visitors

Sunday, December 19, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైరెండవ భాగం

19.12.2021 - ఆదివారం భాగం - 62:

అధ్యాయం 2  భాగం 61 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

విదేశాలలో మన తెలుగు సంగీతాన్ని ప్రచారం చేయాలన్న కాంక్ష అయితే బలంగా ఘంటసాల మాస్టారిలో వున్నా వాటిని సఫలీకృతం చేయడానికి చాలానే కృషిచేయవలసివచ్చింది. తన గాత్ర సంగీతంతో పాటు మన భారతీయ సంగీతాన్ని లైట్ ఎండ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో బ్రహ్మాండమైన  వాద్య సంగీత రూపకాలుగా ప్రదర్శించాలని ఘంటసాల తపించారు. పాతికమంది బృందంతో  ప్రపంచమంతా పర్యటించాలనేది వారి చిరకాల వాంఛ. అయితే అందుకు కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అంత సులభంకాలేదు.   కేంద్ర, రాష్ట్ర పభుత్వాల తరఫునుండి ఇంత పెద్ద  సాంస్కృతిక బృందాన్ని విదేశాలకు పంపడానికి తమ సుముఖత కనపర్చలేకపోయింది.  విదేశాలలోని స్థానిక సాంస్కృతిక సంస్థలు చొరవ తీసుకుంటే ఈ సత్కార్యం సానుకూల పడుతుందని అందరూ సలహా ఇచ్చారు. USEFI/కెనెడియన్ ఫౌండేషన్ రీజనల్ డైరెక్టర్  గా పనిచేసిన డా.డి.ఎన్.రావు తన వ్యక్తిగత హోదాలో అమెరికాలోని సాంస్కృతిక సంస్థలకు, మిత్రులకు ఉత్తరాలు వ్రాసారు. కొందరు సానుకూలంగా స్పందించారు. అలాటి పరిస్థితులలో వెస్ట్ జర్మనిలోని గొటింజెన్ లో కచేరీ జరపడానికి ఆహ్వానం వచ్చింది. అలాగే నార్త్ అమెరికా లోని భారతీయ సాంస్కృతిక సంఘాలవారు యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో సంగీత కచేరీలు ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.

పాతిక మంది బృందం అనుకున్నది పదిమందికే పరిమితమయింది. వీరందరి రానుపోను టిక్కెట్లు, విదేశాలకు తగిన దుస్తులు, వారు మద్రాసులో లేనప్పుడు వారి కుటుంబాల జీవనభృతి, ఇత్యాది అనేక ఖర్చులకు కావలసిన ధనం ఎవరిస్తారు? ఎలా సమకూర్చాలనేది ప్రధాన సమస్యగా మారింది. 

ఈ విషయం ప్రజలలోకి వెళ్ళింది. ముందుగా నెల్లూరు జిల్లా ప్రముఖులు ఘంటసాలవారి విదేశీ పర్యటనకు తగు ఆర్థిక సహాయం చేస్తామని ఘంటసాల మాస్టారిని నెల్లూరుకు ఆహ్వానించి నెల్లూరు జిల్లా పరిషత్ ఆధ్వరంలో ఒక బ్రహ్మాండమైన సన్మాన సభ ఏర్పాటు చేసారు. స్థానిక ప్రముఖులు శ్రీ ఆనం సంజీవరెడ్డి, శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డిగార్ల చేతుల మీదుగా ఘంటసాలవారికి పదివేల రూపాయలను బహుకరించి ఘంటసాల విదేశ సంగీతయాత్ర దిగ్విజయం కావాలాని అభినందనలు తెలియజేసారు. ఈ శుభపరిణామంతో మద్రాసులోని సినీవర్గాలు కూడా ముందుకు వచ్చాయి. అగ్రనటులైన ఎన్.టి.రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, భానుమతిగారు వంటి ప్రముఖ నటులు కొందరు ధన సహాయం చేసారు. అనేక మంది నిర్మాతలు తమ చిత్రాలలో పాడబోయే పాటల పారితోషకాన్ని ఎడ్వాన్స్ గా ఇచ్చి ఆదుకున్నారు.  ఈవిధంగా అనేక రూపాలలో ధనసేకరణ చేసి, మిగిలిన ఖర్చులన్నీ తన సొంత నిధులనుండి ఉపయోగించాలనే దృఢ నిశ్చయానికి వచ్చారు ఘంటసాలవారు.

ఘంటసాల మాస్టారి విదేశీ పర్యటన 1971 అక్టోబర్ 7వ తేదీ ఉదయం ప్రారంభమై 1971 నవంబర్  6వ తేదీ మధ్యాహ్నానికి ముగిసింది. మొత్తం నాలుగు వారాల పర్యటన. ఘంటసాల మాస్టారు తన విదేశీ సంగీత జైత్రయాత్ర కోసం వాద్యబృంద కళాకారులుగా సౌత్ ఇండియన్ సినీ రంగంలోని ఏస్ మ్యుజిషియన్స్ నే ఎన్నుకున్నారు.  వారు - సర్వశ్రీ - మిట్టా జనార్దన్-సితార్, నంజప్ప-ఫ్లూట్, పి.సంగీతరావు-హర్మోనియం, షేక్ సుభాన్-క్లారినెట్, వి.ఎల్.ప్రసాద్-మృదంగం/డోల్కి, పాల్ జడ్సన్-తబలా, మురుగేష్-ఘటసింగారి/ఇతర తాళ వాద్యాలు.

మురుగేశన్, సంగీతరావు, నరసింగ, ఘంటసాల సావిత్రి, ఘంటసాల, సుభాన్, జడ్సన్, జనార్దన్, ప్రసాద్, నంజప్ప, 'ఎమెస్కో కృష్ణమూర్తి

ఈ సప్తస్వరాలతో పాటు  తన మిమిక్రీతో ప్రేక్షకులను రంజిపజేయడానికి శ్రీ నేరెళ్ళ వేణూ మాధవ్ ను కూడా తన బృందంలో చేర్చారు ఘంటసాల. వీరందరికీ అన్నివిధాలా సహాయ సహకారాలందించే బృంద నాయకుడి భాధ్యతలను శ్రీ  'ఎమెస్కో' కృష్ణమూర్తిగారికి అప్పగించారు. 

ఈ నాలుగు వారాల పర్యటనలో వెస్ట్ జర్మని (గొటింజన్), లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజెలిస్, శాన్ ఫ్రాన్సిస్కో, డెట్రాయిట్, చికాగో, టొరెంటో, బోస్టన్, UNO, పారిస్, కువైట్ నగరాలలో ఘంటసాల మాస్టారి సంగీత కచేరీలు జరుగుతాయని నిర్ణయించారు. ఈ విషయాలన్నీ ఘంటసాలవారితో వెళ్ళబోయే బృంద సభ్యులందరికీ తెలియపర్చడం జరిగింది. నెలరోజులపాటు విదేశీ పర్యటన అంటే సామాన్యమా!  అలాటి అవకాశం లభించడమే కష్టం. విదేశీయ ప్రేక్షకుల సమక్షంలో   తమ  కళాప్రతిభను చాటుకోవాలంటే అందరికీ మహదానందమే.  కళాకారులంతా తమ ప్రయాణానికి సంసిధ్ధం కావడం ప్రారంభించారు. 
💐💐

మద్రాస్ వాసులకు రెండే కాలాలు. తొమ్మిది మాసాలు ఎండాకాలం. మూడు మాసాలు అందరి కొంపలు ముంచే వర్షాకాలం. 'వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియదు' అనే సామెత ఇక్కడివారికి బాగా అనుభవమే. ఆ వర్షాలు ఎప్పుడైనా సైక్లోన్ రూపంలో వచ్చి జనజీవితాలను అతలాకుతలం చేస్తుంది. మిగతా రోజులంతా ఎండలతో ఉక్కపోత వాతావరణం. మద్రాసులో పుట్టిపెరిగిన వారెవరికీ చలి అంటే ఏమిటో తెలియదు. అది అనుభవించాలనుకునేవారు ఏ ఊటీకో, కొడైకెనాల్ కో పనిగట్టుకు వెళ్ళాలి. అందుచేత మద్రాసు వాళ్ళకి చలి దుస్తుల అవసరమేమీ అసలు వుండదు. అందుచేత మాకెవరికీ వులెన్ స్వెట్టర్లు, ఓవర్ కోట్లు, మఫ్లర్స్ వంటివి లేవు. ఇప్పుడదే మా నాన్నగారికి సమస్య అయింది. ఆయనకు మొదటి నుండీ అంటే విజయనగరం వచ్చినప్పటినుండీ బెంగాలీబాబుల్లా తెల్లటి పైజమా, జుబ్బాలే అలవాటు. ఇప్పుడు ఈ విదేశీ ప్రయాణం లో కొన్ని దేశాలలో అక్టోబర్/నవంబర్ ల నాటికి బాగా చలివుండే అవకాశం వుందని అందుకు తగ్గట్టుగా అందరూ కోట్లు, సూట్లు, చలి దుస్తులతో  ప్రయాణానికి సిధ్ధంగా వుండమని బృంద కళాకారులందరికీ ఆదేశాలు అందాయి. మా నాన్నగారికిదో కొత్త బెడద. మూలిగే నక్కమీద తాటిపండు. అలవాటు లేని ఔపాసన. ఈనాడు కొత్తగా పాంట్, షర్ట్ లు, సూట్లు ధరించడం, ముఖ్యంగా వాటిని సంపాదించడమే సమస్య. కొత్తవి కొనాలంటే వందలో, వేలో ఖర్చుపెట్టాలి. ఈ విదేశీయానం తర్వాత వాటి అవసరమే వుండదు. మూలన పడేయాల్సిందే. తరచూ విదేశాలలో తిరిగేవాళ్ళకు తప్పదు. ఎప్పుడో పున్నమికో, అమావాస్యకో వెళ్ళేవాళ్ళకు ఈ జంఝాటం అవసరమా? ఈ సమస్యను ఎలా సానుకూలపర్చడమా అనే ఆలోచనలో పడ్డారు మా నాన్నగారు.

అలాటి సమయంలో ఒకరోజు నాన్నగారి మిత్రుడు మధురకవి శ్యామలరావుగారు మా ఇంటికి వచ్చారు.  అప్పట్లో ఆయన ONGC లో జియోఫిజిస్ట్ గా పనిచేసేవారు. శ్యామలరావుగారితో మా పరిచయం మా నాన్నగారి మరో స్నేహితుడు ఆయపిళ్ళ రామారావుగారి ద్వారా జరిగిన గుర్తు. రామారావుగారు మద్రాసు శివార్లలో ఉన్న తిరువెట్రియూర్ (ఇప్పుడు సిటీలో కలసిపోయింది)లో వుండిన మద్రాస్ షీట్ గ్లాస్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేసేవారు. ఆయన మా నాన్నగారిని ఒకరోజు శ్యామలరావు గారింటికి తీసుకువెళ్ళేవారు. అప్పుడు ఆయన ఎగ్మూర్ ప్రాంతం పుదుప్పేటలో ఒక బజార్ వీధిలో ఒక మేడమీద పోర్షన్ లో అద్దెకు దిగారు. మద్రాస్ కు కొత్తగా వచ్చారు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కాపురం. ఆయపిళ్ళ రామారావు గారు, శ్యామలరావుగారు ఇద్దరూ మా ప్రాంతంవారే. స్వశాఖీయులే. శ్యామలరావు గారి తండ్రి బొబ్బిలి-విజయనగరం  లైన్లో వుండే కోమటిపల్లి అనే అతి చిన్న రైల్వేస్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా పనిచేసేవారని ఆయన తనకు తెలుసని మా నాన్నగారు చెపుతూండేవారు. ఆ రోజుల్లో ఆ లైన్ లో ఒక్క విశాఖపట్నం - రాయపూర్ ప్యాసెంజర్ రైలు మాత్రమే తిరిగేది. ఇప్పుడంటే అనేకమైన ఎక్స్ ప్రెస్ రైళ్ళు వచ్చాయి. ONGC వారు కావేరీ బేసిన్ లో ఎస్కవేషన్స్ మొదలెట్టిన సమయంలో శ్యామలరావుగారు ట్రాన్స్ఫర్ మీద  మద్రాసు వచ్చారు. ఆయన నెలలో ఇరవై రోజులు కాంప్ ల్లోనే వుండేవారు. ఆయన ఒక్క సౌత్ లోనే కాక హిమాలయ ప్రాంతాలలోని డెహ్రాడూన్ లో క్యాంప్ ల్లో చిన్న చిన్న టెంట్లలో తమ కార్యకలాపాలు సాగించేవారు. భార్య, ఇద్దరు పసి పిల్లలు మెడ్రాస్ లో వుండేవారు. వారెవరికి అప్పట్లో అరవ భాష రాదు. చాలా ఇబ్బందిపడేవారు. శ్యామలరావు గారు మా నాన్నగారిని అప్పుడప్పుడు వచ్చి తన కుటుంబాన్ని గమనించమని కోరారు. మా నాన్నగారు ఆ భాధ్యతను నాకు అప్పగించారు. నేను  అప్పుడప్పుడు శని ఆదివారాలలో పుదుప్పేటలో వారికి తోడుగా ఉండేవాడిని.  అప్పటినుండీ శ్యామలరావుగారితో మంచి స్నేహం పెరిగింది. శ్యామలరావుగారిలో ఒక మంచి రోల్ మోడల్ కు కావలసిన లక్షణాలన్నీ పుష్కలంగా వున్నాయి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక్క జియోఫిసిస్ట్ మాత్రమే కాదు. వంటలు, కుట్లు, అల్లికలు, చిత్రలేఖనం వంటి అనేక కళలలో కూడా నైపుణ్యం సంపాదించారు. క్యాంప్ లలో వున్నప్పుడు ఏ మాత్రం ఖాళీ దొరికిన ప్రతి వస్తువుతో ఏదో రకమైన బొమ్మలు చేసేవారు.

 


హిమాలయాలలో దొరికే రాళ్ళతో, తాటి టెంకలతో, పూసలతో, మిగిలిపోయిన సబ్బుబిళ్ళలతో రకరకాల వస్తువులు తయారు చేసి మాలాటి వారికి బహుకరించేవారు. ఆయన వేసిన అసంఖ్యాకమైన ఆయిల్ పెయింటింగ్ లు వారింటి గోడలను అలంకరించి వుంటాయి. శ్యామలరావుగారు ONGCలో డైరెక్టర్ హోదా వరకు వెళ్ళినా కూడా ఈ హ్యాండీక్రాప్ట్స్ తయారు చేయడం, పెయింటింగ్ చేయడం మానలేదు. ఆయన ఇల్లు ఒక చిన్న మ్యూజియంలా వుంటుంది. శ్యామలరావుగారు రేకీ లో గ్రాండ్ మాస్టర్. రేకి థెరపితో అనేకమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చికిత్సలు చేస్తూవుంటారు. అలా శ్యామలరావుగారి సలహాలు పొందినవారిలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ వంటి మద్రాస్ పుర ప్రముఖులెందరో వున్నారు. ఈ రేకీ విద్యకు సంబంధించిన అనేక వ్యాసాలను ఆయన "ఋషిపీఠం" పత్రికలో వ్రాసేవారు. ఇప్పటికీ, ఎనభై ఐదేళ్ళ వయసులో కూడా ఈ కళలను ఎంతో  ఉత్సాహం గా కొనసాగిస్తున్నారు. అప్పటికి శ్యామలరావుగారు రెండిళ్ళు మారారు. పుదుపేట నుండి మహాలింగపురంలో రాజుబాబు ఇంటి పక్కింటిలో ఉన్న రోజుల్లోనే మా నాన్నగారి అమెరికా ప్రయాణం. ఈ విషయం తెలిసి మా నాన్నగారిని అభినందించడానికి మా ఇంటికి వచ్చారు. మాటల సందర్భంలో మా నాన్నగారు తన చలి దుస్తుల సమస్య గురించి శ్యామలరావుగారికి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే, తన దగ్గర చాలా రకాల శీతాకాలపు దుస్తులున్నాయని వాటిలో కొన్నిటిని ఇస్తానని వాటిని అవసరం మేరకు టైలర్ దగ్గర ఆల్టర్ చేయించుకోమని కొన్ని వులెన్ పాంట్లు, ఫుల్ హ్యాండ్ షర్ట్ లు, స్వెట్టర్లు, ఒవర్ కోటు, ఇత్యాదులు చాలా ఇచ్చారు. వాటిని మా కేశవన్ టైలర్ మా నాన్నగారి సైజ్ కు తగినట్లుగా ఆల్టర్ చేసి ఇచ్చాడు. మానాన్నగారికి ఒక పెద్ద బెడద వదిలింది. శ్యామలరావుగారు ఆ రోజు ఆపధ్బాంధవుడిలా వచ్చి ఆదుకున్నారు.  1971లో అలా ఉపయోగించిన ఆ డ్రెస్ లు తర్వాత ఓ పుష్కరం తర్వాత  కూచిపూడి బృందంతో వరసగా మొదలైన విదేశపర్యటనలో కూడా ఉపయోగించిన గుర్తు. అందులో ఒకటి రెండు  BCIC  ఉత్సవాలకోసం వెళ్ళినప్పుడు ఢిల్లీ  చలిని తట్టుకోడానికి నాకు కూడా ఉపయోగపడ్డాయి. పదేళ్ళ క్రితం వరకు ఆ ఓవర్ కోట్ నా దగ్గర వుండేది.

💐💐


అక్టోబర్ 7, 1971 ఘంటసాలవారి జీవితంలో మరపురాని మధురఘట్టం. అన్ని అడ్డంకులను తొలగించుకొని తన చిరకాల వాంఛను సఫలీకృతం చేసుకోబోతున్న రోజు. ఆ రోజు ఉదయం తన బృందంతో విదేశీ పర్యటన ప్రారంభించడానికి ఘంటసాల మాస్టారు విమానాశ్రయానికి బయల్దేరారు. వారికి వీడ్కోలు చెప్పడానికి కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా ఎయిర్ పోర్ట్ కు తరలివెళ్ళారు.

తర్వాత...వచ్చే వారమే...

                     ...సశేషం

Sunday, December 12, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైయొకటవ భాగం

12.12.2021 - ఆదివారం భాగం - 61*:
అధ్యాయం 2 భాగం 60 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


ఒకప్పుడు మద్రాసు  దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు ముఖ్య కేంద్రంగా వుండేది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలన్నీ మద్రాస్ లోనే నిర్మించబడేవి. సినిమా స్టూడియోలు, సినీమా కంపెనీలు అన్నీ మద్రాసు లోనే వుండేవి. హైదరాబాద్ లో సారధీ స్టూడియో, మైసూర్ లో ప్రీమియర్ స్టూడియో వంటివి కొన్ని వున్నా చిత్ర నిర్మాణం అంతంత మాత్రమే. అక్కినేని నాగేశ్వరరావుగారు మద్రాస్ వదలి హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత క్రమక్రమంగా తెలుగు సినీమాలు హైదరాబాద్ లో తీయడం మొదలెట్టారు. అయినా చాలా కాలం వరకు సినీసంగీత విభాగం మాత్రం మద్రాసులోనే వుండేది. అధిక సంఖ్యాకులైన సంగీత దర్శకులు, గాయనీగాయకులు మద్రాసులోనే వుంటూ అక్కడి నాలుగు భాషలలో తమ ప్రతిభను చాటుకునేవారు.  తర్వాత తర్వాత అందరిలో స్వరాష్ట్రాభిమానం అధికమై తమ సొంత రాష్ట్ర రాజధానులలో చిత్రసీమను తరలించుకున్నారు. హాలీవుడ్ బాణీలో బాలీవుడ్ వస్తే దాన్ని అనుకరిస్తూ ఈనాడు టాలీవుడ్, కోలివుడ్, సాండల్ వుడ్,  అంటూ వివిధ నిర్మాణ కేంద్రాలు వెలిసాయి.

పర్వతనేని గంగాధరరావు హైదరాబాద్ కేంద్రంగా తమ హైదరాబాద్ మూవీస్/నవశక్తి ప్రొడక్షన్స్ బ్యానర్ ల మీద కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆయన సోదరుడు సాంబశివరావు అనేక సినీమాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ రాజకీయ నేత పి.ఉపేంద్ర కూడా వీరి సోదరుడేనని ఎవరో అనగా విన్నాను. అంతగా తెలియదు.

పి. గంగాధరరావు, డైరెక్టర్ సి.ఎస్.రావు దర్శకత్వంలో 'జీవితచక్రం' అనే సినీమా మొదలెట్టారు. ఎన్.టి.రామారావు, జగ్గయ్య, వాణిశ్రీ, శారద, రేలంగి, రమణారెడ్డి వంటి భారీ తారాగణం ఈ సినీమాలో వున్నారు. ఈ సినీమాకు సంగీత దర్శకులుగా శంకర్ జైకిషన్ల ను ఎన్నుకోవడం ఒక విశేషమైతే ఈ చిత్రంలోని పాటలన్నీ బొంబాయి స్టూడియోలోనే  రికార్డ్ చేయాలని సంకల్పించడం మరో పెద్ద వార్తగా ప్రచారమయింది. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ కు వున్న నాలుగు పాటలను ఘంటసాల మాస్టారిచేత పాడించడానికి నిర్ణయించారు. రెండు సోలోలు, రెండు డ్యూయెట్లు. ఈ రెండు డ్యూయెట్లను సుశీలగారి చేత కాకుండా బొంబాయి గాయని శారద పాడతారని అనుకున్నారు. ఈ నాలుగు పాటలు ఆరుద్రే వ్రాసారు. గతంలో శంకర్ జైకిషన్ల సంగీతంలో వచ్చిన 'ప్రేమలేఖలు' హిందీ డబ్బింగ్ సినీమా పాటలన్నీ ఆరుద్రగారే వ్రాసారు. ఈ సినీమాలో సి.నారాయణరెడ్డిగారు వ్రాసిన రెండు పాటలను పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం; పి.సుశీల, బి.వసంత పాడతారని అనుకున్నారు.

నాకు తెలిసి ఘంటసాలవారు పాటల రికార్డింగ్ లకోసం మద్రాసు వదలి బయట ఊళ్ళకు వెళ్ళడం చాలా అరుదు. ఒకసారి మాత్రం తన సంగీత దర్శకత్వంలో వచ్చిన 'సతీ సుకన్య' పాటల రికార్డింగ్ కోసం మైసూర్ వెళ్ళారు. మైసూర్ ప్రీమియర్ స్టూడియో లోనే ఆ సినిమా షూటింగ్ లు, రికార్డింగ్/రీరికార్డింగ్ జరిగాయి. ఆ సినీమా పాటల కంపోజింగ్ విశేషాల గురించి గతంలో 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో పేర్కొనడం జరిగింది.

జీవితచక్రంలోని నాలుగు పాటలు పాడడానికి ఒక వారం బొంబాయి లో వుండేలా ఏర్పాట్లు చేసుకోమని నిర్మాతలు అడుగుతున్నారని దానికి తగ్గట్లుగా మద్రాస్ లోని  తన షెడ్యూల్స్ ఎడ్జస్ట్ చేసుకోవాలని ఘంటసాల మాస్టారు ఇంట్లో అనేవారు. ఘంటసాలవారికి బొంబాయి  సినీమా వాతావరణం క్రొత్త. అలాగే అక్కడివారికీ ఘంటసాల అంటే ఏమిటో తెలియదు. అక్కడ మాస్టారికి తెలిసిన తెలుగు వ్యక్తి సి.వెంకటేశ్వరరావు. ఆయన బొంబాయి లో డాన్స్ డైరక్టర్ గా పనిచేసేవారు. ఆయనకు ఘంటసాలగారి పాటలంటే విపరీతాభిమానం. ఘంటసాలవారి పాత గ్రామఫోన్ రికార్డులను తన వర్క్ స్పాట్ కు తీసుకువెళ్ళి ఖాళీ సమయాలలో వింటూండేవారట. అక్కడివారందరికీ మాస్టారి పాటలు వినిపించి ఘంటసాలవారి గురించి గొప్పగా వివరించేవారట. ఆయన తర్వాత ఎప్పుడో మద్రాసు వచ్చి ఘంటసాల మాస్టారు సంగీతదర్శకత్వం  వహించిన ఒకటి రెండు సినిమా లకు నృత్య దర్శకత్వం వహించారు.

బొంబాయి చిత్రసీమ జీవన శైలికి, మద్రాస్ చిత్రసీమ జీవనరీతులకు చాలా తేడావుంది. మద్రాసు  చిత్ర నిర్మాణంలో వుండే క్రమపధ్ధతి, నిబధ్ధత, సమయపాలన మొదలైన అంశాలు బొంబాయి లో తక్కువ. అనుకున్న షెడ్యూల్స్ లో పని  సక్రమంగా పూర్తికాదని అనుకోవడం విన్నాను. ఇవే నాలుగు పాటలు మద్రాసులో అయితే రెండు కాల్షీట్లు లో ముగించేయవచ్చు. దానికోసం వారం రోజులు అవసరమా అని అనుకుంటూ ఘంటసాల మాస్టారు బొంబాయి వెళ్ళారు. శంకర్ జైకిషన్ల్ అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక పొందిన సంగీత దర్శకులు. తమ పాటలకు వందకు తక్కువ లేకుండా వెస్టర్న్  ఆర్కెష్ట్రాను భారీగా ఉపయోగిస్తారనుకునేవారు. వాళ్ళ బాణీకి ఘంటసాలవారి బాణికి చాలా తేడా వుంది. వారి పాటలలో గమకాలు ఎక్కువ వుండవు. ఆ విషయం ముఖేష్, శారద వంటి గాయకులు పాడిన పాటలు వింటే అర్ధమవుతుంది.

ఈ సినీమా నాటికే శంకర్ జైకిషన్ల్ విడాకులు పుచ్చుకున్నారు. ఎవరి సినీమాలు వారివే. కానీ, రాజ్ కపూర్ లాటి ఆప్తమిత్రుల కోసం ఇద్దరూ సంయుక్తంగానే పనిచేస్తున్నట్లు కనిపించేవారు. ఈ ఇద్దరిలో ఎవరు ఏ సినీమాకు పనిచేసినా శంకర్ జైకిషన్ల సంగీతంగానే ప్రచారం జరిగేది.

జీవితచక్రం సినీమా సంగీతం శంకర్ ది. ఈయన స్వస్థలం కూడా హైదరాబాద్. తెలుగువాడే. అయితే ఆయనకు ఎంతవరకూ తెలుగు గుర్తుందో నాకు తెలియదు. బొంబాయిలో దిగిన ఘంటసాల మాస్టారిని  గౌరవప్రదంగా స్వాగతించి తీసుకువెళ్ళారు.

సామాన్య దాక్షిణాత్యుల మాదిరిగా మామూలు  తెల్లలుంగీ, తెల్ల షర్ట్ లో కనిపించే ఈ గాయకుడు బొంబాయి వాద్యగాళ్ళనేమీ పెద్దగా ఆకర్షించలేదట ఏదో సాదాసీదా గాయకుడిగా భావించారు. రిహార్సల్స్ జరిగాయి. పాడడానికి కష్టమనుకుంటే బిట్ బై బిట్ రికార్డ్ చేద్దామన్నారట. అలాటి అలవాటే ఘంటసాలవారికి లేదు. మొత్తం పాటంతా ఒకేసారి పాడేయాల్సిందే. మోనిటర్ చూడడానికి మైక్రోఫోన్స్ ఆన్ చేయగానే అప్పుడు తెలిసింది ఘంటసాల అంటే ఎవరో. ఆ గళంలోని స్థాయికి , గాంభీర్యానికి వైబ్రేషన్స్ తో రికార్డింగ్ ధియేటర్ దద్దరిల్లిందట. అక్కడున్న మ్యుజిషియన్స్ అందరూ ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యారట.  ఈ గాయకుడెవరో సామాన్యుడు కాడని అర్ధమయింది. ఒకటి రెండు టేకులలో పాట అంతా ok.  శంకర్ జైకిషన్ల ఆర్కెష్ట్రా అంతా ఒక్కుమ్మడిగా లేచి నిలబడి  చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేసారట. అలాగే మొత్తం నాలుగు పాటలను రెండు రోజుల్లో ముగించేసి మూడోరోజు సాయంత్రానికి ఘంటసాల మాస్టారు తిరిగి మద్రాసు వచ్చేసారు. వారం రోజులన్నది మూడు రోజుల్లోనే వచ్చేసరికి అందరికీ ఆశ్చర్యం, ఆందోళన కలిగింది బొంబాయి రికార్డింగ్ లు ఏమైనా క్యాన్సిల్ అయ్యాయేమోనని. అదేంలేదు, నాలుగు పాటల రికార్డింగ్ లు ముగించే వచ్చానని చెప్పారు.  ఈ పాటలు పాడడంలో పెద్దగా కష్టపడలేదని ఈ రకమైన పాటలు రోజుకు మూడు నాలుగైనా సునాయాసంగా పాడవచ్చని చెప్పారు. పనిలేకుండా వారంరోజులు హోటల్లో గడపడం తనకు ఇష్టంలేదని, దానివల్ల నిర్మాత కు అనవసరపు ఖర్చు తప్ప ఇంకేమీ వుండదని, అదే ఇంటికి వచ్చేస్తే ఇక్కడి పనులు చూసుకోవచ్చని వచ్చేసినట్లు చెప్పారు. బొంబాయి శంకర్ తనను ఎంతో గౌరవించారని, తనను బొంబాయి వచ్చేయమని తాను  మ్యూజిక్ చేసే హిందీ సినీమాలలో, లాటిన్, ఫ్రెంచ్ భాషలలో ఆల్బమ్స్  పాడిస్తానని బలవంతపెట్టారట. అందుకు ఘంటసాల మాస్టారు వినయంగా తాను తెలుగు చిత్రసీమలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా పాడుతున్నాని, అక్కడ వున్న స్థానము, పొందుతున్న గౌరవము, ప్రజాభిమానమే చాలని, తెలియని భాషలు కొత్తగా నేర్చుకొని పాడేంత ఆసక్తి, సమయమూ తనకు లేవని తెలియజేసారట. తాను అక్కడున్న మూడు రోజులలో సాయంత్రం పూట ఎంతో మంది సంగీతప్రియులు మాస్టారి రూమ్ కు వచ్చి ఆయనచేత పాడించి విని ఆనందించేవారట. మాస్టారు చెప్పిన అనేకమంది పేర్లలో ఈనాడు నాకు గుర్తున్నది మాలాసిన్హా పేరు మాత్రమే. 

అది ఘంటసాలవారి వ్యక్తిత్వం.

అందుకే  ఆకారాన్ని, వేష భాషలను చూసి మనిషిని అంచనా వేయకూడదంటారు.

జీవితచక్రం శంకర్ జైకిషన్ల మొదటి తెలుగు చిత్రం. (ప్రేమలేఖలు డబ్బింగ్). ఈ చిత్రంలోని పాటలన్నీ గతంలో శంకర్ జైకిషన్ల్ చేసిన పాటల ధోరణిలోనే వినిపిస్తాయి. దానికి కారణం బహుశా, తమ పాటల మీద తమకున్న మమకారం, మక్కువ కావచ్చు, అవే ట్యూన్స్ తిరిగి తిరిగి శ్రోతలకు వినిపిస్తాయి. ఇది రాజ్ కపూర్ ప్రభావం అని నాకనిపిస్తుంది. రాజ్ కపూర్ తీసిన మొదటి తరం సినీమాలోని పాటల బిట్లు తర్వాత వచ్చిన సినీమాలన్నిటిలో ఎక్కడో దగ్గర అంతర్లీనంగా నేపథ్య సంగీత రూపంలో సుశ్రావ్యంగా వినిపిస్తూంటాయి. 'తినగ తినగ వేము తియ్యగుండు' అన్నట్లు పాత పాటలైనా పదేపదే వినిపిస్తూంటే శ్రోతల హృదయాలకు మరింత చేరువ అవుతాయి.

ఆ విధంగా జీవితచక్రంలోని ఏడు పాటలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగించేవే, ఒక్క 'సుడిగాలి లోన దీపం కడవరకు వెలుగునా' పాట తప్ప. ఇది విషాదగీతం. ఈ పాటలో ఘంటసాలగారి  గళంలో వినపడే విషాద భావోద్రేకాలు, గాంభీర్యం ఎలాటివారినైనా కరిగిస్తాయి. 'కంటి చూపు చెపుతోంది', హిందీ గాయని శారదతో  పాడిన  " కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడు", "మధురాతి మధురం మన ప్రేమ మధురం" పాటలు   అన్ని వర్గాల శ్రోతలచేత స్టెప్ లు వేయించేలా ఉత్సాహభరితంగా మాస్టారు పాడారు.


కంటి చూపు చెబుతోంది - జీవితచక్రం

1971 లో వచ్చిన చాలా సినీమాలలోని పాటలు ఘంటసాలవారికి మంచి కీర్తి ప్రతిష్పలనే సంపాదించి పెట్టాయి. 'పదిమందిలో పాట పాడినా' (ఆనందనిలయం), "మొదటి పెగ్గులో మజా" (శ్రీమంతుడు) పాటలు ఈనాటికీ వినిపిస్తున్నాయి. 


పదిమందిలో పాట పాడినా - ఆనందనిలయం


ఆ సంవత్సరంలో అతి ఘన విజయం సాధించిన సినీమా 'ప్రేమ నగర్'. వరస పరాజయాలతో బాగా కృంగిపోయి ఇక మద్రాసు వదలి పోవడం తప్ప  వేరే మార్గంలేదని నిశ్చయించుకున్న తర్వాత ఆఖరు ప్రయత్నంగా డి.రామానాయుడుగారు నిర్మించిన చిత్రం 'ప్రేమనగర్'. దేవదాసు టైప్ సినీమా. దేవదాసు పాటల్లాగే కె.వి.మహాదేవన్ చేసిన ప్రేమనగర్ పాటలన్నీ సూపర్ హిట్ అయాయి.  దేవదాసుకు వచ్చినంత పేరు ఘంటసాలవారికి ఈ సినీమా పాటలతో వచ్చింది. ఈ సినీమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమిళ, హిందీ భాషలలో కూడా ప్రేమనగర్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఈ సినీమా తర్వాత రామానాయుడు శతాధిక సినీమాలు తీసి,  సొంత స్టూడియో కట్టి 'మూవీ మొఘల్' అనే కీర్తిపొందారు. తెలుగు సినీమా ప్రముఖులలో ప్రముఖుడిగా వెలుగొందారు.

ప్రేమనగర్ లో ఘంటసాల మాస్టారి పాటలు ఎనిమిది వున్నాయి. "అంతము లేని ఈ భువనమంత" పద్యం, "మనసు గతి ఇంతే", "ఎవరి కోసం , ఎవరికోసం", "నేను పుట్టాను లోకం మెచ్చింది', "తేట తేట తెలుగులా", "నీకోసం వెలిసింది ప్రేమ మందిరం", "కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల' పాటలన్నీ ఒక నూతన చరిత్ర సృష్టించాయి. ప్రేమనగర్ సినీమా రామానాయుడుగారి జీవితంలో ఒక అనూహ్యమైన మలుపు.

మనసు గతి ఇంతే - ప్రేమనగర్


1971 వ సంవత్సరం ఆఖరులో వచ్చిన మరో భారీ చిత్రం ఎన్.టి.రామారావు గారి సొంతచిత్రం ' శ్రీకృష్ణ సత్య'. పేరుకు డైరెక్టర్ గా కె.వి.రెడ్డిగారిని నియమించినా నిర్మాణ భాధ్యత అంతా రామారావుగారిదే.

దేశరక్షణనిధి కోసం రామారావుగారి నేతృత్వంలో సినీ పరిశ్రమ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సాంస్కృతికోత్సవాలు నిర్వహించింది. అ సందర్భంలో రామారావుగారు శ్రీకృష్ణుడిగా ఈ కథను నాటకంగా ప్రదర్శించారు. దానికి ఘంటసాల మాస్టారే సంగీత భాధ్యతలు వహించారు. ఆ సమయంలో రామారావుగారు  ఇదే కథను సినీమాగా తీస్తానని ఆ సినీమాకు మీరే సంగీతం చేపట్టాలని ఘంటసాల మాస్టారిని అడిగారట. మాస్టారు సరేనన్నారు. రక్షణనిధి కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి. ఎవరి పనుల్లో వారు పడ్డారు. త‌ర్వాత ఎన్.టి.ఆర్ 'కృష్ణసత్య' ను ప్రారంభించారు. కానీ సంగీత దర్శకుడిగా ఘంటసాలవారిని తీసుకోలేదు. ఎన్.ఎ.టిలో పెండ్యాల గారు ప్రవేశించారు. అయినా ఘంటసాలవారు బాధపడలేదు. తను పాడవలసిన పాటలుంటే అవి ఎలాగూ పాడిస్తారు అనే భావనలో వుండేవారు. కానీ నేను మాత్రం, వస్తాయనుకున్న కొన్ని సినీమాలు చేజారిపోతూంటే, కొన్ని కారణాల వల్ల  బాగా నిరాశ చెందుతూండేవాడిని. సినీమా పూర్తి పౌరాణికం కావడం వలన పద్యాలు పాటలు సమృధ్ధిగానే వుంటాయి. ఈ సినీమాలో తిరుపతి వెంకటకవులు వ్రాసిన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు,  ఓ రెండు పాటలు మొత్తం ఓ పదమూడు వరకూ  మాస్టారు పాడారు. 'ప్రియా ప్రియా మధురం', "అలుకమానవే చిలకల కొలికిరో" పాటలను పెండ్యాల గారు మధురంగా స్వరపర్చారు. 

1970లో  ప్రారంభమై  1971లో విడుదలైన  ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలు నాలుగు అవి, గత వారంలో చెప్పిన
'రంగేళీరాజా', 'పట్టిందల్లా బంగారం', ఎడిటర్ హరినారాయణ సినీమా 'పట్టుకుంటే లక్ష'. ఈ  రెండు సినీమాలలో సంగీతానికి పెద్ద ప్రాధాన్యం లేదు. 'పట్టుకుంటే లక్ష' క్రైమ్ సినీమా. కొమ్మూరి సాంబశివరావుగారి డిటెక్టివ్ నవల ఆధారంగా తీసినది.

ఆ సంవత్సరం ఆఖరులో  రామవిజేతా బాబూరావు సినీమా 'రామాలయం'. ఇందులోని పాటలన్నీ జనరంజకంగా అమరాయి. ముఖ్యంగా మాస్టారు పాడిన 'జగదభిరామా రఘుకుల సోమా', జిక్కి, జానకి పాడిన 'చిన్నా‌రి మరదలికి పెళ్ళవుతుంది", 'మముగన్న తల్లిరా భూదేవి', ఎల్.ఆర్.ఈశ్వరి పాడిన 'మదనా మదనా యనుచును' పాటలు మరింత వినసొంపుగా వుంటాయి.

జగదభిరామ - రామాలయం


'రామాలయం' చిత్రం రీరికార్డింగ్ జరిపే సమయానికి ఘంటసాలవారు తన బృందంతో విదేశీ పర్యటనకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మాస్టారి కోరికను మన్నించి ఎస్.రాజేశ్వరరావుగారు రీరికార్డింగ్ పోర్షన్ కు సంగీతం నిర్వహించారు. మాస్టారి పెద్ద కుమారుడు ఘంటసాల విజయకుమార్ సంగీత సహాయకుడిగా రాజేశ్వరరావు గారికి సహకరించాడు.

ఘంటసాలవారి విదేశీయానం కార్యక్రమాలన్ని ఒక కొలిక్కి వచ్చినట్లే. ఒక శుభ ముహుర్తం చూసుకొని బయల్దేరడమే తరువాయి.

ఆ విశేషాలన్ని వచ్చే వారం...

               ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, December 5, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైయవ భాగం

05.12.2021 - ఆదివారం భాగం - 60*:
అధ్యాయం 2  భాగం 59 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

'గాన గంధర్వుడు' శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారి జయంతి సందర్భంగా అశేషాభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.



🔔🌷🌿💐🔔🌺🌿🙏

జగపతి పిక్చర్స్ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ గారు ఘంటసాలవారికి సన్నిహిత మిత్రులు. ఘంటసాల మాస్టారిపట్ల చాలా గౌరవ మర్యాదలు చూపేవారు. కళాకారులకు చాలా ప్రామ్ట్ గా పారితోషకాలు చెల్లించడం విషయంలో ఎప్పుడూ ప్రధమంగా వుండే ఉత్తమ నిర్మాత. మంచి సహృదయుడు. ఘంటసాల మాస్టారి అవసరాలను డిమాండ్ ను గమనిస్తూ ఎప్పటికప్పుడు పారితోషకాలను పెంచడంలో ఇతర నిర్మాతల కంటే ముందంజలో వుండేవారని చెపుతారు. రాజేంద్రప్రసాద్ గారు చిత్రనిర్మాణం చేపట్టి  మద్రాసులో అడుగుపెట్టేనాటికి ఆయనకు ఆ రంగంలో పెద్ద అనుభవంలేదు. తన మొదటి చిత్రాన్ని ఎవరైనా భాగస్వాములతో కలసి నిర్మించే యోచనలో వున్నారు. ఆ క్రమంలో రాజేంద్రప్రసాద్ గారు ఘంటసాలవారిని కలుసుకొని తనతో భాగస్వామి గా  చేరమని వరసగా చిత్రనిర్మాణం చేపడదామని కోరారు. అప్పటికి ఘంటసాలవారి సొంతచిత్రం ' భక్త రఘునాధ్' నిర్మాణంలో వుంది. అప్పటికే రెండు సినీమాల అపజయంతో అప్పుల్లో మునిగితేలుతూవున్న సమయంలో ఏ అనుభవం లేని కొత్త యువకుడిని భాగస్వామిగా చేసుకొనే విషయంలో ఘంటసాలవారు వెనుకంజ వేసారు. ధైర్యంచేసి ముందుకు వెళ్ళలేకపోయారు. నిర్మాతగా రాశిలేని తనతో మరొక కొత్త నిర్మాత చేరడం ఆ వ్యక్తికి అంత శ్రేయస్కరం కాదని భావించి అదే విషయాన్ని సున్నితంగా రాజేంద్రప్రసాద్ గారికి నచ్చచెప్పి గాయకుడిగా తన పరిపూర్ణ సహకారం ఎప్పటికి వుంటుందని భరోసా ఇచ్చారట (ఈ విషయాలన్నీ  మాస్టారి సోదరుడు,  జి.వి.ఎస్.ప్రొడక్షన్స్ నిర్మాత ఘంటసాల సదాశివుడుగారు చెప్పినవి).

తర్వాత, రాజేంద్రప్రసాద్ గారు మరొకరి  భాగస్వామ్యంలో  1960లో "అన్నపూర్ణ" చిత్రం తీసారు . నిర్మాత వీరమాచనేని, దర్శకుడు వీరమాచనేని కలసి పనిచేసిన మొదటి చిత్రం. అందులో ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. మొదటి చిత్రంతోనే చిత్రరంగానికి సంబంధించిన విషయాలన్ని ఆకళింపు చేసుకొని వరసగా 'అ', 'ఆ'లు మొదటి అక్షరంగా వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో అనేక సినీమాలు తీసి నిర్మాతగా ఘన విజయాలు సాధించారు వీరమాచనేని రాజేంద్రప్రసాద్. ఒక పదేళ్ళ తర్వాత  వీరమాచనేని కాంబినేషన్ లో మార్పు చేయవలసిన పరిస్థితి వచ్చింది. 'అ ,ఆ' ల సినిమా లకు బ్రేక్ పడింది. ఈసారి స్వీయ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ 'దసరాబుల్లోడు' సినీమాను రంగులలో తీసారు. ఆ సినిమా లో పాటలన్నీ విపరీత జనాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. జగపతి సినీమాలంటేనే పాటలు ప్రధానంగా జనాకర్షణగా వుంటాయనే పేరు వచ్చింది. వి.బి.రాజేంద్రప్రసాద్ గారి సినిమాలన్నింటిలోనూ ఘంటసాలవారు పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. జగపతికి అక్కినేని, జగ్గయ్య,  కె.వి.మహాదేవన్, ఆత్రేయ, ఘంటసాల, సుశీల కాంబినేషన్ ఒక అమూల్యమైన ఆస్తి. 

వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శక నిర్మాతగా 1971 లో రిలీజైన అక్కినేని బ్లాక్ బస్టర్  'దసరాబుల్లోడు'లో ఘంటసాలవారు ఏడు పాటలు పాడారు. కుర్రకారును వెర్రెక్కించిన పాటలు పాడడంలో కూడా ఘంటసాలే టాప్ అనడానికి ఈ సినీమా పాటలు ఒక నిదర్శనం. 'ఎట్టాగో వున్నాది ఓలమ్మి', 'పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, 'నల్లవాడే అల్లరి పిల్లవాడే', చేతిలో చెయ్యేసి చెప్పు బావా' పాటలు ఈనాటికీ వినిపిస్తూనే వున్నాయి. దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో  నిర్మాత గా అంచెలంచెలుగా అగ్రస్థాయికి చేరుకున్న నిర్మాత వీరమాచనేని రాజేంద్రప్రసాద్. 

"ఈయనతో ఘంటసాల మాస్టారు భాగస్వామ్యం చేపట్టివుంటే !!!"... అని మాబోటిగాళ్ళం అనుకోవడమే... వారికి మాత్రం ఎప్పుడూ అలాటి ఆలోచనే వుండేది కాదు.

🔔

నెం. 36, ఉస్మాన్ రోడ్ వెనక వేపు ఇంట్లో వుండే రాజగోపాలన్ మామ మామగారు కాలంచేశాక (అనే గుర్తు) మామా, మామీల కుటుంబం మెయిన్ బిల్డింగ్ లోకి వచ్చేసారు. ముందుభాగం గేట్ ఉస్మాన్ రోడ్ లో వుండగా వెనక భాగం గేటు ఆనందం స్ట్రీట్ లో వుండేది. పేరుకే ఆనందం స్ట్రీట్, అందులోకడుగు పెడితే ఏ ఆనందం ఉండేది కాదు. ఆ వీధి పక్కన రంగరాజపురం చిన్న గేటు (రైల్వేగేటు) దాక విస్తరించి ఉండే గుడెసెవాసులుండే రాజపిళ్ళై తోట్టంలోని పిల్లలకి ఆ వీధి మొదటి వంద మీటర్లూ ఓ ఓపెన్ టాయ్ లెట్. కొంచెం అప్రమత్తంగా లేకుండా కాలేస్తే మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తి కాళ్ళు కడుక్కోవలసి వచ్చేది.  ఆ వీధిలోనే ఏడిద నాగేశ్వరరావుగారు, మాడా వెంకటేశ్వరరావుగారు, కృష్ణంరాజుగారు  చిన్న అద్దె ఇళ్ళలో కాపురముండేవారు. ఆ 36 ఉస్మాన్ రోడ్ మెయిన్ బిల్డింగ్  వెనక భాగం, ఆనంద్ స్ట్రీట్ లో ఉన్న ఇంట్లోకి ఒక తెలుగు కుటుంబం వచ్చింది. అప్పటికే మెయిన్ బిల్డింగ్ మేడ మీద అద్దెకున్న మండా బుచ్చిరామారావుగారికి ట్రాన్సఫర్ కావడంతో వారు మద్రాస్ నుండి వెళ్ళిపోయారు. ఈ వెనకింటికి అద్దెకు వచ్చినవారు కూడా సినీమా నిర్మాతే. భార్య, ఒక కుమార్తెతో ఆ ఇంట్లో వుండేవారు. ఆయన పేరు కోగంటి కుటుంబరావుగారు. ఆయన ఉత్తమచిత్ర బ్యానర్ మీద 'మనసు-మాంగల్యం' అనే సినిమాను అక్కినేని, జమున హీరో హీరోయిన్ లుగా మొదలెట్టారు. కె.ప్రత్యగాత్మ డైరక్టర్. పెండ్యాల గారి సంగీతం. కోగంటివారి అమ్మాయి మా చెల్లెళ్ళ వయసుదే. మా రెండిళ్ళ మధ్య ఒక పిట్టగోడ అడ్డు. పిల్లలంతా ఆ గోడ దూకే రాకపోకలు సాగించేవారు.  ఆ అమ్మాయి తమ సినీమా షూటింగ్ విషయాలు మాస్టారి పిల్లలకు చెప్పేది.  అందరితో స్నేహంగా మసిలేది. వయసుకు చిన్నే అయినా మహా ధైర్యస్తురాలు. 
తర్వాత హిందీ ప్రచార సభ సమీపంలోని భాగీరధీ అమ్మాళ్ స్ట్రీట్ లోని ఒక మేడమీదకు మారిపోయారు. ఆ వీధిలోనే కైకాల సత్యనారాయణ గారి బంగళా కూడా వున్న గుర్తు. ఆ కోగంటి వారి అమ్మాయిని ఓ రెండు దశాబ్దాల తర్వాత నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో వున్నప్పుడు మరల చూసాను. 

'మనసు మాంగల్యం' సినీమాలో  ఘంటసాల మాస్టారి పాటలు నాలుగున్నాయి. రెండు సోలోలు, రెండు డ్యూయెట్లు. 'ఏ శుభ సమయంలో', 'ఎందుకు వచ్చావో...', 'ఆవేశం రావాలి..' పాటలకు పెండ్యాలగారు మంచి వరసలు సమకూర్చారు. 

🌷

1971  ఫిబ్రవరి మూడవ వారంలో ఒక రోజు ఉదయాన్నే బయల్దేరి రాయపురంలో వున్న శ్రీ బి డి రావు గారి కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఆయనే దక్షిణ విభాగపు అధిపతి. ప్రపంచంలో 14 దేశాలలో ఆ కంపెనీ ఫ్యాక్టరీలు, సేల్స్ ఆఫీసులు వున్నాయి. మన దేశంలో నాలుగు ప్రధాన నగరాలలో ఫ్యాక్టరీలు, అనుబంధంగా అనేక ప్రధాన పట్టణాలలో సేల్స్ ఆఫీసులు వుండేవి.  ఆ కంపెనీకీ వెళ్ళేవరకు ఆ కంపెనీ గురించి ఏమీ తెలియదు. ఏ పోస్ట్ కోసం రమ్మన్నారో, ఎవరు ఇంటర్వ్యూ చేస్తారో, ఏమి అడుగుతారో అంతకన్నా తెలియదు. ఫ్రంటాఫీస్ లో ఒక్కడినే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. ఓ అరగంట తర్వాత ఓ కళ్ళద్దాల ఆయన వచ్చి మేనేజర్ గారు పిలుస్తున్నారని ఆయన రూమ్ కు దారి చూపాడు. లోపల బి.డి.రావుగారు వున్నారు. ఆయన నన్ను కూర్చోమని చెప్పి నా సర్టిఫికెట్ లు చూసి, "చూడు! మా  చీఫ్ ఎక్కౌంటెంట్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తాడు. అతనికి నీ పట్ల నమ్మకం, తృప్తి కలిగితేనే నీకు జునియర్  స్టెనో టైపిస్ట్ ఉద్యోగం. లేకపోతే లేదు. జాగ్రత్తగా చూసుకో! వెళ్ళి చీఫ్ ఎక్కౌంటెంట్ ను కలియమని చెప్పి పంపేసారు. అతని రూమ్ ఎక్కడో తెలియదు. ఎవరో చెపితే అటుప్రక్క వెళ్ళాను. మొదట్లో నన్ను రావుగారి ఛాంబర్ కు పంపిన కళ్ళద్దాలాయనే చీఫ్ ఎక్కౌంటెంట్. ఆయన మళ్ళీ నా సర్టిఫికెట్ లు అన్నీ తిరగేసి  పక్క రూమ్ లో వున్న ఒక టైప్ రైటర్ దగ్గరకు తీసుకుపోయి ఉద్యోగం కావాలని ఇంగ్లీష్ లో ఒక లెటర్ టైప్ చేసి చూపించమని అడిగారు. నేను బి.ఎ. అంటే పాసయ్యాను కానీ ఇంగ్లీష్ లో నా ప్రవేశం అంతంత మాత్రమే. స్పెల్లింగ్ మిస్టేక్స్ అసలు వుండేవి కావు. అంతలా మా బొబ్బిలి హైస్కూలు లో భట్టీయం వేసేవాళ్ళం రాగయుక్తంగా. కాకపోతే ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడంగానీ,  వ్యాకరణం తప్పులు లేకుండా నాలుగు వాక్యాలు వ్రాయడం కానీ తెలిసేది కాదు. ఆ మాటకొస్తే తెలుగు అంతే అనుకోండి. 

మొత్తానికి ఓ అరగంట కష్టపడి టైపింగ్ మిస్టేక్స్ లేకుండా ఒక అప్లికేషను టైప్ చేసి  చూపాను.  అది చూసిన తర్వాత ఆయన ఓ రెండు నీలం రంగు మెమో పాడ్ కాగితాలిచ్చి తాను రాసిన ఒక లెటర్ ను టైప్ చేయమన్నారు. సరేనని మళ్ళీ టైపిస్ట్ రూముకు వెళ్ళాను. అదొక హాలీడే  నోటీస్. ఏ కారణం చేతనో ఆ మర్నాడు ఫ్యాక్టరీ, ఆఫీసులకు సెలవు. అందుకు బదులుగా మరో శనివారం రోజున పనిచేయాలన్నది అందులో సారాంశం. నిజం చెప్పొద్దు.  ఆ నోటీస్ టైప్ చేయాల్సిన పనే లేదు. ఆ దస్తూరీ ముత్యాలకోవ. చాలా అరుదుగా అంత చక్కటి చేవ్రాత చూస్తాము. బొబ్బిలి లో మా టైపింగ్ గురువులు, పెద్దలు భళ్ళమూడి గోపాలరావుగారి రాక్షస సాధనలో ఉత్తరాలు, స్టేట్మెంట్ లు , బ్యాలన్స్ షీట్లు ఇత్యాదులు టైప్ చేయడమంటే నల్లేరుమీది బండే. ఆ రోజు నా అదృష్టం, షార్ట్ హాండ్ లో డిక్టేషన్ తీసుకోమని అడగలేదు. చేతిలో షార్ట్ హాండ్ సర్టిఫికెట్ వున్నా ప్రత్యక్షానుభవంలేదు.

ఆ ఎక్కౌంటెంట్ గారు ఇచ్చిన మెమో నోటీస్ కూడా జాగ్రత్తగా డిస్ప్లే చేసి టైప్ చేసి ఇచ్చాను. నన్ను మళ్ళా ముందరి రిసెప్షన్ రూములో కూర్చోమని చెప్పి నేను టైప్ చేసిన రెండు ఉత్తరాలను పట్టుకొని ఆ చీఫ్ ఎక్కౌంటెంట్ గారు రీజినల్ మేనేజర్ బి.డి.రావుగారి రూములోకి వెళ్ళారు.

ఈ సందర్భంలో   పాత సంగతి  ఒకటి జ్ఞాపకానికి వచ్చింది. డిగ్రీ చేతికి రాగానే మద్రాసులో ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టిన రోజుల్లో రాయలా కార్పరేషన్ లో పని చేసే ఒకాయన ఇంటికి వెళ్ళాను.  ఆ కంపెనీ హాల్డా టైప్ రైటింగ్ మెషిన్లను తయారీ చేసేది.  సైదాపేట దాటి వేలచ్చేరి రోడ్ కు ముందు గిండీలో వుండేది. అది బొబ్బిలి రాజావారి కంపెనీ.  ఆయన బొబ్బిలి రాజావారికి క్యాంప్ సెక్రెటరి. ఆయనను అదే మొదటిసారి చూడడం.  ఇల్లు సౌత్ ఉస్మాన్ రోడ్ చివర సి.ఐ.టి.నగర్ లో వుండేది. వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకోగానే లోపలనున్న ఆయన శ్రీమతిని బయటకు పిల్చి "వీడెవడో తెలుసా ! మా సుందరి కొడుకు. వీళ్ళమ్మ, మా అక్కలు మంచి ఫ్రెండ్స్.  వీళ్ళ తాతే  ఘంటసాలకు సంగీతం నేర్పాడు. వీళ్ళ నాన్న సంగీతరావుగారు. హార్మోనియం మీద అద్భుతంగా పాటలు, పద్యాలు పాడతారు. నేనూ కృష్ణ రాయబారం పద్యాలు పాడతాను అంటూ "చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు" అంటూ నాటకం బాణీలో  ఆరున్నర శ్రుతిలో కయ్ మని వినిపించారు. "నీక్కాకపోతే ఇంకెవడికి వస్తుందిరా ఉద్యోగం. ఒక అప్లికేషను రాసి ఇయ్యి  అని అన్నారు. నేను అప్పటికే మా నరసింగడి సహాయంతో వ్రాసిన ఇంగ్లీష్ అప్లికేషను చేతిలో పెట్టాను. అది చూసిన వెంటనే 'ఏ వెధవరా నీకు ఇంగ్లీష్ నేర్పింది. ఇలా రాస్తే ఎవడు ఉద్యోగం ఇస్తాడు. అంటు నా కాగితం నాకే తిరిగిచ్చారు. అందులోని మొదటి వాక్యం "Being given to understand that there are some vacancies in your esteemed organization (.) I wish to apply for the same...." అని రాసాను. తరవాత తెలిసింది (,) ఉండవలసిన చోట ఫుల్ స్టాప్ పెట్టాను. ఈరోజుల్లోలాగా just a typo అని తేలిగ్గా తీసుకునేవాళ్ళుకారు ఆరోజుల్లో. కరెక్షన్స్ కి అసలు అవకాశం ఇవ్వురు. ఆయన మళ్ళా మరోలా లెటర్ రాయింపించి తీసుకొని, "తప్పకుండా నీకు నేను ఉద్యోగం వేయిస్తానురా! వారానికో పదిరోజులకో ఒకసారి వచ్చి కలుస్తూండు. మేమంతా నీకు కావలసినవాళ్ళమే" అంటూ భుజం తట్టి పంపారు. నిజంగానే వెంటనే ఉద్యోగం వచ్చినంత సంబరం కలిగింది. పదేసి రోజులకు ఒకసారి ఆయన దర్శనం చేసేవాడిని.  అలాగే నెలలు, ఏళ్ళు గడిచిపోయాయి. నాకు కాలం కలసిరాలేదు. మళ్ళా ఈ మధ్య నా పెళ్ళి ఇన్విటేషన్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు నన్ను అభినందిస్తూ "బొబ్బిలి రాజావారికి కూడా ఒక ఇన్విటేషన్ పంపు. ఎడ్రస్ ఇస్తాను. ఎవడికోసం వస్తాడు. మీనాన్న చిన్నప్పుడు ఆయన మీద పట్టాభిషేకం ఉత్సవాలు జరిగేప్పుడు హైస్కూలులో పాటలు పాడేడు తెలుసా! మీ నాన్న, మా చిన్నన్న దక్షి క్లాస్మేట్స్. ఆ కృతజ్ఞత మీదైనా రావాలి. నేను వచ్చేలా చేస్తాను." ఇది ఆ వైట్ & వైట్ షార్ట్ మ్యాన్  ధోరణి. ఆయనే మా బొబ్బిలి,  తాతా వెంకట కామేశ్వర శాస్త్రి, ఉరఫ్ కృష్ణశాస్త్రి. సాంస్కృతిక రంగంలో అపర భగీరథశాస్త్రి, సింపిల్ గా టి.వి.కె.శాస్త్రి.

చదువు చెప్పే గురువులంతా శ్రధ్ధగా బాగానే చెపుతారు. తమ శిష్యులంతా వృధ్ధిలోకి రావాలనే ధ్యేయంతోనే వుంటారు. నేర్చుకునేవాళ్ళకి తెలివితేటలు లేకపోతే వాళ్ళేంచేస్తారు. ఎలుగ్గొడ్డు చర్మాన్ని ఎంత వుతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు.  కానీ కాలక్రమంలో మనిషి జీవితంలోని వివిధ అనుభవాలు వివిధ రకాల పాఠాలు నేర్పుతాయి. దానితో మనిషి తెల్లగాను (ఉత్తముడిగానూ) మారవచ్చు, లేదా నల్లగానూ (దుర్మార్గుడిగానూ) మారవచ్చు. 

మేనేజర్ గారి రూమ్ లో నుండి మళ్ళీ పిలుపు వచ్చింది. లోపలికి వెళ్ళాను. అక్కడ రావుగారితో పాటు ఇందాకటి చీఫ్ ఎక్కౌంటెంట్, మరో కమర్షియల్ మేనేజర్ ఉన్నారు. ఇప్పుడే కలకత్తా హెడ్ ఆఫీస్ లోని పెర్సనల్ మేనేజర్ తో మాట్లాడాను. "నిన్ను జూనియర్ స్టెనో టైపిస్ట్ గా ఎపాయింట్ చేయడానికి ఒప్పుకున్నారు, ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతావు" అంటూ తన టేబిల్ డ్రాయర్ సొరుగులోని  ఓ చిన్న పంచాంగం చూసి మార్చ్ 1 బాగుంది. మంచి రోజు. రాహుకాలం లేని సమయంగా చూసి రిపోర్ట్ చెయ్యి. సిన్సియర్ గా పనిచేసి వృధ్ధిలోకి రా అని అక్కడి ముగ్గురు అభినందించి పంపారు.

అంతే,  కంపెనీలోని అందరి సహకారంతో, 1971 మార్చ్ 1 నుండి ఓ 28 ఏళ్ళపాటు అదే కంపెనీలో రెవిట్ అయిపోయి, కంపెనీలోని వివిధ శాఖలలో  విశ్వాసంగా పనిచేసి వియ్యారెస్ (vrs) మీద సగౌరవంగా బయటకు వచ్చాను. 

🌿

విదేశాలలో తెలుగు పాటకు ప్రాచుర్యం కల్పించాలనేది ఘంటసాలవారి చిరకాల వాంఛ. 1962లోనో 63లోనో ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో ప్రముఖుల సమక్షంలో జరిగిన సంగీత కచేరీలో లభించిన ప్రశంసలు, ప్రోత్సాహం చూశాక ఆ కోరిక మరింత బలపడింది. రాష్ట్రవ్యాప్తంగా తన పేరిట లలిత సంగీత కళాశాలలు నెలకొల్పి అన్ని విద్యలలాగే నిర్దిష్టమైన పధ్ధతిలో శాస్త్రీయ సంగీతానికి వున్నట్లే లలిత సంగీతానికి సిలబస్ లు తయారుచేయించి సంగీత శిక్షణలు ఇవ్వాలనేది మరో కోరిక. కానీ, తనకున్న నిరంతర కార్యకలాపాల ఒత్తిడిలో తన ఆశయాలు నెరవేరడంలో జాప్యం కలిగింది. రాష్ట్ర రాజధానిలో తన సినీజీవిత రజతోత్సవ వేడుకల అనంతరం  ప్రపంచం నలుమూలలనుండి అభిమానుల ప్రోత్సాహంతో  అక్కడి తెలుగువారు అందజేస్తామన్న సహాయ సహకారాల బలంతో సాధ్యమైనంత త్వరలో విదేశాలలో సంగీత యాత్ర చేపట్టాలనే దృఢనిశ్చయానికి వచ్చారు. ఆ దిశగా ప్రముఖుల సలహా సంప్రదింపులతో కేంద్రస్థాయిలో ప్రయత్నాలు మొదలెట్టారు. అవి సఫలీకృతమవుతాయనే నమ్మకమూ వారిలో బలంగా కలిగింది.  ఈలోగా ఏ నిర్మాతకు తన వలన ఇబ్బంది కలగకుండా తాను పాడవలసిన పాటలను త్వర త్వరగా పాడి ముగించడానికి మాస్టారు నిశ్చయించారు. 

🌷

నాది రంగేళీరాజా స్వభావం కాకపోయినా ఈ కొత్తరకం జీవితంలోకి అడుగుపెట్టాక అదనపు బరువు భాధ్యతలు పెరిగి స్వేఛ్ఛ తగ్గింది. ఆఫీసుకు వెళ్ళిరావడంలోనే 13 గంటలు గడిచిపోయేది. నెం.35, ఉస్మాన్ రోడ్ లో జరిగే కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే అవకాశం కరువయింది. అలాటి సమయంలో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన  100 వ చిత్రం ( ఒక లెక్క ప్రకారం)  'రంగేళీరాజా' సినీమా ప్రివ్యూ చూడడం జరిగింది. రాజ్యం పిక్చర్స్ కు ఘంటసాలవారు సంగీతం నిర్వహించిన మూడవ సినిమా. శకుంతల, గోవులగోపన్న తర్వాత వచ్చిన చిత్రం. మాస్ మసాల సినీమా. ఉన్న ఆరు పాటల్లో నాలుగింటిని మాస్టారే పాడారు. 'విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా', 'డార్లింగ్ డార్లింగ్ కమాన్', 'ఇలాటి రోజు మళ్ళి రానేరాదు', మాస్టారూ సంగీతం మాస్టారు' పాటలు వీనులవిందుగా ఉన్నా సినిమా పెద్ద విజయం సాధించలేదు. 




అదే సంవత్సరంలో ఘంటసాల మాస్టారు మంచి మంచి పాటలు పాడిన చిత్రాలు మరెన్నో వచ్చాయి. రాజకోట రహస్యం, జీవితచక్రం, ఆనందనిలయం, శ్రీమంతుడు, ప్రేమనగర్, రామాలయం, శ్రీకృష్ణ సత్య మొదలైనవి.

ఈ చిత్రాల పాటల విశేషాలన్నీ వచ్చే వారం...

               ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Sunday, November 28, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై తొమ్మిదవ భాగం

28.11.2021 - ఆదివారం భాగం - 59*:
అధ్యాయం 2 భాగం 58 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ప్రధమంగా ఎవరైనా వోటర్ల లిస్ట్ లోకి ఎక్కేరంటే ఆ యువతీ యువకులు పెళ్ళీడుకు వచ్చినట్లే. 1970ల నాటికి బాల్య వివాహాలనేవి రూపుమాసిపోయినా ఉత్తర భారత దేశంలోని అనేక మారు మూల గ్రామాలలో ఇంకా  అక్కడక్కడ ఈ బాల్య వివాహాల జాడ్యం కనిపిస్తూనే వుంటుంది. ఇరవై ఏళ్ళు వచ్చేసరికే పెళ్ళిళ్ళు అయి వారికి పిల్లలూ పుట్టేస్తారు. సంసార జంఝాటంలో ఇరుక్కుపోతారు. ఎవరికైనా  ఏ కారణం చేతైనా ఇరవైయైదేళ్ళలోపు పెళ్ళి కాకపోతే వాళ్ళు ముదురు బెండకాయలక్రిందే లెఖ్ఖ. నేను ఆ కేటగిరిలోకి చేరకముందే పెళ్ళిచేసి చూడాలని మా పెద్దలు సంకల్పించారు. ఔననడానికి కానీ, కాదనడానికి కానీ కావలసిన మనస్థైర్యం,మనో పరిపక్వత ఆనాటికి నాకు ఏర్పడలేదు.

మా ఇంటికి వచ్చి వెళ్ళిన ఆ ద్విభాష్యం సుబ్బారావుగారి పెద్దమ్మాయి నాకు తగినదనే భావన మా నాన్నగారికి అమ్మగారికి కలిగింది. శ్రీ సుబ్బారావు గారి కోరికకు అంగీకారం తెల్పారు. సమానవియ్యం, సమాన కయ్యం అనే సిధ్ధాంతాన్ని మా పెద్దలు పాటించినట్లున్నారు.  సుబ్బారావు గారిది సంగీత కులం కాదు. మద్రాస్ అంబత్తూర్ లో వున్న టి.ఐ. సైకిల్స్ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. అయితే వారి కుటుంబానికి మా కుటుంబానికీ కొన్ని సారూప్య సామీప్యతలున్నాయి. వారిదీ మామూలు మధ్యతరగతి కుటుంబం. వారికీ ఐదుగురు సంతానం. మాఇంట్లోలాగే ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆర్ధికంగా కూడా సరిసమానమే. అయితే ఈనాటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం -  ఏ విధమైన ప్రత్యేకతా కనపడని నాలాటి సగటు నిరుద్యోగికి ఏ ధైర్యంతో  ఆ పెద్దమనిషి  తన కూతురిని నాకిచ్చి పెళ్ళి చేయాలనుకున్నారో నాకు అర్ధం కాని విషయం. నాకు ఓ డిగ్రీ, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ తప్ప కళ్యాణానికి కావలసిన మరే  పెద్ద అర్హతలు లేవు. పైగా అమ్మాయి ఆసరికే బ్రిటానియా బిస్కట్ ఫ్యాక్టరీలో చిన్నో చితకో ఉద్యోగంలో వున్నది. ఈ వివాహం విషయం లో ద్విభాష్యం వారు తొందరపడడానికి,  తర్వాత నేను గ్రహించిన, నాకు కనిపించిన కారణం ఒక్కటే.  అదే కొన్ని మాసాలకు ముందు వారింట జరిగిన ఒక విషాద సంఘటన. చదువు ముగించి, ఉద్యోగానికి సిధ్ధమై చేతికి అందివచ్చిన తమ పెద్దకొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ కుటుంబానికి ఒక పెద్ద అశనీపాతం. ఆ దుఖం నుండి, మనోవేదననుండి బయట పడడానికి ఆరుమాసాలలోపు ఇంట్లో శుభకార్యం జరిపించి ఆనందించాలనే తపనతో వారి పెద్దమ్మాయికి వరుని వెతికే  తీవ్ర ప్రయత్నాలలో భాగంగా  మా నాన్నగారి గురించి విని  వేదుల సుబ్బారావుగారితో మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. అయితే ఈ విషాద నేపథ్యం ఏమి అప్పట్లో చెప్పినట్లు లేదు. నిజానికి చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఏది ఏమైతేనేం ఉద్యోగం, సద్యోగం లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్న నాకు ముందరి కాళ్ళ బంధాలు వేయ నిశ్చయించారు మా పెద్దలు.

ఈ పరిణామాలేవీ ఆనాడు నాలో ఎలాటి ఆసక్తిని, స్పందన, ప్రతిస్పందనలు కానీ నాలో రేకెత్తించలేదు. After all, marriages are made in heaven. నమ్మక తప్పదు మరి.

ఈ సంబంధం విషయం మా నాన్నగారు  ఘంటసాల మాస్టారికి, సావిత్రమ్మగారికి తెలియజేయడంతోనే వారంతా చాలా సంతోషించారు. శుభస్యశ్రీఘ్రం అన్నారు. నిజంగానే రెండు మాసాల వ్యవధిలో నా పెళ్ళి నిశ్చయమైపోయింది. ఘంటసాల మాస్టారు మా పెళ్ళి రిసెప్షన్ లో తన వాద్యబృందంతో వచ్చి కచేరీ చేస్తానని ఆ రోజు మరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోనని ఇంట్లోవారికి చెప్పారు. అంతా బాగానే వుంది. పెళ్ళంటే మాటలా! ఆడపిల్లకైనా, మగపిల్లాడికైనా పెళ్ళంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆర్ధికస్తోమతు గలవారి విషయం వేరే. ఏ తాడూ బొంగరం లేని సామాన్యుల విషయంలో పెళ్ళిళ్ళు ఒక పెద్ద  ప్రతిబంధకమే. కానీ, చూద్దాము, కానున్నది కాకమానదు అనే కర్మసిధ్ధాంతాన్ని మా నాన్నగారు అనుసరించారేమో.

ఘంటసాల మాస్టారు, సావిత్రమ్మగారు కలసి నాకు పెళ్ళి బట్టలు కొనివ్వాలని నిశ్చయించారు. ఒకరోజు  మాస్టారు నేనూ  వారి కారులో పాండీబజార్ రాజకుమారి ధియేటర్ ఎదురుగా వున్న కైలాష్ టెక్స్ టైల్స్ షోరూముకు తీసుకువెళ్ళి నాకు నచ్చిన రంగుల్లో మంచి బట్టలను సెలెక్ట్ చేసుకోమన్నారు. నాకు చాలా మొగమాటమనిపించింది. అన్నిటినీ చూస్తూనే వున్నా ఎలాటివి ఎంచుకోవాలో తెలియలేదు. నా తడబాటు చూసి చివరకు మాస్టారే ఓ మూడు జతల బట్టలను ఎంపికచేసారు. వాటిని ఇంట్లో చూపించి వెంటనే కుబేంద్రరావుకు కుట్టడానికి ఇవ్వమని చెప్పారు.  ఘంటసాలవారి చొక్కాలు, జుబ్బాలు చాలాకాలంగా ఆ కుబేంద్రరావే కుట్టేవాడు. ఆయన ఒక కన్నడిగుడు. పానగల్ పా‌ర్క్ పార్క్ లాండ్స్ హోటల్ పక్కన వున్న మెకర్నెట్ బ్యాకరీ వెనకవేపు కుబేంద్రరావు టైలరింగ్ షాపు. మంచి పేరున్న బిజీ టైలర్. మాకు అలవాటుగా బట్టలు కుట్టే ఎన్. మాస్టర్ టైలర్ కొంతకాలంగా మాకు దూరమవడంతో (అన్నివిధాలా)  కేశవన్ ఎమ్.ఎ. మా ఆస్థాన టైలర్ అయ్యాడు. మనిషి చాలా మంచివాడు. మాకు తగినవాడు. అతనివల్ల భరించలేని నశ్యం వాసన తప్ప మరే ఇబ్బంది వుండేది కాదు. పైగా అతని టైలరింగ్ షాపు మా ఇళ్ళ వరసలోనే. పానగల్ పార్క్ కూరగాయల షాపుకు ఎదురుగా వుండే జైన్ స్టోర్స్ ప్రాంగణంలో ఒక చిన్న కొట్లో వుండేది. ఆ కేశవన్ నా పెళ్ళిబట్టలు కుట్టడానికి మహదానందం తో ఒప్పుకున్నాడు. అయ్యగారు బట్టలు కొనిస్తున్నారు కదా, రిసెప్షన్ కోసం ఒక మంచి సూట్ తీసుకోలేకపోయావా అని  మా నరసింగడు ఒక ఉచిత సలహా పారేసాడు. నేనేమీ మాట్లాడలేదు. నా వరకు పెళ్ళిపేరుతో జరిగే ప్రతి పైసా ఖర్చు శుధ్ధ దండగమారి వ్యవహారం. నాకు ఆదాయం లేకపోయినా కనీసపు అవసరాలు తీరడానికి మా నాన్నగారిలాటి కుటుంబీకులు పడే కష్టం నాకు తెలుసు. తెలిసి తెలిసి నా మూలంగా మరింత వృధా వ్యయం చేయించడానికి మనసు రాలేదు. అయితే ఈ భావాలన్నీ మనసులోనే. బయట వ్యక్తీకరించే ధైర్యం నాకేనాడూ అలవడలేదు.

పెళ్ళి ఇన్విటేషన్ల కోసం నేనూ నరసింగ కలసి 11వ నెంబర్ బస్ లో బయల్దేరి పారీస్ కార్నర్ సమీపంలోని ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా వుండే బందర్ స్ట్రీట్ లోకి వెళ్ళాము. దాని పక్కపక్కనే వుండే సుంకురామ చెట్టి స్ట్రీట్  వంటి వీధులన్నిటిలో ఎన్నో స్టేషనరీ షాపులు, వెడ్డింగ్ ఇన్విటేషన్ల్ దొరికే షాపులు వుండేవి. అలాటి ఒక షాపులో   మరీ ఆడంబరంగా, డాంబికంగా లేకుండా సింపుల్ వుండే కార్డ్ గా చూసి కొన్నాము. వాటిని పాండీబజార్లో నారాయణన్ కేఫ్ ఎదురుగా వుండే ఒక ప్రింటింగ్ ప్రెస్ లో ఇచ్చాము. ఆ ప్రెస్ లో మాకు తెలిసిన ఒక తెలుగాయన ఉండేవారు. పేరు పంచాది అప్పలస్వామి. సినీమాలలో చిన్న చిన్న ఎక్స్ ట్రా వేషాలు వేసేవారు మనిషి పొట్టిగా పంచెకట్టుతో వుండేవారు. ఆయన ఘంటసాలవారు తీసిన 'భక్త రఘునాధ్' లో కూడా ఏదో వేషం వేసారు. వేషాలకోసం తిరుగుతూ మాస్టారిని చూడడానికి వచ్చేవారు. ఆ పరిచయంతో ఆ ప్రెస్ లో ఇన్విటేషన్ల ప్రింట్ కు ఇచ్చాము.  సింపిల్ గా వుండే ఆ ఆహ్వాన పత్రికలో ఘనంగా అందరినీ ఆకర్షించే విషయం  ఘంటసాల వారి కచ్చేరీ ఒక్కటే. 

ఒక పెళ్ళి పేరిట ఇద్దరు మనుషులను కలపడానికి ఇంత ఖర్చు, యాతనా, కాలాయాపనా అవసరమా? అనే భావన నాకు ఎప్పుడూ కలుగుతూంటుంది. కట్నకానుకల విషయంలో, మర్యాదల విషయంలో, మ్యారేజ్ హాల్స్  విషయంలో, భోజనాలలోని ఆహార పదార్ధాల విషయంలోనూ, ఊరేగింపులు, బ్యాండ్ మేళాలు, విడియో కవరేజ్ ల విషయంలో  ఏర్పడే తగాదాలు, కొట్లాటలతో ఎన్నో వివాహాలు, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం కావడం ఈనాటికీ మనం చూస్తూనే వున్నాము. ఇలాటి స్వల్ప విషయాలలో నేటి మన నాగరికత, విద్య, వివేకం ఏమైపోతాయో అర్ధంకాదు.

ఈ రకమైనటువంటి ఏ బాదరబందీ లేకుండా మా పెళ్ళి మద్రాస్ కీల్పాక్ గార్డెన్స్ లోని ఒక కమ్యునిటీ హాల్ లో ఉన్నంతలో హుందాగా, పెద్దల సమక్షంలో  ప్రశాంతంగా జరిగింది. పెళ్ళికి ముందు జరిగే తతంగమంతా కూడా ఘంటసాల మాస్టారింటి చిన్న హాలులోనే  వారి కుటుంబ సభ్యులు, కొల్లూరి వెంకటేశ్వరరావుగారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారి ఆశిస్సులతో జరిగింది. (అదే హాలులో తర్వాత కాలంలో రత్నకుమార్ ఉపనయనం కూడా జరిగింది). సరిగ్గా ఓ ఏడాది క్రితం రతన్ (ఘంటసాల రత్నకుమార్) ఫోన్ చేసి మా పెళ్ళి రిసెప్షన్ లో జరిగిన  నాన్నగారి (ఘంటసాల మాస్టారి) కచేరీ ఫోటోలు పంపమని అడిగాడు. చిత్రం ఏమంటే ఆ నాడు ఎవరికీ పెళ్ళనే ఓ సంఘటనను భవిష్యత్తు లో గుర్తుచేసుకునేలా ఫోటోల ద్వారానో, 16 mm సినీమా ద్వారానో భద్రపర్చుకోవాలనే ధ్యాసే ఎవరికీ లేకపోయింది. ఎందుకంటే, సింపుల్, అదంతా ఖర్చు వ్యవహారం.

మా పెళ్ళికి ఫోటోగ్రాఫర్ లేడు. ఎవరు వ్యక్తిగతంగా కూడా ఫోటోలు తీయలేదు. అలాగే ఘంటసాల మాస్టారి కచ్చేరీ ఫోటోలు కూడా తీయబడలేదు. ఈ రకమైనటువంటి సరదాలు మా నాన్నగారికి తక్కువ. అదే అలవాటు నాకు వచ్చింది. నాకు నేనుగా ఫోటోల కోసం నిలబడిన సంఘటనలు చాలా తక్కువ.

తమిళనాడులో పెళ్ళి ముహుర్తాలన్ని దాదాపు ఉదయం పూటే జరుగుతాయి. అది కూడా ఏడు నుండి పదిన్నర గంటలలోపే వుంటాయి. పెళ్ళి భోజనాలు కూడా పన్నెండు లోపల ముగిసి రెండయేసరికి కళ్యాణమండపాలను ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పెళ్ళికి వచ్చినవారు కూడా  తమ తమ ఆఫీసులలో ఓ రెండు గంటలు పర్మిషన్ తీసుకొని పెళ్ళికి వచ్చి, వధూవరులను అభినందించేసి, పెళ్ళి భోజనాలు చేసేసి, పెళ్ళివారిచ్చే తాంబూలం కవరు తీసుకొని డైరక్ట్ గా ఆఫీసులకు వెళిపోతారు. 
ఇందువల్ల ఎవరి సమయమూ వృథాకాదు. ఎవరికీ ఏ రకమైన ఇబ్బంది కలగదు. బహుశా తమిళులు సౌరమానాన్ని పాటించడంవల్లకావచ్చు. వారికి విరుధ్ధంగా మన తెలుగువారి పెళ్ళిళ్ళన్నీ చాలావరకు అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున జరుగుతూండేవి. ఇప్పుడు రోజులు మారి తెలుగువారు కూడా ఉదయం ముహుర్తాలకే మొగ్గు చూపుతున్నారు. 

మా పెళ్ళి ముహూర్తం ఉదయాన్నే కుదిరింది. తొమ్మిది నుండి పదిముప్పావు. మా సమీప బంధువులు, ఆత్మీయులైన ఘంటసాలవారి కుటుంబం, కొల్లూరి వెంకటేశ్వరరావుగారి కుటుంబం, మా నాన్నగారికి సన్నిహితులైన సాహితీ మిత్రుల సమక్షంలో  వారి శుభాశిస్సులతో శ్రీ ద్విభాష్యం సుబ్బారావు గారి జ్యేష్ట కుమార్తె శేషశ్రీతో  నా వివాహం నిర్విఘ్నంగా శుభప్రదంగా జరిగిపోయింది.




అదే సాయంత్రం అదే కీల్పాక్ హౌసింగ్ బోర్డ్ కమ్యునిటీ హాలులో జరిగిన  ఘంటసాల మాస్టారి కచేరీ ఆహుతులందరికీ షడ్రసోపేత విందుగా అమరింది. ఆ రిసెప్షన్ కు ప్రముఖ రచయిత  మా నాన్నగారికి మంచి మిత్రుడైన శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు కుటుంబ సమేతంగా వచ్చారు.

ఆడపెళ్ళివారి తరఫున బ్రిటానియా కంపెనీ, టిఐ సైకిల్స్ ఉద్యోగులు తరలి వచ్చి మమ్మల్ని అభినందించారు. ఆనాటి ఘంటసాలవారి సంగీత కచేరీ వారందరికీ అపురూపమైన వరంగా అమితానందాన్ని కలగజేసింది. మాస్టారు దాదాపుగా రెండు గంటలసేపు ఆనాటికి బహుళ ప్రచారంలో వున్న  తన తెలుగు, తమిళ సినీమా పాటలను మృదుమధురంగా ఆలపించి శ్రోతలను మైమరపింపజేశారు. నా  పెళ్ళి కచేరీలో మా నాన్నగారు యథావిధిగా తన హార్మోనియంతో  ఘంటసాల మాస్టారికి సహకరించారు. ఆనాడు కచేరీలో పాల్గొన్న ఇతర వాద్యబృందం మా నాన్నగారు యథాశక్తి ఇచ్చిన పారితోషికాన్ని సంతోషంగా "ఇది మా ఇంట్లో పెళ్ళి" అని స్వీకరించారు. 

ఆప్త స్నేహితులు, బంధువుల పట్ల ఘంటసాల వారికి గల ఔదార్యానికి, ప్రేమాభిమానాలకు మా ఇంటి వివాహం ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.

కొత్తకోడలు వచ్చిన వేళావిశేషం అంటారు. అలాటిదేదో నావిషయంలో జరిగిందని చెప్పక తప్పదు. ఆనాటి రిసెప్షన్ కు మానాన్నగారి మరో విజయనగరం స్నేహితుడు బి.డి.రావుగారు భార్యా సమేతంగా వచ్చారు. ఆయనా మానాన్నగారు చిన్నప్పుడు హైస్కూలు లో సహాధ్యాయులని చెప్పిన గుర్తు. ఆయన తండ్రి భాగనారపు సంజీవరావుగారు విజయనగరంలో హెడ్మాస్టర్ గా పనిచేసేవారు. బి.డి.రావుగారు మద్రాసు లో ఒక మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీలో రీజినల్ మేనేజర్. మా నాన్నగారిని తరచూ చూడకపోయినా మంచి అభిమానం గల వ్యక్తి. ఆయన మా పెళ్ళి రిసెప్షన్ కు వచ్చారు. ఆయనకు నా గురించి అంతకుముందే డా. డి.ఎన్.రావుగారి ద్వారా వినివున్నారు. ఆయన ఈ రిసెప్షన్ లో నన్ను అభినందిస్తూ  ఒక మంచి రోజు చూసుకొని తనను తమ రాయపురం ఫ్యాక్టరీ లో కలుసుకొమ్మని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. అంతా మంచే జరుగుతుందని భరోసా ఇచ్చారు.

పట్రాయని వారింటి వివాహానికి రాలేకపోయిన బి.ఎన్.రెడ్డిగారు, పాలగుమ్మి పద్మరాజుగారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, డా.డి.ఎన్.రావు దంపతులు ఆశీఃపూర్వక ఉత్తరాలు పంపారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారైతే ఒకనాటి ఉదయాన్నే మా ఇంటికి వచ్చి కొత్తకోడలిని చూసి స్వయంగా ఆశీర్వదించారు. కృష్ణశాస్త్రిగారు మా ఇంటినుండి తిరిగివెళ్ళబోయే ముందు మా ఇద్దరిని తప్పక వారింటికి పంపమని మా నాన్నగారిని కోరారు. మా నాన్నగారు సంతోషంగా సమ్మతించారు. నాకు తగిన ఇల్లాలే మా ఆవిడ. మా ఇద్దరికీ సంగీతం రాదు. సాహిత్యం అంటే ఏమిటో తెలియదు. అలాటి మేము కృష్ణశాస్త్రిగారి వంటి ప్రసిధ్ధ కవి సమక్షంలో ఏం మాట్లాడగలము, ఎలా మసలగలము? వారింటికి వెళ్ళడానికి సంకోచమే. కానీ వెళ్ళకతప్పదు. ఒక రోజు మేమిద్దరం కృష్ణశాస్త్రిగారింటికి వెళ్ళాము. అప్పట్లో కృష్ణశాస్త్రి గారు టి.నగర్ తిరుమలపిళ్ళై రోడ్ సమీపంలో వాల్మీకి స్ట్రీట్ లో వుండేవారు. మేము వెళ్ళినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నట్లు పలకమీద వ్రాసి చూపారు. ఇంట్లోని తమ కోడలుకు, కుమారునికి మమ్మల్ని పరిచయం చేసారు. దాదాపు ఒక అరగంటకు పైగా వారు  మా స్థాయికి దిగివచ్చి సరదా కబుర్లు చెప్పి వాతావరణాన్ని మార్చివేసారు.  తన వాక్చాతుర్యంతో నాలోని బెరుకుతనం కొంతవరకు తొలగించారు. మేము తిరిగి వస్తున్నప్పుడు కృష్ణశాస్త్రిగారు మా ఆవిడకు తన కోడలిచేత పసుపుకుంకుమ, ఓ జత దీపపు కుందులు కానుకగా ఇప్పించారు. వారి కవితా సంపుటులు నాలుగు పుస్తకాలను నాకు బహుకరించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారింట్లో వారి సమక్షంలో  గడపిన ఆ క్షణాలు ఏనాటికి మరపురాని మధుర స్మృతులు. చూస్తూండగానే, నిన్న మొన్న జరిగినట్లనిపించే మా వివాహానికి స్వర్ణోత్సవం అయిపోయింది.

🌺

1971 జనవరిలో  నాలుగు సినీమా లు రిలీజయ్యాయి. రెండు రామారావు గారు నటించినవి; మరో రెండు నాగేశ్వరరావు గారివి. అవి - శ్రీకృష్ణ విజయం, 

అనరాదే బాలా... శ్రీకృష్ణవిజయం

దసరాబుల్లోడు, నిండు దంపతులు, మనసు మాంగల్యం.

ఆవేశం రావాలి ఆవేదన కావాలి ... మనసు మాంగల్యం

అగ్రనటుల సినీమాలంటే మాస్టారి పాటలు లేకుండా వుంటాయా? ఈ నాలుగు సినీమాలలో మొత్తం ఇరవైఐదు పాటలు పద్యాలు ఘంటసాల మాస్టారు పాడినవే. ఆ పాటల విశేషాలేమిటో వచ్చే వారం...

నెం.35, ఉస్మాన్ రోడ్ కు వస్తే తెలుస్తాయి...

      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, November 21, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై ఎనిమిదవ భాగం

21.11.2021 - ఆదివారం భాగం - 58*:
అధ్యాయం 2  భాగం 57 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"రామం! ఇవేళ పిల్లల్ని ప్రసాద్ కి తీసుకురావే, పిల్లల  పాటను షూట్ చేస్తున్నాము. సరదాపడతారు. సరోజాదేవి, రామారావుగారి కాంబినేషన్" అని చెపుతూ అక్కడే వున్న "నన్ను చూసి నువ్వు కూడా రావోయి" అని ఓ మాట అనేసి వెళ్ళిపోయారు నిర్మాత భమిడిపాటి బాపయ్యపంతులుగారు. మా క్రిందింటి వెంకటేశ్వరరావు గారి బావమరది. షూటింగ్ ఏ.వి.ఎమ్.లోనో, ప్రసాద్ లోనో జరిగింది. ప్రసాద్ స్టూడియోవే కావచ్చు. ఒకప్పుడు వాహినీలో ఒక  వెనక భాగం విజయా స్టూడియోస్. దానిని ఎల్.వి.ప్రసాద్ గారు లీజ్ కు తీసుకొని ప్రసాద్ స్టూడియో గా మార్చారు. ఆ స్టూడియో లో ఈ పాట షూటింగ్.  రావుగారి కార్లో మేము స్టూడియో ఫ్లోర్ లోకి అడుగుపెట్టేప్పటికి "ఎవరో వచ్చే వేళాయే ఎదురై కాస్త చూస్తారా! వాకిలి తీసే ఉంచారా మరి ఒకసారి చూస్తారా" అనే పాట పల్లవి వినిపిస్తోంది.  మా కోసమే పాడుతున్నారా అనిపించింది. ఈ పాట ఏ సినీమాలోదో మీకందరికీ తెలిసేవుంటుంది. 'మాయని మమత' సినీమా లోనిది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ముద్రగల పాట. అశ్వత్థామగారి సంగీతం. శ్రీమతి పి.సుశీల, బి.వసంత గార్లగానం. 

ఎవరో వచ్చే వేళాయె - మాయని మమత

పదమూడేళ్ళ వయసు నుండి ఆరేళ్ళ వయసులోపలి మూడు జతల ఆడపిల్లలతో సరోజాదేవి ఆడుతూ పాడే పాట షూటింగ్. షూటింగ్ అనేది నావరకు  చాలా విసుగెత్తించే విషయం. నత్త నడకలా సాగుతుంది వ్యవహారం. జైంట్ లైట్ల వెలుగు,  సెట్ లోపలి వేడి చాలా చికాకుగా వుంటుంది. అందులోనూ డాన్స్ సాంగ్. వెళ్ళిన కొంతసేపువరకు ఉత్సాహంగానే వుంటుంది. ఒక పల్లవి షూటింగ్ అవడానికి ఒక పూట పట్టింది. మొత్తం పాట అవడానికి ఎన్ని కాల్షీట్లు అయాయో? ఇంతకూ ఆ రోజు షూటింగ్ కు రామారావు గారు రానేలేదు. ఆయన షాట్స్ మరోరోజు , కంబైన్డ్ షాట్స్ మరో రోజు తీస్తారని అనుకున్నారు. ఈ పిల్లలతో ఉన్న భాగం పూర్తికావడానికే రెండురోజులు పడుతుందని అన్నారు. ఈలోగా లైట్లు, కెమేరాల సెట్టింగ్ కోసం బ్రేక్ ఇచ్చారు. ఆ గ్యాప్ లో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ శాస్త్రిగారు వచ్చారు.  మర్నాటి షూటింగ్ గురించి ఆర్టిస్ట్ లతో చర్చలు. ఈ ఆడపిల్లల గ్రూప్ లో ఉండే ఒక పెద్ద అమ్మాయి, జయ కౌసల్య (అనే గుర్తు) కు డేట్స్ క్లాష్. మర్నాడు మరేదో తమిళ్ మూవీ షూటింగ్. ఆ అమ్మాయికి వీలయిన రోజున హీరోయిన్ సరోజాదేవికి అవకాశం లేకపోవడం వంటి విషయాలన్నో చర్చకు వచ్చి చివరకేదో సద్దుబాటు చేసుకున్నారు.  ఈ శాస్త్రిగారిని తెలిసినవారంతా నక్షత్రక శాస్త్రి అనేవారు. ఏ కార్యం సాధించాలన్నా పట్టినపట్టు వదలకుండా అవతల వాళ్ళ చుట్టూ వదలకుండా తిరుగుతూ  పనులు సాధించేవారు. అలాటివారే సినీమా రంగంలో ప్రొడక్షన్ మేనేజర్లుగా రాణిస్తారు. కెమెరా ఏంగిల్స్ అన్ని చూసి మరో షాట్ కు రెడి అనడానికి  ఇంకా చాలా సమయం పట్టేలా కనిపించింది. ఇంక ఆ వేడిలో కూర్చొనే ఓపిక మా రావుగారి పిల్లలలో నశించింది. మెల్లగా అక్కడనుండి బయటపడి ఇంటికి చేరుకున్నాము.

'మాయని మమత' సినీమా టైటిల్స్ లో గాయకుడిగా ఘంటసాలవారి పేరు ముందు ' పద్మశ్రీ' అని వేసారు.  అందులో మాస్టారు పాడిన 'రానిక నీకోసం రాదిక వసంతమాసం' పాట ఈనాటికీ సంగీతాభిమానుల ను అలరిస్తూనేవుంది. 'మాయని మమత'  సినీమా బాగానే వచ్చింది.  పెద్ద నటులు,  పేరున్న డైరక్టర్, మంచి సంగీతం, అంతా బాగుంది కానీ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిర్మాతకు మాత్రం  సినీమా లంటే మమతను మిగల్చకుండా నిరాశాజనక మచ్చగా మిగిలిపోయింది. 

🌿


1970లో ముగ్గురు 'పద్మశ్రీ'లతో విడుదలైన మరో చిత్రం 'విజయం మనదే'. ఇందులోని హీరో ఎన్.టి.రామారావు, హీరోయిన్ బి.సరోజాదేవి, గాయక సంగీత దర్శకుడు ఘంటసాల - ముగ్గురు 'పద్మశ్రీ' గ్రహీతలే. బి.విఠలాచార్య దర్శకత్వంలో ఘంటసాలవారి సంగీతంతో వచ్చిన ముచ్చటైన మూడవ ఆఖరి చిత్రం. ఈ చిత్రం తర్వాత వారిద్దరూ కలసి పనిచేయలేదు. ఈ చిత్ర నిర్మాత నందమూరి సాంబశివరావుగారు  ఎన్.టి.రామారావుగారి కజిన్. ఆయనకు ఘంటసాల గారంటే మంచి గౌరవం, అభిమానం. 'విజయం మనదే' సినీమాకు మూలం 'అరసిలన్ కుమారి' అనే ఒక ఎమ్.జి.ఆర్. సినీమా. ఆ సినీమాను 'కత్తి పట్టిన రైతుగా' డబ్ చేసారు. ఆ సినిమా రీమేక్ 'విజయం మనదే'.
 
ఈ చిత్రంలోని ఘంటసాలవారు పాడిన 'శ్రీరస్తు శుభమస్తు' పాట, సుశీలగారితో పాడిన యుగళాలు - 'ఓ దేవి ఏమి కన్నులు నీవి', ' నా మదిలో ఉందొక మందిరము', ఎస్ జానకి గారి సోలో 'ఎవ్వరో పిలిచినట్టుట్టుంది' వంటి పాటలన్నీ సుశ్రావ్యమే. ఈ సినీమా కంపెనీ ఆఫీస్ సౌత్ ఉస్మాన్ రోడ్ చివరలోని సి.ఐ.టి.నగర్ లో వుండేది. కొన్ని పాటల కంపోజింగ్ కు వెళ్ళాను. ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాసారు 'శ్రీరస్తు శుభమస్తు చిన్నారి నా చెల్లికి - కొంచెం కొంచెం బిడియాలు పాట' వారు వ్రాసిందే.  

కొంచెం కొంచెం బిడియాలు - విజయం మనదే

వారి సినీ గీతాల రచనా శైలి గురించి గతంలో ముచ్చటించడం జరిగింది.  ఒకపట్టాన వారి కలం నుండి అక్షరరూపంలోకి వచ్చేవికావు. ఆయన అలా చిద్విలాసంగా అందరి ముఖాలు చూస్తూ నవ్వుతూ కూర్చునేవారు. ఎంతసేపైనా సంగీత దర్శకుడు  'తననాలు' పలుకుతూండవలసిందే, పల్లవి మాత్రం కాగితం మీదకు ఎక్కేది కాదు. ఇక అందరికీ విసుగు పుడుతున్నదన్న సమయంలో తన మనసులోని మాట పల్లవిగా వెలువడేది. అవి శిలాక్షరాలే. ఆణిముత్యాలే. ఈ పాట చరణంలో 'పుట్టినింట మహరాణి, మెట్టినింట యువరాణి' అనే పద ప్రయోగం ఆ సినీమా యువ అసిస్టెంట్ డైరక్టర్ కు అర్ధం కాలేదు. అందులో ఏదో తప్పును కనిపెట్టబోయాడు. అప్పుడు కృష్ణశాస్త్రి గారు వ్రాసి చూపించారు 'ఆడపిల్ల పుట్టింటిలో వున్నంతవరకూ మహా స్వేఛ్ఛగా మహారాణీ లా వుంటుంది, అదే కొత్తగా వివాహమై అత్తవారింటికి వెడితే అక్కడ అత్తగారిదే మహారాణి హోదా. కోడలు యువరాణిగానే పరిగణింపబడుతుంది' అంటూ  కోడలి స్థాయి గురించి  చక్కగా విశ్లేషించారు. అనుభవంలేని ఆ అత్యుత్సాహ సహాయదర్శకుడు వెనక్కి తగ్గాడు. ఏ కారణం చేతనో 'విజయం మనదే' సినీమాకు ఘంటసాలవారికి సహాయకుడిగా పనిచేసినా మానాన్నగారి పేరు సినీమా టైటిల్స్ లో వేయలేదు. ఒక్క పామర్తి గారి పేరు మాత్రమే కనిపిస్తుంది. ఆ సినీ మాయేమిటో నాకు అర్ధం కాదు. 

🌿🌺🌿


గతంలో ఒకసారి చెప్పాను, నాకు ఘంటసాల మాస్టారింట్లో వింతగా అనిపించిన విషయం, ఒకే పేరుతో ఇద్దరేసి వ్యక్తులు ఆ ఇంటితో అతి సన్నిహితంగా మెలగడం. ఇద్దరు వెంకటేశ్వర రావులు (ఘంటసాల, పామర్తి), ఇద్దరు కృష్ణలు (తమ్ముడు కృష్ణ మావయ్య కృష్ణ),  ముగ్గురు రాఘవులులు (సంగీత సహాయకుడు జె.వి.రాఘవులు, కచేరీలలో సహగాయకుడు కె.ఎస్. (తిరపతి) వీర రాఘవులు, దోభీ రాఘవులు, అలాగే  ఇద్దరు హరినారాయణలు (ఒకరు ఎడిటర్ బి.హరినారాయణ, మరొకరు సావిత్రమ్మగారి తమ్ముడు కె.హరినారాయణ (అసిస్టెంట్ కెమెరామెన్).

ఎడిటర్ హరినారాయణ గారిని నేను మద్రాస్ వెళ్ళినప్పటినుండి మాస్టారింట్లో చూసేవాడిని. లావుగా, పొడుగ్గా సగం నెరిసిన ఉంగరాల జుత్తుతో నీలం రంగు కళ్ళతో భారీగా కనిపించేవారు. మాస్టారింట్లోని పిల్లలందరికీ తన కెమేరాతో ఫోటోలు తీసేవారు. ఘంటసాలగారి సొంత సినీమాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా,  దర్శకుడిగా పనిచేసేవారు. ఘంటసాలవారంటే చాలా గౌరవాభిమానాలుండేవి. ఆ కుటుంబంతో చాలా ఆత్మీయంగా వుండేవారు. తర్వాత భానుమతి గారి భరణీ స్టూడియోలో ఆవిడకు అసిస్టెంట్ గా, ఎడిటర్ గా మంచి అనుభవం సంపాదించారు. ఆ బి. హరినారాయణ తన సోదరుడితో కలసి 'మెరుపు వీరుడు'  అనే జానపద సినీమా ను కాంతారావు, రాజశ్రీ,రాజనాల, లక్ష్మి, విజయలలితలతో  తన స్వీయ దర్శకత్వంలో  ప్రారంభించారు. ఆ సినీమాకు ఘంటసాలవారే సంగీతం. 1970 లోనే విడుదలయింది. అంతకుమించి ఈ సినీమా గురించి ఎక్కువగా చెప్పడానికి ఏమిలేదు. చిత్రం జయాపజయాల గురించి పెద్దగా అవగాహన లేదు. అయితే హరినారాయణ సోదరులు తర్వాత మరో క్రైమ్ థ్రిల్లర్ తీసారు. దానికీ ఘంటసాలవారే సంగీత దర్శకులు. ఆ సినీమా గురించి తర్వాత చెపుతాను.

🍀

రామవిజేతా బాబూరావు నిర్మించిన ' తల్లిదండ్రులు'  సినీమాకు ఘంటసాలవారే సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినీమా లోని ఏడు పాటలలో ఓ నాలుగు పాటలను ఎంతో చక్కగా స్వరపర్చారు మాస్టారు. సుశీలగారు పాడిన 'పాట పాడనా ప్రభూ పాట పాడనా', ఎస్.జానకి బృందం పాడిన 'గొబ్బియళ్ళో  కొండామల్లెకు గొబ్బిళ్ళు', ఘంటసాల-జానకి యుగళగీతం 'మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను', 'ముద్దులు కురిసే ఇద్దరి మనసులు', పాటలు ఎంతో బాగుంటాయి. కుటుంబగాధా చిత్రాలను తెరకెక్కించడంలో బాబూరావు చాలా సమర్ధుడు.

'తల్లిదండ్రులు' సినీమా రీరికార్డింగ్ కు ముందు రష్ వేసి చూపించారు. మాస్టారు, మా నాన్నగారితో పాటూ నేనూ వెళ్ళాను. ఆ రష్ మూవీ చూడడానికి జగ్గయ్య, శోభన్ బాబు, రాజబాబు, అల్లు రామలింగయ్యగార్లు కూడా వచ్చారు. సినీమా ప్రారంభించడానికి వ్యవధి వుండడంతో వీరంతా కబుర్లలొ పడ్డారు. ఆ సందర్భంలో జగ్గయ్య, శోభన్ బాబు గార్ల సంభాషణ 'విగ్గు'ల మీదకు వెళ్ళింది. జగ్గయ్యగారు తనకైతే విగ్గు తప్పనిసరని, మంచి తలకట్టు గల శోభన్ విగ్గులు లేకుండా సహజమైన జుట్టుతో కనిపిస్తే బాగుంటుందని తన నిర్మాతలకు నచ్చజెప్పమని సూచించారు. అందుకు దర్శకులు, నిర్మాతలు సహకరించడంలేదని చెపుతూండగా విన్నమాటలు బాగా గుర్తుండిపోయాయి. రాజబాబు గారైతే తన సీటులోంచి లేచివచ్చి ఘంటసాల మాస్టారి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చేతులు పట్టుకొని 'బాబాయ్' అంటూ వినయంగా, ఆప్యాయంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అల్లు రామలింగయ్యగారైతే ఈ లోకంలో వున్నట్లే కనపడలేదు. తనలో తాను ఏదో పాడుకుంటూ కూర్చొనివున్నారు. కొంతసేపటికి సినీమా వేయడం ఔట్ పుట్ బాగానే వచ్చిందని అందరూ అనుకోవడం జరిగింది. 

💥

ఘంటసాల మాస్టారి స్వీయసంగీతంలో పాటలేవీ పాడని సినీమాలు ఏవైనా వున్నాయా అంటే సందేహా స్పదమే. కానీ గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన 'రెండు కుటుంబాల కథ' లో మాస్టారి పాటలు లేవు. లీల, సుశీలగార్లు పాడిన ఒక పాట ప్రారంభంలో ఒక చిన్న సాకీలాటిది మాత్రమే పాడారు. 

జగతికి జీవము నేనే - రెండు కుటుంబాల కథ

ఆ సినీమాలో ఉన్నవి ఆరే ఆరు పాటలు. సుశీల, లీల, ఎల్.ఆర్.ఈశ్వరి, స్వర్ణలత, పిఠాపురం పాడారు. ఈ  సాంఘిక సినీమా లోని మూడు పాటలు ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత విద్వత్తుకు దర్పణం పట్టేవిగా వుంటాయి. అవి - 'వేణుగాన లోలుని గన', 'జగతికి జీవము నేనే', 'మదిలో విరిసే తీయని రాగం' పాటలు. ఈ పాటలు ఎన్ని దశాబ్దాలైనా నిత్యనూతనంగా శ్రవణానందకరంగానే వుంటాయి. ఈ సినీమా నిర్మాత వి.ఎస్.గాంధి. కాస్ట్యూమ్స్ గాంధిగా చిత్రసీమలో చాలా అనుభవం, పేరు గడించారు. ఆయన ఇంటిపేరు వృధ్ధులవారు. ఆ ఇంటిపేరు గలవారు బొబ్బిలిలో వుండేవారు. ఈ గాంధీగారి స్వస్థలం కూడా బొబ్బిలేనని మా నాన్నగారు అనడం గుర్తు. ఆయన మానాన్నగారు కలిసినప్పుడు ఆ బొబ్బిలి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకునేవారు.

ఈ సినీమా కథకు మూలం ద్వివేదుల విశాలాక్షిగారి 'వారధి' నవల. సినీమా స్క్రిప్ట్ కోసం కావలసిన సినాప్సిస్ నాచేతే వ్రాయించారు విశాలాక్షిగారు. ఆ కారణం చేతనేమో తెలియదు. ఈ సినీమా నిర్మాణ సమయంలో సినీమాలలో ఏదో శాఖలో చేరితేనో అనే చిన్న దురద నాకు పుట్టిన మాట వాస్తవం. అయితే అందుకు మానాన్నగారి, ఘంటసాల మాస్టారి ఆమోదమూ లభించదని నాకు బాగా తెలుసు. అసలు సినీమాలకు కావలసిన ఏ అర్హత నాకు లేదని తెలిసికూడా దురదపుట్టిందంటే అది శుధ్ధ అవివేకమే. 

🔔


1970లో సంగీత దర్శకుడిగా, గాయకుడిగా మంచి పేరును తెచ్చిపెట్టిన సినీమా 'ఆలీబాబా 40 దొంగలు'. ఈనాటి పరిభాషలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్. వినోదమే ప్రధానంగా తీయబడిన సినీమా. ఈ సినిమా ఘంటసాల మాస్టారి పరిచయ వాక్యాలతో ప్రారంభమవుతుంది. సినీమా లోకంతో సంబంధంలేని, బొబ్బిలి పట్టణానికి సమీపంలోని పిరిడి అనే చిన్న గ్రామంలో కొలువైవున్న వీరభధ్రస్వాములు, చండికా అమ్మవారి అనుగ్రహంతో ఈ జానపద సినీమాను విడుదల చేస్తున్నామని ప్రకటించడం, పరిత్రాణాయ సాధూనాం అని భగవద్గీత శ్లోకం వినిపించడం  నాలాటి కుర్రకారుకు తమాషాగా అనిపించిన  విషయం. ఏమైనా సినీమా బాగా విజయం సాధించింది. ఈ సినీమాలో సి.నా.రె., దాశరథి, కొసరాజుగార్లు వ్రాసిన 10 పాటలను ఘంటసాలవారి సుశ్రావ్య స్వరరచనలో ఆయనతో పాటు సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంలు మృదుమధురంగా ఆలపించారు. ఈ సినీమా హీరోయిన్ జయలలిత కూడా సొంతంగా ఒక పాటను పాడారు. ఆ పాట విశేషాలు గతవారాలలో చెప్పడమయింది. 

ఆలీబాబా 40 దొంగలు సినీమా లోని అన్ని పాటలు మంచి మనసుకు పట్టేవిగానే వుంటాయి. వాటిల్లో - 'మరీ అంతగా బిడియమైతే', 'సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు', 'నీలో నేనై  నాలో నీవై', 'లేలో దిల్బహార్ అత్తర్', 'రావోయి రావోయి రాలుగాయి', 'చల్ల చల్లనీ వెన్నెలాయె' పాటలు ఈనాటికీ అందరికీ గుర్తుండిపోయిన పాటలు. 

మరీ అంతగా బిడియమైతే - ఆలీబాబా 40 దొంగలు

గౌతమీ రామబ్రహ్మంగారికి ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా పనిచేసిన రెండవ ఆఖరు చిత్రం. ఈ సినీమా తర్వాత తీసిన 'వాడే వీడు' లో మాస్టారు పాటలు మాత్రమే పాడారు. ఆ సినీమా తర్వాత రామబ్రహ్మంగారు మరే సినీమాలు తీసినట్లు లేదు. మనిషి చాలా నిరాడంబరంగా వుండేవారు. 

🌿🌿

1970 చివర నాటి వరకూ నిరంతరాదయం వచ్చే ఉద్యోగమేదీ దొరకలేదు. చేస్తూ వచ్చిన తాత్కాలిక ఉద్యోగమూ పోయింది. చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. ఇలాటి పరిస్థితులలో కొన్ని అనూహ్యమైన విషయాలు జరిగాయి.

ఒకరోజు ఓ ఇద్దరు వ్యక్తులు మా నాన్నగారిని వెతుక్కుంటూ వచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఒకరు వేదుల సుబ్బారావుగారు, మరొకాయన ద్విభాష్యం సుబ్బారావు గారు. మళ్ళీ, ఇద్దరు సుబ్బారావులు. వేదులవారు, ద్విభాష్యంవారూ మా స్వశాఖీయులే. పరరాష్టంలో వున్న తెలుగువారంతా ఒకరినొకరు కలుసుకుంటూ స్నేహాలు కలుపుకోవడం పరిపాటే. ఆ విధంగానే ఈ సుబ్బారావు ద్వయం మా నాన్నగారితో మాట్లాడేందుకు వచ్చారనుకున్నాను. ఇద్దరిలో ఒకరు నాలాగే పొట్టిగా వున్నాయన ద్విభాష్యం సుబ్బారావుగారు. మద్రాస్ అంబత్తూర్ లోని టి.ఐ.సైకిల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. విల్లివాక్కం  నివాసం. ఆ ఇద్దరూ మా నాన్నగారి తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు.

ఈ నూతన పరిచయస్థుల రాకకు కారణమేమిటో తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే... వచ్చే వారమే...

            ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, November 14, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై ఏడవ భాగం

14.11.2021 - ఆదివారం భాగం - 57*:
అధ్యాయం 2 భాగం 56 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

తమిళ రంగస్థల నాటకం దేదీప్యమానంగా వెలుగొందుతున్న రోజులవి. రంగస్థలం నుండి సినీమాకు వచ్చిన అనేకమంది నటీనటులు  మధ్యాహ్నం వరకు స్టూడియోలలో పనిచేసి సాయంత్రం అయేసరికి విధిగా ఏదో సభలో ఏదో నాటకంలో నటిస్తూ నాటక కళ మీద తమకు గల వ్యామోహాన్ని, భక్తిని చాటుకుంటూవుండేవారు. 

ఒక శివాజీ గణేశన్, ఆర్.ఎస్.మనోహర్, పూర్ణం విశ్వనాధన్, మనోరమ, నాగేష్, సహస్రనామం, మేజర్ సుందరాజన్, చో రామస్వామి, వి.కె.రామస్వామి వంటి ప్రముఖ నటులెందరో విరివిగా విధిగా తమిళ నాటక ప్రదర్శనలలో పాల్గొనేవారు. వీరంతా నాటకాలాడేది ధనార్జన కోసం కాదు. వీరంతా సినీమాలలో బిజీగా పనిచేసేవారే. కానీ వారికి రంగస్థలం మీద గల మక్కువ అలాటిది. అలాటి కళాతృష్ణ తెలుగు సినీమా నటీనటులలో కనపడకపోడానికి కారణం వారిలో నాటకరంగ నేపథ్యం ఉన్నవారు క్రమంగా తగ్గిపోడమే. అలాగే తెలుగు ప్రజలు సినీమాకు ఇచ్చిన ప్రాధాన్యం తెలుగు నాటకానికి ఇవ్వలేదు. అందుకే 60ల తరవాత తెలుగు నాటకం తమిళ, కర్ణాటక, మహరాష్ట్రలలో వృధ్ధి చెందినంతగా తెలుగునాట మహోజ్జ్వలంగా ప్రకాశించలేదు. మిణుకుమిణుకుమంటూనే మనుగడ సాగించింది. 
 
ఒకప్పుడు తమిళనాట నలభై శాతం మంది ప్రజలు తెలుగువారే అయినప్పటికీ వారిలో అధికశాతం  తమిళ సంస్కృతి సంప్రదాయాలకు అలవాటు పడిపోయారు. ఇప్పటికీ కొన్ని జిల్లాలలో ఇళ్ళలో తెలుగులో మాట్లాడుకుంటున్నా వారి యాస, ఆచారవ్యవహారాలు తమిళ సంప్రదాయానికి దగ్గరలో వుంటాయి. 

మద్రాసులో తెలుగువారి  కళాతృష్ణను తీర్చేవిధంగా, తెలుగు సంస్కృతికి దర్పణం పట్టేలా పెద్దగా ఏ సాంస్కృతిక సంస్థలు ఉండేవికావు. మద్రాసులో ని అతి ప్రాచీనమైన తెలుగువారి సాంస్కృతిక సంస్థ చెన్నపురి ఆంధ్ర మహాసభ మాత్రమే. ఆ సంస్థే అప్పడప్పుడు ఏవో కార్యక్రమాలను నిర్వహించేది. అయితే అవి నగరంలో వివిధ మారుమూల  ప్రాంతాలలో వుండే తెలుగువారందరికీ తెలిసి, వెళ్ళి చూసే అవకాశముండేది కాదు. 

అలాటి వాతావరణం లో 1967 తర్వాత మెల్ల మెల్లగా తెలుగు సాంస్కృతిక సంస్థలు ఒక్కొక్కటిగా మొలకెత్తాయి. మద్రాస్ నగరంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే తెలుగువారు కొందరు ఔత్సాహిక సాంస్కృతికోత్సవాలు జరిపేవారు. వారిలో కార్యక్రమాలు నిర్వహించాలనే ఆసక్తి,అభిలాష మెండుగానే వున్నా వారికి తగినంత ఆర్ధిక వనరులు, నిర్వహణా సామర్థ్యం వుండేవికావు. అందువలన ఏడాదికి ఒకమారో రెండుమార్లో ఉగాదికో, దసరాలకో వారు నిర్వహించే సాంస్కృతికోత్సవాలు అంత జనాకర్షణీయంగా వుండేవికావు. పేలవంగానే నడిచేవి. ఇలాటి వాతావరణంలో తెలుగువారికోసం ఫుడ్ కార్పరేషన్ లో, అనే గుర్తు, పనిచేసే తాతా సోమయాజులుగారు, మద్రాస్ టెలిఫోన్స్ లో పనిచేసే గుడిపూడి శ్రీనివాసరావుగార్ల ఆధ్వర్యం లో ఉగాది కల్చరల్ అకాడెమీని ఏర్పాటు చేసి ఉగాది పండగల సమయంలో తెలుగువారి కోసం సాంస్కృతికోత్సవాలు చేయడం మొదలుపెట్టారు. అయితే జనాలను ఆకర్షించాలంటే వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించాలి. ఆ ఉత్సవాలలో వారి కళను ప్రదర్శించేలా సంగీత కచేరీయో, నృత్యమో, నాటకాలో ప్రదర్శించాలి. ఇవన్నీ అంత తేలికగా జరిగేవికావు. స్వలాభాపేక్ష లేకుండా ఇలాటి ప్రజారంజిత కార్యక్రమాలకు అందరూ సానుకూలంగా స్పందించరు. అందరికీ అనువుగా సానుభూతితో స్పందించే వ్యక్తిగా ఘంటసాలవారు పేరుపొందారు. గుడిపూడి శ్రీనివాసరావు గారు ఒకరోజు మాస్టారిని కలసి తమ ఉగాది ఉత్సవాలలో కచేరీ చేయవలసిందిగా కోరారు.  ఘంటసాల మాస్టారు వారి కార్యకలాపాల గురించి తెలుసుకొని నవ్వుతూ ప్రోత్సాహకరంగా మాట్లాడి పంపించేసారు. అయితే అది అంగీకారసూచకమా కాదా అని కార్యకర్తలకు తెలియలేదు. మరల వచ్చారు, అయితే ఈసారి ఘంటసాలవారికి బదులుగా హోమ్ డిపార్ట్మెంట్ హెడ్ నే కలిసి తమ కోరికను వెలిబుచ్చి సహాయం అర్ధించారు. సావిత్రమ్మగారు వారి అభ్యర్థనలను కాదనలేక మాస్టారిని ఒప్పించే భారం తన భుజాన వేసుకున్నారు. ఏదో ఓ ఉగాది పండగ రోజున ఘంటసాలవారి సంగీత కచేరీని ఏర్పాటు చేసారు. మాస్టారు కూడా వాళ్ళకు ఎక్కువ ఆర్థికభారం పెట్టకుండా అతి స్వల్ప వాద్యబృందంతో ఉచితంగా కచేరీ చేసారు. ఘంటసాలవారి కచేరీ అంటే శ్రోతలకు కొదవేముంది. జనాలు బాగానే వచ్చారు. నిర్వాహకుల ఆశయం నెరవేరింది.

అలాగే  దసరా ఉత్సవాల సమయంలో ఒక సాంస్కృతిక సంస్థవారు మా నాన్నగారి సంగీత కచేరీని కోరారు. అందుకు మా నాన్నగారు సమ్మతించారు. తేదీ, సమయం, వేదిక నిర్ణయించబడింది.

పానగల్ పార్క్ కు ఉత్తర దిశలో అంటే ప్రకాశం రోడ్ చివర, గోపతి నారాయణ చెట్టి స్ట్రీట్ మొదట్లో ఎడమవేపు శ్రీ వెంకటేశ్వర కళ్యాణమండపం, దక్షిణాన వుమ్మిడి బంగారు చెట్టి జువెలరీ షాపుకు, కుమరన్ బట్టల కొట్టుకు మధ్యలో సుగుణ్ విహార్ కళ్యాణ మండపం వుండేవి. ఇప్పుడు సుగుణ్ విహార్ అంతా కూడా కుమరన్ సిల్క్స్ గా మారిపోయింది. చిన్న చిన్న సాంస్కృతికోత్సవాలు ఈ రెండు కళ్యాణ మండపాలలో జరిగేవి.  ఈ కళ్యాణమండపాల పరిసరాలన్నీ  పెళ్ళిళ్ళ సీజన్ లో  రంగురంగుల దీప కాంతులతో, నాదస్వర మేళ తాళ మంగళధ్వనులతో, పట్టుచీరల రెపరెపలతో, రకరకాల సెంట్ వాసనల గుబాళింపులతో  కళకళలాడుతూవుండేవి. మిగిలిన రోజుల్లో  ఆ మండపాలు వెలవెలబోతూ కనిపించేవి. అలాటప్పుడు ఏవేవో ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేవారు.

అలాటి శ్రీ వేంకటేశ్వర కళ్యాణమండపంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఒక రోజు ఉదయం పది గంటలకు మా నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావు గారి కచేరీ. పక్క వాద్యాలున్నాయో లేదో గుర్తులేదు. సాధారణంగా దసరాల సమయంలో వానలు పడడం అలవాటు. ఆయన కచేరీ జరిగిన రోజు ఉదయం కూడా ఒక పెద్ద వర్షం పడి వెలసింది.  ఉదయం 9.30 గంటలకే వచ్చి తీసుకువెళతామన్న కార్యనిర్వాహకుల జాడలేదు. మా నాన్నగారే ఒక రిక్షాలో తన హార్మోనియంను పెట్టుకొని పానగల్ పార్క్ దగ్గరున్న కచేరీ వేదిక వద్దకు వెళ్ళిపోయారు. వెనకాలే నేనూ, మరికొంతమందిమి అక్కడికి చేరుకున్నాము.ఆ కళ్యాణ మండపం బయట ఆవరణలో ఒక నల్లబల్లమీద ఒక సుద్దముక్కతో ఆనాటి కార్యక్రమ విశేషాలు వ్రాసిపెట్టారు. అందులో మా నాన్నగారి పేరు వుంది. అప్పటికింకా ఉత్సవనిర్వాహకులు ఎవరూ రాలేదు. సమయం పది గంటలు కాగానే మా నాన్నగారు హార్మోనియం తెరచి  తన సహజధోరణిలో గానం చేయడం మొదలెట్టారు. ఆయన గాత్రం విని సంగీతాభిలాష గల కొంతమంది చుట్టుపక్కల తమిళ శ్రోతలు వచ్చి చేరారు. సుమారు ఒక గంటసేపు పాడి మా నాన్నగారు తమ కచేరీని ముగించి తిరిగి ఇంటికి వెళదామనుకుంటున్న సమయంలో ఆ ఉత్సవ నిర్వాహకులు కొందరు వచ్చి ఆలస్యం జరిగినందుకు విచారం వెలిబుచ్చి కచేరీని ప్రారంభించమని మా నాన్నగారిని కోరారు.  ఆయన ఏమాత్రం అసహనం కనపర్చకుండా తన సంగీత కచేరీ ముగిసిందని చెప్పారు. అది విని ఆ నిర్వాహకులు నిర్ఘాంతపోయారు.  సంగీతసభలో స్వాగతం, పరిచయాలు, ఉపన్యాసాలు, సత్కారాలవంటి తతంగం ఏమీ జరగకుండానే కచేరీ ఎలా జరుగుతుంది.  పైగా వర్షం వలన శ్రోతలు ఎక్కువగా రాలేదని, ఏవేవో కారణాలతో సంజాయిషీలు మొదలెట్టారు. మా నాన్నగారు అతి శాంతంగా కార్యనిర్వాహకులు ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదని, తాను  రోజూ  ఆ సమయంలో ఇంట్లో పాడుకుంటూనే వుంటానని, అలాటిది ఈ రోజు అమ్మవారి సన్నిధిలో పాడానని, శ్రోతలు వున్నారా లేదా అనేది తనకు ముఖ్యం కాదని వినయంగాచెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.

సంగీతరావుగారు సంగీతాన్ని తన ఆత్మానందం కోసం వినియోగించుకున్నారే కానీ పేరు ప్రఖ్యాతులు కోసమో, కచేరీలకోసమో లేక అందువల్ల లభించే ఆదాయం కోసమో కాదు. ఒక అరడజన్ పక్కవాద్యగాళ్ళతో, సంగీతం  తెలియకపోయినా  పక్కనున్న జనాలనాకర్షించడానికి తలలూపుతూ, ఆహా! ఓహో! అనే శ్రోతలకోసం ఆయన ఏనాడు పాడలేదు. పెద్ద పెద్ద సభలలో కచేరీల కోసం వెంపర్లాడలేదు. ఈ విషయంలో ఆయన మార్గం సద్గురు త్యాగబ్రహ్మంగారి మార్గమే.  అందుకే సంగీతరావు గారు మద్రాసు వచ్చాక చేసిన సంగీత కచ్చేరీలు వ్రేళ్ళమీద లెఖ్ఖపెట్టవచ్చును. 

తమ గురుపుత్రులు సంగీతరావు గారి ఈ విలక్షణ వ్యక్తిత్వానికే శ్రీ ఘంటసాలవారు ఆకర్షితులై  అమితమైన గౌరవాన్ని, స్నేహానురాగాలను చివరివరకూ కనపర్చేవారు.

అదీ శ్రీ పట్రాయని సంగీతరావు గారు.

ఒకసారి మద్రాస్ లో ఒక సంగీత కచేరీ జరిగింది. బహుశా టి.నగర్ లోని సుగుణ విహార్ లోనే జరిగిన జ్ఞాపకం. కచేరీ ఘంటసాల మాస్టారిది కాదు వేరెవరో పాడారు. ఆ కచేరీకి మాస్టారితో కూడా నేను వెళ్ళడం జరిగింది. కచేరీ ముగిసిన తర్వాత మాస్టారు కొంచెం సేపు మాట్లాడారు. మాట్లాడవలసిన పరిస్థితిని ఆ కచేరీ నిర్వాహకులు కల్పించారు. నిర్వాహకులు ప్రధాన గాయకుడితోపాటు కచేరీకి సహకరించిన ఇతర వాద్యగాళ్ళను కూడా సభాముఖంగా సముచితంగా పరిచయం చేసి సత్కరించి గౌరవించారు. కానీ ఆ కచేరీలో తంబురా శ్రుతి వేసి సహకరించిన కళాకారుడిని పూర్తిగా విస్మరించారు. ఇది ఘంటసాలవారి  మనసుకు బాధ కలిగించింది. ఆయన వెంటనే స్టేజిమీదకు వెళ్ళి గాయకుడిని అభినందిస్తూ, సంగీతం గురించి రెండు మాటలు చెప్పారు. సంగీతంలో శ్రుతి లయలు రెండూ ప్రధానాంగాలు. శ్రుతి లయలను అనుసరించి పాడగలిగినప్పుడే ఆ గాయకుడి పాట ఆమోదయోగ్యమవుతుంది. గాయకుడిని సదా అంటిపెట్టుకొని వుండేవి శ్రుతి లయలే. అటువంటి శ్రుతి లయలలో శ్రుతిని  నిర్వాహకులు నిర్లక్ష్యం చేసారు. తంబురా శ్రుతి వేసిన కళాకారుడిని పరిచయం చేయడం మరచిపోయారు. వైలిన్, మృదంగం, ఘటం వాద్యాలతో సహకరించిన కళాకారులు కచేరీకి ఎంత ప్రధానామో అలాగే తంబురా శ్రుతి వేసేవారు కూడా కచేరీలకు అంత ప్రధానం.  అలాటివారిని మరవడం భావ్యం కాదని ఘంటసాల మాస్టారు సన్న సన్నగా చీవాట్లు పెట్టి తాను ఆ తంబురా శ్రుతి వేసినవారిని వేదిక మీదకు పిలచి తాను యధారీతిని గౌరవించారు. ఆనాడు ఘంటసాలగారి వంటి మహాగాయకుడి చేత గుర్తింపబడి సత్కారం అందుకున్న ఆ చిరు కళాకారుడి ఆనందం వర్ణనాతీతం. 

అది ఘంటసాలవారి ఔన్నత్యం.

ఇలాటి వైఖరులు గల సాంస్కృతిక సంస్థలు అప్పుడూ వున్నాయి, ఇప్పుడూ వున్నాయి.  సాంస్కృతిక సంస్థలను నెలకొల్పడం కష్టమేమీకాదు. కానీ వాటిని నిర్దిష్టమైన ప్రణాళికలతో, క్రమశిక్షణతో, భక్తిశ్రధ్ధలతో నిర్వహించగలిగినప్పుడే ఆ కళా సంస్థలు  ప్రజల ఆదరాభిమానాలు పొందుతాయి, పదికాలాల పాటు మనుగడ సాగిస్తాయి. అయితే ఏవిధమైన స్వలాభాపేక్ష లేకుండా నిస్స్వార్ధ చింతనతో కళాసేవ చేసే సాంస్కృతిక సంస్థలు దేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.

1970 ల నుండి మద్రాస్ మహా నగరంలో మెల్లమెల్లగా తెలుగు సాంస్కృతిక సంస్థల ఆవిర్భావం మొదలయింది. అలాటివాటిలో ప్రధానమైనవి మూడు. అవి, కళాభారతి, కళావాహిని, కళాసాగర్. కళాభారతి ప్రారంభం ఘంటసాల మాస్టారి చేతులమీదుగానే జరిగిన గుర్తు. కళాసాగర్ సంస్థను నటసామ్రాట్  శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ మూడు సంస్థలు చాలా సంవత్సరాలు మంచి మంచి సాంస్కృతిక కార్యకలాపాలతో తెలుగువారిని అలరించాయి. నగరంలోని తెలుగు ప్రముఖులంతా సమిష్టిగా సమైక్యతా దృక్పధం లేకుండా తలో కుంపటి వెలిగించి 'కళ' తో పోటీలు పడ్డారు.  తమ తెలుగు నైజం నిరూపించుకున్నారు. 

మద్రాస్ లో బెంగాల్ అసోసియేషన్ వుంది. కర్ణాటక అసోసియేషన్ వుంది. మలయాళం అసోషియేషన్ వుంది. అయితే నగరంలో ఏ బెంగాలీ కార్యక్రమాలు జరిగినా, కన్నడ ఉత్సవాలు జరిగినా, లేదా కేరళ పండగలు జరిగినా వాటన్నిటినీ ఆయా భాషలవారంతా కలసి సమిష్టిగా ఐకమత్యభావంతో జరుపుకునేవారు. కాలక్రమేణా ఆయా అసోసియేషన్ లు మద్రాసులో తమకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపును పొందాయి.. కానీ  స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థలలో అలాటి సమిష్టి భావన ఉన్నట్లు తోచదు. 

మద్రాసులోని సాంస్కృతిక వైభవం గురించి మరో అధ్యాయంలో వివరంగా చూద్దాము. 

🌿🌷🌿


1970లో ఘంటసాలవారికి 'పద్మశ్రీ' బిరుదు లభించాక వారు పాడిన పాటలు గల చిత్రాలు విడుదలైనవి 38. ఆ సినీమాలలో వారు మొత్తం   90 పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడారు. వారి స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలు ఐదు - 'మెరుపు వీరుడు', ' ఆలీబాబా 40 దొంగలు', 'విజయం మనదే', 'తల్లిదండ్రులు' 'రెండు కుటుంబాల కథ' చిత్రాలు.

'పద్మశ్రీ' ఘంటసాల అని టైటిల్స్ లో వేసిన సినీమాలు కొన్ని వున్నాయి. 'పద్మశ్రీ' బిరుదును  తమ పేర్లముందు ఉపయోగించరాదనే నియమం ఏదో వుందనుకుంటాను. ఘంటసాలగారు తన లెటర్ హెడ్స్ లో 'పద్మశ్రీ' అని పేరుకు ముందు వేసుకోలేదు. సినీమా టైటిల్స్ లో కూడా వేయాలని ఆశించలేదు. వారిమీది గౌరవంతో నిర్మాతలే కొందరు తమ చిత్రాలలో పద్మశ్రీ ఘంటసాల అని ప్రకటించేవారు. ఇంతకంటే మరెన్నో ఉన్నత పురస్కారాలకు అర్హుడైన ఘంటసాలవారిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉపేక్షించడం చాలా దురదృష్టకరం. 

ఆ సంవత్సరం గాయకుడిగా మంచి పేరును తెచ్చిపెట్టిన  - అక్కాచెల్లెలు, 

చిటా పటా చినుకులతో - అక్కా చెల్లెలు

తల్లా? పెళ్ళామా?, లక్ష్మీ కటాక్షం, జైజవాన్, కధానాయిక మొల్ల, ఆలీబాబా 40 దొంగలు, పెత్తందార్లు, ధర్మదాత, 

జో... లాలీ... ధర్మదాత

విజయం మనదే, తల్లిదండ్రులు, చిట్టిచెల్లెలు, మాయని మమత, 

రానిక నీకోసం - మాయని మమత

మొదలైన సినీమాలలోని పాటలు ఈనాటికీ మనకు వినిపిస్తున్నాయి. 

ఆ పాటల వివరాలేమిటో వచ్చే వారం చూద్దాము.
                ...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.