visitors

Sunday, April 25, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఎనిమిదవ భాగం

25.04.2021 - ఆదివారం భాగం - 28:
అధ్యాయం 2  భాగం 27 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాల మాస్టారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా సినీమాలలోనే కాదు ఇతరత్రాకూడా చాలా బిజీగా వుండేవారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో, బయట ఊళ్ళ సంగీత కచేరీలతో క్షణం తీరిక లేకుండా వుండేవారు. వీటన్నిటి ప్రభావం మాస్టారి ఆరోగ్యంమీద పడింది. అయినా లెక్కచేసేవారు కాదు. అనుకున్నది సాధించేవరకు విశ్రమించేవారు కాదు.

గతంలో ఒకసారి చెప్పాను భారతీయ సినీమారంగం నియమబధ్ధమైన, చట్టబధ్ధమైన పరిశ్రమగా పనిచేయలేదు. ఒక పరిశ్రమకు వుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆనాటి సినీమా నిర్మాణం లో  కనిపించేవికావు. నిర్మాతే సర్వాధికారి. నటీనటుల పారితోషకాలు, సాంకేతిక నిపుణుల వేతనాలు అందరికీ ఒకేలా వుండేవికావు. అలాగే అవి నిర్మాతకు, నిర్మాతకు కూడా మారిపోతాయి. అవి కూడా సక్రమంగా నిర్ణీత సమయానికి చెల్లుబాటు జరిగేదికాదు. ఆర్ధిక స్తోమతగల నిర్మాత అయితే ఇబ్బంది లేదు, సినీమా పూర్తయేలోగా వారి వారి డబ్బులు చేతికందేవి. అలాకాకుండా మూడు రీళ్ళ సినీమాతీసి మిగిలిన సినీమా తీయడానికి డిస్ట్రిబ్యూటర్లు మీద, ఫైనాన్షియర్స్ మీద ఆధారపడే నిర్మాతల నుండి డబ్బు రాబట్టుకోవడం యమయాతనే. పనిచేయించుకొని పూర్తిగా అనుకున్న డబ్బు చెల్లించకుండా వచ్చే సినీమాలో చెల్లిస్తామని ఎగవేత వేసిన నిర్మాతలెందరో కనిపిస్తారు. అలాగే చిత్రం ఆఖరి దశలో వుండగానే రిలీజ్ డేట్ ప్రకటించేస్తారు. అందుకోసం సమయాసమయాలు చూసుకోకుండా నటినటులు,  సాంకేతిక నిపుణులు, సినీ నిర్మాణానికి చెందిన అన్ని విభాగాలవారు రాత్రింపగళ్ళు కష్టపడవలసి వచ్చేది. రాత్రి కాల్షీట్లంటే తెల్లార్లు స్టూడియోలోనే గడపవలసి వచ్చేది. వీటన్నిటి ప్రభావం వారి ఆరోగ్యంమీద పడేది. షూటింగ్ లు అర్ధరాత్రి జరిగేవి. సినిమా రీరికార్డింగ్ లు వరసగా మూడేసి నాలుగేసి రోజులు డే అండ్ నైట్ పనిచేసేవారు. ఇళ్ళకు వెళ్ళే అవకాశం వుండేదికాదు.  1960లకు ముందు మా నాన్నగారు కూడా రాత్రుళ్ళు ఇంటికి రాకుండా వరసగా స్టూడియోలో రీరికార్డింగ్ లకు పనిచేయడం నాకు గుర్తుంది. ఇప్పటిలా సెల్ ఫోన్ల యుగం  కాదది. మామూలు ల్యాండ్ టెలిఫోన్ల వసతి కూడా అందరికీ వుండేది కాదు.  ఇంట్లో ఏ అత్యవసర పరిస్థితి ఏర్పడినా వెంటనె తెలిసే అవకాశం వుండేదికాదు.  ఇన్ని అవస్థలుపడి పనిచేసినా రాబడి అంతంతమాత్రంగానే వుండేది.  కొంతమంది మ్యూజిక్ డైరక్టర్ల పారితోషకాలు వారి దగ్గర పనిచేసే ఆర్కెష్ట్రా వారి ఆదాయంకంటే  తక్కువగానే ఉండేది. ఆర్కెస్ట్రా వారికి రెగ్యులర్ గా పదిమంది దగ్గర పనిచేసే అవకాశంవుంది. కానీ మ్యూజిక్ డైరక్టర్ మరీ గొప్ప పేరు ప్రఖ్యాతులున్న వారైతే తప్ప చేతినిండా పనే వుండదు. సంవత్సరానికి రెండు మూడు సినీమాలు విడుదలైతే ఘనమే. వీటన్నిటితో సినీమారంగానికి చెందిన అనేక విభాగాలలోని కార్మీకులలో, సాంకేతిక నిపుణులులో బాగా అసంతృప్తి పెరిగింది. కానీ, వారు చేయగలిగింది ఏమీ లేదు. ఇష్టంలేకపోతే మూటాముల్లె సద్దుకొని సొంతవూరు చేరుకోవడం తప్ప. తమ జీవితప్రమాణాలు పెరిగే మార్గాలకోసం అన్వేషణ మొదలెట్టారు. తమ స్థితిగతులు చక్కబడేందుకు యూనియన్లు ఏర్పాటు చేసుకొని తమ పనిపాటల విషయంలో ఒక నియమావళిని అనుసరించాలనే నిర్ణయానికి వచ్చారు. చాలా విభాగాలలో యూనియన్లైతే ఏర్పడ్డాయేకానీ వారి కోరికలు ఆచరణసాధ్యం కావడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. 

అలాటి పరిస్థితులలోనే 'సౌతిండియన్ సినీ మ్యుజిషియన్స్ యూనియన్' ఏర్పడింది. ఏ సంవత్సరంలో ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమయిందో నాకు తెలియదు. మొదటి సమావేశం మాత్రం పాండిబజార్  ఆంధ్ర కిళ్ళీ షాపు దగ్గర ఏస్ వయొలనిస్ట్ రామసుబ్బుగారి ఇంట్లో జరిగిందని నాన్నగారు చెబుతుంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన గాయకులు, సంగీత దర్శకులు, వాద్యకళాకారులు, కోరస్ ఆర్టిస్ట్ లు అంతా సభ్యులుగా వుండేవారు. అందులో ఘంటసాల మాస్టారు, మా నాన్నగారు కూడా సభ్యులే.  అందరూ నెలవారీ/సంవత్సరపువారీ చందాలు కట్టి సభ్యులు కావాలి. మొదట్లో మ్యుజిషియన్స్ యూనియన్ చాలా చిన్న స్థాయిలో ఏ రకమైన గుర్తింపులేకుండా వుండేది. ఒక ప్రెసిడెంట్, ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్,  శెక్రెటరీ, కొంతమంది కమీటీ మెంబర్స్ వుండేవారు. వీళ్ళంతా పదిరోజులకో, పదిహేనురోజులకో ఒక ఆదివారం నాడు చేరి తమకుండే కష్టనష్టాలన్నీ ఏకరువు పెట్టి వాటి పరిష్కారమార్గాలకోసం తీర్మానించేవారు. అయితే ఇవేవీ నిర్మాతల దగ్గరచ ఫలించేవికావు. యూనియన్ చాలాకాలం తమ కోరికల లిస్ట్ పెంచుకుంటూ పోయిందే తప్ప వాటిని పెద్దగా సాధించిన దాఖలాలు లేవు. మా నాన్నగారు ఒక సభ్యుడిగా చాలాసార్లే ఈ యూనియన్ మీటింగ్ లకు హాజరయ్యారు. వెళ్ళిన ప్రతీసారీ ఆదివారం నాడు పనిచేయాలా వద్దా? నైట్ కాల్షీట్లు పనిచేయకూడదు. అలా పనిచేస్తే డబుల్ కాల్షీట్  డబ్బులు చెల్లించాలి వంటి రెండు విషయాలమీదే తీవ్రంగా తర్జనభర్జనలు జరిపేవారు. ఈ సమావేశాలలో విభిన్న రాగాలు వినపడేవి. ఒకరికి సాధకంగావుండేది మరొకరికి ఇబ్బందికరం. ఈ విధంగానే సినీ మ్యుజిషియన్స్ యూనియన్ కొన్నాళ్ళు కుంటినడక సాగించింది. పెద్ద సంగీత దర్శకులు, బిజీ సంగీతదర్శకులు యూనియన్ కార్యకలాపాలలో ముఖ్యపాత్ర వహించడానికి ఇష్టపడేవారు కాదు. యూనియన్ విషయాలలో ప్రముఖంగావుంటే  తమకు అవకాశాలిచ్చే నిర్మాతల అసంతృప్తికి గురి కావలసివస్తుందేమోననే భయం పైకి చెప్పకపోయినా కొందరిలో వుండేది. 

ఇలాటి పరిస్థితులలో ఒక ఏడాది యూనియన్ లో కొత్త కమీటీ మెంబర్స్ గా టి.గోవిందరాజులు నాయుడుగారు, ఘంటసాల మాస్టారు, ఎమ్.బి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పాతకాలపు సినీమాలలో (అవి ఏ సినీమాలో నాకైతే తెలియదు) మ్యూజిక్ డైరక్టరయిన గోవిందరాజులు నాయుడుగారు ప్రెసిడెంట్. ఘంటసాల మాస్టారు ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ . ఎమ్ బి శ్రీనివాస్ శెక్రటరీగా ఎన్నికయ్యారు. ఎమ్.బి.శ్రీనివాసన్ మలయాళీ. కొన్ని మలయాళ, తమిళ చిత్రాలకు సంగీతం నిర్వహించారు. నెంబర్ వన్ మ్యూజిక్ డైరక్టర్  కాలేకపోయినా మంచి మాటకారి, మంచి సంగీత పరిజ్ఞానం కలవారు. తెలుగులో మనందరికి బాగా తెలిసిన భానుమతి గారి 'వివాహబంధం' సినీమాకు ఎమ్.బి.శ్రీనివాసనే సంగీత దర్శకుడు. 

 
ఎమ్.బి.శ్రీనివాసన్

1971లో మద్రాస్ ఏర్ పోర్ట్ లో అమెరికా ప్రయాణానికి సాగనంపడానికి వచ్చిన ప్రముఖలు తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారు, ఎమ్.బి.శ్రీనివాసన్ గార్లతో ఘంటసాలగారు
ఘంటసాలగారి వెనుక అటు ఇటు - నేను, ఘంటసాల రవి

మెడ్రాస్ ఆలిండియా రేడియో లో కోరల్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా అనేక మంచి సంగీతకార్యక్రమాలు రూపొందించారు. ఆరోజుల్లో రేడియోలోనే కాక అందరికి ముఖ్యంగా తెలుగు పిల్లలందరికి తెలిసిన  "పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా" అన్న పాట  స్వరరచన ఆయనదే. 

ఈ ముగ్గురూ యూనియన్ కార్యకలాపాలు చేపట్టిన తర్వాత సినీ మ్యుజిషియన్స్ యూనియన్ మంచి అభివృధ్ధి సాధించింది. అయితే అంత సునాయాసంగా ఏమీ జరగలేదు.  పూర్తి స్థాయి రిజిస్టర్డ్ యూనియన్ గా పనిచేయడం ప్రారంభించిన రోజుల్లో ఆర్ధిక స్వావలంబన కోసం ప్రతి సినీ మ్యూజిషియన్ ప్రతి రికార్డింగ్ కి పావలా చొప్పున విరాళంగా ఇచ్చేవారు. కృష్ణ అని వయొలెనిస్టని జ్ఞాపకం, తరవాత ఆర్కెస్ట్రా అరేంజర్ కూడా, అన్ని రికార్డింగ్ స్టూడియోలకి వెళ్ళి  కళాకారుల దగ్గరనుంచి వారి దగ్గర్నుంచి ఆ విరాళాలు సేకరించేేవారు. ఆ కాంట్రిబ్యూషన్ పుచ్చుకున్నందుకు ఆధారంగా ఒక పింక్ కలర్ టికెట్ లాటిది  ఇస్తూండేవారు.  

ఘంటసాల మాస్టారు వైస్ ప్రెసిడెంట్ అయ్యాక  మ్యుజిషియన్స్ యూనియన్ సమావేశాలు చాలా నెం.35, ఉస్మాన్ రోడ్ లోనే జరిగేవి. ఎమ్మె.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహాదేవన్, టి.జి.లింగప్ప, రాజన్ నాగేంద్ర, జి.కె.వెంకటేష్, ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల, టి.వి.రాజు, టి.చలపతిరావు, మాస్టర్ వేణు, సుదర్శనం, గోవర్ధనం, పి.లీల, పామర్తి, ఎ.ఎ.రాజ్ (అంట్యాకుల అప్పలరాజ్), రాఘవులు, అప్పారావు (చక్రవర్తి), వి.దక్షిణామూర్తి, బాబురాజ్, సుసర్ల దక్షిణామూర్తిలాంటి who is who of famous music directors of Telugu film world, సంగీత కళాకారులందరిని ఒకేచోట చూసే అవకాశం నాకు ఈ మీటింగ్ ల ద్వారా కలిగింది. ఈ మీటింగ్ లలో స్పష్టంగా తమ భావాలను తెలియజేసినవారూ ఉన్నారు. తాము మాట్లాడకుండా ఇతరులచేత మాట్లాడించేవారూ ఉండేవారు. ఆయా కమిటీలలో సభ్యులుగా మా నాన్నగారు కూడా పనిచేసేరు.

సినీమ్యుజిషియన్స్ లో చాలామంది ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ క్రిస్టియన్స్ లేదా ఆంగ్లో ఇండియన్స్. వీరంతా విధిగా ఆదివారం చర్చ్ కు హాజరవ్వాలి. ఆరోజున రికార్డింగ్ ల వలన సండే ప్రేయర్స్ కు వెళ్ళడం కుదరదు. వారు లేకుండా విశ్వనాథన్, మహాదేవన్ వంటి ప్రముఖ సంగీత దర్శకులు పాటలు , రీరికార్డింగ్ చేయరు. అందువలన చాలామంది కోరిక కూడా ఆదివారం ఆఫ్ వుంటే మంచిదనే.

మరొక పాయింట్ సినీ మ్యుజిషియన్స్ యూనియన్ మెంబర్స్ అందరికీ పని చేయించుకున్న వెంటనే, అంటే రికార్డింగ్/రీరికార్డింగ్ అయిన వెంటనే స్పాట్ పేమెంట్స్ చేయాలి. 

సంఘ సభ్యుల సంక్షేమం/ఆరోగ్యం దృష్ట్యా రాత్రి పది దాటాక పనిచేయకూడదు. అదేవిధంగా నిర్మాతలకు సహాయపడే రీతిలో కూడా ఘంటసాలవారి చొరవ వల్ల కొన్ని మార్పులు తీసుకువచ్చారు. అంతవరకూ రికార్డింగ్ ల సమయంలో వాద్యకళాకారులను నిర్మాతలే  తమ వాహనాలలో  స్టూడియోలకు తీసుకువెళ్ళడం, రికార్డింగ్ తర్వాత ఇళ్ళ వద్ద దింపడం చేసేవారు. ఇది నిర్మాతలకు చాలా బర్డెన్ గా వుండేది.  ఆ పధ్ధతిని తొలగించి మ్యూజిషియన్స్ ఎవరికి వారే వారికి తోచిన వాహనాలలో సమయానికి స్టూడియో కు చేరుకోవాలి. అది ఆ కళాకారుని సొంత భాధ్యత. అందుకు ప్రత్యమ్నాయంగా ప్రతీ మ్యూజిషియన్ కు కొంత పైకం బేటాగా చెల్లించడం ప్రారంభించారు.  నిర్ణీత సమయం దాటాక వచ్చేవారిపై తగు చర్యలు తీసుకునే అవకాశం సంగీతదర్శకుడికి కల్పించారు.

ఈ విధమైన సమంజసమైన  సభ్యుల సమస్యలన్నీ ప్రతీసారి చర్చకు వచ్చేవి. 

ఘంటసాల మాస్టారు అటు నిర్మాతలకు, ఇటు సంగీత కళాకారులకు వారధిలాటివారు.  సినీమా రంగంలోని పెద్ద నిర్మాతలందరికీ ఘంటసాలగారంటే చాలా గౌరవం వుండేది. ఆయన మాటకూ విలువవుండేది. మాస్టారు, ఎమ్.బి.ఎస్ చాలా ఓర్పుగా, నేర్పుగా సినీ సంగీత కళాకారుల సమస్యలన్నీ  ఎత్తి చూపి, న్యాయబధ్ధమైన వాటన్నిటికీ సానుకూల పధ్ధతిలో ఇరువర్గాలకు ఆమోదకరమైన నిర్ణయాలు అమలు పర్చడంలో తీవ్రంగా కృషి చేసి కీలకపాత్ర పోషించారు.  క్రమక్రమంగా సినీ మ్యుజిషియన్స్ యూనియన్ చాలా వృధ్ధి చెంది. అన్ని యూనియన్లలోకి సినీ మ్యుజిషియన్స్ యూనియనే నెంబర్ వన్ గా, చాలా దృఢమైన సంఘంగా మార్గదర్శకంగా రూపొందింది. 

ఈ విధంగా ఘంటసాల మాస్టారు ఏక్టివ్ వైస్ ప్రెసిడెంట్ గా సినీ మ్యుజిషియన్స్ యూనియన్ కు రెండు, మూడు టెర్మ్స్ తన నిస్స్వార్ధ  సేవలను అందించి సంఘ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఒక్క సంగీత కళాకారులకే కాక పలువురు పాటల రచయితల విషయంలో కూడా తగు చొరవ తీసుకొని వారికి ఇవ్వవలసిన పారితోషకాలను బకాయి పెట్టకుండా చెల్లించేలా కృషిచేసిన సందర్భాలెన్నో.

అయితే తన స్వవిషయంలో మాత్రం కొందరి  నిర్మాతలనుండి తనకు రావలసిన పూర్తి సొమ్మును వసూలు చేసుకోలేకపోయారు. 

ఘంటసాల మాస్టారి తరువాత, పామర్తి, ఎ.ఎ.రాజ్, టి.చలపతిరావు, రామసుబ్బు, కూడా యూనియన్ అధ్యక్షులుగా కార్యకలాపాలు నిర్వహించారు.  మాస్టారి శకం అయ్యాక ఎన్నో కొత్త కొత్త మార్పులు వచ్చాయి.
ప్యాకేజ్ సిస్టం మ్యూజిక్ ప్రారంభమయింది. సంగీతదర్శకుడు అడిగిన లక్షలాది రూపాయలు చెల్లిస్తే చాలు. సీనీమా పాటలు/రీరికార్డింగ్ రెడీ. నిర్మాతకు ఏ బర్డెన్ లేదు. ఎంతమంది ఆర్కెస్ట్రా పెట్టాలి, ఎంతమంది గ్రూప్ సింగర్స్ వుండాలి, ఎవరెవరికి ఎంతెంత పే చెయ్యాలి మొదలైన అధికారాలన్నీ సంగీతదర్శకుడివే. ఈవిధంగా సినీమా సంగీతాన్ని మోనోపలి చేసి లోపాయికారిగా లబ్దిపొందిన  సంగీత దర్శకులు వుండేవారన్న ప్రచారమూ వుండేది.

ఈనాడు సినీ మ్యుజీషియన్స్ యూనియన్ కోడంబాక్కం ఆర్కాట్ రోడ్లో కమలా ధియేటర్ పక్కన తమ సొంత భవనంలో నుండి తమ కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి ఎదిగింది. యూనియన్ లో సభ్యులు కానివారెవ్వరికీ సినీమాలలో పనిచేసే అవకాశంలేదు. విధిగా ప్రతి ఒక్కరూ మెంబర్ కావలసినదే. చందాలు కట్టవలసినదే. కళాకారుల ప్రతిభను బట్టి ABC గ్రేడ్స్ కూడా ఉన్నాయని విన్నాను. 

పనిలేక ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న వృధ్ధ సినీ సంగీత కళాకారులకు తగు ఆర్థిక సహాయాన్ని కూడా యూనియన్ సంక్షేమనిధి నుండి అందజేస్తున్నదని విన్నాను. మా నాన్నగారు ఇప్పటికీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా  వార్షిక Full Member సభ్యత్వ రుసుము కడుతూ సినీ మ్యుజిషియన్స్ యూనియన్ సభ్యులుగా కొనసాగుతున్నారు.

 


2011లో జరిగిన యూనియన్ గోల్డెన్ జూబిలీ ఉత్సవాల్లో నాన్నగారిని సీనియర్ మెంబర్ గా ఒక బంగారు ఉంగరంతో సత్కరించింది యూనియన్.



అయితే ఘంటసాల మాస్టారు స్వర్గస్థులయాక మా నాన్నగారు పూర్తిగా సినీమా సంగీతానికి దూరమయ్యారు. నాకూ సినీరంగ విశేషాల గురించి ఏ అవగాహనా లేకుండాపోయింది. 

ఏది ఏమైనా ఘంటసాల మాస్టారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, సినీ సంగీత కళాకారుల ప్రతినిధిగా  సినీమా రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయం.

💥కొసమెరుపు💥

మా చిన్నప్పుడు హైస్కూల్ రోజుల్లో తరచూ 'మఫ్' (muff) అనే మాట వినబడేది.  దానికి అర్ధం ఈ క్రింద వ్రాసిందాన్ని పూర్తిగా చదివితే అర్ధమౌతుంది.

గతంలో ఒకసారి చెప్పాను, నెం.35, ఉస్మాన్ రోడ్ లో ఒకే పేరుతో ఇద్దరిద్దరు వుండేవారని. వెంకటేశ్వరరావు ద్వయం, సుబ్బారావు ద్వయం, కృష్ణ ద్వయం, జనార్దన ద్వయం అలాగే మరో ద్వయం 'రాఘవులు'. ఈ ద్వయం తర్వాత త్రయం కూడా అయింది. ఆ విషయం మరోసారి చూద్దాము. దీన్ని యాదృచ్ఛికమంటారో, మరేమంటారో నాకు తెలియదుగానీ  నాకు మాత్రం ఒక తమాషాగా వుండేది.

ఈ రాఘవద్వయంలో ఒకరు జెవి రాఘవులు. ఘంటసాల మాస్టారి సంగీత సహాయకుడు. మరొకరు మాస్టారింటి ధోబీ (చాకలి). ఈ రాఘవులు ఒక్క మాస్టారింటికీ, మా ఇంటికి మాత్రమే కాదు సారంగపాణి స్ట్రీట్ లో వుండే అక్కినేని నాగేశ్వరరావు గారింటి ధోబీ కూడా ఈ రాఘవులే. మాస్టారు, నాగేశ్వరరావు గారు ఎక్కువగా తెలుపు బట్టలే ధరించడం వలన ఈ రాఘవులు వారివి వీరికి వీరివి వారికి మార్చేసి తెస్తూ అమ్మగారి (సావిత్రమ్మగారు) దగ్గర చీవాట్లు తినేవాడు. అలాటప్పుడు అన్నపూర్ణ గారి గురించి, నాగేశ్వరరావు గారింటి విశేషాలు చెపుతూ దృష్టి మళ్ళించేవాడు. ఈ రాఘవులులోని ఒక పెద్ద దుర్గుణం ఏమంటే బట్టలు పట్టుకుపోయి నెల్లాళ్ళైనా ఉతికి, ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకువచ్చేవాడు కాదు. ఎప్పుడొస్తాడో స్పష్టంగా చెప్పేవాడు కాదు. ఒక వంద బట్టలయ్యాక మొత్తంగా డబ్బులు తీసుకునేవాడు. అప్పుడు, అతని భార్య, పేరు  సీత అనే గుర్తు,  ఇద్దరూ వచ్చేవారు. మా ఇంటి బట్టలు కూడా ఈ రాఘవులే ఉతికి తీసుకువచ్చేవాడు.

ఒకసారి మాస్టారు కచేరీకి బయట వూరు వెళ్ళవలసి వచ్చింది. మా నాన్నగారు కూడా. వీళ్ళిద్దరి చాలా బట్టలు రాఘవులింట్లో వుండిపోయాయి. మనిషి కనపడడు. అప్పుడు సావిత్రమ్మగారు ఎవరైనా రాఘవులుండే చోటికి వెళ్ళి చూసొస్తే బాగుంటుందని అన్నారు. ఆ సమయానికి నేనూ, నరసింగే అందుబాటులో వున్నందువల్ల రాఘవులింటికి వెళ్ళి బట్టలు తెచ్చే పని మాకు పురమాయించారు. అయితే ధోబీ రాఘవులు ఇల్లు ఎక్కడో ఎవరికీ తెలియదు సైదాపేట రైలు బ్రిడ్జి క్రింద వున్న అడయార్ రివర్ లో బట్టలు వుతుకుతాడని తప్ప. అక్కడికి వెళితే కనిపిస్తాడని ఓ ఊహ. ఆ సైదాపేట ఏరేదో మా విజయనగరం అయ్యకోనేరులా, బొబ్బిలి  గుర్రపు చెరువులా వుంటుంది, అక్కడ లవకుశ లో రేలంగి, గిరిజ, డాక్టర్ శివరామకృష్ణయ్య స్టైల్ లో  'వెయ్యర దెబ్బ దరువెయ్యర దిబ్బ బండమీద దబాదిబా' అంటూ చాకలాళ్ళు రేవులో బట్టలు చింపేస్తూవుంటారు, రాఘవులను ఆమాత్రం పట్టలేకపోతామాని మా ధైర్యం. (అప్పటికి లవకుశ రిలీజ్ కాలేదు కానీ పాటలు రికార్డ్ అయాయి. ఈ పాట షూటింగ్ కూడా ఆ ఏటి ఒడ్డునే జరిగిందని చెప్పడం జ్ఞాపకం). 

నరసింగకి మెడ్రాస్ కొత్త. అరవం రాదు. నాకు వచ్చునని నేను అనుకునేవాడిని. మేమిద్దరం కోడంబాక్కం స్టేషన్లో తాంబరం వేపు వెళ్ళే లోకల్ ట్రైన్ లో బయల్దేరాము. రైలు మాంబళం దాటింది. సైదాపేట దాటింది. కొంతసేపటికి ఒక బ్రిడ్జి క్రింద ఒక ఏరు (అడయార్ రివర్) కనపడింది. అయితే ఆ చుట్టుపక్కల ఏ చాకలివాళ్ళు కనపడలేదు. ట్రైన్ అక్కడెక్కడా ఆగలేదు. పాతకాలం కింగ్ ఇన్స్టిట్యూట్ భవనం దాటి ముందుకు వెళ్ళి గిండీ స్టేషన్ లో ఆగింది. అక్కడ రైలు దిగి మళ్ళా వెనక్కు సైదాపేట బ్రిడ్జి క్రిందివరకు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వచ్చి అడయార్ రివర్ ప్రాంతంలో ఉన్న కొన్ని గుడిసెల ముందున్న కొంతమందిని రాఘవులు గురించి అడిగాము. అందరూ ఒకే సమాధానం 'తెరియాదు' అది మాకు బాగా తెలిసింది. వెతికి వెతికి వేసారి రాఘవుడు కానరాక ఎండలో కాళ్ళీడ్చుకుంటూ (కొంత దూరం) భోజనాల వేళకు ఈదురోమని ఇంటికి చేరాము. చేసే పని తాలుకు ముందువెనుకలు క్షుణంగా తెలుసుకోకుండా, సరైన ఊహ లేకుండా ఏ కార్యం మొదలెట్టినా వాటికి ఏ ఫలితం దక్కదు. వృధాయాసం తప్ప. ఈ పరమానందయ్య శిష్యుల  (నేను, నరసింగ) తెలివితేటలు చూసి మా అమ్మగార్లిద్దరూ మురిసి ముూర్ఛపోయారు.

పరమానందయ్య శిష్యులంటే గుర్తుకు వచ్చింది, ఘంటసాల మాస్టారి అద్వితీయ సంగీత ప్రతిభకు గీటురాయి 1966 నాటి 'పరమానందయ్య శిష్యుల కథ' పాటలు, విశేషాలు...... వచ్చే వారమే......
                      ...సశేషం


Sunday, April 18, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఏడవ భాగం

18.04.2021 -  ఆదివారం భాగం - 26*:
అధ్యాయం 2 భాగం 25  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1963 నాటికి "చచ్చి చెడి సాయంగల విన్నపాలు" అనే నానుడిని నిజంచేస్తూ ఘంటసాలవారి కాంపౌండ్ లో మొట్టమొదటి SSLC (అప్పట్లో అదే 12th Standard), స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్ సంపాదించిన ఘనుడిని నేనే అయ్యాను. అంతవరకూ అందరూ SSLC లోపు చదివినవారే తప్ప అంతకుమించి పైకిపోలేదు. అందుకు మా ఇంట్లోనూ, ఘంటసాల మాస్టారింట్లోనూ అందరూ సంతోషించారు. అయితే, నాలో ఏ గొప్ప విజ్ఞానమూ పెరగలేదు. SSLCలో నాకు వచ్చిన మార్క్ లకు ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో తెలియదు. మెడిసిన్ లు, ఇంజినీరింగ్ లు చదివే తెలివితేటలు గానీ, చదివించే స్థోమతగాని లేదు. బాపట్లలో అగ్రికల్చర్ బి.ఎస్.సి కి సీట్ కోసం అప్లికేషన్ పంపాను. ఆ కాలేజీవారు కూడా ఇంటర్వ్యూకు రమ్మని ఆహ్వానించారు. అయితే ఆ ఉత్తరం మా బొబ్బిలి ఎడ్రస్ కు వెళ్ళింది. అప్పటికి నేను మద్రాస్ వచ్చేసాను. మా బొబ్బిలి తాతగారు వెంటనే ఆ ఉత్తరాన్ని మద్రాసుకు పోస్ట్ చేశారు. ఆ ఉత్తరం మాకు చేరిననాడే ఇంటర్వ్యూ. ఎక్కడ? తిరుపతిలో. ఆనాటికి బాపట్ల, తిరుపతిలలో మాత్రమే అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీలు వుండేవి. ఆ రెండుకాలేజీల ఇంటర్వ్యూలు తిరుపతిలో జరిగాయి. అదే రోజు ఇంటర్వ్యూకు ఎలా వెళ్ళాలో తెలియలేదు. ఘంటసాల మాస్టారిని మా నాన్నగారు సంప్రదించారు. ఆయన వెంటనే ఎదో బస్సు పట్టుకొని తిరుపతి వెళ్ళమని సలహా ఇచ్చారు. నేనూ, మానాన్నగారు బస్ లో బయల్దేరాము. ఆ బస్ 'తడ 'మీదుగా తిరుపతి వెళ్ళే బస్ . అప్పటికి తిరుపతి బస్ రూట్లుగానీ రోడ్లుగానీ  అంత అభివృధ్ధి చెందలేదు. కొండల్లో కోనల్లో మట్టిరోడ్ల మీద ప్రయాణం చేస్తూ, తిరుపతి చేరుకొని, ఆ ఇంటర్వ్యూలు జరిగే స్థలాన్ని వెతికిపట్టుకొని మేము అక్కడికి చేరేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. మేము ఆ ఆఫీసుకు వెళ్ళేసరికి ఐదున్నర దాటిపోయింది. అప్పటికే ఇంటర్వ్యూలు ముగిసిపోయాయి. మేము చేయగలిగింది ఏమీలేదు, వచ్చే ఏడాదికి మళ్ళా అప్లై చేసుకోమని ఒక మంచి ఉచిత సలహా ఇచ్చేరు. ఇక ఆ రాత్రికి ఎక్కడ వుండాలో తెలియలేదు. వెంటనే మద్రాసు వెళ్ళే అవకాశమూ లేదు. కనీసం అంతదూరం వచ్చినందుకు కొండమీది వేంకటేశ్వరస్వామి దర్శనమైనా చేసుకుందామని తిరుమల కొండమీదకు బస్ లో వెళ్ళాము. అయితే చిత్రంగా, ఇన్ని విషయాలు గుర్తున్న నాకు కోవెల లోపలకు వెళ్ళామా లేదా? దైవదర్శనం జరిగిందా, లేదా, అనే విషయాలే జ్ఞాపకంలేవు. కానీ, కొండమీద చెట్లక్రింద అక్కడి సిమెంట్ చప్టాలమీద చాలామంది యాత్రీకులులాగే ఆ రాత్రి గడిపాము. చల్లటి కొండగాలి, కప్పుకోవడానికి సరియైన దుప్పట్లవంటివి తీసుకువెళ్ళక ఆ రాత్రంతా సరియైన నిద్రేలేదు. మర్నాటి ఉదయాన్నే మరల బయల్దేరి మద్రాస్ చేరుకున్నాము. జరిగిన విషయం తెలిసి ఘంటసాల మాస్టారు చాలా విచారించారు. వెంటనే, గుంటూరు లోని తన మిత్రుడు, గొప్ప పలుకుబడిగల  శ్రీ వడ్డె శోభనాద్రిగారికి  నా సీట్ విషయంలో తగు సహాయం చేయమని సిఫార్సు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం నేనే రాసాను. మాస్టారు సంతకం చేశారు. కొన్నిరోజుల తర్వాత శోభనాద్రిగారు సమాధానం వ్రాసారు. ఆ ఏడాదికి కాలేజీ సీట్ల ఇంటర్వ్యూలన్నీ ముగిసి సెలక్షన్ కూడా పూర్తికావడం వలన తగిన సహాయం చేయలేకపోతున్నందుకు విచారిస్తున్నట్లు, వచ్చే సంవత్సరం అప్లైచేసి ముందుగా తనకు తెలియజేయమని ఆ ఉత్తర సారాంశం. వచ్చే ఏడాదివరకూ ఆగడమంటే ఒక ఏడాది చదువు వృధా అయినట్లే. ఆ తర్వాత కూడా అనుకున్న ఆ సీటు వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఉన్న ఆర్ధిక పరిస్తితుల దృష్ట్యా ఏదో ఒక డిగ్రీ వస్తే చాలనిపించింది. వెంటనే, మళ్ళా మా బొబ్బిలికే చేరాను. అప్పటికి రెండు మూడేళ్ళ క్రితమే బొబ్బిలి రాజావారి డిగ్రీ కాలేజీ ప్రారంభించారు. అక్కడ ఇంచుమించు ఒకేసారి విద్య, వినోదాలకోసం ఒక కాలేజీ, ఒక సినీమా హాలు (శ్రీకృష్ణా టాకీస్) వచ్చేయి. (తొలి సినీమా 'శాంతినివాసం').

బొబ్బిలిలోని సంస్థానం హైస్కూల్, సినీమా హాల్, సుగర్ ఫ్యాక్టరీ, రైస్ మిల్స్, వేణుగోపాలస్వామి వారి ఆలయం, ఇలా అన్నిటిలోను ముఖ్య భాగస్వామ్యం బొబ్బిలి రాజావారిదే. బొబ్బిలి కాలేజీ స్థాపనలో స్థానిక, చుట్టుప్రక్కల గ్రామ ప్రజల సహకారం, డబ్బు కూడా వుందని చెప్పుకుంటారు. సుగర్ ఫ్యాక్టరీకి వచ్చే ప్రతీ చెరుకు బండికీ టన్నుకు ఇంత అని, కాలేజీ నిర్మాణానికి డబ్బు వసూలు చేసేవారని అనుకోవడంవుంది. నవంబర్ నుండి మార్చ్ వరకూ సుగర్ ఫ్యాక్టరీ ముమ్మరంగా పనిచేసేది. రాత్రి తెల్లార్లు చెరుకు బళ్ళు చుట్టుపక్కల ఊళ్ళనుండి బొబ్బిలి చేరేవి. ఎడ్లబళ్ళమీద చెరుకు మోపులు కట్టి వచ్చేవారు. రాత్రిపొడూగునా లొల్లాయిపాటలు, కురుక్షేత్రం  నాటక పద్యాలు పాడుకుంటూ చెరుకుబళ్ళు తోలుకువచ్చేవారు. పాడినంతసేపు ఊరంతటికీ వినిపించేలా పాడి అలసిపోయి అలాగే నిద్రపోయేవారు. కానీ, అలవాటు పడిన ఆ ఎడ్లు మాత్రం బండిని సురక్షితంగా సుగర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళిపోయేవి. ఈలోగా చాలామంది ఆకతాయిలు బండిమీద, చేతికి అందినంతవరకు చెరుకుగడలు తస్కరించేవారు. పొరపాటున పట్టుబడ్డారా... ఆ బళ్ళవాళ్ళు నోటికి వచ్చిన బండబూతులు తిట్టేవారు. పాపం! వాళ్ళు కూడా అంతకుమించి ఏం చేయలేకపోయేవారు. ఇది ప్రతీరోజూ క్రమం తప్పక జరిగే వ్యవహారమే. 

అలాటి కొత్తగా తెరిచిన కాలేజీలో బి.ఏ. (ఆనాటికే బి.ఏ. అంటే 'బొత్తిగా అధ్వానం' అనే చిన్నచూపు వచ్చేసింది) డిగ్రీలో చేరాను. ఏడాది మొత్తానికి చాలా శెలవు రోజులుండేవి. ఆ కాలమంతా మద్రాస్ లో 'నెం.35, ఉస్మాన్ రోడ్' లోనే అందరిమధ్యా  సత్కధాకాలక్షేపం.

ఒకరోజు ఉదయం పది పదకొండు గంటల మధ్య రాజగోపాల్ వచ్చి మేడమీది తన ఆఫీసు రూములో తన పని మొదలెట్టాడు. అరవతెలుగు. ఘంటసాల మాస్టారు చిత్రనిర్మాణం ఆపేసినా వాటి ఎక్కౌంట్స్కు సంబంధించిన లావాదేవీలు, ఇన్కంటాక్స్ లెఖ్ఖలు చూడడానికి ఒక సమర్ధుడైన క్లర్క్ గా రాజగోపాల్ వచ్చి చేరాడు. నరసింగ, రాజగోపాల్ కలసి పనిచేసేవారు. నరసింగ ఉస్మాన్ రోడ్ లోని ఘంటసాల వెంకటేశ్వరరావు గారి దగ్గర ఇంట్లో వ్యక్తిగా, హబిబుల్లా రోడ్ లోని గుమ్మడి వెంకటేశ్వరరావు గారి దగ్గర పార్ట్ టైమ్ క్లర్క్ గా పనిచేసేవాడు. 

రాజగోపాల్ రోజూ తనతో కూడా హిందూ పత్రికో, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికో తీసుకువచ్చేవాడు. 
అది రాగానే అందులో ఆఖరి పేజీలలోని సిటీ ఎంటర్టైన్మెంట్ లో ఊళ్ళో ఉన్న సినీమాలు, శుక్రవారం అయితే రివ్యూలు చూసి తర్వాత హెడ్లైన్స్ చూడడం నా అలవాటు. వారపత్రికలైనా కూడా వెనకనుండి ముందుకు వెళ్ళేవాడిని. ఆ తర్వాతే వరసగా  నచ్చిన సీరియల్స్ చదవడం. ఆ రోజు అలా ఆ న్యూస్ పేపర్ వెనకనుంచి ముందు పేజీకి వచ్చి చూస్తే ఒక మహా దారుణమైన,్ దేశ విదేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన వార్త తలకాయంత అక్షరాలతో ప్రకటించారు. భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూగారు స్వర్గస్తులయ్యారన్న వార్తతోపాటు ఆయనకు సంబంధించిన అనేక ఫోటోలు, విశేషాలతో వుంది. 

నేను, నరసింగ రాజగోపాల్ ను అడిగాము పేపర్ చదివావా?' అని. 'చదివానే'. ఇంతే సమాధానం. 'నెహ్రూగారు పోయారట'!
'అవును. పోయారు.'
'మరి నువ్వేం చెప్పలేదే'
'ఏముంది చెప్పడానికి'.

That is Rajagopal. సన్నగా పొడుగ్గా, చామనచాయగా కళ్ళజోడుతో చాలా నిదానంగా, కామ్ గా వుండేవాడు. ఏ హడావుడి వుండేదికాదు. వచ్చేదీ తెలియదు, వెళ్ళేదీ తెలియదు. అతను అలాగే రెండేళ్ళో, మూడేళ్ళో పనిచేసి వెళ్ళిపోయాడు.

1964 చివర్లోనో, 1965 ప్రారంభంలోనో సరిగా గుర్తులేదు, మా రావమ్మ పెళ్ళిజరిగింది. రావమ్మ ఘంటసాల మాస్టారికి ఆప్తుడు, సంగీత సహాయకుడు అయిన పామర్తి వెంకటేశ్వరరావుగారి ప్రధమ సంతానం. నా వయసే. ఆ పెళ్ళి టి.నగర్ బోగ్ రోడ్ లో జరిగింది. ఆరోడ్ లోనే 'మల్లీశ్వరి' బి.ఎన్.రెడ్డిగారు వుండేవారు. (జాతీయస్థాయి ప్రముఖ చిత్ర నిర్మాతాదర్శకుడు బి.ఎన్.రెడ్డిగారి గౌరవార్ధం తమిళనాడు ప్రభుత్వం ఒకప్పుడు ఆ ప్రాంత బోగ్ రోడ్ కు బి.ఎన్. రెడ్డి రోడ్ అని పేరుపెట్టారు. ఆ తరువాత వచ్చిన మరో పార్టీ ప్రభుత్వం కులాలు , జాతులు , మతాలు నిర్మూలించి నవసమాజ నిర్మాతలం అనిపించుకునే క్రమంలో ముందుగా  రోడ్లకు పెట్టిన పేర్లలో వుండే కులం, జాతుల పేర్లమీద నలుపు రంగు పూయడం మొదలెట్టారు. దానితో బి.ఎన్ రెడ్డి రోడ్ లో రెడ్డి పోయి బి.ఎన్. మాత్రం మిగిలింది. జి.ఎన్.చెట్టి లో చెట్టి పోయి, జి.ఎన్. రోడ్ అయింది. నాగేశ్వరరావు రోడ్ లో రావు కులం పేరుగా కనిపించి రావు తీసేసి నాగేశ్వర రోడ్ అన్నారు. డాక్టర్ నాయర్ రోడ్ లో నాయర్ ను లాగి పారేయగా ఒక్క డాక్టర్ మిగిలి డాక్టర్ రోడ్ అన్నారు. తిరుమలపిళ్ళై లో పిళ్ళై పోయి తిరుమల మిగిలింది. మహమ్మద్ ఉస్మాన్ రోడ్ ఉస్మాన్ రోడ్ అయింది. ఇలా మద్రాస్ లోని రోడ్ల పేర్లన్నీ మార్చి పోస్టల్ డిపార్ట్మెంట్ కు కొత్త తలనొప్పి తెచ్చారు. కృష్ణమాచారి, కృష్ణారావు, కృష్ణారావు నాయుడు లలో జాతి ప్రక్షాళన తో ఒక్క కృష్ణ రోడ్, కృష్ణా స్ట్రీట్ మిగిలి ఎడ్రస్ దార్లను కనుక్కోవడంలో, ఉత్తరాల బట్వాడా చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎంతవరకు జాతి, కుల నిర్మూలనం జరిగిందో నవ సమానత్వ సమాజం ఎంతవరకు నిర్మించబడిందో ఆ దేవుడికే తెలియాలి. అదంతా ఒక రాజకీయం. కొన్నాళ్ళకు ఆ పార్టీ పోతుంది. మరొకపార్టీ గద్దె ఎక్కుతుంది. మరో నవసమాజ స్థాపనకు మరేవో మార్పులు చేస్తారు. 'ఇంతేరా జీవితం తిరిగే రంగులరాట్నం'  అంటారు బి.ఎన్.లాటి అనుభవజ్ఞులు.)

మళ్ళీ, రావమ్మ పెళ్ళికి వద్దాము. పెళ్ళి ఉదయం ముహుర్తం. తమిళనాడు లో 90 శాతం పెళ్ళిళ్ళన్నీ ఉదయం ముహుర్తంలోనే జరుగుతాయి. పెళ్ళి చూడ్డానికి వచ్చేవారికి చాలా అనుకూలం. పది పదిన్నర లోపల పెళ్ళయిపోతుంది. వధూవరులకు గిఫ్ట్ ఇచ్చేసి, శుభాకాంక్షలు తెలిపి, పన్నెండులోపల పెళ్ళివారి విందు భోజనంచేసి, వారిచ్చిన తాంబూలం సంచీ పట్టుకొని  ఓ రెండు గంటలు లేట్ పర్మిషన్ తీసుకొని ఆఫీసులకు వెళ్ళిపోతూంటారు. ఇరువర్గాల పెళ్ళివారు మధ్యాహ్నం రెండులోపల కళ్యాణమండపాలు ఖాళీచేసి వెళ్ళిపోతారు. మ్యారేజ్ రిసెప్షన్ లాటివి వుంటే, ముందో, వెనకో ఏర్పాటు చేసుకుంటారు. 

తమిళనాడులో కొన్ని వర్గాలలో జరిగే పెళ్ళి తంతులు వింతగానూ, నవ్వు తెప్పించేవిగాను వుంటాయి. పెళ్ళికొడుకుకు, పెళ్ళికూతురికి చదివించే కానుకలన్నీ, ఇంట్లో వున్న మాకు లౌడ్ స్పీకర్లలో  స్పష్టంగా వినపడేవి. వధూవరులకు వారి దగ్గర చుట్టాలు ఇచ్చే కానుకలన్నీ పేరు పేరునా చదువుతూంటే మరొకరు వాటన్నింటినీ కాగితం మీద రాస్తూంటారు. అందులో కాస్ట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ నుండి కిలో రెండు కిలోల బియ్యం, కందిపప్పు వరకు 'కాదేది కానుకలకనర్హం' అన్నట్లు అనేక రకమైన వింత వింత వస్తువులెన్నో మా చెవినిపడేవి. పెళ్ళనేది ఆనాడూ, ఈనాడూ కూడా ఆర్ధికస్తోమతు లేనివారికి తలకుమించిన కార్యంగానే మిగిలిపోతోంది.

పామర్తి రామలక్ష్మి(రావమ్మ)ని చేపట్టిన వరుడు కృష్ణప్రసాద్. మాధవపెద్దివారు. మాధవపెద్ది సత్యంగారు, మాధవపెద్ది గోఖలేగారి తమ్ముడే. స్టేట్ బ్యాంక్ ఉద్యోగి.


నవ వధూవరులతో వరుడి తలిదండ్రులతో పామర్తి, ఘంటసాల దంపతులు

మంచి ఈడూజోడూ. ఈ పెళ్ళి నిర్విఘ్నంగా, జయప్రదంగా జరిపించడంలో ఘంటసాల మాస్టారు, సావిత్రమ్మగారు ఎంతో తోడ్పడ్డారు. పామర్తిగారికి సగం భారం తగ్గింది. అప్పటికే స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేయాలనే కోరికతో మాస్టారి దగ్గర సహాయకుడిగా పాల్గొనడం తగ్గించేసారు. అయినా ఇరుకుటుంబాల మధ్య గల పరస్పర ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు ఏమాత్రం తగ్గలేదు. మరల కొన్నేళ్ళ గ్యాప్ తో ఘంటసాల మాస్టారి చిత్రాలు కొన్నిటికి సహాయకుడిగా పనిచేయడం జరిగింది. ఘంటసాల మాస్టారి స్వభావం లో ఏ మార్పురాలేదు. ఆనాటి వివాహ కార్యక్రమం శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి మేనకోడళ్ళు, వింజమూరి సోదరీమణులు సీత, అనసూయ ద్వయంలో అనసూయగారి తనయ,  అప్పట్లోనే రంగప్రవేశం చేసిన  రత్నపాప కూచిపూడి నృత్యప్రదర్శనతో ముగిసింది. 

దేవత సినీమా వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి రావమ్మను మాస్టారింట్లో చూసాను. దేవతలోని డ్యూయెట్లు పాడి తన వైవాహిక జీవితం ఎంత సంతోషంగా గడుస్తోందో, సత్యం బావగారు, గోఖలే బావగారు(మాధవపెద్ది), తన తోటికోడళ్ళు ఎంత మంచివారో, ఎంత సఖ్యంగా వుంటారో లాటి అత్తింటి విషయాలన్నీ సావిత్రమ్మగారి దగ్గర, పాప పిన్నిగారి దగ్గర కథలు కథలుగా చెప్పింది. రావమ్మ, ఆమె చెల్లెలు శారద కూడా చాలా బాగా పాడేవారు. మాస్టారు దగ్గర కొన్ని కోరస్ లు పాడారేమో కూడా. రావమ్మ కబుర్లు అప్పట్లో నాకు వింతగాను, ఆశ్చర్యంగానూ అనిపించాయి. ఎక్కడా తన అమ్మ, నాన్నల ప్రసక్తేలేదు. పెళ్ళయిన వెంటనే అంతలా మరిపోతారా అనుకునేలా ఆడపిల్లలు అత్తింటి వాతావరణానికి అలవాటు పడిపోతారు. అది సహజం. అవసరం కూడానేమో!

1974 తర్వాత  అప్పుడప్పుడు కొన్ని విషయాలు వినడం తప్ప పామర్తి కుటుంబంతో అనుబంధం తగ్గిపోయింది. రావమ్మను మరల ఒకటి రెండుసార్లు మా మద్రాస్ తెలుగు అకాడెమీ ఉత్సవాలకు వచ్చినప్పుడు చూశాను. తిరుమల కొండమీద మా ఉత్సవాలలో మాధవపెద్ది మూర్తి కూచిపూడి నృత్యం చేసినప్పుడు ఆ గ్రూప్ తో వచ్చి పలకరించింది. అలాటి చిరపరిచితురాలు కొన్నేళ్ళక్రితం తన మనవరాలితోనో/మనవడితోనో సరదాగా ఆటలాడుకుంటూనే చాలా సునాయాసంగా, ఏ బాధపడకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని విన్నప్పుడు కొంచెం బాధ కలిగినా, చాలా అదృష్టవంతురాలనే భావన కలిగింది. 'జాతస్య మరణం ధృవం' అనేది నిజమైనప్పుడు అందుకు తగిన మనోపరిపక్వత అలవర్చుకోవడమే మంచిది అనిపిస్తుంది.

ఒకరోజు ఉదయం ఘంటసాల మాస్టారు మా నాన్నగారితో "గురువుగారూ! మనకు ఒక కొత్త కంపెనీ వస్తోంది. ప్రొడ్యూసర్ కొత్తవాడు. ఒక భారీ పౌరాణికం సినీమా తీస్తున్నారు. ఆచారిగారే రాస్తున్నారు. కామేశ్వరరావుగారు డైరక్టర్. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉన్న సినీమా. మనమే సంగీతం చేయబోతున్నాము" అని చెప్పారు. అదే ఎ.ఎస్.ఆర్ ఆంజనేయులు నిర్మాతగా మాధవీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన 'పాండవ వనవాసము' సినీమా.

ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, కాంతారావు, రాజనాల, రాజసులోచన, వాణిశ్రీ, బాలయ్య, హరనాథ్, ఎల్.విజయలక్ష్మి, ముక్కామల, నాగయ్య, పద్మనాభం, లింగమూర్తి, అందరూ ఆనాటికి గొప్ప పేరుప్రఖ్యాతులు పొందిన పెద్ద తారాగణంతో మొదలుపెట్టారు. తమ ఆఫీసును కూడా నార్త్ ఉస్మాన్ రోడ్ లో హబిబుల్లా రోడ్ కు సమీపంలో ఒక పెద్ద భవనంలో ఏర్పాటు చేసారు. ఖర్చుకు వెనకాడకుండా ఒక బ్రహ్మాండమైన, మంచి సినీమా తీయాలని లక్ష్యంగా మొదలుపెట్టారు. పాటల కంపోజింగ్ ప్రారంభమయింది. నిర్మాత మంచి సహృదయుడు. సంగీతం విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏం చేసినా, ఎలా చేసినా పాటలన్నీ జనరంజకంగా వుండాలి అనేదే వారి కోరిక. నిర్మాత అభిరుచులమేరకు మంచి సంగీతాన్ని సమకూర్చడానికి ఘంటసాల మాస్టారు, సముద్రాల రాఘవాచార్యులవారు కష్టపడి పనిచేశారు. అందుకు తగినట్లుగానే పాటలు, పద్యాలు సన్నివేశపరంగా, సందర్భోచితంగా అమరాయి.

పాండవ వనవాసం చిత్రానికి సంబంధించినంత వరకూ ఓ మూడు విశేషాలున్నాయి. మొట్టమొదటిసారిగా సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వం లో పాడారు. అదొక సూర్యస్తవం. ధర్మరాజు పాత్రధారి గుమ్మడి మీద చిత్రీకరించారు. రెండవది ఆలిండియా డ్రీమ్ గర్ల్ గా, గ్లామర్ క్వీన్ గా  హిందీ రంగాన ఒక వెలుగు వెలిగిన తమిళుల అమ్మాయి  హేమామాలిని మొదటిసారిగా తెరపై కనిపించిన తెలుగు చిత్రం.



దర్శకేంద్రుడిగా ఎన్నో హిట్ సినీమాలందించిన కె. రాఘవేంద్రరావు మొదటిసారిగా ఈ సినీమకు సహాయదర్శకుడిగా కమలాకర కామేశ్వరరావుగారి దగ్గర పనిచేసారు. 

పాటలు, పద్యాలను ఘంటసాల, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, సుశీల, లీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి పాడారు. ఈ సినీమాలో ఘంటసాల మాస్టారు, మాధవపెద్దిల మధ్య సాగిన సంవాద పద్యాలు పల్లెప్రాంత ప్రేక్షకులకు మృష్టాన్న భోజనమే. ఎస్.జానకి పాడిన 'ఓ వన్నెకాడా నిన్ను చూసి నా మేను పులకించెరా' పాట చాలా నిడివైన పాట. నృత్యగీతం. మూడు కట్స్ గా వస్తుంది. శాస్త్రీయ జానపద రీతులలోసాగుతుంది. ఈ పాటను మాస్టారు చాలా అద్భుతంగా స్వరపర్చారు. జానకి కూడా చాలా బాగా పాడారు. రాజసులోచన, ఎన్టీఆర్ లమీద చిత్రీకరించారు.


 
ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు భీమునికి, అభిమన్యునికి, ఒక నర్తకునికి పాడి ఆయా పాటల్లో, పద్యాలలో తన గాత్ర వైవిధ్యాన్ని, ప్రతిభను అనితరసాధ్యంగా కనపర్చారు. ఆ విషయం  భీముడి పద్యాలలో, హిమగిరి సొగసులు పాటలో, ఆంజనేయ దండకంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంజనేయ పాత్రధారి సుప్రసిధ్ధ  పంజాబీ రెజ్లర్ అజిత్ సింగ్ తన మీద చిత్రీకరించిన ఈ దండకానికి దాసుడై తాను వెళ్ళిన ప్రతీచోటా మాస్టారు పాడిన ఈ ఆంజనేయ దండకాన్ని అందరికీ వినిపించి ఆనందించేవాడట.
               


భీముడి వంటి ధీరోద్ధత నాయకుడి చేత ఒక శృంగార యుగళగీతాన్ని ఆలపింపజేయడం సామాన్య విషయంకాదు. ఈ పాట విషయంలో అనేక తర్జనభర్జనలు జరిపి, నాలుగైదు పల్లవులు అనేక రాగాలలో అనుకొని చివరకు 'హిమగిరి సొగసులు' పాటను ద్విజావంతి/ జైజైవంతి రాగంలో మాస్టారు స్వరపర్చారు. 

ఇదే రాగంలో ఎస్.రాజేశ్వరరావుగారు చేసి, మాస్టారు పాడిన ఒక సూపర్హిట్ సోలో డాక్టర్ చక్రవర్తి లో వుంది. 'మనసున మనసై' అక్కినేని పాట. ఈ రెండు పాటలకు రాగం ఒకటే అయినా స్వరరచనలో రెండింటిమధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. 'హిమగిరి సొగసులు' పాటను కాశ్మీర్ వ్యాలీలో హిమాలయా పర్వతాలు నేపథ్యంగా ఔట్ డోర్లో షూటింగ్ జరుపుతారని ముందుగా అనుకున్నారని వినికిడి. కానీ ఎన్.టి.రామారావు తన షెడ్యూల్స్ దృష్ట్యా ఎక్కువగా దూరప్రాంత ఔట్ డోర్లకు రోజులతరబడి వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడేవారు కాదని కూడా అనుకునేవారు. ఏది ఏమైనా మొత్తం మీద ఈ పాట ఇన్ డోర్ సెట్ లోనే షూట్ చేసారు. పాట సూపర్ హిట్ అయింది. ఈ సినీమా రీరికార్డింగ్ విషయంలో కూడా ఘంటసాల మాస్టారి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. భీముడి నడక మీద వినవచ్చే గిటార్ వ్యాంపింగ్ లు, పాచికలాటమీద వినవచ్చే మ్యూజిక్, ఆంజనేయుడు, భీముడి మధ్య జరిగే కామెడీ సీన్ లోని మ్యూజిక్, ఇలా ఆద్యంతం రీరికార్డింగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

విడుదలైన అనేక కేంద్రాలలో 'పాండవ వనవాసం'  శతదినోత్సవాలు, రజతోత్సవాలు, కొన్ని చోట్ల 175 రోజుల వరకూ విజయవంతంగా ప్రదర్శించబడి ఘంటసాలవారి కీర్తికిరీటంలో ఒక కలికితురాయిగా మిగిలిపోయిన చిత్రం 'పాండవ వనవాసం'. ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వంలో వచ్చిన ఉత్తమ పౌరాణిక చిత్రాలలో పాండవ వనవాసం ఒకటి.

1965 లో విడుదలైన మరో మాస్టారి సంగీతభరిత చిత్రం 'సిఐడి' విజయావారి చిత్రం. విజయావారి ట్రాక్ కు విభిన్నమైన క్రైమ్ స్టోరీ. ఈ సినీమాను ఎమ్.జి.రామచంద్రన్ ను తృప్తి పర్చడానికి అతను నటించిన 'దైవత్తాయ్' అనే తమిళ చిత్రం రైట్స్ కొని తెలుగులో 'సిఐడి' గా నిర్మించారని చెప్తారు. తెలుగు రాముడు భీముడు చిత్రాన్ని విజయావారు అత్యంత భారీగా తమిళంలో ఎమ్.జి.ఆర్. సరోజాదేవి, నంబియార్లతో 'ఎంగవీట్టు పిళ్ళైగా' తీస్తున్న సమయంలో ఎమ్జీయార్ డేట్లకోసం అతన్ని సంతృప్తి పర్చడానికి తెలుగు లో ఒక క్వికీగా ఈ సినిమా తీసినట్లు తోస్తుంది. కళ్యాణి రాగంలో 'నాసరి నీవని', సింధుభైరవిలో 'నిను కలసిన నిముసమున' వంటి పాటలు ఘంటసాల మాస్టారి ముద్రను స్పష్టం చేస్తాయి. ఈ చిత్రంలోని పాటలన్నీ బహుళజనాదరణ పొందాయి. ఈ చిత్రంలో రమణారెడ్డి నాట్యాచార్యుడిగా, హాస్యనటి మీనాకుమారి మీద చిత్రీకరించిన ఒక సుప్రసిధ్ధ తిల్లానా బహు ప్రాచీనమైనది. పట్నం సుబ్రమణ్య అయ్యర్ వ్రాసిన ' సుదతి నీకు తగిన చిన్నదిరా' అనే తిల్లానాను ఘంటసాల మాస్టారు తన మొదటి చిత్రమైన 'లక్ష్మమ్మ' చిత్రంలో ఫరజ్ రాగంలో చేసారు. నటి రుక్మిణి నాట్యానికి పామర్తి వెంకటేశ్వరరావు నట్టువాంగంచేస్తూ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటకు అభినయిస్తారు.
 

ఈ వెంకటేశ్వరరావు ద్వయం 1949ల నుండే ఆత్మీయంగా వుండేవారు. అదే తిల్లానాను మరల ఒకటిన్నర దశాబ్దాల తర్వాత 'సిఐడి' సినీమాలో పెట్టారు. 



ఎందుచేతనో  అన్ని హంగులూ వున్నా 'సిఐడి' సినీమా విజయావారి ఖ్యాతిని పెంచలేకపోయిందనే అనిపిస్తుంది.

అలాగే, నాగిరెడ్డి-చక్రపాణిల విజయా ప్రొడక్షన్స్ కు ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా 'సిఐడి'.  తర్వాత, ఆ సంస్థ నిర్మించిన మరికొన్ని సినిమాలకు పాటలు మాత్రమే పాడారు.  ఘంటసాల మాస్టారి విజయా స్వర ప్రస్థానం 'షావుకారు' తో ప్రారంభమై 'సిఐడి'  తో ముగిసింది.

నాకు తెలిసిన ఇద్దరు వర్థమాన సంగీత దర్శకులు. అందులో ఒకాయన ఒకరి దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ  అవకాశం దొరికినప్పుడు డబ్బింగ్ సినీమాలు చేస్తూ ఒక స్ట్రైట్ సినీమాకు అవకాశం పొందారు. ఆ సమయంలో శాంతారాంగారి సినీమా ఒకటి విడుదలై పాటలన్నీ సంగీతప్రియులను సమ్మోహనపర్చాయి. ఆ సమయంలో ఒకసారి నేను ఈ నూతన సంగీతదర్శకుడిని అడిగాను ఫలానా శాంతారాంగారి సినీమా చూశారా? పాటలన్ని చాలాబాగా చేశారు కదా! అని. అందుకు ఆయన సమాధానం. 'ఏమో నాయనా ! నేను ఇతరులు చేసిన పాటలు వినడం లేదు. వినను. వాటి ప్రభావం నేను చేసే సినీమా మీద పడే అవకాశం వుంది'.

నా బుర్ర తిరిగిపోయింది. 

మరి ఆయన సహాయకుడిగా పనిచేస్తున్న సినీమా పాటల సంగతేమిటి? అవేవీ చెవినపడకుండానే కంపోజింగ్ లు, రికార్డింగ్ లు జరిగిపోతున్నాయా? 
ఆయన వయసునుబట్టి  నేను ఆమాటను ధైర్యంగా అడగలేకపోయాను.

మరొకాయన ఉండేవాడు. 

తాను చేస్తున్న సినీమాలేవీ లేకపోయినా మూడు కలర్, ఒక స్కోప్, రెండు బ్లాక్ ఎండ్ వైట్ సినీమాలకు సంగీతం చేస్తున్నట్లు చెప్పేవాడు. ఒకరిద్దరు బొంబాయి నిర్మాతలు కూడా లైన్లో వున్నారనేవాడు. అందరితో ఇదే ధోరణి. ఒకసారెవరో ఒక పెద్ద నిర్మాత ఇతనికి సహాయం చేయాలని పిలిపిస్తే ఆయన దగ్గరా ఇలాగే గొప్పలుపోయాడట. మరి ఇంత బిజీ సంగీతదర్శకుడు తనకు వద్దులెమ్మని మరెవరికో తన సినీమా సంగీత దర్శకత్వం అప్పగించాడట. సినీమారంగంలో హిపోక్రసి ఈ లెవెల్ లో వుంటుంది. ఇది ముమ్మాటికి నిజం.

"ఆదివారం పని చెయ్యం. రాత్రి పూట పని చేస్తే డబుల్ రెమ్యునరేషన్ పే చేయాలి" ఈ కండిషన్స్ పెట్టినవారెవరు? 

అప్పుడేం జరిగింది !
వచ్చే వారం చూద్దాము.....
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, April 11, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఆరవ భాగం

11.04.2021 - ఆదివారం భాగం - 26:
అధ్యాయం 2  భాగం 25 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ముందుగా, వారం వారం పట్రాయని బ్లాగ్ ను దర్శిస్తూ 'నెం.35, ఉస్మాన్ రోడ్' ధారావాహికను ప్రోత్సహిస్తున్న సన్మిత్రులందరికీ, రాబోయే శ్రీప్లవ నామసంవత్సర ఉగాది సందర్భంగా మా హృదయపూర్వక శుభాభివందనాలు.
      
ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరాది, తమిళుల నూతన సంవత్సరాది పక్క పక్క రోజుల్లోనే రావడం ఒక విశేషం. తమిళుల నూతన సంవత్సరం ఎప్పుడూ అదే ఏప్రిల్ 14వ తేదీనే జరుపుకుంటారు. చాంద్రమాన ఉగాది మాత్రం ఒక పదిహేను రోజులకి అటుయిటూగా ముందుగానే వస్తూంటుంది. 

ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రాబల్య ప్రభావం వలన తమిళనాడు లో నూతన సంవత్సర వేడుకలపై భిన్న భేదాభిప్రాయాలు తలఎత్తి ఒక వర్గంవారు తమిళుల కొత్త సంవత్సరం  'తై' (మన పుష్య మాసం) మాసంలో వచ్చే పొంగల్ (సంక్రాంతి) నుండే ప్రారంభం అవుతుందని దానినే అందరూ పాటించాలని హుకూం జారీచేస్తే మరొక వర్గం కాదు  'చిత్తిరై' (చైత్రం) (ఏప్రిల్ 14) మాస ప్రారంభమే నూతన సంవత్సరమని వాదిస్తుంది. మొత్తానికి ఏ వర్గం అధికారంలో వుంటే వారు నిర్ణయించినదే చట్టం.
'యథారాజా తథాప్రజా'!

మేము  చెన్నై అనబడే మెడ్రాస్ కు రావడమూ, మెడ్రాస్ పెరంబూర్ ప్రాంతంలో 'ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ'  (రైలు పెట్టెల నిర్మాణం) ఆనాటి ప్రధానమంత్రి  శ్రీ జవహర్లాల్ నెహ్రూగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఇంచుమించు కొద్ది మాసాల తేడాతో జరిగింది. మరో ఆరేడేళ్ళకు న్యూ ఆవడీ రోడ్ లో అణ్ణానగర్ వెస్ట్ సమీపంలో రైల్ కోచ్ ల ఫర్నిషింగ్ విభాగము నిర్మించడం జరిగింది. ఈ రెండు విభాగాలలో పనిచేసే వేలాది ఉద్యోగస్తులలో తెలుగువారి సంఖ్య కూడా అధికంగానే వుండేది. మేము మెడ్రాస్ వెళ్ళిన మొదటి మూడేళ్ళలోనే ఒక ఉగాదికి (అనే గుర్తు) ICF ఫ్యాక్టరీ లో ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ జరిగింది. ఆ కచేరీకి నేను కూడా మా నాన్నగారివెంట వెళ్ళాను. నేను చూసిన, చూసి ఆనందించిన ఘంటసాలవారి మొట్టమొదటి సంగీత కచేరీ అదే. ఘంటసాలవారి సంగీత కచేరీ వినడం ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని తరచూ అనుభవించిన అదృష్టం నాకు చిన్నప్పటినుండే కలిగింది.

ఘంటసాల మాస్టారిది, మా నాన్నగారిది ఎప్పుడూ ఒకే డ్రెస్ కోడ్. వైట్ ఎండ్ వైట్. మా నాన్నగారు జుబ్బా, పైజమాలు ధరిస్తే, మాస్టారు జుబ్బా, పంచె లేదా తమిళుల అలవాటు ప్రకారం తెల్ల వేస్టి (లుంగీ)లతో శ్వేత కపోతాలవలె ప్రశాంతంగా కనపడేవారు.


శ్వేత కపోతాలు
మాస్టారు మాత్రం 1972-73 ప్రాంతాలలో కొన్నాళ్ళు కాషాయరంగు బట్టలు ధరించడం జరిగింది. అంతవరకూ ఎప్పుడూ స్వఛ్ఛమైన తెలుపు దుస్తులతోనే కనబడేవారు.

ఘంటసాల మాస్టారు కచేరీలకు బయల్దేరి వెళ్ళేప్పుడు సువాసనలు వెదజల్లే అత్తర్ కొంచెం ఉపయోగించేవారు. సావిత్రమ్మగారి ఆధీనంలో అరంగుళం సైజ్ లో రెండు మూడు బాటిల్స్ లో వివిధ పరిమళాల అత్తర్ లు వుండేవి.  ఆనాటి లెఖ్ఖకు అవి చాలా ఖరీదైనవే. ప్రత్యేకమైన విశేషదినాలలో మాత్రం ఉపయోగించేవారు. ఆ అత్తర్ లను ట్రిప్లికేన్ హైరోడ్ లో వుండే ఒక ముస్లీమ్ అత్తర్ సాహేబ్ అప్పుడప్పుడు మాస్టారింటికి వచ్చి ఈ అత్తర్ లను విక్రయించేవాడు. ఆ సాహేబ్ వీధి వాకిట్లో వుండగానే సెంట్ వాసనల గుబాళింపు సోకేది. తర్వాత ఎప్పుడో 1970 లలో వచ్చిన  'ఆలీబాబా 40 దొంగలు' సినీమాలో  విలన్ సత్యనారాయణ కోసం మాస్టారు పాడిన 'లేలో దిల్బహార్ అత్తర్' పాట విన్నప్పుడల్లా ఘంటసాల మాస్టారు ఉపయోగించిన అత్తర్ సువాసనలే గుర్తుకు వస్తాయి. మా నాన్నగారైతే 'ఆండవర్ జవ్వాదు' పొడిని ఉపయోగించేవారు. 

ఈ సుగంధ పరిమళాలు నా ముక్కుకు సోకుతుండగా  సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కారులో బయల్దేరి ICF కచేరీకి వెళ్ళాము. ఆనాటికి నాకు మద్రాస్ రోడ్ల తీరుతెన్నుల గురించి పెద్దగా తెలియదు. ఆనాటి కచేరీలో పాల్గొన్న ఇతర ఆర్కెష్ట్రావారి గురించి తెలియదు. అయితే మా నాన్నగారితో సహా మరో ఐదుగురారుగురు వాద్య బృందం వుంది. ICF ఫ్యాక్టరీలోకి ప్రవేశించగానే మాస్టారికి అక్కడి ప్రధాన ఉద్యోగులంతా ఘనస్వాగతం పలికి, ముందుగా, కోచ్ ఫ్యాక్టరీ లోపల అంతా తిప్పి చూపించారు. ఆ తర్వాత మాస్టారిని కచేరి వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండగ వాతావరణంతో అన్ని భాషలవారు హాజరయ్యారు. 

ముందుగానే చెప్పాను, ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ వినడం ఒక మధురానుభూతిని కలిగిస్తుందని. అందుకు కారణం, ఆయన ఒక గొప్ప పేరుపొందిన సినీమా గాయకుడు కావడంవల్ల కాదు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో లబ్దప్రతిష్టలైన మహాగాయనీగాయకులు, వాద్యకళాకారులు వున్నారు. వారి సంగీతం ఒక వర్గంవారినే ఆకర్షించి ఆనందింపజేస్తుంది. వారంతా పాడే రాగం, తానం, పల్లవులను లేదా ఖయాల్, తుమ్రీలు విని ఆనందించడానికి సంగీతంలోని ఔన్నత్యం, మాధుర్యం అనుభవించడానికి ఆ యా సంగీతం గురించి కొంతైనా తెలిసివుండాలి. అయితే ఏమీ తెలియకపోయినా బుర్రలు ఊపేస్తూ, ఆహా! ఓహో! వహ్వా! అంటూ హంగామా చేస్తూ ఇతరులను ఆకర్షించడానికి, తమ రసికతను నిరూపించుకోవడానికి కొంతమంది కుహానా రసికులు సంగీత సభలకు హాజరవుతూంటారు, అది వేరే విషయం అనుకోండి.   కానీ, ఘంటసాల వారి సంగీతం అలాకాదు. అన్ని వర్గాల శ్రోతలను సమానంగా అలరిస్తుంది. ఘంటసాలగారు లలితసంగీతానికి, లలితసంగీత కచేరీలకు ఆద్యుడు. ఘంటసాలవారు కచేరీలు చేయడం ఆరంభించిన తరువాతే సినీమా పాటల కచేరీలకు ఒక కొత్త గుర్తింపు, హుందాతనం ఏర్పడింది. వేదికలమీద సూటు బూట్లతో, చేతితో మైక్ పట్టుకొని వేదికను దున్నేస్తూ, ఒళ్ళంతా హూనమయేలా హడావుడి చేస్తూ పాటలు పాడే సంస్కృతి ఘంటసాల మాస్టారిది కాదు. తాను కచేరీ చేసే వేదికను సరస్వతీ నిలయంగా భావించి చాలా భక్తిశ్రధ్ధలతో తన కచేరీ ప్రారంభించేవారు. ఘంటసాలవారి సంగీత కచేరీ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో, నవరసాలతో నిండివుండేది. శాస్త్రీయం, లలితం,  సినీమాగీతాలు, భక్తిగీతాలు అష్టపదులు, జానపదగీతాలు, పద్యాలు ఇలా అన్ని రకాల ప్రక్రియలతో బహుజనరంజకంగా పండిత పామరులను అలరిస్తూ తన సంగీత కచేరీలు జరిపేవారు. వేదికముందున్న శ్రోతలనాడిని, అభిరుచులను ముందు అర్ధం చేసుకొని అందుకు తగిన పాటలనే ఎంచుకునేవారు. ఘంటసాల మాస్టారు మధ్యలో కూర్చొనివుండగా, ఆయనకు ఇరుప్రక్కలా, వెనుకవేపు వాద్యబృందం అమరివుండేది. అందరూ వేదిక మీద కూర్చోనే శాస్త్రీయ సంగీత పధ్ధతిలో కచేరీ జరిగేది. ఘంటసాల వారు కొన్ని వందల, వేల సంఖ్యలో కచేరీలు జరిపివుంటారు. అయినా, ఆయన ఏనాడు  చేతిలోని పుస్తకం చూడకుండా పాడిందిలేదు. ఒకచేత పుస్తకం, ఒడిలో చేతిరుమాలు, మరొక చేతితో  ఒక చెవిని మూసుకొని పాడడం ఆయన ప్రత్యేకత. అలా ఎందుకు చెవిమూసుకొని పాడతారో కూడా తెలియకుండా చాలామంది ఔత్సాహిక గాయకులు ఘంటసాలవారిని అనుకరించడం చూస్తూంటాము. ఘంటసాల మాస్టారి కచేరీలలో పాడే పాటలన్నీ ఓ మూడు  పాకెట్ సైజు పుస్తకాలలో వుండేవి. కొన్ని పుస్తకాలలోని పాటలు వారి దస్తూరీతో ఉన్నవే. అవన్నీ బాగా పాతబడి జీర్ణావస్థకు చేరుకున్నాక తిరిగి అదే రంగులో, అదే సైజులో కొత్త పుస్తకాలను కొనడం చాలా కష్టమయేది. పానగల్ పార్క్ దగ్గరున్న యూనివర్శల్ స్టోర్స్ , టిప్ టాప్, అంటూ చాలా స్టేషనరీ షాపులు ఎక్కి దిగిన తర్వాత, మాస్టారు ఆశించే సైజు పుస్తకాలు లభ్యమయేవి. 
  

 
 
 


నేను ప్లస్ టూ ముగించినప్పటినుండి ఆ పాత పుస్తకాలలోని పాటలను  తిరిగి కొత్త పుస్తకాలలో రాయడం జరిగింది. అయినా, అలవాటు కొద్ది మాస్టారు  ఆ పాత పుస్తకాలనే కచేరీలకు పట్టుకువెళ్ళేవారు.

ఘంటసాల మాస్టారు తన కచేరీని ఎప్పుడూ వినాయకచవితి చిత్రంలోని 'దినకరా శుభకరా' పాటతోనే ప్రారంభించేవారు. ఆ పాట రావడానికి ముందు జరిగిన సంగీత కచేరీల గురించి నాకు తెలియదు. నేను హాజరయిన మొదటి కచేరీ ICF కచేరీయే.

పూర్యాధనశ్రీ రాగం (కర్ణాటక శైలిలో పంతువరాళి లేదా కామవర్ధని) లోని 'దినకరా' పాటను సశాస్త్రీయంగా రాగాలాపనతో, స్వరకల్పనలతో సుమారు పది పన్నెండు నిముషాలపాటు పాడేవారు.  వినాయకచవితి సినీమాలోనూ, గ్రామఫోన్ రికార్డ్ లోనూ లేని ఒక అనుపల్లవితో సహా ఆ పాటను పాడేవారు. సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఆ అనుపల్లవి ఏ కారణంచేతనో సినీమాలో లేదు. అందువల్లే రికార్డు లోనూ లేదు. తర్వాత శ్రోతల అభిరుచులమేరకు బహుళ జనాదరణ పొందిన పాటలన్నీ వుండేవి. అన్ని కచేరీలలో విధిగా 'దినకరా శుభకరా', అత్తలేనికోడలు ఉత్తమురాలు', 'పంచదార వంటి పోలిసెంకటసామీ', జయదేవుని అష్టపది 'రాధికా కృష్ణ రాధికా', కరుణశ్రీగారి పుష్పవిలాపం, జాషువాగారి 'పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కొసమై',  దేవదాసు లోని జగమే మాయా, కుడి ఎడమైతే, మాయాబజార్ లోని వివాహభోజనంబు,  ఇలా రకరకాల పాటలు పాడి ఆఖరుగా బ్రతుకుతెరువులోని 'అందమే ఆనందం' పాటతో తన కచేరీ ముగించేవారు. మాస్టారి కచేరీలలో ఎక్కువగా సోలో పాటలే వుండేవి. 'హాయి హాయిగా ఆమనిసాగే' వంటి యుగళాలు పాడినా ఆడ, మగ చరణాలు రెంటినీ ఆయనే పాడేవారు. ఘంటసాలగారి కచేరీలలో మరో విశేషం ఏమిటంటే ఆయన కచేరీలన్నీ సోలో కచేరీలే. ఇతర గాయకులతో కానీ, గాయనీమణులతో కానీ కలసి పాడిన సందర్భాలు బహు అరుదు. 
అలాగే, హెవీ ఆర్కెస్ట్రాతో చేసిన ఇతర సంగీత దర్శకుల పాటలను తన కచేరీలలో ఎక్కువగా పాడేవారు కాదు. కారణం, ఆయా పాటలలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను యదాతథంగా ఉపయోగించడానికి ఆయా పాటల నొటేషన్స్ ను వ్రాయించి తన  కచేరీ ఆర్కెస్ట్రాతో ప్రాక్టీసు చేయించాలి. అప్పుడే పాటకు పెర్ఫెక్షన్ వస్తుంది. కానీ అది  చాలా ఖర్చుతో కూడిన పని. కచేరీ నిర్వాహకులకు అంతంత భారీ మొత్తాన్ని భరించగలిగే ఆర్ధికస్తోమత చాలామంది నిర్వాహకులకు వుండేదికాదు. అప్పట్లో సంగీత కచేరీలు వ్యాపార దృక్పథంతో జరిగినవికావు. అందుచేత మాస్టారు సాధ్యమైనంతవరకూ తన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలనే పాడేవారు. పాటకు పాటకు మధ్య సందర్భోచితమైన సరస సంభాషణలతో శ్రోతలను రంజింపజేస్తూ కచేరీలు చేసేవారు. ఘంటసాల మాస్టారు పాడితే చాలు, వారిని చూస్తూ పాట వినాలాని తహతహలాడే శ్రోతలే అధికంగా వుండేవారు. ఆయన గాత్ర మాధుర్యం వారి చెవినబడాలి అంతే. ఘంటసాల పాట ఏదైనా అమృత తుల్యమే. 

అలా ICF లోని  ఘంటసాలవారి కచేరీ సుమారు ఓ రెండు గంటలసేపు శ్రోతలను ఆనందంలో ఓలలాడించింది. 

కార్యక్రమానంతరం ICF నిర్వాహకులు ఘంటసాల మాస్టారికి ICFలో తయారయిన రైలుపెట్టె నమూనాను అద్దాలపెట్టెలో పెట్టి జ్ఞాపికగా బహుకరించారు. నేను హాజరయిన ఆ మొదటి సంగీతకచేరీ నాకెపుడూ అపురూపమే, అపూర్వమే.

ఆ తర్వాత మరికొన్నేళ్ళకు మాస్టారింటి హాలులోని అద్దాల బీరువాలో మరో రైలుపెట్టె జ్ఞాపికను చూశాను. అయితే ఆ కచేరీకి నేను వెళ్ళలేదు. ఆ కచేరీ గురించి ఎన్నో దశాబ్దాల తర్వాత  'కళాసాగర్' సుభాన్ ముచ్చటించగా విన్నాను. అప్పట్లో ఎమ్.ఎ.సుభాన్ ICF లో ఉద్యోగం చేస్తూండేవారు. మంచి సాంస్కృతిక పిపాసి. అక్కడి తెలుగు అసోసియేషన్ లో ప్రధానభూమిక వహించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే మరో ఉగాదికి ఘంటసాల మాస్టారి కచేరీ ఏర్పాటుచేశారు. మాస్టారు ICFలో కారు దిగి కచేరీ వేదికవద్దకు వెడుతూండగా అక్కడి స్పీకర్లలో తన పాటే వస్తూండడం చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే తాను పాడిన ఆ పాట ఆ రోజు ఉదయమే ఉగాది సందర్భంగా ఆలిండియా రేడియో వారు బ్రాడ్ కాస్ట్ చేసిన ఉగాది పాట. అంత త్వరలో ఆ పాటను తిరిగి వినడం తటస్థిస్తుందని ఘంటసాల గారు ఊహించలేదుట. ఈ పాటను ఎంత శ్రమపడి రికార్డ్ చేసి సాయంత్రం సమయానికి ఘంటసాలగారి సమక్షంలోనే వినిపించిన సుభాన్ గారి కార్యదీక్షాదక్షతలకు ఘంటసాల మాస్టారు ఎంతగానో సంతోషించి అభినందించారట. ఆ విషయాలన్నీ సుభానే స్వయంగా నాకు చెప్పి ఘంటసాలవారి స్నేహ సౌహార్ద్రతను ఎంతో ప్రశంసించారు.  ఆనాడు ICF వారు ఇచ్చినదే ఆ రెండవ రైలు పెట్టె.

1960ల తర్వాత ఎప్పుడో ఒక ఉగాది ఘంటసాల మాస్టారింట్లోనే జరిగింది. శ్రీయుతులు యామిజాల పద్మనాభస్వామిగారు, జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రిగారు (జరుక్ శాస్త్రి) సాహితీలోకానికి చిరపరిచితులు. యామిజాలవారు మా నాన్నగారికి చిరకాల మిత్రులు. సాలూరుకు సమీపంలోని శివరామపురాగ్రహారం వారి స్వస్థలం. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారిదీ అదే ఊరు. పద్మనాభస్వామిగారు ఉద్యోగరీత్యా మద్రాస్ లో స్థిరపడ్డారు. పానగల్ పార్క్ వద్దనున్న శ్రీరామకృష్ణ మిషన్ శారదా విద్యాలయ గర్ల్స్ హైస్కూలు లో తెలుగు పండితులుగా పనిచేసేవారు. 

శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి చెల్లెలు మల్లాది మంగతాయారుగారు కూడా అదే స్కూల్ లో మరో తెలుగు టీచర్ గా పనిచేసేవారు. మా చెల్లెళ్ళు, మాస్టారి ఆడపిల్లలు అందరూ యామిజాలవారికి, మంగతాయారుగారి విద్యార్ధినులే. మా పెద్ద చెల్లెలు శ్రీమతి కాకరపర్తి రమణమ్మకి పిహెచ్.డి. చెయ్యాలన్నంత అభిమానం తెలుగు భాష మీద కలగడానికి వీరిద్దరి వద్ద చేసిన శిష్యరికమే కారణమని  నేను అనుకుంటున్నాను. శారదా విద్యాలయలో శ్రీ పద్మనాభస్వామిగారు మాత్రమే మగవారు. మిగిలిన టీచర్లంతా హెడ్మాష్టర్ తో సహా అందరూ మహిళలే. 

యామిజాల వారు మొదట నెం.35, ఉస్మాన్ రోడ్ దగ్గర బజుల్లా రోడ్ కి అవతల తిలక్ స్ట్రీట్ లోను తరవాత  కోడంబాక్కం రైల్వేస్టేషన్ వెళ్ళేదారిలో రామకృష్ణ స్ట్రీట్ ముందుండే వివేకానందా స్ట్రీట్ మొగలో ఉన్న ఇంట్లో ఉండేవారు. యామిజాల వారు చాలా సన్నగా పొడుగ్గా వుండేవారు. మాట కూడా చాలా నెమ్మది. వినీ వినిపించకుండా వుండేది. యామిజాల మాస్టారి భార్య భానుమతి గారు(?) ముగ్గురో నలుగురో మగపిల్లలు. ఆడపిల్లలు లేకపోవడం వలన ఆడపిల్లలంటే ఆ దంపతులు మహా ముచ్చట పడేవారు. మహాశ్రోత్రీయ కుటుంబం. వారింటి పూజాగృహంలో రమణమహర్షి, కావ్యకంఠ గణపతిముని గార్ల చిత్రపటాలు వుండేవి. యామిజాల మాస్టారు మా ఇంటి ప్రక్కనుండే స్కూల్ కు నడచి వెళ్ళేవారు. ఖద్దర్ పంచెకట్టు, మోకాళ్ళ వరకు పొడుగ్గా ఉండే జుబ్బా, దానికి ఒక్క పెన్ను మాత్రం పట్టేపాటి సన్నటి పొడుగు జేబు, భుజంపై కండువా - నిజంగా పూర్వకాలపు ఉపాధ్యాయుడికి ప్రతీకగా వుండేవారు. మాటా నెమ్మది, మనిషి చాలా సౌమ్యుడు. ఈయనకు పూర్తి వ్యతిరేకంగా కనిపించే వ్యక్తి జరుక్ శాస్త్రి అనబడే జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారు. పానగల్ పార్క్ కు ఉత్తరంవేపు యామిజాల వారైతే, దక్షిణం వేపు జలసూత్రం వారు. బహుశా, ఉస్మాన్ రోడ్ లో రామన్స్ కాఫీ పొడి కొట్టు, సలామ్ స్టోర్స్ వెనకవేపు వుండే ఇళ్ళలో వుండేవారనుకుంటాను. అక్కడే జి.ఎన్.స్వామిగారి కుటుంబమూ ఉండేది. టి.నగర్ బస్ స్టాండ్ నుంచి బయల్దేరిన బస్సులు ఆగే మొదటి బస్ స్టాప్ కూడా అక్కడే ఉండేది.

సాయంత్రం ఐదు ఆరు ప్రాంతాలలో  జలసూత్రంవారు, శ్రీరంగం నారాయణబాబుగారు, యామిజాలవారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, ఆరుద్రగారి వంటి కవిపుంగవులంతా పానగల్ పార్క్ ముందున్న సిమెంట్ చప్టాల మీద ఆసీనులై లోకాభిరామాయణం ప్రారంభించేవారు. అందరూ సాహితీవేత్తలే కావడం వలన  ఎన్నో ఆసక్తికరమైన విషయలే చర్చించబడేవి. కీట్స్, కృష్ణశాస్త్రి, కిన్నెరసాని, కోడంబాక్కం అప్పలసరసలు, చర్చిల్ చుట్టలు, గిరీశం లెక్చెర్లు, యిలా ఎంతోమంది వారి మాటల్లో కనిపించి పలకరించేవారు. ఈ సాహితీవేత్తల మాటలను వినడానికనే కొంతమంది సాహితీ పిపాసులు శ్రోతలుగా అక్కడికి చేరేవారు. మా నాన్నగారికి కూడా మంచి సాహిత్యాభిలాషవుండడం వల్ల వీరందరితో మంచి సాన్నిహిత్యమే వుండేది. ఆయనకు అవకాశమున్నప్పుడల్లా వీరిని కలుసుకునేవారు. 

శ్రీరంగం నారాయణబాబు
వీరిలో నారాయణ బాబుగారి వేషధారణ మిగతావారికి భిన్నంగా వుండేది. మధ్యపాపిడి, టైట్ పైజమా షేర్వాణి, పొడుగాటి జుబ్బా, పైన వేస్ట్ కోట్.
'యామిజాల జాలమేమి
జాలమేమి యామిజాల'
అంటూ పద్మనాభస్వామిగారి గురించిన రైమ్ ఒకటి వినపడేది. ఆ మాటను ఎవరు ఎప్పుడు ఎందుకు ఉపయోగించారనే విషయం నాకు తెలియదు.

జలసూత్రంవారు మహాభారతాన్ని, యామిజాలవారు రామాయణాన్ని ఆంధ్రీకరిస్తున్న రోజులవి. ఆంధ్రప్రభ దిన పత్రికలో మహాభారతం, ఆంధ్రపత్రిక దినపత్రిక లో రామాయణం ధారావాహికగా ప్రచురించబడేవి. రామాయణ, మహాభారత గ్రంథాల పుస్తకరూప ఆవిష్కరణోత్సవాన్ని ఘంటసాల మాస్టారు చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మా నాన్నగారు కూడా ఇతోధికంగా తోడ్పడ్డారు. ఒక ఉగాదినాటి ఉదయం ఈ కృతిస్వీకారోత్సవం ఘంటసాల మాస్టారింటి హాలులో జరిగింది. ఆ కృతులభర్త ఘంటసాల మాస్టారేనని గుర్తు. ఖచ్చితంగా చెప్పలేను. మా నాన్నగారికి గుర్తుండి ఉండవచ్చు. ఆనాటి ఉత్సవానికి సర్వశ్రీ - దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, పాలగుమ్మి పద్మరాజుగారి వంటి కవులు ప్రత్యేకంగా విచ్చేసారు. ఆహ్వానితులందరికీ ముందుగా, పార్క్ ల్యాండ్స్ హోటల్ నుండి తెప్పించిన అల్పాహారం తో చిన్నపాటి విందు జరిగింది. తర్వాత, కవిసమ్మేళనంలో భాగంగా యామిజాల పద్మనాభస్వామిగారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు తాము ఆంధ్రీకరించిన  రామాయణ, మహాభారతాలనుండి కొన్ని ఘట్టాలను రసవత్తరంగా చదివి వినిపించారు. వక్తల ప్రసంగాల తర్వాత ఘంటసాల మాస్టారు ఈ ఇద్దరు కవులను సముచితరీతిని గౌరవించి సత్కరించారు.  

ఘంటసాల యామిజాల మధ్యలో జలసూత్రం దేవులపల్లి

ఆనాటి కార్యక్రమం ప్రముఖ కవుల రాకతో కళకళలాడింది. మాస్టారు, మా నాన్నగారు ఒక మంచి సత్కార్యంలో భాగస్వాములైనందుకు చాలా ఆనందించారు.

మరికొన్నేళ్ళ తర్వాత, శ్రీ యామిజాల పద్మనాభస్వామిగారు శ్రీ తిరుపతి వేంకటేశ్వరుడిమీద వ్రాసిన 'భువన మోహన' పద్యాన్ని, 'శ్రీశేషశైలేశ శ్రితపారిజాతా' అనే పాటను ఘంటసాల మాస్టారు గ్రామఫోన్ రికార్డ్ గా రిలీజ్ చేసారు.



ఈ విధంగా ఘంటసాల మాస్టారు సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాల పట్ల కూడా మంచి ఆసక్తికనపర్చేవారు.

ఇలాగే మరొకసారి, ఒక యోగాచార్యుడు మాస్టారి వద్దకు వచ్చి మద్రాస్ లో తన యోగాసనాల కార్యక్రమాన్ని సినీ ప్రముఖులందరి ఎదుటా ఏర్పాటు చేయమని కోరారు. సినీమాలోకంలో ఇలాటి యోగా కార్యక్రమాలు ఏమాత్రపు గుర్తింపు, మన్నన పొందుతాయో తెలియని సందిగ్దావస్థలోనే మాస్టారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంతరం  వృత్తి వ్యాపకాలతో తీవ్రమైన ఒత్తిళ్ళకు గురి అవుతున్న సినీ కళాకారులందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రధ్ధవహించి ప్రతీరోజు కొంతసేపు యోగాసానాలు వేస్తూంటే ఆరోగ్యానికి ఎంతైనా మంచిదని సందేశమిస్తూ ఘంటసాల మాస్టారు పరిశ్రమలోని వారందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వాన పత్రికలను నేను, నరసింగరావు కలసి సినీ ప్రముఖుల ఇళ్ళకు వెళ్ళి ఇవ్వడం అందరినీ ఆహ్వానించాం. ఈ యోగాసానాల కార్యక్రమాన్ని ఘంటసాల మాస్టారు హబిబుల్లా రోడ్ లో వున్న రామారావు కళామండపంలో విజయవంతంగా నిర్వహించారు.

1970లకు ముందు మద్రాసులో తెలుగు సాంస్కృతిక సంఘాలు చాలా తక్కువ సంఖ్యలోనే వుండేవి. చెన్నపురి ఆంధ్ర మహాసభ, పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, ఆంధ్రా సోషల్ & కల్చురల్ క్లబ్ - ఇలా తెలుగు సంస్థలు వ్రేళ్ళమీదే లెఖ్ఖపెట్టవచ్చును. ఆయా సంస్థలు కూడా ఏడాదికి ఒకటో రెండో ఉగాది, సంక్రాంతి లాటి పర్వదినాలలో ఉత్సవాలు జరిపేవారు.

ఆరోజుల్లో మద్రాస్ లో తమిళ రంగస్థల నాటకాలకు వుండే మోజు, గిరాకీ సినీమాలకు కూడా వుండేది కాదు. తమిళ సినీ నటులు కూడా తమ పాప్యులారిటీని రంగస్థలం మీదనుండి పెంచుకున్నవారే. శివాజీ గణేశన్, ఆర్.ఎస్.మనోహర్, చో, నాగేష్, తంగవేలు, ఎమ్.ఆర్.రాధ, సహస్రనామం, మనోరమ వంటి నటులంతా కూడా సినీమాలలో నటిస్తూనే  తరచూ నాటకాల ప్రదర్శనలిచ్చేవారు. లెజెండరీ డైరక్టర్ అయిన బాలచందర్, వృత్తిపరంగా గవర్నమెంట్ ఉద్యోగి అయినా రంగస్థల నాటకాల ద్వారా మంచి పేరు పొందారు.  టెలివిజన్ ఇళ్ళలోకి ప్రవేశించనంతకాలం తమిళనాట నాటకాలదే రాజ్యం.  తమిళ సీనీ నటీనటులతో పోలిస్తే తెలుగు రంగస్థల అభివృద్ధికి సినీనటులు చేయగలిగింది ఎంతో కొంత ఉన్నా చేసింది ఏమీ లేదనే చెప్పాలి. 

1965 లో ఘంటసాల మాస్టారు పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే. వాటిలో అజరామర గీతాలుగా వన్నెకెక్కినవి - పెండ్యాలగారి 'కొండగాలి తిరిగింది'( ఉయ్యాల జంపాల); నమో భూతనాధా (సత్య హరిశ్చంద్ర); ఎస్.పి.కోదండపాణిగారి 'ఆలయాన వెలసిన, బొమ్మను చేసి ప్రాణం పోసి( దేవత).

ఆ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో రెండే రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి పాండవ వనవాసం. మరొకటి సిఐడి.

ఈ చిత్రాల గురించి వచ్చేవారం....

కొసమెరుపు :
ఇది 1960 లకు ముందే జరిగినది.

ఘంటసాల మాస్టారు కచేరీలకోసం బయట ఊళ్ళకు వెళ్ళేప్పుడు ఎక్కువగా రైల్లోనే వెళ్ళేవారు. మద్రాసు సెంట్రల్ స్టేషన్ వెళ్ళి సాగనంపడనికి పెద్దబాబు, నేను, మాకు (తోడుగా బాబు వాళ్ళ అమ్మగారు - సావిత్రమ్మగారు) వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు ఇతర ఆర్కెష్ట్రాతో ముందే వెళ్ళిపోయేవారు. ఒకసారి హౌరామెయిల్ లో ప్రయాణం. ఆ రోజుల్లో  హౌరామెయిల్ రాత్రి 8.30 కు  4వ నెంబర్ ప్లాట్ఫారమ్ మీదనుండే బయల్దేరేది. మాస్టారు ఫస్ట్ క్లాసులో; ఆర్కెష్ట్రావారు స్లీపర్ కోచ్ లో ప్రయాణం. ఆరోజుల్లో రిజర్వడ్ కంపార్ట్మెంట్స్ లిమిటెడ్ గా ఉండేవి. అందుచేత వెళ్ళిన ప్రతీసారి రిజర్వేషన్ దొరక్కపోతే జనరల్ భోగీలోనే వెళ్ళవలసి వచ్చేది. మాస్టారు స్టేషన్ కు వెళ్ళగానే బృంద సభ్యులున్న చోటికి వెళ్ళి వారిని పలకరించి తన కంపార్ట్మెంట్ వద్దకు వచ్చేవారు. 

ఆ రోజు మాస్టారు కొంచెం ముందే స్టేషన్ కు చేరుకున్నారు. బయట పనుల ఒత్తిడివల్ల ఎప్పుడూ ఆఖరి నిముషంలో ఉరుకులు పరుగులతోనే స్టేషన్ కు వెళ్ళడం జరిగేది. మేమూ వెంట పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఓ పది నిముషాలు ముందే చేరుకున్నాము. మాస్టారితోపాటూ మేమూ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాము. ఎదురు సీట్ లో ఎవరో ఇద్దరు యూరోపియన్స్ భార్యాభర్తలు కూర్చొనివున్నారు. మాకు అర్ధంకాని ఇంగ్లీషు స్లాంగ్ లో మాట్లాడుకుంటున్నారు. ఇంక ఒకటి రెండు నిముషాలలో రైలు బయల్దేరబోతున్నదనగా ఆ దొరసాని ఆ దొరగారిని గట్టిగా వాటేసుకొని ముద్దులు పెట్టడం మొదలెట్టింది. Farewell kiss. ఆ దొర మాత్రమే ప్రయాణం చేస్తున్నట్లున్నాడు. నాకూ, పెద్దబాబుకు బ్రహ్మాండమైన షాక్. కళ్ళు పెద్దవి చేసుకొని నోరెళ్ళబెట్టుకు చూస్తున్నాం. మాస్టారు మమ్మల్ని చూసి నవ్వుతు "టైమవుతోంది, ఇంక క్రిందకు దిగండని" అమ్మగారితో చెప్పి వెంటనే మమ్మల్ని క్రిందికి దింపించేసారు. ఆ సీన్ అక్కడితో కట్. అరవై ఏళ్ళ క్రితం బహిరంగ స్థలాలలో ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంస్కృతికి విరుధ్ధం. విదేశీయులకు వారి కల్చర్ లో భాగం. వారు అశ్లీలంగా భావించరు. ఈనాడు మన యువతమీద విదేశీ నాగరికతా ప్రభావం  మెట్రోలలోని పబ్లిక్ పార్క్ ల్లో, సినీమా హాల్స్ లో వారి హావభావచేష్టలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 
        ...సశేషం

Sunday, April 4, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఐదవ భాగం

04.04.2021 -  ఆదివారం భాగం - 25:
అధ్యాయం 2 భాగం 24  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
1964 లో తెలుగు సినీమా ఖ్యాతిని ఇనుమడింప జేసిన సినీమాలెన్నో వచ్చాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఆత్మబలం, గుడిగంటలు, మూగమనసులు, అమరశిల్పి జక్కన్న, రాముడు భీముడు, డా.చక్రవర్తి, దాగుడుమూతలు, బొబ్బిలియుద్ధం మొదలైన సినీమాలు ఆర్ధికంగా ఘనవిజయం పొందాయి. ఈ సినీమాలన్నిటి విజయానికి సంగీతం,  ఘంటసాల గారు పాడిన పాటలే ఎంతో దోహదం చేసాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినీమాలలోని పాటలన్నీ ఈ నాటికీ అన్ని టివి ఛానల్స్ లో, సినీమా పాటల వేదికల మీద విస్తృతంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ పాటల సజీవత్వానికి ఘంటసాల మాస్టారి అసాధారణ గానమాధుర్యమే కారణమని నా నిశ్చితాభిప్రాయం.

ఇక, ఘంటసాల మాస్టారు ఆ ఏడాది సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే -  గుడిగంటలు, మర్మయోగి, శ్రీ సత్యనారాయణ మహత్యం, వారసత్వం  - నాలుగూ ఎన్.టి.రామారావు కధానాయకుడిగా నటించినవే. రెండు సాంఘికం, ఒకటి జానపదం, ఒకటి పౌరాణికం. ఈ నాలుగు సినీమాలకు ఘంటసాల మాస్టారు మర్చిపోలేని సంగీతాన్నే అందించారు. 

ఈ నాలుగు సినీమాల విషయంలో నాకు తెలిసిన విషయాలు అనుభవాలు ఈ వారం తెలియజేస్తాను. 

మర్మయోగి సినీమా తమిళం రీమేక్. 1951 లో జూపిటర్ పిక్చర్స్ తీసిన ఈ సినీమా ఘన విజయం సాధించడమేకాక ఎమ్.జి.ఆర్ కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆకాలంలో కత్తియుద్ధాలకు ఎమ్జీయార్ పెట్టింది పేరు. అదే సినిమాను అదే జూపిటర్ పిక్చర్స్ వారు తెలుగులో ఎన్టీఆర్ తో అదే మర్మయోగి పేరుతో తీశారు. ఈ సినీమాలో రామారావు కొన్ని సీన్లలో ఛత్రపతి శివాజీ గెటప్ లో కనిపిస్తారు. ఈ సినీమాకు సంబంధించినంతవరకు ఈ సినిమా లోని కధానాయకుడు ఎన్.టి.ఆర్. కథానాయిక కృష్ణకుమారిలకు  స్వరపర్చిన పాటలకంటే ఉపపాత్రలకోసం చేసిన పాటలు సన్నివేశపరంగా మంచి జనాదరణ పొందాయేమో అనిపిస్తుంది. లీలావతి (పి.లీల), గుమ్మడి (మాస్టారి నవ్వులు) కలసి నటించిన పడవ పాట 'నవ్వులనదిలో పువ్వుల పడవ' పాట, మరో ఉపపాత్ర లంక సత్యం కోసం మాస్టారు పాడిన పద్యాలు, ఆ తర్వాత కొందరు నర్తకీ మణులు (కోమల, జమునారాణి) పాడిన 'ఎందుకు పిలచితివో రాజా!' పాట చాలా హాయినికలిగిస్తాయి. 

ఈ చిత్రంలో జమునారాణి ఏకంగా నాలుగు పాటలు, అందులో మాస్టారితో మూడు డ్యూయెట్లు పాడడం ఒక విశేషమే. ఆవిడ nasal voice ఒక ప్రత్యేక ఆకర్షణగా  అభిమానించే రసికులెందరో వున్నారు.  

జానపదచిత్రం కావడాన కావలసినన్ని యుద్ధాలు, ఛేసింగ్స్, ఘోస్ట్  చేసే అట్టహాసాలు చూడడానికి ఉత్సాహం కలిగిస్తాయి. రీరికార్డింగ్ కు ముందు రష్ వేసి చూపించారు. సినీమా స్లోగా, డ్రాగీగా నాకు అనిపించింది. కానీ, ఒక్కొక్క సీన్ మీద మాస్టారు కంపోజ్ చేసిన బిట్స్ చూశాక నా అభిప్రాయమే మారిపోయింది. ఓపెనింగ్ సీన్సలోని ఆటలు, పోరాటాలు, మధ్య మధ్యలో హార్స్ ఛేసింగ్స్ వాటిమీద ఉపయోగించిన ట్రంపెట్స్, సాక్సోఫోన్, వైలిన్స్, ప్లూట్, క్లారినెట్, కాంగో, బేస్ డ్రమ్స్ ల ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఉత్సాహం రేకెత్తిస్తాయి.

ఈ సినీమాలో  మరో ముఖ్య ఆకర్షణ రాజుగారి దెయ్యం. మధ్య మధ్యలో వచ్చి వ్యాంప్  రాణి (లీలావతి)ని భయపెడుతూంటుంది. ఆ సీన్ లో రంపం, వైలిన్ బౌతో సృష్టించిన ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అలరించాయి. ఆ దెయ్యం చేసే కొన్ని ధ్వనులను తబలా ప్రసాద్ వినిపించాడు. అతని గొంతు దగ్గర పికప్ లు పెట్టి రికార్డ్ చేయడం బాగా గుర్తుంది. 

రక్తసంబంధం తర్వాత రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా నిర్మించిన చిత్రం గుడిగంటలు. ఇదికూడా తర్జుమా చిత్రమే. శివాజీ నటించిన 'ఆలయమణి' ని గుడిగంటలుగా ఎన్టీఆర్ తో నిర్మించారు. ఆనవాయితీ ప్రకారం ఈ సినీమాలోని ఆరు పాటల్లో రెండు మాత్రమే మాస్టారి స్వయంప్రతిభను చాటే పాటలు. మిగిలిన నాలుగు తమిళం, హిందీ పాటల వరసలే. అయినా అవి కూడా తెలుగుదనం సంతరించుకునేలా స్వరపర్చడంలో మాస్టారి నైపుణ్యం కనిపిస్తుంది. పాటలన్నీ బహుళ జనాదరణ పొందాయి. 

టైటిల్ మ్యూజిక్ మీద షెహనాయ్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలు ప్రాధాన్యత వహించాయి. చిత్రం ప్రారంభం నుండి టెన్నిస్ మ్యాచ్ మీద వచ్చే రీరికార్డింగ్ కు నేనూ వెళ్ళాను. ఎక్కువ పాళ్ళలో మెలోడ్రామా గల చిత్రం గుడిగంటలు. శివాజీ , ఎన్టీఆర్ నటించిన ఈ కథ హిందీలో (ఆద్మీ) దిలీప్ కుమార్ నటించడం ఆశ్చర్యమే. శివాజీ గణేశన్  హెవీడోస్ నటనకు, దిలీప్ కుమార్  సున్నితమైన ముఖభావాలకు పొంతనే కుదరదు. ఈ చిత్రంలో మాస్టారు పాడిన మూడు సోలోలు ఈనాటికీ అందరూ విని ఆనందిస్తున్నారు.

లాహిరి లాహిరి పాట తర్వాత మరోసారి నేను ఘంటసాల మాస్టారికి తీరని  ద్రోహం చేసాను. అది బొబ్బిలి కాలేజీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ చేస్తున్నప్పుడు. కాలేజీ ఏనివర్శరీ ఫంక్షన్స్ లో కొంతమంది మిత్రద్రోహులు నన్ను అడగాపెట్టకుండా  పాటలు పాడేవారి లిస్ట్ లో నాపేరు వేయించారు. నా పేరు మైక్ లో ఎనౌన్స్ చేసే వేళకు నేను ఆ చుట్టుపక్కలే లేను. ఎక్కడో వున్న నన్ను బలవంతంగా స్టేజిమీదకు తోసారు. అసలే భసాపంకం. మా ఊరి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గట్టిగా పద్యాలు చదవడం తప్ప పాడడమనేదే లేదు. స్టేజి మీద అంతమంది లెక్చరర్ లు, స్టూడెంట్ల మధ్య ఏం పాడాలి? ఎవరి పాట పాడాలి. ఆ సమయంలో ఆ వూళ్ళో ఆడుతున్న 'గుడిగంటలు' లో పాట గుర్తుకు వచ్చింది. ఆ పాటలో  ప్రముఖ రచయితల కథానాయికల పేర్లు ఉపయోగించారు కవి దాశరధి. అప్పట్లో ఆ పాట పూర్తిగా గుర్తుండేది.  వెంటనే నా బాణీలో ఆ పాటను పాడేసాను. లేదా, చదివేసాను. మా బొబ్బిలి యువరాజా వారితో సహా అక్కడున్నవారంతా చాలా సహృదయులు.  నాకూ చప్పట్లు కొట్టారు. 'నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో'  పాటను ఎంతో భావయుక్తంగా  స్వరపర్చి, అద్భుతంగా గానం చేసిన ఘంటసాల మాస్టారికి గానం పేరిట  నాలాటివారెందరు అన్యాయం చేస్తున్నారో కదా!

పొడుగాటి గజిబిజి బిజిఎమ్స్ తో అసలు పాట పల్లవేదో మర్చిపోయేలా పాటల కంపోజింగ్ ఘంటసాల మాస్టారి శైలికాదు.  పాటలోని భావానికి తగినట్లుగా అవసరంమేరకు మాత్రమే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం, అందుకు అవసరమైన వాద్యాలను మాత్రమే ఉపయోగించడం, తాను పాడి, తోటి గాయకులచేత పాడించి కావలసిన రసభావాన్ని సృష్టించడమే మాస్టారి బాణీ. 

హెవీ ఆర్కెష్ట్రా హోరు, జోరు వల్లే పాట రక్తికడుతుందని అనుకునేవారికి పూర్తి వ్యతిరేకం ఘంటసాల బాణి. వారి పాటలన్నింటిలో గాయకులకే ప్రాధాన్యత. ఏ గాయకుడి రేంజ్ ఎంతవరకు, ఎవరెవరు ఏయే పాటలు పాడగలరన్నది ఆయనకు తెలిసినంత సుస్పష్టంగా ఇతర సంగీత దర్శకులకు తెలియదనే చెప్పాలి. అలాటి సున్నితమైన, శ్రావ్యమైన, లాలిత్యంతోకూడిన మంచి పాటలు గల చిత్రం 'వారసత్వం'. ఈ సినీమాకు ముందు అనుకున్న పేరు 'మమకారం'. ఆర్ధిక ఇబ్బందులవల్ల సినీమా నిర్మాణం దాదాపు మూడేళ్ళు సాగింది. సినీమా చేతులు మారి 'వారసత్వం' గా విడుదలయింది. వారసత్వంలో ఘంటసాల మాస్టారు, సుశీల ఆలపించిన 'ప్రేయసీ మనోహరి వరించి చేరవే', సుశీల పాడిన 'పేరైనా అడుగలేదు, ఊరైనా అడుగలేదు', మాస్టారు, పి.లీల పాడిన 'చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటీ' పాటలు అపాతమధురాలుగా, అజరామర గీతాలుగా అభివర్ణించవచ్చు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఎంతో శ్రావ్యమైనవి. 

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో 1964 లో విడుదలైన మరో పౌరాణిక చిత్రం 'శ్రీ సత్యనారాయణ మహత్యం'. దాదాపు ఇరవై పాటలు, పద్యాలు గల సంగీత రసభరిత చిత్రం. ఘంటసాల మాస్టారి గాన వైదుష్యానికి దర్పణం పట్టే చిత్రంగా చెప్పుకోవాలి. ఈ సినీమాలో మాస్టారి తో పాటూ సుశీల, లీల, కోమల, స్వర్ణలత, వసంత, మాధవపెద్ది, రాఘవులు ఉన్న పాటలన్నింటిని పాడారు. 

1964 నాటికి ఘంటసాల సంగీతకుటుంబంలో మరో గాయకుడు వచ్చి చేరాడు. అతనే మొవ్వ జనార్దనరావు. బాగానే పాడేవాడు. కానీ అదృష్టం కలసిరాలేదు. మాస్టారి దగ్గరే వుంటూ కోరస్ లు పాడడం, మాస్టారి కంపోజింగ్ లకు రావడం, ఆయనతో రికార్డింగ్ లకు, కచేరీలకు వెళ్ళడం చేసేవాడు. మనిషి చాలా సౌమ్యుడు. సున్నితమైనవాడు. మాతో స్నేహపూర్వకంగా మెసిలేవాడు. ఈ సినీమా కోరస్ లలో మొవ్వ జనార్ధనరావు కూడా ఇతరులతో పాడాడు. ఘంటసాలవారి సంగీత కుటుంబంలో మరో ద్వయం - జనార్దన ద్వయం. ఇద్దరి ఇనిషియల్స్ 'ఎమ్' తోనే ఆరంభమౌతాయి. మిట్ట, మొవ్వ. మిట్టా జనార్దన్ సుప్రసిద్ద సితార్ విద్వాంసుడు. మొవ్వ జనార్దన రావు గాయకుడు. ఈ ఇద్దరితో పరిచయం పెరగనప్పుడు వీరిద్దరిలో ఎవరు జనా‌ర్దన్ , ఎవరు  జనార్దనరావు అనే తికమక చాలా రోజులుండేది.

ఈ సినీమా టైటిల్స్ మీద 'జయ జయ శ్రీమన్నారాయణా జయ విజయీభవ నారాయణా' అనే దశావతార గీతం. ఈ పాటను రాగమాలికలో కంపోజ్ చేశారు మాస్టారు. ఈ పాట విషయంలో మాస్టారు ఒక కొత్తపోకడ పోయారనే అనుకుంటున్నాను. నేను అంతకుముందు ఏ పాటల్లోనూ అలాటి స్వర రచన వినలేదు. ఘంటసాల మాస్టారు, పి.లీల, బృందం పాడిన  ఈ పాట లో ఎక్కడా నేపథ్య వాద్య సంగీతం వినపడదు, లయ ప్రధాన వాద్యాలు తప్ప. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపించవలసిన చోట్లలో మాస్టారు బృందగాయకుల గాత్రాలనే ఉపయోగించారు. స్వరాలు, ఛాయాస్వరాలను ఆయా గాయకులు ఆలపిస్తుండగా ప్రధాన పాటను మాస్టారు, లీల పాడారు. ఇదొక వైవిధ్యమైన ప్రక్రియగా నేను భావిస్తున్నాను. 


ఈ సినిమాలో మరో డ్యూయెట్ మాస్టారు, సుశీల పాడిన 'జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే, జలతారు మెరుపు నీవే' పాట. ఈ పాట కంపోజింగ్, రిహార్సల్స్, రికార్డింగ్ కు అనారోగ్యం కారణంగా మా నాన్నగారు పూర్తిగా హాజరు కాలేదు. ఈ పాట ఆయన లేకుండానే జరిగింది. నేను ఆ పాట సమయంలో వుండడం మూలాన ఆ పాట ట్యూన్ ఎలా చేశారో మా నాన్నగారు నన్ను వినిపించమనేవారు. నేను కొంచెం అటుయిటుగా పాడి వినిపించేవాడిని. సినీమాలో ఈపాట నాయికా నాయకుల మధ్య సాగే యుగళగీతమే అయినా శృంగారభావాలేవీ ధ్వనించవు. నాయిక నాయకుని పరంగా ఆలపిస్తుంది. కానీ, నాయకుడు నాయికను తలచుకోవడానికి బదులుగా దైవాన్ని తల్చుకుంటూ పాడడం తరచూ మనం చూసే సినీమాలలో కనపడదు. మరి ఈ నావెల్టీని ఆడియన్స్ ఏవిధంగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు.

ఈ సినీమాలో మాస్టారు పాడిన 'మాధవా మౌనమా సనాతనా కనరావ కమలనయనా' అనే పాట ఈ చిత్రానికే హైలైట్. ఘూర్జరీతోడి (శుభపంతువరాళి) రాగంలో కంపోజ్ చేశారు. మాస్టారు మూడు శృతిలో ఈ పాటను పాడారని చెప్పగా విన్నాను. పాట క్లైమాక్స్ లో మాస్టారి రెండిషన్ చాలా హైపిచ్ లో ఉంటుంది. ఈ పాట రికార్డింగ్ డేట్ ఫిక్సయి రికార్డింగ్ థియేటర్ కూడా బుక్ చేయడం జరిగింది. వాహిని స్టూడియో అనే గుర్తు. 

సరిగ్గా రికార్డింగ్ రోజున ఘంటసాల మాస్టారికి హై ఫీవర్. పైగా ముఖంమీద సెగగడ్డలు లేవడంతో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. ఆ రోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా సావిత్రమ్మగారికి కలిగింది. కానీ, ఘంటసాల మాస్టారు ఆ సలహాకు సుముఖత చూపలేదు. ఆ రోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే నిర్మాత చాలా నష్టపోతాడని ఆయన ఆవేదన. పైగా ఈ పాట షూటింగ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్లుంది. ఎన్.టి.రామారావుగారితో షెడ్యూల్. ఈ అవకాశం కోల్పోతే మరల రామారావుగారి డేట్స్ కుదరడం కష్టం. ఈ విధంగా నిర్మాత సాధకబాధకాలన్నీ ఆలోచించి, తన అనారోగ్యాన్ని లక్ష్యపెట్టకుండా రికార్డింగ్ కు వెళ్ళడానికే నిశ్చయించారు. మంచో చెడ్డో ఆ సత్యనారాయణస్వామే చూసుకుంటాడని స్టూడియోకు బయల్దేరారు. ముఖం మీది సెగగెడ్డలకు మంచి గంధం పూతపెట్టుకొని జ్వరంతోనే వెళ్ళారు. మాస్టారు ధియేటర్ కు వెళ్ళే సమయానికి మా నాన్నగారు,  పాట నొటేషన్స్ ను, బిజిఎమ్ నొటేషన్స్ ను ఆర్కెష్ట్రా వారందరికీ చెప్పడం వారంతా వారి వారి బిట్స్ రాసుకోవడం అయింది. ఈ పాటలో ఎక్కువగా షెహనాయ్, వైలిన్స్, సెల్లో, డబుల్ బేస్, డ్రమ్స్, తబలా వాద్యాలు వినిపిస్తాయి. ఘంటసాల మాస్టారు వచ్చి సౌండ్ ఇంజనీర్ రూమ్ లో నుండి ఆర్కెష్ట్రా వారు వాయించిన పాట విన్నారు. ఎవరికి ఇవ్వవలసిన సూచనలు వారికిచ్చి వాయిస్ తో ఒక మానిటర్ చూద్దామని తన మైక్ వద్దకు వెళ్ళారు. ఆనాటి ఆయన పరిస్థితిని చూసినవారంతా నిర్మాతతో సహా, జాలిపడి ఆరోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే బాగుంటుందనే భావించారు. కానీ మాస్టారు ఒప్పుకోలేదు. మాస్టారికి ఏవిధమైన ఒత్తిడి తేకుండా అతి భక్తి శ్రద్ధలతో ఆర్కెష్ట్రా వారు జాగ్రత్తగా వాయించడం మొదలెట్టారు. ఇప్పటి రికార్డింగ్ సిస్టంకి, ఆనాటి విధానానికి హస్తిమశకాంతం తేడా. ఆనాడు ట్రాక్ సిస్టమ్ అంత అభివృద్ధి చెందలేదు. లైవ్ రికార్డింగ్ చేయడానికే అందరు సంగీతదర్శకులు పాటుపడేవారు. ఒక పాట రికార్డింగ్ అనేది ఒక సమిష్టి కృషి. ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదు. అనేక విభాగాల సాంకేతిక నిపుణులంతా కలసి పనిచేస్తేనే ఒక పాట బయటకు వస్తుంది. ఆరోజు అందరికీ ఒకటే ఆలోచన. ఘంటసాలగారిని ఎక్కువ శ్రమ పెట్టకుండా పాట పూర్తిచేయాలి. ఆర్కెష్ట్రాతో వాయిస్ మానిటర్ చూశారు.  మాస్టారు వెంటనే
రెడీ ఫర్ టేక్ అన్నారు. ధియేటర్ అంతా పిన్ డ్రాప్ సైలన్స్. పస్ట్ టేక్ ప్రారంభమయింది. ఘంటసాల మాస్టారిలో ఏ దైవం ఆవహించిందో తెలియదు. తన జ్వరం, సెగగడ్డల బాధ అన్నీ మర్చిపోయారు. ఆ మూడు శృతిపాటను అద్భుతంగా ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా పాడారు. పాట క్లైమాక్స్ లో 'మాధవా ! కేశవా' అంటూ బాధతో తదాత్మ్యం చెంది పెట్టిన కేకతో రికార్డింగ్ ధియేటర్ దద్దరిల్లింది. ఏదో అవాంఛనీయ పరిస్థితి ఏర్పడిందేమోననే అందరూ భయపడ్డారు. కానీ ఏమీ జరగలేదు. మాస్టారిలోని భావావేశానికి ఆర్కెష్ట్రాతో సహా అందరూ నిశ్చేష్టులయ్యారు. షెహనాయ్ సత్యం అయితే బొటబొటా కన్నీరే కార్చారు. ఇక సెకెండ్ టేక్ కు అవసరమే లేకపోయింది. అందరూ ఫుల్లీ సాటిస్ఫైడ్. అనుకున్న సమయానికి రికార్డింగ్ పూర్తి అయింది. ఎన్టీఆర్ తో షూటింగ్ పూర్తి అయింది. ఇది నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటన. అందుకే సంగీతం దైవదత్తమని, ఘంటసాల మాస్టారు దైవాంశసంభూతుడని మనస్ఫూర్తిగా నమ్ముతాను.

ఈ సినీమా పూర్తికాకుండానే ఈ సినీమాను డైరక్ట్ చేస్తున్న ఎస్ రజనీకాంత్ మరణించారు. మిగిలిన సినీమాను ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన కె. గోపాలరావు పూర్తిచేశారు. చిత్రాన్ని రజనీకాంత్ గారికి అంకితమిస్తూ డైరెక్టర్ గా ఆయన పేరే వేశారు.

ఘంటసాల మాస్టారి సినీ జీవితచరిత్రలో ఇలాటి మరచిపోలేని ఘట్టాలెన్నో! నాకు తెలిసినవి కొన్ని మాత్రమే. 

రామచంద్రరావు. ఇంటిపేరు దేవగుప్తాపు. విశాఖపట్నం జిల్లావాడు. సొంతవూరు ఏదో నాకు గుర్తులేదు. ఘంటసాలవారి చిరకాలమిత్రుడు. సావిత్రమ్మగారికంటే ముందునుంచి సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి. రామచంద్రరావు, ఘంటసాలగారిని కలపి మైత్రీబంధం పెంచినది పానగల్ పార్క్ అరుగులే. ఇద్దరూ జీవనోపాధి వెతుక్కుంటూ మెడ్రాస్ చేరినవారే. అష్టకష్టాలు పడినవారే. ఎప్పుడైతే ఘంటసాలగారికి గాయకుడిగా పేరు రావడం ప్రారంభమయిందో అప్పటినుండే ఆకలి దప్పులు తీర్చుకోవడానికి తగిన ఆదాయము రావడం ప్రారంభించింది. అటువంటి సమయంలో పార్క్ స్నేహితుడిని వదిలేసి ఘంటసాలవారు తన దారి తాను చూసుకోలేదు. ఆ మిత్రుడిని కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. మాస్టారు, రామచంద్రరావు కలసి మోతీలాల్ స్ట్రీట్, రామానుజం స్ట్రీట్ లలో అద్దె ఇళ్ళలో కాలక్షేపం చేశారు.  సావిత్రమ్మగారు మొట్టమొదటిసారిగా మద్రాసు కాపరానికి వచ్చినప్పుడు తోడుగావుండి తీసుకువచ్చినది ఈ రామచంద్రరావేనట. చిన్న వయసులోనున్న సావిత్రమ్మగారికి దగ్గరుండి వంటావార్పు నేర్పింది కూడా ఈ రామచంద్రరావే. ఘంటసాల వారి కుటుంబానికి చాలా ఆత్మబంధువు. ఒక్క ఘంటసాలగారిని తప్ప మిగిలిన వారందరినీ ఏకవచనప్రయోగమే. మాస్టారిని మాత్రం గౌరవంగా అయ్యగారు అని పిలిచేవారు. అంతటి ఆత్మీయంగా మెలిగిన కారణంచేతనే ఘంటసాల మాస్టారు తన స్వగృహప్రవేశం సమయంలో తన మిత్రుడైన రామచంద్రరావుకు దగ్గరుండి ఘనంగా ఉపనయనం జరిపించారు. ఆ విషయాలు గతంలో నెం.35, ఉస్మాన్ రోడ్ లో చోటుచేసుకున్నాయి.

నెం. 35, ఉస్మాన్ రోడ్ ఒక పుష్పక విమానంలాటిది. ఎంతమంది వచ్చినా మరొక్కరికి చోటు వుంటూనే వుండేది. మేస్టారింటి మేడమీద ఎంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయో. వారంతా నాకన్నా వయసులో బాగా పెద్ద. మా నాన్నగారికంటే వయసులో చిన్నయినా నాకు వారెవరూ సమవయస్కులు కారు. అయినా అందరూ ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా వుండేవారు. ఈ రామచంద్రరావు మా అమ్మగారిని అక్కయ్యగారని పిలిచేవారు.

మనిషి సన్నగా, చామనఛాయతో, పక్కపాపిడి క్రాఫింగ్ తో ఎప్పుడూ ప్యాంట్,  ఫుల్ హ్యాండ్ షర్ట్ తో మహానీటుగా వుండేవారు. చేతిరుమాలులో పౌడర్ వేసుకొని ఆ రుమాలును మెడ వెనకనుండి ముందుకు చుట్టుకోవడం ఫస్ట్ ఫస్ట్ రామచంద్రరావు దగ్గరే చూశాను. ముందు రెండు పళ్ళు కొంచెం ఎత్తుగానే వుండేవి. చైన్ స్మోకర్. ఇంట్లో కాల్చేవారు కారు. కానీ మేడమీద రోడ్లమీద వెళుతున్నప్పుడు చాలా సిగరెట్లే కాల్చేవారు. ఘంటసాల మాస్టారి సినీమా నిర్మాణ వ్యవహారాలలో ఏమాత్రం పాత్ర వహించారో నాకు అంతగా గుర్తులేదు, కానీ, మద్రాస్ హార్బర్ లో ఏదో ఉద్యోగం చేసేవారు. ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం దాటాక ఇంటికి చేరేవారు. హార్బర్ నుండి అప్పుడప్పుడు ఏవో ఫారిన్  వస్తువులు, తినుబండారాలు తెచ్చేవారు. మాస్టారింట్లోనే భోజనవసతులన్నీ. అలాటి రామచంద్రరావుకు ఏదో అనారోగ్యం ఏర్పడింది. తరచూ దగ్గుతూవుండేవారు. అయినా సిగరెట్లు మానలేదు. డాక్టర్లు పరిక్ష చేసి చూసి క్షయ అని నిర్ధారించారు.  విశ్రాంతి కోసమని కొన్నాళ్ళ తర్వాత హార్బర్ ఉద్యోగం మానేశారు. మైలాపూర్ లజ్ కార్నర్ లో ఏదో ఒక కాఫీ హోటల్ లో గల్లాపెట్టి దగ్గర కూర్చొనే ఉద్యోగం చేశారు. అదీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.  తోడుగా ఊరినుండి అతని మేనల్లుడో, అన్నకొడుకో ఒక అబ్బాయి వచ్చి మాస్టారింట్లోనే గడిపాడు. చివరకు వ్యాధి ముదిరి, పిల్లలున్న ఇంట్లో గడపడం శ్రేయస్కరం కాదని విశాఖపట్నం కెజిహెచ్ లో చేరారు. అలాటి గడ్డు పరిస్థితులలో కూడా ఘంటసాల మాస్టారు తన మిత్రుడిని ఆర్ధికంగా ఆదుకున్నారు. ప్రతీ నెల రామచంద్రరావుకు కొంత పైకాన్ని మనీఆర్డర్ ద్వారా పంపేవారు. చిన్నవయసు కావడం వలన కొన్ని విషయాలు అర్ధమయి కాకుండా వుండేవి.

ఒకసారెప్పుడో మా అమ్మగారితో మా పిల్లలం అందరం బొబ్బిలి వెళుతున్నప్పుడు మాకు వాల్టేర్ స్టేషన్ లో  చాలా దీనస్థితిలో కనిపించారు. మా అమ్మగారి దగ్గర కష్టసుఖాలు చెప్పుకున్నారు.

ఈలోగా రైలు కదిలింది. కానీ రామచంద్రరావు క్రిందికి దిగలేదు. నాకు ఒకటే కంగారు, ఎలా దిగగలడని. లేపోతే అతను కూడా మాతో బొబ్బిలి వస్తున్నారా అని తెలియదు. కానీ ఆయన మాత్రం మా అమ్మగారితో కబుర్లు చెపుతునే వున్నారు. ఆ రైలు విశాఖపట్నం స్టేషన్ కు వెళ్ళి తిరిగి వాల్టేర్ వచ్చేక రామచంద్రరావు క్రిందికి దిగారు. ఆయనకు మా అమ్మగారు కొంత డబ్బు ఇవ్వడం చూశాను. ఆ పైకం తీసుకుంటున్నప్పుడు రామంచంద్రరావు కళ్ళలో నీళ్ళు చూసి నాకు చాలా బాధ కలిగించింది. 

ఆ రోజుల్లో చాలా రైళ్ళు వాల్టేర్ స్టేషన్ నుండి విశాఖపట్నం స్టేషన్ కు వెళ్ళి అక్కడనుండి మళ్ళా వాల్టేర్ స్టేషన్  వచ్చి ఆగి అక్కడనుండి గోపాలపట్నం జంక్షన్ దాకా వచ్చాక మెడ్రాస్ వెళ్ళేవి, హౌరా వెళ్ళేవి, రాయపూర్ వెళ్ళేవి డైవర్ట్ అయ్యేవి.

అదే రామచంద్రరావును ఆఖరిసారిగా చూడడం. ఆ తర్వాత ఎప్పుడో వ్యాధి ముదిరి విశాఖ కెజిహెచ్ లోనే కాలం చేశారని విన్నాను.

రైలు పయనంలాటి ఈ జీవితంలో ఎంతోమంది తారసపడుతూంటారు. కలసి ప్రయాణం చేస్తాం. ఎవరి మజిలీ వచ్చినప్పుడు వారు వెళ్ళిపోతూంటారు. కొందరిని మరల చూసే అవకాశం వుంటుంది. కొందరి గురించి ఏ విషయాలు తెలియవు. కాలక్రమేణా మనకు ఆప్తులనుకునేవారంతా మనకు తెలియకుండానే మన  జ్ఞాపకాల దొంతరలనుండి కనుమరుగైపోతారు. ఎవరికి ఎంతవరకు ఋణానుబంధమో అంతవరకే ఈ బంధాలు, అనుబంధాలు, స్నేహాలు అన్నీ. ఉన్న నాలుగు రోజులు మంచిగా, అందరితో సఖ్యంగా వుంటూ మంచివాడనిపించుకోవడమే మనం చేయవలసింది. ఈ సూత్రాన్నే ఘంటసాల మాస్టారు తన స్వల్ప జీవితంలో తూ.చ. తప్పక పాటించారని నాకు అనిపిస్తుంది. 

మరిన్ని ఉత్సాహభరిత విశేషాలతో వచ్చే వారం...
...సశేషం