visitors

Wednesday, November 5, 2025

ఘంటసాల భగవద్గీత శ్లోకములు రాగవిశ్లేషణ భాగము -4 - జోగియా


ఘంటసాల భగవద్గీత శ్లోకములు రాగవిశ్లేషణ భాగము - 4 - జోగియా

అమరగాయకుడు శ్రీ ఘంటసాలగారి భగవద్గీత గానానికి నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావుగారు 2008 జనవరిలో చేసిన ఈ రాగవిశ్లేషణను మిత్రులు శ్రీ నూకల ప్రభాకర్ గారి సహకారంతో ఆడియో రూపంలో నిక్షిప్తం చేసాం. 

నవంబర్ 2, 2025 న నాన్నగారి 105వ జన్మదినం సందర్భంగా ఈ ఆడియోను సం'గీతా'భిలాషులతో పంచుకుంటున్నాం.

ఘంటసాల గానం చేసిన గీతాగానంలో ఉపయోగించిన రాగాలననుసరించి ఆయన గానం చేసిన, లేదా ఆయన స్వరపరచిన వివిధ సినీ గీతాలను కూడా ఈ ఆడియో భాగాలలో పొందుపఱచేము. అయితే ఆయా రాగాలు రసభావములకనుగుణ్యంగా అన్యస్వర ప్రయోగాలతోను ఇతర రాగముల ఛాయా స్వరములతోను కూడా అవి పరిగ్రహించడి ఉన్నవి. 88 ఏళ్ళ వయసులో ఈ రికార్డింగ్ జరిగిననాటి నాన్నగారి గాత్ర అభ్యంతరాలను రసజ్ఞులైన శ్రోతలు సహృదయంతో గ్రహించగలరు. 

Ghantasala Bhagavadgita San'gita'amrutham - Raagarasasphoorthi - a clarifcation

ఘంటసాల సం'గీతా'మృతం - రాగరసస్ఫూర్తి - ఒక స్పష్టీకరణ

This critical analysis is intended to initiate the younger generation into the field of classical music and the choice of Sri Ghantasala's Bhagavadgita is apt as it happens to be a repository of vareity of raagas suitable for the purpose of serious study of application of Carnatic and Hindusthani raagas to various situations and moods. The reasearch author was closely associated and involved in the original creation and intended this research work to help the practitioners, amateurs and connoisseurs alike in appreciating the intricacies of the raagas dealt therein. The reproduction of the rendition of Sri Ghantasala's Bhagavadgita slokas is solely for the purpose of appreciating the similarities and dissimilarities in the raagas applied in his work and other contemporary music.

 పట్రాయని వేణు గోపాలకృష్ణ

భాగం 4 -  జోగియా -  శ్లోకం 5 - వాసాంసి జీర్ణాని యథా విహాయ  (2.22), 
శ్లోకం 6 - నైనంఛిందంతి శస్త్రాణి (2.23) -  ఏ నిమిషానికి ఏమి జరుగునో.
 




Tuesday, November 4, 2025

ఘంటసాల భగవద్గీత శ్లోకములు రాగవిశ్లేషణ భాగము -3 - దర్బారి కానడ


ఘంటసాల భగవద్గీత శ్లోకములు రాగవిశ్లేషణ భాగము -3 - దర్బారి కానడ

అమరగాయకుడు శ్రీ ఘంటసాలగారి భగవద్గీత గానానికి నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావుగారు 2008 జనవరిలో చేసిన ఈ రాగవిశ్లేషణను మిత్రులు శ్రీ నూకల ప్రభాకర్ గారి సహకారంతో ఆడియో రూపంలో నిక్షిప్తం చేసాం. 

నవంబర్ 2, 2025 న నాన్నగారి 105వ జన్మదినం సందర్భంగా ఈ ఆడియోను సం'గీతా'భిలాషులతో పంచుకుంటున్నాం.

ఘంటసాల గానం చేసిన గీతాగానంలో ఉపయోగించిన రాగాలననుసరించి ఆయన గానం చేసిన, లేదా ఆయన స్వరపరచిన వివిధ సినీ గీతాలను కూడా ఈ ఆడియో భాగాలలో పొందుపఱచేము. అయితే ఆయా రాగాలు రసభావములకనుగుణ్యంగా అన్యస్వర ప్రయోగాలతోను ఇతర రాగముల ఛాయా స్వరములతోను కూడా అవి పరిగ్రహించడి ఉన్నవి. 88 ఏళ్ళ వయసులో ఈ రికార్డింగ్ జరిగిననాటి నాన్నగారి గాత్ర అభ్యంతరాలను రసజ్ఞులైన శ్రోతలు సహృదయంతో గ్రహించగలరు. 

Ghantasala Bhagavadgita San'gita'amrutham - Raagarasasphoorthi - a clarifcation

ఘంటసాల సం'గీతా'మృతం - రాగరసస్ఫూర్తి - ఒక స్పష్టీకరణ

This critical analysis is intended to initiate the younger generation into the field of classical music and the choice of Sri Ghantasala's Bhagavadgita is apt as it happens to be a repository of vareity of raagas suitable for the purpose of serious study of application of Carnatic and Hindusthani raagas to various situations and moods. The reasearch author was closely associated and involved in the original creation and intended this research work to help the practitioners, amateurs and connoisseurs alike in appreciating the intricacies of the raagas dealt therein. The reproduction of the rendition of Sri Ghantasala's Bhagavadgita slokas is solely for the purpose of appreciating the similarities and dissimilarities in the raagas applied in his work and other contemporary music.

 పట్రాయని వేణు గోపాలకృష్ణ

భాగం 3 - దర్బారీకానడ - శ్లోకం 3 - అశోచ్యానన్వశోచిస్త్వం (2.11),

శ్లోకం 4 - దేహినోస్మిన్ యథాదేహే (2.13) - జగదభి రాముడు



 

 

 



Monday, November 3, 2025

ఘంటసాల భగవద్గీత శ్లోకములు రాగవిశ్లేషణ భాగము -2 - ఈశామనోహరి



ఘంటసాల భగవద్గీత శ్లోకములు రాగవిశ్లేషణ భాగము -2 - ఈశామనోహరి

అమరగాయకుడు శ్రీ ఘంటసాలగారి భగవద్గీత గానానికి నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావుగారు 2008 జనవరిలో చేసిన ఈ రాగవిశ్లేషణను మిత్రులు శ్రీ నూకల ప్రభాకర్ గారి సహకారంతో ఆడియో రూపంలో నిక్షిప్తం చేసాం. 

నవంబర్ 2, 2025 న నాన్నగారి 105వ జన్మదినం సందర్భంగా ఈ ఆడియోను సం'గీతా'భిలాషులతో పంచుకుంటున్నాం.

ఘంటసాల గానం చేసిన గీతాగానంలో ఉపయోగించిన రాగాలననుసరించి ఆయన గానం చేసిన, లేదా ఆయన స్వరపరచిన వివిధ సినీ గీతాలను కూడా ఈ ఆడియో భాగాలలో పొేందుపఱచడం జరిగిెంది. అయితే ఆయా రాగాలు రసభావములకనుగుణ్యంగా అన్యస్వర ప్రయోగాలతోను ఇతర రాగముల ఛాయా స్వరములతోను కూడా అవి పరిగ్రహించడం జరిగింది. 88 ఏళ్ళ వయసులో ఈ రికార్డింగ్ జరిగిననాటి నాన్నగారి గాత్ర అభ్యంతరాలను రసజ్ఞులైన శ్రోతలు సహృదయంతో గ్రహించగలరు. 

Ghantasala Bhagavadgita San'gita'amrutham - Raagarasasphoorthi - a clarification

ఘంటసాల సం'గీతా'మృతం - రాగరసస్ఫూర్తి - ఒక స్పష్టీకరణ

This critical analysis is intended to initiate the younger generation into the field of classical music and the choice of Sri Ghantasala's Bhagavadgita is apt as it happens to be a repository of vareity of raagas suitable for the purpose of serious study of application of Carnatic and Hindusthani raagas to various situations and moods. The reasearch author was closely associated and involved in the original creation and intended this research work to help the practitioners, amateurs and connoisseurs alike in appreciating the intricacies of the raagas dealt therein. The reproduction of the rendition of Sri Ghantasala's Bhagavadgita slokas is solely for the purpose of appreciating the similarities and dissimilarities in the raagas applied in his work and other contemporary music.

 పట్రాయని వేణు గోపాలకృష్ణ


భాగం 2 - ఈశామనోహరి - శ్లోకం 2 - నకాంక్షే విజయం కృష్ణ (1.32 - అధ్యాయం 1 శ్లోకం 32)



Sunday, November 2, 2025

ఘంటసాల భగవద్గీత శ్లోకములు రాగ విశ్లేషణ భాగము - 1 పంతువరాళి

 
ఘంటసాల భగవద్గీత శ్లోకములు రాగ విశ్లేషణ భాగము - 1 పంతువరాళి

అమరగాయకుడు శ్రీ ఘంటసాలగారి భగవద్గీత గానానికి నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావుగారు 2008 జనవరిలో చేసిన ఈ రాగవిశ్లేషణను మిత్రులు శ్రీ నూకల ప్రభాకర్ గారి సహకారంతో ఆడియో రూపంలో నిక్షిప్తం చేసాం. 

నవంబర్ 2, 2025 న నాన్నగారి 105వ జన్మదినం సందర్భంగా ఈ ఆడియోను సం'గీతా'భిలాషులతో పంచుకుంటున్నాం.

ఘంటసాల గానం చేసిన గీతాగానంలో ఉపయోగించిన రాగాలననుసరించి ఆయన గానం చేసిన, లేదా ఆయన స్వరపరచిన వివిధ సినీ గీతాలను కూడా ఈ ఆడియో భాగాలలో పొందుపఱచేము. అయితే ఆయా రాగాలు రసభావములకనుగుణ్యంగా అన్యస్వర ప్రయోగాలతోను ఇతర రాగముల ఛాయా స్వరములతోను కూడా అవి పరిగ్రహించడి ఉన్నవి. 88 ఏళ్ళ వయసులో ఈ రికార్డింగ్ జరిగిననాటి నాన్నగారి గాత్ర అభ్యంతరాలను రసజ్ఞులైన శ్రోతలు సహృదయంతో గ్రహించగలరు. 

Ghantasala Bhagavadgita San'gita'amrutham - Raagarasasphoorthi - a clarification

ఘంటసాల సం'గీతా'మృతం - రాగరసస్ఫూర్తి - ఒక స్పష్టీకరణ

This critical analysis is intended to initiate the younger generation into the field of classical music and the choice of Sri Ghantasala's Bhagavadgita is apt as it happens to be a repository of vareity of raagas suitable for the purpose of serious study of application of Carnatic and Hindusthani raagas to various situations and moods. The reasearch author was closely associated and involved in the original creation and intended this research work to help the practitioners, amateurs and connoisseurs alike in appreciating the intricacies of the raagas dealt therein. The reproduction of the rendition of Sri Ghantasala's Bhagavadgita slokas is solely for the purpose of appreciating the similarities and dissimilarities in the raagas applied in his work and other contemporary music

 పట్రాయని వేణు గోపాలకృష్ణ


భాగం 1 - పంతువరాళి - శ్లోకం 1- పార్థాయ ప్రతిబోధితాం (అథ ధ్యానమ్) - దినకరా శుభకరా.







 

Sunday, February 27, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - డెభైయవ భాగం

27.02.2022 - ఆదివారం భాగం - 70:

అధ్యాయం 2  భాగం 69 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

కర్ణాటక సంగీత ముమూర్తులలో అగ్రజులు, అగ్రగణ్యులు అయిన సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారు 1847 పుష్య మాస బహుళ పంచమి తిథినాడు శ్రీరామునిలో ఐక్యమైనారు. అదే బహుళ పంచమి నాడు (మాఘ మాసం) 1974 లో త్యాగయ్యగారి శిష్య, ప్రశిష్య పరంపర క్రమంలోనుండి వచ్చి కర్ణాటక సంగీతంలో నిష్ణాతుడై, నవ్య లలిత సంగీత నిర్మాతగా సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానం పొందిన ఘంటసాల వేంకటేశ్వర రావుగారు కలియుగదైవమైన తిరుపతి వేంకటేశ్వరుని స్మరిస్తూనే ఆ దైవంలో కలిసిపోయారు.

భారతీయ చలనచిత్ర వినీలాకాశంలో ఘంటసాల అనే విశిష్ట తార నేల రాలకుండా మింటికెగిసి ధృవతారగా వెలుగొందుతూ తన అపురూప రాగాలను ప్రకృతినంతా నింపుతూ సంగీతప్రియులను అలరిస్తోంది.

1944 నుండి 1974 వరకు సుమారు మూడు దశాబ్దాల కాలం తెలుగు చలనచిత్ర సినీమా సంగీతరంగంలో ఒక స్వర్ణయుగ సృష్టికర్తగా, ఒక శకపురుషునిగా  కోట్లాది ప్రజల ప్రేమాభిమానాలను పొందిన విశిష్ట గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాలవారు. రెండున్నర దశాబ్దాలకు పైగా  చిత్రసంగీత రంగంలో  అగ్రస్థానం అధిష్టించిన ఘంటసాలవారి సుదీర్ఘ సినీజీవనయానంలో వారితో కలసి పయనించిన కళాకారులు అసంఖ్యాకం.

ఆ కళాకారుల పురోభివృద్ధికి ఘంటసాల మాస్టారి అపూర్వ గాన ప్రతిభ ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఎంతో దోహదపడింది.  ఇది అందరూ అంగీకరించిన సత్యం. వివిధ భాషలకు చెందిన ఇన్నివందల మంది   అగ్రశ్రేణి కళాకారులందరితో  సఖ్యతతో అజాతశతృవుగా కలసిమెలసి పనిచేసిన ఏకైక గాయక, సంగీతదర్శకుడు ఘంటసాల అంటే అతిశయోక్తి కానేరదు.  నిజం చెప్పాలంటే ప్రపంచస్థాయిలోనే ఇది ఒక గొప్ప రికార్డ్ గా నమోదు కావలసి వుంది. ఇంతమంది సంగీతదర్శకులతో, గాయనీగాయకులతో, వాద్యకళాకారులతో,  నటీనటులతో, సాంకేతిక నిపుణులతో తలలో నాలుకలా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందిన సంగీత స్రష్ట ఘంటసాల.

1944 నుండి 1974 వరకు సుమారు 1226 తెలుగు సినీమాలు (డబ్బింగ్ తో సహా) విడుదలైనట్లు ఒక అంచనా. అందులో  గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాలవారి భాగస్వామ్యం 656 చిత్రాలు. ఈ సమాచారమే  సంపూర్ణం, సమగ్రం అని చెప్పలేము. దాదాపు మరో 110 చిత్రాలకు సంబంధించిన వివరాలు అలభ్యం. అలాగే, నిర్మాణం మధ్యలో ఆగిపోయినవి,  ఎవరికీ తెలియక కాలగర్భంలో కలిసిపోయిన చిత్రాలు మరెన్నో. ఇవన్నీ లభ్యమైతే ఘంటసాలవారి ఆణిముత్యాలు మరికొన్ని వందలు లభ్యమయ్యేవి.

మూడు దశాబ్దాల కాలంలో ఘంటసాలవారు ఆలపించిన గీతాలు 5000 కు మించి వుండవనే అనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో వున్న గణాంకాల ప్రకారం ఘంటసాల మాస్టారికి సంబంధించిన వివరాలు ఈ క్రింద పొందుపరస్తున్నాను. 

నా యీ సేకరణకు (యథాతథంగా మాత్రం కాదు)  శ్రీ చల్లా సుబ్బారాయుడి గారి 'ఘంటసాల గాన చరిత'  పుస్తకం ఎంతగానో సహకరించింది.  శ్రీ చల్లా సుబ్బారాయుడుగారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి పుస్తకంలోని అమూల్య సమాచారాన్ని మరింత విస్తృతపర్చడానికి చొరవతీసుకుంటున్నందుకు శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు అన్యధా భావించరని తలుస్తాను. 

💐

ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో వచ్చిన తెలుగు 
సినిమాలు:




సంగీత దర్శకుడు సి.ఆర్ సుబ్బురామన్ కు సహాయకుడిగా పనిచేసిన తొలిచిత్రం :
1. రత్నమాల 1948

ఘంటసాలవారు సహ సంగీత దర్శకులుగా పాటలు స్వరపర్చిన చిత్రాలు :
1. బాలరాజు 1948
2. రక్షరేఖ 1949
3. వాలి సుగ్రీవ 1950
4. చంద్రవంక 1951
5. నిర్దోషి 1951
6. పూలమాల 1973
7. సతీ సావిత్రి 1978 (రెండు పాటలు, ఒక శ్లోకం మాత్రం)
8. వస్తాడే మా బావ 1978 (1 పాట మాత్రం)

ఘంటసాల గారు సంగీతం నిర్వహించిన
అనువాద చిత్రాలు :
1. భాగ్యవంతులు 1962
2. మమకారం  1963
3. మహావీర భీమసేన 1963

ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలోని తమిళం సినీమాలు :

1. పాతాళ భైరవి
2. కళ్యాణం పణ్ణి ప్పార్
3.  పరోపకారం
4. చంద్రహారం
5.గుణసుందరి
6. కల్వనిన్ కాదలి
7. ఎల్లాం ఇన్బమయమ్
8. నిరపరాధి
9. అమరగీతమ్
10. మాయాబజార్
11. వాళ్కై ఒప్పందం
12. లవకుశ
13. మణిదన్ మారవిల్లై

ఘంటసాలవారు మ్యూజిక్ డైరక్షన్ లో వచ్చిన కన్నడం సినీమాలు :

1. మాయాబజార్
2. గిరిజాకళ్యాణం
3. మోహినీ రుక్మాంగద
4. లవకుశ
5. వాల్మీకి
6. మదువె మాడి నోడు
 7. వీరకేసరి
8.  నన్న తమ్మ 

ఘంటసాల మాస్టారి స్వియ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొత్తం సినీమాలు: 
తెలుగు :   76
జంటగా :     8
డబ్బింగ్:      3
తమిళం:    13
కన్నడం :      8

మొత్తం : 108

ఘంటసాలవారు సంగీత దర్శకత్వం వహించిన మొత్తం 108 సినీమాలలో సుమారు 1000 ఆణిముత్యాలవంటి పాటలను స్వరపర్చారు.

స్వీయ సంగీతదర్శకత్వంలో వచ్చిన 86 తెలుగు సినీమాలలో  ఘంటసాలవారు పాడిన పాటలు :                    455
గ్రామఫోన్ కంపెనికి,
ఆలిండియా రేడియోకు
పాడిన పాటలు,పద్యాలు.         90

చరమదశలో భారతజాతికి
పాడి సమర్పించిన భగవద్గీత
శ్లోకాలు.                             .   108

మిగిలిన దాదాపు 400/500 పాటలను
ఇతర గాయనీగాయకులు ఆలపించారు.

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో పాడిన గాయకులు :

1.చిత్తూరు వి నాగయ్య; 2.శివరావు; 3.అక్కినేని నాగేశ్వరరావు; 4.ఎమ్.ఎస్.రామారావు; 5.ఎ.ఎమ్.రాజా; 6.మాధవపెద్ది; 7.పిఠాపురం నాగేశ్వరరావు; 8.పి.బి.శ్రీనివాస్; 9.రేలంగి; 10.జె.వి.రాఘవులు; 11.టి.ఎమ్.సౌందరరాజన్; 12.శీర్కళి గోవిందరాజన్; 13.ఎ.ఎల్.రాఘవన్; 14.ఎస్.సి.కృష్ణన్; 15.వి.జె.వర్మ; 16.నల్ల రామ్మూర్తి; 17.కొమ్మినేని అప్పారావు; 18.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం; 19.పామర్తి; 20.మాస్టర్ రామకృష్ణ (పెళ్ళిచేసిచూడు); 21.కె.ఎస్.వీరరాఘవులు; 22.మంగళంపల్లి బాలమురళీకృష్ణ; 23.మల్లిక్; 24.పద్మనాభం; 25.సి.ఎస్.ఆర్.; 26.రఘురాం; 27.సౌమిత్రి; 28.కె.రఘురామయ్య; 29.అద్దంకి శ్రీరామమూర్తి; 30.మోపర్రుదాసు; 31.కె.జే.ఏసుదాస్.

ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో పాడిన గాయనీమణులు :

1.సి.కృష్ణవేణి; 2.వక్కలంక సరళ; 3.ఎస్ వరలక్ష్మి; 4.శ్రీదేవి; 5.పి.భానుమతి; 6.ఋష్యేంద్రమణి; 7.శాంతకుమారి; 8.బేబి కృష్ణవేణి;  9.పి.లీల; 10.జిక్కి; 11.ఎ.పి.కోమల; 12.పి.సుశీల; 13.ఎస్. జానకి; 14.కె.రాణి; 15.వైదేహి; 16.స్వర్ణలత; 17.బి.వసంత;18. ఉడత సరోజిని; 19.ఎల్.ఆర్. ఈశ్వరి; 20.టి.కనకం; 21.పద్మప్రియ; 22.ఎమ్.ఎల్.వసంతకుమారి; 23.ఎన్.ఎల్.గానసరస్వతి; 24.విజయలక్ష్మి; 25.విజయలక్ష్మీ కన్నారావు; 26.ఆర్.బాలసరస్వతీదేవి; 27.టి.జి.కమలాదేవి; 28.బెంగుళూరు లత; 29.కె.జమునారాణి; 30.రమణ; 31.కె.సుందరమ్మ; 32.ఎ.వి.సరస్వతి; 33.జి.వరలక్ష్మి; 34.జి.భారతి; 35.శకుంతల; 36.సురభి కమలాబాయి; 36.జె.గిరిజ; 37.నటి సావిత్రి; 38.జయలలిత; 39.పద్మ; 40.బెజవాడ రాజరత్నం; 41.సత్యవతి; 42.రాజేశ్వరి; 
వీరు కాక బృందగానాలలో గొంతు కలిపిన గాయనీగాయకులు మరెందరో వున్నారు.

1945 మొదలు 1974 వరకు ఘంటసాలవారు ఆలపించిన వేలాది రసమయ గీతాలకు స్వర రచన చేసిన సంగీత దర్శకులు :

1.చిత్తూరు వి.నాగయ్య 2.గాలి పెంచల నరసింహారావు 3.ఓరుగంటి రామచంద్రరావు 4.అద్దేపల్లి రామారావు 5.సి.ఆర్.సుబ్బురామన్ 6.ఎస్.రాజేశ్వరరావు 7.పెండ్యాల 8.సుసర్ల దక్షిణామూర్తి  9.ఆదినారాయణరావు 10.టి.వి.రాజు 11.టి.చలపతిరావు 12.మాస్టర్ వేణు 13. చెళ్ళపిళ్ళ సత్యం 14.ఎస్.పి.కోదండపాణి 15.రమేష్ నాయుడు 16.కె.వి.మహాదేవన్ 17.ఎమ్.ఎస్.విశ్వనాధన్ 18. వేదా 19.జె.వి.రాఘవులు 20.పామర్తి 21.బి గోపాలం  22.ఎమ్.రంగారావు 23.ఆర్.సుదర్శనం 24.ఆర్.గోవర్ధనం 25. బి.రజనీకాంతరావు 26.పాండురంగన్ 27.జి.రామనాధన్ 28.ఎమ్.ఎస్.జి.మణి 29.దండాయుధపాణి పిళ్ళై 30.సి.మోహన్ దాస్ 31.టి.ఆర్ పాప 32. అశ్వథ్థామ 33. బి.ఎన్.ఆర్ 34.మల్లిక్ 35.ఎల్.మల్లేశ్వరరావు 35.పి.సూరిబాబు 36.కె.ప్రసాదరావు 37.ఎమ్.ఎస్.శ్రీరామ్  38.ఎమ్.ఎస్.రాజు 39.ఎస్.హనుమంతరావు 40.హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి 41.విజయభాస్కర్ 42. టి.జి.లింగప్ప 43.విశ్వనాధన్-రామమూర్తి 44.రాజన్ నాగేంద్ర 45.బి.శంకర్ 46.శంకర్ జైకిషన్ 47.భానుమతి: 48.ఎ.ఎమ్.రాజా 49. ఎమ్.ఎస్.ప్రకాష్ 50.డి.బాబూరావు 51.విజయా కృష్ణమూర్తి 52.జోసెఫ్-వేలూరి కృష్ణమూర్తి 53.ఎ.ఎ.రాజ్ 54.టి.ఎమ్.ఇబ్రహీం 55.ఎస్.వి.వెంకట్రామన్ 56.ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు 57.ఎమ్.బి.శ్రీనివాసన్ 58.చంద్రం-సూర్యం 59.పెండ్యాల శ్రీనివాస్ 60.జి.కె.వెంకటేష్ 61.పి.లీల 62.ఎమ్.పూర్ణచంద్రరావు 63.వి శివారెడ్డి 64.సత్యారావు 65. చక్రవర్తి.

ఇతరుల సంగీత దర్శకత్వంలో ఘంటసాలవారితో కలసి యుగళగీతాలు పాడిన మరికొందరు గాయనీమణులు :
1 ఎమ్.వి.రాజమ్మ 2.కన్నాంబ 3.బొంబాయి శారద 4.జొహ్రాబాయి 5.సత్యవతి 6.పద్మాసిని 7.రేణుక 8.రాధా-జయలక్ష్మి 9.శూలమంగళం రాజలక్ష్మి 10.శ్రీరంగం గోపాలరత్నం 11.నటి సావిత్రి 12.బేబి కౌసల్య 13.శోభారాణి 14.విజయలక్ష్మి 15.తిలకం 16.మాధురీదేవి 17.శరావతి 18.రమోల; 

తెర వెనుక ఘంటసాల మాస్టారి గళానికి తెరపైన పెదవులు కదుపుతూ అభినయించిన ముఖ్య ప్రముఖ నటులు :

1.సి.హెచ్.నారాయణ రావు 2.అక్కినేని నాగేశ్వరరావు 3.ఎన్.టి.రామారావు 4.చిత్తూరు వి.నాగయ్య 5.సి.ఎస్.ఆర్. 6.కాంతారావు 7.జగ్గయ్య 8.కృష్ణ 9.శోభన్ బాబు 10.చంద్రమోహన్ 11.హరనాథ్ 12.కోన ప్రభాకరరావు 13.మోపర్రు దాసు 14.జయసింహ; 15.ముక్కామల 16.రేలంగి 17.రమణారెడ్డి 18.పద్మనాభం 19.మిక్కిలినేని 20.రాజనాల 21.సత్యనారాయణ 22.సి.సీతారాం 23.మంత్రవాది శ్రీరామమూర్తి 24.ఆ‌ర్.నాగేశ్వరరావు 25.వెంపటి చిన సత్యం 26.త్యాగరాజ భాగవతార్ 27.శివాజీ గణేశన్ 28.జెమిని గణేశన్ 29.నాగేష్ 30.రాజ్ కుమార్ 31.ఉదయకుమార్ 32.రామశర్మ 33.జోగారావు  34.మహంకాళి వెంకయ్య 35.బాలయ్య 36.గుమ్మడి 37.చలం 38. అమర్నాధ్ 39.నాగభూషణం 40.ఎమ్.జి.ఆర్ 41.కౌశిక్ 42.కెంపరాజ్ 43.రంజన్ 44.ఎస్.ఎస్త్రిపాఠి 45.జె.వి.రమణమూర్తి 46.తంగవేలు 47.అజిత్ సింగ్ 48.లంక సత్యం 49.త్యాగరాజు 50.రామ్మోహన్ 51.ఎస్.వి.రంగారావు 52.రామకృష్ణ 53.అర్జా జనార్దన్ రావు 54.బి.గోపాలం.

వీరు కాక నృత్యగీతాలకు అభినయించన కళాకారులు, పేరు తెలియని జూనియర్ నటులెందరికో ఘంటసాలవారి గళం తోడ్పడింది. ఘంటసాలవారంటే ప్రజలంతా అంతటి మక్కువ, మమకారం ఏర్పర్చుకోవడానికి కారణం ఆయనలోని అసాధారణ సమ్మోహన గాత్రధర్మం ఒక్కటేకాదు, వారిలోని వినయవిధేయతలు,సౌజన్యం, సేవాగుణం, కృతజ్ఞతాభావం, యివన్నీ ఘంటసాలవారిని ప్రజలకు మరింత దగ్గర చేసాయి. గాయకుడిగా ఎంత ఉన్నతికి చేరినా, ఎంతటి ధనార్జన చేసినా  దర్పానికి పోకుండా చివరివరకూ  అతి నిరాడంబరంగానే జీవించారు. సినీమా ప్రపంచంలో ఈ రకమైన వ్యక్తిత్వం గల వ్యక్తులు బహు అరుదుగా కనిపిస్తారు. ఇంతటి విశిష్టమైన వ్యక్తి కనుకనే ఆ తరంనుండి ఈ తరం వరకు  సంగీతాభిమానులంతా ఘంటసాలను తమ ఆత్మీయగాయకుడిగా భక్తితో ఆరాధిస్తున్నారు. ఆ ప్రజాభిమానమే వేయి పురస్కారాల పెట్టు. 

గత 77 సంవత్సరాలుగా ప్రజలందరిచేతా ఆరాధించబడుతున్న ఈ ప్రజాగాయకుని  సమున్నత బిరుదు ప్రదానం విషయంలో మాత్రం  కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తూండడం చాలా బాధాకరమైన విషయం.

ఉత్తమ కళాకారులను గుర్తించలేని ప్రభుత్వపు బిరుదులు కన్నా కోట్లాది సంగీతాభిమానులు ఇచ్చిన గౌరవం, అభిమానమే మిన్న. 

ఘంటసాల మాస్టారు ఉన్నకాలంలోనే  అసంఖ్యాకులైన జూనియర్ ఘంటసాలలు దేశమంతా తయారయి ఘంటసాల పాటలను ఘంటసాలగారికే వినిపించేవారు.  వారు భౌతికంగా దూరమైన తర్వాత కూడా జూనియర్ ఘంటసాలల సంఖ్య మరింత పెరిగింది. వారి పాటలు విస్తృతంగా వినిపించసాగాయి.  ఘంటసాల పాటలు పాడడమే వృత్తిగా చేసుకుని వృధ్ధిపొందినవారు,  ఘంటసాల పాటలతో విదేశపర్యటనలు జరిపి ఖ్యాతి పొందుతున్నవారు ఎందరో. 

ఘంటసాల గీతాలతో నాట్యప్రదర్శనలకు శ్రీకారం చుట్టినది మా జంటసంస్థలే. అంతకు ముందు శాస్త్రీయ పధ్ధతిలో పాడిన సినీగీతాలకు నాట్యం చేయడానికి సందేహించిన సంప్రదాయ సంగీత కళాకారులంతా తర్వాత తర్వాత మేము ప్రవేశపెట్టిన బాణీనే అనుసరించారు. ఇంకా కొనసాగిస్తున్నారు. ఘంటసాల జయంతి, వర్ధంతి ఉత్సవాలతో అనేక సాంస్కృతిక సంస్థలు దేశ విదేశాలలో ఘంటసాలవారిపట్ల తమకు గల భక్తిని గౌరవాన్ని చాటిచెపుతున్నారు. దేశంలో మరే సినీ సంగీత కళాకారుడికి దక్కని గౌరవం,  మర్యాద, అభిమానం విగ్రహావిష్కరణ రూపంలో ఘంటసాలవారికి దక్కింది. ఒకప్పుడు సినీరంగానికే పరిమితమైన "మాస్టారు" సంబోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయింది.

గాన గంధర్వుడు ఘంటసాలవారి శతజయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతున్న సాంస్కృతికోత్సవాలు ఘంటసాల మాస్టారి ఔన్నత్యాన్ని అఖండ కీర్తిని మరింత చాటిచెపుతాయి.

ఘంటసాల సంగీతం ఒక చైతన్య స్రవంతి. ఒక జీవవాహిని. అనంతంగా ప్రవహిస్తూనే వుంటుంది.

ఈ ప్రపంచంలో తెలుగు భాష ఉన్నంతవరకూ, తెలుగుజాతి ఉన్నంతవరకూ ఘంటసాల పాట, ఘంటసాలను గురించిన మాట వినిపిస్తూనే వుంటాయి. సంగీత వినీలాకాశంలో ఒక ధృవతార మన ఘంటసాల. అమరుడు ఘంటసాల. 

                   💐🙏 ఈ అధ్యాయం ఇక్కడితో సమాప్తం 🙏💐

Sunday, February 20, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై తొమ్మిదవ భాగం

20.02.2022 - ఆదివారం భాగం - 69*:
అధ్యాయం 2 భాగం 68 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
1971 లో నేను ప్రవేశించిన కొత్త ఉద్యోగం నిరంతరమని అనిపించుకున్న ఏడాది నుండి కంపెనీవారు నాకు కూడా LTA ( Leave Travel Assistance) రూల్స్ వర్తింపజేశారు. దాని ప్రకారం నేను కూడా సంవత్సరానికి ఒకసారి 5 రోజులకు తక్కువ లేకుండా శెలవు పెట్టి LTA  advance తీసుకొని ఏదైనా ఊరు వెళ్ళి రావచ్చు. వెళ్ళివచ్చిన తర్వాత రైలు టిక్కెట్ల ప్రూఫ్ తో మిగతా ఎలవెన్స్ కంపెనీ నుండి తీసుకోవచ్చును. నేను చేరిన ఒక పదిహేనేళ్ళ వరకు  మా కంపెనీకి శని, ఆదివారాలు శెలవు దినాలుగా వుండేవి.   ఆ కంపెనీ యూరోపియన్స్ కంపెనీ కావడం వలన డిసెంబర్ 25  క్రిస్మస్ కు ఆ మర్నాడు 26 బాక్సింగ్ డే కు శెలవులుండేవి. జనవరి 1 , న్యూ ఇయర్స్ డే కు శెలవు. మా కంపెనీ/ ఫ్యాక్టరీలో తమిళం, మలయాళీ క్రిస్టియన్లు చాలామందే వుండేవారు. వాళ్ళంతా ఈ మూడు రోజులు కలసి వచ్చేలా LTA లీవులో పోతూండేవాళ్ళు. మిగిలినవాళ్ళు దీపావళి, పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా శెలవుల్లో వెళ్ళేవారు. ముందువెనకల శని, ఆదివారాలకు ఒక ఐదురోజులు శెలవు జోడిస్తే దాదాపు పదిహేను రోజులు శెలవు హాయిగా అనుభవించే అవకాశం వుండేది. నాకు వివాహమైన మొదటి రెండు  సంవత్సరాలు ఎక్కడికీ బయట వూళ్ళకు వెళ్ళే అవకాశం లభించలేదు.

1974 సంక్రాంతి సమయంలో LTA తో మాకు అత్యంత దగ్గర బంధువుల వూళ్ళకు వెళ్ళాము. సుమారు ఓ పదిహేనురోజుల ట్రిప్. మా ఆవిడతో బయట వూళ్ళకు వెళ్ళడం అదే మొదలు. అత్తవారి వూరు కూడా మద్రాసే కావడం వలన ఆ వంకన బయట ఊళ్ళకు వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. మా రెండు తరఫుల దగ్గర చుట్టాల ఇంటికి ఈ ట్రిప్ లో వెళ్ళాలని బయల్దేరాము.

మేము ఓ పదిహేను రోజుల తర్వాత మద్రాసు వచ్చేటప్పటికి నెం. 35,ఉస్మాన్ రోడ్ ఇంటి వాతావరణం ఉద్విగ్నభరితమైవుంది. (ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు నేను మద్రాసు లో లేని సమయంలో జరిగిన సంఘటనలు నా స్వానుభవం కాదు. మా ఇంట్లోవారు  మాస్టారు ఇంట్లోవారు చెప్పగా విన్నవి మాత్రమే). 

ఘంటసాల మాస్టారికి అతి చిన్నవయసులోనే  అంటే ఆయనకు తన ముఫ్ఫై రెండవ ఏటనే మధుమేహ(డయబిటిస్) వ్యాధి బయటపడిందని చెప్పుకోవడం వుంది. ఈ వ్యాధి వారింట్లో మాస్టారి తల్లిగారికి, తమ్ముడు సదాశివుడు గారికి, పెద్దకుమారుడు విజయకుమార్ కు, (చిన్నబాబు రత్నకుమార్ కు కూడా వున్నట్లే గుర్తు) తీవ్రంగానే వుండేది. వంశపారంపర్యంగా సంక్రమించిందనే చెప్పాలి. ఈ లక్షణాల వలన ఘంటసాల మాస్టారు హెచ్చు శ్రుతిలో పైస్థాయిలో ఆలపించేప్పుడు కొంత అయాసం, అలసట కలిగేవి. దాని ప్రభావం వలన అరికాళ్ళ మంటలు ఎక్కువై చాలా అవస్థ పడేవారు. గతవారం చెప్పినట్లు ఘంటసాలవారు సంగీతం విషయంలో గొప్ప నిష్ణాతులు. అనుభవజ్ఞులు. కానీ లౌకిక వ్యవహారాలలో ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయంలో చాలా అమాయకులు. ఎవరేది చెప్పినా గాఢంగా నమ్మేసి అది పాటించేసేవారు. అలాటి సలహాలు కొన్ని పనిచేసినా మరికొన్ని తీవ్రంగా వికటించేవి.

ముఖ పరిచయం లేని ఒక పత్రికా విలేఖరి ఎవరో వచ్చి  దీర్ఘకాలిక రోగాలకు  చికిత్స చేసే గొప్ప నాటు వైద్యుడు ఎవరో చిత్తూరు లో వున్నడని అతని దగ్గరకు తీసుకు వెడతానని చెప్పాడట. ఆ వైద్యుడు చేసిన వైద్యంతో తన తల్లిదండ్రులకు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ తల్లిదండ్రులకు ఉన్న జబ్బులు నయమయాయని చెప్పాడట. ఘంటసాల మాస్టారు ఆ వైద్యం తీసుకోవడానికి సిధ్ధపడ్డారట. సావిత్రమ్మగారు ఎంత చెప్పినా వినకుండా  1974 జనవరి 12 వ తేదీన విజయకుమార్ ను తోడుతీసుకొని కారులో చిత్తూరు వెళ్ళారట. ఆ నాటు వైద్యుడు ఒక హోటల్ సర్వర్ కూడా. నాలుగేసి గంటలకు ఒకసారి చొప్పున రెండు డోసుల మందు ఇచ్చాడట. ఆ రెండు డోసులు వేసుకున్న తర్వాత నయంగా అనిపించిందట. ఆ మందుతో కాళ్ళవాపులు తగ్గాయని తిరిగి మద్రాస్ వచ్చేసారట. త‌ర్వాత యథాప్రకారంగా రికార్డింగ్ లకు, రిహార్సల్స్ కు వెళ్ళడం ప్రారంభించారు. ఆ నాటు మందు వేసుకోసాగారు. ఆ మందు ప్రభావంతో కాళ్ళవాపులు కొంత తగ్గాయి కాని గొంతునొప్పి ప్రారంభమై  జనవరి 16 నాటికి అది తీవ్రమయింది. వేసుకున్న నాటుమందు వికటించింది. అలాగే 20వ తేదిన కూడా రెండు పాటలు పాడి వచ్చారట. విజయా హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ గా పనిచేసే వారి కుటుంబ వైద్యుడు డా. జయంతి రామారావుగారు వచ్చి మందులేవో ఇస్తూ వచ్చారు కానీ గుణం కనపడలేదు. మద్రాస్ లోనే అత్యంత ప్రఖ్యాతి పొందిన ENT స్పెషలిస్ట్ డా. చిట్టూరి సత్యనారాయణగారు. మాస్టారిని ఆయన వద్దకు తీసుకువెళ్ళారు. ఆయన అన్ని పరీక్షలు చేసి ఆ నాటు మందు వల్లే గొంతు సెప్టిక్ అయిందని, నయంకావడానికి ఇంజక్షన్లు, మందులు వ్రాసిచ్చారు. గొంతు నొప్పి వలన ఆహారం తీసుకోవడం కష్టమయింది. పూర్తిగా నీరసపడిపోయారు. లేచి నిలుచోలేని స్థితికి వచ్చేసారు. అలా ఓ పదిరోజులు గడిపారు ఇక ఇంట్లో లాభంలేదు హాస్పిటల్ లో జాయిన్ చేయడం మంచిదని డా.జయంతి గారు చెప్పడంతో  జనవరి 30న విజయా హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. ఘంటసాలకు ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే అమలు పర్చమని  విజయా హాస్పిటల్ అధినేత బి.నాగిరెడ్డి గారు తమ సిబ్బందికి ఉత్తర్వులు ఇచ్చారట.

ఘంటసాల మాస్టారు హాస్పిటల్ లో వున్నప్పుడు ఎంతో మంది నిర్మాతలు వచ్చి ధైర్యం చెప్పేవారట. మాస్టారు పాడవలసిన పాటల కాల్షీట్లు ఇవ్వమని, ముందస్తుగా ఎడ్వాన్స్ గా ఔదార్యంగా మొత్తం డబ్బు ఇవ్వబోయేవారట. కానీ మాస్టారు తాను ఆ పాటలన్నీ పాడిన తర్వాతే డబ్బు తీసుకుంటానని చెప్పారట. అదీ ఘంటసాలవారి వ్యక్తిత్వం.

బి.పి., డయబిటిస్, పైల్స్, హార్ట్ ప్రోబ్లెమ్స్ అన్నీ ఎక్కువై ఘంటసాలవారి పరిస్థితి విషమించింది. చాలా రోజులుగా ఆహారం లేకపోవడంతో విజయా హాస్పిటల్ డాక్టర్లు డ్రిప్స్ ఎక్కించడం మొదలెట్టారు.

వాహినీ స్టూడియోలోని కొన్ని రికార్డింగ్ ధియేటర్లను, షూటింగ్ ఫ్లోర్స్ స్థానే విజయాహాస్పిటల్ ను నిర్మించారు బి.నాగిరెడ్డి.  దాదాపు పాతిక సంవత్సరాల పాటు ఏ స్టూడియోలో నిర్విరామంగా పాటలు పాడారో ఏ సంస్థకోసం అజరామరమైన గీతాలను స్వరపర్చడానికి వెళ్ళేవారో అదే స్థలంలోని ఒక గదిలో ఈ రోజు ఘంటసాల మాస్టారు తీవ్ర అనారోగ్యంతో మంచానబడ్డారు.

సావిత్రమ్మగారు మాస్టారి పక్కనే రాత్రింబవళ్ళు గడపసాగారు. ఇంట్లోని పిల్లలు, పెద్దలూ  భయపడకుండా వుండడానికి మాస్టారికి నయమైపోతుందని  పదకొండవ తేదీన ఇంటికి వచ్చేస్తారని చెప్పడం నేనూ విన్నాను. దానికి తగినట్లుగానే ఆ రోజు ఉదయం ఘంటసాలగారు బాగా మాసిపోయిన గెడ్డం గీయించుకున్నారట. డాక్టర్లు కూడా ఇడ్లీ, జావ పెట్టవచ్చని చెప్పారట.

ఘంటసాలవారి అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతీ స్వాములు ఘంటసాలవారిని చూడడానికి విజయా హాస్పిటల్ కు వచ్చారట. వారు ధైర్యవచనాలు చెప్పి వెళ్ళిన తర్వాత ఘంటసాలవారు అకస్మాత్తుగా తన చొక్కా, బనీను విప్పేసి, మెడలోని యజ్ఞోపవీతాన్ని కూడా తీసేసి పక్కన పడేసారట.

1974 ఫిబ్రవరి 11 వ తేదీ ఉదయం పది గంటల సమయంలో మాస్టారికి శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. వేరే రూమ్ కు తీసుకువెళ్ళి ఆక్సిజన్ పెట్టారట.  గత కొద్ది రోజులుగా  డ్రిప్స్ మీదే కాలం వెళ్ళబుచ్చుతున్నందున వారి రెండు చేతులు బాగా కమిలిపోయి  డ్రిప్స్ పెట్టడం కష్టమైపోయి కాలికి పెట్టడం ప్రారంభించారట. డ్యూటీ డాక్టర్  తాను ఘంటసాలవారి అభిమానినని ఘంటసాలవారి కచేరీ తిరుపతిలో జరిగినప్పుడు వాళ్ళ ఊరినుంచి సైకిల్ మీద తిరుపతి వెళ్ళి ఘంటసాలవారి కచేరీ విని మురిసిపోయిన సంగతులన్ని చెపుతూ వచ్చేరట. కానీ మాస్టారిలో ఏ స్పందన కనిపించకపోయేసరికి నాడి చూస్తే అందలేదట. వెంటనే డా. జయంతి రామారావుగారు, ఇతర డాక్టర్లు పరుగెత్తుకు వచ్చి తమ ప్రయత్నాలు తామూ చేసారట. కానీ ఫలితం దక్కలేదు.

1974 ఫిబ్రవరి 11 వ తేదిన రెండు గంటల సమయంలో  ఘంటసాలవారి భౌతికకాయం నెం. 35, ఉస్మాన్ రోడ్ కు చేర్చారు.

ఘంటసాలవారి మరణవార్తతో దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.  మద్రాసు నగరంలోని సినీమా  కార్యకలాపాలు స్థంభించిపోయాయి. సంతాప సూచకంగా  రెండు రోజులపాటు అన్ని స్టూడియో లలో రికార్డింగ్ లు క్యాన్సిల్ చేసేసారు.

మామూలుగా ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళిపోయిన నాకు మా నాన్నగారు ఘంటసాలవారి మరణవార్తను ఫోన్ చేసి చెప్పారు. నేను వెంటనే రెండురోజులు శెలవు పెట్టి ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేప్పటికి ఇంటి ప్రాంగణమంతా జనసందోహంతో నిండిపోయింది.  అందరి ముఖాలలో తీవ్ర విషాదం అలముకొనివుంది. ఘంటసాల మాస్టారి భౌతికకాయాన్ని పోర్టికో వరండాలో ఉంచారు. ఆ వరండా మీది కుర్చీలోనే కూర్చొని తన కోసం వచ్చే కోరస్ సింగర్స్ తో, బయటిప్రాంతాల అభిమానులతో ఘంటసాలవారు చాలా సంతోషంగా, ఉత్సాహం తో మాట్లాడుతూ వచ్చినవారందరినీ ఆనందపర్చేవారు. అలాటి వ్యక్తి ఈనాడు అచేతనంగా వుండడం మనసుకెంతో కష్టాన్ని కలిగించింది.

ఘంటసాలవారి మరణవార్త వినగానే జాతి, కు‌ల, మత, భాషా తత్త్వాలకు అతీతంగా అసంఖ్యాకమైన జనసందోహం ఆ ప్రజాగాయకుని కడసారిగా చూచి నివాళులు అర్పించేందుకు  తరలివచ్చింది. వచ్చినవారందరిలో తీవ్రమైన దుఃఖం గూడుకట్టుకొనివుంది. ఎవరికి ఎవరు సానుభూతి చెప్పాలో తెలియక విలపించసాగారు. మాస్టారి సతీమణి సావిత్రమ్మగారు, ఘంటసాల మాస్టారి తమ్ముడు సదాశివుడు, ఇతర కుటుంబ సభ్యులు పూర్తిగా నిశ్చేష్ఠులైపోయారు. వారికి ఏవిధంగా సానుభూతి చూపగలము.

ముందుగా ఘంటసాలవారి కి మంచిమిత్రుడు, ప్రముఖ నటుడు కాంతారావుగారు వచ్చి చొరవతీసుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కాంతారావు గారు చిత్రపరిశ్రమలోని ప్రముఖులు అందరికీ టెలిఫోన్ లో సమాచారం అందజేశారు. నేను , నరసింగ పక్కనేవుండి టెలిఫోన్ డైరక్టరీ లోని నెంబర్లను ఒక్కొక్కటిగా అందజేస్తూంటే కాంతారావు గారు అందరికీ ఈ విషాదవార్తను ఫోన్ లో చెప్పారు. ఘంటసాలవారి మరణవార్త వినగానే ఆలిండియా రేడియో వారు విషాద సంగీతం వినిపిస్తూ మధ్య మధ్యలో ప్రముఖుల సంతాపసందేశాలను, మాస్టారి అజరామరమైన మధురగీతాలను ప్రసారం చేస్తూనే వచ్చారు. మద్రాస్ లోని తమిళ సాయంత్రపు పత్రికలన్నీ ఘంటసాలవారి మరణవార్తనే ప్రధానంగా ప్రకటించాయి. సినీ ప్రముఖులతో ఇల్లంతా నిండిపోయింది. అక్కినేని, ఎన్.టి.రామారావు తమ విషాద సంతాపాన్ని, మాస్టారితో తమకు గల అనుబంధాన్ని  తమ గద్గదకంఠాలతో ఆలిండియా రేడియోలో వివరించారు. బి.ఎన్.రెడ్డి, పి.పుల్లయ్య, సి.ఎస్.రావు వంటి ప్రముఖ దర్శక నిర్మాతలు వచ్చి మాస్టారిని చూసి కన్నీరు కార్చారు. ఘంటసాలవారంటే అమితంగా గౌరవించే సంగీతదర్శకుడు టి.చలపతిరావు కన్నీరు ఆపుకోలేక స్పృహకోల్పోయారు.  ఆయనను సముదాయించడమే కష్టమయింది. దక్షిణాది భాషలకు చెందిన సంగీతదర్శకులు, నేపథ్యగాయకులు, వాద్యకళాకారులు తమ ప్రియతమ మాస్టారిని చూసి కంటతడిపెట్టుకున్నారు. దక్షిణ భారత సినీ మ్యుజిషియన్స్ ఎసోసియేషన్ ఆఫీస్ లో  ఘంటసాలవారి చిత్రపటానికి పూలమాలలు వేసి కన్నీటి అంజలి ఘటించారు. రెండురోజులపాటు పాటల రికార్డింగ్ కార్యక్రమాలను బంద్ చేసేసారు. ఇక సామాన్య ప్రజానీకానికి అంతేలేదు. 

సుప్రసిధ్ధ తమిళనటుడు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మాస్టారి పెద్దకుమారుడు విజయకుమార్ ను సముదాయింబోయి తానే గట్టిగా విలపించడం మొదలెట్టారు. అక్కడి వాతావరణం ఉద్వేగభరితమయింది. పెద్దబాబు(విజయకుమార్) అయితే తండ్రిగారి భౌతికకాయం పక్కనే తంబురా పెట్టుకు కూర్చుని విషాదరాగాలను, తండ్రిగారు పాడిన విషాదగీతాలను రాత్రంతా నిర్విరామంగా పాడుతూనే వున్నాడు. మరొకపక్క మాస్టారి దగ్గర పాటలు పాడే కోరస్ సింగర్సంతా భజనగీతాలు ఆలపిస్తూనే వచ్చారు. 

ఆ రాత్రి ఎలా తెలవారిందో ఎవరికీ తెలియదు. మర్నాటి ఉదయానికి ఘంటసాలవారి బంధువులు, సావిత్రమ్మగారి ఆత్మీయులు అందరూ రావడంతో ఇంట్లోవారి దుఃఖానికి అంతేలేదు. పురోహితులు ఘంటసాలవారి భౌతికాయానికి అంతిమ సంస్కారాలు చేయడానికి కావలసిన కార్యక్రమాలు మొదలెట్టారు.  మద్రాసులో సినీ నటీనటులను చూడడానికి వచ్చిన తిరుపతి యాత్రా స్పెషల్ బస్సులన్నీ  నెం.35, ఉస్మాన్ రోడ్ ప్రాంగణానికి వచ్చిచేరాయి. వారంతా తమ ప్రియతమ గాయకుని అంతిమ యాత్రలో భాగమయ్యారు. ఘంటసాలగారి భౌతికకాయం, గాయకులు టి.ఎమ్.సౌందరరాజన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నటుడు కృష్ణంరాజు, మాడా వెంకటేశ్వరరావు, ఏడిద నాగేశ్వరరావు వంటివారు ముందుగా నడుస్తూండగా శ్మశానవాటికకు చేరుకుంది.




టి.నగర్ ఉస్మాన్ రోడ్ దక్షిణాన ఉన్న కన్నమ్మపేట శ్మశాన వాటికకి, ఎక్కడెక్కడినుండో వచ్చిన వేలాది అభిమానులు ఘంటసాల మాస్టారి భౌతికాయం మీద పూలవర్షం కురిపిస్తూ ఘంటసాల అమర్ రహే, ఘంటసాల జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగగా, సినీ ప్రముఖుల భుజాలమీదుగా ఘంటసాలవారి భౌతికకాయం తన అంతిమయాత్ర సాగించింది.  కన్నమ్మపేట శ్మశాన వాటికకు చేరేంతవరకు రోడ్ కు ఇరువైపులా ప్లాట్ ఫారమ్ ల మీద, మేడలపైనుండి తమిళ అభిమానులంతా ఘంటసాలవారి కి నివాళులు అర్పించారు. కొందరు తమిళం  వారు దేవదాసు లో మాస్టారు పాడిన 'ఉలగేమాయం వాళ్వే మాయం'  (జగమేమాయా బ్రతుకే మాయా) పాటను పాడుతూ విలపించారు. వేలాది ప్రజలు వెంటరాగా శ్మశానవాటికలో ఘంటసాలవారి భౌతికకాయానికి పెద్దకుమారుడు విజయకుమార్ అగ్నిసంస్కారం చేశాడు.  ఒక సంగీత సామ్రాట్ ఆత్మ అనంతలోకాలకు తరలిపోయింది.  




ఘంటసాలవారు అమరగాయకులుగా మన మనస్సులలో నిల్చిపోయారు. వారు భౌతికంగా మన మధ్యనుండి తొలగి 48 సంవత్సరాలు అవుతున్నావారు పాడిన వేలాది పాటలు సంగీతప్రియులకు అన్నివిధాలా ఉపశమనం కలిగిస్తూనే ఉన్నాయి.

తెలుగు భాష ఉన్నంతవరకూ ఘంటసాలవారు, వారి అమృతతుల్యమైన గానం ఈ ప్రకృతిలో లీనమయేవుంటుంది.

ఘంటసాల చరిత అజరామరం. అంతమనేదే లేదు.
                        ...సశేషం

Sunday, February 13, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఎనిమిదవ భాగం

13.02.2022 - ఆదివారం భాగం - 68:

అధ్యాయం 2  భాగం 67 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళీ" అన్న ఘంటసాలవారు, ఒక దగ్గర "జీవితమంతా కలయేనా జీవితమంతా భ్రమయేనా" అంటారుమరో చోట" ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నం" అంటారు. నిరంతర ఈ చక్రభ్రమణంలో ఏది శాశ్వతం కాదు. నీటిబుడగ వంటి ఈ జీవితంలో ఏ నిముసానికి ఏమి జరుగుతుందో ఎవరూహించలేరు. విధి విలాసాన్నితప్పించడమూ అంతకన్నా  ఎవరివల్లా కాదు. సుఖదుఃఖాలు రెండూ ఒకదాని వెనక ఒకటి అంటిపెట్టుకునే వస్తూంటాయి. మంచి జరిగితే ఆనందించడం చెడు జరిగితే విలపించడమూ తప్ప సామాన్య మనిషి మరేమీ చేయలేడు. చీకటి వెలుగుల్లాటి సుఖదుఃఖాలు అనివార్యమని, మనిషి తన ఉద్వేగాలను తన ఆధీనంలోనే నియంత్రించాలని  వేదాంతులు చెప్పినా వాటి ప్రభావంనుండి మనిషి అంత తొందరగా బయటపడలేడు.  నిగ్రహించుకోనూలేడు. సుఖమూ దుఃఖమూ రెండూ వెంటవెంటనే కలుగుతూంటే ఆనందించాలో లేక బాధపడాలో తెలియని అగమ్యస్థితిలో పడతాడు.

ఏదో ఒక పాత సినీమాలో రేలంగి  ఒక పాటలో "నవ్వుతూ ఏడ్వనా, ఏడుస్తూ నవ్వనా" అని తానేడుస్తూ జనాలను నవ్విస్తారు.  ఒకరికి ఖేదము మరొకరికి మోదమూ అవుతుంది.

క్రిందటివారం నేను దాదాపు అటువంటి అవస్థనే అనుభవించాను.

ఫిబ్రవరి నెల మాకు ఎన్నటికీ మరపురానిది.

 2022 ఫిబ్రవరి 5 వ తేదీన మా 51 వ వివాహవార్షిక దినం. అదేరోజు సాయంత్రం మా పెద్ద చెల్లెలు శ్రీమతి కాకరపర్తి వెంకట రమణమ్మ రెండవ కుమార్తె చి.సౌ. గాయత్రి వివాహపు నిశ్చితార్థం, వెంటవెంటనే ఎదురు సన్నాహాలు, పరిచయకార్యక్రమాలు అన్నీ చాలా వైభవంగా జయప్రదంగా జరిగాయి.  బంధు మిత్రులతో సంతోషంగా గడచింది. మర్నాడు 6 వ తేదీ ఉదయం 8 గంటల తర్వాత సుముహుర్తం. చి.ల.సౌ.గాయత్రి, చి. ఆత్రేయ వివాహమహోత్సవం శుభప్రదంగా ముగిసిన కొంతసేపటికే  ఏడు దశాబ్దాల పాటు సంగీతప్రియులందరినీ తన అసమాన్య గాత్ర మాధుర్యంతో వేలాది పాటలతో కోట్లాది శ్రోతలకు తన్మయత్వం కలిగించిన ఇండియన్ నైటింగేల్, 'భారతరత్న' లతామంగేష్కర్ దివంగతులయారనే దుర్వార్త. గతకొంతకాలంగా పట్టిపీడిస్తున్న అనారోగ్యం, 93ఏళ్ళ వృధ్ధాప్యమే వారి మరణానికి కారణమని తెలిసినా ఆ కోకిల కంఠం శాశ్వతంగా మూగపోయిందనే తలపు మనసుకెంతో ఆవేదనను కలగజేసింది.

ఫిబ్రవరి 6 వ తేదీన వచ్చిన నా 'నెం.35,ఉస్మాన్ రోడ్' ధారావాహిక లో లతామంగేష్కర్ గారి భగవద్గీత గురించి, ఘంటసాల మాస్టారి తాత్పర్యసహిత భగవద్గీత గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ ఇద్దరు మహాగాయకులు  సంతానం సినీమాలో 'నిదురపోరా తమ్ముడా' పాటను పాడినా అది ఇద్దరూ  కలసిపాడిన డ్యూయెట్ కాదు.  ఎవరి పోర్షన్ వాళ్ళదే.  అయినా ఆ ఇద్దరి పాటలు ఒకేసారి రికార్డ్ చేయడం, ఒకరికొకరు పరిచయంకాబడడం, ఒకరి పాట మరొకరు వినడం, రికార్డింగ్ పూర్తిఅయేవరకూ ఇద్దరు అక్కడేవుండడం జరిగింది. ఘంటసాలవారంటే  లతామంగేష్కర్ గారు అమితమైన గౌరవమర్యాదలు కనపర్చేవారు.  ఘంటసాలగారితో కలసి పాడాలనే అభిలాషను కనపర్చేవారట. సువర్ణసుందరిలోని "హాయి హాయిగా ఆమని సాగే" పాటలోని గమకస్ఫూర్తి, భావగాంభీర్యం, గాత్రసౌలభ్యం తమ కంఠాలలో తొణికిసలాడలేదని , తెలుగుపాటతో పోలిస్తే హిందీ పాట ఒకింత తేలిపోయిందని లతామంగేష్కర్ భావించినట్లు చెప్పుకునేవారు. పాట రిహార్సల్స్ లో కూడా ఘంటసాల మాస్టారి సహకారం వుంటే బావుంటుందని లతా సలహా ఇచ్చినట్లు, కానీ  తాను అలా జోక్యం చేసుకోవడం మహమ్మద్ రఫీ వంటి గొప్పగాయకుడిని కించపర్చినట్లవుతుందని ఘంటసాల మాస్టారు లతామంగేష్కర్ గారి కోరికను సున్నితంగా తిరస్కరించినట్లు మాస్టారింట్లో  చెప్పుకోగా విన్నాను.

తర్వాత కాలంలో హైదరాబాద్ లో దీనానాధ్ మంగేష్కర్ గారి పేరిట లతామంగేష్కర్ గారు ఘంటసాలవారికి ఘన సన్మానం చేసినప్పుడు సభాముఖంగా కాక, విడిగా సంభాషిస్తున్నప్పుడు లతామంగేష్కర్ మాస్టారితో గాయకులకు తమ గొంతే అత్యంత విలువైనదని దానిని ఎల్లవేళలా ప్రాణప్రదంగా కాపాడుకోవాలని సలహా ఇచ్చారట. సినీమా రంగంలో అసూయాపరులకు కొదవలేదని, స్లోపాయిజన్ తో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరని తనకు జరిగిన స్వానుభవాన్ని చెప్పారట. దీనినిబట్టి  చిత్ర విచిత్ర మనస్తత్త్వాలకు ఆలవాలమైన చిత్రసీమలో  తీవ్రమైన పోటీలకు, ఈర్ష్యాద్వేషాలకు కొరతలేదని స్పష్టంగా తెలుస్తుంది.

ఫిబ్రవరి 11 వ తేదీ విషయంలో కూడా మాకు ఓ విధమైన మిశ్రమభావోద్వేగాలే కలుగుతాయి. ఆ రోజు అమరగాయకుడు, గానగంధర్వుడు ఘంటసాలవారి వర్ధంతి. అదే రోజున మా మరదలు( మా ఆవిడ పెద్ద చెల్లెలు) ఆకుండి జయశ్రీ పరబ్రహ్మంగారి వివాహవార్షికోత్సవం. ఒకే రోజు రెండు వైవిధ్యపూరితమైన  కార్యక్రమాలలో పాల్గొనవలసివచ్చేది. ఫిబ్రవరి 20 న మా అమ్మాయి పెళ్ళిరోజు.

🌅🌷

సాధారణంగా ఘంటసాల మాస్టారు ఇంట్లో వుండడం జరగదు. మరీ ఒంట్లో బాగాలేదనిపిస్తే తప్ప ఏవో పనుల మీద బయటకు వెళ్ళి మధ్యాహ్నం భోజనాల సమయానికి వస్తారు. మళ్ళీ సాయంత్రం నాలుగు తర్వాత బయటకు వెళ్ళి రాత్రి ఎనిమిది తర్వాత వస్తారు. రికార్డింగ్ లున్న రోజులైతే రాత్రి తొమ్మిది దాటిపోయేది. ఈ మధ్య తరచూ ఏదో అస్వస్తత కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నారు. మ్యూజిక్ కంపోజింగ్ లు కూడా ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నారు.
ఖాళీగా ఉన్నరోజుల్లో ఉదయం ఓ అరగంట సాయంత్రం ఓ అరగంట పోర్టికోలోని వరండా మీదున్న కుర్చీలో కూర్చోని ఏవో పత్రికలు తిరగేసేవారు. ఆయనకు పెద్దగా పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఆ వరండా మీదనుండి చూస్తే ఎదురుగా వుండే వ్యాసారావు స్ట్రీట్ లో నుండి వచ్చిపోయేవారు, ఉస్మాన్ రోడ్ లో తిరుగాడేవారు స్పష్టంగా కనిపిస్తారు. మాస్టారు ఇంట్లో ఉన్నారని తెలిస్తే  బయట వూళ్ళనుండి వచ్చే అభిమానులు, సినీమాలో పాటల ఛాన్స్ ల కోసం తిరిగే కోరస్ సింగర్స్, లేక ఆర్కెష్ట్రా ప్లేయర్స్ వచ్చి మాస్టారితో మాట్లాడుతూండేవారు. 'సినీమా' ఇంటూరి, 'మధురవాణి' గోటేటి,' కాగడా' శర్మ, 'కొరడా' రమణమూర్తి వంటి చిన్న సినిమా పత్రికలవారు చందాలకోసం , సినీమా రంగం 'జివిజి', 'ఆంధ్రపత్రిక' శ్రీనివాస్, గోపాలకృష్ణ, వి.ఎ.కే.రంగారావు వంటి ప్రముఖ పాత్రికేయులు ఇంటర్వ్యూలకోసం తరచూ వచ్చేవారు. వచ్చినప్పుడల్లా ఆ వారపు/నెల సినీమా పత్రికలు తీసుకువచ్చి మాస్టారుకు ఇచ్చేవారు. వారందరి రాకపోకలతో మాస్టారింటి ప్రాంగణం కళకళలాడేది.

ఆరోజుల్లో పోస్ట్ మెన్  రోజుకు మూడుసార్లు వచ్చేవారు. ఉదయం పది తర్వాత లోకల్ పోస్ట్, మధ్యాహ్నం, సాయంత్రం  బయట వూళ్ళ ఉత్తరాలు వచ్చేవి. ఎక్కువగా అభిమానుల ఉత్తరాలు, వివాహ ఆహ్వాన పత్రికలు రోజూ వచ్చేవి. అందరిళ్ళల్లో శుభకార్యాలు జరిగిపోతున్నాయి, తమ ఇంట్లో ఏది జరగలేదని ఘంటసాలవారికి   ఒక ఆరాటం వుండేది. నిజానికి పిల్లలంతా చాలా చిన్నవాళ్ళు. చదువులే పూర్తికాలేదు. పెద్దబాబు ఒక్కడే అప్పుడప్పుడే జీవితంలో స్థిరపడే ప్రయత్నాల్లో వున్నాడు. కానీ మాస్టారికి తన ఆరోగ్యం విషయంలో ఏదో అభద్రతా భావం వుండేది. కనీసం పెద్దవాడికైనా పెళ్ళి చేసి చూడాలనే కోరిక ప్రబలింది. సావిత్రమ్మగారికి అంత తొందరగా పెద్దబాబుకు పెళ్ళి చేసే ఉద్దేశం లేకపోయినా మాస్టారు ఆ ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. ఎవరిద్వారానో తమ కుమారుడికి మంచి అనుకూలమైన సంబంధం అమరింది.  చిత్రసీమలోని ప్రముఖులందరి సమక్షంలో మహా వైభవంగా వివాహం జరపాలని ఆశించారు. ఈ విషయమై పుట్టపర్తి సాయిబాబా వారిని, కాంచీ మహాస్వాములను దర్శించి వారి సమ్మతిని, ఆశిస్సులను  కూడా పొందారు.  ముహుర్తాలు పెట్టుకోవలసివుంది.

తరచూ జలుబు చేయడం, ఎక్కువసేపు నిలబడి పాడుతూంటే అలసిపోవడం, దానివలన అనుకున్న సమయానికి రికార్డింగ్ లు జరగక క్యాన్సిల్ కావడం జరిగేది.  దానితో ఘంటసాల గొంతు పోయింది ఇక పాడలేడు అనే దుష్ప్రచారం తెలుగు చిత్రసీమలో మొదలయింది. కొందరు సంగీత దర్శకులు పనిగట్టుకుని కొత్త వాయిస్ లను  పైకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించడం మొదలయింది. మ్యూజిక్ డైరక్షన్ చేసే సినీమా లు తగ్గిపోయాయి.  ప్రముఖ నిర్మాతలు తప్ప చిన్న చిన్న నిర్మాతలు ఇతర గాయకులచేత పాడించి తమ చిత్రాలు ముగించాలనే నిర్ణయానికి వచ్చారు. అగ్ర నటుల పాటల ట్రాక్స్ మాత్రం మాస్టారు  తన గొంతు బాగుందన్నప్పుడు వెళ్ళి పాడివచ్చేవారు.

ఘంటసాలవారు తన సంగీతం విషయంలో తప్ప మిగిలిన విషయాలలో చాలా అమాయకులు. ఎవరేది చెప్పినా నమ్మేసేవారు. తన ఆరోగ్యం విషయంలో ఎవరెవరో ఎవేవో చెప్పేవారు. వాటన్నిటినీ అమలుపర్చమని ఇంట్లోవారికి చెప్పేవారు. ఒకసారి ఎవరో బ్లడ్ సుగర్ తగ్గడానికి పొట్టుతీయని మినపప్పుతో చేసిన  నేతి గార్లను పుట్టతేనెలో ముంచి తినమని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళ పాటు ఆ సలహాను తూచ తప్పకుండా పాటించి ఉదయపు అల్పాహారం గా తేనెతో నేతిగార్లు తీసుకోవడం మొదలెట్టారు. ఒకటి రెండు రోజులు బాగున్నట్లనిపించి ఆ చిట్కా బాగా పనిచేస్తోందని అందరికీ చెప్పి ఆనందించేవారు.  ఆ తర్వాత మరికొన్నాళ్ళకి షరా మామూలే. అల్లోపతి చేదుమాత్రలు తప్పనిసరేయేది.

ఈ పరిస్థితులలో ఒంట్లో ఓపిక తగ్గి బయట వరండాలో  ఒంటరిగా కూర్చొనేవారు. ఒక్క శని, ఆదివారాలలో తప్ప మిగిలిన రోజుల్లో నేను మాస్టారిని చూసే అవకాశం వుండేదికాదు. ఆ రెండు రోజులు మాత్రం నేను ఆయన పక్కనే వరండాలో బెంచ్ మీద గడిపేవాడిని. ప్రపంచం ఎంత విచిత్రమైనదంటే, అంతవరకూ ఇంద్రుడు, చంద్రుడూ, మీ అంతవారు మరెవరూ లేరూ, మీరు లేకపోతే ఇండస్ట్రీయే లేదు అని ఇచ్చకాలు పలికినవారంతా ఇంటి ఛాయలకే రావడం మానేసారు. చూస్తే ఎక్కడ లోపలికి వచ్చి మాట్లాడవలసివస్తుందేమోనని కొంతమంది తలదించుకునే ఇంటిముందునుండి వెళ్ళేవారు. కొంతమంది నిర్మాతలు తాము పాడించుకున్న పాటలకు, చేయించుకున్న మ్యూజిక్ డైరక్షన్ కు ఇవ్వవలసిన పైకం సకాలంలో ఇవ్వకుండా సగం సగం ఇచ్చి అప్పుడు, ఇప్పుడు అని మా నరసింగడిలాటివారిని పదేపదే తమ ఆఫీస్ చుట్టూ తిప్పించుకునేవారు. స్వయంగా ఘంటసాలవారే వెళితే తప్ప డబ్బులు వసూలయేవికావు.  ఆయన ముందు ఒకలా , ఆయన  వెనక మరోలా ప్రవర్తించేవారు. సినీమా ప్రపంచం అంతా సప్లై ఎండ్ డిమాండ్  సిధ్ధాంతాన్నే పాటించేది. ఇదంతా చూసి ఘంటసాల మాస్టారు నిర్వేదంగా నవ్వుకునేవారు. 'ఇదేరా నాయనా లోకం తీరు అనేవారు'.
మాస్టారు చెప్పేవన్నీ వినడం తప్ప సానుభూతి గా మాట్లాడడానికి గానీ, సలహా చెప్పడానికి గానీ నాకు సాహసము, అనుభవమూ, వయసూ ఏవీ లేవు. కానీ ఆ పరిస్థితిలో వారిని చూడడానికి ఏదో దిగులుగా అనిపించేది.

1973 లో మాస్టారిని మరింత క్రుంగదీసే విషాద సంఘటనలెన్నో. దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు అత్యంత ఆత్మీయంగా కలసి పనిచేసినవారెందరో ఈ లోకాన్ని వదలిపెట్టిపోయారు. మొదట మ్యూజిక్ డైరక్టర్ టి.వి.రాజుగారు.

రాజా మహరాజా - టింగు రంగా

టి.వి.రాజుగారు చిత్రసీమ లోకి వచ్చినప్పటినుండి ఘంటసాలవారి తో మంచి స్నేహం వుండేది. రాజుగారి స్వరరచనలో ఘంటసాలమాస్టారు పాడిన పాటలెన్నో ఇంకా గాయకులంతా పాడుకుంటునే వున్నారు. 

తర్వాత, పామర్తి గారు. ఘంటసాలవారి ప్రోత్సాహం తోనే తబలా వాయించడం నేర్చుకొని మాస్టారి వద్ద సహాయకుడిగా అనుభవం గడించి  మ్యూజిక్ డైరెక్టర్ గా ఏదో సాధించాలని మాస్టారిని వదలి బయటకు వెళ్ళిపోయారు. అయినా ఘంటసాల మాస్టారు బాధపడలేదు. పామర్తిగారి చిత్రాలన్నింటిలోనూ పాడారు.

పూవై విరిసిన పున్నమి వేళ - శ్రీ తిరుపతమ్మ కథ

కానీ, పామర్తిగారు డబ్బింగ్ మ్యూజిక్ డైరక్టర్ గానే మిగిలిపోయారు. కేవలం నాలుగు మాత్రమే స్ట్రైట్ సినీమా లకు పనిచేసారు. అందులో నాల్గవ చిత్రం 'పూలమాల'  సినీమా సగంలో వుండగానే పామర్తిగారు కాలంచేసారు. ఆ సినీమాలోని మిగతా పాటలను  రీరికార్డింగ్ ను ఘంటసాల మాస్టారే పూర్తిచేసి దాని వలన వచ్చిన పైకాన్నంతా పామర్తి గారి కుటుంబానికే ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. 1955 వరకు,  మేము 35, ఉస్మాన్ రోడ్ కు రావడానికి ముందు వరకూ పామర్తి గారి కుటుంబం మేమున్న ఔట్ హౌస్ లోనే వుండేవారు.  అటువంటి ఆత్మీయుడైన పామర్తిగారు పోవడం మాస్టారికి ఒక లోటే. అన్నిటికంటే ఘంటసాలవారిని మరింత బాధించింది చిత్తూర్ వి.నాగయ్యగారి మరణం. మద్రాసులో అడుగుపెట్టి అన్నానికి అవస్థలు పడుతున్న రోజుల్లో ఆదరించి తమ రేణుకా సంస్థలో ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి, తమ చిత్రాలలో చిన్నా చితకా వేషాలు, కోరస్ లు ఇచ్చి నాగయ్యగారు చూపిన ప్రేమాభిమానాల గురించి మాస్టారు ఎప్పుడూ తల్చుకునేవారు. 


ఆపరాని తాపమాయెరా - యోగి వేమన

నేపథ్యగానంతో పాటు కూచిపూడి జతులు పలుకుతూ తెరమీద కూడా కనిపిస్తారు ఘంటసాల యోగి వేమనలో. 

ఘంటసాల గారికి తొలిసారిగా పాడే అవకాశం కల్పించిన 'స్వర్గసీమ' సినీమాకు సంగీత దర్శకుడు కూడా చిత్తూరు వి.నాగయ్యగారే. 

ఓ నా రాజా -  స్వర్గసీమ

లక్షలాది రూపాయలు సంపాదించి  మితిమీరిన దాన ధర్మాలకోసం ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్న నాగయ్యగారి జీవితం అందరికీ ఒక గుణపాఠం. అటువంటి మహానుభావుడు స్వర్గస్తులైనప్పుడు కూడా సినీమారంగ ప్రముఖులెవరూ ఆయన దహన సంస్కారాలకు రాలేదు. 

బ్రతికి బాగా వున్నంతవరకే మనిషికి విలువ. ఆ తర్వాత ఎవరూ ఎవరినీ పట్టించుకోరు.తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే నాగయ్యగారి మరణం ఘంటసాలవారిలో ఒక రకమైన మృత్యుభయాన్ని ఆవహింపజేసిందేమో అనిపిస్తుంది.

ఆ విషయాలన్నీ వచ్చే వారం.....
          ...సశేషం

Sunday, February 6, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఏడవ భాగం

06.02.2022 - ఆదివారం భాగం - 67*:
అధ్యాయం 2 భాగం 66 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ప్రపంచ వ్యాప్తంగా వున్న సనాతనధర్మాచరణపరులకు, హిందువులకు పరమ పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథం 'భగవద్గీత'. దీనినే గీతోపనిషత్  అని కూడా అంటారు. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలోని భీష్మపర్వంలో ఈ గీతోపదేశ ఘట్టం వస్తుంది. కర్తవ్యవిమూఢుడైన అర్జునునికి స్ఫూర్తిని, కర్తవ్యాన్ని బోధిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఉపదేశ సారమే భగవద్గీత. 18 భాగాలు గల ఈ గీత 700  సంస్కృత శ్లోకాలతో నిండినది. జ్ఞాన, భక్తి, కర్మ, రాజయోగాల గురించి, ధర్మాధర్మ విచక్షణ గురించి కూలంకషంగా చర్చించబడిన అత్యుత్తమ వేదాంత గ్రంధం భగవద్గీత. సంస్కృత భాషలో వున్న ఈ భగవద్గీత ను ప్రపంచ భాషలన్నింటిలోకి విస్తృతంగా అనువదించబడింది. భారతదేశ స్వతంత్ర పోరాట సమయంలో కూడా బాల గంగాధర్ తిలక్, మహాత్మా గాంధి వంటి గొప్ప నాయకులు భగవద్గీత ను ఆదర్శంగా తీసుకొని  నిష్కామంగా, స్వార్ధరహితంగా దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలనే త్యాగం చేసారు. అటువంటి మహోత్కృష్ట భగవద్గీతకు మహామహులెందరో భాష్యాలు వ్రాసారు. గాయకులెందరో గానం చేసారు. సుప్రసిధ్ధ నేపధ్యగాయని లతామంగేష్కర్ గానం చేసిన భగవద్గీత బహుళజనాదరణ పొందింది. ఆమె భగవద్గీతలోని మొత్తం 700ల శ్లోకాలను సుశ్రావ్యంగా భక్తిరస ప్రధానంగా ఆలపించారు. 

అటువంటి భగవద్గీతనే ఘంటసాలవారు తన జీవిత సాఫల్యఫలంగా తెలుగువారందరికీ పంచిపెట్టాలని, తన  జీవితం చరితార్ధం కావాలని ఆశించారు.  సంస్కృత భాష తెలియని సామాన్యుడు కూడా భగవద్గీతను విని, అందులోని సారాంశాన్ని అర్ధం చేసుకోగల రీతిలో సరళమైన తెలుగుభాషలో తాత్పర్యసహిత భగవద్గీతను రూపొందించాలని ఘంటసాల నిర్ణయించారు. భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలు కాకుండా ఒక నూట ఎనిమిది శ్లోకాలను మాత్రమే తాత్పర్యంతో రికార్డ్ చేయాలని భావించారు. ఈ పవిత్ర బృహత్ ప్రణాళికను  కార్యరూపంలో పెట్టడానికి HMV గ్రామఫోన్ కంపెనీ వారు తమ సంసిధ్ధతను ప్రకటించారు. తెలుగునాట HMV మనుగడకు ముఖ్యకారణం ఘంటసాలవారి భక్తిగీతాలు,  కరుణశ్రీ పద్యాలు, అసంఖ్యాకమైన సినీగీతాలేనన్న విషయం అందరికీ తెలిసిందే. 

కరుణశ్రీ పద్యాలు

ఏడాదికి కనీసం రెండు పాటలైనా  ఘంటసాలవారివి క్రమం తప్పక HMV గ్రామఫోన్ రికార్డ్ లు గా వచ్చేవి. ఆ సంస్థ తెలుగు విభాగపు అధిపతి శ్రీ మంగపతిగారు తరచూ మాస్టారిని కలిసి తమ కంపెనీకి పాడమని బలవంతం చేసేవారు. భగవద్గీతను రికార్డ్ చేద్దామని ఘంటసాల మాస్టారు చెప్పగానే మంగపతి చాలా సంతోషించారు. 

ఘంటసాలవారి భగవద్గీతకు తెలుగు వ్యాఖ్యానాన్ని వ్రాసే భాధ్యత ను శ్రీ కోట సత్యరంగయ్యశాస్త్రిగారికి అప్పజెప్పారు. శ్రీ రంగయ్యశాస్త్రిగారు సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. కవిగా పేరు పొందినవారు. టి.నగర్ లోనే రామకృష్ణ మిషన్ మెయిన్ హైస్కూలులో తెలుగు పండితులుగా వుండేవారు. వీరి సోదరుడు కూడా మంచి పండితులే. అన్నదమ్ములిద్దరూ ఒకే రూపం. చాలా పొట్టిగా పిట్టల్లా వుండేవారు. అతి నిరాడంబరంగా కనిపించేవారు. ఘంటసాల మాస్టారు తన భావాలను వారికి తెలియజెప్పి తాను ఎంచుకున్న శ్లోకాలకు వ్యాఖ్యానం చేయమని కోరారు. శ్రీ కోట సత్యరంగయ్యశాస్త్రిగారు కూడా చాలా ఆనందించారు. కొన్నాళ్ళ తర్వాత తాను వ్రాసినది తీసుకువచ్చి ఘంటసాల మాస్టారికి వినిపించారు. అది మాస్టారికి అంత తృప్తి కలిగించలేదు. అక్కడక్కడ భాష మరీ గ్రాంధికమై పామరులకు అర్ధం కాని విధంగా ఉపయోగించారు. వాటన్నిటినీ ఒకటికి రెండుసార్లు సరిచేయించి భగవద్గీత వ్యాఖ్యానం పూర్తిచేయించారు. 



భగవద్గీతా గానాన్ని ఒక పరమ పవిత్రకార్యంగా భావించారు. అందుకోసం మనసా, వాచా, కర్మణేన ఆ భగవద్గీత రికార్డింగ్ జరిగినన్నాళ్ళు చాలా నియమనిష్టలు పాటించారు. ఆహారరీత్యా శాకాహారులే కావడాన ఆహార సమస్య లేదు.  తన వేషాన్ని కొంత మార్చారు. కషాయ రంగు చొక్కా, లుంగీలను ధరించడం మొదలెట్టారు. ఇందుకుగానూ సావిత్రమ్మగారు మాస్టారి తెల్ల దుస్తులనే పానగల్ పార్క్ సమీపంలో దొరైసామీ రోడ్ లో వున్న నల్లీ డైయింగ్ లో  ఇచ్చి ఆ తెల్ల బట్టలకు కాషాయ రంగు వేయించారు. బయట సినీమా పాటల రికార్డింగులకు కాషాయ బట్టలతోనే వెళ్ళేవారు. ఈ విధమైన నియమ నిష్టలను పౌరాణిక సినీమాల విషయంలో  ఎన్.టి.రామారావు పాటించేవారు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, మహావిష్ణువు, శివుడు వంటి వేషధారణలో వున్నప్పుడు శాకాహారాన్నే తీసుకోవడం, నేలమీదే పడుక్కోవడం వంటివి  ఆచరించేవారు.

ఘంటసాలవారి భగవద్గీత  రికార్డింగ్ అంతా ఒకేసారి జరగలేదు. తన ఇతర సినీమా పాటలకు, ఇతర కార్యకలాపాలకు అడ్డంకి రాకుండా వ్యవధి తీసుకుంటూ రికార్డింగ్ జరిపారు. చాలా శ్లోకాలకు కంపోజింగ్ కూడా రికార్డింగ్ స్పాట్ లనే జరిగిందని మా నాన్నగారు చెప్పగా విన్నాను. 

అప్పటికి నేను నా ఉద్యోగ విధులలో తలమునకలుగా వుండడం వలన మా వాళ్ళ సినీమా  వ్యవహారాలకు చాలావరకు దూరమయ్యాను. రికార్డింగ్ లు, రీరికార్డింగ్ లకు వెళ్ళడం కుదిరేదికాదు. (HMV రికార్డింగ్ స్టూడియో జెమినీ స్టూడియో, సెఫైర్ ధియేటర్ల మధ్య ఒక చిన్న సందులో వుండేది. దానికి ఎదురుగానే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆఫీస్, ప్రొజెక్షన్ థియేటర్ వుండేవి.) ఇప్పుడు వాటి ముందట  వుమ్మిడియార్స్ వాళ్ళ హైటెక్  నగల దుకాణాలు దర్శనమిస్తాయి.

భగవద్గీతను ఒక భగవత్కార్యంగా భక్తి శ్రధ్ధలతో రూపొందించారు. సంగీతంలో తనకు గల అనుభవాన్ని, విద్వత్ ను సంపూర్ణంగా ఈ శ్లోకాలలో ఉపయోగించారు.  రసోత్పత్తి కలగడానికి శుధ్ధ శాస్త్రీయ పధ్ధతిలో అనేక హిందుస్థానీ, కర్ణాటక సంగీత రాగాలను సందర్భోచితంగా ప్రయోగించారు. ఒక్కొక్క శ్లోకానికి, తాత్పర్యానికి ముందు వెనుకల సార్ధకత పెంచేలా వాద్యాలను ఉపయోగించారు. భావోద్వేగాల స్ఫూర్తిని కలిగించడంలో ఘంటసాలవారి ప్రతిభ అణువణువునా గోచరించింది.  ఘంటసాలవారి భగవద్గీత గానంలో నిష్ణాతులైన ఉత్తమ వాద్య కళాకారుల  పరిపూర్ణ సహకారం లభించింది. సర్వశ్రీ - మిట్ట జనార్దన్ - సితార్, గుణసింగ్ - ఫ్లూట్, సంగీతరావు - హార్మోనియం, రామసుబ్బు, చిత్తూరు సుబ్రహ్మణ్యం - వైలిన్స్, సుభాన్ - క్లారినెట్, యు. రామచంద్రరావు - డ్రమ్స్, జడ్సన్ - తబలా,  భద్రం - తంబురా, మొదలగు కళాకారుల సహకారంతో ఘంటసాల మాస్టారు తాత్పర్య సహిత గీతాగానాన్ని రికార్డ్ చేసారు.

ఘంటసాలవారి భగవద్గీత రెండు భాగాలుగా జరిగింది. రెండింటికీ మధ్య ఆరు మాసాల కాల వ్యవధి. ఇతర కార్యకలాపాల వలన కొంత ఘంటసాలవారి అనారోగ్యం కారణంగా కొంత జాప్యమయింది. భగవద్గీత వింటున్నంతసేపూ   ఆ రకమైన తేడాలేవీ వారి గాత్రంలో మనకు కనిపించవు. మనకళ్ళెదట శ్రీకృష్ణుడు, అర్జునుడు మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరి శ్లోకాలలోని వైవిధ్యం, ఘంటసాలవారిలో దాగివున్న నటనా ప్రతిభ ద్యోతకమవుతుంది. విశ్వరూప దర్శన సమయంలో ఉపయోగించిన వాద్య సమ్మేళనం మనకు ఒక రకమైన జలదరింపు, సంభ్రమం కలిగిస్తుంది. నిజంగానే కురుక్షేత్ర సంగ్రామ భూమిలో వున్నామనే భావన కలుగుతుంది. నరనారాయణులిద్దరూ ఘంటసాలవారి లో కనిపిస్తారు. 


పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం...'
అనే శ్లోకం తో మొదలై మరో నూరుకు పైబడిన శ్లోకాలతో ఘంటసాల భగవద్గీతా గాన రసవాహిని శ్రోతలకు గొప్ప భావోద్వేగాన్ని కలుగజేస్తుంది. చివర, ఫలశృతిగా శాంతి శ్లోకాన్ని, అసతోమా సద్గమయా శ్లోకంతో తన భగవద్గీతను ముగించారు ఘంటసాల మాస్టారు. చివరలో వచ్చే ఆ శాంతిశ్లోకంలో తనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కూడా కలసి పాడారు. అందులో ఒక గాత్రం మా రెండవ చెల్లెలు పద్మది కావడం మాకందరికీ ఎంతో ఆనందదాయకం. అప్పటికి ఆమె వయసు 13 మాత్రమే. 

భగవద్గీత శ్లోకాలు పార్థాయప్రతిబోధితాం... శాంతిశ్లోకం    

తాను పాడిన భగవద్గీత ను రికార్డింగ్ సమయంలో వినడమే తప్ప, అది రికార్డ్ గా విడుదలైన తర్వాత సృష్టించిన చరిత్ర, తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులు ఏవీ ఘంటసాలవారికి తెలియనే తెలియవు. అదే దురదృష్టం. 

🙏💐🙏

పంటలు పండని బీడువారిన భూములను వదలి పశుపక్ష్యాదులు పచపచ్చని పచ్చిక మైదానాలను వెతుకుతూ పోయినట్లే తన భవిష్యత్తు కోసం ఘంటసాలవారి దగ్గర సహాయకుడిగా,  వారి పెంపుడు కొడుకులా ఇరవైఏళ్ళపాటు ఇంట్లో మసలిన జె.వి.రాఘవులు 1969లో మాస్టారిని వదలిపెట్టిపోయారు. ఆయనకు డి.రామానాయుడు రూపంలో మంచి ప్రాపకం లభించింది. వారి సంస్థలో సహాయకుడిగా ఎమ్.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహాదేవన్ ల వద్ద పనిచేసారు. రామానాయుడు గారురాఘవులు నాయుడు గారికి తమ 'ద్రోహి' చిత్రానికి సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించి ప్రోత్సహించారు. అయితే ఆ సినీమా విజయవంతం కాలేదు. పాటలు పెద్దగా బయటకు రాలేదు. 1973 లో వచ్చిన రామానాయుడిగారి  'జీవన తరంగాలు' రాఘవులు గారికి సంగీతదర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది. నేపథ్యగాయకుడిగా రాణించడానికి తగిన గాత్రం కాదు. కేవలం కొన్ని తరహా పాటలకే పరిమితమైన గాత్రం. అందువలన సంగీత దర్శకుడిగా నే తమ అదృష్టాన్ని నమ్ముకొన్నారు. 
తెలుగు సినీమారంగంలో సంగీతం ఎవరు నిర్వహించినా  హీరో పాటలు పాడాలంటే ఘంటసాలే రావాలనే దృష్టిలో ఆనాటి హీరోలు, వారిని అనుసరించే నిర్మాత లు వుండేవారు. 'జీవనతరంగాలు'లో రాఘవులు గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. అందులో 'ఈ జీవన తరంగాలు'  లో పాటను అసమాన్యం గా పాడారు. 

ఈ జీవనతరంగాలలో

ఆ పాట ఈనాటికీ బహుళ ప్రచారంలో వున్నది. తన శిష్యుడు ప్రయోజకుడైనందుకు ఘంటసాలవారెంతో సంతోషించారు. ఆరోజుల్లోనో అంతకుముందో రాఘవులు  టి.నగర్ లోని త్యాగరాజ గ్రామణి స్ట్రీట్ లో కట్టుకున్న తమ సొంత ఇంటి గృహప్రవేశానికి మాస్టారింట్లోవారిని, మా నాన్నగారినీ కూడా ఆహ్వానించారు. ఇంట్లోకి ప్రవేశించగానే వుండే వరండాలో గోడమీద ఘంటసాలవారి ఫోటోను పెట్టారు. ఆ తర్వాత రాఘవులుగారిని ఘంటసాలవారింట చూడలేదు.

1973లో  మధ్య మధ్య అనారోగ్యంతో బాధపడుతూ  ఒక ఇరవైఐదు సినీమాలలో మాత్రమే ఘంటసాల మాస్టారు దాదాపు 65 పాటలు పద్యాలు పాడారు. కొన్ని పాటలకు జలుబు వలన  గొంతు సహకరించక వేరే వర్ధమాన గాయకుల చేత ట్రాక్ పాడించి షూటింగ్ ముగించేవారు. సినీమా రిలీజ్ లోపల మాస్టారు ఆ పాటలను మళ్ళీ పాడి ట్రాక్ మిక్స్ చేసేవారు. కొన్ని సందర్భాలలో ఆయా నూతన గాయకులు పాడిన పాటలు బాగున్నాయనుకునేప్పుడు వాటిని తాను మళ్ళీ పాడకుండా ఆ గాయకుల గొంతునే ఉంచమని  ఘంటసాలవారు నిర్మాతలను కోరేవారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, జేసుదాస్‌, జి.ఆనంద్, రమేష్, ఎ.వి.ఎన్.మూర్తి వంటి నూతన గాయకులతో ప్రయోగాలు మొదలుపెట్టి వారిని చిత్రసీమ ప్రోత్సహిస్తున్న రోజులవి. ఎంతమంది నూతన గాయకులు వచ్చినా ఘంటసాలవారి స్థాయికి ఏ ఒక్క గాయకుడు అందుకోలేకపోవడం అటు సంగీత దర్శకులకు, ఇటు నిర్మాతలకు క్లిష్టతరమయింది. 

1973 లో వచ్చిన సినీమా లలో  - 'బంగారుబాబు'లోని  'చెంగావి రంగు చీర', దేవుడు చేసిన మనుషులు' లో ' దేవుడు చేసిన మనుషుల్లారా', పల్లెటూరి బావలో - 'ఒసే వయ్యారి రంగి',  'మైనర్ బాబు'లో 'మోతీ మహల్ లో చూశానా', 'డాక్టర్ బాబు'లో 'విరిసే కన్నులలో', 'మరపురాని మనిషి'లో 'వచ్చింది వచ్చింది లచ్చిమి' వంటి పాటలు మంచి ప్రచారం పొందాయి.

వీటన్నిటిలోకి తలమానికంగా ఈనాటికీ అందరిచేతా పాడబడుతూ అందరి మన్ననలు పొందుతున్న పాటలు 'భక్త తుకారం'లోని పాటలు. ఘంటసాలవారు ఎప్పుడు పాడితే అప్పటివరకు కాచుకునే వుంటామని ఆదినారాయణరావుగారు  ఆ చిత్రంలోని ఆరు పాటలను, మూడు పాటలు ఘంటసాలవారి చేతే పాడించారు. ఆ చిత్రంలోని 'ఘనా ఘన సుందరా', 'భలే భలే అందాలు', 'ఉన్నావా అసలున్నావా', 'చిందులు వేయకురా నరుడా'  పాటలు అజరామరంగా నిల్చిపోయాయి. 

ఘనా ఘనా సుందరా - భక్త తుకారం

భలే భలే అందాలు సృష్టించావు - భక్త తుకారం

ఉన్నావా అసలున్నావా - భక్త తుకారం

ఈ పాటలన్నీ ఘంటసాలవారు అనారోగ్యంతో వున్నప్పుడు పాడినవే. ఈ సినీమాలోని ట్రాక్స్ కొన్ని వి.రామకృష్ణ చేతే పాడించారు. రామకృష్ణ గొంతు చాలా వరకు ఘంటసాలవారి గొంతును అనుకరించి వుండేది.

గాయకుడిగా మద్రాస్ లో  తన ప్రయత్నాలు మొదలెడుతున్న తొలి రోజుల్లో  వి.రామకృష్ణ తన తల్లిగారిని తోడుతీసుకొని ఒకసారి ఘంటసాలవారింటికి వాయిస్ ఆడిషన్ కోసం వచ్చారు. ఘంటసాల మాస్టారు ఎదుట  కొన్ని పాటలు పాడారు. కొత్త గాయకులు ఎవరు వచ్చినా సినీమా పాటలు, తాను పాడిన పాటలు కాకుండా వేరే పాటలు పాడమనేవారు. అప్పుడే వాళ్ళ ఒరిజినాల్టీ తెలుస్తుందని అనేవారు. చాలామంది కొత్త కుర్రాళ్ళు సినీమా పాటలంటే చాలా బాగా పాడేవారు. నాన్ ఫిల్మ్ గీతాలు పాడేప్పటికి తేలిపోయేవారు. అలాటి వారందరికీ ఘంటసాలవారు ఎప్పుడూ ఒకే సలహా ఇచ్చేవారు. ఏ గాయకుడినైనా అనుసరించండి కానీ అనుకరించవద్దనేవారు. అనుకరించేవారికి గాయకుడిగా తాత్కాలిక మనుగడే తప్ప సుదీర్ఘకాలం రాణించలేరనేది వారి నిశ్చితాభిప్రాయం.

రామకృష్ణ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మాట్లాడుతూ ఆ కుర్రాడు సుశీల అక్క కుమారుడని పాటలు బాగానే పాడుతున్నా తన గొంతునే, ముఖ్యంగా వయసు దాటాక ఏర్పడిన జలుబు గొంతునే తెలిసో తెలియక అనుకరిస్తున్నాడని అది అతని భవిష్యత్తుకు అంతగా దోహదపడదని అనడం విన్నాను. అది చాలా వరకు నిజమే అయింది. 

ఈ రోజుల్లోలాగా  తమ వారసులను ప్రమోట్ చేసుకోవడమనే సంస్కృతి ఆనాటి సినీమా రంగంలో ఎక్కువగా కనపడదు.  బాగా పాడతాడు పాడించుకోండని రామకృష్ణ  విషయంలో సుశీలగారు కానీ, మా అబ్బాయి పియోనా బాగా వాయిస్తాడు, అవకాశాలు ఇవ్వండని రాజేశ్వరరావుగారో, ఘంటసాలగారో తమ పిల్లలకోసం ఎవరినీ అడిగిన దాఖలాలు కనపడవు. స్వతఃసిద్ధమైన ప్రతిభ వుంటే వాళ్ళకు వాళ్ళే అవకాశాలు సంపాదించుకొని వృధ్ధిలోకి రావాలని ఆనాటి తల్లిదండ్రులు భావించేవారు. 

సినీమా రంగం చిత్ర విచిత్రమైనదని అందరికీ తెలిసిందే.

ఆ విశేషాలు ఏమిటో వచ్చేవారం చూద్దాము.

                   ...సశేషం