visitors

Tuesday, October 7, 2014

పట్రాయని వారు

తెలుగువారి ఇంటిపేర్లలో అతి తక్కువగా వినిపించే ఇంటిపేరుగా పట్రాయని వారిని చెప్పవచ్చు.దక్షిణ భారత దేశపు బ్రాహ్మలలో ఆరామద్రావిడ శాఖకి చెందిన ఇంటిపేరు పట్రాయనివారు. మొదట సన్నిధివారు అనే ఇంటిపేరుతో ఉండేదట వీరి వంశం. అయితే  వీరి పూర్వీకులలో ఎవరో సైనిక విభాగంలోని ఒక విభాగానికి అధిపతిగా " పట్రాయడు" అనే పదవిలో ఉండేవారని, అందువల్ల అతని వంశానికి పట్రాయడు అనే పేరు వచ్చిందని పెద్దలు చెప్పారు. వ్యాకరణరీత్యా ఇంటిపేర్లు ఔపవిభక్తికరూపంలో తెలుగుదనం సంతరించుకున్న నేపథ్యంలో  పట్రాయడు పదం పట్రాయనిగా కనిపిస్తుంది. తెలిసినంతవరకు పట్రాయనివారి కుటుంబానికి చెందిన పూర్వీకులలో 1800-1850 కాలానికి చెందిన పట్రాయని వెంకట నరసింహ భుక్త గారి పేరు వినిపిస్తుంది.,
శృంగవరపుకోట,విజయనగరం మధ్య చామలా పల్లి అనే అగ్రహారం ప్రతిగ్రహీత గా ఈ వంశంవారు అందుకున్నారు.
చామలా పల్లి 18 వృత్తుల అగ్రహారం. వృత్తి అంటే ఒక కుటుంబం జీవించడానికి కావలసిన భూ వసతి అని అర్థం. ఆనందగజపతి వంశపు రాజులతో ఈ పట్రాయని వెంకట నరసింహ భుక్తగారికి అనుబంధం ఉండేదని తెలుస్తోంది. నరసింహ భుక్తగారి కాలంలోనే ఆ అగ్రహారం, ఇతర ఆస్తులన్నీ హరించిపోయాయి. అతనికి ఆరుగురు కుమారులు.వారిలో పెద్దకుమారుడు పట్రాయని పాపయ్యశాస్త్రి. పాపయ్యశాస్త్రిగారి సోదరులు అయిదుగురిలో ఇద్దరు తూర్పుగోదావరి జిల్లాలవైపు వెళ్లారని, వారిపేర్లు పెదనరసన్న, చిన నరసన్న అని తెలుస్తోంది కాని మిగిలిన వివరాలు తెలియలేదు.
పాపయ్యశాస్త్రిగారి భార్య అవధాన్ల వారి అమ్మాయి నరసమ్మ. పాపయ్య శాస్త్రిగారు పౌరోహిత్యం చేసేవారని తోలు బొమ్మలాటలో ప్రావీణ్యం చూపేవారని తెలుస్తోంది. వీరు 35 ఏళ్ళ చిన్న వయసులోనే మరణించారు.
నరసింహశాస్త్రిగారు గుడివాడ అగ్రహారానికి చెందిన మధురాపంతుల కూర్మన్నగారి అమ్మాయి  సూరమ్మని వివాహం చేసుకున్నారు.. కూర్మన్నగారి పినతండ్రి కొడుకు, జ్ఞాతి మధురాపంతుల పేరయ్యశాస్త్రి గారు. నరసింహశాస్త్రిగారికి పినమామగారు.  పేరయ్యశాస్త్రిగారు అప్పటికే పేరుపొందిన సంగీత విద్వాంసులు. పట్రాయని నరసింహశాస్త్రిగారు వీరివద్ద శిష్యరికం చేసి సంగీతం నేర్చుకున్నారు. దాక్షిణాత్యసంగీత గ్రంధాన్ని నేర్చుకోవడం కోసం మద్రాసునగరానికి వెళ్ళి,నంజుండయ్యర్ వద్ద శిష్యుడిగా ఉన్నారు.బరంపురం,సాలూరు,విజయనగరం సంస్థానాలలో కచేరీలు చేస్తూ,సంగీతశిక్షణ ఇస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా పేరు పొందారు.
నరసింహశాస్త్రిగారు బరంపురం లో చాలాకాలం సంగీత శిక్షణలు చేసిన తరువాత బొబ్బిలి రాజా వారి ఆదరణపొంది సాలూరు లో స్థిరపడ్డారు. సాలూరు గ్రామ ప్రజలు నరసింహశాస్త్రిగారిని ఎంతో ఆప్యాయంగా పెదగురువుగారని సంబోధించేవారు. వారి కుమారుడు సీతారామశాస్త్రిగారిని చినగురువుగారని పిలిచేవారు. సాలూరు లో పెదగురువుగారి శిక్షణలో ఎందరో సంగీత విద్వాంసులుగా పేరుపొందారు. 1920 ప్రాంతాలలోనే నరసింహశాస్త్రిగారు, కుమారుడు సీతారామశాస్త్రిగారు ఇద్దరూ సాలూరులో శ్రీ శారదా గాన పాఠశాల అనే సంగీత విద్యాలయం ప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చేవారు. పర్ణశాలగా ప్రారంభమయిన పాఠశాల సీతారామశాస్త్రిగారు, సాలూరు ప్రజల అండదండలతో పటిష్టమయిన కట్టడంగా రూపొందింది.  ఇప్పటికీ సాలూరులో పట్రాయని సీతారామశాస్త్రి సంగీత నృత్య కళాశాల పేరుతో నిర్వహింపబడుతున్న విద్యాలయంలో ఎందరో చిన్నారులు సంగీతం, నృత్యం మొదలైన రంగాలలో శిక్షణ పొంది వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.ఈ పాఠశాలను నేడు  జరజాపు రమేష్, సాలూరు రాజేశ్వర రావు మెమోరియల్ ట్రస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

నరసింహ శాస్త్రిగారి భార్య పేరు మంగమ్మగారు. వీరికి  ముగ్గురు సంతానం. వారిలో కుమార్తె ,కుమారుడు మరణించగా మిగిలిన ఏకైక కుమారుడు పట్రాయని సీతారామ శాస్త్రి.నరసింహశాస్త్రిగారు పెదగురువుగారన్న పేరుతో, సీతారామశాస్త్రిగారు చినగురువుగారన్న పేరుతో ఆంధ్రదేశంలో ప్రసిద్ధి పొందారు.. సీతారామశాస్త్రిగారు అతి చిన్నవయసులోనే మాతృవియోగం పొంది తండ్రితో పాటు ఉత్తర దక్షిణ దేశ యాత్రలు చేస్తూనే సంగీతం నేర్చుకొని కర్ణాటకసంగీతంలోనే కాక హిందుస్తానీ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. సంప్రదాయ సంగీత కచేరీలలో సంప్రదాయం కన్నా జనరంజకత్వానికి పెద్ద పీట వేసి స్వీయసంగీత రచనలను ఆలపించి అత్యంత జనాకర్షణ పొందారు. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో వోకల్ పండితుడిగా ఎందరో విద్యార్థులను విద్వాంసులుగా తీర్చిదిద్దారు. సంగీత కళాశాలలో ఆయన వద్ద శిక్షణ పొందిన వారంతా ప్రభుత్వ కళాశాలలలో అధ్యాపకులుగా, సంగీత విద్వాంసులుగా, సినీ సంగీత శాఖలో ముఖ్యులుగా రూపొందారు. ప్రముఖ  సినీ నేపధ్యగాయకులు ఘంటసాల వెంకటేశ్వరావు, సుశీల మొదలయిన ప్రముఖులెందరో  శాస్త్రిగారి వద్ద శిక్షణ పొందిన వారే. 1957 ప్రారంభంలో పదవీవిరమణ చేసిన శాస్త్రిగారు మరి కొద్దికాలానికే 1957 మార్చి మాసం 17న మరణించారు.
సీతారామశాస్త్రిగారికి ముగ్గురు కుమారులు. పట్రాయని సంగీతరావు,పట్రాయని నారాయణమూర్తి, పట్రాయని ప్రభాకరరావు. వీరు ముగ్గురూ తాతగారు,తండ్రిగార్ల సంగీత సంప్రదాయాన్ని కొనసాగించారు. పట్రాయని సంగీతరావుగారు అతి చిన్నవయసునుండి గాత్రంలో విద్వత్తును ప్రదర్శిస్తూ కచేరీలు చేసి,సంగీత శిక్షకుడిగా ఉంటూ కాలక్రమంలో ఘంటసాల వేంకటేశ్వరరావుగారికి సహాయకుడిగా,సహచరుడిగా,ఆయన మరణానంతరం కూచిపూడి నాట్య అకాడెమీలో సంగీతదర్శకుడిగా 35 సంవత్సరాలు తన సేవలనందించారు.వెంపటి చినసత్యం గారు రూపొందించిన నృత్యనాటికలకు సంగీతరావుగారు కూర్చిన సంగీతం ఆ నాటకాలకు జీవం పోసింది. దేశవిదేశాలలో కూచిపూడి నృత్యనాటకాలను ప్రదర్శించిన సందర్భంలో సంగీతరావుగారు కూడా సత్యంగారివెంట ఉండి అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్రసంగీత భూషణ, తమిళనాడు ప్రభుత్వం కళాకారులకు గౌరవపురస్కరంగా ఇచ్చే కలైమామణి,ఆంధ్రప్రభుత్వ ముఖ్యమంత్రి తో ఘనసత్కారం,మద్రాసు తెలుగు అకాడెమీ వారి స్వర్ణ పురస్కారం సంగీతరావుగారు అందుకున్న అనేక సన్మానాలలో కొన్ని.

సంగీతరావుగారికి ఇద్దరు అబ్బాయిలు,ముగ్గురు అమ్మాయిలు. అందరూ తండ్రిదగ్గర సంగీత శిక్షణ తీసుకున్నా, వారిలో రెండవ అమ్మాయి పద్మావతి సంగీతంలో విశేష ప్రజ్ఞ కనబరచి తమిళనాడు యూనివర్సిటీలో మ్యూజిక్ లో ఎం.ఏ,ఎం.ఫిల్ డిగ్రీలు సాధించారు. సంగీతరావుగారితో పాటు వెంపటి చినసత్యంగారి నృత్యనాటకప్రదర్శనలలో పాలుపంచుకుని గాత్ర సహకారం చేసారు. 

భర్త ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాద్ ఆలిండియా రేడియో కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటూ ఉంటారు.ఇంటి దగ్గర అనేక మంది శిష్యులకు సంగీత పాఠాలు చెప్తారు. వర్థమాన  సినీ నేపథ్యగాయని,ఇటీవలి నంది అవార్డు గ్రహీత  కుమారి గీతామాధురి   పద్మావతి దగ్గర చిన్నతనం నుండి సంగీతం నేర్చుకున్న శిష్యురాలే.

                                                           శ్రీ పట్రాయని నారాయణ మూర్తిగారు

సంగీతరావుగారి తమ్ముడు పట్రాయని నారాయణమూర్తిగారు వాసా వారివద్ద వీణ శిక్షణ పొంది విశాఖపట్నంలో ఎందరికో వీణలో,గాత్రంలో శిక్షణ ఇచ్చారు.ఆయన దగ్గర సంగీత శిక్షణ పొందిన వారు అధ్యాపకులుగా సంగీత బోధకులుగా స్థిరపడి ఉన్నారు. సినిమా రంగంలో కూడా సంగీతరంగంలో పేరుతెచ్చుకున్న విద్యార్ధులున్నారు. ప్రముఖ వర్థమాన నేపథ్య గాయకుడు మల్లికార్జున్ నారాయణమూర్తి గారి  శిష్యుడే.

నారాయణమూర్తిగారికి ఇద్దరు  కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్యోతిర్మయి-ప్రముఖ రచయిత పంతుల శ్రీరామ శాస్త్రిగారి కోడలు.భర్త ఉద్యోగరీత్యా పాండిచ్చేరి లో కాపురం. జ్యోతిర్మయి పాండిచ్చేరిలో స్కూలు టీచర్ గా పనిచేస్తూనే తమిళనాడులో పలు ప్రాంతాలలో సంగీత కచేరీలు చేస్తూ పేరు పొందారు. రెండవకుమార్తె  కిరణ్మయి విశాఖపట్నం లో స్కూలులో సంగీత అధ్యాపకురాలిగా ఉద్యోగం చేస్తున్నారు.
                                  శ్రీమతి కిరణ్మయి, శ్రీమతి పద్మావతి, శ్రీమతి జ్యోతిర్మయి

 కీ.శే. శ్రీ పట్రాయని ప్రభాకరరావుగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో సంగీతం అభ్యసించి డిప్లమా పొందారు. విజయనగరంలో చాలామందికి సంగీత శిక్షణ ఇచ్చారు. తండ్రి మరణానంతరం  సాలూరు లోని సంగీత పాఠశాల ను నిర్వహించి ఆ చుట్టుపక్కల పలు ప్రాంతాలనుంచి వచ్చేవారికి  సంగీత పాఠాలు చెప్పారు.
                                              శ్రీ పట్రాయని ప్రభాకరరావుగారు
ఈ విధంగా పట్రాయని వంశంలో మూడు తరాల వారు సంగీతవిద్యా సరస్వతి ముద్దు బిడ్డలుగ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంగీతజ్యోతి దేదీప్యమానంగా వెలగడానికి కృషిచేసిన సంగీత విద్వాంసులుగా కనిపిస్తున్నారు