visitors

Friday, July 10, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఏడవ భాగం

భాగం - 7*
ఆరవభాగం ఇక్కడ

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్




నాటకాలు వేసుకుంటూ తిరగడం, ఏవో సంగీతకచేరీలు చేసుకోవడంలో కాలం గడుస్తోందే తప్ప చెప్పుకోతగ్గ  ఆదాయం, అభివృధ్ధి కనపడలేదు. ఇది ఘంటసాల తల్లిగారికి ఒక వేదనగా తయారయింది. ఎప్పుడు ఇంటిపట్టున ఉండక, ఇల్లు పట్టని కొడుకుకు ఒక కాలికట్టు (పెళ్ళి)  వేస్తే బాధ్యత తెలిసి, కుదురుగా ఉంటాడనే తల్లి ప్రేమతో అతనికి పెళ్ళిచేయాలని సంకల్పించారు. 


ఈ విషయంగా తన వరస సోదరుడైన కొడమంచిలి వెంకటరత్నశాస్త్రిగారిని సంప్రదించారు. ఆయన పెదపులివర్రు వాస్తవ్యులు. స్థానిక బాలాత్రిపురసుందరి ఆలయంలో అర్చకులు. ఊళ్ళో మంచి పేరున్న పెద్దమనిషి. ఆయనకు ఆడా, మగా పదిమంది సంతానం. ఆయన రెండవ కుమార్తె సావిత్రిని తన కొడుకుకి యిచ్చి పెళ్ళి జరిపించమని కోరడం , ఆయన సమ్మతించడం జరిగింది.  దైవసంకల్పం కూడా తోడవడంతో సావిత్రి, ఘంటసాల ల వివాహం 1944 లోమార్చ్ మూడవ తేదీన జరిగింది.



ఘంటసాల  బాల్యావస్థ, యువ దశదాటి ఒక గృహస్తుడయ్యాడు. ఇక, ఘంటసాలను బహువచనంతో సంబోధించడం సముచితం.

సావిత్రిగారితో వివాహం ఘంటసాల వారి జీవితంలో ఒక గొప్ప మలుపుకు నాంది పలికింది.
                 

తెలుగు సినీమా ప్రపంచంలో లబ్దప్రతిష్టులైన  కవి శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులు, సినీ డైరక్టర్ కాశీనాధుని విశ్వనాథ్, స్వస్థలం పెదపులివర్రు. ఘంటసాలవారి అత్తవారి ఊరు కూడా అదే పెదపులివర్రు. వారంతా ఒకరికొకరు బాగా పరిచయస్తులు.

ఘంటసాలవారి పెళ్ళైన కొద్ది రోజులకు సముద్రాల రాఘవాచార్యులవారు పెదపులివర్రు వెళ్ళడం జరిగింది. అప్పుడు, ఘంటసాలగారు ఆచార్యులవారిని కలసి తన మంచిచెడ్డలు చెప్పుకున్నారు. తాను నేర్చుకున్న సంగీతాన్ని సముద్రాలవారికి వినిపించారు. ఆయన విని చాలా సంతోషించారు. ఇలాటి పల్లెటూళ్ళలో కన్నా మద్రాస్ వంటి నగరాలలో వృధ్ధిచెందే అవకాశాలు ఎక్కువని, అందుచేత మద్రాస్ లో తనను కలిస్తే తగు ప్రయత్నాలు చేయవచ్చని ఘంటసాలగారిలో ఆత్మస్థైర్యం కలిగించారు. ఆచార్యులవారి మాటలు ఘంటసాల తన ఆశల, ఆదర్శాల సాఫల్యానికి తొలిమెట్టుగా భావించారు. 


వివాహం జరిగిన రెండు మాసాలకు ఘంటసాలగారు ఒంటరిగా తన మకామును మద్రాసుకు మార్చారు. 

సముద్రాల రాఘవాచార్యులవారు ఘంటసాలగారికి తన ఇంటనే ఆశ్రయమిచ్చి, తను పని చేస్తున్న, తెలిసిన సినీమా కంపెనీలన్నింటికీ తిప్పుతూ ప్రతీ చోటా ఘంటసాల పాటను అందరికీ వినిపింపజేసేవారు. ఈ విధంగా ఘంటసాల సముద్రాలవారింట కొన్నిమాసాలు గడిపారు. ఆ క్రమంలో నాగయ్యగారి దగ్గర, బి.ఎన్. రెడ్డిగారి వద్దా తన పాట వినిపించి వారిని మెప్పించారు. కానీ వెనువెంటనే ఏ అవకాశాలు దొరకలేదు.
ఈ అవకాశాల వేటలో తిరుగాడుతూ  టి.నగర్ లోని పానగల్ పార్క్ లోనే  కొన్ని రోజులపాటు అక్కడివారి దయాధర్మంతో రాత్రింబవళ్ళు గడిపారట.

కొన్నాళ్ళకు, ముందుగా ఘంటసాల బలరామయ్యగారి ఆఫీసులో ఉంటూ వారు తీసిన 'సీతారామ జననం' లో కోరస్ లు పాడి, ఎక్స్ట్రా వేషాలు వేసినందుకు నెలకు 75 రూపాయలందుకున్నారు.
(ఘంటసాలగారి సినిమారంగ ప్రవేశం తొలిరోజులగురించి  శ్రీ పేకేటి శివరాంగారు -)


అక్కినేని నాగేశ్వరరావు అదే సీతారామజననంలో రాముడిగా తొలిసారి హీరోగా నటించారు. అక్కినేని, ఘంటసాలల మధ్య మైత్రి బలపడింది అప్పుడే.


నాగయ్యగారి రేణుకా ఆఫీస్ లో ఉండేందుకు అవకాశం దొరికింది. నాగయ్యగారు తీస్తున్న త్యాగయ్య సినీమాలో కోరస్ పాడడం, నాగయ్యగారి శిష్యుడిగా వేషం కట్టడం వంటివి జరిగాయి. 

  ( ఈ వీడియోలో నాగయ్యగారికి ఎడమవైపు ఉన్న శిష్యుడు ఘంటసాల)

వాహినీ వారి 'స్వర్గసీమ' లో తొలిసారిగా భానుమతి గారితో కలసి  ఒక డ్యూయెట్ ను సి.హెచ్. నారాయణరావుకు పాడించారు బి.ఎన్. రెడ్డి. 


అక్కడ    బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఘంటసాలను చూసి ఆలిండియా రేడియోకు సిఫార్సు చేసి ఘంటసాల గొంతును తెలుగు శ్రోతలకు వినిపించేలా  చేశారు . నెలకు ఆరేడు ప్రోగ్రాములు ఇప్పించి భుక్తికి లోటులేకుండా ఆదుకున్నారు.  

ఇదే క్రమంలో, HMV గ్రామఫోన్ కంపెనీకి వెళితే వారు ఘంటసాల కంఠం మైకుకు పనికిరాదని తిరస్కరించారు. (అలా తిరస్కరించిన అక్కడి ఆఫీసరే మరో 18 ఏళ్ళ తర్వాత  తాను నిర్మించిన చిత్రానికి ఘంటసాలను సంగీతదర్శకుడిగా, చిత్రంలో పాటల గాయకుడిగా నియమించుకున్నారు.
ఆయనెవరనేది తరువాయి భాగాలలో చూద్దాము) .

ఆ తరువాత, ఘంటసాల పాటను విన్న పేకేటి శివరాం  HMVలో ప్రవేశించిన వెనువెంటనే ఘంటసాలగారిచేత 'నగుమోమునకు' అనే చాటు పద్యం, 'గాలిలో నా బ్రతుకు' పాటను తొలిసారిగా పాడించారు.


 అయితే అవి కలకత్తా వెళ్ళి అక్కడ రికార్డులుగా మారి ప్రజలలోకి వెళ్ళేలోగా 'స్వర్గసీమ' సినీమా ముందు విడుదలై ఒక కొత్త గాయకుడి గురించి అందరికి తెలిసింది. తరువాత, 
క్రమక్రమంగా, గృహప్రవేశం, త్యాగయ్య, యోగి వేమన (ఇందులో ఒక నాట్య సన్నివేశంలో నట్టువాంగం చేసే కళాకారుడిగా కూడా కనిపిస్తారు).



           (ఈ వీడియోలో నర్తకి పక్కన నట్టువాంగం చేస్తున్న ఘంటసాల)
పల్నాటియుధ్ధంలో నాలుగు పాటలు పాడారు. రెండు అక్కినేనితో, ఒకటి కన్నాంబతో, ఒకటి సోలోగా పాడారు.
భరణీ వారు తీసిన 'రత్నమాల' సినీమాలో భానుమతి తో రెండు డ్యూయెట్లు, ఒక సోలో పాడడమే కాక, భానుమతి, రామకృష్ణగార్ల ప్రోత్సాహంతో సి ఆర్ సుబ్బురామన్ కు సహాయకుడిగా పనిచేయడంతోపాటు స్వతంత్రంగా కొన్ని పాటలను స్వరపర్చడం జరిగింది. 
ఇక, ఘంటసాల పేరు సినిమా రంగంలోనూ, ప్రేక్షకులలోనూ బాగా వినిపించడం ప్రారంభమయింది.

బాలరాజు ' చెలియా కనరావా' పాటతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మార్మోగింది.



బాలరాజు సినీమాయే సంగీత దర్శకుడిగా తన తొలి సినీమాగా ఘంటసాల చెపుతారు.
ఘంటసాల బలరామయ్యగారి బలవంతంమీద, సంగీతదర్శకుడు గాలి పెంచల నరసింహారావుగారి ప్రోద్బలంతో, సహ సంగీతదర్శకుడి హోదాలో 11 పాటలను స్వరపర్చారు.
ఇందులో అక్కినేని పాడిన 'చెలియా కనరావా' పాట గ్రామఫోన్ రికార్డ్ లో ఉంటే, ఘంటసాలగారు పాడిన అదే పాట సినీమాలో ఉంటుంది. 
అక్కినేని నాగేశ్వరరావు పాడిన పాట సినిమాలో లేదు కనుక   ఆ అరుదైన పాట రికార్డు ఇక్కడ వినండి :
ఈ చిత్రంలో వక్కలంక సరళతో పాడిన 'నవోదయం శుభోదయం' పాటే తన తొలి సినీమా పాట స్వరరచనగా ఘంటసాల పేర్కొంటారు.


 ఘంటసాలగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు ఇద్దరూ సినీరంగప్రవేశం ఒకేసారి చేసారు.ఘంటసాలగారితో తన తొలినాళ్ళ స్నేహం గురించి ఏఎన్నార్ ఏమన్నారో ఈ ఆడియో ఫైల్ లో వినవచ్చు.
ఘంటసాలగారి సినీజీవితానికి ఒక గొప్ప మలుపు 'కీలుగుఱ్ఱం' సినిమా. ఇందులోని 'కాదుసుమా కలకాదు సుమా' పాటతో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు మార్మోగింది. ఈ సినీమా తమిళంలో కూడా అత్యంత  విజయవంతమై తమిళనాట కూడా ఘంటసాల పేరు అందరికీ తెలియడం ప్రారంభించింది.
ఈ సినీమా గురించి మరింత చెప్పవలసి ఉంది.
కీలుగుఱ్ఱం చిత్ర నిర్మాత దర్శకుడు మీర్జాపురం రాజావారు. ఆయన సతీమణి సి. కృష్ణవేణి ప్రముఖ నటి, గాయని. వీరు స్థాపించిన శోభానాచల, ఎమ్.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ ద్వారా తమ సొంత స్టూడియో లో ఒకేసారి మూడు సినీమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మూడింటికి సంగీతం సమకూర్చే బాధ్యతను యువ సంగీత దర్శకుడైన ఘంటసాలకు అప్పగించారు. ఘంటసాలగారు మొట్టమొదట స్వతంత్రంగా సంగీతం చేయడానికి ఒప్పందం చేసుకున్న చిత్రం 'లక్ష్మమ్మ', తరువాత, 'మనదేశం', తరువాత 'కీలుగుఱ్ఱం'. అయితే, ఈ మూడింటిలో  1949 లో ముందుగా 'కీలుగుఱ్ఱం', అదే సంవత్సరం ఆఖరులో 'మనదేశం' చిత్రాలు విడుదలై కొత్త సంగీతదర్శకుడిగా, గాయకుడిగా ఘంటసాల పేరు తెలుగు వారందరికీ చిరపరిచితమయింది. తాను ముందుగా ఒప్పుకున్న మొదటి చిత్రం 'లక్ష్మమ్మ' 1950 లో రిలీజయింది. ఈ లక్ష్మమ్మ కు పోటీగా ఘంటసాల బలరామయ్యగారు, అంజలీదేవి, అక్కినేని లతో 'లక్ష్మమ్మ కథ' సినీమా తీశారు, కానీ, విజయవంతం కాలేదు.
కృష్ణవేణి, సి.హెచ్. నారాయణ రావు నటించి త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మమ్మ' గొప్ప హిట్ అయింది. రెండింటి కథా ఒకటే.
ఇక, అక్కడ నుండి ఘంటసాల రక్షరేఖ, లైలామజ్ను, ధర్మాంగద, మనదేశం వంటి చిత్రాలలో తన పాటలతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు.

భానుమతిగారి సూపర్ హిట్ విషాద ప్రేమగాథ 'లైలామజ్ను'. ఇందులో  ఘంటసాలగారు పాడిన తొమ్మిది పాటలు చిత్రానికి జీవం పోసాయి. తమిళంలో కూడా లైలామజ్ను,  పాటలవల్లే సూపర్ హిట్ అయింది. 
1949 లో 'మనదేశం'
1950 లో 'షావుకారు' చిత్రాల సంగీతదర్శకుడిగా ఘంటసాల అగ్రశ్రేణి సంగీతదర్శకుల జాబితాలోకి ఎక్కారు. 
ఇక అక్కడ నుండి గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాల సినీ ప్రస్థానం రెండున్నర దశాబ్దాల పాటు నిరాటంకంగా  కొనసాగింది. 
ఒక ప్రక్క సినీమాలలో పాడుతూనే, ఓ మూడేళ్ళపాటు  మరో ప్రక్క ఆలిండియా రేడియోలో  శాస్తీయ, లలిత  సంగీతం, నాటకాలు, రూపకాలు అంటూ అన్ని రకాల కార్యక్రమాలలో  పాల్గొనేవారు.

ఘంటసాలగారిని ఆదిలో తిరస్కరించిన హిస్ మాస్టర్స్ వాయిస్ (HMV) వారు, తమ నిరంతర గాయకుడిగా నియమించుకున్నారు .

తెలుగువారి సొత్తుగా చెప్పుకునే పద్యపఠన ప్రక్రియను, నూతన శైలిలో తెలుగువారికి అందించిన ఘనత ఘంటసాలకే దక్కుతుంది. తెలుగులో సుప్రసిధ్ధ కవులందరి పద్యాలను గ్రామఫోన్ రికార్డ్ లు గా విడుదల చేసి దేశమంతా సంచలనం సృష్టించారు.  అలాగే, తిరుపతి వేంకటేశ్వరుని మీద లెఖ్ఖకు మించి భక్తిగీతాలను, ప్రబోధగీతాలను, దేశభక్తి గీతాలను ఆలపించి  తెలుగునాట ఒక ప్రభంజనంలా సంచలనం సృష్టించారు.

పద్య పఠనం విషయంలో ఘంటసాలవారు తమ గురుదేవులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారినే స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకున్నారు.  గురువుగారి ప్రభావం ఘంటసాలగారి మీద చాలానే ఉంది.
కేవలం ఘంటసాల పాటలతోనే హెచ్.ఎమ్.వి. వారు ఆంధ్రదేశంలో నిలదొక్కుకున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కానేరదు.

చలన చిత్రసీమలో ఘంటసాలగారు సాధించిన విజయాలు అనన్యసామాన్యం, అనితరసాధ్యం. 

1950 ల తర్వాత, ఘంటసాల సినీ సంగీత చరిత్ర ఒక తెఱచిన పుస్తకం. ఆ విషయాలు నేను చెపితేనే మీరు తెలుసుకోవాలని లేదు.
ఇంటింటా ఒక ఘంటసాల వెలయడానికి కారణభూతులైన తెలుగు ప్రజలందరికీ ఘంటసాల తమ మనిషే. ఈనాటికీ చాలా తెలుగు లోగిళ్ళలో ఘంటసాల పాటతోనే సూర్యోదయమై, ఆయన జోలపాటతోనే నిద్రపోతారు.

ఈవిధంగా విజయపథంలో పయనిస్తున్న ఘంటసాలగారు విజయనగరం వదలి వెళ్ళిన మరో ఐదారేళ్ళకు మరల తమ గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారిని విజయనగరంలో దర్శించారు.
ఆ విశేషాలన్నీ.....
వచ్చేవారం....   (సశేషం)
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified. 


Friday, July 3, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఆరవ భాగం


 
35, ఉస్మాన్ రోడ్.-  ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) -  ఆరవ భాగం
మొదటిభాగం  ఇక్కడ
రెండవ భాగం   ఇక్కడ
మూడవభాగం  ఇక్కడ
నాలుగవభాగం ఇక్కడ
ఐదవభాగం      ఇక్కడ
భాగం - 6. 

*నెం.35 ఉస్మాన్ రోడ్*

                🌳
                    ...స్వరాట్

విజయనగరంలో సంగీతశిక్షణ పూర్తి చేసుకొని స్వగ్రామమైన చౌటపల్లి చేరుకున్న ఘంటసాల జీవితంలో చోటుచేసుకున్న అనేక సంఘటనలు , విశేషాలు అన్నీ , అనేక పత్రికలలో , పుస్తకాల రూపంలో వెలువడ్డాయి . ఆ విషయాలన్నీ  ఆ తరం తెలుగువారందరికీ అవగతమే. అయినా ఈ తరంవారు  ఘంటసాల గురించి మరింత తెలుసుకునేందుకు , ఘంటసాల తన జీవితచరిత్రలో చెప్పుకున్న విశేషాలను సంక్షిప్తంగా , ఈ 6వ భాగంలో మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.

కర్ణాటక సంగీత విద్యలో పట్టభద్రుడైన ఘంటసాల తన స్వగ్రామమైన చౌటపల్లి చేరుకున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆంధ్రదేశంలో అనేక చోట్ల శ్రీరామనవమి , గణపతి నవరాత్రులు , శారదా నవరాత్రులు , మొ.ఉత్సవ కార్యక్రమాలలో , పెళ్ళిళ్ళలో అనేక సంగీత కచేరీలు చేశాడు. అటువంటి సమయంలోనే ఆంధ్రదేశంలో సుప్రసిధ్ధ సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులైన సర్వశ్రీ హరినాగభూషణంగారు , పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు , వారణాసి బ్రహ్మయ్య శాస్త్రిగారు , క్రోవి సత్యనారాయణ గారు
మొదలైనవారి ఆశిస్సులు లభించాయి. 

అయితే  ఘంటసాలకు కేవలం సంగీత కచేరీలపైన వచ్చే ఆదాయంతోనే జీవించడం సాధ్యం కాదనిపించింది. 
ఆంధ్రదేశంలో సంగీత కచేరీలకన్నా నాటక ప్రదర్శనలు , హరికధా కాలక్షేపాలే ఆర్ధికంగా లాభదాయమనిపించింది. నాటక కళ మీద మొదటినుంచి అభిరుచి ఉండడంవలన తానే స్వయంగా ఒక నాటక సంస్థను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. 
అలాటప్పుడే ప్రముఖ రంగస్థల నటులైన అద్దంకి ,పారుపల్లి , సూరిబాబు , రఘురామయ్య, పులిపాటి , పీసపాటి 
మొ.వారి పరిచయాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలో వీరిలో కొందరితో కలసి స్టేజ్ మీద నటించే అవకాశమూ లభించింది. ఆ తరుణంలోనే ఒకసారి ఆంధ్రనాటక కళాపరిషత్ లో కూడా పాల్గొన్నా ఏవిధమైన గుర్తింపు లభించలేదు. 
(అయితే మరో పుష్కరం తరువాత అదే ఆంధ్రనాటక కళా పరిషత్ వారు ఘంటసాలను ఘనంగా సన్మానించడం జరిగింది. )

ఈ విధంగా ఉదరపోషణకోసం సంగీత కచేరీలతో , నాటకాలతో దుర్భరంగా బండిలాగిస్తున్న సమయంలో పులిమీద పుట్రలా మరో విపరీతం వచ్చిపడింది.

 రెండవ ప్రపంచ యుధ్ధ ప్రభావం మన దేశం మీద కూడా పడింది. బ్రిటిష్ వారి బానిసగా మన దేశం దాస్యం చేస్తోంది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నాయకులందరిని జైళ్ళలో పెట్టారు. 1942 ఆగస్ట్ లో  జాతీయ కాంగ్రెస్ 'క్విట్ ఇండియా' తీర్మానం చేసింది. రాజకీయంగా దేశమంతటా ఉద్రేక పరిస్థితి నెలకొన్నది. విప్లవోద్యమం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా చెలరేగింది.

రాజకీయాలగురించి గానీ , దేశ పరిస్థితి గురించి గానీ , ఉద్యమాల గురించి గానీ ఏమీ తెలియని ఘంటసాలలో ఒక అమాయక ఆవేశం ఉవ్వెత్తున తలయెత్తింది. స్కూల్ చదువు కూడా అంతంతమాత్రమే.
అతను తన పదవ ఏట , హరిజనోధ్ధరణ ప్రచారం కోసం జాతిపితగా పేరొందిన మహాత్మాగాంధీ తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది. భారతదేశ  స్వాతంత్రోద్యమ సూత్రధారి కూడా అదే గాంధీయని తెలిసింది. దేశంకోసం , భారత పౌరుడిగా  తాను కూడా త్యాగం చేయవలసిన సమయం ఆసన్నమైయిందని సహ మిత్రులతో కలసి స్థానికంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని వీధులలో దేశభక్తి గీతాలు ఆలపించడం మొదలెట్టాడు. ఇది చూసిన తెల్ల దొరల ప్రభుత్వం అందరితోపాటు ఘంటసాలకు కారాగార శిక్ష విధించింది.


ఘంటసాలకు జైలు జీవితం ఎంతగానో సహకరించింది. 
నియమబధ్ధమైన జీవితం , కర్తవ్యం , స్థిర సంకల్పం మొదలైన విషయాల లో మంచి అవగాహన ఏర్పడింది. 
అందరితో కలివిడిగా మెలిగే నైజం ఉండడం వలన జైలులో వీరూ వారు అనక అందరికీ స్నేహపాత్రుడయ్యాడు. 
ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకులైన సర్వశ్రీ - బెజవాడ గోపాలరెడ్డి , పొట్టి శ్రీరాములు , బి ఎస్ మూర్తి , ఎర్నేని సుబ్రహ్మణ్యం వంటి వారి సహచర్యం ఘంటసాలకు లభించింది. ఘంటసాల తన పాటలు , పద్యాలతో జైల్లోని అన్ని వర్గాలవారిని ఉత్సాహపరచి , ఉత్తేజితులను చేశాడు. 
అయితే , జైలునుండి విడుదల పొందిన తరువాత ఘంటసాలలో ఆ రాజకీయ ప్రభావం ఏదీ మిగలలేదు. మళ్ళా యధాప్రకారంగా నాటకాలతో , సంగీత కచేరీలతో రోజులు గడపసాగాడు.

అటువంటి సందర్భంలో ఘంటసాలకు పెదపులివర్రుకు చెందిన కొడమంచిలి వెంకట రత్న శాస్త్రి గారి రెండవకుమార్తె సావిత్రి తో వివాహం నిశ్చయమయింది.

ఆ పెళ్ళి విశేషాలు....
వచ్చేవారం....
                        సశేషం.

Friday, June 26, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఐదవ భాగం


నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) -  ఐదవ భాగం
 
మొదటిభాగం  ఇక్కడ
రెండవ భాగం   ఇక్కడ
మూడవభాగం  ఇక్కడ
నాలుగవభాగం ఇక్కడ

                              

                             నెం. 35 ఉస్మాన్ రోడ్

               
                                                                                                 - స్వరాట్

విజయనగరం లో ఘంటసాల సంగీతాభ్యాసం అటు సంగీత కళాశాల లోనూ ఇటు గురువుగారు పట్రాయని సీతారామశాస్త్రి గారింటి వద్ద కూడా సాగేది. సంగీతం పట్ల ఒక లక్ష్యం , ఉత్సాహం , శ్రధ్ధ గల విద్యార్ధులకు ఏ సమయంలోనైనా సీతారామశాస్త్రి గారు సంగీత శిక్షణలు యిచ్చేవారు. ఈ విషయాన్ని ఘంటసాలవారు తమ  జీవిత చరిత్రలో , ఇంటర్వ్యూ ల లో తెలియజేశారు.

" సంగీత విద్య యెడల నాకు గల తీవ్రమైన ఆకాంక్షను అర్ధం చేసుకున్నారు. నన్ను సర్వ విధాలా ప్రోత్సహించి నాలో ధైర్యం కలిగించారు. శ్రీ శాస్త్రిగారి గానం , వారి మూర్తిమంతం,   సౌమ్యత నన్ను ప్రబలంగా ఆకర్షించాయి. 'గురువు' అన్న మాట శ్రీ శాస్త్రిగారియెడలనే సార్ధకమయిందనిపించింది. వారి సన్నిధిలో సంగీత సాధన ప్రారంభించాను.
ఈ సమయం , ఆ సమయం అని లేకుండా అన్ని వేళల్లో నన్ను కూర్చోబెట్టి సాధన చేయించేవారు. ఆయన ఎప్పుడూ " సాంబ సదాశివ" నామాన్ని స్మరిస్తూ ,అదే నాదంగా నాభిస్థానం నుండి ఎలా పలకాలో చెపుతూ నాతో కూడా పాడించేవారు.

ఘంటసాలగారు AIR కార్యక్రమంలో తనపైన ప్రభావం చూపిన గురువుగారి గురించి  ఇలా అన్నారు - 

ఆడియో లింక్ ఇక్కడ వినవచ్చు. 



ఆ విధంగా ఘంటసాల సంగీతాభ్యాసం కొనసాగింది.

సంగీతాభ్యాసానికి విజయనగరం వచ్చినప్పుడు కొంతకాలం తన ఆకలిబాధను తీర్చుకోవడానికి మధూకరం ఎత్తినా,  సంగీతకళాశాలలో చేరిన కొన్నాళ్ళకు  మహారాజావారి  సింహాచలం సత్రవులో పద్దు కుదిరింది. ఆకలి సమస్య తీరింది. సత్రవు భోజనం, మఠం నిద్ర (గురువుగారింట).  కళాశాల విద్య ముగిసే రోజులలో తన రాత్రి బసను "మూడు కోవెళ్ళ" కు మార్చాడు.

ఆ రోజుల్లో పేద విద్యార్ధులు వారాలు , మధూకరం చేసుకుంటూ విద్యభ్యాసం చెయ్యడాన్ని అందరూ సహజంగానే భావించేవారు.
గృహస్థులు కూడా ఆలాటి విద్యార్ధుల ఎడల ప్రేమను కనపర్చేవారు. సంప్రదాయజ్ఞులు కూడా విద్యార్ధులు మధూకర వృత్తిని అవలంబించడం మహోత్కృష్టకార్యంగా భావించేవారు.

అయితే ఇందుకు మినహాయింపులు కూడా ఉంటాయి. గురువులు శిష్యుడి శ్రధ్ధను , మనోప్రవృత్తిని గమనించి అందుకు తగినట్లుగానే విద్యాబోధన చేసేవారు. అందుకు ఉదాహరణ గా యీ చిన్న కథ చూద్దాము.

ఒక కుర్రవాడు గురుకులంలో చేరి , గురు శుశ్రూష చేస్తూ శ్రధ్ధగా విద్యాభ్యాసం చేసేవాడు. అతని భోజన వసతులన్నీ గురువుగారింటనే సాగేవి. ఆ గురు దంపతులు ఆ బాలుడిని తమ కన్నకొడుకులతో సమానంగా ప్రేమగా  చూసుకునేవారు.

ఇలా కొన్నేళ్ళు గడిచాయి.

ఒకరోజు గురుపత్ని ఆ విద్యార్ధికి భోజనం వడ్డించి అన్నంపై నెయ్యి వడ్డించింది. వెంటనే , ఆ శిష్యుడు ఆమెను వారిస్తూ , " అమ్మగారు , మీరు పొరపాటున  నాకు నెయ్యికి బదులు ఆముదం వడ్డిస్తున్నారు. గమనించండి ," అని అన్నాడు. " అయ్యో ! అలాగా నాయనా ! చూసుకోలేదు " అంటూ ఆవిడ మరల నేయి తీసుకువచ్చి వడ్డించింది. ఇదంతా  గురువుగారు చూస్తూనే ఉన్నారు. మర్నాటి ఉదయం శిష్యుడు అధ్యయనం కోసం గురువుగారి సమక్షానికి వచ్చాడు. గురువుగారు అతనిని చూసి " నాయనా ! నీ విద్యాభ్యాసం ముగిసింది. ఇక నీవు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళవచ్చును " అని చెప్పారు. అది విని శిష్యుడు నిర్ఘాంతపోయాడు. తనవల్ల ఏం తప్పు జరిగిందో తెలియక ,  గురువుగారి మాటలు అర్ధంకాక శిష్యుడు గురువుగారి కాళ్ళమీద పడ్డాడు. 

ఆయన అతనిని  లేవదీసి బుజ్జగింపుగా " నాయనా ! నీకు ఎప్పుడైతే విద్య పట్ల లక్ష్యం మారి ఇతర విషయాలపై బుధ్ధి లగ్నం చేశావో , అప్పుడే నీ విద్య ముగిసింది. ఇన్నాళ్ళూ నీవు గురువమ్మగారి చేతి భోజనమే చేస్తున్నావు. ఇన్నాళ్ళూ , ఆవిడ నీ భోజనంలో ఆముదమే వడ్డించేది , నెయ్యి కాదు. నీవు మారుమాటాడకుండా అదే భుజించేవాడివి. అప్పుడు నీ లక్ష్యం , ఏకాగ్రత అంతా నీ విద్య మీదనే ఉండేది. నిన్న నీకు భోజనంలో నెయ్యికి బదులు ఆముదం వడ్డించారానే విషయం తట్టింది. అంటే నీ దృష్టి మరలింది. ఏకాగ్రత తగ్గింది. ఇంక నీకు విద్య బుధ్ధికెక్కదు. నీ విద్యాభ్యాసం ముగిసినట్లే. ఇక నీవు ఇంటికి వెళ్ళి వేరే ఏదైనా వృత్తి చేసుకొని నీ తల్లిదండ్రులను సుఖపెట్టు " అని మంచి సలహాలతో అతనిని గురుకులం నుండి పంపివేశాడు.

ఈ కధ ద్వారా మనం తెలుసుకోవలసింది, ఏ విద్యయైనా నేర్చుకోవాలంటే చిత్తశుధ్ధి , లక్ష్యం , ఏకాగ్రత , వినయ విధేయతలు కావాలి.
ఈ లక్షణాలు ఉన్న విద్యార్ధులు  మాత్రమే తమ కృషితో ఉన్నతిని సాధిస్తారు.

ఈ లక్షణాలన్నింటితో ఘంటసాల వెంకటేశ్వర్లు పట్రాయని సీతారామశాస్త్రి గారి సన్నిధిలో సశాస్త్రీయమైన సంగీత విద్యను క్షుణంగా అభ్యసించాడు.

గురువుగారింట శిక్షణ అయాక నల్ల చెరువు మెట్టల సమీపంలో  ఉన్న ఒక బావి దగ్గర స్నానాదికాలు ముగించి , దగ్గరలో ఉన్న వ్యాసనారాయణ స్వామి గుడి ఆవరణలో మరల సంగీత సాధన చేసేవాడు. ఆ వ్యాసనారాయణ మెట్టనే నల్లచెరువు మెట్టలు , బాబా మెట్టలు అని కూడా అనేవారు. అక్కడ ఖాదర్ అవులియా బాబా ఆశ్రమం ఉండేది. ప్రతీ రోజూ సాయంత్రం ఆ బాబాగారి సమక్షంలో సంగీత , నృత్య కార్యక్రమాలు జరిగేవి.

విజయనగరంలో సంగీత విద్యార్ధులు తమ విద్యాసాధనని పరీక్షించుకోవడానికి , సార్ధకపర్చుకోవడానికి అనేక భజన గోష్ఠులు అవకాశం కల్పించేవి. వ్యాసుల రాజారావు గారి మేడలోనూ , వంకాయలవారింటిలోనూ , శంభరదాసుగారి కుటీరంలోనూ   ప్రతీవారం ఏదో రోజున భజన కాలక్షేపం ఉండేది. ఏకాహాలు , సప్తాహాలు అంటూ ఏడాది పొడుగునా సత్కాలక్షేపాలు జరిగేవి. వీటిలో , విద్వాంసులు , విద్యార్థులు అనే తేడాలేకుండా అందరూ పాల్గొనేవారు. ఈ భజన గోష్ఠులలో సాధకులకి మంచి ప్రోత్సాహం , పాడడానికి చొరవ ఏర్పడేవి . ఏదో ఒక కీర్తన తీసుకొని బృందగానం చేసేవారు. స్వరకల్పనలలో అందరూ పోటీపడి పాల్గొనేవారు.

ఇలాటివాటిని వెంకటేశ్వర్లు బాగానే సద్వినియోగం చేసుకున్నాడు.
అంతేకాదు , గురువుగారి " కౌముదీ పరిషత్ " సాహీతీ , సంగీత గోష్ఠులను ఆసక్తితో , శ్రధ్ధగా పరిశీలిస్తూ తన సంగీతవిద్యను పెంపొందించుకున్నాడు.

ఇటువంటి సుహృధ్భావ వాతావరణం లో ఘంటసాల సంగీత విద్య ముగిసింది.
ఇక ఆ ఊరినుండి వెళ్ళిపోయే సమయంలో , విజయనగరం లో శ్రీ మారుతీ భక్త మండలి , సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ ఘంటసాలచేత ఒక సంగీత కచేరీ చేయించారు. ఆ సందర్భంగా ఘంటసాలకు , హరికధా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి చేతుల మీదుగా ఒక తంబురాను బహుకరించారు. ఆ తంబురా తన జీవితంలో అత్యంత విలువైనదిగా ఘంటసాలవారూ తరచూ అందరికీ చెప్పేవారు.

ఘంటసాల వెంకటేశ్వర్లు సంగీత కళాశాల విడిచిపెట్టిన నాటికి ప్రముఖ కర్ణాటక సంగీత గాత్రజ్ఞులు సర్వశ్రీ నేదునూరి కృష్ణమూర్తి , నూకల చిన సత్యనారాయణ , జనగాం ఆంజనేయులు , వైణిక విద్వాంసులు అయ్యగారి సోమేశ్వరరావు , మొ.వారు అప్పటికింకా విద్యార్ధి దశలోనే ఉండేవారు.

ఇక్కడ , శ్రీ పట్రాయని సంగీతరావు గారు చెప్పిన ఆసక్తికరమైన విషయం.
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు , శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు , విజయనగరం సంగీత కళాశాలలో వైలిన్ విద్యార్ధులుగా చేరి సంగీతం నేర్చుకున్నారు. వైలిన్ లో శిక్షణ ముగిసిన కొన్నేళ్ళకు గాత్రంలో సాధన చేసి గాత్ర విద్వాంసులుగా స్థిరపడ్డారు. ఈ యిద్దరూ కూడా కొన్ని సంగీత కచేరీలలో శ్రీ సంగీతరావు గారికి వైలిన్ వాద్య సహకారం అందించారట.

(అలాగే , మద్రాస్ లో జరిగిన ఒక కచేరీలో సంగీతరావు గారికి శ్రీ హరి అచ్యుత రామశాస్త్రి గారు (ప్రముఖ సంగీత విద్వాంసులు కీ.శే. శ్రీ హరి నాగభూషణం గారి కుమారులు శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి. చాలా ప్రముఖ సంగీత దర్శకుల వాద్యబృందాలలో పేరుపొందిన వైలినిస్ట్.) వైలిన్ సహకారం అందించడం నాకు బాగా గుర్తుంది.)

సంగీత విద్యలో పట్టభద్రుడైన ఘంటసాల తన స్వగ్రామం చేరుకున్నారు.

తరువాత , ఏం జరిగిందో , మనం కూడా విజయనగరం నుండి బయటకు వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడేనా...
కాదు , వచ్చే వారం.

                     .... సశేషం

Friday, June 19, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - నాలుగవ భాగం


మొదటి సంచిక ఇక్కడ
రెండవ సంచిక ఇక్కడ
మూడవ సంచిక ఇక్కడ

భాగం - 4.
                              
                                         నెం.35 ఉస్మాన్ రోడ్                                                                                                                       -                                      స్వరాట్


ఘంటసాల వెంకటేశ్వర్లు విజయనగరం లోని విజయరామ సంగీత కళాశాలలో ప్రవేశించేనాటికి విజయనగరం నేపథ్యం, సంగీత కళాశాల నేపథ్యం  గురించి మనం కొంత అవగాహన ఏర్పర్చుకోవాలి. అప్పుడే , ఘంటసాల విద్యాభ్యాసం ఎలా జరిగిందనే విషయం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.
 దాదాపు వంద సంవత్సరాల క్రిందటి విజయనగరం యొక్క గత వైభవం గురించి సమర్ధవంతంగా  ఈనాడు మనకు చెప్పగల ఏకైక వ్యక్తి శ్రీ పట్రాయని సంగీతరావు గారు మాత్రమే. అందుకే , వివిధ సందర్భాలలో శ్రీ సంగీతరావు గారు వెలిబుచ్చిన విషయాలనే ఈ నాలుగవ భాగంలో ఎక్కువగా తీసుకోవడం జరిగింది. వారి మాటలలోని సారాంశాన్ని నాకు తెలిసిన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను.

" సంగీతం నేర్చుకోవడానికి దూరప్రాంతాలనుంచి విజయనగరం వచ్చేవారు. అలా వచ్చినవారిలో నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రులలో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకరు.
సాధ్యమైనంత వరకు విద్యార్ధిలో ఉండే సహజసిధ్ధమైన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి దోహదం చేసేదే నిజమైన విద్య. అది మా తాతగారి విద్యా విధానం . ఆ పధ్ధతినే మా నాన్న అనుసరించారు."

1936 డిసెంబర్ లో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించారు. ఆనాటి విజయనగరం మహారాజు - శ్రీమద్ అలక్ నారాయణ గజపతి మహారాజుగారు (మనకు తెలిసిన అశోక్ గజపతిరాజు , ఆనంద గజపతిరాజు గార్ల తాతగారు).
ఆనాడు విజయనగరం సాంస్కృతికంగా ఆంధ్రదేశంలో ప్రముఖంగా ఉండేది. విజయనగరం కాలేజీ దేశంలో పురాతనమైనది.సంస్కృత కళాశాల , సంగీత కళాశాలలు విజయనగరంలో మాత్రమే ఉండేవి.
నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తెరమరుగై అప్పటికి చాలాకాలం అయింది. ఆటపాటలమేటి అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు , మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రిగారు , ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, వీణా వెంకటరమణయ్య దాసుగారు , మల్లాది విశ్వనాథ కవిరాజు , కవిశేఖర భోగరాజు నారాయణ మూర్తి , మొదలయిన మహనీయులు ఆనాటికి ఉండనే ఉన్నారు. పేరి లక్ష్మీనారాయణ శాస్త్రిగారు , వఝ్ఝల చినసీతారామశాస్త్రిగారు సంస్కృత కళాశాల అధ్యాపకులు గా ఉండేవారు.
సంగీత కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ఆదిభట్ల నారాయణదాసుగారు. వారి హయాంలో హరికథా కాలక్షేపం విద్యార్ధులే ఎక్కువగా ఉండేవారు. దాసుగారు రిటైరయ్యాక ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ప్రిన్సిపాల్ అయ్యారు. ఆయన వచ్చిన తరువాత సంగీత కళాశాలలో సంప్రదాయ సంగీతాధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. వాసా వెంకటరావుగారు వీణ అధ్యాపకులుగా , పట్రాయని సీతారామశాస్త్రి గారు , పేరిబాబుగారు , నేమాని వరహాలు దాసుగారు గాత్ర పండితులుగాను , మునిస్వామి గారు నాదస్వర పండితులు గా , శ్రీపాద సన్యాసిరావుగారు మృదంగ పండితులుగానూ ఉండేవారు.

సరిదె లక్ష్మీ నరసమ్మగారు , ఆ రోజుల్లో , సుప్రసిధ్ధ నర్తకి. ఆవిడనే కళావర్ రింగ్ అనేవారు.
1940 ప్రాంతాల్లో శ్రీ శ్రీ తరుచూ విజయనగరం లో కనిపించేవారు. శ్రీ ఆరుద్ర విజయనగరం కాలేజీ లోనే చదువుకున్నారు. ప్రముఖ కవి శ్రీరంగం నారాయణ బాబు అక్కడివారే. గొప్ప సంగీతాభిమాని . ద్వారం వారి సంగీత కచేరీ అయిన తరువాత తరుచూ నారాయణ బాబుగారి ప్రసంగం కూడా ఉండేది. ప్రముఖ సాహితీవేత్త రోణంకి అప్పలస్వామిగారు , సుప్రసిధ్ధ కథకుడు చాగంటి సోమయాజులు గారూ విజయనగరంలోనే వుండేవారు. విశ్వవిఖ్యాత పహిల్వాన్, కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు గారు కూడా విజయనగరం లోనే ఉండేవారు. అప్పటికే అనారోగ్యంపాలయ్యారు.
అప్పట్లో , చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ ఆంధ్రదేశం అంతటా సుప్రసిధ్ధులుగా ఉండేవారు.నటుడిగా , హరికథకుడిగా , నాటి యువతరానికి మార్గదర్శి ఆయన.మారుతీ భక్త మండలి అనే కళా సంస్థ నిర్వహించేవారు.
సాలూరు చిన గురువుగా ప్రసిధ్ధులైన పట్రాయని సీతారామశాస్త్రి గారింట్లో నిత్యమూ సంగీత , సాహిత్య సమ్మెళనం జరుగుతూండేది. గురువుగారి మిత్రులు , సాహిత్యవేత్తలు , పండితులు , కవులు , కధకులు , నవలా రచయిత లు అందరూ అనేక విధాలైన చర్చలు చేస్తూండేవారు. సంగీత , సాహిత్యాల పరస్పర సంబంధ విషయమై ఆ రోజుల్లో సీతారామశాస్త్రి గారి సంగీత శిష్యుడు పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారి ' లక్ష్య , లక్షణ సమన్వయం ' అనే వ్యాసం ' వేదిక్ రీసెర్చ్' అనే పత్రికలో ప్రచురించారు. అది గురువుగారి ఆదర్శాలను ప్రతిబింబించేదిగా భావించబడింది. గురువుగారింట్లో సమావేశమైన మిత్రబృందమే తరువాత 'కౌముదీ పరిషత్తు' గా పరిణమించింది. ఈ పరిషత్తు సభ్యులు చాలామంది సుప్రసిధ్ధ రచయితలుగా , సంగీతజ్ఞులుగా లోకానికి పరిచయమయ్యేరు.

శ్రీ బుర్రా శేషగిరిరావు పంతులుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన అతి పెద్ద సంస్ధ ' ఆంధ్ర భారతీ తీర్థ'. అదే ' ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ'. యువరచయితలు , కవులు , కధకులు , తమ రచనలను ఈ సంస్థ సభలలో వినిపించేవారు. యువగాయకులు , వాద్యకులు తమ గానాన్ని ప్రదర్శించేవారు. అర్హులకి బిరుదు ప్రదానాలని కూడా ఈ సంస్థ నిర్వహించేది.
మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గురువుగారు , సుప్రసిధ్ధ సంగీతజ్ఞులు కీ.శే. పారుపల్లి రామకృష్ణయ్యగారికి ' గాయక సార్వభౌమ' బిరుదు , విద్యావేత్త గిడుగు సితాపతిగారికి గౌరవ డాక్టరేట్ , స్థానం నరసింహారావుగారికి ' నటశేఖర' ఈ సంస్థే ప్రదానం చేసింది.
( పట్రాయని సీతారామశాస్త్రి గారికి , పట్రాయని సంగీతరావుగారికి కూడా ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ వారు 'సంగీతభూషణ' బిరుదులను ఇచ్చింది.)

ఇటువంటి సాంస్కృతిక వాతావరణం తో నిండిన విజయనగరంలో సంగీతం అభ్యసించడానికి గంపెడాశతో వచ్చాడు ఘంటసాల వెంకటేశ్వర్లు. వచ్చీ రాగానే కలిగిన చేదు అనుభావాలను దిగమ్రింగుకొని పట్రాయని సీతారామశాస్త్రి గారి పంచనజేరాడు.
అప్పుడు అతను ఎలా ఉండేవాడు ?
" ఘంటసాలతో నా మొదటి పరిచయం 1938 లో అని జ్ఞాపకం.తేదీలవారీగా చెప్పుకోవాలంటే ఆ జ్ఞాపకాలు యదార్ధానికి కొంచెం  ఇటూ అటు గా ఉండే అవకాశం ఉంది.
చామనచాయగా , బొద్దుగా , కొంచెం పళ్ళు ఎత్తుగా , కాంతివంతమైన కళ్ళతో , స్నేహశీలమైన హావభావాలతో అతను అందరికీ ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడు. ఆ రోజుల్లో ఒక నిక్కరు , గళ్ళషర్టూ ఇది వేషం. కొంచెం ఈడుకి మించి కనిపించేవాడు."
గురువు గారు పట్రాయని సీతారామశాస్త్రిగారి విలక్షణత గురించి గతంలో కొంత చెప్పుకున్నాము. ఇప్పుడు మరికొంత చూద్దాము.
" శాస్త్రిగారు ఒకవిధంగా వివాదాస్పదమైన పండితులుగా భావింపబడేవారు. వారికి సంగీతం లోనే కాక సాహిత్యం లో కూడా మంచి అభినివేశం ఉండేది. కచేరీలలో ఆయన సొంత రచనలే గానం చేసేవారు. హర్మోనియం ప్రక్క వాద్యంగా తానే వాయించుకొని పాడేవారు. ఇది సంప్రదాయజ్ఞులకి నచ్చేదికాదు. శాస్త్రిగారికి త్యాగరాజస్వామి కీర్తనల విషయంలో త్యాగరాజు సంగీతం పట్లే కాకుండా సాహిత్యం విషయంలో కూడా ఎంతో మమకారం ఉండేది. త్యాగరాజ కీర్తనలలోని సాహిత్యం పోషించడానికి ఆయన ఒక విశిష్టమైన పధ్ధతిలో గానం చేసేవారు. నిజానికి శాస్త్రానికి విరుధ్ధంగా ఆయన ఏమీ చేయలేదు. సలక్షణమైన రాగతాళాలను అతిక్రమించి ఆయన ఎన్నడూ పాడేవారు కాదు. కానీ సంప్రదాయజ్ఞులకు ఆయన బాణీ ఏదో విప్లవ ధోరణిలో కనపడేది. ఆయన కాలేజీలో విద్యార్ధులకు సంప్రదాయ పధ్ధతులలోనే పాఠం చెప్పేవారు. బయట గానం చేసేప్పుడు ఆయన పధ్ధతి ఆయనదే.
పట్రాయని సీతారామశాస్త్రి గారు గానం చేసే విధానం అపూర్వమైనది. ఆయన కచేరీలో సరస్వతీ ప్రార్ధన . ఆయన స్వకీయమైన ఒక పద్యంతో ప్రారంభించేవారు . ఆ పద్యం ఆధారంగానే రాగాలాపన , స్వరకల్పన , సంకీర్తన మొదలైన చాలా కచేరీ అంశాలు నడిపించేవారు.
ఆయన తన కచేరీలలో అలవాటు గా పాడిన పద్యం :

సీసపద్యం : 
రాగమందనురాగ రసములొల్కించుటే
అమ్మరో నీ మందహాసమమ్మ

గడియారమునకె సద్గతిని జూపు లయ తాళ
గతులెన్న నీ మందగమనమమ్మ

పూలమాలికల కూర్పును బోలు స్వరకల్పనలు నీదు
మృదుల భాషలు గదమ్మ

శృతియందు లీనమౌ గతి
మది నిల్పుటే
భారతీ నీ శాంతభావమమ్మ

నవరసంబుల సముద్భవమంద జేయుటే
శారదా నీ కటాక్షము గదమ్మ 🌷

తేటగీతి :

భావ రాగంబులును, తాళ ఫణితి , శృతియు
గలియ గానంబు జేసెడి
గాయకునకు
శృతి పుటంబుల నీ నృత్య గతులు నిండ
కున్న ఆ గాయకుడు గాయకుండె జననీ .
https://youtu.be/rxTrppbqk-Y

సామాన్య శ్రోతలనుంచి , సంగీత సాహిత్యాల సమన్వయం కోరే రసజ్ఞులందరికీ సీతారామశాస్త్రి గారి గానం రస ప్రవాహంలో ముంచెత్తేది.

గురువుగారి విశిష్టమైన గానం ఘంటసాలను ఎంతో ఆకర్షించింది. సంగీతం విషయంలో పట్రాయని సీతారామశాస్త్రి గారి మార్గమే ఘంటసాలకి కూడా ఆదర్శమయింది.

తరువాతి కాలంలో ,పట్రాయని సీతారామశాస్త్రి గారి స్మారక సంచికలో గురువుగారి సంగీత శిక్షణలో తాను గ్రహించిన విషయం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మాటలలో ఈ విధంగా ఉంది.



'సంగీత శాస్త్రము , లక్ష్య గ్రంధము నేను ఇతర పండితుల నుండి సంగ్రహించగలిగే వాడినేమో, గాని గురువుగారు నాకు ప్రసాదించినది అనితర లభ్యమైనదని నా విశ్వాసం.
ముఖ్యంగా గాత్ర సాధన చేయడంలో అలవర్చుకోవలసిన శృతిశుధ్ధి , నాదశుధ్ధి , గమకశుధ్ధి , తాళగత , స్వరగత , లయశుధ్ధి శిష్యులకు కలగజేయడంలో ఆ మహానుభావుడు సిధ్ధుడు.
వారు నాదానుభవాన్ని ' సాంబసదాశివ ' అనే నామ సంకీర్తనతో మంత్రవతుగా నాలో ప్రసరింపజేశారు. కీర్తనలలోని రసభావాలకి అనుగుణ్యంగా పట్టువిడుపులతో గమకాలు అంత సార్ధకంగా ప్రయోగించడం గురువుగారి వంటి నాదసిధ్ధులకు మాత్రమే సాధ్యమని నా నమ్మకం."

ఒకవిధంగా పట్రాయని సీతారామశాస్త్రి గారు కాలానికి సరిపడని విద్వాంసులనిపిస్తుంది.

అటువంటి నాదయోగి సన్నిధిలో  వెంకటేశ్వర్లు సంగీతశిక్షణ నిరాటంకంగా కొనసాగింది. తరువాత ,....
వచ్చేవారమే.....         (సశేషం)


                       

Friday, June 12, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - మూడవభాగం

                                           🌳 నెం. 35 , ఉస్మాన్ రోడ్ 🌳

                                                                                         -  స్వరాట్

                                              


తండ్రి గారు తన ఆఖరి క్షణాలలో యిచ్చిన సలహా ప్రకారం ఎలాగైనా సరే సంగీతం నేర్చుకోవాలనే పట్టుదలతో , యింట్లో ఎవరికీ చెప్పకుండా  చేతినున్న ఉంగరాన్ని అమ్మి ఆ డబ్బుతో విజయనగరం చేరుకున్నాడు వెంకటేశ్వర్లు. అక్కడున్న సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించాలని అతని కోరిక. 

కానీ , దురదృష్టం అతడిని వెంటాడుతూనే వుంది. అతను విజయనగరం వెళ్ళిన సమయానికి సంగీత కళాశాల వేసవి శెలవుల కారణంగా మూసివేశారు. ఏం చేయాలో తోచక ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడిగారిని ఆ కుర్రవాడు కలిసి తన గురించి చెప్పుకోగా , కళాశాల తెరిచేంతవరకు సంగీత కళాశాలలోనే తలదాచుకుందుకు అనుమతించారు నాయుడుగారు. అతనిలాటి వారే కొందరు సంగీత విద్యార్థులు శెలవులకు యిళ్ళకు వెళ్ళలేనివారు అక్కడే బసచేసేవారు. తమ మధ్యకు మరో కొత్తవాడు రావడం వాళ్ళకు గిట్టలేదు. ఇతనిని అక్కడలేకుండా చేయడానికి ఏవో సమస్యలు , యిబ్బందులు సృష్టించారు. అందులో భాగంగా , తమకు సంబంధించినదేదో దొంగలించబడిందని అది యీ కొత్త కుర్రాడే చేశాడని నిందమోపి వెంకటేశ్వర్లుకు నిలవనీడ లేకుండా తరిమికొట్టారు. ఆ విద్యార్ధులకు భయపడి కళాశాల కు సమీపంలో వున్న ఎల్లమ్మ గుడిలో కొన్నిరోజులు తలదాచుకున్నాడు. తినడానికి తిండి , నిలువ నీడ లేని అతనికి ఎవరో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి గురించి చెప్పి , ఆయనను కలిస్తే తగు సహాయం చేస్తారని సలహా యిచ్చారట. ఆ ప్రకారం , శ్రీ సీతారామశాస్త్రి గారిని కలసి తన కష్టాలు చెప్పుకున్నాడు.

తర్వాత కాలంలో ఎప్పుడో బయటపడిన విషయం ఏమంటే  ఆ దొంగతనం అభియోగం కేవలం అసూయతో చేశారట. దొంగలించబడిన వస్తువులేం విలువైనవి కావు. అక్కడ బస చేస్తున్న  ఒక విద్యార్ధి ఎక్కడినుండో తలంటుపోసుకోవడానికి కుంకుడుకాయలు తెచ్చి ఎండబెట్టుకున్నాడట. సాయంత్రం వచ్చి చూస్తే అవి కనిపించలేదట. ఆ కుంకుడుకాయలు దొంగిలించింది ఈ కొత్త కుర్రాడే అని అతడిని హింసించి వెళ్ళగొట్టారట. వాళ్ళలో వాడే మరొకడు ఆ కాయలను తీసి కనపడకుండా దాచేసాడట.
ఇంతే జరిగిన విషయం .అసలు విషయం ఏమంటే  మరో కొత్తవాడు వస్తే తమ స్థాన బలిమి ఎక్కడ పోతుందో అనే భయం, అసూయ. బాల్య చాపల్యం.
 ఈ విషయాలు ఏవీ  ఘంటసాలవారి జీవిత చరిత్రలలోఎక్కడా వ్రాయబడలేదు. 

ఘంటసాలవారు తన కధలో " నేను విజయనగరంలో నిలదొక్కుకొని కాలేజీలో సక్రమంగా ప్రవేశించడానికి కూడా ఎంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇటువంటి నిరుత్సాహ పరిస్థితులలో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి దర్శనం చేశాను. " అని మాత్రమే వ్రాసుకున్నారు.

తర్వాత కాలంలో నాకు జ్ఞానం వచ్చాక ఘంటసాలవారి ప్రస్తావన వచ్చినప్పుడు  మా యింట్లో మా పెద్దలు అనుకున్న మాటలు యివి.)

 ఆ కుర్రవాడి పరిస్థితి కి జాలిపడి శాస్త్రిగారు తన యింటనే ఆశ్రయమిచ్చారు. వెంకటేశ్వర్లు పాటవిని సంగీతం నేర్పడానికి సమ్మతించారు.

శ్రీ సీతారామశాస్త్రి గారింట్లో వారితో పాటు వారి అక్కగారు, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు వుండేవారు. వారుకాక సంగీతం నేర్చుకునే విద్యార్థులు కూడా ఓ ఐదుగురు అదే యింట్లో ఒక గదిలో నివసించేవారు. వారితోపాటు వెంకటేశ్వర్లుకు కూడా శాస్త్రిగారింట్లో నిలవ నీడ దొరికింది. మరి భోజనం సంగతేమిటి ? ఆనాడు యిప్పటిలా హోటల్స్ వుండేవికావు.  వున్నా అలాటి చోట్ల భుజించడానికి కావలసిన డబ్బులు విద్యార్ధుల దగ్గర వుండేవికాదు. అలాటి పేద విద్యార్ధులకోసం , ముఖ్యంగా సంస్కృత కళాశాల విద్యార్ధులకోసం విజయనగరం రాజావారు సింహాచలం భోజన సత్రం ఏర్పాటు చేశారు.అందులో  వందలాది సంస్కృత కళాశాల విద్యార్ధులున్నా , సంగీత కళాశాల విద్యార్ధులు ఓ ఇరవైమందికి మాత్రమే భోజన వసతి  ఉండేది. ఆ సత్రవులో భోజన వసతి  దొరకడానికి  కొంత సమయం పడుతుంది.  అడిగిన వెంటనే దొరకదు.అంతవరకూ ఏం చేయాలి. తాత్కాలికంగా శ్రీ సీతారామ శాస్త్రిగారి దయార్ద్ర హృదయం వలన ఆకలి సమస్య తీరినా , వారి ఆర్ధికస్థితి దృష్ట్యా వారిని యిబ్బంది పెట్టకూడదని , చాలామంది పేద విద్యార్ధులలాగనే వెంకటేశ్వర్లు కూడా మధూకరం ఎత్తడానికి నిర్ణయించాడు.

 ఆరోజుల్లో విద్యార్ధులు మధూకరం చేయడం , సంపన్న గృహస్తుల యిళ్ళలో వారాలు చేసుకొని విద్య సాగించడమనేది సహజంగానే జరిగేది. గృహస్తులు తమ పరిధులలో బీద విద్యార్ధులకు చేయూతనిచ్చేవారు. వెంకటేశ్వర్లు కూడా అదే బాట పట్టాడు. శ్రీ సీతారామశాస్త్రి గారింట్లో వుండే నేలనూతుల నాగభూషణం అనే  ఒక విద్యార్ధితో కలసి ఊళ్ళో మధూకరం చేసి పొట్టనింపుకునేవాడు. నాగభూషణం శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి దగ్గర హరికధ , శ్రీ సీతారామశాస్త్రి గారింట్లో వుంటూ సంగీతం నేర్చుకునేవాడు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నాగభూషణాన్ని ఘంటసాల అన్నా అని సంబోధించేవాడు. ఘంటసాలకు జోలె పట్టుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా , యిద్దరికి కావలసిన అన్నాన్ని నాగభూషణమే తీసుకువచ్చేవాడు.

సంగీత కళాశాల తెరిచే వరకు ఆగకుండా శ్రీ సీతారామశాస్త్రి గారు వెంటనే తన యింటనే సంగీత శిక్షణ యివ్వడం ప్రారంభించారు.
విజయనగరం నుండి తిరిగి వెళ్ళేవరకూ గురువుగారింటనే వెంకటేశ్వర్లు గడపడం జరిగింది. బయట ఆహారం దొరకని పరిస్థితులలో భోజనం కూడా గురువుగారింట్లోనే జరిగేది.

ఈలోగా , వేసవి శెలవులు ముగిసి సంగీత కళాశాల తెరవడం జరిగింది. ప్రిన్సిపాల్ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు , చౌటపల్లి నుంచి వచ్చిన యీ ఘంటసాల వెంకటేశ్వర్లు పాటవిని గాత్ర సంగీతానికి యీ కుర్రవాడి కంఠం బాగుంటుందని గాత్రం క్లాసులోనే ప్రవేశించమని సలహా యిచ్చారు. ఆవిధంగా , ఘంటసాలకు సంగీత కళాశాలలో కూడా శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి పర్యవేక్షణలోనే సంగీత శిక్షణ మొదలయింది.

రోజూ కళాశాలలో, తర్వాత యింటి దగ్గర సంగీతం నేర్చుకునేవాడు.

శ్రీ సీతారామశాస్త్రి గారు ఘంటసాలకు నేర్పిన సంగీత
లక్ష్య , లక్షణాల గురించి  తెలుసుకోవాలంటే
ముందుగా , ఘంటసాలవారి గురువుగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వం గురించి , వారి సంగీత బోధన పధ్ధతుల గురించి , వారి కచేరీలు చేసే విధానం గురించి , వారి కుమారులు శ్రీ పట్రాయని సంగీతరావు గారి మాటల్లో.....

Saturday, June 6, 2020

నెం. 35, ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక - అధ్యాయం 1 - రెండవభాగం


నెం. 35, ఉస్మాన్ రోడ్  (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ( రెండవభాగం)

  

                                            నెం. 35, ఉస్మాన్ రోడ్ 
 
                                                                                      - స్వరాట్


ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేముందు నాకు గల అర్హతేమిటో చెపుతానన్నాను.

ఒక మనిషి తనను గురించి పరిచయం చేసుకోవాలంటే , తనకంటూ ఒక స్థాయి , వ్యక్తిత్వం వుండకతప్పదు. అవి లేనివారు తమ వంశవృక్షాలను వెదకి వాటిలోని సారస్వమైన ఫలాలను తనకు ఆపాదించుకొని పదిమందిలో నిలబడాలనుకుంటారు. దీనినే 'చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం' ;  లేదా "మా పెద్దలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి " అని చెప్పడం. ఆ పనే యిప్పుడు నేను చేయబోతున్నాను.  నా యీ మాటలు చదువుతున్నవారికి నేనేదో complexities తో బాధపడుతున్నాననే అనుమానం కలుగుతుంది. నాకలాటి ఆత్మనూన్యతా భావాలేవీ లేవు. ఉన్న వాస్తవం అది. Hypocrisy కి దూరంగా వుండాలనేది నా కోరిక.

మాది ' పట్రాయని'  వారి వంశం. ఈ వంశంలోని పూర్వీకులు ఏదో రాజుగారి కొలువులో ' పట్రాయుడు' పదవి వహించారట. అంటే కొంతమంది సైనికులకు అధిపతి వంటి పదవి. ఆ పట్రాయుడి వంశంలోని వారు పట్రాయనివారుగా మారారు.
ఆ వంశంలో పుట్టినవారు శ్రీ వెంకట నరసింహ శాస్త్రి . ఆయన సంగీతజ్ఞుడు . ఆయన జీవితం చాలావరకు ఒరిస్సాలో ని బరంపురంలో జరిగింది. కర్ణాటక సంగీతంలో కొంత కీర్తన గ్రంధాన్ని నేర్చుకునేందుకు మద్రాస్ లో కొన్నాళ్ళు వున్నారట. ఒరిస్సా లోని అనేక రాజాస్థానాలలో , జమిందారీలలో  కచేరీలు చేస్తూ పండిత సత్కారాలు , సన్మానాలు అందుకున్నారు.ఈయనకు గాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులుండేవి. శ్రీ నరసింహశాస్త్రి గారికి వయసు మీరాక తన కుమారుడితో సాలూరు లో నివాసం ఏర్పర్చుకున్నారు. సంగీతంలో తండ్రీ కొడుకులిద్దరిదీ వేర్వేరు మార్గాలుగా తోస్తుంది. ఆయనను '  సాలూరు పెద గురువు' గారనేవారు.

ఆయన కుమారుడు పట్రాయని సీతారామ శాస్త్రి. వాగ్గేయకారుడు. ఎన్నో కృతులను , చాటు పద్యాలను చందోబధ్ధంగా వ్రాశారు. వీరు  ' సాలూరు చిన గురువుగా లబ్దప్రతిష్టులు. సీతారామశాస్త్రి గారు సాలురులో సొంతంగా భూమికొని దానిలో ఒక చిన్న పర్ణశాల నిర్మించి సంగీత పాఠశాల ప్రారంభించారు. ఆంధ్రదేశమంతా  తిరిగి సంగీత కచేరీలు చేసేవారు.
సీతారామ శాస్త్రిగారికి ముగ్గురు కుమారులు. సంగీతరావు , నారాయణ మూర్తి , ప్రభాకరరావు.
ఈ ముగ్గురు కూడా శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులే.
ఇలా మూడు తరాల వరకు సంగీతమే వృత్తిగా , ప్రవృత్తిగా , పరమార్ధంగా గల మా పట్రాయని వారి వంశం,  మా నాల్గవ తరానికి వచ్చాక సంగీతాన్నే వృత్తిగా స్వీకరించలేకపోయింది. కారణాలనేకం. అవి అప్రస్తుతం. అయితే అందరూ సంగీతాభిలాష , ఆసక్తి , గౌరవ మర్యాదలు కలవారే. ఇద్దరు , ముగ్గురు ఆడపిల్లలు సంగీతంలో విశిష్టమైన కృషిచేసినవారే.

పెరుగుతున్న కుటుంబం , ఆర్ధిక సమస్యల దృష్ట్యా శ్రీ సీతారామశాస్త్రిగారు (మా తాతగారు) సాలూరులోని స్వంత పాఠశాల వదలి  ఆంధ్రదేశంలోనే ప్రప్రధమ సంగీత కళాశాల అయిన విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించి , తన కుటుంబాన్ని కూడా విజయనగరానికి తరలించారు.
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన సందర్భంగా ఏర్పడిన ఖాళీలో గాత్ర పండితునిగా నియామకానికి పెద్ద పోటీయే వచ్చింది. కాలేజీ ప్రిన్సిపాల్ గా ప్రముఖ వైలిన్ విద్వాంసుడు శ్రీ ద్వారం వేంకటస్వామి నాయుడుగారు నియమించబడ్డారు. గాత్రపండితునిగా శ్రీ సీతారామశాస్త్రిగారు నియమితులయ్యారు. అయితే ,
ఈ ఆచార్య పదవి ఆయనను అంత సునాయాసంగా వరించలేదు.  విజయనగరం ఎస్టేట్ కలెక్టర్ , పండితుల సమక్షంలో జరిగిన పోటీలో నెగ్గిన తర్వాత శ్రీ సీతారామ శాస్త్రిగారికి గాత్ర పండితుడిగా ఉద్యోగం లభించింది.
అదే పదవిలో శ్రీ శాస్త్రిగారు రెండు దశాబ్దాల పాటు పనిచేశారు. శ్రీ సీతారామ శాస్త్రి గారిది విలక్షణమైన సంగీతం. ఆయన గానం శుద్ద శాస్త్రీయమైనా  దాక్షిణాత్యపు సంగీతబాణీకి విరుధ్ధమైనది ఆయన గానం , సంగీతం. ఆయన తనకు ప్రక్క వాద్యంగా హార్మోనియం ను తానే వాయించుకుంటూ పాడేవారు. ఆ కారణంగా , ఆనాటి బాణీ విద్వాంసుల మధ్య ఒకరకంగా వెలివేయబడ్డారు.  ఆయన అన్ని రకాల బాణీలలో ఆరితేరినవారే. సంగీత కళాశాల లో విద్యార్ధులకు సంగీతం బోధించేప్పుడు అక్కడి శాస్త్ర మర్యాదలను పాటిస్తూ సిలబస్ ప్రకారమే శిక్షణ యిచ్చేవారు. కళాశాల వెలుపల , కచేరీలలో తన స్వతంత్ర ధోరణిలో గమకయుక్తమైన , భావప్రధానమైన కర్ణాటక సంగీతాన్నే  హార్మోనియం మీద వాయిస్తూ గానం చేసేవారు.  శ్రీ సీతారామ శాస్త్రిగారి  స్వీయ కృతులు రెండు ఓడియన్ రికార్డ్ లుగా వచ్చాయి.

సాలూరి చిన గురువుగారి బాణీ సాహితీ లోకంలో , వారికి ఒక విశిష్టతను , వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టాయి. కచేరీలలో ఆయన గానం చేసే స్వీయ కృతులు , చాటు పద్యాలు విజయనగరం లోని పండితులను , సాహితీవేత్తలను అమితంగా ఆకర్షించాయి. అదే ' కౌముదీ పరిషత్' అనే సాహితీ వేదిక ఆవిర్భావానికి కారణమయింది. శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారే ఆజన్మ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. స్థానిక సంస్కృత కళాశాల పండితులంతా సభ్యులు గా చేరి పదిహేను రోజులకో  నెలకో ఒకసారి సాయంత్రం పూట వెన్నెల వెలుగులో సాహిత్య , సంగీత గోష్ఠి జరిపి తమ కవితలను , కృతులను వినిపించి చర్చలు జరిపేవారు.
ఈ కౌముదీ పరిషత్ కు ' భారతీ తీర్థ' ఆంధ్రా రీసెర్చ్ యూనివర్శిటీ వారి గుర్తింపు లభించింది. ఆ భారతీ తీర్థ రీసెర్చ్ యూనివర్సిటీ వారే
శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారికి , వారి పెద్ద కుమారుడు శ్రీ సంగీతరావు గారికి ' సంగీత భూషణ ' బిరుదు ప్రదానం చేశారు.
శ్రీ పట్రాయని సంగీతరావు గారు తండ్రికి తగ్గ తనయుడు. సార్ధక నామధేయుడు. గురు ముఖఃతా ఆయన నేర్చుకున్న సంగీతం మూడు మాసాలు మాత్రమే. తండ్రిగారి సహచర్యం లో ఆయన గానం వింటూ స్వయంకృషితో సాధించినదే అధికం. హార్మోనియం మీద కర్ణాటక సంగీతాన్ని గమకయుక్తంగా , శుధ్ధ శాస్త్రీయంగా అత్యంత సమర్ధవంతంగా పలికించగల  అతి కొద్దిమంది విద్వాంసులలో ఒకరుగా శ్రీ సంగీతరావు పేరు పొందారు. తన 16 వ ఏట నుండే స్వతంత్రంగా హార్మోనియం మీద జంత్రగాత్ర కచేరీలు చేయడం ప్రారంభించారు. శ్రీ సంగీతరావు గారు ఆంధ్రదేశానికి చెందిన మరో విలక్షణ విద్వన్మణి సంగీత సుధాకర శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారికి సీనియర్. వయసులో పది సంవత్సరాలు పెద్ద.
ఆలిండియా రేడియో ప్రక్క వాద్యంగా హార్మోనియం ను నిషేధించిన కారణంగా శ్రీ సంగీతరావు ఆలిండియా రేడియోను తనకు తానే దూరం చేసుకున్నారు.  శ్రీ సంగీతరావు గారి  గానవిద్వత్ ప్రదర్శనకు ఆకాశవాణి ఏనాడు వేదిక కాలేదు.   సంగీత ప్రసంగాలకు మాత్రం వారిని ఆహ్వానించేవారు.అది శ్రీ సంగీతరావుగారి వ్యక్తిత్వం.
తన స్వయంకృషితో నే వీణ , వైలిన్ వాద్యాల మీద పట్టు సాధించారు. వారికి తండ్రిగారి వారసత్వం వలన సంగీతంలోనే కాక సాహిత్యంలో కూడా మంచి ప్రవేశం లభించింది. ఆంధ్రదేశంలోని ప్రముఖ కవులు రచయితలతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది.
శ్రీ పట్రాయని సంగీతరావుగారికి ఆ పేరు నెలల పిల్లాడిగా వున్నప్పుడే అనుకోకుండా పెట్టబడింది. ఆ పేరు తోనే సంగీతలోక ప్రసిధ్ధులైనారు. స్కూల్ రికార్డ్స్  లో నమోదైన పేరు నరసింహమూర్తి.  అది వారి తాతగారి పేరు.

నేను శ్రీ సంగీతరావుగారి పెద్ద కుమారుడిని.  నా తర్వాత , మంచి సంగీతం పట్ల అభిరుచి, ఆసక్తి గల ఒక సోదరుడు , ముగ్గురు సోదరీమణులు వున్నారు.

దీనికి , మన పాటల దేవుడికి ఏమిటి సంబంధం , ఎందుకీ అక్కర్లేని సొద అని మీరు భావించినా భావించవచ్చు. కానీ , కారణం వుంది . ఘంటసాలగారి గురించి అర్ధం చేసుకోవాలంటే ఆనాటి సాంఘిక పరిస్థితులు , కొంతమంది వ్యక్తుల గురించి కూడా అవగాహన కావాలి. అందుకే ఈ ఉపోధ్ఘాతం.

శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం విజయరామ సంగీత కళాశాలలో గాత్ర ఉపన్యాసకుడిగా ప్రవేశించిన కొద్ది నెలలకు , వేసంగి శెలవులలో, కళాశాల మూసివేసివున్న తరుణంలో ఓ పధ్నాలుగేళ్ళ వయసున్న, వెంకటేశ్వర్లు అనే అబ్బాయి సంగీతం నేర్చుకోవాలని , విజయనగరం చేరుకున్నాడు.

అప్పుడేం జరిగింది ?
                            .... (సశేషం - రెండవభాగం)

నెం.35, ఉస్మాన్ రోడ్ - ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక - అధ్యాయం 1 - మొదటిభాగం

మొదటి భాగం -

                        నెం. 35, ఉస్మాన్ రోడ్
                  -    స్వరాట్ 

ఆజన్మాంతం నేను సదా గుర్తుంచుకునే సంఖ్యలు చాలానే వున్నా అతి ముఖ్యమైనవి మాత్రం రెండే రెండు -
ఒకటి 35 , రెండవది 25.
35 ఉస్మాన్ రోడ్ గాన సరస్వతికి నిలయం.
25 సాంస్కృతిక నిలయం.
నేనేదో మీకు ఆసక్తి కలిగించే విషయాలు చెపుతానని అనుకోవడానికి కారణం నెం. 35 ఉస్మాన్ రోడ్.

ఇక, నాలాటి ఇంట్రావెర్ట్ ను చేరదీసినాలో కూడా  ఏదో టాలెంట్ వుందని ప్రోత్సహించి , నాచే నాలుగు మంచి పనులు చేయించిఅందరిలో నాకుకొంతలో కొంత గుర్తింపును యిచ్చినది నెం. 25. ఈనాడు, యిన్ని సమూహాలలో ఏవో నాలుగు మాటలు వ్రాయగలగడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్నిచ్చింది నెం. 25, మెలనీ రోడ్ .

ఈ రెండు నెంబర్లు గల స్థలాలలో ఏభైఏడేళ్ళ జీవితం గడిచింది. ఈ రెండు చోట్లా ఒక మంచి మనిషిగా జీవించడానికి కావలసిన అనేక మంచి పాఠాలు నేర్చుకున్నాను.

 ఎక్కడ వున్నాఎంత ఉన్నత స్థితిలో వున్నా గతం మరువద్దు. అహం వద్దు. ఆత్మవిశ్వాసం పెంచుకో. వినయంతో పాటూ వ్యక్తిత్వం కావాలి.  వివాదాలకు దూరంగా వుండు. అడుగు నేలమీదే వుండనీ . మంచి చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావంతో మెలగు.
ఇటువంటి భావాలు నాలో పెంపొందడానికి ఎంతో దోహదం చేసిన ఆ 25 మీద నాకున్న కృతజ్ఞతకు సూచకంగా,  25 వ తేదీ నుండి మన సమూహంలో యీ కొత్త శీర్షికను  ప్రారంభిస్తున్నాను.

ఒకనాడు నెంబర్ 35 ఉస్మాన్ రోడ్, టి.నగర్, మద్రాస్-17, మెడ్రాస్ మహా నగరంలో సుప్రసిధ్ధం. గాన సరస్వతికి నిలయం. అదే, గానగంధర్వుడిగా, అమరగాయకుడిగా ప్రపంచ నలుమూలలావున్న తెలుగు వారందరి హృదయాలలో  సుస్థిరస్థానం ఏర్పర్చుకొని చిరంజీవి గా ప్రకాశిస్తున్న పాటల దేవుడు 'ఘంటసాలనివాస గృహం.

ఈ సంగీత కళాలయంలోని విశేషాలు  ఒక తెఱచిన పుస్తకం. లోకవిదితం. ఇప్పుడు
నేను కొత్తగా కనిపెట్టి, చెప్పగలిగే విశేషాలేవీ వుండవు. అనేకమంది, అనేక సందర్భాలలో, అనేక చోట్ల చెప్పినవే. అందులో కొన్ని మన సమూహంలో గతంలో చెప్పుకున్నవే.
కానీ35 నెంబర్  ప్రాంగణంలో పెరిగానన్న ఒకే కారణంతో, పెద్దలంతా మరింకే విషయాలైనా చెపుతాననే ఆసక్తితో ఈ శీర్షికను నాకు అప్పగించారు. ఆ మహా గాయకుడి సంగీతం గురించి చెప్పే సాహసం నేను చేయలేను. చేయను కూడా.

అందుకనే ఈ శీర్షికకు '' నెం. 35 ఉస్మాన్ రోడ్ '' అని  పేరు పెట్టాను. ఈ ప్రాంగణంలో సుమారు ఇరవై సంవత్సరాల పాటు , ఘంటసాలవారి కాలంలో నేను విన్న విషయాలను, పొందిన అనుభవాలను నాకు జ్ఞాపకమున్నంత వరకు , నాకున్న పరిధిలో వారం వారం నాకున్న భాషా పరిజ్ఞానంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఘంటసాలవారి ని ఒక మహా గాయకుడిగా కంటే , ఒక నిరాడంబర కుటుంబీకుడిగా చూపించే ప్రయత్నం చేస్తాను.
ఏ రకమైన అభూతకల్పనలు లేకుండా , ఏ విధమైన సంచలనాలు లేకుండా ఒక సాదా కుటుంబగాధా చిత్రంగానే , ఈ కధనం సాగుతుంది. సహృదయ సభ్యులంతా ఆమోదించి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను.

ఇంతకూ , నెం. 35 ఉస్మాన్ రోడ్ లోకి నేను ప్రవేశించిన ముచ్చట్లు  చెప్పడానికి నాకు గల అర్హత ఏమిటో చెప్పుకోవాలి. అది ముందు చెప్తాను. 
(సశేషం)

Friday, April 3, 2020

సొగసు తెలుగు పాటల రేడు - భుజంగరాయడు




 రంగులరాట్నం చలనచిత్రంలోని "ఇంతేరాఈ జీవితం - తిరిగే రంగుల రాట్నము" అనే పాట చాలా మంది వినే ఉంటారు. ఎంతో తేలికైన మాటలతో జీవన సారాంశాన్ని  తాత్త్విక చింతనతో కాచివడబోసిన పాటగా ఇప్పటికీ తలచుకుంటారు. 

అయితే ఆ పాట రచించిన కవి ఎవరో చాలామందికి  తెలిసి ఉండక పోవచ్చును. ఆయనే శ్రీ రామ వెంకట భుజంగరాయ శర్మగారు.  


1925లో గుంటూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బియే ఆనర్స్ చదివి మద్రాసు (ఇప్పటి చెన్నై) లోని  పచ్చప్పాస్ కళాశాలలో అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేసారు. తరువాత కావలిలో ఒక మిత్రుడితో కలిసి విశ్వోదయ కళాశాలను స్థాపించి అందులో  తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసారు. ఆయన  గొప్ప కవిగానే కాక నటుడిగా, చిత్రకారుడిగా మంచి వక్తగా పేరుపొందిన వ్యక్తి. శ్రీ వెంపటి చినసత్యం  స్థాపించిన కూచిపూడి నాటక అకాడెమీ వారు ప్రదర్శించిన ఎన్నో నాట్య రూాపకాలను భుజంగరాయశర్మగారు రచించారు.

 కూచిపూడి నాట్యరూపకాలకు మూలాధారమైన  త్రిమూర్తులు కావ్య రచనలు చేసిన భుజంగరాయశర్మగారు,  సంగీత రచన చేసిన పట్రాయని  సంగీతరావుగారు, వాటిని అద్భుతంగా ప్రదర్శించిన వెంపటి చిన సత్యంగారు.  వీరి ముగ్గురి కలయికతో  ఈ నాట్యరూపకాలు ఆధునిక యక్షగానాలుగా ప్రసిద్ధి పొందాయి. దేశ విదేశాలలో తెలుగు సాంస్కృతిక కీర్తి పతాకాన్ని దిగ్విజయంగా ఎగరేసాయి.

 సంగీతరావుగారు -భుజంగరాయ శర్మగారు   వీరిరువురి స్నేహం - సంగీత సాహిత్య సమ్మేళనం. పూవు తావిల అనుబంధం. శతవసంతాలు పూర్తిచేసుకుంటున్న తరుణంలో సంగీతరావుగారిని  భుజంగరాయశర్మగారితో పరిచయం, స్నేహం  గురించి అడిగినప్పుడు వారు చెప్పిన ముచ్చటలు మరోసారి చెప్పుకుందాం. 


భుజంగరాయశర్మగారు రచించిన ఎన్నోలలిత గీతాలు కూచిపూడి యక్షగానాలలోను, ఆలిండియారేడియో ద్వారాను ప్రసిద్ధి పొందినవే.

 కానీ ఇక్కడ వివరించబోయే పాట, ఒక  ప్రత్యేకమైన పాట. ఇంత వరకు ఇది రికార్డుగా వచ్చిన దాఖలాలు లేవు.


 వెంపటి చిన సత్యంగారి కూచిపూడినాటకాలను దేశ విదేశాల్లో ప్రదర్శించారు. ఆ నృత్యబృందంతో పాటు  సంగీతరావుగారు, భుజంగరాయశర్మగారు వీరిద్దరూ  కలిసి ఎన్నో   విదేశపర్యటనలు చేసారు. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అలాంటి ఒకసందర్భంలో  ఒకబస్ ప్రయాణంలో అప్పటికప్పుడు  భుజంగరాయశర్మగారు ఒక  పాటను రాసి, తనకు చూపారని అప్పటికప్పుడే

ఆ పాటను రాగమాలిక లో స్వరపరిచానని చెప్పారు సంగీతరావుగారు.

"ఎన్ని సొగసుల మూట మా తెలుగు పాట"  అంటూ సాగే ఈ పాటలో ప్రతి పదమూ తేనెలో ముంచిన  రసగుళికే. ప్రతి పాదంలోను విరిసే భావన అచ్చతెలుగుదే. 
పాటలో  మొదట వచ్చే  పల్లవి -
  ఎన్ని సొగసులమూట
  మా తెలుగు పాట
  ఎంత తేనియలొలుకు 
  మా తెలుగు పలుకు   
ఈ పల్లవితోనే తెలుగు పదానికి, భావానికి పట్టం కట్టడం ప్రారంభమవుతుంది. తెలుగు అజంత భాష కావడం వలన శ్రవణసుభగంగా ఉంటుందని, తెలుగుమాట తేనెలాగా తీయగా ఉంటుందని, తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని తెలుగుభాష సొగసు గురించి విదేశీయులు కూడా పొగిడారు. అటువంటి తెలుగు మాటలతో కూడిన  తెలుగు పాట ఎన్నో సొగసుల మూటే మరి. తెలుగునుడికారం,తెలుగు సంస్కృతి సంప్రదాయాలు,  అన్నిటినీ  ప్రతిబింబించే విధంగా పాటలోని తరువాతి చరణాలు సాగుతాయి.

  గొబ్బెమ్మ సిగలోని
  గుమ్మడీ పూవులా
  గుమ్మడీ మదిలోని 
  మంచు కోరికలా

 సంక్రాంతికి కన్నెపిల్లలు చక్కని మొగుడు కావాలని, రావాలని  నోములు నోచి ముగ్గులు పెట్టి ఆ మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి  ఆటలు ఆడతారు. ఆ గొబ్బెమ్మల పైన  పసుపురంగు గుమ్మడిపూలను ఉంచుతారు.  ఈ తెలుగు పండుగను గుర్తుచేసేదే రెండో చరణం. గొబ్బెమ్మను చేసి  పైన తురిమే గుమ్మడి పూలలో కనిపించే శీతాకాలపు  తుషార బిందువును  అమ్మాయి మనసులో కాబోయే భర్తగురించి కలిగే కమ్మని ఆలోచనగా సూచిస్తూ గుమ్మడీ మదిలోని  మంచుకోరికగా వర్ణించారు. 
  తొలికారు మబ్బులో 
   పులకించు ధాత్రిలా
   ధాత్రి ఎదలో మేలుకొను
   పంటసిరిలా
తరతరాలుగా భూమి ఆకాశం తెలుగుకవులకి ప్రేయసీ ప్రియులే.  మబ్బులు కమ్మిన ఆకాశం చినికే వానచినుకులు తన ప్రేయసి భూమి పైన చిలికే పన్నీటి జల్లులే.  గ్రీష్మంలో చెమ్మను  కోల్పోయి నెర్రెలు విచ్చిన భూమిని మరల పదును చేసిన రైతులు  తొలికారు  మబ్బులు కమ్మి జలజలా వాన ఎప్పుడు కురుస్తుందా అని విత్తనాలు వేసి ఎదురుచూస్తారు. ఆ సందర్భాన్ని వర్ణించే చరణం ఇది. తొలికారు మబ్బులు కమ్మి వాన కురిస్తే నేల పులకరిస్తుంది. విత్తిన విత్తనాలన్నీ మొలకలెత్తి  పంటసిరిగా మారి రైతులకు సిరి సంపదలిస్తాయి. తెలుగు ప్రాంతాలలో వ్యవసాయం ప్రారంభమయ్యేది తొలికారు లోనే కదా.      
  తలుపుదగ్గర చెప్పు 
  తన మగనిపేరులా
 పేరులో తారాడు 
  మన్మథుని రూపులా 

తొలిసారి వరుడి చిటికెనవేలు పట్టుకొని అత్తగారింటిలో గృహ ప్రవేశం చేసే నవవధువును భర్తపేరు చెప్పమని ఆ గుమ్మంలో నిలబెట్టి అడగడం  మన తెలుగు పెళ్ళిళ్ళలో వేడుక, ఒక సంప్రదాయం. వధువు భర్త పేరు చెప్పడానికి సిగ్గు పడడానికి కారణం ఆమె మనసులో మన్మధుని రూపులా  తన భర్త రూపం  గోచరించడమే.

గోదారి ఒడిలోన 
నెలవంక పాపలా
నెలవంక చెక్కిళ్ళ
పాల వెన్నెలలా

తెలుగుదేశంలో ప్రవహించే గొప్ప నది గోదావరి. తెలుగువారి పలుకుబడి గోదారి.తరతరాలుగా ఈ భారతదేశంలో నీరిచ్చే నదులను, పాలిచ్చే ఆవులను మనని పెంచి పోషించే తల్లితో పోల్చి గౌరవించడం  సంప్రదాయం. గోదావరి నదిలో చంద్రోదయ మైనప్పుడు ఆ సౌందర్యాన్ని వర్ణించడం ఎవరి తరం. మరి  గోదారి తల్లి అయితే  ఆమె కడుపున ఉదయించే  బాలచంద్రుడిని ఆమె పాపగా ఊహించినప్పుడు  ఆవెన్నెల వెలుగులు, ఆ పాపాయి పాల చెక్కిళ్ళు చిందే కాంతులే .

 భద్రాద్రి రాము 
 నెన్నుదిటి కస్తూరిలా
 కస్తూరి మనసులో
 కారుణ్య రేఖలా

భద్రాద్రిపై వెలసిన రాముడు తెలుగింటి దేవుడు. ఆ రాముడి నుదిటిపై వెలిగేది,రెండు ఊర్థ పుండ్రాల నడుమన  కస్తూరి తో తీర్చిన ఎర్రని నామము.రాముడి  నెన్నుదిటిపై (అందమైన నుదురుభాగం) తీర్చే మూడు నామాలలో  తెల్లనిరెండు నామాలు మనిషిలో పెంచుకోవలసిన సత్త్వగుణాలకు ప్రతీకలుగా,మధ్యలో  కస్తూరితో తీర్చే ఎర్రని రేఖను మనిషి లోని అనురాగాన్ని, మోహాన్నిపెంచే రజోగుణానికి ప్రతీకగా భావిస్తారు హైందవులు. రాముడి  మనసుకూడా కస్తూరిలా పరిమళభరితమయినది. నామంలోని ఎరుపు రేఖలా ప్రేమాస్పదమైనది.  చల్లనితండ్రి తెలుగింటి రాముడు. ఆ భద్రాద్రి రాముడి నుదిటిపై  కస్తూరితో తీర్చే ఎర్రని రేఖ, మనందరినీ చల్లగా కాచే కారుణ్యరేఖ. 

ఎంతో సొగసైన తెలుగు పాటల గురించి  పాట రాస్తూ, ఆ  పాటలోనే ఎంతో  సొగసైన తేనెలొలికే  తెలుగు మాటలను వాడారు భుజంగరాయ శర్మగారు. సొగసుల మూట, మంచు కోరిక, మగని పేరు, తారాడు మన్మధుని రూపు, మేలుకొను పంటసిరులు,తొలికారు మబ్బులు, నెలవంక పాప, పాల వెన్నెలలు, నెన్నుదురు  ... 

ఓహోహో !! ఎన్నిచక్కని తెలుగుపదాలు. ఎంత కమ్మని తెలుగురసాల ఊటలు. తెలుగు భాషామతల్లికి భుజంగ రాయ శర్మగారు ఇచ్చిన మంగళ హారతి కదా  ఈ పాట.


లలిత లలితమయిన అలతి అలతి పదాలతో కూర్చిన  ఈ చక్కని  పాటకి ఇంచక్కని  రాగ వరుసలు కూర్చారు - 
శ్రీ పట్రాయని  సంగీతరావుగారు. సంగీతరావుగారి  అమ్మాయి, గాయని,  శ్రీమతి కొచ్చెర్లకోట  పద్మావతి  ఈ పాటను అతి మధురంగా గానం చేసారు. ఆ పాట  లింక్ ఇక్కడ.