visitors

Sunday, September 12, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఎనిమిదవ భాగం

12.09.2021 - ఆదివారం భాగం - 48*:
అధ్యాయం 2  భాగం 47 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాల మాస్టారు తెలుగు సినీమా సంగీతానికి, లలిత సంగీతానికి చేసిన సేవలు అసమాన్యం, గాయకులకు మార్గదర్శకం. తాను నేర్చుకున్నది శుధ్ధ కర్నాటకమే అయినా లలిత సంగీతాభివృధ్ధికి, ఆ లలితసంగీతం సామాన్య శ్రోతల హృదయాలలోనికి చొచ్చుకుపోవడం కోసం కొన్ని కర్నాటక సంగీత రాగాలలో అన్యస్వర ప్రయోగం చేసి ఆయా పాటలకు జీవాన్ని, రసానుభూతిని ఘంటసాల కల్పించారు. ఆ రకమైన పాటలు బహుళజనాదరణ పొందాయి. ఈ రకమైన మార్పులు ఛాందసవాదులైన సంగీత విద్వాంసుల కనుబొమ్మల ఎగురవేతకు, కన్నెర్రకు కూడా గురి అయినాయి. కానీ, ఘంటసాల అలాటివారిని పట్టించుకోలేదు. తను సరియని నమ్మిన మార్గాన్నే అనుసరించారు. తాను రాగాలలో చేసిన మార్పులు తెలియకనో, పొరపాటునో చేసినవికావు. తిరిగి అదే రాగం మరో దగ్గర ఉపయోగించవలసివచ్చినప్పుడు కూడా అదే అన్యస్వర ప్రయోగాన్ని అదే రీతిలో ఉపయోగించేవారు.
 
తర్వాతి కాలంలో వచ్చిన 'శంకరాభరణం' సినీమాలోని 'సామజవరగమన' పాట సన్నివేశానికి (హిందోళ రాగంలో  అన్యస్వరం రిషభం ఉపయోగించడం) వెనుక ఘంటసాలవారి అన్యస్వర సంగీత ప్రభావం, స్ఫూర్తి వుందేమోనని నాకనిపిస్తుంది.

ఘంటసాలవారికి రోజూ అధిక సంఖ్యలో అభిమానుల దగ్గరనుండి ఉత్తరాలు వచ్చేవి. అవన్నీ ఆయన పాడిన పాటలను మెచ్చుకుంటూ పొగుడుతూ వ్రాసినవే. కొంతమంది నిష్కర్షగా విమర్శిస్తూ వ్రాసినవారూ వుండేవారు. కానీ ఘంటసాలవారు పొగడ్తలకు పొంగిపోనూలేదు. విమర్శలకు కుంగిపోనూలేదు. రెంటినీ సమానంగానే స్వీకరించేవారు.

1968 లో వచ్చిన ఒక ఉత్తరం నాకు కోపాన్ని, ఆవేశాన్ని కలిగించింది. ఆ ఉత్తరాన్ని అక్కడకక్కడే చింపిపారేయాలాన్నంత కోపం కలిగించింది. నిగ్రహం లేకపోవడమంటే అదే. ఆ ఉత్తరాన్ని చదివిన ఘంటసాల మాస్టారు, పనుల ఒత్తిడి మూలంగా వెంటనే సమాధానం రాయలేక ఆ ఉత్తరానికి సమాధానాన్ని మా నాన్నగారిని వ్రాసిపెట్టమన్నారు. మా నాన్నగారు చెప్పిన సమాధానం నేనే ఒక పోస్ట్ కార్డ్ మీద వ్రాసి మాస్టారికి చూపించాను. అది చూసి ఆయన చాలా తృప్తిగా బాగుందని చెప్పి ఆ కార్డ్ మీద సంతకం చేసారు. ఆ ఉత్తరం పోస్ట్ చేయడమూ జరిగింది.  ఇంతకూ ఘంటసాల మాస్టారిని విమర్శిస్తూ వ్రాసినవారు మరెవరో కాదు. 'సరాగమాల' శీర్షిక నిర్వాహకుడు, ప్రముఖ చిత్రసంగీత సమీక్షకుడు శ్రీ విఎకె రంగారావు గారే. ఆ కథ అక్కడితో ఆగిపోలేదు.

1971 లో ఘంటసాల మాస్టారు తన వాద్యబృందంతో ఒక నెల రోజుల విదేశీ పర్యటన చేసి వచ్చిన సందర్భంలో మాస్టారి గౌరవార్ధం శ్రీ విఎకె రంగారావు 'ఘంటసాల భువనవిజయం' అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో శ్రీ రంగారావు గారు వ్రాసిన 'నేనెరిగిన ఘంటసాల' వ్యాసం ఆఖరి పేరాలో యిలా వుంది. 

"రెండేళ్ళక్రితం ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ఒక చిత్రం విడుదలైనది. మద్రాసులో చూడడానికి వీలుపడక ఘంటసాల చేసిన పాటలు ఎనిమిది వున్నాయని ఆశపడి పనిగట్టుకొని తిరుపతి వెళ్ళి చూశాను. ఘంటసాల సంగీతంలో ఎప్పుడూ అంతర్లీనంగా ప్రవహించే మార్దవం ఆ చిత్ర సంగీతంలో పూర్తిగా మృగ్యం. వెంటనే అక్కడినుండే ఘంటసాలగారికి ఒక కార్డ్ వ్రాసి పడేసాను. "అయ్యా! ఫలానా చిత్రంలో తమ సంగీతం ఒక్క పాట దక్క దుర్భరము అని. దానికి పర్యవసానం ఏమిటి జరిగిందనుకున్నారు? 

"నన్నేం చేయమంటారు నిర్మాతలలా చేయించుకున్నారని యెదురు పడినప్పుడు కుంటిసాకులు చెప్పలేదు. మీరన్నది నిజమేనని అతి వినయం చూపలేదు, మనసులో వీడికేం తెలుసు అనుకుంటూ. నేను మద్రాసుకి తిరిగి వచ్చిన మూడవనాటికి యీ విధంగా కార్డ్ వచ్చింది.

"రంగారావుగారు! సినీమా సంగీతం పట్ల మీ అభిప్రాయం స్వీకారయోగ్యము, సృజనాత్మకము, ఎంతైనా సమంజసము. అభినందనలతో - ఘంటసాల".

ఘంటసాల  వినయానికి అంతకంటే వేరే నిదర్శనం కావాలా ! "
                  
ఈ సంఘటన ఘంటసాలవారి విచక్షణకు, పరిణితికి ఒక దర్పణం. 

🌺


ఎక్కిరాల వేదవ్యాస్ గారు ఒక IAS ఆఫీసర్. డా.డి.ఎన్.రావుగారు ఢిల్లీలో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో పనిచేసేప్పుడు  వేదవ్యాస్ ఆయన స్టూడెంట్ అని చెప్పగా విన్నాను. ఆయన మద్రాసులో వుండిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు లైజన్ ఆఫీసర్ గా వచ్చారు. డి.ఎన్.రావుగారు నన్ను వెళ్ళి ఆయనను కలవమని చెప్పారు. అప్పట్లో ఆ ఆఫీస్ మైలాపూర్ కపాలేశ్వరాలయం తూర్పు వేపు వీధుల్లో ఒక మేడమీద వుండేది. ఒక మంచి ముహుర్తాన ఆ ఆఫీసులో అడుగుపెట్టాను. నా గురించి అంతకుముందే డా.రావుగారి ద్వారా వినడం వలన పెద్దగా ప్రశ్నలేం వేయకుండా ఒక టెంపరరీ టైపిస్ట్ పోస్ట్ లో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఆ ఆఫీసులో పనిచేసే నలుగురూ  తెలుగువాళ్ళే. అందరూ ఆనాటి ఆంధ్రప్రదేశ్ నుండి ట్రాన్స్ఫరై వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగులే. విదేశాల నుండి మద్రాస్ పోర్ట్ కు షిప్ లలో వచ్చే ఫెర్టిలైజర్స్ ను ఈ ఆఫీస్ ద్వారా  ఆనాటి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలోని ఆథరైజ్డ్  డీలర్లకు లారీలలోనో లేక గూడ్స్ వ్యాగన్స్ లోనో సరఫరా అయేవి. మెడ్రాస్ పోర్ట్ కు  ఫెర్టిలైజర్స్ షిప్ వస్తున్నదనే వార్త తెలిసినప్పటినుండి ఈ లయొజన్ ఆఫీస్ లో ఒకటే హడావుడి, పని ఒత్తిడి అధికమయేది. ఆంధ్రానుండి అన్ని జిల్లాల్లోని డీలర్స్ తమకు కావలసిన యూరియా, అమోనియంసల్ఫేట్, నైట్రేట్   వంటి ఎరువులకోసం టన్నుల లెఖ్ఖన తమ ఇండెట్లను  తీసుకు వచ్చేవారు. వచ్చే సరుకును బట్టి అందులో ఆంధ్రా కోటా ఎంత వస్తుందో చూసి ఈ డీలర్లకు ఆ ఎరువులు పంపిణీ జరిగేది. ఒక్కొక్క డీలర్ కు ఈ ఆఫీసు ద్వారా రిలీజింగ్ ఆర్డర్స్ ఇచ్చేవారు.  డీలర్లు వాటిని పట్టుకొని మెడ్రాస్ హార్బర్ లో తమకు రావలసిన ఎరువులను రిలీజ్ చేసుకొని తమ తమ ఊళ్ళకు లారీలలోనో , లేక రైలు వాగన్స్ లోనో పంపుకునేవారు.  నెలలో ఒక వారం, పది రోజులు ఈ హడావుడి సాగేది. ఇదంతా సక్రమంగా, క్రమశిక్షణతో ఎటువంటి అవకతవకలు జరగకుండా లయొజన్ ఆఫీసర్ గారి పర్యవేక్షణలో జరిగేది. అటువంటి ఆఫీసులో నా కొత్త ఉద్యోగం. అక్కడ నేను కాక పనిచేసే మరో ముగ్గురిలో ఇద్దరి పేర్లే గుర్తున్నాయి. ఒకతని పేరు అబ్దుల్ సలామ్. నెల్లూరు ప్రాంతంవాడు. మెడ్రాస్ లో ముస్లింలు ఎక్కువగా వుండే ట్రిప్లికేన్ లో వుండేవాడు. మరొకాయన మంథా గోపాలకృష్ణ. వారిది విశాఖపట్నం.  మా టి. నగర్ నుండే వచ్చేవాడు. ఈ సలామ్, పేరు గుర్తు లేని మరొక క్లర్క్ వీళ్ళిద్దరితోనే ఆఫీస్ వ్యవహారమంతా నడిచేది. పేరుకు టైపిస్ట్ ఉన్నా చాలా భాగం  ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కువ చేతితోనే వ్రాసేవారు. ఒక్క ఆఫీసర్ గారు డిక్టేట్ చేసే లెటర్స్ మాత్రమే టైపింగ్ కు వచ్చేవి.  షిప్ లు వచ్చే సమయంలో తప్ప ఆఫీసులో నాకు పెద్దగా పనేమీ వుండేదికాదు. మా జీతాలన్నీ కూడా హైదరాబాద్ లోని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండే వచ్చేవి. ఆ డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు బట్వాడా అయేది. ఆ వ్యవహారమంతా సలామ్ అనే ఆయనే చూసేవాడు. మనిషి సన్నగా షెరాయి,చొక్కాలో చాలా సామాన్యంగా వుండేవాడు. నేను లయొజన్ ఆఫీసర్ గారి మూలంగా వచ్చినందున నాతో ఫ్రీగా మాట్లాడడానికి , ఏదైనా పని చెప్పడానికి సంకోచించేవారు. నాకు ఈ వాతావరణం కొత్తగా అనిపించింది. 
మా ఆఫీసర్ వేదవ్యాస్ గారు బయట వ్యవహారాలు చక్కబెట్టడంలోనే ఎక్కువగా నిమగ్నమైవుండేవారు. ఆఫీసులో వుండే సమయం తక్కువ. వారి దర్శనం కోసం ఆంధ్రా నుండి వచ్చే డీలర్లతో నిండివుండేది. వాళ్ళంతా ఎప్పుడు ఆఫీస్ స్టాఫ్ తో ఏదో గొడవపడుతూండేవారు. కారణం ఏమీ లేదు. వాళ్ళు అడిగినంత పెద్ద మొత్తంలో ఎరువులు దొరికేవి కావు. సప్లై, డిమాండ్ ప్రొబ్లం. ఆ విషయాలన్నీ లయొజన్ ఆఫీసర్ తప్ప మరెవరూ పరిష్కారం చేయలేరన్న విషయం అందరికీ తెలుసు. 

ఇలాటి షిప్మెంట్ జరుగుతున్న రోజుల్లోనే ఒక రోజు మా ఆఫీసుకు అల్లు రామలింగయ్య, వారి పెద్దబ్బాయి మా ఆఫీసుకు కొంచెం వేడిగానే వచ్చారు. ఈయనకు ఈ ఆఫీసులో ఏం పని అని అనుకుంటున్న సమయంలో అక్కడున్న సలామ్ ఆయనతో రెండు మూడు రోజుల్లో సరుకు వచ్చేస్తుంది. అందులో మీ ఇండెంట్ వుంది. ఈ వారంలో మీ పనయిపోతుందని సర్ది చెప్పడంతో కొంచెం చల్లబడ్డారు. తర్వాత తెలిసింది, అల్లు రామలింగయ్యగారికి పాలకొల్లులో ఫెర్టిలైజర్స్ డీలర్షిప్ వుందని ఆ సంబంధంగా ఆయన ఈ ఆఫీసుకు వస్తూంటారని. ఆయన ఎప్పుడు వచ్చినా వేదవ్యాస్ గారిని చూసే అవకాశం దొరికేదికాదు. అందుకు ఆయన కొంత చిరాకు చిత్తగించేవాడు. తర్వాత ఎప్పుడో ఆఫీసర్ గారు వచ్చి ఆ రోజు జరిగిన విషయాలన్నీ అడిగి తెలుసుకొని హైదరాబాద్ లోని ఎగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో సంప్రదింపులు, చర్చలు, రగడలు ఇత్యాదులన్నీ రొటీన్ గా సాగిపోతూండేవి. వేదవ్యాస్ గారు ఆఫీసులో ఉన్న సమయంలో వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా మారిపోయేది. అందరూ నిశబ్దంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. 

లంచ్ టైమ్ లో గోపాలకృష్ణ గారు ఆఫీసర్ గారి రూములో విధిగా ఓ రెండు గంటలు గడిపేవాడు. ఒకరోజు ఏదో పనుండి నేను లోపలికి వెళ్ళిచూస్తే వేదవ్యాస్ గారు,  గోపాలకృష్ణ జ్యోతిషం గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. టేబిల్ మీద పెద్ద పెద్ద పుస్తకాలు వున్నాయి. తర్వాత తెలిసింది వేదవ్యాస్, IAS గారు జ్యోతిష్య శాస్త్రంలో ఆరితేరిన పండితులని. ఈ గోపాలకృష్ణ గారికి కూడా జ్యోతిషం, హస్త సాముద్రికంలో మంచి ప్రవేశం వుందని. గోపాలకృష్ణ గారు స్టెనోగ్రాఫర్. అయితే ఆయన పనిచేయగా నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరూ ఆయనకు ఏ పని చెప్పేవారు కాదు. కారణం ఆయన ఆఫీసర్ గారి క్యాంప్ స్టెనోగ్రాఫరట. ఆఫీసర్ గారు బయటవూళ్ళు క్యాంప్ లకు వెళ్ళేప్పుడు మాత్రమే ఈయన ఆయనతో కూడా వెళ్ళి అక్కడి పనులు చక్కబెడతాడని చెప్పగా తెలిసింది. ఊళ్ళో వుంటే ఆయనకు పనేమీ వుండేదికాదు.  ఆఫీసుకు వచ్చే డీలర్లతో ఏవో కబుర్లు చెపుతూ, సలహాలు ఇస్తూ కాలక్షేపం చేసేవాడు. అందరిలాగే టంచన్ గా పది పదిన్నరకు ఆఫీసు కు వచ్చి తన సీట్ లో కూర్చొని తనతో కూడా తెచ్చుకున్న జ్యోతిషం పుస్తకాలను,  హోమియోపతి పుస్తకాలను చాలా సీరియస్ గా చదువుతూ కూర్చునేవాడు. టంచన్ గా లంచ్ టైమ్ లో లజ్ కార్నర్ వరకు వెళ్ళి హోటల్ లో భోజనంచేసి హాయిగా వచ్చేవాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ గ్రంధపఠనం సాగించేవాడు. ఐదు గంటలు దాటితే చాలు. పుస్తకాలు లోపల పెట్టేసి చక్కా ఇంటికి వెళ్ళిపోయేవాడు. దీనంతటినీ అక్కడివారు చాలా సహజంగానే తీసుకునేవారు. నాకు మాత్రం ఇబ్బందికరంగా వుండేది ఏ పని లేకుండా గంటలతరబడి ఒకే చోట కూర్చోవడానికి. ఆ డిపార్ట్మెంట్ లో అతనికి తగినంత పని లేదని వేరో ఊరికి ట్రాన్సఫర్ చేస్తూ ఆర్డర్లు వచ్చినా వెళ్ళి జాయిన్ అయేవాడు కాదు. ఆయన మద్రాస్ కు బాగా అలవాటు పడిపోయాడు. 

నేను అక్కడ పనిచేసిన రెండున్నర ఏళ్ళూ గోపాలకృష్ణ కూడా అదే ఆఫీస్ లో పనిచేసేవాడు. మనిషి  భుజాల వరకు దిగిన గిరజాల జుత్తుతో పాంట్, పైన ఖధ్ధర్ జుబ్బా, మెడలో ఒక సంచీ నిండా పుస్తకాలతో కనిపించేవాడు. ఎప్పుడో మాటల సందర్భంలో చెప్పాడు తన హెయిర్ కటింగ్ కు ఫోర్ షోర్ ఎస్టేట్ లో వున్న ఓషియానిక్ హోటల్ లోని సెలూన్ కే వెడతానని. నాకు ఆశ్చర్యం వేసింది. ఇతని జీతం అంత కాస్ట్లీ హోటల్ కు వెళ్ళడానికి సరిపోతుందా అని. ఆ రోజుల్లో ఓషియానిక్ కు రిచ్ పీపుల్ హోటల్ గా పేరు.

ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు గోపాలకృష్ణ చెట్టుక్రింద డాక్టర్ గా ప్రజాసేవ చేస్తూ కనపడ్డారు.  గవర్నమెంట్ వారి ట్రాన్సఫర్స్  బెడద పడలేక ఆ జాబ్ కు రాజీనామా చేసేసారట. పానగల్ పార్క్ దగ్గర ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ వుండే చోట వెంపటి చిన సత్యంగారి కూచిపూడి ఆర్ట్ అకాడమీ, ఆ పక్కన కార్పరేషన్ స్కూలో, ఆఫీసో వుండేది. దాని పక్కన వెంకటేశ్వరా కళ్యాణ మండపం.  ఈ గోపాలకృష్ణగారు కూచిపూడి ఆర్ట్ అకాడమీలోనే ఒక చిన్న గదిలో వుంటూ బయట ఒక చెట్టుక్రింద తన హోమియో వైద్యం చేసేవాడు. జ్యోతిషాలు చూసేవాడు. కూచిపూడి ఆర్ట్ అకాడమీ టి.నగర్ నుండి రాజా అణ్ణామలైపురంలోని గ్రీన్ వేస్ రోడ్ కు వెళ్ళిపోయాక నేను పానగల్ పార్క్ వేపు వెళ్ళడం తగ్గిపోయింది.కొన్నేళ్ళ తర్వాత గోపాలకృష్ణ ఆ చెట్టు క్రింద కనపడలేదు. ఏమయ్యారో తెలియదు.

కొంతమంది వ్యక్తుల గొప్పతనం, ఔన్నత్యం వారితో పనిచేసేటప్పుడు కానీ, వారి సాంగత్యంలో వున్నప్పుడు కానీ తెలియవు. ఎందుకంటే అలాటివారు తమ గురించి తాము డబ్బా వాయించుకోరు నేనింత సేవచేసానని, తానెంతో గొప్పవాడినని. అలాటి వ్యక్తే శ్రీ వేదవ్యాస్. నేను ఆయన ఆఫీసులో పనిచేసినా ఆయనతో మాట్లాడింది తక్కువే. ఒకసారి మాత్రం తనతోపాటూ కార్లో తీసుకువెళ్ళారు. అయితే అది ఆఫీసు పనిమీద కాదు. తన మిత్రులను కలుసుకోవడం కోసం. తీరా ఆ వెళ్ళిన స్థలం చూస్తే నాకు బాగా పరిచయమున్న స్థలమే. నెం.1, కచేరీ రోడ్. శాంథోమ్ హైరోడ్. చందూర్ దంపతుల ఇల్లు. ఆ ఇద్దరూ నాకు చిరపరిచితులే. ఆ రోజు అక్కడ చాలా విషయాలమీద ఆ ముగ్గురి మధ్య చర్చలు సాగాయి. నేను కేవలం శ్రోతను మాత్రమే. ఒక ఏడాది లోపలే వేదవ్యాస్ గారిని మద్రాస్ లయొజన్ ఆఫీసు నుండి వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసేసారు. వేదవ్యాస్ గారి విశిష్టత గురించి  మానాన్నగారి ద్వారా, తర్వాత పత్రికలలోని వ్యాసాల ద్వారానే నాకు అర్ధమయింది. వేదవ్యాస్ గారు కేవలం IAS అధికారిగానే కాక భారతీయ సంస్కృతి పరిరక్షణకు కూడా ఎంతో సేవచేసారు. ఆధ్యాత్మిక గురువుగా, యోగ, జ్యోతిష్య శాస్త్ర పండితునిగా అనేక ఉత్తమ గ్రంథాలెన్నో వ్రాసారు. దేశంలోని అనేక దేవాలయాల ప్రతిష్టాపనకు, వాటి ఔన్నత్యానికీ నిరవధిక కృషిచేసిన వ్యక్తి. అలాటి విశిష్టవ్యక్తి గురించి ఏమీ తెలుసుకోకుండానే ఆయన దగ్గర పనిచేయడంలో నేను గర్వపడాలా ! నా అదృష్టంగా భావించి సంతోషపడాలా ! ఏదీ తేల్చుకోలేకపోతున్న స్థితి నాది.  వేదవ్యాస్ గారు మద్రాస్ నుండి వెళ్ళిపోయాక తిరిగి నేను మరల ఎక్కడా కలుసుకోలేదు. ఆ సత్సాంగత్యం అక్కడితో సరి. 

💐🙏💐


భాగ్యనగరంలో, ఆనాటి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని యైన హైదరాబాద్ లో 'పంచశీల సాంస్కృతిక సమితి' అనే సంస్థ వుండేది. ఆ సంస్థయొక్క అద్యక్షుడు శ్రీ పి.వి.రంగారావుగారు. ఆయన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి కుమారుడు. శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డిగారి కాబినెట్లో మినిస్టర్ గా కూడా పనిచేశారు. ఆ పి.వి.రంగారావుగారు కళాభిమాని. సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణలో మంచి ఆసక్తి కలవారు. ఆయన తన పంచశీల సాంస్కృతిక సమితి ద్వారా ఘంటసాల మాస్టారిని ఘనంగా సత్కరించాలని సంకల్పించారు. సన్మాన కార్యక్రమం లో భాగంగా మాస్టారి సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేసారు. ఘంటసాల మాస్టారు తన వాద్యబృందంతో ఆ ఉత్సవంలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్ళారు. వాద్యబృందం వుందంటే మా నాన్నగారు కూడా తప్పనిసరి. అందరూ సంతోషంగా తరలివెళ్ళారు.

ఆ రోజున మా ఇంట్లో మా మూడవ చెల్లెలు లలిత, ఆరేడేళ్ళది, నలతగా కనిపించింది. మా నాన్నగారు ఉన్నప్పుడే వచ్చిందో లేక ఊరెళ్ళాక వచ్చిందో గుర్తులేదు కానీ జ్వరం కూడా వచ్చింది. అది ఒక రాత్రివేళ ఎక్కువై ఆందోళన పెట్టింది. ఇంట్లో వున్న మందులు ఇచ్చి చూసారు కానీ జ్వరం తగ్గే సూచనలు కనపడలేదు. రాత్రి మూడు గంటలు దాటేసరికి  ఫిట్స్ రావడం మొదలయింది. పరిస్థితి విషమంగా వుందని వెంటనే మాస్టారింట్లో సావిత్రమ్మగారిని లేపి విషయం చెప్పాము. ఆవిడ వెంటనే నన్ను డ్రైవర్ గోవింద్ ఇంటికి వెళ్ళి పిల్చుకు రమ్మని చెప్పారు. నేను వెంటనే గోవింద్ ఇంటికి పరిగెత్తాను. మూడుగంటల వేళ .అందరూ గాఢంగా నిద్రపోయేవేళ. ఆ ఇంటి ప్రాంతమంతా చీకటిగా నిర్మానుష్యంగా వుంది. ఎలాగో గోవింద్ ను లేపి విషయం చెప్పగానే అతను కంగారుపడుతూ మొహం కడుక్కొని బట్టలు వేసుకు వచ్చాడు. అంతరాత్రి వేళ ఏ డాక్టర్ వద్దకు వెళ్ళాలో తెలియలేదు. సావిత్రమ్మగారికి  నుంగంబాక్కం లో వుండే తమ ఛైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ గోవిందమీనన్ దగ్గరకు తీసుకువెడదాం పదమన్నారు. గోవిందమీనన్ వుండేది ఒక పెద్ద భవంతి. మెయిన్ గేట్ కు లోపలి భవనానికి చాలా దూరం. గేట్ తాళంవేసి వుంది. ఎంత పిలచినా , బయట గేట్ కు వున్న కాలింగ్ బెల్ నొక్కినా ఎవరూ పలకలేదు. ఇక్కడ పరిస్థితి విషమిస్తోంది. ఇంక అక్కడ వుండడం శ్రేయస్కరం కాదని రాయపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్ళాము. వాళ్ళు  చెక్ చేసి సీరియస్ కండిషనేనని వెంటనే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రారంభించారు. లోపల ట్రీట్మెంట్ ప్రారంభమైన తర్వాత  తెల్లవారుతుండగా సావిత్రమ్మగారు ఇంటికి వెళ్ళిపోయారు. నేనూ, మా అమ్మగారు మాత్రమే హాస్పిటల్ లో వున్నాము. ఆ రోజంతా ఏవో మందులు, ఇంజక్షన్స్ ఇస్తూనే వున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మా చెల్లెలు లలిత ఈ లోకం వదిలింది.  సెరెబ్రల్ హెమరేజ్ అని హాస్పిటల్ డాక్టర్లు డిక్లేర్ చేశారు. వెంటనే హాస్పిటల్ బయట ఆవరణలో వున్న లోకల్ టెలిఫోన్ బూత్ నుండి సావిత్రమ్మగారికి ఫోను చేసి చెప్పాను. ఆవిడతో పాటు మా కుటుంబ శ్రేయోభిలాషి డి.ఎన్.రావుగారికి కూడా తెలియజేశాను.  ఆయన వెంటనే వచ్చి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి తదుపరి కార్యక్రమాలు ముగించారు. తమాషా ఏమంటే ఆ తర్వాత జరిగిన విషయాలు నా జ్ఞాపకాలలో నుండి జారిపోయాయి. ఆ పాప బాడీని ఇంటికి తీసుకువచ్చామా? లేక హాస్పిటల్ నుండే శ్మశానానికి తీసుకువెళ్ళారా అనే విషయాలేవీ నాకు గుర్తులేవు.  ఈలోగా సావిత్రమ్మగారు హైదరాబాద్ కు ఫోన్ చేసి ఘంటసాల మాస్టారితో జరిగిన విషయం చెప్పినట్లున్నారు. ఆ మర్నాటికి హైదరాబాద్ నుండి మా నాన్నగారు, మాస్టారు మద్రాస్ చేరుకున్నారు. పంచశీల సాంస్కృతిక సమితివారు ఘంటసాలవారికి బహుకరించిన నిలువెత్తు సన్మాన పత్రం, అన్ని మెమెంటోలతోపాటూ ఈనాటికీ మాస్టారి రెండవ కుమారుడు కీ.శే. రత్నకుమార్ ఇంటి మేడమీద రూమ్ లో గోడను అలంకరించివుంది. ఆ సన్మాన పత్రాన్ని చూసినప్పుడల్లా ఈ విషాద సంఘటన గుర్తుకు వస్తుంది. 

వెలుగు పక్కనే చీకటి ; 

సంతోషాన్ని అంటిపెట్టుకునే దుఃఖం.  ప్రతీ మనిషికి ఈ రెండూ దశలూ ఒకాదానివెంట మరొకటి వస్తూనే వుంటాయి. 

🔔


1968లో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన సినీమాలలోని పాటలు విన్నాము. గాయకుడిగా కూడా ఆ ఏడాది చాలా మంచి పాటలే పాడారు. వాటిలో ముఖ్యమైనవి మాత్రమే చూద్దాము.

ఉమ, చండి, గౌరీ, శంకరుల కథలో మాస్టారు, ఎస్.జానకి పాడిన తిల్లానా

'మాస్టారు పాడిన 'కలగంటినా చెలి' పాట; బ్రహ్మచారి లో సుశీలగారితో డ్యూయెట్' ఏ తోటలో విరబూసెనో'; రణభేరిలో శ్రీశ్రీ గారి ' మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది'; వీరాంజనేయలోని పద్యాలు; రాము సినీమాలోని రెండు సోలోలు ఘంటసాలవారి ఖ్యాతిని ఇనుమడింపజేసిన పాటలే. ఒకటి 'మంటలు రేపే నెల రాజా'; మరొకటి 'రారా కృష్ణయ్యా' ఈ పాటను వేర్వేరు ట్రాక్స్ లో పాడించి తర్వాత ఒకే ట్రాక్ లో మిక్స్ చేశారు. ఈ పాటలో నాగయ్యగారికి, రామారావుగారికి మాస్టారు పాడిన తీరు అనితరసాధ్యం. ఆ వైవిధ్యం మరొకరికి సాధ్యం కాదు. 


అమాయకుడు కృష్ణకు పాడిన 'మనిషైతే మనసుంటే';  సుశీలగారితో పాడిన 'చందమామ రమ్మంది చూడు'; లక్ష్మీ నివాసం లో రంగారావు గారికి పాడిన 'ధనమేరా అన్నిటికీ మూలం'; బాంధవ్యాలులో అదే రంగారావు గారికి పాడిన మరో మంచి పాట 'మంచితనానికి ఫలితం వంచనా'; బంగారు గాజులలో  డ్యూయెట్ 'విన్నవించుకోనా చిన్న కోరికా'; భాగ్యచక్రంలో  డ్యూయెట్ 'నీవులేక నిముసమైనా నిలువజాలనే'


నేనే మొనగాణ్ణిలో, 'వయసు పిలిచింది ఎందుకో'


బాగ్దాద్ గజదొంగ లో 'రావే ఓ చినదానా' వంటి పాటలు ఈనాటికీ మనకు వీనులవిందు చేసే పాటలే. అందరూ తరచూ పాడుకుంటూ ఆనందించేవే.
                                       
                                      రావే ఓ చినదానా....

మనిషిలో సాత్విక లక్షణాలు, సమాజంలో మంచితనం  బ్రతికి వున్నంతకాలం ఘంటసాల పాట వినిపిస్తూనే వుంటుంది. ఇది సత్యం.

నెం. 35, ఉస్మాన్ రోడ్ లో మరికొన్ని జ్ఞాపకాలతో...

వచ్చేవారం...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.



Sunday, September 5, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఏడవ భాగం

05.09.2021 -  ఆదివారం భాగం - 47*:
అధ్యాయం 2 భాగం 46  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిని అనేక రకాల వ్యామోహాలలో ముంచెత్తుత్తున్న సినీమా అనే మాయా ప్రపంచం పుట్టి అప్పుడే 130 సంవత్సరాలు అవుతోంది. 1891 లో మాటలు , పాటలు రాని మూకీగా పుట్టిన సినీమా ఒకరెండు దశాబ్దాల తర్వాత 1920 లో ఫ్రాన్స్ రాజధాని పారీస్ మహానగరంలో తొలిసారిగా గొంతువిప్పింది. అయితే మొట్టమొదటిగా వ్యాపార సరళిలో ప్రజల ముందుకు వచ్చిన విదేశీయ సినీమా ' జాజ్ సింగర్' 1927 లో. 

మన దేశంలో తయారైన మొదటి మూకీ రాజా హరిశ్చంద్ర. ఈ చిత్ర నిర్మాతా దర్శకుడు దాదా సాహేబ్ ఫాల్కే. ఈయన గౌరవార్ధం ఆయన పేరిట మన దేశంలోని అత్యుత్తమ కళాకారులకు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వడం జరుగుతోంది. 

1931 లో మన దేశంలో మొట్టమొదటి టాకీ 'ఆలం ఆరా' తయారయింది. అర్దేషిర్ ఇరానీ నిర్మాత దర్శకుడు.  తమిళంలోని మొదటి టాకీ 'కాళిదాసు' కూడా అదే సంవత్సరం. తెలుగులో మొట్టమొదటి చలనచిత్రం 1932 లోని 'భక్త ప్రహ్లాద'. ఈ రెండు చిత్రాలకు నిర్మాత దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి. ఈయన 1951 లో నిర్మించిన 'నిర్దోషి' కి ఘంటసాలవారు కూడా సంగీత దర్శకుడిగా పనిచేసారు. భారత దేశంలో వచ్చిన మొదటి  మూడు భాషా చిత్రాలలోనూ సుప్రసిధ్ధ దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ నటించడం ఒక విశేషం.

తెలుగు సినీమా తొలి రోజులలో ఆయా సినిమాలలో నటించే నటీనటులే తమ పాటలు, పద్యాలు పాడుకునేవారు. అంద చందాలతోపాటు పాడగల సమర్ధులతోనే మొదటి రెండు దశకాల సినీమాలు వచ్చాయి. రికార్డింగ్ సిస్టమ్ సాంకేతికంగా వృద్ధి చెందని రోజులలో వాద్యబృందాన్ని కూడా షూటింగ్ జరిగే సమయంలోనే ఒక ప్రక్కగా కూర్చోబెట్టి పాట, నటన రెండు ఒకేసారి జరిపేవారట. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక ముందుగా పాటలు రికార్డింగ్ చెయ్యడం అలవాటయింది. రికార్డింగ్ కోసం వేరే థియేటర్ లు నిర్మించడం అనివార్యమైంది. సింగిల్  ఛానల్ సౌండ్, డబుల్ ఛానల్ సౌండ్ సిస్టమ్ నుండి ఈనాడు మల్టీ ఛానల్ సిస్టమ్ లో సినీమా మాటల పాటల ధ్వని ముద్రణ జరుగుతున్నది. 

1944లో ఘంటసాలవారు చిత్రరంగ ప్రవేశం చేసేనాటికే కొంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి సినీమాలలో నేపథ్యగానం అనే ప్రక్రియ మొదలయింది. చిత్రంలో నటీనటులకు వేరే వారిచేత పాటలు పాడించే నూతన ప్రక్రియ ప్రారంభమయింది. దీనితో  సంగీతం తెలియని కొత్త కొత్త నటులకు, గాయకులకు ఈ రంగంలో అవకాశాలు దొరకడం మొదలయింది. శ్రీమతి రావు బాలసరస్వతి  తెలుగులో మొదటి నేపథ్యగాయనిగా చెపుతారు. బెజవాడ రాజరత్నం, గాలి పెంచలనరసింహారావు, మోపర్తి సుందర రామారావు (ఎమ్.ఎస్.రామారావు) ఆనాటి నేపథ్యగాయకులుగా కొన్నేళ్ళపాటు తమ గానప్రతిభను ఒక వెలుగు వెలిగారు. 

1945 లో 'స్వర్గసీమ' సినీమాతో నేపధ్యగాయకునిగా ఘంటసాల అవతరించడంతో తెలుగు సినీమా పాట యొక్క రుచి, వాసన పూర్తిగా మారిపోయాయి.  ఒక నూతన  సంగీత శకం ప్రారంభమయింది. అదే ఘంటసాల శకం. గత 75 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారంతా ఘంటసాల గానవాహినిలోనే తన్మయత్వంతో ఓలలాడుతున్నారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా  ఒక నూతన ఒరవడిని సృష్టించి ఘంటసాల పండిత, పామర హృదయాలో సుస్థిర స్థానం పొంది చెరగని ముద్రవేశారు. ఈనాటి వరకూ లలిత సంగీత గాయకులందరికీ ఆదర్శం, మార్గదర్శకం ఘంటసాల పాట, పద్యమే. ఘంటసాల గళానికి ప్రత్యమ్నాయం లేదనేది నిర్వివివాదాంశం.

ఘంటసాలవారితో పాటే చలనచిత్రసీమలో కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావుగారు రంగప్రవేశం చేసారు. ఈ ఇద్దరూ ఘంటసాల బలరామయ్యగారి ప్రతిభా ఆఫీసులో కలిసే వుండేవారు.  సీతారామ జననంలో అక్కినేని రాముడుగా నటిస్తే ఘంటసాలవారు కోరస్ గీతాలలో పాల్గొని ఏవో  చిన్న వేషాలు వేసారట. అక్కినేని వారు మొదట్లో తన పాటలు తానే పాడుకునేవారు. అలా వచ్చినవే పల్నాటి యుధ్ధంలో, బాలరాజు లో వచ్చిన పాటలు. ఎప్పుడైతే ఘంటసాల కంచుకంఠం దశదిశాలా వ్యాపించడం మొదలయిందో అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు తనకు ఒక నేపథ్యగాయకుడు అవసరమనే సత్యాన్ని గుర్తించారు. అందుకే 'బాలరాజు' సినీమాలోని 'చెలియాకనరావా' పాట అటు అక్కినేని వారి గాత్రంతో, ఇటు ఘంటసాలవారి గళంతో ప్రజలను అలరించాయి. సినీమాలో మాత్రం ఘంటసాలవారి గాత్రమే అక్కినేని వారి కంఠంలోనుండి వినిపిస్తుంది. 


ఆనాడు మొదలైన వారి స్వరసహచర్యం మూడు దశాబ్దాలపాటు నిరాటంకంగా సాగి తెలుగు ప్రేక్షకులకు మహదానందం కలిగిచింది. తర్వాత వచ్చిన ఎన్.టి.రామారావు, జగ్గయ్య, కాంతారావు, శోభన్ బాబు, కృష్ణ ఆదిగాగల 1970ల నాటి హీరోల వరకు ఘంటసాలవారి నేపథ్యగానమే విజయాలకి ఆలంబలమైంది. వారికే కాదు ఇతర ప్రధాన భూమికలు పోషించే నటగాయకులు నాగయ్య, ధూళిపాళలకు, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, మిక్కిలినేని, రాజనాల, ముక్కామలవంటి వారికి, హాస్య నటగాయకులు రేలంగి, కస్తూరి శివరావులకు, రమణారెడ్డి, పద్మనాభం, చలం వంటి హాస్యనటులకు కూడా తమ పాటలను ఘంటసాలవారి చేత పాడిస్తేనే రాణిస్తాయని ఆశించి ఆయనచేతనే పాడించమని కోరేవారు. తెలుగు సినీమాను ఘంటసాలవారి గాత్రం అంతటి ప్రభావితం చేసింది. ఘంటసాలగారు సినీమాలలోకి వచ్చాక మాధవపెద్ది, పిఠాపురం నాగేశ్వరరావు, బి.గోపాలం, ఎ.ఎమ్.రాజా, పి.బి.శ్రీనివాస్, మోహన్ రాజ్, చిత్తరంజన్, బసవేశ్వర్, టి.ఆర్.జయదేవ్ వంటి ఎంతోమంది ఉత్తమగాయకులు నేపథ్యగాయకులుగా వచ్చారు. వీరిలో కొందరు బహుభాషా చిత్రగాయకులుగా మంచి పేరుపొందారు. కానీ నేపథ్యగాయకులుగా ఈ గాయకులంతా ఘంటసాలవారిలా  గాత్రవైవిధ్యాన్ని, రసభావాలను సమర్ధవంతంగా పలికించడంలో, రసజ్ఞుల ఆమోదాన్ని పొందడంలో సఫలీకృతులవలేదనే అనుకోవలసివస్తుంది. పాటలోని పరిపూర్ణ తృప్తి, రసానందం ఒక్క ఘంటసాల గాత్రంలోనే ధ్వనించిందని ఈనాటివరకూ తెలుగువారంతా అనే మాట. ఒక్క తెలుగునాటే కాక తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా ఘంటసాల చెరగని ముద్ర వేసారు.

బొంబాయి చలనచిత్ర సీమలో వుండే సాంకేతిక పరిజ్ఞానం అంతా మద్రాస్ లో తయారయే దక్షిణాది సినీమాలన్నిటిలో కనిపించేవి. 1960ల తర్వాత మల్టీట్రాక్ ఛానల్ సిస్టమ్ వచ్చినా 70ల వరకు పెద్దగా ఎవరూ ఉపయోగించలేదు. సినీమా పాటలన్నీ లైవ్ లోనే రికార్డింగ్ జరిపేవారు. అలాగే పాతకాలపు ఎన్.టి.ఆర్., ఎ.ఎన్,ఆర్., ఎమ్.జి.ఆర్., శివాజీ గణేశన్ల సినీమాల ఆడియో అంతా షూటింగ్ సమయంలోనే రికార్డ్ చేసేవారు. నటీనటులు డబ్బింగ్ చెప్పుకోవడమనేది ఇటివల 80లలో వచ్చిన నవీన పంథా. దానికి కారణం భాష తెలియని నటీనటులు ప్రాంతీయ చిత్రాలలో నటించడం. షూటింగ్ సమయంలో ఆ గాజు బొమ్మలు  డైలాగ్స్ పేరిట ఎ టు జెడ్ ఆల్ఫాబెట్స్ వల్లిస్తే తర్వాత ఎప్పుడో డబ్బింగ్ ఆర్టిస్ట్ లు వచ్చి అసలు డైలాగ్స్ చెపితే ఎడిటర్లు వాటిని లిప్ సింక్ చేసుకుంటారు.  అలాగే పాటల విషయానికొస్తే లైవ్ రికార్డింగ్ విధానం పోయి ట్రాక్ సింగింగ్, ట్రాక్ మిక్సింగ్ విధానం వచ్చింది. విదేశాలలో కూర్చొని మ్యూజిక్ డైరక్టర్ ట్యూన్ పంపిస్తాడు. దానికి రచయితలేవో మాటలందిస్తాడు. ఇక్కడి అరేంజర్లు కంప్యూటర్ లోకి ఎక్కిస్తారు. ఎవరికి వారే వారి స్థావరాలలో కూర్చొని మైక్రోఫోన్ ల ద్వారా   పాడేవారు పాడేస్తారు. వాద్యగాళ్ళు ఎవరికి వారే వారికిచ్చిన బిట్లు వాయించేస్తారు. ఎవరు ఏ సినీమాకి ఎందుకు పాడుతున్నారో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండానే పాటాల కార్ఖానాలో పుంఖానుపుంఖాలుగా పాటల మాన్యుఫేక్ఛరింగ్ జరిగిపోతుంది. తెరమీద ఎవరికి కావలసిన పధ్ధతిలో ఆ పాటలను ఎక్కడో దగ్గర వినిపించి చూపిస్తారు. 

ఘంటసాలవారు తనకు అనారోగ్య సమయాలలో తప్ప ట్రాక్ మిక్సింగ్ కు ఇష్టపడేవారు కాదు. పాటల రికార్డింగ్ లు లైవ్ గా జరిగితేనా పాటకు జీవం, అందం, ఆనందం అని భావించేవారు. ఘంటసాలవారి కాలంలో ఆయనే కాదు, సంగీత దర్శకులందరూ లైవ్ రికార్డింగ్ చేయడానికే ఇష్టపడేవారు.

రోజులు మారాయి. సాంకేతిక విజ్ఞానమూ పెరిగింది. చిత్రనిర్మాణ విధానాలు మారాయి. విడియో ఆవిర్భావం తర్వాత ట్రెండ్ మారిపోయింది. గత కాలంలోలా హిందుస్థాన్ ఫోటో ఫిలిం కంపెనీ,  లేదా కోడక్ వారి ముడి ఫిలిం తో షూటింగ్ లు జరిపి ఆ ఫిల్మ్ రీళ్ళను డబ్బాల్లోకి ఎక్కించి ఆ నెగెటివ్ లకు పాటల ఆడియో జతచేసి వాటిని పాజిటివ్ ఫిల్మ్ కాపీలుగా తీసి సినీమా హాల్స్ లో ప్రొజెక్టర్లలో ఆ 15-20 రీళ్ళ సీనీమాలను వెండితెరపై చూపించడమనే కాలమే పోయింది. ఒకప్పుడు ముడి ఫిల్మ్ కోసం పడరానిపాట్లు పడేవారు. ప్రతీ నిర్మాత తమకు కావలసిన ఫిల్మ్ కోసం ముందుగానే అప్లై చేసుకోవలసి వచ్చేది. అలాగే ఈస్ట్ మన్ కలర్, టెక్నికలర్ ఫిల్మ్ కోసం ఇంకా ఎక్కువకాలం ఎదురుచూడాల్సి వచ్చేది. బాగా ఆర్థిక స్థోమతకల నిర్మాతలైతే తప్ప చిన్న చిన్న నిర్మాతలకు సినీమా తీయడమంటే రోట్లో తలదూర్చటమే. అందుకే తెలుగులో మంచి కలర్ సినీమాల నిర్మాణం చాలా ఆలస్యంగా అభివృద్ధి చెందింది. సినీమా పూర్తయ్యాక అన్ని థియేటర్లకు సరిపడా ప్రింట్ల్ తీసే అవకాశం వుండేదికాదు. ఏ ఇరవై ప్రింట్లో తీయించి వాటినే ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాలలో అక్కడక్కడ ప్రదర్శించేవారు. మద్రాస్ వంటి పెద్ద నగరాలలో ఒకే  సినీమా ప్రింట్ ను  ఒకేసారి దూరం దూరంగా వున్న సినీమాహాల్స్ లో వేసేవారు. ఒక అరగంట వ్యవధిలో సినీమా షోలు మొదలెట్టేవారు. ఒక థియేటర్లో అరగంట సినీమా అయ్యేప్పటికి ఆ రీళ్ళ డబ్బాను ఆటోలోనో, చెమటలు కక్కుకుంటూ సైకిళ్ళమీదో ఆఘమేఘాల మీద మరో థియేటర్ కు చేర్చేవారు. ఈలోగా ఏ కారణం చేతైనా ప్రింట్ చేతికి అందకపోతే ఎక్స్ట్రా ఇంటర్వెల్ స్లైడ్ పడేసేవారు. ఈ విధంగా ఒకే ప్రింట్ ను రెండు మూడు థియేటర్లలో ఆడిన ఎన్నో సినీమాలు నేను చూశాను.

ఇప్పుడు సినీమా టెక్నాలజీ యే మారిపోయింది. ఇప్పుడు ఎవరూ పాత కెమెరాలు, పాత ముడి ఫిల్మ్  వాడడం, సినిమా హాల్స్ లో ప్రొజెక్టర్లు లోకి ఆ మొత్తం రీళ్ళను రెండు మూడు సార్లు మాన్యువల్ గా ఎక్కించి స్క్రీన్ మీద చూపడం ఆ పధ్ధతులన్నీ ఔట్ డేట్ అయిపోయాయి. ఆ నాటి సినీమా పరికరాలు అన్నీ మ్యూజియంలకు చేరాయి. గత పదేళ్ళుగా అంతా డిజిటల్ మయం. డిజిటల్ కెమెరాలు. డిజిటల్ సౌండ్ సిస్టమ్ . మొత్తం 15  రీళ్ళ రెండు గంటల సినీమాను  ఒక చిన్న డిస్క్ లో లేదా పెన్ డ్రైవ్ లో బంధించి  డిజిటల్ ప్రొజెక్టర్ల మూలంగా 70 mm, వైడ్ స్క్రీన్ , స్కోప్ అంటూ రకరకాల సౌండ్ సిస్టమ్స్ తో 3D, 4D  ఎఫెక్ట్స్ తో ప్రజలను వింత వింత లోకాలకు తీసుకుపోయి వినోదాన్ని కల్పిస్తున్నారు.

సినీమా ధ్యాసలో పడి షార్ట్ హాండ్ క్లాసుల గురించే మర్చిపోయాను. పానగల్ పార్క్ దగ్గరలోని నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ కు నాతో పాటు మా బ్యాచ్ లో మరో నలుగురైదుగు తెలుగువారుండేవారు. అందరితో పెద్ద స్నేహం ఏర్పడలేదు కానీ కొందరితో ముఖపరిచయం, కొందరితో పలకరించడం వరకు స్నేహరికం ఏర్పడింది. వారిలో ఒక ప్రముఖ నటి  మేనకోడలు వరస బంధువు ఒకమ్మాయి. ఏదో పేరంటానికి వెడుతున్నట్లుగా ఎప్పుడూ పట్టుబట్టలు, నగలు అలంకరించుకు  దండపాణి వీధి నుండి వచ్చేది. మరొకామె మా ఇంటి దగ్గరి మురుగేశ మొదలియార్ వీధిలోనుండి  వచ్చేది. ఎప్పుడు తెల్లని డిజైన్డ్ ఖటావ్ వాయిల్ చీరలనే కడుతూ చాలా హుందాగావుండేది. సాయంత్రం వేళల్లో తన మూడేళ్ళ చిన్న పాపను నడిపించుకుంటూ పానగల్ పార్క్  కూరల బజారు కు వెడుతూ కనిపించేది. మొదట్లో ఆవిడ  ఆ వీధిలోనే వుండే ఒక తెలుగు నిర్మాత భార్య అని అనుకునేవాడిని. కాని కాదు. ఆవిడ పేరుతో అప్పట్లో కొన్ని పత్రికల్లో కథలు వచ్చేవి. మరి ఆ రచయిత్రి, ఈవిడా ఒకటేనా కాదా అనేది ఇప్పటిదాకా వీడని చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. మరొక అమ్మాయి కోడంబాక్కం నుండి తన అన్ననో తమ్ముడినో తోడు తీసుకు వచ్చేది. ఆ అమ్మాయి తండ్రి సినీమా ఆర్కెష్ట్రా లలో హార్మోనియం వాయించేవారు. కొన్ని డబ్బింగ్ సినీమాల మ్యూజిక్ డైరెక్టర్ గా ఒకటి రెండుసార్లు ఘంటసాల మాస్టారి ఇంటిదగ్గర చూశాను. ఆయన పేరు వేలూరి కృష్ణమూర్తి. ఎన్.టి.రామారావుగారి 'గులేబకావళి కథ' జంట సంగీత దర్శకులలో ఒకరు. 

ఇక మగవాళ్ళలో భరణీ కోటేశ్వరరావు గా పేరుపొందిన భరణీ స్టూడియో సౌండ్ ఇంజనీర్ పి.వి.కోటేశ్వరరావు గారు. ఆయనే తర్వాతి కాలంలో జెమినీకి మారి జెమినీ కోటేశ్వరరావుగా అనేక సినీమాలకు పనిచేశారు. వారి అబ్బాయి ఈ నియో కమర్షియల్ క్లాసులకు వచ్చేవాడు. మరొక అబ్బాయి నారాయణమూర్తి. కోడంబాక్కం నుండి వచ్చేవాడు. సరదాగా మాట్లాడేవాడు. అతనిని మళ్ళా ఒక ఐదేళ్ళ తర్వాత సెంట్రల్ స్టేషన్ పక్కన వాల్టాక్స్ రోడ్ లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ కనిపించాడు. అతని ప్రోద్బలం మీద నెలకు 15/- రూపాయలు చొప్పున 20 మాసాలు  ఇన్స్టాల్ మెంట్ లో మహాబలిపురానికి ఏడు కిలోమీటర్ల ఇవతల ఓల్డ్ మహాబలిపురం రోడ్ లో ఓ రెండు ప్లాట్ లు కొనవలసి వచ్చింది. అదొక కాశీమజిలీ కధ. ఆ గాధ వచ్చే అధ్యాయంలోనే. ఇక్కడ కాదు. ఆ నారాయణ మూర్తి పరిచయం అక్కడితో సరి. రాజేశ్వరశర్మ అని మరో అబ్బాయి వెస్ట్ మాంబళం వేపునుండి వచ్చేవాడు. ఫైవ్ ల్యాంప్స్ ఏరియాలో వుండేవారనుకుంటాను. మనిషి చాలా సౌమ్యుడు. మా ఇద్దరికి కొంత స్నేహం ఏర్పడింది.  ఆ ఇన్స్టిట్యూట్ తోనే మా పరిచయం కూడా ముగిసింది. కానీ ఓ పుష్కరం తర్వాత ఆ రాజేశ్వరశర్మగారు మా రెండవ చెల్లెలు  వివాహ సందర్భంలో  మా రెండవ బావగారు కొచ్చెర్లకోట కృష్ణప్రసాద్ గారి అన్నగారిగా పునఃపరిచయం కావడం అనూహ్యం. ఆశ్చర్యదాయకం. ఈ స్నేహాలు, బంధాలు, అనుబంధాలు ఎప్పుడు, ఎవరితో, ఎలా ఏర్పడుతాయో చెప్పలేము. 

నియో కమర్షియల్ లో క్లాసెస్ టైమింగ్స్  లో క్లాష్ రావడంతో అక్కడ మానేసి మా ఉస్మాన్ రోడ్ మీద గ్రిఫిత్ రోడ్ కి వాసన్ స్ట్రీట్ కి మధ్య బస్ స్టాప్ దగ్గర మేడ వున్న పార్థసారధి టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ లోని షార్ట్ హాండ్ క్లాసులో జాయిన్ అయ్యాను. అది నెం. 25 లేక 26 ఉస్మాన్ రోడ్. మా ఇంటికి ఓ పదిళ్ళు అవతల. ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ ఒక మధ్య వయస్సు విడో. మేడమీద క్లాసులు, క్రింద భాగంలో ఇల్లు. తల్లి, ఇద్దరు అక్కచెల్లెళ్ళు వుండేవారు. చెల్లెలు AG ఆఫీసులో అనుకుంటాను పనిచేసేది. ఆవిడ కూడా అప్పుడప్పుడు షార్ట్ హాండ్ క్లాసెస్ తీసుకునేది. అలాటి కుటుంబాలను చూసాక జీవితం పట్ల నాలో ఒక రకమైన భయం, భాధ్యతల్లాంటివి అలవడడం మొదలయ్యాయి. 

మేడ మీద ఉన్న ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడానికి ఉన్న మెట్లను ఆనుకునే  తర్వాత కొన్నేళ్ళకు బస్ స్టాపువార TMS Stores, 'సమద్' ప్రొవిజన్ స్టోర్స్ వచ్చేయి. ఈ రెంటి మధ్యా పాలంకి సూర్యనారాయణగారి శ్రీ సూర్య ఆయుర్వేద నిలయం. సమద్ భాయి వచ్చాక, పార్క్ దగ్గరి 'సలామ్' భాయికి తాత్కాలికంగా బైబై చెప్పడం జరిగింది. ఆ సలామ్ భాయ్ కొన్నేళ్ళ క్రితం వడపళని ఆర్కాట్ రోడ్  'సలామ్' లో కనపడి, నన్ను గుర్తుపట్టి  పలకరించడం, మా నాన్నగారి యోగక్షేమాలు అడగడం నన్ను ఆశ్చర్యపరిచాయి. మా చిన్నప్పుడు ఉస్మాన్ రోడ్ 'సలామ్' లో సామాన్లు కొన్నప్పుడల్లా ఆ భాయి ఓ నూరు గ్రాముల పచ్చి వేరుశనగ పప్పులు విధిగా వేరేగా  పొట్లం కట్టి  ఉచితంగా ఇచ్చేవాడు. ఆ భాయికి తెలుగురాదు,  నాకు అరవం రాదు, అయినా మా మధ్య సఖ్యత పెరిగింది. ఇప్పుడు ఆ షాపులు లేవు, ఆ వ్యక్తులు ఎక్కడున్నారో తెలియదు. ఈ కాల చక్రభ్రమణంలో ఎవరెవరో తారసపడతారు, మనతోనే వుంటూంటారు. కొన్నాళ్ళకు అదృశ్యమైపోతూంటారు. వారి జ్ఞాపకాలు క్రమేపీ మనలోనుండి తొలగిపోతూంటాయి. 

🌺💐🌺

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో 1967 లో ప్రారంభమై 1968లో రిలీజైన నాలుగు సినీమాలలో రెండు సినీమాలు 'గోవుల గోపన్న', 'చుట్టరికాలు' సినీమా పాటల గురించి ముచ్చటించడం జరిగింది.

కాంతారావు నటించిన 'వీరపూజ', ' జీవితబంధం' కూడా ఆ సంవత్సరమే విడుదలయ్యాయి. వీరపూజ లో మాస్టారు పాడిన 'అద్దరిని వున్నాడు అందగాడు', 'కానరావయ్య కావరావయ్య గౌరీశ కైలాసవాసా', పి.సుశీలగారు పాడిన 'కొనుమా సరాగమాల' వంటి  మంచి పాటలు మరో నాలుగు కూడా ఉన్నాయి. 

'సరాగమాల' పేరు వినగానే వి.ఎ.కె.రంగారావుగారి ఆంధ్రపత్రిక శీర్షిక 'సరాగమాల' గుర్తుకువస్తుంది. ఆ శీర్షికలో శ్రీ రంగారావుగారు ఎన్నో సినీమా పాటల మీద సమీక్షలు వ్రాశారు. ఆ శీర్షికను వారికి సూచించింది శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారే అని విన్న గుర్తు.

ఎమ్.ఎస్.గోపీనాథ్ నిర్మాత దర్శకుడిగా మొదలైన చిత్రం 'జీవితబంధం'. ఇది రివైజ్డ్ టైటిల్. ముందు ఇంకేదో పేరు పెట్టారు. ఆర్థిక ఇబ్బందులవల్ల సినీమా చాలాకాలం ఆగిపోయింది. ఆ తర్వాత మరెవరో రైట్స్ కొనుక్కొని అదే దర్శకుడితో ముగించారు. అందులో మాస్టారు పాడిన 'తెగిపోయిన గాలి పటాలు', 'లేత హృదయాలలో విరిసె ఆనందమూ'  డ్యూయెట్  వినసొంపుగా వుంటాయి. మిగతా పాటల గురించి గుర్తులేదు. తర్వాత కాలంలో ఈ ఎమ్.ఎస్.గోపీనాథ్ మరికొన్ని తమిళ, తెలుగు సినీమాలు తీశారు. ఈయన కుమారుడే గడచిన తరం యువహీరో సురేష్. రత్నకుమార్ తీసిన 'తేన్ కూడు' తమిళ చిత్రంలో హీరో. అనేక తెలుగు, తమిళం సినీమాలలో హీరోగా నటించిన అతను ఈమధ్య వయసుమళ్ళిన పాత్రల్లో అడపదడపా కనిపిస్తున్నాడు.  

మరికొన్ని సినీమాల గురించి.... వచ్చేవారం....
                     ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, August 29, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఆరవ భాగం

29.08.2021 - ఆదివారం భాగం - 46*:
అధ్యాయం 2  భాగం 45 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"పూర్ణిమ" - విజయరాఘవాచారి రోడ్ లోకి ప్రవేశించగానే కుడిచేతివేపున ఆకుపచ్చ,పసుపురంగుల మిశ్రమంలో వచ్చే పచ్చ రంగులో కనిపించే అతి పెద్ద భవనం. అందులోనే USEFI (United States Education Foundation in India) ఆఫీస్. అప్పటికి మద్రాస్ మౌంట్ రోడ్ లో ఆక్స్ ఫర్డ్   ప్రెస్ కు , కెథెడ్రల్ చర్చ్ కు మధ్యనున్న అమెరికన్ కాన్స్యులేట్ బిల్డింగ్, ఆఫీసులు లేవు. అప్పుడు అక్కడ చెప్పుకోదగ్గ మాన్యుమెంట్ జెమినీ స్టూడియో ఒక్కటే. తర్వాత సఫైర్ మల్టీ థియేటర్ కాంప్లెక్స్, ఆ తర్వాత పెద్ద ఫ్లై ఓవర్ వచ్చింది. అమెరికన్ కాన్స్యులేట్ భవంతి ఏర్పడ్డాక డి.ఎన్.రావుగారి ఆధ్వర్యంలోని USEFI కూడా అందులోకి మారిపోయింది. అయితే ఆ భవంతితో నాకు ఏ అనుభవమూ లేదు.

"పూర్ణిమ"  డా.డి.ఎన్.రావుగారి ఆఫీస్ కమ్ రెసిడెన్స్.  చెట్పట్ ప్రాంతంలోని హారింగ్టన్ రోడ్ లోనుండి ఈ భవంతికి మారిపోయారు. ఈ భవంతి ప్రముఖ నిర్మాత దర్శకుడు బి.ఎన్.రెడ్డిగారి అల్లుడిదని విన్న జ్ఞాపకం. ఆ విజయరాఘవాచారి రోడ్ లో వై.ఎస్.శాస్త్రిగారి వంటి తెలుగు ప్రముఖులుండేవారు. తెలుగువారంతా ఎక్కువగా కనపడే ఆంధ్రా క్లబ్ (మర్యాదపూర్వకంగా చెప్పాలంటే  ఆంధ్రా సోషల్ & కల్చురల్ అసోసియేషన్- ఆస్కా)  ఆ రోడ్ లోనే. ఆ రోడ్ చివరకు వెళ్ళి ఎడమకు తిరగగానే బోగ్ రోడ్ లో బి.ఎన్.రెడ్డిగారి యిల్లు. టి.నగర్ లో అతి పెద్ద రోడ్లలో బోగ్ రోడ్ ఒకటి. బోగ్ రోడ్, నార్త్ బోగ్ రోడ్, సౌత్ బోగ్ రోడ్ (శివాజీ గణేశన్ భవంతి), సౌత్-వెస్ట్ బోగ్ రోడ్ అంటూ సుమారు రెండు-రెండున్నర కిలోమీటర్ల పొడుగున ఉత్తర దక్షిణాలలో వున్న మౌంట్ రోడ్ కు సమాంతరంగా అటు జి.ఎన్.చెట్టి రోడ్డు, సర్ త్యాగరాయ రోడ్డు నుంచి ఇటు వెంకట నారాయణారోడ్, సౌత్ ఉస్మాన్ రోడ్, సి.ఐ.టి.నగర్ లను కలిపే అతి పెద్ద లింక్ రోడ్. కొన్ని దశాబ్దాల క్రితం బి.ఎన్.రెడ్డిగారిని గౌరవార్ధం ఆయన ఇల్లున్న ప్రాంతానికి బి.ఎన్.రెడ్డి రోడ్ అని పేరుపెట్టారు ఆనాటి సర్కారువారు. కొన్నేళ్ళకు కొత్త సర్కారు వచ్చింది. కులాలు, మతాలు 'కడియాదు' అంటూ రోడ్ల పేర్లలోని కులాలని, మతాలని కడిగేసారు. ఆ దుమారంలో 'బి.ఎన్.రెడ్డి రోడ్' లో 'రెడ్డి' చెరిగిపోయి 'బి.ఎన్.రోడ్' మిగిలింది.  ఇప్పుడు ఆ బి.ఎన్. ఎవరన్నా కావచ్చు. ఆ రోడ్ కు ఆ పేరు పెట్టడానికి గల ఉద్దేశమే ఇప్పుడెవరికీ అక్కర్లేదు. అదే రాజకీయం.

మళ్ళీ, వెనక్కి తిరిగి 'పూర్ణిమ' లోకి వెడదాము.

USEFI భారత్- యునైటెడ్ స్టేట్స్  దేశాల విద్యార్థుల పాలిటి ఒక కల్పతరువు. ఈ రెండు దేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించాలనుకునే  ఉత్తమ విద్యార్థులకు ఫుల్బ్రైట్ స్కాలర్షిప్ లను ఇచ్చి ప్రోత్సహించే సంస్థ. ఆ సంస్థ సదరన్ రీజియన్ కు డైరక్టర్ డా.డి.ఎన్.రావు. ఆయనకు డెప్యూటీ డా.(మిసెస్)షెట్టి. దక్షిణ కర్ణాటకకు చెందిన మహిళ.  ఇద్దరు సెక్రెటరీలు. ఒకరు కుప్స్ అనబడే కుప్పుస్వామి. మరొక లేడీ సెక్రటరి. ఈ USEFI సంస్థ విదేశాలలో మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్సెస్ కోర్స్లు చదవాలని ఆశించే విద్యార్ధులకు  టోఫెల్, జి.ఆర్.ఇ, తో పాటు మరో రెండు మూడు టెస్ట్ లు నిర్వహించేది. ఆ పరిక్షల సమయంలో ఇన్విజిలేటర్ గా పనిచేయడానికి, మిసెస్.షెట్టికి ఆఫీస్ ఫైలింగ్ సిస్టమ్ లో సహాయకారిగా వుండడానికి తాత్కాలికంగా నన్ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో డి.ఎన్.రావుగారు నన్ను వారి ఆఫీసుకు రమ్మని మా నాన్నగారి ద్వారా కబురుపంపారు. ఈ సంగతి వినగానే నా గుండెల్లో రాయిపడింది. కారణం నాకు తెలుగు, కొంచెం కొంచెం తమిళం తప్ప మరే భాషరాదు. ఇంగ్లీషు రాయడం చదవడం తప్ప స్వేఛ్ఛగా ఇంగ్లీష్ లో మట్లాడడమనేది అసలు చేతకాదు. ఒక వాక్యం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఓ పది నిముషాలు తెలుగులో ఆలోచించాల్సివచ్చేది. ఈ పరిస్థితులలో నేను ఆ ఫారిన్ ఆఫీస్ లో పనిచేయగలనా అనే సంకోచం. గతానుభవాన్ని బట్టి డి.ఎన్.రావుగారి ఫారిన్ స్టైల్ వేషభాషలు, ఆయన గాంభీర్యం, నిజం చెప్పాలంటే ఆయనతో మట్లాడడానికి జంకుగానే వుండేది. వాళ్ళ సంభాషణ అంతా ఎక్కువగా ఇంగ్లీష్ లోనే సాగేది. నాకు ఇండియన్స్ మాట్లాడే ఇంగ్లీష్ అయితే కొంత అర్ధమౌతుంది. ఫారినర్స్ మాట్లాడే ఇంగ్లీష్ స్లాంగ్  ఇప్పటికీ నాకు అర్ధంకాదు. గొప్పలు చెప్పుకోవడం కోసం హాలీవుడ్ సినీమాలు చూడడమే తప్ప అందులో ఒక్కమాటా ఇప్పటికీ అర్ధమై చావదు. ఈ నేపథ్యంలో నేను వాళ్ళ తృప్తిమేరకు పనిచేయగలనా? ఈ బాధలు ఎవరితో చెప్పుకోవాలి? అయినా తప్పదు. 

వెళ్ళి రావు గారిని కలిసాను. ఆయన చెప్పినవాటన్నిటిని శ్రధ్ధగావిని తలూపడం తప్ప మరేం చేయలేదు. మిసెస్ షెట్టి  చెప్పినవి చేస్తూ ఆఫీసు విధానాలు నేర్చుకోమన్నారు. అది మరో ఇబ్బంది నాకు. మా ఇళ్ళలో వుండే ఆడవారితో తప్ప బయట ఆడవారితో మాట్లాడిన సందర్భాలే లేవు. హైస్కూలులో చదివిన నాలుగేళ్ళలో, కాలేజీలో చదివిన మూడేళ్ళలో, కో-ఎడ్యుకేషనే అయినా ఏ ఒక్క ఆడపిల్లతో కలసి మాట్లాడిందేలేదు. అలాటి అవసరమూ రాలేదు. అలాటి నేను మిసెస్ షెట్టి దగ్గర ఎలా మాట్లాడి పని చేయడం. కానీ తప్పదు. ఒక పదిరోజులకు అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాను. ఇప్పటిలా ఆ రోజుల్లో కంప్యూటర్ లు లేవు. అంతా మాన్యువల్ గానే జరిగేవి. 

యూసెఫీలో  వారు కండక్ట్ చేసే పరీక్షలకు సహాయకుడిగా, డా.షెట్టి దగ్గర పని నేర్చుకుంటూ కొన్ని మాసాలు పనిచేశాను. USEFI నిర్వహించే ఫుల్ బ్రై ట్ స్కాలర్ షిప్ టెస్ట్ లు మౌంట్ రోడ్ లోని ఎడిసన్స్ కంపెనీ వారి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగేవి. ఈ ఎడిసెన్స్ పక్కనే హిగిన్ బాదమ్స్, మరోపక్క గవర్నమెంట్ పబ్లికేషన్స్, ఎదురుగా రోడ్ కు అవతలవేపు ఓరియెంట్ లాంగ్మెన్స్, ఆ పక్కనే పటుల్లాస్ రోడ్ లో మాక్మిలన్ పబ్లికేషన్స్ వుండేవి. ఈ ఎడిసన్స్ ఆడిటోరియంలో పరిక్షలు వ్రాయడానికి అనువుగా  ఒక్కోక్క విద్యార్ధికి రైటింగ్ టేబిల్ అటాచ్డ్  ఛైర్స్ వుండేవి. అక్కడికి పరీక్షలు వ్రాయడానికి వచ్చేవారంతా బాగా విద్యాధికులు. ఉన్నత వర్గాలనుండి వచ్చినవారుగా ఉండేవారు. అప్పటి ఆ టెస్ట్ లన్ని అప్టిట్యూడ్ టెస్ట్లు.  పెన్సిల్ తోనే సమాధానాలు వ్రాయాలి. ఆ పరిక్షలకు హాజరయేవారికి కావలసిన ప్రశ్నా పత్రాలు అందివ్వడం చివరలో వారి దగ్గరనుండి ఆ పేపర్లు తీసుకొని నెంబర్ వారీగా సార్టౌట్ చేసి కుప్పుస్వామి కి అప్పజెప్పడం, ఇదే నా పని. విద్యార్ధులెవరితో నేనేమీ మాట్లాడకూడదు. వారేమి అడిగినా చెప్పకూడదు. ఇదొక నిబంధన.  నాకు మహదానందం.  Of course అంతకంటే కావలసింది ఏముంది. అప్పట్లో నాకు of course అనే మాట ఊతపదం గా వుండేది. ఆ మాట అవసరమున్నా లేకపోయినా Of courseగా ఉపయోగించే వాడిని. దీనితో  తికమకపడిన కొంతమంది స్టూడెంట్స్ నన్నేమీ అడిగేవారు కాదు. ఈ పరీక్షలు ఉదయం పది తర్వాత గానీ, మధ్యాహ్నం రెండు తర్వాత గానీ జరిగేవి. ఒక్కోసారి రెండు పూటలా జరిగేవి.  విద్యార్ధులు వ్రాసిన ఈ పరీక్షల సమాధాన పత్రాలను నలగకుండా, మడతపెట్టకుండా ఒక పెద్ద పసుపుపచ్చని కవర్ లో సీల్ చేసి యూసెఫీ అహ్మదాబాద్ ఆఫీస్ కు పంపేవారు. అక్కడినుండే రిజల్ట్స్ వచ్చేవి. ఆ తర్వాత అర్హత పొందిన విద్యార్ధులకు విదేశాలలో చదువుకోవడానికి అవకాశాలు వచ్చేవి. ఈ పరిక్షల నిర్వహణలో సహాయపడినందుకుగాను నాకు  కొన్ని రోజుల తర్వాత సగం రోజుకైతే 8 డాలర్లు, పూర్తిరోజుకైతే 15 డాలర్లు ఇచ్చేవారు. దానిని మన కరెన్సీలోకి మార్చి  మద్రాస్ ఆఫీస్ వారు రూపాయలలో ఇచ్చేవారు. నాకు అప్పటికి బ్యాంక్ ఎకౌంట్ లేదు. అందువల్ల క్యాష్ గానే పే చేసేవారు. మొదటిసారి పైకం తీసుకున్నప్పుడు వోచర్ మీద సంతకం పెట్టమన్నారు. నేను పూర్తిగా పట్రాయని ప్రణవ స్వరాట్ అని పేరు రాసాను. అది చూసి డిఎన్ రావుగారు "ఇది సంతకం కాదు. వీళ్ళెవ్వరికీ ద్వివేదుల నరసింగరావు, పట్రాయని ప్రణవ స్వరాట్ అంటే నోరు తిరగదు, పలకలేక ఛస్తారు. అందుచేత అందరూ పిలవడానికి వీలుగా పేరును సంతకాన్ని మార్చుకోమని ఇక పై కేవలం స్వరాట్ అని మాత్రం సంతకం పెట్టమని సలహా ఇచ్చారు. అప్పటినుండే నాపేరు పి.పి.స్వరాట్ గా మారింది. అలాగే ప్రతిరోజూ ఉదయం ఇండియన్ ఎక్స్ప్రెస్ డైలీ పేపర్ చదివితే మంచి ఇంగ్లీషు ఒంటబడుతుందని సలహా ఇచ్చేరు. ఆ రోజుల్లో  ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక భాషా స్థాయి అంత ఉన్నతంగా వుండేదని అర్ధం చేసుకోవచ్చును.

సాయంత్రం ఐదున్నర దాటేసరికి 'పూర్ణిమ' లో వాతావరణం పూర్తిగా మారిపోయేది. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక డి.ఎన్.రావుగారు లోపలికి వెళ్ళి ఆరులోపల ఫ్రెషప్ అయి తెల్లటి పైజమా, జుబ్బా లేదా , హాఫ్ హాండ్ షర్ట్ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చేవారు. ఈలోగా వారి కారు డ్రైవర్  బాలకృష్ణన్ లోపల్నుండి బయట వున్న లాన్స్ లోకి పేము కుర్చీలు తీసుకువచ్చి వేసేవాడు. రావుగారికి ఒక గ్రేకలర్ అంబాసిడర్ కారు వుండేది. MSV6799 అనే గుర్తు. మనిషి రంగు కొంచెం తక్కువే అయినా బాలకృష్ణన్  తెల్లటి యూనిఫామ్ లో అందంగా వుండేవాడు. చాలా మంచివాడు. 

పోకచెట్లు, అశోక చెట్లతో 'పూర్ణిమ'  ప్రాంగణం చల్లగా ఆహ్లాదకరంగా వుండేది. లోపలనుండి వారి సతీమణి  విశాలాక్షిగారు కాఫీ, టిఫెన్లు తీసుకువచ్చేవారు. వాటిని తింటూ తెలుగులో లోకాభిరామాయణం ప్రారంభించేవారు. అలాటి సందర్భాలలో ఇంట్లో వుంటే వారి అబ్బాయి అమ్మాయికి కూడా వచ్చి కబుర్లు చెప్పేవారు. 

ఒకరోజు ఇలాటి సంభాషణలు జరుగుతున్నప్పుడు విశాలాక్షిగారు "నిన్న రాత్రి ఆ వెధవలు ఏంచేసారో తెలుసునా..." అంటూ మొదలెట్టారు. అందరూ ఆసక్తిగా వినడం మొదలెట్టారు. కొంతసేపయ్యాక నాకు అర్ధమయింది, ఆ వెధవలని ప్రేమతో సంభోదించింది "పిక్సీ" అనే తెల్లటి పొమేరియన్ కుక్కపిల్ల , మరో పిల్లిపిల్లని. ఆ రెండూ ఒక రాత్రివేళ తమ చోట్లలో పడుక్కోకుండా విశాలాక్షిగారి బెడ్ ఎక్కి దుప్పట్లో దూరి వెచ్చగా పడుకున్నాయట. ఈ విషయాన్ని ఆవిడ ఎంతో మురిపెంగా చెపుతూంటే రావుగారు, వారి పిల్లలు ఆసక్తిగా వినేవారు. 

రావుగారి అబ్బాయి చేత కుప్స్ అని పిలవబడే సెక్రెటరీ కుప్పుసామి ఒకరోజు కంగారుపడుతూ వచ్చాడు. అతను వుండేది నంగనల్లూరు.  రోజూ అతనే వచ్చి ఆఫీస్ తలుపులు తెరుస్తాడు. ఆరోజు ఆఫీస్ తాళాలు కనపడలేదు. ఎక్కడైనా వదిలేసాడా, లేక మరెక్కడైనా జారిపోయాయో తెలియలేదు. వెంటనే డూప్లికేట్ తాళాలతో ఆఫీస్ తెరచి వెంటనే లోకల్ పేపర్లలో  ఎడ్రస్ తో సహా ఒక ప్రకటన వేయించారు " తాళాలు తెచ్చి ఇచ్చినవారికి తగిన నగదు బహుమానం ఇస్తామని". అలాగే ఆ ప్రకటన వచ్చిన మర్నాటి సాయంత్రానికల్లా ఎవరో ఒకతను వచ్చి ఏదో హోటల్ టేబిల్ మీద కనిపించాయని ఆ తాళాలు తిరిగి ఇచ్చేశాడు. విశేషం ఏమంటే వీరిస్తామన్న నగదు బహుమానం ఆ వ్యక్తి పుచ్చుకోలేదు.

సాయంత్రాల పూట "పూర్ణిమ" ఒక సాహితీ కేంద్రం.  రచయిత పాలగుమ్మి పద్మరాజుగారు, అమెరికన్ రిపోర్టర్ ఎడిటర్ బి.ఎస్.ఆర్ కృష్ణగారు, సోవియట్ ల్యాండ్ శెట్టి ఈశ్వరరావుగారు, మా నాన్నగారు సంగీతరావుగారు, ఎన్నార్. చందూర్ గారు, ఇలా ఎవరో కొంతమంది సాహితీప్రియులు అక్కడకు చేరి రాత్రి తొమ్మిదివరకు అనేక విషయాలమీద ముచ్చటించేవారు. డి.ఎన్.రావు కుటుంబం మద్రాస్ లో వున్నంతకాలం ఈ సంగీత సాహిత్య సమ్మేళనం కొనసాగిందనే చెప్పాలి.

మీలో ఎవరికైనా సుప్రసిధ్ధ తమిళ నటుడు రంజన్ గుర్తున్నారా? జెమినీ వారి పాత అపూర్వ సహోదరులు, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించారు. మనందరికీ బాగా గుర్తున్న "కొండవీటి దొంగ" చిత్రంలో ఘంటసాలవారు పాడిన "సాహసమే జీవిత పూ బాటరా" పాటను డూప్ లేకుండా గుర్రపుస్వారి చేస్తూ నటించిన ఇండియన్ రాబిన్ హుడ్ ఈ రంజనే. 


ఈయనను మొదటగా తెరమీద కాక బయట చూసింది డి.ఎన్.రావుగారి ఆఫీసులోనే. సూటుబూట్ తో చాలా రాజసంగా కనపడ్డారు. అప్పట్లో ఆయనకు సొంత విమానం, రేసు గుర్రాలు వుండేవని అనుకునేవారు.

ఒకరోజు మాలతీచందూర్ గారు, కె.రామలక్ష్మిగారు విశాలాక్షిగారిని చూడడానికి  వచ్చారు. ఈ ముగ్గురు మహిళలు ఇంటిలోపల ముచ్చట్లు మొదలెట్టారు. అసలు సిసలు తెలుగింటి ఆడపడుచులుగా వారి టాపిక్ చీరలు, నగలు మీదకు మళ్ళింది. ఆ సమయంలో నేను అనుకోకుండా లోపలికి వెళ్ళవలసి వచ్చింది. నన్ను చూసి విశాలాక్షిగారు "స్వరాట్ ఈ చీరల్లో ఏది బాగుంది కొంచెం చూసి చెప్పు" అన్నారు. నాకు కంగారుపుట్టింది. ఇంతలో మాలతిగారు కలగజేసుకొని "మగపిల్లాడు అతనికేం తెలుస్తాయి ఆడవాళ్ళ చీరల సంగతి" అని తేల్చేశారు. అదే నాకు కావలసింది. వెంటనే అక్కడనుండి బయటకు వచ్చేశాను. మాలతీచందూర్ గారి ఈ వ్యాఖ్య విన్నాక నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఏదో సందర్భంలో దొరైసామి రోడ్ చివర ఒక మేడమీద పోర్షన్ లో వుండే పామర్తిగారింటికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయనలేరు. ఆయన సతీమణికి అర్జంటుగా ఒక జాకెట్ గుడ్డ కావలసివచ్చి నన్ను కొనుక్కొని తేగలవా అని అడిగారు. ఏ రంగైనా, ఏ వెరైటీ అయినా ఫర్వాలేదు అంటూ కొంత పైకం ఇచ్చారు. నేను పానగల్ పార్క్ దగ్గర వుండే పాత కుమరన్ స్టోర్ లో ఒక అరగంటసేపు ఆడవాళ్ళలాగే ఇదికాదు అది, అదికాదు ఇదని అన్ని బిట్స్ లాగించి చివరకేదో నాకు బాగుందనిపించినదానిని కొని తీసుకువెళ్ళి ఆవిడకు ఇచ్చాను. ఆవిడ నేను కొన్న బట్ట చూసి "నీకొచ్చే భార్య ఎవరోకానీ మహా అదృష్టవంతురాలయ్యా! ఆ పిల్ల బజార్ కు వెళ్ళే పనేలేదు" అంటూ మెచ్చుకున్నారు. ఇప్పుడు మాలతీచందూర్ గారి వ్యాఖ్య విన్నాక ఆ పాత సంఘటన గుర్తుకు వచ్చింది.

డి.ఎన్.రావుగారు USEFI డైరక్టర్ గా వున్నరోజుల్లోననే జ్ఞాపకం, జాన్ బి. హిగిన్స్ అనే అమెరికన్ ఫుల్ బ్రైట్ స్కాలర్ షిప్ లో మద్రాసులో కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. ఆయన అప్పటికే వెస్టర్న్ మ్యూజిక్ లో పిజి చేసారు. ఆయన మద్రాస్ లో తంజావూరు విశ్వనాథన్. అతని సోదరి ప్రముఖ భరతనాట్య కళాకారిణి టి.బాలసరస్వతి శిష్యరికంలో కర్ణాటక సంగీతంలో నిష్ణాతుడై డాక్టరేట్ పొందారు. జాన్ హిగిన్స్ గాత్రం విన్నవారెవరూ అతను ఒక విదేశీయుడనుకోరు. పూర్తి దక్షిణాది సంప్రదాయపధ్ధతి వేషధారణ తో వేదిక మీద పద్మాసనం వేసుకొని అతను మూడు గంటల సేపు కర్ణాటక సంగీత కచ్చేరీ చేస్తూంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. మానాన్నగారు అతని పట్టుదలకు, మన సంగీతం పట్ల అతనికి వున్న శ్రధ్ధాభక్తులకు ఎంతగానో ముచ్చటపడేవారు. ఆ శ్రధ్ధాభక్తులు మనవాళ్ళలో కనిపించడంలేదని కూడా అనేవారు. జాన్ హిగిన్స్ దక్షిణాదిన ఉన్న ప్రఖ్యాత సంగీత సభలన్నిటిలో కచేరీలు చేశారు. తమిళ సంగీత రసికులంతా ఆయనను 'హిగిన్స్ భాగవతార్' అని ప్రేమతో పిలిచేవారు. 

🌅🌿🌄

ఘంటసాలవారు బయట ప్రపంచానికి ఎంతటి పేరుప్రఖ్యాతులు గల గాయకుడైనప్పటికీ ఆయన చాలా నిరాడంబంరంగా వుండేవారు. నెం.35, ఉస్మాన్ రోడ్ ఇంటి వాతావరణం అలాగేవుండేది. ఏవిధమైన ఆడంబరం, డాంబికం కనిపించేవికావు. ఇంటి పైన మరో అంతస్తు కట్టించినా అదీ క్రిందింటిలాగే వుంచారు తప్ప ఏవిధమైన ఇంటీరియర్ డెకరేషన్స్ జోలికి పోనేలేదు. మెయిన్ హాల్లో మాత్రం తూర్పు దక్షిణాలు కలిసే గోడ దగ్గర అర్ధచంద్రాకారంలో ఒక చిన్న వుడెన్ టీపాయ్ చేయించిపెట్టారు. క్రింది హాల్లో ఉండే జలాల్ కంపెనీవారి సిల్వర్ డయల్ చైమింగ్ గోడగడియారం పై హాలు గోడను అలంకరించింది. ఆ గడియారం ప్రతీ పావుగంటకు బకింగ్ హాం పేలస్ బిగ్ బెన్ చైమింగ్ గంటలతో మ్రోగేది. ఒకసారి మ్రోగితే పావుగంట, అరగంటఅయితే రెండుసార్లు, ముప్పావు గంట అయితే మూడుసార్లు, గంట అయితే, అప్పుడు ఎన్నిగంటలో అన్నిసార్లు ఘంటసాలవారి గళంలాగే ఆ గంట మ్రోగేది. 

గోడకు మరోవైపు G.K.Vale&Co వారు తీసిన ఘంటసాలవారు, సావిత్రమ్మగార్ల జంట ఫోటోలు పెద్దవి ఉండేవి. ఇవికాక కొత్తగా మాస్టారి ఆయిల్ పెయింట్ ఫోటో ఒకటి వచ్చింది. అది బహుశా ప్రముఖ చిత్రకారుడు గెనిసెట్టి వేసిన చిత్రమే అయ్యుండాలి. మాస్టారి అభిరుచుల మేరకు గెనిసెట్టిగారు వేసినవే శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్, ఆయిల్ పెయింట్స్ తో పాటు మరో పెద్ద సీనరీ పటం కూడా మేడమీది హాలులోకి అదనంగా వచ్చి చేరాయి. పెద్దబాబు పుట్టినప్పుడెప్పుడో కొన్నఆకుపచ్చ తెలుపు చారల దూది సోఫాసెట్లు మేడమీదిల్లు కట్టాక మారాయి. పాతవాటికి బదులు  పేమ్ తో అల్లిన వుడెన్ సోఫాసెట్ స్కైబ్లూ కలర్ మెత్తలు, గలీబులతో గోడ రంగులతో పోటీపడుతూ కనిపించేవి. రెండుగోడల కార్నర్ లో వుండే ఆ కొత్త టీపాయ్ మీద ఓ చిన్న ఫ్లవర్ వాజ్, దానికి రెండుప్రక్కలా ఓ రెండు ఏనుగు బొమ్మలు వుండేవి. అందులో ఒక ఏనుగుకు ఒక పక్క దంతం విరిగిపోయివుండేది.

ఘంటసాలవారింటికి వాచ్ మేన్, గూర్ఖా అంటూ ఎవరినీ నియమించుకోలేదు. మాస్టారిని చూడ్డానికి సినీమా కంపెనీలవాళ్ళో, కోరస్ పాడేవాళ్ళో, ఆర్కెస్ట్రావాళ్ళో, అభిమానులో, ఎవరో ఒకరు  నిరంతరం వస్తూనే వుంటారు. తనకు వాళ్ళకు మధ్య ఒక అడ్డుగోడలా ఒక గూర్ఖాను పెట్టుకోవడం మాస్టారికి ఇష్టంవుండేదికాదు. 

ఒకరోజు సాయంత్రం ఆరు గంటల వేళ ఒకతను వచ్చాడు. బయటవూరినుంచి వచ్చానని, ఘంటసాలవారి అభిమానినని ఆయనను చూడాలని అడిగాడు. ఆ సమయంలో మాస్టారు ఇంట్లోలేరు. ఆ విషయమే ఎవరో చెప్పి చూడాలనుకుంటే మర్నాటి ఉదయం రమ్మన్నారు. చాలా దూరంనుండి వస్తున్నానని దాహంగా వుంది. కొంచెం మంచినీళ్ళివ్వమని అడిగాడు. గుండుమామయ్య మంచినీళ్ళు తెచ్చేలోపు ఆ మనిషి మాయమయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత క్రింద గేట్ దగ్గర గోల వినపడింది. ఏమిటాని వెళ్ళి చూశాము. ఎవరో ఒక మనిషిని మావయ్యకృష్ణో లేక సుబ్బారావో సరిగా గుర్తులేదు, పట్టుకొని గదమాయిస్తున్నారు. ఆ మనిషి చేతిలో మేడమీది హాలులోని ఒక ఏనుగు బొమ్మ కనిపించింది. మంచినీళ్ళని అడిగి తెచ్చేలోగా ఆ బొమ్మతో ఉడాయించాలని చూశాడు. ఈ ఏనుగు ఒక్కటే అందుబాటుగా దొరికింది. వాడిని నాలుగు తన్ని టి.నగర్ బస్ స్టాండ్ దగ్గర మాడ్లీ రోడ్ పోలిస్ స్టేషన్ కు లాక్కెళ్ళారు. నరసింగ, నేనూ కూడా వెళ్ళాము. అక్కడ మావాళ్ళకు తెలిసిన  బీట్ కానిస్టేబుల్ కనపడ్డాడు. పండగలకు పబ్బాలకు ఇంటికొచ్చినప్పుడు చూసేవాడిని.  అతను జరిగిన విషయం తెలుసుకొని ఆ వచ్చినవాడిని గదమాయించేప్పటికి ఏనుగు బొమ్మను తీసినట్లు ఒప్పుకున్నాడు. ఆ సమయానికి ఎస్.ఐ లేడు. ఒక గంటసేపు వాడిని లాకప్ లో వుంచి ఎస్.ఐ వచ్చాక విషయమంతా చెప్పి మరో రెండు లాగించారు.

💥కొసమెరుపు:
చివరకు జరిగిందేమిటంటే దొంగలింపబడిన వస్తువు విలువ దృష్ట్యా వాడిని ఒదిలేయడమే ఉత్తమమని లేకపోతే వాడిని లాకప్ వుంచినంతకాలం వాడి భోజనవసతులు వంటి ఖర్ఛులన్నీ  మనమే భరించవలసి వుంటుందనేలాటి కబుర్లేవో చెప్పి ఆ ఏనుగు బొమ్మను దొంగలించినవాడికి గట్టిగా బుధ్ధి చెప్పి వదిలేశారు. ఇది జరిగేకే అని గుర్తు, మరింత భద్రతకోసం మేడమీది ఇంటి ప్రధాన ద్వారానికి అదనంగా ఒక గ్రిల్  డోర్ అమర్చడం జరిగింది.

మరికొన్ని విషయాలతో... వచ్చే వారం.....
       ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, August 22, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై అయిదవ భాగం

22.08.2021 -  ఆదివారం భాగం - 45*:
అధ్యాయం 2 భాగం 44  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నేను పుట్టాను. ఈ లోకం నవ్వింది. నిజం. మనసారా నవ్వుకోవడమే కాదు, సంబరాలు జరుపుకుంది. నేను పుట్టిన మూడు వారాలకు ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన రెండవ ప్రపంచయుధ్ధం ముగిసింది. శాంతియుత వాతావరణానికి శుభోదయమయింది.

నేను పుట్టిన కొన్ని మాసాలకు ముందే లలితసంగీత వినీలాకాశంలో మహాకాంతివంతమైన తార దర్శనమిచ్చింది.  తన విలక్షణమైన కంఠస్వరంతో, అనితరసాధ్యమైన గానప్రతిభతో రసహృదయులను తన్మయులనుజేసింది. ఆనంద పరవశులనుజేసింది. ఈనాటికీ లలిత సంగీతప్రపంచంలో సాటిలేని మేటి ధృవతారగా వెలుగొందుతూనేవుంది.

ఎవరా ధృవతార? 

ఇంటింటా గంట గంటకూ కంచుఘంటలా మార్మోగే కంఠస్వరం కలిగిన గాన గంధర్వుడు ఘంటసాలే ఆ ధృవతార. అటువంటి మహోన్నతగాయకుని ఇంటి ప్రాంగణంలో వారి కనుసన్నలలో రెండు దశాబ్దాల కాలం సన్నిహితంగా మెలగిన అదృష్టవంతుడిని నేను. 

నేను పుట్టాక, నాకు ఊహ తెలిసాక నేను విన్న మొట్టమొదటి పాట ఘంటసాలవారిదే. అదే "పలుకరాదటే చిలకా". కలివరం గంగుల అప్పలనాయుడుగారింటి బాకా గ్రామఫోను లోనుండి వెలువడి నాగావళీ ఏటి గాలి తరంగాలలో తేలియాడుతూ నా చెవులకు సోకిన తొలి మధురగీతం. ఈ పాట పాడేనాటికి గాయకుడిగా ఘంటసాల వయసు ఐదేళ్ళే. నా వయసు ఐదేళ్ళే. 

1944 లో ఒక అనామక గాయకుడిగా చిత్ర రంగప్రవేశం చేసిన వామనమూర్తి (కొందరికి) ఘంటసాల వెంకటేశ్వర్లుగా, ఘంటసాల వెంకటేశ్వరరావుగా, జి.వి.రావుగా, అంచెలంచెలుగా ఎదిగి ఘంటసాల అనే గాన త్రివిక్రముడిగా దిగంతాలకెదిగి అక్కడే ధృవతారగా స్థిరపడి అక్కడినుండే  తన గానామృతాన్ని ఈలోకంలో ఈనాటికి పంచిపెడుతూ గానప్రియులకు మహదానాందాన్ని, రసానుభూతి ని కలిగిస్తున్నాడు.

ఘంటసాల ఈ స్థితికి చేరుకోవడానికి కారణకర్తలైన మహానుభావులెందరో.

జన్మనిచ్చిన ఘంటసాల సూర్యనారాయణ, రత్తమ్మ దంపతులు, పెరిగి పెద్దవడానికి దోహదపడిన మేనమామ ర్యాలి పిచ్చిరామయ్యగారు, నాలుగైదేళ్ళపాటు తన సొంత బిడ్డలా సాకి సంగీత విద్యను నేర్పిన గురువర్యులు పట్రాయని సీతారామశాస్త్రి గారు, తన విద్యాకాలంలో అన్నం పెట్టి ఆదుకున్న విజయనగరం అన్నదాతలు,  మద్రాస్ చలనచిత్ర రంగంలో కాలూనడానికి చేయూతనిచ్చిన మాన్యశ్రీ - సముద్రాల రాఘవాచార్యులవారు, బృందగానాలలో పాడడానికి, తన సినీమా లో చిల్లర వేషాలు వేయడానికి అవకాశం కల్పించి, నెల జీతమిచ్చి ఆదుకున్న ప్రతిభా బలరామయ్యగారు (ఘంటసాల) (ఇద్దరిదీ వేర్వేరు కులం. కానీ ఇద్దరిదీ ఒకటే కులం - సినీమా కులం),  రేణుకా కంపెనీ చిత్తూరు వి నాగయ్య, ఆలిండియా రేడియో ద్వారా తన కంఠాన్ని తెలుగువారికి పరిచయం చేసి నిరంతర జీవనోపాధి కల్పించిన బాలాంత్రపు రజనీకాంతరావుగారు, గాయకుడిగా సినీమాలలో తొలి అవకాశం కల్పించిన దర్శకనిర్మాత శ్రీ బి ఎన్ రెడ్డి , సంగీత దర్శకుడు శ్రీ చిత్తూరు వి.నాగయ్య, సహాయ సంగీతదర్శకుడిగా పరిచయం చేసిన భరణీ భానుమతి, రామకృష్ణారావు దంపతులు - వీరు చూపించిన ఆదరణ, సహాయ సహకారాలు, ప్రేమానురాగాల గురించి ఘంటసాలవారు తలచుకోని క్షణమేలేదు. తన ప్రతీ ఇంటర్వ్యూలలో వీరందరికి తన కృతజ్ఞతలు తెలుపుకున్న గొప్ప సహృదయుడు శ్రీ ఘంటసాల.

వీరితోపాటూ తన పురోభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడిన మరో ప్రముఖ వ్యక్తి పేకేటి శివరాం. ప్రతిభా పిక్చర్స్ ప్రొడక్షన్ మేనేజర్ గా ఘంటసాల వెంకటేశ్వరరావును తమ యజమాని ఘంటసాల బలరామయ్యగారికి పరిచయం చేసి అక్కడ ఒక చోటు లభించేలా తోడ్పడిన సహృదయుడు. 



మరాఠీ బాణి రంగస్థల నాటక పద్యాలకు, దాక్షిణాత్య యాసతో కూడిన సంప్రదాయ సంగీత విద్వాంసుల పాటలకు అలవాటు పడ్డ హిస్ మాస్టర్స్ వాయిస్ (HMV) కార్యక్రమ నిర్వాహకుల చెవులకు ఘంటసాల యొక్క వైవిధ్యభరితమైన, విలక్షణమైన పాట, పద్యం నచ్చలేదట. ఘంటసాలను తిరస్కరించారట. సహజమే. అక్కడున్నవారి సంగీత సంస్కారం అంతవరకే. తర్వాత, ప్రతిభాలో పనిచేసిన పేకేటి హెచ్.ఎమ్.వి.కి ప్రోగ్రామ్ ఎక్సిక్యూటివ్ గా రావడం జరిగింది. వెంటనే, పేకేటి శివరాంగారు శ్రీఘంటసాలగారిని పిలిపించి 'నగుమోమునకు నీ నిశాబింబము' అనే పద్యాన్ని, 'గాలిలో నా బ్రతుకు' పాటను రికార్డ్ చేయించారు. అవే ఘంటసాలవారి రికార్డైన మొదటి పాట, పద్యము. 


కానీ ఇవి ప్రజల మధ్య రావడానికి ముందేస్వర్గసీమ సినీమా విడుదలై భానుమతి గారితో కలసి పాడిన గాజులపిల్ల పాట తెలుగు జనాలకు చేరింది.  ఇదంతా నేను పుట్టిన సంవత్సరంలోనే జరిగింది. 


ఆ రోజుల్లో హెచ్.ఎమ్.వి.వారి పాటలు మెడ్రాస్ లోనే రికార్డ్ చేసినా వాటి ప్రాసెసింగ్, ఫైనల్ రికార్డ్ గా విడుదల కావడం అంతా కలకత్తా డమ్ డమ్ లో జరిగేది. ఆ కారణంగా ఘంటసాలగారి మొదటి పాట, పద్యం ఆ మరుసటి సంవత్సరం తెలుగు శ్రోతల శ్రవణాలకు చేరింది. అంతే, గాయకుడిగా ఘంటసాల పేరు మార్మోగింది. ప్రతీ మూడు మాసాలకు ఒకసారి ఘంటసాల ప్రైవేట్ రికార్డ్ లను విధిగా విడుదల చేయడం మొదలుపెట్టారు. ఘంటసాలవారి కరుణశ్రీ పద్యాలు, తిరుపతి వెంకటేశ్వరుడిమీద భక్తిగీతాలు తెలుగునాట ఎంతటి సంచలనం సృష్టించాయో, ఎంతటి ప్రజాదరణ పొందాయో జగమంతటికి తెలుసు.

ఈ విధంగా ఆదిలో ఘంటసాలవారి గానవిశిష్టత ను ప్రజలకు చేరవేయడంలో  పేకేటి ప్రముఖ పాత్ర వహించారని చెప్పాలి.

తర్వాతి కాలంలో పేకేటి నటుడిగా మారారు. ఘంటసాల గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఉన్నతశిఖరాలకు ఎదిగిపోయారు. పేకేటి నటించిన సినిమాలలో ఘంటసాల మాస్టారు పాడిన పాటలు ఏవీ లేవనే అనుకుంటాను. విన్న గుర్తులేదు. 

పేకేటి నటుడిగా కన్నా కార్యనిర్వాహకుడిగా బహు ప్రజ్ఞావంతుడు. ఈనాడు అందరూ అనే పబ్లిక్ రిలేషన్స్ లో అందెవేసిన చేయి. సినీమారంగం, ముఖ్యంగా ఎన్.టి.రామారావు నిర్వహించిన అనేక సంక్షేమ కార్యక్రమాలలో పేకేటి ప్రముఖ పాత్ర వహించేవారు. విదేశాలలో ఆయనకు మంచి పరిచయాలుండేవంటారు. ఫారిన్ లొకేషన్స్ లో సినీమా ఔట్ డోర్ షూటింగ్ లు నిర్విఘ్నంగా జరగాలంటే పేకేటిని సంప్రదిస్తే సునాయాసంగా జరిగిపోతాయనే ఖ్యాతి ఆయనకు వుండేది. ఘంటసాలవారు నిర్మాతగా తాను తీసిన 'భక్త రఘునాథ్' చిత్రంలో పేకేటి కూడా నటించారు. ఇటీవలే దివంగతురాలైన సుప్రసిధ్ధ బహుభాషా నటీమణి జయంతిని కమలకుమారిగా ఉన్న రోజులలో సినీమా రంగానికి పరిచయం చేసినది పేకేటి శివరామే. ఆమె తొలి చిత్రాలలో ఘంటసాలవారి 'భక్త రఘునాథ్' కూడా ఒకటి. ఆ తర్వాత ఘంటసాల, పేకేటి కలసి పనిచేసే అవకాశమే రాలేదు.

🌿


శ్రీదేవీ ప్రొడక్షన్స్ తోట సుబ్బారావు గారి కోట్స్ రోడ్ ఆఫీసులో తమ కొత్త సినీమా పాటల కంపోజింగ్ మొదలయింది. ఆ బ్యానర్ తీసిన అన్ని సినీమాలకు ఘంటసాలవారే సంగీత దర్శకత్వం వహించారు. ఆ పాటల కంపోజింగ్ సమయంలో పేకేటి శివరాంగారిని అక్కడ చూడడం జరిగింది. ఆయన ఆ సినీమాలో ఏక్ట్ చేస్తున్నారేమోనని భావించాను. కాని రెండు మూడుసార్లు వరసగా ఆయన అక్కడ కనిపించి పాటల కంపోజింగ్ లో పాల్గొని ఆ సినిమా గురించి వివరించినప్పుడు తెలిసింది ఆ సినీమాకు డైరక్టర్ పేకేటి అని. అదొక కన్నడ సినిమాకు రీమేక్. రాజ్ కుమార్, జయంతిలతో వచ్చిన ఒక నవలా చిత్రం ' చక్రతీర్థ'. ఆ సినీమాకు కూడా పేకేటి శివరామే డైరక్షన్. ఆ సినీమా రైట్స్ కొని శ్రీదేవి తోట సుబ్బారావుగారు తెలుగులో 'చుట్టరికాలు' గా మొదలుపెట్టారు. జగ్గయ్య జయంతి ఒక జంట. గుమ్మడి, హేమలత ఒక జంట. కాంతారావు, కృష్ణకుమారి ఒక జంట.  

సెకెండ్ హీరో శోభన్ బాబుకు జోడీగా ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేశారు. ఆ అమ్మాయే లక్ష్మి. తర్వాతి కాలంలో  సర్వ సమర్థురాలైన బహుభాషానటిగా పేరు పొందారు.  నిన్న మొన్నటి 'మిథునం' సినీమాలో కూడా లక్ష్మి అసామాన్యమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆమె తండ్రి వై.వి.రావు, తల్లి రుక్మిణి కూడా మొదటి తరం తారలు. లక్ష్మి (భర్తలు కూడా సినీమా నటులే.) కుమార్తె ఐశ్వర్య కూడా అనేక తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది.

నవలలు ఆధారంగా తీసుకొని తీసే చిత్రాలలో ఎక్కువగా మెలోడ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువుంటాయి.  ఆనాటి మహిళా ప్రేక్షకులు అలాటి కుటుంబ కధా చిత్రాలనే ఆదరించేవారు. అలాటి చిత్రమే ' చుట్టరికాలు'. ఈ సినిమాలో పాటలను ఆనాటి మేటి గీత రచయితలైన దాశరధి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, శ్రీశ్రీ వ్రాసారు. ఈ పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ కూడా విజయాగార్డెన్స్ లో సౌండ్ ఇంజనీర్ ఆర్.స్వామినాథన్ పర్యవేక్షణలోనే జరిగాయి. స్వామినాథన్ తమిళుడు. ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ మూతి బిగించుకునేవుంటారు. కారణం సదా ఆయన నోటినిండా తాంబూలం ఉంటుంది. నోరు విప్పరు. ఐదేసి నిముషాలకు ఒకసారి లేచి బయటకు వెళ్ళి నోరు కడుక్కొని వచ్చేవారు. మరల మరో రెండు మూడు నిముషాల్లో మళ్ళీ తమలపాకులు నోటినిండా దట్టించేవారు. ఆయన పక్కనే ఘంటసాల మాస్టారు కూర్చొని ఆడిటోరియంలోని ఆర్కెష్ట్రావారికి సూచనలు ఇచ్చేవారు. చుట్టరికాలు సినీమాలోని పాటలు గొప్ప హిట్సని చెప్పలేము. కానీ, ఘంటసాల సుశీల పాడిన 'నీవే నా కనులలో',

'అందాల అలివేణివి' 



పి.బి.శ్రీనివాస్, సుశీల పాడిన 'ఏమిటో ఈ వింత ఎందుకో పులకింత', 

ఘంటసాలగారు పాడిన సోలో "గాలి వీచెను అలలు లేచెను", 

ఎల్లారీశ్వరి , సుశీల "ఆడవా ఆటాడవా ఎగిరి ఎగిరి గంతులేసి..." వంటి పాటలు ఘంటసాలవారి మినిమమ్ గ్యారెంటీతో శ్రావ్యంగా వినసొంపుగా వుంటాయి. సినీమా అంటే కేవలం వినోదం మాత్రమేనని ఆశించి వెళ్ళే ప్రేక్షకులకు  నచ్చని అంశం ఈ సినీమాలోని మూడు ప్రధాన పాత్రలను చంపేసి సినీమాను శోకమయం చేయడం. సమైక్యాంధ్రదేశంలో తెలుగు ప్రేక్షకులు 'చుట్టరికాలు' ను ఎంతవరకు ఆదరించారో తెలుసుకునే అవకాశం, ఉద్యోగాల వేటలో పడిన,  నాకు కలగలేదు. తోట సుబ్బారావుగారు మాత్రం తమ చిత్ర నిర్మాణం కొనసాగించారు.

🌺

' పి బి టి డి చె జె కె గె '

పై అక్షరాలు మీకు ఏమైనా గుర్తు చేస్తున్నాయా ?

నేను ఆంధ్రా సిమెంట్స్ లో పనిచేసిన నెల రోజులలో నాకు ఒక విషయం అర్ధమయింది. ఒక సుమారైన ఉద్యోగం దొరకాలంటే నాకున్న అర్హతలు చాలవు. మరింకేదైనా సర్టిఫికెట్లు సంపాదించాలి. టైపిస్ట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళితే బుక్కీంపింగ్ తెలుసా? షార్ట్ హ్యాండ్ తెలుసా? అని అడిగేవారు. ఒకసారి IDPL-SIP (Surgical Instruments Plant-Chennai)లో పనిచేస్తున్న మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు వీకెండ్స్ కు టి.నగర్ అన్నగారింటికి వచ్చినప్పుడు మౌంట్ రోడ్ లో శ్రీరామ్ గ్రూప్ వాళ్ళు కొత్తగా ఏదో ఆఫీసు తెరిచారట, అందులో ఏవో ఉద్యోగాలకు ఖాళీలున్నాయట, వెళ్ళి చూడమని సలహా ఇచ్చారు. పూర్తి వివరాలు ఆయనకు తెలియవు. మౌంట్ రోడ్ ఎల్.ఐ.సి.కి దగ్గరలో వుందని మాత్రం చెప్పారు. సరేనని ఒక రోజు ఉదయం తొమ్మిది తర్వాత పానగల్ పార్క్ దగ్గర 11వ నెంబర్ బస్ పట్టుకొని మౌంట్ రోడ్  ఆర్ట్స్ కాలేజ్ స్టాపింగ్ లో దిగి రోడ్ క్రాస్ చేసి ఎల్.ఐ.సి. బిల్డింగ్ వరసలో ఎక్కడైనా శ్రీరామ్ పేరిట ఏవైనా కంపెనీలు వున్నాయేమోనని తెగ వెతికాను. ఎక్కడా ఆ పేరుతో ఏ ఆఫీసు బోర్డ్  కనపడలేదు. ఆ చుట్టుపక్కలున్న రోడ్లన్నీ గాలించినా ఆ పేరుతో ఏదీ కనపడలేదు. ఇక విసుగెత్తి తిరిగి ఎల్.ఐ.సి. దగ్గర టి.నగర్ బస్ పట్టుకుందామని గోవ్ బిల్డింగ్ పక్కనుండి వస్తూంటే ఒక దగ్గర ఉషా కంపెనీ బోర్డ్ కనిపించింది. "ఉష" అంటే ఆ రోజుల్లో కుట్టుమిషన్లకు, ఫ్యాన్లకు చాలా ప్రసిధ్ధి. ఆ ఆఫీసు ఒక మేడమీద వుండేది. అందులో పనిచేసే వాళ్ళెవరో ఇద్దరు క్రింద నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళదగ్గరకు వెళ్ళి అడిగాను ఈ శ్రీరామ్ వినైల్స్ కంపెనీ ఎడ్రస్ గురించి. నా అదృష్టం. ఆ కంపెనీ ఆ మేడ మీదే వుందని చెప్పారు. మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్ళాను. ఆ ఆఫీసు ఒక మూలగా ఒకే ఒక పాతగదిలో వుంది. అక్కడ ఎవరూ కనపడలేదు. కొంతసేపు అక్కడే తచ్చాడుతుండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను ఏం కావాలని అడిగాడు. అతను తెలుగో, తమిళియనో కాదు. నార్త్ ఇండియన్. అతనే ప్రస్తుతం అక్కడి ఆఫీస్ ఇన్ ఛార్జ్. స్టాఫ్ ఇంకా నియమించబడలేదు. వచ్చిన విషయం తడబడుతూ ఇంగ్లీష్ లో చెప్పాను. తమకు ప్రస్తుతం వెంటనే ఒక స్టోర్ కీపర్ కావాలని, అందులో నా అనుభవం గురించి అడిగాడు. పైగా ఆ ఉద్యోగంలో చేరిన వెంటనే 7000 రూపాయలు సెక్యూరిటి డిపాజిట్ కట్టాలని ఏవో రూల్స్, కండిషన్స్ చెప్పడం మొదలెట్టాడు. స్టెనోగ్రఫీ వచ్చా అని అడిగాడు.  అతను అడిగిన అనుభవమూ లేదు, ఏడువేలు డిపాజిట్ కట్టే స్థోమతాలేదు. కిక్కురుమనకుండా  అతనికి ఒక ధ్యాంక్స్ చెప్పేసి తిరిగి చూడకుండా ఇంటిమార్గం పట్టాను. 

🍀

ధైర్యం చేసి ఏదైనా మంచి  సినీమా కంపెనీలో ఏ అసిస్టెంట్ గానైనా చేరితే ఎలావుంటుంది అనే ఆలోచన పురుగులా నా మెదడును దొలచడం మొదలెట్టింది. ఇందుకు ఘంటసాల మాస్టారితో మాట్లాడమని మా నాన్నగారిని అడిగితే... ఒప్పుకుంటారా? ఇద్దరూ ససేమిరా ఒప్పుకోరు. వేరే మార్గాలు చూడవలసిందే. ఏ ఉద్యోగం రావాలన్నా మరేవైనా క్వాలిఫికేషన్లు సంపాదించాలి. ఇక ఆ ప్రయత్నాలు మొదలెట్టాలనే నిర్ణయానికి వచ్చాను. 

పానగల్ పార్క్ దగ్గర ఇప్పుడున్న నల్లీస్ 100, పోతీస్, ఫ్లైఓవర్  ఆ రోజుల్లో లేవు. దొరైసామి రోడ్ కు మంగేష్ స్ట్రీట్ కు మధ్య సలామ్ స్టోర్స్, రామన్స్ కాఫీ వర్క్స్, పార్క్ హెయిర్ డ్రెసెస్ వంటివి వుండేవి. ఆ పక్కనే ఒక మేడ మీద 'నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్' అని ఎర్రటి బోర్డ్ మీద తెల్లటి అక్షరాలతో వ్రాసి వుంది. అక్కడ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, బుక్ కీపింగ్ వంటి కోర్స్ లకు కోచింగ్ ఇస్తారని వ్రాసి వుంది.  అందులో చేరి షార్ట్ హ్యాండ్, బుక్ కీపింగ్ కోర్స్ లు చేయాలనే నిర్ణయానికి వచ్చి నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లో చేరాను. వాళ్ళు షార్ట్ హ్యాండ్ కు పిట్స్మన్ బుక్,  లాంగ్ నోట్ బుక్, పెన్సిల్, ఎక్కౌంట్స్ కు మరేవో పుస్తకాలు కొనుక్కోమని ఒక లిస్ట్ ఇచ్చారు. రోజుకు రెండు గంటలు. ఇదో గంట, అదో గంట. ఇంటికి దగ్గరే కావడం వలన వెళ్ళి రావడం సమస్య కాదు. ముందుగా కోచింగ్ సెంటర్లో కొనమన్న పుస్తకాలు సంపాదించాలి. అందుకు ముందుగా మా నరసింగడిని సంప్రదించాను. నా అదృష్టం. అతను తన దగ్గరున్న పిట్స్మన్ షార్ట్ హాండ్ టెక్స్ట్ బుక్ ఉదారంగా ఉచితంగా ఇచ్చేసాడు. అతను కొన్నాళ్ళు  షార్ట్ హ్యాండ్ ప్రాక్టీసు చేసి అతనివల్ల కుదరక స్వస్తి చెప్పేసాడట. అతనిచ్చిన ఆ పుస్తకం పట్టుకొని ఓ మంచిరోజు చూసి నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లో చేరాను.

మొదటిరోజు క్లాసుకు నాలాటివారే నలుగురైదుగురు కొత్తవాళ్ళు వచ్చారు. మధ్య వయసులో వుండే ఒకాయన టీచర్ .  ఆయన  బోర్డ్ మీద కొన్ని గీతలు నిలువుగా, అడ్డంగా, వంపుగా, లైట్ గా,థిక్ గా వ్రాసి  pee bee tee dee che jay kay gay అంటూ వ్రాసి చూపించి పెన్సిల్ తో అలాగే వ్రాయడం ప్రాక్టీసు చేయమన్నారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ a b c d లు కాకుండా ఈ పీ బీ టీ డీల వరసేమిటో అర్ధం కాలేదు. షార్ట్ హాండ్ అంతా సింబల్స్ కోడ్స్ తోనే నిండివుంటుంది. అవన్నీ అర్ధం చేసుకోవడానికే నాకు చాలా రోజులు పట్టింది. అలాగే, బుక్ కీపింగ్ అంతా లెఖ్ఖల మయంగా కనిపించింది. డెబిట్, క్రెడిట్, ప్రాఫిట్, లాస్, ఇన్కమ్, ఎక్స్ పెండిచర్, ఎస్సెట్స్, లయబిలిటీస్, జర్నల్ ఎంట్రీస్, బ్యాలన్స్ షీట్ -- ఇవేవీ నా బుర్రకెక్కలేదు.  కొన్నాళ్ళు కష్టపడి ప్రయత్నించినా నాకంతా అయోమయంగానే వుండిపోయింది. దానితో బుక్కీపింగ్ కు స్వస్తిపలికి షార్ట్ హాండ్ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను. అలాగే టైప్ రైటింగ్ 100 వర్డ్స్ టెస్ట్ కు వెళ్ళడానికి టైప్ రైటింగ్ మొదలెట్టాను. కనీసం ఒక ఏడాదైనా బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప పరీక్షలకు వెళ్ళే అర్హత రాదు. 

ఇలా షార్ట్ హాండ్, హైస్పీడ్ టైపింగ్ లతో కాలం వెళ్ళదీస్తున్న కాలంలో ఒక రోజు మా నాన్నగారు నన్ను డా.డి.ఎన్.రావుగారిని వెళ్ళి కలవమని చెప్పారు. నా గుండెల్లో రాయి పడింది.

ఆ విశేషాలేమీటో వచ్చేవారం ... 

             ... సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, August 15, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై నాలుగవ భాగం

15.08.2021 - ఆదివారం భాగం - 44*:
అధ్యాయం 2  భాగం 43 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


డెబ్భై అయిదవ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా స్వతంత్ర భారతావనికి అభినందనలు


35, ఉస్మాన్ రోడ్డు టెర్రస్ మీద ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు మువ్వన్నెల జెండా ఎగిరేది.

ఘంటసాలవారు ఉన్న కాలంనాటికి తెలుగు సినీమాల నిర్మాణం తక్కువగానే ఉండేది. 1970ల నాటికి అధికపక్షంగా సుమారుగా  సంవత్సరానికి 70 సినీమాలు విడుదల అయేవి. వాటిలో ఓ పది డబ్బింగ్ చిత్రాలు. తెలుగు సినీమా మొదటి దశలో ప్రతీ సినీమాలో పాటల సంఖ్య అధికంగానే వుండేది. పౌరాణిక చిత్రాలైతే పాటలు, పద్యాలు అధికసంఖ్యలోనే పెట్టేవారు. ఆనాటి పాటలన్నీ కూడా ఒక్కొక్కటి మూడు నిముషాలలోపే ఉండేవి. 1970లు వచ్చేసరికి తెలుగు సినీమాలలో పాటల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒక్కో సినీమాకు ఆరేడు పాటలకంటే ఎక్కువ పెట్టడం మానేసారు. 

ఘంటసాల మాస్టారి కాలంనాటికి గాయనీగాయకులు, సంగీతదర్శకులు అధికసంఖ్యలోనే వుండేవారు. ఆనాటి తెలుగు సినీమాలు వీరందరికీ సమానమైన వృత్తి అవకాశాలను, ఆదాయాన్ని కల్పించగలిగినదా అంటే లేదనే చెప్పాలి. ఘంటసాలవారితో పాటు, సర్వశ్రీ - ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల, టి.వి.రాజు, టి.చలపతిరావు, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి, సాలూరి హనుమంతరావు, అద్దేపల్లి, ఓరుగంటి, గాలి పెంచల, పామర్తి, విజయాకృష్ణమూర్తిలతో పాటు పరభాషా సంగీత దర్శకులైన కె.వి.మహాదేవన్, ఎమ్.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి, సుదర్శనం-గోవర్ధనం, వేదా, శంకర్-గణేష్, రాజన్-నాగేంద్ర, విజయభాస్కర్, జి.కె.వెంకటేష్, టి.జి.లింగప్ప, శంకర్-జైకిషన్  వంటి సంగీత దర్శకులెందరో ఆనాటి తెలుగు సినీమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వీరితో పాటూ ఓ రెండు మూడు సినీమాలకు మాత్రమే పనిచేసి కనుమరుగైన సంగీత దర్శకులు, 1970ల తర్వాత కొత్తగా పరిచయం కాబడిన సంగీత దర్శకులు మరెందరో కనిపిస్తారు. ఈ మ్యూజిక్ డైరక్టర్లందరికీ ఏడాదిపొడుగునా నిశ్చింతగా కాలం గడపడానికి కావలసిన ఆదాయం లభించేలా సంగీతావకాశాలు లభించేవా అంటే అనుమానాస్పదమే. పైన చెప్పిన సంగీత దర్శకులలో సగం మంది మాత్రమే నిరంతరావకాశాలు కలిగినవారు. అందరు సంగీత దర్శకులకు ఒకే విధమైన  పారితోషకాలు ఉండేవికావు. ఒకరికి పదిహేను వేలయితే, మరొకరికి పదివేలు, ఇంకొకరికి ఏడువేల ఐదొందలు, ఐదువేలు, మూడువేలు, రెండువేలు, పదిహేను వందలకు కూడా పనిచేసే సంగీత దర్శకులుండేవారు. వీరిలోకొంతమంది ఆదాయాలకంటే అనేకమంది సంగీత దర్శకుల దగ్గర పనిచేసే వాద్య కళాకారుల ఆదాయమే గణనీయంగా వుండేది.  నేపథ్యగాయకుల పరిస్థితి ఇలాగే వుండేది. 1965ల వరకూ నేపధ్యగాయకుల పారితోషికం   వారి వారి డిమాండ్ ను బట్టిఒక్కొక్క పాటకు అధిక పక్షం 750/- అయితే అధమపక్షం 200/-గా వుండేది. కొరస్ సింగర్స్ కు అయితే వంద రూపాయల లోపే. ఎవరికీ నికరంగా నెలకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పుకునే ఆస్కారం లేదు.ఱ

ఇదేవిధంగా వాద్యకళాకారుల ఆదాయం కూడా చాలా దయానీయంగానే వుండేది. వాయించే వాద్యాలను బట్టి నలభై రూపాయలనుండి నూరు, నూట ఏభైవరకు మాత్రమే ఇచ్చేవారు. ఎన్నో వందలమంది ఆర్కెష్ట్రా ప్లేయర్స్ వున్నా రోజూ  పని దొరికేది చాలా కొద్దిమందికే. నెలల తరబడి ఏ పని దొరకని సంగీత దర్శకులు,గాయకులు,వాద్యకళాకారులెందరో మద్రాస్ మహానగరంలో అల్లల్లాడుతూండేవారు. ఒక సంఘటన నాకు బాగా గుర్తు నేను కాలేజీలో చేరేముందు ఒకాయన మా నాన్నగారి దగ్గర అప్పుకు వచ్చారు ఒక ఏభై రూపాయలు ఇవ్వమని. మానాన్నగారూ అంత సొమ్ము అప్పుగా ఇచ్చే స్థితిలో లేరు. ఆ వచ్చినాయన చాలా అత్యవసరమని తన దగ్గరున్న వాచీని మా నాన్నగారి చేతిలోపెట్టి, డబ్బు తిరిగి ఇచ్చేవరకూ వాచీని ఉంచుకోమని బలవంతపెట్టి మొత్తానికి తానడిగిన డబ్బును పట్టుకెళ్ళారు. మళ్ళీ ఆ అప్పు తీర్చనూ లేదు. తన వాచీని పట్టుకెళ్ళనూ లేదు. ఆ వాచి చాలా మంచి వాచి. టైటస్ కంపెనీది. ఇప్పటికీ నా దగ్గర వుంది.  ఔటర్ డయల్ మారింది అంతే. ఆ వాచీ ఇప్పటికీ బాగానే పనిచేస్తూ నా కంటే మంచి కండిషన్ లో వుంది. నాకు మొదట్లో అమరిన సైకిలు అలాటిదే. సెకెండ్ హాండ్ లో వచ్చినదే. చాలా ఏళ్ళు ఆ సైకిల్ నన్ను మోసింది. ఈ విధమైన సంగీత కళాకారుల దుస్థితికి సినీ మ్యుజిషియన్స్ యూనియన్  ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా  ఘంటసాల మాస్టారు చాలా ఆవేదన పడేవారు.

తెలుగు చలనచిత్ర సీమలో నెంబర్ వన్ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల మాస్టారు తన  సినీమా పాటలతో, లలిత సంగీత కచ్చేరీలతో, హిస్ మాస్టర్స్ వాయిస్ కంపెనీవారి ప్రైవేట్ రికార్డుల గానంతో  నిరంతరం బిజీగానే వుండేవారు. ఆదాయానికీ ఏ కొరతాలేదు. మొదటినుండి వున్న డయబెటిస్, బి.పి.ల వలన అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. వాటికి నిరంతరం ఏవో మందులు, మాత్రలు వాడేవారు. క్రమక్రమంగా ఓపిక తగ్గుతూండడం వలన సంగీత దర్శకత్వం పట్ల ఆసక్తి సన్నగిల్లుతూ వచ్చింది.  కొత్త  నిర్మాత ల సినీమాలకి సంగీత దర్శకత్వం వహించడానికి సుముఖత చూపలేదు. సంగీత దర్శకత్వం వహించే సమయంలో మరిన్ని పాటలు పాడుకుంటే చాలనే అభిప్రాయం లో వుండేవారు. ముఖ్యంగా, ఘంటసాలగారు సినీమా కంపెనీల చుట్టూ తిరుగుతూ పనికోసం ప్రాకులాడడం అనేది 1950 లకు ముందే మానేసారు. ఘంటసాలే తమ సినీమా పాటలు పాడాలి, ఆయనే మా సినీమాకు సంగీతం చేయాలని వచ్చి అడిగే నిర్మాతలకే చివరివరకూ పనిచేసారు. అలాగే, తననే సంగీతదర్శకుడిగా పెట్టుకుంటామని చెప్పి చివరి క్షణాలలో మరొకరిని తీసుకున్నప్పుడు కూడా ఆయన బాధపడలేదు. మరో సంగీత దర్శకుడికి కొంత ఉపాధి లభించిందని భావించేవారు. ఈ విధమైనటువంటి పరిస్థితులు వ్యక్తిగతంగా ఘంటసాల మాస్టారికి ఇబ్బందులు కలిగించకపోయినా, పూర్తిగా ఆయన సంగీత దర్శకత్వం వహించే సినీమాలకు మాత్రమే పనిచేసే మా నాన్నగారికి, మరో ముగ్గురు వాద్యకళాకారులకు నిరంతరాదాయం లభించని దుస్థితులు ఎదురైనాయి. ఘంటసాలవారు, వారి సతీమణి శ్రీమతి సావిత్రమ్మగారి ఔదార్యం వలన మేము నెం.35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ లో ఉన్నంతవరకూ ఇంటద్దె సమస్య లేకుండా తమ ప్రేమాభిమానాలు మా నాన్నగారిపట్ల, మా కుటుంబంపట్ల కనపర్చారు. 

ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో నా డిగ్రీ పూర్తయింది.

తరువాత ఏం చేయాలి. పి.జి. చేయాలా? అంటే మరో రెండేళ్ళు. అప్పుడు కూడా ఫస్ట్ క్లాసు వస్తేనే ఏదైనా ఓ చిన్న కాలేజీలో  ట్యుటర్  ఉద్యోగం. లేకపోతే టీచర్ ట్రైనింగ్ చేసి బడిపంతులుగా తయారవ్వాలి. మా రోజుల్లో 'బ్రతకలేక బడిపంతులు' అనే నానుడి బహుళ ప్రచారంలో వుంది. అలాగే బి.ఎ. చదువు అంటే కూడా ' బి - బొత్తిగా ఎ - అధ్వానం( బి.ఎ. - బొత్తిగా అధ్వానం) అనే చిన్నచూపు అందరిలోనూ వుండేది. అది ఆనాటి పరిస్థితి. మరి ఈనాటి బడి పంతుళ్ళ జీవన ప్రమాణం చాలా బాగుందనే చెప్పాలి. ('పీత కష్టాలు పీతవి' అన్నట్లుగా వారికుండే సాధకబాధకాలు వారికీ ఉంటాయనుకోండి). కానీ రోజులు మారేయి. అందుకే మా ఈశ్వరుడు (మా శారదక్క కొడుకు) తన తండ్రి తాతలు, అమ్మమ్మల వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడమే కాక తన తమ్ముడిని, తన పిల్లలందరినీ కూడా స్కూల్ టీచర్లుగానే తయారు చేసాడు. మావాడిని పెంచి, చదివించి, పెద్దచేసిన అమ్మమ్మ, మాదొడ్డమ్మగారు కూడా తోటపల్లి కొండలు, శాంతి ఆశ్రమం స్కూల్ లోనే టీచర్ గా పనిచేసారు. ఆవిడ ఒక ఆదర్శ మహిళ. ఆవిడ గురించి ఇక్కడ కాదు. మరొక అధ్యాయంలో ప్రత్యేకంగా రాయాలి.

మొత్తానికి నా మనస్తత్త్వానికి నేను ఉపాధ్యాయుడిగా పనికిరానని తలంపు కలిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా, చిన్నదో చితకదో ఏదో ఒక ఉద్యోగంలో చేరి ఏమాత్రం సంపాదించినా నేను మా నాన్నగారికి  బరువు కాకుండా వుంటాననే సంకల్పం కలిగింది. అయితే ఈ భావాలను స్పష్టంగా ఎవరి దగ్గరా (మా అమ్మగారి దగ్గర కూడా) చెప్పలేకపొవడం నా దౌర్బల్యం. అందుకే నా డిగ్రీ అయ్యాక ఎమ్.ఎ. చేస్తావా అని ఘంటసాలవారు అడిగినప్పుడు ధైర్యంగా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయాను.

ఇక, నా ఉద్యోగ ప్రయత్నాలు మొదలయాయి. మా నాన్నగారి వృత్తి ప్రవృత్తి రెండూ సంగీతమే కావడం వలన వారికి మామూలు చదువులు, వాటి వల్ల దొరికే ఉద్యోగాలు, ఆదాయల పట్ల ఏమాత్రం ఆసక్తిగాని, అవగాహన కానీ నా ఉద్యోగ ప్రయత్నాలకాలం నాటికి వుండేది కాదు. నా ఉద్యోగం గురించి తన మిత్రుల దగ్గర ప్రస్తావించడానికి కూడా అంత సుముఖత చూపేవారు కాదు. నాలోనూ తగినంత చొరవ, ధైర్యమూ లేకపోవడంతో నా ఉద్యోగ ప్రయత్నాలు చురుకుగా సాగలేదు. 

🌿


1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా రూపొందింది. అమెరికా లో లా ఇక్కడ ప్రెసిడెంట్ వుంటారు. గ్రేట్ బ్రిటన్ విధానంలోలా పార్లమెంట్ ఎక్సిక్యూటివ్ గా ప్రైమ్ మినిస్టర్ వుంటారు. 

మన భారత దేశ మూడవ ప్రెసిడెంట్ గా డా.జకీర్ హుస్సేన్ పదవిలో వున్నప్పుడు డా.వి.వి.గిరిగారు (వరహాగిరి వెంకటగిరి) వైస్-ప్రెసిడెంట్ గా వుండేవారు. శ్రీ గిరిగారు లాయర్ గా, ట్రేడ్ యూనియన్ లీడర్ గా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి. మన తెలుగువారు, శ్రీ పి.సూర్యారావుగారు శ్రీ గిరిగారి అల్లుడు. శ్రీ గిరిగారికి ఆడ, మగ సంతానం చాలా ఎక్కువే. అందులో ఒక అమ్మాయి భర్త శ్రీ సూర్యారావుగారు. ఆయన మద్రాస్ లో నున్న ఆంధ్రా సిమెంట్స్ కంపెనీ (దుర్గా బ్రాండ్ సిమెంట్) అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో డెప్యూటీ ప్లాంట్ మేనేజర్ గా పనిచేసేవారు. మౌంట్ రోడ్ లో  ఈ ఆంధ్రా సిమెంట్స్ ఆఫీస్ పక్కనే  కె.సి.పి. సిమెంట్స్, కె.సి.పి. సుగర్స్ కంపెనీల ఆఫీసులు వుండేవి. ఇవన్నీ రామకృష్ణ బిల్డింగ్స్ ప్రాంగణంలోనే వుండేవి. ఇవి దాటాక అతి పెద్ద  టి.వి.సుందరం మోటార్ కంపెని వుండేది.
 
శ్రీ సూర్యారావుగారి ఆఫీస్ లో తాత్కాలిక టైపిస్ట్ ఉద్యోగం ఖాళీ వుంది, మీ అబ్బాయిని వెళ్ళి ప్రయత్నించమని మా నాన్నగారికి ఆయన స్నేహితులెవ్వరో చెప్పారు. నేను వెంటనే నా దగ్గరున్న ఉద్యోగ అర్హతలన్నిటితో ఆ ఆఫీసుకు వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఎదో ఒక మ్యాటర్ ను టైప్ చేసి చూపమన్నారు. చేసి చూపించాను. వారికి సంతృప్తి కలిగింది. నాకు ఆ టెంపరరీ టైపిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు. ఆ ఆంధ్రా సిమెంట్స్ లో అనేకమంది షేర్ హోల్డర్స్. వారందరికీ సంవత్సరానికి ఒకసారి షేర్ సర్టిఫికెట్లు పంపుతారు. ఆ షేర్ సర్టిఫికెట్లు టైప్ చేయడానికి వారికి అదనపు టైపిస్ట్ అవసరమయ్యాడు. ఆ పని వరకే ఆ టైపిస్ట్. ఆ తర్వాత అతని అవసరం వుండదు. అలాటి ఉద్యోగం సుమారు నెలో రెండు నెలలో పనిచేశాను. 9 to 5 ఉద్యోగం. ఆ ఆఫీస్ లో శ్రీ సూర్యారావుగారు మేనేజర్. చౌదరి అనే ఆయన ఎక్కౌంటెంట్. శేషసాయి అనే అతను స్టెనో టైపిస్ట్. వీరు చెప్పిన ప్రకారం పాత సర్టిఫికెట్లు ఆధారంగా కొత్త సర్టిఫికెట్లు తప్పులు లేకుండా టైప్ చేయాలి.  అదే నామొదటి ఉద్యోగం. కొత్త అనుభవం. అప్పట్లో 

నా నైజం 'ఇంట్లో పులి వీధిలో పిల్లి' తరహగా వుండేది. తెలియనివారిని కలసుకొని మాట్లాడడానికి ఏదో బెరుకు, భయం. ఈ లక్షణాలతో ఆంధ్రా సిమెంట్ కంపెనీలో ప్రవేశించాను. ఆ ఆఫీస్ లోని నా మొదటి రోజు అనుభవం నా జీవితంలో మరవలేను. అక్కడ ఎక్కౌంటెంట్, స్టెనోలకు పక్కనే నాకు ఒక టేబిల్, టైప్ రైటర్, తదితర టైపింగ్ సామగ్రి ఏర్పాటు చేసారు. నేను ఆఫీసుకు వెళ్ళి నా సీటులో కూర్చున్న కొంతసేపటికి శేషసాయి వచ్చి మేనేజర్ గారు పిలుస్తున్నారని చెప్పారు. నేను భయం భయంగా ఆయన రూమ్ లోకి వెళ్ళాను. లోపల ఒక పెద్ద ఛైర్లో కూర్చున్న ఆయన చాలా సౌమ్యంగా నన్నేవో మామూలు ప్రశ్నలడిగి ఒక చెక్కును నా చేతిలో పెట్టి బ్యాంక్ లో జమచేసి రమ్మన్నారు.  నా అదృష్టం. ఆ ఆ ఫీసులో వున్నవారంతా స్పష్టమైన తెలుగులోనే మాట్లాడుకునేవారు. మేనేజర్ గారు ఇచ్చిన చెక్కు తీసుకొని చౌదరిగారి దగ్గరకు వెళ్ళి చెప్పాను. " వెళ్ళి రండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గరే. మన ఆఫీసుకు ఎదురు వరసలోనే వుంది. వెళ్ళి కట్టేసిరండి" అన్నారు.  నేను ఆ చెక్కును పట్టుకొని బయటకు నడిచాను. మౌంట్ రోడ్ ఎప్పుడూ వాహనాలతో చాలా జన సమర్ధంగానే వుండేది. అయితే ఇప్పుడున్నంతగా కాదు. రోడ్ ఇవతల వేపునుండి అవతలవేపుకు సులభంగానే వెళ్ళగలిగాను. అప్పట్లో IOB మౌంట్ రోడ్ బ్రాంచ్ సామాన్యంగానే వుండేది. వెనకవేపు ఇప్పుడున్న మల్టీస్టోరీడ్  కార్పరేట్ బిల్డింగ్ అప్పుడు లేదు. ఆ చెక్ పట్టుకొని బ్యాంక్ లోపలికి వెళ్ళాను. స్వతంత్రంగా బ్యాంకుకు వెళ్ళడం అదే మొదటిసారి. అంతకుముందు ఈ వూరు వచ్చిన కొత్తల్లో  ఒకసారి మా నాన్నగారి తో పాండీబజార్లోని బరోడా బ్యాంకు వెళ్ళాను. అప్పుడు ఆయన చెక్కు కట్టడానికి వచ్చారా, లేక డబ్బులు తీసుకుందికి వచ్చారా అని కూడా తెలియని స్థితి. ఇప్పుడు ఈ IOB లో బొల్డన్ని కౌంటర్స్. అన్నిటిముందు చాలా మంది జనాలు. ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి ఇవ్వాలో తెలియదు. చివరకు ఎవరినో అడిగాను. అతను ఆ పక్కన చలాన్ వుంటుంది అది ఫిలప్ చేసి అక్కడి కౌంటర్లో ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఆ చలాన్స్ వున్నచోటికి వెళ్ళి చూస్తే అక్కడ సినీమా పాంప్లెట్స్ లా రోస్,బ్లూ,ఎల్లో,వైట్ కలర్స్ లో రంగురంగు కాగితాలు కనిపించాయి. వాటిలో దేనిని తీసుకోవాలో తెలియలేదు. దానికి మళ్ళీ మరొకరిని అడిగాను. కరెంట్ ఎక్కౌంట్ అయితే ఇది, సేవింగ్స్ ఎక్కౌంట్ అయితే ఇది అని ఏవో కాగితాలు చూపి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను అయోమయంలో పడ్డాను. నా దగ్గరి చెక్కు సేవింగ్సా? లేక కరెంట్ ఎక్కౌంటా? అది కూడా తెలియని ప్రాథమికావస్థ. ఈ కాగితాలు పట్టుకొని మరల ఆఫీసుకు వెళ్ళి ఆ శేషసాయి చేతే నింపించి బ్యాంకులో జమ చేస్తే ఎలా వుంటుందని ఒక ఆలోచన. కానీ అలాచేస్తే వీడికి చెక్కు కట్టడం రాదు. ఉద్యోగానికి అన్ఫిట్ అని ఇంటికి పంపించేస్తే ? ఒంటికి చెమటలు పట్టేసాయి. మళ్ళి మరో దగ్గర కొంచెం ఫ్రీగా వున్న మనిషి దగ్గరకు వెళ్ళి సిగ్గువిడిచి అడిగాను ఈ చెక్కు డిపాజిట్ చెయ్యడానికి ఛలాన్ నింపిపెట్టమని. అతను నన్ను ఎగాదిగా చూసి, ఏ కళననున్నాడో మారు చెప్పకుండా ఛలాన్ పూర్తిచేసి క్రిందన నన్ను సంతకం చెయ్యమన్నాడు. తెలుగులో చెయ్యాలా? ఇంగ్లీషులోనా? సందేహం. అతను ఇంగ్లీషు లో రాశాడు కనక ఇంగ్లీష్ లోనే ధైర్యంగా సంతకం చేశాను పట్రాయని ప్రణవ స్వరాట్ అని. ఆ చెక్కును  ఛలాన్ కు గుండుసూదితో జతపర్చి ఏ కౌంటర్లో ఇవ్వాలో చెప్పి పుణ్యం కట్టుకున్నాడు ఆ మహానుభావుడు. నా విషయంలో అలాటి మహానుభావులెందరో. ఆ సమయంలో నాకు ఒక బ్రైటెస్ట్ అవిడియా వచ్చింది. భవిష్యత్ లో ఇలాటి సమస్య ఎదుర్కోకుండా అతను రాసినట్లే ఒక నమూనాను మరో ఛలాన్ మీద వ్రాసి నా జేబులో పెట్టుకొని మొత్తానికి ఆ చెక్కును డిపాజిట్ చేసి స్టాంప్ వేసిచ్చిన కౌంటర్ ఫాయిల్ ను మరో జేబులో భద్రంగా పెట్టుకొని విజయవంతంగా ఆఫీసుకు చేరుకున్నాను. ఒక పది నిముషాలలో చెక్ డిపాజిట్ చేసి రావలసిన మనిషి ఒక గంటైనా తిరిగి రాకపోయేప్పటికి  చౌదరీగారు కాస్తా కంగారుపడి నాకోసం శేషసాయిని పంపే యోచనలో పడ్డారు. నన్ను చూడగానే ఆయన ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. నేను అంతకంటే ఎక్కువగా హాయిగా ఊపిరి పీల్చుకున్నాను.   ఒక నెలకో రెండు నెలలకో   షేర్ సర్టిఫికెట్లు తయారయాయి. ఆంధ్రా సిమెంట్ కంపెనీలో నా ఉద్యోగమూ ముగిసిపోయింది. నా మొదటిరోజు ఆఫీసు అనుభవాన్ని మాత్రం జీవితాంతం మర్చిపోలేను. 

ఆ ఉద్యోగం తర్వాత కొన్నాళ్ళపాటు  మళ్ళీ రికార్డింగులు, రీరికార్డింగ్ లతోనే కాలం గడిపాను. ఎన్ టి రామారావు గారితో 'శకుంతల' సినీమా నిర్మించిన రాజ్యం పిక్చర్స్ వారు ఈ సారి అక్కినేని నాగేశ్వరరావుగారి ద్విపాత్రాభినయం లో ఒక సాంఘిక చిత్రాన్ని మొదలుపెట్టారు. కన్నడంలో రాజ్ కుమార్ హీరోగా ఎంతో విజయం పొందిన 'ఎమ్మె తమ్మన్న' ఈ తెలుగు సినీమాకు మూలం.  కన్నడంలో నటించిన భారతి, రాజశ్రీలు హీరోయిన్లు. వినోదమే ప్రధానంగా గల ఈ సినీమా తర్వాత హిందీలో జితేంద్రతో ' జిగ్రిదోస్త్' గా, తమిళంలో  ఎమ్జీయార్ తో ' మాట్టుక్కార వేలన్' గా ఘన విజయాన్నే సాధించాయి. అదే తెలుగులో 'గోవుల గోపన్న'. ఘంటసాల మాస్టారిదే సంగీతం. డైరక్షన్ సి ఎస్ రావు. కొన్ని పాటల కంపోజింగ్ మాస్టారింట్లోనే జరిగాయి. ఆ సమయంలో దాశరధిగారు,  కొసరాజుగారు, అసిస్టెంట్ డైరక్టర్ జగన్నాధరావు, డైరక్టర్ బాబ్జి మాస్టారింటికి వచ్చేవారు. ఘంటసాలవారు సి.ఎస్ రావు గారిని బాబ్జీ అని ఆప్యాయంగా పలకరించేవారు. రావుగారు అందరిలాగే ఘంటసాలగారిని మాస్టారు అనే గౌరవంగా పిలిచేవారు.

ఈ సినీమాలోని ఎనిమిది పాటలను శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, ఆరుద్ర రాశారు. ఈ పాటలను ఘంటసాలవారితో పాటు సుశీల, ఎస్.జానకి, బెంగుళూరు లత , జె.వి.రాఘవులు పాడారు. పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ వడపళని సాలిగ్రామంలో వున్న అరుణాచలం స్టూడియోలో జరిగాయి. దాశరధిగారు వ్రాయగా ఘంటసాలవారు, సుశీలగారు ఆలపించిన  యుగళగీతం 'ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే జంటలమై', 'కన్నెల వలపుల వెన్నలు దోచే కన్నయ్యా యీ మాయ ఏలా' , శ్రీశ్రీగారు వ్రాసిన ' ఈ విరితోటల లోగిటిలో', కొసరాజు గారు వ్రాసిన 'వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా" (ఈ పాట సినీమాలో రెండుసార్లు వస్తుంది. ఒకటి మాస్టారి సోలో. మరొకటి సుశీలగారితో డ్యూయెట్). మరొకటి ఎస్ జానకిగారు పాడిన 'హడావుడి పెట్టకోయ్ బావా'. ఆరుద్ర రచన . కొన్ని పాటల రికార్డింగ్ లకు నేనూ వెళ్ళాను. 



ఈ చిత్రంలో పాటలన్నీ చాలా మెలోడియస్ గా, హుషారుగా వుంటాయి. ఈ సినీమాలో ఘంటసాలవారు వెస్టర్న్ వాద్యాలను బాగా ఉపయోగించారు. ఓ రెండు డ్యూయెట్లు వెస్టర్న్ వాల్జ్ బాణీలో  శ్రావ్యంగా వినిపిస్తాయి. పాటల మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. సి.ఎస్.రావుగారి చాలా సాంఘికాలలో శాస్త్రీయ సంగీత శైలిలో నృత్యగీతాలు కనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా హిరో డ్రీమ్ లో రాధాకృష్ణుల రాసలీల పాటను ఎంతో మనోజ్ఞంగా చిత్రీకరించారు అక్కినేని, భారతి నటించిన ఆ పాట 'కన్నెల వలపుల వెన్నలు దోచే' దాశరధిగారి పాట.  హాయినిగొలిపే ఆ పాట నాకెంతో యిష్టం.  




ఈ సినీమా రీరికార్డింగ్ కు నేను వెళ్ళినప్పుడు విలన్ ఇంటిలో, అతని రహస్య స్థావరంలో జరిగిన ఫైట్స్, సీన్స్ కు మ్యూజిక్ పోస్ట్ చేశారు. అలాగే  సినీమా టైటిల్ మ్యూజిక్  కూడా  ఆద్యంతం చాలా ఉత్సాహభరితంగా చేయడం చూశాను. ఎన్నో రకరకాల వాద్యాలు ఒకేసారి లైవ్ లో వాయిస్తుండగా వినడం నాకెప్పుడూ థ్రిల్లింగ్ గా వుండేది. ఈ అనుభవం కోసమే ఘంటసాల మాస్టారు పని చేసిన చాలా చిత్రాల రీరికార్డింగ్ లకు పనికట్టుకు వెళ్ళి చూసి, విని ఆనందించేవాడిని. 

💥కొసమెరుపు💥

గోవుల గోపన్న సినిమా కు సి.ఎస్.రావుగారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన జగన్నాధరావుగారు ఆ సినిమా లో కొన్ని సీన్లలో  అక్కినేని డూప్ గా కనిపిస్తారు. 

వచ్చేవారం మరికొన్ని సినిమా విశేషాలతో....
                  ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, August 8, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై మూడవ భాగం

8.08.2021 -  ఆదివారం భాగం - 43*:
అధ్యాయం 2 భాగం 42  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
" దేవుడనేవాడున్నాడా యని
ఆత్రేయకు కలిగెను సందేహం"

ఒక్క ఆత్రేయగారే అనేమిటి మానవుడై పుట్టిన ప్రతీ మనిషికి ఏదో దశలో ఈ సందేహం కలుగుతుంది. అంతవరకెందుకు‌, మహాభాగవతాన్ని వ్రాసిన పరమ భాగవతోత్తముడైన బెమ్మెర పోతన్న గారికే కలిగింది సందేహం - "కలడు కలండెనువాడు కలడోలేడో" అని. కానీ, మన ఘంటసాల మాస్టారికి అలాటి అనుమానాలు, సందేహాలు ఏనాడులేవు. ఆయన దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించారు. మనస్ఫూర్తిగా దైవనామ సంకీర్తనం చేశారు. అవి సినీమా పాటల రూపంలో, ప్రైవేట్ గీతాల రూపంలోనూ ఈ లోకంలో ప్రచారమై ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెంపొందడానికి దోహదమయింది. శివుడా, విష్ణువా? విద్యల తల్లా, సిరుల తల్లా? లేక ముగ్గురమ్మలు కలసిన ఆది పరాశక్తియా  అనే తరతమ భేదం వారికిలేదు. అందరూ వారికి ఇష్టదేవతలే. సత్పురుషులు, సచ్చింతన కలవారందరిలోనూ ఘంటసాలవారు దైవాన్ని దర్శించి వారి సన్నిధిలో తన దేవగానామృతంతో ఆయా మహనీయులను సేవించారు. వారి ఆశిస్సులు పొందారు. 

కలియుగ దైవంగా, భగవాన్ గా  ప్రపంచం నలుమూలలావున్న కోట్లాది ప్రజలచేత కొనియాడబడిన శ్రీ సత్యసాయి బాబావారి సాంగత్యం ఘంటసాలవారికి మొదటిసారిగా ఏనాడు కలిగిందో నాకు తెలియదు కానీ బాబా మద్రాస్ వచ్చినప్పుడల్లా ఘంటసాలవారు ఆయనను దర్శించేవారు. మైకా బారన్ గా ప్రసిధ్ధిపొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ గోగినేని వెంకటేశ్వరరావుగారు పుట్టపర్తి సాయిబాబా భక్తులు. మద్రాసు లో బాబావారు వారింటికి అతిధిగా వేంచేసినప్పుడు స్థానిక ప్రముఖులెందరో వారిని దర్శించారు. అలాటివారిలో ఘంటసాలవారు ఉన్నారు. తర్వాత కాలంలో, బాబావారు అంజలీదేవి, ఆదినారాయణ రావు దంపతుల గృహానికి వచ్చినప్పుడల్లా ఘంటసాలవారు వారిని కలిసేవారు.

ఒకసారి ఘంటసాల మాస్టారు తన బృందంతో పుట్టపర్తి ప్రశాంతినిలయంలోనో లేక వైట్ ఫీల్డ్స్ లోనో సాయిబాబా సమక్షంలో కచేరీ చేసి బాబా ప్రశంసలకు పాత్రులయ్యారు. (అప్పటికి నాకు సాయిబాబా అంటే ఏవిధమైన అవగాహన లేదు). ఆ సందర్భంగా సత్యసాయిబాబా తన హస్తచాలనంతో ఒక వజ్రాల ఉంగరాన్ని సృష్టించి ఘంటసాలవారికి బహుకరించారు. మిగిలిన వాద్యబృందానికి తలా ఒక బంగారు కాసు బహుకరించారు. ఆ సందర్భంలో మాస్టారితోపాటు సావిత్రమ్మగారు కూడా వెళ్ళారు. ఘంటసాల మాస్టారు చాలా తీవ్రంగా చలించిపోయే మనస్తతత్త్వం కలవారని, చాలా వేగంగా భావోద్వేగాలకు లోనయేవారని మా నాన్నగారు చెపుతూండేవారు. ఆరోజున సత్యసాయి బాబా వారి సమక్షంలో కూడా ఘంటసాల వారికి అలాటి దివ్యానుభూతికి గురయ్యారని అనుకునేవారు. అదే సందర్భంలో అక్కడే వున్న మా నాన్నగారిలో కానీ,  సావిత్రమ్మగారిలో కానీ ఎటువంటి సంచలనాలు కలగలేదని చెప్పగా విన్నాను. దేవుడి విషయంలో కానీ, సాధు సత్పురుషుల విషయంలోకానీ అందరి అనుభవాలు ఒకేలావుండవు. ఆయా మనుషుల జిజ్ఞాస మనోప్రవృత్తి, జీవితానుభవం దృష్ట్యా కూడా దైవ విశ్వాసాల అంతరం, స్థాయి మారుతూంటాయి. ఘంటసాల మాస్టారు తన ఆరోగ్యం బాగాలేని దశలో కూడా సత్యసాయి బాబావారిని దర్శించి వారినుండి ఉపశమనం పొందారు. వారిపై పాటలు వ్రాసి,స్వరపర్చి తన భక్తప్రపత్తులను చాటుకున్నారు. ఘంటసాల మాస్టారు జరిపిన అనేక సంగీత కచ్చేరీలు ఆధ్యాత్మిక కేంద్రాలు, సత్కార్యాలకోసం జరిపినవే. స్వలాభాపేక్ష వుండేది కాదు. స్టూడియోలలో మైక్రోఫోనుల ముందు పాడడంలో కన్నా, చిన్న చిన్న వూళ్ళలో వేలాది అభిమానుల మధ్య వారి కోసం పాడడంలోనే ఘంటసాలవారు ఎక్కువ ఆనందం అనుభవించేవారు. ఆ సమయంలో కలిగిన శ్రమ, కష్టనష్టాలను కూడా ఆయన లెఖ్ఖచేసేవారు కాదు. అందుకే 'ఘంటసాల మా మనిషి' అని, ' ప్రజల గాయకుడు' అని ఈనాటికీ కొనియాడబడుతున్నారు. 

🍄


'ఏరా... పెద్ద బాబూ... ఎక్కడున్నావు... సంగీతం మాస్టారొచ్చి ఎంతసేపయింది..." ఓ పెద్ద కేక. 'వస్తున్నానమ్మా' అంటూ మరెక్కడినుండో మెల్లగా సమాధానం. కొన్ని క్షణాల తర్వాత మాస్టారింటి హాలులో నుండి తంబురా శ్రుతుల మధ్య సంగీత పాఠం ప్రారంభమయేది. శిష్యుడు ఘంటసాలవారి పెద్ద కుమారుడు విజయకుమార్. గురువుగారు నూకల పెద సత్యనారాయణ గారు. సుప్రసిధ్ధ సంగీత విద్వాంసుడు నూకల చిన సత్యనారాయణ గారికి వీరికి ఏమైనా బంధుత్వం వుందేమో తెలియదు. పెద సత్యనారాయణ గారు కూడా అడపాదడపా ఆలిండియా రేడియో లో పాడేవారు. ఆయన మా పెదబాబుకు సంగీతం గురువుగారు. మనిషి పొట్టిగా, సన్నగా ఖద్దరు పంచ, జుబ్బా, చేతిలో గొడుగుతో మధ్యాహ్నం 4.30- 5.00 ప్రాంతాలలో వచ్చేవారు. సంగీతపాఠం జరిగినంతసేపూ ఎవరూ ఆ హాలు ప్రాంతాలకు వెళ్ళేవారు కాదు. ఘంటసాల మాస్టారయితే ఆ దరిదాపులకే వెళ్ళేవారు కాదు. ఆయన కనిపిస్తూంటే గురుశిష్యులిద్దరూ బిగదీసుకుపోయేవారు. అందుకని పాఠం అయేకే మాస్టారు హాలులోకి వచ్చి నూకలవారిని పలకరించేవారు. ఆయనకు ఆదరణ కల్పించే ఉద్దేశంతో తన స్వీయ సంగీతంలో ఎప్పుడైనా తంబురా శ్రుతికి ప్రాధాన్యం వుంటే ఆ అవకాశం వారికి కల్పించేవారు. నూకల పెద సత్యనారాయణ గారికి హియరింగ్ ఎయ్డ్ అవసరం బాగానే ఉండేది. కర్ణాటక సంగీత బాణీకి అలవాటు పడిన గాయకులు కానీ, వాద్యకారులు కానీ  సినీమా సంగీతంలో ఇమిడిపోయి రాణించినవారు బహు అరుదు. వారి సంగీత ప్రతిభ సినీమాలోకంలో అక్కరవచ్చేది కాదు. 1980ల తర్వాత  ఫ్యూజన్ సంగీతం ప్రారంభమయ్యాక ట్రెండ్ కొంత మారిందనుకోండి. అది వేరే విషయం. అలాటి మంచి గాయకులు, వాద్యకారులు సినీమాలలో అవకాశాలకోసం ఘంటసాల మాస్టారి వద్దకు వచ్చేవారు. అలాటివారికి తగిన ప్రోత్సాహం, ఆదరణ కల్పించలేకపోతున్నందుకు మాస్టారు చాలా బాధపడేవారు. 

పెదబాబు విజయకుమార్, నేనూ సమవయస్కులం కాకపోయినా ఇద్దరమూ స్నేహ భావంతోనే వుండేవాళ్ళం. మా అమ్మగారికి పిల్లలపట్ల గల ప్రేమాభిమానాల వలన పెద్దబాబుకు మా అమ్మగారి దగ్గర చనువుండేది. తరచూ మేముండే ఔట్ హౌస్ లో మాతో గడిపేవాడు. చదువులో రాణించలేడనే విషయం అర్ధమయ్యాక అతని దృష్టిని పూర్తిగా సంగీతంవేపు మళ్ళించేలా ఘంటసాల మాస్టారు ప్రయత్నించారు. మొదట్లో మాస్టర్ వేణుగారి దగ్గర హార్మోనియం, పియోనా నేర్పించారు. క్రమక్రమంగా విజయకుమార్ సంగీతవిద్యలో అభివృద్ధి కనపర్చడంతో మౌంట్ రోడ్ లోని 'మ్యూసీ మ్యూజికల్స్ ' లో చేరి పియానో వాద్యంలో కృషి చేసి ట్రినిటి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, లండన్ వారి డిప్లమో సాధించాడు. 

ఆ మ్యూసీ మ్యూజికల్ స్కూల్ లో చాలా ప్రఖ్యాతి పొందిన వెస్టర్న్ సంగీత కళాకారుడు, ఆంగ్లో-ఇండియన్ ఒకాయన ఉండేవారు. హేండల్ మాన్యుల్.


హేండల్ మాన్యుల్

మెడ్రాస్ సినీమా ప్రపంచంలో పేరు పొందిన సంగీత దర్శకులు, వాద్యకళాకారులు ఎందరో ఆయన శిష్యులే. ఆయన విధిగా మద్రాస్ శాంథోమ్ కేతిడ్రల్ లాటి అనేక పెద్ద పెద్ద చర్చ్ లలో ప్రేయర్, హిమ్స్, కేరోల్స్ ఖ్వయర్  సంగీతకార్యక్రమాలని కండక్ట్ చేసేవారు. అలాటి ప్రముఖుని వద్ద పియోనా నేర్చుకునే అదృష్టం పెద్దబాబుకు లభించింది. తర్వాత, తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో సంప్రదాయబధ్ధంగా కర్ణాటక సంగీతం నేర్చుకొని అందులో డిప్లమో పొందాడు. మంచి గాత్రం. 

సంగీత సాధన చేస్తున్నరోజులలో పెద్దబాబు పాడే ఒక కృతి నాకు బాగా గుర్తు. ముత్తయ్య భాగవతార్ రచించి, స్వరపర్చిన  'విజయాంబికే విమలాత్మికే' అనే కృతి. 'విజయనాగరి' రాగం. పెద్దబాబు పియోనాకు మొదటి శ్రోతను (మెచ్చుకర్తను?) నేనే. అతను మాస్టర్ వేణుగారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్న కాలంనుంచే ఇంట్లోనే ఒక పియోనో ఉండేది అతని ప్రాక్టీస్ కోసం మేడమీద స్టడీ రూంలో. మేడ మీద రినొవట్ చేసాక, పిల్లలందరూ స్కూళ్ళనుంచి వచ్చేక హోం వర్కులు, చదవుకోడాలు, ట్యూషన్లు ఆ స్టడీ రూంలోనే. సొంత చిత్ర నిర్మాణ కాలంలో ఆ రూమ్ టైలర్స్ రూమ్.  

పది పన్నెండేళ్ళ వయసులోని పిల్లలు ఏం మాట్లాడినా, ఏంచేసినా పెద్దలకు తప్పుగానే కనిపిస్తుందట. మా నాన్నగారి స్నేహితులు శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారు అనేవారు. ఆ వయసులోని పిల్లలు గట్టిగా మాట్లాడినా, ఆట్లాడినా, పాటలు పాడినా, పని చేసినా, చేయకపోయినా, అల్లరిచేసినా, చేయకపోయినా ఏదో దానికి పెద్దలు విమర్శిస్తూ,  పిల్లలమీద తమ  విసుగుదలను ప్రదర్శిస్తారని, ఇది పెద్దలకుండే అవలక్షణమని ఆయన చెప్పేవారు. తనలో ఉండే ఆ లక్షణం గురించే ఆయన చెప్పారని ఒకసారి రాయఘడా వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను. కారణమేమిటో తెలియదు కానీ, నేను కానీ, పెద్దబాబు కానీ మా తండ్రుల దగ్గర చాలా చనువుతో, స్వేఛ్ఛగా మాట్లాడలేకపోయేవాళ్ళం, మెలగలేకపోయేవాళ్ళం. మా తరం పిల్లల్లో చాలామందిలో ఆ లక్షణం వుండేదనిపిస్తుంది. పెద్దల పట్ల భయం భయంగానే ప్రవర్తించేవారు. ఇది సాకుగా చేసుకొని మాస్టారింట్లో వుండే గుండు మామయ్య, సుబ్బు,  పనిమనిషి తాయి కొడుకు పయ్యా లాటివాళ్ళు కూడా పెద్దబాబును అదలించడం, కన్నెర్రజేయడం నాకు చాలా చికాగ్గా వుండేది. అయితే అదంతా వారి దృష్టిలో పిల్లలను సక్రమంగా తీర్చిదిద్దుతున్నామనే భావన. ఏమైతేనేం, చిన్నప్పుడు నాలో చాయాస్వర జ్ఞానం బాగా వుండేదని మానాన్నగారు అనడం నాకు బాగా గుర్తు. అకారంలో ఏం పాడినా వాటి స్వరాలు గుర్తించేవాడినట. చిన్నతనంలో ఆయన ముఖతః సంగీతం నేర్చుకోలేకపోయాను. ఆయనకూ తన వృత్తి కార్యకలాపాలలో నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని సంగీతం నేర్పే సమయమూ వుండేదికాదు. తర్వాత కాలంలో చదువురీత్యా నేను మద్రాసులో లేకపోవడం వల్ల నా సంగీత శిక్షణ ఆగిపోయింది. నాకు మా నాన్నగారిపట్ల అకారణ భయం మరో కారణం కావచ్చు. కానీ  అదంతా ఏనాటి మాటో!

పెద్దబాబు విజయకుమార్ పియానో వాద్యం నాకు చాలా ఉత్సాహం గాను, ఆశ్చర్యం కలిగించేదిగానూ వుండేది. ఎంతో వేగంగా సాగే ఆ వేళ్ళ కదలిక, గమనం ఆనందంగా వుండేది. వెస్టర్న్  మొజార్ట్, జాజ్, కర్ణాటక రాగాలు అన్నిటినీ చాలా సునాయాసంగా పియానో మీద  గంటల తరబడి వాయించేవాడు. సమయమే తెలిసేది కాదు. హార్మోనియం మీద కూడా  ఘంటసాల మాస్టారి మంచి మంచి పాటలెన్నో అవలీలగా వాయించి వినిపించేవాడు. సినీమా సంగీతానికి కావలసిన అర్హతలన్నీ అతనిలో పుష్కలంగానే వుండేవి.  జరిగిన కథ చిత్రంలో 'ఇదిగో మధువు, ఇదిగో సొగసు' అన్న పాటలో అతని సోలో పియానో బిట్ ప్రత్యేకంగా వినిపిస్తుంది. క్రమక్రమంగా తండ్రిగారికి సహకారం అందించే స్థితికి చేరుకున్నాడు.  సంగీత దర్శకుడై  తన సంగీతదర్శకత్వలో వచ్చిన 'వస్తాడే మా బావ' చిత్రంలో తన తండ్రిగారి చేతే ఒక పాట పాడించి ఆయనకు   ఆనందాన్ని కలగజేశాడు. 



ఆ సినీమాకు చేసిన పాటలు, తర్వాత మరెప్పుడో తన సోదరుడు రత్నకుమార్ తీసిన తమిళ  సినిమా  'తేన్ కూడు' కు చేసిన పాటలు   నాకు హార్మోనియం మీద వాయిస్తూ పాడి వినిపించేవాడు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణించే లక్షణాలన్నీ వుండేవి. 



కానీ,  తెలుగు సినీమా పరిశ్రమ అతని ప్రతిభను గుర్తించి మంచి అవకాశాలు కల్పించలేకపోయింది. భగవంతుడు కూడా పెద్దబాబు కు అర్ధాయుష్షునే ప్రసాదించి ఈ లోకంనుండే తీసుకుపోయాడు. భోళాశంకరుడి వంటి పెద్దబాబు జ్ఞాపకాలు సదా నా వెంటనే వుంటాయి. నెం.35, ఉస్మాన్ రోడ్ లో మరపురాని మనిషి మా పెద్దబాబు. 

💐

" ఇలా ఇలా జీవితం పోతే పోనీ 
ఈ క్షణం నరకమను, స్వర్గమను
ఏది ఏమను... ఇలా ఇలా జీవితం" అంటూ గుండు మామయ్య ఇచ్చిన కాఫీని ఆస్వాదిస్తూ ఎన్టీఆర్ స్టైల్లో  కాఫీగ్లాసును పట్టుకొని తూలుతూ పాడుతూ అందరికి వినోదం కలిగించేవాడు ఒక కుర్రవాడు. గుండు మామయ్య కాఫీ  ఆ కుర్రవాడికి అంత నిషాను, మజాను ఇచ్చేదనుకుంటాను. ఉన్నచోట వుండకుండా తుళ్ళుతూ, గెంతుతూ, చాలా హుషారుగా వుండేవాడు. ఒట్టి కబుర్లపోగు. అతనే వేణు. సావిత్రమ్మగారికి చెల్లెలి కొడుకు. రతన్, శ్యామల వయసే వుండవచ్చు. ఆ అబ్బాయి తండ్రి నరసింహమూర్తి. ఆయన కూడా చాలా హడావుడిగా, గట్టిగా, గలగలా మాట్లాడుతూండేవారు. ఘంటసాల మాస్టారి ఇల్లు ఎప్పుడూ బంధుమిత్రులతో కలకలలాడుతూవుండేది. అందులోనూ వేసవికాలం వస్తే మరింతమంది వచ్చేవారు. సావిత్రమ్మగారి అన్నగారు, పిల్లలు, చెల్లెలు, మరది, పిల్లలతో ఒకటే సందడిగా వుండేది. పిల్లల పాటలు, ఆటలతో పొద్దుపోవడమే తెలిసేదికాదు. నరసిమ్మూర్తి బాబాయి, సుబ్బారావు మామయ్య ఊరినుంచి వచ్చేరంటే మా ఔట్ హౌస్ మీది కొట్టాయ్ (కొబ్బరాకుల పాక)లో కూడా ఉత్హాహం హడావుడి ఎక్కువయేది. ప్రతీ రోజూ మధ్యాహ్నం మూడు నుండి ఆరు వరకూ చతుర్ముఖ పారాయణం జరిగేది. రమ్మీ. పదమూడు ముక్కలాట. పండగ దినాల్లో అయితే రాత్రి పది పదకొండు దాకా సాగేది. ఈ రమ్మీ క్లబ్ లో మా నాన్నగారు, సదాశివుడుగారు, నరసింగ, సుబ్బారావుగారు, నరసింహమూర్తి గారు, క్రిందింట్లో అద్దెకుండే కొల్లూరి వారి బంధువు రామకృష్ణ, ప్రముఖ నటుడు లింగమూర్తిగారు, ప్రముఖ నటి శ్రీదేవి పినతల్లి భర్త మోహన్ రెడ్డి (1980లలో నటి శ్రీదేవి కుటుంబం మా పక్కిల్లు 36, ఉస్మాన్ రోడ్  క్రింది పోర్షన్ లో అద్దెకు వుండేవారు), మా నాన్నగారి మేనమామ కుమారులు మురళి, శాస్త్రి, వయోలా (మేడూరి)రాధాకృష్ణమూర్తిగారు సభ్యులు.  రాధాకృష్ణమూర్తిగారు ఆలిండియా రేడియోలో వయోలా వాద్యంలో బి హై గ్రేడ్ కళాకారుడు. సినీమా వాద్యబృందాలలో కూడా పనిచేయాలని చాలా కోరిక. సంగీత దర్శకులందరిని కలుస్తూండేవారు. కానీ ఆయనది సినీమా సంగీతానికి అతకని శాస్త్రీయ బానీ. దానితో ఆయనకు సరైన అవకాశాలు వచ్చేవికావు. ఘంటసాల మాస్టారు మాత్రం అప్పుడప్పుడు తన పాటలకు పిలిచేవారు. రాధాకృష్ణమూర్తిగారు చాలా మంచి వ్యక్తి. మా నాన్నగారికి మంచి స్నేహితుడు.

వీరంతా రోజూ వచ్చి పేకాట ఆడేవారని కాదు. వారి వారి అవకాశాలను బట్టి వస్తూండేవారు. వీరిలో నలుగురు విధిగా వచ్చేవారే. ఒక చెయ్యి తగ్గినప్పుడు నేను కూడా ఒక చేయి వేసేవాడిని. రామకృష్ణ వెయ్యిళ్ళ పూజారి. అటు మాధవపెద్దివారి లోగిట్లో, మరోపక్క ఆంధ్రా క్లబ్ లో, ఇంకా అనేక చోట్ల చతుర్ముఖ పారాయణం చేయించేవాడు. అతనికి పేక ముక్క నలిగితే నచ్చేదికాదు. కొత్త సెట్లు కావాలనేవాడు.

ఆంధ్రా సోషల్ క్లబ్ లో తెలుగు సినీమా రంగానికి చెందిన హేమాహేమీలెందరో రమ్మీలో నిష్ణాతులు. రోజుకు వందలు, వేలు చేతులు మారేవి. పేకముక్క ఏమాత్రం నలిగినా అదేమిటో కనిపెట్టగల పేకాట నిష్ణాతులుండేవారట. రామకృష్ణే చెప్పేవాడు. అందుచేత ఏ రోజుకారోజే కొత్త పేకలు వాడతారట. పాతవాటిని  క్లబ్ వాళ్ళు చీప్ గా బయటవాళ్ళకు అమ్మేస్తారట. అలాటి పేకలేవో మా ఇంటికొచ్చినప్పుడు తెచ్చేవాడు. ఆటలో  హుషారు వుండేందుకు పైసల స్టేక్స్ తోనే  ఆడేవారు. నాకు గుర్తున్నంత వరకు డ్రాప్ కు ఐదు పైసలు, మిడిల్ 15, ఫుల్ కౌంట్ పావలా తో మొదలెట్టి కాలక్రమేణా 1980లు వచ్చేసరికి పావలా, అర్ధ, రూపాయి.  పాయింట్ కు పైసా. మా మురళీ, శాస్త్రిలాటి వారెవరైనా ఈ ఎపిసోడ్ చదివితే  ఈ ఫిగర్స్ ను సరిచేయవచ్చును.

ఈ చతుర్ముఖ పారాయణ సమయంలో లోకాభిరామాయణంతో పాటు సంగీత, సాహిత్య, వేదాంత విషయాల మీద కాలక్షేప ప్రసంగాలు కూడా జరిగేవి. చాలా సుహృద్భావ వాతావరణంలో ఏ హడావుడి, ఉద్రేకాలు లేకుండా చాలా సరదాగా ప్రశాంతంగా ఈ పారాయణం కొన్ని దశాబ్దాల పాటు జరిగింది. ఘంటసాల మాస్టారికి ఈ ఆటల మీద, పుస్తక పఠనం మీద  పెద్ద ఆసక్తి వుండేదికాదు.  వారికి ఇంట్లో వున్నంతసేపూ హాయిగా విశ్రాంతిగా కళ్ళుమూసుకు పడుక్కోవడంలోనో లేక పిల్లలతో కాలక్షేపం చేయడంలోనో ఆనందంవుండేది. 

ఆ రోజులు, ఆనాటి సరదాలు తిరిగి రానేరావు. ఆ రోజులను ఎంత మననం చేసుకున్నా తనివితీరదు. ఈ మాటలు ఘంటసాల మాస్టారు పాడిన ఒక ప్రైవేట్ లలితగీతాన్ని గుర్తు చేస్తోంది కదూ! 


💐

మరిన్ని విషయాలతో, విశేషాలతో వచ్చే వారం...
అంతవరకు ...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.