసరికి  బాగా చల్లారిపోయి గట్టిపడిపోయాయి. చాలా పెద్ద పెద్ద ఇడ్లీలు. దానినిండా కారప్పొడి, మంచి నూనే వేసి వుంది. వేడివేడిగా ఉన్నప్పుడైతే మహారుచిగా వుండే ఆ ఇడ్లీలను రెండుకంటే తినలేకపోయాను. మిగతావాళ్ళందరిదీ కూడా అదే పరిస్థితి. ఎవరూ తెచ్చుకున్న ఫలహారాలు పూర్తిగా తినలేదు. సగం సగం అక్కడే పారేసారు. కొంతమంది పిల్లలు తాము తిన్న ఫలహారాల ఆకులు, కాగితాలు చెత్తకుప్ప తొట్టిలో వేయకుండా తిన్నచోటే చెట్లక్రింద వదిలేయడంతో అక్కడి వాచ్ మేన్ కోపగించుకొని చీవాట్లు పెట్టాడు. మా అయ్యవారు సర్దిచెప్పి మా అందరికి శుభ్రమైన మంచి అలవాట్లు గురించి ఒక క్లాస్ తీశారు. ఆ తర్వాత, అందరం బయటకు వచ్చి అడయార్ బస్ స్టాండ్ లో  బస్సెక్కి సైదాపేట లో దిగి అక్కడ టి.నగర్ బస్ పట్టుకొని ఇంటికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది.

రామకృష్ణా స్కూల్ లో ఏన్యువల్ డే సెలిబ్రేషన్స్ ఘనంగానే సాగేవి. మేడ మీద ప్రేయర్ హాలులో గానీ, క్రిందనున్న ఖాళీ స్థలంలోగానీ జరిగేవి. ఇది పూర్తిగా మగపిల్లల స్కూల్ కావడం వలన డాన్స్ లు తప్ప మిగిలిన  సంగీతం, నాటికలు, మ్యాజిక్ వంటి కార్యక్రమాలన్నీ జరిగేవి. ఇందులో మాక్లాస్ కు చెందిన త్యాగరాజు, అతని తమ్ముడు శివశంకర్ (లింగమూర్తిగారి అబ్బాయిలు) వైలిన్, మృదంగం కార్యక్రమం తప్పనిసరిగా వుండేది. అతను త్యాగకీర్తనలు ఓ రెండు వాయించిన తరువాత సినీమా పాటలు ఓ రెండు వాయించేవాడు. ఒకటి దేవదాసు లోని 'జగమే మాయ' పాట. పాట చివరలో వచ్చే దగ్గులను కూడా వైలిన్ మీద పలికించే ప్రయత్నం చేసేవాడు. పిల్లలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టేవారు. మరొక పాట మాయా బజార్ లోని 'వివాహ భోజనం' అందులో వచ్చె నవ్వులను వైలిన్ మీద వాయిస్తూంటే పిల్లలంతా కోరస్ గా పాడేవారు. చాలా సరదాగావుండేది. దేవదాసు, మాయాబజార్ రెండూ తమిళనాట దిగ్విజయం పొందిన సినీమాలు. ఆ రెండు చిత్రాలతోనూ ఘంటసాలవారి కి సంబంధం వుండడం నాకు గర్వకారణం. స్కూల్ ప్రోగ్రామ్స్ అయ్యాక ఆ సినీమాల పాటలగురించే కబుర్లు చెప్పుకుంటూ, మెల్లగా నడచుకుంటూ ఇళ్ళకు చేరుకునేవాళ్ళం.

మరిన్ని విశేషాలతో... వచ్చే వారం...   
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.