visitors

Friday, September 11, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదహారవ భాగం

11.09.20 - శుక్రవారం భాగం - 16*:
పదిహేనవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నా బాల్యమంతా కలివరం, విజయనగరం,బొబ్బిలి మధ్యనే జరిగింది. పుట్టింది బొబ్బిలి. మొదటి ఐదేళ్ళూ నాగావళీ తీరాన. మూడేళ్ళు తెలుగువారికి సాంస్కృతిక కేంద్రమైన విజయనగరంలో. చదువు బొబ్బిలి - మద్రాస్ - బొబ్బిలిలో. ఉద్యోగరీత్యా మద్రాస్ లోనే స్థిరనివాసం. 

నేను ఓ మూడేళ్ళపాటు విజయనగరం లోనే ఉన్నా మా అమ్మగారి ఊరైన బొబ్బిలి తరుచూ వెళ్తూండేవాడిని. అక్కడ మా అమ్మమ్మగారు ఆవిడ తమ్ముడు సామవేదుల నరసింహంగారు, మా దొడ్డమ్మగారు చెళ్ళపిళ్ళ వరహాలమ్మ, ఆవిడ ఒకే కూతురు శారద. వీరందరి సంరక్షణాభారం మా తాతగారిదే. ఆయన బొబ్బిలి కోపరేటివ్ అర్బన్ బ్యాంకు లో పెద గుమస్తా, కేషియర్ గా పనిచేసేవారు. ఆయన భార్య సుందరి చిన్నతనంలోనే పోయింది. మా అమ్మమ్మగారు, దొడ్డమ్మగారు ఇద్దరూ వితంతువులే. మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి అయినా తెలిసిన వారంతా సుందరి అనే పిలిచేవారు. ఆవిడకు ఒక అన్నగారుండేవాడట. నాకు తెలియదు. పేరు రామం. పదహారేళ్ళకే పోయాడట. మా బొబ్బిలి తాతగారి పెద్దక్కగారే విజయనగరం ఇంటి సంరక్షకురాలు. మా తాతగారు సీతారామశాస్త్రిగారి ముగ్గురు కొడుకులను పెంచినావిడ. బొబ్బిలిలో మా తాతగారింట్లో ఉన్నవారందరిదీ సాత్వికమైన  ఆశ్రమ జీవితం. అందుకు తగినట్లుగా వారుండేది ఒక పూరిల్లు. ముందు వెనుకల ఇల్లు. మధ్యలో చిన్న వాకిలి. అందరూ బహు సౌమ్యులు. ఎవరినోటా ఏ విధమైన పరుషపు మాటలు, వ్యాఖ్యానాలు వినవచ్చేవి కాదు. మా బొబ్బిలి తాతగారిని అందరూ 'సింహాలు బాబూ' అని చాలా గౌరవంగా చూసేవారు. అగ్రహారపు జీవనం. అలాటి వాతావరణంలో పెరగడం నా అదృష్టం. మా తాతగారుండే వీధిలో మొదట్లో అందరూ సామవేదులవారి కుటుంబాలే ఉండేవి . అందుకే ఆ వీధిని సామవేదులవారి సందు అని అనేవారు. పోస్టల్ రికార్డ్స్ లో కూడా అలాగే ఉండేది. మా తాతగారి పూర్వీకులు బొబ్బిలి సంస్థానంలో సామవేద పండితులుగా, ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారని చెపుతారు.

మా నాన్నగారి తన  నాలుగు, ఐదు క్లాసుల చదువు బొబ్బిలిలో జరిగింది. అప్పుడే, శ్రీ ఆకుండి నారాయణ శాస్త్రిగారి వద్ద కొంత సంగీతం నేర్చుకున్నారు. ఆ నారాయణ శాస్త్రిగారు బొబ్బిలి కోటలో రాజవంశీయుల పిల్లలకు సంగీతం నేర్పేవారు. బొబ్బిలి రాజావారి పట్టాభిషేకం చాలా ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా రాజావారి మీద నారాయణశాస్త్రి గారు  ప్రశంసా గీతం ఒకటి స్వయంగా రాసి రాగమాలికలో స్వరపరచేరు. ఆ తరువాత కూడా ప్రతీ సంవత్సరం బొబ్బిలి ప్రాంతంలో పట్టాభిషేకం దినోత్సవం అని జరుపుకునేవారట. అలాంటి ఒక సందర్భంలో  పట్టాభిషేక దినోత్సవంనాడు బొబ్బిలి ఆస్థానంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్న  మా నాన్నగారి చేత ఆ కీర్తన పాడించేవారట వారి గురువుగారు నారాయమ శాస్త్రిగారు. ఆ పట్టాభిషేక గీతాన్ని మా నాన్నగారు తొంభై ఏళ్ళ వయసులో మళ్ళీ 2010లో పాడినప్పుటి రికార్డింగ్ ఇక్కడ




సుమారు 263 సంవత్సరాలకు ముందు ఒక సాధారణ కోడి పందేలు కారణంగా చిన్నగా వైషమ్యాలు ఏర్పడి అవి పెరిగి పెద్దవై ఇరుగు పొరుగు సంస్థానాల మధ్య పోరు పెరిగి విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య యుధ్ధానికి దారి తీసింది. హైదరాబాద్ నవాబ్, ఫ్రెంచ్ బుస్సీల ఫిరంగి సైనికుల సహాయంతో బొబ్బిలి కోటను నేలమట్టం చేసి బొబ్బిలి వీరులందరినీ హతమార్చారు. బొబ్బిలి కోటలోని అంతఃపుర స్త్రీలంతా ఆత్మాహుతి చేసుకున్నారు. ఇందుకు ప్రతీకారంగా బొబ్బిలి రాజు బావమరిది తాండ్ర పాపారాయుడు విజయరామరాజును దారుణంగా హత్యచేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తరువాత, ఒక 150 సంవత్సరాలకు బొబ్బిలి వంశీయులు ఇప్పుడున్న చోట కొత్తగా ఒక కోట నిర్మించుకున్నారు. దాని చుట్టూ ఒక ఊరు వృధ్ధి చెందింది. ఆనాటి  అసలు రాజ వంశస్థులెవరూ లేని కారణంగా ఇతర సంస్థానాలనుండి దత్తత కు వచ్చినవారే సంస్థానాధీశులు అయినట్లు చెప్పుకుంటారు. ఇప్పుడున్న విజయనగర రాజుల పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని  రేవా సంస్థానం నుండి దత్తతకు వచ్చినవారే. అందుకే ఇన్నాళ్ళైనా వారెవరూ స్వఛ్ఛమైన తెలుగు మాట్లాడలేరు. పివిజి రాజు పెత్తండ్రి - సర్ విజ్జీ ప్రముఖ క్రికెటర్. రన్నింగ్ కామెంటేటర్ గా కూడా చాలా ప్రసిధ్ధి పొందారు.

ఉత్తరాంధ్రాలో ఉన్న జమిందారి సంస్థానాలలో ప్రముఖమైనవి విజయనగరం, బొబ్బిలి, సాలూరు. అందులో ఉన్నతంగా, పెద్ద ఆదాయం కలిగినది విజయనగరం, తరువాత బొబ్బిలి, చివరగా సాలూరు. ఈ సంస్థానాల గురించి ఒక జోకు ప్రచారంలో ఉండేది. ఈ మూడు సంస్థానాలలో నగారాలు మ్రోగించేవారట. ఆ నగారాల నాదం ఆ ఆస్థానాల ఆర్ధికస్థితిని పోలి ఉండేదట.  విజయనగరం నగారా ఘనం ఘనం అని ఘనంగా మ్రోగేదట. బొబ్బిలి నగారా ధనం ధనం అంటూ ధనం కోసం మ్రోగేదట. ఇక, సాలూరు నగారా ఋణం, ఋణం అంటూ ఋణనాదం చేసేదట. ఆయా సంస్థానాల ఆదాయ స్థితిగతులని ఇలా ఈ జోక్ చేసేవారు. 

అలాటి మూడు సంస్థానాలతోనూ మా పూర్వీకులకు సత్సంబంధాలు వుండేవి.

1952లో విజయనగరంలో ఉన్నప్పుడు విజయావారి  "పెళ్ళిచేసి చూడు" చిత్రం వచ్చింది. ఆ సినీమాను అక్కడ చూసినా పూర్తి అవగాహన లేని వయసు. "బ్రహ్మయ్యా! బ్రహ్మయ్యా!" పాట, "అమ్మా! నొప్పులే, అమ్మమ్మా నొప్పులే" పాట, ఎన్ టి రామారావు పిచ్చివాడిలా బస్సు నడపడం, పుష్పలత, మహంకాళి వెంకయ్య నూలు దారంతో ఆడడంవంటివేవో గుర్తున్నాయి తప్ప, పూర్తి సినీమా గుర్తులేదు. నేను, మా అమ్మగారు 1953లోనో ఎప్పుడో బొబ్బిలి వచ్చినప్పుడు రాజావారి హాలుకి పెళ్ళి చేసి చూడు సినీమా రాబోతున్నదని వార్త వచ్చింది. ఆ సినీమాకు ఘంటసాలవాడే సంగీతం సమకూర్చాడని, అందులో అతని పాటలున్నాయని అందరూ ఘనంగా చెప్పుకున్నారు. ఘంటసాల విజయనగరం మ్యూజిక్ కాలేజీలో అందులో సాలూరు చినగురువుగారి దగ్గర సంగీతం నేర్చుకోవడం వలన, ఆ ప్రాంతాలవారందరికీ ఘంటసాల అన్నా ఘంటసాల సంగీతమన్నా, పాడిన పాటన్నా, పద్యమన్నా విపరీతమైన అభిమానం, గౌరవం ఇప్పటికీ వున్నాయి. ఘంటసాల తప్ప మరో గొప్ప గాయకుడున్నాడంటే ససేమిరా ఒప్పుకోరు. 

పెళ్ళిచేసి చూడు చిత్రమూ అందులోని పాటలు అప్పటికే బహుళ జనాదరణ పొందడంతో బొబ్బిలిలో ఆ సినీమా కోసం అందరూ ఎదురు చూసారు. బొబ్బిలిలో అప్పటికి ఒకటే పెర్మనెంట్ సినీమా హాలు. అదే రాజావారి శ్రీరామా టాకీస్. అదికాక ఓ రెండు మూడు టూరింగ్ టాకీస్ లు ఉండేవి.  టెంట్ హాల్స్. అవి వర్షాకాలంలో పనిచేయవు. రాజావారి హాలులో సౌండ్ బాగుంటుందని, డబుల్ ప్రొజెక్టర్ తో పని చేస్తుందని, ఆ హాలులో స్క్రీన్ సిల్వర్  స్క్రీన్ అని చెప్పేవారు. స్క్రీన్ క్లాత్ కాదు. అలాటి హాలులో సినీమా చూడడం ఆనందంగా భావించేవారు. సినీమా రిలీజ్ డేట్ తెలియగానే పోస్టర్లు అంటించిన బళ్ళు ఊరేగించారు. ఆ బళ్ళకు ముందు ఓ ముగ్గురు డప్పులు వాయించుకుంటూ వచ్చేవారు. ఊళ్ళోని ప్రతీ వీధి జంక్షన్ లో నిలబడి లౌడ్ స్పీకర్లలో ఆ సినీమా గురించి గట్టిగా అరిచి చెప్పేవారు. ఐదేసి నిముషాలకు ఒకసారి గ్రామఫోన్ లో ఆ సినీమాలో పాటలు పెట్టేవారు . గ్రామఫోన్ కీ తగ్గినా, స్పీడ్ లెవెల్స్ కదిలిపోయినా పాట మహా బొంగురుగానో, లేదా కీచుగానో వినిపించేది. ఒక్కొక్కసారి జట్కా బండికి పోస్టర్ తడకలు కట్టి, సినిమా రంగు కాగితాలు గాలిలోకి విసురుతూ పంచేవారు. మరి, అలాటి ఘంటసాలవాడి సినీమా చూడడం మానేస్తామా?

మా సామవేదుల వారి వీధిలో ఆఖరి మూడిళ్ళూ సామవేదులవారివే. వారంతా కజిన్స్. తాతా సహోదరుల పిల్లలుఆ మూడిళ్ళ కోడళ్ళ పేరూ ఒకటే. కామేశ్వరి. పెద కామేశ్వరి, మధ్య కామేశ్వరి, చిన్న కామేశ్వరి. ఆ చిన్న కామేశ్వరిగారి భర్త సత్తేలు(సత్యనారాయణ). ఒకే కొడుకు తరణీరావు. చిన్నప్పటినుండీ ఏదో అనారోగ్యం. మెడ ఒక పక్కకు వంగిపోయి భుజానికి అంటుకుపోయినట్లుగా వుండేది. నెలల పిల్లాడిగా ఉన్నప్పటినుండి చిన్న ఊగుడు కుర్చీలో పడుక్కోబెట్టడం వలన అలాటి అవకరం వచ్చిందనేవారు. మరేదో కారణం కావచ్చు. బాగుపడలేదు.  వారిల్లు విశాలమైన పెంకుటిల్లు. రెండు వీధులవేపునుండి ఇంట్లోకి ప్రవేశముండేది.
వారింటికి మా వీధివేపుండే గుమ్మం మాకు దగ్గర.  నిమ్మ, నారింజ, పంపర పనస, జామి వంటి చాలా చెట్లు,   మల్లి, బంతి చామంతి వంటి రకరకాల పువ్వుల మొక్కలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ఇల్లుండేది. ఆ సత్తేలుగారు చెలికాని అచ్యుతరావుగారి రైస్ మిల్లులో పనిచేసేవారు. అచ్యుతరావుగారు బొబ్బిలి రాజా వారికి బావమరది అని విన్నాను. వారంతా వెలమ  దొరలు. అలాటి దొరల కొలువులో పనిచేయడం వలన మిగిలిన వారికంటే కొంచెం ఉన్నతమే. వాళ్ళింటికి అన్నీ దొరగారి దివాణం నుంచే వస్తాయని ఆ చిన్నకామేశ్వరిగారు గొప్పగా చెపుతూండేది. మా తాతగారి కుటుంబానికి కూడా దగ్గరే. మా అమ్మమ్మగారిని వదినా అని పిలిచేది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద చెంబుతో పాలో, లేక మజ్జిగో నిమ్మాకులు, దబ్బాకులు వేసి ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళమనేది. మనిషి మంచిదే. కానీ నోటి ధాటీ వుండేది. వాళ్ళ ఇంటి పక్కనున్న మధ్య కామేశ్వరి గారికి భర్త లేడు. ముగ్గురు పిల్లలు రమణ, వరహాలు, భాస్కరం. బాచీ అని పిలిచేవారు. అతను నాకు బొబ్బిలిలో మొదటి స్నేహితుడు. పెద్దతను అప్పటికే  ఉద్యోగరీత్యా (రైల్వేలోనే అని గుర్తు) వేరెక్కడో ఉండేవాడు. రెండో అతను వరహాలు. హైస్కూలు లో పేరు మోసిన ఫుట్ బాల్ ప్లేయర్. గోల్ కీపర్ గా మంచి పేరుండేది. స్పోర్ట్స్ కోటాలోనే అతనికీ రైల్వేలో ఉద్యోగం దొరికింది. అతనికి బ్రహ్మాండమైన చెముడు. వాళ్ళిల్లు కూడా మా ఇల్లులాగే పూరిల్లు. ఆ పక్కన పెద కామేశ్వరిగారిల్లు. మేడ ఇల్లు. ఎస్ ఎమ్ రావ్ గారూ రైల్వేలోనో పనిచేసేవారు. ఆరోజుల్లో ఉత్తరాంధ్రాలోని చాలామంది SSLC పూర్తికాగానే చిన్నో, చితకో రైల్వే ఉద్యోగం కోసం తెగ తాపత్రయ పడి ఆ ఉద్యోగంలోనే జీవితాంతం గడిపేవారు. ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ లో స్థిరపడిన సగంమంది తెలుగువారంతా రైల్వే ఉద్యోగులే. ఉత్తరాంధ్రాకు చెందినవారే. వారంతా తమ తమ ఊళ్ళలో తెలుగు సంస్కృతిని కాపాడుకోవడంలో ఇతోధికంగా కృషిచేశారు. 

ఆ రోజుల్లో  బొబ్బిలి కోటకు ఎదురుగా, రాజవీధిలో ఒక టౌన్ హాలుండేది. అందులో తరచూ బొబ్బిలి రాణీగారి ఆధ్వర్యంలో పురాణ కాలక్షేపాలు, భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. వాటిలో మా వాళ్ళంతా కూడా వెళ్ళి పాల్గొనేవారు. మా దొడ్డమ్మగారు, చెళ్ళపిళ్ళ వరహాలమ్మ గారు బాగా పాడేవారు హార్మోనియం కూడా వాయించేవారు. బొబ్బిలిలో ఉండే అనేక సత్సంగ కార్యక్రమాలన్నింటికీ విధిగా హాజరయి భజనగీతాలు ఆలపించేవారు. రాణీగారి టౌన్ హాల్ లో జరిగే భజనలకు స్త్రీలకు మాత్రమే ప్రవేశం. రాణివాసపు ఘోషా అమలులో ఉండేది. మగవారికి వేరేగా ఏర్పాటు చేసేవారు. మా కుటుంబానికి ఈ రకమైనటువంటి పరిచయాలు బొబ్బిలి సంస్థానంతో ఉండేవి.



శ్రీ వి ఏ కే రంగారావు

మనందరికీ బాగా తెలిసిన ప్రముఖ సంగీత, నృత్య విమర్శకుడు శ్రీ విఏకె రంగారావు (వేంకట ఆనంద కృష్ణ)గారిది ఆ వూరే. బొబ్బిలి రాజా శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారి తమ్ముడు, కిర్లంపూడి జమిందారు శ్రీ జనార్ధన రంగారావుగారి కుమారుడు. వారి బంగళా ఊరికి కొంచెం దూరంగా విశాలమైన తోటలో వుండేది. విఎకే రంగారావుగారికి నృత్యంలో మంచి ప్రవేశముండేది. ఆయనకు పదహారేళ్ళ వయసులో కాలికి గజ్జె కట్టి వారి రామ్ మహల్ లో నృత్యం చేయడం బాగా గుర్తు. బహుశా గోకులాష్టమి ఉత్సవాల సమయం కావచ్చు. ఈవయసులో కూడా ప్రతీ సంవత్సరం కార్వేటినగర్ వేణుగోపాలుని సన్నిధిలో గజ్జె కట్టి నాట్యం చేస్తారట. అయితె, ఆయనతో నా పరిచయమంతా ఘంటసాలవారింట్లో ఉన్నప్పుడే. బొబ్బిలిలో కృష్ణాష్టమి సమయంలో డోలాయాత్ర చాలా ఘనంగా జరిపేవారు. మా అగ్రహారం వీధి చివరన ఉన్న పూల్ బాగ్ లో ఉన్న మండపంలో  పెద్ద ఊయలను అలంకరించి అందులో కృష్డ విగ్రహాలు పెట్టి పూజా పునస్కారాలు జరిపేవారు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకూ మా వీధంతా రకరకాల షాపులతో, చుట్టుపక్కల గ్రామాలనుండి ఎడ్లబళ్ళమీద   వచ్చే జనాలతో మహా కోలాహలంగా వుండేది. అలాటి సమయాలలో మా తాతగారి బంధువులు కొందరు పక్కనున్న పాల్తేరు నుండో లేక రాయపూర్ నుండో వచ్చి ఈ డోలాయాత్ర, ఊళ్ళో ఉన్న తెలుగు సినిమాలు మూడాటలు చూసి ఆ మర్నాడు తిరిగి వెళ్ళిపోతూండేవారు. మా వీధి చివరన ఉన్న పూలబాగ్ లో చాలా మంచి టెన్నిస్ కోర్ట్ వుండేది. అక్కడ టెన్నిస్ ఆడడానికి బొబ్బిలి రాణిగారు తమ నల్ల ఫోర్డ్ కారులో ప్రతీరోజూ సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో దుమ్ము రేపుతూ వెళ్ళేవారు. ఆ కారంతా తెల్లటి సిల్క్ తెరలు కప్పేసి ఉండేవి. యువరాణి లావణ్యకుమారి మంచి టెన్నిస్ ప్లేయర్. ఆవిడ మద్రాస్ లో  స్టేట్ లెవెల్  పోటీల్లో  చాలా వాటిలో పాల్గొన్నారు.

బొబ్బిలిలోని రాజావారి కోట, వేణుగోపాలస్వామి ఆలయం, సంస్థానం హైస్కూల్, సుగర్ ఫాక్టరీ, ఊరు చివరి తాజ్ మహల్ లాటి గెస్ట్ హౌస్, ఇవే  ఆ వూరి ప్రతిష్టా చిహ్నాలు. దివాణంలోని గంటలు, సుగర్ ఫ్యాక్టరీ సైరన్ లు బొబ్బిలి ప్రజలకు సమయపాలనం గురించి గుర్తు చేసేవి.

సినీమాలకు సంబంధించినంత వరకూ బొబ్బిలి B సెంటర్. అందువలన ఫస్ట్ రిలీజ్ సినీమాలు బహు అరుదు. పక్కనున్న పార్వతీపురం బిజినెస్ సెంటర్ అందువలన అది A గ్రేడ్ . ప్రతి కొత్త సినీమా ఆ ఊళ్ళో ఆడుతుంది. ఆ A సెంటర్స్ లో ఆడి వెళ్ళిన తరువాత ఎప్పుడో బొబ్బిలిలో  సినీమాలు రిలీజయేవి. అప్పట్లో సినిమాలన్ని ఏ పదిహేను కాపీలో, ఇరవై కాపీలో మాత్రమే తీసి ఆంధ్రదేశమంతా ఆడేవారు. బొబ్బిలిలాటి ఊళ్ళో బొమ్మ నాలుగు వారాలాడితే అది హిట్ సినీమా క్రిందే లెక్క. మామూలు సినీమాలన్నీ రెండు వారాలాడితే గొప్ప.


అలాటి సందర్భంలో, ఈ పెళ్ళిచేసి చూడు సినీమా వచ్చింది. బొబ్బిలి రాణిగారి అనుయాయులంతా పాసుల మీద  ఈ  సినీమా చూసేందుకు అవకాశం వచ్చిందని, అందరం కలసి సాయంత్రం ఆటకు వెళదాం రమ్మనమని మా వీధిలోని చిన కామేశ్వరిగారు మా అందరిని బయల్దేరదీసింది. సాధారణంగా ఈ సినీమాలకు పాసులు సినీమా ఇంక వెళిపోతుందనగా, పోలీసులకు, సానిటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లవారికి ఇచ్చేవారు. ఎందుకంటే ఆయా శాఖలవారి నిరంతర సహకారం సినీమా ధియేటర్లకు అవసరం. అందుకోసం వాళ్ళకి ఫ్రీ. 

మేము వెళ్ళినది సినిమా విడుదలైన వారంలోనే. అందులోనూ ఆడవారికి మాత్రమే. నేను చిన్నపిల్లవాడిని కావడం వలన నాకు ఇబ్బంది లేదు. కానీ, వచ్చిన ఇబ్బంది అంతా శ్రీరామా టాకీస్ లోనే. మేమంతా రాణివాసం వారికి కావలసినవాళ్ళం కావడం వలన మమ్మల్నందరినీ తీసుకువెళ్ళి బాక్స్ లో కూచోపెట్టారు. హాలుకు రెండు ప్రక్కలా రెండు బాక్స్ లు ఒక్కొక్కదాంట్లో పదిహేనుమందో ఇరవైమందో కూర్చోవచ్చును. రాయల్ ఫేమీలి వారికోసం మాత్రమే. ధియేటర్లోని ఇతర ప్రేక్షకులు ఎవరూ కనపడకుండా పూర్తిగా తెరలు కప్పేసి ఉంచుతారు, ఘోషా కోసం.  హాలులో హైక్లాస్ కుర్చీ టికెట్ తప్ప మిగిలిన క్రింది క్లాసులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. మధ్యలో  కర్ర డివైడర్స్ ఉండేవి. సినీమా వేసేముందు ధియేటర్లోని లైట్లన్నీ పూర్తిగా ఆర్పివేశాక అప్పుడు బాక్స్ లోని తెరలు తొలగించేవారు. అసలే పొట్టివాడిని. దానికి తోడు అడ్డంగా  బాక్స్ ముందు పిట్టగోడలు (parapet wall). నిక్కి నిక్కి చూడాలి.
 
తెరమీద 'పొగ త్రాగరాదు' 'No Smoking', 'ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు' వంటి హితోపదేశాల స్లైడ్స్ తరువాత ఇండియన్ న్యూస్ రీల్ విమానాలతో ఏదో ఒక పది నిముషాల వార్తా విశేషాలు. తర్వాత, అసలు సినీమా. అప్పటిదాకా హాలు బయట డప్పుల మ్రోత, టిక్కెట్ల అమ్మకం జరిగేది. మెయిన్ సినీమా ప్రారంభించాక టికెట్ కౌంటర్లు మూసివేశేవారు. డప్పుల మ్రోత ఆగేది. సాయంత్రం ఆరుగంటల వేళ ఊళ్ళో ఉన్న మూడు సినీమా హాల్స్ డప్పుల మ్రోత ఊరంతటికి వినపడేది. 

"పెళ్ళి చేసి చూడు" సినీమాకు ముందు ఆ సినీమా ట్రైలర్ వేశారు. అయితే బొమ్మలేకుండా మాటలతోనే ఆ సినీమా వివరాలు, పాటలు వినిపించిన గుర్తు. అందులో పని చేసిన వారిగురించి చెపుతూ, "ఇంట ఇంటనూ గంట గంటకూ ఎవ్వరి కంఠం వింటారో  ఆ ఘంటసాలవారీ చిత్రానికి నాదబ్రహ్మలండీ" అని ఆ సినీమాకు సంగీత దర్శకత్వం వహించి, పాటలు పాడిన ఘంటసాలవారి గురించి ప్రత్యేకంగా చెప్పడం ఒక విశేషం. నాకు మహా ఆనందం. 

అంటే అప్పటికే ఘంటసాలవారి గళం ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేసిందని అర్ధమౌతుంది. ఆ సినీమాలో మిగతా అంశాలతో పాటు పిల్లలకోసమే నాలుగు పాటలు డాన్స్ లు పెట్టడం వలన పెళ్ళిచేసి చూడు, ఆ బాల గోపాలాన్ని అమితంగా ఆకర్షించింది. 



సినీమా పూర్తయి బాక్స్ లోని ఆడవాళ్లంతా కారులోనో, తెరలుకట్టిన జట్కాలలోనో వెళ్ళిపోయాక ధియేటర్ తలుపులు తీసేవారు. అప్పుడు మిగతా జనం బయటకు పోయేవారు. నాకు కట్టి పడేసినట్లుగా ఉండే ఈ బాక్స్ సినీమా తృప్తి కలిగించలేదు. మళ్ళీ  మా తాతగారి దగ్గర మారాం చేసి  ఆరణాల బెంచి టిక్కెట్టు కొనుక్కొని చుట్ట, బీడీ, సిగరెట్ పొగల మధ్య మరొకసారి 'పెళ్ళి చేసి చూడు' సినీమాను తృప్తిగా చూశాను. 

ఈ పెళ్ళి చేసి చూడు సినీమా చూశాక మర్నాడు మా శారద పెళ్ళికి కుద్దిగాం తరలివెళ్ళేం.

ఆ వివరాలు వచ్చేవారం....
                 ....సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, September 4, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదిహేనవ భాగం

04.09.20 - శుక్రవారం భాగం - 15:
పధ్నాలుగవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"శ్రీమతి లీలమ్మ గారికి,
అంటూ తన కృతులను రేడియోలో, కచేరీలలో పాడేందుకు తన అనుమతి పత్రాన్ని ఒక పోస్ట్ కార్డ్ మీద మా తాతగారి తరఫున మా ప్రభూ చిన్నాన్నగారు ముత్యాలకోవ వంటి దస్తూరీతో తన దగ్గరున్న మెరూన్ కలర్ 'రత్నం' పాళీ పెన్ తో వ్రాసి చదివి వినిపించగా, ఆ బరువైన లావుపాటి పెన్ తో మా తాతగారు ఉత్తరం క్రింద 'పట్రాయని శీతారామశాస్త్రి' అని సంతకం చేశారు. 

ఆ తరువాత, ఆ ఉత్తరాన్ని, అప్పటికే సినీమాలలో పాడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్న గాయని శ్రీమతి పి.లీల గారి మెడ్రాస్ ఎడ్రస్ కు  మా చిన్నాన్నగారు పోస్ట్ చేశారు. ఆయన  తెల్ల చొక్కాజేబులు చాలా పెద్దవి. అందులో మనీపర్స్, పద్దులపుస్తకం, కాగితాలు, పోస్ట్ కార్డులు‌, పెన్నులు, ఇలా ఎన్ని వస్తువులైనా పట్టేవిగా ఉండేవి. 

నాకు మా తాతగారు తన సంతకాన్ని తప్పుగా పెడుతున్నారనిపించింది. 'సీతారామశాస్త్రి' కి బదులుగా 'శీతారామశాస్త్రి' అని వ్రాయడం  ఒక ఆశ్చర్యం. అయితే, 'శీ' అని వ్రాయడం ఆయన అలవాటని తెలిసింది.

మా తాతగారు, పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఒక వాగ్గేయకారుడు. భావప్రాధాన్యమున్న ఎన్నో కృతులు వ్రాశారు. చందోబధ్ధంగా పద్యాలు వ్రాసారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ తనదైన బాణీని వినిపించిన శాస్త్రిగారే 'కౌముదీ పరిషత్' కు ఉచితమైన అధ్యక్షుడిగా ఇతర కవులందరిచేత ఎన్నుకోబడి తన జీవితాంతం ఆ పదవిలో కొనసాగారు. ఇంతకూ సీతారామశాస్త్రిగారికి ఏ స్కూల్ చదువులేదు. వారి తాతగారు (తల్లిగారి తండ్రి) ఇసకలో దిద్దించిన ఓనామాలు తప్ప ఎక్కడా ఏ పాఠశాల గడప తొక్కలేదు. 

మా ముందు తరంలోని పెద్దలెవరికీ హైస్కూలు, కాలేజీ సర్టిఫికెట్లు లేవు. అందువలన వారందరూ పూర్తిగా తమ సంగీతాన్నే నమ్ముకొని జీవించవలసివచ్చింది. చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ లేని కారణంగా మా తాతగారికి రావలసిన మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ పదవి రాలేదు. ఆ పదవి దక్కకపోవడానికి గల అనేక కారణాలలో ఇది కూడా ఒక కారణంగానే ఒప్పుకోవాలి. కారణాలేవైనా ఉద్యోగ విరమణానంతరం రావలసిన పెన్షనూ రాలేదు. 

పూర్వజన్మ సుకృతం, స్వయంకృషి సీతారామ శాస్త్రిగారిని ఒక ఉన్నత వాగ్గేయకారుడిని చేసింది. ఒక విలక్షణ వ్యక్తిగా నిలబెట్టింది. సర్వశ్రీ - పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి, క్రొవ్విడి రామం, క్రొవ్విడి లక్ష్మణ్, నల్లాన్ చక్రవర్తుల సోదరులు, భళ్ళమూడి నరసింహం, ఆకుండి వెంకటశాస్త్రి, బుర్రా శేషగిరి రావు, జీవన ప్రభాత వంటి లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తలతో పాటు మా తాతగారి శిష్యులందరూ, ఘంటసాల సహా, కౌముదీ పరిషత్ సభ్యులే. మా నాన్నగారి ముఖ్యస్నేహితులు జీవన ప్రభాత, పంతుల శ్రీరామశాస్త్రి, భట్టిప్రోలు కృష్ణమూర్తి, మంథా వెంకట రమణారావు. వీరంతా కౌముదీ పరిషత్ కార్యకలాపాలలో పాల్గొనేవారు. వీరు అప్పటికే రచయితలుగా పేరుపొందివున్నారు. వీరి రచనలు 'భారతి' లో వస్తూండేవి. కౌముదీ పరిషత్  సంస్థ రాజమండ్రిలో కూడా జీవన ప్రభాత ఆధ్వర్యంలో నడిచింది. మా తాతగారి ఆధ్వర్యంలోని 'కౌముదీ పరిషత్', 'భారతీ తీర్థ' (ఆంధ్రా వేదిక్ రీసెర్చ్ యూనివర్సిటీ)కు అనుబంధ సంస్థగా మారి కవి, గాయక, పండితుల సమ్మేళనంతో ఒక ప్రముఖ వేదికగా అందరి మన్ననలు పొందింది. తరుచూ, సంగీత, సాహిత్య గోష్టులు జరిపేవారు. 

పండగలు పబ్బాలు వస్తే విజయనగరం సంగీత, సాహిత్యగోష్టులతోనే కాదు, పేకాటలతోనూ హోరెత్తేది. మా నాన్నగారి సాహితీ మిత్రబృందం అంతా ఒరిస్సాలోని రాయగఢా, జయపూర్ రూర్కెలా ఇతర ప్రాంతాలనుంచి వచ్చి  కౌముదీ పరిషత్ సభలలో పాల్గొనడంతో పాటు మా ఇంట్లో నిర్విరామ చతుర్ముఖ పారాయణం నిర్వహించేవారు. నిరంతర శ్వేతకాష్టాల ధూపం ఇంట్లో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టేది. 'ఇస్తోకు రాణి' అనే మాట  వాళ్ళ ఆటలో తరుచూ వినపడేది. ఎత్తడం, అడ్డాట, నేషనల్ బ్రిడ్జ్, మూడు ముక్కలాట వంటి పేర్లు అప్పుడే తెలిసింది. రాత్రుళ్ళు హరికేన్ లాంతర్ వెలుగులోనే పేకాడడం గుర్తు. పిల్లల కోసం చిన్న సైజ్ పేకదస్తాలు వుండేవి. వాటితో 'తరగనితంపి' అనే ఆటను  పిల్లలం ఆడేవాళ్ళం. వీరందరి భోజనాలు, బసలు మా ఇంట్లోనే. సందట్లో సందడిగా చామలాపల్లి, డొంకాడ , భీమవరం, పెంట, గుడివాడ, బొబ్బిలి ప్రాంతాల నుండి  వచ్చి పోయే బంధువుల రాకపోకలతో పండుగలు, వేసవి శెలవుల హడావుడి అంతా మా ఇంట్లోనే కనిపించేది.

మా తాతగారికి దిన పత్రికల్లో వచ్చే దినసరి రాశి ఫలాలాను చదివి వాటిని ఆచరించడం ఒక సరదా. 'అమ్మీ! ఇవేళ నా రాశికి ప్రయాణం అని రాశారు. అందుచేత ఒకసారి బొబ్బిలి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయి ఆ మర్నాటికి చక్కా తిరిగి వచ్చి దినఫలాలను నిజం చేసేవారు. బొబ్బిలిలో ఆయన తమ్ముడు (పెత్తల్లి కొడుకు) సామవేదుల నరసింహంగారు (బొబ్బిలి కోపరేటివ్ బేంక్ సింహాలుగారు), ఆయన చెల్లెలు అప్పలనరసమ్మగారు, ఆవిడ పెద్దకూతురు చెళ్ళపిళ్ళ వరహాలమ్మ - ఆయన పెద్ద మేనకోడలు, ఆవిడ కూతురు శారద ఉండేవారు. మా అమ్మగారు సామవేదుల నరసింహంగారి రెండో మేనకోడలు. వీళ్ళందరినీ ఒకసారి చూసేసి ఒక రోజుండి విజయనగరం వచ్చేస్తూండేవారు. ఆయన అక్కగారు, మా తాతగారి కూడా అక్కగారే అయిన ఓలేటి వెంకట నరసమ్మగారే విజయనగరంలో ఇంటి కేర్ టేకర్. ఇంటి సంరక్షణ పర్యవేక్షణ ఆవిడదే. ఆవిడనే మా తాతగారు అమ్మీ అని పిలిచేవారు. ఆవిడే మా పెద్దమ్మమ్మ.

అలాగే, చోడవరం. ఆ ఊళ్ళో ఆయనకో  చెక్క భూముండేది. అది పేరుకే సొంతం. దానిని కౌలుకు తీసుకున్నవారెవరో కానీ ఆ భూమి మీద ఏవిధమైన ఆదాయం ఇచ్చేవారు కాదని వినికిడి. ఎప్పుడో ఒకసారి చోడవరం రావడం ఆ వ్యక్తిని చూడడం, అతను చెప్పే తీపి కబుర్లకు లొంగి అయ్యో పాపం! అని జాలిపడి తిరిగిరావడం జరిగేది. బస్సు ఖర్చులు, అలసట తప్ప ఒరిగిందేఁవీఁ లేదు. ఆ విషయం ఆయనకూ తెలుసు. ఆ తరువాత, ఆ చోడవరం భూమి కూడా సంసారం కొసం హరించుకుపోయింది.

నా విజయనగరం చదువు, బ్రాంచ్ కాలేజీకి మారింది. ఫస్ట్ ఫారమ్ లో జాయిన్ చేశారు. కొత్త స్కూలు, కొత్త వాతావరణం,కొత్త టీచర్లు, కొత్త స్నేహితులు. అలవాటు పడేందుకు టైమ్ పట్టింది. ఆ బ్రాంచ్ కాలేజీలో చేరినప్పుడే బాల్ పెన్ తో వ్రాయడం మొదలయింది. నాకు ఒక  రోస్ కలర్ టిప్, రోస్ కలర్ బాటమ్ ఉండే తెల్లటి బాల్ పెన్ కొనిచ్చారు. దానితో రాయడానికి కష్టపడవలసి వచ్చేది. అప్పుడే, మొదటిసారిగా చెప్పులు వేసుకోవడం మొదలయింది. బాటా చెప్పులు. పది రూపాయల లోపే. అంతవరకు ఎలాటి రోడ్లమీదైనా చెప్పుల్లేకుండానే తిరిగేవాడిని. కొత్త చెప్పులు అలవాటులేక వేళ్ళమధ్య కరవడం, దానికి మందు పూయడం ఒక పని. ఆ బ్రాంచ్ కాలేజీ, పొడుగాటి వరండాలతో, పెద్ద పెద్ద గదులతో బాగానే ఉండేది. ఆగస్ట్ 15 కి తరగతి గదులు అందంగా రంగు కాగితాలతో అలంకరించేవారు.  ఫస్ట్ ఫారమ్ తరగతిలోఉన్న పిల్లలందరిని స్క్వాడ్ ల క్రింద విభజించారు. నేను నెహ్రూ స్క్వాడ్. కొందరు గాంధీ స్క్వాడ్. మరికొందరు నేతాజీ స్క్వాడ్. అప్పుడే, మన దేశ నాయకుల ఫోటోలు చూడడం, వారి పేర్లు తెలుసుకోవడం. నేను నెహ్రూ స్క్వాడ్ లో ఉన్నందుకు ఒక నెహ్రూ ఫోటోను తీసుకురావాలని చెప్పారు. మా చిన్నాన్నగారి సాయంతో ఒక పేపర్ లోని ఫోటో కట్ చేసి దానిని అదే సైజ్ అట్టమీద అంటించి మధ్యలో ఒక కన్నంపెట్టి దారంతో కట్టి, ఆ నెహ్రూను మా క్లాస్ లో మేము కూర్చుండే చోట గోడకు మేకు కొట్టి తగిలించాము. ఆ పనులు వేరే పిల్లలు చేసారు. ఈ స్కూలుకు వెళ్ళాక విజయనగరంలో కొత్త వీధుల పేర్లు తెలిసాయి. పాలేపువారి వీధి, బొంకులదిబ్బ,  కానుకుర్తివారి వీధి , గుండాలవారి వీధి , లక్కపందిరివీధి , లంకవీధి, మూడు లాంతర్ల వీధి, గంటస్థంభం, కొత్తపేట వంటి పేర్లు తెలిసాయి. అయితే అవెక్కడున్నాయో ఇప్పటికీ నాకు తెలియదు. అప్పుడే బొడ్డువారి హాలని ఒక సినీమా హాలు తయారయింది. అదే శ్రీరామా టాకీసేమో గుర్తులేదు. (ఆ ధియేటర్ ఓనర్ గారి అమ్మాయి ఓ పుష్కరం తరువాత తిరుపతిలో మెడిసిన్ చేస్తూ మెడ్రాస్ మా ఉస్మాన్ రోడ్ ఇంటి పక్కింటి అరవాళ్ళ మేడమీద అద్దెకుండే తెలుగువారింటికి శెలవుల్లో వచ్చి గడపడం ఓ గొప్ప థ్రిల్లు. 

కృష్ణాహాలులో మా వాళ్ళతో కలసి 'పెళ్ళిచేసి చూడు' వంటి సినీమాలు చాలానే చూశాను. అయితే ఆ హాలులో ఇనప స్థంబాలు ఎక్కువగావుండి సినీమా సరిగా కనపడేదికాదు. అలాగే ఆ సీట్లు కూడా. ముందువాళ్ళ తలలు తప్ప సినీమా కనపడదు. అప్పట్లో చాలా సినీమా హాల్స్ సీట్లు అలాగే ఉండేవి. 

ఒక రోజు స్కూల్ కు వెడుతున్నప్పుడో, వస్తున్నప్పుడో ఒక సైకిల్ వాడు స్పీడ్ గా వచ్చి నన్ను గుద్దేశాడు. కంటి మీద గాయమయింది. తెలిసినవాళ్ళెవరో  ఇంటికి చేర్చారు. తరువాత, సుసర్ల వెంకట్రావుగారి క్లినిక్, గాయానికి మందులు, మాకులు, స్కూలుకు డుమ్మా తప్పనిసరి. అదృష్టం ఏమంటే ఆ సైకిల్ బ్రేక్ రాడ్ ఎడమ కనుబొమ్మమీద గుచ్చుకుంది. అది ఏమాత్రం క్రిందికి తగిలినా ఎడమకన్నే పోయుండేదని డాక్టర్ గారు చెప్పారు. ఆ గాయం మచ్చ చాలా సంవత్సరాలవరకూ అలాగే వుండిపోయింది.

మా చిన్నప్పుడు మా ఇళ్ళలో ఎక్కడా గోడ గడియారాలు, చేతి వాచీలు లేవు. టైమ్ తెలుసుకోవాలంటే మా వీధిలో నాలుగైదు ఇళ్ళ తరువాత ఉండే పెద్దమ్మి - చిన్నమ్మి ఇంట్లో వుండే గోడ గడియారాన్ని బయటనుండే కటకటాల తలుపులుగుండా చూసి వచ్చేవాళ్ళం. ఒకరోజు ఉదయం టైమ్ చూడడానికి వెళుతూండగా ఏదో జరిగింది.  ఎవరో ముందుకు త్రోసినట్లయింది. ఒక వారగా నడుస్తున్న నేను రోడ్ అవతల వేపుకు జరిగిపోయాను. అదెలా జరిగిందో నాకే తెలియదు. ఆ సమయంలో ఏదో చిన్న ఉరుము లాటి శబ్దం వినిపించింది. అది కొద్ది క్షణాలు మాత్రమే. తర్వాత ఏమీ లేదు. ఇంటికి వచ్చాక తెలిసింది భూమి కంపిస్తే అలా జరుగుతుందట. విజయనగర ప్రాంతాలలో చాలాకాలం ముందు భూకంపాలు తరచూ వచ్చేవిట. అందుకు కారణం, హెర్కులిస్ భూమిని మోస్తూ ఒక భుజం మీదనుండి మరో భుజానికి మార్చుకోడమేనట. మా మిత్రబృందం చెప్పింది.

తరువాత, తెలిసిన విషయం ఏమంటే విజయనగరానికి సమీపాన రామతీర్థం అనే ఊరుంది. ఆ వూళ్ళోని కోదండ రామస్వామివారి ఆలయం చాలా పురాతనమైనది, ప్రసిధ్ధిచెందినదీను. ఈ ప్రాంతమంతా కొండలు. అవి ఒకప్పుడు గంధకం కొండలట. వాటిలోని గంధకం  లోపల్లోపల మండడం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో భూకంపాలు ఏర్పడేవట. ఇదంతా శతాబ్దాలకాలం నాటి మాట. వాటిమీద ఎక్కడా ఒక చెట్టుకానీ, పచ్చని మొక్కకానీ కనపడదు. ఆ ప్రభావం వల్లనే అప్పుడప్పుడు భూమి కంపిస్తుందని అనేవారు.




(రామతీర్థంలో కోదండరామస్వామి కోవెల)

మా ఫ్రెండ్స్ లో రీల్ మాస్టర్లు (సింపుల్ గా కోతలరాయుళ్ళు)‌ ఎక్కువే. విజయనగరం ఊళ్ళోనుండి ఎక్కడనుండి చూసినా ఊరి పొలిమేరల్లో ఉన్న మచ్చకొండ, సూదికొండ కనిపించేవి. ఆ మచ్చకొండ మీద ఏదో పాడుపడిన కట్టడం ఉండేది. అదేమిటో స్పష్టంగా గుర్తులేదు. అలాగే, మచ్చకొండకి మచ్చ ఎలా వచ్చిందంటే, విజయనగరం మహారాజావారు కోటలో నుండి కొండమీదున్న ఒక పక్షిని తన పొడుగాటి తుపాకీతో గురిచూసి కొట్టడంతో ఆ గుండు తాకిడికి పక్షితోపాటూ ఆ కొండ పెళ్ళకూడా రాలి మచ్చపడిందట. ఈ విషయాలు మా స్నేహితులు చెపుతూంటే నోరెళ్ళబెట్టుకొని మహా ఆసక్తిగా వినేవాడిని. విజయనగరం మహారాజావారు ఎంత గొప్పవారో అనిపించేది. 

ఇలాటి విషయాలన్నీ మంత్రిప్రగడ నాగభూషణం నోటమ్మట వినపడేవి. మంత్రిప్రగడ వారింటి పక్కనే మల్లాప్రగడవారు. ఆ ఇంటావిడ మా అమ్మగారి స్నేహితురాలు. ఈ నాగభూషణం చిన్నప్పుడే ముదిరిపోయాడు. అప్పుడు జగ్గయ్య నటించిన 'ప్రియురాలు' అనే సినీమా వచ్చింది. ఆ సినీమాలో హీరో సిగరెట్లు కాలుస్తూంటాడు. ఈ కుర్రాడు ఆ సినీమా చూసొచ్చి అందులో జగ్గయ్యలాగే సిగరెట్ కాలుస్తున్నట్లు నటిస్తూ ఆ డైలాగ్ లతో నటించి చూపేవాడు. అతనంటే ఎందుకో నాకు ఎక్కువ పడేదికాదు. కొంచెం దూరంగానే ఉండేవాడిని.

మా ఇంటి దగ్గరనుండి అయ్యకోనేరు గట్టుకు వెళ్ళాలంటే సుబ్రమణ్యంపేట వీధిలోనుండి తురకల చెరువు మీదుగా వెళ్ళాలి . ఆ వీధిలో అయ్యకోనేరు గట్టుకు ముందు కుడివేపు ఒక పెద్ద తెల్లటి మేడ వుండేది. ఆ ఇంటి వరండాలో పెద్ద పెద్ద డూమ్ లు, రంగురాళ్ళ షాండ్లియర్లు వుండేవి. ఆ ఇంట్లో ఎవరో పట్నాయక్ ఉండేవారు.  రంగురాళ్ళు సేకరించడం ఓ సరదా. మా పక్క వీధిలో ఒకరింట్లో అలాటి రాళ్ళను  మా యింట్లోని వారపత్రికలు ఇచ్చి సంపాదించినట్లు గతంలో చెప్పాను. వాళ్ళింటికి వెళ్ళి చాలారోజులయింది. కోటలోనుండి వచ్చే  కొత్త రంగురాళ్ళేమైన దొరుకుతాయేమోనని వాళ్ళింటికి వెళ్ళాను. నేను ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళేప్పటికి ఎవరెవరో చాలామంది మనుషులు గుమిగూడి వున్నారు. లోపలనుండి ఎవరో ఏడవడం వినిపించింది. నాకు భయంవేసి, ఒకే పరుగున ఇంటికి చేరుకున్నాను. తరువాత, మా చిన్నాన్నగారి మాటల్లో తెలిసిన విషయం ఏమంటే ఆ యింటివారి కొడుకుల్లో ఒకడు విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో చదువుతూ శెలవులకి రైల్లో విజయనగరం వస్తున్నాడట. అతను రైల్లో చల్లగాలికోసం తలుపు దగ్గర కూర్చున్నాడట. రైలు స్టేషన్లోకి రావడం నిద్రమత్తులో గమనించలేదట. రైలుకి ప్లాట్ ఫారమ్ కి మధ్య కాళ్ళు ఇరుక్కుపోయి అతను పట్టాల మధ్య పడి అక్కడికక్కడే చచ్చిపోయాడట. ఆ సంఘటన వినడానికే చాలా భయంకరంగా అనిపించింది. చిన్నతనం కావడంవలన నేను మళ్ళీ ఆ యింటిలోకి వెళ్ళడానికి మనసురాలేదు.

ఒక రోజు మా ఇంటి వరండాలో కూర్చొని ఫ్లోర్ క్యారమ్స్ ఆడుతూంటే ఒక పెద్ద సినీమా వ్యాన్ వచ్చింది. సాధారణంగా, సినీమాల ప్రచారమంతా జట్కా బళ్ళకు, రిక్షాలకు సినీమా పోస్టర్లు అంటించి "నేడే చూడండి మీ అభిమాన పూర్ణా ధియేటర్లో" అని స్పీకర్లో అరుస్తూ సినీమా కాగితాలు పంచిపెట్టేవారు. వాటిని పేపర్ బండి అనేవారు. ఆ సినీమా పేంప్లట్స్ చాలా చీప్ పల్చటి కాగితాలమీద ఎరుపు, పసుపు, పచ్చ, నీలం రంగులలో పంచేవారు. వాటిమీద సినీమా వివరాలు, కధా సంగ్రహం ఉండేవి. ఆ కాగితాలకోసం పిల్లలంతా ఆ జట్కా ల వెనక, రిక్షాలవెనుక పరిగెత్తి వాటిని సంపాదించేవారు. అలాటిది, ఒక సినీమా ఎడ్వర్టైజ్మెంట్ కోసం ఒక పెద్ద వ్యాన్ లాటిది మా వీధిలోకి రావడం మహదానందం కలిగించింది. ఆ వ్యాన్ కు మూడు పక్కలా పూర్తిగా  బల్బులతో అలంకరించి పోస్టర్లు తగిలించారు. దానిమీద "చంద్రహారం" అని రాసివుంది. నాకు బాగా తెలిసిన ఎన్ టి రామారావు బొమ్మవుంది. వేరెవరి బొమ్మలో కూడా ఉన్నాయి. నాకెందుకో ఆ సినీమా పేపర్ సంపాదించాలనిపించి ఆ వ్యాన్ వెనకాల పడ్డాను.  ఆ వీధిలో కొంత దూరం వెళ్ళాక ఎలాగో ఒక పాంప్లెట్ నాకు దొరికింది. అలాటి సినీమా పేపర్ అంతవరకూ నేను చూడలేదు. మల్టీ కలర్స్ లో  గ్లేజ్డ్ పేపర్ మీద వీక్లి పత్రికల సైజ్ లో ఉంది. ఆ పేపర్ నాకెంతో అమూల్యమైనదిగా తోచింది. దానిని జాగ్రత్తగా మా అమ్మగారిచేతికిచ్చాను. చంద్రహారం సినీమా పెళ్ళి చేసి చూడు తీసినవాళ్ళదని ఇందులో కూడా ఘంటసాల పాటలున్నాయని తెలిసింది. ఆ పోస్టర్ మీద ఎన్ టి రామారావుతో పాటు శ్రీరంజని, ఎస్వీరంగారావు, సావిత్రి, రేలంగీ, మరెవరో ఉన్నారని తెలిసింది. నేను  ఆ రంగుల సినీమా పోస్టర్ ను నా పరీక్షల అట్టమీద అంటించి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని. నేను విజయనగరంలో ఉన్నంతకాలం చంద్రహారం పోస్టర్ నా దగ్గరే ఉండేది. తరువాత, ఆ చంద్రహారం సినీమా వ్యాన్ మరో రెండుసార్లు రాత్రిపూట పూర్తి లైట్ల వెలుగుతో మా వీధిలోనుంచి వెళ్ళింది. అప్పటికీ, ఇప్పటికీ కూడా నాకు చంద్రహారం అంటే చాలా ఇష్టం. అందులోని మాలిగా ఎస్వీరంగారావు పాడిన 'ఏనాడు మొదలిడితివో ఓ విధి' పాట నాకు చాలా ఇష్టం. ఆ సీన్ లో మాలిని చూస్తే జాలిగా ఉండేది. కారణం తెలియదు. ఆ సినీమాలో  మిగిలిన పాటలంటే కూడా మహా ఇష్టం. కారణం, ఆ పాటలు పాడింది మా తాతగారి శిష్యుడని తెలియడం వలన. ఆ సినీమా చూసి వచ్చిందగ్గర్నుంచి పిల్లలంతా సావిత్రిలాగా కళ్ళు పెట్టి చేతివేళ్ళూపూతూ ఒకళ్ళనొకళ్ళు భయపెట్టుకునేవాళ్ళు. అలా చేస్తే ఎన్ టి రామారావు లాగా కళ్ళు తిరిగి పడిపోవాలని. కానీ, ఏ ఒక్కడూ కళ్ళు తిరిగి పడిపోలేదు. కానీ, మాలో మేము కాట్లాడుకోవడానికి కారణమయింది 'నువ్వు నన్ను శాపం పెట్టాలని చూస్తున్నావా' అని.
                       
(ఏ నాడు మొదలెడితివో పాట - చంద్రహారం లో మాలి పాడే పాట)

విజయావారు చంద్రహారం కోసం చాలానే కష్టపడ్డారు. భారీగా ఖర్చుపెట్టారు. కానీ, ప్రజలకే నచ్చలేదు. కారణం వాళ్ళ పాతాళభైరవి సినీమా. అందులోని నటులే ఇందులో ఉన్నా అందులోని మాయలు, మంత్రాలు, హాంఫట్, జై పాతాళభైరవి, కాపాలికా, నరుడా ఏమి నీ కోరికా వంటి మాటలు, గాలిలో ఎగిరే మహల్స్ లేకపోవడమే. అందులోనూ ఎన్ టి రామారావు యుధ్ధం చేయకుండా ఎప్పుడూ నిద్రపోతూండడం  సాదా ప్రేక్షకులకు తీరని ఆశాభంగం. అందులోనైతేనేం, చంద్రహారంలో అయితేనేం, ఘంటసాలవారి సంగీత ప్రతిభే ఈనాటికీ ఆ సినీమాల గురించి తల్చుకునేట్లు చేస్తోంది.)

పిల్లల ఆటలు సీజనల్. ఒక సీజన్ లో మా వీధిలో పిల్లలంతా ముమ్మరంగా బొంగరాలాటలో మునిగి వుండేవారు. వాళ్ళతో సమానంగా ఆడాలని నా కోరిక. నా పోరుపడలేక ఒక బొంగరం కొనిచ్చారు. అయితే దానికి తాడేసి చుట్టడం చేతనైయ్యేదికాదు. తోటిపిల్లలు దానిని తీసుకొని దానికి ముల్లులేదు, ఆటకు పనికిరాదని చెప్పడంతో కోపం వచ్చి ఒక రోజంతా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాను. తర్వాత, మా చిన్నాన్నగారు ముల్లున్న బొంగరం కొనిచ్చి అదెలా తిప్పాలో నేర్పారు. బొంగరం నేలమీద పడకుండా అరచేతిమీద త్రిప్పడం సర్కస్ చూస్తున్న ఆనందం. (మరోచరిత్ర లో కమలహాసన్, సరితల బొంగరం సీన్ మరో సర్కస్). ఇలా రెండు మూడు రోజులు ఆడేనో లేదో పిల్లల్లో ఒకడు ఆడిస్తానని చెప్పి దానిని రెండు ముక్కలు చేసి చేతికిచ్చాడు. కొత్తది కొనిస్తానన్న వాగ్దానంతో.

ఇలా మూడు బొంగరాలు, ఆరుచెక్కలుగా కాలక్షేపం జరుగుతున్న సమయంలో మా శారదక్క పెళ్ళి నిశ్చయమయింది. శారద మా దొడ్డమ్మగారి అమ్మాయి. నాకంటే ఏడేళ్ళు పెద్దది. బొబ్బిలిలో మా తాతగారింట్లో వుంటుంది. పెళ్ళి కుద్దిగాం అనే ఒక పల్లెటూళ్ళో. (ఆ ఊరు ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులలో వంశధారా నదీ తీరాన ఉంది).

ఆ పెళ్ళి విశేషాలు....
వచ్చే వారమే....
                   ....సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, August 28, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పధ్నాలుగవ భాగం

28.08.20 - శుక్రవారం భాగం - 14*:
పదమూడవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

సాలూరు పెద గురువుగారు - మా ముత్తాతగారు, శ్రీ పట్రాయని నరసింహ శాస్త్రిగారి - దగ్గర్నుంచి సంక్రమించిన చిన్న స్థలం పక్కనే సాలూరు చిన గురువుగారు - మా తాతగారు, శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు సాలూరులో మరికొంత స్థలంకొని ఏడాదికో ఇటికా గోడా అంటూ నిర్మాణం ప్రారంభించి క్రమ క్రమంగా ఒక పదేళ్ళనాటికి కట్టడం పూర్తిచేసి అప్పటికే తాను ప్రారభించిన  'శారదా గాన పాఠశాల'ను తమ సొంత కట్టడంలోనే నిర్వహించడం ప్రారంభించారు.


సాలూరులో ఈనాటికీ నిలిచివున్న 1930ల నాటి పెంకుల కట్టడం

ఆ కాలంలో  ఏవిద్యార్ధియైనా అభిలాషతో విద్య నేర్చుకోవాలని వస్తే వారికి ఉచితంగానే బోధించేవారు.  ఈ రోజుల్లోలాగా గంటకు ఇంత ఫీజ్ అని సంగీతం వ్యాపారం కాని రోజులవి. విద్యార్ధుల తల్లితండ్రులే వారి వారి స్తోమతును బట్టి గురుదక్షిణ ఏదో ఇచ్చేవారు. ఇవ్వగలిగినవారు ఇస్తారు లేనివారు లేదు. కానీ, గురువులు శిష్యులందరినీ సమాన దృష్టితో చూసి విద్య నేర్పేవారు. మా నాన్నగారు, మా తాతగారు, వారి తండ్రిగారు  వివిధ ప్రాంతాలలో కచేరీలు చేసి అక్కడి సంగీత పోషకులు ఇచ్చిన పారితోషకాలతో జీవనం చేసేవారు. అయితే ఆరోజుల్లో ఏర్పడిన మొదటి, రెండవ ప్రపంచ యుధ్ధాల కారణంగా జనజీవనం స్థంభించి, ఆర్ధిక మాంద్యం వలన మన దేశంలో  పేదరికం ఎక్కువయింది. అప్పుడూ, ఇప్పుడూ కూడా శాస్త్రీయ సంగీతానికి ఆదరణ ఆంధ్రదేశంలో కన్నా దక్షిణాదినే ఎక్కువ. అలాటి పరిస్థితులలో సాలూరు లో సంగీత పాఠశాల నెలకొల్పడం గొప్ప సాహసమే. ఆ పాఠశాల మెల్లగా అభివృద్ధి పొందుతున్నతరుణంలో, కుటుంబపోషణకోసం చినగురువుగారు సాలూరు విడిచిపెట్టక తప్పలేదు. సాలూరు వదిలి విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో నెల జీతానికి కొలువుకి కుదిరి సంగీతాచార్యునిగా రెండు దశాబ్దాలు పాటు పనిచేశారు. అప్పటికి మా నాన్నగారి వయసు పదిహేను సంవత్సరాలు. తన పదకొండవ ఏట నుండే తండ్రిగారి వెనకాల పాడుతూ పదహారు సంవత్సరాలు వచ్చేప్పటికి స్వతంత్రంగా హార్మోనియం వాయిస్తూ కర్ణాటక సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు.


1971లో అమెరికా ప్రయాణం కోసం తీసిన ఫోటో

మా తాతగారు ఉద్యోగనిమిత్తం విజయనగరం మకాం మార్చేక కొన్నాళ్ళు సాలూరు పాఠశాలను నిర్వహించారు. సంగీతరావు గారికి సాలూరులో పెద్ద మిత్రబృందమే ఉండేది. గాయకుడిగానూ మంచి గుర్తింపు పొందారు. ఆయనా అక్కడనుండి వెళ్ళక తప్పలేదు. అప్పుడు, సాలూరిలోని సంగీత పాఠశాల నిర్వహణ బాధ్యతను మా తాతగారి శిష్యులు మానం అప్పారావు, దుంప నరసింహారెడ్డి మొదలైనవారు తీసుకున్నారు. గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు సాలూరులో చాలా ఘనంగా చేసేవారు . సాలూరు లారీ ట్రాన్స్పోర్ట్ కు  ముఖ్య కేంద్రం. ఒరిస్సాలోని జైపూర్ వంటి ఘాట్ ప్రాంతాలకు సాలూరు నుండి వర్తక వ్యాపారాలు జరిగేవి. ఆ లారీ ట్రాన్స్పోర్ట్సంతా విడివిడిగా, సామూహికంగా ఈ సాంస్కృతిక ఉత్సవాలు తొమ్మిదిరోజులూ ఏవో సంగీత, నృత్య, నాటక, హరికధా, బుర్రకధా కాలక్షేపాలతో ఎంతో ఉత్సాహాంతో నిర్వహించి రాష్టంలోని పలుప్రాంతాల కళాకారులను ఇతోధికంగా పోషించేవారు. 

అలాటి ఏదో ఒక ఉత్సవం సమయంలోనే మా నాన్నగారు - సంగీతరావుగారి - సాలూరు ప్రయాణం జరిగిన గుర్తు. విజయనగరం నుండి మా నాన్నగారు, నేను బస్సులో సాలూరు బయల్దేరాము. ఈనాటి రవాణా సౌకర్యాల దృష్ట్యా ఒక గంటన్నర ప్రయాణం. కానీ ఆరోజుల్లో ఒక పూట ప్రయాణం.ఆనాటి బస్సులన్నీ ఫ్రంట్ బోనెట్ తో ఉండేవి.  నలుపు, ముదురాకు పచ్చ రంగుల్లో చూసిన గుర్తు.


ఆనాటికి ఆంధ్రదేశంలో ప్రజారవాణాకి ఉపయోగించిన ''డాడ్జ్" బస్సులు ఇలాగే ఉండేవి

ఇప్పటిలాగా బస్సు స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ ఇగ్నిషన్ ఉండేదో లేదో, లేక పనిచేసేదికాదో నాకు తెలియదు కానీ ఆ బస్సులన్నిటినీ  ముందు భాగంలో హేండీల్ పెట్టి తిప్పుతూ ఒక ఐదారు నిముషాలు కష్టపడి కుస్తీపట్టాక  ఇంజన్ స్టార్ట్ అయేది. 'అప్పన్న బస్సు రైట్ రైట్' అంటూ బయల్దేరదీసేవారు. 

ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆ రోజుల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరన్నా అప్పన్నలు, అప్పారావులు, అప్పలకొండలు ఉండేవారు. కారణం, విశాఖపట్నం పట్నం సమీపంలోని సింహాచలం కొండమీది దేవుడు. సింహాచలం కొండమీద వెలసిన శ్రీ వరహ నరసింహస్వామి వారిని సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు. మా ప్రాంతాల్లో ఆనాడు అప్పన్న, సింహాద్రి, అప్పలకొండ, వరహాలు, నరసింహం పేరు లేని వాళ్ళు చాలా అరుదు. 

"ఒరే అప్పన్నా పొరపాట్న కూడా ఇంజనీ ఆపుచేయకురోయి. మళ్ళీ హేండిలెయ్యాలంటే నా వల్లకాదు" అని మరో అప్పన్న గోల. అలాటి ఒక బస్సు వెనకవేపు డోర్ లోంచి ఎక్కబోతూంటే "బాబూ! మీరు మధ్యలో కూకోండని " మమ్మల్ని మధ్య కంపార్ట్మెంట్లో కూచోపెట్టారు. బండి ఓనర్  దొరగార్లు లైన్లోకొస్తే వాళ్ళు డ్రైవర్ పక్కన కూర్చుంటారు. లేదా దారి మధ్యలో ఏ పోలీసులో,  రెవెన్యూఆఫీసర్లో చేయూపితే అలాటివారికి మధ్యభాగం. మామూలు పాసెంజర్లకి వెనకాల భాగం. ఇలా రెండు మూడు భాగాలుగా ఆనాటి బస్సులుండేవి. బస్సు ఆపనివాళ్ళది పాపం. బస్సు టాప్ మీద కూడా సామాన్లతో పాటు పేసంజర్లని ఎక్కించేసేవారు. వీళ్ళందరినీ ఎక్కిచ్చుకొని నిండు గర్భిణీలా ఆ బస్ బయల్దేరి తన గమ్యం చేరేప్పటికి 'చాలులే ఇటువంటి సేవా' అనిపించేది. మధ్య గదిలో కూర్చోడం వలన మాకు అంత శ్రమ తెలియలేదు. విజయనగరం-సాలూరుల మధ్య మానాపురం, గజపతినగరం, మరడాం, రామభద్రపురం అంటూ చాలా జంక్షన్లే వచ్చేవి. ఒక్కోక్క జంక్షన్లో కనీసం పావుగంటైనా ఆపేసి టీలు, సోడాలు తాగడానికి పోయేవారు. అలాటి సమయాలలో ఇంజన్ ఆగిందంటే ఇంతే సంగతులు. మళ్ళీ హేండిల్ తిప్పాల్సిందే. ఇలా మానాపురం, గజపతినగరం, ఆరికతోట దాటి రామభద్రపురం జంక్షన్ లో బస్ ఆపేప్పటికి అమ్మకాలవాళ్ళు తమ జంగిడీలతో ఈగల్లా బస్ చుట్టూ మూగేవారు. "సిక్కోలు, బొబ్బిలి, పార్తీపురం పేసంజర్లు ఇక్కడ దిగడిపోయి వేరే బస్సు ఎక్కండహో" అని  ఒక అప్పన్న గాఠిగా హుకూం జారీ చేసేవాడు. దిగేవాళ్ళు దిగగా మరికొందరు కొత్త  పేసంజర్లు బస్ ఎక్కేవారు. అప్పట్లో ప్రత్యేకించి బస్ స్టాండ్ లేదు. రోడ్ మీదే ఒక సైడ్ కి బస్సులు ఆపేవారు. ఒకడిని మించి మరొకడు ఓవర్ టేక్ చేసి బస్సులు ఆపడంతో ముందు వెళ్ళవలసిన బస్సువాడు వెళ్ళడానికి చోటులేక ఆ రెండు బస్సుల డ్రైవర్లు కీచులాడుకోవడం ఒక దినసరి చర్య.

బస్సు కిటికీలోంచి చూస్తే పక్కనుంచి వరసగా కావిళ్ళు మోసుకుపోతూ  రైతులు, కూలీలు కనిపించారు. ఆ కావిళ్ళలో కట్టెలమోపులు, పచ్చగడ్డి మోపులు, పాలు, పెరుగు కుండలు, నీళ్ళ బిందెలు, కోళ్ళు, కూరగాయలతో పాటూ  కావిడిలో మరోపక్క చంటిపిల్లలను కూడా  కూర్చో పెట్టుకొని ఆడంగుల సహా పొలాలకో, సంతలకో,  ఇళ్ళకో పోతూ కనిపిస్తుండేవారు.

ఆ కావిళ్ళు చూస్తే నాకు కలివరంలో జరిగిన ఒక పాత సంఘటన గుర్తుకు వచ్చింది.

ఒకసారి కలివరం గంగుల అప్పల నాయుడు గారింట్లోని భోషాణం రేడియోకి జబ్బుచేసింది. దానిని జీప్ బ్యాటరీ దిమ్మలకు  కనెక్ట్ చేసి ఉపయోగించేవారు. అలాటి ఆ రేడియోలో జుయ్యిమని గాలివాన గాలి తప్ప పాటాలేదు, మాటాలేదు.  ఒక చేత సిగరెట్ పీలుస్తూ మరొక చేతితో ఆ రేడియో నాబ్ ని  మహా స్పీడ్ గా ఆపరేట్ చేసే నాయుడిగారి బావగారు అనకాపల్లి రంగారావుగారు ఇంక ఆ రేడియో పనిచేయదని డయాగ్నైజ్ చేయగా దానిని విజయనగరం పెద్ద షాపులకి రిపేరుకి ఇచ్చారు. దానిని విజయనగరం తీసుకువెళ్ళే బాధ్యత మా నాన్నగారిదయింది. దూసి స్టేషన్ వరకు వెళ్ళేప్పుడో, వచ్చేప్పుడో సరిగా గుర్తులేదు ఆ రేడియోను ఒక కావిడిలో పెట్టుకు రావడం జరిగింది. కూడా మా నాన్నగారు, నేనూ కూడా ఆ మూడు నాలుగు మైళ్ళ దూరం నడిచాము. దారిమధ్యలో ఆ రేడియో ఉన్న కావిడిని మోసే కంబారి (ఇళ్ళలోని పనివాళ్ళను కంబార్లు అనేవారు. కంబారి అనగానే నాకు అంబారి గుర్తుకు వస్తుంది, రెండింటికీ ఏ సామీప్యం లేకపోయినా) నేను చిన్నపిల్లాడినవడం వలన అంత దూరం నడవలేనని నన్ను కూడా ఆ కావిడిలో మరో పక్క కూర్చోపెట్టాడు. కానీ, కాళ్ళు ముడుచుకొని కూచోవడం నాకంత సౌకర్యం అనిపించలేదు. కొంత దూరం వెళ్ళాక అందులోనుంచి దిగి నడిచే వెళ్ళాను. 

రామభద్రపురం జంక్షన్లో ఆ కావిళ్ళ గుంపును చూస్తే ఆ పాత సంఘటన గుర్తుకు వచ్చింది.

రామభద్రపురం జంక్షన్ తీపి తీపి కోవాబిళ్ళలకు చాలా ప్రసిధ్ధి . వాటి రుచి మాటల్లో చెప్పలేము. ఆ క్వాలిటీ మన ఫైవ్ స్టార్ స్వీట్ స్టాల్స్ లో కూడా వుండదు. అతిశయోక్తి కాదు. ఒక్కొక్క బిళ్ళ కనీసం డెభ్భై గ్రాములన్నా ఉంటుంది. అలాగే  జీళ్ళు, జంతికలు కూడా. ఈ రెండింటినీ తిని ఓ గోలీ సోడా లాగించే సమయానికి బస్సు బయల్దేరేది. బస్సుల రాకపోక ఉన్నంతసేపు ఈ వ్యాపారం నిరాటంకంగా సాగేది. సీజన్ బట్టి మామిడిపళ్ళు, తాటిముంజెలు, జామిపళ్ళు అంటూ బస్సులొచ్చే సమయానికి సిధ్ధమైపోయేవారు. అంతవరకూ నిర్జనంగా ఉండే ఆ రోడ్ ఒక్కసారిగా బస్సుల రాకతో కోలాహలంగా వుండేది.

ఇలా కొన్ని గంటలు ప్రయాణం చేసిన తరువాత సాయం సమయానికి సాలూరు  శారదా సంగీత పాఠశాలకు చేరుకున్నాము. అక్కడ మా నాన్నగారి చిరకాల మిత్రుల రాకతో, ముచ్చట్లతో సమయమే తెలియలేదు. కొంతసేపటికి మా నాన్నగారి  సంగీత కచేరీ ప్రారంభమయింది. ఆహుతులందరూ ఆ గానంలో లీనమైపోయారు. కచేరీ చాలా అద్భుతంగా సాగింది. రెండు మూడు గంటలన్నా పాడివుంటారు. హర్మోనియం ఒక్కటే పక్కవాద్యం. మృదంగం కూడా ఎవరో వాయించిన గుర్తు. 

ఆ కచేరి ముగిసి బయటికి వచ్చి చూస్తే విపరీతమైన వర్షం పడి రోడ్లన్ని చిత్తడిగా వున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఏ వర్ష సూచనా లేదు. ఒక్క మేఘమూ లేదు. "సంగీతరావుగారు "ఆనందామృతకర్షిణి" కీర్తన పాడేరు. ఆయన గాత్రం మహిమ, మంచి వర్షం కురిసింది అని అక్కడివారు మా నాన్నగారిని మెచ్చుకోవడం జరిగింది. పాటలు పాడితే వర్షాలు ఎలా పడతాయని నాకు ఒకటే ఆశ్చర్యం.

తర్వాతి కాలంలో, తాన్సేన్ మేఘ్ మల్హర్ రాగం గానం చేస్తే వర్షించిందని పుస్తకాలలో చదివాను. మద్రాస్ లో వర్షాలు లేక మంచినీటి చెరువులు పూర్తిగా చుక్కనీరు లేకుండా ఎండిపోతే సుప్రసిధ్ధ కర్ణాటక వాయులీన విద్వాంసుడు కున్నక్కుడి వైద్యనాదన్  రెడ్ హిల్స్ చెరువులో నిలబడి "అమృతవర్షిణి" రాగంలో దీక్షితర్ కృతి "ఆనందామృతాకర్షిణి" ని గంటల తరబడి వైలిన్ మీద వాయించినట్లుగా పత్రికలలో ఫోటోలు చూశాను. సంగీతానికి ఉన్న మహిమ మాటలకు అతీతం. సంగీతం ద్వారా సత్ఫలితాలు సాధించడం ఒక్క గానయోగులకే సాధ్యం.

ఆ సంగీత కార్యక్రమం అనంతరం రాత్రి భోజనానికి ఎవరింట్లోనో ఏర్పాటు చేశారు. నేను ముందే చెప్పినట్లు మా నాన్నగారికి మొగమాటం ఎక్కువ. అందువల్ల తాను భోజనం చేయనని పాలు, పళ్ళుంటే చాలని చెప్పడంతో నన్ను మాత్రం పంపారు. ఆ ఇల్లు  మా సంగీత పాఠశాలకు సమీపంలోనే ఏటికి వెళ్ళే త్రోవలో ఉంది. నేను వెళ్ళినప్పుడు ఎవరో ఒక అవ్వగారు మాత్రమే ఉన్నారు. నన్ను చూసి "సంగీతరావు కొడుకువా! రా నాయనా, మనమందరం కావలసినవాళ్ళమే, మొహమాటపడకు" అంటూ లోపలికి తీసుకువెళ్ళి భోజనం వడ్డించారు. మావాళ్ళెవరూ పక్కన లేకుండా పరాయివాళ్ళ ఇళ్ళలో భోజనం చేయడం అదే మొదటిసారి. నా శౌర్యమంతా మా ఇంట్లో నాలుగు గోడలమధ్యే. బయటకు వెళితే బెదురుగొడ్డునే. ఇప్పటికి కూడా. ఆ ఇల్లు చాలా సామాన్యంగానే ఉంది. ఒక చమురు (కిరోసిన్) బుడ్డి దీపం వెలుతురులో భోజన కార్యక్రమం. వాళ్ళకోసం చేసుకున్నదే పెట్టారు. వేడి వేడి అన్నం, కటిక పెసర పచ్చడి, ఇంగువ చారు, మజ్జిగ, ఇవే పదార్ధాలు. ఆ అవ్వగారు పక్కన కూర్చొని ఏవేవో విషయాలు చెప్పారు. అవేవీ నాకు అర్ధం కాలేదు. కానీ ఆవిడ చూపిన ఆదరణ మరువలేను. అలాగే ఆవిడ చేసిన కటిక పెసర పచ్చడి రుచి అమోఘం. నేను అంతకుముందు ఎక్కడా అంత రుచికరమైన పెసర పచ్చడి తినలేదు. నిజం చెప్పొద్దూ... నాకు కారంగా వుండే పదార్థాలు ఏవైనా ఇష్టమే. ఆవిడ చేసిన ఆ రోటి పచ్చట్లో ఇంగువ, ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువగానే పడ్డాయేమో నాకు ఆ పచ్చడి కారామృతంగా అనిపించింది. ఇది నా  జీవితంలో ఎన్నటికీ మరువలేని సంఘటనగా మిగిలిపోయింది.

మేము మద్రాస్ 35, ఉస్మాన్ రోడ్ లో ఉన్నప్పుడు,  ఒకసారి మా కుటుంబం బొబ్బిలి వెళ్ళారు. అప్పుడు  స్వయంపాకం మొదలెట్టి  మొదలెట్టి తరుచూ ఈ కటిక పెసరపచ్చడిని అన్నంలోకి చేసేవాడిని. ఒకసారి సావిత్రమ్మగారు నేను చేసిన పచ్చడి రుచి చూసి "ఓర్నాయనో! ఇంత కారంగా ఉందేవిట్రా! "అంటూ రెండు గ్లాసుల మంచినీళ్ళు త్రాగారు. నాకు మాత్రం ఆ సాలూరు పెసరపచ్చడి  స్ఫూర్తితో చేసినందువల్ల అద్భుతంగా వుండేది. ఇప్పటికీ నేను కనిపించినప్పుడల్లా సావిత్రమ్మగారు "ఏరా, ఇంకా పెసరపచ్చడి చేస్తున్నావా" అని అడుగుతూంటారు. అలా అని నేను పెద్ద భోజనప్రియుడిని కాను.ఏదుంటే దానితోనే సద్దుకుపోయే రకం. కానీ, ఆ పాతకాలపు అవ్వగారి ప్రేమపూర్వక భోజనం ఎప్పటికీ మరువలేను. 

ఇక్కడ, విజయనగరం మహారాజా వారి ఔదార్యం గురించి చెప్పే కధ ఒకటి గుర్తుకు వస్తుంది.

విజయనగరం మహారాజావారు ఒకసారి వేటకు వెళ్ళి మధ్యాహ్నం వరకు వేటాడి బాగా డస్సిపోయారు. ఆకలి దంచేస్తోంది. చుట్టుపక్కల గ్రామాలేవీ లేవు. అలాటిచోట వెడుతూండగా ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది.  అందులో ఒక ముసలామె ఉంది. అవసరార్ధం తప్పులేదనుకున్నారో ఏమో, నోరు విడిచి, తినడానికి ఏదైనా పెట్టమని అడిగారట.
ఎవరో డాబూ, దర్పంగా ఉన్న మనిషి తన వంటి పేదరాలిని తినడానికి ఏదైనా పెట్టమని అడగడం ఏమిటని ఆ ముసలామె వణికిపోయింది. వచ్చిందెవరో ఆమెకు తెలియదు. కానీ బాగా ఆకలిమీదున్నాడని అర్ధమయింది. రాజుగారిని బయట చెట్టునీడలో కూర్చోమని చెప్పి ఆదరాబాదరా కాస్తా అన్నం ఉడికించి, ఏదో ఒక పచ్చడి నూరి ఆ రెంటినీ ఒక ఆకులో పెట్టి రాజుగారి ముందు ఉంచింది. ఆయన ఆకలిమీద వుండి ఆ ముసలామె పెట్టిన ఆహారాన్ని సంతుష్టిగా తినడమే కాక ఆవిడ చేసిన పచ్చడిని ఆయన అమితంగా ఇష్టపడ్డాడు. తన జన్మలో ఇంత రుచికరమైన పచ్చడి తినలేదని అదేమి పచ్చడో చెప్పమని అడిగాడు. ఆ ముసలామె భయంతో వణికిపోయింది. వచ్చినవాడు మెచ్చుకుంటున్నాడో, ఎగతాళి చేస్తున్నాడో తెలియలేదు నిజం చెపితే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయపడింది. రాజుగారు అదే ప్రశ్నను పదే పదే వేయడంతో ఆ పేదరాలికి చెప్పకతప్పలేదు. భయపడుతు మెల్లిగా చెప్పింది అది గరికతో (గడ్డి) చేసిన పచ్చడి అని. రాజుగారు నిర్ఘాంతపోయాడు, 
తాను అంతగా మెచ్చుకొని తిన్నది గడ్డి పచ్చడా అని. అందుకు ఆయన ఆగ్రహించలేదు. గరికతో కూడా అంత రుచికరమైన వంట పదార్ధంచేసి పెట్టిన ఆ ముసలామె పరిస్థితిని, ఆమె ఆదరణను అర్ధం చేసుకొని ఆమెకు మనసారా నమస్కరించి వెళ్ళిపోయారు. తరువాత, కోటకు వెళ్ళిపోయిన మహారాజావారు ఆ ముసలామె ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాన్నంతా ఆమెకు దానంగా రాసిచ్చారు. అదే నేటి 'గరికవలస' ప్రాంతమనే కధ ప్రచారంలో వుండేది.

దీనిని బట్టి మనకు అర్ధమయేదేమిటి? మనిషి విలువ వాళ్ళకుండే సిరి సంపదలను బట్టి కాదు. వారిలోని సద్గుణాలే వారికి ఔన్నత్యాన్ని కల్పిస్తాయి. 

ఈ రెండు సంఘటనలు ఆనాటి మంచితనం, ప్రేమాభిమానాలు, ఆదరణకు దర్పణం పడతాయి.

ఈ రకమైన గతకాలపు అనుభావాలు, ఈ ధారావాహిక చదివే ఆధునిక తరానికి తెలియాలనే నెం.35, ఉస్మాన్ రోడ్ లో పొందుపరుస్తున్నాను. ఈ రకమైనటువంటి అనుభవాలెన్నిటినో ఘంటసాల తన ప్రారంభ దశ జీవితంలో చవిచూశారు. మనిషెప్పుడూ గతాన్ని గౌరవిస్తూ వర్తమానకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి.
                   ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, August 21, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదమూడవ భాగం

21.08.20 - శుక్రవారం భాగం - 13*:
పన్నెండవ భాగం ఇక్కడ:
నెం.35, ఉస్మాన్ రోడ్
               
               ప్రణవ స్వరాట్

మా ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి ఇద్దరమ్మాయిలు వచ్చేవారు. మా వీధి వాళ్ళే. వడ్లమాని నారాయణ మూర్తిగారి అమ్మాయిలు. చిన్న బజార్లో ఆయనకో స్టీల్ సామాన్ల షాపుండేది. ఆ అమ్మాయిలు మాకంటే వయసులో బాగా పెద్ద. వాళ్ళకు మా ఇంట్లో ఎవరికి అవకాశం వుంటే వాళ్ళు పాఠం చెప్పేవారు. మా అమ్మ, సీత పిన్నిగారు ఇద్దరూ బాగానే పాడేవారు. వీణ వాయించడంలో కూడా ప్రవేశముంది. గీతాలు, వర్ణాలు, స్వరజతుల వరకు పిల్లలకు చెప్పగల సమర్ధత గలవారే. ఆ ఇద్దరమ్మాయిల పేర్లు గుర్తులేవు. కానీ, అందరూ వాళ్ళను పెద్దమ్మి, చిన్నమ్మి అని పిలిచేవారు. వాళ్ళు వస్తే మా పిల్లలకి కావలసినంత కాలక్షేపం. వాళ్ళ సంగీత పాఠం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. వాళ్ళ సంగీత పాఠం పూర్తికాగానే పెరట్లోకి దారి తీసేవాళ్ళం. వాళ్ళు అక్కడున్న రాచఉసిరి కొమ్మలు పట్టుకొని గట్టిగ ఊపేసరికి కాయలన్నీ జలజలా నెత్తిమీద పడేవి. వాటిని తింటూ, వెనకవేపున్న జామిచెట్టు క్రిందకు చేరేవాళ్ళం. చాలా పెద్ద చెట్టు. కర్రకు అందనంత ఎత్తులో పెద్ద పెద్ద ముగ్గిన జామికాయలు, పళ్ళు ఉండేవి. ఈ పెద్దమ్మి, చిన్నమ్మి ఎలాటి చెట్లైనా ఎక్కడంలో ఆరితేరిపోయారు. క్షణాలమీద చెట్టు చివరదాకా ఎక్కి ఒకటి, రెండూ చెట్టంతా దుళ్ళగొట్టేసేవారు. క్రింద పడిన వాటిలో మంచివన్నీ ఏరి పెట్టడం నాపని. మా తాతగారు చూస్తే మాత్రం, 'ఆడపిల్లలు అలా చెట్లెక్కి కాళ్ళు విరగొట్టుకుంటే మీకు పెళ్ళిళ్ళు కావర్రా, దిగండి, దిగండి' అని అదిలించేవారు. ఆయన చూస్తే మాత్రం రాచ ఉసిరికాయలను తిననిచ్చేవారు కాదు. జలుబు చేసి, గొంతు పట్టేస్తుంది అని పిల్లలను తిననిచ్చేవారు కాదు. ఆ అక్కచెల్లెళ్ళిద్దరూ మాకంటే ఎంతో పెద్దైనా మాతో సమానంగా ఆటలాడేవారు. కొబ్బరాకులతో బూరాలు చేయడం వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. 
కొబ్బరి ఆకుతో బూర

మా ఇంటి పెరటి తలుపు తీస్తే వెనక రోడ్. అక్కడే వీధి కొళాయి. అందులో నీళ్ళు వచ్చేసమయానికి ఇళ్ళలోని ఆడవారంతా బిందెలతో సిధ్ధమయేవారు. నీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంతవరకు ఉన్న స్నేహాలేవి పనిచేయవు. రోజూ ఎవరో ఒకరు కీచులాడుకోకతప్పదు. అక్కడ మాత్రం నోరున్నవాళ్ళదే రాజ్యం. పెరటి తలుపుకు కుడిప్రక్క ఒక ఇల్లుండేది. అందులో తల్లి, కొడుకు, కోడలు వుండేవారు. అతనికి కొత్తగా పెళ్ళయిన గుర్తు. ఆ అత్తాకోడళ్ళు ఇద్దరు నీళ్ళకొళాయి దగ్గర కనిపించేవారు. తమాషా ఏమిటంటే వాళ్ళిద్దరి పేర్లూ కాంతమే. కోడలిపేరు సూర్యకాంతం. అత్తగారు మరేదో కాంతం. అత్తగారిలాగే నేనుకూడా ఆ కొత్త కోడలిని సూరీడు అనే పిలిచేవాడిని, మా అమ్మగారు  పెద్దవాళ్ళని అలా పేరు పెట్టి పిలవడం తప్పని వారిస్తున్నా. 

ఈ రోజుల్లోలా అప్పుడు గ్యాస్ స్టౌవ్ లు, గీజర్లు వంటివి ఏవీ లేవు. ఎంతటి ధనవంతులైనా వండుకోవడానికి కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్లు ఉపయోగించవలసిందే. ఏ కారణం చేతనో విజయనగరంలో వీటికి ప్రత్యామ్నాయంగా పొట్టు పొయ్యిలను కూడా వాడేవారు. ఆ పొట్టుపొయ్యిని ప్రిపేర్ చేయడానికి చాలా ఓర్పు, నేర్పు అవసరమయేవి. నాలుగు ప్రక్కలా మూసివుండే మట్టి కుంపటిలో మధ్యలో ఒక సన్నపాటి రోకలిలాటిది పెట్టి, ఆ కుంపట్లో ధాన్యపు పొట్టును పొసి రూళ్ళకర్రతోనో, అప్పడాల కర్రతోనో గట్టిగా దట్టించి, ఆ పొట్టు దిట్టంగా ఉందనే నమ్మకం కలిగాక నెమ్మదిగా అందులోంచి రోకలిని బయటకు తీయాలి.   ఈ ప్రోసెస్ ఏమాత్రం అజాగ్రత్త జరిగినా దట్టించిన పొట్టంతా కూలిపోయేది. మళ్ళీ మొదటినుంచి ప్రారంభించాల్సిందే. అందుచేత‌, ఆ పొట్టుపొయ్యి ఉపయోగించే స్థానమేదో ముందే నిర్ణయించుకొని ఈ  పొట్టు దట్టింపు వ్యవహారం మొదలెట్టాలి. ఈ పనిని చేయడంలో మా ప్రభు చిన్నాన్నగారు సిధ్ధహస్తులు. ఆ పొయ్యిలోని రోకలి కదలకుండా గట్టిగా పట్టుకునే పని నాది. ఆ రూళ్ళకర్ర, అప్పడాలకర్ర మరో సందర్భంలో కూడా ఉపయోగించేవారు. భోజనాల సమయంలో మా చిన్నాన్నగారి పక్కన ఇవి ఉండేవి.            
                      
ప్రతిరోజూ భోజనాల దగ్గర నేను కాని, ప్రసాద్ కానీ ఏదో విషయానికి తిక్కపెట్టి, అన్నం తినడానికి మారాము చేయడం పరిపాటి. అప్పుడు ఈ రూళ్ళకర్రే మా చిన్నాన్నగారి వజ్రాయుధం. దానిని పట్టుకొని ఒకసారి ఆయ్! అని గర్జించేప్పటికి మా అంత అల్లరి బంద్. భోజనాల కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేది. ఆవిర్లు గ్రక్కే అన్నం, పప్పు వెంట వెంటనే తినేయాలనేది నా పంతమైతే, ఆవకాయ ముక్కలాటివాటిని కడిగి వేయలేదని ప్రసాద్ అల్లరి. వీటన్నిటికీ మందు ఆ రూళ్ళకర్రే. మా ప్రభూ చిన్నాన్నగారికి పిల్లలను అదుపు చేయడం మా బాగా తెలుసు. మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు ఇలాటివేవి పట్టించుకునేవారే కాదు. ఆయనకెప్పుడైనా సరదా పుడితే మమ్మల్ని ఎత్తుకొని ఉసిరి చెట్టు ఎక్కించి వదిలేస్తాను , గోడవతలకి విసిరేస్తాను అంటూ ఆటలు పట్టించేవారు. ఇక మా నాన్నగారితో కలిసి విజయనగరం లో గడిపిన రోజులేవీ అంతగా గుర్తులేవు. కానీ, ఆయన తీక్షణంగా చూస్తేమాత్రం నేనూ, ప్రసాద్ ఆ చుట్టుపక్కల చేరేవాళ్ళం కాదు. మా అమ్మ, కమల పిన్ని అవసరమైతే చేయిచేసుకోవడం గుర్తుంది. మా తాతగారు మాకు శ్రీరామ రక్ష. ఆయన పిల్లలను ఏమీ అననిచ్చేవారు కాదు. ఆయనది భయంతో కూడిన ప్రేమ. 

మాగెడ్డవీధి మొదటింటి వరండా నేల అంతా నల్లసేనపు పలకలతో ఉండేది. ఎత్తైన అరుగులు ఆనాటికి. (2008 లో వెళ్ళి చూసినప్పుడు ఇంటి రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఎత్తు అరుగులే లేవు. శిథిలావస్థకు వచ్చింది. ఇల్లంతా రోడ్ లెవల్ కు దిగువుగా కనిపించి చూసేందుకే మనసుకు కష్టమయింది.) వరండా నేల నల్లటి పలకలతో ఉండేది. కొన్ని చతురస్రంగా, కొన్ని నలుచదరంగంగా ఉండేవి. అలాటి నలుచదరపు పలకలు మాకు క్యారమ్ బోర్డ్. ఆ  ఆట మా పిల్లలకి కాలక్షేపం. ఆ క్యారమ్ ఆట  అంత తేలిక కాదు.  పలకమీద నాలుగు పక్కలా సుద్దముక్కతో పోకెట్స్ గీసి , మధ్యలో ఒక రౌండ్ వేసి , మూలలంటా ఏరోలు పెట్టి నిజమైన బోర్డ్ గా చేసేవారు. స్ట్రైకర్, రెడ్, 18 కాయిన్స్ తయారు చేయడం ఒక పెద్ద తతంగం. అందుకోసం పిల్లలంతా ఇటికలను, పెంకులను తెచ్చి వాటిని గుండ్రంగా అరగదీసి వాటితో క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళం. మాకంటే పెద్ద పిల్లలు ఈ బోర్డ్ చేయడంలో సహాయపడేవారు. అయితే వారానికో, పదిరోజులకో వరండా అంతా నీళ్ళుపోసి కడిగేప్పటికి మా క్యారమ్ బోర్డ్ గాయబ్. మళ్ళీ  అంత శ్రమ పడవలసిందే. గవ్వలతో, అవి లేకపోతే చింతపిక్కలను ఒక పక్క అరగదీసి తెల్లగా చేసి అష్టా చెమ్మాలు ఆటలు ఆడేవాళ్ళం.

మా అందరికీ బాగా ఇష్టమైన ఫేవరేట్ కాలక్షేపం సినీమా చూడడం. మా వీధిలో మార్కస్ బార్ట్ లీలు, కమల్ ఘోష్ లు, పి. శ్రీధర్ వంటి కేమెరామెన్లు (కేమెరామెన్ ఇంగ్లీషు, కేమెరామెన్లు తెలుగు) చాలామందే ఉండేవారు. వాళ్ళు సిగరెట్ పేకట్ల అట్టలతో కేమెరాలు చేసి ఫోటోలు తీసేవారు. ఆ అట్టలను మడవడంలో ఒక టెక్నిక్ ఉండేది. దానితో కెమెరా షట్టర్ ఓపెన్ అయేది. అదే ఫోటో తీయడం. అలాగే తరుచూ, మధ్యాహ్నం పూట ఇంట్లో వారంతా విశ్రాంతి తీసుకునే సమయంలో, సినీమా మ్యాట్నీ షో వేసేవారు. ఆ ధియేటర్ మా ఇంట్లోని ముందుగది. దాని కిటికి రోడ్ వేపు ఉండేది. సినీమా హాల్స్ దగ్గర బోల్డెన్ని ఫిలిమ్ ముక్కలు పడి ఉండేవి. వాటిని ఎవరో ఏరుకు వచ్చేవారు. గది కిటికీ కవర్ చేసేలా ఒక అట్టను కత్తిరించి, మధ్యలో ఫిలిమ్ ముక్క పట్టేలా నలుచదరంగా కన్నం చేసి దాని మధ్య ఈ ఫిలిమ్ పెడితే ప్రొజెక్టర్ రెడీ. గది బయట రోడ్ మీద ఎండలో ఒక అద్దం పెట్టి ఆ సూర్యకిరణాలు గదికి పెట్టిన ఫిల్మ్ మీద సోకేలా ఎక్స్పర్ట్ కెమెరామెన్లు చూసేవారు. గదంతా చీకటి చేయడంలో బయటి సూర్యకాంతి ఫిల్ము మీద పడి దాని ప్రతిబింబం తెల్లటి గోడమీద పడేది. సినీమా స్టార్టయేది. అందులో, ఎన్ టి రామారావు కనపడేవాడు. దిలీప్ కుమార్ కనపడేవాడు. నర్గీస్, అంజలి కూడా కనపడేవారు.  ఉన్న ఫిల్మ్ ముక్కలు అయేవరకు సినిమా సాగేది. ఈలోగా రోడ్ మీద రిక్షా వచ్చినా, జట్కా వచ్చినా అద్దం తీసేయాలి. అప్పుడు ఇంటర్వెల్. మళ్ళా, అంతా ఎరేంజ్ చేసి సినీమా వేసేవారు. నేనూ ప్రసాద్ ఎప్పుడూ ప్రేక్షకులమే. ఈ విషయాలేవీ ప్రసాద్ కు గుర్తులేవు. అతను నాకంటే రెండేళ్ళు చిన్న. ఇంతలో మరో కొత్త టెక్నిక్ వచ్చింది . పాడైపోయిన ఎలక్ట్రిక్ బల్బ్ లోని ఫిలమెంట్ తీసేసి అందులో సగానికి పైగా నీరుపోసి ఆ గాజు బుడ్డీని ఫిల్మ్ కు అడ్డంగా పెడితే గోడమీది సినీమా మరింత క్లియర్ గా కనపడేది. ఇలా బోల్డ్ సినీమాలు మా హోమ్ ధియేటర్లో, ఎదిరిళ్ళలో చూసేవాళ్ళం. ఈ పాడైపోయిన బల్బ్ లు కావాలంటే కరెంట్ ఉన్న ఇళ్ళవారిని అడగాలి. మా ఇంట్లో కరెంట్ దీపాలు లేవు. అందుకోసం, పక్కవీధిలో ఒకరింటికి వెళ్ళేవాళ్ళం. ఆ ఇంటి అబ్బాయి, మా ఇంట్లో ఉండే ఆంధ్రపత్రికలు చదవడానికిస్తే ఈ పాడయిపోయిన బల్బ్ లకు బేరం పెట్టేవాడు. అలాగే, ఆ పాత పత్రికలు ఇంట్లోవాళ్ళకు చెప్పి ఇచ్చేవాడిని. అయితే బల్బ్ లకోసం కాదు. వారింట్లో ఢిఫరెంట్ సైజుల్లో ప్రిజమ్స్ ఉండేవి. వాటిల్లోంచి చూస్తే ఎన్నో రంగులు కనిపించేవి. వాళ్ళకు ఆ రంగురాళ్ళు కోటలోంచి వస్తాయని చెప్పేవాడు. నిజమో, అబధ్ధమో నాకు తెలియదు. అలా ఈ బార్టర్ పధ్ధతిలో ఈ రంగురాళ్ళు కొన్ని నాదగ్గరుండేవి.



నేను ఒంటరిగా ఆడే ఆట ఒకటుండేది. అది సైకిల్ టైర్ ఆట. ఎక్కడికైనా కొట్టుమీదకెళ్ళాలంటే ఆ టైర్ ను తోసుకుంటూ పరిగెత్తుకు వెళ్ళడం. ఆ టైర్ ను తొయ్యడానికి ఒక చిన్న కర్ర. అలా వెళ్ళడం సైకిల్ తొక్కుతూ వెళుతున్న ఆనందం.  నాకు పోటీగా మరికొందరు పిల్లలు సైకిల్ వీల్ రిమ్ తో వచ్చేవారు. ఆ రిమ్ మధ్య కర్రపెడితే ఆ వీల్ ఆటోమెటిక్ గా నడిచేది.  తొయ్యక్కరలేదు. టైరు చక్రం కన్నా, రిమ్ చక్రాన్ని తోలడంలో బ్రహ్మాండమైన ఆనందం ఉండేది. అలాటి రిమ్ నా దగ్గర లేనందుకు అవమానకరంగా ఉండేది.



మా ప్రభూ చిన్నాన్నగారు చదరంగంలో ఆరితేరినవారు. ఊళ్ళోని పెద్ద పెద్ద ప్లేయర్సంతా ఆయన దగ్గర ఓడినవారే. అయితే ఆయన  ఏనాడూ ఏ పోటీలకు వెళ్ళినట్లులేదు. ఇంట్లో చదరంగం బల్ల నలుపు తెలుపు రంగులలో ఉండేది. పావులన్నీ కర్రతో చేసినవే పసుపు, ఎరుపు రంగుల్లో ఉండేవి. ఒకటి రెండుసార్లు ఆయనతో కలసి చిన్నబజార్లో (అనే గుర్తు) ఒక మేడమీద రీడింగ్ రూములో చదరంగం ఆటకు వెళ్ళాను. అదే వరసలో మినర్వా టాకీస్ ఉండేదనుకుంటాను. మా చిన్నాన్నగారికి ఆ వీధిలో వారంతా పరిచయస్తులే. ఒక్కో షాప్ దగ్గరా పదేసి నిముషాలు కూచోపెట్టి బాతాఖానీ మొదలెట్టేవారు. అలా ఒక షాప్ దగ్గరకు వెళ్ళగా అక్కడ వరస స్టాండ్లలో రంగు రంగు నీళ్ళున్న సీసాలు వరసగా ఉండేవి ఎవరెవరో వచ్చి ఆ రంగునీళ్ళలో నిమ్మరసం, పంచదార వేయించుకొని త్రాగేవారు. వాటిని షర్బత్ లు అంటారని తెలిసింది. లైట్లవెలుగు ఆ రంగునీళ్ళ సీసాల మీదపడి చూడ్డానికి అదేదో ఇంద్రలోకం లా అనిపించింది 

మా వీధుల్లోకి రంగు రంగుల పాకం మిఠాయి అమ్మకానికి వచ్చేది. ఆ పాకపు ముద్ద ఒక పెద్ద లావాటి వెదురుకర్రకు అంటించివుండేది. అది అమ్మేవాడు ఒకచేత్తో గంట మోగించుకుంటూ వచ్చేవాడు. మనం ఇచ్చే డబ్బులను బట్టి ఆ రంగు పాకాన్ని రెండు చేతుల మణికట్టుల దగ్గర వాచీలా, దండకడియాల్లా కట్టేవాడు. అది కొంచెం కొంచెంగా తీసుకు తినడం మహదానందం. 
అలాగే, నాన్ రొట్టి, రస్క్ లు బిస్కట్లు అమ్మవచ్చేవి. కాఫీలో నాన్ రొట్టి ముంచుకు తినడం మా ప్రసాద్ అలవాటు. ఈ వస్తువులన్నింటిమీద చాలా ఈగలు వాలేవి. అమ్మేవాళ్ళు ఎంత శుభ్రంగా ఉంచినా ఈగలు మూగేవి. అలాగే ఇంట్లో త్రాగేసి వదిలేసిన కాఫీ గ్లాసులలో  కూడా ఈగలు ముసిరేవి. ఆ గ్లాసులు వెంటవెంటనే ఎందుకు కడిగేవారు కాదో నాకు తెలియదు. ఆ పనులు ఏ టైముకైనా ఆడవాళ్ళే చేయాలి. మగాళ్ళు ఇంటి పని చేయడం నామోషి .  ప్రతీ పనికి ఒక టైమ్ టేబుల్. దాని ప్రకారం పనులు జరపడంలో ఇలాటి ఇబ్బందులు తప్పవేమో. అప్పట్లో, మూడో క్లాస్ తెలుగు వాచకంలో ఈగ మీద  ఒక పాఠం ఉండేది. అందులో ఈగ వల్ల వచ్చే హాని గురించి ఈగల వల్ల వచ్చే రోగాల గురించి రాసుండేది. ఆ పాఠాన్ని ఇంట్లోవారెందుకు చదవరో తెలిసేదికాదు. 

టైమ్ టేబిల్ అంటే గుర్తుకు వచ్చింది. భోజనపు మెనును మా పెద్దమ్మమ్మగారే డిసైడ్ చేసేవారు. అన్నంలోకి ఏ పప్పు వండాలి(కంది, పెసర), ఏ పప్పుకు ఏ కూర ఉండాలి. వేడి చేసే కందిపప్పైతే చలవ చేసే బీర, దొండ, బెండవంటి కూరలు, పెసరపప్పైతే వేడిచేసే కూరలు, ఏ రకమైన చారు పెట్టాలి, రాత్రి అయితే ఏ పప్పు పచ్చళ్ళు చేయాలి, ఏ పొడులు వేసుకోవాలి, శని ఆదివారాలలో ఒంటిపూట ఉపవాసం వాళ్ళకి ఏం టిఫెన్లు చేయాలి, వాటికి ఎలాటి సైడ్ డిషెస్ వుండాలి అనే విషయాలను కూలంకషంగా పరిశీలించి ఆరోగ్యాలకు తగినట్లు ఆవిడ వంటను నిర్ణయించేవారు. ఆ విధంగానే  ఆ ఇంటి కూతుళ్ళు  చేసేవారు. మా తాతగారి ముగ్గురు కొడుకులు ఆవిడకు మేనల్లుళ్ళు కావడం వలన వారి భార్యలు ఆవిడకు కూతుళ్ళే. 

ఒక రోజు మా నాన్నగారు సాలూరు వెళ్ళబోతున్నట్లు చెప్పారు.  తనతో కూడా నన్నూ తీసుకువెళ్ళడానికి నిశ్చయించడం అపూర్వమే. ఆయన చాలా మొహమాటస్తుడు. తనవల్ల ఇతరులకు ఏవిధమైన అసౌకర్యం, ఇబ్బంది కలగకూడదని ఆయన ఆశయం. అందుకే ఎక్కడికి వెళ్ళినా తనొక్కరే వెళ్ళడం అలవాటు. ( ఇది నాకు కలిగిన అవగాహన).
సాలూరు ప్రయాణ విశేషాలు వచ్చేవారం.

           ...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, August 14, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పన్నెండవ భాగం

15.08.20 - శుక్రవారం భాగం - 12:
పదకొండవ భాగం ఇక్కడ:
నెం.35, ఉస్మాన్ రోడ్


      ప్రణవ స్వరాట్

నెం. 35, ఉస్మాన్ రోడ్ ధారావాహిక - ఘంటసాలగారి జీవిత చరిత్ర కాదు.

ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాలైన కలివరం, విజయనగరం, బొబ్బిలి వంటి చిన్న ఊళ్ళలో పుట్టి పెరిగి ఒకేసారి మద్రాస్ మహానగరంలోకి వచ్చిపడిన  ఒక సగటు కుర్రవాడి మనోభావాలు, అవస్థలు చూపే ప్రయత్నమే ఈ నెం.35, ఉస్మాన్ రోడ్. 

ఒక డెభ్భై ఏళ్ళక్రితం మన ఊళ్ళు ఎలా ఉండేవో, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, అగ్రహారాలలో ఆనాటి ఆచార వ్యవహారాలు పరిపూర్ణంగా కాకపోయినా సూచనప్రాయంగానైనా ఈ తరంవారికి తెలియజెప్పే ప్రయత్నమే నెం.35, ఉస్మాన్ రోడ్. ఇందులో వచ్చే అన్ని భాగాలతోనూ ఘంటసాలగారికి ప్రత్యక్ష సంబంధం ఉండవచ్చును. ఉండకపోవచ్చును. కానీ, ఆ నాటి పరిస్థితులన్నీ ఘంటసాలగారి సంగీత విద్యమీద, పురోభివృద్ధి మీద, వ్యక్తిత్వ వికాసం మీద ప్రభావం చూపాయనే నేను భావిస్తున్నాను.  వయసు మీరుతున్న కారణంగా గత జ్ఞాపకాలు పూర్తిగా మరుగున పడిపోకముందే వాటిని అక్షరరూపంలో పెట్టే ప్రయత్నమే ఈ నెం.35, ఉస్మాన్ రోడ్. ఈ విషయాలన్నీ ఘంటసాలవారి అభిమానులకు ఆసక్తికరంగా తోచకపోయినా, మా పట్రాయని కుటుంబంలో మా తర్వాతి తరంవారికి, వారి పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష వుంటే ఈ వ్యాసాలు కొంత ఉపయోగిస్తాయి. ఈ వ్యాసాలలో అవాస్తవాలకు, అతిశయోక్తులకు చోటులేదు.  నాకు జ్ఞాపకమున్నంతవరకు ఔచిత్యం పాటిస్తూ ఉన్న విషయాన్ని చెప్పడమే నా ముఖ్యోద్దేశం.

ఇక మన కథలోకి వెళదాం.

ఘంటసాల అనే ఆయన తమ కుటుంబంతో మా తాతగారింటికి వచ్చి వెళ్ళాక ఆయన సినీమా లలో పాటలు పాడతారని, మా తాతగారింట్లోనే వుంటూ సంగీతం నేర్చుకున్నారని తెలిసింది. అప్పటినుండి రేడియోలో కానీ, సినీమాల ప్రచారం కోసం జట్కా బళ్ళలోనూ, సైకిల్ రిక్షాలలో లౌడ్ స్పీకర్లు పెట్టి గ్రామఫోన్లలో వచ్చే పాటల్లోకానీ ఘంటసాల పాట వస్తే గుర్తు పట్టడం తెలిసింది. పెద్దవాళ్ళతో సినీమాలకెడితే అందులో వచ్చే పేర్లలో ఘంటసాల అనే పేరుందో లేదో చూడడం మొదలయింది. 

అప్పట్లో సంసారం, మల్లీశ్వరి,  పరోపకారం, దేవదాస్ వంటి సినీమా పాటలు తరుచూ లౌడ్ స్పీకర్లలో వినిపించేవి. పరోపకారం సినీమా ఘంటసాల వారిదేనని చెప్పుకోవడం విన్నాను. ఆ సినీమాను ధియేటర్లో  చూసిన గుర్తుంది. ఘంటసాల పాటలు జనాలు బాగా పాడుకోవడం మొదలయింది. ముఖ్యంగా దేవదాసు వచ్చాక ఎక్కడ చూసినా అవే పాటలు. 

ఊళ్ళో జరిగే పాటల పోటీలలో కూడా ఔత్సాహిక గాయకులు ఘంటసాల పాటలు పాడడం ఆరంభమయింది. ఘంటసాల పుష్పవిలాపం పద్యాలు చదివే గాయకులు ఎక్కువగా తయారయ్యారు. అలాటి  ఔత్సాహిక గాయకుల పాటల పోటీ ఒకటి సింహాచలం చౌల్ట్రీలో జరిగింది. ఆ పాటల పోటీలలో ముగ్గురు జడ్జీలలో మా నాన్నగారు - శ్రీ సంగీతరావుగారు ఒకరు. ఆ పోటీలో మా నాన్నగారి కజిన్ గుమ్మా మార్కేండేయ శర్మ కూడా పాల్గొని ఘంటసాలగారి 'హృదయమా సాగిపోమ్మా' (పరోపకారం) పాట పాడారట. ఈ విషయాలు పెద్దయ్యాక తెలిసినవి.
  హృదయమా సాగిపొమ్మా"పాటను ప్లేబటన్ నొక్కి వినవచ్చు

రోడ్లమీద తాగుబోతు వాళ్ళ నోట్లో దేవదాసు పాటలే.  మా తాతగారికి రోడ్లమీద తూలుతూ నడిచే తాగుబోతులంటే మహాభయం. దానితో పిల్లలను బయటకు వదిలేవారు కాదు. అలాగే  వీధుల్లో గాడిదలు విపరీతంగా తిరిగేవి. వాటి ముందరి కాళ్ళు రెండూ కట్టేసే ఉంచేవారు వాటి యజమానులు. అయినా అవి అలాగే గెంతుకుంటూ తిరుగాడుతూండేవి. ఆయనే ఎప్పుడైనా పిల్లలను తీసుకొని నల్లచెఱువు మెట్టలవేపు తీసుకువెళ్ళేవారు. అక్కడికి వెళ్ళాలంటే మహదానందం. అక్కడ చాలా ఈతచెట్లుండేవి. చేతికందేలా గుత్తులు గుత్తులుగా ఎర్రటి పళ్ళుండేవి. వాటికోసం ఆయన వెంటపడేవాళ్ళం. ఆ ఈతపళ్ళు, నేరేడు పళ్ళు వీధుల్లోకి తెచ్చి అమ్మేవారు. అవి కొనుక్కోవాలంటే గుప్పెడు నూకలో, బియ్యమో ఇవ్వాలి డబ్బులకు బదులుగా.(అంటే బార్టర్ పద్ధతిలో (barter system) వంగ, దొండ, బెండ, చిక్కుడు, అరటి దవ్వ(దూట), అరటిపువ్వు వంటి కూరగాయలు పాతిక, ఏభై, వందల లెఖ్ఖన అమ్మేవారు.  తూనికతో అమ్మకాలు తక్కువ. వాటికి కూడా డబ్బులకు బదులు నూకలే తీసుకునేవారు. తాటి ముంజెలు, మామిడిపళ్ళ సీజన్ లో  ఆ పళ్ళన్ని చాలా విరివిగా అమ్మకానికి వచ్చేవి.  పెద్ద రసాల మామిడిపళ్ళు వంద పళ్ళు ముఫ్పై, నలభై రూపాయలలోపే వుండేవి. వాటిని బేరం చేసి, ఎంచి, కొని డబ్బులు ఇచ్చే వ్యవహారమంతా మా పెద్దమ్మమ్మగారిదే (మా తాతగారి అక్కగారు). ఆవిడ దగ్గర మూరెడు పొడుగున ఒక పాత పెద్ద తోలు పర్స్  మూడు నాలుగు మడతల్లో ఉండేది.  అప్పట్లో కరెన్సీ నోట్లకన్నా  నాణేల చెలామణియే ఎక్కువుండేది.  ఆవిడ పర్స్ లో ఒక మడతలో రూపాయి నాణేలు, ఒక దాంట్లో అర్ధలు, పావలాలు, ఒక దాంట్లో బేడలు, అణాలు, మరొక మడతలో అర్ధణాలు, కాన్లు వుండేవి. వాటన్నిటితో ఆవిడ పర్స్ బరువుగానే వుండేది.  మొత్తం అంతా కలిపి  ఓ పాతిక రూపాయలుంటే ఎక్కువేనేమో.
                        1950ల నాటికి చలామణీలో ఉన్న నాణాలు

 ఒకసారి మా నాన్నగారు ఏదో ఊరు సంగీత కచేరీకి వెళ్ళి వచ్చి అక్కడి వారిచ్చిన పారితోషకపు మూటను  మా తాతగారికి ఇవ్వమని నా చేతిలో పెట్టారు. నేను మోయలేనంత బరువుంది. ఆ మూట తాళ్ళు విప్పి చూస్తే అందులో అన్నీ  జార్జ్ బొమ్మ (V or VI అనేది గుర్తులేదు) ఉన్న పెద్ద ఇచ్చు రూపాయి నాణేలు. వాటిని నేను లెఖ్ఖపెట్టగా సరిగ్గా ఏభై ఉన్నాయి. నేను మా తాతగారికి ఇవ్వగా ఆయన అమ్మీ అంటూ తన అక్కగారిని పిలిచి ఆ డబ్బు ఆవిడ చేతికిచ్చారు. తన జీతం కూడా ఆవిడకే ఇచ్చేవారు. ఇంటి యాజమాన్యం ఆవిడదే. ఆవిడ ఆ డబ్బులను ఆ మూరెడు తోలు పర్స్ లో పెట్టేది. ఆవిడను ఇంట్లోని మగాళ్ళు అత్తా అని, మా అమ్మ, పిన్ని గార్లు అమ్మన్న అని పిలిచేవారు. 


ఆనాడు రూపాయికి ఉండే విలువ ఈనాడు ఊహించలేము. ఒక రూపాయి ఒక తులం బరువుండేది. బంగారం తూచడానికి ఒక వెండి రూపాయి నాణేన్నే ఉపయోగించేవారు.

   1906నాటి వెండి రూపాయి నాణెం
నేను పుట్టడానికి ముందు ఒక రూపాయికి తులం బంగారం వచ్చేదని చెప్పుకునేవారు. కానీ ఆ రూపాయి దొరకడమే బహు దుర్లభంగా వుండేది. దీపావళి  మతాబాలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, చిచింద్రీల వంటి బాణసంచా తయారుచేసేప్పుడు వాటిలో ఉపయోగించే పదార్థాలను తూచడానికి ఈ రూపాయి నాణేన్నే ఉపయోగించేవారు.

నేను విజయనగరం లో ఉన్నప్పుడు యాచక వృత్తి వుండేది. మాతాతగారికి  మ్యూజిక్ కాలేజీ లేని రోజుల్లో వీధి వరండాలో కూర్చొని వచ్చిపోయేవారిని కుశలప్రశ్నలు వేసి పలకరించేవారు. ఒక రోజు  ఒక ముష్టివాడు ఏవో పాటలు పాడుకుంటూ ఆ వీధిలోకి వచ్చాడు. అతని పాట మా తాతగారికి నచ్చిందనుకుంటాను. అతనిని అరుగుమీద కూర్చోపెట్టి అతనిచేత పాడిస్తూ తాను అగ్గిపెట్టెమీద పాటకు తగ్గట్టు తాళం వేస్తూ ఆనందించారు. అంతా అయిపోయాక అమ్మిగారిచేత డబ్బులు ఇప్పించి పంపేరు. తానొక గొప్ప వాగ్గేయకారుడైనా, ఎటువంటి భేషజం, దర్పం లేకుండా ఒక సామాన్య యాచకుని గానాన్ని మెచ్చుకున్నారంటే ఆయన ఎంతటి విశాలహృదయం గలవాడో, నేను పెద్దయ్యాక అర్ధమయింది. 

అలాటిదే, మరో సంఘటన నేనెన్నటికీ మరువలేనిది. రోజు ఉదయాన్నే ఆరు గంటల ప్రాంతంలో మా ఇంటికి ఎదురింట్లో ఉండే ఒక ముసలి ఆయవారం బ్రాహ్మడు వచ్చి తిధి, వార, నక్షత్రాల వివరాలు చెప్పి ఇంట్లోవారిచ్చే గుప్పెడో, దోసెడో బియ్యం తన ఇత్తడి చెంబులో వేయించుకొని మరో ఇంటికి వెళ్ళేవారు. వేసేవారు వేస్తారు. లేనివారు లేదు. తిధి వార నక్షత్రాలు చెప్పి ఓ రెండు మూడు నిముషాలు చూస్తాడు. ఎవరైనా వస్తే సరే, లేకపోతే మరో గడప ఎక్కేవాడు. చూడడానికి చాలా దీనంగా అనిపించేది. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఒక కోడలు. పెద్దకొడుకు టీచర్ గా పనిచేసేవాడని గుర్తు. రెండోవాడు చదువుకుంటూ, యాచనకు వెళ్ళేవాడు. వారెవరి పేర్లు గుర్తులేవు. ఒక రోజు  మా అమ్మగారు  ఒక బేడ నా చేతిలోపెట్టి  ఒక ప్లాస్టిక్ పన్ని(దువ్వెన) ఒకటి  కొనమని చెప్పింది. ఆ డబ్బులు చొక్కా జేబులో పెట్టుకొని బజారు వేపు వెళ్ళి దారిలో ఒక పార్క్ లో  స్పీకర్ లో నుండి పాటలు వినిపిస్తూంటే అవి వింటూ అక్కడి పచ్చికలో కూర్చొని అక్కడ ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ కాలక్షేపం చేశాను . కొంతసేపు అలా గడిచాక షాపుకెళ్ళి దువ్వెన కొనడానికి బయల్దేరాను. పార్క్ బయటకు వచ్చి జేబులో చెయ్యి పెట్టి చూస్తే డబ్బులు లేవు. గుండెలు గుభేలుమన్నాయి. పరిగెత్తుకుంటూ మళ్ళీ పార్క్ లో నేను కూర్చున్న చోటికి వచ్చి చూస్తే అక్కడేమీ కనపడలేదు. ఏంచేయాలి. డబ్బులు పోయాయని ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుందని భయం. అంతటా వెతకడం మొదలెట్టాను. ఏడుపు తన్నుకొస్తోంది. ఏంచేయాలో తెలీక అక్కడే బిక్కమొహం వేసుకొని దిక్కులు చూడ్డం మొదలెట్టాను. కొంచెం చీకటి పడుతోంది. ఇంతలో, మా ఎదురింటి ఆయవారం బ్రాహ్మడి రెండో కొడుకు అటు పక్క వెళుతూ కనపడ్డాడు. నన్ను చూసి ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావని అడిగాడు. పన్ని కొనాలని వచ్చానని చెప్పాను. సరే, కొనేసావుగా, ఇంటికి పద పోదామని అన్నాడు. అప్పుడు ఏడుపు గొంతుతో జరిగింది చెప్పాను. ఇంటికెళ్తే అమ్మ తిడుతుందని భయం. అతను తన జేబులు చూసి తన దగ్గరా డబ్బులు లేవని చెప్పి. భయపడకు ఇప్పుడే వస్తాను, అక్కడే వుండమని చెప్పి ఒక పావుగంట అయ్యాక వచ్చి నా చేతిలో పన్ని పెట్టి ఇంటికి పదమన్నాడు. డబ్బుల్లేవన్నావు, పన్ని ఎలా కొన్నావని అడిగాను. అదంతా నీకెందుకు.  పన్నిని తీసుకువెళ్ళి అమ్మకు ఇవ్వు. డబ్బులు పోయిన సంగతి, నేను కొనిచ్చానన్న సంగతి ఎవరికి చెప్పద్దని మరీ మరీ చెప్పాడు. అలాగే ఇంటికి వచ్చి ఆ పన్నిని అమ్మగారి చేతికిచ్చాను. అక్కడితో ఆ సంఘటన ముగిసింది. ఈ విషయం నేను తరువాత మా అమ్మగారికి చెప్పానా లేదా పాపం! ఆ డబ్బులు ఆ ఎదురింటి కుర్రవాడికి తిరిగి ఇచ్చానా లేదా? ఆ విషయాలేవీ నాకు గుర్తులేవు. మేము ఆ ఊరొదిలి వెళ్ళాక, నాకు బాగా జ్ఞానం వచ్చాక, ఈ సంఘటన తల్చుకుంటే ఏదో తప్పు చేసిన గిల్టీనెస్ కలుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో యాచన చేసుకునే కుర్రాడి సహాయం పొందవలసి వచ్చిందే, అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా తప్పు చేసాననే  భావం ఇప్పటికీ నన్ను వదలలేదు. విజయనగరం, ఆ పార్క్ తలచుకున్నప్పుడల్లా ఆ సంఘటన గుర్తుకు వచ్చి మనసంతా వికలమౌతుంది.

నేను విజయనగరంలో ఉన్న నాలుగు సంవత్సరాలలో నాకు బాగా గుర్తుండిపోయినవి ఆటలు తప్ప స్కూల్ కు వెళ్ళి చదవడం, అక్కడి విషయాలేవీ గుర్తులేవు. అరటిచెట్ల బడిలో దసరా ఉత్సవాలప్పుడు పప్పుబెల్లాలకోసం తిరగడం. పండగలప్పుడు స్కూల్ లో పెట్టే ప్రసాదాలు తప్ప. ఏవో పండగలయ్యాక ఒక రోజు నేను స్కూలుకు వెళ్ళలేదు. మర్నాడు వెళ్ళినప్పుడు నన్ను మాత్రం టీచర్స్ రూమ్ కు తీసుకుపోయి అక్కడ నాకు ఏదో స్వీటు, పులిహోర పెట్టడం జ్ఞాపకముంది. ఆ మూడో క్లాసు మాస్టారు తెల్లటి పంచే చొక్కా వేసుకొని, భుజంమీద కండువాతో, ఒక బెత్తం పట్టుకొని వచ్చేవారు. ఆయన రామాయణ, భారత కధలను చాలా ఉత్సాహంగా రసవత్తరంగా చెప్పేవారు. పిల్లలంతా నోళ్ళు తెరుచుకొని ఆ కధలు వినేవారు. ఆయన పేరు తెలియదు. ఆ మాస్టారు మా ఇంటికి అప్పుడప్పుడు బియ్యం కొనుక్కునేందుకు వచ్చేవారు. మా ఇంట్లో బియ్యపు వ్యాపారమేమిటని సందేహం కలగవచ్చును. కలివరం నాయుడు గారి బియ్యపు బస్తాలు కొన్నాళ్ళు  విజయనగరంలో మా ఇంట వుంచి అమ్మకానికి పెట్టారు. దానిమీద వచ్చే ఆదాయం ఎవరికోసం అనే విషయం నాకు తెలియదు. ఆ బియ్యాన్ని కొనుక్కునేందుకు ఆ మాస్టారు మా ఇంటికి రెండు మూడుసార్లు రావడం గుర్తుంది. ఒక శేరో, రెండు శేర్లో ఒక గోనె సంచిలో వేయించుకొని వెళ్ళేవారు. అదెన్నాళ్ళు సాగిందో తెలియదు. బియ్యం పప్పులు కొలిచేందుకు కుంచం, అడ్డ‌, శేరు, తవ్వ, సోల, గిద్దెలు ఉపయోగించేవారు. కుంచం హైయ్యస్ట్. గిద్దె లోయస్ట్ కొలమానం. అలాగే, బెల్లం, చింతపండు వంటి ఘన పదార్థాలు తూచడానికి వీశె, మణుగు, బారువ వంటి కొలమానాలుండేవి. ఈ సిస్టమ్ అంతా 1956 లో మారిపోయింది నయాపైసలు, కిలోగ్రాములు, కిలో మీటర్ల మానాలు అమల్లోకి వచ్చాయి. 

ఇందాక  భారత, రామాయణాలంటే ఒక విషయం గుర్తుకువచ్చింది.

ఒకసారి మా ఇంట్లో అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున గట్టిగా అరుపులు, కేకలు వినిపించాయి. ఎందుకో ఏమిటో తెలియదు. మా తాతగారు, పెద్దమ్మమ్మగారు తీవ్రంగా వాదించుకుంటూ, అరుపులు వినపడ్డాయి. మాతాతగారు కోపంతో బయటకు వెళ్ళిపోయారు. ఆవిడ తన తమ్ముడిని 'మూర్ఖపు గాడిదకొడుకు' అని అనడం గుర్తు. ఆయన కోపంతో నల్లచెఱువు మెట్టలవేపో, వ్యాసనారాయణ మెట్టలకో వెళ్ళి కోపం తీరేవరకు అక్కడే కాలక్షేపం చేసి తెల్లారక నెమ్మదిగా ఇంటికి వచ్చేవారు. 'అమ్మీ! ఆలోచించి చూస్తే నువ్వు చెప్పిందే రైట్ సుమీ' అని సమాధానపడేవారు. ఇంతకూ దెబ్బలాటకు కారణం తెలిస్తే విస్తుపోతారు. గొడవలు వాళ్ళిద్దరి మధ్యాకాదు. ఏ మహాభారతం గురించో మొదలయి ఒకరు పాండవుల పక్షాన, ఒకరు కౌరవుల పక్షాన సమర్ధించుకుంటూ మాటకు మాటా పెరిగి తీవ్రరూపం దాల్చేది. ఇలాటి దెబ్బలాటలు ఆర్నెల్లకో, ఏడాదికో జరగడం పరిపాటని తరువాత పెద్దయ్యాక ఇంట్లోవారు అనుకోగా అర్ధమయింది. 

మా తాతగారు తెల్ల ఖధ్ధరు పంచెలు, తెల్ల చొక్కా, కండువా, గొడుగేసుకొని మ్యూజిక్ కాలేజీకి వెళ్ళేవారు. భోజనాల సమయానికి వచ్చేవారు. భోజనం చేసేప్పుడు కాశీ పంచె కట్టుకొని, చొక్కా లేకుండా ఒళ్ళంతా గంధం పూసుకొని నుదుట నల్లటి పెద్ద బొట్టు పెట్టుకొని భోజనానికి వచ్చేవారు. ఆయనకు కావలసిన గంధం అరగదీయడంలో, ఆ నల్లటి బొట్టు తయారుచేయడంలో మాకు చేతనైన పనులు మేము చేసేవారం. ఆ నల్లబొట్టు తయారీలో అరటిపువ్వు దొప్పలు ఉపయోగపడేవి. లేత పువ్వుల్లో ఒకరకమైన తేనెలాటిది ఉంటుంది. దానికోసం పిల్లలం ఎగబడేవాళ్ళం. పువ్వంతా రెలిచిన తరువాత, అరటిపువ్వు డొప్పలను మండుటెండలో ఎండబెట్టి వాటిని ఒక తాడులో గుచ్చేవాళ్ళం. అవసరమైనప్పుడు ఆ ఎండు డొప్పలను నల్లగా కాల్చి ఆ నుసిని ఒక భరిణలోవేసి అందులో మంచికర్పూరంపొడి, ఏదో నూనె వేసి గట్టిగా కలియబెట్టేవారు ఇంట్లోని ఆడవారు. దానిని ఆయన నుదుట అడ్డంగా గంధం రాసుకొని దానిపైన ఈ నల్లబొట్టు పెట్టుకునేవారు. ఈ కార్యక్రమం సుమారు పావుగంట పట్టేది. తరువాత భోజనాలకు కూర్చునేవారు. ముందు మగవారు, పిల్లల భోజనాలు. తరువాత ఆడవారి భోజనాలు. రెండు బ్యాచ్ లుగా అయేవి. భర్తలు లేచాక వదిలిన ఆ కంచాలలోనే ఆ ఇంటికోడళ్ళు భోజనం చేయడం ఆనవాయితి. అదేం ఆచారమో? ఈ రోజుల్లో అలాటివి ఎవరు ఆచరించరు. చెపితే, కనీసం నమ్మను కూడా నమ్మరు. కాని, ఇది నిజం. మా తాతగారికి చిన్నతనంలోనే ఆస్థ్మా వచ్చింది. ఎప్పుడూ దగ్గుతూండేవారు. ఆయనకు చుట్టకాల్చే అలవాటు ఉండేది. ఇదే అలవాటు, బహుశా, శిష్యుడైన ఘంటసాలకు అబ్బిందేమో!

పట్రాయని సీతారామశాస్త్రి గారికి బొట్టు అలవాటు విజయగరం వచ్చిన కొత్తల్లో లేదేమో. ఎందుకంటే, ఈయన, తమ తండ్రిగారి కంటే పెద్దైన శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారిని చూడడానికి వెళ్ళినప్పుడు, ఆయన ఈయనను చూసి 'ఏమిరా, పేరా సాహేబూ! నువ్వు మా నరసింహ కొడుకువి కదూ' అంటూ పలకరించారట. ఆ పేరా సాహేబ్ అనే ఆయన ఆ రోజుల్లో గొప్ప హిందుస్థానీ గాయకుడట. 
Peara Saheb (పేరా సాహెబ్)
 
ఆయన పాడిన గ్రామఫోన్ రికార్డులు బహుళ ప్రచారంలో ఉండేవి. ఆ పేరా సాహేబ్ ఫోటోలు కూడా చాలామంది కళాకారుల ఇళ్ళలో ఉండేవట. మాతాతగారికి ఆయనకు ఏవో పోలికలుండేవట. ముఖ్యంగా,  మాతాతగారు పచ్చని లుంగీ కట్టుకు తిరగడం, హార్మోనియం వాయిస్తూ పాడడం కూడా, ఆయన అలా పిలవడానికి కారణం కావచ్చు. మా తాతగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చేరడానికి ముందు, ఒక యోగ్యతా పత్రం కావలసివచ్చి నారాయణ దాసుగారిని చూసేందుకు వెళ్ళారు. దాసుగారు మా తాతగారిని చూసి "ఒరే, నీకెందుకురా ఆ బాడుఖావు ఉద్యోగం. సలక్షణంగా పాఠశాల కట్టేవు. స్వతంత్రంగా ఉన్నావు అని, నీ ప్రారబ్ధం అలా ఉంది తప్పదు' అని యోగ్యతా పత్రం రాసి ఇచ్చేరట. పక్కనున్నవాళ్ళతో అన్నారట 'ఆ హార్మోనియం లేదూ అదొక కొయ్య. దానిలోంచి అమృతం పిండుతాడు వీడు' అని. (శ్రీ పట్రాయని సంగీతరావు గారి - 'చింతాసక్తి' నుండి). హార్మోనియం విషయంలో ఆ తండ్రిగారి వారసత్వమే శ్రీ సంగీతరావు గారికీ సంక్రమించి వుండవచ్చును. నాకు ఆనాడు ఆ సంగీతపు విలువలు తెలియదు. ఆ వ్యక్తుల ఔన్నత్యం అర్ధమయే వయసుకాదు.

మా తాతగారికి నడుము నొప్పులు, కాళ్ళనొప్పులు వుండేవనుకుంటాను. ఆయన మంచంమీద బోరిగిళ్ళా పడుకొనివుంటే నేను, మా ప్రసాద్ ఇద్దరం గోడ ఆసరాతో ఆయన కాళ్ళమీద, నడుము మీద నిలబడి నెమ్మదిగా తొక్కేవాళ్ళం. ఆయనకు ఆ సేవ చేయడానికి మేమిద్దరం కాట్లాడుకునేవాళ్ళం. అది తల్చుకున్నప్పుడల్లా పరమానందయ్య శిష్యుల కధలో నాగయ్యగారి పాట్లే గుర్తుకు వస్తాయి.

మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు వారి పెద్దమ్మాయి జ్యోతిర్మయి పుట్టిన కొన్ని నెలలకు సంగీత పాఠాలు చెప్పడానికి తన నివాసం విశాఖపట్నానికి మార్చారు. మా సీత పిన్ని, చెల్లి మా తాతగారితోనే వుండేవారు. మా తాతగారింట్లో ఎప్పుడూ బంధు, మిత్రుల రాకతో కళకళలాడుతూ వుండేది. ఇంట్లో ముగ్గురు కోడళ్ళు. వాళ్ళ పుట్టింటినుండి అన్నదమ్ములో, అక్కచెల్లెళ్ళో ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవారు. వైద్యంకోసం విజయనగరం వచ్చే బంధువులు కూడా మా తాతగారింటికి వచ్చేవారు. కుటుంబం పెద్దదవుతూవుంది. ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రం. కళాకారులకు పేరు వచ్చినంతగా ఆదాయం వచ్చేది కాదు. 'బయట పల్లకీలమోత, ఇంట్లో ఈగలమోత' అనే సామెత సంగీతంవాళ్ళకే వర్తిస్తుంది.
 
ఇంట్లోని పిల్లలకెప్పుడూ అనారోగ్యాలు, దగ్గులు, జ్వరాలు. అప్పట్లో మలేరియా జ్వరాలతోపాటు 'కోరింత' దగ్గు అని ఒకటి వచ్చి పిల్లలను బాగా ఇబ్బంది పెట్టేది. ఆ కోరింత దగ్గు వస్తే మాత్రం ఒక పట్టాన వదిలేదికాదు. కనీసం మూడుమాసాలైనా పడుతుంది తగ్గడానికి. ఇలాటి పరిస్థితులలో మా చెల్లెలు రమణమ్మ నెలలపిల్ల. పెరట్లో ఉసిరిచెట్టుక్రింద చాపమీద పడుక్కోపెట్టారు. నిద్రలో దొర్లుకుంటూ పోయి పక్కనున్న చిన్న రాతికాలువలో పడి అక్కడున్న సూదైన రాయి తలవెనక తగిలి బాగా రక్తంకారడం మొదలయింది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ గా మా కమల పిన్నిగారు (ప్రసాద్ తల్లి)  పంచదార, పసుపులాటివేవో అద్ది కట్టుకట్టారు. తరువాత, సుసర్ల వెంకట్రావు గారి హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా ఆయన చూసి తలవెనుక మూడు కుట్లు వేశారు. కొన్నాళ్ళకు గాయంమానింది. మచ్చ ఉండిపోయింది. 

ఏ కారణం చేతనో నా ప్రాధమిక చదువు సక్రమంగా సాగలేదు. ఇంట్లోనే చదివించి, తరువాత సంవత్సరం ఆరోక్లాసులో బ్రాంచ్ కాలేజీ లో చేర్పించడానికి ఏర్పాట్లు చేశారు. మా ఇంటికి కొంచెం దూరంలో, ఇస్మైల్ కాలని అని గుర్తు. ఆ వీధిలో  పప్పు అప్పలనరసింహంగారని మా నాన్నగారికో, తాతగారికో మిత్రులు. ఉపాధ్యాయులు. ఆయన దగ్గరకు ప్రైవేటుకు పంపారు. ఆయన ఏంచెప్పారో, నేను ఎన్నాళ్ళు,  ఏం నేర్చుకున్నానో నాకైతే తెలియదు. నేను చదువు విషయంలో ఎప్పుడూ అంతంత మాత్రంగానే వుండేవాడిని. కొంచెం వయసు వస్తే సరిపోతుందని అనేవారు. కానీ, ఏమీ సరికాలేదు. గ్రాహ్యశక్తి తక్కువ కావడం వలన స్కూల్ పాఠాలు అర్ధమైనట్లే వుండేవి కాని అవి పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి పనికివచ్చేవి కాదు. ఇంట్లో మా ప్రభూ చిన్నాన్నగారు మా ఇద్దరిని కూర్చోబెట్టి చదివించేవారు. ఒకసారి ఆయన కూడికలు, తీసివేతలు లెఖ్ఖలు ఇచ్చారు వాటిలో నూటికి తొంభై రెండు మార్కులు వచ్చాయి.  నా చదువు జీవితంలో అదో నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నంత ఘనత. అదే ఫస్ట్ ఎండ్ లాస్ట్. ఆ తరువాత అందులో సగం మార్కులే నా హైయ్యస్ట్ ర్యాంక్. ఇందుకు, నా పనికిరాని సినీమా పరిజ్ఞానమే కారణమని అనేవారు. ఆటలమీదున్న శ్రధ్ధ చదువుమీద ఉండేది కాదు. మా ప్రసాద్ నాకంటే రెండేళ్ళు చిన్న. నాకు పసుపురంగులో, నీలం కలర్ లో రెండు బుష్ కోట్లు ఉండేవి. వాటికి కాంట్రాస్ట్ కలర్స్ లో బటన్లు. వేసవికాలమైనా అవే వేసుకు తిరిగేవాడిని. నేను కొంచెం బొద్దుగా ఉండేవాడిని, ప్రసాద్ చాలా సన్నగా, వాళ్ళ నాన్నగారిలానే ఉండేవాడు. నాకు బాగా టైట్ అయిపోయిన బట్టలు వాడికి తొడిగితే చాలు. మా ఇద్దరి మధ్యా రామరావణ యుధ్ధమే. మా పిన్నిగారు వచ్చి కోపంగా గుడ్లురిమి చూస్తే చాలు పరుగో పరుగు. ఒక సారి వీధులన్ని చెక్కరకొట్టి మెల్లగా ఇంట్లోకి దూరేవాడిని. ఎప్పుడో తప్ప నేనూ ప్రసాద్ చాలా స్నేహంగానే ఉండేవాళ్ళం.

ఒకసారి మా నాన్నగారు మెడ్రాస్ నుంచి వస్తూ రెండు కీ బస్సులు, రెండు పేము కలర్ స్టిక్స్ తెచ్చారు. ఆ బస్సులు ఒకటి నీలం, ఒకటి ఆకుపచ్చ. చెరొకటి ఇచ్చారు. అంతవరకూ బాగే. వాటితో ఆడేప్పుడే తంటా. నా దగ్గరున్నది వాడికి నచ్చేది. వాడి దగ్గరున్నది నాదైతే బాగుండునని నాకుండేది. అందుకోసం పోట్లాట. మా నాన్నగారు తెచ్చిన స్టిక్స్ తో ఫైటింగ్. అప్పటికి ఎన్ టి రామారావు, నాగేశ్వరరావు జానపద సినీమాలు చూస్తుండడం వలన ఇంట్లో ఆ యుధ్ధాలు మొదలెట్టేవాళ్ళం. నేను ఎన్ టి రామారావును. వాడు నాగేశ్వరరావు. ఆ ఎన్ టి రామారావు పోస్ట్ కోసం ఇద్దరం ఫైటింగ్. నువ్వు సన్నగా నాగేశ్వరరావులా ఉంటావు. అందుచేత నువ్వే నాగేశ్వరరావు, నేను ఎన్ టి రామారావు అని నేను, ఎప్పుడూ నువ్వే ఎన్  టి రామారావు అంటావు‌ ఇవేళ నేనే ఎన్ టి రామారావుని అని మా ప్రసాద్ ఇలా ఇద్దరం  కీచులాడుకునేవాళ్ళం. అదెప్పటికీ తేలేదికాదు. ఈలోగా చేతిలోని స్టిక్స్ వాడికి తగలడమో, నాకు తగలడమో జరిగేది. ఏడుపులు లంకించుకునే సమయంలో మా అమ్మో, వాళ్ళ అమ్మో ఎంట్రీ ఇచ్చి ఆ స్టిక్స్ మా చేతిలోంచి లాక్కొనేవారు. అప్పటికా ఫైటింగ్ సీన్ ముగిసేది. ఇలావుండగా, ఒకసారి మా నాన్నగారు సాలూరు వెళుతూ నన్నూ తీసుకువెళ్ళారు. అంతవరకు కలివరం, విజయనగరం, బొబ్బిలి పేర్లు మాత్రమే తెలుసుకున్న నేను సాలూరు అనే మరో ఊరిపేరు తెలుసుకున్నాను. 

ఆ విశేషాలన్నీ వచ్చేవారం.....(సశేషం)
                                                         -   ప్రణవ స్వరాట్,