visitors

Friday, August 14, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పన్నెండవ భాగం

15.08.20 - శుక్రవారం భాగం - 12:
పదకొండవ భాగం ఇక్కడ:
నెం.35, ఉస్మాన్ రోడ్


      ప్రణవ స్వరాట్

నెం. 35, ఉస్మాన్ రోడ్ ధారావాహిక - ఘంటసాలగారి జీవిత చరిత్ర కాదు.

ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాలైన కలివరం, విజయనగరం, బొబ్బిలి వంటి చిన్న ఊళ్ళలో పుట్టి పెరిగి ఒకేసారి మద్రాస్ మహానగరంలోకి వచ్చిపడిన  ఒక సగటు కుర్రవాడి మనోభావాలు, అవస్థలు చూపే ప్రయత్నమే ఈ నెం.35, ఉస్మాన్ రోడ్. 

ఒక డెభ్భై ఏళ్ళక్రితం మన ఊళ్ళు ఎలా ఉండేవో, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, అగ్రహారాలలో ఆనాటి ఆచార వ్యవహారాలు పరిపూర్ణంగా కాకపోయినా సూచనప్రాయంగానైనా ఈ తరంవారికి తెలియజెప్పే ప్రయత్నమే నెం.35, ఉస్మాన్ రోడ్. ఇందులో వచ్చే అన్ని భాగాలతోనూ ఘంటసాలగారికి ప్రత్యక్ష సంబంధం ఉండవచ్చును. ఉండకపోవచ్చును. కానీ, ఆ నాటి పరిస్థితులన్నీ ఘంటసాలగారి సంగీత విద్యమీద, పురోభివృద్ధి మీద, వ్యక్తిత్వ వికాసం మీద ప్రభావం చూపాయనే నేను భావిస్తున్నాను.  వయసు మీరుతున్న కారణంగా గత జ్ఞాపకాలు పూర్తిగా మరుగున పడిపోకముందే వాటిని అక్షరరూపంలో పెట్టే ప్రయత్నమే ఈ నెం.35, ఉస్మాన్ రోడ్. ఈ విషయాలన్నీ ఘంటసాలవారి అభిమానులకు ఆసక్తికరంగా తోచకపోయినా, మా పట్రాయని కుటుంబంలో మా తర్వాతి తరంవారికి, వారి పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష వుంటే ఈ వ్యాసాలు కొంత ఉపయోగిస్తాయి. ఈ వ్యాసాలలో అవాస్తవాలకు, అతిశయోక్తులకు చోటులేదు.  నాకు జ్ఞాపకమున్నంతవరకు ఔచిత్యం పాటిస్తూ ఉన్న విషయాన్ని చెప్పడమే నా ముఖ్యోద్దేశం.

ఇక మన కథలోకి వెళదాం.

ఘంటసాల అనే ఆయన తమ కుటుంబంతో మా తాతగారింటికి వచ్చి వెళ్ళాక ఆయన సినీమా లలో పాటలు పాడతారని, మా తాతగారింట్లోనే వుంటూ సంగీతం నేర్చుకున్నారని తెలిసింది. అప్పటినుండి రేడియోలో కానీ, సినీమాల ప్రచారం కోసం జట్కా బళ్ళలోనూ, సైకిల్ రిక్షాలలో లౌడ్ స్పీకర్లు పెట్టి గ్రామఫోన్లలో వచ్చే పాటల్లోకానీ ఘంటసాల పాట వస్తే గుర్తు పట్టడం తెలిసింది. పెద్దవాళ్ళతో సినీమాలకెడితే అందులో వచ్చే పేర్లలో ఘంటసాల అనే పేరుందో లేదో చూడడం మొదలయింది. 

అప్పట్లో సంసారం, మల్లీశ్వరి,  పరోపకారం, దేవదాస్ వంటి సినీమా పాటలు తరుచూ లౌడ్ స్పీకర్లలో వినిపించేవి. పరోపకారం సినీమా ఘంటసాల వారిదేనని చెప్పుకోవడం విన్నాను. ఆ సినీమాను ధియేటర్లో  చూసిన గుర్తుంది. ఘంటసాల పాటలు జనాలు బాగా పాడుకోవడం మొదలయింది. ముఖ్యంగా దేవదాసు వచ్చాక ఎక్కడ చూసినా అవే పాటలు. 

ఊళ్ళో జరిగే పాటల పోటీలలో కూడా ఔత్సాహిక గాయకులు ఘంటసాల పాటలు పాడడం ఆరంభమయింది. ఘంటసాల పుష్పవిలాపం పద్యాలు చదివే గాయకులు ఎక్కువగా తయారయ్యారు. అలాటి  ఔత్సాహిక గాయకుల పాటల పోటీ ఒకటి సింహాచలం చౌల్ట్రీలో జరిగింది. ఆ పాటల పోటీలలో ముగ్గురు జడ్జీలలో మా నాన్నగారు - శ్రీ సంగీతరావుగారు ఒకరు. ఆ పోటీలో మా నాన్నగారి కజిన్ గుమ్మా మార్కేండేయ శర్మ కూడా పాల్గొని ఘంటసాలగారి 'హృదయమా సాగిపోమ్మా' (పరోపకారం) పాట పాడారట. ఈ విషయాలు పెద్దయ్యాక తెలిసినవి.
  హృదయమా సాగిపొమ్మా"పాటను ప్లేబటన్ నొక్కి వినవచ్చు

రోడ్లమీద తాగుబోతు వాళ్ళ నోట్లో దేవదాసు పాటలే.  మా తాతగారికి రోడ్లమీద తూలుతూ నడిచే తాగుబోతులంటే మహాభయం. దానితో పిల్లలను బయటకు వదిలేవారు కాదు. అలాగే  వీధుల్లో గాడిదలు విపరీతంగా తిరిగేవి. వాటి ముందరి కాళ్ళు రెండూ కట్టేసే ఉంచేవారు వాటి యజమానులు. అయినా అవి అలాగే గెంతుకుంటూ తిరుగాడుతూండేవి. ఆయనే ఎప్పుడైనా పిల్లలను తీసుకొని నల్లచెఱువు మెట్టలవేపు తీసుకువెళ్ళేవారు. అక్కడికి వెళ్ళాలంటే మహదానందం. అక్కడ చాలా ఈతచెట్లుండేవి. చేతికందేలా గుత్తులు గుత్తులుగా ఎర్రటి పళ్ళుండేవి. వాటికోసం ఆయన వెంటపడేవాళ్ళం. ఆ ఈతపళ్ళు, నేరేడు పళ్ళు వీధుల్లోకి తెచ్చి అమ్మేవారు. అవి కొనుక్కోవాలంటే గుప్పెడు నూకలో, బియ్యమో ఇవ్వాలి డబ్బులకు బదులుగా.(అంటే బార్టర్ పద్ధతిలో (barter system) వంగ, దొండ, బెండ, చిక్కుడు, అరటి దవ్వ(దూట), అరటిపువ్వు వంటి కూరగాయలు పాతిక, ఏభై, వందల లెఖ్ఖన అమ్మేవారు.  తూనికతో అమ్మకాలు తక్కువ. వాటికి కూడా డబ్బులకు బదులు నూకలే తీసుకునేవారు. తాటి ముంజెలు, మామిడిపళ్ళ సీజన్ లో  ఆ పళ్ళన్ని చాలా విరివిగా అమ్మకానికి వచ్చేవి.  పెద్ద రసాల మామిడిపళ్ళు వంద పళ్ళు ముఫ్పై, నలభై రూపాయలలోపే వుండేవి. వాటిని బేరం చేసి, ఎంచి, కొని డబ్బులు ఇచ్చే వ్యవహారమంతా మా పెద్దమ్మమ్మగారిదే (మా తాతగారి అక్కగారు). ఆవిడ దగ్గర మూరెడు పొడుగున ఒక పాత పెద్ద తోలు పర్స్  మూడు నాలుగు మడతల్లో ఉండేది.  అప్పట్లో కరెన్సీ నోట్లకన్నా  నాణేల చెలామణియే ఎక్కువుండేది.  ఆవిడ పర్స్ లో ఒక మడతలో రూపాయి నాణేలు, ఒక దాంట్లో అర్ధలు, పావలాలు, ఒక దాంట్లో బేడలు, అణాలు, మరొక మడతలో అర్ధణాలు, కాన్లు వుండేవి. వాటన్నిటితో ఆవిడ పర్స్ బరువుగానే వుండేది.  మొత్తం అంతా కలిపి  ఓ పాతిక రూపాయలుంటే ఎక్కువేనేమో.
                        1950ల నాటికి చలామణీలో ఉన్న నాణాలు

 ఒకసారి మా నాన్నగారు ఏదో ఊరు సంగీత కచేరీకి వెళ్ళి వచ్చి అక్కడి వారిచ్చిన పారితోషకపు మూటను  మా తాతగారికి ఇవ్వమని నా చేతిలో పెట్టారు. నేను మోయలేనంత బరువుంది. ఆ మూట తాళ్ళు విప్పి చూస్తే అందులో అన్నీ  జార్జ్ బొమ్మ (V or VI అనేది గుర్తులేదు) ఉన్న పెద్ద ఇచ్చు రూపాయి నాణేలు. వాటిని నేను లెఖ్ఖపెట్టగా సరిగ్గా ఏభై ఉన్నాయి. నేను మా తాతగారికి ఇవ్వగా ఆయన అమ్మీ అంటూ తన అక్కగారిని పిలిచి ఆ డబ్బు ఆవిడ చేతికిచ్చారు. తన జీతం కూడా ఆవిడకే ఇచ్చేవారు. ఇంటి యాజమాన్యం ఆవిడదే. ఆవిడ ఆ డబ్బులను ఆ మూరెడు తోలు పర్స్ లో పెట్టేది. ఆవిడను ఇంట్లోని మగాళ్ళు అత్తా అని, మా అమ్మ, పిన్ని గార్లు అమ్మన్న అని పిలిచేవారు. 


ఆనాడు రూపాయికి ఉండే విలువ ఈనాడు ఊహించలేము. ఒక రూపాయి ఒక తులం బరువుండేది. బంగారం తూచడానికి ఒక వెండి రూపాయి నాణేన్నే ఉపయోగించేవారు.

   1906నాటి వెండి రూపాయి నాణెం
నేను పుట్టడానికి ముందు ఒక రూపాయికి తులం బంగారం వచ్చేదని చెప్పుకునేవారు. కానీ ఆ రూపాయి దొరకడమే బహు దుర్లభంగా వుండేది. దీపావళి  మతాబాలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, చిచింద్రీల వంటి బాణసంచా తయారుచేసేప్పుడు వాటిలో ఉపయోగించే పదార్థాలను తూచడానికి ఈ రూపాయి నాణేన్నే ఉపయోగించేవారు.

నేను విజయనగరం లో ఉన్నప్పుడు యాచక వృత్తి వుండేది. మాతాతగారికి  మ్యూజిక్ కాలేజీ లేని రోజుల్లో వీధి వరండాలో కూర్చొని వచ్చిపోయేవారిని కుశలప్రశ్నలు వేసి పలకరించేవారు. ఒక రోజు  ఒక ముష్టివాడు ఏవో పాటలు పాడుకుంటూ ఆ వీధిలోకి వచ్చాడు. అతని పాట మా తాతగారికి నచ్చిందనుకుంటాను. అతనిని అరుగుమీద కూర్చోపెట్టి అతనిచేత పాడిస్తూ తాను అగ్గిపెట్టెమీద పాటకు తగ్గట్టు తాళం వేస్తూ ఆనందించారు. అంతా అయిపోయాక అమ్మిగారిచేత డబ్బులు ఇప్పించి పంపేరు. తానొక గొప్ప వాగ్గేయకారుడైనా, ఎటువంటి భేషజం, దర్పం లేకుండా ఒక సామాన్య యాచకుని గానాన్ని మెచ్చుకున్నారంటే ఆయన ఎంతటి విశాలహృదయం గలవాడో, నేను పెద్దయ్యాక అర్ధమయింది. 

అలాటిదే, మరో సంఘటన నేనెన్నటికీ మరువలేనిది. రోజు ఉదయాన్నే ఆరు గంటల ప్రాంతంలో మా ఇంటికి ఎదురింట్లో ఉండే ఒక ముసలి ఆయవారం బ్రాహ్మడు వచ్చి తిధి, వార, నక్షత్రాల వివరాలు చెప్పి ఇంట్లోవారిచ్చే గుప్పెడో, దోసెడో బియ్యం తన ఇత్తడి చెంబులో వేయించుకొని మరో ఇంటికి వెళ్ళేవారు. వేసేవారు వేస్తారు. లేనివారు లేదు. తిధి వార నక్షత్రాలు చెప్పి ఓ రెండు మూడు నిముషాలు చూస్తాడు. ఎవరైనా వస్తే సరే, లేకపోతే మరో గడప ఎక్కేవాడు. చూడడానికి చాలా దీనంగా అనిపించేది. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఒక కోడలు. పెద్దకొడుకు టీచర్ గా పనిచేసేవాడని గుర్తు. రెండోవాడు చదువుకుంటూ, యాచనకు వెళ్ళేవాడు. వారెవరి పేర్లు గుర్తులేవు. ఒక రోజు  మా అమ్మగారు  ఒక బేడ నా చేతిలోపెట్టి  ఒక ప్లాస్టిక్ పన్ని(దువ్వెన) ఒకటి  కొనమని చెప్పింది. ఆ డబ్బులు చొక్కా జేబులో పెట్టుకొని బజారు వేపు వెళ్ళి దారిలో ఒక పార్క్ లో  స్పీకర్ లో నుండి పాటలు వినిపిస్తూంటే అవి వింటూ అక్కడి పచ్చికలో కూర్చొని అక్కడ ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ కాలక్షేపం చేశాను . కొంతసేపు అలా గడిచాక షాపుకెళ్ళి దువ్వెన కొనడానికి బయల్దేరాను. పార్క్ బయటకు వచ్చి జేబులో చెయ్యి పెట్టి చూస్తే డబ్బులు లేవు. గుండెలు గుభేలుమన్నాయి. పరిగెత్తుకుంటూ మళ్ళీ పార్క్ లో నేను కూర్చున్న చోటికి వచ్చి చూస్తే అక్కడేమీ కనపడలేదు. ఏంచేయాలి. డబ్బులు పోయాయని ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుందని భయం. అంతటా వెతకడం మొదలెట్టాను. ఏడుపు తన్నుకొస్తోంది. ఏంచేయాలో తెలీక అక్కడే బిక్కమొహం వేసుకొని దిక్కులు చూడ్డం మొదలెట్టాను. కొంచెం చీకటి పడుతోంది. ఇంతలో, మా ఎదురింటి ఆయవారం బ్రాహ్మడి రెండో కొడుకు అటు పక్క వెళుతూ కనపడ్డాడు. నన్ను చూసి ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావని అడిగాడు. పన్ని కొనాలని వచ్చానని చెప్పాను. సరే, కొనేసావుగా, ఇంటికి పద పోదామని అన్నాడు. అప్పుడు ఏడుపు గొంతుతో జరిగింది చెప్పాను. ఇంటికెళ్తే అమ్మ తిడుతుందని భయం. అతను తన జేబులు చూసి తన దగ్గరా డబ్బులు లేవని చెప్పి. భయపడకు ఇప్పుడే వస్తాను, అక్కడే వుండమని చెప్పి ఒక పావుగంట అయ్యాక వచ్చి నా చేతిలో పన్ని పెట్టి ఇంటికి పదమన్నాడు. డబ్బుల్లేవన్నావు, పన్ని ఎలా కొన్నావని అడిగాను. అదంతా నీకెందుకు.  పన్నిని తీసుకువెళ్ళి అమ్మకు ఇవ్వు. డబ్బులు పోయిన సంగతి, నేను కొనిచ్చానన్న సంగతి ఎవరికి చెప్పద్దని మరీ మరీ చెప్పాడు. అలాగే ఇంటికి వచ్చి ఆ పన్నిని అమ్మగారి చేతికిచ్చాను. అక్కడితో ఆ సంఘటన ముగిసింది. ఈ విషయం నేను తరువాత మా అమ్మగారికి చెప్పానా లేదా పాపం! ఆ డబ్బులు ఆ ఎదురింటి కుర్రవాడికి తిరిగి ఇచ్చానా లేదా? ఆ విషయాలేవీ నాకు గుర్తులేవు. మేము ఆ ఊరొదిలి వెళ్ళాక, నాకు బాగా జ్ఞానం వచ్చాక, ఈ సంఘటన తల్చుకుంటే ఏదో తప్పు చేసిన గిల్టీనెస్ కలుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో యాచన చేసుకునే కుర్రాడి సహాయం పొందవలసి వచ్చిందే, అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా తప్పు చేసాననే  భావం ఇప్పటికీ నన్ను వదలలేదు. విజయనగరం, ఆ పార్క్ తలచుకున్నప్పుడల్లా ఆ సంఘటన గుర్తుకు వచ్చి మనసంతా వికలమౌతుంది.

నేను విజయనగరంలో ఉన్న నాలుగు సంవత్సరాలలో నాకు బాగా గుర్తుండిపోయినవి ఆటలు తప్ప స్కూల్ కు వెళ్ళి చదవడం, అక్కడి విషయాలేవీ గుర్తులేవు. అరటిచెట్ల బడిలో దసరా ఉత్సవాలప్పుడు పప్పుబెల్లాలకోసం తిరగడం. పండగలప్పుడు స్కూల్ లో పెట్టే ప్రసాదాలు తప్ప. ఏవో పండగలయ్యాక ఒక రోజు నేను స్కూలుకు వెళ్ళలేదు. మర్నాడు వెళ్ళినప్పుడు నన్ను మాత్రం టీచర్స్ రూమ్ కు తీసుకుపోయి అక్కడ నాకు ఏదో స్వీటు, పులిహోర పెట్టడం జ్ఞాపకముంది. ఆ మూడో క్లాసు మాస్టారు తెల్లటి పంచే చొక్కా వేసుకొని, భుజంమీద కండువాతో, ఒక బెత్తం పట్టుకొని వచ్చేవారు. ఆయన రామాయణ, భారత కధలను చాలా ఉత్సాహంగా రసవత్తరంగా చెప్పేవారు. పిల్లలంతా నోళ్ళు తెరుచుకొని ఆ కధలు వినేవారు. ఆయన పేరు తెలియదు. ఆ మాస్టారు మా ఇంటికి అప్పుడప్పుడు బియ్యం కొనుక్కునేందుకు వచ్చేవారు. మా ఇంట్లో బియ్యపు వ్యాపారమేమిటని సందేహం కలగవచ్చును. కలివరం నాయుడు గారి బియ్యపు బస్తాలు కొన్నాళ్ళు  విజయనగరంలో మా ఇంట వుంచి అమ్మకానికి పెట్టారు. దానిమీద వచ్చే ఆదాయం ఎవరికోసం అనే విషయం నాకు తెలియదు. ఆ బియ్యాన్ని కొనుక్కునేందుకు ఆ మాస్టారు మా ఇంటికి రెండు మూడుసార్లు రావడం గుర్తుంది. ఒక శేరో, రెండు శేర్లో ఒక గోనె సంచిలో వేయించుకొని వెళ్ళేవారు. అదెన్నాళ్ళు సాగిందో తెలియదు. బియ్యం పప్పులు కొలిచేందుకు కుంచం, అడ్డ‌, శేరు, తవ్వ, సోల, గిద్దెలు ఉపయోగించేవారు. కుంచం హైయ్యస్ట్. గిద్దె లోయస్ట్ కొలమానం. అలాగే, బెల్లం, చింతపండు వంటి ఘన పదార్థాలు తూచడానికి వీశె, మణుగు, బారువ వంటి కొలమానాలుండేవి. ఈ సిస్టమ్ అంతా 1956 లో మారిపోయింది నయాపైసలు, కిలోగ్రాములు, కిలో మీటర్ల మానాలు అమల్లోకి వచ్చాయి. 

ఇందాక  భారత, రామాయణాలంటే ఒక విషయం గుర్తుకువచ్చింది.

ఒకసారి మా ఇంట్లో అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున గట్టిగా అరుపులు, కేకలు వినిపించాయి. ఎందుకో ఏమిటో తెలియదు. మా తాతగారు, పెద్దమ్మమ్మగారు తీవ్రంగా వాదించుకుంటూ, అరుపులు వినపడ్డాయి. మాతాతగారు కోపంతో బయటకు వెళ్ళిపోయారు. ఆవిడ తన తమ్ముడిని 'మూర్ఖపు గాడిదకొడుకు' అని అనడం గుర్తు. ఆయన కోపంతో నల్లచెఱువు మెట్టలవేపో, వ్యాసనారాయణ మెట్టలకో వెళ్ళి కోపం తీరేవరకు అక్కడే కాలక్షేపం చేసి తెల్లారక నెమ్మదిగా ఇంటికి వచ్చేవారు. 'అమ్మీ! ఆలోచించి చూస్తే నువ్వు చెప్పిందే రైట్ సుమీ' అని సమాధానపడేవారు. ఇంతకూ దెబ్బలాటకు కారణం తెలిస్తే విస్తుపోతారు. గొడవలు వాళ్ళిద్దరి మధ్యాకాదు. ఏ మహాభారతం గురించో మొదలయి ఒకరు పాండవుల పక్షాన, ఒకరు కౌరవుల పక్షాన సమర్ధించుకుంటూ మాటకు మాటా పెరిగి తీవ్రరూపం దాల్చేది. ఇలాటి దెబ్బలాటలు ఆర్నెల్లకో, ఏడాదికో జరగడం పరిపాటని తరువాత పెద్దయ్యాక ఇంట్లోవారు అనుకోగా అర్ధమయింది. 

మా తాతగారు తెల్ల ఖధ్ధరు పంచెలు, తెల్ల చొక్కా, కండువా, గొడుగేసుకొని మ్యూజిక్ కాలేజీకి వెళ్ళేవారు. భోజనాల సమయానికి వచ్చేవారు. భోజనం చేసేప్పుడు కాశీ పంచె కట్టుకొని, చొక్కా లేకుండా ఒళ్ళంతా గంధం పూసుకొని నుదుట నల్లటి పెద్ద బొట్టు పెట్టుకొని భోజనానికి వచ్చేవారు. ఆయనకు కావలసిన గంధం అరగదీయడంలో, ఆ నల్లటి బొట్టు తయారుచేయడంలో మాకు చేతనైన పనులు మేము చేసేవారం. ఆ నల్లబొట్టు తయారీలో అరటిపువ్వు దొప్పలు ఉపయోగపడేవి. లేత పువ్వుల్లో ఒకరకమైన తేనెలాటిది ఉంటుంది. దానికోసం పిల్లలం ఎగబడేవాళ్ళం. పువ్వంతా రెలిచిన తరువాత, అరటిపువ్వు డొప్పలను మండుటెండలో ఎండబెట్టి వాటిని ఒక తాడులో గుచ్చేవాళ్ళం. అవసరమైనప్పుడు ఆ ఎండు డొప్పలను నల్లగా కాల్చి ఆ నుసిని ఒక భరిణలోవేసి అందులో మంచికర్పూరంపొడి, ఏదో నూనె వేసి గట్టిగా కలియబెట్టేవారు ఇంట్లోని ఆడవారు. దానిని ఆయన నుదుట అడ్డంగా గంధం రాసుకొని దానిపైన ఈ నల్లబొట్టు పెట్టుకునేవారు. ఈ కార్యక్రమం సుమారు పావుగంట పట్టేది. తరువాత భోజనాలకు కూర్చునేవారు. ముందు మగవారు, పిల్లల భోజనాలు. తరువాత ఆడవారి భోజనాలు. రెండు బ్యాచ్ లుగా అయేవి. భర్తలు లేచాక వదిలిన ఆ కంచాలలోనే ఆ ఇంటికోడళ్ళు భోజనం చేయడం ఆనవాయితి. అదేం ఆచారమో? ఈ రోజుల్లో అలాటివి ఎవరు ఆచరించరు. చెపితే, కనీసం నమ్మను కూడా నమ్మరు. కాని, ఇది నిజం. మా తాతగారికి చిన్నతనంలోనే ఆస్థ్మా వచ్చింది. ఎప్పుడూ దగ్గుతూండేవారు. ఆయనకు చుట్టకాల్చే అలవాటు ఉండేది. ఇదే అలవాటు, బహుశా, శిష్యుడైన ఘంటసాలకు అబ్బిందేమో!

పట్రాయని సీతారామశాస్త్రి గారికి బొట్టు అలవాటు విజయగరం వచ్చిన కొత్తల్లో లేదేమో. ఎందుకంటే, ఈయన, తమ తండ్రిగారి కంటే పెద్దైన శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారిని చూడడానికి వెళ్ళినప్పుడు, ఆయన ఈయనను చూసి 'ఏమిరా, పేరా సాహేబూ! నువ్వు మా నరసింహ కొడుకువి కదూ' అంటూ పలకరించారట. ఆ పేరా సాహేబ్ అనే ఆయన ఆ రోజుల్లో గొప్ప హిందుస్థానీ గాయకుడట. 
Peara Saheb (పేరా సాహెబ్)
 
ఆయన పాడిన గ్రామఫోన్ రికార్డులు బహుళ ప్రచారంలో ఉండేవి. ఆ పేరా సాహేబ్ ఫోటోలు కూడా చాలామంది కళాకారుల ఇళ్ళలో ఉండేవట. మాతాతగారికి ఆయనకు ఏవో పోలికలుండేవట. ముఖ్యంగా,  మాతాతగారు పచ్చని లుంగీ కట్టుకు తిరగడం, హార్మోనియం వాయిస్తూ పాడడం కూడా, ఆయన అలా పిలవడానికి కారణం కావచ్చు. మా తాతగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చేరడానికి ముందు, ఒక యోగ్యతా పత్రం కావలసివచ్చి నారాయణ దాసుగారిని చూసేందుకు వెళ్ళారు. దాసుగారు మా తాతగారిని చూసి "ఒరే, నీకెందుకురా ఆ బాడుఖావు ఉద్యోగం. సలక్షణంగా పాఠశాల కట్టేవు. స్వతంత్రంగా ఉన్నావు అని, నీ ప్రారబ్ధం అలా ఉంది తప్పదు' అని యోగ్యతా పత్రం రాసి ఇచ్చేరట. పక్కనున్నవాళ్ళతో అన్నారట 'ఆ హార్మోనియం లేదూ అదొక కొయ్య. దానిలోంచి అమృతం పిండుతాడు వీడు' అని. (శ్రీ పట్రాయని సంగీతరావు గారి - 'చింతాసక్తి' నుండి). హార్మోనియం విషయంలో ఆ తండ్రిగారి వారసత్వమే శ్రీ సంగీతరావు గారికీ సంక్రమించి వుండవచ్చును. నాకు ఆనాడు ఆ సంగీతపు విలువలు తెలియదు. ఆ వ్యక్తుల ఔన్నత్యం అర్ధమయే వయసుకాదు.

మా తాతగారికి నడుము నొప్పులు, కాళ్ళనొప్పులు వుండేవనుకుంటాను. ఆయన మంచంమీద బోరిగిళ్ళా పడుకొనివుంటే నేను, మా ప్రసాద్ ఇద్దరం గోడ ఆసరాతో ఆయన కాళ్ళమీద, నడుము మీద నిలబడి నెమ్మదిగా తొక్కేవాళ్ళం. ఆయనకు ఆ సేవ చేయడానికి మేమిద్దరం కాట్లాడుకునేవాళ్ళం. అది తల్చుకున్నప్పుడల్లా పరమానందయ్య శిష్యుల కధలో నాగయ్యగారి పాట్లే గుర్తుకు వస్తాయి.

మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు వారి పెద్దమ్మాయి జ్యోతిర్మయి పుట్టిన కొన్ని నెలలకు సంగీత పాఠాలు చెప్పడానికి తన నివాసం విశాఖపట్నానికి మార్చారు. మా సీత పిన్ని, చెల్లి మా తాతగారితోనే వుండేవారు. మా తాతగారింట్లో ఎప్పుడూ బంధు, మిత్రుల రాకతో కళకళలాడుతూ వుండేది. ఇంట్లో ముగ్గురు కోడళ్ళు. వాళ్ళ పుట్టింటినుండి అన్నదమ్ములో, అక్కచెల్లెళ్ళో ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవారు. వైద్యంకోసం విజయనగరం వచ్చే బంధువులు కూడా మా తాతగారింటికి వచ్చేవారు. కుటుంబం పెద్దదవుతూవుంది. ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రం. కళాకారులకు పేరు వచ్చినంతగా ఆదాయం వచ్చేది కాదు. 'బయట పల్లకీలమోత, ఇంట్లో ఈగలమోత' అనే సామెత సంగీతంవాళ్ళకే వర్తిస్తుంది.
 
ఇంట్లోని పిల్లలకెప్పుడూ అనారోగ్యాలు, దగ్గులు, జ్వరాలు. అప్పట్లో మలేరియా జ్వరాలతోపాటు 'కోరింత' దగ్గు అని ఒకటి వచ్చి పిల్లలను బాగా ఇబ్బంది పెట్టేది. ఆ కోరింత దగ్గు వస్తే మాత్రం ఒక పట్టాన వదిలేదికాదు. కనీసం మూడుమాసాలైనా పడుతుంది తగ్గడానికి. ఇలాటి పరిస్థితులలో మా చెల్లెలు రమణమ్మ నెలలపిల్ల. పెరట్లో ఉసిరిచెట్టుక్రింద చాపమీద పడుక్కోపెట్టారు. నిద్రలో దొర్లుకుంటూ పోయి పక్కనున్న చిన్న రాతికాలువలో పడి అక్కడున్న సూదైన రాయి తలవెనక తగిలి బాగా రక్తంకారడం మొదలయింది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ గా మా కమల పిన్నిగారు (ప్రసాద్ తల్లి)  పంచదార, పసుపులాటివేవో అద్ది కట్టుకట్టారు. తరువాత, సుసర్ల వెంకట్రావు గారి హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా ఆయన చూసి తలవెనుక మూడు కుట్లు వేశారు. కొన్నాళ్ళకు గాయంమానింది. మచ్చ ఉండిపోయింది. 

ఏ కారణం చేతనో నా ప్రాధమిక చదువు సక్రమంగా సాగలేదు. ఇంట్లోనే చదివించి, తరువాత సంవత్సరం ఆరోక్లాసులో బ్రాంచ్ కాలేజీ లో చేర్పించడానికి ఏర్పాట్లు చేశారు. మా ఇంటికి కొంచెం దూరంలో, ఇస్మైల్ కాలని అని గుర్తు. ఆ వీధిలో  పప్పు అప్పలనరసింహంగారని మా నాన్నగారికో, తాతగారికో మిత్రులు. ఉపాధ్యాయులు. ఆయన దగ్గరకు ప్రైవేటుకు పంపారు. ఆయన ఏంచెప్పారో, నేను ఎన్నాళ్ళు,  ఏం నేర్చుకున్నానో నాకైతే తెలియదు. నేను చదువు విషయంలో ఎప్పుడూ అంతంత మాత్రంగానే వుండేవాడిని. కొంచెం వయసు వస్తే సరిపోతుందని అనేవారు. కానీ, ఏమీ సరికాలేదు. గ్రాహ్యశక్తి తక్కువ కావడం వలన స్కూల్ పాఠాలు అర్ధమైనట్లే వుండేవి కాని అవి పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి పనికివచ్చేవి కాదు. ఇంట్లో మా ప్రభూ చిన్నాన్నగారు మా ఇద్దరిని కూర్చోబెట్టి చదివించేవారు. ఒకసారి ఆయన కూడికలు, తీసివేతలు లెఖ్ఖలు ఇచ్చారు వాటిలో నూటికి తొంభై రెండు మార్కులు వచ్చాయి.  నా చదువు జీవితంలో అదో నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నంత ఘనత. అదే ఫస్ట్ ఎండ్ లాస్ట్. ఆ తరువాత అందులో సగం మార్కులే నా హైయ్యస్ట్ ర్యాంక్. ఇందుకు, నా పనికిరాని సినీమా పరిజ్ఞానమే కారణమని అనేవారు. ఆటలమీదున్న శ్రధ్ధ చదువుమీద ఉండేది కాదు. మా ప్రసాద్ నాకంటే రెండేళ్ళు చిన్న. నాకు పసుపురంగులో, నీలం కలర్ లో రెండు బుష్ కోట్లు ఉండేవి. వాటికి కాంట్రాస్ట్ కలర్స్ లో బటన్లు. వేసవికాలమైనా అవే వేసుకు తిరిగేవాడిని. నేను కొంచెం బొద్దుగా ఉండేవాడిని, ప్రసాద్ చాలా సన్నగా, వాళ్ళ నాన్నగారిలానే ఉండేవాడు. నాకు బాగా టైట్ అయిపోయిన బట్టలు వాడికి తొడిగితే చాలు. మా ఇద్దరి మధ్యా రామరావణ యుధ్ధమే. మా పిన్నిగారు వచ్చి కోపంగా గుడ్లురిమి చూస్తే చాలు పరుగో పరుగు. ఒక సారి వీధులన్ని చెక్కరకొట్టి మెల్లగా ఇంట్లోకి దూరేవాడిని. ఎప్పుడో తప్ప నేనూ ప్రసాద్ చాలా స్నేహంగానే ఉండేవాళ్ళం.

ఒకసారి మా నాన్నగారు మెడ్రాస్ నుంచి వస్తూ రెండు కీ బస్సులు, రెండు పేము కలర్ స్టిక్స్ తెచ్చారు. ఆ బస్సులు ఒకటి నీలం, ఒకటి ఆకుపచ్చ. చెరొకటి ఇచ్చారు. అంతవరకూ బాగే. వాటితో ఆడేప్పుడే తంటా. నా దగ్గరున్నది వాడికి నచ్చేది. వాడి దగ్గరున్నది నాదైతే బాగుండునని నాకుండేది. అందుకోసం పోట్లాట. మా నాన్నగారు తెచ్చిన స్టిక్స్ తో ఫైటింగ్. అప్పటికి ఎన్ టి రామారావు, నాగేశ్వరరావు జానపద సినీమాలు చూస్తుండడం వలన ఇంట్లో ఆ యుధ్ధాలు మొదలెట్టేవాళ్ళం. నేను ఎన్ టి రామారావును. వాడు నాగేశ్వరరావు. ఆ ఎన్ టి రామారావు పోస్ట్ కోసం ఇద్దరం ఫైటింగ్. నువ్వు సన్నగా నాగేశ్వరరావులా ఉంటావు. అందుచేత నువ్వే నాగేశ్వరరావు, నేను ఎన్ టి రామారావు అని నేను, ఎప్పుడూ నువ్వే ఎన్  టి రామారావు అంటావు‌ ఇవేళ నేనే ఎన్ టి రామారావుని అని మా ప్రసాద్ ఇలా ఇద్దరం  కీచులాడుకునేవాళ్ళం. అదెప్పటికీ తేలేదికాదు. ఈలోగా చేతిలోని స్టిక్స్ వాడికి తగలడమో, నాకు తగలడమో జరిగేది. ఏడుపులు లంకించుకునే సమయంలో మా అమ్మో, వాళ్ళ అమ్మో ఎంట్రీ ఇచ్చి ఆ స్టిక్స్ మా చేతిలోంచి లాక్కొనేవారు. అప్పటికా ఫైటింగ్ సీన్ ముగిసేది. ఇలావుండగా, ఒకసారి మా నాన్నగారు సాలూరు వెళుతూ నన్నూ తీసుకువెళ్ళారు. అంతవరకు కలివరం, విజయనగరం, బొబ్బిలి పేర్లు మాత్రమే తెలుసుకున్న నేను సాలూరు అనే మరో ఊరిపేరు తెలుసుకున్నాను. 

ఆ విశేషాలన్నీ వచ్చేవారం.....(సశేషం)
                                                         -   ప్రణవ స్వరాట్,

Friday, August 7, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదకొండవ భాగం

07.08.20 - శుక్రవారం భాగం - 11 :
పదవ భాగం ఇక్కడ

నెం.35 ఉస్మాన్ రోడ్

                                                          - ప్రణవ స్వరాట్

బాలరాజు, కీలుగుఱ్ఱం, లైలామజ్ను, మనదేశం, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు, సినీమాలతో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా తెలిసింది. విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్న వ్యక్తి మెడ్రాస్ వెళ్ళి సినీమాలలో స్థిరపడి పేరు తెచ్చుకోవడం ఆ వూరి వారందరికీ గర్వకారణంగా వుండేది.  విజయనగర ప్రాంతాలకు చెందిన రావి కొండలరావు, జెవి రమణమూర్తి వంటి నటులకు, ఏవిఎన్ మూర్తి వంటి గాయకులకు సినీమాలలో చేరడానికి ఘంటసాల ఒక స్ఫూర్తిగా నిలిచారు.

అప్పట్లో, జెవి రమణమూర్తి తయారు చేసిన 'విశ్వశాంతి' అనే నాటకానికి మా నాన్నగారు- సంగీతరావు గారు  సంగీతం సమకూర్చారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో ఆ నాటకానికి ఉత్తమ బహుమతి లభించింది.  కన్యాశుల్కంలోని గీరీశం పాత్ర రమణమూర్తి గారికి పేటెంట్. 
కన్యాశుల్కం నాటకాన్ని దేశవ్యాప్తంగా కొన్ని వందల ప్రదర్శనలిచ్చారు. తరువాత,  కెబి తిలక్ ఆయనను ఎమ్ఎల్ ఏ సినీమాలో హీరోగా పరిచయం చేయడం మీ అందరికీ తెలిసినదే. 'శంకరాభరణం' సోమయాజులు గారు రమణమూర్తి సోదరుడే. ఆయనా మంచి రంగస్థలనటులు. చాలా లేటుగా సినీమాల్లోకి వచ్చారు.  ఉత్తరాంధ్రాకు చెందిన పింగళి వారు, ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్యగారు అప్పటికే మద్రాసు చేరారు.

మా ఇంటికి ఎదురింట్లోనే గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీ ఏవిఎన్ మూర్తి కుటుంబం వుండేది. అప్పటికి ఆయన చిన్నవాడే. తరువాత సంగీతం నేర్చుకొని మద్రాసు వెళ్ళారు.

                                     శ్రీ ఏ.వి.ఎన్. మూర్తి
 ఆయన తమ్ముడు గోపాలరావ్, సర్వి అనే సర్వేశ్వరరావు, మంత్రిప్రగడ నాగభూషణం, వేలమూరి రామారావు, నా వయసువారు. అందరం కలసి ఆటలాడేవాళ్ళం. మల్లాప్రగడ, కందాళం, వడ్లమాని, నేమాని వంటి కుటుంబాలు ఆ గెడ్డ వీధిలోనే ఉండేవి.

ఘంటసాలవారు మా ఇంటికి వస్తారన్న వార్త అందరికీ తెలిసింది. ఒక్కొక్కరుగా వచ్చి ఎప్పుడొస్తారు, ఎన్నాళ్ళుంటారని మావాళ్ళను అడగడం మొదలుపెట్టారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గురువుగారి శిష్యుడన్న విషయం వారికి తెలుసు. 

ఈ హడావుడి మా తాతగారికి కంగారు పుట్టించింది. మర్నాడు, ఘంటసాల వచ్చేప్పటికి వీధిలో వారంతా ఇంటికి వచ్చేస్తే సంబాళించడమెలా, వచ్చే అతిధులకు ఇబ్బందికరంగా తయారౌతుందేమోనని భయం. అదీకాక చాలా పసిపిల్లలున్న ఇంట్లో వచ్చే వారికి తగిన మర్యాదలు చేయడం కష్టమనే భావన. ఇవన్నీ ఆలోచించి ఘంటసాల కుటుంబాన్ని కొంతసేపు వుంచుకొని తరువాత, తమ మిత్రులైన వసంతరావు బ్రహ్మాజీరావుగారింట్లో దింపుదామనే నిర్ణయానికొచ్చారు. బ్రహ్మాజీరావుగారి తమ్ముడు వసంతరావు వెంకట్రావుగారు  ఎమ్ ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా వుండేవారు. వారంతా మా తాతగారికి అతి సన్నిహితులు.
1951లో ఘంటసాలవారు మెడ్రాస్ లో స్వంతంగా ఒక మేడను కొనుగోలు చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఆ సందర్భంగా గురువుగారిని మెడ్రాసు రప్పించి సగౌరవంగా సత్కరించారు. ఆ రోజు సాయంత్రం గురువుగారు, మా తాతగారైన పట్రాయని సీతారామశాస్త్రిగారి సంగీతకచేరీ కూడా ఏర్పాటు చేశారు. శిష్యుడు సాధిస్తున్న ప్రగతికి గురువుగారెంతో సంబరపడ్డారు.





అటువంటి శిష్యుడు కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడం సంతోషకరమే అయినా  కనీసం కరెంట్ వసతి కూడా లేని ఆ ఇంటిలో వారు ఎలా గడపగలరు అనేది ఆయన చింత. అందుకే సకల వసతులు గల తమ మిత్రుల ఇంటిలో బస ఏర్పాట్లు చేశారు.

అనుకున్నట్లుగానే మర్నాడు ఉదయం ఒక కారులో అతిధులు వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారో గుర్తులేదు‌, కానీ ఒక మగ, ఇద్దరు ఆడ, ఓ చిన్న బాబు మాత్రం బాగా గుర్తుండిపోయింది. వచ్చినాయన తెల్లటి చొక్కా, అరవ్వాళ గుండారు కట్టుకొని ఉన్నారు. వచ్చినావిడ చాలా తెల్లగా పొడుగ్గా కనిపించారు. వాళ్ళ బాబుకు రెండేళ్ళుంటాయేమో. ఆవిడను మా ఇంట్లో వాళ్ళందరికీ 'నా వైఫ్ సావిత్రి' అని చెప్పారు. ఆవిడ అందరితో కలుపుగోలుగా మాట్లాడారు. మరొక పెద్దావిడ ఆయన తల్లిగారట. 

(ఘంటసాలగారి తల్లిగారు రత్తమ్మగారు)
ఆ వచ్చినాయన పేరే ఘంటసాల అని తెలిసింది. వారిని చూచేందుకు నాకు తెలియని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి పలకరించడం ఆయన సమాధానాలు చెపుతూ మాట్లాడడం జరిగింది.ఇల్లంతా కోలాహలంగా వుండడం పిల్లలమైన మాకు మంచి ఉత్సాహంగా అనిపించింది. ఘంటసాలగారు మధ్య మధ్యలో "రాజీ! అని పిలవడం, "ఓయ్ అని ఆ సావిత్రి గారు రావడం వింతగా అనిపించింది. ఆవిడ పేరు  సావిత్రి అన్నారే, ఇప్పుడు రాజీ అని పిలుస్తున్నారే. ఆవిడకు రెండు పేర్లా ? అని నాకు సందేహం.  అందరి మాటలు వింటూ ఇంట్లో ఒక ఓరగా నిలబడి వింతగా చూస్తూండిపోయాను. ఘంటసాల గారు ఏవో పాటలు పాడిన గుర్తు. ఆ పాటలకు తగినట్లు బొద్దుగా ఉన్న వారి బాబు కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆడడం గుర్తుంది. మంచి లయజ్ఞానం ఉందని మాపెద్దవాళ్ళు ముచ్చట పడ్డారు. ఆ బాబు పేరు విజయకుమార్ అని చెప్పారు.

(ఘంటసాల విజయకుమార్)
ఘంటసాలగారు విజయా సంస్థలో ఆస్థాన సంగీత దర్శకుడిగా కాంట్రాక్టు జరిగిన మరుసటి సంవత్సరం ఈ బాబు పుట్టాడు. విజయాతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని ఈ బాబుకు ' విజయ' కలిసేలా పేరు పెట్టమని విజయా అధినేత బి.నాగిరెడ్డిగారు సూచించారట. ఆయన కోరిక మేరకు వారి బాబుకు విజయకుమార్ అని పేరు పెట్టడం జరిగిందని తరువాత కాలంలో తెలుసుకున్నాను. ఆ అతిధుల మాటలు, చేష్టలు కొన్ని నాకు బాగా కొత్త . మా పెరట్లో రాచ ఉసిరి, జామి, కొబ్బరి, పత్తి వంటి చెట్లతో చాలా చల్లగా ఉండేది. ఆ సావిత్రి గారికి చాలా ఒత్తైన, పొడుగాటి తలకట్టు ఉండేది. జడవేసుకోవడానికి మావాళ్ళు  పన్ని ఇవ్వబోతే ఆవిడ తన దువ్వెనతో తల దువ్వుకోవడం గుర్తుండిపోయింది. మా ప్రాంతాలలో దువ్వెనను పన్ని అంటారు. మాఇంట్లో పన్నిలు చిన్నవి. కానీ ఆవిడ దగ్గరున్న రంగుదువ్వెన చాలా పొడుగు. తల దువ్వుకుంటూ ఆ దువ్వెనను ఆవిడ తల మధ్యలో పెట్టుకొని మరింకే పనులో చేయడం నాకు ఒకటే ఆశ్చర్యం. మా ఇంటిలో అప్పటికి చూడనివి.

ఇలా కొన్ని గంటలు గడిపాక, వారందరూ బయటకు వెళ్ళారు. మా తాతగారూ, నాన్నగారితో నేనూ వెళ్ళడం జరిగింది. మాతో పాటూ ఆ వూళ్ళోనే ఇంటర్మీడియట్ చదువుతున్న మా నాన్నగారి కజిన్ గుమ్మా మార్కండేయ శర్మ కూడా ఉన్నారు. శర్మ బాబుగా చిరపరిచితుడైన ఆయన పాటలు, పద్యాలు బాగా పాడేవాడు.

ముందుగా, వసంతరావు బ్రహ్మాజీరావు గారింటికి వెళ్ళాము. వారిల్లు చాలా పెద్దిల్లు. ఇల్లాంతా ఎలక్ట్రిక్ దీపాలున్నాయి. నీళ్ళకొళాయిలున్నాయి. వరండాలు,హాల్స్ లో పెద్ద పెద్ద స్థంభాలు, పైనుండి క్రిందికి వేలాడుతూ రంగు రంగుల అద్దాల లైట్ డూమ్స్. ఏ కాలానివో. వాటిలో దీపాలు వెలిగించేవారో లేదో తెలియదు. బ్రహ్మాజీరావు గారి భార్య పేరు రాధమ్మగారు. ఆ దంపతులిద్దరికీ మా తాతగారన్నా, ఆయన పాటన్నా చాలా ఇష్టం. వసంతరావు వెంకట్రావు గారిని కూడా అనేక సార్లు చూశాను. వారంతా ఘంటసాల వారి రాక పట్ల చాలా సంతోషం పొందారు. మాటలు, పాటలు పద్యాల మధ్య మద్యాహ్నపు విందు వారింట్లోనే జరిగింది. 

గురువుగారు తమను ఆ రాత్రికి కూడా బ్రహ్మాజీరావు గారింటనే ఉంచదల్చుకున్నారనే వార్త ఘంటసాలగారికి తెలిసింది. ఆ నిర్ణయానికి ఒప్పుకోలేదు. ఆయన మాతాతగారితోనూ,  వారి కుటుంబ సభ్యులతో గడపడం కోసమే వచ్చామని  అందుచేత వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని రాత్రంతా గురువుగారింట్లోనే ఉంటామని పట్టుపట్టారు. అలాగే చేశారు. మార్గమధ్యంలో మ్యుజిక్ కాలేజి, ఎమ్ ఆర్ కాలేజి, సంస్కృత కాలేజి, ఆయనకు తెలిసిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ, ఒకసారి అయ్యకోనేరు గట్టుమీద ఉన్న గుమ్చీ ప్రాంతంలో ఆగి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అక్కడనుండి, విద్యార్ధి దశలో తనకు ఆకలి సమస్య తీర్చి నిశ్చింతగా సంగీతం నేర్చుకుందుకు దోహదపడిన సింహాచలం దేవస్థానం అన్నసత్రం లోపలికి కూడా వెళ్ళాము. అప్పటికి చీకటి పడింది. అక్కడి భోజనశాలలో కొంతమంది విద్యార్థులు బారులు తీరి భోజనాలు చేస్తున్నారు. అందులో చాలామందికి వచ్చినవారి గురించి ఏమీ తెలియక వింతగా చూశారు. ఘంటసాలగారు ఆ పరిసరాలన్ని తనకు బాగా తెలిసినవే అన్నట్లుగా అన్ని చోట్లకు వెళ్ళి చూశారు. చీకటిగా చిరు దీపాల వెలుగుతో ఉన్న వంటశాలలోకి కూడా వెళ్ళి అక్కడవారితో సరదాగా మాట్లాడారు. మనిషి ఎంత స్థితిమంతుడైనా గతం మరువకూడదనే దానికి నిదర్శనంగా ఘంటసాలగారు నిలుస్తారు. ఆ రాత్రి భోజనాలు మా ఇంట్లోనే జరిగాయి. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఇంట్లో మనిషిలాగే గడిపారు. ఘంటసాలగారు సావిత్రమ్మగారిని మా పెద్దమ్మమ్మగారి వద్దకు తీసుకెళ్ళి "అమ్మగారూ! మీ చేతివంట తిని ఎన్నేళ్ళయిపోయిందో. మీరు చేసే సద్ది కోసమే వచ్చాన"ని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో పులిహోరను 'సద్ది' అని అంటారు. అదెలా చేస్తారో అమ్మగారిని అడిగి నేర్చుకోమని సావిత్రిగారికి చెప్పారు. 

ఘంటసాలగారు తమ మద్రాస్ జీవితంలో అంతకన్నా రుచికరమైన, ఖరీదైన వంటకాలన్నో రుచి చూచి వుండవచ్చును. కాని,గతంలో తనకు అన్నం పెట్టి ఆదరించిన ఒక తల్లి పట్ల తనకుగల ప్రేమాభిమానాలను, కృతజ్ఞతను  వ్యక్తపర్చడానికి అన్న మాటలుగా నేను భావిస్తాను. కరెంట్ దీపాలు లేని ఆ ఇంట్లో హరికెన్ లాంతర్ల వెలుగులో సరదాగా కబుర్లు చెపుతూ భోజనాలు ముగించారు.

మర్నాడు ఉదయం మద్రాస్ ప్రయాణం.

రైలు ఎక్కడానికి ముందు తమ ఇంటికి వచ్చి వెళ్ళవలసిందేనని మా నాన్నగారి స్నేహితుడు శ్రీ ద్వివేదుల నరసింగరావుగారు, వారి భార్య విశాలాక్షిగారు బలవంతం చేసి వారింటికి తీసుకువెళ్ళారు.
(2001 - విశాఖపట్నంలో శ్రీ డి ఎన్ రావుగారు, విశాలాక్షిగారు)

 విశాలాక్షిగారు అప్పటికి రచనా వ్యాసాంగం మొదలుపెట్టలేదు. ఆవిడ ఆంధ్రా మెట్రిక్ పాసయ్యారు. నరసింగరావుగారు మహారాజావారి కాలేజీలో లెక్చెరర్. మా నాన్నగారు మద్రాసు వెళ్ళడానికి ముఖ్య ప్రేరణ ఆ నరసింగరావుగారే.  వారికి ఒక అబ్బాయి శ్రీనాధ్. నాకంటే ఓ రెండేళ్ళు పెద్ద కావచ్చు. తరువాత అమ్మాయి ఛాయ. నాకంటే కొంచెం చిన్నది. ఆ అమ్మాయికి మా ప్రభూ చిన్నాన్నగారు కొన్నాళ్ళు వైలిన్ నేర్పారు. తరువాతి కాలంలో శ్రీ నరసింగరావుగారు విజయనగరం మహారాజావారి స్కాలర్ షిప్ తో అమెరికాలో విస్కన్సిన్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ విభాగంలో పి హెచ్ డి చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ విశేషాలన్నీ రానున్న భాగాలలో చూద్దాము.

అలా ద్వివేదుల వారింటి ఆతిధ్యం పొంది ఘంటసాలవారు తమ కుటుంబంతో సంతోషంగా  మద్రాస్ మెయిల్ ఎక్కారు.

వచ్చేవారం మరిన్ని విశేషాలు. అంతవరకూ....
                      సశేషం

Friday, July 31, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - (పదవ భాగం)

31.07.20 - శుక్రవారం భాగం: 10*
 తొమ్మిదవ భాగం ఇక్కడ





ముందుగా శ్రీ రావి కొండలరావుగారికి స్మృత్యంజలి

సన్మిత్రుడు శ్రీ రావి కొండలరావు గారి మరణం నాకెంతో విచారాన్ని, ఆవేదనను కలిగించింది. మా ఇద్దరికీ మూడు దశాబ్దాల అనుబంధం ఉన్నది. సినీ కళాకారుడిగా ఆయన గురించి తెలిసినది తక్కువే. వాణీమహల్ లో ఆయన నాటకం 'పట్టాలు తప్పిన బండి' చూశాక ఆయనంటే ఒక గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. కానీ, మా మైత్రికి మూలం మద్రాస్ తెలుగు అకాడెమి. 
1980 ల నుండి ఆయన ఆ సంస్థలో గౌరవ కార్యదర్శి. నేను సహ కార్యదర్శిని.  కొండలరావు గారు శ్రీ టివికె శాస్త్రిగారికి బాల్య మిత్రుడు. "ఒరే అంటే ఒరే" అని పలకరించుకునేంత మైత్రి.  మేము ముగ్గురం మద్రాసు తెలుగు అకాడెమీ ద్వారా ఎన్నో అపురూపమైన , అపూర్వమైన సాంస్కృతికోత్సవాలు రూపొందించాము. మా ఇద్దరి మధ్యా పదమూడేళ్ళ వయసు వ్యత్యాసం ఉంది. కానీ ఆయన చాలా ప్రేమతో సోదరుడిలా చూసుకునేవారు. 
తరుచూ, శాస్త్రిగారి ఇంటిదగ్గర (అదే ఆఫీసు, అదే ఇల్లు) కలిసేవాళ్ళం.  అవసరం పడితే కొండలరావుగారి అభిరామపురం ఇంట్లో గంటల తరబడి పనిచేసేవాళ్ళం. నాకు నటన, నాటకం గురించి ఏమీ తెలియకపోయినా  మా వేదిక మీద జరిగిన ఒక స్కిట్ లో నన్నూ ఇరికించి విడియోలో కనపడేలా చేశారు. 
ఆయన హైదరాబాద్ మకాం మార్చినా, మా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వచ్చి కార్యదర్శిగా తన బాధ్యతలు నిర్వహించేవారు. 
కొండలరావు గారు, రాధాకుమారి  టి నగర్ లో ఒక చిన్న అద్దె ఇంటిలో ఉన్నప్పటినుండి ఎరికే. వారి అన్నగారు రావి చలంగారు, తమ్ముడు ధర్మారావుగారు. అందరూ ఉన్నతశ్రేణి నటులే. వారి కుటుంబ సభ్యులందరూ కలసి శ్రీ రావి చలంగారి నిర్వహణలో  నటించిన "చుట్టం కొంప ముంచాడు"  మా వేదిక మీద ప్రదర్శించడం మరువలేని విషయం. చాలా గొప్ప సందేశమున్న నాటకం. 
శ్రీ రావికొండలరావుగారిని విజయనగరంలో  2008 ఉత్సవాల తర్వాత, ఒకటి రెండుసార్లు మద్రాస్ లో శాస్త్రిగారింట్లో చూశాను. స్వయంగా కలుసుకోకపోయినా ఫోన్ల ద్వారా ముచ్చటించుకోవడం ఉండేది. గత కొన్నేళ్ళుగా శారీరక అస్వస్తతతో ఉంటున్నా హైదరాబాద్ లో ఒంటరిగానే ఉంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది  ఆయన జన్మదినోత్సవం అయాక ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆరోగ్యం కోలుకుంటున్నదనే చెప్పారు.
ఇంతలోనే ఈ విషాదవార్త వినరావడం చాలా విచారకరం. 
వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను.

---

భాగం: 10

ఉన్న తావున ప్రశాంతంగా నిలువనీయక చదరంగంలో పావులను కదిపినట్లు, కదిపి, ఒక్కోసారి కుదిపి మనిషి జీవితంతో ఆడుకోవడం దేవుడనేవాడికి ఒక సరదా. 

ఏదో కలివరంలో జీవితం ప్రశాంతంగా జరిగిపోతోందనుకునే సమయంలో మళ్ళీ మా నాన్నగారికి స్థాన చలనం తప్పలేదు. గురువుగారిని దర్శించుకునేందుకు ఘంటసాలవారు విజయనగరం వెళ్ళిన సమయానికి  వారక్కడ లేరు. కలివరంలో ఉన్నరని తెలిసి చూడడానికి అక్కడికే వెళ్ళారు. కూడా ఆయనతో  అప్పట్లో సహాయకుడిగా ఉన్న వీణ రంగారావు (మారెళ్ళ), కూడా ఉన్నారు. ఆ సందర్భంలో గురువుగారితో మట్లాడుతూ తన సినీమా వృత్తి గురించి, మద్రాస్ లో సంగీతజ్ఞులకు ఉండే అవకాశాలను గురించి చెపుతూ సంగీతరావు గారిని మద్రాస్ పంపితే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ తండ్రీ కొడుకులు ఈ విషయంలో వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. కారణం, సినీమాల పట్ల అయిష్టత ఒక కారణమైతే, తన వ్యక్తిత్వానికి తగిన రంగం కాదనే భావన కూడా కావచ్చు. మరి కొన్నేళ్ళు అక్కడే గడిపారు.  (ఈ విషయాలు గతంలో ముచ్చటించడం జరిగింది).

మా నాన్నగారు కలివరం వదలిపెట్టడానికి కారణం ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఆ ఊళ్ళో ఉన్నప్పుడు పుట్టిన ముగ్గురు పిల్లలు,  రెండు మూడేళ్ళ వయసులో పోవడం ఒక కారణమేమోనని నా భావన. నాకంటే పైన ఒక పిల్లవాడు. మా తాతగారి పేరు కలిసొచ్చేలా 'సీతారామ్' అని పెట్టారట. ఎన్నేళ్ళున్నాడో నాకు తెలియదు. తరువాత  రెండవ వాడిగా నేను పుట్టాను.  మా నాన్నగారికి సంగీతంతో పాటు సాహిత్యం, వేదాంత గ్రంధాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి విషయాల మీద మంచి ఆసక్తి, పట్టు ఉండేవి. వెతికి వెతికి నాకు ఉపనిషత్తులు లోనుండి  'ప్రణవస్వరాట్' అనే పేరు పెట్టారు. 'ప్రణవం' అంటే ఓంకారం, నాదమనే అర్ధం వుంది. 'స్వరాట్' అంటే ఇంద్రుడు, అధిపతి అనే అర్ధాలున్నాయట. ఆయన ఉద్దేశంలో సంగీత విద్యలో ఇంద్రుడంతటి వాడిని కావాలనేమో! కుటుంబ వారసత్వపు వాసనల వలన  నేను మంచి సంగీతాన్ని, ఎవరు పాడినా విని ఆనందించగల స్థితిలో ఉన్నాను.

నా తర్వాత, మరొక బాబు.  భగవద్గీత మీద వుండే భక్తితో అతనికి 'గీతాకృష్ణ' అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు నాకు జ్ఞానం రాకుండానే పోయాడు. తర్వాత, మరో ఆడపిల్ల 'సుమన' అని పేరు. ఆ పాప విషయంలో ఉండీ లేనట్లుగా  ఏవో కొన్ని జ్ఞాపకాలు.  ఒకసారి ప్రమాదవశాత్తు మండుతున్న కుంపట్లో వ్రేళ్ళు పెట్టి ఏడవడం బాగా గుర్తుండిపోయింది. సైబాల్ పూయడం గుర్తుంది. ఎఱ్ఱ రంగు సైబాల్ డబ్బా,  అదే రంగులో, అదే సైజులో ఇప్పటికీ చూస్తున్నాను. ఏం అనారోగ్యమో తెలియదు మూడేళ్ళలోపే పోయిందనుకుంటాను. 

కలివరంలో జరిగిన ఈ సంఘటనలు మా నాన్నగారి మీద, అమ్మగారి మీదా ప్రభావం చూపాయేమో! తెలియదు. మొత్తానికి 1951 లో మా నాన్నగారు కలివరం వదలిపెట్టి విజయనగరంలో  మా తాతగారింటికి నివాసం మార్చేశారు. కలివరం వదలి వెళ్ళిపోయినా శ్రీ గంగుల అప్పలనాయుడు గారి కుటుంబంతో మైత్రి కొనసాగుతూనే ఉంది. ఈ ముగ్గురు పిల్లల తరువాత మరెవరికీ ఆసక్తితో పేర్లు ఎంచి పెట్టడం జరగలేదు. అందరూ ఉండి ఉంటే సంగీతరావు గారికి నవరత్నాల్లాటి పిల్లలు (నలుగురు మగ + ఐదుగురు ఆడపిల్లలు) అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఐదుగురున్నాము పిల్లా పాపలతో. 

నాకు అక్షరాభ్యాసంలాటిది కలివరంలోనే జరిగిన గుర్తు. మానాన్నగారు ఒకసారి విజయనగరం నుంచే అనుకుంటాను తెలుగు వాచకం బొమ్మల పుస్తకం తెచ్చారు. అందులో అక్షరాలతో పాటు అల, వల, తల, వంటి మాటలు బొమ్మలుండేవి. మా నాన్నగారికి ఒక కాలంలో కారాకిళ్ళీలు(బాబా జరదా), సిగరెట్లు అలవాటు బాగా ఉండేది. బెర్కిలీ సిగరెట్లు ఆయన మొదటి బ్రాండ్. తరువాత, సిజర్స్ . ఈ సిగరెట్లు రంగు రంగు పెట్టెల్లో వచ్చేవి. వాచీమార్క్, పాసింగ్ షో, ఛార్మీనారు, బెర్కిలీ, సిజర్స్, మొదలైనవి. ఈ ఖాళీ సిగరెట్ పెట్టెలు పిల్లలకు ఎంత అవసరమో నాకు బొబ్బిలి లో తెలిసింది. ఆ విషయాలు తరువాత. ఇవికాక,కరీం బీడీ, గుఱ్ఱం మార్క్ బీడీలు కట్టలు కట్టలుగా  అమ్మేవారు. ఇక, 555 సిగరెట్లు, స్పెన్సర్ చుట్టలు ధనవంతుల బ్రాండ్లు. అట్టపెట్టెల్లో కాకుండా టిన్ డబ్బాల్లో వచ్చేవి. ఆ ఖాళీ డబ్బాలను మొన్నమొన్నటి వరకు ఇళ్ళలో బియ్యం, పప్పులు  కొలుచుకునేందుకు ఉపయోగించేవారు. వాటిని చూడడం మెడ్రాస్ వచ్చేకే. మద్రాస్ ను మెడ్రాస్ అనడం ఒక డాబుగావుండేది.  

కలివరంలో ఈ కారాకిళ్ళీలకు సంబంధించిన  ఒక సంఘటన. మా నాన్నగారు కారాకిళ్లిలతో పాటూ మీఠా కిళ్ళీలు ఇంటికి తెచ్చేవారు. అవి నేనూ నమిలేవాడిని. ఒకసారి తెలియక మీఠాకిళ్ళీకి బదులు ఆ కారాకిళ్ళి నోట్లో పెట్టుకొని నమిలేశాను. ఇంక అంతే సంగతులు. కిళ్ళీలోని కారా మసాలల ఘాటు నశాళానికెక్కింది. తలతిరుగుడు, ఎక్కిళ్ళు ప్రారంభమయాయి. తరువాత నీళ్ళు త్రాగించి, పుక్కిలించి ఉమ్మేయడం వంటివేవో చేయించారు.  తరువాత, ఆయన హార్మోనియం వాయించుకుంటూ పాడుతూంటే  అది వింటూ ఆయన పక్కనే  చాలాసేపు పడుక్కుండిపోయాను.

            
(చింతానాస్తికిలా - శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర రచన -సంగీతరావుగారి గాత్రంలో)
(మనవరాలు గాయత్రి లలితస్మిత గీసిన హార్మోనియం మీద తాతగారి వేళ్ళు) 

సంగీతంలో మాధుర్యంతో పాటు మంత్రశక్తీ వుంది. మానసిక ప్రశాంతికి శ్రావ్యమైన సంగీతానికి మించిన సాధనంగానీ, ఔషధం కానీ లేవు. ఆ ప్రశాంతత ఏ ఒక్క గాయకుడివల్లే కలుగుతుందని లేదు. మంచి సంగీతానికి స్పందించగల హృదయముంటే చాలు. ఆ పాట మహత్తుతో  నెమ్మదిగా నా తల తిరుగుడు తగ్గింది.


నాకు ఆరేళ్ళ వయసులో మానాన్నగారు విజయనగరం వచ్చేశారు. వృత్తిరీత్యా మా నాన్నగారు కచేరీలకు బయట ఊళ్ళకు వెళుతూండేవారు. అలాటి సమయంలోనే, ఆయన మిత్రుడు, శ్రేయోభిలాషి శ్రీ ద్వివేదుల నరసింగరావుగారు మా నాన్నగారికి రైలు టిక్కెట్టు కొనిచ్చి బలవంతంగా మెడ్రాస్ పంపించారు. అప్పుడు ఘంటసాలవారు పరోపకారం తీస్తున్న రోజులు. మా నాన్నగారు మెడ్రాస్ వెళ్ళి ఘంటసాలగారింట్లో ఉంటూ పరోపకారం, పల్లెటూరు  సినీమాలలో బృందగానాల్లో పాల్గొని,ఆ వాతావరణం నచ్చక వెంటనే వెనక్కితిరిగి వచ్చేయడం వంటి విషయాలు గతవారం చెప్పినదే. 

చిన్నతనంలో  నాకు తరుచూ మలేరియా ఫీవర్ వస్తూండేది. దానివలన నా ప్రాధమిక విద్య సక్రమంగా జరగలేదు. 1952-లో అయ్యకోనేరు గట్టుమీద ఉండే అరటిచెట్ల బడిలో మూడవ తరగతిలో చేర్చారు.  మా తాతగారి అద్దె ఇల్లు సుబ్రమణ్యం పేట, గెడ్డవీధిలో మొదటి ఇల్లు. స్కూలుకు వెళ్ళిరావడం, స్కూల్ లో ఇతర పిల్లలతో తిరగడంతో కొంత జ్ఞానం పెరిగింది. అప్పట్లో వచ్చే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కినీమా వంటి పత్రికలలోని సినీమా బొమ్మలు చూడడం వాళ్ళను గుర్తుపట్టడం తెలిసాయి.

అప్పుడప్పుడు మాతాతగారు తనతో కూడా మ్యూజిక్ కాలేజీకి తీసుకువెళ్ళేవారు. అక్కడ  ఆయన పిల్లలకు చెప్పే సంగీతపాఠాలు వింటూ ఆ హాలులో గోడలమీద వుండే ప్రముఖుల ఫోటోలు చూస్తూ,  ఆ వరండాలమీద తిరిగేవాడిని. అక్కడ మా తాతగారి తో పాటు గాత్ర ఆచార్యుడిగా శ్రీ డొక్కా శ్రీరామమూర్తి గారని ఒకాయన. ఆయన మాత్రమే అక్కడివారిలో నాకు పరిచయం ఉన్నవారు. అలాగే శ్రీ ద్వారం బాబూరావు ( భావనారాయణరావు) గారు.  ఆయన మా రెండో చిన్నాన్నగారికి సహాధ్యాయి. ఆ బాబూరావు గారే మనందరికి చిరపరిచితురాలైన సుప్రసిధ్ధ బహు భాషాగాయని శ్రీమతి సుశీలగారి సంగీతం గురువుగారు.

1950 లో భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం లభించి గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. 1952 లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టు, స్వతంత్ర, ఇండిపెండెంట్ అభ్యర్ధులంటూ రోడ్లమీది గోడలన్నీ రకరకాల పేర్లతో రంగు రంగుల బొమ్మలతో నిండిపోయి వుండేవి. వివిధ రకాల జెండాలు ఊరంతా రెపరెపలాడేవి. నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, రాజాజీ వంటి ప్రముఖ జాతీయనాయకుల పేర్లతో పాటూ తెన్నేటి విశ్వనాధం, ఎన్ జి రంగా వంటి పేర్లు కనపడేవి. ఆ ఎన్నికల్లో విజయనగరం రాజావారు శ్రీ పివిజి రాజు కూడా సోషలిస్టు పార్టీ తరఫున పోటీచేసిన గుర్తు. అలాగే సాంబశివరావు అనే ఆయన పోటీ చేశారు.  మా తాతగారు రాజావారి సంగీతకళాశాల ఉద్యోగి కావడం వలన స్వామిభక్తితో పివిజి కే ఓట్ వేసినట్లు చెప్పుకునేవారు. మా ఇంట్లోని ముగ్గురు అన్నదమ్ములు తలో పార్టీకి వత్తాసు పలుకుతూ భోజనాల దగ్గర వివాదాలు మొదలెట్టేవారు. మా ఇంటికి సమీపంలోనే ఒక మునసబ్ కోర్ట్ ఉండేది. అందులో పోలింగ్ బూత్. ఇంట్లోవారంతా వెళ్ళి ఓటేసివచ్చారు. ఆ ఎలక్షన్ హీటంతా మా ఇంట్లోనూ ఉండేది. 


(21/01/1952 - విజయనగరంలో సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధుల విజయం)

ఈలోగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఒకటి. ఊరంతా సభలు, సమావేశాలు, ఊరేగింపులతో దద్దరిల్లింది. గోడలనిండా "ఆంధ్రరాష్టం రావాలంటే రాజాజీ నశించాలి" అని స్లోగన్స్ . దాని పక్కనే  "ఆంధ్ర రాష్ట్రం కావాలంటే దుంపరాష్ట్రం తెంచాలి" అని ఆకతాయిల సొంత పైత్యాలతో నిండి వుండేవి. వాటి ప్రభావం మా ఇంటి పెరటిగోడల మీద పడింది. అప్పట్లో ఇంట్లో అల్లరి చేయడానికి  నాతో పాటు మా రెండవ చిన్నాన్నగారి అబ్బాయి ఉండేవాడు నాకంటే రెండేళ్ళు చిన్న. పేరు పట్రాయని వెంకట నరసింహ సన్యాసి వర ప్రసాద్. (PVNSV ప్రసాద్. Ex. Telco employee, ప్రస్తుతం బెంగుళూరు నివాసి). మేమిద్దరం మాకు వచ్చిన తెలుగులో బొగ్గుతోనూ, జామాకు, రాచఉసిరి ఆకుల పసరుతో గోడలన్ని ఖరాబు చేస్తూండేవాళ్ళం. మా అమ్మగారో, పిన్నిగార్లో ఎవరో చూసి కేకలేసినా ఆ క్షణం వరకే. తరువాత మామూలే. మా తాతగారికి భయం. మమ్మల్ని గట్టిగా అదలిస్తే ఆ భయంతో ఏ ఊష్ణం వచ్చేస్తుందోనని. మమ్మల్ని ఇల్లు కదలి బయటికి పంపేవారు కాదు. ఆరోజుల్లో విజయనగరం సాంస్కృతిక పరంగా ఎంత ప్రసిధ్ధో, అలాగే గాడిదలకి,మలేరియా దోమలకి, తద్వారా ఫైలేరియాకు కూడా ప్రసిధ్ధే. మా తాతగారు చాలా సౌమ్యులు. అతి భయస్తులు. ఆ లక్షణాలన్నీ మా ఒంటబట్టాయి.

1952 డిసెంబర్ లో ఒక చెల్లెలు పుట్టింది. పేరు వెంకట రమణమ్మ. ఏడుకొండలవాడి పేరు. 1953 జనవరిలో మా నారాయణ మూర్తి చిన్నాన్నగారికి ఒక ఆడపిల్ల. రాజరాజేశ్వరీ ప్రసన్న జ్యోతిర్మయి. సింపుల్ గా జ్యోతి అయింది. వీళ్ళిద్దరికీ మీద మరో ఆడపిల్ల కూడా ఉంది. మా ప్రభూ చిన్నాన్నగారి అమ్మాయి మంగమాంబ. మంగమ్మగారు మా నాయనమ్మగారు. మూడో కొడుకు పుట్టిన మూడేళ్ళకే కాలం చేశారు. మాకెవరికీ తెలియదు. ఈ ఇంట్లోవాళ్ళందరికీ కేర్ టేకర్ మా పెద్ద అమ్మమ్మగారే. ఓలేటి వెంకట నరసమ్మ, మా అమ్మగారి దొడ్డమ్మ, మా తాతగారి పెత్తల్లి కూతురు. ఆవిడ చెల్లెలు, మా అమ్మమ్మగారు, అప్పల నరసమ్మ. మా పెద్దమ్మమ్మగారు వితంతువు. పిల్లలు లేరు.  మంచి జ్ఞాని. ఆవిడ భర్త, మా పెద్దతాతగారి పేరు కూడా నరసన్న. ఆయన ఉండే రోజుల్లో వారిద్దరూ కలిసి వెంకటనరసకవులుగా సాహిత్య సేవ కూడా చేసేరు. తమ్ముడి సంసారమంతటి మీదా ఆవిడదే పర్యవేక్షణ. మా తాతగారు, పట్రాయని సీతారామశాస్త్రిగారు, నిమిత్తమాత్రులు.

క్రమక్రమంగా ఒంటరిగా బయటకు వెళ్ళడం, అయ్యకోనేరు గట్టుకు ఒక ప్రక్కనుండే, అలవాటైన శెట్టికొట్లో పెప్పర్మెంట్లు, ప్యారీ చాక్లెట్లు, జెబి మంఘారాం బిస్కెట్లు వంటివి తెచ్చుకోవడం అలవాటయింది. అప్పట్లో దసరా ఉత్సవాలు బాగా జరిపేవారు. స్కూల్ టీచర్లందరూ పిల్లల్ని వెంటేసుకొని వీధివీధినా ప్రతి యింటిముందూ ఆపి దసరాపాటలు పాడి, అయ్యవార్లకు ఐదు వరహాలు, పిల్లకాయలకు పప్పుబెల్లాలు చాలంటూ డిమాండ్ చేసి, బాణాలతో ఆ ఇళ్ళవారిమీద పువ్వులు జల్లిపించి వారిచ్చే  అర్ధో, రూపాయో, సంభావన పుచ్చుకొని మరో ఇంటికెళ్ళేవారు. అలాగే స్కూల్ లో కూడా దసరా పూజలు చేసి స్వీట్లు పంచిపెట్టేవారు.

విజయనగరంలో దీపావళి కూడా వీరోత్సాహంతో జరిగేది. దీపావళి వస్తే ఏ వీధి తగలెడుతుందోనని భయపడేవారు. ఊళ్ళో పాత కక్షలేవైనా ఉంటే ఆ రోజు రాత్రి మరింత పెట్రేగేవి. ఆ ఊళ్ళో లంక వీధని ఒకటి ఉండేది. అక్కడ ఇలాటి అల్లర్లు ఎక్కువని చెప్పుకునేవారు. వాళ్ళంతా రెండు పార్టీలు గా చీలిపోయి తారాజువ్వలు, వెలక్కాయలు, కొబ్బరికాయలలో మందుగుండు కూరి వాటిని నేలమీద ఎదురెదురుగా విసురుకొంటూ ఉండేవారు. ఇవన్నీ ప్రమాదకరంగా మారి ఇళ్ళుకాలిపోయి, ఒళ్ళుకాలిపోయిన సంఘటనలతో మర్నాడు ఊరంతా గుప్పుమనేది. అప్పటికీ పోలిసులు అలాటి రౌడీ ముఠాలను అరెస్టు చేసి ఒక లారీలో ఎక్కించి అర్ధరాత్రి సమయాలలో చీకట్లో ఊరవతలెక్కడో జనసంచారం లేనిచోట వదిలేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు అక్కడనుండి నడుచుకుంటూ ఊరు చేరేసరికి తెల్లారిపోయేది. దీపావళి అయిపోయేది. మా తాతగారి శిష్యులు, మిత్రుల (పరిమి వారు) పిల్లలు మాకు దీపావళికి ఇంట్లో తయారు చేసిన మతాబాలు, చిచ్చుబుడ్లు, చిచింద్రీలు తెచ్చి ఇచ్చేవారు. వాటిని కాలిస్తే ఒళ్ళెక్కడ కాలుతుందోనని మాతాతగారి భయం.

అలాగే, విజయనగరం కొళాయి నీళ్ళ దెబ్బలాటలకూ ప్రసిద్దే. ఆడవాళ్ళ గొడవలతో ప్రారంభమై మగాళ్ళు తలలు బద్దలు కొట్టుకునేవరకు వచ్చేది. అలాటివారికి అవగాహన కల్పించేందుకు 'కొళాయి బుర్ర' వంటి బుర్రకధలను అభ్యుదయవాదులు వినిపించేవారు. 
మా చిన్నాన్నగారు శ్రీ పట్రాయని నారాయణ మూర్తిగారు వైణికుడు. శ్రీ వాసా వెంకటరావుగారి శిష్యుడు. శ్రీ వాసా కృష్ణమూర్తిగారికి, శ్రీ పంతుల భువనేశ్వరరావుగారికి సహాధ్యాయి. ఈయన అదే సంవత్సరంలో విశాఖపట్నం మకాము మార్చి అక్కడ సంగీత పాఠాలు, ఒక చిన్న స్కూలు ఏర్పాటు చేసుకున్నారు. మా రెండో చిన్నాన్నగారు శ్రీ పట్రాయని ప్రభాకరరావు గారు గాత్రజ్ఞుడు. విజయనగరం మహారాజ సంగీత కళాశాల విద్యార్ధిగా డిప్లొమా హోల్డర్. అందరూ మంచి విద్వత్ కలవారే. ఆయనే మా తాతగారికి తోడుగా ఇంటిపనులన్ని చూసేవారు. మా ఇద్దరిని కూర్చోపెట్టి  అప్పుడప్పుడు చదివించేవారు. ఇంట్లో ఎవరికి అనారోగ్యం చేసినా ఆ ప్రభాకరరావుగారే వెంటనే సుసర్ల వెంకట్రావుగారనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళేవారు. ఆయన హస్తవాసి గొప్పదని చెప్పుకునేవారు. ఆయన మూడు నాలుగు రంగుల్లో అరకు మందులు బాటిల్స్ లో పోసి రోజుకు రెండుసార్లు, మూడుసార్లు వాడమని ఇచ్చేవారు. ఇంట్లో రకరకాల రంగు రంగుల అరకు మందు సీసాలుండేవి.  మా నారాయణమూర్తి చిన్నాన్నగారి డాక్టర్ వేరే. ఆయన పేరు యాజులుగారు. స్థానికంగా ఉండే ఘోషాస్పత్రికి రిక్షాలో వెళుతూంటే నేనూ కూడా వెళ్ళేవాడిని.

అప్పటికి ఊళ్ళో నాలుగు వీధులు పరిచయమై ఒంటరిగా వెళ్ళడం అలవాటయింది. ఈలోగా సినీమా పరిజ్ఞానమూ పెరిగింది. ఆ రోజుల్లోనే పాతాళభైరవి, మల్లీశ్వరి, ప్రియురాలు, పెళ్ళిచేసి చూడు, ప్రేమ, పిచ్చిపుల్లయ్య, చండీరాణి వంటి సినీమాలు రావడం వాటికి సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలు చదవడం వచ్చాయి. అప్పట్లోనే 'తండ్రి' అని ఒక సినీమా మలయాళం డబ్బింగ్ కావచ్చు. తిక్కురుసి అనే నటుడు నటించినది. ఆ తిక్కురిసి పేరు వింతగా అనిపించి ఆ సినీమా పేరు గుర్తుండి పోయింది. అలాగే, 'ముగ్గురు కొడుకులు' అని ఒక సినీమా. ఈ రెండు సినీమాలు చూడలేదు, కానీ, 'తండ్రి - 'మా తాతగారుగా',  'ముగ్గురు కొడుకులు' మా నాన్నగారు, చిన్నాన్నగార్లుగా ఊహల్లో ఉండేవి. ఈ సినీమాలలోని పాటలన్నీ లౌడ్ స్పీకర్లలో, పబ్లిక్ పార్క్ లలో వినిపించేవి. కొన్నిటిని ఘంటసాలవాడు పాడాడని అనుకునేవారు. అదెవరో మాకు తెలిసేది కాదు. 

విజయనగరం కృష్ణాహాల్ సమీపంలో ఒక పెద్ద పార్క్ ఒక పక్క మరో సినీమా హాలు ఉండేవి. ఆ పార్క్ లోనే నేను మొదటిసారిగా 'ఓ తారకా ఓ జాబిలీ' పాటను లౌడ్ స్పీకర్లో విన్నాను. పాట వింటున్నంతసేపు ఆనందంగా అనిపించింది. అదేం సినీమా, పాడిందెవరనే ధ్యాస అప్పుడు లేదు. ఎప్పుడో తరువాత తెలుసుకున్నాను చండీరాణి సినీమాలో ఎన్ టి రామారావు, భానుమతి పాడారని. మరి, ఘంటసాల పాడడమేమిటనే సందేహమూ కలిగింది. అలాటి సందేహాలన్నింటినీ తరవాతి కాలంలో కాలమే తీర్చింది.

(చండీరాణి సినిమాలోని ఓ తారకా పాట వినడంకోసం ప్లే బటన్ నొక్కండి)

మా ఇంటికి దగ్గరలో 'ప్రభాత్' టాకీస్ అని ఓ సినీమా హాలుండేది. అందులో 'కృష్ణలీలలు' సినీమా వచ్చింది. ఎస్ వి రంగారావుది కాదు. వేమూరి గగ్గయ్యది. ఆయన కంసుడు అందులో. ఎస్ రాజేశ్వరరావు కృష్ణుడు. ఆ సినీమాను ఒంటరిగా చూడ్డానికి ఇంట్లోవారు పర్మిషన్ ఇచ్చి డబ్బులిచ్చి పంపారు. నేను హాలు దగ్గరకు వెళ్ళేసరికి  యింకా మ్యాట్నీ షో వదలలేదు. సినీమా హాలులోపల నుండి గాట్టిగా అరుపులు , భయంకరమైన నవ్వులు, పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. అంతే! భయంతో ఠారెత్తి ఇంటికి ఒకటే పరుగు. సినీమాలేదు, గినీమా లేదు. ఆ తరువాత ఎప్పుడో టివీలో దూరదర్శన్ ప్రసారం చేసినప్పుడు చూసాను. కొన్నాళ్ళపాటు గగ్గయ్య, జగ్గయ్య ఒకరేననే భ్రమ ఉండేది. 

మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు ఒకసారి నన్నేదో ఇంగ్లీషు సినీమాకు తీసుకెళ్ళారు.' కొవ్వాడీస్' అని గుర్తు. నేను చూసిన మొదటి ఇంగ్లీష్ సినిమా అది. అది చూసి వచ్చి ఇంట్లో నడుముమీద రెండు చేతులు పెట్టుకొని చెప్పులతో కాళ్ళు ముందుకు వెనక్కి ఊపుతూ డాన్స్ చేస్తూంటే నాకు నవ్వు వచ్చేది. అంత పెద్దవాడు అలా గెంతుతూంటే. కుటుంబంలో ఆడవాళ్ళు సినీమాలకు వెళ్ళాలంటే జట్కా బళ్ళలోనే. విజయనగరంలో సైకిల్ రిక్షాలు వచ్చిన కొత్తరోజులు. స్టేషన్ కు వెళ్ళాలన్నా, మ్యూజిక్ కాలేజీకి వెళ్ళాలన్నా, సుసర్ల వెంకట్రావుగారి హాస్పిటల్ కు వెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా సైకిల్ రిక్షాయే. ఎక్కడికైనా బేడ (రెండు అణాలు) డబ్బులే ఇచ్చేవారు. అప్పట్లో అక్కడి గౌరీశంకర్ విలాస్ హోటల్లో ఒక అణాకు రెండు ఇడ్లీలు. మీకు రూపాయి మానం గుర్తుందా. 
ఒక రూపాయికి - అర్ధలు 2
పావలాలు - 4
బేడలు - 8
అణాలు - 16
అర్ధణాలు - 32
కాణీలు - 64
దమ్మిడీలు - 128
వీటికి క్రింద ఏగాణీలు, ఠోలీలు అనే నాణేలు కూడా ఉండేవి.
'దమ్మిడీ ముండకు ఏగాణీ క్షవరం' అనే సామెతలు ప్రచారంలో ఉండేవి.  రాగితో చేసిన ఆ కాణీలు, దమ్మిడీలకు కూడా ఏవో కొనుకున్న గుర్తుంది. ఈ కాణీలు రెండు రకాలు. ఒకదానికి చిల్లుండేది. అలాటి చిల్లు కాణీలను పిల్లల మొలత్రాడులో వేసి నడుముకు కట్టేవారు. దృష్టిపరిహారామో లేక రాగి ఒంటికి మంచిదనే కారణమేనా కావచ్చు. ఈ కాపర్ల (రాగి నాణేలు) మీద వాటితో కొనుక్కోగల చుట్టలమీద కన్యాశుల్కం లో ఒక పెద్ద లెక్చరే ఉంది గిరీశానిది.

ఇలా జరుగుతూండగా ఒకరోజు మా ఇంట్లో ఘంటసాల పేరు మరొకసారి వినిపించింది. ఒకే మనిషిని కొందరు 'డు' అని మరికొందరు 'రు' అని ఎందుకు పిలుస్తారో నాకు అర్ధమయేది కాదు. గంటసాలవాడు రేపు మనింటికి వస్తున్నాడని. గంటసాలవాడు ఎవరు? ఎక్కడనుండి వస్తున్నాడు? ఎందుకు రావడం? అనే వాటిమీద అనేక సందేహాలు. ఎవరిని అడగాలి. అడిగితే ఏమంటారో? నాకు గంటశాల అంటే దేవుడి గుళ్ళోని గంట, శాల అంటే తాటాకుల శాలగా అర్ధం చెప్పుకొని గంట ఉన్న శాలే గంటశాల అని నిర్ణయానికొచ్చాను. కానీ గంటసాల మనిషంటున్నారే. 

ఈ లోపల ఇంట్లో వారంతా ఆ వచ్చేవారికోసం ఏర్పాట్లు జరుపుతూ, పెరటి గోడలమీద మా వ్రాతలను తుడిపి శుభ్రం చేసే పనిని నాకు, ప్రసాద్ కు  పెట్టారు.

తరువాత...... వచ్చేవారం....
                        సశేషం.

Friday, July 24, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - తొమ్మిదవ భాగం

24.07.20- శుక్రవారం భాగం: 9 *
 ఎనిమిదవ భాగం ఇక్కడ


నెం.35,ఉస్మాన్ రోడ్
                  ప్రణవ స్వరాట్

'సాలూరు చిన గురువు' శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి శిష్యుడు ఒకరు. స్వయాన ఆయన కుమారుడు మరొకాయన. ఇద్దరూ కర్ణాటక సంగీతంలో నిష్ణాతులే. ఇద్దరూ ఆ సంగీతాన్ని నమ్ముకొని జీవించాలనుకున్నవారే. కానీ విధి వారికి విభిన్న మార్గాలను సూచించింది. ఘంటసాలవారు 1944 లో దక్షిణాపథానికి పయనించి మద్రాసులో చిత్రసీమలో తన జీవనయానం మొదలుపెట్టారు. గురుపుత్రులు సంగీతరావుగారు అదే సమయంలో కొంచెం తూర్పుదిశగా పయనించి తనకిష్టమైన ప్రశాంత వాతావరణంలో కలివరం అనే గ్రామం లో ఒక సహృదయుడి అండనజేరారు. ఆయన పేరు, గతంలో చెప్పాను,  శ్రీ గంగుల అప్పల నాయుడు. మంచి సంగీత రసికుడు. వీణ వాయించేవారట. సంగీతరావుగారు ఆయన దగ్గరకు వెళ్ళకముందు ప్రముఖ వైణికుడు శ్రీ వాసా కృష్ణమూర్తిగారు , శ్రీ మండా సూర్యనారాయణ శాస్త్రిగారు (సినీ నటుడు రావు గోపాలరావు గారి మామగారు) అక్కడ ఉండేవారు. ఈయనకి సంగీతంలోనే కాక మంత్ర శాస్త్రంలో కూడా మంచి ప్రావీణ్యం ఉండేది. వీరిద్దరి తరువాత, మా నాన్నగారు సంగీతరావుగారు ఆయన వద్ద చేరారు. "మీరు ఎవరికీ ఏ సంగీతము నేర్పనక్కరలేదు. మీరు నా వద్ద ఉంటే చాలు" అని చెప్పినంత సహృదయుడు గంగుల అప్పలనాయుడుగారు.  ప్రముఖ సినీమా డైరక్టర్ బి ఎ సుబ్బారావు, వారికి దగ్గర బంధువే.


(శ్రీ గంగుల అప్పలనాయుడుగారు)

ఆ అప్పలనాయుడు గారి ఒక చెల్లెలు, సత్యవతిగారి  అల్లుడే మనందరికీ బాగా తెలిసిన సినిమా ఎడిటర్ శ్రీ  కె ఎ మార్తాండ్.


(అనకాపల్లి రంగారావుగారు, నాన్నగారు, ఫిల్మ్ ఎడిటర్ కె ఏ మార్తాండ్ గారు)

మరొక చెల్లెలు, సావిత్రిగారి భర్త సాలూరులో ప్రముఖ వ్యక్తి శ్రీ జర్జాపు నీలకంఠం. ఆయన కుమారుడు శ్రీ జర్జాపు ఈశ్వరరావు. ఆయనే, ప్రస్తుతం, సాలూరులో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు స్థాపించిన ' శారదా గాన పాఠశాల' మంచిచెడ్డలు గమనిస్తున్నారు. 


(శ్రీ జరజాపు ఈశ్వరరావుగారు మా నాన్నగారితో)

ఇలా కొన్ని కుటుంబాలతో తరతరాల సత్సంబంధాలు కొనసాగుతూంటాయి.
 

(శ్రీ గంగుల అప్పలనాయుడుగారి సోదరి - లక్ష్మీనారాయణమ్మగారు, మేనకోడలు సత్యవతిగారు వారి పిలల్లతో మా అమ్మగారు, మా చెల్లెళ్ళు)

1945 లో 'స్వర్గసీమ' సినిమా వచ్చింది. ఘంటసాల అనే గాయకుడు ఈ సినిమాలో తన మొట్ట మొదటి పాటను భానుమతి వంటి ప్రముఖ గాయనితో కలసి పాడడంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. అదే  1945 సంవత్సరం లో నేను పుట్టాను. అందుకు లోకం నవ్వనూలేదు, ఏడ్వనూ లేదు. ఉండవలసినంత సహజంగానే ఉంది. కాకపోతే మరో గొప్ప విశేషం జరిగింది. నేను పుట్టాక రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసింది. ఇది  నిజంగా ప్రపంచమంతటికీ శుభవార్తే. సంతోషకరమైన విషయమే. ఎందుకంటే, ఆ యుధ్ధ కాలంలో అన్నిటికీ రేషనే. ఏ వస్తువు దొరికేది కాదట. పసిపిల్లల పాల డబ్బాలకు రేషనే. అయితే, మా ఇంట్లో ఒక ఆవు ఉండేది. అది కొంచెం కొంచెం గుర్తు.

ఇలా ఐదేళ్ళు గడిచాయి. ఈలోగా లోకమంతా ఎన్నో మార్పులు జరిగాయి. మనదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి విముక్తి కలిగి స్వాతంత్ర్యం లభించింది. ఆ విషయాలన్నీ తెలిసే వయసుకాదు నాది. కానీ, ఒకనాటి ఉదయం, మా యింటి పెరట్లో గులాబీ మొక్కలు, వంగ, బెండ మొక్కల మధ్య కాలక్షేపం చేస్తూండగా గాలిలో తేలుతూ ఎక్కడనుండో ఒక పాట వినిపించింది. అది మా నాన్నగారు పాడే పాటలా లేదు. ఎక్కడనుండి వస్తున్నదో తెలియదు. గాలివాటానికి ఒకసారి గట్టిగా, ఒకసారి మెల్లగా  వినిపించేది. అదెందుకో తెలియదు. ఆ పాట నాకు తరుచూ వినిపించేది. ఒకరోజు మా నాన్నగారు నన్ను నాయుడుగారింటికి తీసుకువెళ్ళారు.  నేను అంతవరకూ గాలిలో వింటున్న పాట,   ఆ యింటిలో ఒక బాకాలోనుండి వినిపించింది. 

నాకు చాలా వింతగా అనిపించింది. మనుషులెవరూ పాడడం లేదు. అయినా పాట వినిపిస్తోంది. ఇంతలో బాకాలో పాట ఆగిపోయింది. మళ్ళీ పాడితే బాగుండుననిపించింది. మా నాన్నగారు ఆ బాకా దగ్గరకు వెళ్ళి దేన్నో తిప్పారు.  విచిత్రం మళ్ళీ అదే పాట వచ్చింది. ఆ పాటలో మాటలు నాకు అర్ధం కాలేదు, 'పలుకు', చిలకా' అనే రెండు మాటలు తప్ప. ఎందుకంటే అదే ఊళ్ళో ఎవరింట్లోనో ఒక బాదం చెట్టు, చెట్టు మీద చిలకలు చూశాను. అవి బాదం కాయలు కొరికి పలుకులను క్రింద పడేసేవి. ఆ కాయల్లో పలుకులుంటాయని వినడం వలన , ' పలుకు', చిలక' మాత్రం గుర్తున్నాయి. ఆ మాటలు ఈ బాకాలో వినడం ఆనందం కలిగించింది. అప్పటికి నాకు నాలుగేళ్ళు దాటాయి. కొన్ని గుర్తున్నాయి. కొన్నిలేవు.




          (పలుకరాదటే చిలుకా  పాటను వినాలంటే రికార్డు పైన   ప్లే బటన్ నొక్కండి)
                                   
ఆ తర్వాత ఎప్పుడో కొన్నేళ్ళకు తెలిసింది, అది 'పలుకరాదటే చిలకా' అని, షావుకారు సినీమాలో ఘంటసాలవాడు పాడేడని. అదే నాకు కొంత జ్ఞానం వచ్చాక విన్న మొదటి పాట. అలాగే, 'దీపావళి, దీపావళీ మా ఇంట మాణిక్య కళికావళీ'. ఇందులో కూడా నాకు తెలిసిన దీపావళి ఉండడం వలన నాకు ఇష్టంగా  గుర్తుండిపోయాయి. ఈ పాటలను నాయుడిగారింట్లో చాలాసార్లే విన్నాను.

అక్కడే, మరో రెండు పాటలూ విన్నాను 'ఓ విభావరి,' 'ఆ తోటలో నొకటి'. ఎవరు పాడారో అప్పుడు తెలియదు . తర్వాత తెలిసింది.

(ఆ తోటలోనొకటి ఆరాధానాలయము .. పాట వినడానికి ప్లే బటన్ నొక్కండి)


ఒక నల్లటి ప్లేట్ తిరుగుతూంటే పాట వినపడడం నేను కనిపెట్టిన కొత్త వింత.


(ఓ విభావరీ......పాట వినడానికి ప్లే బటన్ నొక్కండి)
అలాగే, కొంతమంది వ్యక్తులతో పరిచయాలు కూడా వింతగానే ఉంటాయి. మనకు తెలిసినవాళ్ళు కొన్నాళ్ళు కనిపించి, తరువాత ఎప్పుడో ఎక్కడో కలుసుకోవడమో, లేక వాళ్ళ గురించి వినడమో జరిగితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.

ఇంతకు ముందు చెప్పాను, కలివరం గ్రామం నాగావళి ఏటిని ఆనుకుని ఉందని. అవతలి ఒడ్డున తొగరాం అనే ఊరుందని. అక్కడే గండ్రేడు అని మరో ఊరు. ఆ ఊళ్ళో నుండి మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకుందికి ఒకతను వచ్చేవాడు. అతను చాలా తెల్లగా ఉండేవాడు. షెరాయి, చొక్కా వేసుకునేవాడు.  ఆయన పేరు బురిడి లక్ష్మున్నాయుడు. మనిషి చాలా మంచివాడు. మా నాన్నగారి వ్యాసాల ద్వారా తెలుసుకున్నది. 


(శ్రీ బురిడి లక్ష్మున్నాయుడు)

అలాగే, మరొకతను, పేరు ఏదో దాసు. పూర్తిపేరు గుర్తులేదు. అతను నన్ను ఎత్తుకొని ఆడించేవాడు. తాటాకుతో చక్రాలు, న్యూస్ పేపర్ తో గాలిపటాలు చేసి, నాతో సమానంగా ఏటి ఇసకల మీద ఆడించేవాడు. అంతవరకే గుర్తు. ఆ ఊరిని ఆనుకొని ప్రవహించే నాగావళి ఏరును దొంగ ఏరు అనేవారు. సడన్ గా వరదనీటితో ఏరంతా నిండిపోయేది.  మర్నాటికల్లా వరదొచ్చిన ఆనవాలే ఉండేదికాదు.  ఎక్కడో కొండల్లో వర్షాలు పడితే ఈ ఏటికి వరద వచ్చేది. ఒకసారి అలాటి వరదలో ములిగిపోయాను. ఎవరో జుట్టుపట్టుకు పైకి లాగారు.  లేకపోతే, ఈ కబుర్లు నానుండి మీరు చదివేవారు కాదు. అప్పటినుండి నాకు కొంచెం వాటర్ ఫోబియా ఉంది. అందుకే నదీ స్నానాలు, సముద్ర స్నానాలకు దూరం. మద్రాసు మెరినా బీచ్ కు వెళ్ళినా  పాదం మునిగే లెవెల్ వరకే వెళ్ళడం పరిపాటి.

సరి, మళ్ళీ బురిడి లక్ష్మునాయుడి గారి విషయం చూద్దాము. ఆయన మా నాన్నగారు - శ్రీ సంగీతరావుగారి దగ్గర చాలా కాలమే సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత, మా నాన్నగారు కలివరం వదలి, విజయనగరం, మద్రాస్ వెళ్ళాక, ఆయన కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో  మా తాతగారు  - శ్రీ సీతారామశాస్త్రి గారి క్లాసులోనే చేరి డిప్లొమా చేశారు. అదే కాలేజీలో లెక్చరర్ గా కూడా పని చేశారనుకుంటాను. ఆలిండియా రేడియోలో తరుచూ ఆయన కచేరీలు వినిపించేవి. ఆయన టోపి ధరించేవారు. లక్షుంనాయుడుగారు కచేరీలలో తమ గురువులైన శ్రీ సీతారామశాస్త్రి గారి కృతులు  కూడా గానం చేసేవారు.  ఆయన కుమార్తే, బురిడి అనురాధా పరశురామ్. ప్రస్తుత విజయనగరం మ్యూజిక్ కాలేజి ప్రిన్సిపాల్. ఆవిడను 2008లో విజయనగరం మ్యూజిక్ కాలేజీలో కలసి మాట్లాడినప్పుడు ఆ చిన్నప్పటి కలివరం రోజుల్ని జ్ఞాపకం చేసుకున్నాను.


(శ్రీమతి అనురాధా పరశురామ్)

అదే కాలేజీలో గాత్రం లెక్చెరర్ గా పనిచేసిన శ్రీ బి ఎ నారాయణగారు శ్రీ బురిడి లక్షుంనాయుడిగారి శిష్యుడేనని విన్నగుర్తు.



బి ఎ నారాయణగారు  కర్ణాటక సంగీతంలోనే కాక ఘంటసాలవారి పాటలు, పద్యాలు  పాడడంలో కూడా ఆరితేరినవాడు. మా జంటసంస్థలు ఆవిర్భావం నుండి 2008లో విజయనగరంలో జరిగిన ఆఖరి కార్యక్రమాల వరకూ క్రమం తప్పకుండా పాల్గొని ఘంటసాలవారి పాటలు, పద్యాలు పాడి ప్రేక్షకులను సమ్మోహనపర్చేవారు. కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వలన, మంచి గాత్రసంపద ఉన్నందువల్ల చాలా మంచి గాయకుడిగా పేరు సంపాదించారు.


(శ్రీ బి ఏ నారయణ, ఆయన కుమారుడు పవన్)

విజయనగరంలో మా ఉత్సవాల సందర్భంగా విశిష్ట అతిధిగా హాజరయిన శ్రీ సంగీతరావుగారిని బి ఎ నారాయణ మ్యూజిక్ కాలేజీకి తీసుకువెళ్ళి తమ స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేసి ఆ పిల్లలచేత పాడించారు. ఆయన కుమారులు పవన్, సంతోష్ లు కూడా ఇప్పుడు మంచి గాయకులుగా స్థిరపడ్డారు.

ఎప్పుడో, ఎక్కడో 1945లలోని మూలాలు నేటి వరకు మూడు తరాలపాటు వ్యాపించడం అపూర్వంగానే తోస్తుంది నాకు. ఆ విధంగా నాకు ఘంటసాలవారి పాటతో  మొదటిసారిగా పరిచయం ఏర్పడినది, విన్నదీ  కరెంట్ వసతులు కూడా  లేని ఒక కుగ్రామంలో. ఇప్పుడా కలివరం కూడా అన్ని ఊళ్ళలాగే అభివృధ్ధి చెందిందని విన్నాను. 1951 ప్రాంతాలలో ఆ ఊరినుంచి  కుటుంబంతో సహా వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళే అవకాశమే దొరకలేదు. కానీ, మనసులో ఎక్కడో గాఢమైన కోరిక ఉంది. ఆ కలివరం వెళ్ళాలని.

వచ్చే వారం మళ్ళీ విజయనగరంలో......
ఘంటసాలవారి విశేషాలతో......
                ....సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified. 


Friday, July 17, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఎనిమిదవ భాగం

ఏడవ భాగం     ఇక్కడ.

17.7.2020 - శుక్రవారం: భాగం : 8.

నెం.35,ఉస్మాన్ రోడ్.  


ఘంటసాలగారి సంస్కారం

                                            
మద్రాస్ లో చిత్రసీమలో కొంత నిలదొక్కుకున్న తర్వాత , విజయనగరం వదలి వెళ్ళిన మరికొన్నేళ్ళకు ఘంటసాల మరల విజయనగరం వెళ్ళి తమ గురువులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారిని కలిసారు. సినీమాలలో తన పురోభివృద్ధి ని గురించి గురువుగారికి చెప్పి వారి ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంలో , మద్రాస్ లో మంచి గాయకులకు తగిన అవకాశాలున్నాయని , అందువల్ల , వారి పెద్దబ్బాయి సంగీతరావు ను తన దగ్గరకు పంపమని కోరారు. కానీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అందుకు కొన్ని కారణాలు లేకపోలేదు.

1942 లో తొలిసారిగా మా నాన్నగారు - శ్రీ సంగీతరావు గారు ఒక స్నేహితుడి ఆహ్వానం మీద మద్రాస్ వెళ్ళారు. అప్పటికింకా ఘంటసాల మద్రాసు వెళ్ళలేదు. మద్రాసులో ఆలిండియా రేడియో , జెమినీ స్టూడియో   
ప్రారంభమైన తొలిరోజులు.

      
                                                                      
ఆ జెమినీ స్టూడియో లో సాలూరుకు చెందిన మా తాతగారి మిత్రుడు శ్రీ ఉరిమి జగన్నాధం ( ప్రముఖ తబలిస్ట్ వి. లలిత్ ప్రసాద్ తండ్రి) అనే ఆయన జెమినీ స్టూడియోలో తబలిస్ట్ గా పనిచేశేవారు. ఆయన సాలూరులో రాజావారి నాటక సంస్థలో తబలిస్ట్ గా , స్క్రీన్స్ పెయింటర్ గా ఉండేవారు. ఆ జగన్నాధంగారు మా నాన్నగారిని కలుసుకొని తనతో కూడా మద్రాసులో అనేక సినీమా కంపెనీలకు , నాటక సంస్థలకు తీసుకువెళ్ళి మా నాన్నగారి పాటను అందరికీ వినిపించేవారు. 

ఆ క్రమంలో మా నాన్నగారు శ్రీచిత్తూరు వి. నాగయ్యగారిని కూడా కలసి తన పాట వినిపించారు. ఆ సమయంలో నాగయ్యగారు భక్త పోతన సినీమాకు పని చేస్తున్నారు. అక్కడ , " మాతా పితా గురుదేవా " అనే పాట రిహార్సల్స్ జరుగుతున్నాయి. సినీమాలో పోతనగారి కూతురు పాడే పాట. ఆ పాట విని అదే పాటను సంగీతరావు గారు నాగయ్యగారికి వినిపించారు. ఆయన అది విని చాలా సంతోషించారు. సుసర్ల దక్షిణామూర్తి వంటివారు కుర్రవాళ్ళుగా తిరుగాడుతూ కనిపించేవారు. 

ఈ విధంగా మద్రాస్ లో కొన్నాళ్ళు గడిపాక సంగీతరావు గారికి బాగా అనారోగ్యం చేసింది. అదే సమయంలో రెండవ ప్రపంచయుధ్ధం యొక్క ప్రభావం మన దేశం మీద కూడా పడుతుందనే భయంతో సీతారామశాస్త్రి గారు తమ కుమారుడిని మద్రాసు వదలి రమ్మని కబురు పంపించడంతో , సంగీతరావు గారు మద్రాసు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శ్రీకాకుళానికి సమీపంలో దూసి స్టేషన్ . ఆ స్టేషన్ కు ఓ నాలుగు మైళ్ళ దూరంలో కలివరం అనే ఒక చిన్నగ్రామం.ఊరిని ఆనుకొని నాగావళి ఏరు. ఏటికి అవతలి ఒడ్డున తొగరాం అనే ఊరు ఉండేది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారి తండ్రిగారిది ఆ వూరే.

 ఈ కలివరంలో శ్రీగంగుల అప్పలనాయుడు గారని పెద్ద భూస్వామి. ఆయనకు సంగీతమంటే చాలా ఇష్టం. ఆయన మా నాన్నగారిని తన ఆస్థానగాయకుడిగా పెట్టుకున్నారు. శ్రీ సంగీతరావు 1944 నుండి ఆరేళ్ళపాటు ఆయన ఆదరణలో ఉన్నారు. అప్పలనాయుడు గారికి ముగ్గురో , నలుగురో చెల్లెళ్ళు. వారందరికీ మా నాన్నగారు -సంగీతరావు గారు సంగీతం నేర్పేవారు.

 1952 లో మరల శ్రీ ఘంటసాలవారి ఆహ్వానం మేరకు మా నాన్నగారు మద్రాసు బయల్దేరి వెళ్ళారు. వెళ్ళే సమయంలో భయంకరమైన గాలివాన వచ్చి రైల్వే ట్రాక్ లు దెబ్బ తినడంతో రైలును గూడూరు నుండి రేణిగుంట మార్గంగా నడిపి మద్రాస్ చేర్చారు. అక్కడ సెంట్రల్ స్టేషన్ పక్కన ఒక హోటల్ లో దిగి ,తన పెట్టె అక్కడుంచి ఘంటసాలవారి ని చూడ్డానికి మాంబళం ( అదే త్యాగరాయనగర్ లేదా టి.నగర్) లోని నెం.35 , ఉస్మాన్ రోడ్ కు వెళ్ళారు. ఆ రోజు ఘంటసాలగారి తండ్రి తిధి. ఆయన ఆ కార్యక్రమంలో మునిగిఉన్నారు. మ నాన్నగారు వచ్చిన సంగతి మోపర్రు దాసుగారి ద్వారా విని , ఘంటసాలగారు లోపలనుండి బయటకు వచ్చి మా నాన్నగారిని ఆప్యాయంగా పలకరించి ఇంటిలోపలికి తీసుకువెళ్ళారు. ఆ సంస్కారం , గౌరవం మరెవరికీ రావని మా నాన్నగారు ఎప్పుడూ తల్చుకుంటూంటారు. 

అప్పట్లో ఘంటసాలగారు కొత్తగా ' వాక్సాల్' (vauxhall) అనే కారు కొన్నారు. ఆ రోజు సాయంత్రం , ఆ కారులో ఘంటసాలగారు తనను హొటల్ కు తీసుకువెళ్ళి అక్కడున్న పెట్టితో సహా ఇంటికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఘంటసాల గారు పరోపకారం సినీమా తీస్తున్నారు.

(ఆడియో వినడం కోసం పరోపకారం పోస్టర్ మీద క్లిక్ చేయండి)

 అందులో ఆరుద్ర వ్రాసిన 'పదండి ముందుకు-పదండి తోసుకు ' అనే గీతాన్ని సంగీతరావు గారిచేత పాడించారు. అది శ్రీ శ్రీ రాసిన " పదండి ముందుకు " పాటకు పేరడీ లాటిది. అలాగే , ' పల్లెటూరు ' చిత్రంలో అనేక బృందగానాలుండేవి. మాధవపెద్ది , పిఠాపురం , గోపాలం వీరందరితో కలసి మా నాన్నగారు కూడా ఆ పాటలను పాడారు. అయితే తను నేర్చుకున్న సంగీతం వేరు , సినీమాల్లోని సంగీతం వేరని , ఆ వ్యవహారం మనసుకు నచ్చక మా నాన్నగారు సంగీతరావు గారు మరొకసారి మద్రాసు వదలి వెళ్ళిపోయారు. యధాప్రకారంగా తను , తన కచేరీలంటూ కాలం గడపసాగారు. 

కానీ , విజయనగరంలో, పెరుగుతున్న కుటుంబభారం , ద్వివేదుల నరసింగరావు ( డా.డి.ఎన్ రావు , ద్వివేదుల విశాలాక్షి) వంటి మిత్రులు ఇక్కడే ( విజయనగరం) లోనే వుంటూ తనలో వుండే సంగీత ప్రతిభను వృధా చేసుకోవద్దనే స్నేహపూర్వకమైన ఒత్తిడులు ఎక్కువై వృత్తిరీత్యా విజయనగరం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


 1954 లో కలివరం గంగుల అప్పలనాయుడు గారి కోరిక మేరకు వారితో కలసి తిరుపతియాత్ర వెళ్ళారు. అక్కడికి ఆ నాయుడి గారి బంధువు ప్రముఖ డైరెక్టర్ బి.ఎ. సుబ్బారావు , వారి సోదరుడు బి.ఎ. రామారావు వచ్చారు. వారంతా కలసి మద్రాసు వచ్చి ఘంటసాలవారి ని చూచేందుకు వెళ్ళారు. అప్పుడు ఘంటసాలగారు కన్యాశుల్కం రికార్డింగ్ కు వెళ్ళారు. సంగీతరావు గారు తెల్లారి తిరిగి వెళ్ళిపోతారనే సమయానికి ఘంటసాలవారు వచ్చి " ఇప్పుడు మన చేతిలో చాలా సినీమాలున్నాయి. మీరు వెళ్ళడానికి వీలులేదని" బలవంతపెట్టి ఉంచేశారు. నాయుడు గారి కుటుంబం మాత్రం వెనక్కి వెళ్ళిపోయారు.


 అలా 1954 నుండి 1974 వరకు రెండు దశాబ్దాల వరకు ఘంటసాలగారి దగ్గరే సంగీతరావు గారు పనిచేశారు. ఘంటసాల వారి సంగీత సహాయకుడిగా ఘంటసాలగారు స్వరపర్చిన పాటలకు స్వరాలు వ్రాస్తూ వాటిని ఆర్కెష్ట్రా కు , గాయకులకు నేర్పడం , ఆర్కెష్ట్రా లో హార్మోనియం , వీణ వంటివి వాయించడం చేశేవారు. సినీమా లలో పాడడం విషయంలో ఏమాత్రం ఆసక్తి  కనపర్చలేదు. ఘంటసాల గారితో కలసి అనేక కచేరీలలో పాల్గొని హార్మోనియం వాయించారు. అవసరమనుకున్నప్పుడు ఘంటసాలవారి తో కలసి కచేరీలలో పాడేవారు.

 1971 లో ఘంటసాలవారి తో కలసి విదేశాలు పర్యటించారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఘంటసాలవారి కి అనారోగ్యం కారణంగా సంగీత దర్శకత్వం వహించే సినీమా ల సంఖ్య తగ్గిపోయింది. కానీ , ఘంటసాలవారి ని వదలిపెట్టి వేరే సంగీతదర్శకులను ఆశ్రయించడానికి మనస్కరించలేదు. ఘంటసాలవారి కోరిక మీద వచ్చిన తను చివరవరకూ ఆయనతోనే ఉండాలనే ఒకరకమైన కృతజ్ఞతాభావం , ఒకరిపట్ల ఒకరికి గల సోదరభావం , పరస్పర మైత్రీ భావంతో , ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మా నాన్నగారు మాత్రం ఘంటసాలవారికి మాత్రమే సహాయకుడిగా ఉండిపోయారు.

 1972 నుండి ఘంటసాలవారి అనుమతితో శ్రీ వెంపటి చిన సత్యంగారి కోరిక మీద వారి కూచిపూడి స్కూల్ లో పిల్లలకు సంగీతం చెప్పడానికి ప్రవేశించారు. అలాగే , సినీ నటి కాంచనకు గాత్రం , వీణ నేర్పించారు . అలాగే ఆత్రేయ గారి అమ్మాయికి నాలుగేళ్ళు సంగీతం నేర్పారు. 1974 తర్వాత , డా. వెంపటి చినసత్యంగారితో ఏర్పడిన మైత్రి కారణంగా మరో పాతిక సంవత్సరాలు కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ కి మా నాన్నగారు తన సేవలందించారు. 1983 వరకు అదే నెం.35 ఉస్మాన్ రోడ్ ఘంటసాలగారింటి చిన్న ఔట్ హౌస్ లో నే తన ఐదుగురు పిల్లలతో కాలం గడిపారు. తన భవిష్యత్ పట్ల ఆదినుండి ఎంతో అక్కర చూపిన ఘంటసాలగారంటే మానాన్నగారికి ఎంతో గౌరవం. కుచేలుడు , కృష్ణుడు వంటి భావం ఉండేదేమో తెలియదు. ఘంటసాలవారి తో కలసి పనిచేస్తున్నా తన పరిధులు దాటి తనెలాటి అతి చొరవ తీసుకోలేదు. తన పిల్లలూ అలాగే ఉండాలని కోరుకున్నారు.
ఆ విషయాలన్నీ .... వచ్చే వారమే... 

(సశేషం)