visitors

Saturday, February 6, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పద్ధెనిమిదవ భాగం

07.02.2021 - ఆదివారం భాగం - 18*:
అధ్యాయం 2  భాగం 17 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారి 'భక్త రఘునాధ్' చిత్రంలో ఎన్.టి.రామారావు, గుమ్మడి, అంజలీదేవి కూడా నటించారు. అని చెప్పడం సమంజసం కాదు. మాస్టారి మీద వున్న గౌరవం, ప్రేమాభిమానాలతో, చిత్రం చివరలో ఎన్.టి.రామారావు శ్రీకృష్ణుడిగా, గుమ్మడి బలరాముడిగా, అంజలీదేవి (అనే గుర్తు) సుభద్రగా కొన్ని సెకెండ్లు గౌరవ నటుల హోదాలో తెరపై కనిపిస్తారు. వారికి ఏవైనా డైలాగులు వున్నాయా అంటే సందేహమే.

నెం.35, ఉస్మాన్ రోడ్ లో 'కృష్ణ ద్వయం' ఉండేది. ఒకరు 'మామయ్య' కృష్ణ. మరొకరు 'తమ్ముడు' కృష్ణ ఉరఫ్ 'గుండు మావయ్య'.

మావయ్య కృష్ణ సావిత్రమ్మగారికి మేనమామ.  వయసులో ఆవిడ కంటే చిన్నే. మాస్టారి ఇంట్లోనే వుంటూ  జివిఎస్ ప్రొడక్షన్ లో  పని చేసేవాడు. సుమారైన ఎత్తులో నొక్కుల జుత్తు మధ్యపాపిడి, ఫుల్ హాండ్స్ షర్ట్, వేస్టి (తెల్ల లుంగీ) ధరించేవాడు. మనిషి సౌమ్యంగానే వుండేవాడు. అయితే అతను మాట్లాడే తెలుగు నాకు అర్ధమయేది కాదు. ఇంట్లో పిల్లలందరినీ చేరదీసి ఆడించడం, సైకిల్ మీద బయటకు తీసుకువెళ్ళడం చేసేవాడు. ఆ క్రమంలో ఒకసారి మా పెద్ద చెల్లెలు రమణమ్మను సైకిల్ మీద వెనక క్యారియర్ మీద కూర్చోపెట్టుకొని స్కూలుకు (గ్రిఫిత్ రోడ్ రామకృష్ణా ఎలిమెంటరీ స్కూల్ బ్రాంచ్) తీసుకువెడుతూండగా, పొరపాటున మా రమణమ్మ కాలు వెనక చక్రం స్పోక్స్ లో ఇరుక్కుపోయి గొల్లుమంది. కృష్ణ మావయ్య కంగారుపడి క్రిందికి దింపి తనను ఇంటికి తీసుకు వచ్చేసాడు. మా చెల్లెలి కాలు బాగా వాచిపోయి నొప్పి చేసి రెండు మూడురోజులు అవస్థపడింది. కృష్ణ అజాగ్రత్తకకు  సావిత్రమ్మగారు బాగా చిరాకు పడ్డారు. 

ఒక సంవత్సరం, వేసవి శెలవులనే జ్ఞాపకం, మావయ్య కృష్ణ అన్నగారు, అమ్మగారు వచ్చి మాస్టారింట్లోనే కొన్నాళ్ళున్నారు. అప్పుడు సావిత్రమ్మగారి తల్లి కూడా అక్కడే ఉన్న గుర్తు. ఇల్లంతా చాలా హడావుడి గా ఉండేది. వాళ్ళంతా చాలా గాఠిగా మాట్లాడుకునేవారు. వారి సంభాషణలలో సావిత్రమ్మగారు పాలు పంచుకునేవారు. అయితే వచ్చిన అతిథుల భాష మాత్రం తెలుగు కాదు. అరవంలాగా వినపడలేదు. నాకు తెలియని భాష. తర్వాత తెలిసింది వారు మాట్లాడేది మలయాళం అని. క్రమక్రమంగా వారి సంబంధ బాంధవ్యాలు అర్ధమయ్యాయి. మావయ్య కృష్ణ అక్కగారు సావిత్రమ్మగారి తల్లి. కృష్ణ మావయ్య తల్లి సావిత్రమ్మగారి అమ్మమ్మగారు. సావిత్రమ్మగారి పెద మేనమామ కృష్ణ అన్నగారు. తమ్ముడిది నొక్కుల జుట్టయితే అన్నగారిది పూర్తి బట్టతల. నిరంతర తాంబూల సేవనప్రియుడు. మా పిల్లలందరితో సరదగా మాట్లాడేవారు. నాకు సరిక్రొత్త చిక్కు వచ్చిపడింది. ఘంటసాల  అయ్యగారు తెలుగువారు, అమ్మగారు తెలుగు వారు, వారి అమ్మగారూ తెలుగువారే. కానీ మావయ్యలు, అమ్మమ్మగారు మాత్రం మలయాళం. అదెలా సాధ్యం. ఒకటే సందేహం. ఎవరినైనా అడిగితే చెప్పేవారేమో. కానీ, ఏ విషయంలోనూ నోరు తెరచి ధైర్యంగా మాట్లాడలేక పోవడమనేది మొదటినుంచి నాకున్న పెద్ద బలహీనత. ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం తర్వాత ఎప్పుడో తెలిసింది. సావిత్రమ్మగారి తాతగారు, ఆంధ్రదేశంలో తనకు నచ్చిన, తగిన పెళ్ళికూతురు దొరకకపోతే చివరకు మలబార్ (కేరళ) లోని పాల్ఘాట్ వరకు వెళ్ళి ఒక బ్రాహ్మణులింటి వధువు నచ్చి వివాహం చేసుకొని ఆంధ్రాకు తీసుకువచ్చేసారట. బాల్యవివాహమే. ఆ విధంగా  అమ్మమ్మగారికి తప్ప మిగిలిన  ఎవరికీ మలయాళం తెలియదు. ఎప్పుడైనా అమ్మమ్మ తరఫు బంధువులు కలుసుకున్నప్పుడు మలయాళంలో  మాట్లాడుకునేవారు. అమ్మగారి అమ్మమ్మగారు, పెద మావయ్య అక్కడ ఉన్న సమయంలోనే ఒకసారి పి.లీల, ఆవిడ తండ్రి మీనన్  మాస్టారింటికి వచ్చారు కారులో. వాళ్ళది ఆస్టిన్ ఇంగ్లాండ్ కారు. నల్లగా, నిగనిగలాడుతూ ఎప్పుడు చూసినా సరికొత్తగా చాలా క్యూట్ గా వుండేదా కారు. లీల గారు ఆ కారును చాలా ఏళ్ళు ఉపయోగించారు. ఆవిడదీ పాల్ఘాట్ (ఇప్పుడు పాలక్కాడ్) ప్రాంతమే కావడంతో ఇల్లంతా మలయాళంతో ప్రతిధ్వనించేది. ఘంటసాల మాస్టారు వీరందరి సంభాషణలను సరదాగా నవ్వుతూ వినేవారు. ఒకరిపట్ల ఒకరు ప్రేమాభిమానాలతో ఆప్యాయంగా వుండేవారు.

అదీ సంగతి! అందుకే నాకు మావయ్య కృష్ణ తెలుగు అర్ధమయ్యేది కాదు. మావయ్య కృష్ణకు చాలా లేటుగా వివాహం జరిగింది. జివిఎస్ ప్రొడక్షన్స్ సినీమాలు తీయొద్దని నిర్ణయించుకన్నాక మావయ్య కృష్ణ భరణీ స్టూడియో లో చేరారు. అలాగే ఎడిటర్ హరినారాయణ కూడా భానుమతీగారికి సహాయకుడిగా భరణీ స్టూడియోకు వెళ్ళిపోయారు. ఆ తర్వాతే  కృష్ణ నెం.35, ఉస్మాన్ రోడ్ ను విడచి వేరే చోట కాపురం పెట్టారు. ఆ తర్వాత నాకు మావయ్య కృష్ణ గురించి గానీ , ఆయన కుటుంబం గురించి గానీ ఏ అవగాహన లేదు. ఆయనను సావిత్రమ్మగారింట్లోనూ చూసిన గుర్తు లేదు. ఎడిటర్ హరినారాయణ కూడా ఒక ఐదేళ్ళక్రితం కాలంచేసినట్లు అతని దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మా వీడియో ఎడిటర్ గోవిందరాజన్ తెలిపాడు.

పుష్పక విమానంలాంటి ఘంటసాల మాస్టారి లోగిలి ఎప్పుడూ బంధుమిత్రులతో కలకలలాడుతూండేది.

అదీ కృష్ణద్వయంలోని మరో కృష్ణ. 'తమ్ముడు' కృష్ణ. మొత్తం పిల్లలందరికీ 'గుండు మామయ్య'. (ఒకసారి తిరుపతికెళ్ళి గుండుతో వచ్చినప్పుడు రతన్ గుండుమాఁవయ్యా అని పిలవడంతో పిల్లలందరికి, పిల్లల పిల్లలకి కూడా "గుండుమాఁవయ్య"గా స్థిరపడిపోయాడు కృష్ణ).


మనవరాలితో (రత్తన్ కూతురు) గుండు మాఁవయ్య

సావిత్రమ్మగారి కన్నా వయసులో పెద్ద. ఆవిడను, పాప పిన్నిగారిని "అక్కయ్యా"  అని నోరారా పిలిచేవాడు. ఆ ఇద్దరూ కూడా వయసులో పెద్దైనా అతనిని తమ్ముడిలా ఆదరించారు. అసలు ఎవరీ తమ్ముడు కృష్ణ? ఎక్కడనుండి వచ్చాడు? ఆయనది బందరు. మొదట్లో ఘంటసాలవారి బంధువుల ఇంట్లో పనిచేసేవాడట. అప్పుడు మాస్టారింట్లో నమ్మకస్తుడైన మంచి పనివాడికోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి ఇతనిని మాస్టారింటికి తీసుకువచ్చారు. అతనికి సినీమాలలో చేరిపోవాలనే ఆశ వుండేదట. అయితే ఓనామాలు కూడా తెలియవు. ఏ స్కూలు గడప తొక్కలేదు. ఘంటసాల మాస్టారి హోమ్ డిపార్ట్మెంట్ లో హెల్పర్ గా అమ్మగారికి (సావిత్రమ్మగారు), పాప పిన్నిగారికీ  సహాయ పడుతూండేవాడు. 

కొమరవోలు వెంకట కృష్ణారావు, ఉరఫ్ తమ్ముడు కృష్ణ అను గుండుమామయ్య త్వరలోనే ఘంటసాల కుటుంబ సభ్యుడయ్యాడు. ఘంటసాల మాస్టారికి సుగర్ కంప్లైంట్, బిపి వుండడంవలన తరుచు అరికాళ్ళమంటలతో బాధపడేవారు. రికార్డింగ్ ల సమయంలో గంటలతరబడి నిలబడివలసి వచ్చేది. అలాటిరోజుల్లో కాళ్ళమంటలు మరింత ఎక్కువగా ఉండేవి. అలాటప్పుడు ఈ కృష్ణే మాస్టారి అరికాళ్ళకు కర్పూరం కలపిన మంచినూనెతో మర్దనా చేసేవాడు. ఆయనా ఉపశమనం పొందేవారు. ఆ సమయంలో కృష్ణ ఏవేవో కబుర్లు చెప్పేవాడు. మాస్టారు శ్రధ్ధగా వినేవారు. అది చూడడం వినడం నాకు ఒక కాలక్షేపం. 

అలాగే, కచేరీలకు ఘంటసాల మాస్టారు బయట ఊళ్ళకు వెళ్ళేప్పుడు ఆయనకి 'ADC - Aide de Camp' గా వెంటవెళ్ళేవాడు. ట్రైన్ లోను, ఆయా ఊళ్ళలోనూ టైమ్ ప్రకారం మాస్టారికి మాత్రలు తీసి యివ్వడం, భోజనం వడ్డించడం వంటి పనులన్నీ దగ్గరుండి చేసేవాడు. ఇవన్నీ ఒక యజమానికి నౌకర్ చేస్తున్నట్లు కాక, భక్తితో ప్రేమానురాగాలతో సేవ చేసేవాడు. చాలా నమ్మకస్తుడు. నిజాయితీపరుడు. చాలా సౌమ్యుడు. అందరితోనూ సఖ్యంగా వుండేవాడు. అతనికి అక్కన్నా, అమ్మన్నా, తండ్రి అన్నా, అంతా అమ్మగారు, అయ్యగారు మాత్రమే. తన జీవితాన్ని ఆ కుటుంబానికే అంకితం అన్నట్లుండేవాడు. 

కృష్ణ మా అమ్మగారిని కూడా అక్కయ్యగారూ అని పిలిచేవాడు. అతనికీ మా అమ్మగారిలాగే ఒక్క అరవముక్కా వచ్చేదికాదు. ఎవరితోనైనా తెలుగులోనే మాట్లాడేవాడు. అందుకే ఇంట్లోని అరవ పనివాళ్ళకు, పక్కిళ్ళవారికి తెలుగు వచ్చేసింది. 


(కుడి నుండి ఎడమకు) మా అమ్మగారు, రాజేశ్వరమ్మగార్లతో కొమరవోలు కృష్ణారావుగారు
అదే మా గుండుమాఁవయ్య

మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలలో ప్రసిధ్ధిపొందిన గోపాల్  పళ్ళపొడినే వాడమని రేడియో సిలోన్ వాడు అస్తమానూ ఊదరగొడుతున్నా మేము మాత్రం మా ఇంట్లో నంజన్ గూడు ఎర్ర పళ్ళపొడినే వాడేవాళ్ళం. పేపర్ ప్యాకెట్ లో వచ్చేది. అన్ని షాపుల్లోనూ సులభంగా దొరికేది. టూత్ బ్రష్ లకు, కాల్గెట్ టూత్ పౌడర్లకీ, టూత్ పేస్ట్ లకీ ఎప్పుడు మారామో తెలియదు కానీ, ప్రామిస్, క్లోజప్, పెప్సోడెంట్ అంటూ  చాలా రకాల పేస్ట్ లనే నా తళతళ మెరిసే పళ్ళకు ఉపయోగించాను. ఇప్పుడు ఒక పదేళ్ళుగా సెన్సోడైన్ టూత్ పేస్ట్ కు పరిమితమయ్యాను. మా ఇంటిల్లిపాదీ టూత్ పౌడర్ నే వాడినా మా అమ్మమ్మగారికి మాత్రం పలుతోము పుల్లలే కావలసి వచ్చేవి. మా ఇంటి వెనకాల నూతి దగ్గర ఒక వేపచెట్టు వుండేది. కృష్ణ ఆ  వేపచెట్టు ఎక్కి కొమ్మలు విరిచి ఆ పుల్లలను, వేప గింజలను సేకరించి మా అమ్మమ్మగారికి ఇచ్చేవాడు. ఈ విషయంలో నేను అతనికి సాయం చేసేవాడిని.  ఆ సమయంలో అతను చెప్పినదానికి విరుధ్ధంగా ఏదో పనిచేసి అతనికి చిరాకు తెప్పించడం నాకు ఒక ఆనందం. మా ఇద్దరికీ నూతి గట్టు మీద నీళ్ళకోసం గొడవ వచ్చేది.  అయితే బయటవాళ్ళకు తెలిసేది కాదు. ఉదయాన్నే పళ్ళుతోముకునేప్పుడు అతను పెట్టుకున్న నీళ్ళను నేను కావాలనే వాడేసేవాడిని. తన నీళ్ళే ఎందుకు వాడడం  వేరే తెచ్చుకోవచ్చు కదా అనేవాడు. నేనేదో అనేవాడిని. అతనేదో అనేవాడు. సరే నేనే నూతిలోంచి నీళ్ళు తోడిస్తానని చేద( బకెట్) నూతిలో వేయబోతే అడ్డుకునేవాడు. నూతిగట్టంత ఎత్తైనా లేనివాడివి నువ్వేం నీళ్ళు తోడుతావు, ఏం అక్కరలేదని తానే తోడుకునేవాడు. అంత ప్రేమగా వుండేవాడు. నాకు కొంచెం జ్ఞానం వచ్చాక ఇలాటి చిలిపి చేష్టలకు స్వస్తి చెప్పాను. 

రీరికార్డింగ్ ల సమయంలో మాస్టారికి, మా నాన్నగారికి మధ్యాహ్నం ఇళ్ళకు వచ్చే అవకాశం ఉండేది కాదు. మేమిద్దరం కలసి  12బి బస్సులో వడపళనిలో వుండే స్టూడియోలకు మధ్యాహ్నం భోజనం క్యారియర్ లు పట్టుకు వెళ్ళేవాళ్ళం (నా స్కూల్ శెలవు దినాలలో). మాస్టారి భోజనం అయి మాత్రలు వేసుకున్నాక కృష్ణ తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడు. నేను మాత్రం రీరికార్డింగ్ చూస్తూ రాత్రి మా నాన్నగారితోనో లేక ఘంటసాల మాస్టారితోనో ఇంటికి చేరేవాడిని.

మరి, కృష్ణ సినీమా సరదా ఎలా తీరింది? 

కృష్ణ చాలా సాదాసీదాగా వుండేవాడు. ఇంట్లో వుంటే నిక్కర్, పైన ఒక మల్లు బనీన్ తోనే గడిపేవాడు.ఆ నిక్కర్ టైట్ గా వుండడానికి ఏదో వెండి తావీదు వున్న ఎర్ర  మొలతాడుతో బిగించి కట్టేవాడు.  బజారుకో, స్టూడియోలకో వెళ్ళేప్పుడు మాత్రమే చొక్కా వేసుకునేవాడు.

కృష్ణకు ఎలా అబ్బిందో కానీ యోగాసనాలు వేసే విద్య అబ్బింది. ఆసనాలు బాగా వేసేవాడు. చాలా క్లిష్టమైన ఆసనాలన్నీ సునాయాసంగా వేయగలిగేవాడు. ఈ విషయాలు గ్రహించిన ఘంటసాల మాస్టారు భక్త రఘునాధ్ లో కృష్ణకు అవకాశం కల్పించారు. కధానాయకుడు కాంతారావు దేశద్రిమ్మరిలా తిరుగుతూ ఒక యోగి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ యోగి చిత్తూరు నాగయ్యగారు. ఆయనకు అనేకమంది శిష్యులు. అందులో యోగాసనాలు వేసే ఒక శిష్యుడిగా మన  కొమరవోలు కృష్ణారావు కనిపిస్తాడు. కొన్ని క్లోజప్ లలో కూడా కనిపించాడు. ఈ సినీమానాటికి అతనిని తెరమీద చూసి గుర్తుపట్టి ఆనందించగలిగేది మాస్టారి పెద్దబ్బాయి విజయకుమార్, నేనూ మాత్రమే. మిగతా పిల్లలెవరికీ గుండు మావయ్య సత్తా తెలియదు.

నిజానికి కృష్ణకు ఏ విధంగానూ సినీమాలకు పనికివచ్చే ముడిసరుకు లేదు. ఆ విషయం ఘంటసాల మాస్టారికి బాగానే తెలుసు.

తర్వాత, మరో సందర్భంలో (రికార్డింగో లేక కచేరీయో) పి.లీల పక్కన తంబురా శృతి వేసే అవకాశాన్ని మాస్టారు కృష్ణకు కల్పించారట. అతని జన్మ ధన్యమైపోయింది. తను పి.లీలకు వాయించాడు. అప్పటినుండీ అందరితోనూ లీలకు వాయించానని చెప్పుకుంటూ తెగ మురిసిపోయేవాడు.

సాంస్కృతికాలయంలాటి నెం.35, ఉస్మాన్ రోడ్ కు ఎంతోమంది వచ్చారు కొందరు కొన్నాళ్ళున్నారు.  కొందరు కొన్నేళ్ళున్నారు. వారి వారి కార్యక్రమాలు పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. ఘంటసాల మాస్టారు అయితే చిన్న వయసులోనే పిల్లలు యింకా ఎదగకుండానే అర్ధాంతరంగా ఈ లోకాన్నే వదలిపెట్టి వెళ్ళిపోయారు. 

కాలం కలసిరాక ఘంటసాలవారి కుటుంబం తమ ప్రాణప్రదమైన నెం.35 ఉస్మాన్ రోడ్ నే వదులుకోవలసి వచ్చింది. అటువంటి క్లిష్ట సమయాలలో కూడా కృష్ణ అమ్మగారినే అంటిపెట్టుకున్నాడు. ఆవిడ ఉన్నచోటే  సేవ చేస్తూ అతనూ కాలం గడిపాడు. 


మా నాన్నగారు, సావిత్రమ్మగార్లతో గుండు మామాయ్య

కృష్ణకు పెళ్ళి, సొంత సంసారం ఏదీ లేదు. ఉపనయనం అయింది. బ్రహ్మచారిగానే బ్రతికాడు. ఘంటసాల మాస్టారి జీవితంలోని అన్ని దశలు కృష్ణకు బాగా తెలుసు. ఘంటసాలవారి అందరి పిల్లలను తన చేతులతో ఎత్తుకు ఆడించాడు. ఆ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీచూశాడు. వాళ్ళకూ తనకు చేతనైన  సేవచేశాడు. తన సొంత బిడ్డల్లా సాకాడు. వాళ్ళంతా పెరిగి పెద్దకావడం , పెళ్ళిళ్ళు చేసుకోవడం అన్నీ చూశాడు. వాళ్ళకు సంతానం కలిగి వారంతా పెరిగి పెద్దై పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా కళ్ళారా చూసి సంతోషించాడు. 

కొన్నేళ్ళ క్రితం వరకూ ఘంటసాలవారి రెండవకుమారుడు రత్నకుమార్ ఇంటనే సావిత్రమ్మగారితో వుంటూ తన వయసుకు తగిన పనులు చేస్తూవుండేవాడు. రత్నకుమార్ పార్థసారధి పురంలో ఇల్లుకొన్నాడు. అదే వీధిలో ఒక చివర నటి ఆమని ఇల్లుండేది. వీళ్ళిద్దరి ఇంటి నెంబర్లూ ఒక్కటే. పాత, కొత్త  నెంబర్లని తప్ప. ఈ తేడా తెలియనివారు రతన్ కోసం ఆమని ఇంటికి, ఆమనిని చూడాలని వచ్చేవారు రతన్ ఇంటికీ వచ్చేవారు. నేను మొదటిసారి రతన్ ఇంటికి  వెళ్ళినప్పుడు ఆమని ఇంటి తలుపే తట్టాను. అక్కడెవరో మళ్ళీ గైడ్ చేసి వెనక్కి పంపారు. రతన్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా తమ్ముడు కృష్ణ కనిపించి ఆప్యాయంగా పలకరించి మావాళ్ళందరి గురించి అడిగేవాడు. మనిషిలో వృధ్ధాప్యం బాగా వచ్చేసింది. తరచూ ఏదో అనారోగ్యం చోటుచేసుకునేది.

తమ్ముడు కృష్ణ 2016 ఫిబ్రవరి తొమ్మిదిన కాలం చేశాడు. ఆ సంవత్సరం ఆ దినాన ఘంటసాల మాస్టారి ఆబ్దికం. తొలిరోజు రాత్రి కూడా కృష్ణ ఆ విషయం చెపుతూ అయ్యగారి గురించే తలచుకున్నాడట. ఘంటసాల మాస్టారి తిధిరోజునే, ఆయన్నే నమ్ముకు బ్రతికిన కృష్ణ ఈ లోకాన్ని వదిలిపెట్టడం ఆశ్చర్యమనిపిస్తుంది. అటువంటి తమ్ముడు కృష్ణ, మా గుండు మావయ్య తన 90 ఏట (వయసు నిర్ధారణగా తెలియదు) రత్నకుమార్ ఇంటనే తన తుదిశ్వాస విడిచాడు.  రత్నకుమారే జరిపించవలసిన కర్మకాండ జరిపించాడు.

కృష్ణకు తనవాళ్ళనేవారు ఎవరైనా ఉండేవారా? ఇతనెప్పుడైనా తన సొంతవూరు వెళ్ళాడా? వాళ్ళెప్పుడైనా ఇతనిని చూడ్డానికి వచ్చేవారా? నాకు తెలిసినంతవరకూ లేదు. అతని సర్వస్వము ఘంటసాలవారి కుటుంబమే. ఈ కలియుగంలో ఇటువంటి వ్యక్తులుంటారా అని అనుకునే వాళ్ళకి ఈ కృష్ణే సాక్ష్యం. అందుకు ఘంటసాలవారి/వారి కుటుంబ  ఔదార్యమే సాక్ష్యం.  ఇలాటి వ్యక్తులను మరచిపోగలమా ?

1959లో మొదలయి 1960 లో విడుదలైన అనేక సినీమాలు ఘంటసాల మాస్టారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. అందులో ముఖ్యమైన సినీమాలు (శ్రీ చల్లా సుబ్బారాయుడిగారి "ఘంటసాల గాన చరిత" ఆధారంగా) చూద్దాము.

నమ్మినబంటు, శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం, శాంతినివాసం, శ్రీకృష్ణరాయబారం (సినీమా అంతా పద్యాలే), రాజమకుటం, మహాకవి కాళిదాసు, రాణి రత్నప్రభ, భక్త శబరి, దేవాంతకుడు (పద్యాలు మాత్రం), విమల, అభిమానం, దీపావళి, భట్టి విక్రమార్క, భక్త రఘునాధ్, కుంకుమరేఖ, కనకదుర్గ పూజామహిమ, చివరకు మిగిలేది. ఆ సంవత్సరంలో విడుదలైన అనేక చిత్రాలలో ఇవి కొన్ని మాత్రమే. ఈ చిత్రాలలోని పాటలన్నీ సూపర్ హిట్స్ గా నమోదు అయాయి. 

ఘంటసాల మాస్టారికి విపరీత జనాదరణ పెరగడానికి కారణమైన మరో ముఖ్య చిత్రం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వరలక్ష్మి నటించిన అత్యద్భుత పౌరాణిక చిత్రం శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం'. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు పాట పాడుతూ తెరపై కనిపించి అశేష తెలుగు ప్రజానీకంలో ఒక సంచలనం సృష్టించారు. 

ఆ వివరాలు...  వచ్చే వారమే...           
...సశేషం

Saturday, January 30, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదిహేడవ భాగం

30.01.2021 -  శనివారం భాగం- 17*:
అధ్యాయం 2 భాగం 16 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"మీ ఘంటసాల సవినయంగా సమర్పించు..." అంటూ  తెల్లని దుస్తులతో, అంతకంటే నిర్మలమైన చిరునవ్వుతో నిండుగా తెరమీద కనిపిస్తూ ప్రేక్షకులనుద్దేశించి చెప్పిన ప్రారంభ స్వాగత వచనాలతో జివిఎస్ ప్రొడక్షన్స్ వారి సంగీత ప్రధాన, భక్తి రస చిత్రం  "భక్త రఘునాధ్" సినిమా ప్రారంభమవుతుంది.

జి.వి.ఎస్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ఒక  మకరతోరణం మధ్య ఒక పెద్ద గంట వేలాడుతూ, క్రింది ముందు భాగంలో ఇంగ్లీష్ లో G.V.S.PRODUCTIONS అని కనిపిస్తుంది. 

ఘంటసాలవారి రెండో చిత్రమైన 'సొంతవూరు' చిత్రం కూడా జివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే వచ్చింది. అసలు ఈ పేరు ఎన్నుకోవడంలో మాస్టారి అంతరంగం నాకు తెలియదు కానీ, ఆ బ్యానర్ లో మాస్టారింట్లో చాలామంది పేర్లు కలిసివచ్చేలా కనిపిస్తాయి: జి. ఘంటసాల, వి. వెంకటేశ్వరరావు, విజయకుమార్, ఎస్. సావిత్రి , సదాశివుడు(తమ్ముడు), సుబ్బలక్ష్మి(తమ్ముడి భార్య,మేనకోడలు), శ్యామల. అప్పటికి సుగుణ, శాంతి అనే అమ్మాయిలు పుట్టలేదు.  ఇలా అందరి భాగస్వామ్యంతో ఈ సినీమాలు తీసారని నేను సరదాగా మా బొబ్బిలిలో మా స్నేహితుల దగ్గర చెప్పేవాడిని. "భక్త రఘునాధ్" సినీమా చూసింది కూడా బొబ్బిలిలోనే. శ్రీరామా టాకీస్ అని గుర్తు.

రఘునాధుడు ఉత్కళదేశానికి చెందిన విష్ణుభక్తుడు. ఉత్కళదేశమే ఓఢ్రదేశంగా, ఒరిస్సాగా , ఇప్పుడు ఒడియా రాష్ట్రంగా మారింది. ప్రాచీన భారతదేశంలోని అనేకమంది పరమ భాగవతోత్తముల గాధలన్నీ గ్రంథరూపంలో వెలువడ్డాయి. అందులో, పూరీ జగన్నాధస్వామి భక్తుడైన ఈ రఘునాధ గోస్వామి చరిత్ర కూడా వుంది. 

రెండు సాంఘిక సినీమాలు తీసి ఆర్ధికంగా చాలా నష్టపోయినా ముచ్చటగా మూడవ ప్రయత్నంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచి మరో సినీమా తీయ సంకల్పించి కధ, మాటలు, పాటలు, దర్శకత్వపు భాధ్యతలను శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులవారికి అప్పగించారు. శ్రీ సముద్రాలవారు పౌరాణిక చిత్రాలకు మాటలు,పాటలు రాయడంలో నిష్ణాతులు. అంతకు రెండేళ్ళకుముందే వినాయకచవితి వంటి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకానుభవమూ పొందారు. వీటన్నిటినీ మించి తనను చిత్రసీమకు పరిచయం చేసిన వ్యక్తిగా, ఆత్మీయుడిగా, సన్నిహితుడిగా ఆచార్యులవారి మీద గల పూజ్యభావంతో, కృతజ్ఞతా భావంతోను తాను నిర్మించబోయే కొత్త సినీమా భాధ్యతలను ఆచార్యులవారికి అప్పగించేరేమో అని అనిపిస్తుంది. 

"భక్త రఘునాధ్" చిత్రానికి కధానాయకుడిగా ముందు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారిని సంప్రదించగా, వారెందుకో ఈ చిత్రకధ పట్ల అంత సుముఖంగా లేనట్లు, రఘునాధుడనే భక్తుడిగురించి తెలుగువారికి అంతగా తెలియదని, అలాటి గాథను తెరకెక్కించడం శ్రేయస్కరం కాదని, అయినా ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీ కె.వి.రెడ్డిగారిని నియమిస్తే బాగుంటుందని సలహా యిచ్చినట్లు, కానీ, అప్పటికే ఘంటసాలవారు తన సినీమా డైరక్టర్ గా శ్రీ సముద్రాల వారికి మాట యిచ్చినందువలన, ఆ వాగ్దానాన్ని మీరడం ఇష్టంలేక  శ్రీ నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్లుగా వచ్చిన సమాచారాన్ని నేను చదివేను. 

తరువాత, కాంతారావు, జమునలను నాయక,నాయికలుగా ఎన్నుకున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో నాగయ్య, సి.ఎస్.ఆర్, రేలంగి, సూర్యకాంతం, పేకేటి మొదలైనవారు నియమితులయ్యారు. 

ఈ సినీమా భక్తుడి గాథ కావడం వలన  అతని జీవితం లోని కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు, ఇలా అన్ని రసభావాలను చూపించే క్రమంలో ఈ సినీమాలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. నిర్మాత (తమ్ముడి పేరిట) సంగీతదర్శకుడు, గాయకుడు అన్నీ తానే అయినందున సంగీతనిర్వహణ విషయంలో వారికెంతో స్వేచ్ఛ లభించిందనే చెప్పుకోవాలి. ఇతరుల ఒత్తిడులేవీ సంగీతంమీద ప్రతిఫలించే అవకాశంలేదు. సంపూర్ణ  పాటల స్వర రచన విషయంలో మాస్టారు వ్యవహరించి అక్కడ తానే ఒక భక్తుడి అవస్థలను అనుభవించి ఆయా రసాలకు తగిన వరుసలను సమర్ధవంతంగా తయారు చేశారు. 

పాటల కంపోజింగ్, రిహార్సల్స్ వంటివి నెం.35, ఉస్మాన్ రోడ్ ఇంటి క్రింది హాల్ లో, మేడమీది గదులలో జరిగాయి. ఈ రిహార్సల్స్ సమయంలో ఆ పాటలు పాడిన నేపథ్య గాయనీమణులైన శ్రీమతి పి.లీల, జిక్కి, ఎ.పి.కోమల, మాధవపెద్ది మొదలైనవారిని తరచూ చూస్తూ, వారు పాట నేర్చుకుంటూ పాడే విధానాన్ని గమనిస్తూండేవాడిని.

భక్త రఘునాథ్ చిత్ర జయాపజయాలు పరంగా కాకుండా అందులోని ఉత్తమమైన, శ్రావ్యమైన సంగీతపరంగా, ఆ సినీమానిర్మాణంలో చోటుచేసుకున్న కొన్ని అంశాలవలన, ఆ చిత్రం ఎప్పటికీ నాకు మరపురానిది, అత్యంత ఆత్మీయమైనది. అవేమిటో మీకే తెలుస్తుంది.

భక్త రఘునాథ్ చిత్ర గీతాల రికార్డింగ్, రీరికార్డింగ్, ఇండోర్ షూటింగ్ వాహినీ స్టూడియోలోనే జరిగింది. మాస్టారు తన దైనందిక కార్యకలాపాలు చూసుకుంటూనే ఈ చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూండేవారు.

1959లో మొదలైన "భక్త రఘునాధ్" 1960 లో విడుదలయింది. ఈ సినీమాలో మొత్తం 14 పాటలు, ఓ 8 పద్యాలు, శ్లోకాలు ఉన్నాయి. వీటిలో చాలా పాటలు, పద్యాలు హెచ్ ఎమ్ వి గ్రామఫోన్ రికార్డులుగా విడుదలయాయి. ఈ పాటలలో చాలా భాగం వేసవి శెలవులలోనే రికార్డింగ్ పూర్తిచేసుకోవడంవలన నేను చాలా పాటల రికార్డింగ్ కు, తరువాత రీరికార్డింగ్ కు వెళ్ళడం జరిగింది. అందులో నాకు బాగా గుర్తుండిపోయినవి - 
"నీ గుణగానాము", "తరలిపోయే తెరువరీ", "సంసారజలధి", "ఈ మరపేలా ఈ వెరపేలా", "రామహరే కృష్ణహరే", "గోపాల దయసేయరా"పాటలు.


ఈ చిత్ర నిర్మాణ సమయంలో సాలూరు నుండి మా ప్రభూ చిన్నాన్నగారి అబ్బాయి ప్రసాద్ (పి.వి.ఎన్.ఎస్.వి) కూడా శెలవులకు మద్రాస్ మొదటిసారిగా వచ్చాడు. అతను అప్పుడు ఇప్పుడు కూడా ఘంటసాలవారి పరమ వీర భక్తుడు. ఘంటసాల మాస్టారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చాలా జిజ్ఞాసతో సేకరించే అలవాటుకలవాడు. అతను మద్రాస్ వచ్చిన సమయంలో నెం.35, ఉస్మాన్ రోడ్ కల్యాణశోభతో వెలిగిపోతూండేది. సకలజనాల రాకపోకలతో కోలాహలంగా వుండేది.

ఒక పెద్ద భోషాణం పెట్టిలాటి స్పూల్ టేప్ రికార్డర్ ( జర్మన్ మేక్ గ్రండిగ్  టేప్ రికార్డర్ )లో "భక్త రఘునాథ్" పాటలు, పద్యాలు, షూటింగ్ సమయంలో రికార్డ్ చేసిన డైలాగ్స్  ఇంట్లోని ఆడవారికి వినిపిస్తూండేవారు ప్రొడ్యూసర్ సదాశివుడు, మేనేజర్ సుబ్బు, ఎడిటర్లు బి. హరినారాయణ, దేవేంద్రలు. అలాగే షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటో ఆల్బమ్స్ అన్నీ మేడమీద గదుల్లో బీరువాలలో పడివుండేవి. ఆ ఫోటోలను భక్తిపూర్వకంగా, అపురూపంగా చూడడంలో, టేప్ రికార్డర్ లో పాటలు, మాటలు  వినడంలో మా ప్రసాద్, నేనూ పోటీలు పడేవాళ్ళం. అతను మద్రాస్ లో ఉన్న సమయంలోనే "నీ గుణ గానము" పాట షూటింగ్ వాహినీలో జరిగింది. మేమూ వెళ్ళాము. పూరీ జగన్నాధస్వామి ఆలయం సెట్ వేసి దేవుడి ముందు షూటింగ్. జమున, కాంతారావు, మరికొంతమంది ఎక్స్ట్రాలు (వారిని ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అంటున్నారు) మేకప్ వేసుకొని సిద్థంగా ఉన్నారు.. ఎంతసేపు గడచినా షూటింగ్ ప్రారంభంకాలేదు. లైటింగ్ ఎడ్జస్ట్మెంట్ తోనే సరిపోయింది. ఆ పాట షూటింగ్ చూడకుండానే బయటకు వచ్చేసాము.

ఎడిటర్ దేవేంద్రనాధ్ తండ్రిగారు వాహినీలో పనిచేసేవారు. ఈ దేవేంద్రకు ఆ రోజుల్లో కొంచెం అక్కినేని నాగేశ్వరరావు పోలికలుండేవి. ఆకారణం చేతనేమో ఈయన 'పెళ్ళి చేసి చూడు' సినీమాలో రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద ఎన్టీఆర్, జి.వరలక్ష్మిల ముందునుండి నల్లకళ్ళద్దాలతో స్టైల్ గా నడిచెళుతూ కనిపిస్తారు. దేవేంద్ర తర్వాత చాలా సినీమాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఎడిటర్ హరినారాయణ కూడా ఎడిటర్ గా తరువాత కొన్ని సినీమా లకు డైరక్టర్ గా పనిచేశారు. అలాటివాటిలో ఒకటి రెండు సినిమాలకు మాస్టారు సంగీతం కూడా నిర్వహించేవారు. పామర్తిగారు, హరి, దేవేంద్ర, సుబ్బు, జెవి రాఘవులు వీరంతా మాస్టారింట్లో సొంత మనుషుల్లాగే ఏ అరమరికలు లేకుండా మసిలేవారు. వీరందరి కుటుంబాలతో సావిత్రమ్మగారికి మంచి స్నేహసంబంధాలుండేవి. ఒకరిళ్ళకు ఒకరు వచ్చిపోతూండేవారు.  

సినీ పరిశ్రమ అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్. సాంకేతికంగా  అంత అభివృద్ధి చెందని ఆరోజుల్లో సాంకేతిక నిపుణుల జీవితాలు చాలా దుర్భరంగా వుండేవి. చిత్రనిర్మాణం త్వరగా ముగించాలనే తపనలో రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని కష్టపడేవాళ్ళు. సమయానికి సరైన ఆహారం వుండేదికాదు. వాటి ప్రభావం వారి ఆరోగ్యాలమీద పడేది. సినీమాలలో పనిచేసేవాళ్ళలో అధిక సంఖ్యాకులు డైబిటీస్, బి.పి, హార్ట్ కంప్లైంట్, విజన్ ప్రోబ్లమ్స్ కు గురి అయేవారు. అందుకు, సక్రమమైన ఆహారవిహారాలు, పనిచేసే చోట సరైన వసతులు లభించక అనారోగ్యాలకు గురైయ్యేవారు. సుబ్బు , దేవేంద్ర కూడా కొంత వయసు మీరాక తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని విన్నాను. 

ఘంటసాలవారిది నిండుమనసు. బంధు, స్నేహప్రీతి మెండు. తన ఆశ్రితులందరికీ ఏదో విధంగా ప్రోత్సాహం , సహాయం చేయాలని ఆశించేవారు. మాస్టారు తీసిన మూడు సినీమాలలోనూ నటులు కాని తన సన్నిహితులచేత ఏవో వేషాలు వేయించి వారికి ఆనందం కలిగించి తానూ ఆనందపడేవారు. 

మొదటిచిత్రం 'పరోపకారం' లో గాయకుడు బి.గోపాలంగారి చేత, నృత్య కళాకారుడు వెంపటి చిన సత్యంగారి చేత వేషాలు వేయించి వారికి తాను పాటలు పాడారు.

రెండవ సినీమా 'సొంతవూరు' లో రాజసులోచన కు హీరోయిన్ హోదా కల్పించారు. ఆ సినీమా లో మా నాన్నగారు( పి.సంగీతరావు) కూడా సి.ఎస్.ఆర్ తో ఒక సన్నివేశంలో కనిపిస్తారు. ఏవో రెండు మూడు డైలాగ్స్ వున్నాయి. 

ఈ మూడవ సినీమా భక్త రఘునాథ్ లో కూడా ఒక నృత్య సన్నివేశంలో వీణవాయిస్తూ మా నాన్నగారు కనిపిస్తారు. "జయమురళీలోలా గోపాలా" అనే జావళీని మాస్టారు అద్భుతంగా స్వరపర్చగా ఏపి కోమల పాడారు.

 తెరమీద నర్తకిగా మణి అనే కొత్త అమ్మాయికి అవకాశం కల్పించారు. మణి, స్వర్ణ ఇద్దరూ అక్కచెల్లెళ్ళు. చక్కటి నృత్యకళాకారులు. భక్త రఘునాధ్ లో పాటకి నాట్యం చేసినది మణే. నాకు బాగా గుర్తు. కానీ పాటలపుస్తకంలో మణి పేరుకు బదులుగా స్వర్ణ అని ఎక్కడో చూశాను. వీరిద్దరూ తరువాత ఎన్టీఆర్ నిర్మించిన 'శ్రీ సీతారామ కల్యాణం'లో సీత, శూర్ఫణకలుగా అవకాశాలు పొంది గుర్తింపబడ్డారు. అందులోని మణియే తర్వాత తర్వాత గీతాంజలిగా  బహుభాషా చిత్రనటిగా పేరుపొందారు. పాపం! ఆమె నటించిన మాస్టారి "భక్త రఘునాధ్" ఆవిడకు గుర్తులేదు. ఎన్టీఆర్ సినీమా ద్వారానే చిత్రసీమకు వచ్చినట్లు చెప్పుకునేవారు. పరాజయం పొందిన సినీమాలో నటించానని చెప్పుకోవడం ఒక నామోషి కూడా కావచ్చు. అలాగే భక్త రఘునాథ్ లో నటించిన మరొక కొత్త నటి కమలకుమారి. పేకేటి శివరాం పరిచయం చేశారు. ఆ నటీమణే జయంతిగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఆవిడా అంతే. 

ఘంటసాల మాస్టారు తమ గురువు (పట్రాయని సీతారామశాస్త్రి)గారిని గౌరవించే రీతిలో "భక్త రఘునాథ్"లో గురువుగారు చదివే  చాటుపద్యం "మరచుట లేదు నీ స్మరణ" ను తాను పాడారు. ఈ పద్యాన్ని రఘునాథ్ పాత్రధారి కాంతారావు మీద చిత్రీకరించారు. ఈ పద్యం కాగానే "భవ తాపాలు బాపే నీ పాదయుగళి" పాట ప్రారంభమవుతుంది.



ఈ చాటుపద్య కవి ఎవరో తెలియదు. కానీ మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు ఈ పద్యాన్ని విధిగా తమ కచేరీలలో పాడేవారని విన్నాను. ఆ విధంగా తమ గురువుగారు పాడుతూండగా విని ఘంటసాల మాస్టారు నేర్చుకున్నారు. గురువుగారు తన శిష్యులెవరికీ తన స్వీయ కీర్తనలు నేర్పించి ప్రచారం పొందే ప్రయత్నం చేయలేదు. ఆ శిష్యులంతా గురువుగారి కచేరీలు విని గ్రహించినవి కొన్ని కృతులు మాత్రమే.


గురువుగారు తరచు పాడే చాటువు 
"మరచుటలేదు నీ స్మరణ..." సంగీతరావుగారి గాత్రంలో వినండి
 
ఘంటసాలవారి భక్త రఘునాథ్ మద్రాస్ శివార్లలోని తిరుప్పొరూర్ మురుగన్ ఆలయ పరిసర వీధులలో చిత్రీకరించారు. అక్కడి ఆలయంలో పెళ్ళిచేసుకున్న నవ దంపతులతో ఒక పెళ్ళి బృందం ఊరేగింపుగా వస్తూండగా మదమెక్కిన ఒక ఏనుగును పాటపాడుతూ భక్త రఘునాథ్  ఆపు చేసే దృశ్యం చిత్రీకరణ జరిగింది. ఆ షూటింగ్ రెండు మూడురోజులు సాగింది. ఔట్ డోర్ అవడం మూలాన, నేను చిన్నవాడిని కావడం వలన, వెళ్ళాలని కోరిక కలిగినా అది సాగదని తెలిసి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆ నవ దంపతులలో  కొత్త పెళ్ళికొడుకుగా రెడ్డి (పూర్తిపేరు గుర్తులేదు) వేషం కట్టాడు. 

(రెడ్డి తర్వాత కాలంలో నటి వాసంతి కి కారు డ్రైవర్ గా పనిచేశాడు. మాస్టారి కారు డ్రైవర్ గోవిందు ఎప్పుడైనా శెలవుపెడితే ఆపద్ధర్మ డ్రైవర్ గా ఈ రెడ్డి వచ్చేవాడు. ఎర్రగా పొడుగ్గా నొక్కులజుత్తుతో ఉండేవాడు. సినీమా నటుడు కావాలని వచ్చాడనుకుంటాను. చివరికి నటిమణి డ్రైవర్ గా సరిపుచ్చుకోవలసి వచ్చింది. వాసంతి లా కాలేజీలో చదువుతూ సినిమా నటిగా అవకాశాలు రావడంతో లా చదువు మధ్యంతరంగా ఆపేసినట్లు తమిళ పత్రికలలో చదివాను. ఆ వాసంతి, బి.ఏ., మంచి మనసులు చిత్రంలో నటించిన సంగతి మీకు తెలిసినదే. ఆవిడ కొన్నాళ్ళు ఉస్మాన్ రోడ్ లోనే మా ఇంటికి, పానగల్ పార్క్ కు మధ్య నాదముని స్ట్రీట్, గోవింద్ స్ట్రీట్ లమధ్య వుండే మూడు నాలుగు పెంకుటిళ్ళలో ఒక ఇంటిలో నివాసముండేది.  ఒక సినీమానటి అలాటి సామాన్యమైన ఇంటిలో అద్దెకుండడమా? అని నాకు ఆశ్చర్యంగా వుండేది. అయితే ఆకాలంలో ఆపాటి నటీమణులకు యిచ్చే పారితోషికం అంతేమరి. వారికొచ్చే ఆదాయంతో అలాటి చిన్న ఇళ్ళలోనే గడపవలసి వచ్చేది. అనేక సినీమాలలో నటించాక ఒక డి.ఎమ్.కె లీడర్ ను వివాహం చేసుకొని సినీమాలకు గుడ్ బై చెప్పేసింది).

సరే. మళ్ళీ మన షూటింగ్ గజేంద్రుడిని చూద్దాము.

సినీమా లో ఈ సీన్ లో ఒక పెళ్ళి బృందంమీద ఒక మదమెక్కిన ఏనుగు భీభత్సం సృష్టిస్తే భక్తుడైన రఘునాథ్ వచ్చి వారిని రక్షించాలి. అక్కడ ఒక పాట ఉంది. "ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా" మాస్టారు చాలా ఉద్వేగభరితంగా, భక్తి ప్రపత్తులు ఉట్టిపడేలా పైస్థాయిలో సాగేపాట. 

ఇటువంటి సిట్యుయేషనల్ సాంగ్స్ ను డైరక్టర్ చెప్పే సన్నివేశాన్ని తన మనసులో ఊహించుకుంటూ సంగీతదర్శకుడు హెవీ ఆర్కెష్ట్రాను ఉపయోగించి ఒక అద్భుతమైన వరసను సమకూరుస్తారు. అంతకు పదిరెట్లు భావావేశంతో ఘంటసాల మాస్టారు వంటి గాయకులు గానంచేసి ఆ పాటను సజీవం చేస్తారు. అయితే అంత అద్భుతంగా రూపొందిన పాట సీనీమాలో మరింత ఆకర్షణీయంగా జనామోదం పొందాలంటే సన్నివేశ చిత్రీకరణ బాగుండాలి. అందుకు దర్శకుడి ప్రతిభ, నటీనటుల నటనావైదుష్యం, సాంకేతికవర్గం నైపుణ్యం, పరిసరాలు, వాతావరణం అన్నీ సహకరించాలి. 

షూటింగ్ ముగించుకొని రాత్రి ఎప్పుడో ఇళ్ళకు చేరి ఆ పాట షూటింగ్ లో జరిగిన ఫార్స్ ను  రామచంద్రరావు, సుబ్బు, తాతగారు (సదాశివుడు), హరి పగలబడి నవ్వుతూ ఇంట్లో వివరిస్తూంటే నాకు ఏదోలా అనిపించేది. ఇంతకూ విషయమేమిటంటే, ఘంటసాల మాస్టారి గాన ప్రతిభకు తగ్గట్టుగా, సముద్రాల వారి ఊహాపోహలకు తగినట్లుగా, ఛాయాగ్రహకుల నైపుణ్యాన్ని తలదన్నేలా ఉండవలసిన ఏనుగు ఆ సన్నివేశంలో ఏమాత్రమూ సహకరించలేదట. "ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా" అని మాస్టారి గొంతు హైపిచ్ లో వినిపిస్తూంటే, మరో పక్కనుండి పాటకు లిప్ మూమెంట్స్ ఇస్తూ  హిరో  కాంతారావు శరవేగంగా వస్తూంటే భీభత్సాన్ని సృష్టించి, ఔట్ డోర్లో ఒక కలకలం సృష్టించవలసిన గజరాజు మాత్రం ఒక్క ఇంచ్ కూడా ముందుకు అడుగెయ్యలేదట. ఉన్నచోటనే కదలకుండా పెట్టిన ఆహారం తాపీగా నములుతూ పాట వింటోందట. పక్కనున్న మావటివాడు అంకుశంతో ఎంత పొడిచినా ఆ ఏనుగులో చలనమేలేదట. అలాటి ఏనుగును ఎక్కడనుండి పట్టుకొచ్చారని దర్శక నిర్మాతలు విసుగుచెందారట. అయితే ఆ ఏనుగు సీజన్డ్ ఆర్టిస్టేనని అప్పటికే అనేక సినీమాలలో నటించిందని ప్రొడక్షన్ మేనేజర్ సుబ్బు వివరణ. ఏమైతేనేం ఒక రోజు ఎగిరిపోయింది. ఔట్ డోర్ లో ఎండాపోయింది. హీరో గారి ఒకరోజు కాల్షీట్ వేస్టయింది. ఆ మర్నాడు అదే తంతు. చివరికి హీరో షాట్లు, పెళ్ళిబృందం షాట్లు ముగించారట. ఏనుగు షాట్లు తర్వాత తీసారట. అప్పుడు కూడా ఆ ఏనుగు దయతల్చలేదు. సినీమాలో ఏనుగు నడిచి వస్తూంటే పక్కనే కనీకనిపించకుండా ఆ మావటివాడు కనిపిస్తాడు. ఘంటసాలవారు, డైరెక్టర్ సముద్రాల వారు ఆశించనట్లుగా పాట రూపొందలేదు. ఏనుగు అందరిని నిరాశపర్చి తట్టెడు పేడను మాత్రం మిగిల్చిందని షూటింగ్ కు వెళ్ళిన మావాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేసుకుంటూ నవ్వుకున్నారు, అంతకుమించి చేయగలిగింది ఇంకేమీలేక. తర్వాత, ఎడిటింగ్ టేబిల్ దగ్గర ఆ సీన్ ను ఏదో మేనేజ్ చేశారు.

సినీమాలలో సన్నివేశ చిత్రీకరణలు ఇలాగేవుంటాయి. చెప్పేదొకటి,  అనుకునేదొకటి, అయేది మరొకటి.  చివరకు నిర్మాతే బోల్తా కొడతాడు.

ఘంటసాల మాస్టారి భక్త రఘునాథ్ లో కనిపించే మరో ఆత్మీయ వ్యక్తి 'తమ్ముడు' కృష్ణ, మా అందరికీ 'గుండు'మామయ్య. మాస్టారింటి చీఫ్ ఛెఫ్. (నిజమనుకునేరు! కాదండోయ్!)

ఆ వివరాలతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాము.

         ...సశేషం.

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.