visitors

Showing posts with label ఘంటసాల. Show all posts
Showing posts with label ఘంటసాల. Show all posts

Friday, August 7, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదకొండవ భాగం

07.08.20 - శుక్రవారం భాగం - 11 :
పదవ భాగం ఇక్కడ

నెం.35 ఉస్మాన్ రోడ్

                                                          - ప్రణవ స్వరాట్

బాలరాజు, కీలుగుఱ్ఱం, లైలామజ్ను, మనదేశం, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు, సినీమాలతో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా తెలిసింది. విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్న వ్యక్తి మెడ్రాస్ వెళ్ళి సినీమాలలో స్థిరపడి పేరు తెచ్చుకోవడం ఆ వూరి వారందరికీ గర్వకారణంగా వుండేది.  విజయనగర ప్రాంతాలకు చెందిన రావి కొండలరావు, జెవి రమణమూర్తి వంటి నటులకు, ఏవిఎన్ మూర్తి వంటి గాయకులకు సినీమాలలో చేరడానికి ఘంటసాల ఒక స్ఫూర్తిగా నిలిచారు.

అప్పట్లో, జెవి రమణమూర్తి తయారు చేసిన 'విశ్వశాంతి' అనే నాటకానికి మా నాన్నగారు- సంగీతరావు గారు  సంగీతం సమకూర్చారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో ఆ నాటకానికి ఉత్తమ బహుమతి లభించింది.  కన్యాశుల్కంలోని గీరీశం పాత్ర రమణమూర్తి గారికి పేటెంట్. 
కన్యాశుల్కం నాటకాన్ని దేశవ్యాప్తంగా కొన్ని వందల ప్రదర్శనలిచ్చారు. తరువాత,  కెబి తిలక్ ఆయనను ఎమ్ఎల్ ఏ సినీమాలో హీరోగా పరిచయం చేయడం మీ అందరికీ తెలిసినదే. 'శంకరాభరణం' సోమయాజులు గారు రమణమూర్తి సోదరుడే. ఆయనా మంచి రంగస్థలనటులు. చాలా లేటుగా సినీమాల్లోకి వచ్చారు.  ఉత్తరాంధ్రాకు చెందిన పింగళి వారు, ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్యగారు అప్పటికే మద్రాసు చేరారు.

మా ఇంటికి ఎదురింట్లోనే గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీ ఏవిఎన్ మూర్తి కుటుంబం వుండేది. అప్పటికి ఆయన చిన్నవాడే. తరువాత సంగీతం నేర్చుకొని మద్రాసు వెళ్ళారు.

                                     శ్రీ ఏ.వి.ఎన్. మూర్తి
 ఆయన తమ్ముడు గోపాలరావ్, సర్వి అనే సర్వేశ్వరరావు, మంత్రిప్రగడ నాగభూషణం, వేలమూరి రామారావు, నా వయసువారు. అందరం కలసి ఆటలాడేవాళ్ళం. మల్లాప్రగడ, కందాళం, వడ్లమాని, నేమాని వంటి కుటుంబాలు ఆ గెడ్డ వీధిలోనే ఉండేవి.

ఘంటసాలవారు మా ఇంటికి వస్తారన్న వార్త అందరికీ తెలిసింది. ఒక్కొక్కరుగా వచ్చి ఎప్పుడొస్తారు, ఎన్నాళ్ళుంటారని మావాళ్ళను అడగడం మొదలుపెట్టారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గురువుగారి శిష్యుడన్న విషయం వారికి తెలుసు. 

ఈ హడావుడి మా తాతగారికి కంగారు పుట్టించింది. మర్నాడు, ఘంటసాల వచ్చేప్పటికి వీధిలో వారంతా ఇంటికి వచ్చేస్తే సంబాళించడమెలా, వచ్చే అతిధులకు ఇబ్బందికరంగా తయారౌతుందేమోనని భయం. అదీకాక చాలా పసిపిల్లలున్న ఇంట్లో వచ్చే వారికి తగిన మర్యాదలు చేయడం కష్టమనే భావన. ఇవన్నీ ఆలోచించి ఘంటసాల కుటుంబాన్ని కొంతసేపు వుంచుకొని తరువాత, తమ మిత్రులైన వసంతరావు బ్రహ్మాజీరావుగారింట్లో దింపుదామనే నిర్ణయానికొచ్చారు. బ్రహ్మాజీరావుగారి తమ్ముడు వసంతరావు వెంకట్రావుగారు  ఎమ్ ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా వుండేవారు. వారంతా మా తాతగారికి అతి సన్నిహితులు.
1951లో ఘంటసాలవారు మెడ్రాస్ లో స్వంతంగా ఒక మేడను కొనుగోలు చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఆ సందర్భంగా గురువుగారిని మెడ్రాసు రప్పించి సగౌరవంగా సత్కరించారు. ఆ రోజు సాయంత్రం గురువుగారు, మా తాతగారైన పట్రాయని సీతారామశాస్త్రిగారి సంగీతకచేరీ కూడా ఏర్పాటు చేశారు. శిష్యుడు సాధిస్తున్న ప్రగతికి గురువుగారెంతో సంబరపడ్డారు.





అటువంటి శిష్యుడు కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడం సంతోషకరమే అయినా  కనీసం కరెంట్ వసతి కూడా లేని ఆ ఇంటిలో వారు ఎలా గడపగలరు అనేది ఆయన చింత. అందుకే సకల వసతులు గల తమ మిత్రుల ఇంటిలో బస ఏర్పాట్లు చేశారు.

అనుకున్నట్లుగానే మర్నాడు ఉదయం ఒక కారులో అతిధులు వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారో గుర్తులేదు‌, కానీ ఒక మగ, ఇద్దరు ఆడ, ఓ చిన్న బాబు మాత్రం బాగా గుర్తుండిపోయింది. వచ్చినాయన తెల్లటి చొక్కా, అరవ్వాళ గుండారు కట్టుకొని ఉన్నారు. వచ్చినావిడ చాలా తెల్లగా పొడుగ్గా కనిపించారు. వాళ్ళ బాబుకు రెండేళ్ళుంటాయేమో. ఆవిడను మా ఇంట్లో వాళ్ళందరికీ 'నా వైఫ్ సావిత్రి' అని చెప్పారు. ఆవిడ అందరితో కలుపుగోలుగా మాట్లాడారు. మరొక పెద్దావిడ ఆయన తల్లిగారట. 

(ఘంటసాలగారి తల్లిగారు రత్తమ్మగారు)
ఆ వచ్చినాయన పేరే ఘంటసాల అని తెలిసింది. వారిని చూచేందుకు నాకు తెలియని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి పలకరించడం ఆయన సమాధానాలు చెపుతూ మాట్లాడడం జరిగింది.ఇల్లంతా కోలాహలంగా వుండడం పిల్లలమైన మాకు మంచి ఉత్సాహంగా అనిపించింది. ఘంటసాలగారు మధ్య మధ్యలో "రాజీ! అని పిలవడం, "ఓయ్ అని ఆ సావిత్రి గారు రావడం వింతగా అనిపించింది. ఆవిడ పేరు  సావిత్రి అన్నారే, ఇప్పుడు రాజీ అని పిలుస్తున్నారే. ఆవిడకు రెండు పేర్లా ? అని నాకు సందేహం.  అందరి మాటలు వింటూ ఇంట్లో ఒక ఓరగా నిలబడి వింతగా చూస్తూండిపోయాను. ఘంటసాల గారు ఏవో పాటలు పాడిన గుర్తు. ఆ పాటలకు తగినట్లు బొద్దుగా ఉన్న వారి బాబు కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆడడం గుర్తుంది. మంచి లయజ్ఞానం ఉందని మాపెద్దవాళ్ళు ముచ్చట పడ్డారు. ఆ బాబు పేరు విజయకుమార్ అని చెప్పారు.

(ఘంటసాల విజయకుమార్)
ఘంటసాలగారు విజయా సంస్థలో ఆస్థాన సంగీత దర్శకుడిగా కాంట్రాక్టు జరిగిన మరుసటి సంవత్సరం ఈ బాబు పుట్టాడు. విజయాతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని ఈ బాబుకు ' విజయ' కలిసేలా పేరు పెట్టమని విజయా అధినేత బి.నాగిరెడ్డిగారు సూచించారట. ఆయన కోరిక మేరకు వారి బాబుకు విజయకుమార్ అని పేరు పెట్టడం జరిగిందని తరువాత కాలంలో తెలుసుకున్నాను. ఆ అతిధుల మాటలు, చేష్టలు కొన్ని నాకు బాగా కొత్త . మా పెరట్లో రాచ ఉసిరి, జామి, కొబ్బరి, పత్తి వంటి చెట్లతో చాలా చల్లగా ఉండేది. ఆ సావిత్రి గారికి చాలా ఒత్తైన, పొడుగాటి తలకట్టు ఉండేది. జడవేసుకోవడానికి మావాళ్ళు  పన్ని ఇవ్వబోతే ఆవిడ తన దువ్వెనతో తల దువ్వుకోవడం గుర్తుండిపోయింది. మా ప్రాంతాలలో దువ్వెనను పన్ని అంటారు. మాఇంట్లో పన్నిలు చిన్నవి. కానీ ఆవిడ దగ్గరున్న రంగుదువ్వెన చాలా పొడుగు. తల దువ్వుకుంటూ ఆ దువ్వెనను ఆవిడ తల మధ్యలో పెట్టుకొని మరింకే పనులో చేయడం నాకు ఒకటే ఆశ్చర్యం. మా ఇంటిలో అప్పటికి చూడనివి.

ఇలా కొన్ని గంటలు గడిపాక, వారందరూ బయటకు వెళ్ళారు. మా తాతగారూ, నాన్నగారితో నేనూ వెళ్ళడం జరిగింది. మాతో పాటూ ఆ వూళ్ళోనే ఇంటర్మీడియట్ చదువుతున్న మా నాన్నగారి కజిన్ గుమ్మా మార్కండేయ శర్మ కూడా ఉన్నారు. శర్మ బాబుగా చిరపరిచితుడైన ఆయన పాటలు, పద్యాలు బాగా పాడేవాడు.

ముందుగా, వసంతరావు బ్రహ్మాజీరావు గారింటికి వెళ్ళాము. వారిల్లు చాలా పెద్దిల్లు. ఇల్లాంతా ఎలక్ట్రిక్ దీపాలున్నాయి. నీళ్ళకొళాయిలున్నాయి. వరండాలు,హాల్స్ లో పెద్ద పెద్ద స్థంభాలు, పైనుండి క్రిందికి వేలాడుతూ రంగు రంగుల అద్దాల లైట్ డూమ్స్. ఏ కాలానివో. వాటిలో దీపాలు వెలిగించేవారో లేదో తెలియదు. బ్రహ్మాజీరావు గారి భార్య పేరు రాధమ్మగారు. ఆ దంపతులిద్దరికీ మా తాతగారన్నా, ఆయన పాటన్నా చాలా ఇష్టం. వసంతరావు వెంకట్రావు గారిని కూడా అనేక సార్లు చూశాను. వారంతా ఘంటసాల వారి రాక పట్ల చాలా సంతోషం పొందారు. మాటలు, పాటలు పద్యాల మధ్య మద్యాహ్నపు విందు వారింట్లోనే జరిగింది. 

గురువుగారు తమను ఆ రాత్రికి కూడా బ్రహ్మాజీరావు గారింటనే ఉంచదల్చుకున్నారనే వార్త ఘంటసాలగారికి తెలిసింది. ఆ నిర్ణయానికి ఒప్పుకోలేదు. ఆయన మాతాతగారితోనూ,  వారి కుటుంబ సభ్యులతో గడపడం కోసమే వచ్చామని  అందుచేత వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని రాత్రంతా గురువుగారింట్లోనే ఉంటామని పట్టుపట్టారు. అలాగే చేశారు. మార్గమధ్యంలో మ్యుజిక్ కాలేజి, ఎమ్ ఆర్ కాలేజి, సంస్కృత కాలేజి, ఆయనకు తెలిసిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ, ఒకసారి అయ్యకోనేరు గట్టుమీద ఉన్న గుమ్చీ ప్రాంతంలో ఆగి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అక్కడనుండి, విద్యార్ధి దశలో తనకు ఆకలి సమస్య తీర్చి నిశ్చింతగా సంగీతం నేర్చుకుందుకు దోహదపడిన సింహాచలం దేవస్థానం అన్నసత్రం లోపలికి కూడా వెళ్ళాము. అప్పటికి చీకటి పడింది. అక్కడి భోజనశాలలో కొంతమంది విద్యార్థులు బారులు తీరి భోజనాలు చేస్తున్నారు. అందులో చాలామందికి వచ్చినవారి గురించి ఏమీ తెలియక వింతగా చూశారు. ఘంటసాలగారు ఆ పరిసరాలన్ని తనకు బాగా తెలిసినవే అన్నట్లుగా అన్ని చోట్లకు వెళ్ళి చూశారు. చీకటిగా చిరు దీపాల వెలుగుతో ఉన్న వంటశాలలోకి కూడా వెళ్ళి అక్కడవారితో సరదాగా మాట్లాడారు. మనిషి ఎంత స్థితిమంతుడైనా గతం మరువకూడదనే దానికి నిదర్శనంగా ఘంటసాలగారు నిలుస్తారు. ఆ రాత్రి భోజనాలు మా ఇంట్లోనే జరిగాయి. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఇంట్లో మనిషిలాగే గడిపారు. ఘంటసాలగారు సావిత్రమ్మగారిని మా పెద్దమ్మమ్మగారి వద్దకు తీసుకెళ్ళి "అమ్మగారూ! మీ చేతివంట తిని ఎన్నేళ్ళయిపోయిందో. మీరు చేసే సద్ది కోసమే వచ్చాన"ని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో పులిహోరను 'సద్ది' అని అంటారు. అదెలా చేస్తారో అమ్మగారిని అడిగి నేర్చుకోమని సావిత్రిగారికి చెప్పారు. 

ఘంటసాలగారు తమ మద్రాస్ జీవితంలో అంతకన్నా రుచికరమైన, ఖరీదైన వంటకాలన్నో రుచి చూచి వుండవచ్చును. కాని,గతంలో తనకు అన్నం పెట్టి ఆదరించిన ఒక తల్లి పట్ల తనకుగల ప్రేమాభిమానాలను, కృతజ్ఞతను  వ్యక్తపర్చడానికి అన్న మాటలుగా నేను భావిస్తాను. కరెంట్ దీపాలు లేని ఆ ఇంట్లో హరికెన్ లాంతర్ల వెలుగులో సరదాగా కబుర్లు చెపుతూ భోజనాలు ముగించారు.

మర్నాడు ఉదయం మద్రాస్ ప్రయాణం.

రైలు ఎక్కడానికి ముందు తమ ఇంటికి వచ్చి వెళ్ళవలసిందేనని మా నాన్నగారి స్నేహితుడు శ్రీ ద్వివేదుల నరసింగరావుగారు, వారి భార్య విశాలాక్షిగారు బలవంతం చేసి వారింటికి తీసుకువెళ్ళారు.
(2001 - విశాఖపట్నంలో శ్రీ డి ఎన్ రావుగారు, విశాలాక్షిగారు)

 విశాలాక్షిగారు అప్పటికి రచనా వ్యాసాంగం మొదలుపెట్టలేదు. ఆవిడ ఆంధ్రా మెట్రిక్ పాసయ్యారు. నరసింగరావుగారు మహారాజావారి కాలేజీలో లెక్చెరర్. మా నాన్నగారు మద్రాసు వెళ్ళడానికి ముఖ్య ప్రేరణ ఆ నరసింగరావుగారే.  వారికి ఒక అబ్బాయి శ్రీనాధ్. నాకంటే ఓ రెండేళ్ళు పెద్ద కావచ్చు. తరువాత అమ్మాయి ఛాయ. నాకంటే కొంచెం చిన్నది. ఆ అమ్మాయికి మా ప్రభూ చిన్నాన్నగారు కొన్నాళ్ళు వైలిన్ నేర్పారు. తరువాతి కాలంలో శ్రీ నరసింగరావుగారు విజయనగరం మహారాజావారి స్కాలర్ షిప్ తో అమెరికాలో విస్కన్సిన్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ విభాగంలో పి హెచ్ డి చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ విశేషాలన్నీ రానున్న భాగాలలో చూద్దాము.

అలా ద్వివేదుల వారింటి ఆతిధ్యం పొంది ఘంటసాలవారు తమ కుటుంబంతో సంతోషంగా  మద్రాస్ మెయిల్ ఎక్కారు.

వచ్చేవారం మరిన్ని విశేషాలు. అంతవరకూ....
                      సశేషం

Friday, July 17, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఎనిమిదవ భాగం

ఏడవ భాగం     ఇక్కడ.

17.7.2020 - శుక్రవారం: భాగం : 8.

నెం.35,ఉస్మాన్ రోడ్.  


ఘంటసాలగారి సంస్కారం

                                            
మద్రాస్ లో చిత్రసీమలో కొంత నిలదొక్కుకున్న తర్వాత , విజయనగరం వదలి వెళ్ళిన మరికొన్నేళ్ళకు ఘంటసాల మరల విజయనగరం వెళ్ళి తమ గురువులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారిని కలిసారు. సినీమాలలో తన పురోభివృద్ధి ని గురించి గురువుగారికి చెప్పి వారి ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంలో , మద్రాస్ లో మంచి గాయకులకు తగిన అవకాశాలున్నాయని , అందువల్ల , వారి పెద్దబ్బాయి సంగీతరావు ను తన దగ్గరకు పంపమని కోరారు. కానీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అందుకు కొన్ని కారణాలు లేకపోలేదు.

1942 లో తొలిసారిగా మా నాన్నగారు - శ్రీ సంగీతరావు గారు ఒక స్నేహితుడి ఆహ్వానం మీద మద్రాస్ వెళ్ళారు. అప్పటికింకా ఘంటసాల మద్రాసు వెళ్ళలేదు. మద్రాసులో ఆలిండియా రేడియో , జెమినీ స్టూడియో   
ప్రారంభమైన తొలిరోజులు.

      
                                                                      
ఆ జెమినీ స్టూడియో లో సాలూరుకు చెందిన మా తాతగారి మిత్రుడు శ్రీ ఉరిమి జగన్నాధం ( ప్రముఖ తబలిస్ట్ వి. లలిత్ ప్రసాద్ తండ్రి) అనే ఆయన జెమినీ స్టూడియోలో తబలిస్ట్ గా పనిచేశేవారు. ఆయన సాలూరులో రాజావారి నాటక సంస్థలో తబలిస్ట్ గా , స్క్రీన్స్ పెయింటర్ గా ఉండేవారు. ఆ జగన్నాధంగారు మా నాన్నగారిని కలుసుకొని తనతో కూడా మద్రాసులో అనేక సినీమా కంపెనీలకు , నాటక సంస్థలకు తీసుకువెళ్ళి మా నాన్నగారి పాటను అందరికీ వినిపించేవారు. 

ఆ క్రమంలో మా నాన్నగారు శ్రీచిత్తూరు వి. నాగయ్యగారిని కూడా కలసి తన పాట వినిపించారు. ఆ సమయంలో నాగయ్యగారు భక్త పోతన సినీమాకు పని చేస్తున్నారు. అక్కడ , " మాతా పితా గురుదేవా " అనే పాట రిహార్సల్స్ జరుగుతున్నాయి. సినీమాలో పోతనగారి కూతురు పాడే పాట. ఆ పాట విని అదే పాటను సంగీతరావు గారు నాగయ్యగారికి వినిపించారు. ఆయన అది విని చాలా సంతోషించారు. సుసర్ల దక్షిణామూర్తి వంటివారు కుర్రవాళ్ళుగా తిరుగాడుతూ కనిపించేవారు. 

ఈ విధంగా మద్రాస్ లో కొన్నాళ్ళు గడిపాక సంగీతరావు గారికి బాగా అనారోగ్యం చేసింది. అదే సమయంలో రెండవ ప్రపంచయుధ్ధం యొక్క ప్రభావం మన దేశం మీద కూడా పడుతుందనే భయంతో సీతారామశాస్త్రి గారు తమ కుమారుడిని మద్రాసు వదలి రమ్మని కబురు పంపించడంతో , సంగీతరావు గారు మద్రాసు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శ్రీకాకుళానికి సమీపంలో దూసి స్టేషన్ . ఆ స్టేషన్ కు ఓ నాలుగు మైళ్ళ దూరంలో కలివరం అనే ఒక చిన్నగ్రామం.ఊరిని ఆనుకొని నాగావళి ఏరు. ఏటికి అవతలి ఒడ్డున తొగరాం అనే ఊరు ఉండేది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారి తండ్రిగారిది ఆ వూరే.

 ఈ కలివరంలో శ్రీగంగుల అప్పలనాయుడు గారని పెద్ద భూస్వామి. ఆయనకు సంగీతమంటే చాలా ఇష్టం. ఆయన మా నాన్నగారిని తన ఆస్థానగాయకుడిగా పెట్టుకున్నారు. శ్రీ సంగీతరావు 1944 నుండి ఆరేళ్ళపాటు ఆయన ఆదరణలో ఉన్నారు. అప్పలనాయుడు గారికి ముగ్గురో , నలుగురో చెల్లెళ్ళు. వారందరికీ మా నాన్నగారు -సంగీతరావు గారు సంగీతం నేర్పేవారు.

 1952 లో మరల శ్రీ ఘంటసాలవారి ఆహ్వానం మేరకు మా నాన్నగారు మద్రాసు బయల్దేరి వెళ్ళారు. వెళ్ళే సమయంలో భయంకరమైన గాలివాన వచ్చి రైల్వే ట్రాక్ లు దెబ్బ తినడంతో రైలును గూడూరు నుండి రేణిగుంట మార్గంగా నడిపి మద్రాస్ చేర్చారు. అక్కడ సెంట్రల్ స్టేషన్ పక్కన ఒక హోటల్ లో దిగి ,తన పెట్టె అక్కడుంచి ఘంటసాలవారి ని చూడ్డానికి మాంబళం ( అదే త్యాగరాయనగర్ లేదా టి.నగర్) లోని నెం.35 , ఉస్మాన్ రోడ్ కు వెళ్ళారు. ఆ రోజు ఘంటసాలగారి తండ్రి తిధి. ఆయన ఆ కార్యక్రమంలో మునిగిఉన్నారు. మ నాన్నగారు వచ్చిన సంగతి మోపర్రు దాసుగారి ద్వారా విని , ఘంటసాలగారు లోపలనుండి బయటకు వచ్చి మా నాన్నగారిని ఆప్యాయంగా పలకరించి ఇంటిలోపలికి తీసుకువెళ్ళారు. ఆ సంస్కారం , గౌరవం మరెవరికీ రావని మా నాన్నగారు ఎప్పుడూ తల్చుకుంటూంటారు. 

అప్పట్లో ఘంటసాలగారు కొత్తగా ' వాక్సాల్' (vauxhall) అనే కారు కొన్నారు. ఆ రోజు సాయంత్రం , ఆ కారులో ఘంటసాలగారు తనను హొటల్ కు తీసుకువెళ్ళి అక్కడున్న పెట్టితో సహా ఇంటికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఘంటసాల గారు పరోపకారం సినీమా తీస్తున్నారు.

(ఆడియో వినడం కోసం పరోపకారం పోస్టర్ మీద క్లిక్ చేయండి)

 అందులో ఆరుద్ర వ్రాసిన 'పదండి ముందుకు-పదండి తోసుకు ' అనే గీతాన్ని సంగీతరావు గారిచేత పాడించారు. అది శ్రీ శ్రీ రాసిన " పదండి ముందుకు " పాటకు పేరడీ లాటిది. అలాగే , ' పల్లెటూరు ' చిత్రంలో అనేక బృందగానాలుండేవి. మాధవపెద్ది , పిఠాపురం , గోపాలం వీరందరితో కలసి మా నాన్నగారు కూడా ఆ పాటలను పాడారు. అయితే తను నేర్చుకున్న సంగీతం వేరు , సినీమాల్లోని సంగీతం వేరని , ఆ వ్యవహారం మనసుకు నచ్చక మా నాన్నగారు సంగీతరావు గారు మరొకసారి మద్రాసు వదలి వెళ్ళిపోయారు. యధాప్రకారంగా తను , తన కచేరీలంటూ కాలం గడపసాగారు. 

కానీ , విజయనగరంలో, పెరుగుతున్న కుటుంబభారం , ద్వివేదుల నరసింగరావు ( డా.డి.ఎన్ రావు , ద్వివేదుల విశాలాక్షి) వంటి మిత్రులు ఇక్కడే ( విజయనగరం) లోనే వుంటూ తనలో వుండే సంగీత ప్రతిభను వృధా చేసుకోవద్దనే స్నేహపూర్వకమైన ఒత్తిడులు ఎక్కువై వృత్తిరీత్యా విజయనగరం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


 1954 లో కలివరం గంగుల అప్పలనాయుడు గారి కోరిక మేరకు వారితో కలసి తిరుపతియాత్ర వెళ్ళారు. అక్కడికి ఆ నాయుడి గారి బంధువు ప్రముఖ డైరెక్టర్ బి.ఎ. సుబ్బారావు , వారి సోదరుడు బి.ఎ. రామారావు వచ్చారు. వారంతా కలసి మద్రాసు వచ్చి ఘంటసాలవారి ని చూచేందుకు వెళ్ళారు. అప్పుడు ఘంటసాలగారు కన్యాశుల్కం రికార్డింగ్ కు వెళ్ళారు. సంగీతరావు గారు తెల్లారి తిరిగి వెళ్ళిపోతారనే సమయానికి ఘంటసాలవారు వచ్చి " ఇప్పుడు మన చేతిలో చాలా సినీమాలున్నాయి. మీరు వెళ్ళడానికి వీలులేదని" బలవంతపెట్టి ఉంచేశారు. నాయుడు గారి కుటుంబం మాత్రం వెనక్కి వెళ్ళిపోయారు.


 అలా 1954 నుండి 1974 వరకు రెండు దశాబ్దాల వరకు ఘంటసాలగారి దగ్గరే సంగీతరావు గారు పనిచేశారు. ఘంటసాల వారి సంగీత సహాయకుడిగా ఘంటసాలగారు స్వరపర్చిన పాటలకు స్వరాలు వ్రాస్తూ వాటిని ఆర్కెష్ట్రా కు , గాయకులకు నేర్పడం , ఆర్కెష్ట్రా లో హార్మోనియం , వీణ వంటివి వాయించడం చేశేవారు. సినీమా లలో పాడడం విషయంలో ఏమాత్రం ఆసక్తి  కనపర్చలేదు. ఘంటసాల గారితో కలసి అనేక కచేరీలలో పాల్గొని హార్మోనియం వాయించారు. అవసరమనుకున్నప్పుడు ఘంటసాలవారి తో కలసి కచేరీలలో పాడేవారు.

 1971 లో ఘంటసాలవారి తో కలసి విదేశాలు పర్యటించారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఘంటసాలవారి కి అనారోగ్యం కారణంగా సంగీత దర్శకత్వం వహించే సినీమా ల సంఖ్య తగ్గిపోయింది. కానీ , ఘంటసాలవారి ని వదలిపెట్టి వేరే సంగీతదర్శకులను ఆశ్రయించడానికి మనస్కరించలేదు. ఘంటసాలవారి కోరిక మీద వచ్చిన తను చివరవరకూ ఆయనతోనే ఉండాలనే ఒకరకమైన కృతజ్ఞతాభావం , ఒకరిపట్ల ఒకరికి గల సోదరభావం , పరస్పర మైత్రీ భావంతో , ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మా నాన్నగారు మాత్రం ఘంటసాలవారికి మాత్రమే సహాయకుడిగా ఉండిపోయారు.

 1972 నుండి ఘంటసాలవారి అనుమతితో శ్రీ వెంపటి చిన సత్యంగారి కోరిక మీద వారి కూచిపూడి స్కూల్ లో పిల్లలకు సంగీతం చెప్పడానికి ప్రవేశించారు. అలాగే , సినీ నటి కాంచనకు గాత్రం , వీణ నేర్పించారు . అలాగే ఆత్రేయ గారి అమ్మాయికి నాలుగేళ్ళు సంగీతం నేర్పారు. 1974 తర్వాత , డా. వెంపటి చినసత్యంగారితో ఏర్పడిన మైత్రి కారణంగా మరో పాతిక సంవత్సరాలు కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ కి మా నాన్నగారు తన సేవలందించారు. 1983 వరకు అదే నెం.35 ఉస్మాన్ రోడ్ ఘంటసాలగారింటి చిన్న ఔట్ హౌస్ లో నే తన ఐదుగురు పిల్లలతో కాలం గడిపారు. తన భవిష్యత్ పట్ల ఆదినుండి ఎంతో అక్కర చూపిన ఘంటసాలగారంటే మానాన్నగారికి ఎంతో గౌరవం. కుచేలుడు , కృష్ణుడు వంటి భావం ఉండేదేమో తెలియదు. ఘంటసాలవారి తో కలసి పనిచేస్తున్నా తన పరిధులు దాటి తనెలాటి అతి చొరవ తీసుకోలేదు. తన పిల్లలూ అలాగే ఉండాలని కోరుకున్నారు.
ఆ విషయాలన్నీ .... వచ్చే వారమే... 

(సశేషం)

Friday, July 10, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఏడవ భాగం

భాగం - 7*
ఆరవభాగం ఇక్కడ

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్




నాటకాలు వేసుకుంటూ తిరగడం, ఏవో సంగీతకచేరీలు చేసుకోవడంలో కాలం గడుస్తోందే తప్ప చెప్పుకోతగ్గ  ఆదాయం, అభివృధ్ధి కనపడలేదు. ఇది ఘంటసాల తల్లిగారికి ఒక వేదనగా తయారయింది. ఎప్పుడు ఇంటిపట్టున ఉండక, ఇల్లు పట్టని కొడుకుకు ఒక కాలికట్టు (పెళ్ళి)  వేస్తే బాధ్యత తెలిసి, కుదురుగా ఉంటాడనే తల్లి ప్రేమతో అతనికి పెళ్ళిచేయాలని సంకల్పించారు. 


ఈ విషయంగా తన వరస సోదరుడైన కొడమంచిలి వెంకటరత్నశాస్త్రిగారిని సంప్రదించారు. ఆయన పెదపులివర్రు వాస్తవ్యులు. స్థానిక బాలాత్రిపురసుందరి ఆలయంలో అర్చకులు. ఊళ్ళో మంచి పేరున్న పెద్దమనిషి. ఆయనకు ఆడా, మగా పదిమంది సంతానం. ఆయన రెండవ కుమార్తె సావిత్రిని తన కొడుకుకి యిచ్చి పెళ్ళి జరిపించమని కోరడం , ఆయన సమ్మతించడం జరిగింది.  దైవసంకల్పం కూడా తోడవడంతో సావిత్రి, ఘంటసాల ల వివాహం 1944 లోమార్చ్ మూడవ తేదీన జరిగింది.



ఘంటసాల  బాల్యావస్థ, యువ దశదాటి ఒక గృహస్తుడయ్యాడు. ఇక, ఘంటసాలను బహువచనంతో సంబోధించడం సముచితం.

సావిత్రిగారితో వివాహం ఘంటసాల వారి జీవితంలో ఒక గొప్ప మలుపుకు నాంది పలికింది.
                 

తెలుగు సినీమా ప్రపంచంలో లబ్దప్రతిష్టులైన  కవి శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులు, సినీ డైరక్టర్ కాశీనాధుని విశ్వనాథ్, స్వస్థలం పెదపులివర్రు. ఘంటసాలవారి అత్తవారి ఊరు కూడా అదే పెదపులివర్రు. వారంతా ఒకరికొకరు బాగా పరిచయస్తులు.

ఘంటసాలవారి పెళ్ళైన కొద్ది రోజులకు సముద్రాల రాఘవాచార్యులవారు పెదపులివర్రు వెళ్ళడం జరిగింది. అప్పుడు, ఘంటసాలగారు ఆచార్యులవారిని కలసి తన మంచిచెడ్డలు చెప్పుకున్నారు. తాను నేర్చుకున్న సంగీతాన్ని సముద్రాలవారికి వినిపించారు. ఆయన విని చాలా సంతోషించారు. ఇలాటి పల్లెటూళ్ళలో కన్నా మద్రాస్ వంటి నగరాలలో వృధ్ధిచెందే అవకాశాలు ఎక్కువని, అందుచేత మద్రాస్ లో తనను కలిస్తే తగు ప్రయత్నాలు చేయవచ్చని ఘంటసాలగారిలో ఆత్మస్థైర్యం కలిగించారు. ఆచార్యులవారి మాటలు ఘంటసాల తన ఆశల, ఆదర్శాల సాఫల్యానికి తొలిమెట్టుగా భావించారు. 


వివాహం జరిగిన రెండు మాసాలకు ఘంటసాలగారు ఒంటరిగా తన మకామును మద్రాసుకు మార్చారు. 

సముద్రాల రాఘవాచార్యులవారు ఘంటసాలగారికి తన ఇంటనే ఆశ్రయమిచ్చి, తను పని చేస్తున్న, తెలిసిన సినీమా కంపెనీలన్నింటికీ తిప్పుతూ ప్రతీ చోటా ఘంటసాల పాటను అందరికీ వినిపింపజేసేవారు. ఈ విధంగా ఘంటసాల సముద్రాలవారింట కొన్నిమాసాలు గడిపారు. ఆ క్రమంలో నాగయ్యగారి దగ్గర, బి.ఎన్. రెడ్డిగారి వద్దా తన పాట వినిపించి వారిని మెప్పించారు. కానీ వెనువెంటనే ఏ అవకాశాలు దొరకలేదు.
ఈ అవకాశాల వేటలో తిరుగాడుతూ  టి.నగర్ లోని పానగల్ పార్క్ లోనే  కొన్ని రోజులపాటు అక్కడివారి దయాధర్మంతో రాత్రింబవళ్ళు గడిపారట.

కొన్నాళ్ళకు, ముందుగా ఘంటసాల బలరామయ్యగారి ఆఫీసులో ఉంటూ వారు తీసిన 'సీతారామ జననం' లో కోరస్ లు పాడి, ఎక్స్ట్రా వేషాలు వేసినందుకు నెలకు 75 రూపాయలందుకున్నారు.
(ఘంటసాలగారి సినిమారంగ ప్రవేశం తొలిరోజులగురించి  శ్రీ పేకేటి శివరాంగారు -)


అక్కినేని నాగేశ్వరరావు అదే సీతారామజననంలో రాముడిగా తొలిసారి హీరోగా నటించారు. అక్కినేని, ఘంటసాలల మధ్య మైత్రి బలపడింది అప్పుడే.


నాగయ్యగారి రేణుకా ఆఫీస్ లో ఉండేందుకు అవకాశం దొరికింది. నాగయ్యగారు తీస్తున్న త్యాగయ్య సినీమాలో కోరస్ పాడడం, నాగయ్యగారి శిష్యుడిగా వేషం కట్టడం వంటివి జరిగాయి. 

  ( ఈ వీడియోలో నాగయ్యగారికి ఎడమవైపు ఉన్న శిష్యుడు ఘంటసాల)

వాహినీ వారి 'స్వర్గసీమ' లో తొలిసారిగా భానుమతి గారితో కలసి  ఒక డ్యూయెట్ ను సి.హెచ్. నారాయణరావుకు పాడించారు బి.ఎన్. రెడ్డి. 


అక్కడ    బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఘంటసాలను చూసి ఆలిండియా రేడియోకు సిఫార్సు చేసి ఘంటసాల గొంతును తెలుగు శ్రోతలకు వినిపించేలా  చేశారు . నెలకు ఆరేడు ప్రోగ్రాములు ఇప్పించి భుక్తికి లోటులేకుండా ఆదుకున్నారు.  

ఇదే క్రమంలో, HMV గ్రామఫోన్ కంపెనీకి వెళితే వారు ఘంటసాల కంఠం మైకుకు పనికిరాదని తిరస్కరించారు. (అలా తిరస్కరించిన అక్కడి ఆఫీసరే మరో 18 ఏళ్ళ తర్వాత  తాను నిర్మించిన చిత్రానికి ఘంటసాలను సంగీతదర్శకుడిగా, చిత్రంలో పాటల గాయకుడిగా నియమించుకున్నారు.
ఆయనెవరనేది తరువాయి భాగాలలో చూద్దాము) .

ఆ తరువాత, ఘంటసాల పాటను విన్న పేకేటి శివరాం  HMVలో ప్రవేశించిన వెనువెంటనే ఘంటసాలగారిచేత 'నగుమోమునకు' అనే చాటు పద్యం, 'గాలిలో నా బ్రతుకు' పాటను తొలిసారిగా పాడించారు.


 అయితే అవి కలకత్తా వెళ్ళి అక్కడ రికార్డులుగా మారి ప్రజలలోకి వెళ్ళేలోగా 'స్వర్గసీమ' సినీమా ముందు విడుదలై ఒక కొత్త గాయకుడి గురించి అందరికి తెలిసింది. తరువాత, 
క్రమక్రమంగా, గృహప్రవేశం, త్యాగయ్య, యోగి వేమన (ఇందులో ఒక నాట్య సన్నివేశంలో నట్టువాంగం చేసే కళాకారుడిగా కూడా కనిపిస్తారు).



           (ఈ వీడియోలో నర్తకి పక్కన నట్టువాంగం చేస్తున్న ఘంటసాల)
పల్నాటియుధ్ధంలో నాలుగు పాటలు పాడారు. రెండు అక్కినేనితో, ఒకటి కన్నాంబతో, ఒకటి సోలోగా పాడారు.
భరణీ వారు తీసిన 'రత్నమాల' సినీమాలో భానుమతి తో రెండు డ్యూయెట్లు, ఒక సోలో పాడడమే కాక, భానుమతి, రామకృష్ణగార్ల ప్రోత్సాహంతో సి ఆర్ సుబ్బురామన్ కు సహాయకుడిగా పనిచేయడంతోపాటు స్వతంత్రంగా కొన్ని పాటలను స్వరపర్చడం జరిగింది. 
ఇక, ఘంటసాల పేరు సినిమా రంగంలోనూ, ప్రేక్షకులలోనూ బాగా వినిపించడం ప్రారంభమయింది.

బాలరాజు ' చెలియా కనరావా' పాటతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మార్మోగింది.



బాలరాజు సినీమాయే సంగీత దర్శకుడిగా తన తొలి సినీమాగా ఘంటసాల చెపుతారు.
ఘంటసాల బలరామయ్యగారి బలవంతంమీద, సంగీతదర్శకుడు గాలి పెంచల నరసింహారావుగారి ప్రోద్బలంతో, సహ సంగీతదర్శకుడి హోదాలో 11 పాటలను స్వరపర్చారు.
ఇందులో అక్కినేని పాడిన 'చెలియా కనరావా' పాట గ్రామఫోన్ రికార్డ్ లో ఉంటే, ఘంటసాలగారు పాడిన అదే పాట సినీమాలో ఉంటుంది. 
అక్కినేని నాగేశ్వరరావు పాడిన పాట సినిమాలో లేదు కనుక   ఆ అరుదైన పాట రికార్డు ఇక్కడ వినండి :
ఈ చిత్రంలో వక్కలంక సరళతో పాడిన 'నవోదయం శుభోదయం' పాటే తన తొలి సినీమా పాట స్వరరచనగా ఘంటసాల పేర్కొంటారు.


 ఘంటసాలగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు ఇద్దరూ సినీరంగప్రవేశం ఒకేసారి చేసారు.ఘంటసాలగారితో తన తొలినాళ్ళ స్నేహం గురించి ఏఎన్నార్ ఏమన్నారో ఈ ఆడియో ఫైల్ లో వినవచ్చు.
ఘంటసాలగారి సినీజీవితానికి ఒక గొప్ప మలుపు 'కీలుగుఱ్ఱం' సినిమా. ఇందులోని 'కాదుసుమా కలకాదు సుమా' పాటతో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు మార్మోగింది. ఈ సినీమా తమిళంలో కూడా అత్యంత  విజయవంతమై తమిళనాట కూడా ఘంటసాల పేరు అందరికీ తెలియడం ప్రారంభించింది.
ఈ సినీమా గురించి మరింత చెప్పవలసి ఉంది.
కీలుగుఱ్ఱం చిత్ర నిర్మాత దర్శకుడు మీర్జాపురం రాజావారు. ఆయన సతీమణి సి. కృష్ణవేణి ప్రముఖ నటి, గాయని. వీరు స్థాపించిన శోభానాచల, ఎమ్.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ ద్వారా తమ సొంత స్టూడియో లో ఒకేసారి మూడు సినీమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మూడింటికి సంగీతం సమకూర్చే బాధ్యతను యువ సంగీత దర్శకుడైన ఘంటసాలకు అప్పగించారు. ఘంటసాలగారు మొట్టమొదట స్వతంత్రంగా సంగీతం చేయడానికి ఒప్పందం చేసుకున్న చిత్రం 'లక్ష్మమ్మ', తరువాత, 'మనదేశం', తరువాత 'కీలుగుఱ్ఱం'. అయితే, ఈ మూడింటిలో  1949 లో ముందుగా 'కీలుగుఱ్ఱం', అదే సంవత్సరం ఆఖరులో 'మనదేశం' చిత్రాలు విడుదలై కొత్త సంగీతదర్శకుడిగా, గాయకుడిగా ఘంటసాల పేరు తెలుగు వారందరికీ చిరపరిచితమయింది. తాను ముందుగా ఒప్పుకున్న మొదటి చిత్రం 'లక్ష్మమ్మ' 1950 లో రిలీజయింది. ఈ లక్ష్మమ్మ కు పోటీగా ఘంటసాల బలరామయ్యగారు, అంజలీదేవి, అక్కినేని లతో 'లక్ష్మమ్మ కథ' సినీమా తీశారు, కానీ, విజయవంతం కాలేదు.
కృష్ణవేణి, సి.హెచ్. నారాయణ రావు నటించి త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మమ్మ' గొప్ప హిట్ అయింది. రెండింటి కథా ఒకటే.
ఇక, అక్కడ నుండి ఘంటసాల రక్షరేఖ, లైలామజ్ను, ధర్మాంగద, మనదేశం వంటి చిత్రాలలో తన పాటలతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు.

భానుమతిగారి సూపర్ హిట్ విషాద ప్రేమగాథ 'లైలామజ్ను'. ఇందులో  ఘంటసాలగారు పాడిన తొమ్మిది పాటలు చిత్రానికి జీవం పోసాయి. తమిళంలో కూడా లైలామజ్ను,  పాటలవల్లే సూపర్ హిట్ అయింది. 
1949 లో 'మనదేశం'
1950 లో 'షావుకారు' చిత్రాల సంగీతదర్శకుడిగా ఘంటసాల అగ్రశ్రేణి సంగీతదర్శకుల జాబితాలోకి ఎక్కారు. 
ఇక అక్కడ నుండి గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాల సినీ ప్రస్థానం రెండున్నర దశాబ్దాల పాటు నిరాటంకంగా  కొనసాగింది. 
ఒక ప్రక్క సినీమాలలో పాడుతూనే, ఓ మూడేళ్ళపాటు  మరో ప్రక్క ఆలిండియా రేడియోలో  శాస్తీయ, లలిత  సంగీతం, నాటకాలు, రూపకాలు అంటూ అన్ని రకాల కార్యక్రమాలలో  పాల్గొనేవారు.

ఘంటసాలగారిని ఆదిలో తిరస్కరించిన హిస్ మాస్టర్స్ వాయిస్ (HMV) వారు, తమ నిరంతర గాయకుడిగా నియమించుకున్నారు .

తెలుగువారి సొత్తుగా చెప్పుకునే పద్యపఠన ప్రక్రియను, నూతన శైలిలో తెలుగువారికి అందించిన ఘనత ఘంటసాలకే దక్కుతుంది. తెలుగులో సుప్రసిధ్ధ కవులందరి పద్యాలను గ్రామఫోన్ రికార్డ్ లు గా విడుదల చేసి దేశమంతా సంచలనం సృష్టించారు.  అలాగే, తిరుపతి వేంకటేశ్వరుని మీద లెఖ్ఖకు మించి భక్తిగీతాలను, ప్రబోధగీతాలను, దేశభక్తి గీతాలను ఆలపించి  తెలుగునాట ఒక ప్రభంజనంలా సంచలనం సృష్టించారు.

పద్య పఠనం విషయంలో ఘంటసాలవారు తమ గురుదేవులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారినే స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకున్నారు.  గురువుగారి ప్రభావం ఘంటసాలగారి మీద చాలానే ఉంది.
కేవలం ఘంటసాల పాటలతోనే హెచ్.ఎమ్.వి. వారు ఆంధ్రదేశంలో నిలదొక్కుకున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కానేరదు.

చలన చిత్రసీమలో ఘంటసాలగారు సాధించిన విజయాలు అనన్యసామాన్యం, అనితరసాధ్యం. 

1950 ల తర్వాత, ఘంటసాల సినీ సంగీత చరిత్ర ఒక తెఱచిన పుస్తకం. ఆ విషయాలు నేను చెపితేనే మీరు తెలుసుకోవాలని లేదు.
ఇంటింటా ఒక ఘంటసాల వెలయడానికి కారణభూతులైన తెలుగు ప్రజలందరికీ ఘంటసాల తమ మనిషే. ఈనాటికీ చాలా తెలుగు లోగిళ్ళలో ఘంటసాల పాటతోనే సూర్యోదయమై, ఆయన జోలపాటతోనే నిద్రపోతారు.

ఈవిధంగా విజయపథంలో పయనిస్తున్న ఘంటసాలగారు విజయనగరం వదలి వెళ్ళిన మరో ఐదారేళ్ళకు మరల తమ గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారిని విజయనగరంలో దర్శించారు.
ఆ విశేషాలన్నీ.....
వచ్చేవారం....   (సశేషం)
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified. 


Friday, June 26, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఐదవ భాగం


నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) -  ఐదవ భాగం
 
మొదటిభాగం  ఇక్కడ
రెండవ భాగం   ఇక్కడ
మూడవభాగం  ఇక్కడ
నాలుగవభాగం ఇక్కడ

                              

                             నెం. 35 ఉస్మాన్ రోడ్

               
                                                                                                 - స్వరాట్

విజయనగరం లో ఘంటసాల సంగీతాభ్యాసం అటు సంగీత కళాశాల లోనూ ఇటు గురువుగారు పట్రాయని సీతారామశాస్త్రి గారింటి వద్ద కూడా సాగేది. సంగీతం పట్ల ఒక లక్ష్యం , ఉత్సాహం , శ్రధ్ధ గల విద్యార్ధులకు ఏ సమయంలోనైనా సీతారామశాస్త్రి గారు సంగీత శిక్షణలు యిచ్చేవారు. ఈ విషయాన్ని ఘంటసాలవారు తమ  జీవిత చరిత్రలో , ఇంటర్వ్యూ ల లో తెలియజేశారు.

" సంగీత విద్య యెడల నాకు గల తీవ్రమైన ఆకాంక్షను అర్ధం చేసుకున్నారు. నన్ను సర్వ విధాలా ప్రోత్సహించి నాలో ధైర్యం కలిగించారు. శ్రీ శాస్త్రిగారి గానం , వారి మూర్తిమంతం,   సౌమ్యత నన్ను ప్రబలంగా ఆకర్షించాయి. 'గురువు' అన్న మాట శ్రీ శాస్త్రిగారియెడలనే సార్ధకమయిందనిపించింది. వారి సన్నిధిలో సంగీత సాధన ప్రారంభించాను.
ఈ సమయం , ఆ సమయం అని లేకుండా అన్ని వేళల్లో నన్ను కూర్చోబెట్టి సాధన చేయించేవారు. ఆయన ఎప్పుడూ " సాంబ సదాశివ" నామాన్ని స్మరిస్తూ ,అదే నాదంగా నాభిస్థానం నుండి ఎలా పలకాలో చెపుతూ నాతో కూడా పాడించేవారు.

ఘంటసాలగారు AIR కార్యక్రమంలో తనపైన ప్రభావం చూపిన గురువుగారి గురించి  ఇలా అన్నారు - 

ఆడియో లింక్ ఇక్కడ వినవచ్చు. 



ఆ విధంగా ఘంటసాల సంగీతాభ్యాసం కొనసాగింది.

సంగీతాభ్యాసానికి విజయనగరం వచ్చినప్పుడు కొంతకాలం తన ఆకలిబాధను తీర్చుకోవడానికి మధూకరం ఎత్తినా,  సంగీతకళాశాలలో చేరిన కొన్నాళ్ళకు  మహారాజావారి  సింహాచలం సత్రవులో పద్దు కుదిరింది. ఆకలి సమస్య తీరింది. సత్రవు భోజనం, మఠం నిద్ర (గురువుగారింట).  కళాశాల విద్య ముగిసే రోజులలో తన రాత్రి బసను "మూడు కోవెళ్ళ" కు మార్చాడు.

ఆ రోజుల్లో పేద విద్యార్ధులు వారాలు , మధూకరం చేసుకుంటూ విద్యభ్యాసం చెయ్యడాన్ని అందరూ సహజంగానే భావించేవారు.
గృహస్థులు కూడా ఆలాటి విద్యార్ధుల ఎడల ప్రేమను కనపర్చేవారు. సంప్రదాయజ్ఞులు కూడా విద్యార్ధులు మధూకర వృత్తిని అవలంబించడం మహోత్కృష్టకార్యంగా భావించేవారు.

అయితే ఇందుకు మినహాయింపులు కూడా ఉంటాయి. గురువులు శిష్యుడి శ్రధ్ధను , మనోప్రవృత్తిని గమనించి అందుకు తగినట్లుగానే విద్యాబోధన చేసేవారు. అందుకు ఉదాహరణ గా యీ చిన్న కథ చూద్దాము.

ఒక కుర్రవాడు గురుకులంలో చేరి , గురు శుశ్రూష చేస్తూ శ్రధ్ధగా విద్యాభ్యాసం చేసేవాడు. అతని భోజన వసతులన్నీ గురువుగారింటనే సాగేవి. ఆ గురు దంపతులు ఆ బాలుడిని తమ కన్నకొడుకులతో సమానంగా ప్రేమగా  చూసుకునేవారు.

ఇలా కొన్నేళ్ళు గడిచాయి.

ఒకరోజు గురుపత్ని ఆ విద్యార్ధికి భోజనం వడ్డించి అన్నంపై నెయ్యి వడ్డించింది. వెంటనే , ఆ శిష్యుడు ఆమెను వారిస్తూ , " అమ్మగారు , మీరు పొరపాటున  నాకు నెయ్యికి బదులు ఆముదం వడ్డిస్తున్నారు. గమనించండి ," అని అన్నాడు. " అయ్యో ! అలాగా నాయనా ! చూసుకోలేదు " అంటూ ఆవిడ మరల నేయి తీసుకువచ్చి వడ్డించింది. ఇదంతా  గురువుగారు చూస్తూనే ఉన్నారు. మర్నాటి ఉదయం శిష్యుడు అధ్యయనం కోసం గురువుగారి సమక్షానికి వచ్చాడు. గురువుగారు అతనిని చూసి " నాయనా ! నీ విద్యాభ్యాసం ముగిసింది. ఇక నీవు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళవచ్చును " అని చెప్పారు. అది విని శిష్యుడు నిర్ఘాంతపోయాడు. తనవల్ల ఏం తప్పు జరిగిందో తెలియక ,  గురువుగారి మాటలు అర్ధంకాక శిష్యుడు గురువుగారి కాళ్ళమీద పడ్డాడు. 

ఆయన అతనిని  లేవదీసి బుజ్జగింపుగా " నాయనా ! నీకు ఎప్పుడైతే విద్య పట్ల లక్ష్యం మారి ఇతర విషయాలపై బుధ్ధి లగ్నం చేశావో , అప్పుడే నీ విద్య ముగిసింది. ఇన్నాళ్ళూ నీవు గురువమ్మగారి చేతి భోజనమే చేస్తున్నావు. ఇన్నాళ్ళూ , ఆవిడ నీ భోజనంలో ఆముదమే వడ్డించేది , నెయ్యి కాదు. నీవు మారుమాటాడకుండా అదే భుజించేవాడివి. అప్పుడు నీ లక్ష్యం , ఏకాగ్రత అంతా నీ విద్య మీదనే ఉండేది. నిన్న నీకు భోజనంలో నెయ్యికి బదులు ఆముదం వడ్డించారానే విషయం తట్టింది. అంటే నీ దృష్టి మరలింది. ఏకాగ్రత తగ్గింది. ఇంక నీకు విద్య బుధ్ధికెక్కదు. నీ విద్యాభ్యాసం ముగిసినట్లే. ఇక నీవు ఇంటికి వెళ్ళి వేరే ఏదైనా వృత్తి చేసుకొని నీ తల్లిదండ్రులను సుఖపెట్టు " అని మంచి సలహాలతో అతనిని గురుకులం నుండి పంపివేశాడు.

ఈ కధ ద్వారా మనం తెలుసుకోవలసింది, ఏ విద్యయైనా నేర్చుకోవాలంటే చిత్తశుధ్ధి , లక్ష్యం , ఏకాగ్రత , వినయ విధేయతలు కావాలి.
ఈ లక్షణాలు ఉన్న విద్యార్ధులు  మాత్రమే తమ కృషితో ఉన్నతిని సాధిస్తారు.

ఈ లక్షణాలన్నింటితో ఘంటసాల వెంకటేశ్వర్లు పట్రాయని సీతారామశాస్త్రి గారి సన్నిధిలో సశాస్త్రీయమైన సంగీత విద్యను క్షుణంగా అభ్యసించాడు.

గురువుగారింట శిక్షణ అయాక నల్ల చెరువు మెట్టల సమీపంలో  ఉన్న ఒక బావి దగ్గర స్నానాదికాలు ముగించి , దగ్గరలో ఉన్న వ్యాసనారాయణ స్వామి గుడి ఆవరణలో మరల సంగీత సాధన చేసేవాడు. ఆ వ్యాసనారాయణ మెట్టనే నల్లచెరువు మెట్టలు , బాబా మెట్టలు అని కూడా అనేవారు. అక్కడ ఖాదర్ అవులియా బాబా ఆశ్రమం ఉండేది. ప్రతీ రోజూ సాయంత్రం ఆ బాబాగారి సమక్షంలో సంగీత , నృత్య కార్యక్రమాలు జరిగేవి.

విజయనగరంలో సంగీత విద్యార్ధులు తమ విద్యాసాధనని పరీక్షించుకోవడానికి , సార్ధకపర్చుకోవడానికి అనేక భజన గోష్ఠులు అవకాశం కల్పించేవి. వ్యాసుల రాజారావు గారి మేడలోనూ , వంకాయలవారింటిలోనూ , శంభరదాసుగారి కుటీరంలోనూ   ప్రతీవారం ఏదో రోజున భజన కాలక్షేపం ఉండేది. ఏకాహాలు , సప్తాహాలు అంటూ ఏడాది పొడుగునా సత్కాలక్షేపాలు జరిగేవి. వీటిలో , విద్వాంసులు , విద్యార్థులు అనే తేడాలేకుండా అందరూ పాల్గొనేవారు. ఈ భజన గోష్ఠులలో సాధకులకి మంచి ప్రోత్సాహం , పాడడానికి చొరవ ఏర్పడేవి . ఏదో ఒక కీర్తన తీసుకొని బృందగానం చేసేవారు. స్వరకల్పనలలో అందరూ పోటీపడి పాల్గొనేవారు.

ఇలాటివాటిని వెంకటేశ్వర్లు బాగానే సద్వినియోగం చేసుకున్నాడు.
అంతేకాదు , గురువుగారి " కౌముదీ పరిషత్ " సాహీతీ , సంగీత గోష్ఠులను ఆసక్తితో , శ్రధ్ధగా పరిశీలిస్తూ తన సంగీతవిద్యను పెంపొందించుకున్నాడు.

ఇటువంటి సుహృధ్భావ వాతావరణం లో ఘంటసాల సంగీత విద్య ముగిసింది.
ఇక ఆ ఊరినుండి వెళ్ళిపోయే సమయంలో , విజయనగరం లో శ్రీ మారుతీ భక్త మండలి , సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ ఘంటసాలచేత ఒక సంగీత కచేరీ చేయించారు. ఆ సందర్భంగా ఘంటసాలకు , హరికధా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి చేతుల మీదుగా ఒక తంబురాను బహుకరించారు. ఆ తంబురా తన జీవితంలో అత్యంత విలువైనదిగా ఘంటసాలవారూ తరచూ అందరికీ చెప్పేవారు.

ఘంటసాల వెంకటేశ్వర్లు సంగీత కళాశాల విడిచిపెట్టిన నాటికి ప్రముఖ కర్ణాటక సంగీత గాత్రజ్ఞులు సర్వశ్రీ నేదునూరి కృష్ణమూర్తి , నూకల చిన సత్యనారాయణ , జనగాం ఆంజనేయులు , వైణిక విద్వాంసులు అయ్యగారి సోమేశ్వరరావు , మొ.వారు అప్పటికింకా విద్యార్ధి దశలోనే ఉండేవారు.

ఇక్కడ , శ్రీ పట్రాయని సంగీతరావు గారు చెప్పిన ఆసక్తికరమైన విషయం.
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు , శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు , విజయనగరం సంగీత కళాశాలలో వైలిన్ విద్యార్ధులుగా చేరి సంగీతం నేర్చుకున్నారు. వైలిన్ లో శిక్షణ ముగిసిన కొన్నేళ్ళకు గాత్రంలో సాధన చేసి గాత్ర విద్వాంసులుగా స్థిరపడ్డారు. ఈ యిద్దరూ కూడా కొన్ని సంగీత కచేరీలలో శ్రీ సంగీతరావు గారికి వైలిన్ వాద్య సహకారం అందించారట.

(అలాగే , మద్రాస్ లో జరిగిన ఒక కచేరీలో సంగీతరావు గారికి శ్రీ హరి అచ్యుత రామశాస్త్రి గారు (ప్రముఖ సంగీత విద్వాంసులు కీ.శే. శ్రీ హరి నాగభూషణం గారి కుమారులు శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి. చాలా ప్రముఖ సంగీత దర్శకుల వాద్యబృందాలలో పేరుపొందిన వైలినిస్ట్.) వైలిన్ సహకారం అందించడం నాకు బాగా గుర్తుంది.)

సంగీత విద్యలో పట్టభద్రుడైన ఘంటసాల తన స్వగ్రామం చేరుకున్నారు.

తరువాత , ఏం జరిగిందో , మనం కూడా విజయనగరం నుండి బయటకు వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడేనా...
కాదు , వచ్చే వారం.

                     .... సశేషం

Saturday, June 6, 2020

నెం. 35, ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక - అధ్యాయం 1 - రెండవభాగం


నెం. 35, ఉస్మాన్ రోడ్  (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ( రెండవభాగం)

  

                                            నెం. 35, ఉస్మాన్ రోడ్ 
 
                                                                                      - స్వరాట్


ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేముందు నాకు గల అర్హతేమిటో చెపుతానన్నాను.

ఒక మనిషి తనను గురించి పరిచయం చేసుకోవాలంటే , తనకంటూ ఒక స్థాయి , వ్యక్తిత్వం వుండకతప్పదు. అవి లేనివారు తమ వంశవృక్షాలను వెదకి వాటిలోని సారస్వమైన ఫలాలను తనకు ఆపాదించుకొని పదిమందిలో నిలబడాలనుకుంటారు. దీనినే 'చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం' ;  లేదా "మా పెద్దలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి " అని చెప్పడం. ఆ పనే యిప్పుడు నేను చేయబోతున్నాను.  నా యీ మాటలు చదువుతున్నవారికి నేనేదో complexities తో బాధపడుతున్నాననే అనుమానం కలుగుతుంది. నాకలాటి ఆత్మనూన్యతా భావాలేవీ లేవు. ఉన్న వాస్తవం అది. Hypocrisy కి దూరంగా వుండాలనేది నా కోరిక.

మాది ' పట్రాయని'  వారి వంశం. ఈ వంశంలోని పూర్వీకులు ఏదో రాజుగారి కొలువులో ' పట్రాయుడు' పదవి వహించారట. అంటే కొంతమంది సైనికులకు అధిపతి వంటి పదవి. ఆ పట్రాయుడి వంశంలోని వారు పట్రాయనివారుగా మారారు.
ఆ వంశంలో పుట్టినవారు శ్రీ వెంకట నరసింహ శాస్త్రి . ఆయన సంగీతజ్ఞుడు . ఆయన జీవితం చాలావరకు ఒరిస్సాలో ని బరంపురంలో జరిగింది. కర్ణాటక సంగీతంలో కొంత కీర్తన గ్రంధాన్ని నేర్చుకునేందుకు మద్రాస్ లో కొన్నాళ్ళు వున్నారట. ఒరిస్సా లోని అనేక రాజాస్థానాలలో , జమిందారీలలో  కచేరీలు చేస్తూ పండిత సత్కారాలు , సన్మానాలు అందుకున్నారు.ఈయనకు గాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులుండేవి. శ్రీ నరసింహశాస్త్రి గారికి వయసు మీరాక తన కుమారుడితో సాలూరు లో నివాసం ఏర్పర్చుకున్నారు. సంగీతంలో తండ్రీ కొడుకులిద్దరిదీ వేర్వేరు మార్గాలుగా తోస్తుంది. ఆయనను '  సాలూరు పెద గురువు' గారనేవారు.

ఆయన కుమారుడు పట్రాయని సీతారామ శాస్త్రి. వాగ్గేయకారుడు. ఎన్నో కృతులను , చాటు పద్యాలను చందోబధ్ధంగా వ్రాశారు. వీరు  ' సాలూరు చిన గురువుగా లబ్దప్రతిష్టులు. సీతారామశాస్త్రి గారు సాలురులో సొంతంగా భూమికొని దానిలో ఒక చిన్న పర్ణశాల నిర్మించి సంగీత పాఠశాల ప్రారంభించారు. ఆంధ్రదేశమంతా  తిరిగి సంగీత కచేరీలు చేసేవారు.
సీతారామ శాస్త్రిగారికి ముగ్గురు కుమారులు. సంగీతరావు , నారాయణ మూర్తి , ప్రభాకరరావు.
ఈ ముగ్గురు కూడా శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులే.
ఇలా మూడు తరాల వరకు సంగీతమే వృత్తిగా , ప్రవృత్తిగా , పరమార్ధంగా గల మా పట్రాయని వారి వంశం,  మా నాల్గవ తరానికి వచ్చాక సంగీతాన్నే వృత్తిగా స్వీకరించలేకపోయింది. కారణాలనేకం. అవి అప్రస్తుతం. అయితే అందరూ సంగీతాభిలాష , ఆసక్తి , గౌరవ మర్యాదలు కలవారే. ఇద్దరు , ముగ్గురు ఆడపిల్లలు సంగీతంలో విశిష్టమైన కృషిచేసినవారే.

పెరుగుతున్న కుటుంబం , ఆర్ధిక సమస్యల దృష్ట్యా శ్రీ సీతారామశాస్త్రిగారు (మా తాతగారు) సాలూరులోని స్వంత పాఠశాల వదలి  ఆంధ్రదేశంలోనే ప్రప్రధమ సంగీత కళాశాల అయిన విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించి , తన కుటుంబాన్ని కూడా విజయనగరానికి తరలించారు.
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన సందర్భంగా ఏర్పడిన ఖాళీలో గాత్ర పండితునిగా నియామకానికి పెద్ద పోటీయే వచ్చింది. కాలేజీ ప్రిన్సిపాల్ గా ప్రముఖ వైలిన్ విద్వాంసుడు శ్రీ ద్వారం వేంకటస్వామి నాయుడుగారు నియమించబడ్డారు. గాత్రపండితునిగా శ్రీ సీతారామశాస్త్రిగారు నియమితులయ్యారు. అయితే ,
ఈ ఆచార్య పదవి ఆయనను అంత సునాయాసంగా వరించలేదు.  విజయనగరం ఎస్టేట్ కలెక్టర్ , పండితుల సమక్షంలో జరిగిన పోటీలో నెగ్గిన తర్వాత శ్రీ సీతారామ శాస్త్రిగారికి గాత్ర పండితుడిగా ఉద్యోగం లభించింది.
అదే పదవిలో శ్రీ శాస్త్రిగారు రెండు దశాబ్దాల పాటు పనిచేశారు. శ్రీ సీతారామ శాస్త్రి గారిది విలక్షణమైన సంగీతం. ఆయన గానం శుద్ద శాస్త్రీయమైనా  దాక్షిణాత్యపు సంగీతబాణీకి విరుధ్ధమైనది ఆయన గానం , సంగీతం. ఆయన తనకు ప్రక్క వాద్యంగా హార్మోనియం ను తానే వాయించుకుంటూ పాడేవారు. ఆ కారణంగా , ఆనాటి బాణీ విద్వాంసుల మధ్య ఒకరకంగా వెలివేయబడ్డారు.  ఆయన అన్ని రకాల బాణీలలో ఆరితేరినవారే. సంగీత కళాశాల లో విద్యార్ధులకు సంగీతం బోధించేప్పుడు అక్కడి శాస్త్ర మర్యాదలను పాటిస్తూ సిలబస్ ప్రకారమే శిక్షణ యిచ్చేవారు. కళాశాల వెలుపల , కచేరీలలో తన స్వతంత్ర ధోరణిలో గమకయుక్తమైన , భావప్రధానమైన కర్ణాటక సంగీతాన్నే  హార్మోనియం మీద వాయిస్తూ గానం చేసేవారు.  శ్రీ సీతారామ శాస్త్రిగారి  స్వీయ కృతులు రెండు ఓడియన్ రికార్డ్ లుగా వచ్చాయి.

సాలూరి చిన గురువుగారి బాణీ సాహితీ లోకంలో , వారికి ఒక విశిష్టతను , వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టాయి. కచేరీలలో ఆయన గానం చేసే స్వీయ కృతులు , చాటు పద్యాలు విజయనగరం లోని పండితులను , సాహితీవేత్తలను అమితంగా ఆకర్షించాయి. అదే ' కౌముదీ పరిషత్' అనే సాహితీ వేదిక ఆవిర్భావానికి కారణమయింది. శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారే ఆజన్మ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. స్థానిక సంస్కృత కళాశాల పండితులంతా సభ్యులు గా చేరి పదిహేను రోజులకో  నెలకో ఒకసారి సాయంత్రం పూట వెన్నెల వెలుగులో సాహిత్య , సంగీత గోష్ఠి జరిపి తమ కవితలను , కృతులను వినిపించి చర్చలు జరిపేవారు.
ఈ కౌముదీ పరిషత్ కు ' భారతీ తీర్థ' ఆంధ్రా రీసెర్చ్ యూనివర్శిటీ వారి గుర్తింపు లభించింది. ఆ భారతీ తీర్థ రీసెర్చ్ యూనివర్సిటీ వారే
శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారికి , వారి పెద్ద కుమారుడు శ్రీ సంగీతరావు గారికి ' సంగీత భూషణ ' బిరుదు ప్రదానం చేశారు.
శ్రీ పట్రాయని సంగీతరావు గారు తండ్రికి తగ్గ తనయుడు. సార్ధక నామధేయుడు. గురు ముఖఃతా ఆయన నేర్చుకున్న సంగీతం మూడు మాసాలు మాత్రమే. తండ్రిగారి సహచర్యం లో ఆయన గానం వింటూ స్వయంకృషితో సాధించినదే అధికం. హార్మోనియం మీద కర్ణాటక సంగీతాన్ని గమకయుక్తంగా , శుధ్ధ శాస్త్రీయంగా అత్యంత సమర్ధవంతంగా పలికించగల  అతి కొద్దిమంది విద్వాంసులలో ఒకరుగా శ్రీ సంగీతరావు పేరు పొందారు. తన 16 వ ఏట నుండే స్వతంత్రంగా హార్మోనియం మీద జంత్రగాత్ర కచేరీలు చేయడం ప్రారంభించారు. శ్రీ సంగీతరావు గారు ఆంధ్రదేశానికి చెందిన మరో విలక్షణ విద్వన్మణి సంగీత సుధాకర శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారికి సీనియర్. వయసులో పది సంవత్సరాలు పెద్ద.
ఆలిండియా రేడియో ప్రక్క వాద్యంగా హార్మోనియం ను నిషేధించిన కారణంగా శ్రీ సంగీతరావు ఆలిండియా రేడియోను తనకు తానే దూరం చేసుకున్నారు.  శ్రీ సంగీతరావు గారి  గానవిద్వత్ ప్రదర్శనకు ఆకాశవాణి ఏనాడు వేదిక కాలేదు.   సంగీత ప్రసంగాలకు మాత్రం వారిని ఆహ్వానించేవారు.అది శ్రీ సంగీతరావుగారి వ్యక్తిత్వం.
తన స్వయంకృషితో నే వీణ , వైలిన్ వాద్యాల మీద పట్టు సాధించారు. వారికి తండ్రిగారి వారసత్వం వలన సంగీతంలోనే కాక సాహిత్యంలో కూడా మంచి ప్రవేశం లభించింది. ఆంధ్రదేశంలోని ప్రముఖ కవులు రచయితలతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది.
శ్రీ పట్రాయని సంగీతరావుగారికి ఆ పేరు నెలల పిల్లాడిగా వున్నప్పుడే అనుకోకుండా పెట్టబడింది. ఆ పేరు తోనే సంగీతలోక ప్రసిధ్ధులైనారు. స్కూల్ రికార్డ్స్  లో నమోదైన పేరు నరసింహమూర్తి.  అది వారి తాతగారి పేరు.

నేను శ్రీ సంగీతరావుగారి పెద్ద కుమారుడిని.  నా తర్వాత , మంచి సంగీతం పట్ల అభిరుచి, ఆసక్తి గల ఒక సోదరుడు , ముగ్గురు సోదరీమణులు వున్నారు.

దీనికి , మన పాటల దేవుడికి ఏమిటి సంబంధం , ఎందుకీ అక్కర్లేని సొద అని మీరు భావించినా భావించవచ్చు. కానీ , కారణం వుంది . ఘంటసాలగారి గురించి అర్ధం చేసుకోవాలంటే ఆనాటి సాంఘిక పరిస్థితులు , కొంతమంది వ్యక్తుల గురించి కూడా అవగాహన కావాలి. అందుకే ఈ ఉపోధ్ఘాతం.

శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం విజయరామ సంగీత కళాశాలలో గాత్ర ఉపన్యాసకుడిగా ప్రవేశించిన కొద్ది నెలలకు , వేసంగి శెలవులలో, కళాశాల మూసివేసివున్న తరుణంలో ఓ పధ్నాలుగేళ్ళ వయసున్న, వెంకటేశ్వర్లు అనే అబ్బాయి సంగీతం నేర్చుకోవాలని , విజయనగరం చేరుకున్నాడు.

అప్పుడేం జరిగింది ?
                            .... (సశేషం - రెండవభాగం)