visitors

Sunday, October 24, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై నాలుగవ భాగం

24.10.2021 - ఆదివారం భాగం - 54*:
అధ్యాయం 2  భాగం 53 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1967 లో 'నిర్దోషి' సినీమాను విడుదల చేసిన నర్రా రామబ్రహ్మంగారు తన రెండవ చిత్రంగా తన గౌతమీ పిక్చర్స్ బ్యానర్ మీద ఒక జానపద సినీమాను తీయడానికి సంసిధ్ధులయ్యారు. బి.విఠలాచార్య దర్శకుడు. ఎన్.టి.రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, రావికొండలరావు మొదలగువారు ప్రధాన తారాగణంగా వుంటారని అనుకున్నారు. తన మొదటి చిత్రం 'నిర్దోషి' కి సంగీతం నిర్వహించిన ఘంటసాలవారినే తన రెండవ చిత్రానికి కూడా సంగీతం చేయమని నిర్మాత రామబ్రహ్మం కోరారు. ఘంటసాలవారంటే మంచి గౌరవం, స్నేహంగల వ్యక్తి రామబ్రహ్మం గారు. వారిద్దరి మధ్య ఒక సదవగాహన వుండేది.

ఒక శుభ ముహుర్తం చూసి గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ లో కంపోజింగ్ మొదలెట్టారు ఘంటసాల. బందిపోటు సినీమా తర్వాత ఘంటసాల, బి.విఠలాచార్య కలసి పనిచేస్తున్న రెండవ సినీమా. వీఠలాచార్యగారి ఆలోచనా సరళికి, ఘంటసాలవారి ఆలోచనా సరళికి అంతరాలున్నా వాటన్నింటిని పక్కనబెట్టి సమన్వయంతో కలసి పనిచేసి చిత్ర విజయానికి కృషిచేశారు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో మరో జానపదం కూడా వచ్చింది. ఆ విషయం తర్వాత. 

గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ మా 35, ఉస్మాన్ రోడ్ కు దగ్గరే. పానగల్ పార్క్ కు తూర్పునున్న రామకృష్ణ మిషన్ మెయిన్ హైస్కూలు పక్కనే నటుడు ముదిగొండ లింగమూర్తిగారు వుండే నానారావు నాయుడు స్ట్రీట్. దానిని ఆనుకొని వెంకట నారాయణ చెట్టి రోడ్ మీదకే ఉన్న మొదటి భవనం. ఆ భవనంలోనే రామబ్రహ్మం గారు ఒంటరిగా ఉండేవారు. సంసారం ఏదీ ఇక్కడ ఉండేదికాదు. బ్రహ్మాచారి అని విన్నాను. వివరాలు తెలియవు. ఆ ఇంటికి రెండు మూడు ఇళ్ళ తర్వాత ఎస్.వరలక్ష్మిగారి ఇల్లు, ఆ తర్వాత వచ్చే రాజా స్ట్రీట్ లో  ఎడమవేపు మొదటిదో, రెండవదో నటి సంధ్యగారి ఇల్లు. ఆమె కుమార్తే జయలలిత. నటిగా, తర్వాత ఎమ్జీయార్ పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా తమిళనాట తన ప్రభావాన్ని, ప్రాభవాన్ని చాటి చెప్పారు. ఆ జయలలితే రామబ్రహ్మంగారి 'ఆలీబాబా 40 దొంగలు' సినిమాకు కధానాయిక. 

ఆ రోజుల్లో సినిమా పాటల కంపోజింగ్ మొదలుపెట్టేముందు ఆ చిత్రం యొక్క కథను సంగ్రహంగా సంగీత దర్శకుడికి, ఆనాటి పాట వ్రాయడానికి వచ్చే రచయిత కు వివరిస్తారు. సాధారణంగా ఆ భాధ్యత ను రచయిత, అసిస్టెంట్ డైరక్టర్ తీసుకుంటారు. చిత్రనిర్మాత కూడా పక్కనే వుంటారు. 

ఆ విధంగా వారు కథను చెప్పిన తర్వాత ఏఏ సన్నివేశాలలో పాటలు అవసరమనిపిస్తాయో వాటి వివరాలు ఆయా పాటల కంపోజింగ్ సమయంలో చెపుతారు. వారు చెప్పినదానిని మనసులో పెట్టుకొని గీత రచయిత, సంగీతదర్శకుడు తమ కార్యక్రమానికి ఉపక్రమిస్తారు.  వెళ్ళిన ప్రతీసారి, వీటన్నిటికీ ముందు ఒక ముఖ్యమైన కార్యక్రమం వుంటుంది, అదే ఫలహారాలు, కాఫీ, తాంబూలం, సిగరెట్ల సేవనం. సాధారణంగా ఈ పాటల కంపోజింగ్ లు ఉదయం తొమ్మిదికి, సాయంత్రం నాలుగు తర్వాత ఏర్పాటు చేసేవారు. ఆ సమయానికి అనుగుణమైన ఫలహారాలనే ,పాపం , నిర్మాతలు తమ సొంత ఖర్చుమీద, ఒక మంచి పెద్ద హోటల్ నుండి తెప్పించి ఆ రోజు అక్కడున్నవారందరికీ తెప్పించేవారు. షూటింగ్/రికార్డింగ్/రీరికార్డింగ్ లు జరిగేప్పుడు ఆయా  సమయాలను బట్టి కాఫీ, టిఫెన్లు, భోజనాలు ఏర్పాటు చేసేవారు. షూటింగ్ లు, రీరికార్డింగ్ లు నిర్విరామంగా, ఏ అడ్డంకులు లేకుండా సాగాలంటే ఈ రకమైన సాదరు ఖర్చులు తప్పవు.
 
ఆ రోజుల్లో స్టూడియోలకు వెళ్ళి రావడానికి వాహనాలను కూడా నిర్మాతలే ఏర్పాటు చేసేవారు. అందుకు సినీమా నిర్మాణంలో వున్నన్ని రోజులు కొన్ని కార్లను, వ్యాన్లను అద్దెకు తీసుకునేవారు.

మరీ నాస్తికుడైన నిర్మాత అయితే తప్ప,   తమ సినిమాను ఒక శుభముహుర్తాన పురోహితుల సమక్షంలో వినాయకుడు, లక్ష్మీ, సరస్వతి మొదలైన దేవతాపటాలను పూలమాలలతో అలంకరించి పూజతో ప్రారంభిస్తారు. సాధారణంగా ఈ పూజా కార్యక్రమానికి  నిర్మాత దర్శకుడు, హీరో హీరోయిన్ లు, సంగీత దర్శకుడు, కెమెరామెన్, డిస్ట్రిబ్యూటర్ లను కూడా ఆహ్వానిస్తారు. ఆ పూజకు హాజరైనవారంతా తలా ఒక కొబ్బరికాయ (నిర్మాత డబ్బులే)  కొట్టి భగవంతుడి ఆశీస్సులు పొందుతారు. ఈ పూజా కార్యక్రమాలు కొన్నిసార్లు మొదటి రోజు షూటింగ్ సందర్భంగా చేస్తారు, లేదా పాటల కంపోజింగ్ తో ఆఫీసులో జరుపుతారు. వారి అనుకూలాన్నిబట్టి జరుగుతాయి. నిర్మాత యొక్క ఆర్ధికస్తోమత,  మెయిన్ ఆర్టిస్ట్ లు ఇచ్చే  వరస డేట్ల మీద సినిమా ఎంతకాలంలో ముగుస్తుందనేది తెలిసిపోతుంది.

మరి, ఈ ఆలీబాబా 40 దొంగల సినిమా ఏవిధంగా ప్రారంభయిందో నాకు తెలియదు. నేను 'వినాయకచవితి', 'మాయనిమమత' సినిమా ప్రారంభోత్సవాలకు తప్ప మిగిలిన ఏ సినీమా ఉత్సవాలకు వెళ్ళలేదు. ఈ సినిమా సమయంలో నేను కొంచెం ఖాళీగానే ఉండేవాడిని. శని ఆదివారాలు శెలవు, ప్రతీ పండగకు ఏదో రకమైన శెలవుల వలన, మా నాన్నగారికి ఇష్టంలేకపోయినా, ఘంటసాల మాస్టారి వెనకాల వెళ్ళేవాడిని. షూటింగ్ ల పట్ల, స్టార్స్ పట్ల నాకు ఏనాడు ఆసక్తివుండేదికాదు. ఆంధ్రానుండి మద్రాస్ వచ్చే బంధుమిత్రుల కోసం కొన్ని షూటింగ్ లకు వెళ్ళడం జరిగింది. పాటల రచన విధానం మీద, స్వర రచనల మీద వుండే ఆసక్తివలన కంపోజింగ్ లకు, రికార్డింగ్/రీరికార్డింగ్ లకు వెళ్ళేవాడిని. అది కూడా ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలకు మాత్రమే వెళుతూ,  ఎక్కడా నా వల్ల ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడిని. పాటల కంపోజింగ్ సమయంలో పాటల లోని పదాలు,  వరసల విషయంలో రచయిత, సంగీత దర్శకుల మధ్య జరిగే చర్చలు, సంభాషణలు వినడంలో ఒక ఆనందం వుండేది.
 
కొసరాజుగారు, సి.నారాయణరెడ్డి గారి వంటి రచయితలు వారే ఏవో ట్యూన్స్ లాటివి కట్టి పాడి వినిపిస్తూండేవారు. పాటల కంపోజింగ్ మామూలు వాళ్ళకు ఒక విసుగుపుట్టించేపని. ఘంటసాలవారి కంపోజింగ్ అంటే సంగీతంబాబు (హార్మోనియం), రాఘవులు (చేసిన ట్యూన్ కు సరైన మాటలు దొరికేవరకు అలా  పదే పదే పాడి వినిపించడం ఆనాటి రివాజు). లయ కోసం ఒక తబలా తప్పనిసరి. మొదటి రోజుల్లో పామర్తిగారు కంపోజింగ్ లలో తబలా వాయించేవారు. తర్వాత పెద్ద ప్రసాద్, జడ్సన్, ఆయన తమ్ముడు చిన్నప్రసాద్, సుబ్బారావు, ఇలా చాలామంది మారారు.

గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ ఇంటి క్రింది భాగంలో వుండడం మా నాన్నగారిలాటి వాళ్ళకు ఒక సౌకర్యంగా వుండేది. కొన్ని ఫిల్మ్ కంపెనీలు మేడమీద వుండి తన హార్మోనియంను ప్రతీసారీ మేడమీదకు ఎక్కించడం, దింపడం మహాయాతనగా వుండేది. కొన్నిసార్లు ఆఫీసు బాయ్స్ అందుబాటులో వుండేవారు కాదు. అలాటి కొన్ని సమయాలలో నేనే ఆయనకు సాయంపట్టేవాడిని. తర్వాత కాలంలో వీణ వాయించేప్పుడు అదే సమస్య. రెండు చాలా బరువైన వాద్యాలే. హార్మోనియం, వీణ, డ్రమ్స్ వంటి హెవీ ఇన్స్ట్రమెంట్స్ ను స్టూడియోలకు మోసుకెళ్ళడమూ శ్రమతోకూడిన పనే. ఈ వాద్యలతో పోలిస్తే ఫ్లూట్, వైలిన్ వాయించేవాళ్ళకు మహా హాయి. చాలా తేలికగా బస్సుల్లో ప్రయాణం చేసి స్టూడియోలకు వచ్చేవారు. అందుకే మొదటి రోజుల్లో సినీమా కంపెనీవాళ్ళే ఆర్కెస్ట్రావారిని తమ కార్లలో తీసుకువెళ్ళి, మళ్ళీ ఇళ్ళవద్ద దింపేవారు. మొదటినుండి మా నాన్నగారిది బరువైన జీవితమే.

ఆలీబాబా 40 దొంగలు కథ అరేబియన్ నైట్స్ కథలలోనిది. ఈ  కథ సినీమాగా అనేక విదేశీ భాషల్లో, స్వదేశీ భాషలలో నిర్మించారు. 1955లో ఆలీబాబా 40 దొంగలు సినీమాను మోడర్న్ థియేటర్స్ వారు తమిళంలో ఎమ్.జి.రామచంద్రన్, భానుమతి, వీరప్ప, తంగవేలు మొదలైనవారితో తీసారు. తమిళంలో మొట్టమొదటి గేవాకలర్ సినీమా. బ్రహ్మాండమైన విజయం పొందింది. హీరో పాడే ఒకే డ్యూయెట్ భానుమతితో   ఎ.ఎమ్.రాజా పాడగా, కమేడియన్ తంగవేలు తెర మీద పాడిన 'ఉల్లాస ఉలగమ్ ఉనకే సొందం... సెయడ సెయడ సెయడ... ని జల్సా సెయడ సెయడ సెయడ..." పాటను ఘంటసాలగారు పాడారు. సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతంలో వచ్చిన ఆ సినీమా పాటలన్నీ చాలా జనాదరణ పొందాయి. సినిమాలో భానుమతిగారి పాటలే ఎక్కువ. ఆ సినీమాను తెలుగులో కూడా డబ్ చేసారు. ఆ సినీమాను ఒక పధ్నాలుగేళ్ళ తర్వాత తెలుగులో తీయ సంకల్పించారు రామబ్రహ్మంగారు. విఠలాచార్యగారు, మాటల రచయిత డి.వి.నరసరాజుగారు కలసి తెలుగు సినిమా ట్రీట్మెంట్ ను కొంత మార్చారు. ఒరిజినల్ కథలో ఆలీబాబాకు, ఆ నలభై దొంగలకు ఏ సంబంధము లేదు. కాని తెలుగులో మాత్రం ఆ బందిపోటు దొంగల గుంపు వల్లే ఆలీబాబా తండ్రి చనిపోవడం లాటి ఫ్లాష్ బ్యాక్ ను సృష్టించారు. కామెడీ ట్రాక్ మార్చారు. 1969 సినీమా నాటికి దొంగల చేతికి తుపాకులు వచ్చాయి. అవి పాత సినిమా లో కనపడవు. ఆలీబాబా 40 దొంగలు లో వినోదానికి కొదవలేదు. అందువల్ల పాటలకు కొదవలేదు. సోలోలు, డ్యూయెట్లు, డాన్స్ పాటలు చాలానే వుంటాయని అనుకోవడం జరిగింది. సంగీతపరంగా మంచి స్కోప్ వున్న సినీమా. పాటల ట్యూన్స్ విషయంలో ఏ విధమైన జోక్యం లేకుండా స్వేఛ్ఛగా పనిచేసుకునే వాతావరణాన్ని ఘంటసాలవారికి రామబ్రహ్మంగారు కల్పించడంతో ఘంటసాలగారు మనసుపెట్టి ఈ సినీమాకు పనిచేశారు. 

అప్పుడే వర్ధమాన గాయకుడిగా అందరి దృష్టిలో పడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనే నూతన గాయకుడిచేత ఘంటసాలవారు తనసంగీత దర్శకత్వంలోని ఈ సినీమాలో  రెండు పాటలు పాడే అవకాశం కల్పించారు. 

ఈ సినీమాలో హీరోయిన్ కు ఒక రొమాంటిక్ సోలో. ఎవరిచేత పాడించాలనే విషయం చర్చకు వచ్చింది. సాధారణంగా జయలలిత పాటలకు  సుశీలగారినే ఎన్నుకుంటారు. కానీ ఈ పాటను ఆ సినిమా హీరోయిన్ జయలలిత చేతే పాడించాలని నిర్ణయించారు. జయలలిత  గాయని కాదు.  నటి, నర్తకి మాత్రమే. కానీ సంగీతం మీద ఆసక్తి, పాడాలనే ఉత్సాహం గల నటి. శ్రావ్యమైన కంఠం. అది చూసి ఎమ్.జి.ఆర్ ముందుగా తన సొంత చిత్రం ' అడిమై పెణ్' లో జయలలిత చేత ఒక సోలో కె.వి.మహాదేవన్ సంగీతంలో పాడించారు. ఆ పాట ('అమ్మా ఎన్డ్రాల్ అన్బు)  అందరికీ నచ్ఛింది. అలాగే, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  తమిళంలో పాడగా రిలీజైన మొదటి సినీమా కూడా ఈ అడిమై పెణ్ సినీమానే. ఇందులో  హీరో ఎమ్.జి.ఆర్ కు పాడే అవకాశం రావడం అతనికి దక్కిన గొప్ప అదృష్టం.

గాయని కాని గాయని చేత పాడించాలంటే సంగీతదర్శకుడు కొంత కసరత్ చేయాలి. పాత గాయనీమణుల శక్తి సామర్ధ్యాలు అందరికీ తెలిసినవే కావడం వలన పాట ఎలా కంపోజ్ చేసినా ఇబ్బందిలేదు. కావలసిన ఎఫెక్ట్ రాబట్టుకోవచ్చును. అదే నూతన గాయకులైతే వారు ఏ శ్రుతులలో పాడగలరు, ఎంత స్థాయి వరకు గొంతు పెగులుతుంది, గమకాలు ఎంతవరకు పాడగలరు, భాష ఉచ్చారణ, భావ ప్రకటన  వంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని  వారి స్థాయికి తగ్గ రీతిలో పాటకు వరస కూర్చవలసి వస్తుంది. అక్కడ సంగీత దర్శకుడు తన సంగీత ప్రతిభను చాటకూడదు. విజ్ఞతను చూపించాలి. లేకపోతే పాట అభాసుపాలు అవుతుంది.

ఏ సన్నివేశానికి ఏ రకమైన రాగాలు అనువుగా వుంటాయి, పాటలో ఎన్ని చరణాలుండాలి, పాటను బట్టి ఎలాటి బిజిఎమ్స్ వేయాలి, పాటకు ఎంత ఆర్కెస్ట్రాను పెట్టాలి అనే విషయాలన్నిటిమీద సంగీత దర్శకుడిగా ఘంటసాలవారికి నిర్దిష్టమైన అభిప్రాయాలే వుండేవి. అవసరమున్నా లేకపోయినా హెవీ ఆర్కెస్ట్రాను ఉపయోగించడానికి సుతారము ఘంటసాలగారు ఇష్టపడేవారు కాదు. పాట అందరు పాడుకోవడానికి వీలుగా పదాలు సులభంగా అర్ధం అయేలా, క్యాచీగా వుండాలి. అందుకే తన పాటలలో పల్లవి తర్వాత వచ్చే చరణాలు రెండైనా, మూడైనా ఒకే వరసలోనే చేసేవారు. చరణం చరణానికి ట్యూన్ మార్చుకుంటూ పోతే ఆ పాట  శ్రోతల హృదయాలలో నిలవదనేది వారి అభిప్రాయం. రాగమాలిక పాటలు వేరు. అదే నృత్యప్రధాన గీతమైతే డాన్స్ డైరెక్టర్ ను కూడా పక్కన పెట్టుకొని వారి సూచనలు తీసుకొని గతులను, జతులను సమకూర్చేవారు. 

జయలలితకు తెలుగులో ఇదే మొదటిపాట. హీరో హీరోయిన్ లను మంచి చేసుకుంటే (ఇచ్చే భారీ పారితోషికాలు ఎలాగూ తప్పవు) తమ సినిమా షూటింగ్ లు ఏ ఆటంకాలు లేకుండా అనుకున్న ప్రకారం ముగిసిపోతాయని నిర్మాతల అల్ప ఆశ. అందుకోసం వాళ్ళలో వుండే అదనపు అర్హతలు కనిపెట్టి బయటపెట్టడానికి తాపత్రయపడుతూ వుంటారు. స్టార్ ఇమేజ్ గలవాళ్ళు ఏం చేసినా అదో గొప్ప చరిత్ర అని భావించే వీరాభిమానులున్నంత వరకూ ఎవరేంజేసినా చెల్లుతుంది.

జయలలిత విషయంలో అలాటి అపప్రధ రాకుండా వుండేలా ఘంటసాల మాస్టారు ఆలీబాబా 40 దొంగలు సినీమా లో ఒక పాటను స్వరపర్చారు. ఆ పాటను  సరళమైన చిన్న చిన్న మాటలతో దాశరధి వ్రాసారు. మాస్టారు కూడా గాయని ఎక్కువ కష్టపడకుండా వుండేలా సున్నితంగా, శ్రావ్యంగా బృందావన సారంగ స్వరాలను ఉపయోగించి ఈ పాటను స్వరపర్చారు. ఘంటసాల మాస్టారు చేసినపాట నిర్మాత, దర్శకుడు అందరికీ నచ్చింది. ఇప్పుడా పాట రికార్డింగ్ చేయడానికి ముందు హీరోయిన్ జయలలితకు నేర్పాలి. ఆ తర్వాతే రికార్డింగ్. నిర్మాత హీరోయిన్ ను సంప్రదించి పాట రిహార్సల్స్ చేయడానికి  ఓ రెండు రోజుల పాటు సమయం సంపాయించారు. ఉదయం ఆరు నుండి ఏడు గంటలవరకు రిహార్సల్స్. ఆ తరువాత ఆవిడ మేకప్ చేసుకొని తొమ్మిదికల్లా షూటింగ్ స్పాట్ లో వుండాలి. రాత్రి తొమ్మిది దాటాకే ఇంటికి రావడం. అప్పుడు అసలు కుదరదు. జయలలిత ఇంట్లోనే రిహార్సల్స్. ఘంటసాల మాస్టారే ఆవిడ ఇంటికి వెళ్ళి పాట నేర్పాలి. ఆ విషయంలో మాస్టారికేమీ పట్టింపులేదు. తాను చేసిన పాట బాగా రావాలి, అంతే. ఆవిడ నివాసం గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ కు దగ్గరలోనే రాజా స్ట్రీట్ లో. అనుకున్నట్లుగానే ఒక రోజు ఉదయం ఆరింటికల్లా మాస్టారు, మా నాన్నగారు (సంగీతరావుగారు) హార్మోనియంతో, జడ్సన్ తబలాతో, వారితో పాటు నేను కూడా జయలలిత ఇంటికి చేరుకున్నాము. ఎవరో మమ్మల్ని చూసి లోపల హాల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. ఇల్లంతా నిర్మానుష్యంగా, నిశబ్దంగా వుంది. కొంతసేపటికి సంధ్యగారు వచ్చి మాస్టారిని పలకరించి అమ్ము (జయలలిత  ముద్దు పేరు) ఇప్పుడే వచ్చేస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఓ పది నిముషాల తర్వాత మెల్లగా సుకుమారంగా మేడ మెట్లు దిగి జయలలిత మేమున్న చోటికి వచ్చి అందరికి ఓ నమస్కారం అందజేసింది. కొన్ని మామూలు మాటలు అయ్యాక మాస్టారు, వాద్యబృందం సహకారంతో ఆవిడకు 'చల్ల చల్లనీ వెన్నెలాయే, మల్లెపూల పానుపాయే' పాటను  ఓ రెండుసార్లు పాడి వినిపించారు. జయలలిత మంచి జ్ఞానస్తురాలే. ఎక్కువ సమయం తీసుకోకుండానే పాటను నేర్చుకుంది. తానూ పాడి వినిపించింది. సన్నటి శ్రావ్యమైన గాత్రం. అవేళకు రిహార్సల్స్ ముగిసాయి. ఆ మర్నాడు కూడా మరోసారి రిహార్సల్స్ చూస్తే రికార్డింగ్ పెట్టుకోవచ్చని చెప్పిందావిడ. ఆ మర్నాడు ఉదయం జరిగిన రిహార్సల్స్ కు నేను వెళ్ళలేదు. తర్వాత ఒక రోజు విజయాగార్డెన్స్ థియేటర్ లో 2 to 9 కాల్షీట్ లో రికార్డింగ్ ఫిక్స్ చేసారు. ఈ పాటకు వైలిన్స్, గిటార్, మేండలిన్, పియోనో, ప్లూట్, క్లారినెట్, డబుల్ బేస్, తబలా, డోలక్, రెండు హార్మోనియంలు (రెండో హార్మోనియం హుసేన్ రెడ్డిగారు) ఇతర రిథిమ్స్ మొత్తం అంతా ఒక పదిహేను మంది ఆర్కెస్ట్రాను ఉపయోగించిన గుర్తు.   హీరోయిన్ జయలలిత పాడుతున్న పాట అనగానే ఈ పాట రికార్డింగ్ కు ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, డాన్స్ డైరక్టర్, అసిస్టెంట్లుతో పాటు నాలాటివారు కూడా చాలా మందే హాజరయ్యారు. ఆర్కెస్ట్రాతో ఓ రెండు మానిటర్లు చూసాక సింగర్ వాయిస్ తో ఒక రిహార్సల్ చూశారు. ఘంటసాలమాస్టారు సౌండ్ ఇంజనీర్ స్వామినాథన్ పక్కనే కూర్చోని జయలలితకు, ఆర్కెస్ట్రావారికి తగిన సూచనలిచ్చాక ఫైనల్ టేక్ కు అంతా రెడీ అయ్యారు. అప్పుడు జయలలిత తన రూమ్ లోనుండి ఘంటసాల మాస్టారు వున్న రూముకు వచ్చి మొదటిసారిగా తెలుగులో మీ డైరక్షన్ లో పాడుతున్నాను. బాగా పాడాలని ఆశీర్వదించండి అని  వంగి ఘంటసాల మాస్టారి కాళ్ళకు నమస్కారం చేసింది.  అందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. అది ఒక ఉత్తమ కళాకారుడి సంస్కారం. వినయ విధేయతలు. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ పెద్దలను గౌరవించడమనే సంస్కారం అందరిలో అలవడాలి. ఆ తరువాత ఓ రెండు మూడు టేకులలో పాట OK చేసారు.  జయలలిత ఆలీబాబా 40 దొంగలు సినీమా కోసం పాడిన తొలి తెలుగు గీతం రికార్డింగ్  తృప్తికరంగా ముగిసింది. 


చల్లచల్లనీ వెన్నెలాయే

 🌿💐🌿


1969 లో తిరుమల-తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడిగా ఘంటసాలవారిని కరుణించిన వేంకటేశ్వరస్వామి 1970లో మరోసారి మరోలా ఆశీర్వదించాడు. 

తన సంగీతం ద్వారా 25 సంవత్సరాల పాటు చలనచిత్రసీమకు, సమాజానికి, దేశానికి ఇతోధికంగా చేసిన సేవలకు గుర్తింపుగా భారతప్రభుత్వం ఘంటసాల వారికి ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' బిరుదును ఇచ్చి గౌరవించింది. 1970 ప్రారంభంలో ఢిల్లీలో ఆనాటి రాష్ట్రపతి గౌరవనీయులు వి.వి.గిరిగారి చేతులమీదుగా ఘంటసాలవారు  'పద్మశ్రీ' అవార్డు ను అందుకున్నారు.
 
పద్మ అవార్డ్ ను పొందిన తొలి తెలుగు సినీమా గాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది తెలుగు సంగీతాభిమానుల ప్రశంసలను, ఆశీస్సులను, ప్రేమాభిమానాలను తన సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ వచ్చిన శుభతరుణంలో ఘంటసాల రజతోత్సవ నిర్వహణా కార్యకర్తలలో మరింత నూతనోత్సాహం పుంజుకుంది.

ఆ రజతోత్సవ విశేషాలన్నీ వచ్చేవారం...
                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, October 17, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై మూడవ భాగం

17.10.2021 -  ఆదివారం భాగం - 53*:
అధ్యాయం 2 భాగం 52 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, వ్యక్తులతో పరిచయాలు, తిరిగే పరిసరాలు యాదృఛ్ఛికంగా జరిగేవే అయినా వాటితో అనుబంధం, మమకారం మనలను అంటిపెట్టుకునే వుంటాయి.

మేము నెం.35, ఉస్మాన్ రోడ్ లో 28 సంవత్సరాలున్నాము. అలాగే ఆ ఇల్లు వదలిపెట్టి కూడా 38 సంవత్సరాలయింది. ఆ ఇల్లు మన్నందర్నీ వదిలి 20 ఏళ్ళైంది. అయినా, ఆ యింటితో, ఉస్మాన్ రోడ్ తో, టి.నగర్ ప్రాంతంతో వున్న అనుబంధం, మమకారం నన్ను అంటిపెట్టుకునేవున్నాయి. ఆనాటి జ్ఞాపకాలు సదా మదిలో మెదులుతూనే వుంటాయి. 

అలాగే  మా లయొజన్ ఆఫీస్ ఉన్న అడయార్ ప్రాంతం. మైలాపూర్ నుండి ఆఫీస్ షిప్ట్ చేసేనాటికి ఆ ప్రాంతం ఎక్కడ వుందో,ఎలా వుంటుందో నాకు తెలియదు. టి.నగర్ నుండి  47, 47A బస్ లలో వెళ్ళడం మొదలు పెట్టినా సరిగ్గా మా ఆఫీస్ వీధికి దగ్గరలో వున్న స్టాపింగ్ లో దిగడం గాంధీనగర్ ఫోర్త్ క్రాస్ స్ట్రీట్ లో వుండే ఆఫీస్ కు వెళ్ళడం మళ్ళా మెయిన్ రోడ్ కు వచ్చి బస్ ఎక్కి పానగల్ పార్క్ దగ్గర దిగడం, ఇదే దినచర్యగా వుండేది. అడయార్ లోని మిగిలిన ప్రాంతాలగురించి ఏ అవగాహన వుండేదికాదు. కానీ, ఎప్పుడైతే మా లయొజన్ ఆఫీసర్ వసంతకుమార్ బావా గారు నన్ను తానుండే ఇంటికి ఆఫీస్ పనిమీద రమ్మనడం మొదలెట్టారో అప్పటినుండి అడయార్ ప్రాంతం గురించి తెలియడం ప్రారంభించింది. అప్పట్లో ఆయన ఉండే ఫ్లాట్స్  లోనే  ఇప్పుడు అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ  'మలర్' హాస్పిటల్ వుంది. ఆ ప్రాంతంలోనే శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి ఆలయం వుంది. స్వామివారు శయనభంగిమలో చాలా పెద్ద విగ్రహం. అప్పటికి ఆ ఆలయం కట్టి ఆరేడు సంవత్సరాలు మాత్రమే. త్రివేండ్రమ్ ఆలయంలోని మూలవిరాట్ లానే వుంటుంది. ఆ ఆలయనిర్మాణానికి స్థలాన్ని దానం చేసింది కూడా త్రివాన్కూర్  ఆఖరి మహారాజే. ఎప్పుడైతే బస్ లో  మానేసి సైకిల్ మీద వెళ్ళడం ప్రారంభించానో అప్పుడే అడయార్ ఎంత పెద్ద ప్రాంతమో తెలియడం ఆరంభమయింది. 1970ల నాటికి నేను ఆ ఆఫీస్ వదిలేశాను.  కానీ  ఓ దశాబ్దంన్నర తర్వాత మళ్ళీ అదే గాంధీనగర్ కు మా టివికె శాస్త్రిగారితో వెళ్ళవలసి వచ్చేది.  ఆదినుండి మా సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే శ్రీమతి జయలక్ష్మి తన తల్లిదండ్రులతో అదే గాంధీనగర్ లో మా ఆఫీస్ వుండిన వీధిలోనే వుండేది. 

ఇప్పటికీ ఆ అడయార్ తో నా అనుబంధం ముగియలేదు. ఇప్పుడు మేముంటున్న OMR (IT Express way) కు కూడా అడయార్ మీదుగానే రావాలి. ఏ పెద్ద షాపింగ్ చేయాలన్నా అడయార్ గాంధీనగర్ మెయిన్ రోడ్ కు వెడుతూనేవుంటాము.
అలా అడయార్ కూడా మా జీవితంలో ఒక భాగమైపోయింది.

అసలు ముఖ్యమైన విషయం ఒకటి ఇక్కడ చెప్పవలసివుంది. 

నేను ఈ అడయార్ ఆఫీస్ కు రావడానికి ఓ రెండేళ్ళముందే మా నాన్నగారి తో కలసి ఒకసారి ఈ అడయార్ గాంధీనగర్ కు వచ్చాను. అప్పుడు అడయార్ ప్రాంతం చాలా ప్రశాంతంగా  వుండేది. ఇప్పుడు వున్నంత జనసమర్దత కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఫ్లై ఓవర్స్ కానీ ఏవీ లేవు. రోడ్లకు రెండుప్రక్కలా పెద్ద పెద్ద చెట్లతో  చాలా చల్లగా వుండేది. పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాగా వుండేది. అప్పట్లో శ్రీ వి.జి.కె.చారి (వింజమూరి గోపాలకృష్ణమాచారి)గారు ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు శ్రీ వింజమూరి వరదరాజయ్యంగార్ గారి సోదరుడి కుమారుడు,  అడయార్ గాంధీనగర్ లో  వుండేవారు. వరదరాజయ్యంగార్ గారి కుమార్తె మా పెద్దచెల్లెలు డాక్టర్ కె.వి.రమణమ్మకి కాలేజీలో ఒక సంవత్సరం సీనియర్. వి.జి.కె.చారిగారు వృత్తిరీత్యా ఛార్టర్డ్ ఎక్కౌంటెన్సీ కన్సల్టెంట్. మా నాన్నగారికి అంతవరకూ లేదు కానీ ఆ  ఒక్క ఏడాది మాత్రం  ఆదాయం పన్ను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ లెక్కల వ్యవహారాలు సరిచూడడానికి మా నాన్నగారు చారీగారి వద్దకు వచ్చారు. ఆయన తెలుగువారే. వృత్తిరీత్యా ఆడిటర్  అయినా ప్రవృత్తి భక్తిగీత రచనలు. సంగీతం పట్ల మంచి ఆసక్తి వుండేది. 


వి.జి.కె. చారిగారు


వింజమూరి వరదరాజ అయ్యంగార్ గారు

ఆయన మా నాన్నగారి ఆదాయ వ్యయాలు సరిచూసి చివరకు ఒక నూరు రూపాయలు టాక్స్ కట్టాలని తేల్చి 'are you happy?' అని నన్ను అడిగారు. ఈ సందర్భంగా నేను మాత్రం ఆయన వద్దకు రెండుసార్లు వెళ్ళాను. ఈ వ్యవహారం చూసేందుకు మా నాన్నగారు ఆయనకు ఫిజు ఎంత ఇచ్చారో తెలియదు. ఇవన్నీ మా నాన్నగారున్న స్థితిలో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందమయింది.
 
ఈ టాక్స్ ల వ్యవహారం అయిన తర్వాతే అని గుర్తు వి.జి.కె.చారిగారు వ్రాసిన రెండు పాటలను శ్రీ ఘంటసాలవారు ప్రైవేట్ రికార్డ్ లుగా పాడారు. అవే తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి మీద పాడిన 'శేషాద్రి శిఖరాన', 'తిరువెంకటాధిశ జగదీశా' పాటలు. 





ఈ రెండు పాటలు బహుళ జనాదరణ పొందాయి. ఈ పాటలు ఈనాటికీ తిరుమల శిఖరాలలో నిత్యమూ ప్రతిధ్వనిస్తూ యాత్రికులలో భక్తిభావాన్ని పెంపొందిస్తూనేవున్నాయి.

🌿🌺🌿


ఒకరోజు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారు నన్ను వారింటికి రమ్మని కబురుచేశారు. అప్పటికి USEFI  అమెరికన్ కాన్స్యులేట్ కి వెళ్ళడం వల్లనో లేక డి.ఎన్ రావుగారు USEFI వదలి ఇండో-కెనెడియన్ ఫౌండేషన్ లో రీజినల్ డైరెక్టర్ గా చేరడం వల్లనో తెలియదు, మొత్తానికి వారిల్లు విజయరాఘవాచారి రోడ్  'పూర్ణిమ' నుండి బజుల్లా రోడ్ - తిరుమలపిళ్ళై రోడ్ జంక్షన్ లోని ఇంటికి మారింది. ఆ కొత్త ఇంటికి వెళ్ళగానే విశాలాక్షి గారు తాను వ్రాసిన ఒక పుస్తకాన్ని నా చేతిలో పెట్టారు. ఆ నవలను ఎవరో నిర్మాత తెలుగులో సినీమాగా తీయాలని సంకల్పించారని, ఆ నవలకు ఒక సినాప్సిస్ వ్రాయాలని , ఆ పనిని నేను చేయాలని అడిగారు. పుస్తకాలు సరిగా చదవడమే రాదు, వాటికి సినాప్సిస్ నేను రాయడమా? అలవాటు లేని ఔపాసన అని అనుకున్నాను. కానీ, ఆవిడ ధైర్యం చెప్పి ఎలా రాయాలో చెప్పి నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని పురిగొల్పారు. ఆవిడ చెప్పిన పధ్ధతులలోనే ఆ నవలకు కావలసిన సినాప్సిస్ తెలుగులో వ్రాసి ఆవిడ చెప్పిన గడువుకు ముందే వ్రాసి ఇచ్చేశాను. ఆవిడ అది చదివి చాలా సంతోషించారు. నేను వ్రాసినదానికి ఏ మార్పులు చేయకుండా యథాతథంగా ఆ నిర్మాతకు అందజేసినట్లు తర్వాత చెప్పారు. ఆ నిర్మాత దర్శకులకు కూడా ఆ కథాసంగ్రహం నచ్చిందని దానినే సినిమా గా తీయడానికి విశాలాక్షి గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ నవలే ' వారధి'. ఆ సినీమాయే 'రెండు కుటుంబాల కథ'.  ఈ నవలకు సినాప్సిస్ వ్రాసినందుకు నాకు కొంత పారితోషికం కూడా లభించింది. ఈ సినీమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తర్వాత చూద్దాము. 

🌿🌺🌿


ఘంటసాలవారు చలనచిత్ర సీమకు వచ్చి 25 సంవత్సరాలు అవుతున్నది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా, స్వాతంత్య్ర పోరాటంలో తన పాటలతో ప్రజలను ఉత్తేజపర్చి తనవంతు పాత్రను పోషించిన ఒక ఉత్తమ పౌరుడిగా, ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలనే ఒడ్డిన పొట్టి శ్రీరాములుగారి నిరాహారదీక్షలో తనవంతు చేయూతనిచ్చి ప్రవాసాంధ్రులలో చైతన్యం తెచ్చిన ప్రజాగాయకుడిగా ఘంటసాలవారి కృషి, చేసిన సేవ నిరుపమానం.

అటువంటి ఘంటసాల చలనచిత్ర రజతోత్సవాన్ని ఘనంగా జరపాలని దేశవ్యాప్తంగా వున్న ఘంటసాల అభిమానులంతా కోరుకున్నారు. అందుకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా సహకరించడానికి తమ సంసిధ్ధతను తెలియజేశారు. దక్షిణ చలనచిత్ర సీమలలోని ప్రముఖులంతా కూడా  ఘంటసాల చలనచిత్ర రజతోత్సవ సంగీత సంబరాలలో పాల్గొనడానికి తమ పరిపూర్ణ సహకారాన్ని ప్రకటించారు.

ఘంటసాలవారు తన 25 సంవత్సరాల సినీ సంగీత యానంలో తన పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డ నిర్మాత, దర్శకులు, సంగీతదర్శకులు, నేపథ్యగాయనీగాయకులు, వాద్యకళాకారులు, అంతకు మించి తాను పాడిన పాటలను, స్వరపర్చిన గీతాలను మెచ్చుకుంటూ తమ ప్రశంసలతో, అభిమానంతో ప్రోత్సహిస్తూ వస్తున్న అశేష ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా అందరి సమక్షంలో ఈ బ్రహ్మాండమైన ఉత్సవం జరగాలని  ఘంటసాలగారు కోరుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమ అంతా ఒకే కుటుంబమని, వారందరి సహాయ సహకారాలతోనే తాను వివిధ భాషలలో ఎన్నో పాటలు పాడే అవకాశం లభించిందని, అందువలన ఈ రజతోత్సవం కళాకారులందరి ఉత్సవంగా అందరూ పదికాలాలపాటు తలచుకునేలా భాసిల్లాలని ఆశించారు. 

1944 లో మద్రాసు సినీమా రంగంలో అడుగుపెట్టిన ఘంటసాల సినీ సంగీత ప్రస్థానం 1969 నాటికి 25 సంవత్సరాలు  పూర్తి చేసుకున్నది. 

"శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంఘం " (Sri Ghantasala Venkateswara Rao Movie Career Silver Jubilee Celebrations Committee) పేరిట ఒక కార్యనిర్వాహక సంఘాన్ని ఏర్పర్చారు.

ఘంటసాల ప్రజల మనిషి గా అందరి ఆదరాభిమానాలు పొందిన వ్యక్తి కావడంతో ఆనాటి రాజకీయ ప్రముఖులు ఈ ఉత్సవ నిర్వహణలో ఉత్సాహం కనపర్చారు.

శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంఘం -

అధ్యక్షులు :  గౌ. శ్రీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిగారు (ఆనాటి ఆంధ్రప్రదేశ్  రెవెన్యూ శాఖామాత్యులు);

ప్రధాన కార్యదర్శి : గౌ.శ్రీ అక్కిరాజు వాసుదేవ రావు గారు (ఆనాటి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖామాత్యులు);

ఉపాధ్యక్షులు : శ్రీ పి. రామచంద్రా రెడ్ఠి, B.A.B.L;

కోశాధికారి : శ్రీ రాజా ఎ. రామచంద్రారెడ్డి (ఆనాటి ఆంధ్రప్రదేశ్ క్రీడామండలి అధ్యక్షులు);

కార్యదర్శి : శ్రీ ఆర్ వి రమణమూర్తి

🌷రిసెప్షన్ కమిటీ మెంబర్స్ గా - సర్వశ్రీ - గౌరవనీయులు -
జె.వి. నరసింగరావు (డెప్యూటీ చీఫ్ మినిస్టర్),
కె. విజయభాస్కర రెడ్డి (మినిస్టర్ ఫర్ ఫైనాన్స్),
ఆర్. రామలింగరాజు (మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్),
పి.వి. నరసింహారావు (మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్),
వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు (మినిస్టర్ ఫర్ పవర్),
ఎ. భగవంతరావు (మినిస్టర్ ఫర్ హ్యాండ్ లూమ్స్), 
ఎమ.ఎన్. లక్ష్మీనరసయ్య (మినిస్టర్ ఫర్ ట్రాన్స్ పోర్ట్),
రోడా మిస్త్రి (మినిస్టర్ ఫర్ టూరిజం),
వి.పురుషోత్తమ రెడ్డి (మినిస్టర్ ఫర్ మైనర్ ఇరిగేషన్);

🌺రిసెప్షన్ కమిటీలో చలనచిత్ర సీమ ప్రముఖులు:

సర్వశ్రీ - బి.ఎన్.రెడ్డి, ఎ వి మెయ్యప్పన్, డి.మధుసూదనరావు,
ఎ.ఎల్.శ్రీనివాసన్, సుందర్లాల్ నహతా, జి. కామరాజు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కె.జగ్గయ్య, వి.నాగయ్య, శివాజీ గణేశన్, ఎమ్.జి.రామచంద్రన్, పి.పుల్లయ్య, టి.ఎల్.కాంతారావు, రేలంగి, సావిత్రి గణేష్, షావుకారు జానకి, అంజలీదేవి, కె.శ్రీనివాసరావు, ఎన్,త్రివిక్రమరావు, డి.రామానాయుడు; డా.సి.నారాయణరెడ్డి, రావూరు వెంకట సత్యనారాయణ, వి.వి.మాణిక్యాలరావు, ఎ.కెచెలువరాజు, జి.హనుమంతరావు, పోతుకూచి సాంబశివరావు, జి.ఎస్.వరదాచారి, పి.ఎస్.ఆర్.ఆంజనేయశాస్త్రి, బాసాని సుదర్శనరెడ్డి, కె. సుబ్రహ్మణ్యం, ఎ.ఆర్ కృష్ణ, బి.కృష్ణంరాజు. (సేకరణ : ఘంటసాల రజతోత్సవ ప్రత్యేక సంచిక)

ఈ రజతోత్సవ ప్రత్యేక కమిటీలు ఏర్పడకముందు, ఏర్పడిన తర్వాత కూడా ఆర్.వి.రమణమూర్తి తరచూ మద్రాస్ వచ్చి ఘంటసాలవారి తో సంప్రదించేవారు. కమిటీ అధ్యక్షుడు గౌ. మంత్రివర్యులు శ్రీయుతులు పి. తిమ్మారెడ్డిగారు, అక్కిరాజు వాసుదేవరావు గారు కూడా  ఓ రెండుసార్లు మద్రాస్ వచ్చి  ఘంటసాల మాస్టారింట్లో చాలా సేపు ఈ ఉత్సవ విషయమై చర్చించేవారు. వీరితోపాటు మరికొందరు రాజకీయనాయకులు కూడా వచ్చేవారు. వీరందరి చర్చలతో మాకు పొద్దే తెలిసేదికాదు. స్థానికంగా వున్న దక్షిణాది సినీ ప్రముఖులందరిని కలిసి ఈ బ్రహ్మండమైన రజతోత్సవంలో పాల్గొనేలా సమ్మతింపజేశారు. వాసుదేవరావుగారు వచ్చినప్పుడల్లా ఆయనతో నటుడు కాంతారావు కూడా వచ్చేవారు. వారిద్దరూ కోదాడకు చెందినవారు కావడాన ఆ స్నేహం కావచ్చు. వారిద్దరూ బంధువులని కూడా విన్నాను. ఎంతవరకూ నిజమో నాకు తెలియదు. రమణమూర్తిగారికి ఘంటసాల మాస్టారంటే చాలా గౌరవం, అభిమానం వుండేవి. 

ఘంటసాల చలనచిత్ర జీవిత రజతోత్సవాన్ని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యపట్టణం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది చలనచిత్రాభిమానుల సమక్షంలో జరపడానికి పెద్దలంతా కలసి నిర్ణయించారు.

రజతోత్సవ సంఘం కార్యదర్శిగా ఆర్.వి.రమణమూర్తిగారు చేసిన కృషి, పడిన శ్రమ అసమాన్యం. ఈ ఉత్సవం చేయాలని సంకల్పించినది మొదలు అది  'నభూతో నభవిష్యతి' అనే రీతిలో ముగిసేవరకు ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు. కాలికి చక్రాలు కట్టుకున్నట్లుగా హైదరాబాద్ మద్రాసుల మధ్య ఎన్నిసార్లు తిరిగారో లెఖ్ఖలేదు. రమణమూర్తి చాలా ఉత్సహవంతుడు. హైదరాబాద్ లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలో ఆరితేరిన వారు. రాజకీయ రంగంలో, సినీమా రంగంలో గల ప్రముఖులందరితో మంచి పరిచయాలు గల వ్యక్తి. అందరిళ్ళలో  వాళ్ళ వంటింటి వరకూ వెళ్ళి  కబుర్లు చెప్పేంత చొరవగల మనిషి అని ఘంటసాల మాస్టారు చెప్పేవారు. అతనితో రెండుసార్లు తిరిగాక ఆ మాట నిజమే అనిపించింది. ఒకసారి మద్రాస్ వచ్చి ఈ రజతోత్సవం తిరుపతి వేంకటేశ్వరుడి ఆశిస్సులు తోనే జరగాలి. అందువల్ల  వెంటనే తిరుపతి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని, నరసింగడిని, నన్ను కూడా తనతో బయల్దేరదీసాడు. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నేను కూడా ఎలాగైనా ఏదో రకంగా  ఘంటసాలవారి రజతోత్సవం లో పాలుపంచుకోవాలని. ఆరోజు మధ్యాహ్నం సమయాన మేము ముగ్గురం కారులో తిరుపతి బయల్దేరాము. ముందుగా దారిలో వచ్చే తిరుత్తణి కొండమీద వున్న సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాము. మేము వెళ్ళిన సమయానికి ఆలయంలో పెద్ద రద్దీలేదు. దర్శనం బాగా జరిగింది. రమణమూర్తి అక్కడ ఏవో అర్చనలు జరిపించారు. నేను తిరుత్తణి వెళ్ళడం అదే మొదలు, ఆఖరు కూడా. ఆ తర్వాత ఎన్నోసార్లు వెళ్ళాలని ప్రయత్నించినా కుదరనేలేదు. ఈ సదవకాశం రమణమూర్తి పుణ్యమే అని చెప్పాలి. అక్కడ నుండి బయల్దేరి సాయంత్రం చీకటి పడే సమయానికి తిరుమలలో వేంకటేశ్వర సన్నిధికి చేరుకున్నాము. అక్కడ ఎంతసేపు క్యూలో నిలబడాలో, ఎంత సమయం పడుతుందోనని నేను భయపడ్డాను. కానీ రమణమూర్తి డైరక్ట్ గా ప్రధాన ద్వారం లోపలనుండే మమ్మల్ని గర్భగుడిలోకి తీసుకువెళ్ళిపోయారు. ఎవరూ అడ్డగించలేదు. లోపల దేవుడికి అతి చేరువలో నిలబడి దర్శనం చేసుకున్నాము. అంత దగ్గరలో, అంత ఎక్కువసేపు వెంకన్న సన్నిధిలో నేను ఏనాడు గడపలేదు. (కానీ అలాటి సదవకాశం మరల కొన్ని దశాబ్దాల తర్వాత వరసగా ఐదురోజులపాటు లభించింది. ఆ వివరాలు వేరే అధ్యాయంలో).

రమణమూర్తి కోరిక నెరవేరింది. వచ్చిన పని సక్రమంగా ముగించుకొని అర్ధరాత్రి కి మద్రాసు చేరుకున్నాము. ఆ మర్నాడు ఉదయం ఫ్లైట్ లో రమణమూర్తి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.

ఈ తిరుపతి ప్రయాణంలో కలిగిన పరిచయమే. ఈ ఉత్సవం జరిగిన మధ్యకాలంలో చాలా తరచుగానే కలిసి తిరిగేవాళ్ళం. మాట్లాడుకునేవాళ్ళం. హైదరాబాద్ లో జరిగిన రజతోత్సవం తర్వాత నేను రమణమూర్తి గారిని మళ్ళీ  ఘంటసాలవారి విదేశ యాత్ర సమయంలో చూసాను. ఆ తర్వాత మరల ఎక్కడా కలవనూ లేదు, చూసిన గుర్తూ లేదు. పత్రికలలో చూడడం తప్ప. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చురల్ కౌన్సిల్ కు చైర్మన్ గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చాలా పేరుపొందారు. సినీమా నిర్మాతగా కూడా 'నీరాజనం', 'అభినందన' వంటి చిత్రాలు నిర్మించి ఎన్నో నందీ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు  కూడా పొందారు. ఈ చిత్రాలలో నీరాజనం చిత్రానికి O.P.నయ్యార్, అభినందన చిత్రానికి ఇళయరాజా వంటి  జాతీయస్థాయి సుప్రసిధ్ధ సంగీత దర్శకులు పనిచేయడం ఒక విశేషం.

ఘంటసాల సినీ జీవిత రజతోత్సవానికి ఇంకా చాలా సమయం వుంది. ఇందుకు సంబంధించిన మరెన్నో విశేషాలు వచ్చేవారాలలో ....అంతవరకూ.....
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, October 10, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై రెండవ భాగం

10.10.2021 - ఆదివారం భాగం - 52*:
అధ్యాయం 2  భాగం 51 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నకాలంలో తెలుగు సినీమాలలో కథకు, కథకుడికి కూడా ప్రాధాన్యత వుండేది. ఒక సినీమా విజయవంతం కావాలంటే కథ, మాటలు, పాటలు, నేపథ్యసంగీతం, దర్శకత్వ, సాంకేతిక వర్గ నైపుణ్యం, అన్నీ సమపాళ్ళలో వుండాలి. అప్పుడే ఆ సినీమా ప్రజారంజకమవుతుంది. ఆ చిత్రంలోని పాటలు ప్రజల హృదయాలలో నిలిచిపోతాయి.

మల్లీశ్వరి, పాతాళభైరవి కాలంలో, సినీమా పరిభాషలో చెప్పాలంటే, కథ మీద కూర్చునే (చర్చలు జరపడం) సమయమే ఎక్కువగా వుండేది. ఆ కథకు పకడ్బందీగా కథా సంవిధానం తయారు చేసుకొని, మాటలు వ్రాయించి, ఆ తర్వాతే సందర్భోచితంగా పాటల దృశ్యాలను నిర్ణయించి సంగీతదర్శకుడిచేత వరసలు కట్టించి, ఆ పాటలు పాడగల సమర్థులైన గాయకులచేత పాడించి రికార్డింగ్ చేయించేవారు. కథలో సన్నివేశబలం గల చోట్ల వచ్చిన పాటలు తప్పక బహుళ జనాదరణ పొందేవి. 

1960లు దాటేవరకు మన తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు  చాలావరకు తమ కథల కోసం పరాయి భాషల మీదే ఆధారపడేవారు. బెంగాలి శరత్ బాబు, ఆశాపూర్ణాదేవి, షేక్స్పియర్, అలెగ్జాండర్ డ్యూమాస్, అరేబియన్ నైట్స్  కథల ఆధారంగానే మన తెలుగు సినీమాలు వుండేవి. గుణసుందరి కథ, మనదేశం, పాతాళభైరవి, మిస్సమ్మ, బాటసారి, మాంగల్యబలం, ఆరాధన, వెలుగునీడలు వంటి ఎన్నో కథలు పరాయి భాషలనుండి దిగుమతి చేసుకొని మన తెలుగు వాతావరణానికి తగినట్లుగా ఆ కథలను మలచుకొని తెరకెక్కించారు. తెరానువాదం సక్రమంగా జరిగిన సినీమాలు కొన్ని విజయంపొందాయి. మరికొన్ని ప్రేక్షకుల ఆమోదం పొందలేదు. ఎందుకంటే మరేవో లోపాలు. ప్రేక్షకులు ఏ సినిమాలు నచ్చుతారు ఏ సినిమాలు నచ్చరు అన్నదానికి సినిమా విశ్లేషకులు, విమర్శకుల 'సహేతుక' వివరణలన్నీ కాయితాలకి పరిమితమైన థియొరీలే. పాండిబజార్ లో సినిమా సారాన్నంతా గ్రహించి రోడ్డుమీదే అందరికీ పంచే తత్త్వజ్ఞానులూ ఉండేవారు. 

తెలుగు సినీమా స్వర్ణయుగంలో తెలుగు కథకు పట్టాభిషేకం చేసి శిఖరాగ్రాన కూర్చోబెట్టిన మహాకథకులెందరో వుండేవారు. సినీమారంగంతో సంబంధం లేని కథా రచయిత లెందరో తమ అద్భుత రచనా చాతుర్యంతో తెలుగు రచనా ప్రాభవాన్ని చాటిచెప్పారు. ఆరోజుల్లో ఇప్పటికన్నా ప్రజలలో పఠనాసక్తి ఎక్కువగానే వుండేది. నిత్యజీవితంలోని సమస్యలనే ప్రధానాంశాలుగా తీసుకొని వాటిని విభిన్నకోణాలలో విశ్లేషించి రచయితలు తమ రచనలు కొనసాగించారు. ఉత్తమ సాహిత్యానికి విలువనిచ్చే తెలుగు దిన, వార, పక్ష, మాస పత్రికలెన్నో మంచి మంచి కథలను, నవలలను తమ తమ పత్రికలలో ప్రచురించేవారు.

నాకు కొంత ఊహ తెలిసేనాటికి నేను చూసిన మొదటి వార పత్రిక 'ఆంధ్రపత్రిక', అలాగే 'ఆంధ్రపత్రిక' దిన పత్రిక. 'దేశోధ్ధారక' నాగేశ్వరరావు పంతులుగారు స్థాపించినది. వారి స్థాపనంలో వచ్చిన మరో అద్భుత మాస పత్రిక 'భారతి'. భారతి విద్యావేత్తల, సాహితీ మేధావుల పత్రిక. కవిత్వంలో ఆరితేరిన మహామహుల రచనలు, విమ‌ర్శలు, విశ్లేషణలు, చర్చలు, వాదోపవాదాలుతో నిండివుండేది. విశ్వనాథ సత్యనారాయణ, తిరుపతి వెంకటకవులు, శ్రీపాదకృష్ణమూర్తి, గురజాడ, శ్రీశ్రీ, చలం వంటి గొప్ప కవుల రచనలు ఆ భారతిలో వచ్చేవి. 'భారతి'లో ఎవరి కథైనా, వ్యాసమైనా ప్రచురించబడితే ఆ రచయిత ఒక విశిష్ట రచయితగా సాహితీలోకంలో గుర్తింపబడి గౌరవించబడేవాడు. ఆ స్థాయిని అందుకోవడం కోసం ఆనాటి రచయితలంతా తపించేవారు. అలాటి 'భారతి' లో మా నాన్నగారి స్నేహితులు - పంతుల శ్రీరామశాస్త్రి, భట్టిప్రోలు కృష్ణమూర్తి, మంథా రమణరావుగార్ల కథలు, చందోభధ్ధ కవితలు ప్రచురించబడేవి. భారతిలో వచ్చిన మంథా రమణరావుగారి 'మంటలు' నేనూ చదివాను. ఆయన వ్రాసిన మరో నవల 'చలిచీమలు' ను సినీమాగా కూడా  తీసారు. మంథా రమణరావు తాను వ్రాసిన ఒక పుస్తకాన్ని మా నాన్నగారికి అంకితం కూడా చేశారు. మంథా రమణరావు వృత్తిరీత్యా రూర్కెలా స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతోద్యోగి. ప్రవృత్తి రచనా వ్యాసాంగం. భట్టిప్రోలు  కృష్ణమూర్తిగారు ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఉన్నతాధికారి. జయపూర్, జునాఘడ్, కెయింఝోర్ లోని ప్రవాసాంధ్ర కవి, రచయిత. పంతుల శ్రీరామశాస్త్రి రాయఘడా హైస్కూలులో మాస్టర్. చందోబధ్ధంగా కవిత్వం రాసేవారు. ఈ ఇద్దరూ, మా నాన్నగారు కలసి వ్రాసిన గొలుసుకట్టు కథలు 1950లలో ఆంధ్రపత్రికలో ప్రచురించబడ్డాయి. అయితే కథలు చదివేంత వయసు ఆనాడు నాకు లేదు. 

మేము విజయనగరంలో వుండేనాటికి ఆనాటి ప్రముఖ పత్రికలుగా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక, విశాలాంధ్ర, ప్రజామాత, జాగృతి, గృహలక్ష్మి  కనిపించేవి. ఇందులో కొన్ని దినపత్రికలు, కొన్ని వార, పక్ష మాస పత్రికలు. వీటన్నిటిలో  చాలా మంచి కథలు, నవలలు, వ్యాసాలు వచ్చేవి. ఈ పత్రికలన్నింటిలో కొన్ని పేజీలు సినీమా వార్తలకోసం ఫోటోల కోసం కేటాయించేవారు.అప్పుడు ఇప్పుడూ కూడా వారపత్రికల ముఖచిత్రాలుగా సినీమా తారల బొమ్మలే వేయడం ఆచారంగా వస్తోంది.

మేము విజయనగరం లో వుండేప్పుడు ఆంధ్రపత్రికలో వచ్చిన ఒక సీరియల్ పేరు మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఆ సీరియల్ పేరు 'మంచి-చెడు' రచయిత శారద. ఆ పేరు వల్లే నాకు ఆ సీరియల్ పేరు గుర్తుండిపోయింది. కారణం 'శారద'. శారద మా దొడ్డమ్మగారి ఏకైక కుమార్తె. ఆమె నన్ను ఎప్పుడూ తమ్ముడూ అని  ప్రేమతో లాలించి పిల్చినా నేను మాత్రం శారద అనే పిలిచేవాడిని 'అక్క' అని ఎప్పుడూ పిలవలేదు. నాకు ఎవరిని వరసలు పెట్టి పిలిచే అలవాటు అలవడలేదు.

శారద పేరు ఇంతగా గుర్తుండిపోవడానికి మరో కారణం.  1930లలో మా తాతగారు సాలూరులో నెలకొల్పిన సంగీత పాఠశాల పేరు 'శారదా గాన పాఠశాల'.

ఇంతకూ ఈ 'మంచి-చెడు'  శారద ఎవరు? విజయనగరంలో ఉన్నంతకాలం పత్రికలలో కనపడే శారద మహిళా రచయితనే అనుకునేవాడిని. శారద అనేది మగ రచయిత కలం పేరని, ఏదో ఊళ్ళో ఒక హోటల్ లో సర్వర్ అని మెడ్రాస్ వచ్చాకే తెలిసింది. ఈమధ్య కాలం వరకూ  శారద పూర్తి చరిత్ర నాకు ఏమాత్రం తెలియదు. తెలుగు కథకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా  వెలువడిన ఒక వీడియోలో 'పిరికి ప్రియుడు' అనే కథను పరిచయం చేసారు శ్రీగొల్లపూడి మారుతీరావుగారు. ఆ కథను వ్రాసింది శారద. శారద గురించి శ్రీ మారుతీరావుగారు చెప్పింది విన్నాక మనసు వికలమయింది.  

శారద తెలుగువాడు కాదు. ఒక తమిళుడు. పేరు నటరాజన్. అతి పేద కుటుంబంలో పుట్టాడు. పుట్టినగెడ్డమీద బ్రతికే ఆస్కారం లేక పొట్ట చేతబట్టుకొని తండ్రితో ఆంధ్రదేశంలోని తెనాలి చేరుకున్నాడు. అప్పటికి అతని వయసు 13 సంవత్సరాలు మాత్రమే. పరాయి రాష్ట్రంలో భాష తెలియని ప్రాంతంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ నానా అవస్థలు పడ్డారు. నటరాజన్ కు తమిళ సాహిత్యం మీది మక్కువతో ఆ వయసుకే కథలు వ్రాసేవాడట. తెనాలి వచ్చాక తండ్రి మరణించాడు. శారద అనాథయ్యాడు. తెలుగు భాష మీద మక్కువ పెంచుకొని,  నోటు బుక్కులు కొనే స్థోమత లేక  రోడ్లమీద దొరికే సిగరెట్ ప్యాకెట్లు ఏరుకొని వాటి వెనక తెలుగు మాటలకు అర్ధం తెలుసుకొని వాటిని వ్రాసుకొని తెలుగు నేర్చుకొని తెలుగులో వ్రాసిన అద్భుతమైన కధలు ఆనాటి ప్రముఖ తెలుగు రచయితలను, పాఠకులను ఉలిక్కిపడేలా చేశాయి.

విజయవాడలో జరిగిన ఒక సాహితీ సదస్సులో విశ్వనాథ, జాషువా వంటి మహా రచయితలను చూసి వారి స్ఫూర్తితో తెలుగు భాషమీద పట్టును సాధించినవాడు శారద. తమ హోటల్ కు వచ్చిన ప్రతీ ఒక్కరిని వారికి పుస్తకపఠనాభిలాష వుందా అని అడిగి తెలుసుకొని వారి వద్దనుండి తెలుగు పుస్తకాలు అడిగి పుచ్చుకొని విస్తృతంగా చదివేవాడట. శారద హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్న రోజులనుండి అంటిపెట్టుకున్న ఆయన స్నేహితుడు ఆలూరి భుజంగరావు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాడు శారద, భుజంగరావు, అతని తల్లి తినేందుకు తిండి దొరకక పస్తుండి మంచినీళ్ళతో కడుపునింపుకున్నారట. శారదకు మూర్ఛ జబ్బు. నయం చేసుకునే ఆర్థిక స్తోమత లేదు.  అప్పుడప్పుడు నడిరోడ్ మీదే మూర్ఛ వచ్చి పడిపోతూండేవాడట. చివరకు ఆ మూర్ఛ జబ్బు వల్లనే శారద తన 30వ ఏట 1955లో  అతి పిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపోయాడట. శారద తన జీవితకాలంలో చిల్లర నాణేలు, రూపాయి, ఐదు, పది రూపాయల నోటు తప్ప నూరు రూపాయల నోటు ఎలా వుంటుందో  తెలియదట. 'మంచి- చెడు', 'అపస్వరాలు', ఏది సత్యం' వంటి అధ్భుతమైన తెలుగు నవలలు వ్రాసిన తమిళుడు  శారద అనబడే ఎస్.నటరాజన్ దుర్భర లేమిలో కనుమూసాడు. ఎంతటి దౌర్భాగ్యస్థితి.  సామాన్య ప్రజల జీవితం నుండి, మనచుట్టూ వున్న సమాజం నుండే తన కథలను, కథాపాత్రలను ఎంచుకొని సహజమైన కథలను వ్రాసిన ప్రతిభాశాలి శారద. ఆయన వ్రాసిన 'ఏది నిజం' నవల పబ్లిష్ అయిన రెండు నెలలలోనే అన్ని పుస్తకాలు అమ్ముడుపోయి ద్వితీయ ముద్రణ వేయవలసి వచ్చిందట.

ఈ రచయిత విషాద గాధలో  ఒక సినీమాకు సరిపడేంత జీవిత సత్యాలు నిండివున్నాయి.

మా నాన్నగారికి వున్న సాహిత్యాభిలాషతో ఆయన చాలా మంచి పుస్తకాలనే సేకరించారు. టాగోర్, శరత్, మున్షీ ప్రేమ్ చంద్, విశ్వనాధ, గురజాడ, చలం, కొడవటిగంటి, రావూరి భరద్వాజ వంటి ప్రముఖుల పుస్తకాలతోపాటూ మాక్సిమ్ గోర్కి, టాల్ స్టాయ్, సోమర్సెట్ మామ్, మార్క్ ట్వైన్ వంటి విదేశీ రచయితల అనువాద సాహిత్యం, సంగీత నృత్యాలకు సంబంధించిన ప్రాచీన గ్రంథాలు అంతా మా నాన్నగారు కొనేవారు. ఈ ఉత్తమ సాహిత్యంలోని చాలాభాగం పాండీబజార్లో రాజకుమారి థియేటర్ ముందున్న ప్లాట్ ఫారమ్ బుక్ షాపులో సెకెండ్ హ్యాండ్ లో కొన్నవే. ఎంతో విలువైన పుస్తకాలు. పుస్తకాలకు మించిన మంచి స్నేహితులుండరని మా నాన్నగారి అభిప్రాయం. రికార్డింగ్ ల విరామ సమయంలో, ఘంటసాలవారితో బయట వూళ్ళు కచేరీలకు వెళ్ళేప్పుడు ప్రయాణాలలో ఈ పుస్తక పఠనంతోనే కాలక్షేపం చేసేవారు.

మా ఇంట్లోని ఈ సాహిత్యం పూర్తిగా కూలంకషంగా చదివేంత విజ్ఞానం నాకు లేకపోయింది. వార పత్రికలలో వచ్చే కధలతోటే నాకు గడచిపోయేది. అప్పుడే నాకు చాలామంది రచయితలు, రచయిత్రుల పేర్లు తెలిసాయి. ఆనాటి పత్రికలలో ఎక్కువగా  చక్రపాణి, గోపీచంద్ (అసమర్ధుని జీవిత యాత్ర),  కొడవటిగంటి కుటుంబరావు (చదువు), బలివాడ కాంతారావు, మధురాంతకం రాజారామ్, కొమ్మూరి వేణుగోపాలరావు (పెంకుటిల్లు), మద్దిపట్ల సూరి, బుచ్చిబాబు (చివరకు మిగిలేది), ధనికొండ హనుమంతరావు, ఎన్.ఆర్.నంది, కొండముది హనుమంతరావు, మహీధర రామ్మోహనరావు, పిలకా గణపతిశాస్త్రి (విశాలనేత్రాలు), తిరుమల రామచంద్ర (హంపీ నుండి హరప్పా దాకా), రాచకొండ విశ్వనాధ శాస్త్రి (ఆరు సారా కథలు, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త), ముళ్ళపూడి వెంకట రమణ (ఋణానందలహరి), పోలాప్రగడ సత్యనారాయణ (దీపశిఖ ) వంటి చేయి తిరిగిన రచయితలెందరో  తెలుగు కథాధా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. 

పురుష రచయితలకు సమానంగా స్త్రీ రచయితలు కూడా ఎంతోమంది వినూత్న పంథాలో రచనలు సాగించారు. కొమ్మూరి పద్మావతి , ఇల్లిందల సరస్వతీ దేవి, భానుమతి, లత (ఊహాగానం), మాలతీ చందూర్ (చంపకం-చెదపురుగులు, ప్రమదావనం), కె. రామలక్ష్మి, ద్వివేదుల విశాలాక్షి (వైకుంఠపాళి, గ్రహణం విడిచింది, వారధి),  వేల్పూరి సుభద్రాదేవి (మంచుబొమ్మలు), డా.త్రివేణి (వెండిమబ్బు), ముప్పాళ రంగనాయకమ్మ (బలిపీఠం, కృష్ణవేణి ,పేకమేడలు), కోడూరి కౌసల్యాదేవి (చక్రభ్రమణం, ప్రేమ నగర్), యద్దనపూడి సులోచనారాణి (సెక్రెటరి, జీవన తరంగాలు, మీనా), డా.శ్రీ దేవి (కాలాతీత వ్యక్తులు), డి. కామేశ్వరి, పవని నిర్మలా ప్రభావతి, సి. ఆనందారామం మొదలైన రచయిత్రులు తెలుగువారి సాహితీ వికాసానికి ఇతోధికంగా తోడ్పడ్డారు. 

(బ్రాకెట్లలో ఉన్నవి నేను చదివిన వారి వారి పుస్తకాలు).

ఒక దశలో  తెలుగు సినిమా నిర్మాతాదర్శకులు ఆనాటి పత్రికలలో వచ్చిన నవలలు, సీరియల్స్ ఆధారంగా ఎన్నో విజయవంతమైన సినీమాలను తీశారు. తమ కథల ద్వారా ముప్పాళ రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి, ద్వివేదుల విశాలాక్షి, పోలాప్రగడ ఇత్యాదులు సినీప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా చూరగొన్నారు. 1980ల తర్వాత వచ్చిన యండమూరి వీరేంద్రనాధ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, కొమ్మనాపల్లి గణపతిరావు వంటి ప్రముఖ పత్రికా రచయితలు కూడా సినీమా కథకులుగా లబ్దప్రతిష్టులు.

నాతరం వారందరికీ కూడా బాగా తెలిసిన  పాల మనసులు (డా.త్రివేణి వెండిమబ్బు), డా.చక్రవర్తి, ప్రేమనగర్,  సెక్రెటరి, చదువుకున్న అమ్మాయిలు, మీనా, జీవన తరంగాలు, బలిపీఠం, భార్యాభర్తలు (డా.లక్ష్మి అనే తమిళ రచయిత్రి నవల), తల్లిదండ్రులు, రెండు కుటుంబాల కథ, చలి చీమలు వంటి సినీమాలన్నీ సినీమా రంగానికి సంబంధంలేని పత్రికా రచయితల కథల ఆధారంగా తీసినవే.

సినీమా నిస్సందేహంగా వినోదం ముడిసరుకుగా ఉన్న వ్యాపారం. ఏ నిర్మాత సినీమా తీసినా ముఖ్యోద్దేశం  సినీమా వ్యాపారం ద్వారా ధనార్జనే. అందుకే ఈ నాటి సినీమాలలో వాసి కంటె రాశికే ప్రాధాన్యత. నిర్మాతలంతా  వివిధ ప్రసార ప్రచార సాధనాలతో తమకు గల వ్యాపార దక్షత అంతా ఉపయోగించి వందల కోట్ల బడ్జెట్ తో   ప్రేక్షక వినోదమే ప్రధాన లక్ష్యంగా, సంచలనమే ముఖ్యాకర్షణగా సినీమాలు నిర్మిస్తున్నారు. అయితే  విజయవంతమయ్యేవి పది సినీమాలలో  ఏ రెండో మూడో. మిగిలినవన్నీ మఖలో పుట్టి పుబ్బలో గిట్టే సినీమాలే. వందలాది కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే. ఆ సినీమాలలోని కథ, మాటలు, పాటలు, నటీనటులు, ఏ అంశమూ ప్రేక్షకులకు జ్ఞాపకమే వుండవు.

ఈ రకమైన ఫక్తు వ్యాపార  దృక్పథం గడచిన తరం నిర్మాతా దర్శకులలో తక్కువ. అధిక లాభాలు రాకపోయినా తాము ఆ సినీమా మీద పెట్టిన సొమ్ము తిరిగి వస్తే చాలని ఆనందంగా సినీమాలు తీసేవారు. తమ సినీమాల ద్వారా సమాజానికి ఏదో ఒక మంచిని చేయాలని,  ఆదర్శ ప్రాయమైన సందేశాన్ని వినిపించాలని తలచేవారు. అందుకే కథ విషయంలో, సభ్యత గల  భాషను వాడే విషయంలో,  వీనులకు విందు చేసే శ్రావ్యమైన సంగీతం విషయంలో, సందర్భోచిత నటన విషయంలో ఎంతో  జాగ్రత్తలు వహించేవారు. 

ఆ రోజుల్లో ఒక సినీమా వరసగా  50 రోజులు ఆడితే వారి పెట్టుబడి వారికి వచ్చి రెండవ సినీమా తీయడానికి కావలసిన డబ్బు చేతికందే పరిస్థితి. ఆనాడు గోల్డెన్ జూబ్లీలు చేసుకున్న చిత్రాలు వచ్చాయి. కేవలం వారం, రెండు వారాలలోనే ఫిలిం డబ్బాలు వెనక్కి తిరిగి వచ్చినవీ ఉన్నాయి. నాటికీ నేటికీ సినీమా నిర్మాణ దృక్పథంలో ఎంతో తేడా వచ్చింది. ప్రేక్షకుల అభిరుచిలోనూ మార్పువచ్చింది. 

ఈనాటి సినీమాలలో ఉత్తమ సాహిత్యాన్ని, సుశ్రావ్యమైన మనసులను పరవశింపజేసే సంగీతాన్ని ఆశించడమనేది నేతి బీరకాయలో నేయికోసం వెతకడంలాటిదే అవుతుంది. 

💐

మాస్టారుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని వారందరిచేత ఆప్యాయంగా  గౌరవింపబడిన సుప్రసిధ్ధ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారు చలనచిత్రసీమకు వచ్చి 25 సంవత్సరాలు అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఘంటసాల సినీ జీవిత రజతోత్సవాన్ని(ఆనాటి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానియైన హైదరాబాద్ లో అత్యంతభారీగా, వైభవోపేతంగా జరపడానికి నిశ్చయించబడింది. అందుకుగాను వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో ఒక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 

ఆ మహోత్సవ విశేషాలు... వచ్చే వారం...
...సశేషం




Sunday, October 3, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభైయొకటవ భాగం

03.10.2021 -  ఆదివారం భాగం - 51:
అధ్యాయం 2 భాగం 50 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఇప్పటి చెన్నైలో మౌంట్ రోడ్ స్పెన్సర్స్ ప్లాజాకు ఎదురుగా సిటీ బ్యాంక్ వుంది. ఆ బ్యాంక్ మొదటి పేరు ఫస్ట్ నేషనల్ సిటి బ్యాంకు, ఒక విదేశీ సంస్థ. మద్రాసులో లో కొత్తగా తెరిచారు. ఆ బ్యాంక్ లో స్టెనో టైపిస్ట్ ల ఉద్యోగానికి పత్రికలలో ప్రకటన చేశారు. అది చూసి నేను  నా అప్లికేషన్ ను పంపాను. 

డా. డి.ఎన్.రావు గారి అబ్బాయి  శ్రీనాధ్ అదే ఫస్ట్ నేషనల్ సిటి బ్యాంక్ బొంబాయి బ్రాంచ్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కొత్తగా జాయిన్ అయ్యారు. ఒంటరిగా ఉండేవాడు. బొంబాయి మహానగరంలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ. ఇండియాలో ఫ్లాట్స్,అపార్ట్మెంట్స్ సంస్కృతి ముందుగా అభివృద్ధి చెందినది బొంబయిలోనే.  1970ల తర్వాతే మద్రాస్ లో మల్టీస్టోరీడ్  రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సిస్టమ్ డెవలప్మెంట్ ప్రారంభమయింది. ఎగ్మూర్ పోష్ లొకాలిటీస్ లో ఈ ఫ్లాట్స్ ఒకటో రెండో వుండేవి. వాటిలో ఎక్కువగా మార్వాడీలు, గుజరాతీలు వుండేవారు. దాక్షిణాత్యులంతా విశాలమైన  కాంపౌండ్ తో ఇండివిడ్యువల్ భవంతులు, ఇళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి మద్రాస్ లో వాళ్ళుండే 'పూర్ణిమ' లాగే బొంబాయిలో శ్రీనాధ్ వుండేది ప్రత్యేకమైన పెద్ద ఇల్లేనా అని అడిగితే అతను చెప్పిన సమాధానం అప్పట్లో షాక్ నే కలిగించింది. ఒక మల్టీస్టోరీడ్ బిల్డింగ్ లో ఒక చిన్న 12'×12' రూమ్ లో మరొకరితో షేర్ చేసుకొని వుంటాడట. ఆ చిన్న రూమ్ కు ఇతని వంతు అద్దె 2500/- రూపాయలని చెప్పిన గుర్తు. అంత అద్దెకు మద్రాస్ లో  నాలుగేసి గదులున్న చాలా పెద్ద ఇళ్ళే అద్దెకు దొరికేవి.  బొంబాయి లైఫ్ స్టైల్ గురించి అతను చెప్పే మాటలను ఆశ్చర్యంగా వినేవాడిని.

అలాటి పెద్ద బ్యాంక్ నుండి నన్ను ఇంటర్వ్యూకు రమ్మని పిలవడం నాకు ఆశ్చర్యమే. మద్రాసులోని ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ అప్పట్లో ప్యారీకార్నర్ వెనక ఆర్మీనియన్ స్ట్రీట్ లో వుండేది. మా పానగల్ పార్క్ బస్ స్టాప్ లో 11 నెంబర్  బస్ పట్టుకొని ఆఖరి స్టాపింగ్  అయిన ప్యారీస్ కార్నర్ లో దిగి ఆర్మీనియన్ స్ట్రీట్ లోని ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ కు నడుచుకుంటూ వెళ్ళాను. అలాటి పెద్ద బ్యాంక్ లకు వెళ్ళడం కొత్త. అక్కడ అందరూ చాలా టిప్ టాప్ గా సూటూ బూట్లతో హైలెవెల్ లో కనిపించారు. ఇంటర్వ్యూ కు వచ్చినవారు కూడా చాలా స్టైలిష్ గా వున్నారు. అందరిలోకి అతి సామాన్యంగా వున్నది నేను మాత్రమే. నేను డి.ఎన్.రావుగారి USEFI లో పనిచేసేప్పుడు నా సర్టిఫికెట్లు అన్ని పెట్టుకోవడానికి అక్కడి సెక్రెటరీ కుప్పుస్వామి ఒక బ్లూకలర్ థిక్ ప్లాస్టిక్ క్లోజ్ట్ ఫోల్డర్ ఒకటి ఇచ్చారు. ముందువేపు స్కైబ్లూ , వెనకవేపు డార్క్ బ్రోన్. నా సర్టిఫికెట్లు అన్నీ ఇంకా అదే ఫోల్డర్ లో నా దగ్గర భద్రంగా వున్నాయి. ఆ ఫోల్డర్ తోనే ఆ రోజు ఇంటర్వ్యూ కు వెళ్ళాను. ప్రతి ఇంటర్వ్యూ లాగే సాగింది.  ఒక  పావుగంటలో ఇంటర్వ్యూ ముగిసింది. ఏ సంగతీ తర్వాత తెలియజేస్తామన్నారు. నేను సరేనని వెనక్కి తిరిగి వచ్చేసాను. 

కొన్నిరోజుల తర్వాత  బొంబాయి నుండి శ్రీనాధ్ వీకెండ్స్ కు మద్రాస్ వచ్చారు. అతని బ్యాంకు లోనే నన్ను ఇంటర్వ్యూకు పిలిచారన్న విషయం శ్రీనాధ్ కు  చెప్పడానికి వెళ్ళాను. అతను నాకంటే వయసులో మరీ పెద్దవాడేమీ కాదు. ఉంటే ఒకటి రెండేళ్ళు పెద్దవాడేమో, తెలియదు. కానీ, చాలా తెలివైనవాడు, చొరవగలవాడు. అతనికి నా ఇంటర్వ్యూ వివరాలన్ని చెప్పాను. అన్నీ విని అతను ఒకే మాటన్నాడు 'ఆ స్టెనోగ్రాఫర్ ఉద్యోగం నీకు రాదు' అని. దానికి శ్రీనాధ్ చెప్పిన కారణం నాకు ఒక గుణపాఠం. ఆ బ్యాంక్ లో నన్ను ఇంటర్వ్యూ చేసిన పెద్దమనిషి అన్ని వివరాలు అడుగుతూ ఆ బ్యాంకు లో నాకు తెలిసినవారెవరైనా ఉన్నారా అని అడిగాడు. నేను మహాగొప్పగా శ్రీనాధ్  పేరుచెప్పి బొంబాయి బ్రాంచ్ లో పనిచేస్తున్నారని చెప్పాను. అదే నా కొంపముంచిందిట. తెలిసినవాళ్ళున్నారని చెప్పడం అలాటి పెద్ద కంపెనీలలో ఒక డిస్క్వాలిఫికేషన్ క్రింద పరిగణిస్తారట. అలాటి అప్లికెంట్స్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తారట. కారణాలేమైనా  ఆ తర్వాత మళ్ళీ నేను ఆర్మీనియన్ స్ట్రీట్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ ఛాయలకు వెళ్ళనేలేదు. 
🌷

మా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లయొజన్ ఆఫీస్ మైలాపూర్ నుండి అడయార్ కు మారాక నేను 12B బస్సులకోసం కాచుకోవడం మానేశాను. బస్ లో వెళితే ICF నుండి వచ్చే 47Aలో కానీ, విల్లివాక్కం నుండి వచ్చే 47 బస్ లో కానీ వెళ్ళాలి. ఆ బస్ స్టాప్ లు పానగల్ పార్క్ బస్ స్టాపింగ్ లకు కొంచెం దూరంలో వున్న రామకృష్ణ మెయిన్ స్కూల్ దాకా వెళ్ళాలి. ఆ బస్సులు సరియైన  సమయానికి వచ్చేవి కావు. వచ్చినా ఆ బస్సులు ఫుల్ గా జనాలు వేలాడుతుండేవారు. ఆ స్టాప్ లో ఆగకుండానే వెళ్ళిపోయేవి. ఆ బస్సుల కోసం కాచుకొని కూర్చుంటే ఆఫీసుకు బాగా లేటయిపోయేది. ఎంత నాకు పనిలేని గవర్నమెంట్ ఆఫీసయినా వారిచ్చే జీతానికి విశ్వాసంగా, సక్రమంగా పనిచేయాలనే నియమం నాకు వుండేది. అందువల్ల ఇంక సిటి బస్సులను నమ్ముకోకుండా ఆఫీసుకు సైకిల్ మీద వెళ్ళడం ప్రారంభించాను. వ్యాయామానికి వ్యాయామం. డబ్బుకు డబ్బు ఆదా. దీనివల్ల మా అమ్మగారికి ఆనందమే. బస్సులు వెళ్ళిపోతాయనే నెపంతో తన కొడుకు తాను వండి కట్టిచ్చే టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళకుండా పారిపోయే అవకాశం ఇప్పుడులేదు. మొత్తానికి ఓ నలభైయైదు నిముషాలలో సైకిల్ మీద అడయార్ గాంధీనగర్ లోని ఆఫీసుకు చేరేవాడిని. మా ఇంటినుండి సౌత్ ఉస్మాన్ రోడ్ చివరనున్న మౌంట్ రోడ్ వరకూ ఒకటే తిన్నటి రోడ్. ఇప్పటిలా ఫ్లైఓవర్ లు, వన్ వే ట్రాఫిక్ ల బెడద వుండేది కాదు. టి.నగర్ రంగనాథన్ స్ట్రీట్ నుండి టి నగర్ బస్ స్టాండ్ దాటేవరకే వాహనాల రద్దీ ఎక్కువగా వుండేది. ఆ తర్వాత  ప్రయాణం ఫ్రీగా సాగేది. ఆ తర్వాత మళ్ళి మౌంట్ రోడ్ లో సైదాపేట బ్రిడ్జ్ దాటేవరకు వాహనాల రాకపోక ఎక్కువే. లిటిల్ మౌంట్ దాటి రాజభవన్ రోడ్ ప్రవేశించాక, అడయార్ ఆఫీస్ కు వెళ్ళేవరకు చక్కనీ రాజమార్గమే. చాలా నిర్మానుష్యంగా, చల్లటి సముద్రపుగాలి, ప్రశాంతమైన వాతావరణంతో చాలా ఆహ్లాదకరంగా వుండేది.  రాజభవన్, గిండీ ఇంజనీరింగ్ కాలేజ్, గాంధీ మండపం దాటి IIT క్యాంపస్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, దాటేవరకూ రోడ్ కు రెండు ప్రక్కలా దట్టమైన చెట్లతో లోపలనున్న గిండీ ఫారెస్ట్ లోని లేళ్ళు, దుప్పులు రోడ్ ను క్రాస్ చేసుకుంటూ ఛెంగు ఛెంగున దుముకుతూ వచ్చేపోయే వాహనాలకు అడ్డుతగులుతూండేవి. సాయంత్రం ఏడు గంటలు దాటితే ఆ రోడ్ మీద నర సంచారమే వుండేదికాదు, అప్పుడప్పుడు తిరిగే బస్సులు,కార్లు తప్ప. అలా ఆ ఆఫీసుకు ఓ రెండేళ్ళపాటు సైకిల్ మీదే వెళ్ళివచ్చేవాడిని. ఆ ఆఫీస్ లో ఫెర్టిలైజర్స్ షిప్మెంట్ టైములో తప్ప మిగిలిన సమయాలలో పెద్దపని వుండేదికాదు. పని తగినట్లుగానే జీతాలు తక్కువే. అక్కడ పనిచేసేప్పుడు ఖాళి సమయమంతా నా షార్ట్ హాండ్ ప్రాక్టీస్, పుస్తకపఠనం, లంచ్ టైమ్ కునుకుపాట్లతో గడిచిపోయేది. సాయంత్రం ఐదు దాటినదగ్గరనుండీ స్టాఫ్ అంతా ఒక్కొక్కరూ మెల్లగా ఇళ్ళకు జారుకునేవారు. లయొజన్ ఆఫీసర్  బావా, IAS గారి నివాసం కూడా అడయార్ లోనే. కుటుంబం వుండేది కాదు. ఒంటరిగా ఒక గెస్ట్ హౌస్ లో వుండేవారు. మనిషి పొడుగ్గా ఏదో అనారోగ్యంతో వున్నట్లు కనపడేవాడు. ఆయన ఆహారం ముప్పొద్దులా బ్రెడ్, గ్రేప్స్, ఆపిల్స్,ఆరెంజ్ లు తోనే గడిపేవాడు. అప్పుడప్పుడు నన్ను తన రూమ్ కి పిల్చి అక్కడ లెటర్స్ డిక్టేట్ చేసేవాడు. ఆయనా ఆ ఆఫీస్ లో ఎక్కువ రోజులు పనిచేయలేదు. ట్రాన్స్ఫరై వెళ్ళిపోయాడు. Men may come,men may go, but the institutions remain the same. మాలాటివాళ్ళు మాత్రం మరో గత్యంతరం లేక అలాటి ఆఫీసులను పట్టుకు వేళ్ళాడుతుంటారు.

ఒక రోజు ఆఫీసులో పని వుండి సాయంత్రం ఇంటికి బయల్దేరడం ఒక గంట లేటయింది. సైదాపేట బ్రిడ్జి దాటి జయరాజ్ థియేటర్ దగ్గరకు వచ్చేసరికి బాగా చీకటిపడి రోడ్ లైట్లు వెలిగించేసారు. నేను సైదాపేట పోలీసు స్టేషన్ ప్రాంతానికి వచ్చేసరికి ఒక ట్రాఫిక్ పోలిస్ అటకాయించాడు. సైకిల్ కు లైట్ లేదని ఫైన్ కట్టమన్నాడు. ఇప్పుడే కదా లైట్లు వేసారు. మరో పావుగంటలో ఇంటికివెళ్ళిపోతానంటాను నేను. సైకిల్ కు వెనకవేపుండే రెడ్ షేడ్ లేదని మరో అభియోగం. అది కొన్ని రోజులముందే ఏ గోడకో కొట్టుకొని ముక్కలైపోయింది. కొత్తది వేయించడానికి బధ్ధకించడంతో ఆ రోజున పోలీస్ కు బలైపోయాను. సాధారణంగా ఆరు లోపల ఇంటికి చేరుకోవడం వలన ఈ సైకిల్ లైట్, వెనక రెడ్ షేడ్ గురించి ఎవరూ పట్టిచ్చుకునేవారు కాదు. బీట్ కాన్స్టేబుల్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ లో పెట్టేసి ఓ రెండురోజుల తర్వాత ఫైన్ కట్టేసి సైకిల్ ను తీసుకుపొమ్మన్నాడు. ఎంత బ్రతిమాలినా కనికరించలేదు. బహుశా చేయి తడిపితే వదిలేసేవాడేమో! అందుకు నేను సిధ్ధంగా లేనే. సైకిల్ అక్కడ వదలేసి అడయార్ నుండి వచ్చే 47A. బస్ పట్టుకొని పానగల్ పార్క్ దగ్గర దిగి మెల్లగా ఇంటికి చేరుకున్నాను.

ఆ మర్నాడు ఆఫీసుకు బస్ లో వెళ్ళవలసి వచ్చింది. పానగల్ పార్క్ దగ్గరకు వచ్చేసరికి 12B స్టాపింగ్ దగ్గర గతంలో కనపడ్డ తెలుగాయన మళ్ళీ కనపడ్డారు. ఆయనతో మా ఆఫీస్ లో పనిచేసే జ్యోతిషం  గోపాలకృష్ణ ఏదో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళను దాటుకొని రామకృష్ణా స్కూల్ స్టాపింగ్ కు నడిచాను. నేను వెళ్ళిన కాసేపటికి గోపాలకృష్ణ కూడా నేనున్న బస్ స్టాప్ దగ్గరకే వచ్చారు. ఆ తెలుగాయన గురించి ఈ తెలుగాయనను అడిగాను. ఆయనపేరు సూర్యప్రకాశరావు గారని, ఆలిండియా రేడియో లో పనిచేస్తున్నారని చెప్పారు. అయితే మరో సంగీతం మనిషన్నమాట అని అనుకున్నాను. అప్పుడప్పుడు బస్ స్టాప్ ల దగ్గర కలుసుకున్నా వయోభేదం చేత ఆయనతో నాకు పరిచయం పెరగలేదు. కానీ దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత మా రెండో చెల్లెలు మామగారిగా శ్రీ కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారితో పరిచయం ఏర్పడింది. వారి మరో అబ్బాయి రాజేశ్వరశర్మగారే  పానగల్ పార్క్ దగ్గరవున్న  నియో కమర్షియల్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ లో  నాకు సహాధ్యాయి. నేను శ్రీ సూర్యప్రకాశరావుగారితో స్వయంగా వారింటివద్ద  మాట్లాడింది 1994 లో నేను హైదరాబాద్ కు ట్రాన్సఫర్ మీద వెళ్ళినప్పుడే. మనుషుల మధ్య స్నేహాలు, అనుబంధాలు చాలా చిత్రంగా అనూహ్యంగా ఏర్పడతాయి.

🌺🌿🌺


తిరుపతి వేంకటేశ్వర స్వామివారికి పరమ భక్తుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారు.  పౌరాణిక సినీమాలలో వచ్చే దైవ సంబంధమైన గీతాలెన్నింటికో ఘంటసాలవారు ప్రాణప్రతిష్టచేశారు. వారి కంఠంలోని మాధుర్యం, భావం, భక్తితత్పరతల వలన  అనేక భక్తిగీతాలు ప్రజా బాహుళ్యంలోనికి చొచ్చుకుపోయాయి. అనేకమందికి దేవుడిపట్ల భక్తివిశ్వాసాలు ఏర్పడ్డాయి. వివిధ దేవతామూర్తులమీద ఘంటసాలవారు పాడినన్ని భక్తి గీతాలు, పద్యాలు, శ్లోకాలు, అంత సార్ధకంగా మరే గాయకుడు పాడివుండరు. 

1960ల తర్వాత తిరుపతి వెంకటేశ్వరుడి మీద ఘంటసాలవారు వెలువరించిన గ్రామఫోన్ రికార్డులు పల్లె పల్లెలలా, పట్టణాలలో, నగరాలలో, మహానగరాలలో, విదేశాలలోని తెలుగువారందరికీ  దైవప్రార్ధనా గీతాలు అయినాయి. HMV గ్రామఫోన్ కంపెనీ వారికి విపరీతమైన ప్రచారాన్ని, ధనాన్ని సంపాదించిపెట్టాయి.

తెలుగునాట గల ప్రతీ సినీమా హాలు వాళ్ళు మూడాటలకు  ముందుగా ఘంటసాలవారు పాడిన 'ఏడు కొండలా సామి', 'నమో వెంకటేశా' పాటలను విధిగా వినిపించిన తర్వాతే తమ టిక్కెట్ కౌంటర్లు తెరిచేవారు. అదొక సంప్రదాయంగా, సదాచారంగా మారింది. ఆ తర్వాతే మిగిలిన పాటలను లౌడ్ స్పీకర్లలో వినిపించేవారు. ఘంటసాలవారి భక్తిగీతాలు తెలుగువారిని అంత ప్రభావితులను చేశాయి. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యంలో ఘంటసాలవారు తెరమీద కనిపిస్తూ పాడిన ఏకాంతసేవా గీతం 'శేషశైలా వాసా' రంగుల రాట్నంలోని 'నడిరేయి ఏ జాములో' పాటలు తెలుగు హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు.

తిరుపతి వెంకన్న మీద ఘంటసాల పాడిన - 'ఏడు కొండల సామీ', 'నమో వెంకటేశా', 'వేంకటేశ్వర సుప్రభాత పద్యాలు', 'వేంకటేశ్వరుని బుర్రకథ', 'తీయని వెంకని నామామృతం', 'వెంకన్న నామమే భక్తితో కొలిచితే,' 'జయ జయ జయ శ్రీ వేంకటేశా', 'శేషాద్రి శిఖరానా', 'తిరువెంకటాధీశ జగదీశా', 'నీ కొండకు నీవే రప్పించుకో ' 'భువనమోహన నిను పొడగన్న కనులతో'', భక్త జయదేవుని అష్టపదులు, తన జీవిత చరమాంకంలో ఆలపించిన తాత్పర్య సహిత భగవద్గీత  ఘంటసాలవారి భక్తి సంగీతానికి అజరామరత్వం కల్పించాయి.  భక్తికి, ముక్తికీ ఘంటసాల గాన శ్రవణమే పరమావధిగా ప్రతీ తెలుగువారూ భావించారు.



ఘంటసాల, జలసూత్రం, దేవులపల్లి, యామిజాల



అటువంటి గానగంధర్వుడిని తిరుపతి వేంకటేశ్వరుడు కరుణించాడు. తన ఏడుకొండలలో ఘంటసాల భక్తిగానం నిరంతరం  ప్రతిధ్వనింపజేస్తూ  తనను చేరవచ్చే భక్తుల అలసటను, అలసత్వాన్ని తొలగించే దివ్యౌషధంగా వరం ప్రసాదించాడు. అంతేకాదు, ఎంతటి పుణ్యమో చేసుకుంటే తప్ప సామాన్యులెవ్వరికీ లభించని పదవిని, తన ఆస్థాన గాయక పదవిని ఘంటసాలవారికి లభించేలా ఆ శ్రీనివాసుడు అనుగ్రహించాడు. తిరుమల- తిరుపతి దేవస్థానం వారు ఘంటసాలవారిని తమ ఆస్థాన గాయకునిగా నియామకం చేసి ఆ భక్తగాయక శిఖామణిని సముచితంగా గౌరవించారు. మూడేళ్ళపాటు అపురూపమైన స్వామివారి సన్నిధిలో గానం చేసే అదృష్టాన్ని ఘంటసాలవారికి కల్పించారు. టి.టి.డి.వారి అత్యున్నత ఆస్థాన గాయక పదవిని పొందిన తొలి లలిత/ సినీమా సంగీత గాయక శ్రేష్టుడు ఘంటసాలవారు. ఇంతకు మించిన ఉన్నత స్థానాన్ని, పదవిని ఏ మానవమాత్రుడు ఇవ్వగలడు? ఇచ్చినా భగవంతుని వరప్రసాదంతో సమానమౌతుందా ? ఘంటసాలవారి సంగీత విద్య, గాన ప్రతిభ సార్ధకత చెందాయి. ధన్యజీవి ఘంటసాల.

తన ఆరాధ్యదైవం తిరుపతి వేంకటేశ్వరుని కరుణా కటాక్షాలతో తన సదాశయాలన్నీ సిధ్ధించాలని నూతనోత్సాహం తో ముందడుగు వేసారు ఘంటసాల. కొత్తగా అజంతా మూవీస్ వారి 'మెరుపువీరుడు', శ్రీ గౌతమీ పిక్చర్స్ వారి 'ఆలీబాబా 40 దొంగలు', రామవిజేతా వారి 'తల్లిదండ్రులు', గిరిధర్ ప్రొడక్షన్స్ వారి 'రెండు కుటుంబాల కధ', రాజ్యం ప్రొడక్షన్స్ వారి 'రంగేళీ రాజా'  తో పాటూ మరో రెండు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేయడానికి ఒప్పుకున్నారు.

ఆ చిత్ర గీతాల విశేషాలు వచ్చేవారం ... అంతవరకూ...

                ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, September 26, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభైయవ భాగం

26.09.2021 - ఆదివారం భాగం - 50*:
అధ్యాయం 2  భాగం 49 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఒకసారి ఘంటసాలవారు తలపెట్టిన  ఏదో ఒక  కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలను పలువురు ప్రముఖులకు స్వయంగా అందజేసే భాధ్యతను నరసింగకు, నాకు అప్పజెప్పారు. మేము  స్వయంగా చెప్పి ఆహ్వనపత్రికను అందజేసేవారిలో వి.ఎ.కె.రంగారావుగారు కూడా వున్నారు. అందజేయవలసిన వారందరి ఎడ్రస్ లు సినీమా డైరక్టరీ నుండి సేకరించి వాటి ప్రకారం వెళ్ళి యివ్వాలని నిశ్చయించాము. ఆ ఎడ్రెస్సులలో చాలాభాగం టి.నగర్, కోడంబాకం, తేనాంపేట‌, ఆళ్వార్ పేట, మైలాపూర్, ట్రిప్లికేన్ ప్రాంతాలలోనివారే. అందువలన సైకిళ్ళమీద వెళ్ళి యిద్దామని నరసింగ సలహా యిచ్చాడు. అప్పటికి నాకు సైకిల్ తొక్కడం వచ్చును కానీ మౌంట్ రోడ్ వంటి భారీ ట్రాఫిక్ లో బస్సులు, లారీలమధ్య నుండి సైకిల్ తొక్కడానికి భయంగా వుండేది. దూరంగా సిటీ బస్సులు రావడం కనిపిస్తే ఇక్కడ నేను సైకిల్ దిగి మరల ఆ బస్ వెళ్ళిపోయాక సైకిల్ ఎక్కేవాడిని. మరొక పెద్ద సమస్య నేను ఆ సైకిలంత ఎత్తు కూడా లేకపోవడం వలన సైకిల్ ఎక్కడం, దిగడం చాలా ఇబ్బందికరంగా తోచేది. అసలు నేను సైకిల్ నేర్చుకున్నది మెడ్రాస్ లో కాదు. బొబ్బిలి హైస్కూలులో చదువుతున్న రోజుల్లో అందరి పిల్లల్లాగే నేను సైకిల్ నేర్చుకోవాలని ఉబలాటపడ్డాను. మా ఊళ్ళో గంటకు ఇంతని వసూలు చేసి అద్దెకు సైకిళ్ళు ఇచ్చే షాపులుండేవి. సొంత సైకిళ్ళు లేనివారు తమ అర్జంట్ పనులకు, కొత్తగా సైకిళ్ళు తొక్కడం నేర్చుకునే పిల్లలు ఈ అద్దె సైకిళ్ళనే ఆశ్రయించేవారు. మా సామవేదుల వారి సందులో, అగ్రహారం వీధిలో ఆ రోజుల్లో ఎక్కువ వాహన సంచారం వుండేదికాదు, సాయంత్రం పూట పూల్ బాగ్ కు వెళ్ళి వచ్చే బొబ్బిలి రాణీ గారి కారు తప్ప. అందుచేత మా సైకిల్ సాధన నిరాటంకంగా సాగేది. బాగా పొడుగున్న పిల్లలైతే సీటు మీద కూర్చొని వెనకాల మరొకరి సాయంతో నేర్చుకునేవారు. కొందరు హాఫ్ పెడల్ పధ్ధతిలో నేర్చుకునేవారు. నాకు ఈ రెండు పధ్ధతులు అనుకూలపడేవికావు. అందువలన ఎవరి సాయంలేకుండా వెనక కారియర్ మీద కూర్చొని అతికష్టం మీద బ్యాలన్సింగ్ అలవాటు చేసుకొని సైకిల్ నడపడం అలవాటు చేసుకున్నాను. అయితే సీటుమీద కూర్చొని దిగడానికి ఏవైనా అరుగులు,  వసారాలు చూసుకోవలసి వచ్చేది. మొత్తానికి కాలేజీలో ప్రవేశించేనాటికి బాగా సైకిల్ తొక్కడం వచ్చేసింది. కాకపోతే బొబ్బిలిలో నేను సైకిల్ ఉపయోగించవలసిన అవసరమేపడలేదు. ఒకసారి మాత్రం సరదాగా ఇంట్లోవారికి తెలియకుండా, బస్ లో సాలూరులో మా చిన్నాన్నగారింటికి వెళుతున్నాని చెప్పి , ఒక అద్దె సైకిల్ మీద ఓ పది,పన్నెండు మైళ్ళ దూరంలో వున్న సాలూరు ఉదయం వెళ్ళి, సాయంత్రానికి తిరిగి వచ్చేశాను.  ముందుగా చెప్పినట్లు దూరాన బస్సులు, లారీలు కనిపిస్తే అవి నన్ను దాటి వెళ్ళేవరకు సైకిల్ దిగిపోయేవాడిని. అప్పట్లో నాకది ఒక ట్రావెల్ ఎడ్వంచర్. 

అలాటి అనుభవంతో ప్రక్కన నరసింగ ఉన్నాడనే ధైర్యంతో సైకిల్ మీద వెళ్ళి ఇన్విటేషన్లు ఇవ్వడానికి అంగీకరించాను. నిజానికి నరసింగ నాకంటే పొట్టివాడే. అయినా సైకిల్ సీటు మీదకు సులభంగానే ఎక్కగలిగేవాడు. అది నాకు చేతనయ్యేదికాదు. మొత్తానికి  సొంత సైకిళ్ళమీద  ట్రిప్లికేన్ లో వున్న పైక్రాఫ్ట్స్ రోడ్ లో వుండే వి.ఎ.కె.రంగారావుగారింటికి మేమిద్దరం బయల్దేరాము. టి.నగర్ నుండి గోపతినారాయణస్వామి చెట్టి రోడ్ (జి.ఎన్.చెట్టి రోడ్) చివరనున్న సన్ ధియేటర్ (బండి సుందర్రావు నాయుడుగారి సినీమా హాలు. సుందర్రావులోని మొదటి మూడు ఇంగ్లీష్ అక్షరాలతో SUN Theatre గా పేరు పెట్టారు) దాటిన తర్వాత మౌంట్ రోడ్ వస్తుంది. అక్కడ ఎడమవేపు జెమిని స్టూడియో వేపునుండి నుంగంబాక్కం  హైరోడ్,  కుడివేపు  అమెరికన్ కాన్స్యులేట్, చర్చ్ ల వేపునున్న కెథెడ్రల్ రోడ్ వచ్చి కలుస్తాయి. అక్కడ నుండి కొంచెం దూరంలో ఎడమ వేపు వీకంసీస్ డైమండ్ కంపెనీవాళ్ళ సెఫైర్, బ్లూడైమండ్, ఎమరాల్డ్ సినీమా ధియేటర్ల కాంప్లెక్స్, అది దాటాక కుడివైపున చర్చ్ పార్క్ కాన్వెంట్. దాని దగ్గర ముందు పీటర్స్ రోడ్, కాన్వెంట్ దాటాక లాయడ్స్ రోడ్, వైట్స్ రోడ్, పటుల్లోస్ రోడ్, జనరల్ ప్యాటర్స్ రోడ్, వాలాజా రోడ్, ఏడమ్స్ రోడ్ అన్ని వరసగా మౌంట్ రోడ్ లో కుడివేపు వుండే రోడ్లు. సకల నదులు సముద్రంలోనే కలుస్తాయన్నట్లుగా మౌంట్ రోడ్ మీద కుడిచేతివేపున్న రోడ్లన్నీ తూర్పునున్న బంగాళాఖాత సముద్ర తీరానికే చేరుస్తాయి. ఈ పైక్రాఫ్ట్స్ రోడ్ చివరనే ట్రిప్లికేన్ బీచ్. అక్కడే సంగం కాలంనాటి మదురై నగరాన్ని తన శాపంతో దహించివేసిన మహా పతివ్రత, స్త్రీ శక్తి కణ్ణగి విగ్రహం రౌద్రంగా దర్శనమిస్తూంటుంది.

మేము ముందు చర్చ్ పార్క్ కాన్వెంట్ ముందున్న పీటర్స్ రోడ్ మీద (అంతగా బస్సుల రద్దీ వుండని కారణంగా) రాయపేట వరకు వెళ్ళి అక్కడ ఎడమవేపు తిరిగి "కేసరి కుటీరం", "గౌడీయమఠ్" దాటుకొని రాయపేట పోలిస్ స్టేషన్, పాత ఉడ్ ల్యాండ్స్ హోటల్ (ఇప్పుడు ఉడ్ లాండ్స్ సింఫనీ సినీమా థియేటర్ వుంది), రాయపేట గవర్నమెంట్ హాస్పిటల్ దాటాక నాలుగు రోడ్ల కూడలి. అక్కడ ఎడమవేపు మౌంట్ రోడ్ వెళ్ళే వైట్స్ రోడ్‌, తిన్నగాగా వెడితే (అది కూడా మౌంట్ రోడ్ లో బుహారీ హోటల్ దగ్గరకు వెళుతుంది) జనరల్ పాటర్స్ రోడ్ లోని ఓడియన్, మిడ్ ల్యాండ్ (తర్వాత  జయప్రదగా మారింది. సినీనటి జయప్రద తన తమ్ముళ్ళ కోసం కొనుగోలు చేసారని వార్త. కుడి వేపు తిరిగితే ట్రిప్లికేన్ లోని పైక్రాఫ్ట్స్ రోడ్. ఆ ప్రాంతమంతా ఈనాటికీ ముస్లిముల నివాసాలు, వ్యాపారాలు, మసీదులు, దర్గాలతో వారి ప్రాబల్యంతోనే నిండి వుంటుంది.

మొత్తానికి పైక్రాఫ్ట్స్ రోడ్ లోకి ప్రవేశించి కుడి ఎడమలు చూసుకుంటూ రంగారావుగారి ఇల్లు వెతకడం ప్రారంభించాము. అంతకుముందు మాలో ఎవరు వారింటికి వెళ్ళింది లేదు. సినీమా డైరక్టరీ ఆధారంతో ఇంటివేట మొదలెట్టాము. 'రామ్ మహల్' పేరిట  ఏ భవంతీ కనపడలేదు. ఇప్పటిలా అప్పుడు సెల్ ఫోన్లో, విరివిగా లోకల్ టెలిఫోన్ బూత్ లో వుండేవికావు. అలా కుడి ఎడమల కుసుమపరాగం అనుభవిస్తూ పైక్రాఫ్ట్స్ చివర వరకు వెళ్ళిపోయాము. అక్కడొక పెద్ద రావిచెట్టు. దానికి సమీపంలోనే టి.నగర్ నుండి వచ్చే 13 వ నెంబర్ బస్ ల చివరి స్టాప్. అక్కడ నుండి రోడ్ దాటి అవతలివేపుకు వెళితే ట్రిప్లికేన్ బీచ్. మాకు కావలసిన  'రామ్ మహల్' తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. అడ్రస్ లో ఉన్న నెం.1 (అనే గుర్తు) లో ఒక చిన్న ఉడిపి హోటల్ వుంది. వి.ఎ.కె.రంగారావుగారి ఇల్లు మాత్రం కనపడలేదు. ఇక వెతికే ఓపికలేక ఆ చిన్న హోటల్ లోకి వెళ్ళాము. హోటల్ చిన్నదే అయినా శుభ్రంగా వుంది. ఫలహారాలు రుచికరంగా వున్నాయి. ఆ సమయంలో ఆవిర్లు వస్తున్న వేడివేడి ఇడ్లీలు, తెలుగువారిష్టపడే కారపు చట్నీ మాకెంతో ఆనందం కలిగించింది. ఆ హోటల్లో ఉదయం నుండి రాత్రి హోటల్ మూసేవరకూ ఏ సమయంలోనైనా వేడివేడి ఇడ్లీలు లభిస్తాయని తెలిసింది. తర్వాత నేను ఎప్పుడు బీచ్ కు వెళ్ళినా 13 నెంబర్ బస్ దిగి ముందు ఆ హోటల్లో రెండు వేడివేడి ఇడ్లీలు తిని మరీ బీచ్ కు వెళ్ళేవాడిని. 
 
ఇక ఆవేళకి వెతుకులాట కార్యక్రమానికి స్వస్తి చెప్పి కాళ్ళీడ్చుకుంటూ.... కాదు సైకిళ్ళు తొక్కుకుంటూ ఇంటికి చేరుకున్నాము. 

ఆ తరువాత తీరుబడిగా మరోసారి సినీమా డైరక్టరీలో వి.ఎ.కె.రంగారావుగారి ఎడ్రస్ తీసి చూశాము. తీరా చూస్తే అది పైక్రాఫ్ట్స్ రోడ్ కాదు. పైక్రాఫ్ట్స్ గార్డెన్స్.   హడావుడిలో  గార్డెన్స్ అనే మాటను వదిలేసి రోడ్ అని ఎడ్రస్ రాసుకోడంతో అంతా తారుమారు అయింది. పైక్రాఫ్ట్స్ రోడ్ ట్రిప్లికేన్ లో వుంది. పైక్రాఫ్ట్స్ గార్డెన్స్. ఇప్పుడు కాలేజ్ రోడ్ మీదున్న విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ కి, శంకర్ నేత్రాలయాకి ముందు ఇండియన్ మిటియెరోలాజికల్ సంస్థ దగ్గరలో ఉండే ప్రాంతం. నుంగంబాకంలో హేడోస్ రోడ్ మీదున్న శాస్త్రీ భవన్ ఎదురువైపు ఉండే రోడ్డు పైక్రాఫ్ట్స్ గార్డెన్ రోడ్. ఆ తర్వాత మరో రోజు సరైన ఎడ్రస్ కు వెళ్ళి అందజేయవలసిన ఆహ్వానం సక్రమంగా అందజేశాము. అది వేరే సంగతి. 

పరమానందయ్య శిష్యుల పనితనం ఇలాగే ఉంటుంది.

ఘంటసాల మాస్టారింటి క్రింది పోర్షన్లో కొల్లూరి వారి కుటుంబం వుండేది. మంచి స్నేహపాత్రులు. వెంకటేశ్వరరావుగారు (ఆయన పేరు కూడా మాస్టారి పేరే) అంబత్తూర్ లోని ఒక ఫ్యాక్టరీలో ఒక పెద్ద పదవిలోనే వుండేవారు.

వెంకటేశ్వరరావుగారు ఘంటసాలవారింట్లోకి రాకముందు  పాండీబజార్లో హరిబాబు అనే సుప్రసిధ్ధ మేకప్ మెన్  ఇంట్లో అద్దెకు వుండేవారు. వెంకటేశ్వరరావు దంపతులు నేనంటే ఎంతో అభిమానంగా వుండేవారు. నా ఉద్యోగం విషయంలో మంచి అక్కర చూపేవారు. ఒక రోజు ఆయన తన కారులో  అంబత్తూర్  ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని తమ ఆఫీసుకు తీసుకువెళ్ళి అంతా చూపించారు. వాళ్ళ ఆఫీసులో నాకు తగిన ఖాళీలు లేవని చెప్పారు. ఏదో లీవ్ వేకన్సీలో ఒక పది పదిహేను రోజులు అక్కడ నాకు అవకాశం కల్పించారు. తర్వాత,  పాడీలో వున్న బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళారు. ఆ కంపెనీ కూడా అప్పటికి కొద్ది సంవత్సరాలముందే బిస్కట్ల తయారీ ప్రారంభించింది. అక్కడ కోటేశ్వరరావు అనే తెలుగాయన  ఒక డిపార్ట్మెంట్ కు మేనేజర్ గా వుండేవారు. మా వెంకటేశ్వరరావురావుగారూ ఆయనా స్నేహితులు. నన్ను పరిచయంచేసి విలయిన సహాయం చేయమని అడిగారు. ఫ్యాక్టరీ సైడ్ ఉద్యోగమైతే వెంటనే ఏర్పాటు చేయవచ్చని, అడ్మినిస్ట్రేషన్ సైడ్ అంటే  వెంటనే అవకాశం లేదని, నా బయోడాటా తనకు ఇవ్వమని, అవకాశాలు వచ్చినప్పుడు తప్పక ఇంటర్వ్యూకు పిలుస్తామని హామీ ఇచ్చారు.  అక్కడితో సరి.  కాకపోతే నాకు కాబోయే సతీమణి బ్రిటానియా బిస్కట్ల ఫ్యాక్టరీలోనే పనిచేస్తూవుండడం యాదృఛ్ఛికం.

అలాగే డి.ఎన్.రావుగారి స్నేహితుడు బి.డి.రావుగారి సిఫార్సుతో మెడ్రాస్ ఎనామిల్స్ అనే కెమికల్స్ కంపెనీకీ వెళ్ళాను.  అది సెంట్రల్ స్టేషన్ పక్కనున్న సిడెన్హామ్స్ రోడ్ చివరలో వుండేది. ఆ కంపెనీకి అధిపతి కానూరి రంజిత్ కుమార్ గారు. ఆయన, తమ కంపెనీ జీతాలు తక్కువని, వాళ్ళిచ్చే జీతం రెండు బస్సుల్లో వచ్చి వెళ్ళడానికే సరిపోతుందని చెప్పారు. ఆ ప్రాంతంలోనే ఉండేవాళ్ళకైతే అనువుగా వుంటుందని అందుచేత ఆ కంపెనీలో చేరి టైము వృధా చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఆ కానూరి రంజిత్ కుమార్ గారు ఒక దశాబ్దం తర్వాత  చిత్ర నిర్మాత గా కొన్ని తెలుగు  రంగుల సినీమాలు కూడా తీశారు.

కొల్లూరి వెంకటేశ్వరరావుగారు నాలాగే పొట్టిగా బొద్దుగా వుండేవారు. కానీ ఆయన పేరు వెనక పల్నాటి చేంతాడంత డిగ్రీలుండేవి. చాలా తెలివైన వాడు. ఆయన తమ్ముడిని పిల్లలంతా శాస్త్రిబాబు అనేవారు. అతను అప్పట్లో అన్నగారి వద్ద వుంటూ ఛార్టర్డ్ ఎక్కౌంటెన్సీ చదివేవాడు.  వీరిది రాజమండ్రి. రావుగారి సతీమణిది కాకినాడ, భమిడిపాటివారి ఆడపడుచు. వారు ఘంటసాలవారింట్లోకి వచ్చేనాటికి ముచ్చటగా  ముగ్గురు చిన్నపిల్లలు. ఒక అబ్బాయి, ఇద్దరమ్మాయిలు. గతంలో చెప్పినట్లుగా వారందరితో నెం. 35, ఉస్మాన్ రోడ్ 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం' లా పిల్లలతో  కళకళలాడుతూ వుండేది.

ఒక  ఆదివారం రోజు రావుగారి పిల్లలంతా 'చిన్నా బాబు వచ్చాడు, చిన్నాబాబు వచ్చాడంటూ' గోలగా అరవడం వినిపించింది. ఎవరా చిన్నా బాబు అని చూశాను. అంతకుముందెప్పుడూ చూడలేదు. ఆయన రావుగారికి తమ్ముడట. పెత్తండ్రి కొడుకు. మద్రాసులోనే అనుకుంటాను ఏదో ఒక జాపనీస్ కంపెనీలో  ఇంజనీర్ ట.  అతని తమ్ముడు కూడా IIT లో చదివేవాడట, అతనిని వీళ్ళంతా పండుబాబు అని పిలిచేవారు. అప్పుడప్పుడు వీళ్ళు విడివిడిగా శెలవు రోజుల్లో రావుగారింటికి వస్తూండేవారు.  చిన్నాబాబు చాలా హాండ్సమ్ గా రేమండ్ సూటింగ్, రెబొన్ గ్లాసెస్ మోడల్ లా చాలా స్టైల్ గా వుండేవాడు.  టైట్ ప్యాంట్, టక్ చేసిన టైట్ షర్ట్, నడుముకి బెల్ట్ , కోటెడ్ కూలింగ్ గ్లాసెస్ తో ఏదో కంపెనీ మోడల్ లా కనిపించాడు అప్పటి నా కళ్ళకు. అతని స్కూటర్ కూడా ఇతర వెస్పా, లాంబ్రెట్టాలకు భిన్నంగా వుండేది. అలాటి స్కూటర్లు చాలా అరుదుగా రోడ్లమీద కనపడేవి. మనిషి అతి చురుకు అనిపించేది. స్కూటర్ స్టార్ట్ చేసిన మరు సెకెండ్ లోనే మనిషి మాయమయ్యేవాడు. 

అలాగే కొల్లూరివారి బావమరదులు భమిడిపాటి బాపయ్యపంతులుగారు ఆయన సొదరుడు రామ్మోహన్, రావుగారి వదినగార్లు,మరదళ్ళ రాకపోకలతో నెం.35, ఉస్మాన్ రోడ్ నిత్యమూ కలకలలాడుతూవుండేది.

భమిడిపాటి బాపయ్య పంతులుగారి తండ్రిగారు సత్యనారాయణ గారనే గుర్తు. వారిది కాకినాడ. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు బిజినెస్ అనే విన్నాను. బాపయ్యపంతులుగారి సోదరులు రామ్మోహన్ కంటే పైన మరొకాయన వుండేవారు, పేరు గుర్తులేదు. రామ్మోహన్ బ్రిడ్జ్ ఆటలో ఎక్స్పర్ట్. మద్రాసు లోని  జింఖానా వంటి ప్రముఖ క్లబ్ లలో జరిగే బ్రిడ్జ్ టోర్న్ మెంట్లలో పాల్గొనేవారు. 

బాపయ్యపంతులుగారు చిత్రనిర్మాత. భాగస్తులతో కలసి కొన్ని సినీమాలు తీసి అవి కలసి రాక స్వతంత్రంగా  'మాయని మమత' అనే సినీమా తీయాలని తలపెట్టారు. డైరక్టర్ కమలాకర కామేశ్వరరావుగారు. ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి నాయికా నాయకులు.  సంగీత దర్శకుడిగా ఘంటసాలవారనే అనుకున్నారు. వారి ఆఫీసులోని ప్రారంభోత్సవానికి మేమంతా వెళ్ళాము. పాండీబజార్ వెనక ప్రాంతాల్లో ఆ ఆఫీసు వుండేది. ఒక రోజు రాత్రి ఆ కార్యక్రమం జరిగింది. త్వరలోనే  పాటల కంపోజింగ్ ప్రారంభించాలని మాస్టారితో చెప్పడమూ జరిగింది. ఈలోగా కొన్ని అనివార్య మార్పులు జరిగి ఘంటసాల మాస్టారు చేయవలసిన ఆ  'మాయని మమత ' సినీమా అశ్వథ్థామగారికి వెళ్ళింది. ఘంటసాలవారి నేపథ్య గానంతో దేవులపల్లివారు వ్రాసిన పాటలు చాలా చక్కగా అమరాయి. సినీమా కూడా చాలా బాగా తీశారు. కానీ డిస్ట్రిబ్యూషన్ సమస్యలు, లోపాలకారణంగా  నిర్మాత బాపయ్య పంతులు మాత్రం నష్టాలనే చవిచూసారని అనుకోవడం విన్నాను.

చిత్రం ఏమంటే 'మాయని మమత' వచ్చిన ఆరేళ్ళకు, ఘంటసాలవారు కాలం చేసాక వారి రెండో అమ్మాయి భమిటిపాటివారింటి కోడలు కావడం.  అప్పటికి కొల్లూరి వెంకటేశ్వరావుగారు వేరే ఇంటికి మారిపోయారు. అప్పుడు టేలర్స్ రోడ్ లో వుండేవారనుకుంటాను. లేదా జాంబియావో, కెన్యావో ఉద్యోగరీత్యా వెళ్ళిపోయారా ? గుర్తు లేదు. ఒకప్పటి కుటుంబ మిత్రులే బంధువులు కూడా కావడం ఎంతో విశేషం. చాలా ఆనందదాయకం. ఆ కుటుంబాలతో ఇంకా మా స్నేహం చెక్కుచెదరకుండా కొనసాగడం మరింత సంతోషకరం.

🌿🌷🌿


1969 లో ఘంటసాల మాస్టారు పాడిన పాటలెన్నో హిట్ గా ప్రజాదరణ పొందాయి. అందులో కొన్ని పాటలు  --

అదృష్టవంతులు చిత్రంలోని "అయ్యయ్యో బ్రహ్మయ్యా", "ముముముద్దంటే చేదా", వరకట్నం లోని "ఇదేనా మన సంప్రదాయమిదేనా", శ్రీ రామకధలో "మాధవా నను లాలించరా", మూగనోములో "ఈ వేళలో నాలో ఎందుకో", "నిజమైనా కలయైనా", సప్త స్వరాలులో "యదుబాలా శ్రితజనపాలా", "హాయిగా పాడనా గీతం", బందిపోటు దొంగలులో "విరిసిన వెన్నెలవో", "విన్నానులే ప్రియా", గండికోట రహస్యంలో "నీలాల నింగి మెరిసిపడే", విచిత్ర కుటుంబంలో "ఆడవే జలకమ్ములాడవే", సత్తెకాలపు సత్తెయ్యలో "నన్ను ఎవరో తాకిరి", ఆదర్శకుటుంబంలో "బిడియమేలా ఓ చెలి"

ఆత్మీయులు లో "కళ్ళల్లో పెళ్ళిపందిరి", "చేమంతి ఏమిటే ఈ వింత", బుధ్ధిమంతుడులో "నను పాలింపగ నడచి వచ్చితివో", "భూమ్మీద సుఖపడితే", "గుట్టమీద గువ్వ కూసింది", "బడిలో ఏముంది", "టాటా వీడుకోలు గుడ్ బై". ఈ పాటలలో ఘంటసాలవారు ఇద్దరు అక్కినేనిలకు మధ్య గల  వైరుధ్యభావాలకు తగినట్లుగా తన గాత్రంలో మార్పును సుస్పష్టంగా వినిపించారు. 


నను పాలింపగ నడచీ వచ్చితివా

మాతృదేవతలో "విధి ఒక విషవలయం".

ఆ సంవత్సరంలో అజరామరంగా, ఆపాతమాధుర్యాలుగా నిలచిపోయే పాటలను ఘంటసాల మాస్టారు ఏకవీర చిత్రంలో పాడారు. "తోటలో నా రాజు", "ఒక దీపం వెలిగింది", ఎస్.పి.బి.తో పాడిన "ప్రతీరాత్రి వసంతరాత్రి", పాటలు ఈనాటికీ శ్రోతలను అలరిస్తూనే వున్నాయి.


ఒక దీపం వెలిగింది

ఆ ఏడాది మాస్టారి సంగీత దర్శకత్వంలో రెండే సినీమాలు వచ్చాయి. ఒకటి భలే అబ్బాయిలు, మరొకటి‌ జరిగినకధ.

పేకేటి డైరక్షన్ లో తోట సుబ్బారావుగారి శ్రీదేవీ కంబైన్స్ నిర్మించిన "భలే అబ్బాయిలు" "వక్త్" అనే హింది సినీమాకు తెలుగు రూపం. " గులాబీలు పూసే వేళ", "కలగన్నానే తీయని కలగన్నానే", "ఆనాటి మధుర వసంతం" వంటి పాటలు వీనులవిందు చేసాయి. 


ఆనందం నాలో పొంగేను

నాగావళి రామవిజేతా బ్యానర్ మీద నిర్మాత దర్శకుడు కె.బాబురావు ప్రథమ ప్రయత్నం "జరిగిన కథ" ఈ సినీమా తర్వాత తీసిన మరో నాలుగు చిత్రాలకు ఘంటసాలవారే సంగీతం నిర్వహించారు. సంగీతం విషయంలో పూర్తి స్వేఛ్ఛనిచ్చే నిర్మాత బాబూరావు. అందుకే ఆయన చిత్రాలలోని పాటలన్నీ సన్నివేశపరంగా అందరి ప్రశంసలు పొందాయి.

జరిగినకథ చిత్రంలోని "భలేమంచి రోజు" పాట ఎంతటి సూపర్ హిట్టో అందరికీ తెలిసినదే. ఇదే చిత్రంలోని "ఏనాటికైనా ఈ మూగవీణ", "చినవాడ మనసాయెరా", "లౌ లవ్ లవ్ మి నెరజాణ", "ఇదిగో మధువు ఇదిగో సొగసు", "తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే" అన్ని పాటలు ఈనాటికీ అన్ని వేదికలమీదా వినిపిస్తునేవున్నాయి.


చినవాడ మనసాయెరా


లౌ లౌ లౌ మీ నెరజాణా

కవి యిచ్చిన మాటలకు వరస కట్టాలన్నా, లేక ఇచ్చిన ట్యూన్ కూ సరిపడిన సాహిత్యం అమరాలన్నా సంగీతదర్శకుడు, గీత రచయిత ఇద్దరూ సమర్థులైవుండాలి. వీరిచ్చిన పాటను సమర్థవంతంగా తెరకెక్కించే నైపుణ్యం, ప్రతిభ చిత్ర దర్శకుడికి వుండాలి. వీరందరిని అర్ధం చేసుకొని నటీనటులు సందర్భోచితంగా నటించాలి. వీరందరి సమిష్టి కృషిని తెరమీద చూసే ప్రేక్షకుడు అవునని అనాలి అప్పుడే ఆ  సినీమా విజయం పొందుతుంది. ఆ సినీమా లోని పాటలు ప్రచారంపొంది పదికాలాలపాటు ప్రేక్షకుల మనసులలో నిలచిపోతాయి. కానీ సినీమా చూసే ప్రేక్షకుడికి  ఎప్పుడు ఏ సినీమా ఎందుకు నచ్చుతుందో ఇంతవరకు వారిని సృష్టించిన బ్రహ్మదేవుడికి కూడా తెలియని పరమ రహస్యం. అందువల్లనే సరైన ప్రచారం లేక మాణిక్యాలవంటి పాటలు ఎన్నో మట్టిలో కలసి మరుగునపడిపోయాయి. 

🌺

ఘంటసాల మాస్టారికి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే విషయాలెన్నో వచ్చే వారాలలో...

మళ్ళీ వచ్చేవారం మరికొన్నివిశేషాలతో...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, September 19, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై తొమ్మిదవ భాగం

19.09.2021 -  ఆదివారం భాగం - 49:
అధ్యాయం 2 భాగం 48  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలగారు ప్రజల మనిషి. ప్రజాగాయకుడు. స్టూడియో మైక్రోఫోన్ ల ముందుకంటే ప్రజాబాహుళ్యంలో వారి ప్రశంసాపూర్వకమైన కరతాళధ్వనుల మధ్యనే పాడడానికి ఎక్కువ ఉత్సాహం చూపేవారు. ఘంటసాలవారు తిరిగినన్ని పల్లెటూళ్ళు ఆయన స్థాయిలో వున్న మరే గాయకుడు తిరిగివుండడు. తమ అంతస్తుకు తగ్గ పెద్ద పెద్ద హోటల్స్ లో బస చేస్తూ మహా నగరాలలోనే స్టేజ్ షోలు చేయడానికి సిధ్ధపడతారు. కానీ ఘంటసాలగారు ప్రయాణ సౌకర్యాలు లేని కుగ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ కచేరీలు చేసేవారు.

ఒక సంవత్సరం ఆగస్ట్ 15 భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంనాడు అప్పటి విశాఖపట్నం జిల్లాలోని కిండాం అగ్రహారం అనే కుగ్రామంలో  స్థానిక ప్రజల మధ్య పతాకావిష్కరణోత్సవంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రెండు మూడు గ్రూపులుగా విడిపోయిన ఆ చిన్న గ్రామంలోని పెద్ద మనుషులు, ఒకటిగా కలసిమెలసివుంటామనే కండిషన్ మీద ఘంటసాలవారు ఆ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు రోజు తనకెంతో ఆప్తుడు, కీర్తిశేషుడు అయిన ముద్దు పాపారావు గారి కుమార్తె వివాహాన్ని తన చేతులమీదుగా  జరిపించడానికి ఘంటసాలవారు కిండాం అగ్రహారం వెళ్ళారు. ఆ వివాహానికి అయిన ఖర్చంతా దివంగత మిత్రుడి మీది ప్రేమతో ఘంటసాలవారే భరించారు. తన మిత్రుడు కొడుకు ముద్దు నరసింగరావు అప్పటికే ఘంటసాలవారి పంచనజేరాడు.

ముద్దు పాపారావుగారు విజయనగరం మహారాజావారి సంగీత కళాశాలలో ఘంటసాలవారికి సహాధ్యాయి. మా తాతగారి శిష్యుడే. పాపారావుగారు, ఘంటసాలవారు మంచిమిత్రులు. సంగీత విద్య నేర్చుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఆ సమయంలో పాపారావుగారు ఘంటసాలవారికి ఆధరవుగా వుండేవారట. తమ మైత్రి ఎప్పటికి విడరానిదిగా వుండాలని ఈ ఇద్దరు మిత్రులు అనుకునేవారట.

సంగీతశిక్షణ పూర్తయాక ఎవరిదారులు వారివి అయాయి. ఇద్దరికీ కుటుంబ పోషణ ప్రధాన సమస్యగా మారింది. ఎవరికెవరూ సంబంధం లేకుండా పోయింది.  తాను నేర్చుకున్న సంగీతాన్నే నమ్ముకొని ఘంటసాలవారు పొట్టచేతబట్టుకొని దక్షిణాన ఉన్న మద్రాసు చేరుకున్నారు. పాపారావుగారు కూడా అదే సంగీతాన్ని నమ్ముకొని ఒరిస్సా రాష్ట్రం గుణుపూర్ లో స్థిరపడి అక్కడ సంగీత శిక్షణలు ఇస్తూ అతి సామాన్యంగా జీవితం సాగించారు. అప్పట్లో గుణుపూర్ చాలా చిన్న ఊరు. సంపాదన అంతంతమాత్రంగానే వుండేదట. ముద్దు పాపారావు గారి స్వస్థలం కిండాం అగ్రహారం. పాపారావుగారి పెద్దతండ్రి ముద్దు నారాయణ మూర్తిగారు గొప్ప పలుకుబడిగల భూ కామందు. జమీందారీ ఫాయిదాలో చాలా దర్జాగా, దర్పంగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. ఆనాటి సంస్థానాధీశులులాగా గుర్రపు బగ్గీలలో మందీ మార్బలంతో వుండేవారట. తుపాకీ చేతబట్టి వేటకు వెళ్ళే బ్రాహ్మణుడిగా ముద్దు నారాయణమూర్తిగారికి ఘనమైన కీర్తి ఆ వూళ్ళో వుండేది. ఆయన దేవిడి ముందునుండి  ఆ వీధిలో ఎవరు చెప్పులతో వెళ్ళడానికి సాహసించేవారు కాదంటే ఆయన రాజసం ఎంతటిదో ఊహించుకోవచ్చును. జమిందారీ ఆక్ట్ అమలుపర్చిన తర్వాత అందరి జమిందార్లు లాగే కిండాం ముద్దు నారాయణమూర్తిగారి భూములన్నీ ప్రభుత్వపరమైపోయాయి. ఆయన కొడుకులు, మనవల కాలానికి చాలా ఆస్తులు హరించుకుపోయాయి. ఉన్న భూములను ముందుచూపుతో అభివృధ్ధి పర్చుకున్నవారు బాగుపడ్డారు.  ఆ ముందు ఛూపు లేనివారు ఉన్న ఆస్తంతా సంపెంగి నూనెలకు, నేతి ఖర్చులకే ఉపయోగించి అనామకులయ్యారు. ముద్దు నారాయణమూర్తిగారి తమ్ముడు కొడుకే ముద్దు పాపారావుగారు. ఆయన కాలానికి, ఆయన భాగంగా ఏమీ మిగలలేదు. పాపారావుగారు మా తాతగారు పట్రాయని సీతారామశాస్త్రిగారి శిష్యుడు. ఘంటసాలగారి సహాధ్యాయి.


ఈ ఫోటోలో సరిగ్గా గురువుగారి వెనుక నించునున్నది ముద్దు పాపారావుగారు 
ఫోటోకి ఎడమవేపు కింద కూర్చునున్నది ఆయన మేనల్లుడు

మా నాన్నగారు (పట్రాయని సంగీతరావుగారి) జన్మస్థలం కూడా కిండాం అగ్రహారమే. మా నాన్నగారి మాతామహుల ఊరు. ఈ కిండాం అనే పాతకాలపు అగ్రహారం విజయనగరం జిల్లాలోని బొండపల్లి నుండి మూడుమైళ్ళ దూరంలో, గజపతినగరం నుండి పదిమైళ్ళ దూరంలోను వుందట. నేనెప్పుడూ ఆ వూరు వెళ్ళలేదు. ఇప్పుడు అన్ని ఊళ్ళలాగే ఆ వూరు కూడా కొంత అభివృద్ధి చెందిందని విన్నాను. (ఈ కిండాం కు సంబంధించిన వివరాలు కొన్ని మా నాన్నగారి ద్వారా విన్నవి, మరికొన్ని మా శర్మ బాబు (గుమ్మా మార్కండేయశర్మ, మా నాన్నగారి పినతల్లి కొడుకు) ద్వారా తెలుసుకున్నవి.)

ఘంటసాలవారి స్నేహితుడు ముద్దు పాపారావుగారికి వివాహం జరిగి సంసారం పెరిగింది. కాని ఆర్ధిక స్థితి అంతగా పెరగలేదు. ఆయన ఒక కొడుకు  నరసింగరావు అని పేరు.  విజయనగరంలో రాజావారి సింహాచలం సత్రవులో భోజనం చేస్తూ  చదువుతూవుండేవాడు. ఇలాటి పరిస్థితులలో ముద్దు పాపారావుగారు కాలం చేశారు. సంసారం రోడ్ న పడింది. నరసింగరావు చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ విషయం ఘంటసాలవారికి తెలిసింది. ఆయన వెంటనే తన స్నేహితుడు కొడుకైన నరసింగరావును తన దగ్గరకు పిలిపించుకున్నారు. ఇకపైన ఆ కుర్రవాడి బరువు భాధ్యతలు మనవేనని, మన సొంత మనిషిలానే అందరూ ఆదరించాలని, తనంతట తానుగా వెళ్ళిపోతానంటే తప్ప అతనిని ఎవరూ ఆ ఇల్లువదలి పొమ్మనకూడదని ఘంటసాల మాస్టారు తమ ఇంట్లోవారందరికీ చెప్పారు. 

ఆనాటి నుండి ముద్దు పాపారావుగారి కుమారుడు ముద్దు నరసింగరావు (మా నరసింగ) ఘంటసాలవారింటి కుటుంబసభ్యుడయాడు. చదువు సరిగా సాగనందున పెద్ద ఉద్యోగాలు దొరికే అవకాశంలేక  తమ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులకు వినియోగించేవారు. ఘంటసాలవారి సొంత నిర్మాణ సంస్థకు సంబంధించిన ఎకౌంట్స్ చూసే క్లర్క్ కు సహాయకారిగా వుంటూవుండేవాడు. 

కొన్నాళ్ళకు కొంచెం అనుభవం వచ్చాక ప్రముఖ నటుడు గుమ్మడిగారి ఇన్కమ్ టాక్స్ లెక్కలు రాయడానికి వెళ్ళేవాడు. అలాగే, ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ జి.ఎన్.భూషణ్, 'ది మెయిల్" మద్రాసులోని ప్రముఖ ఇంగ్లీష్ eveninger లో సబ్ ఎడిటర్ జి.వి.రామారావుగారు (గిడుగు వెంకట రామారావు) కలసి ఏర్పాటు చేసిన కల్పన పబ్లిసిటిస్ లో పార్ట్ టైమ్ టైపిస్ట్ గా పనిచేసేవాడు. ఆ ఇంటి మేడమీదే బేబి శ్రీదేవి కుటుంబం వుండేది. ఆ ఆఫీసుకు రెండుమూడుసార్లు వెళ్ళాను. బాపు రమణల సినీమాలన్నిటికి పబ్లిసిటీ వ్యవహారం అంతా ఈ కల్పనా పబ్లిసిటీ యే చూసేది. ఆ ఆఫీస్ టైపింగ్ శైలి నాకు వింతగా వుండేది. ఇంగ్లీష్ లోని కరస్పాడెన్స్ లో ఎక్కడా కాపిటల్ లెటర్సే ఉపయోగించేవారు కాదు. అంతా స్మాల్ లెటర్సే. అందరు ఎడమవేపు మార్జిన్  సెట్ చేస్తే వాళ్ళు కుడివేపున మార్జిన్ సెట్ చేసేవారు. అంతా తమాషాగా వుండేది. ఇదంతా సినిమా పబ్లిసిటీలో ఒక నావెల్టీ అనేవాడు. కొన్నాళ్ళపాటు ఒక స్నేహితుడు (సుధాకర్)తో కలసి 16 mm సినీమాలు డిస్ట్రిబ్యూషన్ కు తీసుకొని ఆంధ్రాలోని పల్లెటూళ్ళలో, స్కూళ్ళలో, పెళ్ళిళ్ళలో  ప్రదర్శిస్తూ ఓ చిన్నపాటి వ్యాపారం సాగించాడు. అవన్నీ మూన్నాళ్ళ ముచ్చటగానే సాగాయి. 

అయ్యగారిలా సంగీతం అబ్బలేదు కానీ వారిలా చుట్టకాల్చడం మాత్రం అబ్బింది. ఉదయం పూట చుట్టలు కాలిస్తే ఆ వాసనకు ఇంట్లోవారు తిడతారని రాత్రి పదయ్యాక  అందరూ పడుకున్నాక గేట్ బయటకు వచ్చి ఓ గంటసేపు చుట్టకాలుస్తూ అనేక  సినీమా కంపెనీల కబుర్లు చెపుతూండేవాడు.

ఘంటసాల మాస్టారి అభిమతం ప్రకారం ముద్దు నరసింగరావు చివరివరకూ ఘంటసాలవారింటి బిడ్డగానే బ్రతికాడు. ఘంటసాలవారు స్వర్గస్తులైన తర్వాత కూడా  ఆ కుటుంబానికి సంబంధంలేని కొమరవోలు వెంకట కృష్ణారావు అనే తమ్ముడు కృష్ణ ఉరఫ్ గుండు మామయ్య, ఈ ముద్దు నరసింగరావు ఈ నెం.35, ఉస్మాన్ రోడ్ లోనే వుండిపోయారు. ఘంటసాలవారి సతీమణి సావిత్రమ్మగారు ఈ ఇద్దరినీ కూడా తన పిల్లలతో సమానంగా చూసారు. నిజానికి తమ్ముడు కృష్ణ సావిత్రమ్మగారికంటే  వయసులో బాగా పెద్ద. అయినా అతన్ని తమ్ముడూ అనే పిలిచేవారు.  35, ఉస్మాన్ రోడ్ ఇల్లు అమ్మిన తర్వాత కూడా ఈ ఇద్దరూ అమ్మగారినే అంటిపెట్టుకొని ఆవిడకు సహాయంగా ఆవిడ ఉన్నచోటే  ఉంటూ ఈ ఇద్దరూ తమకంటూ ఏ కుటుంబమూ లేకుండా గడిపారు.  ఇద్దరికీ పెళ్ళి కాలేదు. తమ్ముడు కృష్ణ తన 90వ ఏట, ముద్దు నరసింగరావు తన 80వ ఏట  ఘంటసాల కుటుంబ సభ్యులుగానే తమ అంతిమశ్వాస విడిచారు. ఘంటసాలవారి కుటుంబ సభ్యులంతా వీరిద్దరి మరణానికి ఎంతగానో ఆవేదనపొందారు. ఘంటసాలవారి కుటుంబంతో మెలిగినవారంతా కూడా అంతటి ఆత్మీయతనే పొందారు. దీనంతటికీ కారణం ఘంటసాలవారి ఔదార్యం, మానవతా దృక్పధమే కారణం. 

🌺


చూస్తూండగానే వరసగా రెండు 12Bలు ఖాళీగా వెళ్ళిపోయాయి. నేనింకా కోట్స్ రోడ్ కూడా దాటలేదు. తర్వాతి బస్ ఎంతసేపటికి వస్తుందో ఇవేళ ఆఫీస్ కు లేటయలే వుంది అనుకుంటూ పానగల్ పార్క్ వేపు నడిచాను. నేను శారదా స్కూల్ ఎదురుగా వున్న పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళేసరికి 12 నెం. కూడా ఒకటి నాముందు నుండే వెళ్ళిపోయింది. నాలుగడుగులలో బస్ స్టాప్. బస్ స్టాప్ లో ఆపకుండా కొంచెం ముందుకు పోయి ఆపాడు. జనాలు పొలోమంటూ ఆ బస్ వెనక పరుగులు తీసారు. స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసుల టైముల్లో ఇది సర్వసాధారణం. నా 12B. రాలేదు. దానికోసం ఎదురుచూస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఈలోగా ఒకాయన వడవడిగా వచ్చి 12B. వెళ్ళిపోయిందా అని అరవంలో అడిగారు. నేనూ అదే అరవంలో ఐదునిముషాలముందే రెండు బస్సులు వెళ్ళిపోయాయని  చెప్పాను. ఆయన రిలాక్స్డ్ గా ఒక చెట్టును ఆనుకొని ఏవో కూనిరాగాలు తీస్తున్నారు. ఆయన వేషధారణ చూస్తే తెలుగాయనేమో అనిపించింది. పంచెకట్టు, పైన తెల్లటి జుబ్బా, భుజంమీద కండువా చూసి అనిపించింది. మరో పావుగంట తర్వాత 12B. కొంచెం ఖాళీగా వచ్చింది. వెంటనే ఎక్కేశాను. నాతోపాటే ఆయనా బస్ ఎక్కారు.  నాకు లక్కీగా పాండీబజార్లోని రాజకుమారి ధియేటర్ స్టాపింగ్ దగ్గర కిటికీ వేపు సీట్ దొరికింది. అక్కడ నుండి లజ్ కు వెళ్ళడానికి ఒక అరగంటైనా పడుతుంది. బయటనుండి వచ్చే చల్లటిగాలికి నాకళ్ళు మూతలుపడ్డాయి. ఎంతసేపు అలా పడుకున్నానో తెలియదు. ఇదే లాస్ట్ స్టాప్ అందరూ దిగండి దిగండనే బస్ కండక్టర్  తమిళ అరుపులతో నాకు తెలివి వచ్చింది. అప్పుడే లజ్ కార్నర్ వచ్చేసిందా అనుకుంటూ బస్ దిగి చూశాను. అది నాకు పరిచయమున్న లజ్ కార్నర్ కాదు. ఏదో కొత్త ప్రదేశం అంతకుముందెప్పుడు చూడలేదు. చుట్టూ కొబ్బరి చెట్లు. వాటి మధ్య ఎత్తైన ఒక రాజగోపురంతో ఒక పెద్ద శివాలయం కనిపించింది.  కంగారుగా వచ్చిన బస్ వేపు పరీక్షగా చూస్తే అది 12E. బస్. నేను దిగింది తిరువాన్మియూర్ లో. నా అదృష్టం బాగుంది. స్టాండ్ కండక్టర్లు ఎవరూ దిగినవాళ్ళ దగ్గర టిక్కెట్లు చెక్ చేయలేదు. అలాచేసివుంటే  కొన్న టిక్కెట్టు కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసినందుకు చీవాట్లు, దానితోపాటూ ఫైన్ కట్టవలసి వచ్చేది. ఆ ప్రాంతానికి వెళ్ళడం అదే మొదటిసారి. చాలా నిర్మానుష్యంగా ప్రశాంతంగా వుందా స్థలం. మహాబలిపురానికి బస్ లు  ఆ రోడ్ మీద నుండే వెళతాయని తర్వాత తెలిసింది. అదే ఈనాడు ఈస్ట్ కోస్ట్ రోడ్ గా దట్టమైన చెట్లతో, కాదు భవనాలతో, ట్రాఫిక్ జామ్ లతో  బ్రహ్మాండంగా అభివృద్ధిచెందింది.

నేను మళ్ళీ ఆ బస్ స్టాండ్ లో లజ్ కు వెళ్ళే బస్ నెంబర్ తెలుసుకొని, అది వచ్చేవరకు కాచుకొనివుండి ఆ బస్ లో బయల్దేరి ఒళ్ళు దగ్గరపెట్టుకొని  బుధ్ధిగా లజ్ లో దిగి కపాలేశ్వరాలయం దగ్గరకు వెళ్ళేసరికి 12 దాటింది. మెల్లగా మరో ఐదునిముషాల తర్వాత ఆఫీసుకు చేరుకున్నాను. ఎందుకు లేటయిందని ఎవరూ నన్నడగలేదు. పాత ఆఫీసర్ గారు ట్రాన్స్ఫరై వెళ్ళిపోయారు. క్రొత్తగా వచ్చిన లయొజన్ ఆఫీసర్ గారు  ఆరోజు ఆఫీసుకు రాకుండా డైరక్ట్ గా హార్బర్ లో చెకింగ్ కు వెళ్ళారట. ఆయన పేరు వి.కె.బావా (వసంతకుమార్ బావా). ఈయన కూడా IAS ఆఫీసరే. పంజాబీ. సూటు, బూట్ లతో ఒక పెద్ద ఎక్సిక్యూటివ్ కు వుండే లక్షణాలన్నీ వుండేవి. ఆయనకు తెలుగురాదు. ఇంగ్లీష్, హిందీలలోనే వ్యవహారమంతా.  ఈయన వచ్చాక నాకు పని ఎక్కువయింది. ఈయన హయాంలో ఎక్కువగా లెటర్ కరస్పాన్డెన్స్ జరిగేది. నేను మొదటిసారిగా ఫాక్స్ మిషన్ ను, సైక్లొస్టైల్ మిషన్ ను చూసింది ఆ ఆఫీసులోనే. 

మద్రాస్ లోని ఈ లయొజన్ ఆఫీస్  నడపాలా, వద్దా అని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం వారు ఏడాదికొకసారి ఆర్డర్స్ జారి చేసేవారు. ఆ ఆర్డర్స్ రావడం లేటయితే ఉద్యోగస్తుల జీతాలు రావడం కూడా లేటయేది. ఆంధ్రాలోని డీలర్లకు ఎరువులు ఏ పోర్ట్ ద్వారా ఎలా సరఫరా అవుతాయో తెలియని అసందిగ్దత ఏర్పడేది. అలాగే ఆ లయొజన్ ఆఫీస్ మద్రాస్ లో కొనసాగింది. మైలాపూర్ లో వున్న ఆ ఆఫీస్ తర్వాత కొన్నాళ్ళకు అడయార్ కు మారింది. 
🌺
              
కె.వి.రెడ్డిగారి దగ్గర సహాయకుడిగా పనిచేసి సంపాదించిన అనుభవంతో బాబూరావు అనే కొత్త కుర్రవాడు సినీమా తీస్తున్నాడు. అతనే డైరక్షన్ . మనమే ఆ సంగీతం చేస్తున్నామని  ఒకరోజు ఘంటసాల మాస్టారు చెప్పారు. అప్పటికి ఆయన చేతిలో రెండు మూడు సినీమాలకంటే ఎక్కువలేవు. 

1952 నుండి ఘంటసాల మాస్టారినే అంటిపెట్టుకొని అన్నిచోట్లకు కూడా తిరిగే జె.వి.రాఘవులుగారు కూడా మాస్టారింటికి రావడం తగ్గించేసారు. ప్రతీరోజూ ఉదయం ఎనిమిది గంటలకంతా వచ్చే రాఘవులుగారు లేకుండానే మాస్టారు బయట రికార్డింగ్ లకు రిహార్సల్స్ కు వెళ్ళడం సాగించారు. ఆ సమయంలోనే మొవ్వ జనార్దనరావు,  మూడవ రాఘవులు ఘంటసాలవారి దగ్గర చేరారు. ఈ ఇద్దరూ కూడా మంచి గాయకులే. ఆ తర్వాత,  అంతకుముందే  మాస్టారి అనేక సినీమాలకు సహాయకుడిగా పనిచేసిన పామర్తిగారు మరల వచ్చిచేరారు. రాఘవులుగారికి గాయకుడిగా రాణించే అవకాశాలు తక్కువనే విషయం ఆయనకు అవగతమయింది. స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేయాలనే కోరికా పెరిగింది. నూతనావకాశాలకోసం చేసే ప్రయత్నాలలో రాఘవులు ఘంటసాలవారి కి క్రమక్రమేణా దూరమయ్యారు. తన దగ్గర వున్న మనిషి అభివృద్ధి పథంలోకి అడుగుపెడుతున్నందుకు ఘంటసాల మాస్టారు ఆనందించారు.

మాస్టారి దగ్గర పనిచేసిన మాస్టర్ వేణు, విజయాకృష్ణమూర్తి, ఎమ్.రంగారావు, బి.గోపాలం, పామర్తి వంటివారెందరో అవకాశాలు లభించినప్పుడు సంగీతదర్శకులుగా వెళ్ళిపోయారు. వారెవరూ తనకు పోటీయని మాస్టారు భావించనూలేదు. వారందరి సినీమాలలో ఘంటసాలగారే ప్రధాన గాయకుడు.

ఘంటసాలవారు అప్పటికే సంగీత దర్శకుడిగా అగ్రస్థానాన ఉన్నారు. ఆయనుండే కాలానికి తెలుగు సినీమాలలో ఎక్కువ సంఖ్యలో సంగీత దర్శకత్వం వహించింది వారే. అనేక చిత్రనిర్మాణ సంస్థలకు రిపీటెడ్ గా సంగీత దర్శకత్వం వహించింది ఘంటసాలవారే. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా గల ప్రతిభతో పాటు ఆయనకు గల వినయ విధేయతలు, నిర్మాతా దర్శకులతో గల స్నేహ సత్సంబంధాల వలన ఒకే నిర్మాత తీసిన అనేక చిత్రాలకు ఆయనే సంగీతదర్శకుడిగా చివరవరకూ కొనసాగారు. ఒక చిత్రం ఒప్పుకున్న తర్వాత ఆయనంతట ఆయనగా  ఆ చిత్రం మధ్యలో తప్పుకున్న సందర్భాలే లేవు. ఘంటసాల మాస్టారిని సంగీత దర్శకుడుగా రిపీటెడ్ గా వినియోగించుకున్న అనేక చిత్రనిర్మాణ సంస్థలలో ముఖ్యమైనవి -

సి.కృష్ణవేణి&మీర్జాపూర్ రాజావారి ఆధ్వర్యంలోని శోభనాచల, నాగిరెడ్డి&చక్రపాణిల విజయా ప్రొడక్షన్స్, సుందర్లాల్ నహతాగారి రాజశ్రీ/శ్రీ/రాజలక్ష్మీ ప్రొడక్షన్స్, డి.ఎల్ నారాయణగారి వినోదా పిక్చర్స్, కోవెలమూడి భాస్కరరావు గారి భాస్కర్ ప్రొడక్షన్స్, దోనేపూడి కృష్ణమూర్తి గారి గోకుల్ పిక్చర్స్, లక్ష్మీరాజ్యం గారి రాజ్యం ప్రొడక్షన్స్, నర్రా రామబ్రహ్మంగారి గౌతమీ పిక్చర్స్, ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు గారి మాధవీ పిక్చర్స్, తోట సుబ్బారావు గారి శ్రీదేవి ప్రొడక్షన్స్, కె.ఎ.ప్రభాకర్&కె.బాబూరావ్ సోదరుల రామ విజేతా ఫిలింస్ వంటి సంస్థలకు వరసగా ఘంటసాలవారు సంగీత దర్శకత్వం వహించడం ఒక ఘనచరిత్రగానే భావించవచ్చును. 

సాటిలేని గాయకలక్షణాలు, సంగీతంలో పరిణితిచెందిన సంగీతదర్శకత్వపు లక్షణాలు ఒకే వ్యక్తి కలిగివుండడం అరుదైన విషయం. అటువంటి గొప్పకళాకారుడు మన ఘంటసాల. రెండున్నర దశాబ్దాల పాటు గాయకుడిగా , సంగీతదర్శకుడిగా కోట్లాది తెలుగువారి పరిపూర్ణాభిమానాన్ని చూరగొన్న ఘంటసాలవారి చలనచిత్ర జీవిత రజతోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆయన అభిమానులంతా కోరుకున్నారు. ఆ గంధర్వగాయకుని సంగీత రజతోత్సవం చేయడానికి ప్రణాళికలు వేయడం మొదలయింది.

ఆ విశేషాలేమిటో రాబోయే వారాలలో మీరే తెలుసుకుంటారు...
 
                 ...సశేషం



*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.