visitors

Friday, April 3, 2020

శ్రీ సంగీతరావుగారి జ్ఞాపకాలలో శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు

                                     
                                   శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు       

                                                                                                                                                                                                                  -  పట్రాయని సంగీతరావు


తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నృత్యనాటకం శ్రీనివాస కల్యాణం పేరుతో ప్రదర్శించాలని సంకల్పించింది. నృత్య నిర్వహణ వెంపటి చిన సత్యంగారికప్పగించింది. దీనికి సలహాదారు బి.ఎన్. రెడ్డిగారు, రచయిత ఎస్. వి. భుజంగరాయ శర్మగారు. సంగీత నిర్వహణ ద్వారం భావనారాయణగారు. ద్వారం భావనారాయణగారికి సహాయకుడిగా నన్నాహ్వానించేరు. ఆయన అంతకు పూర్వం శాకుంతల నృత్యనాటాకానికి సంగీత నిర్వహణ చేశారు.

శ్రీనివాస కల్యాణంలో రెండు సీన్లు పూర్తయ్యాయి. భృగుమహర్షి త్రిమూర్తుల యోగ్యతను పరీక్షించడం ప్రారంభమయింది. మహేశ్వరుణ్ణి పరీక్షించడానికి రావలసి ఉన్నది. పరమేశ్వర ప్రార్ధన శ్లోకం ప్రారంభమయింది. వాసంత ప్రసవీకృతైందవకళమ్ చూడాకలాపోన్నతమ్ – మాటలన్నీ లలితంగా, శ్రవణపేయంగా వినిపించేయి. కృతైందవకళమ్–  ఇందుశబ్దానికి తధ్ధిత రూపం ఐందవా’ ? అని అడిగాను. తధ్ధిత రూపమనే వ్యాకరణ పారిభాషిక పదంతో కూడిన ప్రశ్న నా నుంచి రావడం శర్మగారికి వింతగా వినిపించింది. ఈ సంఘటన తరవాత నన్ను సాహిత్యాభిలాషిగా గ్రహించేరు. అప్పటినుంచి ఏది రికార్డు చేయవలసి వచ్చినా, ఆ సాహిత్యాన్ని ముందుగా నాకు వినిపిస్తూ ఉండేవారు.

ఆయన చాలా సహృదయుడు. స్నేహాభిలాషి. భాషలోను, భవంలోను ఉత్తమ సంస్కారం కలిగినవాడు. క్రమంగా – భావనారాయణగారు మద్రాసులో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేకపోవడంతో – పద్మావతీ శ్రీనివాసం – నృత్యనాటాకానికి సంగీతం నేనే నిర్వహించవలసీ వచ్చింది. శర్మగారు ఏది రాసినా లలితంగా, సుకుమారంగా వినిపించేది. వెంటనే దానికి సంగీతం అమర్చడానికి ఎంతో ఉత్సాహం కలిగేది.

నాటకరంగ విభజనలో, పాత్రపోషణలో ప్రదర్శన సంబంధమైన అంశాలు అన్నిటిలోను సత్యంగారు, శర్మగారిని సంప్రదిస్తూ ఉండేవారు.

ఆ రోజుల్లో కావలి కాలేజీలో ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి గారూ పనిచేవారు. హనుమఛ్ఛాస్త్రి గారూ, పిలకా గణపతిశాస్త్రిగారూ విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్ధులుగా ఉండినప్పుడు పంతుల లక్ష్మీనారాయణ గారు శతవృధ్ధులు.

నవ్యకవిత్వం ఆవిర్భవించిన రోజులవి. నవ్యకవిత్వం పట్ల ఇంద్రగంటి వారికీ, పిలకావారికి సానుభూతి ఉండేది. ఆనాటి ముచ్చట్లు నేను కొన్ని విన్నాను. శర్మగారికా ముచ్చట్లు చెప్పడం జరిగింది. ఆ కబుర్లు పొడిగించాలని ఉండేది శర్మ గారికి.

శ్రీ వెంపటి చిన సత్యం గారు శర్మ గారి సాహిత్యమే కాకుండా, ఆయన సాన్నిహిత్యమూ కోరుకునేవారు. ఆ కారణంచేతే అకాడెమీ నృత్యనాటకాలు ఎక్కడ జరిగినా, శర్మగారి తోడ్పాటు ఉంటూ ఉండేది.

ఆ రోజుల్లో – అవతల కెనడా నుంచి ఇవతల ఫ్లోరిడా దాకా సంచారం జరిగింది. ఈ ప్రయాణాలన్నీ గ్రేహౌండ్బస్సులోనే. శర్మగారూ మాతోటే ప్రయాణం చేసేరు. ఆయన నాకు దగ్గరగా ఉండేవారు.
ఆ బస్సులోనే –
  ‘ఎన్ని సొగసుల మూట 
  మా తెలుగు పాట
  ఎంత తేనియలొలుకు 
  మా తెలుగు పలుకూ
అనే పాట రాసి చూపించేరు నాకు శర్మగారు. నాకది వెంటనే పాడి వినిపించాలనిపించింది. రాగమాలికలో చేశానాపాట.

ఆ పాట ఇదీ –
పల్లవి – రాగం పీలు
ఎన్ని సొగసుల మూట మా తెలుగు పాటా
ఎంత తేనియలొలుకు మా తెలుగు పలుకు       llఎన్నిll


చరణం 1 – రాగం పీలు
తొలికారు మబ్బులో పులకించు ధాత్రిలా
ధాత్రియెదలో మేలుకొను పంటసిరిలా              llఎన్నిll
చరణం 2 – రాగం పీలు
గొబ్బెమ్మ సిగలోని గుమ్మడీ పూవులా
గుమ్మడీ మనసులో మంచు కోరికలా              llఎన్నిll
చరణం 3 – రాగం జంఝూటి
తలుపు దగ్గర చెప్పు తన మగని పేరులా
పేరులో తారాడూ మన్మథుని రూపులా            llఎన్నిll
చరణం 4 – రాగం మోహన
గోదారి ఒడిలోని నెలవంక పాపలా
నెలవంక చెక్కిళ్ళ పాల వెన్నెలలా                  llఎన్నిll

చరణం 5 – రాగం మధ్యమావతి
భద్రాద్రి రాము నెన్నుదుటి కస్తూరిలా
కస్తూరి మనసులో కారుణ్య రేఖలా                  llఎన్నిll

– ఇలా ఏ పాట రాసినా లలిత సుందరమైన ఆ శైలి మనసునెంతో ఆకట్టుకుంటుంది.
శర్మగారెప్పుడు ఏ పనిమీద మద్రాసు వచ్చినా ఆయనతో సత్కాలక్షేపం అవుతుందనే ఆశ నాకుండేది.
18-03-2020
ఉదయం  11 గంటలకు
నాన్నగారు చెపుతుండగా రాసిన వ్యాసం
-      కె వి రమణమ్మ 

Wednesday, March 25, 2020

సాధకుడు బోధకుడు విద్వన్మణి- నూకల చినసత్యనారాయణ


                     


సంగీతరావుగారు సమకాలీనులైన కళాకారులను పరిచయం చేస్తూ, వారి కళాప్రదర్శనలోని లోతుపాతులను వివరిస్తూ ఎన్నో ప్రామాణిక వ్యాసాలను రాసారు. 1976 సం.లో ఆంధ్ర ప్రభ దినపత్రిక లో ఈ వ్యాసపరంపర ప్రచురితమైంది. అప్పటి వ్యాసాలలో ఆయా కళాకారులగురించి సంగీతరావుగారు వివరించిన విశేషాలు తెలుసుకోగోరేవారికోసం ఇక్కడ మళ్లీ ప్రచురిస్తున్నాం. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణమూర్తి వంటి ఎందరో మహావిద్వాంసులను పరిచయంచేసిన ఆ వ్యాస పరంపరలో నూకల చినసత్యనారాయణగారి విద్వత్తును వివరించే వ్యాసం ఇది.

ఆంధ్రప్రభ – డిసెంబర్ 12, 1976, విజ్ఞాన వేదిక
                                  రాగపస్తారంలో స్వతంత్రుడు
         నూకల చిన సత్యనారాయణ
సంగీతం శాస్త్రంగా, వృత్తిగా పరిగ్ర్యహించి పరిపూర్ణమైన సత్ఫలితాలను సాధించిన పట్టభద్రుడు శ్రీ నూకల సత్యనారాయణ. కర్ణాటక సంగీత రసికులకు ఈనాడు శ్రీ సత్యనారాయణ సంగీతం ఎంతో కుతూహలం, ఆసక్తి ఉన్నాయి. సుశ్రావమైన ఆయన కంఠస్వరమూ, రాగతాళములలో గల స్వాతంత్ర్యమూ, సరసత, కచేరీ నిర్వహించడంలో గల అభినివేశమూ శ్రీ సత్యనారాయణ సంగీతంలోని సహజ ఆకర్షణ.

మూడు పదులు దాటిన శ్రీ సత్యనారాయణ సంగీత జీవితానుభవం గణనీయమైనది. సంప్రదాయ సంగీతం సక్రమమైన పధ్ధతిలో గురుముఖతః సాధనచేసిన శ్రీ సత్యనారాయణ సంగీతం ఆయనను ప్రభావితం చేసిన అనేక మంది విద్వాంసుల ప్రతిభతో తాదాత్మ్యం చెందడం ఆయన రసజ్ఞతను, సహృదయాన్ని వ్యక్తం చేస్తుంది. కళాపరంగా ఎక్కడ ఏ మంచి వినిపించినా దానిని గ్రహించడం వలన శ్రీ సత్యనారాయణ పాండిత్యంలో ఎంతో వైశాల్యమూ, గాంభీర్యమూ ఏర్పడ్డాయి. ఈవిధమైన పాండిత్యం ఉత్తమ గురుత్వానికి లక్షణం.

శ్రీ సత్యనారాయణ మొదట వాయులీన వాదకులైన తరవాతనే గాయకులయ్యారు. వాద్యనైపణ్యం కూడా కలిగిన గాయకుడిలో శాస్త్రియంగా సునిశితమైన అవగాహన, సుస్ఫష్టమైన గమకస్ఫూర్తి ఉంటాయి.




పరిశోధన
శ్రీ సత్యనారాయణ సంగీతశాస్త్రంలో పరిశోధనలు సలిపిన పండితులు. భారతీయ సంగీతంలోని రాగవిధానానికి సంబంధించిన దాక్షిణాత్య, ఔత్తరాహ సంగీతసంప్రదాయ రీతుల తులనాత్మక పరిశీలన వారి ప్రత్యేక కృషి.

రాగవిధానం భారతీయ సంగీతం విశిష్ఠత నిరూపస్తుంది. భారత హృదయ సంవేదన రాగవిధానంలోనే సంగీతమయంగా వ్యక్తం అవుతుంది. రాగములు దేవతామూర్తులుగా ధ్యానించబడ్డాయి. అనేక రాగములు రూపకల్పన చేయబడి చిత్రీకరించబడ్డాయి.

రాగనిర్వచనం
రాగం అంటే ఏమిటి? ఆరోహణావరోహణ క్రమంలో గల స్వర సముదాయం అని స్థూలంగా చెప్పడం కన్న, రాగం అంటే సంగ్రహరూపంగా ఉన్న ఒక స్వర రచన అని అనడం ఉచితం. అయితే, ఆ రచన గాయకుని ఊహాపోహలననుసరించి సంకోచ వ్యాకోచాలకు అవకాశం కలిగిస్తుంది. అనేక రాగాలకు రసనిర్ణయం జరిగింది. అయితే ఆ నిర్ణయం సక్రమంగా అనుసరించబడలేదు. నిజానికి వివిధ రసములకు లక్ష్యప్రాయమైన స్వరరచనలు లేవు. యక్షగానాలలోను, నాట్యరూపకములలోను ఆయా రాగాలను వివిధ రస నిష్ప్తత్తికి పోషించేవారేమో? ఆయా రసభావములను పోషించే సందర్భంలో తీవ్ర, కోమల స్వరసమ్మేళన గాయకుని సరసమైన ప్రతిభే ప్రధానంగా ఉంటుంది. రసనిష్పత్తికి రాగప్రాధాన్యాన్ని చెప్పినట్టు, తాళప్రాధాన్యాన్ని చెప్పడం కనబడదు. అనుభవంలో తాళప్రాధాన్యం ఎంతో కనిపస్తుంది. రసభావపోషణలో రాగముల పరిధి నిర్ణయించడం పరిశోధకుల సమస్య. అనేక ప్రసిధ్ధ రాగములు శతాబ్దుల తరబడి ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాలక్రమాన మేళకర్త పధ్ధతి అనుభవంలోకి రావడం, దానిని బట్టి అనాదిగా వస్తూన్న రాగాలను ఆయా మేళకర్తలకు సంబంధించి వర్గీకరించడం జరిగింది. మేళకర్త విధానం అమలులోకి వచ్చిన తరవాత ఔడవషాడవ భేదాలననుసరించి ఏర్పడ్డ రాగాలు వేలకు వేలు తయారయాయి. వీటన్నిటికీ పేర్లు పెట్టవలసి రావడం ఒక సమస్యే. కారణం – చందోబధ్ధంగా ఏర్పడ్డ ఆయా రాగాలకు అనుభవంలో లేకపోయినా, వేల సంఖ్యలో నామకరణం చేయవలసి ఉంటుంది గదా! అయితే, ఎన్ని పుస్తకాల్లో వెతికినా అన్ని వేల రాగాలు కనబడవు. మనకి కావలసిన మూర్ఛనకి సరిపడే పేరు పుస్తకాల్లో కనబడకపోతే ఏ శక్తిప్రియఅన్న పేరో పెట్టుకోవలసి ఉంటుంది. ఆరోహణావరోహణ క్రమంలో వక్రసంచారంలో ప్రతి చిన్న మార్పును వేరే రాగంగా వ్యవహరించవలసి వస్తుంది.

ఒక రాగం శ్రవణయోగ్యంగా ఉండడం, ఆ రాగంలోని స్వరసంబంధ పరస్పర సంవాది, అనువాది రూపంగా ఉండడం గ్రహించగలుగుతాం. ఈ ప్రాతిపదిక మీద రాగవిధానం పునః పరిశీలించడం అవసరమేమో? ప్రతి చిన్న సంచారాన్నీ ప్రత్యేక రాగంగా పేర్కొనడం కన్నా ఈనాడు వివిధ రాగములుగా పేర్కొనబడిన రాగాలను సమన్వయపఱచి ఒకే రాగంగా విస్తృతపరచవచ్చునేమో! శ్రీ సత్యనారాయణగారి వంటి పరిశోధకులు వివరించవలసి ఉంటుంది.

రాగమేళనం    
ఈనాడు ఉత్తరాది సంగీతంలో రెండు భాగాలుగా గానం చేయడం ఒక ప్రక్రియగా అమలులోకి వచ్చి ఉంది. రాగవిధానం వలన నిర్దిష్టమైన రాగభావములకు ప్రత్యేకత ఏర్పడడం జరిగింది. ఆ రాగ స్వరూపానికి స్కాలిత్యం ఏర్పడకుండా అచంచలమైన లక్షణం ఏర్పడింది. గ్రహస్వరం, న్యాసస్వరం, అంశస్వరములను నిర్ణయించి ఆ రాగ స్వరూపానికి మార్పులు, చేర్పులకు అవకాశంలేకుండా చేయబడింది. దీనివలన ఆయా రాగాల స్వరూపాలు నిర్దిష్టంగా ఏర్పడ్డా, ఆయా రాగములలో రచింపబడిన రచనలలో వైవిధ్యం లోపిస్తుంది. ఒకే రాగంలో ఉన్న అనేక రచనలలో ఉన్న రాగభావం ఒకటే. ఒక కీర్తన గాంధారంలో ప్రారంభం అయితే, మరొకటి షడ్జమంలో ఎత్తుగడ జరిగిందనే తృప్తి తప్పిస్తే మరేమీలేదు.

అందుచేతనే రాగభావములను ఆధారం చేసుకున్న ఆయా రచనలలో స్వరరచయిత భావనకు అవకాశంలేదు. ఇంతకు పూర్వం శతాబ్దులుగా ప్రచారంలో ఉన్న రాగభావన్ని సాహిత్యానికి అమర్చడమన్నదే ప్రధానం. ఆయా విషయాలను వివరంగా రసికులు గ్రహించడానికి శ్రీ సత్యనారాయణగారు వంటి పండితుల పరిశోధనలు ఎక్కువ ఉపకరిస్తాయి.

శ్రీ సత్యనారాయణ ప్రథమశ్రేణి గాయకులు. అనేక సంగీత కచేరీలు చేసి, రసికుల మన్ననలు పొందారు. రేడియో జాతీయ కార్యక్రమాల్లో తమ సంగీతం వినిపించారు. అనేక సంగీత రూపకములకు సంగీత సారథ్యం వహించారు. ప్రభుత్వ మర్యాదలననుసరించి అనేక సత్కారాలు పొందారు. పీఠాధిపతుల ఆశీస్సులనందుకున్నారు.

ఉత్తమ సంగీత విద్వాంసులుగా, ప్రథమశ్రేణి గాయకులుగా, వాద్య నిపుణులుగా, స్వరరచయితగా, ఆచార్యులుగా కృతార్థులయిన శ్రీ సత్యనారాయణ స్వకీయమైన ప్రతిభతో రసిక లోకానికి ఇవ్వగలిగినది ఇంకా ఎంతో ఉందనే అనిపిస్తుంది.

===+++===  ఫఫరరరరర