visitors

Showing posts with label పట్రాయని సంగీతరావు. Show all posts
Showing posts with label పట్రాయని సంగీతరావు. Show all posts

Friday, August 7, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదకొండవ భాగం

07.08.20 - శుక్రవారం భాగం - 11 :
పదవ భాగం ఇక్కడ

నెం.35 ఉస్మాన్ రోడ్

                                                          - ప్రణవ స్వరాట్

బాలరాజు, కీలుగుఱ్ఱం, లైలామజ్ను, మనదేశం, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు, సినీమాలతో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా తెలిసింది. విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్న వ్యక్తి మెడ్రాస్ వెళ్ళి సినీమాలలో స్థిరపడి పేరు తెచ్చుకోవడం ఆ వూరి వారందరికీ గర్వకారణంగా వుండేది.  విజయనగర ప్రాంతాలకు చెందిన రావి కొండలరావు, జెవి రమణమూర్తి వంటి నటులకు, ఏవిఎన్ మూర్తి వంటి గాయకులకు సినీమాలలో చేరడానికి ఘంటసాల ఒక స్ఫూర్తిగా నిలిచారు.

అప్పట్లో, జెవి రమణమూర్తి తయారు చేసిన 'విశ్వశాంతి' అనే నాటకానికి మా నాన్నగారు- సంగీతరావు గారు  సంగీతం సమకూర్చారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో ఆ నాటకానికి ఉత్తమ బహుమతి లభించింది.  కన్యాశుల్కంలోని గీరీశం పాత్ర రమణమూర్తి గారికి పేటెంట్. 
కన్యాశుల్కం నాటకాన్ని దేశవ్యాప్తంగా కొన్ని వందల ప్రదర్శనలిచ్చారు. తరువాత,  కెబి తిలక్ ఆయనను ఎమ్ఎల్ ఏ సినీమాలో హీరోగా పరిచయం చేయడం మీ అందరికీ తెలిసినదే. 'శంకరాభరణం' సోమయాజులు గారు రమణమూర్తి సోదరుడే. ఆయనా మంచి రంగస్థలనటులు. చాలా లేటుగా సినీమాల్లోకి వచ్చారు.  ఉత్తరాంధ్రాకు చెందిన పింగళి వారు, ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్యగారు అప్పటికే మద్రాసు చేరారు.

మా ఇంటికి ఎదురింట్లోనే గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీ ఏవిఎన్ మూర్తి కుటుంబం వుండేది. అప్పటికి ఆయన చిన్నవాడే. తరువాత సంగీతం నేర్చుకొని మద్రాసు వెళ్ళారు.

                                     శ్రీ ఏ.వి.ఎన్. మూర్తి
 ఆయన తమ్ముడు గోపాలరావ్, సర్వి అనే సర్వేశ్వరరావు, మంత్రిప్రగడ నాగభూషణం, వేలమూరి రామారావు, నా వయసువారు. అందరం కలసి ఆటలాడేవాళ్ళం. మల్లాప్రగడ, కందాళం, వడ్లమాని, నేమాని వంటి కుటుంబాలు ఆ గెడ్డ వీధిలోనే ఉండేవి.

ఘంటసాలవారు మా ఇంటికి వస్తారన్న వార్త అందరికీ తెలిసింది. ఒక్కొక్కరుగా వచ్చి ఎప్పుడొస్తారు, ఎన్నాళ్ళుంటారని మావాళ్ళను అడగడం మొదలుపెట్టారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గురువుగారి శిష్యుడన్న విషయం వారికి తెలుసు. 

ఈ హడావుడి మా తాతగారికి కంగారు పుట్టించింది. మర్నాడు, ఘంటసాల వచ్చేప్పటికి వీధిలో వారంతా ఇంటికి వచ్చేస్తే సంబాళించడమెలా, వచ్చే అతిధులకు ఇబ్బందికరంగా తయారౌతుందేమోనని భయం. అదీకాక చాలా పసిపిల్లలున్న ఇంట్లో వచ్చే వారికి తగిన మర్యాదలు చేయడం కష్టమనే భావన. ఇవన్నీ ఆలోచించి ఘంటసాల కుటుంబాన్ని కొంతసేపు వుంచుకొని తరువాత, తమ మిత్రులైన వసంతరావు బ్రహ్మాజీరావుగారింట్లో దింపుదామనే నిర్ణయానికొచ్చారు. బ్రహ్మాజీరావుగారి తమ్ముడు వసంతరావు వెంకట్రావుగారు  ఎమ్ ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా వుండేవారు. వారంతా మా తాతగారికి అతి సన్నిహితులు.
1951లో ఘంటసాలవారు మెడ్రాస్ లో స్వంతంగా ఒక మేడను కొనుగోలు చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఆ సందర్భంగా గురువుగారిని మెడ్రాసు రప్పించి సగౌరవంగా సత్కరించారు. ఆ రోజు సాయంత్రం గురువుగారు, మా తాతగారైన పట్రాయని సీతారామశాస్త్రిగారి సంగీతకచేరీ కూడా ఏర్పాటు చేశారు. శిష్యుడు సాధిస్తున్న ప్రగతికి గురువుగారెంతో సంబరపడ్డారు.





అటువంటి శిష్యుడు కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడం సంతోషకరమే అయినా  కనీసం కరెంట్ వసతి కూడా లేని ఆ ఇంటిలో వారు ఎలా గడపగలరు అనేది ఆయన చింత. అందుకే సకల వసతులు గల తమ మిత్రుల ఇంటిలో బస ఏర్పాట్లు చేశారు.

అనుకున్నట్లుగానే మర్నాడు ఉదయం ఒక కారులో అతిధులు వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారో గుర్తులేదు‌, కానీ ఒక మగ, ఇద్దరు ఆడ, ఓ చిన్న బాబు మాత్రం బాగా గుర్తుండిపోయింది. వచ్చినాయన తెల్లటి చొక్కా, అరవ్వాళ గుండారు కట్టుకొని ఉన్నారు. వచ్చినావిడ చాలా తెల్లగా పొడుగ్గా కనిపించారు. వాళ్ళ బాబుకు రెండేళ్ళుంటాయేమో. ఆవిడను మా ఇంట్లో వాళ్ళందరికీ 'నా వైఫ్ సావిత్రి' అని చెప్పారు. ఆవిడ అందరితో కలుపుగోలుగా మాట్లాడారు. మరొక పెద్దావిడ ఆయన తల్లిగారట. 

(ఘంటసాలగారి తల్లిగారు రత్తమ్మగారు)
ఆ వచ్చినాయన పేరే ఘంటసాల అని తెలిసింది. వారిని చూచేందుకు నాకు తెలియని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి పలకరించడం ఆయన సమాధానాలు చెపుతూ మాట్లాడడం జరిగింది.ఇల్లంతా కోలాహలంగా వుండడం పిల్లలమైన మాకు మంచి ఉత్సాహంగా అనిపించింది. ఘంటసాలగారు మధ్య మధ్యలో "రాజీ! అని పిలవడం, "ఓయ్ అని ఆ సావిత్రి గారు రావడం వింతగా అనిపించింది. ఆవిడ పేరు  సావిత్రి అన్నారే, ఇప్పుడు రాజీ అని పిలుస్తున్నారే. ఆవిడకు రెండు పేర్లా ? అని నాకు సందేహం.  అందరి మాటలు వింటూ ఇంట్లో ఒక ఓరగా నిలబడి వింతగా చూస్తూండిపోయాను. ఘంటసాల గారు ఏవో పాటలు పాడిన గుర్తు. ఆ పాటలకు తగినట్లు బొద్దుగా ఉన్న వారి బాబు కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆడడం గుర్తుంది. మంచి లయజ్ఞానం ఉందని మాపెద్దవాళ్ళు ముచ్చట పడ్డారు. ఆ బాబు పేరు విజయకుమార్ అని చెప్పారు.

(ఘంటసాల విజయకుమార్)
ఘంటసాలగారు విజయా సంస్థలో ఆస్థాన సంగీత దర్శకుడిగా కాంట్రాక్టు జరిగిన మరుసటి సంవత్సరం ఈ బాబు పుట్టాడు. విజయాతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని ఈ బాబుకు ' విజయ' కలిసేలా పేరు పెట్టమని విజయా అధినేత బి.నాగిరెడ్డిగారు సూచించారట. ఆయన కోరిక మేరకు వారి బాబుకు విజయకుమార్ అని పేరు పెట్టడం జరిగిందని తరువాత కాలంలో తెలుసుకున్నాను. ఆ అతిధుల మాటలు, చేష్టలు కొన్ని నాకు బాగా కొత్త . మా పెరట్లో రాచ ఉసిరి, జామి, కొబ్బరి, పత్తి వంటి చెట్లతో చాలా చల్లగా ఉండేది. ఆ సావిత్రి గారికి చాలా ఒత్తైన, పొడుగాటి తలకట్టు ఉండేది. జడవేసుకోవడానికి మావాళ్ళు  పన్ని ఇవ్వబోతే ఆవిడ తన దువ్వెనతో తల దువ్వుకోవడం గుర్తుండిపోయింది. మా ప్రాంతాలలో దువ్వెనను పన్ని అంటారు. మాఇంట్లో పన్నిలు చిన్నవి. కానీ ఆవిడ దగ్గరున్న రంగుదువ్వెన చాలా పొడుగు. తల దువ్వుకుంటూ ఆ దువ్వెనను ఆవిడ తల మధ్యలో పెట్టుకొని మరింకే పనులో చేయడం నాకు ఒకటే ఆశ్చర్యం. మా ఇంటిలో అప్పటికి చూడనివి.

ఇలా కొన్ని గంటలు గడిపాక, వారందరూ బయటకు వెళ్ళారు. మా తాతగారూ, నాన్నగారితో నేనూ వెళ్ళడం జరిగింది. మాతో పాటూ ఆ వూళ్ళోనే ఇంటర్మీడియట్ చదువుతున్న మా నాన్నగారి కజిన్ గుమ్మా మార్కండేయ శర్మ కూడా ఉన్నారు. శర్మ బాబుగా చిరపరిచితుడైన ఆయన పాటలు, పద్యాలు బాగా పాడేవాడు.

ముందుగా, వసంతరావు బ్రహ్మాజీరావు గారింటికి వెళ్ళాము. వారిల్లు చాలా పెద్దిల్లు. ఇల్లాంతా ఎలక్ట్రిక్ దీపాలున్నాయి. నీళ్ళకొళాయిలున్నాయి. వరండాలు,హాల్స్ లో పెద్ద పెద్ద స్థంభాలు, పైనుండి క్రిందికి వేలాడుతూ రంగు రంగుల అద్దాల లైట్ డూమ్స్. ఏ కాలానివో. వాటిలో దీపాలు వెలిగించేవారో లేదో తెలియదు. బ్రహ్మాజీరావు గారి భార్య పేరు రాధమ్మగారు. ఆ దంపతులిద్దరికీ మా తాతగారన్నా, ఆయన పాటన్నా చాలా ఇష్టం. వసంతరావు వెంకట్రావు గారిని కూడా అనేక సార్లు చూశాను. వారంతా ఘంటసాల వారి రాక పట్ల చాలా సంతోషం పొందారు. మాటలు, పాటలు పద్యాల మధ్య మద్యాహ్నపు విందు వారింట్లోనే జరిగింది. 

గురువుగారు తమను ఆ రాత్రికి కూడా బ్రహ్మాజీరావు గారింటనే ఉంచదల్చుకున్నారనే వార్త ఘంటసాలగారికి తెలిసింది. ఆ నిర్ణయానికి ఒప్పుకోలేదు. ఆయన మాతాతగారితోనూ,  వారి కుటుంబ సభ్యులతో గడపడం కోసమే వచ్చామని  అందుచేత వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని రాత్రంతా గురువుగారింట్లోనే ఉంటామని పట్టుపట్టారు. అలాగే చేశారు. మార్గమధ్యంలో మ్యుజిక్ కాలేజి, ఎమ్ ఆర్ కాలేజి, సంస్కృత కాలేజి, ఆయనకు తెలిసిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ, ఒకసారి అయ్యకోనేరు గట్టుమీద ఉన్న గుమ్చీ ప్రాంతంలో ఆగి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అక్కడనుండి, విద్యార్ధి దశలో తనకు ఆకలి సమస్య తీర్చి నిశ్చింతగా సంగీతం నేర్చుకుందుకు దోహదపడిన సింహాచలం దేవస్థానం అన్నసత్రం లోపలికి కూడా వెళ్ళాము. అప్పటికి చీకటి పడింది. అక్కడి భోజనశాలలో కొంతమంది విద్యార్థులు బారులు తీరి భోజనాలు చేస్తున్నారు. అందులో చాలామందికి వచ్చినవారి గురించి ఏమీ తెలియక వింతగా చూశారు. ఘంటసాలగారు ఆ పరిసరాలన్ని తనకు బాగా తెలిసినవే అన్నట్లుగా అన్ని చోట్లకు వెళ్ళి చూశారు. చీకటిగా చిరు దీపాల వెలుగుతో ఉన్న వంటశాలలోకి కూడా వెళ్ళి అక్కడవారితో సరదాగా మాట్లాడారు. మనిషి ఎంత స్థితిమంతుడైనా గతం మరువకూడదనే దానికి నిదర్శనంగా ఘంటసాలగారు నిలుస్తారు. ఆ రాత్రి భోజనాలు మా ఇంట్లోనే జరిగాయి. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఇంట్లో మనిషిలాగే గడిపారు. ఘంటసాలగారు సావిత్రమ్మగారిని మా పెద్దమ్మమ్మగారి వద్దకు తీసుకెళ్ళి "అమ్మగారూ! మీ చేతివంట తిని ఎన్నేళ్ళయిపోయిందో. మీరు చేసే సద్ది కోసమే వచ్చాన"ని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో పులిహోరను 'సద్ది' అని అంటారు. అదెలా చేస్తారో అమ్మగారిని అడిగి నేర్చుకోమని సావిత్రిగారికి చెప్పారు. 

ఘంటసాలగారు తమ మద్రాస్ జీవితంలో అంతకన్నా రుచికరమైన, ఖరీదైన వంటకాలన్నో రుచి చూచి వుండవచ్చును. కాని,గతంలో తనకు అన్నం పెట్టి ఆదరించిన ఒక తల్లి పట్ల తనకుగల ప్రేమాభిమానాలను, కృతజ్ఞతను  వ్యక్తపర్చడానికి అన్న మాటలుగా నేను భావిస్తాను. కరెంట్ దీపాలు లేని ఆ ఇంట్లో హరికెన్ లాంతర్ల వెలుగులో సరదాగా కబుర్లు చెపుతూ భోజనాలు ముగించారు.

మర్నాడు ఉదయం మద్రాస్ ప్రయాణం.

రైలు ఎక్కడానికి ముందు తమ ఇంటికి వచ్చి వెళ్ళవలసిందేనని మా నాన్నగారి స్నేహితుడు శ్రీ ద్వివేదుల నరసింగరావుగారు, వారి భార్య విశాలాక్షిగారు బలవంతం చేసి వారింటికి తీసుకువెళ్ళారు.
(2001 - విశాఖపట్నంలో శ్రీ డి ఎన్ రావుగారు, విశాలాక్షిగారు)

 విశాలాక్షిగారు అప్పటికి రచనా వ్యాసాంగం మొదలుపెట్టలేదు. ఆవిడ ఆంధ్రా మెట్రిక్ పాసయ్యారు. నరసింగరావుగారు మహారాజావారి కాలేజీలో లెక్చెరర్. మా నాన్నగారు మద్రాసు వెళ్ళడానికి ముఖ్య ప్రేరణ ఆ నరసింగరావుగారే.  వారికి ఒక అబ్బాయి శ్రీనాధ్. నాకంటే ఓ రెండేళ్ళు పెద్ద కావచ్చు. తరువాత అమ్మాయి ఛాయ. నాకంటే కొంచెం చిన్నది. ఆ అమ్మాయికి మా ప్రభూ చిన్నాన్నగారు కొన్నాళ్ళు వైలిన్ నేర్పారు. తరువాతి కాలంలో శ్రీ నరసింగరావుగారు విజయనగరం మహారాజావారి స్కాలర్ షిప్ తో అమెరికాలో విస్కన్సిన్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ విభాగంలో పి హెచ్ డి చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ విశేషాలన్నీ రానున్న భాగాలలో చూద్దాము.

అలా ద్వివేదుల వారింటి ఆతిధ్యం పొంది ఘంటసాలవారు తమ కుటుంబంతో సంతోషంగా  మద్రాస్ మెయిల్ ఎక్కారు.

వచ్చేవారం మరిన్ని విశేషాలు. అంతవరకూ....
                      సశేషం

Friday, July 17, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఎనిమిదవ భాగం

ఏడవ భాగం     ఇక్కడ.

17.7.2020 - శుక్రవారం: భాగం : 8.

నెం.35,ఉస్మాన్ రోడ్.  


ఘంటసాలగారి సంస్కారం

                                            
మద్రాస్ లో చిత్రసీమలో కొంత నిలదొక్కుకున్న తర్వాత , విజయనగరం వదలి వెళ్ళిన మరికొన్నేళ్ళకు ఘంటసాల మరల విజయనగరం వెళ్ళి తమ గురువులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారిని కలిసారు. సినీమాలలో తన పురోభివృద్ధి ని గురించి గురువుగారికి చెప్పి వారి ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంలో , మద్రాస్ లో మంచి గాయకులకు తగిన అవకాశాలున్నాయని , అందువల్ల , వారి పెద్దబ్బాయి సంగీతరావు ను తన దగ్గరకు పంపమని కోరారు. కానీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అందుకు కొన్ని కారణాలు లేకపోలేదు.

1942 లో తొలిసారిగా మా నాన్నగారు - శ్రీ సంగీతరావు గారు ఒక స్నేహితుడి ఆహ్వానం మీద మద్రాస్ వెళ్ళారు. అప్పటికింకా ఘంటసాల మద్రాసు వెళ్ళలేదు. మద్రాసులో ఆలిండియా రేడియో , జెమినీ స్టూడియో   
ప్రారంభమైన తొలిరోజులు.

      
                                                                      
ఆ జెమినీ స్టూడియో లో సాలూరుకు చెందిన మా తాతగారి మిత్రుడు శ్రీ ఉరిమి జగన్నాధం ( ప్రముఖ తబలిస్ట్ వి. లలిత్ ప్రసాద్ తండ్రి) అనే ఆయన జెమినీ స్టూడియోలో తబలిస్ట్ గా పనిచేశేవారు. ఆయన సాలూరులో రాజావారి నాటక సంస్థలో తబలిస్ట్ గా , స్క్రీన్స్ పెయింటర్ గా ఉండేవారు. ఆ జగన్నాధంగారు మా నాన్నగారిని కలుసుకొని తనతో కూడా మద్రాసులో అనేక సినీమా కంపెనీలకు , నాటక సంస్థలకు తీసుకువెళ్ళి మా నాన్నగారి పాటను అందరికీ వినిపించేవారు. 

ఆ క్రమంలో మా నాన్నగారు శ్రీచిత్తూరు వి. నాగయ్యగారిని కూడా కలసి తన పాట వినిపించారు. ఆ సమయంలో నాగయ్యగారు భక్త పోతన సినీమాకు పని చేస్తున్నారు. అక్కడ , " మాతా పితా గురుదేవా " అనే పాట రిహార్సల్స్ జరుగుతున్నాయి. సినీమాలో పోతనగారి కూతురు పాడే పాట. ఆ పాట విని అదే పాటను సంగీతరావు గారు నాగయ్యగారికి వినిపించారు. ఆయన అది విని చాలా సంతోషించారు. సుసర్ల దక్షిణామూర్తి వంటివారు కుర్రవాళ్ళుగా తిరుగాడుతూ కనిపించేవారు. 

ఈ విధంగా మద్రాస్ లో కొన్నాళ్ళు గడిపాక సంగీతరావు గారికి బాగా అనారోగ్యం చేసింది. అదే సమయంలో రెండవ ప్రపంచయుధ్ధం యొక్క ప్రభావం మన దేశం మీద కూడా పడుతుందనే భయంతో సీతారామశాస్త్రి గారు తమ కుమారుడిని మద్రాసు వదలి రమ్మని కబురు పంపించడంతో , సంగీతరావు గారు మద్రాసు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శ్రీకాకుళానికి సమీపంలో దూసి స్టేషన్ . ఆ స్టేషన్ కు ఓ నాలుగు మైళ్ళ దూరంలో కలివరం అనే ఒక చిన్నగ్రామం.ఊరిని ఆనుకొని నాగావళి ఏరు. ఏటికి అవతలి ఒడ్డున తొగరాం అనే ఊరు ఉండేది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారి తండ్రిగారిది ఆ వూరే.

 ఈ కలివరంలో శ్రీగంగుల అప్పలనాయుడు గారని పెద్ద భూస్వామి. ఆయనకు సంగీతమంటే చాలా ఇష్టం. ఆయన మా నాన్నగారిని తన ఆస్థానగాయకుడిగా పెట్టుకున్నారు. శ్రీ సంగీతరావు 1944 నుండి ఆరేళ్ళపాటు ఆయన ఆదరణలో ఉన్నారు. అప్పలనాయుడు గారికి ముగ్గురో , నలుగురో చెల్లెళ్ళు. వారందరికీ మా నాన్నగారు -సంగీతరావు గారు సంగీతం నేర్పేవారు.

 1952 లో మరల శ్రీ ఘంటసాలవారి ఆహ్వానం మేరకు మా నాన్నగారు మద్రాసు బయల్దేరి వెళ్ళారు. వెళ్ళే సమయంలో భయంకరమైన గాలివాన వచ్చి రైల్వే ట్రాక్ లు దెబ్బ తినడంతో రైలును గూడూరు నుండి రేణిగుంట మార్గంగా నడిపి మద్రాస్ చేర్చారు. అక్కడ సెంట్రల్ స్టేషన్ పక్కన ఒక హోటల్ లో దిగి ,తన పెట్టె అక్కడుంచి ఘంటసాలవారి ని చూడ్డానికి మాంబళం ( అదే త్యాగరాయనగర్ లేదా టి.నగర్) లోని నెం.35 , ఉస్మాన్ రోడ్ కు వెళ్ళారు. ఆ రోజు ఘంటసాలగారి తండ్రి తిధి. ఆయన ఆ కార్యక్రమంలో మునిగిఉన్నారు. మ నాన్నగారు వచ్చిన సంగతి మోపర్రు దాసుగారి ద్వారా విని , ఘంటసాలగారు లోపలనుండి బయటకు వచ్చి మా నాన్నగారిని ఆప్యాయంగా పలకరించి ఇంటిలోపలికి తీసుకువెళ్ళారు. ఆ సంస్కారం , గౌరవం మరెవరికీ రావని మా నాన్నగారు ఎప్పుడూ తల్చుకుంటూంటారు. 

అప్పట్లో ఘంటసాలగారు కొత్తగా ' వాక్సాల్' (vauxhall) అనే కారు కొన్నారు. ఆ రోజు సాయంత్రం , ఆ కారులో ఘంటసాలగారు తనను హొటల్ కు తీసుకువెళ్ళి అక్కడున్న పెట్టితో సహా ఇంటికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఘంటసాల గారు పరోపకారం సినీమా తీస్తున్నారు.

(ఆడియో వినడం కోసం పరోపకారం పోస్టర్ మీద క్లిక్ చేయండి)

 అందులో ఆరుద్ర వ్రాసిన 'పదండి ముందుకు-పదండి తోసుకు ' అనే గీతాన్ని సంగీతరావు గారిచేత పాడించారు. అది శ్రీ శ్రీ రాసిన " పదండి ముందుకు " పాటకు పేరడీ లాటిది. అలాగే , ' పల్లెటూరు ' చిత్రంలో అనేక బృందగానాలుండేవి. మాధవపెద్ది , పిఠాపురం , గోపాలం వీరందరితో కలసి మా నాన్నగారు కూడా ఆ పాటలను పాడారు. అయితే తను నేర్చుకున్న సంగీతం వేరు , సినీమాల్లోని సంగీతం వేరని , ఆ వ్యవహారం మనసుకు నచ్చక మా నాన్నగారు సంగీతరావు గారు మరొకసారి మద్రాసు వదలి వెళ్ళిపోయారు. యధాప్రకారంగా తను , తన కచేరీలంటూ కాలం గడపసాగారు. 

కానీ , విజయనగరంలో, పెరుగుతున్న కుటుంబభారం , ద్వివేదుల నరసింగరావు ( డా.డి.ఎన్ రావు , ద్వివేదుల విశాలాక్షి) వంటి మిత్రులు ఇక్కడే ( విజయనగరం) లోనే వుంటూ తనలో వుండే సంగీత ప్రతిభను వృధా చేసుకోవద్దనే స్నేహపూర్వకమైన ఒత్తిడులు ఎక్కువై వృత్తిరీత్యా విజయనగరం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


 1954 లో కలివరం గంగుల అప్పలనాయుడు గారి కోరిక మేరకు వారితో కలసి తిరుపతియాత్ర వెళ్ళారు. అక్కడికి ఆ నాయుడి గారి బంధువు ప్రముఖ డైరెక్టర్ బి.ఎ. సుబ్బారావు , వారి సోదరుడు బి.ఎ. రామారావు వచ్చారు. వారంతా కలసి మద్రాసు వచ్చి ఘంటసాలవారి ని చూచేందుకు వెళ్ళారు. అప్పుడు ఘంటసాలగారు కన్యాశుల్కం రికార్డింగ్ కు వెళ్ళారు. సంగీతరావు గారు తెల్లారి తిరిగి వెళ్ళిపోతారనే సమయానికి ఘంటసాలవారు వచ్చి " ఇప్పుడు మన చేతిలో చాలా సినీమాలున్నాయి. మీరు వెళ్ళడానికి వీలులేదని" బలవంతపెట్టి ఉంచేశారు. నాయుడు గారి కుటుంబం మాత్రం వెనక్కి వెళ్ళిపోయారు.


 అలా 1954 నుండి 1974 వరకు రెండు దశాబ్దాల వరకు ఘంటసాలగారి దగ్గరే సంగీతరావు గారు పనిచేశారు. ఘంటసాల వారి సంగీత సహాయకుడిగా ఘంటసాలగారు స్వరపర్చిన పాటలకు స్వరాలు వ్రాస్తూ వాటిని ఆర్కెష్ట్రా కు , గాయకులకు నేర్పడం , ఆర్కెష్ట్రా లో హార్మోనియం , వీణ వంటివి వాయించడం చేశేవారు. సినీమా లలో పాడడం విషయంలో ఏమాత్రం ఆసక్తి  కనపర్చలేదు. ఘంటసాల గారితో కలసి అనేక కచేరీలలో పాల్గొని హార్మోనియం వాయించారు. అవసరమనుకున్నప్పుడు ఘంటసాలవారి తో కలసి కచేరీలలో పాడేవారు.

 1971 లో ఘంటసాలవారి తో కలసి విదేశాలు పర్యటించారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఘంటసాలవారి కి అనారోగ్యం కారణంగా సంగీత దర్శకత్వం వహించే సినీమా ల సంఖ్య తగ్గిపోయింది. కానీ , ఘంటసాలవారి ని వదలిపెట్టి వేరే సంగీతదర్శకులను ఆశ్రయించడానికి మనస్కరించలేదు. ఘంటసాలవారి కోరిక మీద వచ్చిన తను చివరవరకూ ఆయనతోనే ఉండాలనే ఒకరకమైన కృతజ్ఞతాభావం , ఒకరిపట్ల ఒకరికి గల సోదరభావం , పరస్పర మైత్రీ భావంతో , ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మా నాన్నగారు మాత్రం ఘంటసాలవారికి మాత్రమే సహాయకుడిగా ఉండిపోయారు.

 1972 నుండి ఘంటసాలవారి అనుమతితో శ్రీ వెంపటి చిన సత్యంగారి కోరిక మీద వారి కూచిపూడి స్కూల్ లో పిల్లలకు సంగీతం చెప్పడానికి ప్రవేశించారు. అలాగే , సినీ నటి కాంచనకు గాత్రం , వీణ నేర్పించారు . అలాగే ఆత్రేయ గారి అమ్మాయికి నాలుగేళ్ళు సంగీతం నేర్పారు. 1974 తర్వాత , డా. వెంపటి చినసత్యంగారితో ఏర్పడిన మైత్రి కారణంగా మరో పాతిక సంవత్సరాలు కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ కి మా నాన్నగారు తన సేవలందించారు. 1983 వరకు అదే నెం.35 ఉస్మాన్ రోడ్ ఘంటసాలగారింటి చిన్న ఔట్ హౌస్ లో నే తన ఐదుగురు పిల్లలతో కాలం గడిపారు. తన భవిష్యత్ పట్ల ఆదినుండి ఎంతో అక్కర చూపిన ఘంటసాలగారంటే మానాన్నగారికి ఎంతో గౌరవం. కుచేలుడు , కృష్ణుడు వంటి భావం ఉండేదేమో తెలియదు. ఘంటసాలవారి తో కలసి పనిచేస్తున్నా తన పరిధులు దాటి తనెలాటి అతి చొరవ తీసుకోలేదు. తన పిల్లలూ అలాగే ఉండాలని కోరుకున్నారు.
ఆ విషయాలన్నీ .... వచ్చే వారమే... 

(సశేషం)

Saturday, June 6, 2020

నెం. 35, ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక - అధ్యాయం 1 - రెండవభాగం


నెం. 35, ఉస్మాన్ రోడ్  (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ( రెండవభాగం)

  

                                            నెం. 35, ఉస్మాన్ రోడ్ 
 
                                                                                      - స్వరాట్


ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేముందు నాకు గల అర్హతేమిటో చెపుతానన్నాను.

ఒక మనిషి తనను గురించి పరిచయం చేసుకోవాలంటే , తనకంటూ ఒక స్థాయి , వ్యక్తిత్వం వుండకతప్పదు. అవి లేనివారు తమ వంశవృక్షాలను వెదకి వాటిలోని సారస్వమైన ఫలాలను తనకు ఆపాదించుకొని పదిమందిలో నిలబడాలనుకుంటారు. దీనినే 'చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం' ;  లేదా "మా పెద్దలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి " అని చెప్పడం. ఆ పనే యిప్పుడు నేను చేయబోతున్నాను.  నా యీ మాటలు చదువుతున్నవారికి నేనేదో complexities తో బాధపడుతున్నాననే అనుమానం కలుగుతుంది. నాకలాటి ఆత్మనూన్యతా భావాలేవీ లేవు. ఉన్న వాస్తవం అది. Hypocrisy కి దూరంగా వుండాలనేది నా కోరిక.

మాది ' పట్రాయని'  వారి వంశం. ఈ వంశంలోని పూర్వీకులు ఏదో రాజుగారి కొలువులో ' పట్రాయుడు' పదవి వహించారట. అంటే కొంతమంది సైనికులకు అధిపతి వంటి పదవి. ఆ పట్రాయుడి వంశంలోని వారు పట్రాయనివారుగా మారారు.
ఆ వంశంలో పుట్టినవారు శ్రీ వెంకట నరసింహ శాస్త్రి . ఆయన సంగీతజ్ఞుడు . ఆయన జీవితం చాలావరకు ఒరిస్సాలో ని బరంపురంలో జరిగింది. కర్ణాటక సంగీతంలో కొంత కీర్తన గ్రంధాన్ని నేర్చుకునేందుకు మద్రాస్ లో కొన్నాళ్ళు వున్నారట. ఒరిస్సా లోని అనేక రాజాస్థానాలలో , జమిందారీలలో  కచేరీలు చేస్తూ పండిత సత్కారాలు , సన్మానాలు అందుకున్నారు.ఈయనకు గాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులుండేవి. శ్రీ నరసింహశాస్త్రి గారికి వయసు మీరాక తన కుమారుడితో సాలూరు లో నివాసం ఏర్పర్చుకున్నారు. సంగీతంలో తండ్రీ కొడుకులిద్దరిదీ వేర్వేరు మార్గాలుగా తోస్తుంది. ఆయనను '  సాలూరు పెద గురువు' గారనేవారు.

ఆయన కుమారుడు పట్రాయని సీతారామ శాస్త్రి. వాగ్గేయకారుడు. ఎన్నో కృతులను , చాటు పద్యాలను చందోబధ్ధంగా వ్రాశారు. వీరు  ' సాలూరు చిన గురువుగా లబ్దప్రతిష్టులు. సీతారామశాస్త్రి గారు సాలురులో సొంతంగా భూమికొని దానిలో ఒక చిన్న పర్ణశాల నిర్మించి సంగీత పాఠశాల ప్రారంభించారు. ఆంధ్రదేశమంతా  తిరిగి సంగీత కచేరీలు చేసేవారు.
సీతారామ శాస్త్రిగారికి ముగ్గురు కుమారులు. సంగీతరావు , నారాయణ మూర్తి , ప్రభాకరరావు.
ఈ ముగ్గురు కూడా శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులే.
ఇలా మూడు తరాల వరకు సంగీతమే వృత్తిగా , ప్రవృత్తిగా , పరమార్ధంగా గల మా పట్రాయని వారి వంశం,  మా నాల్గవ తరానికి వచ్చాక సంగీతాన్నే వృత్తిగా స్వీకరించలేకపోయింది. కారణాలనేకం. అవి అప్రస్తుతం. అయితే అందరూ సంగీతాభిలాష , ఆసక్తి , గౌరవ మర్యాదలు కలవారే. ఇద్దరు , ముగ్గురు ఆడపిల్లలు సంగీతంలో విశిష్టమైన కృషిచేసినవారే.

పెరుగుతున్న కుటుంబం , ఆర్ధిక సమస్యల దృష్ట్యా శ్రీ సీతారామశాస్త్రిగారు (మా తాతగారు) సాలూరులోని స్వంత పాఠశాల వదలి  ఆంధ్రదేశంలోనే ప్రప్రధమ సంగీత కళాశాల అయిన విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించి , తన కుటుంబాన్ని కూడా విజయనగరానికి తరలించారు.
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన సందర్భంగా ఏర్పడిన ఖాళీలో గాత్ర పండితునిగా నియామకానికి పెద్ద పోటీయే వచ్చింది. కాలేజీ ప్రిన్సిపాల్ గా ప్రముఖ వైలిన్ విద్వాంసుడు శ్రీ ద్వారం వేంకటస్వామి నాయుడుగారు నియమించబడ్డారు. గాత్రపండితునిగా శ్రీ సీతారామశాస్త్రిగారు నియమితులయ్యారు. అయితే ,
ఈ ఆచార్య పదవి ఆయనను అంత సునాయాసంగా వరించలేదు.  విజయనగరం ఎస్టేట్ కలెక్టర్ , పండితుల సమక్షంలో జరిగిన పోటీలో నెగ్గిన తర్వాత శ్రీ సీతారామ శాస్త్రిగారికి గాత్ర పండితుడిగా ఉద్యోగం లభించింది.
అదే పదవిలో శ్రీ శాస్త్రిగారు రెండు దశాబ్దాల పాటు పనిచేశారు. శ్రీ సీతారామ శాస్త్రి గారిది విలక్షణమైన సంగీతం. ఆయన గానం శుద్ద శాస్త్రీయమైనా  దాక్షిణాత్యపు సంగీతబాణీకి విరుధ్ధమైనది ఆయన గానం , సంగీతం. ఆయన తనకు ప్రక్క వాద్యంగా హార్మోనియం ను తానే వాయించుకుంటూ పాడేవారు. ఆ కారణంగా , ఆనాటి బాణీ విద్వాంసుల మధ్య ఒకరకంగా వెలివేయబడ్డారు.  ఆయన అన్ని రకాల బాణీలలో ఆరితేరినవారే. సంగీత కళాశాల లో విద్యార్ధులకు సంగీతం బోధించేప్పుడు అక్కడి శాస్త్ర మర్యాదలను పాటిస్తూ సిలబస్ ప్రకారమే శిక్షణ యిచ్చేవారు. కళాశాల వెలుపల , కచేరీలలో తన స్వతంత్ర ధోరణిలో గమకయుక్తమైన , భావప్రధానమైన కర్ణాటక సంగీతాన్నే  హార్మోనియం మీద వాయిస్తూ గానం చేసేవారు.  శ్రీ సీతారామ శాస్త్రిగారి  స్వీయ కృతులు రెండు ఓడియన్ రికార్డ్ లుగా వచ్చాయి.

సాలూరి చిన గురువుగారి బాణీ సాహితీ లోకంలో , వారికి ఒక విశిష్టతను , వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టాయి. కచేరీలలో ఆయన గానం చేసే స్వీయ కృతులు , చాటు పద్యాలు విజయనగరం లోని పండితులను , సాహితీవేత్తలను అమితంగా ఆకర్షించాయి. అదే ' కౌముదీ పరిషత్' అనే సాహితీ వేదిక ఆవిర్భావానికి కారణమయింది. శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారే ఆజన్మ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. స్థానిక సంస్కృత కళాశాల పండితులంతా సభ్యులు గా చేరి పదిహేను రోజులకో  నెలకో ఒకసారి సాయంత్రం పూట వెన్నెల వెలుగులో సాహిత్య , సంగీత గోష్ఠి జరిపి తమ కవితలను , కృతులను వినిపించి చర్చలు జరిపేవారు.
ఈ కౌముదీ పరిషత్ కు ' భారతీ తీర్థ' ఆంధ్రా రీసెర్చ్ యూనివర్శిటీ వారి గుర్తింపు లభించింది. ఆ భారతీ తీర్థ రీసెర్చ్ యూనివర్సిటీ వారే
శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారికి , వారి పెద్ద కుమారుడు శ్రీ సంగీతరావు గారికి ' సంగీత భూషణ ' బిరుదు ప్రదానం చేశారు.
శ్రీ పట్రాయని సంగీతరావు గారు తండ్రికి తగ్గ తనయుడు. సార్ధక నామధేయుడు. గురు ముఖఃతా ఆయన నేర్చుకున్న సంగీతం మూడు మాసాలు మాత్రమే. తండ్రిగారి సహచర్యం లో ఆయన గానం వింటూ స్వయంకృషితో సాధించినదే అధికం. హార్మోనియం మీద కర్ణాటక సంగీతాన్ని గమకయుక్తంగా , శుధ్ధ శాస్త్రీయంగా అత్యంత సమర్ధవంతంగా పలికించగల  అతి కొద్దిమంది విద్వాంసులలో ఒకరుగా శ్రీ సంగీతరావు పేరు పొందారు. తన 16 వ ఏట నుండే స్వతంత్రంగా హార్మోనియం మీద జంత్రగాత్ర కచేరీలు చేయడం ప్రారంభించారు. శ్రీ సంగీతరావు గారు ఆంధ్రదేశానికి చెందిన మరో విలక్షణ విద్వన్మణి సంగీత సుధాకర శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారికి సీనియర్. వయసులో పది సంవత్సరాలు పెద్ద.
ఆలిండియా రేడియో ప్రక్క వాద్యంగా హార్మోనియం ను నిషేధించిన కారణంగా శ్రీ సంగీతరావు ఆలిండియా రేడియోను తనకు తానే దూరం చేసుకున్నారు.  శ్రీ సంగీతరావు గారి  గానవిద్వత్ ప్రదర్శనకు ఆకాశవాణి ఏనాడు వేదిక కాలేదు.   సంగీత ప్రసంగాలకు మాత్రం వారిని ఆహ్వానించేవారు.అది శ్రీ సంగీతరావుగారి వ్యక్తిత్వం.
తన స్వయంకృషితో నే వీణ , వైలిన్ వాద్యాల మీద పట్టు సాధించారు. వారికి తండ్రిగారి వారసత్వం వలన సంగీతంలోనే కాక సాహిత్యంలో కూడా మంచి ప్రవేశం లభించింది. ఆంధ్రదేశంలోని ప్రముఖ కవులు రచయితలతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది.
శ్రీ పట్రాయని సంగీతరావుగారికి ఆ పేరు నెలల పిల్లాడిగా వున్నప్పుడే అనుకోకుండా పెట్టబడింది. ఆ పేరు తోనే సంగీతలోక ప్రసిధ్ధులైనారు. స్కూల్ రికార్డ్స్  లో నమోదైన పేరు నరసింహమూర్తి.  అది వారి తాతగారి పేరు.

నేను శ్రీ సంగీతరావుగారి పెద్ద కుమారుడిని.  నా తర్వాత , మంచి సంగీతం పట్ల అభిరుచి, ఆసక్తి గల ఒక సోదరుడు , ముగ్గురు సోదరీమణులు వున్నారు.

దీనికి , మన పాటల దేవుడికి ఏమిటి సంబంధం , ఎందుకీ అక్కర్లేని సొద అని మీరు భావించినా భావించవచ్చు. కానీ , కారణం వుంది . ఘంటసాలగారి గురించి అర్ధం చేసుకోవాలంటే ఆనాటి సాంఘిక పరిస్థితులు , కొంతమంది వ్యక్తుల గురించి కూడా అవగాహన కావాలి. అందుకే ఈ ఉపోధ్ఘాతం.

శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం విజయరామ సంగీత కళాశాలలో గాత్ర ఉపన్యాసకుడిగా ప్రవేశించిన కొద్ది నెలలకు , వేసంగి శెలవులలో, కళాశాల మూసివేసివున్న తరుణంలో ఓ పధ్నాలుగేళ్ళ వయసున్న, వెంకటేశ్వర్లు అనే అబ్బాయి సంగీతం నేర్చుకోవాలని , విజయనగరం చేరుకున్నాడు.

అప్పుడేం జరిగింది ?
                            .... (సశేషం - రెండవభాగం)

నెం.35, ఉస్మాన్ రోడ్ - ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక - అధ్యాయం 1 - మొదటిభాగం

మొదటి భాగం -

                        నెం. 35, ఉస్మాన్ రోడ్
                  -    స్వరాట్ 

ఆజన్మాంతం నేను సదా గుర్తుంచుకునే సంఖ్యలు చాలానే వున్నా అతి ముఖ్యమైనవి మాత్రం రెండే రెండు -
ఒకటి 35 , రెండవది 25.
35 ఉస్మాన్ రోడ్ గాన సరస్వతికి నిలయం.
25 సాంస్కృతిక నిలయం.
నేనేదో మీకు ఆసక్తి కలిగించే విషయాలు చెపుతానని అనుకోవడానికి కారణం నెం. 35 ఉస్మాన్ రోడ్.

ఇక, నాలాటి ఇంట్రావెర్ట్ ను చేరదీసినాలో కూడా  ఏదో టాలెంట్ వుందని ప్రోత్సహించి , నాచే నాలుగు మంచి పనులు చేయించిఅందరిలో నాకుకొంతలో కొంత గుర్తింపును యిచ్చినది నెం. 25. ఈనాడు, యిన్ని సమూహాలలో ఏవో నాలుగు మాటలు వ్రాయగలగడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్నిచ్చింది నెం. 25, మెలనీ రోడ్ .

ఈ రెండు నెంబర్లు గల స్థలాలలో ఏభైఏడేళ్ళ జీవితం గడిచింది. ఈ రెండు చోట్లా ఒక మంచి మనిషిగా జీవించడానికి కావలసిన అనేక మంచి పాఠాలు నేర్చుకున్నాను.

 ఎక్కడ వున్నాఎంత ఉన్నత స్థితిలో వున్నా గతం మరువద్దు. అహం వద్దు. ఆత్మవిశ్వాసం పెంచుకో. వినయంతో పాటూ వ్యక్తిత్వం కావాలి.  వివాదాలకు దూరంగా వుండు. అడుగు నేలమీదే వుండనీ . మంచి చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావంతో మెలగు.
ఇటువంటి భావాలు నాలో పెంపొందడానికి ఎంతో దోహదం చేసిన ఆ 25 మీద నాకున్న కృతజ్ఞతకు సూచకంగా,  25 వ తేదీ నుండి మన సమూహంలో యీ కొత్త శీర్షికను  ప్రారంభిస్తున్నాను.

ఒకనాడు నెంబర్ 35 ఉస్మాన్ రోడ్, టి.నగర్, మద్రాస్-17, మెడ్రాస్ మహా నగరంలో సుప్రసిధ్ధం. గాన సరస్వతికి నిలయం. అదే, గానగంధర్వుడిగా, అమరగాయకుడిగా ప్రపంచ నలుమూలలావున్న తెలుగు వారందరి హృదయాలలో  సుస్థిరస్థానం ఏర్పర్చుకొని చిరంజీవి గా ప్రకాశిస్తున్న పాటల దేవుడు 'ఘంటసాలనివాస గృహం.

ఈ సంగీత కళాలయంలోని విశేషాలు  ఒక తెఱచిన పుస్తకం. లోకవిదితం. ఇప్పుడు
నేను కొత్తగా కనిపెట్టి, చెప్పగలిగే విశేషాలేవీ వుండవు. అనేకమంది, అనేక సందర్భాలలో, అనేక చోట్ల చెప్పినవే. అందులో కొన్ని మన సమూహంలో గతంలో చెప్పుకున్నవే.
కానీ35 నెంబర్  ప్రాంగణంలో పెరిగానన్న ఒకే కారణంతో, పెద్దలంతా మరింకే విషయాలైనా చెపుతాననే ఆసక్తితో ఈ శీర్షికను నాకు అప్పగించారు. ఆ మహా గాయకుడి సంగీతం గురించి చెప్పే సాహసం నేను చేయలేను. చేయను కూడా.

అందుకనే ఈ శీర్షికకు '' నెం. 35 ఉస్మాన్ రోడ్ '' అని  పేరు పెట్టాను. ఈ ప్రాంగణంలో సుమారు ఇరవై సంవత్సరాల పాటు , ఘంటసాలవారి కాలంలో నేను విన్న విషయాలను, పొందిన అనుభవాలను నాకు జ్ఞాపకమున్నంత వరకు , నాకున్న పరిధిలో వారం వారం నాకున్న భాషా పరిజ్ఞానంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఘంటసాలవారి ని ఒక మహా గాయకుడిగా కంటే , ఒక నిరాడంబర కుటుంబీకుడిగా చూపించే ప్రయత్నం చేస్తాను.
ఏ రకమైన అభూతకల్పనలు లేకుండా , ఏ విధమైన సంచలనాలు లేకుండా ఒక సాదా కుటుంబగాధా చిత్రంగానే , ఈ కధనం సాగుతుంది. సహృదయ సభ్యులంతా ఆమోదించి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను.

ఇంతకూ , నెం. 35 ఉస్మాన్ రోడ్ లోకి నేను ప్రవేశించిన ముచ్చట్లు  చెప్పడానికి నాకు గల అర్హత ఏమిటో చెప్పుకోవాలి. అది ముందు చెప్తాను. 
(సశేషం)

Wednesday, March 25, 2020

సాధకుడు బోధకుడు విద్వన్మణి- నూకల చినసత్యనారాయణ


                     


సంగీతరావుగారు సమకాలీనులైన కళాకారులను పరిచయం చేస్తూ, వారి కళాప్రదర్శనలోని లోతుపాతులను వివరిస్తూ ఎన్నో ప్రామాణిక వ్యాసాలను రాసారు. 1976 సం.లో ఆంధ్ర ప్రభ దినపత్రిక లో ఈ వ్యాసపరంపర ప్రచురితమైంది. అప్పటి వ్యాసాలలో ఆయా కళాకారులగురించి సంగీతరావుగారు వివరించిన విశేషాలు తెలుసుకోగోరేవారికోసం ఇక్కడ మళ్లీ ప్రచురిస్తున్నాం. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణమూర్తి వంటి ఎందరో మహావిద్వాంసులను పరిచయంచేసిన ఆ వ్యాస పరంపరలో నూకల చినసత్యనారాయణగారి విద్వత్తును వివరించే వ్యాసం ఇది.

ఆంధ్రప్రభ – డిసెంబర్ 12, 1976, విజ్ఞాన వేదిక
                                  రాగపస్తారంలో స్వతంత్రుడు
         నూకల చిన సత్యనారాయణ
సంగీతం శాస్త్రంగా, వృత్తిగా పరిగ్ర్యహించి పరిపూర్ణమైన సత్ఫలితాలను సాధించిన పట్టభద్రుడు శ్రీ నూకల సత్యనారాయణ. కర్ణాటక సంగీత రసికులకు ఈనాడు శ్రీ సత్యనారాయణ సంగీతం ఎంతో కుతూహలం, ఆసక్తి ఉన్నాయి. సుశ్రావమైన ఆయన కంఠస్వరమూ, రాగతాళములలో గల స్వాతంత్ర్యమూ, సరసత, కచేరీ నిర్వహించడంలో గల అభినివేశమూ శ్రీ సత్యనారాయణ సంగీతంలోని సహజ ఆకర్షణ.

మూడు పదులు దాటిన శ్రీ సత్యనారాయణ సంగీత జీవితానుభవం గణనీయమైనది. సంప్రదాయ సంగీతం సక్రమమైన పధ్ధతిలో గురుముఖతః సాధనచేసిన శ్రీ సత్యనారాయణ సంగీతం ఆయనను ప్రభావితం చేసిన అనేక మంది విద్వాంసుల ప్రతిభతో తాదాత్మ్యం చెందడం ఆయన రసజ్ఞతను, సహృదయాన్ని వ్యక్తం చేస్తుంది. కళాపరంగా ఎక్కడ ఏ మంచి వినిపించినా దానిని గ్రహించడం వలన శ్రీ సత్యనారాయణ పాండిత్యంలో ఎంతో వైశాల్యమూ, గాంభీర్యమూ ఏర్పడ్డాయి. ఈవిధమైన పాండిత్యం ఉత్తమ గురుత్వానికి లక్షణం.

శ్రీ సత్యనారాయణ మొదట వాయులీన వాదకులైన తరవాతనే గాయకులయ్యారు. వాద్యనైపణ్యం కూడా కలిగిన గాయకుడిలో శాస్త్రియంగా సునిశితమైన అవగాహన, సుస్ఫష్టమైన గమకస్ఫూర్తి ఉంటాయి.




పరిశోధన
శ్రీ సత్యనారాయణ సంగీతశాస్త్రంలో పరిశోధనలు సలిపిన పండితులు. భారతీయ సంగీతంలోని రాగవిధానానికి సంబంధించిన దాక్షిణాత్య, ఔత్తరాహ సంగీతసంప్రదాయ రీతుల తులనాత్మక పరిశీలన వారి ప్రత్యేక కృషి.

రాగవిధానం భారతీయ సంగీతం విశిష్ఠత నిరూపస్తుంది. భారత హృదయ సంవేదన రాగవిధానంలోనే సంగీతమయంగా వ్యక్తం అవుతుంది. రాగములు దేవతామూర్తులుగా ధ్యానించబడ్డాయి. అనేక రాగములు రూపకల్పన చేయబడి చిత్రీకరించబడ్డాయి.

రాగనిర్వచనం
రాగం అంటే ఏమిటి? ఆరోహణావరోహణ క్రమంలో గల స్వర సముదాయం అని స్థూలంగా చెప్పడం కన్న, రాగం అంటే సంగ్రహరూపంగా ఉన్న ఒక స్వర రచన అని అనడం ఉచితం. అయితే, ఆ రచన గాయకుని ఊహాపోహలననుసరించి సంకోచ వ్యాకోచాలకు అవకాశం కలిగిస్తుంది. అనేక రాగాలకు రసనిర్ణయం జరిగింది. అయితే ఆ నిర్ణయం సక్రమంగా అనుసరించబడలేదు. నిజానికి వివిధ రసములకు లక్ష్యప్రాయమైన స్వరరచనలు లేవు. యక్షగానాలలోను, నాట్యరూపకములలోను ఆయా రాగాలను వివిధ రస నిష్ప్తత్తికి పోషించేవారేమో? ఆయా రసభావములను పోషించే సందర్భంలో తీవ్ర, కోమల స్వరసమ్మేళన గాయకుని సరసమైన ప్రతిభే ప్రధానంగా ఉంటుంది. రసనిష్పత్తికి రాగప్రాధాన్యాన్ని చెప్పినట్టు, తాళప్రాధాన్యాన్ని చెప్పడం కనబడదు. అనుభవంలో తాళప్రాధాన్యం ఎంతో కనిపస్తుంది. రసభావపోషణలో రాగముల పరిధి నిర్ణయించడం పరిశోధకుల సమస్య. అనేక ప్రసిధ్ధ రాగములు శతాబ్దుల తరబడి ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాలక్రమాన మేళకర్త పధ్ధతి అనుభవంలోకి రావడం, దానిని బట్టి అనాదిగా వస్తూన్న రాగాలను ఆయా మేళకర్తలకు సంబంధించి వర్గీకరించడం జరిగింది. మేళకర్త విధానం అమలులోకి వచ్చిన తరవాత ఔడవషాడవ భేదాలననుసరించి ఏర్పడ్డ రాగాలు వేలకు వేలు తయారయాయి. వీటన్నిటికీ పేర్లు పెట్టవలసి రావడం ఒక సమస్యే. కారణం – చందోబధ్ధంగా ఏర్పడ్డ ఆయా రాగాలకు అనుభవంలో లేకపోయినా, వేల సంఖ్యలో నామకరణం చేయవలసి ఉంటుంది గదా! అయితే, ఎన్ని పుస్తకాల్లో వెతికినా అన్ని వేల రాగాలు కనబడవు. మనకి కావలసిన మూర్ఛనకి సరిపడే పేరు పుస్తకాల్లో కనబడకపోతే ఏ శక్తిప్రియఅన్న పేరో పెట్టుకోవలసి ఉంటుంది. ఆరోహణావరోహణ క్రమంలో వక్రసంచారంలో ప్రతి చిన్న మార్పును వేరే రాగంగా వ్యవహరించవలసి వస్తుంది.

ఒక రాగం శ్రవణయోగ్యంగా ఉండడం, ఆ రాగంలోని స్వరసంబంధ పరస్పర సంవాది, అనువాది రూపంగా ఉండడం గ్రహించగలుగుతాం. ఈ ప్రాతిపదిక మీద రాగవిధానం పునః పరిశీలించడం అవసరమేమో? ప్రతి చిన్న సంచారాన్నీ ప్రత్యేక రాగంగా పేర్కొనడం కన్నా ఈనాడు వివిధ రాగములుగా పేర్కొనబడిన రాగాలను సమన్వయపఱచి ఒకే రాగంగా విస్తృతపరచవచ్చునేమో! శ్రీ సత్యనారాయణగారి వంటి పరిశోధకులు వివరించవలసి ఉంటుంది.

రాగమేళనం    
ఈనాడు ఉత్తరాది సంగీతంలో రెండు భాగాలుగా గానం చేయడం ఒక ప్రక్రియగా అమలులోకి వచ్చి ఉంది. రాగవిధానం వలన నిర్దిష్టమైన రాగభావములకు ప్రత్యేకత ఏర్పడడం జరిగింది. ఆ రాగ స్వరూపానికి స్కాలిత్యం ఏర్పడకుండా అచంచలమైన లక్షణం ఏర్పడింది. గ్రహస్వరం, న్యాసస్వరం, అంశస్వరములను నిర్ణయించి ఆ రాగ స్వరూపానికి మార్పులు, చేర్పులకు అవకాశంలేకుండా చేయబడింది. దీనివలన ఆయా రాగాల స్వరూపాలు నిర్దిష్టంగా ఏర్పడ్డా, ఆయా రాగములలో రచింపబడిన రచనలలో వైవిధ్యం లోపిస్తుంది. ఒకే రాగంలో ఉన్న అనేక రచనలలో ఉన్న రాగభావం ఒకటే. ఒక కీర్తన గాంధారంలో ప్రారంభం అయితే, మరొకటి షడ్జమంలో ఎత్తుగడ జరిగిందనే తృప్తి తప్పిస్తే మరేమీలేదు.

అందుచేతనే రాగభావములను ఆధారం చేసుకున్న ఆయా రచనలలో స్వరరచయిత భావనకు అవకాశంలేదు. ఇంతకు పూర్వం శతాబ్దులుగా ప్రచారంలో ఉన్న రాగభావన్ని సాహిత్యానికి అమర్చడమన్నదే ప్రధానం. ఆయా విషయాలను వివరంగా రసికులు గ్రహించడానికి శ్రీ సత్యనారాయణగారు వంటి పండితుల పరిశోధనలు ఎక్కువ ఉపకరిస్తాయి.

శ్రీ సత్యనారాయణ ప్రథమశ్రేణి గాయకులు. అనేక సంగీత కచేరీలు చేసి, రసికుల మన్ననలు పొందారు. రేడియో జాతీయ కార్యక్రమాల్లో తమ సంగీతం వినిపించారు. అనేక సంగీత రూపకములకు సంగీత సారథ్యం వహించారు. ప్రభుత్వ మర్యాదలననుసరించి అనేక సత్కారాలు పొందారు. పీఠాధిపతుల ఆశీస్సులనందుకున్నారు.

ఉత్తమ సంగీత విద్వాంసులుగా, ప్రథమశ్రేణి గాయకులుగా, వాద్య నిపుణులుగా, స్వరరచయితగా, ఆచార్యులుగా కృతార్థులయిన శ్రీ సత్యనారాయణ స్వకీయమైన ప్రతిభతో రసిక లోకానికి ఇవ్వగలిగినది ఇంకా ఎంతో ఉందనే అనిపిస్తుంది.

===+++===  ఫఫరరరరర