visitors

Sunday, February 14, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పంధొమ్మిదవ భాగం

14.02.2021 -  ఆదివారం భాగం- 19*:
అధ్యాయం 2 భాగం 18 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

క్రిందటి వారం జ్ఞాపకాలమాలికలో తెలియజేసినట్లుగా, 1960 ఘంటసాల మాస్టారికి గాయకుడిగా, సంగీతదర్శకుడిగా మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ సంవత్సరం మాస్టారి సంగీతంలో నాలుగు సినీమాలు రిలీజ్ అయ్యాయి. అవి, శాంతినివాసం, అభిమానందీపావళీ, భక్త రఘునాధ్. రెండు సాంఘికం, రెండు పౌరాణికం. ఈ నాలుగు చిత్రాలు నాకు నాలుగు రకాలుగా ఉత్సాహాన్ని, సంతోషాన్నీ పెంపొందించిన చిత్రాలు. నేను బొబ్బిలి హైస్కూలులో చదువు మొదలెట్టాక విడుదలైన సినీమాలు. శాంతినివాసం సినీమాతో మా ఊళ్ళో కొత్త సినీమా హాలు ప్రారంభమయింది. శ్రీకృష్ణా టాకీస్. బొబ్బిలి రాజావారి బావమరది శ్రీ చెలికాని అచ్యుతరావుగారి నిర్వహణ. అదే సంవత్సరం బొబ్బిలి యువరాజావారి పేరుమీద మొట్టమొదటి ఆర్ట్స్ కాలేజీ వెలిసింది. దానితో బొబ్బిలి రూపురేఖలు మారిపోయాయి. పెద్ద పల్లెటూరి స్థితినుండి చిన్న పట్టణంగా రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. 

శ్రీ కృష్ణాలో అక్కినేని శాంతినివాసం, శ్రీరామాలో 'శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం'. ఈ ఐదు సినీమాలతో బొబ్బిలి విద్యార్ధిలోకంలో నా పేరు మార్మోగింది. కారణం మా నాన్నగారు చిత్రసీమలో వుండడం, అందులోనూ ఉత్తరాంధ్ర ప్రజల అత్యంత అభిమాన గాయకుడైన శ్రీ ఘంటసాలవారి వద్ద సహాయకుడిగా పనిచేస్తూవుండడంతో బొబ్బిలిలో నన్ను గుర్తుపట్టి పలకరించేవారి సంఖ్య ఎక్కువయింది.  చదువురీత్యా నేను సగటు విద్యార్ధినే అయినా,ఆనాటి పెద్దలంతా ఆశించే గుణగణాలన్నీ పుష్కలంగా నాలో వున్న కారణంగా అటు స్కూల్ లో , ఇటు బయటా అందరి ప్రేమాభిమానాలకు పాత్రుడనైయ్యాను.

"శాంతినివాసం"అభిమానం", "దీపావళి", "భక్త రఘునాధ్" ఈ నాలుగు చిత్రాలు వ్యక్తిగతంగా నేను మరచిపోలేనివి. ఈ నాలుగు సినీమాలలోని పాటలన్నీ ఆపాతమధురాలే. ఘంటసాలవారి సంగీత ప్రతిభకు గీటురాళ్ళే. శాంతినివాసం చిత్రంలో మొదటిసారిగా మా నాన్నగారు (శ్రీ సంగీతరావు గారు) హార్మోనియంతో పాటు వీణ కూడా వాయించారు. పి.సుశీల గారు, పి.బి.శ్రీనివాస్ గారు పాడిన "శ్రీ రఘురామ్ జయ రఘురాం" పాటకు వీణ వాయించారు". అలాగే, ఘంటసాల మాస్టారు పాడిన పద్యాల మధ్య వినవచ్చే హార్మోనియం బిట్స్ కూడా మా నాన్నగారే వాయించారు. శాంతినివాసంలో మూడు నాలుగైదు హిందీపాటల వరసలు చొరబడినా, మాస్టారు సొంతంగా చేసిన "రాగాలా సరాగాలా" పాట, "కలనైనా నీ వలపే", "సెలయేటి జాలులాగా చిందేసే లేడిలాగా" (ఎ.పి.కోమలపి.లీల) పాటలు నేటికీ సజీవంగానే వున్నాయి. 

శాంతినివాసం సినీమా తీసిన సుందర్లాల్ నహతాగారిదే మరో చిత్రం "అభిమానం" కూడా అదే సంవత్సరం విడుదలయింది. అభిమానం సినీమాలో మొట్టమొదటిసారిగా మా నాన్నగారి పేరును సంగీత సహాయకుడిగా తెరపై చూడడం నాకు మహదానందం కలిగించింది. అందులోనూ సంగీతవిభాగంలో మరెవరి పేరు లేకుండా 'సంగీతరావుఅని మాత్రం వేయడం కించిత్ ఆశ్చర్యదాయకం కూడా. అయితే ఇలాటి లౌకిక విషయాలలో మా నాన్నగారు చాలా నిర్లిప్తంగా వ్యవహరించేవారు. తన పేరు టైటిల్స్ లో ఉన్నా, లేకపోయినా తన వృత్తి ధర్మం ఏదో దానిని నిజాయితీగా, మనస్ఫూర్తిగా చేయడమే తన లక్ష్యంగా భావించారు. అభిమానం చిత్రంలో కె.వి.శర్మ, చలంలకు ఒక పాట వుంది. "మదిని నిన్ను నెర నమ్మి కొలుతు" ఈ పాట మీ నాన్నే పాడారు కదా అని మా బంధువర్గంలోవారు, ఆయనను తెలిసినవారు అడిగేవారు. వారికి ఎందుకు అలా అనిపించిందో తెలియదు కానీ ఆ పాటను మాధవపెద్ది, రాఘవులు పాడారు. ఇందులో ఎస్ వరలక్ష్మి కూడా ఒక సోలో పాడడం విశేషం. (అభినయం కూడా ఆవిడదే). అన్ని నహతాగారి సినీమాల పాటల్లాగే ఇందులోనూ కొన్ని హిందీవరసలు వున్నాయి. అయితే ఆ హిందీ పాటలన్నీ మాస్టారి మ్యూజికల్ టచ్ తో తెనుగుదనం సంతరించుకునేవి అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అభిమానం సినీమాలోని "ఊయలలుగే నా హృదయం", "వలపుతేనె పాట", "మధురా నగరిలో" (సుశీల), "దయగల తల్లికి మించిన దైవం" పాటలు అప్పుడూ, ఇప్పుడూ కూడా బహుళ జనాదరణ పొందినవే. సుశీల గారు పాడిన ఈ పాట రికార్డింగ్ కు నేనూ, మా ప్రసాద్ వెళ్ళి విని ఆనందించిన సంఘటన ఎప్పటికీ మరువలేము. నేనైతే ఈ సినీమా రీరికార్డింగ్ కు కూడా వెళ్ళాను. (కన్నాంబ, కృష్ణకుమారి, రేలంగి  పాల్గొన్న కొన్ని  సన్నివేశాలు).  

దీపావళీ సినీమాలో పాటలు పద్యాలూ ఎక్కువే. అయితే పి.లీల ఈ సినీమాలో ఒక పాటా, పద్యమూ పాడకపోవడం విశేషం. ఆడవాళ్ళ పాటలన్నీ కోమల, సుశీల, ఎస్వరలక్ష్మీ పాడగా మగవారికి ఘంటసాల, మాధవపెద్ది, రాఘవులు పాడారు. దీపావళీ సినీమాలో ఘంటసాలవారి సంగీతం  ఒక ప్రధాన ఆకర్షణ. "సరియా మాతో సమరాన..", "యదుమౌళీ ప్రియ సఖి నేనే", "ఓ దేవా కనలేవా", "కరుణా చూడవయా", "విరాళీ సైపలేనురా" వంటి పాటలలో ఘంటసాల మాస్టారి శాస్త్రీయ సంగీతప్రజ్ఞ స్పష్టంగా కనిపిస్తుంది. 


దీపావళీ సినీమా రీరికార్డింగ్ పూర్తిగా చూశాను. నరకాసురుడి రథం క్రింద బాలుడు పడిపోవడం; నరకుడి చెరలో గుమ్మడి కష్టాలు, కళ్ళు పొడిచేయడం; గుమ్మడి కూతురు పాముగా మారి చెరసాల తాళాలు తీయడం; చెరసాల భటులతో నారదుడు, కృష్ణుడి మాయా వినోదాలు; యిలా ఆద్యంతం ఎన్నో సీన్లు రీరికార్డింగ్ లో చూసాను. సందర్భోచితంగా, సమయస్ఫూర్తి తో రీరికార్డింగ్ సంగీతం సమకూర్చి రక్తికట్టించడమనేది సామాన్య విషయం కాదు. ఆ విషయంలో ఘంటసాల మాస్టారి ప్రతిభ అసమాన్యం.

ఇటీవలి కాలంలో "దీపావళీ" సినీమాకు సంబంధించి ఒక ముచ్చట. ఈ చిత్రానికి సంగీతం నిస్సందేహంగా ఘంటసాలవారిదే. కానీ, ఏ కారణం చేతనో "దీపావళీ" సినీమా సిడిలలో, డివిడిలలో ఉన్న టైటిల్స్ లో 'సంగీతం -ఘంటసాల' కార్డ్ మిస్సింగ్. సహాయకులలో సంగీతం పి.సంగీతరావు అని వుంటుంది.  ఈటీవీ ప్రారంభమైన కొత్తలో వారి tv సరాగాలుకార్యక్రమంలో ప్రసారం చేసే సినిమా పాటలలో దీపావళి సినిమా (ముఖ్యంగా తరచుగా ప్రసారంచేసిన "సరియా మాతో సమరాన నిలువగలడా..") పాటలకి వేసే క్రెడిట్స్ లో సంగీతం పి.సంగీతరావు అని వేసేవారు. అయితే రసజ్ఞులైన సంగీతాభిమానులందరికీ వాస్తవం తెలుసు కనుక ఎవరూ పెద్దగా పట్టిచ్చుకోలేదు. ఓ నవ్వు నవ్వి నవ్వుకున్నారు ఈటీవి సాంకేతిక వర్గంవారు ఆ తరవాత పాతికేళ్ళలో కావలసినంత సినీమా పరిజ్ఞానం సంపాదించుకున్నాక ఆ తప్పు మరి చెయ్యలేదు.

ఇక ఆ సంవత్సరం, 1960లో వచ్చిన మాస్టారి ఆఖరి చిత్రం, సొంత చిత్రం "భక్త రఘునాధ్". ఈ  సినీమా విశేషాలు గతవారమే ముచ్చటించుకున్నాము. 1960 లో ఘంటసాల మాస్టారి ఘనకీర్తిని పెంచిన రెండు మహత్తర చిత్రాలు "మహాకవి కాళిదాసు", "శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం". రెండూ అగ్రనటుల (ఎఎన్నార్, ఎన్టీఆర్) చిత్రాలు. రెంటికీ సంగీతం పెండ్యాలగారే. మహాకవి కాళిదాసు చిత్రంలోని పద్యాలకు, శ్లోకాలకు స్వరరచన ప్రముఖ రంగస్థల నటుడు పి.సూరిబాబు. ఈ చిత్రానికి సహనిర్మాత కూడా. కాళిదాసు చిత్రంలో ఘంటసాలవారి  గళంలో విశ్వరూపం కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన శ్యామలా దండకం ఆయనను గాన గంధర్వుడిని చేసింది.

ఈ దండకం మాస్టారికి, నటించిన అక్కినేని వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టింది. మహాకవి కాళిదాసులో మాస్టారు పాడిన శ్యామలా దండకాన్ని వేదికలమీద, టివి ఛానల్స్ లో పాడని గాయకులే లేరు. కాకపోతే ఘంటసాలవారి రేంజ్ కు సమీపంగా చేరుకున్నవాళ్ళని నేను చూడలేదు. అందరూ గాన గంధర్వులు కారు, కాలేరు.

కలియుగ దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి మీద పద్మశ్రీ ఫిలింస్ బ్యానర్ మీద పి.పుల్లయ్యగారి నిర్మాణ దర్శకత్వంలో రూపొందుకున్న చిత్రం 'శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం'. ఈ సినీమాలో తిరుపతి తిరుమల వేంకటేశ్వరుని పరమ భక్తుడైన శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు ఒక భక్తిగీతం ఆలపిస్తూ తెరపై కనపడడం, వారి అశేషాభిమానులకు ఒక గొప్ప విశేషం, అపురూప దర్శనం. ఇదే వేంకటేశ్వర మహత్మ్యం కథను పి.పుల్లయ్యగారు 82 ఏళ్ళక్రితం 'బాలాజీ' అనే పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు. అందులో పద్మావతిగా నటించిన పుల్లయ్యగారి భార్య శాంతకుమారి, 1960 సినీమాలో వకుళమాతగా నటించి చక్కని పాటలు కూడా ఆలపించారు. ఇరవై ఏళ్ళ వ్యవధిలో ఒకే నటి రెండు విభిన్న పాత్రలు. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమాలో ఘంటసాల మాస్టారు పాడిన 'శేషశైలావాసా శ్రీ వేంకటేశాపాట ప్రధాన చిత్రంతో సంబంధంలేదు. చిత్రం చివరలో తిరుమలలో జరిగిన మహాకుంభాభిషేకం డాక్యుమెంటరీకీ అదనపు ఆకర్షణగా ఆత్రేయగారు వ్రాసిన ఈ పాటను ఘంటసాలవారిపై చిత్రీకరించారు. ఒక భక్త గాయకునిలో వుండాల్సిన ప్రశాంతత, చిరునవ్వు, భక్తిభావం, తాదాత్మ్యం యివన్నీ మాస్టారి వదనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ ఏకాంత సేవ గీతం ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ పొందిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఈ పాట చిత్రీకరణలో మాస్టారితో పాటు ఫ్లూట్ వాయిస్తూ నంజుండప్ప(నంజప్ప), తంబురా శృతి వేస్తూ డి.బాబూరావు , మృదంగం వాయిస్తూ వాహినీ సౌండ్ ఇంజనీర్, వల్లభజోస్యుల శివరాం(లాగే కనిపిస్తున్నారు) పాల్గొన్నారు. నిర్మాతా దర్శకుడు పి.పుల్లయ్యగారి ఒత్తిడి వలన ఈ భక్తుని పాత్రలో తెరమీద పాడుతూ కనిపించడానికి మాస్టారు అంగీకరించారని అనుకునేవారు. ఈ పాట చిత్రీకరణ వాహినీ-విజయా స్టూడియోలో జరిగింది. ఇందుకుగానూ ఒక ఆలయం సెట్ వేసి అందులో ఈ పాట చిత్రీకరించారు. ఈ పాట షూటింగ్ కు సావిత్రమ్మగారు, పెద్దబాబులతో సహా నేనూ వాహినీకి వెళ్ళాను. మేము సుమారు మూడు, నాలుగు గంటల ప్రాంతంలో వెళ్ళాము. మాస్టారిని మేకప్ లో చూడడం అదే ప్రధమం. పట్టుబట్టలు, నుదుట తిరుచూర్ణం, మెడలో పులిగోరు పతకం, చాలా తమాషాగా, ఒకరకమైన థ్రిల్ గా అనిపించింది. ఆ షూటింగ్ లో మమ్మల్ని కూడా ప్రేక్షకుల మధ్య కూర్చోపెట్టమని ఎవరో అడగడం, అందుకు మాస్టారు సున్నితంగా నిరాకరించడం నాకు బాగా గుర్తు.  అర్ధరాత్రి వరకు పిల్లలు నిద్రకు ఆగలేరు, వద్దని చెప్పిన గుర్తు. ఓ రెండు మూడు గంటలసేపు వుండి మేము ముగ్గురం ఇంటికి తిరిగి వచ్చేసాము. అది నాకు నిరాశ కలిగించింది. షూటింగ్ పూర్తిగా చూసే అవకాశం కోల్పోయాను. కాస్తా వయసు వచ్చాక అర్ధమయింది, ఆ రోజంతా షూటింగ్ లో కూర్చున్నా మా మొహాలు తెరమీద కనిపించవని. ఎంతైనా మాస్టారు అనుభవజ్ఞులు. అందుకే పెద్దలు చెప్పిన మాటలు పాటించాలనడం.

శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా ప్రివ్యూ చూసిన గుర్తులేదు. కానీ, మా బొబ్బిలి శ్రీరామా హాలులో ఓ రెండు మూడుసార్లు చూసాను. ధియేటర్ బయట శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం పెట్టి మూడాటలకు ముందు పువ్వుల అలంకరణ, నిత్యపూజలు, హారతులు నిర్వహించేవారు. వడ్డి కాసులవాడు కదా, హుండీ కలెక్షన్, సినీమా కలెక్షన్ రెండూ దండిగానే మూటకట్టుకున్నారు. ఆ ధియేటర్ లో ఆ సినీమా ఆడినన్నాళ్ళు నేనూ నా స్నేహితుడు బి.ఎస్.కృష్ణారావు సాయంత్రం ఆట సమయంలో అక్కడికి వెళ్ళి ఆ హారతులు, తీర్థం అందుకొని అక్కడనుంచి పక్కనే వున్న మా వేణుగోపాలస్వామివారి ఆలయానికి వెళ్ళేవాళ్ళం. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా చూడడానికి చుట్టుపక్కల పల్లెటూళ్ళనుండి  ప్రజలంతా బళ్ళలో కుటుంబాలతో సహావచ్చి సినీమాచూసి రాత్రంతా బళ్ళలోనే పడుక్కొని మర్నాటి ఉదయాన్నే తమ తమ గ్రామాలకు వెళ్ళిపోయేవారు. ఈ సినీమా వచ్చిన ఐదు రోజులకు సరికొత్త సినీమా హాలు శ్రీకృష్ణా టాకీస్ లో 'శాంతినివాసం' విడుదలయింది. ఎఎన్నార్ సినీమా. ఒకటి సాంఘికం. ఒకటి పౌరాణికం. ఒకదానికొకటి పోటీ కాలేదు. ఈ రెండు సినీమాలు 50 రోజులకు పైనే ఫుల్ కలెక్షన్స్ తో ఆడాయి. మా బొబ్బిలిలో ఏదైనా సినీమా 50 రోజులు ఆడితే అది సూపర్ హిట్ సినీమా క్రిందే లెఖ్ఖ. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా తర్వాత ఘంటసాల మాస్టారింటికి , ఎన్.టి,రామారావుగారి ఇంటికీ తిరుపతి యాత్రీకుల రద్దీ విపరీతంగా పెరిగింది.

భారతదేశం అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో పాల్గొంటూ అప్పుడే దాదాపు 90 ఏళ్ళు పైబడిందనుకుంటాను. సి.ఎస్.నాయుడు, సి.కె.నాయుడు, సర్ విజ్జి(రాజకుమార్ ఆఫ్ విజయనగరం), లాలా అమర్ నాథ్, అధికారి వంటి ప్రముఖులు ప్రథమదశ  క్రికెట్ క్రీడాకారులుగా, ఆ ఆట జనబాహుళ్యంలోకి రావడానికి చాలా కృషిచేసారు. నేను క్రికెట్ ఆట గురించి తెలుసుకున్ననాటికి, పాలీ ఉమ్రీగర్, నారీ కంట్రాక్టర్, రమాకాంత్ దేశాయ్, దిలీప్ సర్దేశాయ్, బాపు నడ్కర్ణి, ఫరూక్ ఇంజనీర్, ఎమ్ ఎల్ జయసింహ, కుందెరన్ వంటి ఆటగాళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూండేవి. తర్వాత తరంనాటి సునీల్ గవాస్కర్, జి.ఆర్.విశ్వనాధ్, శ్రీక్కాంత్సోల్కర్, ఇ.ఏ.ఎస్.ప్రసన్న, బిషెన్ సింగ్ బేడీ, బి.ఎస్.చంద్రశేఖర్, ఎస్.వెంకటరాఘవన్ లు ఇప్పటి తరానికి కూడా తెలుసు. ఆనాటి క్రికెట్ ఆటగాళ్ళకు సంబంధించి రెండు, మూడు విషయాలు బాగా గుర్తుండిపోయాయి. ఒకటి ఫరూక్ ఇంజనీర్ ఏడ్. ఇతను ఇండియా తరఫు స్టార్ వికెట్ కీపర్, మంచి స్టైలిస్ట్ బ్యాట్స్మేన్. ఇతను 'బ్రిల్ క్రీమ్' ఏడ్స్ లో కనపడేవాడు. నున్నగా దువ్విన నిగనిగలాడే నల్లని వంకీల జుత్తుతో ఉన్న ఇంజినీర్ ఫోటోకింద తెలుగులో 'అతని గర్వము తలకెక్కినదా'? అనే ప్రకటన చాలా రోజులు కనపడేది. నాకు ఇంజనీర్ అంటే 'గర్వము తలకెక్కినదా' మాట ఒక్కటే గుర్తుకు వచ్చేది.  మరొక విషయం. నారీ కంట్రాక్టర్. ఇంగ్లండ్ టూర్ వెళ్ళినప్పుడు  ఏదో టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి బలంగా వచ్చి తలకు తగలడం, స్కల్ కు ఆపరేషన్ చేయడం, ఆ తర్వాత కంట్రాక్టర్ శాశ్వతంగా క్రికెట్ నుండి తప్పుకోవడం జరిగిందని పేపర్లలో చూశాను. మూడవది ఎమ్.ఎల్.జయసింహ. ఓపెనర్ బ్యాట్స్ మేన్ అనుకుంటాను. హైదరాబాద్ ప్లేయర్. తెలుగువాడనే విన్నాను. పేరును బట్టి ఎన్.టి.రామారావు (జయసింహ సినీమా వల్ల)లా వుంటాడని ఊహించుకునేవాణ్ణి. అతను మహా జిడ్డు ఆటగాడని తాతగారు(సదాశివుడు) అంటూండేవారు. ఏదో ఒక టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా వెళ్ళి మూడు రోజులపాటు నాటౌట్ గా వుండిపోయాడు. ఈ మూడు రోజుల ఆటలో అతను కేవలం 72 పరుగులు మాత్రమే చేసాడని పత్రికలలో చదివాను. నిజానికి టెస్ట్ మ్యాచ్ లకు అలాటి patience, consistency ఉన్న ఆటగాళ్ళే ముఖ్యం. అలాటి బేట్స్ మెన్ ని ఇప్పుడు వాల్ అంటున్నారు. ఈ తరం ఆటగాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫార్మేట్ కి తగిన ఆటతీరు అలవరుచుకోవలసిందే. ఓర్పు, సహనం ఈనాటి ఒన్డేలకి ట్వంటీ ట్వంటీలకి సరిపడదు. అలనాటి విదేశీ ఆటగాళ్ళు డాన్ బ్రాడ్మన్, గారీ సోబర్స్, రోహన్ కన్హాయ్, వెస్లీ హాల్, మైఖేల్ హోల్డింగ్, బాబీ సింప్సన్, మొదలైనవారు గత తరం ఆటగాళ్ళు. వీళ్ళంతా ఏఏ దేశాలవారో నాకు తెలియదు. పత్రికలలో చదవడంతో సరి. ఆ రోజుల్లో క్రికెట్ అంటే మూడు రోజుల రంజీ, దులీప్ ట్రాఫీ లీగ్ మ్యాచ్ లు, ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే.

మేము మెడ్రాస్ వచ్చిన పిమ్మటే క్రికెట్  అనే ఆట ఒకటి వుందని తెలిసింది. మా రామకృష్ణా స్కూల్ లో మంచి టీములే వుండేవి. నన్ను 'సి' టీములో వుండి ఆట నేర్చుకోమన్నారు. కానీ, బరువైన బ్యాట్ లు, ప్యాడ్స్, బంతులను భరించడం నా వల్ల కాలేదు. నేనెప్పుడు ప్యాడ్లు కట్టుకొనిక్రికెట్ బంతితో ఆడిన దాఖలాలు లేవు. అయినా, చిన్ళప్పటినుండి రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూండేవాడిని. ఆట రాకపోయినా. సంగీతం రాకపోయినా శాస్త్రీయ సంగీత రాగాల పేర్లు తెలుసుకున్నట్లే క్రికెట్ ఆడడం రాకపోయినా ఆ ఆటకు సంబంధించిన కొన్ని మాటలను తెలుసుకోవడం జరిగింది. కాలేజీలో చేరాక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్రికెట్ ఆట గురించి చెప్పడానికి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ జరిగినప్పుడు మొదటిసారిగా ఈ ఆట గురించి ఫీల్డింగ్ పొజిషన్స్ గురించి మరికొంచెం తెలిసింది. స్లిప్ లు, గల్లీ, మిడ్ ఆన్, మిడ్ ఆఫ్, లాంగ్ ఆఫ్, లాంగ్ ఆన్,  స్క్వేర్ డ్రైవ్, హుక్, స్వీప్, ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, షార్ట్ బాల్, బౌన్సర్ వంటి కొన్ని పేర్లు వినడం జరిగింది. అవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రయోగిస్తారో నాకు ఏమాత్రం అవగాహన లేదు. నా క్రికెట్ పరిజ్ఞానం అంతగా పెరగలేదు. హాకీ కొన్నాళ్ళపాటు ఆడినా అదీ ఒంటబట్టలేదు. చివరకు హ్యాపీగా బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్ వంటి ఇన్ డోర్ గేమ్స్ కు పరిమితమై కొన్ని సర్టిఫికెట్ లు సంపాదించుకోగలిగాను. టెన్నిస్ అంటే రాయ్ ఎమర్సన్, రాడ్ లేవర్, రామనాథన్ కృష్ణన్ ల పేర్లే. ఈ కృష్ణన్ డేవిస్ కప్ పోటీలలో రాణించినంతగా వింబుల్డన్ లో పేరు పొందలేదు. సెమీఫైనల్ తోనే వెనక్కు వచ్చేసేవాడు. అతని కొడుకు రమేష్ కృష్ణన్ తండ్రికంటే మంచి పేరు పొందాడు.

రెజ్లర్స్ అంటే కింగ్ కాంగ్, దారాసింగ్ వంటి వస్తాదుల పేర్లే వినపడేవి. ఘంటసాల మాస్టారికి ఆటలపట్ల మంచి ఉత్సాహం, ఆసక్తివుండేవి. అవకాశం దొరికితే అలాటి ఆటలు చూడడానికి ఇష్టపడేవారు. దారాసింగ్  మల్లయుధ్ధ పోటీలలో పాల్గొనడానికి మెడ్రాస్ వచ్చినప్పుడు  మాస్టారు కూడా చూసేందుకు వెళ్ళారట. ఆ సందర్భంలో ఆ క్రీడాకారుల గౌరవార్ధం ఇచ్చిన ఒక విందులో తీసిన గ్రూప్ ఫోటోలో  దారాసింగ్ తో పాటూ మన మాస్టారూ కనిపిస్తారు. 

కింగ్ కాంగ్, దారా సింగ్ ల మధ్య ఘంటసాల

మా చిన్నతనంలో క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్ లే. ఇప్పటిలా ట్వెన్టీ ట్వెన్టీలు, వన్ డే మ్యాచ్ లు లేవు. ఆ టెస్ట్ మ్యాచ్ లు కూడా అరుదుగా రెండేళ్ళకో, మూడేళ్ళకో జరిగేవి. ఇంగ్లండ్, వెస్ట్ ఇండీస్, ఇండియా, పాకిస్థాన్ఆస్ట్రేలియా, అంటూ చాలా లిమిటెడ్ గానే టీమ్స్ ఉండేవి. అప్పటి ఆటగాళ్ళ ఆదాయం కూడా అంతంతమాత్రమే. మెడ్రాస్ లో  జరిగిన గేరీ సోబర్స్, వెస్లీ హాల్ తో కూడిన వెస్ట్ ఇండీస్ టీం, ఇండియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కు ఘంటసాల మాస్టారు వెళుతూ తనతో కూడా మా నాన్నగారినీ తీసుకువెళ్ళారు.

మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరిగిందా లేక నెహ్రూ స్టేడియంలో జరిగిందో నాకు తెలియదు. ఆ రెండు స్టేడియంలు అప్పుడు ఇప్పుడున్నంత ఆధునిక వసతులతో వృధ్ధి చెందలేదు. ఓపెన్ ఎయిర్ లో మండుటెండలో కూర్చొని ఆట చూడవలసి వచ్చేది. అన్ని గ్యాలరీలకు రూఫ్స్ ఉండేవికావు. ఐదు రోజుల మ్యాచ్ లో మాస్టారు, మా నాన్నగారు ఒక రోజు ఆటకు మాత్రమే వెళ్ళారు. అప్పటికి మానాన్నగారికి క్రికెట్ ఆటగురించి పెద్దగా తెలియదు. ఒక్కొక్క ఓవర్ కు టీమ్ సెట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, బౌలర్ ఎక్కడో దూరం నుంచి పరుగెత్తుకు వచ్చి బాల్ వేయడం బ్యాట్స్ మేన్ ఆ బంతిని  టుప్పుమని బ్లాక్ చేయడం, లేదా బాల్ పిచింగ్ ఔట్ సైడ్ స్టంప్స్ అయితే అలా వదిలేయడం, మళ్ళా బౌలర్ అంత దూరం వెళ్ళి, పరిగెత్తుకుంటూ వచ్చి బంతి విసరడం, బ్యాట్స్ మన్ దానిని కొట్టి  అట్నుండి ఇటు పరిగెత్తుకు రావడం, దానిని చూసి జనాలు చప్పట్లుకొట్టడం, ఈలలువేసి అరవడం. ఈలోగా ఫీల్డర్ విసిరిన బంతి స్టంప్స్ కు తగలడమో, లేదా కొట్టిన బంతిని ఎవరైనా పట్టుకోవడమో జరగగానే ఔట్ అనడం, మరొక ఆటగాడురావడం, పట్టుమని పది రన్ లు కూడా తీయకుండానే ఔటయి వెళ్ళిపోవడం - ఇదంతా మా నాన్నగారికి ఆ రోజుల్లో అంత ఆసక్తి కలిగించలేదు. విసుగుపుట్టించింది.  ఉదయం ఏ ఎనిమిదింటికో వెళ్ళినవారు సాయంత్రం ఆరు దాటాక  బాగా అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. మాస్టారిదీ అదే పరిస్థితి.  ఆటాడిన వాళ్ళకన్నా ఆటను చూసినవారే ఎక్కువ అలసిపోతారు. వెస్టిండీస్ బలం ముందు ఇండియా బలం చాలలేదు. ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిందని అన్నారు.

మా నాన్నగారికి ఓ 75 ఏళ్ళు వచ్చేప్పటికి ఆయనా, మా అమ్మగారూ  క్రికెట్ లో, టెన్నీస్ లో ఆరితేరిపోయారు. ఆడడంలో కాదు, టీవీలో ఆ మ్యాచ్ లు చూడడంలో, ఆ ఆటగాళ్ళ ఆటల తీరుతెన్నుల గురించి విశ్లేషించడంలో  ఇద్దరూ చాలా జ్ఞానం సంపాదించారు. ఏ ఏ దేశాల ప్లేయర్లు ఎవరెవరో వారి పేర్లేమిటో  వారిద్దరికీ  తెలిసినంతగా నాకు తెలియవు. నాకు దేశాభిమానం ఎక్కువ. ఇండియా పాల్గొనే క్రికెట్ మ్యాచ్ లు మాత్రమే రేడియో కామెంటరీ విధిగా వినేవాడిని, ఆ ఇంగ్లీష్ అర్ధం కాకపోయినా. ఇప్పుడూ అంతే.

అదే సంవత్సరం ఇంగ్లండ్ లో ఇండియా టీమ్ వెళ్ళి ఆడింది. ఆ మ్యాచ్ మన ఇండియా టైమ్ ప్రకారం రాత్రి జరిగేది. అందరూ నిద్రపోయే టైము. వాళ్ళకు నిద్రా భంగం కాకుండా హాలులోని లైట్లు తీసేసి  పాత పెద్ద రేడియోలో వాల్యూమ్ తగ్గించేసి సదాశివుడుగారు, నేనూ మాత్రం చెవులొగ్గి క్రికెట్ కామెంటరీ వినేవాళ్ళం. ఆ కామెంటరీ ఏ బిబిసి నుంచో షార్ట్ వేవ్ లో వచ్చేది. ఆ రేడియో లో మీడియం వేవ్ దొరికినంత సులభంగా షార్ట్ వేవ్ ట్యూన్ అయ్యేదికాదు. నా వరకూ అయితే ఆ రేడియోలో సముద్రపు హోరు లాటి శబ్దాలే వినపడేవి మాటలకన్నా. ఈలోపల ఆ కామెంటరీని ఓవర్ టేక్ చేస్తూ మహ స్పష్టంగా రేడీయో పీకింగ్  అంటూ చైనా రేడియో స్టేషన్ అడ్డొచ్చి ఈ కామెంటరీ పోయేది. ఆనాటి చైనా రాజధాని పీకింగ్ ను ఇప్పుడు బీజింగ్ అంటున్నారు. ఆ రేడియో పీకింగ్ చాలా పవర్ ఫుల్. దానిని తప్పించుకొని మళ్ళా బిబిసిని పట్టడానికి నానా తిప్పలు పడేవాళ్ళం. నాకేమీ అర్ధమయేది కాదు. మధ్యమధ్య ఫోర్ అనో, కాట్ అనో, ఔట్ అనో గట్టిగా చెప్పేవారు. కామెంటరీ ఇంగ్లీష్ లో సాగేది. ఒక్క ముక్క తెలిసేదికాదు. అయినా ఆ రేడియోను అంటిపెట్టుకొని వినడం అదో సరదా. ఆ కామెంటరీ చెప్పేవాళ్ళలో ఒకాయన పేరు సర్ విజ్జి . ఆయన మా విజయనగరం రాజా, పి.వి.జి.రాజుగారికి పినతండ్రో, పెత్తండ్రో అని చెప్పుకోగా విన్నాను. కానీ ఆయనెప్పుడూ విజయనగరంలో ఉండేవారు కాదట. వాళ్ళ ఎస్టేట్స్ అన్నీ ఉత్తరప్రదేశ్ లోని రేవా, బుందేల్ ఖండ్, వారణాసి ప్రాంతాల్లో వుండడం వలన ఆయన అక్కడే ఉండేవారట. మొత్తానికి అర్ధరాత్రి దాటేవరకూ ఆ వినపడని రేడియోలో ని కామెంటరీ విని పడుక్కునేవాళ్ళం. ఇండియా జట్టు గెలవడం అనేది బహు అరుదుగా జరిగేది. విదేశీ ఫాస్ట్ బౌలర్లంటే మనవాళ్ళు హడిలి చచ్చే రోజులవి. ముఖ్యంగా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లంటే మనవాళ్ళకు సింహ స్వప్నం.

మా ఇంటి ఎదురుగా వున్న సోమసుందరం గ్రౌండ్స్ లో శెలవు దినాలలో పెద్దవాళ్ళ క్రికెట్ మ్యాచ్ లు ఉదయం నుండి సాయంత్రం వరకూ జరిగేవి. ఆ సమయంలో రబ్బర్ బంతులతో ఆడే  పిల్లల క్రికెట్  బంద్. పెద్దవాళ్ళ మ్యాచ్ అయ్యేప్పుడు మేము పిల్లలం బౌండరీలైన్ లో వుండే ఫీల్డర్స్ తో ఏదో మాట్లాడుతూ, చప్పట్లు కొడుతూ అరుస్తూండేవాళ్ళం. ఇలా ఒక మ్యాచ్ లో బౌండరీలైన్ లో ఉన్న ఒక ఫీల్డర్ వేపు బ్యాట్స్ మేన్ కొట్టిన బంతి ఆకాశంలోంచి ఎగురుకుంటూ వచ్చింది. మేమంతా గట్టిగా రన్ రన్ క్యాచ్ క్యాచ్ అంటూ ఆ ఫీల్డర్ ను ఉత్సాహపరుస్తూ అరవడం మొదలెట్టాము. అతను మంచి ఒడ్డూ పొడుగుతో లావుగా సైట్ కళ్లజోడుతో వుండేవాడు. వేగంగా వస్తున్న ఆ బంతిని పట్టినట్లే పట్టి జారవిడిచేశాడు. ఆ బంతి సరాసరి వెళ్ళి అతని కళ్ళజోడుకు తగిలి కళ్ళద్దాలు పగిలి అతని ఒక కంటికి తీవ్రమైన గాయం అయింది. అంతవరకూ వారం వారం కనిపించే ఆ ఆటగాడు తిరిగి ఆ గ్రౌండ్స్ లో జరిగే క్రికెట్ మ్యాచ్ లలో కనపడలేదు. ఆరోజు జరిగిన ప్రమాదంలో అతని ఒక కన్ను పూర్తిగా పోయిందని చెప్పుకునేవారు. ఇది చూసాక క్రికెట్ ఆటగాడిని అవాలనే ఉద్దేశ్యం ఏదైనా ఉంటే దానిని సమూలంగా తుడిచిపెట్టేసాను. ఇదంతా 60 ఏళ్ళ క్రితం మాట. 

ఇదిగో ఇప్పుడు మరల నిన్న అదే ఇంగ్లండ్ తో చెన్నై చేపాక్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ అయింది. 2016 తర్వాతచెన్నైలో మళ్ళీ టెస్ట్ మ్యాచ్ జరగడం ఇప్పుడే. కోవిడ్ 19 దృష్ట్యా ఈ టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించలేదు. రెండవ టెస్ట్ నుండి టిక్కెట్లు అమ్ముతారని తెలుస్తోంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా క్రికెట్ సూపర్ స్టార్లంతా బ్రహ్మాండంగా ఆడి బాజా భజంత్రీలతో 227 రన్ ల తేడాతో ఘనంగా......ఓడారు.

...సశేషం

 *With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, February 6, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పద్ధెనిమిదవ భాగం

07.02.2021 - ఆదివారం భాగం - 18*:
అధ్యాయం 2  భాగం 17 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారి 'భక్త రఘునాధ్' చిత్రంలో ఎన్.టి.రామారావు, గుమ్మడి, అంజలీదేవి కూడా నటించారు. అని చెప్పడం సమంజసం కాదు. మాస్టారి మీద వున్న గౌరవం, ప్రేమాభిమానాలతో, చిత్రం చివరలో ఎన్.టి.రామారావు శ్రీకృష్ణుడిగా, గుమ్మడి బలరాముడిగా, అంజలీదేవి (అనే గుర్తు) సుభద్రగా కొన్ని సెకెండ్లు గౌరవ నటుల హోదాలో తెరపై కనిపిస్తారు. వారికి ఏవైనా డైలాగులు వున్నాయా అంటే సందేహమే.

నెం.35, ఉస్మాన్ రోడ్ లో 'కృష్ణ ద్వయం' ఉండేది. ఒకరు 'మామయ్య' కృష్ణ. మరొకరు 'తమ్ముడు' కృష్ణ ఉరఫ్ 'గుండు మావయ్య'.

మావయ్య కృష్ణ సావిత్రమ్మగారికి మేనమామ.  వయసులో ఆవిడ కంటే చిన్నే. మాస్టారి ఇంట్లోనే వుంటూ  జివిఎస్ ప్రొడక్షన్ లో  పని చేసేవాడు. సుమారైన ఎత్తులో నొక్కుల జుత్తు మధ్యపాపిడి, ఫుల్ హాండ్స్ షర్ట్, వేస్టి (తెల్ల లుంగీ) ధరించేవాడు. మనిషి సౌమ్యంగానే వుండేవాడు. అయితే అతను మాట్లాడే తెలుగు నాకు అర్ధమయేది కాదు. ఇంట్లో పిల్లలందరినీ చేరదీసి ఆడించడం, సైకిల్ మీద బయటకు తీసుకువెళ్ళడం చేసేవాడు. ఆ క్రమంలో ఒకసారి మా పెద్ద చెల్లెలు రమణమ్మను సైకిల్ మీద వెనక క్యారియర్ మీద కూర్చోపెట్టుకొని స్కూలుకు (గ్రిఫిత్ రోడ్ రామకృష్ణా ఎలిమెంటరీ స్కూల్ బ్రాంచ్) తీసుకువెడుతూండగా, పొరపాటున మా రమణమ్మ కాలు వెనక చక్రం స్పోక్స్ లో ఇరుక్కుపోయి గొల్లుమంది. కృష్ణ మావయ్య కంగారుపడి క్రిందికి దింపి తనను ఇంటికి తీసుకు వచ్చేసాడు. మా చెల్లెలి కాలు బాగా వాచిపోయి నొప్పి చేసి రెండు మూడురోజులు అవస్థపడింది. కృష్ణ అజాగ్రత్తకకు  సావిత్రమ్మగారు బాగా చిరాకు పడ్డారు. 

ఒక సంవత్సరం, వేసవి శెలవులనే జ్ఞాపకం, మావయ్య కృష్ణ అన్నగారు, అమ్మగారు వచ్చి మాస్టారింట్లోనే కొన్నాళ్ళున్నారు. అప్పుడు సావిత్రమ్మగారి తల్లి కూడా అక్కడే ఉన్న గుర్తు. ఇల్లంతా చాలా హడావుడి గా ఉండేది. వాళ్ళంతా చాలా గాఠిగా మాట్లాడుకునేవారు. వారి సంభాషణలలో సావిత్రమ్మగారు పాలు పంచుకునేవారు. అయితే వచ్చిన అతిథుల భాష మాత్రం తెలుగు కాదు. అరవంలాగా వినపడలేదు. నాకు తెలియని భాష. తర్వాత తెలిసింది వారు మాట్లాడేది మలయాళం అని. క్రమక్రమంగా వారి సంబంధ బాంధవ్యాలు అర్ధమయ్యాయి. మావయ్య కృష్ణ అక్కగారు సావిత్రమ్మగారి తల్లి. కృష్ణ మావయ్య తల్లి సావిత్రమ్మగారి అమ్మమ్మగారు. సావిత్రమ్మగారి పెద మేనమామ కృష్ణ అన్నగారు. తమ్ముడిది నొక్కుల జుట్టయితే అన్నగారిది పూర్తి బట్టతల. నిరంతర తాంబూల సేవనప్రియుడు. మా పిల్లలందరితో సరదగా మాట్లాడేవారు. నాకు సరిక్రొత్త చిక్కు వచ్చిపడింది. ఘంటసాల  అయ్యగారు తెలుగువారు, అమ్మగారు తెలుగు వారు, వారి అమ్మగారూ తెలుగువారే. కానీ మావయ్యలు, అమ్మమ్మగారు మాత్రం మలయాళం. అదెలా సాధ్యం. ఒకటే సందేహం. ఎవరినైనా అడిగితే చెప్పేవారేమో. కానీ, ఏ విషయంలోనూ నోరు తెరచి ధైర్యంగా మాట్లాడలేక పోవడమనేది మొదటినుంచి నాకున్న పెద్ద బలహీనత. ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం తర్వాత ఎప్పుడో తెలిసింది. సావిత్రమ్మగారి తాతగారు, ఆంధ్రదేశంలో తనకు నచ్చిన, తగిన పెళ్ళికూతురు దొరకకపోతే చివరకు మలబార్ (కేరళ) లోని పాల్ఘాట్ వరకు వెళ్ళి ఒక బ్రాహ్మణులింటి వధువు నచ్చి వివాహం చేసుకొని ఆంధ్రాకు తీసుకువచ్చేసారట. బాల్యవివాహమే. ఆ విధంగా  అమ్మమ్మగారికి తప్ప మిగిలిన  ఎవరికీ మలయాళం తెలియదు. ఎప్పుడైనా అమ్మమ్మ తరఫు బంధువులు కలుసుకున్నప్పుడు మలయాళంలో  మాట్లాడుకునేవారు. అమ్మగారి అమ్మమ్మగారు, పెద మావయ్య అక్కడ ఉన్న సమయంలోనే ఒకసారి పి.లీల, ఆవిడ తండ్రి మీనన్  మాస్టారింటికి వచ్చారు కారులో. వాళ్ళది ఆస్టిన్ ఇంగ్లాండ్ కారు. నల్లగా, నిగనిగలాడుతూ ఎప్పుడు చూసినా సరికొత్తగా చాలా క్యూట్ గా వుండేదా కారు. లీల గారు ఆ కారును చాలా ఏళ్ళు ఉపయోగించారు. ఆవిడదీ పాల్ఘాట్ (ఇప్పుడు పాలక్కాడ్) ప్రాంతమే కావడంతో ఇల్లంతా మలయాళంతో ప్రతిధ్వనించేది. ఘంటసాల మాస్టారు వీరందరి సంభాషణలను సరదాగా నవ్వుతూ వినేవారు. ఒకరిపట్ల ఒకరు ప్రేమాభిమానాలతో ఆప్యాయంగా వుండేవారు.

అదీ సంగతి! అందుకే నాకు మావయ్య కృష్ణ తెలుగు అర్ధమయ్యేది కాదు. మావయ్య కృష్ణకు చాలా లేటుగా వివాహం జరిగింది. జివిఎస్ ప్రొడక్షన్స్ సినీమాలు తీయొద్దని నిర్ణయించుకన్నాక మావయ్య కృష్ణ భరణీ స్టూడియో లో చేరారు. అలాగే ఎడిటర్ హరినారాయణ కూడా భానుమతీగారికి సహాయకుడిగా భరణీ స్టూడియోకు వెళ్ళిపోయారు. ఆ తర్వాతే  కృష్ణ నెం.35, ఉస్మాన్ రోడ్ ను విడచి వేరే చోట కాపురం పెట్టారు. ఆ తర్వాత నాకు మావయ్య కృష్ణ గురించి గానీ , ఆయన కుటుంబం గురించి గానీ ఏ అవగాహన లేదు. ఆయనను సావిత్రమ్మగారింట్లోనూ చూసిన గుర్తు లేదు. ఎడిటర్ హరినారాయణ కూడా ఒక ఐదేళ్ళక్రితం కాలంచేసినట్లు అతని దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మా వీడియో ఎడిటర్ గోవిందరాజన్ తెలిపాడు.

పుష్పక విమానంలాంటి ఘంటసాల మాస్టారి లోగిలి ఎప్పుడూ బంధుమిత్రులతో కలకలలాడుతూండేది.

అదీ కృష్ణద్వయంలోని మరో కృష్ణ. 'తమ్ముడు' కృష్ణ. మొత్తం పిల్లలందరికీ 'గుండు మామయ్య'. (ఒకసారి తిరుపతికెళ్ళి గుండుతో వచ్చినప్పుడు రతన్ గుండుమాఁవయ్యా అని పిలవడంతో పిల్లలందరికి, పిల్లల పిల్లలకి కూడా "గుండుమాఁవయ్య"గా స్థిరపడిపోయాడు కృష్ణ).


మనవరాలితో (రత్తన్ కూతురు) గుండు మాఁవయ్య

సావిత్రమ్మగారి కన్నా వయసులో పెద్ద. ఆవిడను, పాప పిన్నిగారిని "అక్కయ్యా"  అని నోరారా పిలిచేవాడు. ఆ ఇద్దరూ కూడా వయసులో పెద్దైనా అతనిని తమ్ముడిలా ఆదరించారు. అసలు ఎవరీ తమ్ముడు కృష్ణ? ఎక్కడనుండి వచ్చాడు? ఆయనది బందరు. మొదట్లో ఘంటసాలవారి బంధువుల ఇంట్లో పనిచేసేవాడట. అప్పుడు మాస్టారింట్లో నమ్మకస్తుడైన మంచి పనివాడికోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి ఇతనిని మాస్టారింటికి తీసుకువచ్చారు. అతనికి సినీమాలలో చేరిపోవాలనే ఆశ వుండేదట. అయితే ఓనామాలు కూడా తెలియవు. ఏ స్కూలు గడప తొక్కలేదు. ఘంటసాల మాస్టారి హోమ్ డిపార్ట్మెంట్ లో హెల్పర్ గా అమ్మగారికి (సావిత్రమ్మగారు), పాప పిన్నిగారికీ  సహాయ పడుతూండేవాడు. 

కొమరవోలు వెంకట కృష్ణారావు, ఉరఫ్ తమ్ముడు కృష్ణ అను గుండుమామయ్య త్వరలోనే ఘంటసాల కుటుంబ సభ్యుడయ్యాడు. ఘంటసాల మాస్టారికి సుగర్ కంప్లైంట్, బిపి వుండడంవలన తరుచు అరికాళ్ళమంటలతో బాధపడేవారు. రికార్డింగ్ ల సమయంలో గంటలతరబడి నిలబడివలసి వచ్చేది. అలాటిరోజుల్లో కాళ్ళమంటలు మరింత ఎక్కువగా ఉండేవి. అలాటప్పుడు ఈ కృష్ణే మాస్టారి అరికాళ్ళకు కర్పూరం కలపిన మంచినూనెతో మర్దనా చేసేవాడు. ఆయనా ఉపశమనం పొందేవారు. ఆ సమయంలో కృష్ణ ఏవేవో కబుర్లు చెప్పేవాడు. మాస్టారు శ్రధ్ధగా వినేవారు. అది చూడడం వినడం నాకు ఒక కాలక్షేపం. 

అలాగే, కచేరీలకు ఘంటసాల మాస్టారు బయట ఊళ్ళకు వెళ్ళేప్పుడు ఆయనకి 'ADC - Aide de Camp' గా వెంటవెళ్ళేవాడు. ట్రైన్ లోను, ఆయా ఊళ్ళలోనూ టైమ్ ప్రకారం మాస్టారికి మాత్రలు తీసి యివ్వడం, భోజనం వడ్డించడం వంటి పనులన్నీ దగ్గరుండి చేసేవాడు. ఇవన్నీ ఒక యజమానికి నౌకర్ చేస్తున్నట్లు కాక, భక్తితో ప్రేమానురాగాలతో సేవ చేసేవాడు. చాలా నమ్మకస్తుడు. నిజాయితీపరుడు. చాలా సౌమ్యుడు. అందరితోనూ సఖ్యంగా వుండేవాడు. అతనికి అక్కన్నా, అమ్మన్నా, తండ్రి అన్నా, అంతా అమ్మగారు, అయ్యగారు మాత్రమే. తన జీవితాన్ని ఆ కుటుంబానికే అంకితం అన్నట్లుండేవాడు. 

కృష్ణ మా అమ్మగారిని కూడా అక్కయ్యగారూ అని పిలిచేవాడు. అతనికీ మా అమ్మగారిలాగే ఒక్క అరవముక్కా వచ్చేదికాదు. ఎవరితోనైనా తెలుగులోనే మాట్లాడేవాడు. అందుకే ఇంట్లోని అరవ పనివాళ్ళకు, పక్కిళ్ళవారికి తెలుగు వచ్చేసింది. 


(కుడి నుండి ఎడమకు) మా అమ్మగారు, రాజేశ్వరమ్మగార్లతో కొమరవోలు కృష్ణారావుగారు
అదే మా గుండుమాఁవయ్య

మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలలో ప్రసిధ్ధిపొందిన గోపాల్  పళ్ళపొడినే వాడమని రేడియో సిలోన్ వాడు అస్తమానూ ఊదరగొడుతున్నా మేము మాత్రం మా ఇంట్లో నంజన్ గూడు ఎర్ర పళ్ళపొడినే వాడేవాళ్ళం. పేపర్ ప్యాకెట్ లో వచ్చేది. అన్ని షాపుల్లోనూ సులభంగా దొరికేది. టూత్ బ్రష్ లకు, కాల్గెట్ టూత్ పౌడర్లకీ, టూత్ పేస్ట్ లకీ ఎప్పుడు మారామో తెలియదు కానీ, ప్రామిస్, క్లోజప్, పెప్సోడెంట్ అంటూ  చాలా రకాల పేస్ట్ లనే నా తళతళ మెరిసే పళ్ళకు ఉపయోగించాను. ఇప్పుడు ఒక పదేళ్ళుగా సెన్సోడైన్ టూత్ పేస్ట్ కు పరిమితమయ్యాను. మా ఇంటిల్లిపాదీ టూత్ పౌడర్ నే వాడినా మా అమ్మమ్మగారికి మాత్రం పలుతోము పుల్లలే కావలసి వచ్చేవి. మా ఇంటి వెనకాల నూతి దగ్గర ఒక వేపచెట్టు వుండేది. కృష్ణ ఆ  వేపచెట్టు ఎక్కి కొమ్మలు విరిచి ఆ పుల్లలను, వేప గింజలను సేకరించి మా అమ్మమ్మగారికి ఇచ్చేవాడు. ఈ విషయంలో నేను అతనికి సాయం చేసేవాడిని.  ఆ సమయంలో అతను చెప్పినదానికి విరుధ్ధంగా ఏదో పనిచేసి అతనికి చిరాకు తెప్పించడం నాకు ఒక ఆనందం. మా ఇద్దరికీ నూతి గట్టు మీద నీళ్ళకోసం గొడవ వచ్చేది.  అయితే బయటవాళ్ళకు తెలిసేది కాదు. ఉదయాన్నే పళ్ళుతోముకునేప్పుడు అతను పెట్టుకున్న నీళ్ళను నేను కావాలనే వాడేసేవాడిని. తన నీళ్ళే ఎందుకు వాడడం  వేరే తెచ్చుకోవచ్చు కదా అనేవాడు. నేనేదో అనేవాడిని. అతనేదో అనేవాడు. సరే నేనే నూతిలోంచి నీళ్ళు తోడిస్తానని చేద( బకెట్) నూతిలో వేయబోతే అడ్డుకునేవాడు. నూతిగట్టంత ఎత్తైనా లేనివాడివి నువ్వేం నీళ్ళు తోడుతావు, ఏం అక్కరలేదని తానే తోడుకునేవాడు. అంత ప్రేమగా వుండేవాడు. నాకు కొంచెం జ్ఞానం వచ్చాక ఇలాటి చిలిపి చేష్టలకు స్వస్తి చెప్పాను. 

రీరికార్డింగ్ ల సమయంలో మాస్టారికి, మా నాన్నగారికి మధ్యాహ్నం ఇళ్ళకు వచ్చే అవకాశం ఉండేది కాదు. మేమిద్దరం కలసి  12బి బస్సులో వడపళనిలో వుండే స్టూడియోలకు మధ్యాహ్నం భోజనం క్యారియర్ లు పట్టుకు వెళ్ళేవాళ్ళం (నా స్కూల్ శెలవు దినాలలో). మాస్టారి భోజనం అయి మాత్రలు వేసుకున్నాక కృష్ణ తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడు. నేను మాత్రం రీరికార్డింగ్ చూస్తూ రాత్రి మా నాన్నగారితోనో లేక ఘంటసాల మాస్టారితోనో ఇంటికి చేరేవాడిని.

మరి, కృష్ణ సినీమా సరదా ఎలా తీరింది? 

కృష్ణ చాలా సాదాసీదాగా వుండేవాడు. ఇంట్లో వుంటే నిక్కర్, పైన ఒక మల్లు బనీన్ తోనే గడిపేవాడు.ఆ నిక్కర్ టైట్ గా వుండడానికి ఏదో వెండి తావీదు వున్న ఎర్ర  మొలతాడుతో బిగించి కట్టేవాడు.  బజారుకో, స్టూడియోలకో వెళ్ళేప్పుడు మాత్రమే చొక్కా వేసుకునేవాడు.

కృష్ణకు ఎలా అబ్బిందో కానీ యోగాసనాలు వేసే విద్య అబ్బింది. ఆసనాలు బాగా వేసేవాడు. చాలా క్లిష్టమైన ఆసనాలన్నీ సునాయాసంగా వేయగలిగేవాడు. ఈ విషయాలు గ్రహించిన ఘంటసాల మాస్టారు భక్త రఘునాధ్ లో కృష్ణకు అవకాశం కల్పించారు. కధానాయకుడు కాంతారావు దేశద్రిమ్మరిలా తిరుగుతూ ఒక యోగి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ యోగి చిత్తూరు నాగయ్యగారు. ఆయనకు అనేకమంది శిష్యులు. అందులో యోగాసనాలు వేసే ఒక శిష్యుడిగా మన  కొమరవోలు కృష్ణారావు కనిపిస్తాడు. కొన్ని క్లోజప్ లలో కూడా కనిపించాడు. ఈ సినీమానాటికి అతనిని తెరమీద చూసి గుర్తుపట్టి ఆనందించగలిగేది మాస్టారి పెద్దబ్బాయి విజయకుమార్, నేనూ మాత్రమే. మిగతా పిల్లలెవరికీ గుండు మావయ్య సత్తా తెలియదు.

నిజానికి కృష్ణకు ఏ విధంగానూ సినీమాలకు పనికివచ్చే ముడిసరుకు లేదు. ఆ విషయం ఘంటసాల మాస్టారికి బాగానే తెలుసు.

తర్వాత, మరో సందర్భంలో (రికార్డింగో లేక కచేరీయో) పి.లీల పక్కన తంబురా శృతి వేసే అవకాశాన్ని మాస్టారు కృష్ణకు కల్పించారట. అతని జన్మ ధన్యమైపోయింది. తను పి.లీలకు వాయించాడు. అప్పటినుండీ అందరితోనూ లీలకు వాయించానని చెప్పుకుంటూ తెగ మురిసిపోయేవాడు.

సాంస్కృతికాలయంలాటి నెం.35, ఉస్మాన్ రోడ్ కు ఎంతోమంది వచ్చారు కొందరు కొన్నాళ్ళున్నారు.  కొందరు కొన్నేళ్ళున్నారు. వారి వారి కార్యక్రమాలు పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. ఘంటసాల మాస్టారు అయితే చిన్న వయసులోనే పిల్లలు యింకా ఎదగకుండానే అర్ధాంతరంగా ఈ లోకాన్నే వదలిపెట్టి వెళ్ళిపోయారు. 

కాలం కలసిరాక ఘంటసాలవారి కుటుంబం తమ ప్రాణప్రదమైన నెం.35 ఉస్మాన్ రోడ్ నే వదులుకోవలసి వచ్చింది. అటువంటి క్లిష్ట సమయాలలో కూడా కృష్ణ అమ్మగారినే అంటిపెట్టుకున్నాడు. ఆవిడ ఉన్నచోటే  సేవ చేస్తూ అతనూ కాలం గడిపాడు. 


మా నాన్నగారు, సావిత్రమ్మగార్లతో గుండు మామాయ్య

కృష్ణకు పెళ్ళి, సొంత సంసారం ఏదీ లేదు. ఉపనయనం అయింది. బ్రహ్మచారిగానే బ్రతికాడు. ఘంటసాల మాస్టారి జీవితంలోని అన్ని దశలు కృష్ణకు బాగా తెలుసు. ఘంటసాలవారి అందరి పిల్లలను తన చేతులతో ఎత్తుకు ఆడించాడు. ఆ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీచూశాడు. వాళ్ళకూ తనకు చేతనైన  సేవచేశాడు. తన సొంత బిడ్డల్లా సాకాడు. వాళ్ళంతా పెరిగి పెద్దకావడం , పెళ్ళిళ్ళు చేసుకోవడం అన్నీ చూశాడు. వాళ్ళకు సంతానం కలిగి వారంతా పెరిగి పెద్దై పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా కళ్ళారా చూసి సంతోషించాడు. 

కొన్నేళ్ళ క్రితం వరకూ ఘంటసాలవారి రెండవకుమారుడు రత్నకుమార్ ఇంటనే సావిత్రమ్మగారితో వుంటూ తన వయసుకు తగిన పనులు చేస్తూవుండేవాడు. రత్నకుమార్ పార్థసారధి పురంలో ఇల్లుకొన్నాడు. అదే వీధిలో ఒక చివర నటి ఆమని ఇల్లుండేది. వీళ్ళిద్దరి ఇంటి నెంబర్లూ ఒక్కటే. పాత, కొత్త  నెంబర్లని తప్ప. ఈ తేడా తెలియనివారు రతన్ కోసం ఆమని ఇంటికి, ఆమనిని చూడాలని వచ్చేవారు రతన్ ఇంటికీ వచ్చేవారు. నేను మొదటిసారి రతన్ ఇంటికి  వెళ్ళినప్పుడు ఆమని ఇంటి తలుపే తట్టాను. అక్కడెవరో మళ్ళీ గైడ్ చేసి వెనక్కి పంపారు. రతన్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా తమ్ముడు కృష్ణ కనిపించి ఆప్యాయంగా పలకరించి మావాళ్ళందరి గురించి అడిగేవాడు. మనిషిలో వృధ్ధాప్యం బాగా వచ్చేసింది. తరచూ ఏదో అనారోగ్యం చోటుచేసుకునేది.

తమ్ముడు కృష్ణ 2016 ఫిబ్రవరి తొమ్మిదిన కాలం చేశాడు. ఆ సంవత్సరం ఆ దినాన ఘంటసాల మాస్టారి ఆబ్దికం. తొలిరోజు రాత్రి కూడా కృష్ణ ఆ విషయం చెపుతూ అయ్యగారి గురించే తలచుకున్నాడట. ఘంటసాల మాస్టారి తిధిరోజునే, ఆయన్నే నమ్ముకు బ్రతికిన కృష్ణ ఈ లోకాన్ని వదిలిపెట్టడం ఆశ్చర్యమనిపిస్తుంది. అటువంటి తమ్ముడు కృష్ణ, మా గుండు మావయ్య తన 90 ఏట (వయసు నిర్ధారణగా తెలియదు) రత్నకుమార్ ఇంటనే తన తుదిశ్వాస విడిచాడు.  రత్నకుమారే జరిపించవలసిన కర్మకాండ జరిపించాడు.

కృష్ణకు తనవాళ్ళనేవారు ఎవరైనా ఉండేవారా? ఇతనెప్పుడైనా తన సొంతవూరు వెళ్ళాడా? వాళ్ళెప్పుడైనా ఇతనిని చూడ్డానికి వచ్చేవారా? నాకు తెలిసినంతవరకూ లేదు. అతని సర్వస్వము ఘంటసాలవారి కుటుంబమే. ఈ కలియుగంలో ఇటువంటి వ్యక్తులుంటారా అని అనుకునే వాళ్ళకి ఈ కృష్ణే సాక్ష్యం. అందుకు ఘంటసాలవారి/వారి కుటుంబ  ఔదార్యమే సాక్ష్యం.  ఇలాటి వ్యక్తులను మరచిపోగలమా ?

1959లో మొదలయి 1960 లో విడుదలైన అనేక సినీమాలు ఘంటసాల మాస్టారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. అందులో ముఖ్యమైన సినీమాలు (శ్రీ చల్లా సుబ్బారాయుడిగారి "ఘంటసాల గాన చరిత" ఆధారంగా) చూద్దాము.

నమ్మినబంటు, శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం, శాంతినివాసం, శ్రీకృష్ణరాయబారం (సినీమా అంతా పద్యాలే), రాజమకుటం, మహాకవి కాళిదాసు, రాణి రత్నప్రభ, భక్త శబరి, దేవాంతకుడు (పద్యాలు మాత్రం), విమల, అభిమానం, దీపావళి, భట్టి విక్రమార్క, భక్త రఘునాధ్, కుంకుమరేఖ, కనకదుర్గ పూజామహిమ, చివరకు మిగిలేది. ఆ సంవత్సరంలో విడుదలైన అనేక చిత్రాలలో ఇవి కొన్ని మాత్రమే. ఈ చిత్రాలలోని పాటలన్నీ సూపర్ హిట్స్ గా నమోదు అయాయి. 

ఘంటసాల మాస్టారికి విపరీత జనాదరణ పెరగడానికి కారణమైన మరో ముఖ్య చిత్రం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వరలక్ష్మి నటించిన అత్యద్భుత పౌరాణిక చిత్రం శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం'. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు పాట పాడుతూ తెరపై కనిపించి అశేష తెలుగు ప్రజానీకంలో ఒక సంచలనం సృష్టించారు. 

ఆ వివరాలు...  వచ్చే వారమే...           
...సశేషం

Saturday, January 30, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదిహేడవ భాగం

30.01.2021 -  శనివారం భాగం- 17*:
అధ్యాయం 2 భాగం 16 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"మీ ఘంటసాల సవినయంగా సమర్పించు..." అంటూ  తెల్లని దుస్తులతో, అంతకంటే నిర్మలమైన చిరునవ్వుతో నిండుగా తెరమీద కనిపిస్తూ ప్రేక్షకులనుద్దేశించి చెప్పిన ప్రారంభ స్వాగత వచనాలతో జివిఎస్ ప్రొడక్షన్స్ వారి సంగీత ప్రధాన, భక్తి రస చిత్రం  "భక్త రఘునాధ్" సినిమా ప్రారంభమవుతుంది.

జి.వి.ఎస్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ఒక  మకరతోరణం మధ్య ఒక పెద్ద గంట వేలాడుతూ, క్రింది ముందు భాగంలో ఇంగ్లీష్ లో G.V.S.PRODUCTIONS అని కనిపిస్తుంది. 

ఘంటసాలవారి రెండో చిత్రమైన 'సొంతవూరు' చిత్రం కూడా జివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే వచ్చింది. అసలు ఈ పేరు ఎన్నుకోవడంలో మాస్టారి అంతరంగం నాకు తెలియదు కానీ, ఆ బ్యానర్ లో మాస్టారింట్లో చాలామంది పేర్లు కలిసివచ్చేలా కనిపిస్తాయి: జి. ఘంటసాల, వి. వెంకటేశ్వరరావు, విజయకుమార్, ఎస్. సావిత్రి , సదాశివుడు(తమ్ముడు), సుబ్బలక్ష్మి(తమ్ముడి భార్య,మేనకోడలు), శ్యామల. అప్పటికి సుగుణ, శాంతి అనే అమ్మాయిలు పుట్టలేదు.  ఇలా అందరి భాగస్వామ్యంతో ఈ సినీమాలు తీసారని నేను సరదాగా మా బొబ్బిలిలో మా స్నేహితుల దగ్గర చెప్పేవాడిని. "భక్త రఘునాధ్" సినీమా చూసింది కూడా బొబ్బిలిలోనే. శ్రీరామా టాకీస్ అని గుర్తు.

రఘునాధుడు ఉత్కళదేశానికి చెందిన విష్ణుభక్తుడు. ఉత్కళదేశమే ఓఢ్రదేశంగా, ఒరిస్సాగా , ఇప్పుడు ఒడియా రాష్ట్రంగా మారింది. ప్రాచీన భారతదేశంలోని అనేకమంది పరమ భాగవతోత్తముల గాధలన్నీ గ్రంథరూపంలో వెలువడ్డాయి. అందులో, పూరీ జగన్నాధస్వామి భక్తుడైన ఈ రఘునాధ గోస్వామి చరిత్ర కూడా వుంది. 

రెండు సాంఘిక సినీమాలు తీసి ఆర్ధికంగా చాలా నష్టపోయినా ముచ్చటగా మూడవ ప్రయత్నంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచి మరో సినీమా తీయ సంకల్పించి కధ, మాటలు, పాటలు, దర్శకత్వపు భాధ్యతలను శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులవారికి అప్పగించారు. శ్రీ సముద్రాలవారు పౌరాణిక చిత్రాలకు మాటలు,పాటలు రాయడంలో నిష్ణాతులు. అంతకు రెండేళ్ళకుముందే వినాయకచవితి వంటి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకానుభవమూ పొందారు. వీటన్నిటినీ మించి తనను చిత్రసీమకు పరిచయం చేసిన వ్యక్తిగా, ఆత్మీయుడిగా, సన్నిహితుడిగా ఆచార్యులవారి మీద గల పూజ్యభావంతో, కృతజ్ఞతా భావంతోను తాను నిర్మించబోయే కొత్త సినీమా భాధ్యతలను ఆచార్యులవారికి అప్పగించేరేమో అని అనిపిస్తుంది. 

"భక్త రఘునాధ్" చిత్రానికి కధానాయకుడిగా ముందు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారిని సంప్రదించగా, వారెందుకో ఈ చిత్రకధ పట్ల అంత సుముఖంగా లేనట్లు, రఘునాధుడనే భక్తుడిగురించి తెలుగువారికి అంతగా తెలియదని, అలాటి గాథను తెరకెక్కించడం శ్రేయస్కరం కాదని, అయినా ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీ కె.వి.రెడ్డిగారిని నియమిస్తే బాగుంటుందని సలహా యిచ్చినట్లు, కానీ, అప్పటికే ఘంటసాలవారు తన సినీమా డైరక్టర్ గా శ్రీ సముద్రాల వారికి మాట యిచ్చినందువలన, ఆ వాగ్దానాన్ని మీరడం ఇష్టంలేక  శ్రీ నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్లుగా వచ్చిన సమాచారాన్ని నేను చదివేను. 

తరువాత, కాంతారావు, జమునలను నాయక,నాయికలుగా ఎన్నుకున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో నాగయ్య, సి.ఎస్.ఆర్, రేలంగి, సూర్యకాంతం, పేకేటి మొదలైనవారు నియమితులయ్యారు. 

ఈ సినీమా భక్తుడి గాథ కావడం వలన  అతని జీవితం లోని కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు, ఇలా అన్ని రసభావాలను చూపించే క్రమంలో ఈ సినీమాలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. నిర్మాత (తమ్ముడి పేరిట) సంగీతదర్శకుడు, గాయకుడు అన్నీ తానే అయినందున సంగీతనిర్వహణ విషయంలో వారికెంతో స్వేచ్ఛ లభించిందనే చెప్పుకోవాలి. ఇతరుల ఒత్తిడులేవీ సంగీతంమీద ప్రతిఫలించే అవకాశంలేదు. సంపూర్ణ  పాటల స్వర రచన విషయంలో మాస్టారు వ్యవహరించి అక్కడ తానే ఒక భక్తుడి అవస్థలను అనుభవించి ఆయా రసాలకు తగిన వరుసలను సమర్ధవంతంగా తయారు చేశారు. 

పాటల కంపోజింగ్, రిహార్సల్స్ వంటివి నెం.35, ఉస్మాన్ రోడ్ ఇంటి క్రింది హాల్ లో, మేడమీది గదులలో జరిగాయి. ఈ రిహార్సల్స్ సమయంలో ఆ పాటలు పాడిన నేపథ్య గాయనీమణులైన శ్రీమతి పి.లీల, జిక్కి, ఎ.పి.కోమల, మాధవపెద్ది మొదలైనవారిని తరచూ చూస్తూ, వారు పాట నేర్చుకుంటూ పాడే విధానాన్ని గమనిస్తూండేవాడిని.

భక్త రఘునాథ్ చిత్ర జయాపజయాలు పరంగా కాకుండా అందులోని ఉత్తమమైన, శ్రావ్యమైన సంగీతపరంగా, ఆ సినీమానిర్మాణంలో చోటుచేసుకున్న కొన్ని అంశాలవలన, ఆ చిత్రం ఎప్పటికీ నాకు మరపురానిది, అత్యంత ఆత్మీయమైనది. అవేమిటో మీకే తెలుస్తుంది.

భక్త రఘునాథ్ చిత్ర గీతాల రికార్డింగ్, రీరికార్డింగ్, ఇండోర్ షూటింగ్ వాహినీ స్టూడియోలోనే జరిగింది. మాస్టారు తన దైనందిక కార్యకలాపాలు చూసుకుంటూనే ఈ చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూండేవారు.

1959లో మొదలైన "భక్త రఘునాధ్" 1960 లో విడుదలయింది. ఈ సినీమాలో మొత్తం 14 పాటలు, ఓ 8 పద్యాలు, శ్లోకాలు ఉన్నాయి. వీటిలో చాలా పాటలు, పద్యాలు హెచ్ ఎమ్ వి గ్రామఫోన్ రికార్డులుగా విడుదలయాయి. ఈ పాటలలో చాలా భాగం వేసవి శెలవులలోనే రికార్డింగ్ పూర్తిచేసుకోవడంవలన నేను చాలా పాటల రికార్డింగ్ కు, తరువాత రీరికార్డింగ్ కు వెళ్ళడం జరిగింది. అందులో నాకు బాగా గుర్తుండిపోయినవి - 
"నీ గుణగానాము", "తరలిపోయే తెరువరీ", "సంసారజలధి", "ఈ మరపేలా ఈ వెరపేలా", "రామహరే కృష్ణహరే", "గోపాల దయసేయరా"పాటలు.


ఈ చిత్ర నిర్మాణ సమయంలో సాలూరు నుండి మా ప్రభూ చిన్నాన్నగారి అబ్బాయి ప్రసాద్ (పి.వి.ఎన్.ఎస్.వి) కూడా శెలవులకు మద్రాస్ మొదటిసారిగా వచ్చాడు. అతను అప్పుడు ఇప్పుడు కూడా ఘంటసాలవారి పరమ వీర భక్తుడు. ఘంటసాల మాస్టారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చాలా జిజ్ఞాసతో సేకరించే అలవాటుకలవాడు. అతను మద్రాస్ వచ్చిన సమయంలో నెం.35, ఉస్మాన్ రోడ్ కల్యాణశోభతో వెలిగిపోతూండేది. సకలజనాల రాకపోకలతో కోలాహలంగా వుండేది.

ఒక పెద్ద భోషాణం పెట్టిలాటి స్పూల్ టేప్ రికార్డర్ ( జర్మన్ మేక్ గ్రండిగ్  టేప్ రికార్డర్ )లో "భక్త రఘునాథ్" పాటలు, పద్యాలు, షూటింగ్ సమయంలో రికార్డ్ చేసిన డైలాగ్స్  ఇంట్లోని ఆడవారికి వినిపిస్తూండేవారు ప్రొడ్యూసర్ సదాశివుడు, మేనేజర్ సుబ్బు, ఎడిటర్లు బి. హరినారాయణ, దేవేంద్రలు. అలాగే షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటో ఆల్బమ్స్ అన్నీ మేడమీద గదుల్లో బీరువాలలో పడివుండేవి. ఆ ఫోటోలను భక్తిపూర్వకంగా, అపురూపంగా చూడడంలో, టేప్ రికార్డర్ లో పాటలు, మాటలు  వినడంలో మా ప్రసాద్, నేనూ పోటీలు పడేవాళ్ళం. అతను మద్రాస్ లో ఉన్న సమయంలోనే "నీ గుణ గానము" పాట షూటింగ్ వాహినీలో జరిగింది. మేమూ వెళ్ళాము. పూరీ జగన్నాధస్వామి ఆలయం సెట్ వేసి దేవుడి ముందు షూటింగ్. జమున, కాంతారావు, మరికొంతమంది ఎక్స్ట్రాలు (వారిని ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అంటున్నారు) మేకప్ వేసుకొని సిద్థంగా ఉన్నారు.. ఎంతసేపు గడచినా షూటింగ్ ప్రారంభంకాలేదు. లైటింగ్ ఎడ్జస్ట్మెంట్ తోనే సరిపోయింది. ఆ పాట షూటింగ్ చూడకుండానే బయటకు వచ్చేసాము.

ఎడిటర్ దేవేంద్రనాధ్ తండ్రిగారు వాహినీలో పనిచేసేవారు. ఈ దేవేంద్రకు ఆ రోజుల్లో కొంచెం అక్కినేని నాగేశ్వరరావు పోలికలుండేవి. ఆకారణం చేతనేమో ఈయన 'పెళ్ళి చేసి చూడు' సినీమాలో రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద ఎన్టీఆర్, జి.వరలక్ష్మిల ముందునుండి నల్లకళ్ళద్దాలతో స్టైల్ గా నడిచెళుతూ కనిపిస్తారు. దేవేంద్ర తర్వాత చాలా సినీమాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఎడిటర్ హరినారాయణ కూడా ఎడిటర్ గా తరువాత కొన్ని సినీమా లకు డైరక్టర్ గా పనిచేశారు. అలాటివాటిలో ఒకటి రెండు సినిమాలకు మాస్టారు సంగీతం కూడా నిర్వహించేవారు. పామర్తిగారు, హరి, దేవేంద్ర, సుబ్బు, జెవి రాఘవులు వీరంతా మాస్టారింట్లో సొంత మనుషుల్లాగే ఏ అరమరికలు లేకుండా మసిలేవారు. వీరందరి కుటుంబాలతో సావిత్రమ్మగారికి మంచి స్నేహసంబంధాలుండేవి. ఒకరిళ్ళకు ఒకరు వచ్చిపోతూండేవారు.  

సినీ పరిశ్రమ అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్. సాంకేతికంగా  అంత అభివృద్ధి చెందని ఆరోజుల్లో సాంకేతిక నిపుణుల జీవితాలు చాలా దుర్భరంగా వుండేవి. చిత్రనిర్మాణం త్వరగా ముగించాలనే తపనలో రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని కష్టపడేవాళ్ళు. సమయానికి సరైన ఆహారం వుండేదికాదు. వాటి ప్రభావం వారి ఆరోగ్యాలమీద పడేది. సినీమాలలో పనిచేసేవాళ్ళలో అధిక సంఖ్యాకులు డైబిటీస్, బి.పి, హార్ట్ కంప్లైంట్, విజన్ ప్రోబ్లమ్స్ కు గురి అయేవారు. అందుకు, సక్రమమైన ఆహారవిహారాలు, పనిచేసే చోట సరైన వసతులు లభించక అనారోగ్యాలకు గురైయ్యేవారు. సుబ్బు , దేవేంద్ర కూడా కొంత వయసు మీరాక తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని విన్నాను. 

ఘంటసాలవారిది నిండుమనసు. బంధు, స్నేహప్రీతి మెండు. తన ఆశ్రితులందరికీ ఏదో విధంగా ప్రోత్సాహం , సహాయం చేయాలని ఆశించేవారు. మాస్టారు తీసిన మూడు సినీమాలలోనూ నటులు కాని తన సన్నిహితులచేత ఏవో వేషాలు వేయించి వారికి ఆనందం కలిగించి తానూ ఆనందపడేవారు. 

మొదటిచిత్రం 'పరోపకారం' లో గాయకుడు బి.గోపాలంగారి చేత, నృత్య కళాకారుడు వెంపటి చిన సత్యంగారి చేత వేషాలు వేయించి వారికి తాను పాటలు పాడారు.

రెండవ సినీమా 'సొంతవూరు' లో రాజసులోచన కు హీరోయిన్ హోదా కల్పించారు. ఆ సినీమా లో మా నాన్నగారు( పి.సంగీతరావు) కూడా సి.ఎస్.ఆర్ తో ఒక సన్నివేశంలో కనిపిస్తారు. ఏవో రెండు మూడు డైలాగ్స్ వున్నాయి. 

ఈ మూడవ సినీమా భక్త రఘునాథ్ లో కూడా ఒక నృత్య సన్నివేశంలో వీణవాయిస్తూ మా నాన్నగారు కనిపిస్తారు. "జయమురళీలోలా గోపాలా" అనే జావళీని మాస్టారు అద్భుతంగా స్వరపర్చగా ఏపి కోమల పాడారు.

 తెరమీద నర్తకిగా మణి అనే కొత్త అమ్మాయికి అవకాశం కల్పించారు. మణి, స్వర్ణ ఇద్దరూ అక్కచెల్లెళ్ళు. చక్కటి నృత్యకళాకారులు. భక్త రఘునాధ్ లో పాటకి నాట్యం చేసినది మణే. నాకు బాగా గుర్తు. కానీ పాటలపుస్తకంలో మణి పేరుకు బదులుగా స్వర్ణ అని ఎక్కడో చూశాను. వీరిద్దరూ తరువాత ఎన్టీఆర్ నిర్మించిన 'శ్రీ సీతారామ కల్యాణం'లో సీత, శూర్ఫణకలుగా అవకాశాలు పొంది గుర్తింపబడ్డారు. అందులోని మణియే తర్వాత తర్వాత గీతాంజలిగా  బహుభాషా చిత్రనటిగా పేరుపొందారు. పాపం! ఆమె నటించిన మాస్టారి "భక్త రఘునాధ్" ఆవిడకు గుర్తులేదు. ఎన్టీఆర్ సినీమా ద్వారానే చిత్రసీమకు వచ్చినట్లు చెప్పుకునేవారు. పరాజయం పొందిన సినీమాలో నటించానని చెప్పుకోవడం ఒక నామోషి కూడా కావచ్చు. అలాగే భక్త రఘునాథ్ లో నటించిన మరొక కొత్త నటి కమలకుమారి. పేకేటి శివరాం పరిచయం చేశారు. ఆ నటీమణే జయంతిగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఆవిడా అంతే. 

ఘంటసాల మాస్టారు తమ గురువు (పట్రాయని సీతారామశాస్త్రి)గారిని గౌరవించే రీతిలో "భక్త రఘునాథ్"లో గురువుగారు చదివే  చాటుపద్యం "మరచుట లేదు నీ స్మరణ" ను తాను పాడారు. ఈ పద్యాన్ని రఘునాథ్ పాత్రధారి కాంతారావు మీద చిత్రీకరించారు. ఈ పద్యం కాగానే "భవ తాపాలు బాపే నీ పాదయుగళి" పాట ప్రారంభమవుతుంది.



ఈ చాటుపద్య కవి ఎవరో తెలియదు. కానీ మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు ఈ పద్యాన్ని విధిగా తమ కచేరీలలో పాడేవారని విన్నాను. ఆ విధంగా తమ గురువుగారు పాడుతూండగా విని ఘంటసాల మాస్టారు నేర్చుకున్నారు. గురువుగారు తన శిష్యులెవరికీ తన స్వీయ కీర్తనలు నేర్పించి ప్రచారం పొందే ప్రయత్నం చేయలేదు. ఆ శిష్యులంతా గురువుగారి కచేరీలు విని గ్రహించినవి కొన్ని కృతులు మాత్రమే.


గురువుగారు తరచు పాడే చాటువు 
"మరచుటలేదు నీ స్మరణ..." సంగీతరావుగారి గాత్రంలో వినండి
 
ఘంటసాలవారి భక్త రఘునాథ్ మద్రాస్ శివార్లలోని తిరుప్పొరూర్ మురుగన్ ఆలయ పరిసర వీధులలో చిత్రీకరించారు. అక్కడి ఆలయంలో పెళ్ళిచేసుకున్న నవ దంపతులతో ఒక పెళ్ళి బృందం ఊరేగింపుగా వస్తూండగా మదమెక్కిన ఒక ఏనుగును పాటపాడుతూ భక్త రఘునాథ్  ఆపు చేసే దృశ్యం చిత్రీకరణ జరిగింది. ఆ షూటింగ్ రెండు మూడురోజులు సాగింది. ఔట్ డోర్ అవడం మూలాన, నేను చిన్నవాడిని కావడం వలన, వెళ్ళాలని కోరిక కలిగినా అది సాగదని తెలిసి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆ నవ దంపతులలో  కొత్త పెళ్ళికొడుకుగా రెడ్డి (పూర్తిపేరు గుర్తులేదు) వేషం కట్టాడు. 

(రెడ్డి తర్వాత కాలంలో నటి వాసంతి కి కారు డ్రైవర్ గా పనిచేశాడు. మాస్టారి కారు డ్రైవర్ గోవిందు ఎప్పుడైనా శెలవుపెడితే ఆపద్ధర్మ డ్రైవర్ గా ఈ రెడ్డి వచ్చేవాడు. ఎర్రగా పొడుగ్గా నొక్కులజుత్తుతో ఉండేవాడు. సినీమా నటుడు కావాలని వచ్చాడనుకుంటాను. చివరికి నటిమణి డ్రైవర్ గా సరిపుచ్చుకోవలసి వచ్చింది. వాసంతి లా కాలేజీలో చదువుతూ సినిమా నటిగా అవకాశాలు రావడంతో లా చదువు మధ్యంతరంగా ఆపేసినట్లు తమిళ పత్రికలలో చదివాను. ఆ వాసంతి, బి.ఏ., మంచి మనసులు చిత్రంలో నటించిన సంగతి మీకు తెలిసినదే. ఆవిడ కొన్నాళ్ళు ఉస్మాన్ రోడ్ లోనే మా ఇంటికి, పానగల్ పార్క్ కు మధ్య నాదముని స్ట్రీట్, గోవింద్ స్ట్రీట్ లమధ్య వుండే మూడు నాలుగు పెంకుటిళ్ళలో ఒక ఇంటిలో నివాసముండేది.  ఒక సినీమానటి అలాటి సామాన్యమైన ఇంటిలో అద్దెకుండడమా? అని నాకు ఆశ్చర్యంగా వుండేది. అయితే ఆకాలంలో ఆపాటి నటీమణులకు యిచ్చే పారితోషికం అంతేమరి. వారికొచ్చే ఆదాయంతో అలాటి చిన్న ఇళ్ళలోనే గడపవలసి వచ్చేది. అనేక సినీమాలలో నటించాక ఒక డి.ఎమ్.కె లీడర్ ను వివాహం చేసుకొని సినీమాలకు గుడ్ బై చెప్పేసింది).

సరే. మళ్ళీ మన షూటింగ్ గజేంద్రుడిని చూద్దాము.

సినీమా లో ఈ సీన్ లో ఒక పెళ్ళి బృందంమీద ఒక మదమెక్కిన ఏనుగు భీభత్సం సృష్టిస్తే భక్తుడైన రఘునాథ్ వచ్చి వారిని రక్షించాలి. అక్కడ ఒక పాట ఉంది. "ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా" మాస్టారు చాలా ఉద్వేగభరితంగా, భక్తి ప్రపత్తులు ఉట్టిపడేలా పైస్థాయిలో సాగేపాట. 

ఇటువంటి సిట్యుయేషనల్ సాంగ్స్ ను డైరక్టర్ చెప్పే సన్నివేశాన్ని తన మనసులో ఊహించుకుంటూ సంగీతదర్శకుడు హెవీ ఆర్కెష్ట్రాను ఉపయోగించి ఒక అద్భుతమైన వరసను సమకూరుస్తారు. అంతకు పదిరెట్లు భావావేశంతో ఘంటసాల మాస్టారు వంటి గాయకులు గానంచేసి ఆ పాటను సజీవం చేస్తారు. అయితే అంత అద్భుతంగా రూపొందిన పాట సీనీమాలో మరింత ఆకర్షణీయంగా జనామోదం పొందాలంటే సన్నివేశ చిత్రీకరణ బాగుండాలి. అందుకు దర్శకుడి ప్రతిభ, నటీనటుల నటనావైదుష్యం, సాంకేతికవర్గం నైపుణ్యం, పరిసరాలు, వాతావరణం అన్నీ సహకరించాలి. 

షూటింగ్ ముగించుకొని రాత్రి ఎప్పుడో ఇళ్ళకు చేరి ఆ పాట షూటింగ్ లో జరిగిన ఫార్స్ ను  రామచంద్రరావు, సుబ్బు, తాతగారు (సదాశివుడు), హరి పగలబడి నవ్వుతూ ఇంట్లో వివరిస్తూంటే నాకు ఏదోలా అనిపించేది. ఇంతకూ విషయమేమిటంటే, ఘంటసాల మాస్టారి గాన ప్రతిభకు తగ్గట్టుగా, సముద్రాల వారి ఊహాపోహలకు తగినట్లుగా, ఛాయాగ్రహకుల నైపుణ్యాన్ని తలదన్నేలా ఉండవలసిన ఏనుగు ఆ సన్నివేశంలో ఏమాత్రమూ సహకరించలేదట. "ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా" అని మాస్టారి గొంతు హైపిచ్ లో వినిపిస్తూంటే, మరో పక్కనుండి పాటకు లిప్ మూమెంట్స్ ఇస్తూ  హిరో  కాంతారావు శరవేగంగా వస్తూంటే భీభత్సాన్ని సృష్టించి, ఔట్ డోర్లో ఒక కలకలం సృష్టించవలసిన గజరాజు మాత్రం ఒక్క ఇంచ్ కూడా ముందుకు అడుగెయ్యలేదట. ఉన్నచోటనే కదలకుండా పెట్టిన ఆహారం తాపీగా నములుతూ పాట వింటోందట. పక్కనున్న మావటివాడు అంకుశంతో ఎంత పొడిచినా ఆ ఏనుగులో చలనమేలేదట. అలాటి ఏనుగును ఎక్కడనుండి పట్టుకొచ్చారని దర్శక నిర్మాతలు విసుగుచెందారట. అయితే ఆ ఏనుగు సీజన్డ్ ఆర్టిస్టేనని అప్పటికే అనేక సినీమాలలో నటించిందని ప్రొడక్షన్ మేనేజర్ సుబ్బు వివరణ. ఏమైతేనేం ఒక రోజు ఎగిరిపోయింది. ఔట్ డోర్ లో ఎండాపోయింది. హీరో గారి ఒకరోజు కాల్షీట్ వేస్టయింది. ఆ మర్నాడు అదే తంతు. చివరికి హీరో షాట్లు, పెళ్ళిబృందం షాట్లు ముగించారట. ఏనుగు షాట్లు తర్వాత తీసారట. అప్పుడు కూడా ఆ ఏనుగు దయతల్చలేదు. సినీమాలో ఏనుగు నడిచి వస్తూంటే పక్కనే కనీకనిపించకుండా ఆ మావటివాడు కనిపిస్తాడు. ఘంటసాలవారు, డైరెక్టర్ సముద్రాల వారు ఆశించనట్లుగా పాట రూపొందలేదు. ఏనుగు అందరిని నిరాశపర్చి తట్టెడు పేడను మాత్రం మిగిల్చిందని షూటింగ్ కు వెళ్ళిన మావాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేసుకుంటూ నవ్వుకున్నారు, అంతకుమించి చేయగలిగింది ఇంకేమీలేక. తర్వాత, ఎడిటింగ్ టేబిల్ దగ్గర ఆ సీన్ ను ఏదో మేనేజ్ చేశారు.

సినీమాలలో సన్నివేశ చిత్రీకరణలు ఇలాగేవుంటాయి. చెప్పేదొకటి,  అనుకునేదొకటి, అయేది మరొకటి.  చివరకు నిర్మాతే బోల్తా కొడతాడు.

ఘంటసాల మాస్టారి భక్త రఘునాథ్ లో కనిపించే మరో ఆత్మీయ వ్యక్తి 'తమ్ముడు' కృష్ణ, మా అందరికీ 'గుండు'మామయ్య. మాస్టారింటి చీఫ్ ఛెఫ్. (నిజమనుకునేరు! కాదండోయ్!)

ఆ వివరాలతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాము.

         ...సశేషం.

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.