visitors

Sunday, January 30, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఆరవ భాగం

30.01.2022 - ఆదివారం భాగం - 66:

అధ్యాయం 2  భాగం 65 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

9 టు 9 రీ-రికార్డింగ్ కాల్షీట్. ఆరోజుతో ఎలాగైనా రీరికార్డింగ్ పూర్తిచేసేయాలనే దీక్షతో వచ్చారు ఘంటసాల మాస్టారు. ముందుగా ఆ రోజు చేయవలసిన సీన్స్ తెరమీద వేసి చూపారు.  స్టాప్ వాచ్ తో మొత్తం సీన్ ఎన్ని నిముషాలు వుందో అందులో ఎంతమేరకు మ్యూజిక్ అవసరమవుతుందో ఏఏ వాద్యాలు ఉపయోగించాలో నిర్ణయించుకున్నారు. ఆ సీన్ లో ముందు ఛేసింగ్స్,   తర్వాత ఒక లెన్తీ ఫైట్ సీక్వెన్స్. మాస్టారు, మా నాన్నగారు హార్మోనియం మీద, జడ్సన్ తబలామీద సహకరిస్తూంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. తనకు తృప్తి కలిగేంతవరకు చేర్పులు , మార్పులు చేసి నోట్స్ ఫైనలైజ్ చేసారు. మధ్యమధ్య ఏ విధమైన సౌండ్ ఎఫెక్ట్స్ ఏ వాద్యం మీద రావాలో తాత్కాలికంగా నిర్ణయించారు. ఓ ముఫ్ఫై నలభైమంది ఆర్కెష్ట్రా. వెస్టర్న్ స్ట్రింగ్, విండ్ ఇన్స్ట్ర్మెంట్స్ ఎక్కువగానే వున్నాయి. హై పిచ్ లో ఫాస్ట్ టెంపో నోట్స్ ను మాస్టారు కంపోజ్ చేశారు. ఒక్కొక్క సెక్షన్ నుండి ఒక్కొక్క ప్రతినిధి వచ్చి మా నాన్నగారు చెపుతూంటే వారి వారి భాషల్లో నోట్స్ రాసుకొని మిగతావారికి అందజేశారు. ముందుగా ఆ నోట్స్  ఒకటి రెండు సార్లు ప్రాక్టీసు చేశాక, తెర మీద సినీమాతో పాటు వాయింపజేసి నాన్ సింక్ లు ఏమైనా వున్నాయేమోనని చెక్ చేసుకొన్నారు. ఫస్ట్ మోనిటర్ లో చిన్న చిన్న మార్పులు అవసరమయాయి. వాటిని సరిచేసి మరో మోనిటర్ పిక్చర్ తో చూశారు. తృప్తికరంగానే వచ్చింది. టేక్ తీద్దామా అని సౌండ్ డిపార్ట్మెంట్ వారిని. ఆడిటోరియంలో ని ఆర్కెస్ట్రాను మైక్ లో అడిగారు మాస్టారు. టేక్ సమయంలో ఏ రకమైన  దగ్గులు, తుమ్ములు, ఆవలింతలు, బరబర చప్పుళ్ళు వినపడకూడదనడానికి ఇదొక హెచ్చరిక. సౌండ్ వాళ్ళు తాము రెడీ అని చెప్పాక ఆర్కెస్ట్రాను కండక్ట్ చేసే రాఘవులుగారు సైలెన్స్ అని ఓ అరుపు అరిచి, సీన్ నెంబర్ చెప్పి స్టార్ట్  అనగానే స్క్రీన్ మీద సినీమా ప్రారంభమై ఆడిటోరియంలో వాద్యాల మ్రోత ఆరంభమయింది. అన్ని వాద్యాలు ఒకేసారి జోరుగా మ్రోగుతున్నప్పుడు వినేవారికి చాలా ఉత్కంఠ కలుగుతుంది. వాద్యాలు స్పీడ్ అందుకున్నాయి.  సౌండ్ ఇంజనీర్ పక్కనే కూర్చున్న  ఘంటసాల మాస్టారు సడన్ గా కట్ అని అరిచారు. ఒక్కసారిగా వాద్యాలన్నీ ఆగిపోయాయి. మాస్టారు ఎందుకు కట్ చెప్పారో ఎవరికీ అర్ధం కాలేదు. మాస్టారికి తెలుసు ఏ సెక్షన్ లో పొరపాటని. అయినా  ఒక్కొక్క సెక్షన్ ను  మళ్ళీ వాళ్ళ వాళ్ళ నోట్స్ ను వాయించి చూపమన్నారు. అలా మళ్ళీ వాయించేప్పుడు  వైలిన్స్ సెక్షన్ లో ఎవరో నోట్స్ తప్పుగా రాసుకోవడం వలన ఒకచోట స్వరం తప్పి అపశ్రుతిగా వినపడింది. ఆ విషయం థియేటర్లో వాయిస్తున్నవారికి తెలియదు . ఏ చిన్న లోపం ఎక్కడ జరిగినా లోపల సౌండ్ కంట్రోల్ రూమ్ లో తెలిసిపోతుంది. మళ్ళీ మొత్తం సీన్ మొదటినుండి ప్రారంభించవలసిందే. ఇలాటి పొరపాట్లు ఎవరు చేసినా దాని ఫలితం అందరూ అనుభవించాలి. అందుకే ఆర్కెస్ట్రాలో బాగా అనుభవం ఉన్నవారిని, ప్రొఫెషనల్స్ ను పిలుస్తారు. ధియేటర్లోకి వచ్చాక ఒక్కొక్క నిముషం ఎంతో విలువైనది. అంతా అణా పైసలతో కూడుకున్నది. అనుకున్న రీతిలో పని సక్రమంగా జరగకపోతే అక్కడ నిర్మాత బిపి రేట్ పెరిగిపోతూంటుంది. అటువంటి దురవస్థ నుండి నిర్మాతకు తప్పించవలసిన బాధ్యత ఇప్పుడు సంగీతదర్శకుడిదే. నిర్ణీత సమయంలో పనిపూర్తి చేయాలి, తను చేస్తున్న సీన్ తనకు ఇతరులకు పూర్తి సంతృప్తిని కలిగించాలి. ఇందుకుగానూ ఘంటసాలగారు ఎంతో శ్రమించేవారు. ఆఖరు నిముషం వరకూ అన్నీ సక్రమంగానే వున్నా టేక్ కు వెళ్ళేప్పటికి ఎదో అంతరాయం. సౌండ్ విభాగంలో కరెంట్ ఫ్లక్చువేషన్ వల్ల మైకులు పనిచేయకపోవడం, శ్రుతుల బిగింపు ఎక్కువై వైలిన్ తీగెలు తెగిపోవడం, తబలా,డ్రమ్ముల శ్రుతులు జారిపోవడం, లేదా హార్మోనియం మెట్లు  జామ్ అయి హ్యాంగ్ కావడం,ఆర్కెస్ట్రా రూమ్ లోని కుర్చీలో, టేబిల్సో జరిగి చప్పుడు కావడం ఇత్యాది అనివార్య అవాంతరాలతో టేక్ సగంలో కట్ చేసి మళ్ళీ మొదలుపెట్టవలసి వచ్చేది. ఇప్పటి మోడర్న్ టెక్నాలజీ ఆనాడే వుండివుంటే మరెంతో ఉత్తమ సంగీతం లభించేది.   ప్రపంచ సినీమా ఇండస్ట్ట్రీలతో పోలిస్తే భారతీయ చలనచిత్ర సాంకేతిక నైపుణ్యం ఎప్పుడూ ఒక దశాబ్దం వెనకే అని సినీ పండితుల అభిప్రాయం. హాలీవుడ్ లో ఔట్ డేట్ అయిన తర్వాత ఆ సాంకేతికత ఇండియాకు దిగుమతి అవుతుందని మా వీడియో టెక్నిషియన్స్ అనడం నేను విన్నాను. ఈ రకమైనటువంటి పొరపాట్లవలన, లోపాల వలన నిర్ణీత సమయంలో సక్రమంగా పని పూర్తికాదు.  అందువల్ల ఏర్పడే స్ట్రెస్,  స్ట్రైన్ కళాకారుల మీద చాలా తీవ్రంగా వుంటుంది. ఈ విధమైన ఒత్తిళ్ళు తట్టుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. 

ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించి అనుకున్న సమయానికి నిర్మాత, దర్శకుల తృప్తిమేరకు పాటలను, రీరికార్డింగ్, మిక్సింగ్ లను పూర్తి చేయడమనేది  ప్రసవ వేదన అనుభవించడంలాటిది. ప్రతి మనిషి జీవితంలో ఏదో దశలో ఏవో అపశ్రుతులు ధ్వనిస్తూనేవుంటాయి. దానికి కారణం స్వయంకృతాపరాధాలు కావచ్చు, లేదా తన చుట్టూవుండే తనవారి పొరపాటు వల్ల కూడా కావచ్చు. కానీ అందువల్ల కలిగే దుష్ఫలితాలు ఆ మనిషి జీవితాంతం వెంటాడుతూనేవుంటాయి. ఆ మనిషిని అన్ని విధాలా భౌతికంగా, మానసికంగా కృంగదీస్తూనేవుంటాయి.

1972 సెప్టెంబర్ లో జరిగిన ఒక సంఘటన ఘంటసాలవారిని మనోవేదనకు గురిచేసింది. సుప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత శ్రీ కె.వి రెడ్డిగారు కాలధర్మం చెందారు. విజయా  వాహినీ సంస్థల పురోభివృధ్ధికి ఎంతగానో శ్రమించిన వ్యక్తి. ఘంటసాలవారంటే సదా ఎంతో ప్రేమ,అభిమానం కనపరుస్తూ ఆయన సంగీత ప్రతిభను ఎంతగానో గౌరవించిన వ్యక్తి. కె.వి.రెడ్డిగారి ఇల్లు వెనక భాగం మాస్టారింటికి ఎదురుగానే వుండేది. ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో రాత్రిపూట స్టూడియో నుండి ఇళ్ళకు చేరేవారు. కె.వి.రెడ్డిగారు పోయినరోజు  ఆ ఇంట్లోవారిని పరామర్శ చేయడానికి మాస్టారు వెళుతూ నన్ను కూడా వెంట తీసుకువెళ్ళారు. మేము వెళ్ళే సమయానికి బయటవాళ్ళెవరూ పెద్దగా కనపడలేదు. ప్రముఖ నటి వాణిశ్రీ ఉన్నారు. కె.వి.రెడ్డిగారి అబ్బాయిలలో ఒకరు రామకృష్ణ స్కూల్ లో సహధ్యాయే అయినా నేనెప్పుడూ నా చిన్నతనంలో వారింటికి వెళ్ళలేదు. ఒకరకమైన భయం. కె.వి.రెడ్డిగారు పిల్లల క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారని చెప్పుకునేవారు. వారు సొంతంగా చిత్రనిర్మాణం మొదలెట్టి జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద 'పెళ్ళినాటి ప్రమాణాలు' తీస్తున్న రోజులలో ఆ ఆఫీసుకు అప్పుడప్పుడు వెళుతూ అక్కడ ఆయనను దూరం నుండి చూసేవాడిని. ఆ  మొదటి సినీమాకు ఘంటసాల మాస్టారే సంగీత దర్శకత్వం వహించారు. మా నాన్నగారు సహాయకుడు. కొన్నిపాటలకు వీణ కూడా వాయించారు. మా నాన్నగారు ఎన్నో కంపెనీలకు అసిస్టెంట్ గా పనిచేసినా ఒక్క కె.వి.రెడ్డిగారి జయంతి బ్యానర్లో మాత్రమే  ఆ సినీమా అయినన్నాళ్ళు అదనంగా నెల జీతం క్రింద కొంత పైకం ఇచ్చేవారు. అదెన్నడూ మరచిపోలేను.  ఇంట్లోగానీ, బయటగానీ ఎటువంటి చెడువార్తలు విన్నా ఘంటసాలవారు అమితంగా చలించిపోయేవారు. ఇంటికి ఎదురుగా వుండే చిరకాల సన్నిహితుడు కె.వి.రెడ్డిగారు పోవడం ఘంటసాల మాస్టారికి ఎంతో ఆవేదన కలిగించింది.

ఘంటసాలవారు ఏభైవపడి చేరేసరికి మనిషిలో వృధ్ధాప్య ఛాయలు, వైరాగ్య ధోరణి కనపడసాగాయి.  వంశపారంపర్యంగా వస్తున్న మధుమేహ వ్యాధి వారికి తమ 33వ ఏటనే సంక్రమించింది. అది అంతకుముందే ఎప్పటినుండి వుండేదో తెలియదు. ఈరోజుల్లోలా ఆనాడు ఇళ్ళలో గ్లూకోమీటర్లు, బిపి చెకింగ్ మీటర్లు అందుబాటులో వుండేవికావు. యూరిన్ టెస్ట్ లు చేసుకోవడానికి తగినంత సమయమూ దొరికేదికాదు. బిపి, సుగర్ లు రెండూ బాగా పెరిగిపోయాయి. ఎప్పుడూ అరికాళ్ళ మంటలతో బాధపడేవారు. రికార్డింగ్, రీరికార్డింగ్ సమయాలలో గంటల తరబడి నిలబడే వుండవలసి వచ్చేది. దానితో కాళ్ళమంటలు మరింత ఎక్కువయేది. ఇంటికీ రాగానే తమ్ముడు కృష్ణగానీ , సావిత్రమ్మగారు గానీ అరికాళ్ళకు కర్పూరం వేసిన నూనెతో మర్దనా చేస్తే కొంత సర్దుకునేది.

మిగిలిన రంగాలతో పోల్చి చూస్తే ఆనాడు సినీమావాళ్ళకు ఆహారం విషయంలో కంట్రోల్ వుండేదికాదు. నిర్ణీత సమయానికి భోజనం, నిద్ర వుండేవికావు. ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎంతో జాగ్రత్త అవసరం. మనిషికి 45 ఏళ్ళ వరకూ మంచి రెసిస్టెన్స్ పవర్ వుంటుంది. ఆ వయసులో ఎలాటి ఆహారనియమాలు పాటించకపోయినా మనిషి దృఢంగానే వున్నట్లు కనిపిస్తాడు. అక్కడనుండే ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. ఘంటసాల మాస్టారు రుచికరమైన ఆహార పదార్ధాల విషయంలో నిగ్రహం పాటించలేకపోయేవారు.  చిన్నవయసులో ఎలాగూ సరైన తిండికి నోచుకోలేదు, ఇప్పుడు బాగా సంపాదిస్తున్న కాలంలో కూడా సుష్టుగా భోజనం చేయకపోతే ఎలా అనేవారు. సాధారణంగా డైబెటిక్స్ అందరూ తీపి పదార్ధాలకు లోబడిపోతారు. ప్రముఖ హాస్యనటుడు రేలంగి గారు కూడా ఇదే మనోస్థితిలో వుండేవారు. చిన్న వయసులో రాళ్ళనైనా హరాయించుకోగల శక్తి వున్నప్పుడు చేతిలో పైసలు లేక అన్నంకోసం మొహంవాచి మంచినీళ్ళతోనే ఆకలితీర్చుకోవలసి వచ్చింది. నాలుగు డబ్బులు సంపాదించి హాయిగా కడుపునిండా తిందామనుకునేసరికి రకరకాల జబ్బులు ఒంటిని పట్టి కావలసినవి తినడానికి నోచుకోలేకపోతున్నాని ఎన్నోసార్లు అందరితో చెప్పి బాధపడేవారు. సుగర్, బిపి రెండూ ఆప్తమిత్రులు. ఎవరికైనా ఒకటుంటే పక్కనే రెండోదికూడా వచ్చి చేరుతుంది. ఈ రెండూ వుంటే మిగిలిన వ్యాధులు ఒక్కొక్కటే కాలక్రమేణా బయటపడతాయి. అందులోనూ ఘంటసాల మాస్టారు కృష్ణాజిల్లా వ్యక్తి. ఆహార పదార్థాలు అన్నిటిలో ఉప్పు కారాలు మరీ మితిమీరకపోయినా బాగానే పడేవి. సావిత్రమ్మగారి నేతృత్వంలో తయారైన రకరకాల ఆవకాయలు, కొరివికారం, దోసావకాయ వంటి ఊరగాయలు సంవత్సరం పొడుగునా వుండేవీ. చిరకాలం నిల్వ వుండే ఊరగాయలు కావాలంటే ఘాటైన గుంటూరు మిరపకాయలు, అక్కడి సన్న ఆవాలు, శుధ్ధమైన నువ్వులనూనె మాత్రమే ఉపయోగించాలని ఊరగాయ శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈనాడు మనకు షాపుల్లో దొరికే ఊరగాయలన్నింటిలో వినిగర్ వంటి ప్రిసర్వేటివ్స్ వేసేస్తారు. దానివలన  మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, టొమేటొ, గోంగూర ఇలా ఏ ఊరగాయ చూసినా అన్నిటి రుచులు ఒక్కలాగే వుంటాయి. ఒకదానికొకటి తేడానే తెలియదు. షాపుల్లో దొరికే ఊరగాయలు తెలుగువారి ఊరగాయ సంస్కృతిని ముమ్మాటికి ప్రతిబింబించవు. ఏభై అరవై ఏళ్ళ క్రితం మన బామ్మలు, అమ్మమ్మలు పెట్టే ఊరగాయలు, సీమమిరప పొడి కలిపిన అప్పడాలు, ఒడియాలు ఈనాడు ఏ ఇంటా కనపడవు.  శాస్త్రోక్తంగా నిబధ్ధతతో ఇంట్లో  ఊరగాయలు పెట్టే ఓపికగానీ, తిని హరాయించుకునే ఆరోగ్యాలు కానీ ఈకాలంలో  ఎవరికీ లేవు. ఆనాటి ఆహారపు సంస్కృతే వేరు.

సినీమా రంగంలో అడుగుపెట్టి రెండున్నర దశాబ్దాలుగా  సినీ సంగీత సామ్రాజ్యంలో  మధురగాయకుడిగా, విశిష్ట సంగీతదర్శకుడిగా కీర్తి పొంది మకుటంలేని మహారాజుగా తెలుగువారందరిచేతా నీరాజనాలు పట్టించుకున్న ఘంటసాల మాస్టారికి నిరంతరంగా కాకపోయినా తగిన విశ్రాంతి పొందేలా తగు మార్పులు చేసుకోవాలని ఆశించారు. వయోధర్మానికి తగిన మంచి సాహిత్యం గల పాటలేవైనా తనకు వస్తే మాత్రమే పాడాలని, ఆకతాయి అల్లరి చిల్లరి పాటలు, ద్వంద్వార్ధాల పాటలు పాడకూడదని, బాగా పాడే కొత్త కుర్రాళ్ళను తన పరిధులమేరకు ప్రోత్సహించాలని అనుకునేవారు. ఘంటసాలవారు మొదటినుండీ లైట్ మ్యూజిక్ కచేరీలతో పాటు ఫక్తు కర్ణాటక సంగీత కచేరీలు దేశవ్యాప్తంగా చేయాలని ఆశపడేవారు. కానీ ఆ ఆశ ఆశగానే మిగిలిపోయినందుకు బాధపడేవారు. గాయకుడిగా సినీమా టెక్నిక్ వేరే, కర్ణాటక సంగీత బాణీ వేరే. రెండింటిని సమన్వయ పర్చి సమన్యాయం చేకూర్చడం అంత సులభమైన పనికాదు. శాస్త్రీయ సంగీత కచేరీ చేయడానికి చాలా సాధన అవసరం.  నిరంతరం ఏవో వ్యాపకాలతో క్షణం తీరికలేని ఘంటసాల మాస్టారికి అంత సమయం వుండేది కాదు. తాను ఎంత వద్దనుకున్నా నిర్మాతల ఒత్తిడిని, ఆదరాభిమానాలను  త్రోసిపుచ్చలేక అన్ని రకాల పాటలు చివరివరకూ పాడుతూనే వచ్చారు. ఎప్పుడైతే శరీరం విశ్రాంతి  కోసం తొందరచేస్తున్నదో అప్పుడే ఆయన తన జీవితంలో సార్ధకత చెందే, చిరస్థాయిగా అందరి  మన్ననలు పొందే ఉత్తమ కార్యం ఏదైనా చేసి సినీమా రంగం నుండి విశ్రాంతి పొందాలనే దృఢ నిశ్చయానికి వచ్చారు.  గాయకుడిగా సార్ధకత చెందే కార్యం ఏదని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఘంటసాలవారికి లతామంగేష్కర్ గారి భగవద్గీత గుర్తుకు వచ్చింది.  ఆవిడ భగవద్గీత కు భిన్నంగా పండిత పామరులంతా విని,  దాని సారాంశం అర్ధం చేసుకొని ఆనందించే రీతిలో రూపొందించాలని తీర్మానించారు. 
 
అందుకు గానూ ఘంటసాలవారు ...
ఏం చేసారో ఎలా ముందుకు సాగారో
వచ్చేవారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో...

                   ... సశేషం

Sunday, January 23, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఐదవ భాగం

23.01.2022 - ఆదివారం భాగం - 65*:
అధ్యాయం 2 భాగం 64 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1970లో ఘంటసాలవారికి భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' బిరుదుప్రదానం చేసింది. ఆ మరుసటి నెల ప్రారంభంలోనే ఆయన సినీ జీవిత రజతోత్సవం సినీమా ప్రముఖుల, రాజకీయ నేతల సమ్మేళనంతో హైదరాబాద్ లో అతివైభవంగా జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అదే హైదరాబాద్ లో సుప్రసిధ్ధ హిందీ నేపధ్యగాయని లతామంగేష్కర్ ఆధ్వర్యంలో ఘంటసాలవారి సంగీత కచేరీ, వారికి ఘన సన్మానం జరిగింది. తన తండ్రిగారి పేరు మీద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'దీనానాధ్ మంగేష్కర్' పురస్కారాన్ని ఘంటసాలవారికి ఇచ్చారు. ఆ సందర్భంగా లతామంగేష్కర్ తాను గానం చేసిన 'భగవద్గీత' ఎల్.పి.రికార్డులను ఘంటసాల మాస్టారికి బహుకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గాయని చేతుల మీదుగా ఒక ఉత్తమ పురస్కారం అందుకోవడం ఘంటసాలవారికి చాలా ఆనందం కలిగించింది.

లతామంగేష్కర్ భగవద్గీత ఘంటసాల మాస్టారి మరో నూతన ఆశయానికి బీజం వేసింది. 1972 వచ్చేసరికి తెలుగు సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి కొత్త కొత్త నటీనటులు రాసాగారు. నూతన సంగీత దర్శకులు అవకాశాలు పొందసాగారు. సాంకేతికంగా కూడా మార్పులు చోటుచేసుకోవడం ప్రారంభమయింది. కలర్ సినిమాలు ఎక్కువైనాయి. చిత్రనిర్మాణం అధికమయింది. ఈ రకమైన నూతన పరిణామాలు సంగీత రంగంలోనూ కనిపించాయి.  సంగీత సరళి మారుతూ వచ్చింది. మల్టీ ఛానల్ రికార్డింగ్ సిస్టమ్ వచ్చింది. దానితో లైవ్ రికార్డింగ్ తో పాటూ ట్రాక్ మిక్సింగ్ సౌకర్యాలు ఎక్కవయాయి.  ట్రాక్ సింగర్స్ కు కొత్త జీవనోపాధి కలిగింది. ఆర్కెస్ట్రేషన్ లో కూడా ధ్వని ప్రధాన వాద్య పరికరాల ప్రాముఖ్యత పెరిగింది.

1972లో ఓ 25 సినీమాలలో ఘంటసాల మాస్టారు దాదాపు నూరు పాటలు, పద్యాలు పాడారు.  వాటిలో ముఖ్యమైనవి - భార్యాబిడ్డలు, సంపూర్ణ రామాయణం, వంశోవధ్ధారకుడు, మంచోరోజులొచ్చాయి, శ్రీకృష్ణాంజనేయ యుధ్ధం, దత్తపుత్రుడు, మేనకోడలు, పండంటి కాపురం, విచిత్రబంధం, కులగౌరవం, బడిపంతులు, కాలంమారింది, బాలభారతం, కొడుకు కోడలు, వంటి చిత్రాలలో పాడిన పాటలు ఘంటసాలవారికి మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఈ నాటీకీ ఆ పాటలు ప్రచారంలోనే వున్నాయి. 

ఆ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు  రెండు. అవి - వంశోధ్ధారకుడు, మేనకోడలు, మొదటి చిత్రంలో శోభన్ బాబు , రెండవచిత్రం లో కృష్ణ హీరోలు. వంశోధ్ధారకుడు సినీమా మాధవీ ప్రొడక్షన్ ఆంజనేయులుగారిది. ఈ చిత్రంలోని 'నువ్వు నవ్వు జతగా', 'నానీ నా పేరును నిలపాలి' పాటలు అందరినోటా వినిపించాయి.

నానీ నా పేరును నిలపాలి - వంశోద్ధారకుడు

ఈ 'నానీ నా పేరును నిలపాలి' పాటను తననుద్దేశించే పాడినట్లుగా భావించుకుంటూ ఘంటసాలవారి రెండవ కుమారుడు ఘంటసాల రత్నకుమార్ తన ప్రతీ సంగీత కార్యక్రమంలో ఈ పాటను పాడుతూ తండ్రిగారిని గుర్తుచేసుకునేవాడు. ఘంటసాలగారు మాధవీ ప్రొడక్షన్స్ కు చేసిన ఆఖరి చిత్రం ఇదే. 

మేనకోడలు చిత్రంలో దాశరధి వ్రాసిన ' 'తిరుమల మందిర సుందరా' పాట ఘంటసాలవారికి గాయకుడిగా , సంగీతదర్శకుడిగా మంచిపేరునే తెచ్చిపెట్టింది. సినీమాలో ఈ పాటను సుశీలగారు పాడగా జమున మీద చిత్రీకరించారు. 

తిరుమల మందిర సుందరా - మేనకోడలు

తిరుపతి వెంకటేశ్వరుడికి సంబంధించిన గీతం కావడం వలన ఇదే పాటను ఘంటసాలగారు కూడా పాడేందుకు ఆసక్తి చూపారు. ఆ పాటను సినీమాతో సంబంధం లేకుండా  రికార్డు చేసి విడుదల చేసారు. ఈనాటికీ ఆ  రెండు పాటలు  అందరూ పాడుతూనే వున్నారు. 1960లకు ముందెప్పుడో పాడిన 'ఏడుకొండల సామీ ఎక్కాడున్నావయ్యా' మొదలుకొని 'తిరుమల మందిర సుందరా' వరకు తిరుపతి వేంకటేశ్వరుని మీద ఘంటసాల వెంకటేశ్వరుడి గానాభిషేకం కొనసాగుతూనే వచ్చింది.  నాటి నుండి నేటివరకూ ఆ భక్తి సంగీతామృతంతో తెలుగు శ్రోతలంతా పరవశత్వం చెందుతూనే వున్నారు.

సుప్రసిధ్ధ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణ రావు గారు, ఘంటసాలగారు కలసి పనిచేసిన ఏకైక చిత్రం మేనకోడలు. దాసరి నారాయణరావుగారు ఈ చిత్రానికి సహాయ దర్శకుడు. డైరెక్టర్ బి.ఎస్.నారాయణగారికి అసిస్టెంట్. ఆ హోదాలో ఆయన పాటల కంపోజింగ్ సమయంలో మాస్టారిని కలసి సన్నివేశాల గురించి క్షుణంగా వివరించేవారు. దాసరి కథ, సన్నివేశం చెప్పే తీరుకు, అత్యుత్సాహానికి ఘంటసాలవారు ముచ్చటపడి ఆసక్తిగా వినేవారు.   ఈ సినీమా విడుదలకు ముందే దాసరి దర్శకత్వంలో 'తాతా మనవడు' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. రాజబాబును హీరోను చేసింది. ఈ రెండు సినీమాలు 1972 లోనే రిలీజ్ అయాయి. మేనకోడలు తర్వాత దాసరి నారాయణరావు, ఘంటసాల కలయిక లో మరే సినీమా రాలేదనే అనుకుంటున్నాను.

1972 లో రిలీజైన వంశోధ్ధారకుడు, మేనకోడలు చిత్రాల తర్వాత ఘంటసాల మాస్టారి చేతిలో రామవిజేతా వారి 'రామరాజ్యం' తప్ప వేరే సినీమాలు లేవు. గౌతమీ రామబ్రహ్మంగారు, లలితా శివజ్యోతి శంకరరెడ్డిగారు, టి.గోపాలకృష్ణగారి సినీమాలు రావచ్చని అనుకునేవారు. 

గౌతమీ రామబ్రహ్మంగారు ఆలీబాబా 40 దొంగలు చిత్రం తర్వాత ఒక క్రైమ్ సబ్జెక్ట్ మొదలెట్టారు. కారణాలేమిటో నాకు తెలియవు కానీ, ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా సత్యంగారిని నియమించుకున్నారు. ఎవరు ఎవరిని సంగీతానికి పెట్టుకున్నా, ఆయనే వద్దంటే తప్ప, పాటలు పాడించుకోవడానికి ఘంటసాల మాస్టారి వద్దకే రావాలి.  ఆనాటికి నూతనగాయకుల ఉనికి అంతంతమాత్రంగానే వుండేది.

ఘంటసాలవారు సంగీత దర్శకత్వం చేయకపోతే ఇబ్బందులపాలయేది మా నాన్నగారిలాటి ఒకరిద్దరు మాత్రమే.

టి.గోపాలకృష్ణగారు 'వస్తాడే మా బావ' చిత్రానికి ప్రారంభోత్సవం చేసి మాస్టారి చేత కంపోజింగ్ మొదలెట్టారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసిన పాట 'వాగూ ఓ కొండ వాగూ' అనే పి.సుశీలగారితో పాడిన  యుగళగీతం మాత్రం మాస్టారు రికార్డు చేసారు. తర్వాత నిర్మాణ కార్యక్రమాలు అంత చురుకుగా సాగలేదు. 

వాగు ఓ కొండవాగు - వస్తాడే మా బావ

రహస్యం' అపజయం తర్వాత మరో సినీమా మొదలెట్టడానికి శంకరరెడ్డి గారికి మరో ఐదేళ్ళు పట్టింది. ఆయన సినీమాలన్ని భారీగా పంచవర్ష ప్రణాళికలా తాపీగా సాగుతాయి. ఈసారి ఆయన ఒక పౌరాణిక వర్ణచిత్రం మొదలెట్టారు. అదే 'సతీ సావిత్రి' . విభిన్న తరహా పాత్రలంటే మోజుపడే ఎన్.టి.ఆర్ ఈ చిత్రంలో యమధర్మరాజు. వాణిశ్రీ, సావిత్రిగా, కృష్ణంరాజు సత్యవంతుడిగా నటిస్తారని తెలిసింది. ఘంటసాల మాస్టారే సంగీతం. అయితే ఈ సినీమాలలోని పాటలేవీ వెంటవెంటనే రికార్డ్ చేయబడలేదు. మధ్యమధ్యలో మాస్టారికి సైనస్ కారణంగా చిన్న చిన్న అనారోగ్యాల వలన  ఎప్పుడు  ఏ పనులుంటాయో తెలియని స్థితి ఏర్పడింది. సతీ సావిత్రి సినిమా కోసం ఓ రెండు పాటలను ఒక శ్లోకాన్ని ఘంటసాలమాస్టారు కంపోజ్ చేసివుంచారు. బయటవూళ్ళ కచేరీలు కూడా ఏవీ వుండేవి కావు. 

ఇటువంటి ఇబ్బందికర సమయంలో మా నాన్నగారు జీవనోపాధికి మార్గాలు ఇతరత్రా, ఘంటసాలవారి అనుమతితోనే, అన్వేషించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో జరిగే తమ కూచిపూడి నాట్య కార్యక్రమంలో పాడడానికి  రమ్మని డా.వెంపటి చిన సత్యం కోరారు. అప్పటికి రికార్డింగ్ పనులేవి లేక,  ఆయన మాటను కాదనలేక  వారి బృందంతో ఢిల్లీ వెళ్ళి మొదటిసారిగా నృత్యకార్యక్రమంలో పాడారు. ఘంటసాలవారి దగ్గర సహాయకుడిగా చేరిన తర్వాత ఇతరుల వద్ద పనిచేయడం అదే మొదటిసారి. మా నాన్నగారు ఢిల్లీ వెళ్ళి వచ్చేసరికి 'సతీ సావిత్రి' కోసం కంపోజ్ చేసిన పాట 'ఓం నాదబిందు కళాధరీ' పాట ' శ్రీవాగ్దేవీ మహాకాళీ' శ్లోకం  రికార్డింగ్ పూర్తి అయపోయింది. 

నాద బిందు కళాధరీ - సతీ సావిత్రి

ఆ రికార్డింగ్ లలో పాల్గొనే అవకాశం మా నాన్నగారు కోల్పోయారు. ఆ తర్వాత ఆ సినీమా నిర్మాణ కార్యక్రమాలు మూలబడ్డాయి. 

ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని తాను చేయాలనుకున్న బృహత్ ప్రణాళిక గురించి ఘంటసాల మాస్టారు తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టారు.

ఆ విశేషాలేమిటో వచ్చే వారం చూద్దాము ... 
                                ...సశేషం

Sunday, January 2, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైనాలుగవ భాగం

02.01.2022 - ఆదివారం భాగం - 64:

అధ్యాయం 2  భాగం 63 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


"ఏ దేశమేగినా ఎందు కాలిడినా... పొగడరా నీ తల్లి భూమి భారతిని"

1971 అక్టోబర్ 9న వెస్ట్ జర్మనీ చేరిన ఘంటసాలవారి బృందం తమ  విదేశీయానంలోని మొదటి సంగీత కచేరీని పదవ తారీఖున గొటింజెన్ నగరంలోని పెడగోగియా ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిపారు. జర్మన్ శ్రోతలే అధిక సంఖ్యలో హాజరయి ఘంటసాలవారి సంగీతాన్ని ఆద్యంతం ఆస్వాదించి ఆనందించారు. భాష తెలియకపోయిన భారతీయ సంగీతంలోని భావం, శ్రుతి లయలు, ఘంటసాలవారి గాత్రంలోని మార్దవం, గంభీరత అక్కడి శ్రోతలనెంతో ఆకట్టుకున్నాయి. అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు కచేరీ జరిపారట. ఈ సంగీత కచ్చేరీ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఒక సత్కార్యం కోసం ఉపయోగించారు.

ఈస్ట్ పాకిస్థాన్ నుండి తరలివచ్చిన శరణార్ధుల సంక్షేమం కోసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి తమ విరాళంగా కార్యనిర్వాహకులు, ఘంటసాల బృందం సమర్పించడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. స్వదేశంలోనే కాక విదేశాలలో కూడా ఘంటసాలవారు తన ఔదార్యాన్ని సత్కార్యాలపట్ల తనకు గల భక్తి శ్రధ్ధలను చాటిచూపారు. అక్కడ ఘంటసాలవారికి జర్మన్ సంగీతాభిమానులు ఏర్పడి తర్వాత కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. ఘంటసాలవారి బృందం గొటింజెన్ నుండి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళేప్పుడు అనేకమంది జర్మన్ విద్యార్ధులు రైల్వే స్టేషన్ కు వచ్చి ఉత్సాహంగా వీడ్కోలు చెప్పి ఘంటసాలవారి ని తిరిగి జర్మనీలో పాడాలని మరీమరీ కోరారట. అలాగే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో కూడా అధిక సంఖ్యలో అక్కడి భారతీయులు వచ్చి వీడ్కోలు పలకడం, తన తొలి విదేశీ కచేరీ ఎటువంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయం గా జరగడం ఘంటసాలవారికి, ఇతర బృందానికి ఎంతో ఆనందం కలిగించింది.

ఫ్రాంక్ఫర్ట్ నుండి లండన్ వచ్చిన ఘంటసాల మాస్టారికి, వారి బృందానికి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారిగారు  తన మిత్రులతో వచ్చి ఘనస్వాగతం ఇచ్చారు. అక్టోబర్ 11న లండన్ లో శ్రీమతి సూర్యకుమారి నిర్వహిస్తున్న నృత్య కళాశాలలో ఘంటసాలవారి గౌరవార్థం ఒక అభినందన సభను, సంగీత కచేరీని ఏర్పాటు చేశారు.  ఆ సభకు సంగీత నృత్యాభిమానులే హాజరు కావడం వలన వారంతా  భారతీయ సంగీతాన్ని గురించి కొంత అవగాహన కలిగినవారే కావడంతో వారంతా ఘంటసాలవారి సంగీతం వారిని అమితంగా ఆకర్షించింది. పదే పదే అడిగి మరీ పాడించుకున్నారట. అక్కడి వారి సంగీతాభిలాషకు, ప్రశంసలకు ఘంటసాలవారు ఎంతగానో చలించిపోయారట. తరచూ లండన్ వచ్చి మరింత పెద్ద బహిరంగ స్థలాలలో పాడాలని మరీ మరీ కోరడం ఘంటసాలవారి కి రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించింది. లండన్ లో తనకు, తన వాద్య బృందానికి లభించిన ఆదరణతో పొంగిపోయిన ఘంటసాలవారు రెట్టింపు ఉత్సాహంతో యునైటెడ్ స్టేట్స్ వేపు పయనించారు. ఈ పర్యటనలో అధిక సంఖ్యలో కచేరీలు ఏర్పాటు అయినవి యునైటెడ్ స్టేట్స్ లోనే. 

ఘంటసాలవారు తమ విదేశీ పర్యటనలో ఎటువంటి సంగీతాన్ని వినిపించాలనే విషయంలో చాలా స్పష్టంగానే వున్నారు. భారతీయ సంగీతం, ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే కర్ణాటక, హిందుస్థానీ సంగీత రీతులలో చేయబడిన గీతాలను, లలిత, శృంగార, జానపద రీతులలో బహుళ జనాదరణ పొందిన తెలుగు చిత్రగీతాలను,  అన్నమయ్య, జయదేవ, రామదాసు భక్తి సంగీత గీతాలను తన విదేశీ కచేరీలలో సమయ సందర్భాలననుసరించి గానం చేశారు. వివిధ ప్రక్రియలతో కూడిన ఘంటసాలవారి సంగీతం వారు వెళ్ళిన ప్రతీ స్థలంలోనూ అక్కడి సంగీతాభిమానులను విశేషంగా ఆకర్షించింది. అలాగే  తన వాద్యబృందంలోని సితార్ జనార్దన్, ఫ్లూట్ నంజప్ప, సంగీతరావు హార్మోనియం, ప్రసాద్-మురుగేశన్ల తాళ వాద్య ప్రతిభ రసజ్ఞుల మెప్పులను, ప్రశంసలందుకున్నట్లు చెప్పారు. 

ఈ బృందానికి మరొక ముఖ్య ఆకర్షణ నేరెళ్ళ వేణు మాధవ్ గారి మిమిక్రి. మన తెలుగు, హిందీ నటుల, గాయకుల గాత్రాలనే కాక హాలీవుడ్ నటుల గాత్రాలను అనుకరించి  బెన్ హర్ , టెన్ కమాండ్మెంట్స్, క్లియోపాట్రా  వంటి భారీ చిత్రాలలో వచ్చే యుధ్ధ సన్నివేశాలలోని వినవచ్చే డైలాగ్స్, వాద్యాల ధ్వనులను ఏకకాలంలో పలికించి  వెళ్ళిన చోటల్లా విదేశీ ప్రేక్షకులను ఆశ్చర్యసంభ్రమాలలో ముంచెత్తేవారని చెప్పేవారు. 

🌅

1971 అక్టోబర్ 31న ఘంటసాల మాస్టారు తన బృందంతో న్యూయార్క్ చేరుకున్నారు. ఘంటసాలవారి నార్త్ అమెరికా పర్యటనను పురస్కరించుకొని అక్కడి స్టూడియోలో మాస్టారి తొలి పలుకులతో పాటు  మరో ఎనిమిది పాటలను పాడగా రికార్డ్ చేసారు. అవి తర్వాత లాంగ్ ప్లేయింగ్  " గోల్డెన్ రికార్డ్" గా  విడుదలయింది. ముందుగా, శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి "ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గర్వమ్ము..."అన్న రాయప్రోలువారి మాటలను తలచుకుంటూ అమెరికాలోని తెలుగు సోదరులకు ఆవేశపూరితమైన స్ఫూర్తిని కలుగజేశారు. 

"అమెరికాలో ఉన్న తెలుగువారికి ఘంటసాలవారి సందేశం" 

ఆ తర్వాత పాడిన ఎనిమిది గీతాలు తన స్వంత స్వర రచనలో చేసిన పాటలనే ఎన్నుకున్నారు.  ఇతర సంగీత దర్శకుల పాటలేవీ ఈ రికార్డ్ లో లేకుండా చూసి జాగ్రత్త వహించారు.  ఆ గోల్డెన్ రికార్డ్ ఒక ప్రక్క - *వినాయక చవితి చిత్రం నుండి తన ఫేవరిట్ గీతం 'దినకరా శుభకరా',

"దినకరా శుభకరా"

*జయదేవుని అష్టపది 'యారమితా వనమాలినా', 

"యారమితా వనమాలినా"

*అన్నమాచార్యులవారి 'కొలనిదోపరికి గొబ్బిళ్ళో,

"కొలని దోపరికి గొబ్బిళ్ళో"

*కంచెర్ల గోపన్న( భక్త రామదాసు) గారి 'నను బ్రోవమని చెప్పవే' పాటలు వున్నాయి. 

"నను బ్రోవమని చెప్పవే"

అదే రికార్డ్ లో రెండవ ప్రక్క - *త్యాగరాజకీర్తన 'చలమేలరా సాకేతరామా', *జరిగిన కథ' చిత్రంలోని 'భలేమంచి రోజు', *'నిర్దోషి' చిత్రంలోని 'సింగారి చెకుముకి రవ్వ',

"సింగారి చెకుముకి రవ్వ"

*'బ్రతుకు తెరువు' లోని 'అందమె ఆనందం' పాటలు వున్నాయి.

వినాయక చవితి సినిమా విడుదలైన నాటినుండి తన ఆఖరి కచేరీ వరకూ ప్రతీసారి తన కచేరిని 'దినకరా శుభకరా' తో ప్రారంభించి 'బ్రతుకు తెరువు' లోని 'అందమె ఆనందం' పాటతో ముగించేవారు. ఈ మధ్యలో మరెన్నో పాత,  కొత్త సినీమా పాటలు పాడినా ఈ రెండు పాటలు లేకుండా వారి కచేరీ ఏది జరగలేదు. ఆ సంప్రదాయాన్నే ఘంటసాల మాస్టారు అమెరికాలో కూడా అనుసరించారు.

"రాధికా కృష్ణా రాధికా"

అమెరికా, కెనడా దేశాలలోని ప్రముఖ నగరాలన్నింటిలో అక్టోబర్ 13 నుండి నవంబర్ 1వ తేదీ వరకు వరసగా దాదాపు పదిహేను కచేరీలు బహిరంగ స్థలాలోను, స్థానిక  భారతీయుల గృహాలలోనూ చేసి ఘంటసాలవారు అక్కడి భారతీయులందరికీ మరింత ఆప్తుడు, ఆత్మీయుడు అయ్యారు. 

"ఉలగే సమాదాన ఆలయమా"

వారంతా ఘంటసాలవారిని, వారి బృందాన్ని చిరుకానుకలతో సత్కరంచారు. 

ఘంటసాలవారి బృందం తొలిసారిగా విదేశాలంటే వెళ్ళింది కానీ ఆ పర్యటన లో వారెవరికీ తగినంత ఫారిన్ కరెన్సీ లభ్యపడలేదు. ఒక్కొక్క సభ్యుడికి కేవలం ఎనిమిది డాలర్లు మాత్రమే ఇచ్చారు. ఆ ఎనిమిది డాలర్లతో ఆ యా దేశాలలోని వింతలే చూస్తారా ? లేక ఆనాటికి ఇండియా లో దొరకని అపురూప వస్తవులే కొంటారా ? వెళ్ళినచోట్లలోని వింతలు విశేషాలు చూసి ఆనందించడం వరకే వీరంతా చేయగలిగారు. అయితే అక్కడి కళాభిమానులు కొందరు బృంద సభ్యులకు విడివిడిగా తమకు తోచినంత డాలర్ల రూపంలో ఇచ్చి సహకరించారు. అలాంటి కానుకలతో ఏవో చిన్న చిన్న వస్తువులు  ఇండియా లోని తమవారికోసం కొనుక్కోగలిగారు.  స్థానిక నిర్వాహకులు వీరందరినీ నయగారా ఫాల్స్, డిస్నీలాండ్, రేడియో హాల్   వంటి ఎన్నో పర్యాటక కేఃద్రాలను సందర్శించే ఏర్పాట్లు చేసారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘంటసాలవారి విదేశీ పర్యటన జరగడానికి అందరూ కలసికట్టుగా కృషిచేసారు.  ఈ దేశాలలో జరిగిన ప్రతీ సంగీత కచేరీ విదేశీ శ్రోతలకు, మన భారతీయులకు చాలా తృప్తిని కలిగించింది. వారందరూ కూడా ఘంటసాలవారు మరల మరల తమ దేశాలలో సంగీత కచ్చేరీ చేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ప్రశంసలందించారు. 

ప్రపంచ దేశాల దౌత్య ప్రతినిధులతో  నిండిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో తమ ప్రతిభను చాటుకునే అవకాశం అతికొద్దిమందికే లభిస్తుంది. అటువంటి అరుదైన  గొప్ప అవకాశం ఘంటసాల మాస్టారికి, ఆయనతో వున్న కళాకార బృందానికి  లభించింది. UNO లో జరిగిన ఘంటసాలవారి కచ్చేరికి దేశదేశాల ప్రతినిధులంతా విచ్చేసి వారి అద్భుత గానాన్ని విని ఆనందించారు. ఘంటసాలవారి గాన ప్రతిభను ప్రశంసిస్తూ వారికి అతి ప్రతిష్టాత్మకమైన  'శాంతి పతకం' బహుకరించారు.  వాద్యబృందాన్ని కూడా సముచితంగా సత్కరించి కానుకలు అందజేశారు. ఈ సంఘటన తన జీవితంలో మరువలేని మధురక్షణంగా ఘంటసాలవారు భావించేవారు. యునైటెడ్ స్టేట్స్ లో ఆఖరుగా నవంబర్ ఒకటవ తేదిన  న్యూయార్క్ లోని తెలుగు సాంస్కృతిక సంఘంవారు ఘంటసాలవారికి, వారి  వాద్యబృందానికి ఒక ఘనమైన సన్మాన సభ ఏర్పాటు చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికాలో జరిగిన ఘంటసాల వారి కచ్చేరీలు అన్నింటికి స్థానిక భారతీయులే కాక మూడు వందలు,  నాలుగువందల మైళ్ళ దూరంలో వున్న తెలుగువారంతా తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంతో వచ్చి విని ఆనందించారట.

నవంబర్ 1న పారిస్  బయల్దేరిన ఘంటసాలవారికి న్యూయార్క్ తెలుగువరాంతా ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఘంటసాలవారికి, వారి బృందానికి ఘనమైన విడ్కోలు పలికారు. పారీస్ లో ఘంటసాలవారి కచేరీలు ఏవీ ఏర్పాటు చేయబడలేదు. కేవలం రెండురోజులు విశ్రాంతి, ఆ సమయంలో  ఈఫిల్ టవర్  వంటి ముఖ్యమైన పర్యాటక స్థలాలు సందర్శన కోసం మాత్రం కేటాయించారు. 

ఘంటసాలగారు ఏ దేశం వెళ్ళినా ఎంతటి ఉన్నత వ్యక్తులను కలసినా తన సహజ వేష భాషలను మార్చుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా తన తెల్ల లుంగీ, తెల్ల చొక్కాతోనే హుందాగా వెళ్ళేవారు. అలాగే కచ్చేరీలు చేసేప్పడు కూడా. సూటూ బూట్లతో వేదికల మీదకు వెళ్ళడమనేది ఆయనకు అలవాటులేదు. సశాస్త్రీయంగా వేదిక మీద కూర్చోనే తన సంగీత కచేరీలు చేసారు. మన సంస్కృతి సంప్రదాయాలను తూచ పాటించేవారు.

ఘంటసాలగారి వంటి అపురూప మధురగాయకుడిని చూడడానికి వచ్చేవారు వారిచేత పాడించక వదులుతారా? మాస్టారిని తమ తమ ఇళ్ళకు విందుకు ఆహ్వానించి వారిళ్ళలోనే చిన్నపాటి కచేరీలు చేయించారట. అభిమానుల సంతృప్తికోసం పాడేందుకు మాస్టారు ఎప్పుడూ సిధ్ధమే.

ఎయిర్ ఇండియా సంస్థలో శ్రీ డి.ఎన్.లింగం ఉన్నతాధికారిగా వుండేవారు. ఆయన, ఆయన మిత్ర బృందం అంతా కలసి  ఘంటసాలవారి కచ్చేరీని కువైట్ లో నవంబర్ 5 వ తేదీన ఏర్పాటు చేసారు. వారి విదేశీ పర్యటనలో ఇదే చివరి కచేరీ. కానీ దురదృష్టవశాత్తు వీరు బయల్దేరే సమయానికి పారీస్ లో దట్టమైన మంచు కురిసి విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సకాలానికి కువైట్ ఫ్లైట్ అందుకోలేక పోవడంతో కువైట్ కచేరీ కాన్సిల్ చేయవలసి వచ్చింది. నిర్వాహకులు , ఘంటసాల మాస్టారు చాలా నిరాశచెందారు.  కువైట్ లోని ఘంటసాలవారి అభిమానులంతా ఎయిర్ పోర్ట్ కు వచ్చి 5వ తేదీ రాత్రి బొంబాయి ఫ్లైట్ ఎక్కేంతవరకు వారితోనే వుండి ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. కువైట్ వాసులకోసం మరల మరొకసారి పర్యటన జరపి సంగీత కచేరీ చేయాలనే ఘంటసాలవారి కోరిక మరింక నెరవేరలేదు.

కువైట్ నుండి బయల్దేరి మర్నాడు ఉదయానికి ఘంటసాలవారి బృందం బొంబాయి చేరుకున్నారు. 1971 నవంబర్ 6 మధ్యాహ్నానికి ఘంటసాలవారు, వారి బృందం సురక్షితంగా మద్రాస్ వచ్చి చేరారు. ఘంటసాలవారికి ఘన స్వాగతం పలకడానికి సినీ ప్రముఖులెందరో మద్రాస్ విమానాశ్రయానికి వచ్చారు.

పదిమంది సభ్యులతో అమెరికాలో లలిత సంగీత కచేరీ జరిపిన తొలి భారతీయ గాయకుడిగా ఘంటసాలవారి గురించి చెప్పుకునేవారు. విదేశాలలో తెలుగు సంగీతాన్ని వినిపించాలనే ఘంటసాల వారి కోరిక సాఫల్యం చెందింది. మాస్టారు కూడా చెప్పలేనంత ఆనందాన్ని పొందారు. 

"అందమే ఆనందం ఆనందమె జీవిత మకరందం"

ఇప్పుడు రోజులు మరిపోయాయి. విదేశాలలో పర్యటించడానికి ప్రతిభావ్యుత్పత్తుల అవసరమేలేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి తన గొంతు వినిపించే సౌకర్యాలు వచ్చేసాయి.

నాలుగు వారాల విదేశ యాత్ర ముగించుకు వచ్చిన ఘంటసాల మాస్టారు తన వృత్తి వ్యాపకాలు మొదలెట్టారు. తన కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలకు ఒక్కొక్కరికీ కాల్షీట్లు ఇచ్చి తాను పాడవలసిన పాటల ట్రాక్ మిక్సింగ్ లకు, రికార్డింగులకు హాజరుకావడం మొదలెట్టారు.

ఆ విశేషాలన్నీ వచ్చే వారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో చూద్దాము.

              ...సశేషం

Sunday, December 26, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైమూడవ భాగం

26.12.2021 - ఆదివారం భాగం - 63*:
అధ్యాయం 2 భాగం 62 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
అక్టోబర్ 6 నాకు వ్యక్తిగతంగా ఆనందకరమైన రోజైతే, అక్టోబర్  7 1971, 35, ఉస్మాన్ రోడ్ లో వున్నవారందరికీ మహదానందకరమైన రోజు. ఆనాడు ఆ ఇంట పండగ వాతావరణం చోటుచేసుకుంది. 

మొదటిసారిగా మా నాన్నగారు, ఘంటసాలవారు విదేశాలకు వెళుతున్న సందర్భంలో విమానాశ్రయానికి వెళ్ళి అందరితోపాటు వీడ్కోలు చెప్పాలనే కోరిక అందరితోపాటు నాకు వుండడం సహజమే. అందుకోసం చాలా రోజుల ముందునుండి ప్లాన్ చేస్తూనే వున్నాను. నేను పని చేసేది దొరల కంపెనీ. నేను ఆ కంపెనీలో చేరే నాటికి నా అదృష్టం దొరలెవ్వరూ మద్రాస్ ఫ్యాక్టరీ/ఆఫీసులో అధికారులుగా లేరు. కలకత్తా హెడ్ ఆఫీస్ లో ఎమ్.డి.గా ఒక దొర వుండేవారు.  అయినా కంపెనీలో 52 శాతం షేర్లు ఇండియన్స్ వి. 48 శాతం యూరోపియన్స్ వి. కంపెనీ నియమ నిబంధనల మీద ఆధిపత్యం అంతా UK కంపెనీ వారిదే. ఆనాటికి నేను పనిచేస్తున్న కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ టు పొజిషన్లో వుండేది. దీనికి పోటీగా ఇండియాలో నాలుగైదు కంపెనీలున్నా ఈ కంపెనీకీ పెద్ద పోటీ ఇచ్చే స్థాయిలో లేవు. నేను ఆ కంపెనీలో పనిచేసిన 28 ఏళ్ళలో చెప్పుకోదగ్గ స్ట్రైకులు , లాకౌట్లు అంటూ మేమెవ్వరమూ బాధపడలేదు. ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు. మూడేళ్ళకొకసారి  జరిగే యూనియన్ ఎగ్రిమెంట్ సమయాలలో తప్ప. అప్పుడు ఓ వారం పదిరోజులు పాటు హెడ్ ఆఫీస్ నుండి ఇతర బ్రాంచ్ ఫ్యాక్టరీలలోని యూనియన్ లీడర్స్ వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు మంతనాలు సాగించేవారు. లంచ్ టైమ్ లో మేమంతా (యూనియనైజ్డ్ స్టాఫ్) గేట్ల వద్ద నిలబడి తిన్నది అరిగేంతవరకూ "పోరాడతాం! పోరాడతాం! మా కోర్కెలు నెరవేరే వరకు పోరాడతాం! అని అరచి తర్వాత ప్రతి దినం ఆ సమయంలో మా హక్కుగా ఇచ్చే లెమన్ జ్యూస్ తాగేసి ఎవరి పనుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం. ఇదంతా ఒక ఫార్మాలిటీయని అందరికీ తెలుసు. అయినా అదో సరదా వ్యవహారం.

అదృష్టవశాత్తు మా కంపెనీ వ్యవహారాలలో లోకల్ పొలిటికల్ యూనియన్లు తలదూర్చకుండా మా కంపెనీ యూనియన్,  మేనేజ్మెంట్ చాలా జాగురూకతతో వ్యవహరించేది. ఈ మూడేళ్ళ ఎగ్రిమెంట్ జరిగినప్పుడల్లా ఉద్యోగస్తులు 20-30 శాతం వరకు ఆర్ధికంగా బాగుపడేవారు. అయితే ఈ బెనిఫిట్స్ అన్ని నిరంతర ఉద్యోగులకు మాత్రమే. వీరు కాక తాత్కాలిక ఉద్యోగులు నలుగురైదుగురు ఉండేవారు.

ఈ పరిస్థితులలో నాలాటి కొత్త వాడికి ఆఫీస్ లో శెలవు ఇస్తారో లేదో అనే సందేహం వుండేది. అదృష్టవశాత్తూ అప్పటికి ఆ కంపెనీలో నా ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయింది. నన్ను పెర్మనెంట్ ఎంప్లాయిగా కన్ఫర్మ్ చేస్తూ ఆర్డర్ కూడా చేతికిచ్చారు. దానివలన నాకు ఏడాదికి పదహారు ఫెస్టివల్ హాలిడేస్, పదిరోజులు ఏన్యువల్ లీవులు, ఆరు సిక్ లీవులు, మూడు క్యాజువల్ లీవులు వుండేవి. ఇవికాక శని ఆదివారాలు శెలవులు. వీటికి ప్రిఫిక్స్, సఫిక్స్ లు గా శెలవులు పెట్టుకొని వరసగా వారం పదిరోజులు బయట ఊళ్ళకు తిరిగే అవకాశం వుండేది. వీటన్నిటిని మించి శెలవులు పెడితే లాస్ ఆఫ్ పే. నెలవారీ అదనపు కన్వేయన్స్ లు, ఓవర్ టైమ్ లు వంటివి పోయేవి.  ఉన్న శెలవులు వాడనివారికి క్యాష్ బెనిఫిట్ వుండేది. అయితే ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.30 వరకు ఆఫీస్ టైమింగ్స్. 8. 35 లోపల మేనేజేరియల్ లెవల్ వారు తప్ప మిగిలిన స్టాఫ్ అంతా విధిగా  కార్డ్ లు పంచ్ చేసిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. 8.45 వరకు నెలలో మూడు రోజులు అనుమతి. అది మీరితే సగం రోజు శెలవు కట్ . దాని వల్ల వచ్చే క్యాష్ బెనిఫిట్ లు కట్. ఈ కట్లు ఏవీ లేకుండా పూర్తి జీతాలకోసం ఇళ్ళ నుండి ఉదయం ఏడు లోపలే బయల్దేరేవాళ్ళు. మరీ ఫ్యాక్టరీ పరిసరాల్లో కాపురం వుండేవాళ్ళు తప్ప. ఫ్యాక్టరీ రాయపురంలో. మేముండేది టి.నగర్. సుమారు 20 కి.మీ. డైరక్ట్ బస్ ఒకే ఒకటి 36A. దానిని నమ్ముకుందుకు లేదు. ప్యారీస్ కార్నర్ వరకు ఒక బస్ . అక్కడనుండి రాయపురం వేపు వెళ్ళే నెం. 1, 6, 8, 36 వంటి బస్సులు పట్టుకొని ఆఫీస్ కు అరకిలో మీటర్ దూరంలో దిగి అక్కడ నుండి ఆఘమేఘాలమీద పరుగులెత్తి ఎలాగో  8.35 లోపల  ఫ్యాక్టరీ గేట్ దగ్గర వుండే క్లాక్ దగ్గర కార్డ్ పంచ్ చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి గడియారం  8.25 కే ఆగిపోయేది. కాదు, కొందరు యూనియన్ లీడర్ల స్వామిభక్తులు ఆపేసేవారు. ఆ విషయంగా కొన్నాళ్ళు చర్చలు, రాధ్ధాంతం, మీటింగ్ లు అధికార్ల హెచ్చరికలు అదో తమాషా. ఈ బస్ ప్రయాణాలకంటే లోకల్ ట్రైన్ లో కోడంబాక్కం నుండి బీచ్  స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ రాయపురం వెళ్ళే బస్సుల్లో వెళ్ళడం కొంత బాగనిపించింది. అందుకు ఉస్మాన్ రోడ్ నుండి కోడంబాక్కం వరకు సైకిల్ మీద వెళ్ళి అక్కడ స్టాండ్ లో సైకిల్ వుంచి ఎలక్ట్రిక్ ట్రైన్ లో బీచ్ వరకు వెళ్ళేవాడిని బీచ్ స్టేషన్ కు ఎదురుగానే GPO బస్ స్టాప్. ఆ ఫస్ట్ లైన్ బీచ్ లోని భవంతులన్నీ బ్రిటిష్ వారి కాలం నాటివి. అన్నీ ఒకే రకం ఎర్ర రంగులో వుండేవి. స్టేట్ బ్యాంకు, జిపిఓ, కార్నవాలీస్ బిల్డింగ్ , క్లైవ్ బ్యాటరీ అంటూ ఆ రోడ్డంతా రాయపురం రైల్వే స్టేషన్ వరకు పురాతన బ్రిటిష్ సంస్కృతి తో నిండిన భవంతులు వుండేవి. గత పాతిక సంవత్సరాలలో వచ్చిన ఆధునికీకరణతో ఆ పాతకాలం నాగరికతా చిహ్నాలు కూడా కనుమరుగైపోయాయి. ఆ బస్ స్టాప్ లో నిలబడి మా ఆఫీస్ లో నలుగురైదుగురం బస్ ల కోసం ఎదురుతెన్నులు చూస్తూండేవాళ్ళం. ఆ బస్ లు ఏవీ ఖాళీగా వుండేవి కావు. బస్ స్టాప్ లలో ఆగేవీ కావు. ఉదయం, సాయంత్రం మాకది మహా యజ్ఞమే. ఆ సమయాలలో ఆ రోడ్డమ్మటే కార్లలోనో మోటార్ సైకిల్స్ మీద వెళ్ళే మా మేనేజర్లు మమ్మల్ని చూస్తే మమ్మల్ని తమ వాహనాలమీద తీసుకుపోయేవారు. అయితే వారికి 8.35 నిముషాల షరతేమీ లేదు. తొమ్మిది లోపల ఎప్పుడైనా వచ్చేవారు. అందుచేత మాకు ఆఫీసుకు వెళ్ళడం రావడం అనేది ఎప్పుడూ 100 మీటర్ రేస్ గానే వుండేది. 

నాకంటే ముందే లేచి మా ఆవిడ ఆరింటికే ఇల్లు వదలి అంబత్తూర్ కు ముందే వున్న పాడీ లోని బ్రిటానియా కు పరిగెత్తేది. నేను ఏడింటికి ఇల్లు ఒదిలేవాడిని. ఇద్దరం సాయంత్రం ఏడు గంటల ప్రాంతాన ఇల్లు చేరేవాళ్ళం. ఇంత అవస్థ పడుతూ ఒక ఆడపిల్ల ఉద్యోగం కోసం హైరాన పడడం మా నాన్నగారికి , ఘంటసాల మాస్టారికి అంత ఇష్టం వుండేదికాదు.  పెద్దల మాటకు ఎదురు చెప్పలేక మా పెళ్ళైన మూడు మాసాలలోపే, సరియైన రాకపోకల సౌకర్యం లేక మా ఆవిడ ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన బ్రిటానియా కంపెనీ ఉద్యోగానికి తిలోదకాలిచ్చివేసింది.

మా నాన్నగారు ఫారిన్ ట్రిప్ వెడుతున్నారు, సెండాఫ్ కు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాలి ఒక రోజు శెలవు కావాలని మూడు రోజులు ముందే లీవ్ అప్లికేషను ఫారమ్ నింపి మా డిపార్ట్మెంట్ హెడ్ వరదరాజన్ కు ఇచ్చాను. చూసిన వెంటనే మారుమాట లేకుండా ఎంతో అందమైన దస్తూరీలో కె.ఆర్. వరదరాజన్ అని సంతకం పెట్టి శెలవు మంజూరు చేసారు. మనిషి చాలా డిగ్నిఫైడ్ గా వ్యవహరించేవారు. ఆ కంపెనీలో ఎప్పుడూ శెలవు సమస్య లేదు. మితిమీరితే అన్నివిధాల నష్టపోయేది ఉద్యోగి మాత్రమే. ఇవన్నీ ఆ ఉద్యోగి యొక్క ఇంక్రిమెంట్లు మీద , ప్రమోషన్లమీద ప్రభావం చూపేవి.

ఇక హాయిగా ఎయిర్ పోర్ట్ కు వెళ్ళవచ్చు. కానీ వెళ్ళడం ఎలా. మాస్టారింటి జనాలతోనే వారి కారు సరిపోతుంది. మా నాన్నగారు మరికొంతమంది కలసి వేరే కారులో వారి సామాన్లతో వెళతారు. వారితో కుదరదు. మీనంబాక్కం వేపు బస్ లు చాలాసేపు పడుతుంది. ఇక వున్న సౌకర్యం ఎలక్ట్రిక్ రైలు మాత్రమే. మా ఇంటిలోనుండి నేను ఒక్కడినే ఎయిర్ పోర్ట్ కు బయల్దేరాను. అప్పటికి, ఇప్పటికీ (అంటే గత ఇరవైఏళ్ళ క్రితం వరకు) నాకు అందుబాటులో వున్నది, నడపడం తెలిసినదీ సైకిల్ మాత్రమే. సెకండ్ హ్యాండ్ లో లభ్యమైన ఆ సైకిల్ నన్ను చాలా ఏళ్ళే మోసింది. (ఆ తర్వాత  కొన్నేళ్ళకు టి.ఐ. సైకిల్ లో పనిచేస్తున్న మా మామగారి కోటాలో కొత్తగా ఒక హెర్క్యులిస్ సైకిల్ కొనడం జరిగింది. అంతవరకే నా వాహనయోగం.)

ఆ సైకిల్ మీదే ఒక వైట్ ప్యాంట్, వైట్ టీ.షర్ట్ (రెడీమేడ్ కాదు,  టైలర్ మేడే) వేసుకొని కోడంబాక్కం వెళ్ళి అక్కడనుండి తాంబరం వెళ్ళే రైలు ఎక్కాను. ఇప్పుడంటే జనసమర్దత విపరీతంగా పెరిగిపోయి రైళ్ళ రాకపోకలు అపసవ్యమైపోయాయి, కానీ, ఆ రోజులలో ప్రతీ ఏడెనిమిది నిముషాలకు ఒక లోకల్ ట్రైన్ ఠంచన్ గా వచ్చేది. అప్పట్లో మద్రాస్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాలంటే మీనంబాక్కం లోనే దిగవలసి వచ్చేది. ఆనాటికి ఎయిర్ పోర్ట్ కు ఎదురుగా వుండే త్రిశూలం రైల్వే స్టేషన్ లేదు. అలాగే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వేరే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వేరేగా వుండేవి. అప్పట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రోజూ వుండేవి కావు. వాటికోసం బొంబాయి లేదా ఢిల్లీ వెళ్ళవలసి వచ్చేది. అందువల్లనే ఘంటసాలవారి బృందం కూడా ముందు బెంగుళూరుకు, తర్వాత బొంబాయి కి వెళ్ళి అక్కడనుండి వెస్ట్ జర్మనీ కి ఫ్లైట్ లో వెళ్ళారు వయా బేరూట్ (లెబనాన్). 

నేను మీనంబాక్కం రైల్వేస్టేషన్ లో దిగి అక్కడ నుండి నడుచుకుంటూ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ కు చేరాను. నేను చాలా ముందుగానే వచ్చాను కనుక మానాన్నగారితో ఘంటసాలవారి బృందంతో సరదాగా గడపవచ్చని ఊహించాను. కానీ అక్కడి వాతావరణం పూర్తి విరుధ్ధంగా వుంది. ఎయిర్ పోర్ట్ అంతా జన సముద్రంగా వుంది. మావాళ్ళెవరూ కనపడలేదు. ఆ జనంలో మా వాళ్ళ దరిదాపులకు వెళ్ళడమే కష్టమయింది. అక్కడకు వచ్చినవారంతా దక్షిణ భారత చలనచిత్రసీమలోని దిగ్గజాలే. వారందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్ళే సాహసం చేయలేకపోయాను. ఒక ప్రక్కగా నిలబడి వచ్చే పోయేవాళ్ళను చూడడం తప్ప నేనేమీ చేయలేకపోయాను. కొంతసేపటికి ఎవరో బాగా తెలిసినవాళ్ళు కనిపించి మా వాద్యబృందం ఉన్నవేపు చూపించారు. అక్కడే మానాన్నగారు, ఇతర వాద్యబృందం ఉన్నారు. ఒక పక్కన సినీరంగ ప్రముఖులతో మాట్లాడుతూ ఘంటసాల మాస్టారు కనిపించారు. వారి పక్కకు వెళ్ళే అవకాశమేలేదు. అదీకాక, ఆ సమయంలో నాకు ఒక కంటికి ' మద్రాస్ ఐ' (కంజన్క్టివిటిస్) వచ్చి కొంత అవస్థపడుతున్నాను. అది వైరల్ కావడం వలన మరింత చొరవగా అందరిలో కలవడానికి సాహసించలేకపోయాను. మాస్టారికి వీడ్కోలు చెప్పడానికి వచ్చే ప్రముఖులను చూస్తూ ఒక వారగా నిలబడ్డాను. 

నేను మద్రాస్ వచ్చాక విమానాశ్రయానికి రావడం అదే మొదటిసారి. బయట నుండి విమానాలు రావడం పోవడం చాలాసార్లు చూసినా లోపలికి ఎప్పుడూ వెళ్ళలేదు. మా తాతగారి (బాబాయిగారు) (ఘంటసాల సదాశివుడు) SIP క్వార్టర్స్ మేడ మీదనుండి చాలా స్పష్టంగా ఎయిర్ పోర్ట్ రన్ వే దగ్గరగా కనపడేది. సెయింట్ థామస్ మౌంట్ కొండను తాకుతూ క్రిందికి దిగుతున్నట్లు వచ్చే విమానాలను చూస్తూ శని ఆదివారాలలో కాలక్షేపం చేసేవాళ్ళం నేనూ, మాస్టారి పిల్లలూ. ఇప్పుడున్నంత జనారణ్యాలు ఆనాడు లేకపోవడం వలన చల్లటి గాలి రివురివ్వుమని వీచేది. గంటలకొద్ది ఆ పై మేడలమీదే గడిపేవాళ్ళం.

ఇక ఈ రోజు మాస్టారికి వీడ్కోలు పలకడానికి వచ్చిన పెద్దలు, అభిమానులను చూస్తూంటే గాయకుడిగా, వ్యక్తిగా ఘంటసాలవారి ఔన్నత్యం అర్ధమయింది.

తెలుగు సినీమాకు మూలస్థంభాలనదగ్గ ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ నటులు కాంతారావు, రామకృష్ణ, గుమ్మడి, ధూళిపాళ, పద్మనాభం, కెవి చలం, నిర్మాతలు - త్రివిక్రమరావు, పుండరీకాక్షయ్య, రామానాయుడు, రాజేంద్రప్రసాద్, పద్మశ్రీ వెంకటేశ్వర్లు, ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు, డి.వి.ఎస్.రాజు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, మల్లికార్జున రావు , కె ఎ ప్రభాకర్ , బలరాం , ప్రతిభా శాస్త్రి, దర్శకులలో పి.పుల్లయ్య, కె.విశ్వనాథ్, కె.బాబూరావు, గీత రచయితలు - ఆరుద్ర, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి మాస్టారికి ఘనమైన వీడ్కోలు పలికి అభినందించారు. ఆనాడు అక్కడకు వచ్చిన సినీ సంగీత కుల ప్రముఖులు - కెవిమహాదేవన్ , టి.వి.రాజు, టి.చలపతిరావు, సత్యం, ఎమ్.బి.శ్రీనివాస్, పుహళేంది, ఎ.ఎ.రాజ్, నేపధ్య గాయకులు - టి.ఎమ్.సౌందరరాజన్, పి.బి.శ్రీనివాస్, పి లీల, పి. సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం, మొదలైన సినీ ప్రముఖులు, వందలాది ఘంటసాలవారి అభిమానులు మాస్టారిని పూలమాలలతో ముంచెత్తారు. వారికి వారి బృందానికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారి హర్షధ్వానాలతో మద్రాసు విమానాశ్రయం మార్మోగింది. దీనికి ముఖ్యకారణం - దక్షిణాది చలనచిత్ర పరిశ్రమనుండి పదిమంది బృందంతో ఒకే ట్రిప్ లో వివిధ దేశాలలో సినీ, లలిత సంగీత కచ్చేరీలు చేయబోతున్న మొదటి కళాకారుడు మన ఘంటసాల వారే కావడం. ఇది సినీరంగంలో అందరిలో ఆనందాన్ని, ఆసక్తిని రేకెత్తించిన విషయం.


ఇంతమంది సినీరంగ కళాకారుల, అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ఘంటసాల మాస్టారి సంగీతయాత్ర దిగ్విజయంగా ప్రారంభమయింది. ఇక్కడనుండి  రాయబోయే కధనమంతా మా నాన్నగారు, ఘంటసాల మాస్టారు విదేశ యాత్ర ముగించుకు వచ్చిన తర్వాత వారి అనుభవాలను వారి ముఖతా విన్నదీ, దిన వార పత్రికలలో వచ్చిన సమాచారం ద్వారా తెలుసుకున్నదీ మాత్రమే.

నిజానికి ఘంటసాల మాస్టారి వీడ్కోలు సందర్భంగా వారితో నాకు కూడా ఒక ఫోటో (of course వారి వెనకాలే అనుకోండి) వుందన్న విషయం నాకు చాలా కాలం వరకు తెలియనే తెలియదు. ఇటీవల ఈ  వాట్సప్ సమూహాలలో ఘంటసాల మాస్టారి అభిమానులు వారి ఫోటోలు విరివిగా పెట్టడం మొదలెట్టాక నేనున్న యీ ఫోటో కూడా బయటకు వచ్చింది. 



మద్రాసు నుండి బయల్దేరిన ఘంటసాలవారి విమానం బెంగుళూరు చేరింది. విమానాశ్రయంలో కన్నడ చిత్ర ప్రముఖులు, అభిమానులు, పాత్రికేయులు ఘంటసాలవారికి ఆనందంగా వీడ్కోలు పలికారు. 

తరువాత అక్కడినుండి బొంబాయి చేరుకున్నారు. బొంబాయి ఆంధ్రా సాంస్కృతిక సంఘంవారు ఒక్రబ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసి ఘంటసాలవారిని పూర్ణకుంభంతో వేదమంత్రాల మధ్య సభాస్థలికి తీసుకువెళ్ళి ఘన స్వాగతం పలికారు. ఘంటసాలవారి సంగీతయాత్ర  జయప్రదం కావాలని ప్రార్ధనలు చేశారు. ఆ సభకు వేలాది అభిమానులు హాజరయి హర్షధ్వానాలు పలికారు. 

" ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీ జాతి నిండు గర్వమ్ము "
అని ప్రబోధించిన కవివరేణ్యులు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి మాటలను మననం చేసుకుంటూ మన తెలుగు గాయకుడు ఘంటసాల అక్టోబర్ 8 వ తేదీ తెల్లవారుజామున బొంబాయి ఎయిర్ పోర్ట్ లో ప్రముఖులు ఇచ్చిన వీడ్కోలు అందుకొని తన వాద్య బృందంతో  జర్మనీ వెళ్ళే విమానం ఎక్కారు. 

అక్కడ నుండి మొదలైన వారి మూడు వారాల సంగీత యాత్రా విశేషాలు ....

వచ్చేవారం  'నెం. 35, ఉస్మాన్ రోడ్' లో  చూద్దాము...
                              ...సశేషం

Sunday, December 19, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైరెండవ భాగం

19.12.2021 - ఆదివారం భాగం - 62:

అధ్యాయం 2  భాగం 61 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

విదేశాలలో మన తెలుగు సంగీతాన్ని ప్రచారం చేయాలన్న కాంక్ష అయితే బలంగా ఘంటసాల మాస్టారిలో వున్నా వాటిని సఫలీకృతం చేయడానికి చాలానే కృషిచేయవలసివచ్చింది. తన గాత్ర సంగీతంతో పాటు మన భారతీయ సంగీతాన్ని లైట్ ఎండ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో బ్రహ్మాండమైన  వాద్య సంగీత రూపకాలుగా ప్రదర్శించాలని ఘంటసాల తపించారు. పాతికమంది బృందంతో  ప్రపంచమంతా పర్యటించాలనేది వారి చిరకాల వాంఛ. అయితే అందుకు కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అంత సులభంకాలేదు.   కేంద్ర, రాష్ట్ర పభుత్వాల తరఫునుండి ఇంత పెద్ద  సాంస్కృతిక బృందాన్ని విదేశాలకు పంపడానికి తమ సుముఖత కనపర్చలేకపోయింది.  విదేశాలలోని స్థానిక సాంస్కృతిక సంస్థలు చొరవ తీసుకుంటే ఈ సత్కార్యం సానుకూల పడుతుందని అందరూ సలహా ఇచ్చారు. USEFI/కెనెడియన్ ఫౌండేషన్ రీజనల్ డైరెక్టర్  గా పనిచేసిన డా.డి.ఎన్.రావు తన వ్యక్తిగత హోదాలో అమెరికాలోని సాంస్కృతిక సంస్థలకు, మిత్రులకు ఉత్తరాలు వ్రాసారు. కొందరు సానుకూలంగా స్పందించారు. అలాటి పరిస్థితులలో వెస్ట్ జర్మనిలోని గొటింజెన్ లో కచేరీ జరపడానికి ఆహ్వానం వచ్చింది. అలాగే నార్త్ అమెరికా లోని భారతీయ సాంస్కృతిక సంఘాలవారు యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో సంగీత కచేరీలు ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.

పాతిక మంది బృందం అనుకున్నది పదిమందికే పరిమితమయింది. వీరందరి రానుపోను టిక్కెట్లు, విదేశాలకు తగిన దుస్తులు, వారు మద్రాసులో లేనప్పుడు వారి కుటుంబాల జీవనభృతి, ఇత్యాది అనేక ఖర్చులకు కావలసిన ధనం ఎవరిస్తారు? ఎలా సమకూర్చాలనేది ప్రధాన సమస్యగా మారింది. 

ఈ విషయం ప్రజలలోకి వెళ్ళింది. ముందుగా నెల్లూరు జిల్లా ప్రముఖులు ఘంటసాలవారి విదేశీ పర్యటనకు తగు ఆర్థిక సహాయం చేస్తామని ఘంటసాల మాస్టారిని నెల్లూరుకు ఆహ్వానించి నెల్లూరు జిల్లా పరిషత్ ఆధ్వరంలో ఒక బ్రహ్మాండమైన సన్మాన సభ ఏర్పాటు చేసారు. స్థానిక ప్రముఖులు శ్రీ ఆనం సంజీవరెడ్డి, శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డిగార్ల చేతుల మీదుగా ఘంటసాలవారికి పదివేల రూపాయలను బహుకరించి ఘంటసాల విదేశ సంగీతయాత్ర దిగ్విజయం కావాలాని అభినందనలు తెలియజేసారు. ఈ శుభపరిణామంతో మద్రాసులోని సినీవర్గాలు కూడా ముందుకు వచ్చాయి. అగ్రనటులైన ఎన్.టి.రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, భానుమతిగారు వంటి ప్రముఖ నటులు కొందరు ధన సహాయం చేసారు. అనేక మంది నిర్మాతలు తమ చిత్రాలలో పాడబోయే పాటల పారితోషకాన్ని ఎడ్వాన్స్ గా ఇచ్చి ఆదుకున్నారు.  ఈవిధంగా అనేక రూపాలలో ధనసేకరణ చేసి, మిగిలిన ఖర్చులన్నీ తన సొంత నిధులనుండి ఉపయోగించాలనే దృఢ నిశ్చయానికి వచ్చారు ఘంటసాలవారు.

ఘంటసాల మాస్టారి విదేశీ పర్యటన 1971 అక్టోబర్ 7వ తేదీ ఉదయం ప్రారంభమై 1971 నవంబర్  6వ తేదీ మధ్యాహ్నానికి ముగిసింది. మొత్తం నాలుగు వారాల పర్యటన. ఘంటసాల మాస్టారు తన విదేశీ సంగీత జైత్రయాత్ర కోసం వాద్యబృంద కళాకారులుగా సౌత్ ఇండియన్ సినీ రంగంలోని ఏస్ మ్యుజిషియన్స్ నే ఎన్నుకున్నారు.  వారు - సర్వశ్రీ - మిట్టా జనార్దన్-సితార్, నంజప్ప-ఫ్లూట్, పి.సంగీతరావు-హర్మోనియం, షేక్ సుభాన్-క్లారినెట్, వి.ఎల్.ప్రసాద్-మృదంగం/డోల్కి, పాల్ జడ్సన్-తబలా, మురుగేష్-ఘటసింగారి/ఇతర తాళ వాద్యాలు.

మురుగేశన్, సంగీతరావు, నరసింగ, ఘంటసాల సావిత్రి, ఘంటసాల, సుభాన్, జడ్సన్, జనార్దన్, ప్రసాద్, నంజప్ప, 'ఎమెస్కో కృష్ణమూర్తి

ఈ సప్తస్వరాలతో పాటు  తన మిమిక్రీతో ప్రేక్షకులను రంజిపజేయడానికి శ్రీ నేరెళ్ళ వేణూ మాధవ్ ను కూడా తన బృందంలో చేర్చారు ఘంటసాల. వీరందరికీ అన్నివిధాలా సహాయ సహకారాలందించే బృంద నాయకుడి భాధ్యతలను శ్రీ  'ఎమెస్కో' కృష్ణమూర్తిగారికి అప్పగించారు. 

ఈ నాలుగు వారాల పర్యటనలో వెస్ట్ జర్మని (గొటింజన్), లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజెలిస్, శాన్ ఫ్రాన్సిస్కో, డెట్రాయిట్, చికాగో, టొరెంటో, బోస్టన్, UNO, పారిస్, కువైట్ నగరాలలో ఘంటసాల మాస్టారి సంగీత కచేరీలు జరుగుతాయని నిర్ణయించారు. ఈ విషయాలన్నీ ఘంటసాలవారితో వెళ్ళబోయే బృంద సభ్యులందరికీ తెలియపర్చడం జరిగింది. నెలరోజులపాటు విదేశీ పర్యటన అంటే సామాన్యమా!  అలాటి అవకాశం లభించడమే కష్టం. విదేశీయ ప్రేక్షకుల సమక్షంలో   తమ  కళాప్రతిభను చాటుకోవాలంటే అందరికీ మహదానందమే.  కళాకారులంతా తమ ప్రయాణానికి సంసిధ్ధం కావడం ప్రారంభించారు. 
💐💐

మద్రాస్ వాసులకు రెండే కాలాలు. తొమ్మిది మాసాలు ఎండాకాలం. మూడు మాసాలు అందరి కొంపలు ముంచే వర్షాకాలం. 'వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియదు' అనే సామెత ఇక్కడివారికి బాగా అనుభవమే. ఆ వర్షాలు ఎప్పుడైనా సైక్లోన్ రూపంలో వచ్చి జనజీవితాలను అతలాకుతలం చేస్తుంది. మిగతా రోజులంతా ఎండలతో ఉక్కపోత వాతావరణం. మద్రాసులో పుట్టిపెరిగిన వారెవరికీ చలి అంటే ఏమిటో తెలియదు. అది అనుభవించాలనుకునేవారు ఏ ఊటీకో, కొడైకెనాల్ కో పనిగట్టుకు వెళ్ళాలి. అందుచేత మద్రాసు వాళ్ళకి చలి దుస్తుల అవసరమేమీ అసలు వుండదు. అందుచేత మాకెవరికీ వులెన్ స్వెట్టర్లు, ఓవర్ కోట్లు, మఫ్లర్స్ వంటివి లేవు. ఇప్పుడదే మా నాన్నగారికి సమస్య అయింది. ఆయనకు మొదటి నుండీ అంటే విజయనగరం వచ్చినప్పటినుండీ బెంగాలీబాబుల్లా తెల్లటి పైజమా, జుబ్బాలే అలవాటు. ఇప్పుడు ఈ విదేశీ ప్రయాణం లో కొన్ని దేశాలలో అక్టోబర్/నవంబర్ ల నాటికి బాగా చలివుండే అవకాశం వుందని అందుకు తగ్గట్టుగా అందరూ కోట్లు, సూట్లు, చలి దుస్తులతో  ప్రయాణానికి సిధ్ధంగా వుండమని బృంద కళాకారులందరికీ ఆదేశాలు అందాయి. మా నాన్నగారికిదో కొత్త బెడద. మూలిగే నక్కమీద తాటిపండు. అలవాటు లేని ఔపాసన. ఈనాడు కొత్తగా పాంట్, షర్ట్ లు, సూట్లు ధరించడం, ముఖ్యంగా వాటిని సంపాదించడమే సమస్య. కొత్తవి కొనాలంటే వందలో, వేలో ఖర్చుపెట్టాలి. ఈ విదేశీయానం తర్వాత వాటి అవసరమే వుండదు. మూలన పడేయాల్సిందే. తరచూ విదేశాలలో తిరిగేవాళ్ళకు తప్పదు. ఎప్పుడో పున్నమికో, అమావాస్యకో వెళ్ళేవాళ్ళకు ఈ జంఝాటం అవసరమా? ఈ సమస్యను ఎలా సానుకూలపర్చడమా అనే ఆలోచనలో పడ్డారు మా నాన్నగారు.

అలాటి సమయంలో ఒకరోజు నాన్నగారి మిత్రుడు మధురకవి శ్యామలరావుగారు మా ఇంటికి వచ్చారు.  అప్పట్లో ఆయన ONGC లో జియోఫిజిస్ట్ గా పనిచేసేవారు. శ్యామలరావుగారితో మా పరిచయం మా నాన్నగారి మరో స్నేహితుడు ఆయపిళ్ళ రామారావుగారి ద్వారా జరిగిన గుర్తు. రామారావుగారు మద్రాసు శివార్లలో ఉన్న తిరువెట్రియూర్ (ఇప్పుడు సిటీలో కలసిపోయింది)లో వుండిన మద్రాస్ షీట్ గ్లాస్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేసేవారు. ఆయన మా నాన్నగారిని ఒకరోజు శ్యామలరావు గారింటికి తీసుకువెళ్ళేవారు. అప్పుడు ఆయన ఎగ్మూర్ ప్రాంతం పుదుప్పేటలో ఒక బజార్ వీధిలో ఒక మేడమీద పోర్షన్ లో అద్దెకు దిగారు. మద్రాస్ కు కొత్తగా వచ్చారు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కాపురం. ఆయపిళ్ళ రామారావు గారు, శ్యామలరావుగారు ఇద్దరూ మా ప్రాంతంవారే. స్వశాఖీయులే. శ్యామలరావు గారి తండ్రి బొబ్బిలి-విజయనగరం  లైన్లో వుండే కోమటిపల్లి అనే అతి చిన్న రైల్వేస్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా పనిచేసేవారని ఆయన తనకు తెలుసని మా నాన్నగారు చెపుతూండేవారు. ఆ రోజుల్లో ఆ లైన్ లో ఒక్క విశాఖపట్నం - రాయపూర్ ప్యాసెంజర్ రైలు మాత్రమే తిరిగేది. ఇప్పుడంటే అనేకమైన ఎక్స్ ప్రెస్ రైళ్ళు వచ్చాయి. ONGC వారు కావేరీ బేసిన్ లో ఎస్కవేషన్స్ మొదలెట్టిన సమయంలో శ్యామలరావుగారు ట్రాన్స్ఫర్ మీద  మద్రాసు వచ్చారు. ఆయన నెలలో ఇరవై రోజులు కాంప్ ల్లోనే వుండేవారు. ఆయన ఒక్క సౌత్ లోనే కాక హిమాలయ ప్రాంతాలలోని డెహ్రాడూన్ లో క్యాంప్ ల్లో చిన్న చిన్న టెంట్లలో తమ కార్యకలాపాలు సాగించేవారు. భార్య, ఇద్దరు పసి పిల్లలు మెడ్రాస్ లో వుండేవారు. వారెవరికి అప్పట్లో అరవ భాష రాదు. చాలా ఇబ్బందిపడేవారు. శ్యామలరావు గారు మా నాన్నగారిని అప్పుడప్పుడు వచ్చి తన కుటుంబాన్ని గమనించమని కోరారు. మా నాన్నగారు ఆ భాధ్యతను నాకు అప్పగించారు. నేను  అప్పుడప్పుడు శని ఆదివారాలలో పుదుప్పేటలో వారికి తోడుగా ఉండేవాడిని.  అప్పటినుండీ శ్యామలరావుగారితో మంచి స్నేహం పెరిగింది. శ్యామలరావుగారిలో ఒక మంచి రోల్ మోడల్ కు కావలసిన లక్షణాలన్నీ పుష్కలంగా వున్నాయి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక్క జియోఫిసిస్ట్ మాత్రమే కాదు. వంటలు, కుట్లు, అల్లికలు, చిత్రలేఖనం వంటి అనేక కళలలో కూడా నైపుణ్యం సంపాదించారు. క్యాంప్ లలో వున్నప్పుడు ఏ మాత్రం ఖాళీ దొరికిన ప్రతి వస్తువుతో ఏదో రకమైన బొమ్మలు చేసేవారు.

 


హిమాలయాలలో దొరికే రాళ్ళతో, తాటి టెంకలతో, పూసలతో, మిగిలిపోయిన సబ్బుబిళ్ళలతో రకరకాల వస్తువులు తయారు చేసి మాలాటి వారికి బహుకరించేవారు. ఆయన వేసిన అసంఖ్యాకమైన ఆయిల్ పెయింటింగ్ లు వారింటి గోడలను అలంకరించి వుంటాయి. శ్యామలరావుగారు ONGCలో డైరెక్టర్ హోదా వరకు వెళ్ళినా కూడా ఈ హ్యాండీక్రాప్ట్స్ తయారు చేయడం, పెయింటింగ్ చేయడం మానలేదు. ఆయన ఇల్లు ఒక చిన్న మ్యూజియంలా వుంటుంది. శ్యామలరావుగారు రేకీ లో గ్రాండ్ మాస్టర్. రేకి థెరపితో అనేకమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చికిత్సలు చేస్తూవుంటారు. అలా శ్యామలరావుగారి సలహాలు పొందినవారిలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ వంటి మద్రాస్ పుర ప్రముఖులెందరో వున్నారు. ఈ రేకీ విద్యకు సంబంధించిన అనేక వ్యాసాలను ఆయన "ఋషిపీఠం" పత్రికలో వ్రాసేవారు. ఇప్పటికీ, ఎనభై ఐదేళ్ళ వయసులో కూడా ఈ కళలను ఎంతో  ఉత్సాహం గా కొనసాగిస్తున్నారు. అప్పటికి శ్యామలరావుగారు రెండిళ్ళు మారారు. పుదుపేట నుండి మహాలింగపురంలో రాజుబాబు ఇంటి పక్కింటిలో ఉన్న రోజుల్లోనే మా నాన్నగారి అమెరికా ప్రయాణం. ఈ విషయం తెలిసి మా నాన్నగారిని అభినందించడానికి మా ఇంటికి వచ్చారు. మాటల సందర్భంలో మా నాన్నగారు తన చలి దుస్తుల సమస్య గురించి శ్యామలరావుగారికి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే, తన దగ్గర చాలా రకాల శీతాకాలపు దుస్తులున్నాయని వాటిలో కొన్నిటిని ఇస్తానని వాటిని అవసరం మేరకు టైలర్ దగ్గర ఆల్టర్ చేయించుకోమని కొన్ని వులెన్ పాంట్లు, ఫుల్ హ్యాండ్ షర్ట్ లు, స్వెట్టర్లు, ఒవర్ కోటు, ఇత్యాదులు చాలా ఇచ్చారు. వాటిని మా కేశవన్ టైలర్ మా నాన్నగారి సైజ్ కు తగినట్లుగా ఆల్టర్ చేసి ఇచ్చాడు. మానాన్నగారికి ఒక పెద్ద బెడద వదిలింది. శ్యామలరావుగారు ఆ రోజు ఆపధ్బాంధవుడిలా వచ్చి ఆదుకున్నారు.  1971లో అలా ఉపయోగించిన ఆ డ్రెస్ లు తర్వాత ఓ పుష్కరం తర్వాత  కూచిపూడి బృందంతో వరసగా మొదలైన విదేశపర్యటనలో కూడా ఉపయోగించిన గుర్తు. అందులో ఒకటి రెండు  BCIC  ఉత్సవాలకోసం వెళ్ళినప్పుడు ఢిల్లీ  చలిని తట్టుకోడానికి నాకు కూడా ఉపయోగపడ్డాయి. పదేళ్ళ క్రితం వరకు ఆ ఓవర్ కోట్ నా దగ్గర వుండేది.

💐💐


అక్టోబర్ 7, 1971 ఘంటసాలవారి జీవితంలో మరపురాని మధురఘట్టం. అన్ని అడ్డంకులను తొలగించుకొని తన చిరకాల వాంఛను సఫలీకృతం చేసుకోబోతున్న రోజు. ఆ రోజు ఉదయం తన బృందంతో విదేశీ పర్యటన ప్రారంభించడానికి ఘంటసాల మాస్టారు విమానాశ్రయానికి బయల్దేరారు. వారికి వీడ్కోలు చెప్పడానికి కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా ఎయిర్ పోర్ట్ కు తరలివెళ్ళారు.

తర్వాత...వచ్చే వారమే...

                     ...సశేషం

Sunday, December 12, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైయొకటవ భాగం

12.12.2021 - ఆదివారం భాగం - 61*:
అధ్యాయం 2 భాగం 60 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


ఒకప్పుడు మద్రాసు  దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు ముఖ్య కేంద్రంగా వుండేది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలన్నీ మద్రాస్ లోనే నిర్మించబడేవి. సినిమా స్టూడియోలు, సినీమా కంపెనీలు అన్నీ మద్రాసు లోనే వుండేవి. హైదరాబాద్ లో సారధీ స్టూడియో, మైసూర్ లో ప్రీమియర్ స్టూడియో వంటివి కొన్ని వున్నా చిత్ర నిర్మాణం అంతంత మాత్రమే. అక్కినేని నాగేశ్వరరావుగారు మద్రాస్ వదలి హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత క్రమక్రమంగా తెలుగు సినీమాలు హైదరాబాద్ లో తీయడం మొదలెట్టారు. అయినా చాలా కాలం వరకు సినీసంగీత విభాగం మాత్రం మద్రాసులోనే వుండేది. అధిక సంఖ్యాకులైన సంగీత దర్శకులు, గాయనీగాయకులు మద్రాసులోనే వుంటూ అక్కడి నాలుగు భాషలలో తమ ప్రతిభను చాటుకునేవారు.  తర్వాత తర్వాత అందరిలో స్వరాష్ట్రాభిమానం అధికమై తమ సొంత రాష్ట్ర రాజధానులలో చిత్రసీమను తరలించుకున్నారు. హాలీవుడ్ బాణీలో బాలీవుడ్ వస్తే దాన్ని అనుకరిస్తూ ఈనాడు టాలీవుడ్, కోలివుడ్, సాండల్ వుడ్,  అంటూ వివిధ నిర్మాణ కేంద్రాలు వెలిసాయి.

పర్వతనేని గంగాధరరావు హైదరాబాద్ కేంద్రంగా తమ హైదరాబాద్ మూవీస్/నవశక్తి ప్రొడక్షన్స్ బ్యానర్ ల మీద కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆయన సోదరుడు సాంబశివరావు అనేక సినీమాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ రాజకీయ నేత పి.ఉపేంద్ర కూడా వీరి సోదరుడేనని ఎవరో అనగా విన్నాను. అంతగా తెలియదు.

పి. గంగాధరరావు, డైరెక్టర్ సి.ఎస్.రావు దర్శకత్వంలో 'జీవితచక్రం' అనే సినీమా మొదలెట్టారు. ఎన్.టి.రామారావు, జగ్గయ్య, వాణిశ్రీ, శారద, రేలంగి, రమణారెడ్డి వంటి భారీ తారాగణం ఈ సినీమాలో వున్నారు. ఈ సినీమాకు సంగీత దర్శకులుగా శంకర్ జైకిషన్ల ను ఎన్నుకోవడం ఒక విశేషమైతే ఈ చిత్రంలోని పాటలన్నీ బొంబాయి స్టూడియోలోనే  రికార్డ్ చేయాలని సంకల్పించడం మరో పెద్ద వార్తగా ప్రచారమయింది. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ కు వున్న నాలుగు పాటలను ఘంటసాల మాస్టారిచేత పాడించడానికి నిర్ణయించారు. రెండు సోలోలు, రెండు డ్యూయెట్లు. ఈ రెండు డ్యూయెట్లను సుశీలగారి చేత కాకుండా బొంబాయి గాయని శారద పాడతారని అనుకున్నారు. ఈ నాలుగు పాటలు ఆరుద్రే వ్రాసారు. గతంలో శంకర్ జైకిషన్ల సంగీతంలో వచ్చిన 'ప్రేమలేఖలు' హిందీ డబ్బింగ్ సినీమా పాటలన్నీ ఆరుద్రగారే వ్రాసారు. ఈ సినీమాలో సి.నారాయణరెడ్డిగారు వ్రాసిన రెండు పాటలను పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం; పి.సుశీల, బి.వసంత పాడతారని అనుకున్నారు.

నాకు తెలిసి ఘంటసాలవారు పాటల రికార్డింగ్ లకోసం మద్రాసు వదలి బయట ఊళ్ళకు వెళ్ళడం చాలా అరుదు. ఒకసారి మాత్రం తన సంగీత దర్శకత్వంలో వచ్చిన 'సతీ సుకన్య' పాటల రికార్డింగ్ కోసం మైసూర్ వెళ్ళారు. మైసూర్ ప్రీమియర్ స్టూడియో లోనే ఆ సినిమా షూటింగ్ లు, రికార్డింగ్/రీరికార్డింగ్ జరిగాయి. ఆ సినీమా పాటల కంపోజింగ్ విశేషాల గురించి గతంలో 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో పేర్కొనడం జరిగింది.

జీవితచక్రంలోని నాలుగు పాటలు పాడడానికి ఒక వారం బొంబాయి లో వుండేలా ఏర్పాట్లు చేసుకోమని నిర్మాతలు అడుగుతున్నారని దానికి తగ్గట్లుగా మద్రాస్ లోని  తన షెడ్యూల్స్ ఎడ్జస్ట్ చేసుకోవాలని ఘంటసాల మాస్టారు ఇంట్లో అనేవారు. ఘంటసాలవారికి బొంబాయి  సినీమా వాతావరణం క్రొత్త. అలాగే అక్కడివారికీ ఘంటసాల అంటే ఏమిటో తెలియదు. అక్కడ మాస్టారికి తెలిసిన తెలుగు వ్యక్తి సి.వెంకటేశ్వరరావు. ఆయన బొంబాయి లో డాన్స్ డైరక్టర్ గా పనిచేసేవారు. ఆయనకు ఘంటసాలగారి పాటలంటే విపరీతాభిమానం. ఘంటసాలవారి పాత గ్రామఫోన్ రికార్డులను తన వర్క్ స్పాట్ కు తీసుకువెళ్ళి ఖాళీ సమయాలలో వింటూండేవారట. అక్కడివారందరికీ మాస్టారి పాటలు వినిపించి ఘంటసాలవారి గురించి గొప్పగా వివరించేవారట. ఆయన తర్వాత ఎప్పుడో మద్రాసు వచ్చి ఘంటసాల మాస్టారు సంగీతదర్శకత్వం  వహించిన ఒకటి రెండు సినిమా లకు నృత్య దర్శకత్వం వహించారు.

బొంబాయి చిత్రసీమ జీవన శైలికి, మద్రాస్ చిత్రసీమ జీవనరీతులకు చాలా తేడావుంది. మద్రాసు  చిత్ర నిర్మాణంలో వుండే క్రమపధ్ధతి, నిబధ్ధత, సమయపాలన మొదలైన అంశాలు బొంబాయి లో తక్కువ. అనుకున్న షెడ్యూల్స్ లో పని  సక్రమంగా పూర్తికాదని అనుకోవడం విన్నాను. ఇవే నాలుగు పాటలు మద్రాసులో అయితే రెండు కాల్షీట్లు లో ముగించేయవచ్చు. దానికోసం వారం రోజులు అవసరమా అని అనుకుంటూ ఘంటసాల మాస్టారు బొంబాయి వెళ్ళారు. శంకర్ జైకిషన్ల్ అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక పొందిన సంగీత దర్శకులు. తమ పాటలకు వందకు తక్కువ లేకుండా వెస్టర్న్  ఆర్కెష్ట్రాను భారీగా ఉపయోగిస్తారనుకునేవారు. వాళ్ళ బాణీకి ఘంటసాలవారి బాణికి చాలా తేడా వుంది. వారి పాటలలో గమకాలు ఎక్కువ వుండవు. ఆ విషయం ముఖేష్, శారద వంటి గాయకులు పాడిన పాటలు వింటే అర్ధమవుతుంది.

ఈ సినీమా నాటికే శంకర్ జైకిషన్ల్ విడాకులు పుచ్చుకున్నారు. ఎవరి సినీమాలు వారివే. కానీ, రాజ్ కపూర్ లాటి ఆప్తమిత్రుల కోసం ఇద్దరూ సంయుక్తంగానే పనిచేస్తున్నట్లు కనిపించేవారు. ఈ ఇద్దరిలో ఎవరు ఏ సినీమాకు పనిచేసినా శంకర్ జైకిషన్ల సంగీతంగానే ప్రచారం జరిగేది.

జీవితచక్రం సినీమా సంగీతం శంకర్ ది. ఈయన స్వస్థలం కూడా హైదరాబాద్. తెలుగువాడే. అయితే ఆయనకు ఎంతవరకూ తెలుగు గుర్తుందో నాకు తెలియదు. బొంబాయిలో దిగిన ఘంటసాల మాస్టారిని  గౌరవప్రదంగా స్వాగతించి తీసుకువెళ్ళారు.

సామాన్య దాక్షిణాత్యుల మాదిరిగా మామూలు  తెల్లలుంగీ, తెల్ల షర్ట్ లో కనిపించే ఈ గాయకుడు బొంబాయి వాద్యగాళ్ళనేమీ పెద్దగా ఆకర్షించలేదట ఏదో సాదాసీదా గాయకుడిగా భావించారు. రిహార్సల్స్ జరిగాయి. పాడడానికి కష్టమనుకుంటే బిట్ బై బిట్ రికార్డ్ చేద్దామన్నారట. అలాటి అలవాటే ఘంటసాలవారికి లేదు. మొత్తం పాటంతా ఒకేసారి పాడేయాల్సిందే. మోనిటర్ చూడడానికి మైక్రోఫోన్స్ ఆన్ చేయగానే అప్పుడు తెలిసింది ఘంటసాల అంటే ఎవరో. ఆ గళంలోని స్థాయికి , గాంభీర్యానికి వైబ్రేషన్స్ తో రికార్డింగ్ ధియేటర్ దద్దరిల్లిందట. అక్కడున్న మ్యుజిషియన్స్ అందరూ ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యారట.  ఈ గాయకుడెవరో సామాన్యుడు కాడని అర్ధమయింది. ఒకటి రెండు టేకులలో పాట అంతా ok.  శంకర్ జైకిషన్ల ఆర్కెష్ట్రా అంతా ఒక్కుమ్మడిగా లేచి నిలబడి  చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేసారట. అలాగే మొత్తం నాలుగు పాటలను రెండు రోజుల్లో ముగించేసి మూడోరోజు సాయంత్రానికి ఘంటసాల మాస్టారు తిరిగి మద్రాసు వచ్చేసారు. వారం రోజులన్నది మూడు రోజుల్లోనే వచ్చేసరికి అందరికీ ఆశ్చర్యం, ఆందోళన కలిగింది బొంబాయి రికార్డింగ్ లు ఏమైనా క్యాన్సిల్ అయ్యాయేమోనని. అదేంలేదు, నాలుగు పాటల రికార్డింగ్ లు ముగించే వచ్చానని చెప్పారు.  ఈ పాటలు పాడడంలో పెద్దగా కష్టపడలేదని ఈ రకమైన పాటలు రోజుకు మూడు నాలుగైనా సునాయాసంగా పాడవచ్చని చెప్పారు. పనిలేకుండా వారంరోజులు హోటల్లో గడపడం తనకు ఇష్టంలేదని, దానివల్ల నిర్మాత కు అనవసరపు ఖర్చు తప్ప ఇంకేమీ వుండదని, అదే ఇంటికి వచ్చేస్తే ఇక్కడి పనులు చూసుకోవచ్చని వచ్చేసినట్లు చెప్పారు. బొంబాయి శంకర్ తనను ఎంతో గౌరవించారని, తనను బొంబాయి వచ్చేయమని తాను  మ్యూజిక్ చేసే హిందీ సినీమాలలో, లాటిన్, ఫ్రెంచ్ భాషలలో ఆల్బమ్స్  పాడిస్తానని బలవంతపెట్టారట. అందుకు ఘంటసాల మాస్టారు వినయంగా తాను తెలుగు చిత్రసీమలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా పాడుతున్నాని, అక్కడ వున్న స్థానము, పొందుతున్న గౌరవము, ప్రజాభిమానమే చాలని, తెలియని భాషలు కొత్తగా నేర్చుకొని పాడేంత ఆసక్తి, సమయమూ తనకు లేవని తెలియజేసారట. తాను అక్కడున్న మూడు రోజులలో సాయంత్రం పూట ఎంతో మంది సంగీతప్రియులు మాస్టారి రూమ్ కు వచ్చి ఆయనచేత పాడించి విని ఆనందించేవారట. మాస్టారు చెప్పిన అనేకమంది పేర్లలో ఈనాడు నాకు గుర్తున్నది మాలాసిన్హా పేరు మాత్రమే. 

అది ఘంటసాలవారి వ్యక్తిత్వం.

అందుకే  ఆకారాన్ని, వేష భాషలను చూసి మనిషిని అంచనా వేయకూడదంటారు.

జీవితచక్రం శంకర్ జైకిషన్ల మొదటి తెలుగు చిత్రం. (ప్రేమలేఖలు డబ్బింగ్). ఈ చిత్రంలోని పాటలన్నీ గతంలో శంకర్ జైకిషన్ల్ చేసిన పాటల ధోరణిలోనే వినిపిస్తాయి. దానికి కారణం బహుశా, తమ పాటల మీద తమకున్న మమకారం, మక్కువ కావచ్చు, అవే ట్యూన్స్ తిరిగి తిరిగి శ్రోతలకు వినిపిస్తాయి. ఇది రాజ్ కపూర్ ప్రభావం అని నాకనిపిస్తుంది. రాజ్ కపూర్ తీసిన మొదటి తరం సినీమాలోని పాటల బిట్లు తర్వాత వచ్చిన సినీమాలన్నిటిలో ఎక్కడో దగ్గర అంతర్లీనంగా నేపథ్య సంగీత రూపంలో సుశ్రావ్యంగా వినిపిస్తూంటాయి. 'తినగ తినగ వేము తియ్యగుండు' అన్నట్లు పాత పాటలైనా పదేపదే వినిపిస్తూంటే శ్రోతల హృదయాలకు మరింత చేరువ అవుతాయి.

ఆ విధంగా జీవితచక్రంలోని ఏడు పాటలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగించేవే, ఒక్క 'సుడిగాలి లోన దీపం కడవరకు వెలుగునా' పాట తప్ప. ఇది విషాదగీతం. ఈ పాటలో ఘంటసాలగారి  గళంలో వినపడే విషాద భావోద్రేకాలు, గాంభీర్యం ఎలాటివారినైనా కరిగిస్తాయి. 'కంటి చూపు చెపుతోంది', హిందీ గాయని శారదతో  పాడిన  " కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడు", "మధురాతి మధురం మన ప్రేమ మధురం" పాటలు   అన్ని వర్గాల శ్రోతలచేత స్టెప్ లు వేయించేలా ఉత్సాహభరితంగా మాస్టారు పాడారు.


కంటి చూపు చెబుతోంది - జీవితచక్రం

1971 లో వచ్చిన చాలా సినీమాలలోని పాటలు ఘంటసాలవారికి మంచి కీర్తి ప్రతిష్పలనే సంపాదించి పెట్టాయి. 'పదిమందిలో పాట పాడినా' (ఆనందనిలయం), "మొదటి పెగ్గులో మజా" (శ్రీమంతుడు) పాటలు ఈనాటికీ వినిపిస్తున్నాయి. 


పదిమందిలో పాట పాడినా - ఆనందనిలయం


ఆ సంవత్సరంలో అతి ఘన విజయం సాధించిన సినీమా 'ప్రేమ నగర్'. వరస పరాజయాలతో బాగా కృంగిపోయి ఇక మద్రాసు వదలి పోవడం తప్ప  వేరే మార్గంలేదని నిశ్చయించుకున్న తర్వాత ఆఖరు ప్రయత్నంగా డి.రామానాయుడుగారు నిర్మించిన చిత్రం 'ప్రేమనగర్'. దేవదాసు టైప్ సినీమా. దేవదాసు పాటల్లాగే కె.వి.మహాదేవన్ చేసిన ప్రేమనగర్ పాటలన్నీ సూపర్ హిట్ అయాయి.  దేవదాసుకు వచ్చినంత పేరు ఘంటసాలవారికి ఈ సినీమా పాటలతో వచ్చింది. ఈ సినీమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమిళ, హిందీ భాషలలో కూడా ప్రేమనగర్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఈ సినీమా తర్వాత రామానాయుడు శతాధిక సినీమాలు తీసి,  సొంత స్టూడియో కట్టి 'మూవీ మొఘల్' అనే కీర్తిపొందారు. తెలుగు సినీమా ప్రముఖులలో ప్రముఖుడిగా వెలుగొందారు.

ప్రేమనగర్ లో ఘంటసాల మాస్టారి పాటలు ఎనిమిది వున్నాయి. "అంతము లేని ఈ భువనమంత" పద్యం, "మనసు గతి ఇంతే", "ఎవరి కోసం , ఎవరికోసం", "నేను పుట్టాను లోకం మెచ్చింది', "తేట తేట తెలుగులా", "నీకోసం వెలిసింది ప్రేమ మందిరం", "కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల' పాటలన్నీ ఒక నూతన చరిత్ర సృష్టించాయి. ప్రేమనగర్ సినీమా రామానాయుడుగారి జీవితంలో ఒక అనూహ్యమైన మలుపు.

మనసు గతి ఇంతే - ప్రేమనగర్


1971 వ సంవత్సరం ఆఖరులో వచ్చిన మరో భారీ చిత్రం ఎన్.టి.రామారావు గారి సొంతచిత్రం ' శ్రీకృష్ణ సత్య'. పేరుకు డైరెక్టర్ గా కె.వి.రెడ్డిగారిని నియమించినా నిర్మాణ భాధ్యత అంతా రామారావుగారిదే.

దేశరక్షణనిధి కోసం రామారావుగారి నేతృత్వంలో సినీ పరిశ్రమ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సాంస్కృతికోత్సవాలు నిర్వహించింది. అ సందర్భంలో రామారావుగారు శ్రీకృష్ణుడిగా ఈ కథను నాటకంగా ప్రదర్శించారు. దానికి ఘంటసాల మాస్టారే సంగీత భాధ్యతలు వహించారు. ఆ సమయంలో రామారావుగారు  ఇదే కథను సినీమాగా తీస్తానని ఆ సినీమాకు మీరే సంగీతం చేపట్టాలని ఘంటసాల మాస్టారిని అడిగారట. మాస్టారు సరేనన్నారు. రక్షణనిధి కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి. ఎవరి పనుల్లో వారు పడ్డారు. త‌ర్వాత ఎన్.టి.ఆర్ 'కృష్ణసత్య' ను ప్రారంభించారు. కానీ సంగీత దర్శకుడిగా ఘంటసాలవారిని తీసుకోలేదు. ఎన్.ఎ.టిలో పెండ్యాల గారు ప్రవేశించారు. అయినా ఘంటసాలవారు బాధపడలేదు. తను పాడవలసిన పాటలుంటే అవి ఎలాగూ పాడిస్తారు అనే భావనలో వుండేవారు. కానీ నేను మాత్రం, వస్తాయనుకున్న కొన్ని సినీమాలు చేజారిపోతూంటే, కొన్ని కారణాల వల్ల  బాగా నిరాశ చెందుతూండేవాడిని. సినీమా పూర్తి పౌరాణికం కావడం వలన పద్యాలు పాటలు సమృధ్ధిగానే వుంటాయి. ఈ సినీమాలో తిరుపతి వెంకటకవులు వ్రాసిన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు,  ఓ రెండు పాటలు మొత్తం ఓ పదమూడు వరకూ  మాస్టారు పాడారు. 'ప్రియా ప్రియా మధురం', "అలుకమానవే చిలకల కొలికిరో" పాటలను పెండ్యాల గారు మధురంగా స్వరపర్చారు. 

1970లో  ప్రారంభమై  1971లో విడుదలైన  ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలు నాలుగు అవి, గత వారంలో చెప్పిన
'రంగేళీరాజా', 'పట్టిందల్లా బంగారం', ఎడిటర్ హరినారాయణ సినీమా 'పట్టుకుంటే లక్ష'. ఈ  రెండు సినీమాలలో సంగీతానికి పెద్ద ప్రాధాన్యం లేదు. 'పట్టుకుంటే లక్ష' క్రైమ్ సినీమా. కొమ్మూరి సాంబశివరావుగారి డిటెక్టివ్ నవల ఆధారంగా తీసినది.

ఆ సంవత్సరం ఆఖరులో  రామవిజేతా బాబూరావు సినీమా 'రామాలయం'. ఇందులోని పాటలన్నీ జనరంజకంగా అమరాయి. ముఖ్యంగా మాస్టారు పాడిన 'జగదభిరామా రఘుకుల సోమా', జిక్కి, జానకి పాడిన 'చిన్నా‌రి మరదలికి పెళ్ళవుతుంది", 'మముగన్న తల్లిరా భూదేవి', ఎల్.ఆర్.ఈశ్వరి పాడిన 'మదనా మదనా యనుచును' పాటలు మరింత వినసొంపుగా వుంటాయి.

జగదభిరామ - రామాలయం


'రామాలయం' చిత్రం రీరికార్డింగ్ జరిపే సమయానికి ఘంటసాలవారు తన బృందంతో విదేశీ పర్యటనకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మాస్టారి కోరికను మన్నించి ఎస్.రాజేశ్వరరావుగారు రీరికార్డింగ్ పోర్షన్ కు సంగీతం నిర్వహించారు. మాస్టారి పెద్ద కుమారుడు ఘంటసాల విజయకుమార్ సంగీత సహాయకుడిగా రాజేశ్వరరావు గారికి సహకరించాడు.

ఘంటసాలవారి విదేశీయానం కార్యక్రమాలన్ని ఒక కొలిక్కి వచ్చినట్లే. ఒక శుభ ముహుర్తం చూసుకొని బయల్దేరడమే తరువాయి.

ఆ విశేషాలన్ని వచ్చే వారం...

               ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, December 5, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైయవ భాగం

05.12.2021 - ఆదివారం భాగం - 60*:
అధ్యాయం 2  భాగం 59 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

'గాన గంధర్వుడు' శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారి జయంతి సందర్భంగా అశేషాభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.



🔔🌷🌿💐🔔🌺🌿🙏

జగపతి పిక్చర్స్ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ గారు ఘంటసాలవారికి సన్నిహిత మిత్రులు. ఘంటసాల మాస్టారిపట్ల చాలా గౌరవ మర్యాదలు చూపేవారు. కళాకారులకు చాలా ప్రామ్ట్ గా పారితోషకాలు చెల్లించడం విషయంలో ఎప్పుడూ ప్రధమంగా వుండే ఉత్తమ నిర్మాత. మంచి సహృదయుడు. ఘంటసాల మాస్టారి అవసరాలను డిమాండ్ ను గమనిస్తూ ఎప్పటికప్పుడు పారితోషకాలను పెంచడంలో ఇతర నిర్మాతల కంటే ముందంజలో వుండేవారని చెపుతారు. రాజేంద్రప్రసాద్ గారు చిత్రనిర్మాణం చేపట్టి  మద్రాసులో అడుగుపెట్టేనాటికి ఆయనకు ఆ రంగంలో పెద్ద అనుభవంలేదు. తన మొదటి చిత్రాన్ని ఎవరైనా భాగస్వాములతో కలసి నిర్మించే యోచనలో వున్నారు. ఆ క్రమంలో రాజేంద్రప్రసాద్ గారు ఘంటసాలవారిని కలుసుకొని తనతో భాగస్వామి గా  చేరమని వరసగా చిత్రనిర్మాణం చేపడదామని కోరారు. అప్పటికి ఘంటసాలవారి సొంతచిత్రం ' భక్త రఘునాధ్' నిర్మాణంలో వుంది. అప్పటికే రెండు సినీమాల అపజయంతో అప్పుల్లో మునిగితేలుతూవున్న సమయంలో ఏ అనుభవం లేని కొత్త యువకుడిని భాగస్వామిగా చేసుకొనే విషయంలో ఘంటసాలవారు వెనుకంజ వేసారు. ధైర్యంచేసి ముందుకు వెళ్ళలేకపోయారు. నిర్మాతగా రాశిలేని తనతో మరొక కొత్త నిర్మాత చేరడం ఆ వ్యక్తికి అంత శ్రేయస్కరం కాదని భావించి అదే విషయాన్ని సున్నితంగా రాజేంద్రప్రసాద్ గారికి నచ్చచెప్పి గాయకుడిగా తన పరిపూర్ణ సహకారం ఎప్పటికి వుంటుందని భరోసా ఇచ్చారట (ఈ విషయాలన్నీ  మాస్టారి సోదరుడు,  జి.వి.ఎస్.ప్రొడక్షన్స్ నిర్మాత ఘంటసాల సదాశివుడుగారు చెప్పినవి).

తర్వాత, రాజేంద్రప్రసాద్ గారు మరొకరి  భాగస్వామ్యంలో  1960లో "అన్నపూర్ణ" చిత్రం తీసారు . నిర్మాత వీరమాచనేని, దర్శకుడు వీరమాచనేని కలసి పనిచేసిన మొదటి చిత్రం. అందులో ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. మొదటి చిత్రంతోనే చిత్రరంగానికి సంబంధించిన విషయాలన్ని ఆకళింపు చేసుకొని వరసగా 'అ', 'ఆ'లు మొదటి అక్షరంగా వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో అనేక సినీమాలు తీసి నిర్మాతగా ఘన విజయాలు సాధించారు వీరమాచనేని రాజేంద్రప్రసాద్. ఒక పదేళ్ళ తర్వాత  వీరమాచనేని కాంబినేషన్ లో మార్పు చేయవలసిన పరిస్థితి వచ్చింది. 'అ ,ఆ' ల సినిమా లకు బ్రేక్ పడింది. ఈసారి స్వీయ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ 'దసరాబుల్లోడు' సినీమాను రంగులలో తీసారు. ఆ సినిమా లో పాటలన్నీ విపరీత జనాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. జగపతి సినీమాలంటేనే పాటలు ప్రధానంగా జనాకర్షణగా వుంటాయనే పేరు వచ్చింది. వి.బి.రాజేంద్రప్రసాద్ గారి సినిమాలన్నింటిలోనూ ఘంటసాలవారు పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. జగపతికి అక్కినేని, జగ్గయ్య,  కె.వి.మహాదేవన్, ఆత్రేయ, ఘంటసాల, సుశీల కాంబినేషన్ ఒక అమూల్యమైన ఆస్తి. 

వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శక నిర్మాతగా 1971 లో రిలీజైన అక్కినేని బ్లాక్ బస్టర్  'దసరాబుల్లోడు'లో ఘంటసాలవారు ఏడు పాటలు పాడారు. కుర్రకారును వెర్రెక్కించిన పాటలు పాడడంలో కూడా ఘంటసాలే టాప్ అనడానికి ఈ సినీమా పాటలు ఒక నిదర్శనం. 'ఎట్టాగో వున్నాది ఓలమ్మి', 'పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, 'నల్లవాడే అల్లరి పిల్లవాడే', చేతిలో చెయ్యేసి చెప్పు బావా' పాటలు ఈనాటికీ వినిపిస్తూనే వున్నాయి. దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో  నిర్మాత గా అంచెలంచెలుగా అగ్రస్థాయికి చేరుకున్న నిర్మాత వీరమాచనేని రాజేంద్రప్రసాద్. 

"ఈయనతో ఘంటసాల మాస్టారు భాగస్వామ్యం చేపట్టివుంటే !!!"... అని మాబోటిగాళ్ళం అనుకోవడమే... వారికి మాత్రం ఎప్పుడూ అలాటి ఆలోచనే వుండేది కాదు.

🔔

నెం. 36, ఉస్మాన్ రోడ్ వెనక వేపు ఇంట్లో వుండే రాజగోపాలన్ మామ మామగారు కాలంచేశాక (అనే గుర్తు) మామా, మామీల కుటుంబం మెయిన్ బిల్డింగ్ లోకి వచ్చేసారు. ముందుభాగం గేట్ ఉస్మాన్ రోడ్ లో వుండగా వెనక భాగం గేటు ఆనందం స్ట్రీట్ లో వుండేది. పేరుకే ఆనందం స్ట్రీట్, అందులోకడుగు పెడితే ఏ ఆనందం ఉండేది కాదు. ఆ వీధి పక్కన రంగరాజపురం చిన్న గేటు (రైల్వేగేటు) దాక విస్తరించి ఉండే గుడెసెవాసులుండే రాజపిళ్ళై తోట్టంలోని పిల్లలకి ఆ వీధి మొదటి వంద మీటర్లూ ఓ ఓపెన్ టాయ్ లెట్. కొంచెం అప్రమత్తంగా లేకుండా కాలేస్తే మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తి కాళ్ళు కడుక్కోవలసి వచ్చేది.  ఆ వీధిలోనే ఏడిద నాగేశ్వరరావుగారు, మాడా వెంకటేశ్వరరావుగారు, కృష్ణంరాజుగారు  చిన్న అద్దె ఇళ్ళలో కాపురముండేవారు. ఆ 36 ఉస్మాన్ రోడ్ మెయిన్ బిల్డింగ్  వెనక భాగం, ఆనంద్ స్ట్రీట్ లో ఉన్న ఇంట్లోకి ఒక తెలుగు కుటుంబం వచ్చింది. అప్పటికే మెయిన్ బిల్డింగ్ మేడ మీద అద్దెకున్న మండా బుచ్చిరామారావుగారికి ట్రాన్సఫర్ కావడంతో వారు మద్రాస్ నుండి వెళ్ళిపోయారు. ఈ వెనకింటికి అద్దెకు వచ్చినవారు కూడా సినీమా నిర్మాతే. భార్య, ఒక కుమార్తెతో ఆ ఇంట్లో వుండేవారు. ఆయన పేరు కోగంటి కుటుంబరావుగారు. ఆయన ఉత్తమచిత్ర బ్యానర్ మీద 'మనసు-మాంగల్యం' అనే సినిమాను అక్కినేని, జమున హీరో హీరోయిన్ లుగా మొదలెట్టారు. కె.ప్రత్యగాత్మ డైరక్టర్. పెండ్యాల గారి సంగీతం. కోగంటివారి అమ్మాయి మా చెల్లెళ్ళ వయసుదే. మా రెండిళ్ళ మధ్య ఒక పిట్టగోడ అడ్డు. పిల్లలంతా ఆ గోడ దూకే రాకపోకలు సాగించేవారు.  ఆ అమ్మాయి తమ సినీమా షూటింగ్ విషయాలు మాస్టారి పిల్లలకు చెప్పేది.  అందరితో స్నేహంగా మసిలేది. వయసుకు చిన్నే అయినా మహా ధైర్యస్తురాలు. 
తర్వాత హిందీ ప్రచార సభ సమీపంలోని భాగీరధీ అమ్మాళ్ స్ట్రీట్ లోని ఒక మేడమీదకు మారిపోయారు. ఆ వీధిలోనే కైకాల సత్యనారాయణ గారి బంగళా కూడా వున్న గుర్తు. ఆ కోగంటి వారి అమ్మాయిని ఓ రెండు దశాబ్దాల తర్వాత నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో వున్నప్పుడు మరల చూసాను. 

'మనసు మాంగల్యం' సినీమాలో  ఘంటసాల మాస్టారి పాటలు నాలుగున్నాయి. రెండు సోలోలు, రెండు డ్యూయెట్లు. 'ఏ శుభ సమయంలో', 'ఎందుకు వచ్చావో...', 'ఆవేశం రావాలి..' పాటలకు పెండ్యాలగారు మంచి వరసలు సమకూర్చారు. 

🌷

1971  ఫిబ్రవరి మూడవ వారంలో ఒక రోజు ఉదయాన్నే బయల్దేరి రాయపురంలో వున్న శ్రీ బి డి రావు గారి కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఆయనే దక్షిణ విభాగపు అధిపతి. ప్రపంచంలో 14 దేశాలలో ఆ కంపెనీ ఫ్యాక్టరీలు, సేల్స్ ఆఫీసులు వున్నాయి. మన దేశంలో నాలుగు ప్రధాన నగరాలలో ఫ్యాక్టరీలు, అనుబంధంగా అనేక ప్రధాన పట్టణాలలో సేల్స్ ఆఫీసులు వుండేవి.  ఆ కంపెనీకీ వెళ్ళేవరకు ఆ కంపెనీ గురించి ఏమీ తెలియదు. ఏ పోస్ట్ కోసం రమ్మన్నారో, ఎవరు ఇంటర్వ్యూ చేస్తారో, ఏమి అడుగుతారో అంతకన్నా తెలియదు. ఫ్రంటాఫీస్ లో ఒక్కడినే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. ఓ అరగంట తర్వాత ఓ కళ్ళద్దాల ఆయన వచ్చి మేనేజర్ గారు పిలుస్తున్నారని ఆయన రూమ్ కు దారి చూపాడు. లోపల బి.డి.రావుగారు వున్నారు. ఆయన నన్ను కూర్చోమని చెప్పి నా సర్టిఫికెట్ లు చూసి, "చూడు! మా  చీఫ్ ఎక్కౌంటెంట్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తాడు. అతనికి నీ పట్ల నమ్మకం, తృప్తి కలిగితేనే నీకు జునియర్  స్టెనో టైపిస్ట్ ఉద్యోగం. లేకపోతే లేదు. జాగ్రత్తగా చూసుకో! వెళ్ళి చీఫ్ ఎక్కౌంటెంట్ ను కలియమని చెప్పి పంపేసారు. అతని రూమ్ ఎక్కడో తెలియదు. ఎవరో చెపితే అటుప్రక్క వెళ్ళాను. మొదట్లో నన్ను రావుగారి ఛాంబర్ కు పంపిన కళ్ళద్దాలాయనే చీఫ్ ఎక్కౌంటెంట్. ఆయన మళ్ళీ నా సర్టిఫికెట్ లు అన్నీ తిరగేసి  పక్క రూమ్ లో వున్న ఒక టైప్ రైటర్ దగ్గరకు తీసుకుపోయి ఉద్యోగం కావాలని ఇంగ్లీష్ లో ఒక లెటర్ టైప్ చేసి చూపించమని అడిగారు. నేను బి.ఎ. అంటే పాసయ్యాను కానీ ఇంగ్లీష్ లో నా ప్రవేశం అంతంత మాత్రమే. స్పెల్లింగ్ మిస్టేక్స్ అసలు వుండేవి కావు. అంతలా మా బొబ్బిలి హైస్కూలు లో భట్టీయం వేసేవాళ్ళం రాగయుక్తంగా. కాకపోతే ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడంగానీ,  వ్యాకరణం తప్పులు లేకుండా నాలుగు వాక్యాలు వ్రాయడం కానీ తెలిసేది కాదు. ఆ మాటకొస్తే తెలుగు అంతే అనుకోండి. 

మొత్తానికి ఓ అరగంట కష్టపడి టైపింగ్ మిస్టేక్స్ లేకుండా ఒక అప్లికేషను టైప్ చేసి  చూపాను.  అది చూసిన తర్వాత ఆయన ఓ రెండు నీలం రంగు మెమో పాడ్ కాగితాలిచ్చి తాను రాసిన ఒక లెటర్ ను టైప్ చేయమన్నారు. సరేనని మళ్ళీ టైపిస్ట్ రూముకు వెళ్ళాను. అదొక హాలీడే  నోటీస్. ఏ కారణం చేతనో ఆ మర్నాడు ఫ్యాక్టరీ, ఆఫీసులకు సెలవు. అందుకు బదులుగా మరో శనివారం రోజున పనిచేయాలన్నది అందులో సారాంశం. నిజం చెప్పొద్దు.  ఆ నోటీస్ టైప్ చేయాల్సిన పనే లేదు. ఆ దస్తూరీ ముత్యాలకోవ. చాలా అరుదుగా అంత చక్కటి చేవ్రాత చూస్తాము. బొబ్బిలి లో మా టైపింగ్ గురువులు, పెద్దలు భళ్ళమూడి గోపాలరావుగారి రాక్షస సాధనలో ఉత్తరాలు, స్టేట్మెంట్ లు , బ్యాలన్స్ షీట్లు ఇత్యాదులు టైప్ చేయడమంటే నల్లేరుమీది బండే. ఆ రోజు నా అదృష్టం, షార్ట్ హాండ్ లో డిక్టేషన్ తీసుకోమని అడగలేదు. చేతిలో షార్ట్ హాండ్ సర్టిఫికెట్ వున్నా ప్రత్యక్షానుభవంలేదు.

ఆ ఎక్కౌంటెంట్ గారు ఇచ్చిన మెమో నోటీస్ కూడా జాగ్రత్తగా డిస్ప్లే చేసి టైప్ చేసి ఇచ్చాను. నన్ను మళ్ళా ముందరి రిసెప్షన్ రూములో కూర్చోమని చెప్పి నేను టైప్ చేసిన రెండు ఉత్తరాలను పట్టుకొని ఆ చీఫ్ ఎక్కౌంటెంట్ గారు రీజినల్ మేనేజర్ బి.డి.రావుగారి రూములోకి వెళ్ళారు.

ఈ సందర్భంలో   పాత సంగతి  ఒకటి జ్ఞాపకానికి వచ్చింది. డిగ్రీ చేతికి రాగానే మద్రాసులో ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టిన రోజుల్లో రాయలా కార్పరేషన్ లో పని చేసే ఒకాయన ఇంటికి వెళ్ళాను.  ఆ కంపెనీ హాల్డా టైప్ రైటింగ్ మెషిన్లను తయారీ చేసేది.  సైదాపేట దాటి వేలచ్చేరి రోడ్ కు ముందు గిండీలో వుండేది. అది బొబ్బిలి రాజావారి కంపెనీ.  ఆయన బొబ్బిలి రాజావారికి క్యాంప్ సెక్రెటరి. ఆయనను అదే మొదటిసారి చూడడం.  ఇల్లు సౌత్ ఉస్మాన్ రోడ్ చివర సి.ఐ.టి.నగర్ లో వుండేది. వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకోగానే లోపలనున్న ఆయన శ్రీమతిని బయటకు పిల్చి "వీడెవడో తెలుసా ! మా సుందరి కొడుకు. వీళ్ళమ్మ, మా అక్కలు మంచి ఫ్రెండ్స్.  వీళ్ళ తాతే  ఘంటసాలకు సంగీతం నేర్పాడు. వీళ్ళ నాన్న సంగీతరావుగారు. హార్మోనియం మీద అద్భుతంగా పాటలు, పద్యాలు పాడతారు. నేనూ కృష్ణ రాయబారం పద్యాలు పాడతాను అంటూ "చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు" అంటూ నాటకం బాణీలో  ఆరున్నర శ్రుతిలో కయ్ మని వినిపించారు. "నీక్కాకపోతే ఇంకెవడికి వస్తుందిరా ఉద్యోగం. ఒక అప్లికేషను రాసి ఇయ్యి  అని అన్నారు. నేను అప్పటికే మా నరసింగడి సహాయంతో వ్రాసిన ఇంగ్లీష్ అప్లికేషను చేతిలో పెట్టాను. అది చూసిన వెంటనే 'ఏ వెధవరా నీకు ఇంగ్లీష్ నేర్పింది. ఇలా రాస్తే ఎవడు ఉద్యోగం ఇస్తాడు. అంటు నా కాగితం నాకే తిరిగిచ్చారు. అందులోని మొదటి వాక్యం "Being given to understand that there are some vacancies in your esteemed organization (.) I wish to apply for the same...." అని రాసాను. తరవాత తెలిసింది (,) ఉండవలసిన చోట ఫుల్ స్టాప్ పెట్టాను. ఈరోజుల్లోలాగా just a typo అని తేలిగ్గా తీసుకునేవాళ్ళుకారు ఆరోజుల్లో. కరెక్షన్స్ కి అసలు అవకాశం ఇవ్వురు. ఆయన మళ్ళా మరోలా లెటర్ రాయింపించి తీసుకొని, "తప్పకుండా నీకు నేను ఉద్యోగం వేయిస్తానురా! వారానికో పదిరోజులకో ఒకసారి వచ్చి కలుస్తూండు. మేమంతా నీకు కావలసినవాళ్ళమే" అంటూ భుజం తట్టి పంపారు. నిజంగానే వెంటనే ఉద్యోగం వచ్చినంత సంబరం కలిగింది. పదేసి రోజులకు ఒకసారి ఆయన దర్శనం చేసేవాడిని.  అలాగే నెలలు, ఏళ్ళు గడిచిపోయాయి. నాకు కాలం కలసిరాలేదు. మళ్ళా ఈ మధ్య నా పెళ్ళి ఇన్విటేషన్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు నన్ను అభినందిస్తూ "బొబ్బిలి రాజావారికి కూడా ఒక ఇన్విటేషన్ పంపు. ఎడ్రస్ ఇస్తాను. ఎవడికోసం వస్తాడు. మీనాన్న చిన్నప్పుడు ఆయన మీద పట్టాభిషేకం ఉత్సవాలు జరిగేప్పుడు హైస్కూలులో పాటలు పాడేడు తెలుసా! మీ నాన్న, మా చిన్నన్న దక్షి క్లాస్మేట్స్. ఆ కృతజ్ఞత మీదైనా రావాలి. నేను వచ్చేలా చేస్తాను." ఇది ఆ వైట్ & వైట్ షార్ట్ మ్యాన్  ధోరణి. ఆయనే మా బొబ్బిలి,  తాతా వెంకట కామేశ్వర శాస్త్రి, ఉరఫ్ కృష్ణశాస్త్రి. సాంస్కృతిక రంగంలో అపర భగీరథశాస్త్రి, సింపిల్ గా టి.వి.కె.శాస్త్రి.

చదువు చెప్పే గురువులంతా శ్రధ్ధగా బాగానే చెపుతారు. తమ శిష్యులంతా వృధ్ధిలోకి రావాలనే ధ్యేయంతోనే వుంటారు. నేర్చుకునేవాళ్ళకి తెలివితేటలు లేకపోతే వాళ్ళేంచేస్తారు. ఎలుగ్గొడ్డు చర్మాన్ని ఎంత వుతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు.  కానీ కాలక్రమంలో మనిషి జీవితంలోని వివిధ అనుభవాలు వివిధ రకాల పాఠాలు నేర్పుతాయి. దానితో మనిషి తెల్లగాను (ఉత్తముడిగానూ) మారవచ్చు, లేదా నల్లగానూ (దుర్మార్గుడిగానూ) మారవచ్చు. 

మేనేజర్ గారి రూమ్ లో నుండి మళ్ళీ పిలుపు వచ్చింది. లోపలికి వెళ్ళాను. అక్కడ రావుగారితో పాటు ఇందాకటి చీఫ్ ఎక్కౌంటెంట్, మరో కమర్షియల్ మేనేజర్ ఉన్నారు. ఇప్పుడే కలకత్తా హెడ్ ఆఫీస్ లోని పెర్సనల్ మేనేజర్ తో మాట్లాడాను. "నిన్ను జూనియర్ స్టెనో టైపిస్ట్ గా ఎపాయింట్ చేయడానికి ఒప్పుకున్నారు, ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతావు" అంటూ తన టేబిల్ డ్రాయర్ సొరుగులోని  ఓ చిన్న పంచాంగం చూసి మార్చ్ 1 బాగుంది. మంచి రోజు. రాహుకాలం లేని సమయంగా చూసి రిపోర్ట్ చెయ్యి. సిన్సియర్ గా పనిచేసి వృధ్ధిలోకి రా అని అక్కడి ముగ్గురు అభినందించి పంపారు.

అంతే,  కంపెనీలోని అందరి సహకారంతో, 1971 మార్చ్ 1 నుండి ఓ 28 ఏళ్ళపాటు అదే కంపెనీలో రెవిట్ అయిపోయి, కంపెనీలోని వివిధ శాఖలలో  విశ్వాసంగా పనిచేసి వియ్యారెస్ (vrs) మీద సగౌరవంగా బయటకు వచ్చాను. 

🌿

విదేశాలలో తెలుగు పాటకు ప్రాచుర్యం కల్పించాలనేది ఘంటసాలవారి చిరకాల వాంఛ. 1962లోనో 63లోనో ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో ప్రముఖుల సమక్షంలో జరిగిన సంగీత కచేరీలో లభించిన ప్రశంసలు, ప్రోత్సాహం చూశాక ఆ కోరిక మరింత బలపడింది. రాష్ట్రవ్యాప్తంగా తన పేరిట లలిత సంగీత కళాశాలలు నెలకొల్పి అన్ని విద్యలలాగే నిర్దిష్టమైన పధ్ధతిలో శాస్త్రీయ సంగీతానికి వున్నట్లే లలిత సంగీతానికి సిలబస్ లు తయారుచేయించి సంగీత శిక్షణలు ఇవ్వాలనేది మరో కోరిక. కానీ, తనకున్న నిరంతర కార్యకలాపాల ఒత్తిడిలో తన ఆశయాలు నెరవేరడంలో జాప్యం కలిగింది. రాష్ట్ర రాజధానిలో తన సినీజీవిత రజతోత్సవ వేడుకల అనంతరం  ప్రపంచం నలుమూలలనుండి అభిమానుల ప్రోత్సాహంతో  అక్కడి తెలుగువారు అందజేస్తామన్న సహాయ సహకారాల బలంతో సాధ్యమైనంత త్వరలో విదేశాలలో సంగీత యాత్ర చేపట్టాలనే దృఢనిశ్చయానికి వచ్చారు. ఆ దిశగా ప్రముఖుల సలహా సంప్రదింపులతో కేంద్రస్థాయిలో ప్రయత్నాలు మొదలెట్టారు. అవి సఫలీకృతమవుతాయనే నమ్మకమూ వారిలో బలంగా కలిగింది.  ఈలోగా ఏ నిర్మాతకు తన వలన ఇబ్బంది కలగకుండా తాను పాడవలసిన పాటలను త్వర త్వరగా పాడి ముగించడానికి మాస్టారు నిశ్చయించారు. 

🌷

నాది రంగేళీరాజా స్వభావం కాకపోయినా ఈ కొత్తరకం జీవితంలోకి అడుగుపెట్టాక అదనపు బరువు భాధ్యతలు పెరిగి స్వేఛ్ఛ తగ్గింది. ఆఫీసుకు వెళ్ళిరావడంలోనే 13 గంటలు గడిచిపోయేది. నెం.35, ఉస్మాన్ రోడ్ లో జరిగే కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే అవకాశం కరువయింది. అలాటి సమయంలో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన  100 వ చిత్రం ( ఒక లెక్క ప్రకారం)  'రంగేళీరాజా' సినీమా ప్రివ్యూ చూడడం జరిగింది. రాజ్యం పిక్చర్స్ కు ఘంటసాలవారు సంగీతం నిర్వహించిన మూడవ సినిమా. శకుంతల, గోవులగోపన్న తర్వాత వచ్చిన చిత్రం. మాస్ మసాల సినీమా. ఉన్న ఆరు పాటల్లో నాలుగింటిని మాస్టారే పాడారు. 'విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా', 'డార్లింగ్ డార్లింగ్ కమాన్', 'ఇలాటి రోజు మళ్ళి రానేరాదు', మాస్టారూ సంగీతం మాస్టారు' పాటలు వీనులవిందుగా ఉన్నా సినిమా పెద్ద విజయం సాధించలేదు. 




అదే సంవత్సరంలో ఘంటసాల మాస్టారు మంచి మంచి పాటలు పాడిన చిత్రాలు మరెన్నో వచ్చాయి. రాజకోట రహస్యం, జీవితచక్రం, ఆనందనిలయం, శ్రీమంతుడు, ప్రేమనగర్, రామాలయం, శ్రీకృష్ణ సత్య మొదలైనవి.

ఈ చిత్రాల పాటల విశేషాలన్నీ వచ్చే వారం...

               ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.