visitors

Friday, April 3, 2020

సొగసు తెలుగు పాటల రేడు - భుజంగరాయడు




 రంగులరాట్నం చలనచిత్రంలోని "ఇంతేరాఈ జీవితం - తిరిగే రంగుల రాట్నము" అనే పాట చాలా మంది వినే ఉంటారు. ఎంతో తేలికైన మాటలతో జీవన సారాంశాన్ని  తాత్త్విక చింతనతో కాచివడబోసిన పాటగా ఇప్పటికీ తలచుకుంటారు. 

అయితే ఆ పాట రచించిన కవి ఎవరో చాలామందికి  తెలిసి ఉండక పోవచ్చును. ఆయనే శ్రీ రామ వెంకట భుజంగరాయ శర్మగారు.  


1925లో గుంటూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బియే ఆనర్స్ చదివి మద్రాసు (ఇప్పటి చెన్నై) లోని  పచ్చప్పాస్ కళాశాలలో అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేసారు. తరువాత కావలిలో ఒక మిత్రుడితో కలిసి విశ్వోదయ కళాశాలను స్థాపించి అందులో  తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసారు. ఆయన  గొప్ప కవిగానే కాక నటుడిగా, చిత్రకారుడిగా మంచి వక్తగా పేరుపొందిన వ్యక్తి. శ్రీ వెంపటి చినసత్యం  స్థాపించిన కూచిపూడి నాటక అకాడెమీ వారు ప్రదర్శించిన ఎన్నో నాట్య రూాపకాలను భుజంగరాయశర్మగారు రచించారు.

 కూచిపూడి నాట్యరూపకాలకు మూలాధారమైన  త్రిమూర్తులు కావ్య రచనలు చేసిన భుజంగరాయశర్మగారు,  సంగీత రచన చేసిన పట్రాయని  సంగీతరావుగారు, వాటిని అద్భుతంగా ప్రదర్శించిన వెంపటి చిన సత్యంగారు.  వీరి ముగ్గురి కలయికతో  ఈ నాట్యరూపకాలు ఆధునిక యక్షగానాలుగా ప్రసిద్ధి పొందాయి. దేశ విదేశాలలో తెలుగు సాంస్కృతిక కీర్తి పతాకాన్ని దిగ్విజయంగా ఎగరేసాయి.

 సంగీతరావుగారు -భుజంగరాయ శర్మగారు   వీరిరువురి స్నేహం - సంగీత సాహిత్య సమ్మేళనం. పూవు తావిల అనుబంధం. శతవసంతాలు పూర్తిచేసుకుంటున్న తరుణంలో సంగీతరావుగారిని  భుజంగరాయశర్మగారితో పరిచయం, స్నేహం  గురించి అడిగినప్పుడు వారు చెప్పిన ముచ్చటలు మరోసారి చెప్పుకుందాం. 


భుజంగరాయశర్మగారు రచించిన ఎన్నోలలిత గీతాలు కూచిపూడి యక్షగానాలలోను, ఆలిండియారేడియో ద్వారాను ప్రసిద్ధి పొందినవే.

 కానీ ఇక్కడ వివరించబోయే పాట, ఒక  ప్రత్యేకమైన పాట. ఇంత వరకు ఇది రికార్డుగా వచ్చిన దాఖలాలు లేవు.


 వెంపటి చిన సత్యంగారి కూచిపూడినాటకాలను దేశ విదేశాల్లో ప్రదర్శించారు. ఆ నృత్యబృందంతో పాటు  సంగీతరావుగారు, భుజంగరాయశర్మగారు వీరిద్దరూ  కలిసి ఎన్నో   విదేశపర్యటనలు చేసారు. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అలాంటి ఒకసందర్భంలో  ఒకబస్ ప్రయాణంలో అప్పటికప్పుడు  భుజంగరాయశర్మగారు ఒక  పాటను రాసి, తనకు చూపారని అప్పటికప్పుడే

ఆ పాటను రాగమాలిక లో స్వరపరిచానని చెప్పారు సంగీతరావుగారు.

"ఎన్ని సొగసుల మూట మా తెలుగు పాట"  అంటూ సాగే ఈ పాటలో ప్రతి పదమూ తేనెలో ముంచిన  రసగుళికే. ప్రతి పాదంలోను విరిసే భావన అచ్చతెలుగుదే. 
పాటలో  మొదట వచ్చే  పల్లవి -
  ఎన్ని సొగసులమూట
  మా తెలుగు పాట
  ఎంత తేనియలొలుకు 
  మా తెలుగు పలుకు   
ఈ పల్లవితోనే తెలుగు పదానికి, భావానికి పట్టం కట్టడం ప్రారంభమవుతుంది. తెలుగు అజంత భాష కావడం వలన శ్రవణసుభగంగా ఉంటుందని, తెలుగుమాట తేనెలాగా తీయగా ఉంటుందని, తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని తెలుగుభాష సొగసు గురించి విదేశీయులు కూడా పొగిడారు. అటువంటి తెలుగు మాటలతో కూడిన  తెలుగు పాట ఎన్నో సొగసుల మూటే మరి. తెలుగునుడికారం,తెలుగు సంస్కృతి సంప్రదాయాలు,  అన్నిటినీ  ప్రతిబింబించే విధంగా పాటలోని తరువాతి చరణాలు సాగుతాయి.

  గొబ్బెమ్మ సిగలోని
  గుమ్మడీ పూవులా
  గుమ్మడీ మదిలోని 
  మంచు కోరికలా

 సంక్రాంతికి కన్నెపిల్లలు చక్కని మొగుడు కావాలని, రావాలని  నోములు నోచి ముగ్గులు పెట్టి ఆ మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి  ఆటలు ఆడతారు. ఆ గొబ్బెమ్మల పైన  పసుపురంగు గుమ్మడిపూలను ఉంచుతారు.  ఈ తెలుగు పండుగను గుర్తుచేసేదే రెండో చరణం. గొబ్బెమ్మను చేసి  పైన తురిమే గుమ్మడి పూలలో కనిపించే శీతాకాలపు  తుషార బిందువును  అమ్మాయి మనసులో కాబోయే భర్తగురించి కలిగే కమ్మని ఆలోచనగా సూచిస్తూ గుమ్మడీ మదిలోని  మంచుకోరికగా వర్ణించారు. 
  తొలికారు మబ్బులో 
   పులకించు ధాత్రిలా
   ధాత్రి ఎదలో మేలుకొను
   పంటసిరిలా
తరతరాలుగా భూమి ఆకాశం తెలుగుకవులకి ప్రేయసీ ప్రియులే.  మబ్బులు కమ్మిన ఆకాశం చినికే వానచినుకులు తన ప్రేయసి భూమి పైన చిలికే పన్నీటి జల్లులే.  గ్రీష్మంలో చెమ్మను  కోల్పోయి నెర్రెలు విచ్చిన భూమిని మరల పదును చేసిన రైతులు  తొలికారు  మబ్బులు కమ్మి జలజలా వాన ఎప్పుడు కురుస్తుందా అని విత్తనాలు వేసి ఎదురుచూస్తారు. ఆ సందర్భాన్ని వర్ణించే చరణం ఇది. తొలికారు మబ్బులు కమ్మి వాన కురిస్తే నేల పులకరిస్తుంది. విత్తిన విత్తనాలన్నీ మొలకలెత్తి  పంటసిరిగా మారి రైతులకు సిరి సంపదలిస్తాయి. తెలుగు ప్రాంతాలలో వ్యవసాయం ప్రారంభమయ్యేది తొలికారు లోనే కదా.      
  తలుపుదగ్గర చెప్పు 
  తన మగనిపేరులా
 పేరులో తారాడు 
  మన్మథుని రూపులా 

తొలిసారి వరుడి చిటికెనవేలు పట్టుకొని అత్తగారింటిలో గృహ ప్రవేశం చేసే నవవధువును భర్తపేరు చెప్పమని ఆ గుమ్మంలో నిలబెట్టి అడగడం  మన తెలుగు పెళ్ళిళ్ళలో వేడుక, ఒక సంప్రదాయం. వధువు భర్త పేరు చెప్పడానికి సిగ్గు పడడానికి కారణం ఆమె మనసులో మన్మధుని రూపులా  తన భర్త రూపం  గోచరించడమే.

గోదారి ఒడిలోన 
నెలవంక పాపలా
నెలవంక చెక్కిళ్ళ
పాల వెన్నెలలా

తెలుగుదేశంలో ప్రవహించే గొప్ప నది గోదావరి. తెలుగువారి పలుకుబడి గోదారి.తరతరాలుగా ఈ భారతదేశంలో నీరిచ్చే నదులను, పాలిచ్చే ఆవులను మనని పెంచి పోషించే తల్లితో పోల్చి గౌరవించడం  సంప్రదాయం. గోదావరి నదిలో చంద్రోదయ మైనప్పుడు ఆ సౌందర్యాన్ని వర్ణించడం ఎవరి తరం. మరి  గోదారి తల్లి అయితే  ఆమె కడుపున ఉదయించే  బాలచంద్రుడిని ఆమె పాపగా ఊహించినప్పుడు  ఆవెన్నెల వెలుగులు, ఆ పాపాయి పాల చెక్కిళ్ళు చిందే కాంతులే .

 భద్రాద్రి రాము 
 నెన్నుదిటి కస్తూరిలా
 కస్తూరి మనసులో
 కారుణ్య రేఖలా

భద్రాద్రిపై వెలసిన రాముడు తెలుగింటి దేవుడు. ఆ రాముడి నుదిటిపై వెలిగేది,రెండు ఊర్థ పుండ్రాల నడుమన  కస్తూరి తో తీర్చిన ఎర్రని నామము.రాముడి  నెన్నుదిటిపై (అందమైన నుదురుభాగం) తీర్చే మూడు నామాలలో  తెల్లనిరెండు నామాలు మనిషిలో పెంచుకోవలసిన సత్త్వగుణాలకు ప్రతీకలుగా,మధ్యలో  కస్తూరితో తీర్చే ఎర్రని రేఖను మనిషి లోని అనురాగాన్ని, మోహాన్నిపెంచే రజోగుణానికి ప్రతీకగా భావిస్తారు హైందవులు. రాముడి  మనసుకూడా కస్తూరిలా పరిమళభరితమయినది. నామంలోని ఎరుపు రేఖలా ప్రేమాస్పదమైనది.  చల్లనితండ్రి తెలుగింటి రాముడు. ఆ భద్రాద్రి రాముడి నుదిటిపై  కస్తూరితో తీర్చే ఎర్రని రేఖ, మనందరినీ చల్లగా కాచే కారుణ్యరేఖ. 

ఎంతో సొగసైన తెలుగు పాటల గురించి  పాట రాస్తూ, ఆ  పాటలోనే ఎంతో  సొగసైన తేనెలొలికే  తెలుగు మాటలను వాడారు భుజంగరాయ శర్మగారు. సొగసుల మూట, మంచు కోరిక, మగని పేరు, తారాడు మన్మధుని రూపు, మేలుకొను పంటసిరులు,తొలికారు మబ్బులు, నెలవంక పాప, పాల వెన్నెలలు, నెన్నుదురు  ... 

ఓహోహో !! ఎన్నిచక్కని తెలుగుపదాలు. ఎంత కమ్మని తెలుగురసాల ఊటలు. తెలుగు భాషామతల్లికి భుజంగ రాయ శర్మగారు ఇచ్చిన మంగళ హారతి కదా  ఈ పాట.


లలిత లలితమయిన అలతి అలతి పదాలతో కూర్చిన  ఈ చక్కని  పాటకి ఇంచక్కని  రాగ వరుసలు కూర్చారు - 
శ్రీ పట్రాయని  సంగీతరావుగారు. సంగీతరావుగారి  అమ్మాయి, గాయని,  శ్రీమతి కొచ్చెర్లకోట  పద్మావతి  ఈ పాటను అతి మధురంగా గానం చేసారు. ఆ పాట  లింక్ ఇక్కడ.

     
     

            
     
        
        

         

శ్రీ సంగీతరావుగారి జ్ఞాపకాలలో శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు

                                     
                                   శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు       

                                                                                                                                                                                                                  -  పట్రాయని సంగీతరావు


తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నృత్యనాటకం శ్రీనివాస కల్యాణం పేరుతో ప్రదర్శించాలని సంకల్పించింది. నృత్య నిర్వహణ వెంపటి చిన సత్యంగారికప్పగించింది. దీనికి సలహాదారు బి.ఎన్. రెడ్డిగారు, రచయిత ఎస్. వి. భుజంగరాయ శర్మగారు. సంగీత నిర్వహణ ద్వారం భావనారాయణగారు. ద్వారం భావనారాయణగారికి సహాయకుడిగా నన్నాహ్వానించేరు. ఆయన అంతకు పూర్వం శాకుంతల నృత్యనాటాకానికి సంగీత నిర్వహణ చేశారు.

శ్రీనివాస కల్యాణంలో రెండు సీన్లు పూర్తయ్యాయి. భృగుమహర్షి త్రిమూర్తుల యోగ్యతను పరీక్షించడం ప్రారంభమయింది. మహేశ్వరుణ్ణి పరీక్షించడానికి రావలసి ఉన్నది. పరమేశ్వర ప్రార్ధన శ్లోకం ప్రారంభమయింది. వాసంత ప్రసవీకృతైందవకళమ్ చూడాకలాపోన్నతమ్ – మాటలన్నీ లలితంగా, శ్రవణపేయంగా వినిపించేయి. కృతైందవకళమ్–  ఇందుశబ్దానికి తధ్ధిత రూపం ఐందవా’ ? అని అడిగాను. తధ్ధిత రూపమనే వ్యాకరణ పారిభాషిక పదంతో కూడిన ప్రశ్న నా నుంచి రావడం శర్మగారికి వింతగా వినిపించింది. ఈ సంఘటన తరవాత నన్ను సాహిత్యాభిలాషిగా గ్రహించేరు. అప్పటినుంచి ఏది రికార్డు చేయవలసి వచ్చినా, ఆ సాహిత్యాన్ని ముందుగా నాకు వినిపిస్తూ ఉండేవారు.

ఆయన చాలా సహృదయుడు. స్నేహాభిలాషి. భాషలోను, భవంలోను ఉత్తమ సంస్కారం కలిగినవాడు. క్రమంగా – భావనారాయణగారు మద్రాసులో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేకపోవడంతో – పద్మావతీ శ్రీనివాసం – నృత్యనాటాకానికి సంగీతం నేనే నిర్వహించవలసీ వచ్చింది. శర్మగారు ఏది రాసినా లలితంగా, సుకుమారంగా వినిపించేది. వెంటనే దానికి సంగీతం అమర్చడానికి ఎంతో ఉత్సాహం కలిగేది.

నాటకరంగ విభజనలో, పాత్రపోషణలో ప్రదర్శన సంబంధమైన అంశాలు అన్నిటిలోను సత్యంగారు, శర్మగారిని సంప్రదిస్తూ ఉండేవారు.

ఆ రోజుల్లో కావలి కాలేజీలో ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి గారూ పనిచేవారు. హనుమఛ్ఛాస్త్రి గారూ, పిలకా గణపతిశాస్త్రిగారూ విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్ధులుగా ఉండినప్పుడు పంతుల లక్ష్మీనారాయణ గారు శతవృధ్ధులు.

నవ్యకవిత్వం ఆవిర్భవించిన రోజులవి. నవ్యకవిత్వం పట్ల ఇంద్రగంటి వారికీ, పిలకావారికి సానుభూతి ఉండేది. ఆనాటి ముచ్చట్లు నేను కొన్ని విన్నాను. శర్మగారికా ముచ్చట్లు చెప్పడం జరిగింది. ఆ కబుర్లు పొడిగించాలని ఉండేది శర్మ గారికి.

శ్రీ వెంపటి చిన సత్యం గారు శర్మ గారి సాహిత్యమే కాకుండా, ఆయన సాన్నిహిత్యమూ కోరుకునేవారు. ఆ కారణంచేతే అకాడెమీ నృత్యనాటకాలు ఎక్కడ జరిగినా, శర్మగారి తోడ్పాటు ఉంటూ ఉండేది.

ఆ రోజుల్లో – అవతల కెనడా నుంచి ఇవతల ఫ్లోరిడా దాకా సంచారం జరిగింది. ఈ ప్రయాణాలన్నీ గ్రేహౌండ్బస్సులోనే. శర్మగారూ మాతోటే ప్రయాణం చేసేరు. ఆయన నాకు దగ్గరగా ఉండేవారు.
ఆ బస్సులోనే –
  ‘ఎన్ని సొగసుల మూట 
  మా తెలుగు పాట
  ఎంత తేనియలొలుకు 
  మా తెలుగు పలుకూ
అనే పాట రాసి చూపించేరు నాకు శర్మగారు. నాకది వెంటనే పాడి వినిపించాలనిపించింది. రాగమాలికలో చేశానాపాట.

ఆ పాట ఇదీ –
పల్లవి – రాగం పీలు
ఎన్ని సొగసుల మూట మా తెలుగు పాటా
ఎంత తేనియలొలుకు మా తెలుగు పలుకు       llఎన్నిll


చరణం 1 – రాగం పీలు
తొలికారు మబ్బులో పులకించు ధాత్రిలా
ధాత్రియెదలో మేలుకొను పంటసిరిలా              llఎన్నిll
చరణం 2 – రాగం పీలు
గొబ్బెమ్మ సిగలోని గుమ్మడీ పూవులా
గుమ్మడీ మనసులో మంచు కోరికలా              llఎన్నిll
చరణం 3 – రాగం జంఝూటి
తలుపు దగ్గర చెప్పు తన మగని పేరులా
పేరులో తారాడూ మన్మథుని రూపులా            llఎన్నిll
చరణం 4 – రాగం మోహన
గోదారి ఒడిలోని నెలవంక పాపలా
నెలవంక చెక్కిళ్ళ పాల వెన్నెలలా                  llఎన్నిll

చరణం 5 – రాగం మధ్యమావతి
భద్రాద్రి రాము నెన్నుదుటి కస్తూరిలా
కస్తూరి మనసులో కారుణ్య రేఖలా                  llఎన్నిll

– ఇలా ఏ పాట రాసినా లలిత సుందరమైన ఆ శైలి మనసునెంతో ఆకట్టుకుంటుంది.
శర్మగారెప్పుడు ఏ పనిమీద మద్రాసు వచ్చినా ఆయనతో సత్కాలక్షేపం అవుతుందనే ఆశ నాకుండేది.
18-03-2020
ఉదయం  11 గంటలకు
నాన్నగారు చెపుతుండగా రాసిన వ్యాసం
-      కె వి రమణమ్మ