visitors

Friday, October 16, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - రెండవ భాగం


16.10.2020 - శుక్రవారం భాగం - 2*:
అధ్యాయం 2  భాగం 1 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్



మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ లో రైలు దిగి ప్లాట్ ఫారమ్ మీద అడుగుపెట్టగానే, నిజంగానే, మరేదో లోకానికి వచ్చినట్టయింది. నాకు తెలిసిన విజయనగరం స్టేషన్ కు రెండే ప్లాట్ ఫారమ్ లు. మెడ్రాస్ స్టేషన్ లో వరసగా ఆరో, ఏడో వున్నాయి. అన్నింటిమీదా రైళ్ళు నిలబడివున్నాయి. రైల్వే స్టేషన్లు ఇంత పెద్దవిగా , ఇంత పొడుగ్గా వుంటాయా అనిపించింది. బొబ్బిలి స్టేషన్ కంటే విజయనగరం స్టేషనే పెద్దదనుకుంటే  దానికంటే మరెన్నో రెట్లు పెద్ధదిగా మెడ్రాస్ స్టేషన్ కనిపించింది. స్టేషనంతా కూలివాళ్ళ కేకలు, అదలింపులతో, వేలాది( నాకప్పుడు అలా అనిపించింది) మనుషుల ఉరుకులు పరుగులతో, వచ్చీపోయే రైళ్ళ కూతలతో ఎక్కడ నిలబడాలో ఎటుపక్క వెళ్ళాలో తెలియక భయం భయంగా తోచింది. మా నాన్నగారి వెనకాలే ప్లాట్ ఫారమ్ మీద చాలాసేపు నడిచి బయటకు వచ్చాము. మేము రైలు దిగింది మధ్యాహ్నం అయినా చల్లటి గాలి వీస్తూంది. మా నాన్నగారు మమ్మల్ని (అమ్మగారు, అమ్మమ్మగారు, నేను, చెల్లెలు రమణమ్మ) ఒక కారులో ఎక్కించారు. (అంతకుముందు, మొదటిసారి, విజయనగరంలో ఘంటసాలగారు వచ్చినప్పుడు వాళ్ళతోపాటూ కారులో బయటకు వెళ్ళిన గుర్తుంది.)

మేము ఎక్కిన కారు చాలా చాలా దూరం వెళ్ళి ఒక దగ్గర ఆగింది. కారులోంచి దిగి చూస్తే ఒక పెద్ద రాజమహల్ లాంటి భవనం ముందు  ఉన్నాము. అది ఎవరిదో, అక్కడ ఎందుకు దింపారో అర్ధంకాలేదు. అంత పెద్ద మేడలో మేముంటామని ఊహించలేదు. కారువాడికి డబ్బులిచ్చేసి మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళారు. ఇంటిలోపలికి వెళ్ళాక, లోపలున్న మనుషులను చూసాక తెలిసింది అదే ఘంటసాలవారి ఇల్లని. వాళ్ళే మా తాతగారిని చూడ్డానికి విజయనగరం వచ్చేరని. ఆ ఇంట్లో వున్నవారంతా చాలా అభిమానంతో పలకరించారు మమ్మల్ని. అక్కడి వాతావరణం, మరికొంతమంది మనుషులు పూర్తిగా కొత్త కొత్తగా అనిపించింది. భయం భయంగా మా అమ్మగారి వెనకే నక్కడం బాగా గుర్తుంది. 

ఆ రోజు సాయంత్రం ఘంటసాలగారింట్లో వారంతా తమ స్నేహితుల ఇంట్లో పెళ్ళికో, లేక, పెళ్ళి విందుకో వెళుతూ మా అందరినీ కూడా తీసుకువెళ్ళారు. మేము వెళ్ళిన పెళ్ళివారిల్లు చాలా పెద్దదిగా విశాలంగా వుంది. అంత విశాలమైన గదిలో పెళ్ళి కార్యక్రమం చూడడం అదే ప్రధమం. అంతకు ముందు మా శారద పెళ్ళి చూసినా అదంతా తాటాకు పందిళ్ళ క్రింద జరిగింది. ఈ పెళ్ళికి వచ్చినవారిలో ఎక్కువగా తెలుగు మాట్లాడినవారే కనిపించారు. అయితే, మెడ్రాస్ తెలుగు ఊరే అని అనుకున్నాను. అక్కడివారంతా మాకు తెలియనివారు కావడం చేత వారి మాటలు వింటూ ఓ పక్కన కూర్చుండిపోయాము.  ఊరు కొంత అలవాటుపడిన కొన్నాళ్ళకు తెలిసింది - అది పెళ్ళి వారి సొంతిల్లు కాదని, అక్కడ అలాంటి పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు‌, సభలు, సమావేశాలు జరుగుతూంటాయని, వాటిని కళ్యాణమండపాలని అంటారని. అలాటి అద్దె విడిదుల్లోనే పెళ్ళిళ్ళు జరుపుతారని తెలుసుకున్నాను. మేము వెళ్ళిన కళ్యాణ మండపం నుంగంబాక్కం స్టెర్లింగ్ రోడ్, స్పర్ టాంక్ రోడ్ బ్రిడ్జ్ దాటాక చెట్ పట్ లెవెల్ క్రాస్ కు ముందు ఎడమవేపు బాగా లోపలకు వుండేది. (అప్పటికి చెట్ పట్ ఫ్లైఓవర్ కట్టలేదు). ఇప్పటికీ ఆ కళ్యాణమండపం మూడు పెళ్ళిళ్ళు ఆరు రిసెప్షన్లంటూ  నిత్యకళ్యాణం పచ్చతోరణంగా కలకలాడుతూనే  ఉంది ఈ మధ్యకాలం వరకూ 'కుచలాంబాళ్ కళ్యాణ మండపం' పేరిట. (ఇప్పుడూ ఉందనుకుంటాను. అటుపక్కకి వెళ్ళలేదు ఈమధ్య.) 

ఆ విధంగా మా మెడ్రాస్ జీవితం శుభప్రదంగా ఒక పెళ్ళి శుభకార్యంతో ప్రారంభమయింది. 

ఆరోజు రాత్రి ఘంటసాల వారింట్లోనే గడిపి ఆ మర్నాడు ఉదయం మేము వుండవలసిన ఇంటికి చేరుకున్నాము. అదొక పెద్ద లోగిలి. వీధివేపు ప్రహారీగోడ, లోపలికి వెళ్ళడానికి చిన్న గేటు.లోపలికి ప్రవేశించగానే ఎడమవేపు చిన్న చప్టాతో ఒక పెద్ద చెట్టు - అదేం చెట్టో గుర్తులేదు, కానీ చల్లదనం ఇచ్చే చెట్టు. కుడి, ఎడమల వేపు చిన్న చిన్న పెంకుటిళ్ళు. నడవడానికి మధ్య దారి. ఒక వంద గజాల తర్వాత ఎదురు వరసలో మరికొన్ని ఇళ్ళు. మొత్తానికి ఆ లోగిట్లో ఓ పదిహేను ఇళ్ళవరకు ఉండవచ్చును. ఆ ఇళ్ళ కప్పుల మీదున్న పెంకులు నేను విజయనగరంలో, బొబ్బిలిలో చూసిన ఇళ్ళపెంకులకు విరుధ్ధంగా ఉన్నాయి. అవి వంపు తిరిగి డొప్పల్లా వుంటే, మెడ్రాస్ ఇళ్ళ పెంకులు ఎర్రగా పలకల్లా పెద్దవిగా వున్నాయి. వాటినే బంగళా పెంకులంటారని తెలిసింది. బొబ్బిలి, విజయనగరం ప్రాంత పెంకుటిళ్ళు మెడ్రాస్ లో కూడా వున్నాయని కొన్నేళ్ళకు తెలిసింది. కచాలేశ్వర అగ్రహారం, పరశువాకం విల్లివాక్కం, ట్రిప్లికేన్, మైలాపూర్, సైదాపేట్, ఆలందూర్, వెస్ట్ మాంబళం వంటి పాత మెడ్రాస్ ప్రాంతాలలో అలాటి అప్పటికింకా ఉండేవి. అయితే ఎనభైలకి అవి శిధిలావస్థకి చేరుకున్నాయి. మేమున్న వీధి పేరు 'రంగయ్యర్ స్ట్రీట్. మెడ్రాస్ లో ప్రతీ ఇంటికీ విధిగా ఒక నెంబరు ఉండి తీరాలట, ఉంటున్న ఇంటిని ఇతరులకు చెప్పడానికి, పోస్ట్ మేన్ తిన్నగా ఉత్తరాలు తెచ్చివ్వడానికి. మా వూళ్ళలో ఏ ఇంటికీ ఏ నెంబర్ వుండేదికాదు. ఫలానా వారిల్లంటే చాలు జట్కావాళ్ళు, రిక్షావాళ్ళు  సరిగ్గా ఇంటిదగ్గర దింపేసేవారు. మెడ్రాస్ మహానగరం కావడాన ప్రతీ వీధికీ పేరు, ఇంటికి నెంబరు తప్పనిసరి. రంగయ్యర్ స్ట్రీట్ లో మేముండిన ఇంటి నెంబర్ '11'.

ఆ లోగిట్లో కుడివైపున్న నాలుగైదు ఇళ్ళలో ఆఖరిది. ఇల్లంతటికి ఒకటే గది. గుమ్మం దాటగానే ఎడమవేపు చిన్న వంటిల్లు, పక్కన చిన్న వరండా. అది దాటితే ఒక గది.  అంతే మొత్తం ఇల్లు. కరెంట్ దీపాలున్నాయి. ఇంటంతటికీ రెండే కాంతి తక్కువ బల్బులు, వంటింట్లో ఒకటి, గదిలో ఒకటి. ఇంటి బయట  ఒక కొళాయి, ఒక బాత్ రూమ్, ఒక టాయిలెట్ ఆ వరసలోని ఇళ్ళన్నిటికీ కామన్. వాటి శుభ్రత విషయం అంతంత మాత్రమే. అద్దె నెలకు ఇరవయ్యో, ముఫ్ఫైయో. మధ్య తరగతివాళ్ళకు అలాటిచోట్ల ఇల్లు దొరకడమే గొప్పని అనేవారు. ఆ లోగిలి సొంతదారుడు ఒక గుజరాతీ సేఠ్ అట. మా ఇంటికి ఎదురుగానే పెద్ద బంగళాలో వుంటారట. ఇంటికి చాలా పెద్దగేటు, లోపల పెద్ద పెద్ద కార్లు మాత్రమే కనిపించేవి. మనుషులు కనిపించేవారు కాదు. ఎప్పుడేనా కారు బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా ౠఎవరో తోటమాలి తలుపు తెరిచేవారు. వెంటనే తలుపులు మూసుకునేవి. అలాటప్పుడు ఒకసారి లోపలకు తొంగి చూసాను. వీధి వాకిట్లోనే చాలా పెద్ద కొలనులా వుంది. దాని మధ్య ఒక  పెద్ద రంగుల సిమెంట్ తామర మొగ్గ. కొలను చుట్టూ రౌండ్ గా సిమెంట్ తొట్టి. అలాటి కొలను  పాతాళభైరవి సినిమాలో 'ఎంత ఘాటు ప్రేమయో' పాటప్పుడు చూసిన గుర్తు. దానిని వాటర్ ఫౌంటెన్ అంటారట. అందులోనుండి నీళ్ళు చిమ్ముతాయట. అయితే, ఆ వింత ఆ ఇంట్లో ఉన్న రోజుల్లో చూడ్డం అవలేదు. 









ఏది ఏమైనా ఈ బంగళాపెంకుటింటి కంటే మా బొబ్బిలి పూరిల్లే విశాలంగా చాలా బాగుండేదనిపించింది. 

ఇంటిలోనుండి వీధిలోకి వచ్చి కుడివైపు కొంత దూరం వెడితే అడ్డంగా ఒక మెయిన్ రోడ్. దాని పేరు 'సర్ మహమ్మద్ ఉస్మాన్ రోడ్'. అక్కడ ఎడమ వేపు తిరిగి ఒక పది నిముషాల పాటు నడిస్తే 35 ఉస్మాన్ రోడ్ వస్తుందని మా నాన్నగారు చెప్పారు. అదే ఘంటసాలవారిల్లు.

ఘంటసాల అంటే గుర్తుకు వచ్చింది. మా లోగిట్లో కూడా ఒక ఘంటసాల వుండేవారు. అయితే జూనియర్ ఘంటసాల. పేరు బాగేపల్లి సుబ్రమణ్యం. భార్య, ఒక చంటిపిల్లవాడు వారి కుటుంబం. మా ఇంటికి ఎదురు వరసలో ఇల్లు. వారు కన్నడిగులే  అని గుర్తు. కానీ తెలుగు బాగా తెలుసు.  ఆయన దగ్గర ఒక గ్రామఫోన్ మూడో నాలుగో రికార్డ్లు ఉండేవి. ఆయన 'ఉమాసుందరి' సినీమాలో పిఠాపురం తో కలసి ఒక పాట పాడారట. కానీ ఇప్పుడు నెట్ లో ఆ సినిమా టైటిల్స్ లో ఆయన పేరులేదు. మరేవో మూడు పాటలు ఆయనవే, గ్రామఫోన్ లో వేసి వినిపిస్తూండేవారు ఎవరొచ్చినా. అలాగే,  'జూనియర్ ఘంటసాల 'బాగేపల్లి సుబ్రహ్మణ్యంగారి గాన కచేరీ  అని ప్రింట్ చేయబడిన లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ పాంప్లెట్స్ చూపించేవారు. కానీ, ఆ గ్రామఫోన్ లో వారిగొంతు ఘంటసాలగారి గొంతులా నాకనిపించలేదు. నా గ్రహణశక్తి లోపం కావచ్చు. మేము ఆ ఇల్లు వదలి వెళ్ళాక మళ్ళీ ఆ బాగేపల్లి సుబ్రమణ్యంగారిని నేను చూడడం తటస్థించలేదు. గాయకుడిగా కూడా ఆయన పేరు విన్న గుర్తులేదు. మెడ్రాస్ లో  తాము నేర్చుకున్న విద్యకు తగ్గ గుర్తింపు, అవకాశం లభించక కనుమరుగైపోయిన ఇలాటి సినీ కళాకారులెందరో.



తెలుగు, ఇంగ్లీషు, హిందీయే కాకుండా ఇంకా చాలా భాషలే వున్నాయని రంగయ్యర్ స్ట్రీట్ ఇంటికి వెళ్ళేకే నాకు తెలిసింది. అదొక మిని భారత దేశం. రకరకాల మనుషులు. అధిక సంఖ్యలో తమిళులు, స్వల్ప సంఖ్యలో తెలుగు, కన్నడ, మలయాళ, గుజరాతీ, మరాఠీ కుటుంబాలు ఆ వీధిలో వుండేవి. 

ఆ ప్రాంతంలోని అన్ని వీధులలో ఇలాటి లోగిళ్ళు రెండో మూడో వుండడం తర్వాతి కాలంలో గమనించాను. మా లోగిట్లో వారు మాట్లాడేది తమిళం, కన్నడం, మలయాళం భాషలంటారని క్రమక్రమంగా అర్ధమయింది. ఏ భాష ఏదో తెలిసేది కాదు, తెలుగు తప్ప. తెలుగులో మాట్లాడేవాళ్ళు తక్కువే. అక్కడి వాళ్ళు మాట్లాడే తెలుగుకి, నాకు తెలిసిన తెలుగుకి చాలా తేడావుంది. అరవం ఒక్క ముక్క అర్ధమయేది కాదు. (తమిళాన్ని అరవం అని అనడానికి కారణం ఏమిటో ? ఎవరైనా భాషా చరిత్రకారులు చెప్పాలి).

'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' తో పాటూ ఇతర భాషామ తల్లులని కూడా మల్లెపూదండలతో గౌరవించాలని రంగయ్యర్ స్ట్రీట్ లో నాకు బాగ అర్ధమయింది. 

నెం.11, రంగయ్యర్ స్ట్రీట్ లోగిట్లోవారంతా ఎవరి భాషలో వారు పలకరించేవారు. నాచేత మాట్లాడించడానికి ప్రయత్నించేవారు. అసలు బయట జనాలంటేనే భయం. అందులో ఏవేవో భాషలవారితో నేనేం మాట్లాడగలను. అందుకే, నా నైజం అర్ధం చేసుకున్న మా పెద్దమ్మమ్మగారు 'వీడు ఇంట్లో పులి, వీధిలో పిల్లి' అని అనేవారు.

రంగయ్యర్ స్ట్రీట్ ఇంటికి వెళ్ళిన కొద్దిరోజులకే బోల్డు కష్టాలలో ఇరుక్కున్నాను, భాషాపరంగా. ఒక రోజు మా అమ్మగారు పక్కవీధిలోని దుకాణానికి వెళ్ళి కాఫీగుండ తెమ్మని పురమాయించారు. ఆ దుకాణం మా ఇంటికి ఎడమవేపునున్న మాంబళం రైల్వే స్టేషన్ రోడ్ లో వుండేది. ఆ రోడ్ మీద ఎడమవేపు కొంత దూరం వెడితే  లోకల్ రైల్వే స్టేషన్, కుడివేపు వెళితే  దొరస్వామిరోడ్ లెవెల్ క్రాస్. ఒక పక్క పానగల్ పార్క్ రోడ్. లెవెల్ క్రాస్ కు అవతల వేపు వెస్ట్ మాంబళం. వెస్ట్ మాంబళం అతి ప్రాచీనం. మేముండేది కొత్త మాంబళం. దానినే త్యాగరాయనగర్ (టి.నగర్) అంటారట. 

నేను మా అమ్మగారు చెప్పిన కొట్టుకి (షాపు)వెళ్ళాను కాఫీగుండ కొనడానికి. అప్పట్లో ఆ షాప్ కు  ఏ పేరుండేదో గుర్తులేదు కానీ, తర్వాతి కాలంలో TUCS(ట్రిప్లికేన్ అర్బన్ కోపరేటివ్ స్టోర్)గా, ఆ ప్రాంతపు రేషన్ షాప్ గా వృధ్ధి చెందింది. సరే, ఆ షాపుకు వెళ్ళేను. పెద్దగా జనాలు లేరు అప్పటికి. కౌంటర్లో వున్నవాడితో  మా అమ్మగారు చెప్పినట్లుగా తూచా తప్పకుండా 'కాఫీగుండ' కావాలని అడిగాను శుధ్ధ తెలుగులో. నేనడిగింది అతనికి అర్ధమైనట్లులేదు. 'ఎన్నా వేణుం' అని అతనన్నది నాకర్ధంకాలేదు. మళ్ళీ 'కాఫీగుండ' అన్నాను. ఆ షాపువాడికి కాఫీ అన్నమాట ఒక్కటే తెలిసింది. అదిక్కడ దొరకదు హోటల్ కు పో అన్నాడు అరవంలో.  నాకు కావలసింది హోటల్ కాఫీ కాదు. అక్కడే నిలబడ్డాను జెండా కొయ్యలాగ. జనాలు వస్తున్నారు, పోతున్నారు. మరికొంతసేపటికి మరొకడు వచ్చి అడిగాడు ఏం కావాలని. మళ్ళీ అదే పాట 'కాఫీగుండ'. వీడికి నా మాట అర్ధమైనట్లుంది. లోపలికి వెళ్ళి పొట్లం కట్టి తీసుకువచ్చి నా దగ్గర డబ్బులు తీసుకొని, ఆ పొట్లాం చేతిలో పెట్టాడు. అమ్మయ్య! మొత్తానికి సాధించానని సంతోషంగా ఇంటివేపు లగెత్తాను. ఇంట్లోకి వచ్చి ఆ పొట్లాన్ని మా అమ్మగారికి ఇచ్చేను. 'ఇదేమిటి? కాఫీగుండ ఏది? ప్రశ్న. 'అదే ఇది' సమాధానం. పొట్లం విప్పి చూస్తే లోపల కాఫీ గుండ లేదు. వేయించని కాఫీ గింజలు.  అమ్మక్కోపం వచ్చింది. నేను గుండ అన్నది షాపు వాడికి కాఫీ గుండుగింజలుగా అర్ధమయింది. మా నాన్నగారే మళ్ళీ ఆ షాపుకు వెళ్ళి ఆ కాఫీ గింజలు మార్చి కావలసిన కాపీ తూళ్ అదే కాఫీ పొడి కొనుక్కువచ్చారు. అమ్మ చెప్పిన కాఫీగుండ తేలేకపోయినందుకు నాకు ఘోర అవమానంగా తోచింది. నా తెలుగు తెలియని ఆ అరవ్వాళ మీద కోపం వచ్చింది. 

అదే, మెడ్రాస్ లో నా మొట్టమొదటి షాపింగ్ అనుభవం.
ఇలాటి అరవంపు బాధలు మరిన్ని ...
వచ్చే వారం ....
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Friday, October 9, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - మొదటి భాగం

09.10.20 - శుక్రవారం భాగం - 1*:
మొదటి అధ్యాయం పంధొమ్మిదవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1955 చివరి నెలలలో మా నాన్నగారు, శ్రీ పట్రాయని సంగీతరావు గారు విజయనగరంనుంచి తన కుటుంబాన్ని మాత్రం మెడ్రాస్ కు మార్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికి మా తాతగారు  శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఇంకా విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్రోపన్యాసకునిగా పనిచేస్తూనే వున్నారు. మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు 1953 లోనే విశాఖపట్నానికి మకాం మార్చారు. అక్కడ డాబా గార్డెన్స్ లో ఒక చిన్న సంగీతం స్కూల్ పెట్టి గాత్రం, వీణ, క్లాసెస్ ప్రారంభించారు. విజయనగరంలో మా తాతగారు, పెద్దమ్మమ్మగారు, ప్రభూ చిన్నాన్నగారు, కమల పిన్నిగారు, వారి పిల్లలు ప్రసాద్, మంగమాంబ వున్నారు. విజయనగరంలో వుండేప్పుడు మా ప్రసాద్, నేనూ చాలా సఖ్యంగా వుండేవాళ్ళం. ఇప్పటికి ప్రసాద్ నాపట్ల చాలా ప్రేమాభిమానాలతో వుంటాడు. అతను నాకంటే రెండేళ్ళు చిన్న.

చిన్నతనంలో ప్రసాదు, స్వరాటు

ఇది మేము విజయనగరం వెళ్ళిన కొత్తల్లో మా ఇద్దరికీ ఫోటో స్టూడియోలో తీసిన ఫోటో. ఆ వయసులోని ఫోటో చూస్తూంటే ఏదో తమాషాగా వుంటుంది. 

అలాటి ఆత్మీయులందరినీ వదలి మెడ్రాస్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎలా ఫీలయ్యానో నాకు ఏమాత్రం గుర్తులేదు. బహుశా, చాలా దూరం రైలు ప్రయాణం చేయబోతున్నాననే సంతోషం వుందేమో. అంత సుదీర్ఘ రైలు ప్రయాణం చేయడం, నా పదేళ్ళ జీవితంలో అదే మొదటిసారి. అంతకుముందు ఒకసారి ఏదో పాతమొక్కుబడి తీర్చాలని నన్ను సింహాచలం కొండకు తీసుకువెళ్ళారు. అంతకు కొన్ని రోజులముందే విపరీతమైన జ్వరం వచ్చింది. (పదేళ్ళు దాటేవరకు వరకూ తరచూ నాకు మలేరియా జ్వరం వస్తూండేది). సింహాచలం కొండమీదకు మెట్లన్నీ (సుమారు వేయికి పైనే మెట్లున్నాయి). అంత చిన్న వయసులో (7 ఏళ్ళు)  ఎవరి చంకా ఎక్కకుండా అన్ని మెట్లు నేనే ఎక్కి వెళ్ళినందుకు మా అమ్మగారు అందరితో చెప్పి మురిసిపోవడం బాగా గుర్తుండిపోయింది. నేనూ ఏదో ఘనకార్యం సాధించేననే అనుకున్నాను. 

సింహాచలం  దేవుడు వరాహ నరసింహస్వామి. ఆ రోజుల్లో కొండమీదకు బస్సులు లేవు. కాలినడకనే మెట్లమీదుగా వెళ్ళవలసి వచ్చేది. సింహాద్రి అప్పన్న కొండంతా రకరకాల వృక్షాలతో, పూల వనాలతో సుగంధభరితంగా వుండేది. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా  ఉన్న పనసపళ్ళతో చెట్లు‌, ఆకు సంపెంగ, రేక సంపెంగ వృక్షాల సముదాయంతో, చిన్న చిన్న జలధారలతో దైవీక వాతావరణం మధ్య ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మా దైవ దర్శనం జరిగింది.

అక్కడ నుండి విశాఖపట్నం కూడా వెళ్ళాము. అందుకోసం సింహాచలం స్టేషన్ లో ఒక పెద్ద రావిచెట్టు క్రింది చప్టామీద కూర్చొని చాలాసేపే గడిపాము. ప్లాట్ ఫారమ్ మీద జనాలే లేరు. చల్లటి కొండగాలికి రావి ఆకుల గలగల సవ్వడి చేస్తూంటే చాలా హాయిగా అనిపించింది. ఈలోగా కాస్తా కాలక్షేపం కోసం మా నాన్నగారు పక్కనున్న టీ స్టాల్ నుండి వేడి వేడిగా  "శనగపప్పు పకోడీలు  ఫ్రెష్ గా వేస్తున్నాడంటూ పట్టుకొచ్చేరు. అందుకు మా అమ్మగారిచ్చిన సమాధానం 'ఆ! గుడ్డు! ఇప్పుడు ఏ హోటల్ వాడు శెనగపిండి వాడుతున్నాడు. ఇవి బఠాణీ పిండితో చేసిన పకోడీలే' అని ఒక్కమాటలో తేల్చేసింది. ఈ మాటలంటున్నప్పుడు ఆవిడ యిచ్చిన రియాక్షన్ ఇంకా అలాగే మనసులో నిల్చిపోయింది. అంటే ఆనాటికే కాదేదీ కల్తీకనర్హం అన్న వ్యాపారసూత్రం బాగా ప్రబలిందనుకోవాలి. (విజయనగరం కోటయ్య కొట్లోని పకోడీలు చాలా ప్రశస్థమని మా తాతగారు అప్పుడప్పుడు తెచ్చేవారు, కల్తీలేనివే అయుంటాయి). 

తర్వాత, వాల్టేర్ వెళ్ళే ప్యాసింజర్ రావడం మేము రైలెక్కడం జరిగింది. ఆ రాత్రికి విశాఖపట్నం లో డాబా గార్డెన్స్ లోని మా చిన్నాన్నగారింట గడిపాము.  ఆ ఇల్లు లీలామహల్ పక్క వీధిలో వుండేది. (అప్పట్లో ఆ ధియేటర్ పేరు నాకు తెలీదు). ఆనాటికి విశాఖపట్నం చిన్న పట్టణమే. అంత అభివృధ్ధి చెందలేదు. ఇళ్ళు కూడా చెదురుమదురుగానే వుండేవి. చీకట్లో ఊరంతా నిర్మనుష్యంగా వుండేది. డాల్ఫిన్స్ నోస్ కొండమీది లైట్ హౌస్ లైట్ వెలుగు, వాల్టేర్ అప్ ల్యాండ్స్ లోని గవర్నర్ బంగళా లైట్ల వెలుగు మా చిన్నాన్నగారింటికి స్పష్టంగా కనిపించేది. ఇతర కొండలమీద ఇళ్ళేవీ లేవు అప్పటికి. వాల్టేర్ రోడ్లన్నీ   ఎగుడు దిగుడు రోడ్లు. సిటీ బస్సులు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ రిక్షాలలోనే వెళ్ళాలి మనస్సాక్షి  చంపుకొని. ఒక పావలా ఇస్తే ఇద్దరు మనుషుల్ని ఎక్కించుకొని రైల్వే స్టేషన్ నుండి నాలుగైదు మైళ్ళ దూరం వరకూ తీసుకుపోయేవారు. ఎత్తు ప్రాంతాలలో  రిక్షా తొక్కలేరు. లాగుతూ, నడిపించుకునే తీసుకువెళ్ళాలి. ఎండైనా, వానైనా. ఆ రిక్షావాళ్ళ శ్రమ, కష్టం చూస్తే మనసుకు బాధ కలుగుతుంది. అలాటివారితో బేరాలాడడం మా నాన్నగారికి ఇష్టంవుండేది కాదు. ఆయన అన్నివిధాలా చాలా ఉదారంగానే ఉండేవారు. మా నాన్నగారెప్పుడూ పిల్లల్ని కొట్టడం, తిట్టడం చేయలేదు. కానీ కోపం వస్తే ఆయన  తీక్షణమైన చూపులు, ఘాటైన ఉపన్యాసాలు తీవ్రంగా వుండేవి. 

మా నాన్నగారు కథలు చెప్పే తీరు చాలా అద్భుతం. ఎక్కువగా టాగోర్, శరత్, ప్రేమ్ చంద్ కథలు చెప్పేవారు. ఆయన చెప్పిన కథలు చాలా బరువైనవిగా వింటూంటే దుఃఖం కలిగించేవిగా ఉండేవి. అంతలా మనసుకు హత్తుకునేలా కథలు చెప్పే తీరు నాకు మరెవరి దగ్గరా కనపడలేదు. ఈ విషయాన్ని ఘంటసాల సావిత్రమ్మగారు, పాప పిన్నిగారు (ఘంటసాల సదాశివుడిగారి భార్య) కూడా తరుచూ చెప్పేవారు. మేము మెడ్రాస్ కు వెళ్ళకముందు మా నాన్నగారు ఒంటరిగా ఓ ఏడాదికి పైగా ఘంటసాల వారింటి మేడమీద వుండేవారు. (పానగల్ పార్క్ దగ్గరి పార్క్ లాండ్స్ హోటల్ లో భోజనం, 35 ఉస్మాన్ రోడ్ మేడ మీదం మకాం). సత్రవు భోజనం, మఠం నిద్ర. అలాటి రోజుల్లో సాయంత్రం పూట బాల్కనీలో కూర్చొని  అందరూ సరదాగా కబుర్లు చెప్పుకునే సమయాలలో మా నాన్నగారు ఇలాటి కథలెన్నో చాలా రసవత్తరంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పేవారని, సంగీతంగారి కథలు విన్న తరువాతే పుస్తక పఠనం మీద ఆసక్తి పెరిగిందని చెప్పేవారు.

అలాగే, ఆయన పాడే తీరు, హార్మోనియం మీద కర్ణాటక సంగీతం వాయించే విధానం నన్ను కట్టి పడేసేవి. నేనే కాదు, మా నాన్నగారిని గురించి తెలిసినవారంతా ఇలాగే చెప్పేవారు. సంగీత, సాహిత్యాలలో ఆయనకున్న శాస్త్రపరిజ్ఞానం, అనుభవం అపారం. ఎడ్వాన్స్డ్ మ్యుజీషియన్స్ కు ఆయనొక గొప్ప గైడని ఆయన దగ్గరకు పలువురు సంగీత విద్యార్ధులు వచ్చేవారు. సంగీతరావు గారు గొప్ప మ్యూజికల్ జీనియస్సని డా. సి. నారాయణరెడ్డి గారు సభాముఖంగా ప్రశంసించడం నేను విన్నాను. ఆ సభలో సంగీతరావు గారు లేరు. ఆరుద్ర లాటి చరిత్రకారుడు కూడా సంగీతం విషయంలో ఆయనను సంప్రదించేవారు.   ఆయన స్థాయి సంగీత జ్ఞానం కలిగిన కొందరు ప్రముఖులు పొందిన గుర్తింపు ఆయనకి దక్కలేదన్నది ఆయన మిత్రులు కొందరి అభిప్రాయం. కమర్షియల్ పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మా నాన్నగారు, తాత, ముత్తాతల మార్గం భిన్నం. వారి ఆశయాలు, ఆదర్శాలు, వారిని మరో మార్గంలో నడిపించేయి.  

మా టివికె శాస్త్రిగారు ఎప్పుడూ ఒక మాట అనేవారు "మీ తాత, నాన్నల సంగీతం విని అనుభవించలేకపోవడం జనాల కర్మ. వాళ్ళకు ఆ అదృష్టం, ప్రాప్తం లేదు" అని. ఆయన కుటుంబం అంతటికీ మా తాత తండ్రుల గురించి తెలుసు. టివికె శాస్త్రిగారు కళాకారులను ఉద్దేశించి మరొక మాట కూడా ఎప్పుడూ అంటూండేవారు  "ఎంతటి బంగారు పళ్ళేనికైనా, దాని విలువ, మెఱుపు తెలియాలంటే ఒక మంచి దన్ను, దాపు ఉండాలి. ఆ పనే మనం చేస్తున్నాము. మనలాటివాళ్ళు పూనుకొని ప్రోత్సహిస్తేనే మరుగున పడిన మాణిక్యాలు కొన్నైనా బయటపడతాయి" అని  యువకులకు స్ఫూర్తినిచ్చేవారు. ఆ విశేషాలన్నీ మరో అధ్యాయంలో.

ఓ! నేను ఈ విషయాలు చెపుతూ కూర్చుంటే మెడ్రాస్ రైలు తప్పినా తప్పిపోవచ్చు. ఇంక మెడ్రాస్ మార్గం పడదాం.

నేను పుట్టిన దగ్గరనుండి దూసి-విజయనగరం, విజయనగరం- బొబ్బిలి మధ్య అనేకసార్లు రైళ్ళలో ప్రయాణం చేసినా నాకవి అంతగా గుర్తులేవు. ఆ రోజుల్లో విజయనగరం నుండి వెళ్ళాలంటే రెండో మూడో రైళ్ళుండేవి, ఒకటి హోరా వేపు, మరొకటి రాయపూర్ వేపు. అందువల్ల వచ్చీపోయే రైళ్ళలో జనాలరద్దీ ఎక్కువగానే వుండేది. మా (సామవేదుల) వరహాల్తాతగారి రైల్వే పరిభాషలో - ప్రతి  డబ్బా - కంపార్ట్ మెంటూ క్రిక్కిరిసే వుండేది. (ఆయన రాసిన రైలు కథలు, రైల్వే జోకులు తరుచూ ఆంధ్రపత్రికలో వచ్చేవి).  ఆ రైళ్ళలో  I, II, III అని మూడు తరగతులు. తొంభై శాతం ప్రయాణీకులు III క్లాసు డబ్బాల్లోనే ప్రయాణం. ఆనాటికి ఎడ్వాన్స్ రిజర్వేషన్ల పధ్ధతి లేదు. అంతా జనరలే. కండబలం కలిగినవాడే రైల్లో రారాజు. రైల్లో సీట్లు నాలుగు వరసల్లో పొడుగాటి కర్రబల్లలతో వుండేవి. కిటికీల వేపు రెండు వరసలు, మధ్యలో ముందు వెనుకలుగా రెండు వరసలు వుండేవి. సామాన్లు పెట్టుకుందుకు  పైన బల్లలుండేవి. అయితే, అవెప్పుడూ హోల్డాల్ లు పరచి బలాఢ్యులైన  వారి నిద్రలకే నిర్ణయమైపోయివుండేవి. అప్పట్లో ఎవరికీ less luggage more comfort అన్న స్లోగన్ అనుసరించవలసిన విషయంలా అనిపించేదికాదేమో. తక్కువ దూరం ప్రయాణమైనా ఒక హోల్డాల్, నీళ్ళ మరచెంబు, ఓ సూట్ కేసు, గొడుగు, విసనకర్ర తప్పనిసరి. మా నాన్నగారి చిరకాల స్నేహితుడు, తరువాత మా నారాయణమూర్తి చిన్నాన్నగారి వియ్యంకుడు, ప్రముఖ కవి, రచయిత అయిన కీ.శే. శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారు రాయఘడా నుండి ఎప్పుడు విజయనగరం వచ్చినా హోల్డాల్ తప్పనిసరి. అది మోయడానికి ఒక కూలీ. 

35, ఉస్మాన్ రోడ్ ఆఫీస్ రూం దగ్గర  
శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారితో నాన్నగారు 

ఇన్ని సామాన్లు, జనం రద్దీల మధ్య శనక్కాయలు, జంతికలు, జాంపళ్ళు అమ్మేవాళ్ళ జంగిడీలతో ప్రయాణం అనూహ్యం. మరి మా నాన్నగారు పూర్తి సామానుతో, ఇద్దరు చిన్న పిల్లలతో అంత రద్దీలో  విజయనగరంలో ఎలా రైలెక్కించగలిగారో ఆయనకే తెలియాలి. సగం మంది ప్రయాణీకులకే సీట్లు. మిగిలిన వారంతా వారి వారి పెట్టెల మీద సద్దుకోవడం, లేదంటే తమ స్టేషన్ వచ్చేవరకు వచ్చేపోయేవారి తోపులాటలు, కీచులాటలు భరిస్తూ నిలుచోవడం. అంతకు మించి వారికి వేరే గత్యంతరం లేదు. రైలు ప్రయాణం ఒక భగీరథ యత్నం. 

నా మొట్టమొదటి సుదీర్ఘ రైలు ప్రయాణం, విజయనగరం నుండి మెడ్రాస్ కు జనతా ఎక్స్ ప్రెస్ లో జరిగిన జ్ఞాపకం. ఆ రైలు హౌరా(కలకత్తా)లో బయల్దేరి ఖర్గపూర్, భువనేశ్వర్, కటక్, ఆముదాలవలసల మీదుగా విజయనగరం వచ్చి, వాల్టేర్, విజయవాడ, నెల్లూరు, గూడూరుల మీదుగా మెడ్రాస్ చేరేది. (విశాఖపట్నం పోర్ట్ స్టేషన్ కి కొన్ని ఎక్స్ ప్రెస్, పాసెంజర్ ట్రైన్స్ మాత్రం వెళ్ళేవి) ఈ మధ్యలో మరెన్నో ఊళ్ళు. ఆ లిస్టంతా మొదలెడితే కోట శ్రీనివాసరావు ప్రహసనమే అవుతుంది. ఆరోజుల్లో, నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ రెండే రైళ్ళు. ఈనాటికీ తూర్పుకోస్తా తీరం వెంబడి ప్రతిరోజూ 1,664 కిలోమీటర్ల దూరాన్ని28 గంటల్లో దాటుతూ సుదీర్ఘంగా నూట ఇరవై ఏళ్ళుగా ప్రతిరోజూ ప్రయాణిస్తూన్న హౌరా మెయిల్ ఒకటి.

 
   ఆనాటి WP స్టీమ్ ఇంజిన్                    ఇప్పటి WAP ఎలక్ట్రిక్ లోకో మోటివ్

మరొకటి జనతా ఎక్స్పెస్. కొన్నాళ్ళకు దాని స్థానంలో హౌరా ఎక్స్పెస్ వచ్చింది. మరికొన్నేళ్ళకు 1977 మార్చిలో ఆ బండి స్థానే కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వచ్చి రెండు మహా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు రెండు గంటలు  తగ్గించింది. 

ఆరోజుల్లో జనతా ఎక్స్ ప్రెస్  లో మెడ్రాస్ చేరడానికి  20 గంటలకు పైనే పట్టేది. విజయనగరం స్టేషన్ లోకి రైలు సైటింగ్ అయిందనగానే కలకలం మొదలయేది. జనాలంతా పిల్లాపాపలతో సామానేసుకొని ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందు వెనుకలకు పరుగులు మొదలెట్టేవారు. దూరాన కనిపించే రైలును చూడగానే నాకు కంగారుపుట్టేది. రైలింజన్ ఆవిరి చిమ్ముకుంటూ స్టేషన్ అదిరేలా ప్లాట్ఫారమ్ మీదకు రావడంతోనే నా గుండె అదరడం ప్రారంభమయేది. ఆ టెన్షన్ ఇప్పటికీ నాకు వుంది. చెన్నై నుండి బయల్దేరే రైళ్ళయితే ఇబ్బంది లేదు కానీ బయట వూళ్ళనుండి వచ్చే రైళ్ళు ఎక్కాలంటే కంగారే కంగారు ఇప్పటికీ, ఎంత రిజర్వేషన్ బెర్తులున్నా, ఆ గుండెల్లో గాభరా తగ్గలేదు. 

మరి, మేము మెడ్రాస్ రైలు ఎలా ఎక్కాము, సీట్లు దొరికాయా లేదా అనే విషయాలు గుర్తులేవు.

మేము మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ లో రైలుబండి దిగి ప్లాట్ ఫామ్ మీద అడుగు పెట్టగానే వేరేదో లోకంలోకి వచ్చినట్లయింది.

వచ్చేవారం నుండి మద్రాసు జీవితం కొత్త విశేషాలతో.....

                    .... సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.