visitors

Saturday, January 30, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదిహేడవ భాగం

30.01.2021 -  శనివారం భాగం- 17*:
అధ్యాయం 2 భాగం 16 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"మీ ఘంటసాల సవినయంగా సమర్పించు..." అంటూ  తెల్లని దుస్తులతో, అంతకంటే నిర్మలమైన చిరునవ్వుతో నిండుగా తెరమీద కనిపిస్తూ ప్రేక్షకులనుద్దేశించి చెప్పిన ప్రారంభ స్వాగత వచనాలతో జివిఎస్ ప్రొడక్షన్స్ వారి సంగీత ప్రధాన, భక్తి రస చిత్రం  "భక్త రఘునాధ్" సినిమా ప్రారంభమవుతుంది.

జి.వి.ఎస్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ఒక  మకరతోరణం మధ్య ఒక పెద్ద గంట వేలాడుతూ, క్రింది ముందు భాగంలో ఇంగ్లీష్ లో G.V.S.PRODUCTIONS అని కనిపిస్తుంది. 

ఘంటసాలవారి రెండో చిత్రమైన 'సొంతవూరు' చిత్రం కూడా జివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే వచ్చింది. అసలు ఈ పేరు ఎన్నుకోవడంలో మాస్టారి అంతరంగం నాకు తెలియదు కానీ, ఆ బ్యానర్ లో మాస్టారింట్లో చాలామంది పేర్లు కలిసివచ్చేలా కనిపిస్తాయి: జి. ఘంటసాల, వి. వెంకటేశ్వరరావు, విజయకుమార్, ఎస్. సావిత్రి , సదాశివుడు(తమ్ముడు), సుబ్బలక్ష్మి(తమ్ముడి భార్య,మేనకోడలు), శ్యామల. అప్పటికి సుగుణ, శాంతి అనే అమ్మాయిలు పుట్టలేదు.  ఇలా అందరి భాగస్వామ్యంతో ఈ సినీమాలు తీసారని నేను సరదాగా మా బొబ్బిలిలో మా స్నేహితుల దగ్గర చెప్పేవాడిని. "భక్త రఘునాధ్" సినీమా చూసింది కూడా బొబ్బిలిలోనే. శ్రీరామా టాకీస్ అని గుర్తు.

రఘునాధుడు ఉత్కళదేశానికి చెందిన విష్ణుభక్తుడు. ఉత్కళదేశమే ఓఢ్రదేశంగా, ఒరిస్సాగా , ఇప్పుడు ఒడియా రాష్ట్రంగా మారింది. ప్రాచీన భారతదేశంలోని అనేకమంది పరమ భాగవతోత్తముల గాధలన్నీ గ్రంథరూపంలో వెలువడ్డాయి. అందులో, పూరీ జగన్నాధస్వామి భక్తుడైన ఈ రఘునాధ గోస్వామి చరిత్ర కూడా వుంది. 

రెండు సాంఘిక సినీమాలు తీసి ఆర్ధికంగా చాలా నష్టపోయినా ముచ్చటగా మూడవ ప్రయత్నంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచి మరో సినీమా తీయ సంకల్పించి కధ, మాటలు, పాటలు, దర్శకత్వపు భాధ్యతలను శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులవారికి అప్పగించారు. శ్రీ సముద్రాలవారు పౌరాణిక చిత్రాలకు మాటలు,పాటలు రాయడంలో నిష్ణాతులు. అంతకు రెండేళ్ళకుముందే వినాయకచవితి వంటి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకానుభవమూ పొందారు. వీటన్నిటినీ మించి తనను చిత్రసీమకు పరిచయం చేసిన వ్యక్తిగా, ఆత్మీయుడిగా, సన్నిహితుడిగా ఆచార్యులవారి మీద గల పూజ్యభావంతో, కృతజ్ఞతా భావంతోను తాను నిర్మించబోయే కొత్త సినీమా భాధ్యతలను ఆచార్యులవారికి అప్పగించేరేమో అని అనిపిస్తుంది. 

"భక్త రఘునాధ్" చిత్రానికి కధానాయకుడిగా ముందు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారిని సంప్రదించగా, వారెందుకో ఈ చిత్రకధ పట్ల అంత సుముఖంగా లేనట్లు, రఘునాధుడనే భక్తుడిగురించి తెలుగువారికి అంతగా తెలియదని, అలాటి గాథను తెరకెక్కించడం శ్రేయస్కరం కాదని, అయినా ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీ కె.వి.రెడ్డిగారిని నియమిస్తే బాగుంటుందని సలహా యిచ్చినట్లు, కానీ, అప్పటికే ఘంటసాలవారు తన సినీమా డైరక్టర్ గా శ్రీ సముద్రాల వారికి మాట యిచ్చినందువలన, ఆ వాగ్దానాన్ని మీరడం ఇష్టంలేక  శ్రీ నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్లుగా వచ్చిన సమాచారాన్ని నేను చదివేను. 

తరువాత, కాంతారావు, జమునలను నాయక,నాయికలుగా ఎన్నుకున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో నాగయ్య, సి.ఎస్.ఆర్, రేలంగి, సూర్యకాంతం, పేకేటి మొదలైనవారు నియమితులయ్యారు. 

ఈ సినీమా భక్తుడి గాథ కావడం వలన  అతని జీవితం లోని కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు, ఇలా అన్ని రసభావాలను చూపించే క్రమంలో ఈ సినీమాలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. నిర్మాత (తమ్ముడి పేరిట) సంగీతదర్శకుడు, గాయకుడు అన్నీ తానే అయినందున సంగీతనిర్వహణ విషయంలో వారికెంతో స్వేచ్ఛ లభించిందనే చెప్పుకోవాలి. ఇతరుల ఒత్తిడులేవీ సంగీతంమీద ప్రతిఫలించే అవకాశంలేదు. సంపూర్ణ  పాటల స్వర రచన విషయంలో మాస్టారు వ్యవహరించి అక్కడ తానే ఒక భక్తుడి అవస్థలను అనుభవించి ఆయా రసాలకు తగిన వరుసలను సమర్ధవంతంగా తయారు చేశారు. 

పాటల కంపోజింగ్, రిహార్సల్స్ వంటివి నెం.35, ఉస్మాన్ రోడ్ ఇంటి క్రింది హాల్ లో, మేడమీది గదులలో జరిగాయి. ఈ రిహార్సల్స్ సమయంలో ఆ పాటలు పాడిన నేపథ్య గాయనీమణులైన శ్రీమతి పి.లీల, జిక్కి, ఎ.పి.కోమల, మాధవపెద్ది మొదలైనవారిని తరచూ చూస్తూ, వారు పాట నేర్చుకుంటూ పాడే విధానాన్ని గమనిస్తూండేవాడిని.

భక్త రఘునాథ్ చిత్ర జయాపజయాలు పరంగా కాకుండా అందులోని ఉత్తమమైన, శ్రావ్యమైన సంగీతపరంగా, ఆ సినీమానిర్మాణంలో చోటుచేసుకున్న కొన్ని అంశాలవలన, ఆ చిత్రం ఎప్పటికీ నాకు మరపురానిది, అత్యంత ఆత్మీయమైనది. అవేమిటో మీకే తెలుస్తుంది.

భక్త రఘునాథ్ చిత్ర గీతాల రికార్డింగ్, రీరికార్డింగ్, ఇండోర్ షూటింగ్ వాహినీ స్టూడియోలోనే జరిగింది. మాస్టారు తన దైనందిక కార్యకలాపాలు చూసుకుంటూనే ఈ చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూండేవారు.

1959లో మొదలైన "భక్త రఘునాధ్" 1960 లో విడుదలయింది. ఈ సినీమాలో మొత్తం 14 పాటలు, ఓ 8 పద్యాలు, శ్లోకాలు ఉన్నాయి. వీటిలో చాలా పాటలు, పద్యాలు హెచ్ ఎమ్ వి గ్రామఫోన్ రికార్డులుగా విడుదలయాయి. ఈ పాటలలో చాలా భాగం వేసవి శెలవులలోనే రికార్డింగ్ పూర్తిచేసుకోవడంవలన నేను చాలా పాటల రికార్డింగ్ కు, తరువాత రీరికార్డింగ్ కు వెళ్ళడం జరిగింది. అందులో నాకు బాగా గుర్తుండిపోయినవి - 
"నీ గుణగానాము", "తరలిపోయే తెరువరీ", "సంసారజలధి", "ఈ మరపేలా ఈ వెరపేలా", "రామహరే కృష్ణహరే", "గోపాల దయసేయరా"పాటలు.


ఈ చిత్ర నిర్మాణ సమయంలో సాలూరు నుండి మా ప్రభూ చిన్నాన్నగారి అబ్బాయి ప్రసాద్ (పి.వి.ఎన్.ఎస్.వి) కూడా శెలవులకు మద్రాస్ మొదటిసారిగా వచ్చాడు. అతను అప్పుడు ఇప్పుడు కూడా ఘంటసాలవారి పరమ వీర భక్తుడు. ఘంటసాల మాస్టారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చాలా జిజ్ఞాసతో సేకరించే అలవాటుకలవాడు. అతను మద్రాస్ వచ్చిన సమయంలో నెం.35, ఉస్మాన్ రోడ్ కల్యాణశోభతో వెలిగిపోతూండేది. సకలజనాల రాకపోకలతో కోలాహలంగా వుండేది.

ఒక పెద్ద భోషాణం పెట్టిలాటి స్పూల్ టేప్ రికార్డర్ ( జర్మన్ మేక్ గ్రండిగ్  టేప్ రికార్డర్ )లో "భక్త రఘునాథ్" పాటలు, పద్యాలు, షూటింగ్ సమయంలో రికార్డ్ చేసిన డైలాగ్స్  ఇంట్లోని ఆడవారికి వినిపిస్తూండేవారు ప్రొడ్యూసర్ సదాశివుడు, మేనేజర్ సుబ్బు, ఎడిటర్లు బి. హరినారాయణ, దేవేంద్రలు. అలాగే షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటో ఆల్బమ్స్ అన్నీ మేడమీద గదుల్లో బీరువాలలో పడివుండేవి. ఆ ఫోటోలను భక్తిపూర్వకంగా, అపురూపంగా చూడడంలో, టేప్ రికార్డర్ లో పాటలు, మాటలు  వినడంలో మా ప్రసాద్, నేనూ పోటీలు పడేవాళ్ళం. అతను మద్రాస్ లో ఉన్న సమయంలోనే "నీ గుణ గానము" పాట షూటింగ్ వాహినీలో జరిగింది. మేమూ వెళ్ళాము. పూరీ జగన్నాధస్వామి ఆలయం సెట్ వేసి దేవుడి ముందు షూటింగ్. జమున, కాంతారావు, మరికొంతమంది ఎక్స్ట్రాలు (వారిని ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అంటున్నారు) మేకప్ వేసుకొని సిద్థంగా ఉన్నారు.. ఎంతసేపు గడచినా షూటింగ్ ప్రారంభంకాలేదు. లైటింగ్ ఎడ్జస్ట్మెంట్ తోనే సరిపోయింది. ఆ పాట షూటింగ్ చూడకుండానే బయటకు వచ్చేసాము.

ఎడిటర్ దేవేంద్రనాధ్ తండ్రిగారు వాహినీలో పనిచేసేవారు. ఈ దేవేంద్రకు ఆ రోజుల్లో కొంచెం అక్కినేని నాగేశ్వరరావు పోలికలుండేవి. ఆకారణం చేతనేమో ఈయన 'పెళ్ళి చేసి చూడు' సినీమాలో రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద ఎన్టీఆర్, జి.వరలక్ష్మిల ముందునుండి నల్లకళ్ళద్దాలతో స్టైల్ గా నడిచెళుతూ కనిపిస్తారు. దేవేంద్ర తర్వాత చాలా సినీమాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఎడిటర్ హరినారాయణ కూడా ఎడిటర్ గా తరువాత కొన్ని సినీమా లకు డైరక్టర్ గా పనిచేశారు. అలాటివాటిలో ఒకటి రెండు సినిమాలకు మాస్టారు సంగీతం కూడా నిర్వహించేవారు. పామర్తిగారు, హరి, దేవేంద్ర, సుబ్బు, జెవి రాఘవులు వీరంతా మాస్టారింట్లో సొంత మనుషుల్లాగే ఏ అరమరికలు లేకుండా మసిలేవారు. వీరందరి కుటుంబాలతో సావిత్రమ్మగారికి మంచి స్నేహసంబంధాలుండేవి. ఒకరిళ్ళకు ఒకరు వచ్చిపోతూండేవారు.  

సినీ పరిశ్రమ అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్. సాంకేతికంగా  అంత అభివృద్ధి చెందని ఆరోజుల్లో సాంకేతిక నిపుణుల జీవితాలు చాలా దుర్భరంగా వుండేవి. చిత్రనిర్మాణం త్వరగా ముగించాలనే తపనలో రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని కష్టపడేవాళ్ళు. సమయానికి సరైన ఆహారం వుండేదికాదు. వాటి ప్రభావం వారి ఆరోగ్యాలమీద పడేది. సినీమాలలో పనిచేసేవాళ్ళలో అధిక సంఖ్యాకులు డైబిటీస్, బి.పి, హార్ట్ కంప్లైంట్, విజన్ ప్రోబ్లమ్స్ కు గురి అయేవారు. అందుకు, సక్రమమైన ఆహారవిహారాలు, పనిచేసే చోట సరైన వసతులు లభించక అనారోగ్యాలకు గురైయ్యేవారు. సుబ్బు , దేవేంద్ర కూడా కొంత వయసు మీరాక తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని విన్నాను. 

ఘంటసాలవారిది నిండుమనసు. బంధు, స్నేహప్రీతి మెండు. తన ఆశ్రితులందరికీ ఏదో విధంగా ప్రోత్సాహం , సహాయం చేయాలని ఆశించేవారు. మాస్టారు తీసిన మూడు సినీమాలలోనూ నటులు కాని తన సన్నిహితులచేత ఏవో వేషాలు వేయించి వారికి ఆనందం కలిగించి తానూ ఆనందపడేవారు. 

మొదటిచిత్రం 'పరోపకారం' లో గాయకుడు బి.గోపాలంగారి చేత, నృత్య కళాకారుడు వెంపటి చిన సత్యంగారి చేత వేషాలు వేయించి వారికి తాను పాటలు పాడారు.

రెండవ సినీమా 'సొంతవూరు' లో రాజసులోచన కు హీరోయిన్ హోదా కల్పించారు. ఆ సినీమా లో మా నాన్నగారు( పి.సంగీతరావు) కూడా సి.ఎస్.ఆర్ తో ఒక సన్నివేశంలో కనిపిస్తారు. ఏవో రెండు మూడు డైలాగ్స్ వున్నాయి. 

ఈ మూడవ సినీమా భక్త రఘునాథ్ లో కూడా ఒక నృత్య సన్నివేశంలో వీణవాయిస్తూ మా నాన్నగారు కనిపిస్తారు. "జయమురళీలోలా గోపాలా" అనే జావళీని మాస్టారు అద్భుతంగా స్వరపర్చగా ఏపి కోమల పాడారు.

 తెరమీద నర్తకిగా మణి అనే కొత్త అమ్మాయికి అవకాశం కల్పించారు. మణి, స్వర్ణ ఇద్దరూ అక్కచెల్లెళ్ళు. చక్కటి నృత్యకళాకారులు. భక్త రఘునాధ్ లో పాటకి నాట్యం చేసినది మణే. నాకు బాగా గుర్తు. కానీ పాటలపుస్తకంలో మణి పేరుకు బదులుగా స్వర్ణ అని ఎక్కడో చూశాను. వీరిద్దరూ తరువాత ఎన్టీఆర్ నిర్మించిన 'శ్రీ సీతారామ కల్యాణం'లో సీత, శూర్ఫణకలుగా అవకాశాలు పొంది గుర్తింపబడ్డారు. అందులోని మణియే తర్వాత తర్వాత గీతాంజలిగా  బహుభాషా చిత్రనటిగా పేరుపొందారు. పాపం! ఆమె నటించిన మాస్టారి "భక్త రఘునాధ్" ఆవిడకు గుర్తులేదు. ఎన్టీఆర్ సినీమా ద్వారానే చిత్రసీమకు వచ్చినట్లు చెప్పుకునేవారు. పరాజయం పొందిన సినీమాలో నటించానని చెప్పుకోవడం ఒక నామోషి కూడా కావచ్చు. అలాగే భక్త రఘునాథ్ లో నటించిన మరొక కొత్త నటి కమలకుమారి. పేకేటి శివరాం పరిచయం చేశారు. ఆ నటీమణే జయంతిగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఆవిడా అంతే. 

ఘంటసాల మాస్టారు తమ గురువు (పట్రాయని సీతారామశాస్త్రి)గారిని గౌరవించే రీతిలో "భక్త రఘునాథ్"లో గురువుగారు చదివే  చాటుపద్యం "మరచుట లేదు నీ స్మరణ" ను తాను పాడారు. ఈ పద్యాన్ని రఘునాథ్ పాత్రధారి కాంతారావు మీద చిత్రీకరించారు. ఈ పద్యం కాగానే "భవ తాపాలు బాపే నీ పాదయుగళి" పాట ప్రారంభమవుతుంది.



ఈ చాటుపద్య కవి ఎవరో తెలియదు. కానీ మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు ఈ పద్యాన్ని విధిగా తమ కచేరీలలో పాడేవారని విన్నాను. ఆ విధంగా తమ గురువుగారు పాడుతూండగా విని ఘంటసాల మాస్టారు నేర్చుకున్నారు. గురువుగారు తన శిష్యులెవరికీ తన స్వీయ కీర్తనలు నేర్పించి ప్రచారం పొందే ప్రయత్నం చేయలేదు. ఆ శిష్యులంతా గురువుగారి కచేరీలు విని గ్రహించినవి కొన్ని కృతులు మాత్రమే.


గురువుగారు తరచు పాడే చాటువు 
"మరచుటలేదు నీ స్మరణ..." సంగీతరావుగారి గాత్రంలో వినండి
 
ఘంటసాలవారి భక్త రఘునాథ్ మద్రాస్ శివార్లలోని తిరుప్పొరూర్ మురుగన్ ఆలయ పరిసర వీధులలో చిత్రీకరించారు. అక్కడి ఆలయంలో పెళ్ళిచేసుకున్న నవ దంపతులతో ఒక పెళ్ళి బృందం ఊరేగింపుగా వస్తూండగా మదమెక్కిన ఒక ఏనుగును పాటపాడుతూ భక్త రఘునాథ్  ఆపు చేసే దృశ్యం చిత్రీకరణ జరిగింది. ఆ షూటింగ్ రెండు మూడురోజులు సాగింది. ఔట్ డోర్ అవడం మూలాన, నేను చిన్నవాడిని కావడం వలన, వెళ్ళాలని కోరిక కలిగినా అది సాగదని తెలిసి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆ నవ దంపతులలో  కొత్త పెళ్ళికొడుకుగా రెడ్డి (పూర్తిపేరు గుర్తులేదు) వేషం కట్టాడు. 

(రెడ్డి తర్వాత కాలంలో నటి వాసంతి కి కారు డ్రైవర్ గా పనిచేశాడు. మాస్టారి కారు డ్రైవర్ గోవిందు ఎప్పుడైనా శెలవుపెడితే ఆపద్ధర్మ డ్రైవర్ గా ఈ రెడ్డి వచ్చేవాడు. ఎర్రగా పొడుగ్గా నొక్కులజుత్తుతో ఉండేవాడు. సినీమా నటుడు కావాలని వచ్చాడనుకుంటాను. చివరికి నటిమణి డ్రైవర్ గా సరిపుచ్చుకోవలసి వచ్చింది. వాసంతి లా కాలేజీలో చదువుతూ సినిమా నటిగా అవకాశాలు రావడంతో లా చదువు మధ్యంతరంగా ఆపేసినట్లు తమిళ పత్రికలలో చదివాను. ఆ వాసంతి, బి.ఏ., మంచి మనసులు చిత్రంలో నటించిన సంగతి మీకు తెలిసినదే. ఆవిడ కొన్నాళ్ళు ఉస్మాన్ రోడ్ లోనే మా ఇంటికి, పానగల్ పార్క్ కు మధ్య నాదముని స్ట్రీట్, గోవింద్ స్ట్రీట్ లమధ్య వుండే మూడు నాలుగు పెంకుటిళ్ళలో ఒక ఇంటిలో నివాసముండేది.  ఒక సినీమానటి అలాటి సామాన్యమైన ఇంటిలో అద్దెకుండడమా? అని నాకు ఆశ్చర్యంగా వుండేది. అయితే ఆకాలంలో ఆపాటి నటీమణులకు యిచ్చే పారితోషికం అంతేమరి. వారికొచ్చే ఆదాయంతో అలాటి చిన్న ఇళ్ళలోనే గడపవలసి వచ్చేది. అనేక సినీమాలలో నటించాక ఒక డి.ఎమ్.కె లీడర్ ను వివాహం చేసుకొని సినీమాలకు గుడ్ బై చెప్పేసింది).

సరే. మళ్ళీ మన షూటింగ్ గజేంద్రుడిని చూద్దాము.

సినీమా లో ఈ సీన్ లో ఒక పెళ్ళి బృందంమీద ఒక మదమెక్కిన ఏనుగు భీభత్సం సృష్టిస్తే భక్తుడైన రఘునాథ్ వచ్చి వారిని రక్షించాలి. అక్కడ ఒక పాట ఉంది. "ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా" మాస్టారు చాలా ఉద్వేగభరితంగా, భక్తి ప్రపత్తులు ఉట్టిపడేలా పైస్థాయిలో సాగేపాట. 

ఇటువంటి సిట్యుయేషనల్ సాంగ్స్ ను డైరక్టర్ చెప్పే సన్నివేశాన్ని తన మనసులో ఊహించుకుంటూ సంగీతదర్శకుడు హెవీ ఆర్కెష్ట్రాను ఉపయోగించి ఒక అద్భుతమైన వరసను సమకూరుస్తారు. అంతకు పదిరెట్లు భావావేశంతో ఘంటసాల మాస్టారు వంటి గాయకులు గానంచేసి ఆ పాటను సజీవం చేస్తారు. అయితే అంత అద్భుతంగా రూపొందిన పాట సీనీమాలో మరింత ఆకర్షణీయంగా జనామోదం పొందాలంటే సన్నివేశ చిత్రీకరణ బాగుండాలి. అందుకు దర్శకుడి ప్రతిభ, నటీనటుల నటనావైదుష్యం, సాంకేతికవర్గం నైపుణ్యం, పరిసరాలు, వాతావరణం అన్నీ సహకరించాలి. 

షూటింగ్ ముగించుకొని రాత్రి ఎప్పుడో ఇళ్ళకు చేరి ఆ పాట షూటింగ్ లో జరిగిన ఫార్స్ ను  రామచంద్రరావు, సుబ్బు, తాతగారు (సదాశివుడు), హరి పగలబడి నవ్వుతూ ఇంట్లో వివరిస్తూంటే నాకు ఏదోలా అనిపించేది. ఇంతకూ విషయమేమిటంటే, ఘంటసాల మాస్టారి గాన ప్రతిభకు తగ్గట్టుగా, సముద్రాల వారి ఊహాపోహలకు తగినట్లుగా, ఛాయాగ్రహకుల నైపుణ్యాన్ని తలదన్నేలా ఉండవలసిన ఏనుగు ఆ సన్నివేశంలో ఏమాత్రమూ సహకరించలేదట. "ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా" అని మాస్టారి గొంతు హైపిచ్ లో వినిపిస్తూంటే, మరో పక్కనుండి పాటకు లిప్ మూమెంట్స్ ఇస్తూ  హిరో  కాంతారావు శరవేగంగా వస్తూంటే భీభత్సాన్ని సృష్టించి, ఔట్ డోర్లో ఒక కలకలం సృష్టించవలసిన గజరాజు మాత్రం ఒక్క ఇంచ్ కూడా ముందుకు అడుగెయ్యలేదట. ఉన్నచోటనే కదలకుండా పెట్టిన ఆహారం తాపీగా నములుతూ పాట వింటోందట. పక్కనున్న మావటివాడు అంకుశంతో ఎంత పొడిచినా ఆ ఏనుగులో చలనమేలేదట. అలాటి ఏనుగును ఎక్కడనుండి పట్టుకొచ్చారని దర్శక నిర్మాతలు విసుగుచెందారట. అయితే ఆ ఏనుగు సీజన్డ్ ఆర్టిస్టేనని అప్పటికే అనేక సినీమాలలో నటించిందని ప్రొడక్షన్ మేనేజర్ సుబ్బు వివరణ. ఏమైతేనేం ఒక రోజు ఎగిరిపోయింది. ఔట్ డోర్ లో ఎండాపోయింది. హీరో గారి ఒకరోజు కాల్షీట్ వేస్టయింది. ఆ మర్నాడు అదే తంతు. చివరికి హీరో షాట్లు, పెళ్ళిబృందం షాట్లు ముగించారట. ఏనుగు షాట్లు తర్వాత తీసారట. అప్పుడు కూడా ఆ ఏనుగు దయతల్చలేదు. సినీమాలో ఏనుగు నడిచి వస్తూంటే పక్కనే కనీకనిపించకుండా ఆ మావటివాడు కనిపిస్తాడు. ఘంటసాలవారు, డైరెక్టర్ సముద్రాల వారు ఆశించనట్లుగా పాట రూపొందలేదు. ఏనుగు అందరిని నిరాశపర్చి తట్టెడు పేడను మాత్రం మిగిల్చిందని షూటింగ్ కు వెళ్ళిన మావాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేసుకుంటూ నవ్వుకున్నారు, అంతకుమించి చేయగలిగింది ఇంకేమీలేక. తర్వాత, ఎడిటింగ్ టేబిల్ దగ్గర ఆ సీన్ ను ఏదో మేనేజ్ చేశారు.

సినీమాలలో సన్నివేశ చిత్రీకరణలు ఇలాగేవుంటాయి. చెప్పేదొకటి,  అనుకునేదొకటి, అయేది మరొకటి.  చివరకు నిర్మాతే బోల్తా కొడతాడు.

ఘంటసాల మాస్టారి భక్త రఘునాథ్ లో కనిపించే మరో ఆత్మీయ వ్యక్తి 'తమ్ముడు' కృష్ణ, మా అందరికీ 'గుండు'మామయ్య. మాస్టారింటి చీఫ్ ఛెఫ్. (నిజమనుకునేరు! కాదండోయ్!)

ఆ వివరాలతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాము.

         ...సశేషం.

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, January 23, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదహారవ భాగం

23.01.2021 - శనివారం భాగం - 16*:
అధ్యాయం 2  భాగం 15 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"నాన్నగారు! ముందు బుహారిలో ఫలూడా. తర్వాత రేస్ కోర్సుకు"  మాస్టారికి పెద్దబాబు విజ్ఞాపన. "సరేలే" మాస్టారి అభయం. కారు ఎక్కగానే విజయబాబుకు ఎక్కడలేని హుషారు వచ్చేసింది. ఒక మధ్యాహ్నం పూట మేము ముగ్గురమే షికారుకు బయల్దేరాము. ఆరోజు మాస్టారు ఖాళీగావున్నారు. కారు ఉస్మాన్ రోడ్ లో టి.నగర్ బస్ స్టాండ్ దాటి తిన్నగా సిఐటి నగర్ మీదుగా మౌంట్ రోడ్, సైదాపేట మీదుగా గిండీవేపు  రేస్ హార్స్ లా కారు దూసుకుపోతోంది. డ్రైవర్ గోవిందు ముఖం కూడా వెలిగిపోతూనే వుంది.  కారు ముందుగా గిండీవేపు వెళ్ళడం చూసి పెద్దబాబు(విజయకుమార్) గునిసాడు. ఈలోగా మాస్టారు ఒక దగ్గర  ఎడమ చేతివేపు రోడ్ ఓరగా కారును ఆపమన్నారు. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడా ఏ  షాపులు, భవనాలు ఏవీ లేవు. అక్కడ  ఇనపముళ్ళ కంచెతో వున్న ఒక పొడుగాటి గోడ, గోడ వెనక చాలా పెద్ద మైదానం కనిపించింది. అయ్యగారు ఇక్కడే ఎందుకు కారు ఆపించారో గోవిందుకు అర్ధం కాలేదు. మాస్టారు పెద్దబాబును కారులోంచి దింపి కారు బోనెట్ మీద కూర్చోపెట్టారు. చెట్లక్రింద చల్లటి నీడలో మంచి గాలి వీస్తూంటే చాలా హాయిగా అనిపించింది. ఇలా కొంతసేపు గడిచాక గోడ వెనక ఉన్న మైదానంలో దూరంగా పరుగులు తీస్తున్న కొన్ని గుర్రాలు కనిపించాయి. వాటిని చూడగానే పెద్దబాబు లో ఉత్సాహం పెరిగింది. వరసగా చాలా గుర్రాలు మా ముందునుంచే పరుగులు తీస్తూ వచ్చి, పక్కకు తిరిగి మరోవేపు మహాస్పీడ్ గా వెళ్ళాయి. అవే రేస్ గుర్రాలని వాటి మీద స్వారీ చేస్తున్నవాళ్ళనే జాకీలంటారని తెలుసుకున్నాను అందరూ నెత్తిమీద క్యాప్ లు, కాళ్ళకుపొడుగాటి తోలుబూట్లతో ఉన్నారు. మళ్ళా మరో ఐదు నిముషాల తర్వాత ఆ గుర్రాలు మరింత వేగంతో దుమ్మురేపుకుంటూ వెళ్ళాయి. వాటిని చూసి పెద్దబాబు ఆనందంగా అరవడం మొదలెట్టాడు.ఈ విధంగా ఓ అరగంట సేపు ఆ గుర్రాల పరుగులు చూసేప్పటికి పెద్ద బాబుకు నీరసం వచ్చేసింది. "నాన్నగారూ, బుహారీ" అని పాట మొదలుపెట్టాడు. ఆవిధంగా నా జీవితంలో  మొదటిసారిగా(అదే ఆఖరుసారి కూడా) గుర్రపందేలను ప్రత్యక్షంగా, చాలా దగ్గరగా, స్పష్టంగా చూడడం జరిగింది.

(మేము కారు నిలుపుకొని నిలబడి చూసిన స్థలంలో కొంతకాలం క్రితం కోకోకోలా వాళ్ళ బాట్లింగ్ ప్లాంట్ ఉండేది. ఇప్పుడు ఆ స్థలమంతా ఎమ్జీయార్ యూనివర్శిటీ క్యాంపస్ గా మారిపోయింది. దానికి ఎదురుగా SPIC బిల్డింగ్ వచ్చింది. రోడ్ రెండు పక్కలా భవనాలమయం. ఫ్లైఓవర్లతో, ఎయిర్ పోర్ట్ వేపు వెళ్ళి వచ్చే వాహనాల రొదతో ఇప్పుడు ఒక్క సెకెండ్ కూడా ఆ ప్రాంతాన నిలబడలేము. ఆ ఎత్తైన భవనాల వెనక ఆ పాత గిండీ రేస్ కోర్స్ అలాగేవుంది. అయితే , ఇప్పుడు చెన్నైలో హార్స్ రేస్ లు జరుగుతున్నాయా, లేదా అనే విషయం మీద నాకు అంత అవగాహన లేదు.) 


గిండీలో హార్స్  రేస్ లు చూసి మళ్ళా మౌంట్ రోడ్ మీదుగా కెథెడ్రల్ రోడ్ కు వెళ్ళి అక్కడనుండి బీచ్ కు వెళ్ళాము. అక్కడ ట్రిప్లికేన్ బీచ్ లో ఒక బుహారీ  రెస్టారెంట్ వుంది. వాళ్ళదే మెయిన్ రెస్టారెంట్ మౌంట్ రోడ్ వెల్లింగ్టన్ పక్కన, (ఇప్పుడు లేదు. దర్గాకు ఎదురుగా అనుకుందాము) మరొకటి సెంట్రల్ స్టేషన్ కు ఎదురుగా వుండేవి. ఇప్పుడూ ఉన్నాయి. ఆనాడు బుహారీకి వెళ్ళడం ఒక స్టాటస్ సింబల్. అలాటిచోట్ల నేనూ అడుగుపెట్టాను. గొప్పే కదూ!

ఆనాటి పెద్ద పెద్ద తారామణుల కోసం ప్రత్యేకించి బుహారీ నుండి పక్కనే వున్న బిలాల్ నుండి భోజనాలు, ఫ్రెష్ జ్యూస్ లు ప్యాక్ చేయించి ఎక్కడో వున్న కోడంబాక్కం స్టూడియోలకు అష్టకష్టాలు పడి తీసుకువెళ్ళేవారు. ఆ పదార్ధాలు చూస్తే తప్ప ఆ నటీమణులకు మూడ్ వచ్చేదికాదు. రా ఫిల్మ్ ఎంత తిన్నా షాట్ ఓకే అయేది కాదు. ఇంతకీ ఆ భోజనాలన్నీ అమ్మగార్ల వెంట వచ్చే అమ్మగార్ల కోసం. అమ్మ ఆనందపడితేనే బేబి ఖుషీ అవుతుంది. ఈలాటి నటీనటులమీద కె.బాలచందర్ మరచిపోలేని బ్రహ్మాండమైన సెటైర్లు రాశారు. సర్వర్ సుందరం సినీమాకోసం. నాగేష్, మనోరమ, ఎస్విరంగారావు ఆ సీన్ లలో అద్భుతంగా జీవించారు.

ఘంటసాల మాస్టారికి అలాటి భేషజాలు ఏవీ ఎప్పుడూలేవు. ఎప్పుడైనా  పిల్లల ముచ్చట తీర్చడం కోసం తీసుకు వచ్చేవారు. బుహారిలో టీ చాలా టేస్ట్ గా వుంటుందని ఆనాటి ప్రతీతి. ఆ రెస్టారెంట్లలో మరో విశేషం ఏమిటంటే, మెడ్రాస్ లో ఆనాడు ఆ హోటల్స్ లో మాత్రమే జూక్ బాక్స్ లుండేవి. పావలాకో పాట. మనకు కావలసిన సినీమా పాటను సెలెక్ట్ చేసుకొని స్లాట్ లో ఒక పావలా బిళ్ళ తోస్తే మనం అడిగిన పాట వినిపిస్తుంది. అయితే మనం కోరిన పాట వెంటనే రాదు. ముందువేసిన పావలాగాళ్ళ పాటలన్నీ వినిపించాక మన పావలా వంతు వస్తుంది, అప్పుడే మనక్కావలసిన పాట విపిస్తుంది. ఈలోగా తాపీగా సమోసాలు (వెజ్/నాన్ వెజ్) స్నాక్స్ తింటూ, స్పెషల్ టీయో, ఫ్రూట్ జ్యూస్ లో సేవిస్తూ, జూక్ బాక్స్ లో ఇతరులు కోరిన పాటలు వింటూ వచ్చీపోయే జనాలను చూస్తూ, కాలక్షేపం చెయ్యొచ్చు. బీచ్ బుహారీ అయితే సముద్రపు గాలి కూడా అదనం. ఫ్రీ.  చాలా సంతోషంగా గడిచేది. ఆ బుహారీ జూక్ బాక్స్ లోనే 'హౌరాబ్రిడ్జ్', 'చైనాటౌన్', 'ఝనక్ ఝనక్ పాయల్ బాజే', 'అవారా', 'మధుమతి' సినీమాలలోని హిట్ పాటలు విన్నాను. నేను కూడా ఒకసారి నా దగ్గర పావలా కాయిన్ లేక క్యాష్ కౌంటర్లో చిల్లర యిచ్చి పావలా నాణెం తీసుకొని 'జిందగీ' సినీమాలోని కె ఎల్ సైగల్ పాట 'సో జా రాజకుమారి సోజా' పాట మీద  (ఏ పాట కోరుకోవాలో తెలియక) మీట నొక్కాను. ఒకపక్క బాబూ వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటారో అని భయం. ఆయనదేమీ గమనించనేలేదు. ప్రశాంతంగా టీ త్రాగుతూ, పెద్దబాబు ఫలూడా తింటూవుంటే  చూస్తూ జూక్ బాక్స్ లో పాటలు వింటూన్నారు. ఎంతకీ నా 'సోజా రాజకుమారి' మాత్రం రాలేదు. ఎక్కడో బజ్జుండిపోయింది. వేరే పాటలు వస్తూన్నాయి. చూసి చూసి విసుగెత్తింది. ఈలోగా వచ్చినపని పూర్తయింది వెళ్ళిపోదామన్నాడు పెద్దబాబు. నేను కోరిన పాట వేయని జూక్ బాక్స్ ను, పోయిన నా పావలాను తల్చుకుంటూ మాస్టారి వెనకాలే వచ్చి కారెక్కాను. పావలా పోతే పోయిందిగానీ ఆనాటి షికారు మరపురాని ఆనందం కలిగించింది. నెం.35, ఉస్మాన్ రోడ్ లో ఇలాటి మధురజ్ఞాపకాలు ఎన్నో.



"గోవిందా! గోవిందా! గోవిందా!" అని త్రిస్థాయిలో ఎవరో మాస్టారింట్లోంచి ముమ్మారు పిలిచారు. గోవిందుడు పలకలేదు. నేను  బయటకు వచ్చి నూతి దగ్గర చూశాను. అక్కడలేడు. పోర్టికోలో చూశాను అక్కడా లేడు. గేట్ తెరచి బయటకు వెళ్ళి చూస్తే నోట్లో బీడీ, చేతిలో రోస్ కలర్ పాకెట్ సైజ్ పుస్తకంతో ఎదురింటి నామగిరి డాక్టరమ్మ ఇంటికి వచ్చిన రిక్షావాడితో మాట్లాడుతున్నాడు. ఆ రిక్షావాడి చేతిలో కూడా పసుపు, ఆకుపచ్చ రంగు కాగితాలున్నాయి. విషయం అర్ధమయింది. ఈ సమయంలో అయ్యగారు, అమ్మగారే కాదు సాక్షాత్తు తిరుపతి గోవిందరాజులే వచ్చి పిలిచినా ఈ గోవిందుడి చెవినపడదు. నేను వెళ్ళి "ఇంట్లో పిలుస్తున్నారని" చెప్పాను. వెంటనే, నోట్లో బీడీ క్రిందపడేసి, చేతిలోని పుస్తకం, రంగు కాగితాలు లుంగీలోని
నిక్కర్ జేబులోకి త్రోసేసి, ఆ రిక్షావాడిని అక్కడే వుండమని చెప్పి ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ గోవిందు ఘంటసాల వేంకటేశ్వర్లువారి  రథసారధి (కారు డ్రైవర్). మేము మెడ్రాస్ వెళ్ళినప్పటినుండి మాస్టారింట్లో అతనే కారు డ్రైవర్. చూడడానికి చాలా సామాన్యంగా వుంటాడు. కాకీ నిక్కర్, పైన తెల్ల లుంగీ చుట్టుకొని, తెల్లచొక్కాతో వచ్చేవాడు. మాస్టారు రిహార్సల్స్ కు వెళ్ళినా, రికార్డింగ్ లకు వెళ్ళినా, బయట షికార్ల కు వెళ్ళినా, అమ్మగారు షాపింగ్ లకు వెళ్ళాలన్నా, పిల్లలను స్కూలుకు తీసుకు వెళ్ళాలన్నా గోవిందుడు ఉండాల్సిందే. ఉదయం ఎనిమిది గంటలనుండి రాత్రి వరకూ మాస్టారింట్లోనే ఉండేవాడు. రాత్రి ఒకసారి నెం. 35, ఉస్మాన్ రోడ్ ను వదలి వెళ్ళాడంటే అతని లోకమేవేరు. బ్రహ్మాది రుద్రులు వచ్చినా ఈ గోవిందుడితో ఏ పని చేయించలేరు. ఎందువల్లో వేరే చెప్పక్కర్లేదుగా! ఈ గోవిందు గ్రిఫిత్ రోడ్ (ఇప్పుడు సుప్రసిధ్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు "మహారాజపురం సంతానం" రోడ్ గా మారింది) లో 'శ్రీకృష్ణగాన సభ' పక్కనున్న వాసన్ స్ట్రీట్ చివర కోడంబాక్కం స్టేషన్ కు వెళ్ళే త్రోవలో చిన్న(రైల్వే)గేట్ దగ్గర గుడిసెల ఇళ్ళుండేవి (రాజపిళ్ళైతోట్టం స్లం) అక్కడ ఒక గుడిసెలో గోవిందుడి  కుటుంబం ఉండేది. ముగ్గురో నలుగురో  సంతానం. సరిగా తెలియదు. ఆనాటికి అంతా చిన్నపిల్లలే. డ్రైవర్ గోవింద్ చాలా మంచివాడు, నమ్మకస్తుడు. కానీ అతనికి సరైన చదువు సంధ్యలు లేక కొన్ని దుర్గుణాలకు అలవాటు పడ్డాడు. అందులో ఒకటి గుర్రపుపందేలు. ఆ సీజన్ లో శని ఆదివారాలు వస్తే చాలు, సమయం చూసుకొని గిండీ రేస్ కోర్స్ కు పరిగెత్తేవాడు. ఎప్పుడు చూసినా కారు గేర్ బాక్స్ లో తెలుపు, ఎరుపు, పసుపు, పచ్చ‌, నీలం అంటూ రంగు రంగుల అట్టలున్న పాకెట్ సైజ్ పుస్తకాలు పడివుండేవి. ఒక్క కారు డ్రైవింగ్ చేసే సమయంలో తప్ప మిగిలిన సమయాలలో పోర్టికో అరుగుమీద కూర్చొని ఆ విజ్ఞాన గ్రంధాలను తిరగేస్తూండేవాడు. వాటిలో  పందెపు గుర్రాల పేర్లు, వాటిని స్వారీ చేసే జాకీల పేర్లు, గుర్రాలు, జాకీల వయసు, వాళ్ళ యజమానులు, ఏ ఏ గుర్రం ఎన్నిసార్లు గెలిచిందో, ఇత్యాది వివరాలన్నీ వుండేవి. వీటన్నిటినీ క్షుణంగా అధ్యయనం చేసి, నాయర్ టీ కొట్టుదగ్గరున్న రిక్షా వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి ఆ గుర్రాలమీద కాచేవాడు. ఎప్పుడైనా నాలుగు డబ్బులు కంటబడితే జాక్పాట్ కూడా ఆడేవాడు. జాక్పాట్ కొడితే దశ తిరిగిపోతుందని ఆశ. గుర్రపందాలలో పోవడమేగానీ, వచ్చి బాగుపడడమనేది పచ్చి కల్ల. ఒక వారం రేసుల్లో ఎవరైనా ఒక వంద గెలిస్తే అంతకుముందే మరెన్నో వందలు, వేలు పోగొట్టుకున్నారని అర్ధం.  "ఒక్క లెగ్ లో జాక్పాట్ మిస్సయిందనే" మాట ఎంతోమంది నోట విన్నాను. ఆ మాటలో నిజం వుండదు. ఐదు లెగ్ లలో బెట్ కాచేప్పుడు ఐదింటి మీది గుర్రాలు గెలిస్తే వాటిమీద డబ్బు కాచిన వాళ్ళకు లక్షల్లో డబ్బు వస్తుంది.  ఈ ఐదింటిలో ఒకటి పోయి మిగిలిన నాలుగూ గెలిచినా పెద్ద మొత్తమే లభిస్తుంది. కానీ అలా జరగదు. వీళ్ళు పందెం కాచిన గుర్రాల్లో ఒకటో, రెండో మాత్రమే ముందుంటాయి. ఈ వ్యవహారం అంతా అర్ధం కావాలంటే మహాశ్వసాగర మథనం చేయాల్సిందే. రేసులకు సంబంధించిన వివరాలన్నీ 'ది హిందూ', 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్, 'దినత్తన్ ది' వంటి దిన పత్రికల క్రీడారంగం కాలమ్స్ లో వేసేవారు. అలాటి వార్తల్లో 'బొబ్బిలి ప్లేట్' 'వెంకటగిరి ప్లేట్' అంటూ కొన్ని తెలుగు వాళ్ళ పేర్లు కనపడేవి.  ఆరోజుల్లో ఈ గుర్రపందేల వ్యసనం సినీమావాళ్ళలో కూడా చాలా ఎక్కువగానే వుండేది. దీన్ని ఆధారం చేసుకొని తమ జీవనాన్ని వెళ్ళబుచ్చుకున్నవారు ఉండేవారు. మద్రాస్ టి.నగర్, విజయరాఘవాచారి రోడ్  లో "ఆంధ్రా సోషల్ & కల్చరల్ క్లబ్"లో తెలుగు సినీమా ప్రముఖులెందరో సభ్యులు. టెన్నీస్, ఛెస్  ప్రాక్టీస్ లతోపాటూ  పేకాటలు జోరుగా సాగేవి. గుమ్మడి, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు వంటి నటులెందరో అక్కడ కనిపించేవారు. చాలా పెద్ద ఎత్తునే డబ్బు చేతులు మారేది. అక్కడికి వచ్చేవారిలో చాలామందికి గుర్రపందేలాట మీద కూడా వ్యామోహం వుండేది. ఎవరికి తగ్గ స్థాయిలో వారు డబ్బు పోగొట్టుకునేవారు. అప్పుడప్పుడు కంటితుడుపుగా కొన్ని వందలు గెలిచేవారు. ఈ హార్స్ రేసుల మీద వాటిలో పాల్గొనే గుర్రాలు, జాకీల మీద నిత్యాధ్యాయనంతో పరిశోధనలు చేసి ఇతరులకు టిప్స్ ఇచ్చే నటుడు ఒకాయన వుండేవారు. ఆయన ఘంటసాల మాస్టారు తీసిన  ఒక సినీమాలో కూడా నటించారు(?) మంచి అందగాడు. చక్కగా నటిస్తాడనే పేరు తెచ్చుకున్నవాడు. తెలుగు సినీమాలలో హీరోగా ఒక  వెలుగు వెలిగి ఆరిపోయాడు. జీవనమే కష్టమైపోయింది. చదువుకున్నవాడు కావడం వలన కొంతమంది సినీ ప్రముఖుల పిల్లలకు ట్యూషన్లు చెప్పుకోవడంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అలాటి నటుడు ఈ గుర్రపందేలకు సంబంధించి ఇతరులకు టిప్స్ ఇస్తూ వారిచ్చే పది, పాతికలతో కాలం గడిపేవాడు. 1965లు వచ్చేసరికి ఆ నటుడికి వేషాలు ఇచ్చే నిర్మాతే కరువయ్యాడు. సావిత్రి, కృష్ణకుమారిల పక్కన హీరోగా నటించిన ఆ నటుడిని జనాలు మర్చిపోయారు.

సినీమారంగం పూలపాన్పు కాదు. ముళ్ళమయం. అదృష్టం అందరినీ వరించదు. అలా వరిస్తే, తెలివైనవారు, విజ్ఞత కలిగినవారైతే తమకు కలిసొచ్చిన అదృష్టానికి తమ కృషిని, ప్రతిభను జోడించి ముందుకు దూసుకుపోతారు. అలాటివారిని వేళ్ళతో లెఖ్ఖపెట్టవచ్చును. ఇదొక వ్యామోహాల పుట్ట. సినీమా రంగానికి చెందిన ఎంతోమంది జూదం, త్రాగుడు, గుర్రపందేల వంటి వ్యసనాలతో   పూర్తిగా రోడ్ న పడ్డారు. అయినా షో నడుస్తూనేవుంది.

అయితే, ఈ వ్యసనపరులు ఇతర రంగాల్లోమాత్రం లేరా? వున్నారు. అయితే మనకు తెలిసే అవకాశం తక్కువ. అదే సినీమారంగానికి చెందినవారైతే వార్త గుప్పుమంటుంది. 

మని+షి =మనిషి అని ఒకరు నిర్వచించారు.ఈ రెంటికీ బానిస కానంతవరకే మనిషి. మని మత్తుకు, మదిర మత్తుకు, మగువ మత్తుకు అలవాటుపడితే అధఃపతనమే. ఈ మూడు 'మ'మ కారాలకు దూరంగా వుండగలిగినవాడు ధన్యజీవి. కానీ ఈలోకంలో పరిపూర్ణ పురుషులంటూ ఎవరూ లేరు. మనకు తెలియని, మనం చూడలేని పరమాత్మ తప్ప. అందరూ  ఏవో రకమైన బలహీనలతో బ్రతికేవారే. కాకపోతే హిపొక్రసితో ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూంటారు. అంతే.

మన  చుట్టు వున్న సాంఘిక వాతావరణం ఎలావుంటుందో, మనకి జీవితంలో ఎన్ని రకాల మనుషులు తారసపడతారో అర్ధం చేసుకోవడానికి నెం.35, ఉస్మాన్ రోడ్ కొంత దోహదపడుతుందని భావిస్తున్నాను.

ఘంటసాలవారి కారు డ్రైవర్ గా గోవింద్ చాలా రకాల కార్లనే తోలాడు. మేము మెడ్రాస్ వెళ్ళేనాటికి మాస్టారింట్లో మూడు కార్లుండేవి ఒకటి వాక్సాల్ ముదురాకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగుల్లో వుండేది. దాని నెంబర్ MSZ 4997. మరొకటి ముదురాకు పచ్చ మారీస్ మైనర్. 




మరొకటి నల్లరంగు నాష్ కారు. సొంత సినీమా నిర్మాణం జరిగినంతకాలం ఈ మూడు కార్లు వుండేవి. ఇవి చాలక వ్యాన్లూ అద్దెకు తీసుకునేవారు. కొన్నాళ్ళకు వాక్సాల్ కారు అమ్మేసి హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళదే 'ల్యాండ్ మాస్టర్' నల్ల రంగు కారు కొన్నారు. (ఆ తరవాత రెండు అంబాసడర్ లు ఒకదాని తరవాత ఒకటి వచ్చేయి. అందులో ఒకటి పచ్చరంగు MSS 1130. తరవాతది లైట్ బ్లూ కలర్ MSW 8929 అని గుర్తు. అదే 35, ఉస్మాన్ రోడ్ పోర్టికోలో దర్శనమిచ్చిన ఆఖరి కారు). లాండ్ మాస్టర్ అప్పట్లో కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. ఏదో దసరా పండగల సమయంలో ఇంటికి వచ్చింది. ఆ కారుకు పూజచేసి పూలదండలు వేసి కారంతా గంధం, కుంకుమలు చిలకరించి, నాలుగు టైర్ల క్రిందా నాలుగు నిమ్మకాయలు పెట్టి, హారతినివ్వడం నాకు వింతగా, ఆనందంగా అనిపించింది. ఆ కార్యక్రమం అంతా అయ్యాక ఒక రౌండ్ కొట్టివద్దామని బయల్దేరారు.  పెద్దబాబు, నేనూ కూడా వున్నాము. ఇంటిబయటకు వచ్చి ఎడమప్రక్కకు తిరిగి ఉస్మాన్ రోడ్ మీదుగా బజుల్లా రోడ్, వాణీమహల్, డా. నాయర్ రోడ్ లోనుండి పాండీబజర్  వచ్చేప్పటికి వర్షం మొదలయింది. అక్కడనుండి పానగల్ పార్క్ మీదుగా ఉస్మాన్ రోడ్ ఇంటికి చేరేప్పటికి వర్షం ఎక్కువయింది. కొత్తకారుకు అద్దిన చందనమంతా కరిగిపోయింది.  ఆ సమయంలో కారు డ్రైవ్ చేసినది గోవింద్ కాదు. జివిఎస్ ప్రొడక్షన్స్ మేనేజర్ సుబ్బు (సుబ్బారావు). మాస్టారింటి కుటుంబ సభ్యుడిలా మసిలేవారు. ఈయన సుందర్లాల్ నహతాగారి సినీమా కంపెనీల ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు. 

మాస్టారింట్లో ఎవరికీ డ్రైవింగ్ రాదు. సావిత్రమ్మగారికి నేర్చుకోవాలనే కుతూహలం వుండేది. ఆ క్రమంలో డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలెట్టిన మూడో రోజునో, నాల్గవరోజునో కారును ఇంటిగేట్ గోడకు (మెల్లగానే అనుకోండి) గుద్దించేయడంతో కారు డ్రైవింగ్ శిక్షణకు మంగళం పాడడం జరిగింది. అయితే దానివలన ప్రమాదమేమీ జరగలేదు. పిల్లలలో పెద్దబాబు, చిన్నబాబు పెద్దయ్యాక కారు డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఈ నల్ల ల్యాండ్ మాస్టర్ కి ముందు నుండి దాహమెక్కువ. ఎంత పెట్రోల్ పోసినా చాలేదికాదు. మాన్యూఫాక్చరింగ్ లోనే లోపం అని అనుకునేవారు. మాస్టారికి అలవాటైన పెట్రోల్ బంక్ వాణీమహల్ ఎదురుగా వున్న 'గోపాలకృష్ణ ఆటోమొబైల్  సర్వీస్'. పెట్రోల్ పోయించాలన్నా, కారు సర్వీసింగ్ చేయాలన్నా అక్కడే. ఇప్పటికీ ఆ పెట్రోల్ బంక్ అక్కడేవుంది. ఈ కారు ఎక్కువ కాలం లేదు. ఈ కారు ఎక్కిన కొత్త రోజుల్లో నాకు వింతగా అనిపించింది, అంతకుముందు ఎరుగనిది ఒకటి ఉండేది. రోడ్ మీద వెడుతున్నప్పుడు కుడి, ఎడమల వేపు తిరిగేప్పుడు ఒక స్విచ్ నొక్కితే  ఆటోమెటిక్ గా కారు బయట రెండు డోర్ల మధ్య ఒక ఇండికేటర్ లో లైట్ వెలుగుతూ ఠక్ అని బయటకు వచ్చేది. ఈ ఇండికేటర్ రెండు పక్కలా ముందు వెనక డోర్ల మధ్య వుండేది. పక్కలకు తిరిగేప్పుడు చెయ్యి బయటపెట్టి చూపించక్కరలేదు. కానీ డ్రైవర్ గోవిందు ఆ ఇండికేటర్లను ఉపయోగించేవాడు కాదు. అది నాకు పెద్ద కొరతగా వుండేది. అందువల్ల ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోతుందని భయపడుతూ వుండేవాడిని. అలాగే కారు ముందువేపున్న రెండు లైట్లకి సగానికి పైగా నల్లటి పెయింట్ విధిగా అన్నికార్లకు పూసేవారు. అది ట్రాఫిక్ రూల్. కొన్నాళ్ళకు అదిపోయి మధ్యలో బల్బ్ దగ్గర పెద్ద బొట్టు పెట్టడం మొదలెట్టారు. రాత్రిపూట ప్రయాణం చేసేప్పుడు ఎదురుకార్లు హెడ్ లైట్స్ వేయకూడదు. ఎదురుగా వచ్చే కారును గమనిస్తూ లైట్లను ఆన్ ఆఫ్ చేస్తూ డ్రైవ్ చేయాలి. ఇప్పుడెవరూ ఏ ట్రాఫిక్ రూల్స్ ను సక్రమంగా పాటించనే పాటించరు. అందుకే అధికశాతం లారీ, బస్, కారు, మోటర్ సైకిల్ ఆక్సిడెంట్లు రాత్రిపూటే జరుగుతాయి. మనలో హక్కుల గురించి అథార్టీగా మాట్లాడేవారేతప్ప పాటించవలసిన విధులగురించి పట్టించుకోరు. అది తమకోసం కాదన్నట్లుంటారు.

ఇంతలో హిందుస్థాన్ మోటార్స్ ల్యాండ్ మాస్టర్ ను మాడిఫై చేసి 'అంబాసిడర్' మోడల్ ను మార్కెట్లోకి పెట్టారు. అప్పట్లో రంగుల కార్లు ఎక్కువగా ఉండేవి కావు. నలుపు, తెలుపు కార్లు మాత్రమే. అలాటి సమయంలో అంబాసిడర్ లో రంగు రంగులవి వచ్చేయి. మాస్టారు ల్యాండ్ మాస్టర్ ను మార్చి అంబాసిడర్ కొన్నారు. దాని నెంబర్ MSS 1130. లేత ఆకుపచ్చలో తెలుపు మిక్స్ చేస్తే వచ్చే రంగు. చాలా ఆకర్షణగా వుండేది. ఆ రంగు కార్లు చాలా తక్కువగా ఉండేవి. కొన్నేళ్ళ తరువాత ఆ కారు మార్చి మరొకటి తీసుకున్నారు. ఆ రోజుల్లోని బ్యూక్, ఛెవర్లెట్, కాడిలాక్, డాడ్జ్, ప్లిమత్ వంటి స్కై బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ కార్లు సావిత్రి, సరోజాదేవి, ఎన్టీఆర్, ఎఎన్నార్, భానుమతి, దేవిక, శివాజీ, ఎమ్జీయార్, ఎమ్ ఆర్ రాధా, జెపి చంద్రబాబు (తమిళం కమేడియన్) వంటి ప్రముఖుల దగ్గరవుండేవి. కానీ అన్నిటికంటే అన్ని కాలాలకు, అన్ని వర్గాలకు సౌకర్యంగా వుండేది అంబాసిడర్ ఒక్కటే అని అనుకునేవారు. నిన్న మొన్నటివరకు అంబాసిడర్ కార్లే ఎక్కువగా ఉండేవి. దీనితోపాటు ఆస్టిన్ ఇంగ్లండ్, ఆస్టిన్ ఇండియా, స్టాండర్డ్ ఫియట్ కార్లు  కూడా చాలా పాప్యులర్ గా, రోడ్లమీద ఎక్కువగా కనపడేవి. ఈ ఫియట్ కారే తర్వాత ప్రిమియర్ పద్మినీగా రూపాంతరం చెందింది. మరోటి ఆరోజుల్లో అరుదుగా కనిపించే కారు హెరాల్డ్ (గుండమ్మ కధలో NTR డ్రైవ్ చేసేది).

కారు డ్రైవింగ్ విషయంలో నటి సావిత్రి చాలా రాష్ డ్రైవర్ అని పేరు. విపరీతమైన స్పీడ్ తో కారు నడిపేది. స్పీడ్ గా వెళ్ళనప్పుడు కారెందుకు అనేది ఆవిడ తత్త్వం. సావిత్రి షోలవరం కారు రేసుల్లో కూడా పాల్గొనేదని ఆనాటి పత్రికలలో చదివాను. సావిత్రికి పూర్తి విరుధ్ధం ఒక తమిళ విలన్ కమేడియన్. ఆయన మహా శృంగారపురుషుడు. అతనికి ఎంతమంది భార్యలు, ఎంతమంది ఉంపుడుగత్తెలు, ఎంతమంది పిల్లలున్నారో అతనికే తెలియదట. ఆ నటుడి గురించి జోక్ చెప్పుకునేవారు. కోడంబాక్కం రోడ్ల మీద ఇరవైమైళ్ళ స్పీడ్ కన్నా కారును తోలద్దని డ్రైవర్ కు చెప్పేవాడట. ఎందుకంటే ఆ రోడ్లమీద కార్లకు అడ్డంబడి ఆడుకునే చిన్న పిల్లలలో తన సంతానం కూడా వుంటుందేమోనని అతని భయమట. ఆయన పిల్లలు చాలామంది తమిళ సినీమాలలో, టివి సీరియల్స్ లో ఇంకా నటిస్తూనే వున్నారు.

ఘంటసాల వారింట పనిచేసినవారంతా మొదట్నించీ చివరి వరకూ  వారితో కలసి జీవితంలో ప్రయాణం సాగించినవారే. అలాటివారిలో ఈ గోవింద్ కూడా ఒకడు. నాకు తెలిసి అతనివల్ల ఒక్కసారి కూడా ఏ విధమైన కారు ప్రమాదం జరగలేదు. అంత జాగ్రత్తగా కారు నడిపేవాడు. బయట వూళ్ళకు రాత్రి ప్రయాణాలు చేసేప్పుడు  బయల్దేరే ముందే హెచ్చరిక చేసేవాడు, నిద్రపోయేవాళ్ళు వెనక సీట్లో కూర్చోమని, తన పక్కన వద్దని. తన పక్కన ఏదో మాట్లాడుతూ నిద్రకు జోగనివాళ్ళనే కూర్చోమనేవాడు. నిద్రపోయేవాళ్ళు పక్కనుంటే తనకు  తెలియకుండానే కళ్ళుమూతలు పడతాయనేవాడు. అలాటి డ్రైవర్ డ్రైవ్ చేస్తున్న కారు ఒకసారి బెంగుళూర్ నుండి వస్తూ ప్రమాదానికి గురయిందని అందులో ప్రయాణం చేస్తున్న ఘంటసాల సోదరులకు తీవ్రగాయాలయ్యాయని చాలా ప్రమాదకర పరిస్థితిలో వున్నారని ఒక  తమిళపత్రికలో ప్రచురించినట్లుగా వార్త వచ్చింది. ఇంట్లో అందరూ చాలా ఆందోళన చెందారు. ఇప్పటిలా అప్పుడు టెలిఫోన్లు, సెల్ ఫోన్లు లేవు. బయటకు వెళ్ళిన మనిషి క్షేమంగా తిరిగివస్తేనే తెలిసేది. ఈ వార్త వచ్చిన కొన్ని గంటల తర్వాత మాస్టారు, తమ్ముడు-తాత (సదాశివుడు) క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఎక్కడా ఏ కారు ప్రమాదమూ జరగలేదు. ఆ వార్త ఒట్టి వదంతి మాత్రమే. ఈ న్యూస్ ను వేసింది 'హిందూనేశన్' అనే 1940లనాటి ఒక Yellow Journal. (ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చే అధిక సంఖ్యాకం ఇలాటివే) ఇందుకు కారణం, ఏదో రకమైన సెన్సేషనల్ న్యూస్ ను ఆదరించే పాఠకులే. అటువంటి వార్తలు రాసే ఆ పత్రిక ఎడిటర్ చివరకి హత్యకి గురవడం ఒక సంచలనం అయితే ఆ హత్య కేసులో తగులుకున్నతమిళ సినిమా ప్రముఖుల్లో ఒకరు ఆనాటి తమిళ సినిమా సూపర్ స్టార్ అవడం మరో సంచలనం.


ఘంటసాల మాస్టారు 1959 లో మరో సినీమా తీయడానికి సన్నాహం మొదలుపెట్టారు. ఈ సినీమాల నిర్మాణానికి మొదటినుండి శ్రీమతి సావిత్రమ్మగారు వ్యతిరేకించినట్లుగా ఆవిడ మాటలద్వారా అర్ధమయేది. విధి బలీయం అంటారు కదా! మరో సినీమా ప్రారంభమయింది.

విశేషాలు వచ్చేవారం...
                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, January 16, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదిహేనవ భాగం

16.01.2021 -  శనివారం భాగం- 15*:
అధ్యాయం 2 భాగం 14 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

అందరికీ పండుగానంతరం చెబుతున్న మకర సంక్రమణ శుభాకాంక్షలు.

దీపావళీ  వచ్చి వెళ్ళిన తరువాత వచ్చే మరో పెద్ద పండగ మకర సంక్రాంతి. నాలుగురోజుల పండగ. ధనుర్మాస కాలం ప్రారంభమైన దగ్గరనుండే తెల్లవారుజామునే పక్కనే ఉన్న 'దరుమపురి ఆదీన మడం' (ధర్మపురి ఆధీన మఠం)లో నుండి, కొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడులనుండి భక్తిగీతాలు గాలిలోనుండి తేలివచ్చి మమ్మల్ని మేల్కొలిపేవి. మెడ్రాస్ కు చలికాలంలేదు. రెండే కాలాలు. వేసవికాలం, వర్షాకాలం. అయినా ఉదయాన్నే సముద్రపుగాలి చలి చలిగా గిలిగింతలు పెట్టేది. అప్పట్లో ఇంత జనసముద్రం, వాతావరణ కాలుష్యం లేని రోజులు కదా.

మహానగరం కావడంవలన రోడ్లమీద సంక్రాంతి ముగ్గుల హడావుడి ఎక్కువ కనపడేది కాదు. ఎవరింటి వాకిట్లో వారు ముగ్గులు పెట్టుకునేవారు. మాంబళం శివ విష్ణు ఆలయం, మైలాపూర్ కపాలేశ్వరాలయం, ట్రిప్లికేన్ పార్ధసారధి, విల్లివాక్కం దామోదరస్వామి, ఇతర ప్రముఖ ఆలయ ప్రాంతాల  మాడ వీధులలోని స్త్రీలంతా చూడముచ్చటైన ముగ్గులు, వాటిమధ్య రకరకాల పువ్వులతో గొబ్బెళ్ళుతో అలంకరించేవారు. బోగి(భోగీ), పొంగల్(సంక్రాంతి), మాట్టు పొంగల్(కనుమ). ఆ మర్నాడు ముక్కనుమను ఉழవర్  తిర్నాళ్ గా పండుగ చేసుకుంటారు. ఉழవర్ అంటే కర్షకులు. రైతులు, వ్యవసాయదారుల కృషిని గుర్తిస్తూ నాలుగో రోజు ఊరు వాడా అంతా కలిసి సమష్ఠిగా చేసుకునే పండుగ రోజు.  ఈ నాలుగు రోజులూ ఊరంతా ఆనందోత్సాహాలతో సందడే సందడి. 

మకర సంక్రాంతి పండగ అంటేనే వ్యవసాయదారులకు, పశువులకు సంబంధించిన పండగ. ఈ పండగ విశేషాలన్నీ మన పాత తెలుగు సినీమాలెన్నిటిలోనో చూశాము. భోగీనాడు ఉదయాన్నే భోగీ పిడకల తోరణంతో, లేదా ఎవరిళ్ళనుండో దొంగతనంగా ఎత్తుకొచ్చిన పాత తలుపులు, విరిగిపోయిన కిటికీలు, కట్టెలతో భోగి మంటలు వేయడం మా ఊళ్ళలో రివాజు. కానీ మెడ్రాస్ లో రోడ్లమీద భోగీమంటల నిషేధం వుండేది. పైగా పేడ గొబ్బిళ్ళ పిడకలు తట్టేంత అవకాశం నగరవాసులకు వుండేది కాదు. అందువల్ల పాత రబ్బర్ టైర్లు, ట్యూబులు, చిత్తు పుస్తకాలు వారి వారి ఇళ్ళలోనే మంటపెట్టి ఆనందించేవారు. ఈ రకమైన చర్యలవలన కాలుష్యం పెరగడం తప్ప మరే విశిష్టత లేదు. ఈ నాలుగురోజుల పొంగల్ పండగలకు ప్రభుత్వపరమైన ఆశీస్సులు వున్నాయి. ఈ రోజుల్లోనే తిరువళ్ళువర్, అంబేద్కర్ ల జయంతులని కూడా పురస్కరించుకుని అదనంగా చేర్చి సభలు, సమావేశాలు, కవితాగోష్టులంటూ ప్రజలను మరింత చైతన్యవంతం చేయడం జరుగుతూంటుంది. 

పొంగల్ వస్తోందంటే మూర్ మార్కెట్ పక్కనున్న కన్నప్పర్ తిడల్ లోని SIAA గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ లు ప్రారంభమయేవి. అలాగే సర్కస్ కంపెనీల డేరాలు వెలిసేవి. ఒక ఏడాది కమలా త్రీ రింగ్ సర్కస్ మెడ్రాస్ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఆ సర్కస్ ఆడిన రోజుల్లో రాత్రిపూట సెర్చ్ లైట్లతో ఊరంతటిని హడలుగొట్టారు. వున్నట్టుండి లైట్ వెలుగు పడి మాయమయేది. మళ్ళీ రెండు మూడు నిముషాలకు కనపడేది.  ఆ దీపపు వెలుగు ఎక్కడో వున్న మా టి నగర్ ఇళ్ళలో కూడా  పడేది. అదేమిటో తెలియక జనాలు మొదట్లో కంగారు పడ్డారు. తర్వాత తెలిసింది అది 'కమలా త్రీ రింగ్ సర్కస్' వాళ్ళ ప్రచార సాధనమని. భారీ ఎత్తున అనేక ఆకర్షణలు కలిగిన ఆ సర్కస్ నేనూ చూశాను.

డైరీ మిల్క్, బాటిల్డ్ మిల్క్ సంస్కృతి రాకముందు 35, ఉస్మాన్ రోడ్ కి ఆవుపాలు, గేదెపాల సరఫరావుండేది. ఉదయమో, రాత్రో ఆ పశువులను ఇంటికి తీసుకువచ్చి పాలు పితికి ఇచ్చేవారు. ఆ పాలు పితికి పోసే ఆర్ముగం మహా మాయలోడు. ఒక పొడుగాటి గొట్టంలాటి స్టీల్ లేదా ఇత్తడి పాత్రలో పాలు పితికేవాడు. ఆవుపొదుగులు కడగడానికి ఆ పాత్రలో నీరు తెచ్చేవాడు. కడగడం అయ్యాక పాలు తీసేముందు "అమ్మగారు చూసుకోండి" అంటూ ఆ పాత్రను బోర్లించి తిప్పేసేవాడు. పక్కనే అమ్మగారో, తమ్ముడు కృష్ణో(గుండు మావయ్య) ఉంటే తీసిన పాలు చిక్కగావుండేవి. దగ్గరలో ఎవరూ లేకపోతే ఆ పాత్రలో నీళ్ళు అలాగే వుండేవి. పాలు నీళ్ళలాగే వుండేవి. ఈ మాయాజాలం అందరికీ ఎరికే. చీవాట్లు పెట్టడమూ జరిగేది. ఆ పాలవాడు కుంటిసాకులూ సాగేవి. మాట్టు పొంగల్ రోజున ఆ ఆవులను బాగా అలంకరించి మాస్టారింటికి తీసుకువచ్చేవాడు. ఆవుమీద భక్తికాదు. పండగ ఈనాముల కోసం. ఆవుల ఒళ్ళంతా పసుపు పూసి కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరణ చేసేవాడు. ఆవుల కొమ్ములు, కాలిగిట్టలకు రంగు పెయింట్లు వేసేవారు. ఆయా పాలవాళ్ళు ఏ రాజకీయ పార్టీ అనుయాయులైతే ఆ పార్టీ రంగులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోనూ లేదా ఎరుపు, నలుపు రంగుల్లోను ఆ పశువుల కొమ్ములు మెరుస్తూండేవి. ఆ రెండు కొమ్ముల చివర మువ్వలు కట్టేవారు. అవి తల ఆడించినప్పుడల్లా గలగలాడుతూ చూడముచ్చటగా వుండేది. బేటరీతో వెలిగే చిన్న చిన్న బల్బులూ తగిలించేవారు.  అమ్మగారు ఆ పశువులకు ఓ చిన్న పూజలాటిది జరిపి ఆ పాలవాడికి పొంగల్ ఇనాము ఇచ్చిపంపేవారు. 

పొంగల్ రోజుల్లో పానగల్ పార్క్ మార్కెట్, పాండీబజార్ మార్కెట్, రంగనాధన్ స్ట్రీట్ బజార్లో అన్ని షాపులు కళకళలాడుతూ వుండేవి. రకరకాల పువ్వుల దుకాణాలు, పళ్ళదుకాణాలు, పసుపు కొమ్మలు, పొడుగాడి చెరుకుగడలు, మురియులు(మరమరాలు) కొనుక్కొని పట్టుకెళ్ళే పిల్లలు పెద్దలతో కాలుపెట్టే సందులేకుండా వుండేది.

ఉழవర్ తిరునాళ్ రోజున ఊరిజనమంతా మెడ్రాస్ మెరీనా బీచ్ లోనే కాపురం. ఎక్కడెక్కడినుండో ప్రత్యేక బస్సుల్లో తండోపతండాలుగా కుటుంబాలతో సహా వచ్చి బీచ్ లో ఆటపాటలతో ఆనందంగా గడిపేవారు.
 
పొంగల్ వస్తోందంటే కొత్త సినిమాలకు కొదవలేదు. పోటాపోటీగా సినీమాలను వదిలేవారు. రోజుకు నాలుగైదు ఆటలతో పొంగల్ వారంరోజులు అన్ని ధియేటర్లు కళకళలాడుతూ కోలాహలంగా వుండేవి. ఏ సినీమాకైనా కలెక్షన్లు కనిపించేవి. రెండోవారం నుండి ట్రెండ్ మారేదనుకోండి అది వేరే విషయం. దీపావళీ, పొంగల్ పండగలొస్తే ఎమ్.జి.ఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎస్.ఎస్.రాజేంద్రన్ల సినీమాలు తప్పనిసరిగా విడుదల చేసేవారు.  అవి కూడా పక్క పక్క ధియేటర్లలో వేసేవారు. ఆయా థియేటర్ల దగ్గర పండగ వాతావరణంతో పాటు యుధ్ధవాతావరణమూ కనిపించేది. బుధ్ధున్నవాడెవడూ పండగల రోజులలో సినిమాకు వెళ్ళడనుకునేవాళ్ళం. మెడ్రాస్ లో కేవలం ఎమ్జీయార్ సినీమాలు మాత్రమే ఆడే ధియేటర్లు కొన్నయితే, శివాజీ సినీమాలు తప్ప వేయని సినిమా హాల్స్ మరికొన్ని ఉండేవి. జెమినీ గణేశన్ ను 'సాంబార్ హీరో పడమ్(సినీమా)' అని ఎగతాళి చేసేవారు. కానీ, ఆ సాంబార్ హీరో ఏక్ట్ చేసిన మాయాబజార్, తేన్ నిలవు,  కళ్యాణ పరిసు(పెళ్ళికానుక), కొంజుం సలంగై(మురిపించే మువ్వలు), 'వంజికోట్టై వాలిబన్', 'రాము', 'కర్పగం'(తోడు నీడ) వంటి చిత్రాలెన్నో తమిళనాడులో, సిలోన్, మలేషియా  వంటి విదేశాలలో సైతం సంచలనం సృష్టించాయి.

ఇలాటి పండగ సీజన్లలోనే ఒక సంవత్సరం మెడ్రాస్ కు ఒక కొత్తరకం సినీమా వచ్చింది. ఆ సినీమాను చూడ్డానికి ఆడమగా, పిల్లజెల్లా, ముసలిముతక, చిన్నాచితక అందరూ తండోపతండాలుగా ఎగబడి ఆ సినీమాను చూసారు. మేము ఆ సినీమా ఆ వూరు వదలి వెళ్ళిపోవడానికి ముందు వెళ్ళి చూసివచ్చాము. 'సర్కరామ' అనే ఆ సినీమాను మనవాళ్ళు 'సర్కారమా' అనో 'సర్కారామా' అనో అనేవారు. Circle Vision. Panorama లాగా Circlerama. ఆ సినీమా విశేషం ఏమంటే ఆ సినీమాను నిల్చునే చూడాలి. కూర్చుండ కుర్చీలుండవుగా. 

  

సినీమాను వెయ్యడానికి ప్రొజెక్టర్లు కనపడేవి కావు. ఒక్కొక్క ఆటకు నూరు, నూటయాభైమంది లోపలే జనాలను వదిలేవారు. ఆ సినీమా హాలు పెర్మనెంట్ కాదు. ఒక గుడారంలో ఆ సినీమా. సన్ ధియేటర్ పక్కనే వున్న విశాలమైన కాంగ్రెస్ గ్రౌండ్స్ లో ఈ సర్కారమ సినీమా ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. సినీమా మొదలవగానే గుడారంలోపల అన్ని దిక్కులనుండి సినీమా పెద్ద పెద్ద తెరలమీద బ్రహ్మాండమైన సౌండ్ తో  కనిపించింది. ఆ సినీమా కధాంశం గుర్తులేదు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా, నోళ్ళు తెరచి చూశారు. తరువాతి రోజుల్లో సినీమా టెక్నాలజీ పెరిగి బిర్లా ప్లానెటోరియా, 70 mm స్క్రీన్ లు వచ్చాక అలాటి వింతలెన్నో సర్వసాధారణం అయాయనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ నాటికి 'సర్కరామ' ఒక గొప్ప అనుభవం. 

మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తల్లో అన్ని సింగిల్ స్క్రీన్ ధియేటర్లే. 1960-70లలో ఒకే కాంపౌండ్ లో రెండేసి, మూడేసి స్క్రీన్ లున్న ధియేటర్లు కట్టడం ప్రారంభమయింది. 

మెడ్రాస్ సిటీ లిమిట్స్ లో చాలా లిమిటెడ్ గానే సినీమా హాల్స్ వుండేవి. ముందుగా టి.నగర్ నుండి ప్రారంభిస్తే - పాండీ బజార్లో "రాజకుమారి" (తమిళం) (ఇది ప్రముఖ సినీమా నటి టి.ఆర్.రాజకుమారిది. ఈ ధియేటర్లో సినీమా చూడడానికి వచ్చిన కృష్ణకుమారి  తానే ఒక  సినిమా హీరోయిన్ అయిపోయింది. తరువాత, రాజకుమారి చేతులు మారి "సాహ్నీ" గా మారిన రోజుల్లో ఇంగ్లీష్, హిందీ సినిమాల హాలుగా మారింది. ఇందులోనే నేను "ఝనక్ ఝనక్ పాయల్ బాజే", "నవరంగ్" సినీమాలు చూశాను. మళ్ళీ కొన్నాళ్ళ తరవాత రాజకుమారీగా మారిపోయింది.

జి.ఎన్.చెట్టి రోడ్ (గోపతి నారాయణస్వామి చెట్టి రోడ్) చివర మౌంట్ రోడ్ కు సమీపంలో "సన్" ధియేటర్(తమిళం). ఇది బండి సుందర్రావు నాయుడు గారనే తెలుగాయనది. ఎమ్జియార్ సినిమాలే వేసేవారు. వెస్ట్ మాంబళంలో నేషనల్ ధియేటర్ (తమిళం), సైదాపేటలో "జయరాజ్"(తమిళం), అడయార్ లో "ఈరోస్". లజ్ కార్నర్లో "కామధేను", మౌంట్ రోడ్ ప్రాంతంలో  "గెయిటీ ", మెడ్రాస్ లో నిర్మించబడ్డ మొట్టమొదటి సినీమాహాలు. 1913 లో శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడుగారు కట్టించారు. పరశువాక్కంలోని "రాక్సీ", మింట్ లోని "క్రౌన్" ధియేటర్ లను కూడా రఘుపతి వెంకయ్య నాయుడే నిర్మించినట్లు సినీమా చరిత్ర. 

గ్లోబ్" ఇదే తరువాత "అలంకార్". "ప్లాజా", "వెల్లింగ్టన్", "మిడ్ లాండ్" (ఈ ధియేటర్ ను నటి జయప్రద కొని "జయప్రద" గా మార్చి పైనే మరో ధియేటర్ కూడా కట్టించారు). "న్యూ ఎలిఫిన్ స్టన్", "ఓడియన్", గెయిటీ , "కాసినో ',  ట్రిప్లికేన్ హైరోడ్ లో "స్టార్', వాలాజారోడ్ లో "పారగన్", మౌంట్ రోడ్ గెయిటీ పక్కన కూవమ్ వంతెన దాటాక "చిత్ర", పరశువాక్కంలో "రాక్సీ", కెల్లీస్ లో "ఉమ", "మేఖల", అయనావరంలో "సయానీ", విల్లివాక్కంలో "నాదముని" (ఇందులో భానుమతి గారికి భాగస్వామ్యం వుండేదనేవారు). జార్జ్ టౌన్ లో  "సెలక్ట్"(తెలుగు), "మినర్వా" (ఇంగ్లీష్). ఇది గోడౌన్లు, వర్క్ షాపుల మధ్య ఒక మేడ మీద వుండేది. ముగ్గురేసి కూర్చునేలా పేము సోఫాలు. కెపాసిటీ వందలోపే). బ్రాడ్వేలో "ప్రభాత్", "బ్రాడ్వే", మింట్ లో  "మురుగన్",  "క్రౌన్", "శ్రీకృష్ణా", వాషర్ మేన్ పేటలో "మహరాణి", రాయపురంలో "బ్రైటన్", ఇవి ఆనాటి ప్రముఖ సినీమా హాల్స్.

ఈ రాక్సీ , బ్రాడ్వే సినీమాల మీద శ్రీ శ్రీ గారి ప్రసిధ్ధికెక్కిన వాక్యం ఒకటుంది. " బ్రాడ్వే లో కాంచనమాలా ? లేక రాక్సీలోని  నార్మా షెరెర్?" ఎవరిని చూడాలో అర్ధంకాక ఒక యువకుడు సందిగ్ధంలో పడ్డాడని. 

వీటిలో మౌంట్ రోడ్ లోని గ్లోబ్, ఓడియన్, మిడ్ లాండ్, న్యూఎలిఫిన్ స్టన్, కాసినోలలో కేవలం ఇంగ్లీష్ సినీమాలు, అప్పుడప్పుడు హిందీ సినిమాలు మాత్రం ఆడేవి. నేను చూసిన మొట్టమొదటి ఇంగ్లీషు సినీమా "కొ వాడీస్", విజయనగరంలో మా నారాయణమూర్తి చిన్నాన్నగారు తీసుకెళ్ళారు. ఆ సినీమా పేరు తప్ప మిగిలిన విషయాలు గుర్తులేవు. మెడ్రాస్ వచ్చాక నేను చూసిన తొలి ఇంగ్లీష్ సినీమాలు 'టెన్ కమాండ్మెంట్స్", "బెన్ హర్", మరొక సినీమా పేరు, ది మిస్టీరియస్ ఐలండ్ అయుండొచ్చు, సరిగా గుర్తులేదు. జూల్స్ వెర్న్ నవలే అని జ్ఞాపకం. ఆంధ్రపత్రికలో 'సాగరగర్భంలో సాహసయాత్ర' అనే సీరియల్ వచ్చేది. ఆ సినీమాయే అది. ఆ సినీమాను మిడ్ లాండ్ లోనే చూశాము. మానాన్నగారు, ఊరినుంచి వచ్చిన ఆయన స్నేహితులు, మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు, బావమరది సుబ్బారావు గారు కూడా వచ్చిన గుర్తు. నిజానికి నేను ఆరోజు వెళ్ళగలిగే స్థితిలో లేను. అప్పుడు నా ఎడమకాలి వెనక మోకాలు మధ్యలో పెద్ద సెగగడ్డలేచింది. కాలు మడవబడక విపరీతంగా బాధపడుతున్న సమయం. అయినా మొండిగా వాళ్ళతో బయల్దేరాను. ఆ రోజు వేసుకున్న డ్రెస్ కూడా బాగా గుర్తే. బ్లూబ్లాక్ పోలియెస్టర్ ప్యాంట్, సిల్వర్ గ్రే షార్క్ స్కిన్ ఫుల్ హాండ్ షర్ట్. అసలే కురుపు. దాని మీద ఒత్తిడి తెస్తూ మరింత వేడి కలిగించే పోలియెస్టర్ ప్యాంట్. బలవంతంగా, కుంటుకుంటూ వాళ్ళ వెనక వెళ్ళాను. ఆ సినిమా చాలా విజయవంతమైన సినీమా. అయితే బలవంతంగా వెళ్ళి సినిమా చూసిన ఆనందం దక్కలేదు. చూసి వచ్చాక రాత్రి కొంచెం జ్వరం కూడా వచ్చింది.

మౌంట్ రోడ్ గీతాకేఫ్ పక్కనే మలుపు తిరగగానే  (ఇప్పుడు సబ్ వే ఉన్న చోట) అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ వుండేది. ఎక్కువగా ఆంగ్లో ఇండియన్స్, వెస్ట్ నర్లే వచ్చేవారు. ఓపెన్ ఎయిర్ లోనే పూలతీగెలు, పూలతొట్లు మధ్య చిన్న వాటర్ ఫౌంటెన్. దాని చుట్టూ కుర్చీలు, రౌండ్ టేబిల్స్ తో వుండేది. దానిని ఆనుకొని వున్న అతి చిన్న ధియేటర్ న్యూ ఎలిఫిన్ స్టన్. పారమౌంట్, వార్నర్ బ్రదర్స్  వాళ్ళ వార్ సినీమా లు ఎక్కువగా ఆడేవి. అందులోనే "హటారీ"  అనే  ఇంగ్లీష్ సినీమా చూసాను. చూడడం వరకే. బ్రహ్మాండమైన దృశ్యాలు చూసి ఆహా! ఓహో! అని ఆనందించడం వరకే. ఆ  అమెరికన్ ఇంగ్లీష్ ఒక్క మాటకూడా అర్ధమైయ్యేదికాదు. ఇప్పటికీ. నేనూ హాలీవుడ్ సినిమాలు చూస్తాననిపించుకోవడం కోసం.  స్టాటస్ సింబల్ కదా! 

ఓడియన్ లో "జిస్ దేశ్ మే గంగా బహతీహై", మిడ్ ల్యాండ్ లో "మొఘల్-ఏ-ఆజం" చూశాను. మరపురాని చిత్రాలు.

నేను చూసిన మొట్టమొదటి 70 mm సినిమా లిజ్ టేలర్ , రిఛర్డ్ బర్టన్, రెక్స్ హారిసన్ల "క్లియోపేట్రా". సఫైర్ థియేటర్లో. 64లో ఆ థియేటర్ కట్టినప్పుడు అందులో రిలీజైన మొట్టమొదటి సినిమా క్లియోపేట్రా. మద్రాసులోని మొదటి 70 mm థియేటర్. లాబీలో స్నాక్స్ కౌంటర్ దగ్గర ఓ 'Foosball' table కూడా ఉండేది. ఆ కౌంటర్ వెనక గోడమీద ఆరడగుల ఎత్తునుంచి రూఫ్ దాకా ఓ పది పదిహేనడుగులు పొడుగున్న wooden board మీద ఆ థియేటర్ లో అప్పటి వరకూ రిలీజైన సినిమాల లిస్ట్ డేట్ వారీగా ఉండేది. కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఏ సినిమా చూసామో, లేదా చూడలేదో అని లెక్కబెట్టుకుంటూన్న జనం కూడా ఉండేవారు. మౌంట్ రోడ్ వేపు వ్యూ కనిపించేలా అద్దాలతో ఓ లిఫ్ట్ పైకి కిందికీ వెళుతూ కనిపించేేది.  

ట్రిప్లికేన్ ప్రాతంలో ముస్లీమ్ జనాభా ఎక్కువగా ఉండేది. అందువల్ల అక్కడి "స్టార్" ధియేటర్లో హిందీ సినీమాలు మాత్రం ఆడేవి. "సెలెక్ట్" సినిమాలో తెలుగువి వచ్చేవి. కానీ అక్కడికి వెళ్ళి సినీమా చూడడమంటే మరో ఊరు వెళ్ళడమే. ఈ సెలెక్ట్ లో మాస్టారితో కలసి ఒక సినిమాకు వెళ్ళాము. ఆ సినీమా విశేషాలు రానున్న వారాలలో. ఇక మిగిలిన సినీమా హాల్స్ లో అరవ సినీమాలే ఆడేవి.

ఇన్ని సినీమా హాల్స్ వివరాలు నాకు ఎలా తెలుసనే సందేహం మీకు రావడం సహజం. ఆరోజుల్లో మెడ్రాస్ రోడ్లలో వుండే ఇళ్ళ కాంపౌండ్ గోడలమీద పెద్ద పెద్ద సినిమా వాల్ పోస్టర్స్ పెద్ద పెద్ద అక్షరాలతో దర్శనమిచ్చేవి. సినీమా పోస్టర్స్ లేని సిటీ గోడలే అరుదు. అలాటి వాటిలో ఘంటసాల మాస్టారి ఇంటి కాంపౌండ్ వాల్. అదెందుకో మరి, సినీమా వాల్ పోస్టర్ల బారిన పడలేదు. కొన్నేళ్ళ తర్వాత సర్కారు వారు గోడలమీద సినీమా వాల్ పోస్టర్ల సంస్కృతికి చరమగీతం పాడారు. అయితేనేం, మద్రాస్ వీధుల గోడలన్నీ రాజకీయ పార్టీల కబ్జాకు గురి అయాయి. ఇప్పుడు ఏ గోడ చూసినా ఉదయసూర్యుడు, రెండాకులు, హస్తం, సుత్తి కొడవళ్ళు, వాటి నాయకుల నిలువెత్తు చిత్రాలు మనలను బెదిరిస్తూంటాయి.  

మా ఇంటి ఎదురుగా వుండే అన్ని ఇళ్ళ గోడలమీదా కొట్టచ్చేలా సావిత్రి, అంజలి, భానుమతి, సరోజాదేవి, రాజసులోచన, జమున, శివాజీ గణేశన్, ఎమ్జీయార్, ఎమ్ ఆర్ రాధ, పి.ఎస్ వీరప్ప, నంబియార్ మొదలగువారి  రంగు రంగులబొమ్మలు, దర్శనమిచ్చేవి. ఆ పోస్టర్లలో సినీమా హాల్స్, అవి ఉండే స్థలాలు ఇంగ్లీష్ లో ఉండేవి. సినీమా పేర్లన్నీ తమిళంలో పెద్దవిగా ఉండేవి. నేను తమిళం నేర్చుకోవడానికి ఎక్కువగా సహాయపడినవి ఈ వాల్ పోస్టర్లే. ఆ సినీమా పేర్లేమిటో తెలుసుకొని అందులోని అక్షరాలను పోల్చుకోవడంతో ప్రారంభించాను. ఒకసారి మా ఇంటి ఎదురు గోడమీద ఎమ్జీయార్, భానుమతి, కన్నాంబల బొమ్మలతో ఒక వాల్ పోస్టర్ చూసాను. అందులో భానుమతి, కన్నాంబ వుండడం నన్ను ఆకర్షించింది. వాళ్ళిద్దరూ మనోళ్ళు కదా! ఆ సినీమా పేరేమిటని మా రావమ్మను (పామర్తిగారి పెద్దమ్మాయి) అడిగాను. "తాయిక్కుప్పింతారమ్" అని చెప్పింది.  అందులో నాకు రెండే రెండు మాటలు అర్ధమయాయి. ఒకటి తాయి. మరొకటి కుప్పింతారం. నా కళ్ళకెదురుగా మా ఇంటి ముసలి పనిమనిషి 'తాయి', కుప్పించి ఎగిరింది అన్నట్టనిపించి నవ్వొచ్చింది. నాకెందుకు నవ్వొచ్చిందో అర్ధంకాని రావమ్మ అయోమయంగా చూసింది. తర్వాత ఎన్నేళ్ళకో నాకు తమిళం కొంత అర్ధమవడం ప్రారంభించాక ఆ సినీమా అసలు పేరు అర్ధమయింది " తాయ్ క్కు పిన్ దారమ్" (అంటే 'తల్లి తర్వాతే భార్య' అని అర్ధం). ఎమ్జీయార్ సినీమాలన్నింటిలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా వుండేది. రాజకీయాలలో ఎదగడానికి కూడా తమిళనాడు మహిళల ఆదరణే కారణం.

ఈ మెడ్రాస్ ధియేటర్లలో ఎక్కడో ఏదో మూల ఘంటసాల మాస్టారు తమిళ పాటలు పాడిన సినీమాలు, సంగీతం చేసిన సినీమాలు ఆడుతూనేవుండేవి. తమిళ ప్రేక్షకుల చెవులకు ఘంటసాల పాట, పేరు సోకుతూనే వుండేది.

అలాగే, ఇన్ని సినీమా హాల్స్ గురించి తెలియడం వెనక మరో కధ ఉంది.1970 ప్రాంతాలలో మా టివికె శాస్త్రిగారికి మెడ్రాస్ లో తెలుగు సినీమాలు ఆడించి తెలుగులకు సేవచేయాలనే కోరికపుట్టింది. మద్రాసులోనే తెలుగు సినీమా తయారవుతున్నా, సినీమాలతో సంబంధంలేని తెలుగువారు తెలుగు సినిమా చూసే అదృష్టానికి నోచుకోలేదు. తెలుగు జనాభా ఎక్కువుండే ప్రాంతాలను, ఆ చుట్టుప్రక్కల వుండే సినీమా హాల్స్ వివరాలు సేకరించేపనిలో నన్నూ వినియోగించారు. ఆ సమయంలో ఈ ధియేటర్ల పేర్లు, స్థలాలు మరింతగా తెలిసాయి. చివరకు అందరికీ అందుబాటులో టి.నగర్ బస్ స్టాండ్ కు ఎదురుగా వున్న కృష్ణవేణి ధియేటర్ ను ఎంపిక చేశారు. దాని ఓనర్ ఒక నెల్లూరు రెడ్డిగారని గుర్తు. ప్రతీ ఆదివారం ఉదయం ఏదో ఒక తెలుగు సినిమాను మార్నింగ్ షోగా వేయడం జరిగింది. ఆ ప్రయత్నం విజయవంతమైతే ఈవెనింగ్ షోస్ వేయాలని భావించారు. సుమారు ఒక ఏడాది వేసాక ఆదాయం కంటే ఖర్చులే  ఎక్కువగా కనిపించడంతో ఆ తెలుగు సినిమా సేవకు స్వస్తి పలికారు. నాకు మాత్రం మెడ్రాస్ సినీమా హాల్స్ పరిజ్ఞానం మిగిలిపోయింది. 

1960ల తర్వాత ఆనంద్, సత్యం, సఫైర్, దేవీ కాంప్లెక్స్ - దేవీ, దేవీ పారడైజ్, దేవీబాలా, దేవీకళ - పైలట్, ఉడ్ లాండ్స్, శాంతి, అభిరామి, మోక్షమ్, వంటి మల్టీ స్క్రీన్ ధియేటర్లెన్నో వెలిసాయి. అయితే ఇవన్నీ చాలావరకూ ఈనాడు మూతబడి కళ్యాణ మండపాలుగానో, షాపింగ్ మాల్స్ గానో మారిపోయాయి. ఇవాళ సినీమా ధియేటర్ల బిజినెస్ అంత లాభసాటి కాదనే స్థితిలో వున్నారు. ఇప్పుడంతా మల్టీప్లెక్స్ కల్చర్. గత ఇరవై ఏళ్ళలో నేను థియేటర్లలో చూసిన సినీమాలు ఒక పాతిక కూడా వుండవు. ఎందుకంటే ఈ తరం సినీమాలు, అందులో వినిపించే సంగీతం విని, చూసి ఆనందించే స్థితిలో ఏమాత్రం లేకపోవడమే. 

ప్రేక్షకుల హృదయాలకు హత్తుకొని పదికాలాలపాటు (ఘంటసాలవారి డైలాగ్) పాడుకునేలా ఈనాటి సినీమా సంగీతం లేదు. 

1959 లో వచ్చిన  'మాంగల్యబలం' 'శభాష్ రాముడు' వంటి కొన్ని చిత్రాలు తమిళంలో కూడా రిలీజ్ అయి గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాలవారి కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేసాయి. 

1959 లో తెలుగులో కూడా గాయకునిగా, సంగీత దర్శకుడిగా ఆఖిలాంధ్ర ప్రజలచేత కొనియాడబడేలా ఏన్నో సినీమాలు వచ్చాయి. అందులో ముఖ్యమైనవి - మాంగల్యబలం, అప్పుచేసి పప్పుకూడు, సతీ సుకన్య, పెళ్ళి సందడి, జయభేరి, ఇల్లరికం, రేచుక్క పగటి చుక్క, శభాష్ రాముడు, బాలనాగమ్మ, బండరాముడు, భక్త అంబరీష వంటి సినీమాలున్నాయి. వీటన్నిటిలో మకుటాయమానంగా నిలిచిపోయిన చిత్రం "జయభేరి". ఈ చిత్రంలో పాటలన్నీ ఆపాతమధురమే. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన పాటలన్నీ గాయకులకు సవాలు విసిరి హడలెత్తించేవే. అందులోని రసికరాజా, మది శారదా దేవి మందిరమే, రాగమయీ రావే, నందుని చరితము, యమునా తీరమున, ఇలా ఈ సినీమాలో పాటలన్నింటికీ ఘంటసాల మాస్టారు ప్రాణప్రతిష్ట చేసి సంగీత దర్శకుడు పెండ్యాలగారి కీర్తికి దోహదపడ్డారంటే అతిశయోక్తికాదు. జయభేరి చిత్రంలోని "మదిశారదాదేవి" పాట సన్నివేశం తనకెంతో ఇష్టమైనదని ఘంటసాల మాస్టారు అనేక సందర్భాలలో చెప్పారు. గురుపాదులైన నాగయ్యగారి సమక్షంలో అక్కినేని, ఇతర శిష్యబృందం ఈ పాటను ఆలపించినప్పుడు, విజయనగరంలో తమ గురువులు శ్రీ పట్రాయని సీతామశాస్త్రిగారి సన్నిధిలో తాను చేసిన సంగీత సాధన, గురువుగారి బోధన, వాత్సల్యం గుర్తుకు వచ్చేయని, ఈ రకమైన పాట చిత్రీకరణ చాలా ఆనందం కలిగించిందని చెప్పేవారు. 


                  "జయభేరి" చిత్రంలో "మది శారదాదేవి మందిరమే" పాట

ఈ సంవత్సరంలో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలో శభాష్ రాముడు, పెళ్ళి సందడి సినీమాలు సంగీతపరంగా కూడా మంచి పేరు తెచ్చి పెట్టాయి. శభాష్ రాముడు లోని "రేయీ మించేనోయి రాజా", "జయమ్ము నిశ్చయమ్మురా", పాటలు, "పెళ్ళిసందడి" సినీమా లోని "రావే ప్రేమలతా", "ఛమక్ ఛమక్ తారా, "జాలీ బొంబయిలే మామా", లీల, జిక్కిలు పాడిన 'సమయమిది డాయరా సరసుడా' అనే జావళీ తరహా పాట, "హైలేలో నారాజా రావోయి నీదేనోయి కన్నె రోజా" అనే ఓరియంటల్ మ్యూజిక్ తో వున్నపాట ఈనాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే వున్నాయి. ఈ చిత్రాలలోని సంగీతం విషయంలో  మాస్టారు అన్ని రకాల సంగీత శైలులు ప్రయోగించడం ఒక విశేషం. శభాష్ రాముడు, పెళ్ళి సందడి ఈ రెండు సినీమాల రీరికార్డింగ్ చూశాను.


           "సమయమిది డాయరా" -పెళ్ళిసందడి - లీల, జిక్కి యుగళగీతం

"ఒక్క లెగ్ లో జాక్పాట్ మిస్. ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు .....??

వచ్చే వారం ....  
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, January 9, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పధ్నాలుగవ భాగం

09.01.2021 - శనివారం భాగం - 14*:
అధ్యాయం 2  భాగం 13 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1959 - 1963 ల మధ్య నెం.35, ఉస్మాన్ రోడ్, 36, ఉస్మాన్ రోడ్ లలో బాలకాండ సాగింది.  పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యంగా ఇల్లంతా కళకళలాడింది. 


35, 36 ఉస్మాన్ రోడ్ పిల్లలు

నెం.35, ఉస్మాన్ రోడ్ లోని ఘంటసాలవారి పిల్లలు, ఔట్ హౌస్ లోని సంగీతరావుగారి పిల్లలు, నెం.36, ఉస్మాన్ రోడ్ లోని రాజగోపాలన్ గారి పిల్లలు ఏ అరమరికా లేకుండా, ఏ భేషజాలు లేకుండా చివరివరకూ స్నేహసుహృద్భావాలతో, ఒకరిపట్ల మరొకరు ప్రేమాభిమానాలు కనపరుస్తూ మెలిగారు. ఇప్పటికీ ఈ మూడిళ్ళలో పుట్టి పెరిగిన సంతానం అలాగే వున్నారు. అక్కా తమ్ముడూ, అన్నా చెల్లి అంటూ ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోకపోయినా అందరూ సోదరభావంతోనే మెసలుతూ వచ్చారు. ఇంట్లో పెద్దల భావాలు, నడవడిక, పెంపకం ఎలావుంటే ఆ ఇంటి పిల్లలు కూడా అదే రీతిలో పెరుగుతారు, అని జనరలైజ్ చేసి చెప్పలేము, కానీ, ఆయా కుటుంబాలలోని సంస్కారం అందుకు తప్పక దోహదం చేస్తుంది. 

1959 జనవరిలో మా యింట మా రెండో చెల్లెలు పద్మ, 1959 మే నెలలో మాస్టారి పెద్దమ్మాయి శ్యామల, 1960 జూలైలో మాస్టారి రెండో అమ్మాయి సుగుణ, 1961 మే లో మా మూడో చెల్లెలు లలిత, 1963 జనవరిలో ఘంటసాలవారి ఆఖరి అమ్మాయి రాధ (శాంతి), 1963 అక్టోబర్ లో మా ఆఖరి చెల్లెలు సుమబాల పుట్టడం జరిగింది. మా పక్కిల్లు నెం.36, ఉస్మాన్ రోడ్, మామా ఇంట్లో కూడా దాదాపు ఈ కాలంలోనే వారి ఆఖరి ఇద్దరి ముగ్గురు పిల్లలు పుట్టిన గుర్తు. మా పక్కింటి మామా (శ్రీAKరాజగోపాలన్), మామీల (శ్రీమతి పర్వతవర్థని) పెద్దబ్బాయి రఘు, సీత, తార, లల్లి(లలిత), శేఖర్ (AKస్వామినాథన్), కణ్ణా(బాలకృష్ణన్), శీను(శ్రీనివాసన్), వీళ్ళందరికీ నడకా, మాటా వచ్చేసరికి అందరి గమ్యం 35 ఉస్మాన్ రోడ్డే.



మా అమ్మగారికి పిల్లలంటే మహా ప్రాణం. ఆవిడ ఏనాడు పిల్లలను తిట్టడంగానీ, వాళ్ళను కఠినంగా శిక్షించడంవంటివి గానీ  చేయలేదు. విజయనగరంలో ఒకేఒకసారి మాత్రం  ఆవిడ కోపాన్ని నా మీద ప్రయోగించింది. కారణం గుర్తులేదుఅందువలన ఈ రెండిళ్ళలోని పిల్లలు మా అమ్మగారంటే చాలా ఇష్టపడేవారు. ఆవిడ దాదాపు ఐదు దశాబ్దాలు మద్రాసులోనే గడిపినా ఆవిడకు తమిళం ఒక్క ముక్క ఒంటబట్టలేదు. ఆవిడ ఆ ప్రయత్నమూ చెయలేదు. (మా నాన్నగారికీ తమిళం రాలేదు. భాష అర్ధమవుతుంది కానీ, మాట్లాడలేరు.)

అందువలన మా పక్కింటి పిల్లలు మా అమ్మగారితో మెసలుతూ అవసరంమేరకు తెలుగులో మాట్లాడడం నేర్చేసుకున్నారు. అలాగే  మాస్టారింట్లో పనిచేసే తాయి, ఆవిడ కొడుకు మా తెలుగులోనే మాట్లాడుతూ మా అమ్మగారికి అభిమానపాత్రులయ్యారు. మాస్టారింట్లో సావిత్రమ్మగారు, పాపగారు, అందరూ  తమిళం బాగా మాట్లాడతారు. నాకు మొదట్లో తమిళ భాష రానందువల్ల పక్కింటి మామా కుటుంబంతో, వారి పిల్లలతో పెద్దగా స్నేహం పెరగలేదు. అందుకు మరో కారణం నా వయసు. పక్కింటి రఘు తప్ప మిగిలిన రెండిళ్ళ పిల్లలు వయసులో చాలా చాలా చిన్నవాళ్ళు. వాళ్ళతో కలసి అల్లరిచేస్తూ, ఆటలాడే వయసు నాది కాదు. 

'బాలానాం రోదనం బలం' అంటారు. ఇంట్లో ఏదో మూల ఒకరు ఏడుపు మొదలెడితే వెంటనే రెసిప్రోకల్ గా మరో పక్కనుండి మరో శృతిలో మరొకరు గొంతు కలిపేవారు. ఇలా ఒక ఐదేళ్ళు అందరి ఆరున్నరశృతి  సప్తస్వరాలలాగా  వినిపించేవి. ఈ పిల్లల అల్లరితో ముద్దు మురిపాలతో నెం.35, ఉస్మాన్ రోడ్ లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. 1965 నాటికి  ఒక చిన్న సైజ్ కిండర్గార్డెన్ స్కూలుకు కావలసినంతమంది పిల్లలు ఈ రెండు లోగిళ్ళలో తయారయ్యారు.


మెరీనా బీచ్ లో ఉస్మాన్ రోడ్ పిల్లలతో నరసింగ

ఘంటసాల మాస్టారికి పిల్లలంటే ముద్దే. స్వపర భేదం లేదు. అందరినీ చేరదీసేవారు. ఆయన తీరికగా ఇంట్లో వుంటే ఈ చంటి పిల్లలంతా ఆయన గుండెలమీదే స్వారీ చేసేవారు. ఆయన కూడా ఏదో తమాషాలు చేసి ఆ పిల్లలను నవ్వించేవారు. పిల్లలమీద విసుక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి మాస్టారికి ఇష్టముండేది కాదు. ఆ సెషన్ అంతా అమ్మగారిది. అయ్యగారు ఇంట్లోలేనప్పుడు క్లాస్ తీసేవారు. అమ్మగారికి కోపం ఎక్కువే. అల్లరిపెట్టేవాళ్ళకి అమ్మగారి శిక్షలు తప్పేవికావు. తన ప్రేమపాశాన్ని తొడపాశాల ద్వారా  చూపెట్టేవారు. నొప్పితో కుయ్యో, మొర్రోమని నోరెత్తితే "ఛంపుతా" అని కళ్ళెర్ర జేసి అమ్మగారు చెయ్యెత్తితే చాలు అల్లరి చేసే పిల్లల నోళ్ళు మూతపడేవి. వాళ్ళు మెల్లగా అక్కడనుండి జారుకొని పాప పిన్నిగారి దగ్గరకో, మా అమ్మగారి దగ్గరకో చేరి కావలసిన సానుభూతిని, బిస్కట్ల లంచాన్ని పొందేవారు. మాస్టారింటి తీన్ దేవియాల అల్లరి చేష్టల వల్ల  ఆ ఇంట్లోని ఒక మంచి క్యారమ్ బోర్డ్ ఎందుకూ పనికి రాకుండాపోయింది. మరి అది ఎలాటి అల్లరో  మీరే ఊహించుకోండి.

1959 అంతా నెం.35, ఉస్మాన్ రోడ్ లో నిర్విరామ కార్యక్రమాలతో చాలా ఉత్సాహంగా సాగింది. 

ఆ సంవత్సరం ఘంటసాల మాస్టారింటికి సుప్రసిధ్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ గారు ఏడెనిమిది మంది పరివారంతో మద్రాస్ వచ్చారు.  

బడే గులాం ఆలీఖాన్ గారిది పాటియాలా ఘరానా సంగీత శైలి. తుమ్రీ, ఖయాల్ గానంలో అత్యంత నిష్ణాతులు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గాయకుడు. అటువంటి గాయకుడిని కళ్ళారా చూడడమే గొప్ప అదృష్టమైతే, ఆయన కచేరీ వినే మహాధ్భాగ్యం నాకు నా చిన్నతనంలోనే కలిగింది. ఘంటసాల మాస్టారు 'ఖాన్ సాబ్' అని పిలిచేవారు. మాస్టారికి ఖాన్ సాబ్ గాత్రమన్నా, ఆయన సంగీతమన్నా చాలా ఇష్టం. చంద్రహారం లోని "ఇది నా చెలీ, ఇది నా సఖీ" పాటకు ఘంటసాల మాస్టారు ఉపయోగించిన రాగేశ్వరి రాగం మీద ఖాన్ సాబ్ సంగీత శైలి ప్రభావం వుందని అంటారు. 



ఖాన్ సాబ్ తన కచేరీలలో విధిగా "క్యా కర్ సజనీ ఆయెన బాలం" అనే గీతాన్ని ఆలపించేవారు. ఘంటసాలవారికి ఈ గీతమంటే అమితమైన ఇష్టం. తరచూ హమ్ చేసేవారు. మా నాన్నగారు పాడగా కూడా విన్నాను. మాస్టారు వారిని, వారి వాద్యబృందాన్ని, పరివారాన్ని చాలా సాదరంగా, గౌరవంగా తమ ఇంటికి ఆహ్వానించి తీసుకువచ్చారు.

అప్పట్లో ఒక బ్రాహ్మడు ఒక ఇస్లామ్ మతస్థుడిని తీసుకువచ్చి తన ఇంట్లో పెట్టుకోవడం కొందరు ఛాందసవాదుల కన్నెర్రకు కారణమయింది, అని చెప్పుకోగా విన్నాను. అయినా ఘంటసాల మాస్టారు చాలా విశాల దృక్పథం కలవారు. ఎవరి విమర్శలను లెఖ్ఖ చేయలేదు. అందుకే ఖాన్ సాహేబ్ కు ఘంటసాలగారంటే అంత వాత్సల్యం, అభిమానం. వచ్చినవారందరికీ మాస్టారి ఇంటి మేడ భాగాన్ని పూర్తిగా కేటాయించి, ఇంట్లో వారెవరూ వారికి ఏ రకమైన అంతరాయం కలిగించరాదని హెచ్చరించారు. భోజన వసతులన్నీ మాస్టారింటినుండే వెళ్ళేవి. మేడమీదకు వెళ్ళడానికి ప్రత్యేకమైన త్రోవ వుండడం వలన ఎవరికీ ఏవిధమైన ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లన్నీ చేశారు. అంతకుముందు, వారు ఒకసారి మద్రాస్ వచ్చారట, కానీ, అప్పటికి మేము మద్రాస్ వెళ్ళలేదు. ఈసారి కొన్ని వరస కచేరీలు చేయడానికి మద్రాస్ వచ్చారు. అందులో ఒక రోజు కచేరీకీ మాస్టారింట్లో అందరితోపాటూ నేనూ వెళ్ళాను. ఆ రోజున కూడా ఆ "క్యా కర్ సజనీ ఆయెన బాలమ్"  గీతాన్ని ఎంతో మనోజ్ఞంగా గానం చేశారు. నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు. కానీ ఆయన పాట వింటూంటే చాలా ఆశ్చర్యంగా, ఎంతో హాయిగా, ఆనందంగా అనిపించింది.



ఖాన్ సాబ్ ను చూడకముందు ఆయన గురించి మా నాన్నగారిని అడగేను. 1960ల నాటికి మా ఇంట్లో అందరికంటే మా నాన్నగారు, ఆయన స్నేహితుడు శ్రీ పంతుల శ్రీరామశాస్త్రి గారు వలంగా ఉండేవారు. (మా ప్రాంతాల్లో లావుగా వుండడాన్ని 'వలంగా' వున్నాడని అంటారు.) మా నాన్నగారి కంటే ఘంటసాల మాస్టారు లావు. మాస్టారికి రెండింతలు బడే గులాం ఆలీఖాన్ గారు వుంటారని మా నాన్నగారు చెపితే 'అమ్మ బాబోయ్' అనిపించింది. నిజమే, ఖాన్ గారిది చాలా భారీకాయమే. పెద్ద పెద్ద బుర్ర మీసాలు, తలమీద నల్లటి టోపీ, పఠాన్లు లాగా వస్త్రధారణ. కారులోకి ఎక్కేప్పుడు, దిగేప్పుడు చాలా శ్రమపడవలసి వచ్చేది. చిన్న పీటలాటిది ఎప్పుడూ అందుబాటులో ఉండేది. ఖాన్ సాబ్ కు కానీ, ఆయన పరివారానికి కాని పెద్ద సమస్య భాష. వారందరికీ ఉర్దూ తప్ప మన తెలుగు , తమిళ భాషలు ఒక్క ముక్క అర్ధం కావు.  ఉర్దు, తెలుగు తెలిసిన ఎవరో మధ్యవర్తి ద్వారా కాలక్షేపం జరిగేది. ఘంటసాల మాస్టారిది, ఖాన్ సాబ్ ను చూసేందుకు వచ్చేవారందరిదీ ఒకటే భాష. సంగీతం.  అన్ని వర్గాలవారిని సమన్వయపర్చి వారధిగా నిలిచేది విశ్వవ్యాప్తమైన సంగీతమే. అక్కడ మరే యితర మాటలకు తావులేదు. అంతా సామవేద గానమే. అదే మన భారతీయ సంస్కృతి. ఖాన్ సాబ్ పాటను వినడానికి మద్రాస్ లోని ప్రముఖ సంగీత విద్వాంసులంతా మాస్టారింటికి ఎడతెరిపిలేకుండా వచ్చేవారు.  కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన విద్వాంసులందరు ఖాన్ సాబ్ ను చూసి ఆయనతో ముచ్చటించాలని వచ్చేవారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, డికె పట్టమ్మాళ్, ఎమ్మెల్ వసంతకుమారి, శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, వంటి విద్వాంసులను అప్పుడే చూసే అవకాశం లభించింది. ఇక సినీమా గాయకులు, అన్ని భాషలవారూ చూడడానికి వచ్చేవారు. 

ఖాన్ సాబ్ పాడుతున్నప్పుడు అంతరాయం కలగకూడదని, మెల్లగా చప్పుడు చేయకుండా మేడ మెట్లమీదే కూర్చొని శ్రధ్ధగా ఆయన పాటను ఆలకించేవాడినని ప్రముఖ కవి ఆరుద్ర తన వ్యాసం ఒకదానిలో వ్రాశారు. అర్ధరాత్రి దాటేవరకూ ఎవరో ఒకరు రావడం ఆయన పాడేది వినడం పరిపాటిగా వుండేది. ఖాన్ సాబ్ నిద్రపోతున్న సమయంలో కూడా స్వరమండల్ ఆయన గుండెలమీదే వుండేది. ఏమాత్రం మెలకువ వచ్చినా స్వరమండల్ తంత్రులన్నీ మధురమైన స్వరాలని వినిపించేవి.

ఖాన్ సాబ్ వంటి సరస్వతీ పుత్రులవల్ల, ఆయనను సందర్శించడానికి వచ్చే ఇతర గాయక స్రష్టల వలన "నెం.35, ఉస్మాన్ రోడ్" ఎంతో పావనమయింది. అందుకే, నా దృష్టిలో "నెం.35, ఉస్మాన్ రోడ్" ఒక సాధారణ గృహం కాదు. ఒక పవిత్ర సరస్వతీ నిలయం.  సంగీతాలయం. అటువంటి సాంస్కృతిక వాతావరణంలో పెరిగి పెద్దైన అదృష్టం నాకు లభించింది. పాట రాకపోయినా ఫర్వాలేదు, మంచి సంగీతం విని ఆనందించే హృదయముంటే చాలని భావిస్తాను.

వచ్చిన సంగీతాభిమానులంతా వెళ్ళిపోయిన తరువాత వారి రాత్రి భోజన కార్యక్రమం జరిగేది. ఖాన్ సాబ్ బృందమంతా చిన్న, పెద్ద తేడాలేకుండా అందరూ చుట్టూరా కూర్చొనేవారు. వారిమధ్యలో పెద్ద పెద్ద చపాతీ దొంతరలు, పక్కనే కొన్ని కూరల వంటకాలు ఉండేవి. ఇన్ని చపాతీలు  ఎవరైనా తినగలరా అని నాకు అనిపించేది. కానీ ఒక చిన్న ముక్క కూడా మిగిలేది కాదు. అన్నం విలువ తెలిసినవారే ఏ ఒక్క పదార్ధమూ పారేయకుండా భక్తి శ్రధ్ధలతో తింటారని మా పెద్దలు చెప్పేవారు.

ఖాన్ సాబ్ బృందంవారు భోజనాల సమయంలో ఒకరు వడ్డించడం, మరొకరు తినడం అనే ప్రసక్తేలేదు. ఎవరికి కావలసినది వారే వడ్డించుకు తినేవారు. భోజన సమయంలో కూడా గడచిన సంగీత కార్యక్రమం గురించి, లేదా, జరగబోయే కచేరీ గురించి చర్చించుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించేవారు. వారి భోజన కార్యక్రమం నాకు చాలా వింతగా అనిపించేది. వయసు, అనుభవం లేకపోతే ఏది చూసినా వింతే. ఇవన్నీ నాకు గుర్తుండిపోవడానికి కారణం ఆ చిన్న వయసు మనస్తత్త్వమేనేమో!

బడే గులాం ఆలీఖాన్ గారు ఏనాడు సినీమాలలో పాడలేదు. పాడాలనీ అనుకోలేదేమో! అటువంటి వ్యక్తిని బలవంతపెట్టి "మొఘల్ ఈ అజాం" చిత్రంలో తాన్సేన్ పాత్రకు పాడించారు. సినీమాలలో  ఒక సంగీత దర్శకుడి అదుపాజ్ఞలు పాటిస్తూ పాడడం ఇష్టంలేని ఖాన్ సాబ్ ఒక అనూహ్యమైన చాలా పెద్ద పారితోషికం డిమాండ్ చేసారట. అంత పెద్ద మొత్తం ఆ రోజుల్లో ఏ సినీమా గాయకుని ఇచ్చే స్తోమత ఏ నిర్మాతకు వుండేది కాదు. కానీ నిర్మాత పట్టుదలతో ఆయన కోరిన పారితోషికం ఇచ్చి పాడించారట. సంగీత దర్శకుడు నౌషాద్ అలి. సాధారణ గాయకులకు నేర్పినట్లు ఖాన్ సాబ్ కు పాట నేర్పడం సాధ్యమయేపనికాదు. అందువలన రాగం పేరు మాత్రం చెప్పి సాహిత్యం చేతికి ఇచ్చి  ఆయన ఇష్టానికే వదిలేసారట. పాడడమంటూ మొదలుపెడితే అది అనంతంగా సాగిపోవలసిందే. కట్ చెప్పి ఆపే ధైర్యం నౌషాద్ చేయలేకపోయారట. పాట అంతా రికార్డ్ చేసి తరువాత ఎడిటింగ్ సమయంలో తమకు కావలసినంత మేరకు సినీమాలో ఉపయోగించుకున్నారని మొఘలే ఈ అజాం సినీమా సంగీత విశేషాల గురించి వచ్చిన ఒక వ్యాసంలో చదివాను. ఇందులోని నిజానిజాలు నాకైతే తెలియవు.

బడే గులాం ఆలీఖాన్ గారు తమ బృందంతో తిరిగి బొంబాయి వెళ్ళేముందు అందరూ  వాకిట్లో కారు పోర్టికోలోకి వచ్చారు. ట్రైన్ లోనే వెళ్ళిన గుర్తు. మేడ మీద నుండి వారి సామానంతా కార్లలోకి ఎక్కిస్తున్న సమయంలో ఖాన్ సాబ్ పోర్టికోలోని సిమెంట్ అరుగుమీద కూర్చొని (ముక్కాలి పీట సాయంతో), వెళ్ళేముందు మాస్టారిని, మా నాన్నగారిని, అక్కడ ఉన్నవారందరినీ పలకరిస్తూ వచ్చారు. మా నాన్నగారి పక్కనే నిల్చొనివున్న నన్ను చూసి "ఈ కుర్రవాడి చెవులు పెద్దవిగా ఉన్నాయి. చాలా అదృష్టవంతుడు అవుతాడు" అని నా తల నిమిరారు. ఆ సమయంలో అందరి దృష్టి నా మీదే పడడంతో నాకు చాలా సిగ్గనిపించింది. అష్టవంకరలు పోయాను. 

అదృష్టం అనేక రకాలు.  ధనార్జనే ఒక్కటే అదృష్టంగా భావించనక్కరలేదు. ఆ విధంగా నేను అదృష్టవంతుడినే. అంతటి మహాగాయకుని మాటలు నాకు ఆశీస్సులు గా భావిస్తాను. మనిషికి తప్పనిసరిగా ఏదో ఒక ambition ఉండాలి,  జీవితంలో ఏదైనా ఘనమైన సాధన చేయాలి అని మా నాన్నగారు తరుచు అనేవారు. డబ్బు సంపాదన ఒక్కటే సాధన కాదని ఆయన దృఢాభిప్రాయంగా నాకు తోస్తుంది. 

1958-59 ప్రాంతాలలోనే 'నమో వెంకటేశా', 'ఏడు కొండలసామీ' వంటి పాటలు గ్రామఫోన్ రికార్డింగ్ జరిగిన జ్ఞాపకం. ఆ పాటల కంపోజింగ్ మేడమీద ముందు రూమ్ లో జరిగేది. ఆ సమయంలోనే ఆ పాటల రచయిత శ్రీ రావులపర్తి భద్రిరాజుగారిని చూసాను. ఆ పాటల కంపోజింగ్ సమయంలోనే 'ఖోల్' అనే వాద్యాన్ని మొదటిసారిగా చూసాను. 

 


చూడడానికి మృదంగంలా కనిపించినా ఆకారంలో, ధ్వనిలో చాలా తేడావుంది. అలాగే ఆ పాటలలో క్లేవైలిన్ (యూనివాక్స్) కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ రెండు పాటలు ఎంత హిట్టయినాయో అందరికీ తెలుసు. సినీమా పాటలకంటే ఎక్కువ ప్రజాదరణ పొంది ఘంటసాల మాస్టారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. 'ఏడు కొండలసామి' పాట గ్రామఫోన్ రికార్డ్ గా రావడానికి ముందు, కొంచెం తేడాగా ఘంటసాలగారు పాడినది ఆలిండియా రేడియోలో ప్రసారం చేసారు. 

మాస్టారి ఇంటి మేడమీది ముందు రూమ్ లో తెలుపు నలుపుల ఫోటో ఒకటి గోడకు వేలాడుతుండేది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఆ వ్యక్తి చేతిలో ఒక కాఫీ కప్ కూడా కనిపిస్తుంది. మాస్టారికి ఏ విధమైన సంబంధమో తెలియదు. తరువాత ఎవరో చెప్పారు ఆయన ఒక  పెద్ద గాయకుడని, హిందీ సినీమాలలో పాడతారని. మనిషి చాలా హాండ్సమ్ గా కనిపిస్తారు. నాకెందుకో అతనే  ముఖేష్ అని అనిపించేది. ఆ పేరే నా మనసులో  చాలాకాలం లాక్ అయిపోయింది. కొన్ని దశాబ్దాల తర్వాత, కొంత సినిమా పరిజ్ఞానం పెరిగాక అప్పుడు తెలిసింది ఆ ఫోటోలో వున్న హిందీ గాయకుడి పేరు తలత్ మహమ్మద్ అని. తలత్ మహమ్మద్ గళంలోని ఒక రకమైన వణుకు ఆయన ప్రత్యేకత. అది ఆయనకే చెల్లు.

1959లో ఘంటసాలవారి పుష్పకవిమానం (నెం.35, ఉస్మాన్ రోడ్)లోకి మరొక కొత్త వ్యక్తి ప్రవేశించాడు. అతని పేరు ముద్దు నరసింగరావు. 

చివర సర్కిల్ ఉన్నది నరసింగరావు

ఘంటసాల మాస్టారి స్నేహితుడు ముద్దు పాపారావుగారి కుమారుడు. పాపారావుగారు, మాస్టారు విజయనగరం సంగీత కళాశాలలో సహాధ్యాయులు. ఆప్తమిత్రులు. 


తాతగారి వెనుకే సర్కిల్ లో ఉన్నది ముద్దు పాపరావుగారు
ఎడమవేపు కూర్చుని సర్కిల్ ఉన్నది ఆయన అన్నగారి అబ్బాయి (నరసింగరావుకి కజిన్)

ఘంటసాలవారి స్నేహసౌశీల్యాలు చాలా గొప్పవి. పాపారావుగారు గుణుపూర్ లో ఉండేవారు. ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో వుండి కనుమూశారు. భార్యా పిల్లలకు జీవనాధారం కరువయింది. స్నేహితుడి కుమారుడైన నరసింగరావును తన దగ్గరకు రప్పించి తమ ఇంటి పిల్లవాడిలా ఆదరించారు. అతని చెల్లెళ్ళకు తనే దగ్గరుండి వివాహం జరిపించి ఆ కుటుంబానికి దారి చూపారు. నరసింగరావుకు పెద్ద ఉద్యోగం  ఏర్పాటు చేయడానికి కావలసిన విద్యార్హతలు లేక తమ ప్రొడక్షన్ ఆఫీసు పనులే చేయించేవారు. నరసింగరావు నాకంటే ఏడేళ్ళు పెద్ద. ఘంటసాలవారింటి పిల్లవాడిలాగే అందరూ చూసుకున్నారు. గత రెండేళ్ళ క్రితం వరకు ఘంటసాలవారి మూడో అల్లుడు, (శాంతి భర్త కొండూరు సురేంద్ర కుమార్) స్వగృహంలోనే సావిత్రమ్మగారికి సొంత కొడుకులా సేవచేస్తూ చేదోడువాదోడుగా వుండేవాడు. అతనికి కుటుంబ పరిస్థితులవల్ల పెద్దగా చదువు సంధ్యలు, వివాహం అమరలేదు. అమ్మగారు ఏవూరు వెళ్ళినా తోడుగావెళ్ళేవాడు. (రెండేళ్ళ క్రితం, సరిగ్గా 24 జనవరి 2019న) ఎనభై ఏళ్ళ వయసులో అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి నిద్రలో సునాయాస మరణం పొందాడు. మాస్టారి కుటుంబమే అంత్యక్రియలు జరిపించారు. ఎవరు ఏపాటి మేలు చేసినా మరువక పోవడమనేది ఘంటసాలవారి సౌహార్ద్రత, వాత్సల్యం. 

వేసవి శెలవులు వచ్చాయంటే 35, ఉస్మాన్ రోడ్ బంధు మిత్రులతో నిండిపోతుంది. మా ఇంటికి వచ్చే అతిధులు కూడా రాత్రిపూట నిద్ర మాస్టారింటి మేడమీదనే. 1959 వేసవుల్లోనే అని గుర్తు, మా నాన్నగారి పినతల్లి కొడుకు గుమ్మా మార్కెండేయ శర్మ. 


గుమ్మా మార్కండేయ శర్మ

మా ఇంటికి వచ్చి కొన్నాళ్ళున్నారు. ఆయన BA, B.Ed., మాస్టరుగారు. మెడ్రాసంతా చూపించడానికి అతనికి నేనే ఎస్కార్ట్ ను. ఇద్దరమూ కలసి బస్ లో చాల చోట్లకే తిరిగాము.

ఆ సమయంలోనే HMVలో మాస్టారివి రెండు పాటలు రికార్డ్ చేయడం జరిగింది. అవి రావులపర్తి భద్రిరాజుగారు వ్రాసిన "పాడనా ప్రభూ పాడనా", మరొకటి "జీవితమంతా కలయేనా" ఈ పాటల రికార్డింగ్ కు నేనూ, శర్మబాబు కూడా ఘంటసాల మాస్టారితో వెళ్ళాము. ఆ రికార్డింగ్ సమయంలో తీసిన ఫోటో కూడా ఉండేది. అందులో శర్మ కూడా కనిపిస్తారు. ఈ HMV రికార్డింగ్ స్టూడియో మౌంట్ రోడ్ లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసు ఎదురుగా వుండేది. కొత్తగా ఎవరు ఏ సినీమా తీయదల్చిన తమ సినీమాపేరును ఈ ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకెవరైనా అదే పేరుతో సినిమా తీస్తే చెల్లుబాటు కాకుండా చర్యలు చేపట్టేవారు. ఇప్పుడు ఆ ఫిలిం ఛాంబర్ కు ముందు వేపు మౌంట్ రోడ్ లో వుమ్మిడియార్స్ వారి పెద్ద నగల దుకాణం వెలసింది.

HMVకి పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ లో 'కోల్ ఇండియా' ఆఫీసు, మరొక పక్క సఫైర్, బ్లూ డైమండ్, ఎమరాల్డ్ థియేటర్స్ కాంప్లెక్స్ ఉండేది. 

ఆ బ్లూ డైమండ్ థియేటర్ ఇండియాలోనే మొట్టమొదటి కంటిన్యువస్ సినీమా థియేటర్. ఉదయం 9 గంటల నుండి రాత్రి ఒంటిగంట వరకు ఒకే సినిమా నాన్ స్టాప్ గా  వేసేవారు. ఒకే టిక్కెట్టు మీద రోజంతా ఆ థియేటర్లో కాలక్షేపం చేయవచ్చు. ఎక్కువగా ఇంగ్లీషు సినీమాలే వేసేవారు. పనీపాటాలేని వారంతా హాయిగా ఇక్కడ కాలక్షేపం చేసేవారు. ఈ సినీమా కాంప్లెక్స్ కు అధిపతులు వీకంసీస్ డైమండ్ జ్యూవెలర్స్ వారిది. ఆ స్థలంమీద రాజకీయ నాయకుల శీత కన్నుపడింది. ఆ కాంప్లెక్సంతా నేలమట్టమై,నిరుపయోగంగా, వివాదాస్పద స్థలమైపోయింది.

ఘంటసాల మాస్టారికి తీరిక చిక్కినప్పుడు భార్యా పిల్లలను ఇంట్లోనివారిని తీసుకొని బీచ్ కు వెళ్ళడం ఆయనకు సరదా. రాత్రి భోజనాలు అయ్యాక ఏ తొమ్మిదింటికో బయల్దేరేవారు. ఒక కారు చాలకపోతే రెండో కారును కూడా తీసేవారు. తమ్ముడు కృష్ణ మాస్టారికోసం ఒక చాప, దిండు కూడా తీసుకువచ్చేవారు. మాస్టారు బయట ఊళ్ళ కచేరీలకు వెళ్ళినప్పుడు ఈ తమ్ముడు కృష్ణే ఎస్కార్ట్. ఇతని గురించి మరోసారి చూద్దాము. ఆ రోజు బీచ్ కు మా నాన్నగారు, నేనూ, శర్మబాబు కూడా వెళ్ళాము (మా నాన్నగారికి అంత ఆమోదయోగ్యం కాకపోయినా. తనవల్ల, తనవారి వల్ల ఘంటసాలవారికి, వారి కుటుంబానికి ఏ అసౌకర్యం కలగకూడదనేది మా నాన్నగారి ధ్యేయం. ఆ విషయం నేనూ ఒక తండ్రినయ్యాకగానీ అర్ధంకాలేదు).

మాస్టారు ఎప్పుడు బీచ్ కు వెళ్ళినా ఇలియట్స్ రోడ్ చివరన ఉన్న గాంధీ స్టాచ్యూ బీచ్ కే తీసుకువెళ్ళేవారు. దానికి ఎదురుగా IG of Police (now DGP) ఆఫీస్, పక్కనే ఆలిండియా రేడియోస్టేషన్ ఉన్నాయి. కొత్త లైట్ హౌస్  కూడా ఇప్పుడు ఆలిండియా రేడియో కు ఎదురుగా ఉంది.  బిసెంట్ నగర్ లో కూడా ఒక ఇలియట్స్ బీచ్ వుంది. పాతరోజుల్లో, అమెరికన్ కాన్స్లులేట్ ఉన్న స్థలం నుండి మద్రాస్ మ్యూజిక్ ఎకాడెమీ వరకు ఉన్న రోడ్ ను కెథెడ్రల్ రోడ్ అని, (ఈ రోడ్ మీదే మద్రాసులోని మొట్టమొదటి ఫైవ్ స్టార్ హోటల్ చోళా షెరాటన్ వెలసింది) దాని తర్వాత వచ్చే రోడ్ ను ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ అని పిలిచేవారు. ప్రసిధ్ధి పొందిన కళ్యాణీ హాస్పిటల్ కూడా ఈ రోడ్ మీదే  ఉంది. ఆ రోడ్ చివరన గాంధీ బీచ్. భారత ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధకృష్ణన్ గారి "గిరిజ" భవనం ఉన్నదీ ఈ రోడ్డే.  ఆ భవనంలో డా.రాధాకృష్ణన్ గారి సమక్షంలో మాస్టారు చేసిన ఒక కచేరీకి నేనూ వెళ్ళాను. ఆయన పేరు మీదుగానే ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ ను డా.రాధాకృష్ణన్ సాలై( వీధి)గా మార్చడం జరిగింది.

మేము బీచ్ కు వెళ్ళే సమయానికి జనసమర్దం వుండేదికాదు ప్రశాంతమైన  చల్లనిగాలితో, వెన్నెల రాత్రిలో బీచ్ లో గడపడం ఎంత హాయిగా, ఆనందంగా ఉండేదో. బీచ్ ఇసకలో ఒక చోట కృష్ణ తెచ్చిన చాప దిండు వేసుకొని మాస్టారు పడుక్కునేవారు. పక్కనే అమ్మగారు, మా నాన్నగారు కూర్చొని మాట్లాడుకునేవారు, కృష్ణ మాస్టారి కాళ్ళు పడుతూండేవారు. పిల్లలందరం వాళ్ళతో సంబంధం లేకుండా పిన్నిగారితో కలసి చాలా దూరం వరకు నడచి వెళ్ళి అక్కడ ఆటలాడే వాళ్ళం. మేము వెళ్ళేముందే మాస్టారు చెప్పేవారు ఒక గంట వరకు రావద్దని. మా నాన్నగారిని కూడా  బీచ్ కు తీసుకు వచ్చారంటే ఏవో పాటల కంపోజింగ్ కు, సంగీతానికి సంబంధించిన చర్చలు జరపడానికే. నా చిన్నతనంలో చాలాసార్లే  మాస్టారి కుటుంబంతో వెన్నెలలో బీచ్ కు వచ్చి ఆనందంగా గడపడం జరిగింది. తిరిగి ఏ పదకొండు గంటల తర్వాత ఇంటికి బయల్దేరేవాళ్ళం.

ఇప్పుడు రోజులు మారిపోయాయి. అదుపుమీరి పెరిగిపోతున్నజనసముద్రం, విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యంతో బీచ్ లో మునుపచి ఆహ్లాదకరమైన వాతావరణం లేదు. ఇంటి దగ్గరున్నా, బీచ్ కు వెళ్ళినా ఒక్కటే అనిపిస్తోంది. ఇప్పటిలా ఆ రోజుల్లో బీచ్ లో సేఫ్టీ, సెక్యూరిటీ ప్రోబ్లమ్ అంటూ ఏ ఆంక్షలు వుండేవి కావు. ఇప్పుడు ఇంట్లోని ఆడవాళ్లతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో బీచ్ కు వెళితే భద్రతే లేదు. అటు ఎన్టీ సోషల్ ఎలిమెంట్స్, ఇటు వారిని కంట్రోల్ చేసే నెపంతో పోలీసుల అథారిటీ. వీటన్నిటితో "బీచ్ పక్కకెళ్ళద్దురా డింగరీ" అని పాడుకోవలనిపిస్తుంది.

1959 లో ఘంటసాల మాస్టారు మరొకసారి సినీమా నిర్మాణానికి పూనుకున్నారు.

 మళ్ళీనా...???

ఆ సినీమా సమాచారం వచ్చేవారం ..... 
                 ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.